స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా చెక్-ఇన్ల కాలంలోనూ పాతకాలపు స్టాంపుల సేకరణకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. ఇండియా పోస్ట్ కర్ణాటక పోస్టల్ సర్కిల్ ప్రవేశపెట్టిన ‘ఫిలాటెలీ పాస్పోర్ట్’ ప్రస్తుతం ప్రయాణికులు, స్టాంప్ కలెక్టర్లలో కొత్త క్రేజ్గా మారింది. తాజా ఎడిషన్ విడుదల నేపథ్యంలో బెంగళూరులోని జనరల్ పోస్టాఫీసు ముందు వందలాది మంది తెల్లవారుజామునే క్యూలు కట్టడం ఈ ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఈ పాస్పోర్ట్ 2024 చివర్లో తొలిసారి అందుబాటులోకి రాగా, ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా సుమారు 100 పర్యాటక, వారసత్వ ప్రాంతాలను కలుపుతూ నవీకరించిన ఎడిషన్ను విడుదల చేశారు. సుమారు 1,500 కాపీల తాజా బ్యాచ్కు కూడా భారీ డిమాండ్ నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఫిలాటెలీ పాస్పోర్ట్ అంటే?
పేరు పాస్పోర్ట్ అయినప్పటికీ దీనికి విదేశీ ప్రయాణాలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారికి ప్రత్యేక జ్ఞాపకంగా రూపొందించిన కలెక్టర్ బుక్లెట్. ఇందులో ప్రతి గమ్యస్థానానికి ఒక ప్రత్యేక పేజీ ఉంటుంది. ఆ ప్రాంతానికి సమీపంలోని గుర్తించిన పోస్టాఫీసుకు వెళ్లి పోస్టల్ స్టాంప్ను కొనుగోలు చేసి, అక్కడ మాత్రమే లభించే పర్మనెంట్ పిక్టోరియల్ క్యాన్సిలేషన్ (PPC) ముద్రను వేయించుకోవాలి. దేవాలయాలు, కోటలు, మ్యూజియంలు, వన్యప్రాణి అభయారణ్యాలు, చారిత్రక ప్రదేశాలకు ప్రత్యేక గుర్తులతో ఈ ముద్రలు అందుబాటులో ఉంటాయి.
ట్రావెలింగ్కి కొత్త అర్థం
ప్రతి ముద్ర నిజంగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన గుర్తుగా నిలుస్తుంది. అందుకే ఈ పాస్పోర్ట్ను చాలామంది ఒక ‘ట్రావెల్ ఛాలెంజ్’గా కూడా భావిస్తున్నారు. అన్ని గమ్యస్థానాలను సందర్శించి ముద్రలు సేకరించడం ద్వారా రాష్ట్రాన్ని విభిన్న కోణాల్లో అన్వేషించే అవకాశం లభిస్తుంది. సాధారణ సావనీర్లా కొనుక్కునే వస్తువు కాకుండా, స్వయంగా ప్రయాణించి సంపాదించాల్సిన జ్ఞాపకంగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది.
సోషల్ మీడియాలో వైరల్
ఫిలాటెలీ పాస్పోర్ట్కు సోషల్ మీడియా కూడా ఊపునిచ్చింది. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పోస్టల్ ముద్రలు సేకరిస్తున్న వీడియోలు, రీల్స్ వైరల్ కావడంతో యువత కూడా దీనిపై ఆసక్తి చూపుతోంది. దీంతో స్టాంప్ కలెక్టర్లకే పరిమితమైన ఈ అభిరుచి ఇప్పుడు ట్రావెల్ లవర్స్, హెరిటేజ్ ప్రియులను కూడా ఆకర్షిస్తోంది.
పాత అభిరుచికి కొత్త ఊపు
ఫిలాటెలీ అంటే స్టాంపుల సేకరణను ప్రోత్సహించేందుకు ఇండియా పోస్ట్ ఇప్పటికే ప్రత్యేక కవర్లు, స్మారక స్టాంపులు, ‘దీన్దయాళ్ స్పార్ష్’ వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు ఫిలాటెలీ పాస్పోర్ట్ ద్వారా ఆ అభిరుచిని ప్రయాణ అనుభవంతో మేళవించింది. డిజిటల్ యుగంలో ప్రతి ప్రయాణాన్ని భౌతిక గుర్తుగా నిలిపే ఈ వినూత్న ప్రయత్నం కర్ణాటకలో విశేష ఆదరణ పొందుతోంది.


