ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. బీటెక్ (BTech) లో గోల్డ్ మెడల్ సాధించి, గవర్నర్ చేతుల మీదుగా మెడల్ అందుకున్న 23 ఏళ్ల యువకుడు, ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే తీవ్ర మనస్తాపంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆనంద్ కుమార్ ఆనంద్ కాన్పూర్లోని 'ప్రాణ్వీర్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (PSIT) లో 2024లో బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) పూర్తి చేసి కాలేజ్ టాపర్గా నిలిచాడు. రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించాడు. కాలేజ్ ఫంక్షన్లో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నాడు. చదువు పూర్తయ్యాక 'పవర్ గ్రిడ్' సంస్థలో ఏడాది పాటు అప్రెంటిస్షిప్ పూర్తి చేసి, ఆపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ప్రారంభించాడు. కానీ ప్రతీసారి వైఫల్యం వెక్కింరించడంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి ఆలయంలో బర్త్డే ప్రత్యేక పూజలు చేసిన నటి
ఆనంద్ అన్నయ్య పెళ్లి సంబంధం మాట్లాడటానికి కుటుంబ సభ్యులంతా బీహార్లోని తమ సొంతూరికి వెళ్లారు. కాన్పూర్లోని గోవింద్ నగర్లో ఉన్న మూడంతస్తుల ఇంట్లో ఆనంద్ ఒంటరిగా ఉన్నాడు. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో, ఇంట్లో పనిచేసే వ్యక్తి పొరుగువారికి, పోలీసులకు సమాచారం అందించాడు. లోపలికి వెళ్లి చూడగా ఆనంద్ తన గదిలో ఉరివేసుకుని కనిపించాడు.
ఆత్మహత్య లేఖ
పోలీసులు ఘటనా స్థలం నుండి ఐదు లైన్ల చేతిరాతతో ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన తండ్రికి క్షమాపణలు చెబుతూ ఇలా రాశాడు: "సారీ పాపా.. నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి దాదాపు 50 సార్లు ప్రయత్నించాను, కానీ విజయం సాధించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి."
ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!
రైల్వేస్, ఎస్ఎస్సి (SSC), బ్యాంకులు, విద్యాశాఖ నిర్వహించిన పలు రిక్రూట్మెంట్ పరీక్షలు రాసినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో ఆనంద్ గత కొన్ని నెలలుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్లు అతని తండ్రి రాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది


