కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినప్పటికి, సీనియర్ బ్యాటర్ జోరూట్(133 బంతుల్లో 99 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
రూట్ తన 21వ వన్డే సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. గస్ అట్కిన్సన్ ఫోర్ బాది మ్యాచ్ను ముగించడంతో రూట్కు సెంచరీ చేసే అవకాశం లభించలేదు. అతడితో పాటు విల్ జాక్స్ 30 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ రెండు, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, శివమ్ దూబే, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు.
కుప్పకూలిన మిడిలార్డర్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఓ దశలో 300 పరుగులు చేసేలా కనిపించిన భారత్.. మిడిలార్డర్ విఫలం కావడంతో నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. గిల్ సేన తన చివరి ఏడు వికెట్లను 55 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.
భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(65), శ్రేయస్ అయ్యర్(66) ఆర్ధ శతకాలతో రాణించగా.. ఆఖరిలో జస్ప్రీత్ బుమ్రా(20) కాస్త దూకుడగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ అట్కిన్సన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సాకిబ్ మహమూద్ 2, సామ్ కర్రన్, విల్ జాక్స్ ఒక్కో వికెట్ సాధించారు. ఈ విజయంతో ఇంగ్లీష్ జట్టు మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ మూడో వన్డే ఆదివారం జరగనుంది.


