అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో 149వ జగన్నాథ రథయాత్ర ఈరోజు (గురువారం) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పూరీ తర్వాత దేశంలోనే అతిపెద్ద రెండో రథయాత్రగా ఇది పేరొందింది. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన మంగళ హారతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉపముఖ్యమంత్రి హర్ష సంఘవి సంప్రదాయబద్ధంగా 'పహింద్' విధిని నిర్వహించి, రథాలను ప్రారంభించారు.
జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి రథాలు జమాల్పూర్ ఆలయం నుంచి బయలుదేరి నగరం గుండా సాగుతున్నాయి. ఈ యాత్రలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, భజన బృందాలు, అఖారాలు పాల్గొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రత కోసం 30,000 మంది సిబ్బందిని, సుమారు 3,700 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, డ్రోన్లను పోలీసులు రంగంలోకి దించారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. యాత్ర మార్గంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. అటు భక్తులు నామస్మరణతో నగరాన్ని భక్తిపారవశ్యంతో ముంచెత్తుతున్నారు.


