గిర్నార్ కొండల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుజరాత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జునాగఢ్ గిర్నార్ కొండపై శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మెట్లు ఎక్కుతున్న 11 ఏళ్ల బాలుడిపై అకస్మాత్తుగా సింహం దాడి చేసి.. అడవిలోకి లాక్కెళ్లింది. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గత 46 రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలో మనుషులపై సింహాలు దాడి చేసిన తొమ్మిదో ఘటన ఇది.
ఖేడా జిల్లా మోదాజ్ గ్రామానికి చెందిన బాలుడు మయూర్ సింగ్ తన కుటుంబంతో కలిసి గిర్నార్ క్షేత్ర దర్శనానికి వచ్చాడు. రాత్రంతా పుణ్యక్షేత్రం సమీపంలోనే బస చేసిన కుటుంబ సభ్యులు.. శనివారం తెల్లవారుజామున సుమారు 5:45 గంటల ప్రాంతంలో కొండ ఎక్కడం ప్రారంభించారు. వారు 50 మెట్లు ఎక్కిన తర్వాత అంతలోనే పక్కనే ఉన్న దట్టమైన అడవిలోంచి ఒక సింహం మెట్లపైకి దూసుకువచ్చింది. బాబాయ్ చేయి పట్టుకుని నడుస్తున్న మయూర్ సింగ్పై ఒక్కసారిగా దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు, రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. జునాగఢ్ ఫారెస్ట్ డివిజన్, సోషల్ ఫారెస్ట్రీ, సాసన్ రెస్క్యూ టీమ్లకు చెందిన సుమారు 60 నుండి 70 మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. అడవిలో గాలించగా బాలుడి బూట్లు, బట్టలు, శరీర భాగాలు లభ్యమయ్యాయి. డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అక్షయ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. సింహాలు అడవి దాటుతున్న సమయంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. దాడికి కారణమైనట్లు అనుమానిస్తున్న మూడు సింహాలను అటవీ సిబ్బంది మత్తుమందు ఇచ్చి బంధించారు. ప్రస్తుతం వాటిని వైద్య పరీక్షల నిమిత్తం సక్కర్బాగ్ జూకు తరలించారు.
బంధించిన సింహాలలో ఒక సింహం కక్కిన వాంతిలో బాలుడి శరీర అవశేషాలు లభ్యమయ్యాయని.. మిగిలిన శరీర భాగాలు అడవిలోని వేర్వేరు ప్రాంతాల్లో దొరికాయని అధికారులు ధృవీకరించారు. బాధిత బాలుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ వన్యప్రాణుల దాడి పరిహార విధానం కింద రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అధికారులు ప్రకటించారు.
ఈ ఘోర ఘటనతో స్థానికులు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మెట్ల మార్గం పరిసరాల్లో సింహాలు తిరుగుతున్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మెట్ల మార్గంలో సరైన విద్యుత్ దీపాలు (లైటింగ్), భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే తెల్లవారుజామున చీకట్లో వన్యప్రాణులను గుర్తించలేకపోయామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటన నేపథ్యంలో గిర్నార్ మెట్ల మార్గాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అటవీ శాఖ సమగ్ర తనిఖీలు పూర్తి చేసిన తర్వాతే యాత్రను తిరిగి పునరుద్ధరించనున్నారు. భక్తుల రక్షణ కోసం అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు.. గిర్నార్ మార్గంలోని సుమారు 2,000 మెట్ల వరకు ఇనుప ఫెన్సింగ్ (రక్షణ కంచె) ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది.


