దేశంలో పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ఈ ఇంధనం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు వస్తుండగా తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తాను దేశద్రోహిని కాదని స్పష్టం చేస్తూనే.. ఈ ఇథనాల్ పెట్రోల్ విధానం సామాన్య బైక్ వినియోగదారుల నుంచి లగ్జరీ కార్ల యజమానుల వరకు అందరికీ ఇబ్బందిగా మారిందని ఆయన విమర్శించారు.
లక్షల రూపాయల నష్టం..
తన స్నేహితుడు (బీజేపీ సానుభూతిపరుడు) ఇటీవల కొనుగోలు చేసిన టయోటా క్యామ్రీ కారులో ఇథనాల్ పెట్రోల్ ద్వారా ఇంజిన్ వాల్వ్లు దెబ్బతిన్నాయని, వాటిని మార్చడానికి రూ.3.5 లక్షలు ఖర్చయిందని నరేష్ పేర్కొన్నారు. ‘ఇదే పరిస్థితి నా కొత్త పోర్షే పనమెరా కారుకు వస్తే దాదాపు రూ.12 లక్షల వరకు నష్టం వస్తుంది. అందుకే నేను తప్పనిసరి పరిస్థితుల్లో లీటరు రూ.165 ధర పలికే ‘హై ఆక్టేన్ 100’ పెట్రోల్ వాడుతున్నాను’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు లగ్జరీ ఇంధనాలు వాడగలరని, కానీ నిత్యం బతుకుదెరువు కోసం చూసే సామాన్య బైక్ వినియోగదారుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
I am not anti national but this ethanol Petrol is giving heart attacks from bike users to high-end car users . My friend( a sympathiser of BJP) who bought Toyota Camry recently had to change valves of the engine. Which cost him 3.5 lks . If the same happens to my new Porsche… pic.twitter.com/4ciFCJxRv4
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) July 19, 2026
‘ఒక మాజీ బీజేపీ నాయకుడిగా నాకు తెలుసు.. పార్టీకి బలమైన థింక్ ట్యాంక్, ప్లాన్ A, B, C లు ఉంటాయి. కానీ కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి పర్యావరణాన్ని రక్షించాలనే ఈ నిర్ణయం చాలా హడావుడిగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఇది బీజేపీకి ఒక రెడ్ సిగ్నల్ లాంటిది’ అని నరేష్ విజయకృష్ణ తెలిపారు. బ్రెజిల్ వంటి చిన్న దేశాలు ఇథనాల్ను దశలవారీగా ప్రవేశపెట్టి విజయం సాధించాయని, భారతదేశంలో ఇంత హడావుడి ఎందుకని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.
ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?


