పిల్లల కథ: వింత వస్తువు | An Inspirational Story For Children Written By Kokkeragadda Sridevi | Sakshi
Sakshi News home page

పిల్లల కథ: వింత వస్తువు

Jul 5 2026 10:34 AM | Updated on Jul 5 2026 10:34 AM

An Inspirational Story For Children Written By Kokkeragadda Sridevi

నందవనానికి సింహసేనుడు అనే సింహం రాజు. ఒకరోజు నక్క అడవి సరిహద్దుల్లో ఒక వింతవస్తువును చూసి ఆశ్చర్యపోయింది. 
ఆ వింత వస్తువును చూడగానే, ‘ఇది నోటికి చిక్కదు, కాలికి అందదు’ అనుకుంది.

‘ఈ వస్తువును సింహసేనుడు సహా అన్ని జంతువులకు చూపించి, తానొక గొప్పదాన్నని నిరూపించుకోవాలి’ అనుకుంది.
అనుకున్నదే తడవుగా అడవిలోని అందరికీ చెప్పేసింది.
సింహసేనుడు సహా జంతువులన్నీ వింత వస్తువున్న చెట్టు వద్దకు చేరుకున్నాయి.
జంతువులన్నింటి వైపు తేరిపార చూస్తూ నక్క ఇలా అంది.

‘ఆకాశం నుండి రాలిపడిన వింత వస్తువిది. దీనిని ఎవరు తాకుతారో వారు అత్యంత బలవంతులైపోతారు’.
నక్క మాట వినగానే... ‘అయితే నేను ముందంటే నేను ముందు’ అంటూ సింహం, ఏనుగు, ఎలుగుబంటి, జింక ముందుకు కదిలాయి.
‘కానీ ఒక నియమం పాటిస్తేనే వస్తువును ముట్టుకోగలరు’ అంది నక్క.
‘ఏమిటా నియమం?’ జంతువులన్నీ నక్కను ఆత్రంగా అడిగాయి.

‘వస్తువును తాకేముందు తమ తమ సహజ స్వభావాన్ని వదులుకుంటామని వస్తువుకు మాటివ్వాలి. అప్పుడే అద్భుత శక్తి వస్తుంది.’
నక్క మాటలు విన్న జింక ‘ఓస్‌! అంతే కదా’ అంటూ వింతవస్తువు వద్దకు వెళ్ళింది.
సింహం, ఎలుగుబంటి, ఏనుగు, నక్క– జింకకేసి విచిత్రంగా చూడసాగాయి.
‘నాకు భయం ఎక్కువ. ఇప్పుడు నా భయాన్ని పోగొట్టుకుని, పులిలా గాండ్రిస్తాను’ అంటూ గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. కానీ జింక గొంతు సహకరించలేదు.

‘నా స్వభావం మార్చుకోవడం నా వల్ల కాదు’ అంటూ జింక వెనుతిరిగింది.
‘నన్ను చూడండి’ అంటూ ఎలుగుబంటి గొప్పగా ముందుకు కదిలింది.
‘నాకు తేనెపట్టులోని తేనె కడుపునిండా తిన్నాక హాయిగా నిద్ర పోవడం నాకిష్టం. ఈ రోజునుంచి నిద్రపోకుండా మేల్కొనే ఉంటాను’ అంది. అంతలోనే ఆవులింత రావడంతో, ‘అమ్మో! నిద్రను ఆపడం నా వల్ల కాదు’ అంటూ వెనుతిరిగింది.
‘ఇప్పుడు ఏనుగు వంతు’ నక్క అనడంతో ఏనుగు ముందుకు కదిలింది.

