మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మొదట ఓసారి చెప్పి చూస్తాం; వినకపోతే గొడవపడతాం; మరీ సీరియస్ అయితే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం; కోర్టుకెళతాం. అయితే మన సమస్యలకు ఓ దెయ్యం కారణమైతే, మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే? దెయ్యమా? ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా? నిజమే, అమెరికాలో ఓ ఖైదీ తన సమస్యలన్నింటికీ ఓ దెయ్యమే కారణమని బలంగా నమ్మాడు. ఆ దెయ్యాన్ని ఎలాగైనా కోర్టుకీడ్చి శిక్ష వేయించాలనుకున్నాడు. కోర్టులో కేసు కూడా వేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. జడ్జి వేసిన ఓ ప్రశ్నతో ఇది ఆసక్తికరంగా మారింది. అమెరికాలో అత్యంత అరుదైన కేసుగా, వేలాదిమంది న్యాయ విద్యార్థులకు ఇదో పాఠంగా మిగిలింది.
పెన్సిల్వేనియాలోని వెస్టర్న్ పెనిటెన్షియరీ జైలులో జెరాల్డ్ మేయో అనే 22 ఏళ్ల ఓ వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. తన జీవితం ఇలా ఎందుకు అయిపోయింది? తన సమస్యలకు కారణం ఏంటని ప్రతి రోజూ దీర్ఘంగా ఆలోచించేవాడు. తనకు జీవితంలో ఎదురైన ప్రతీ అపజయం, బాధ, కష్టాలు, చివరకు జైలుకు రావడానికి కూడా ఆ దెయ్యమే కారణమనే అభిప్రాయానికి వచ్చాడు.
వెంటనే మేయో జిల్లా ఫెడరల్ కోర్టుకు ఓ పిటిషన్ పంపాడు. ఓ దెయ్యం, ఆ దెయ్యం సహాయకులు ఉద్దేశపూర్వకంగా తన జీవితంలో జోక్యం చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని, తన హక్కులూ హరిస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. కోర్టు ఫీజు కట్టడానికి డబ్బులు లేవని, ఫీజు మాఫీ చేయాలని అభ్యర్థించాడు. ఆ దెయ్యం, సహాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోర్టును వేడుకున్నాడు.
అధికార పరిధిపై సందేహం
ఫెడరల్ కోర్టు జడ్జి గెరాల్డ్ జే. వెబర్ ఈ కేసుపై పలు సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తారు. ఏదైనా నేరంలో ఫిర్యాదు దారు పేర్కొన్న ప్రత్యర్థులకు సమన్లు జారీ చేస్తాం. అయితే ఈ కేసులో సమన్లు ఏ పేరుతో ఎక్కడికి పంపించాలని ప్రశ్నించారు. మేయో తన పిటిషన్లోనూ ఎవరికి? ఎలా సమన్లు పంపాలనే వివరాలు జత చేయలేదని చెప్పారు.
దెయ్యాన్ని విచారించే అధికార పరిధి ఈ కోర్టుకు ఉందా? లేదా? అనే అంశంపై కూడా స్పష్టత లేదని జడ్జి పేర్కొన్నారు. దెయ్యాల వల్ల తనలాగే ఇబ్బంది పడుతున్న బాధితుల తరఫున ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని మేయో చేసిన ప్రయత్నాన్ని జడ్జి తిరస్కరించారు. అలాంటి వర్గానికి అతడు ప్రతినిధిగా చూపించే ఆధారాలు ఏమీ కోర్టుకు సమర్పించలేదని పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్ను ఉమ్మడి వ్యాజ్యంగా పరిగణించలేమని స్పష్టం చేశారు.
నిబంధనల ప్రకారం..
దెయ్యం ఉనికి, మతపరమైన అంశాలు, ఆధ్యాత్మిక భావనల జోలికి వెళ్లడం లేదని జడ్జి గెరాల్డ్ జే. వెబర్ స్పష్టం చేశారు. కోర్టు అధికార పరిధి– ప్రతివాదికి సమన్లు పంపడం, వ్యాజ్యం చట్టబద్ధంగా విచారణార్హత కలిగి ఉండడం– ఈ అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. దీని ఆధారంగా పిటిషన్ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కేసు చట్టపరంగా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుందా? లేదా అనే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్టు వ్యాఖ్యానించారు. ఫీజు లేకుండా పిటిషన్ను స్వీకరించాలన్న అభ్యర్థనను జడ్జి తోసిపుచ్చారు.
భావోద్వేగాలపై కాదు, న్యాయప్రక్రియ ఆధారంగానే న్యాయస్థానాలు వ్యవహరిస్తాయని ఈ కేసు ద్వారా వెల్లడైంది. 1971లో ఈ పిటిషన్ దాఖలైంది. అయినా దీనిని ఇప్పటికీ అమెరికాలోని పలు న్యాయకళాశాలల్లో ఓ కేస్ స్టడీగా విద్యార్థులకు వివరిస్తారు. ఒక కేసు విచారణకు వచ్చే ముందు న్యాయస్థానం ఏయే అంశాలను పరిశీలిస్తోంది, ఎప్పుడు తిరస్కరిస్తోందనే అంశాల్లో ముఖ్యమైన కేసుగా ఇది నిలిచిపోయింది.
దిలీప్ మాదిరెడ్డి
(చదవండి: పన్నేండువేల ఏళ్ల నాటి పాచికలు..!)


