PC: BCCI Twitter
యూకే పర్యటనలో భారత్కు మరో ఓటమి ఎదురైంది. కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత బౌలింగ్ పరంగా రాణించినప్పటికి బ్యాటింగ్లో మాత్రం విఫలమైంది. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 234 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 44.1 ఓవర్లలో చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ కూడా కాస్త తడబడినప్పటికి, సీనియర్ బ్యాటర్ జోరూట్(99) అజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1 సమమైంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. బ్యాటింగ్లో మిడిలార్డర్ వైఫల్యమే తమ కొంపముంచిందని గిల్ అంగీకరించాడు.
ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. 25 ఓవర్లు ముగిసేసరికి మేము మంచి పొజిషన్లో ఉన్నాం. కనీసం 300 నుంచి 310 పరుగులు చేస్తామని ఆశించాం. కానీ ఒక్కసారిగా పరిస్థితి తారుమారు అయిపోయింది. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయాం. మా టెయిలెండర్లు గొప్ప బ్యాటర్లు కారని మాకు తెలుసు.
కానీ లోయర్ మిడిలార్డర్ నుంచి మేము మరింత మెరుగైన ప్రదర్శనను ఆశించాం. ఈ మ్యాచ్లో మాకు లభించిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. వచ్చే మ్యాచ్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పి, ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాను అని గిల్ పేర్కొన్నాడు.
తన వికెట్ కోల్పోవడంపై గిల్ స్పందిస్తూ.. మంచి షాట్ ఆడినప్పుడు బంతి నేరుగా కవర్ ఫీల్డర్ చేతికి వెళ్తే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపించింది. వాషింగ్టన్ సుందర్ గాయం జట్టు వ్యూహాలను దెబ్బతీసింది. వాషీ మా జట్టులో కీలక ఆటగాడు.
అతడు బ్యాటింగ్ చేస్తూ మిడ్-ఆఫ్ వైపు సింగిల్ తీసే క్రమంలో గాయపడ్డాడు.దీంతో మేము ఇన్నింగ్స్ మొత్తం మా ప్రధాన బౌలర్లతోనే బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. జో రూట్ అద్బుతంగా ఆడాడు. ఒకవేళ స్కోరు 300 ఉండి ఉంటే, అప్పుడు రూట్పై ఒత్తిడి ఉండేది. కానీ ఇలాంటి చిన్న స్కోర్లు చేధించడంలో అతడు దిట్ట అని చెప్పుకొచ్చాడు.


