అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గిన్నిస్ రికార్డు
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. ఏఎంసీ ఆధ్వర్యంలో గంట వ్యవధిలో∙ఏకంగా 3.61 లక్షల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించారు. 25 వేల మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జపాన్కు చెందిన మియావాకి విధానంలో ఈ మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. ఏఎంసీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం అభినందించారు.
ప్రజల భాగస్వామ్యం, పటిష్టమైన ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజానికి ఉన్న నిబద్ధతకు ఇది ఒక అద్భుతమైన నిదర్శనమని పేర్కొన్నారు. దాదాపు 91,006 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. సుమారు 35 రకాల దేశీయ వృక్ష జాతులకు చెందిన 3.61 లక్షల మొక్కలను నాటారు.
ఏక్ పేడ్ మా కే నామ్(తల్లి పేరిట ఒక మొక్క) కార్యక్రమం విస్తృత ప్రజాదరణ పొందుతోందని, సామూహిక ఉద్యమంగా మారుతోందని అమిత్ అన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా పచ్చదనం పెరుగుతోందన్నారు. భవిష్యత్ తరాల కోసం భూమిపై పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడానికి అత్యంత కీలకమని సూచించారు. ఆదివారం అహ్మదాబాద్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కింద దేశంలో 1.26 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


