సాక్షి, బళ్లారి: పెళ్లి కాక ముందే ఓ యువకున్ని ప్రేమించింది. తల్లిదండ్రులు ఆమెకు మరొక వ్యక్తితో వివాహం జరిపించారు. కానీ ప్రియునితో సంబంధం కొనసాగించడం చూసి విరక్తి చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దావణగెరె జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. న్యామతి తాలూకా కడదహట్టి గ్రామానికి చెందిన మణికంఠ (28)కు, 3 నెలల క్రితం రాణిబెన్నూరు తాలూకాకు చెందిన యువతితో పెళ్లయింది. కానీ ఆమె ప్రియునితో అక్రమ సంబంధం కొనసాగించేది.
పాత సంబంధాలు వదులుకుని కొత్త జీవితం కొనసాగించాలని భర్త హితబోధ చేసినా, వినకుండా గొడవకు దిగేది. తీవ్ర మనోవేదనకు గరైన మణికంఠ డెత్నోట్ రాసి శుక్రవారం సాయంత్రం సమీపంలోని తుంగా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలించి శనివారం మృతదేహాన్ని వెలకితీశారు. మృతుని కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


