ముంబై: దేశీ ప్రైమరీ మార్కెట్లో ఈ వారం కూడా ఐపీఓల సందడి జోరుగా కొనసాగనుంది. నేటి (జూలై 20)తో ప్రారంభమయ్యే ఈ వారంలో మెయిన్ బోర్డ్ విభాగంలో మొత్తం నాలుగు కొత్త పబ్లిక్ ఇష్యూలు ఓపెన్ కానున్నాయి. అలాగే గత వారం ముగిసిన రెండు కీలక కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) అయిన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిస్టింగ్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఎస్బీఐ ఫండ్స్ మెగా లిస్టింగ్
గత వారం రూ. 9,813 కోట్ల భారీ ఐపీఓ ప్రక్రియ ముగిసిన తర్వాత, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ షేర్లు జూలై 21న (మంగళవారం) ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరు 16 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది.
కాలిబర్ మైనింగ్.. శుక్రవారం
మహారాష్ట్రకు చెందిన కోల్ మైనింగ్ సర్వీసెస్ కంపెనీ ‘కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్’ రూ. 450 కోట్ల విలువైన ఐపీఓ జూలై 21న ముగియనుంది. జూలై 24న (శుక్రవారం) ఈ షేరు మార్కెట్లో లిస్ట్ కానుంది. గ్రే మార్కెట్లో షేరు ధర ఏకంగా 27 శాతం ప్రీమియంతో దూసుకుపోతుండటం విశేషం.
కొత్త ఇష్యూలు..
క్యూబ్ హైవేస్ ట్రస్ట్ ఇన్విట్: ఈ పబ్లిక్ ఇష్యూ జూలై 22న ప్రారంభమై, జూలై 24న ముగియనుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో రూ. 5,000 కోట్లను సేకరించనుంది. దీని ధరల శ్రేణి రూ. 151–152.
ఇండో–ఎమ్ఐఎమ్: బెంగళూరుకు చెందిన ఈ ప్రెసిషన్ ఇంజనీరింగ్ సంస్థ ఐపీఓ జూలై 23–27 మధ్య ఉంటుంది.
లోహియా కార్ప్: కాన్పూర్కు చెందిన ఈ టెక్నికల్ టెక్స్టైల్ మెషినరీ తయారీ సంస్థ ఐపీఓ జూలై 23–27 మధ్య ఉంటుంది.
ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్: ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఈ సంస్థ రూ.170 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో జూలై 23న మార్కెట్లోకి వస్తోంది. దీని ధరల శ్రేణి రూ.120–127గా ఉంది.