ఏనుగు వింతవస్తువు వద్దకు వెళ్లి, ‘దారిలో అడ్డంగా పడిపోయిన చెట్లను నా తొండంతో వేగంగా పైకి తీయడం అలవాటు. ఇక నుంచి చీమలా నెమ్మదిగా నడుస్తాను’ అంటూ మెల్లగా నడవబోయింది.
‘నా శరీరానికి చీమలాగా నెమ్మదిగా నడవడం కుదరదు’ అంటూ ఏనుగు కూడా వెనుతిరిగింది.
‘మీలో ఒక్కరూ సాధించ లేకపోయారు. నన్ను చూడండి’ అంటూ మృగరాజు సింహసేనుడు వింతవస్తువు వైపు కదిలాడు.
నక్క, ఏనుగు, ఎలుగు, జింక అన్నీ సింహాన్ని ఆసక్తిగా గమనించసాగాయి. వింతవస్తువు దగ్గరకు వెళ్ళి సింహం ఇలా అంది.
‘నేను మాంసాహారిని. కానీ ఈ రోజు నుండీ గడ్డి తింటాను’ అంటూ అక్కడే ఉన్న కొంత పచ్చగడ్డిని పళ్లతో పీకి నోట్లో వేసుకుంది. కానీ తినలేకపోయింది.

‘ఆకలేసినంత మాత్రాన సింహం గడ్డి తినలేదు’ అనుకుంటూ వింతవస్తువును తాకకుండానే మృగరాజు కూడా వెనుతిరిగింది.
ఇదంతా అక్కడే చెట్టు పైనున్న ఉడుత గమనించి, కిందకు దిగి గట్టిగా నవ్వింది.
‘మమ్మల్ని చూస్తే నీకు నవ్వొస్తోందా?’ సింహం కోపంగా అంది.
‘కోపం వద్దు మృగరాజా! నా నవ్వుకు కారణం ఉంది’ అంది ఉడుత.
‘ఏమిటిది?’ ఏనుగు అడిగింది.

‘మీరంతా వింతవస్తువంటూ, విచిత్రంగా చూస్తున్న ఆ వస్తువు పేరు ‘గ్లోబు’. భూగోళానికి నమూనా అది. మన అడవి దాటితే ఒక ఊరు ఉంది. ఆ ఊరి బడిలో దీనిని నేను చూశాను. అక్కడి పిల్లలకు మాస్టారు దీని గురించి చెబితే విన్నాను. ఆ మాస్టారు, పిల్లలతో అడవిలోని చెట్లను చూడటానికి మన సరిహద్దు వైపు వాహనంలో వచ్చారు. అలా వచ్చినప్పుడు పిల్లలు ఈ గ్లోబును ఇక్కడ మరచిపోయి వెళ్లిపోయారు.

ఈ వస్తువు సంగతి తెలియని నక్క మిమ్మల్ని ఆట పట్టించడానికే ఇలా నాటకమాడింది. మీరే కాదు, సృష్టిలో ఏ జీవీ తన సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. అలా ప్రవర్తించి మనుగడ సాధించలేదు.
ఇప్పుడర్థమైందా? మృగరాజా? నేనెందుకు నవ్వానో?’
ఉడుత మాటలతో సింహం సహా జంతువులన్నింటికీ విషయం అర్థం కావడంతో వాటి తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి.

‘మనందరినీ ఆట పట్టించిన ఈ టక్కరి నక్క అంతుచూస్తాను’ అని మృగరాజు గట్టిగా అనడంతో నక్క ‘అయ్య బాబోయ్‌’ అంటూ తుర్రుమంటూ కాళ్లకు బుద్ధి చెప్పింది.
‘ఇంకెప్పుడూ ఇటువైపు రాకు’ సింహం అంది.
భయంతో పరుగుతీస్తున్న నక్కను చూసి జంతువులు నవ్వుకున్నాయి. - కొక్కెరగడ్డ శ్రీదేవి
 

హితవచనం..

  • అంభస్యాభిద్యతే సేతుస్తథా మంత్రోప్యరక్షితః
    పైశున్యాద్భిద్యతే స్నేహో వాచా భిద్యేత కాతరః

నీటి ఉద్ధృతికి ఆనకట్ట కొట్టుకుపోతుంది. రక్షించకపోతే రహస్యం బయటపడిపోతుంది. చాడీలకోరు వల్ల స్నేహం చెడిపోతుంది. పిరికిపంద మాటలకే బెదిరిపోతాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement