ఒడిశాలోని పూరీలో గురువారం ప్రారంభమైన రథయాత్రకు లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. అణువణువునా భక్తి, విశ్వాసాలు తాండవిస్తున్నాయి. ఇదిలావుండగా జగన్నాథునికి ఒరియా సినిమాకు విడదీయలేని అనుబంధం ఉంది.దశాబ్దాలుగా ఒరియా చిత్ర పరిశ్రమలో జగన్నాథుని మహిమలను, భక్తుల విశ్వాసాన్ని చాటిచెప్పే సినిమాలు ఎన్నో వచ్చాయి. వాటిలో ఐదు విశిష్ట చిత్రాలు ఇవే..
జై జగన్నాథ (2006)
ఒడిశాలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక భక్తి చిత్రాలలో ఇది ఒకటి. లక్ష్మీ పురాణం ఆధారంగా సబ్యసాచి మహాపాత్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. విద్యపతి, బిమల అనే భక్తుల గాథను వివరిస్తుంది. కులమతాల కతీతంగా జగన్నాథ భక్తిని చాటిచెప్పిన ఈ సినిమా, పలు భాషల్లో విడుదలై జగన్నాథ చైతన్యాన్ని ప్రచారం చేసింది.
హిసాబ్ కరీబా కలియా (1990)
1990వ దశకంలో విడుదలైన ఈ చిత్రం, సామాజిక కథాంశంతో పాటు సామాన్యుల దైనందిన జీవితంలో జగన్నాథుని ఉనికిని ఎంతో చక్కగా ప్రతిబింబించింది. దీపనాథ్ మాస్టారుగా దేబు బోస్, ప్రతినాయకుడిగా దుఖీరామ్ స్వైన్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
మణిక (1976)
జగన్నాథ స్వామికి సంబంధించిన ప్రసిద్ధ ‘కాంచీ అభియాన్’ గాథ, మణిక అనే పెరుగు అమ్మే పేద మహిళ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తంద్రారాయ్ ప్రధాన పాత్రలో నటించగా, జగన్నాథుని పాత్రలో గురుదత్ కనిపించి ఆధ్యాత్మిక లోతులను చూపించారు.
శ్రీ జగన్నాథ (1950)
ఒరియా చిత్ర పరిశ్రమలో చరిత్రాత్మక మైలురాయిగా ఈ సినిమా నిలిచింది. జగన్నాథుని సంస్కృతి, పురాణాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంతోనే చపలా నాయక్ (తర్వాతి కాలంలో పార్వతీ ఘోష్) బాలనటిగా పరిచయమయ్యారు.
జగా హతరే పఘా (2015)
తరంగ్ సినీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో అనుభవ్ మహంతి, ఝిలిక్ భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. మురళీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, నేటి తరం భక్తులకు జగన్నాథునిపై ఉన్న విశ్వాసాన్ని మరోసారి గుర్తుచేసింది. రథయాత్ర వేళ భక్తి భావంతో నిండిన ఈ చిత్రాలు.. ఒడిశా సాంస్కృతిక వారసత్వాన్ని, జగన్నాథుని మహిమలను నేటికీ సజీవంగా ఉంచుతున్నాయి.
ఇది కూడా చదవండి: ‘రెండో భారీ రథయాత్ర’లో అమిత్ షా మంగళహారతి


