కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం.. E20 పెట్రోల్‌పై ఆందోళన! | E20 Petrol Concerns 45 Percent of Vehicle Owners Ready for Legal Action | Sakshi
Sakshi News home page

కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం.. E20 పెట్రోల్‌పై ఆందోళన!

Jul 17 2026 8:16 PM | Updated on Jul 17 2026 8:41 PM

E20 Petrol Concerns 45 Percent of Vehicle Owners Ready for Legal Action

భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి మాత్రమే కాకుండా.., దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం. ప్రస్తుతం దేశంలో E20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం) వినియోగం విస్తరిస్తోంది.

ఈ20 పెట్రోల్ కారణంగా.. పాత పెట్రోల్ వాహనాల్లో ఇంజిన్ సమస్యలు, మైలేజ్ తగ్గడం, మరమ్మతుల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయని కొంతమంది వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ20 పెట్రోల్ వల్ల తమ వాహనాలకు నష్టం జరిగితే.. పరిహారం కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చాలామంది వాహన యజమానులు చెబుతున్నారు.

లోకల్ సర్వే నిర్వహించిన ఒక నివేదిక ప్రకారం.. ఈ20 పెట్రోల్ వల్ల తమ వాహనాలకు తీవ్రమైన నష్టం జరిగిందని భావించే వారిలో ఎక్కువ మంది పరిహారం కోసం ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సర్వేలో దేశంలోని 316 జిల్లాలకు చెందిన 22 వేలకుపైగా పెట్రోల్ వాహన యజమానులు పాల్గొన్నారు.

సర్వే ప్రకారం.. 31 శాతం మంది 'వినియోగదారుల కమిషన్'ను ఆశ్రయిస్తామని తెలిపారు. 14 శాతం మంది అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఉపయోగిస్తామని వెల్లడించారు. అంటే మొత్తం 45 శాతం మంది న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

అదే సమయంలో 18 శాతం మంది వాహన తయారీ సంస్థతో పాటు ఇంధన కంపెనీ నుంచి పరిహారం కోరుతామని తెలిపారు. 9 శాతం మంది కేవలం వాహన తయారీదారు నుంచి పరిహారం కోరనున్నట్లు పేర్కొన్నారు.

నిజానికి భారత్ ఈ20 పెట్రోల్ వైపు మారుతున్న సమయంలో, ముఖ్యంగా పాత పెట్రోల్ వాహనాల యజమానుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. 2023కు ముందు తయారైన పెట్రోల్ వాహనాలను కలిగిన వారిలో 55 శాతం మంది 2025 ప్రారంభం నుంచి వాహనంలో అసాధారణమైన అరుగుదల, ఎక్కువ మరమ్మతుల అవసరం కనిపించిందని తెలిపారని సర్వే ద్వారా తెలిసింది. గతంలో నిర్వహించిన మరో సర్వేలో 66 శాతం మంది వాహనదారులు 10 శాతానికి పైగా మైలేజ్ తగ్గిందని పేర్కొన్నట్లు సంస్థ తెలిపింది.

ఇదీ చదవండి: సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement