breaking news
Funday
-
కథాకళి: విలన్
ఆ ఆదివారం, జనవరి పద్దెనిమిదిన ముప్ఫై రెండేళ్ళ ఏగ్నెస్ సెయింట్ ఫిలోమినా చర్చ్లోంచి బయటికి వచ్చి, మెట్రో స్టేషన్స్ దాకా నడిచింది. తన హేండ్బేగ్ తెరచి డబ్బు లెక్క చూసుకుని, కొద్దిసేపు ఆలోచించింది. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలని అనుకుంటోది. వెళ్ళాక ఏదో కొనాలనిపిస్తుంది. కాని సరిపడా డబ్బు లేదు. ఆ ఆదివారం సాయంత్రం హాస్టల్కి వెళ్ళి గదిలో ఒంటరిగా గడపటానికి ఇష్టపడక ఆమె మెట్రో స్టేషన్స్ లోకి నడిచింది. ముప్పావు గంట తర్వాత ఆమె ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ లోకి టికెట్ కొనుక్కుని వెళ్ళింది. ఒక్కో స్టాల్ని చూసుకుంటూ నడవసాగింది. ఆదివారం కాబట్టి అక్కడ బాగా రద్దీగా ఉంది.ఏగ్నెస్ మిరపకాయ బజ్జీల స్టాల్ దగ్గర ఆగింది. బయట అమ్మే ధర కన్నా ఒకోటి నాలుగు రెట్ల ధర. ఆకలిగా ఉండటంతో రెండు కొనుక్కొని తిన్నది. ఆమె తను ఏమేం కొనలేక పోతోందో స్టాల్స్లో చూసుకుంటూ సగం దూరం వెళ్ళాక అది జరిగింది. అకస్మాత్తుగా ఒకడు ఆమె హేండ్ బేగ్ని లాక్కుని పరిగెత్తాడు.‘‘ఆగు. దొంగ. దొంగ.’’ ఆమె అరుస్తూ అతని వెంట పరిగెత్తింది.అతను మనుషుల్ని పక్కకి తోసుకుంటూ వేగంగా పరిగెత్తాడు. ఏగ్నెస్ ఆ రద్దీలో అతని వెంటపడి పట్టుకోలేకపోయింది. అతను ఎర్ర టీషర్ట్, జీన్స్ తొడుక్కున్నాడని మాత్రం గుర్తించింది. అతని వయసు పాతిక దాకా ఉండచ్చని అనుకుంది. కొందరు ఆమెని ప్రశ్నించసాగారు.‘‘దొంగని గుర్తుపట్టగలరా?’’‘‘ఎంతుంది?’’‘‘పోలీస్ పోస్ట్ ఎంట్రన్స్ గేటు పక్కన ఉంది. వెంటనే రిపోర్ట్ చేయండి.’’ ఓ ముసలాయన సలహా ఇచ్చాడు.ఆమె పాతిక అడుగులు వేశాక, ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకి ఆ హేండ్బేగ్ని అందిస్తూ అడిగాడు.‘‘మీదే కదా ఇది?’’‘‘అవును. మీకు ఎలా దొరికింది?’’ ఏగ్నెస్ సంభ్రమంగా అడిగింది.‘‘మీ అరుపులు విన్నాను. వాడు నా ముందు నుంచే పరిగెత్తాడు. మీ అరుపులు విన్నాక మగాడి చేతిలో లేడీస్ హేండ్బేగ్ చూడగానే ఏం జరిగిందో గ్రహించి కాలు అడ్డుపెట్టాను. వాడు పడగానే దీన్ని లాక్కున్నాను. వెధవ. నా దవడమీద కొట్టి పారిపోయాడు.’’‘‘థాంక్స్ అండీ. మీరు నిజంగా హీరో.’’ ఏగ్నెస్ చెప్పింది.‘‘విలన్స్ ఉంటేనే హీరో ఉంటాడు. ఏం పోలేదుగా? చూసుకోండి. ఐనా వాడికి దాన్ని తెరిచి కొట్టేసే సమయం లేదు లెండి.’’‘‘ఇది బీద హేండ్బేగ్. అందులో హాస్టల్కి వెళ్ళడానికి సరిపడా డబ్బు మాత్రమే ఉంది. కాకపోతే ఐడీ కార్డ్ గురించి నేను వర్రీ అయ్యాను.’’‘‘మీ పేరు?’’‘‘ఏగ్నెస్.’’‘‘నేను అబిడ్స్లో మొబైల్స్ రిపేర్ షాప్ నడుపుతున్నాను.’’‘‘నైస్. థాంక్స్ అగైన్స్ అండీ. మీకు మిర్చిబజ్జీలు కొనిపెట్టాలని ఉంది. కాని అంత డబ్బు లేదు.’’ ఏగ్నెస్ నొచ్చుకుంటూ చెప్పింది.‘‘ఫర్వాలేదు. మీ బేగ్ జాగ్రత్త. బై.’’ చెప్పి అతను వెళ్ళిపోయాడు.ఆమెకి ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. తిరిగి మెట్రో స్టేషన్స్ కి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది అవుతోంది. టికెట్ కొనడానికి హేండ్బేగ్ని తెరిచి చూసి భృకుటి ముడివేసింది. అందులోంచి ఐదువందల రూపాయల నోట్ల కట్టని బయటికి తీసి చూసింది.ఏభై వేల రూపాయలు! ఇది తన హేండ్ బేగ్లోకి ఎలా వచ్చింది? ఆ దొంగ పెట్టి ఉంటాడు. ఎందుకు పెట్టినట్లు? బహుశా ఇంకెవరి దగ్గరో కొట్టేసింది తన బేగ్లో ఉంచి ఉంటాడనే ఆలోచన ఆమెకి కలిగింది.ఇప్పుడు తనేం చేయాలి? పోలీసులకి జరిగింది చెప్పి ఆ డబ్బు ఇవ్వటం సబబు. కాని దాదాపు ప్రతి ఇండియన్స్ కి వచ్చే ఆలోచన దాన్ని రద్దు చేసింది. అది దాని యజమానికి కాక పోలీసుల జేబులోకి వెళ్ళే బదులు తనే వాడుకోవచ్చుగా?మెట్రోలో వెళ్తూ ఆ డబ్బుతో ఏం కొనాలో ఆలోచించింది. చాలా గుర్తొచ్చాయి. ముఖ్యంగా సిటీ సెంటర్ మాల్లో, జూడియోలో విండో షాపింగ్లో చూసిన గౌన్స్ గుర్తొచ్చింది. ఆమె కూకట్పల్లిలో మెట్రోలోంచి బయటికి వచ్చి, పది నిమిషాల దూరంలోని తన వర్కింగ్ విమెన్స్ హాస్టల్కి నడవసాగింది. రోడ్లోంచి ఓ సందులోకి, అందులోంచి ఆట్టే రద్దీ లేని మరో చిన్న సందులోకి నడిచాక వినిపించింది.‘‘హలో ఏగ్నెస్.’’ఆమె తల తిప్పి చూస్తే, ఇందాక ఆ హేండ్ బేగ్ ఇచ్చిన వ్యక్తి పక్కనే నడుస్తూ కనిపించాడు.‘‘హలో. మళ్ళీ కలిశాం.’’ ఆశ్చర్యంగా చెప్పింది.‘‘ఇప్పుడు మీరు అనుకుంటున్నట్లుగా నేను హీరోని కాను. విలన్స్ ని. ఆ డబ్బు ఇవ్వండి.’’ కఠినంగా చెప్పాడు.‘‘డబ్బు? ఏ డబ్బు?’’‘‘మెట్రో స్టేషన్స్ బయట దాన్ని తీసి చూసుకుని, మళ్ళీ నువ్వు హేండ్ బేగ్లో ఉంచిన ఏభైవేలు.’’ఆమె తెల్లబోతూ చూస్తూంటే అతను ఆమె హేండ్బేగ్ని అందుకుని అందులోంచి ఆ సొమ్ము తీసుకుని చెప్పాడు.‘‘వాడు నా తమ్ముడు. ఓ దుకాణంలో కేష్ బాక్స్లోంచి దాన్ని దొంగిలించాడు. పోలీసులు పట్టుకున్నా తన దగ్గర ఆ డబ్బు దొరకకూడదని దీన్ని నీ హేండ్బేగ్లో ఉంచి నాకు ఇచ్చాడు. నేను దాన్ని నీకు ఇచ్చాను.’’అతను ఆ డబ్బు తన జేబులో ఉంచుకుని వేగంగా వెళ్ళిపోతూంటే, ఏగ్నెస్ నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
మృగశృంగుని వృత్తాంతం
పూర్వం కుత్సురుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు కర్దమ మహర్షి కుమార్తెను వివాహమాడాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి మృగశృంగుడని నామకరణం చేశారు. కుత్సురుడు కుమారుడికి ఐదో ఏట ఉపనయనం చేశాడు. ఆ బాలుడు విద్యాభ్యాసం ప్రారంభించి, తండ్రి వద్ద సకల వేద శాస్త్రాలను అభ్యసించాడు. కొంతకాలానికి అతడు యుక్తవయసుకు వచ్చాడు. దేశాటనకు పోవాలనే కోరికతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని, ఇంటి నుంచి బయలుదేరాడు. మృగశృంగుడు దేశాటన సాగిస్తూ, మార్గమధ్యంలో ఎదురైన పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ కొన్నాళ్లకు మాఘమాసం సమీపిస్తుండగా, కావేరీ తీరానికి చేరుకున్నాడు. ‘ఏమి నా భాగ్యం! మాఘమాసంలో కావేరీ స్నానమాచరించే అవకాశం దొరికింది. మాఘమాసం అంతా ఇక్కడే బస చేస్తాను’ అనుకుని మృగశృంగుడు సంతోషించాడు. నదీ తీరానికి చేరువలోనే ఆశ్రమాన్ని నిర్మించుకుని, అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండటం ప్రారంభించాడు. అతడి తపస్సుకు మెచ్చి ఒకనాడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ‘ఓ విప్రకుమారా! నీ తపస్సుకు మెచ్చాను. పవిత్ర మాఘమాసంలో విడువకుండా కావేరీస్నానం సాగిస్తూ వచ్చినందుకు నీ పుణ్యం రెట్టింపైంది. నీకేం కావాలో కోరుకో, తప్పకుండా నెరవేరుస్తాను’ అన్నాడు శ్రీహరి. ‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! నీ దర్శనమాత్రంతోనే నా జన్మ ధన్యమైంది. నాకింకే ఐహిక కాంక్షలూ లేవు. నాకు ఎలా దర్శనమిచ్చావో, ఇదేచోటు కొలువుండి నీ భక్తులకు దర్శనమివ్వు. ఇది చాలు నాకు’ అన్నాడు మృగశృంగుడు. శ్రీహరి అతడి కోరికను మన్నించి అదేచోట కొలువై వెలిశాడు.కొన్నాళ్లకు మృగశృంగుడు తల్లిదండ్రులను చూడటానికి స్వగ్రామం చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతడిని చూసి సంతోషించారు. మృగశృంగుడికి వివాహం చేయాలని వారు భావించారు. ఇదే సంగతి అతడికి చెబితే, ‘ఆశ్రమాలన్నిటిలోనూ గృహస్థాశ్రమమే శ్రేష్ఠమని దైవజ్ఞులు చెబుతారు. అయితే, భార్య గుణవతి, అనుకూలవతి అయినప్పుడే గృహస్థాశ్రమ ధర్మాన్ని సజావుగా నిర్వర్తించడం సాధ్యమవుతుంది. అలాంటి యువతి దొరికినప్పుడే వివాహం చేసుకుంటాను’ అన్నాడు. ‘కుమారా! నీ మాటలు సమంజసంగా ఉన్నాయి. నీ కోరిక తీరాలంటే, భగవంతుడైన శ్రీహరిపైనే భారం వేయాలి. నీ అభీష్టం నెరవేరుగాక!’ అన్నారు తల్లిదండ్రులు.ఇలా ఉండగా, భోగాపురం అనే గ్రామంలో సదాచారపరాయణుడైన విప్రుడు ఉండేవాడు. అతడికి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమె అందాలరాశి. పేరుకు తగినట్లుగానే గుణవంతురాలు. దైవభక్తి, పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగిన సుశీల నిత్యం ఏదో ఒక వ్రతం చేపడుతూ, పురాణశ్రవణంతో కాలక్షేపం చేస్తూ ఉండేది. ఆమె గుణగణాలను తెలుసుకున్న మృగశృంగుడు ఆమెనే పెళ్లాడదలచాడు.ఒకనాడు సుశీల తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి కావేరీ స్నానానికి బయలుదేరింది. అకస్మాత్తుగా ఒక ఏనుగు అటువైపు వచ్చి, ఆ ముగ్గురు యువతులను తరమసాగింది. భయభ్రాంతులైన ఆ యువతులు దిక్కుతోచక పరుగు లంకించుకున్నారు. పరుగెడుతూ వారు ఒక దిగుడుబావిలో పడి మరణించారు. సంగతి తెలిసి హుటాహుటిన అక్కడకు చేరుకున్న వారి తల్లిదండ్రులు విగతజీవులైన కుమార్తెలను చూసి భోరున విలపించసాగారు. మృగశృంగుడికి కూడా ఈ వార్త తెలియడంతో అతడు కూడా అక్కడకు చేరుకున్నాడు. వారిని ఎలాగైనా బతికించాలని సంకల్పించుకున్నాడు. తాను వచ్చేంత వరకు మృతదేహాలను చూస్తుండమని వారి తల్లిదండ్రులతో చెప్పి, నేరుగా కావేరి వద్దకు వెళ్లాడు. మెడలోతు నీళ్లలో మునిగి, ధ్యానం ప్రారంభించాడు. ఈలోగా ఆ యువతుల మరణానికి కారణమైన ఏనుగు అక్కడకు ఘీంకరిస్తూ వచ్చింది. మృగశృంగుడి ఎదుట నిలిచి, భీకరంగా ఘీంకరించింది. మృగశృంగుడు చలించలేదు. అది తదేకంగా అతడినే కాసేపు చూసింది. ఉన్నపళాన అతడిని తొండంతో చుట్టి పైకిలేపి, వీపుమీదకు ఎక్కించుకుంది. ఈ పరిణామాన్ని చూస్తున్న జనాలంతా హాహాకారాలు చేయసాగారు. అయితే, మృగశృంగుడు చలించలేదు. పైగా దీనిని శుభసూచకంగా తలచాడు. ఏనుగు శరీరాన్ని నిమిరి, మంత్రజలాన్ని దానిపై చల్లాడు. తక్షణమే ఏనుగు దేవతారూపం దాల్చి, మృగశృంగుడి ఎదుట నిలిచింది. తనకు శాపవిమోచనం కలిగించినందుకు అతడికి కృతజ్ఞతలు తెలిపి, స్వర్గానికి బయలుదేరింది. శాపవిమోచనం పొందిన ఏనుగు వెళ్లిపోయాక, విగతజీవులైన యువతులను బతికించాలనే సంకల్పంతో మృగశృంగుడు మళ్లీ కావేరిలోకి దిగి, యముడి గురించి ధ్యానం ప్రారంభించాడు. యమధర్మరాజు అతడి దీక్షకు సంతృప్తి చెంది, అతడికి ప్రత్యక్షమయ్యాడు.‘మృగశృంగా! నీ దీక్షకు సంతోషించాను. ఏంకావాలో కోరుకో, తప్పక నెరవేరుస్తాను’ అని పలికాడు.మృగశృంగుడు యమధర్మరాజును వేనోళ్ల స్తుతించి, విగతజీవులైన ముగ్గురు యువతులనూ పునర్జీవితులను చేయమని కోరాడు.యముడు ‘తథాస్తు’ అని పలికాడు.అప్పటివరకు విగతజీవులై పడి ఉన్న ఆ ముగ్గురు యువతులూ నిద్రనుంచి మేల్కొన్నట్లుగా లేచారు. కొంతకాలానికి మృగశృంగుడు సుశీలను పెళ్లాడాడు.∙సాంఖ్యాయన -
బడ్జెట్ భావుకత
ఏడు దశాబ్దాలకు పైగా మన బడ్జెట్ ప్రసంగాలు ఆర్థిక క్రమశిక్షణను మాత్రమే కాకుండా, మన దేశపు గొప్ప సాహిత్య వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి! వివేకానందుడి ధీరత్వం, తిరువళ్ళువర్ నైతికత, చాణక్యుడి వ్యూహం; గాలిబ్, ఇక్బాల్ల కవిత్వం.. ఇలా ఎందరో సాహితీవేత్తల ఉల్లేఖనాలు మన ఆర్థిక ప్రణాళికా ప్రసంగాలకు ఆత్మగా నిలిచాయి. దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఆ ప్రసంగ పాఠాలలో, మహనీయుల మాట ఎలా ఒక దిక్సూచిలా మారిందో.. ఆర్థిక మంత్రులు తమ దార్శనికతను సాహిత్యం ద్వారా ఎలా ప్రజల హృదయాలకు చేరవేశారో వివరించే ‘బడ్జెట్ కావ్యం’ ఇది. ఆస్వాదించండి.సొగసైన వ్యక్తీకరణలుభారత కేంద్ర బడ్జెట్ చరిత్రను పరిశీలిస్తే, ఆర్థిక మంత్రులు కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, సందర్భోచితమైన ‘గొప్ప మాటల’ ద్వారా ప్రభుత్వ దూరదృష్టిని, విజయాలను చాటిచెప్పడం ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. విధానపరమైన నిర్ణయాలకు బలాన్ని చేకూర్చడానికి, దేశ భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించడానికి వీరు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల కోట్స్ను ‘దన్ను’గా ప్రయోగిస్తుంటారు. చారిత్రక వ్యక్తులు మొదలుకొని, ప్రసిద్ధ కవులు, రచయితల వరకు వైవిధ్య భరితమైన మూలాల నుండి ఆ కోట్లను స్వీకరిస్తారు. ప్రసంగంలోని తీవ్రతను బట్టి వాటి శైలి మారుతూ ఉంటుంది. అవి, దేశ ఆర్థిక గమనాన్ని సామాన్యులకు సైతం ప్రభావవంతంగా వివరించడానికి తోడ్పతాయి.కభీ ఖుషీ కభీ ఘమ్ఉదాహరణకు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసిద్ధ కవి ఇక్బాల్ కవిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. పి. చిదంబరం తన బడ్జెట్ ప్రతిపాదనలకు తిరువళ్ళువర్, థోరో వంటి గొప్ప వ్యక్తుల విజ్ఞానాన్ని జోడించేవారు. ప్రణబ్ ముఖర్జీ ప్రాచీన భారతీయ రాజనీతిజ్ఞుడైన కౌటిల్యుడి సూత్రాల నుండి మార్గదర్శకత్వాన్ని పొందేవారు. కేవలం షేక్స్పియర్ లేదా వివేకానందుడి వంటి వారే కాకుండా; అమర్త్యసేన్, ఇందిరా గాంధీ వంటి వారి ప్రస్తావనలు కూడా ఆర్థిక నిర్ణయాల వెనుక ఉన్న హేతుబద్ధతను బలోపేతం చేయడానికి బడ్జెట్ ప్రసంగాలకు ఉపయోగపడ్డాయి. ఇక 2002 నాటి ప్రసంగంలో యశ్వంత్ సిన్హా ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు విచారం), ‘ఫిల్హాల్’ (క్షణికమైన) వంటి బాలీవుడ్ చిత్రాల పేర్లను సైతం ఉదహరించారు!మొరార్జీ ఆశావాదం1960వ, 70వ దశాబ్దాలలో భారతదేశం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి పారిశ్రామిక దేశంగా రూపాంతరం చెందుతున్న తరుణంలో కూడా, ఆర్థిక మంత్రులు ఈనాటికీ స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా 1967–68 బడ్జెట్ ప్రసంగంలో, అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ పేదరికంపై పోరాటం–మారుతున్న ఆర్థిక పరిస్థితుల మధ్య అత్యంత ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. సరైన విధానాలను అనుసరిస్తే దేశ ఆర్థిక పురోగతికి ఒక మలుపు అవుతుందని ఆయన ఆశించారు. ‘‘రాబోయే ఆర్థిక సంవత్సరాన్ని నేను పూర్తి ఆశావాదంతో చూస్తున్నాను. నిర్ణయాలను సరిగ్గా అమలు చేస్తే, ఈ ఏడాది.. ఆర్థిక పునరుజ్జీవనానికి నాంది అవుతుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను’’ అని ఆయన తన ప్రసంగంలో అన్నారు.మన్మోహన్ ఉర్దూ అద్దకం1990వ దశాబ్దంలో భారతదేశం ఆర్థిక సరళీకరణ దిశగా అడుగులు వేసింది. అప్పటి ఆర్థిక మంత్రి, భవిష్యత్ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఈ మార్పు చోటుచేసుకుంది. 18,650 పదాలతో నేటికీ అత్యంత సుదీర్ఘమైనదిగా నిలిచి ఉన్న తన 1991 నాటి బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖ ఉర్దూ కవి అల్లామా ఇక్బాల్ రాసిన భావగర్భితమైన కవితను ఆయన చదివారు.దాని భావం: ‘‘గ్రీకు, ఈజిప్షియన్, రోమన్ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని మన గుర్తింపు ఇంకా సజీవంగా ఉంది. ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనం ఇంకా నిలబడగలిగామంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి ఉండాలి.’’! అదే ప్రసంగంలో ఆయన విక్టర్ హ్యూగో రాసిన..‘‘సమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ భూమిపై ఏ శక్తీ అడ్డుకోలేదు’’ అనే ప్రసిద్ధ వాక్యాన్ని కూడా ప్రస్తావించారు. మరుసటి ఏడాది కూడా మన్మోహన్ మరో ఉర్దూ కవి ముజఫర్ రజ్మీ రాసిన మాటలను గుర్తుచేశారు. దాని అర్థం: ‘‘చరిత్రలో కొన్ని సందర్భాలు ఇలా కూడా ఉన్నాయి, క్షణాల్లో జరిగిన పొరపాట్ల వల్ల శతాబ్దాల తరబడి శిక్షను అనుభవించాల్సి వచ్చింది.’’జస్వంత్.. తీరం, తుఫానుబీజేపీ హయాంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్ బడ్జెట్ ప్రసంగాలు కూడా కవితాత్మను ప్రతిఫలించాయి. 1999 నుండి 2003 వరకు ఆర్థికమంత్రిగా సేవలందించిన యశ్వంత్ సిన్హా.. బడ్జెట్ను సంప్రదాయానికి భిన్నంగా సాయంత్రం పూట కాకుండా, మధ్యాహ్నం పూట ప్రవేశపెట్టిన మొదటి మంత్రిగా గుర్తింపు పొందారు. ఆర్థిక వ్యవస్థలో రెండవ తరం సంస్కరణలు, వృద్ధి, సమానత్వం ఎంత ముఖ్యమో వివరిస్తూ ఆయన ఒక కవితను పేర్కొన్నారు.దాని తాత్పర్యం: ‘‘సమయం మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతోంది. తీరం వెంబడి సురక్షితంగా ఎంతకాలం నడుస్తూ వెళ్తాం?’’ (సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం).అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో, యశ్వంత్ సిన్హా తర్వాత ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జస్వంత్ సింగ్, ప్రభుత్వ చివరి సంవత్సరాల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగంలో సామాన్యుల అవసరాలకు పెద్దపీట వేస్తూ – ‘‘పేదవాడి కడుపులో ఆహారం, గృహిణి కొంగులో ధనం ఉండాలి..’’ అన్నారు. గాలి మేడలు.. పునాదులుకాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.చిదంబరం తన బడ్జెట్ ప్రసంగాల్లో మేధావుల మాటలను జోడించడంలో సిద్ధహస్తులు. ముఖ్యంగా తమిళ తాత్విక కవి తిరువళ్ళువర్ పట్ల ఆయనకు ఉన్న భక్తి, గౌరవం ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ స్పష్టంగా కనిపిస్తాయి. తరచు ఆయన తిరువళ్ళువర్ రాసిన ప్రసిద్ధ ‘తిరుక్కురల్’ నుండి, ‘‘ఏది సరైనదో నీ విచక్షణకు స్పష్టంగా తెలిసినప్పుడు, దానిని పూర్తి దృఢ సంకల్పంతో, అలసత్వం లేకుండా సాధించాలి..’’ అనే మాటను ఉదహరించేవారు. 2006–07 మధ్యంతర బడ్జెట్ సమయంలో, భారతదేశ యువత కలలను, ఆకాంక్షలను ప్రతిఫలించేలా, ‘‘మీరు గాలిలో కోటలు కట్టినట్లయితే, మీ శ్రమ వృథా కాదు. అవి ఉండాల్సిన చోటు అదే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ కోటల కింద బలమైన పునాదులను నిర్మించడమే..’’ అని హెన్రీ డేవిడ్ థోరో చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. అంతేకాదు, స్వామి వివేకానందుడి స్ఫూర్తిదాయక వాక్యాలను గుర్తు చేస్తూ, ‘‘మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తాము. మన తలరాతను మనమే రాసుకుంటాము. గాలి అందరికీ సమానంగానే వీస్తుంది. ఎవరైతే తమ పడవ తెరచాపలను తెరిచి ఉంచుతారో వారు ముందుకు వెళ్తారు. తెరచాపలు మూసి ఉంచిన వారు వెనుకబడిపోతారు. అది గాలి తప్పా? కాదు... మన విధిని మనమే నిర్మించుకుంటాము..’’ అని మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో నొక్కి చెప్పారు. అరుణ్ జైట్లీ.. పూలు–ముళ్లుజైట్లీ తన బడ్జెట్ ప్రసంగాల్లో సందర్భోచితమైన సూక్తులను, కవితలను ప్రయోగిస్తూ ఆర్థిక విధానాలను ఎంతో ఆసక్తికరంగా వివరించేవారు. 2017–18 బడ్జెట్ ప్రసంగంలో ఆయన, ‘‘నా లక్ష్యం సరైనదై, గమ్యం నా కళ్ల ముందు ఉన్నప్పుడు.. గాలులు నాకు అనుకూలిస్తాయి, నేను ఉన్నత శిఖరాలకు చేరుకుంటాను’’ అని తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. అలాగే 2016–17లో, ‘‘చాంపియన్లు అనేవారు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, ఒక కల, ఒక దార్శనికత నుండి ఉద్భవిస్తారు..’’ అని ఎంతో స్ఫూర్తిమంతంగా మాట్లాడారు. 2014–15 బడ్జెట్ ప్రసంగంలో ఆయన చేసిన, ‘మినిమం గవర్నమెంట్, మాగ్జిమం గవర్నెన్స్’ అనే పద ప్రయోగం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఒక ప్రతీకాత్మక నినాదంగా మారిపోయింది. ప్రధాని మోదీ ఘన విజయం తర్వాత అరుణ్ జైట్లీ తన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతూ, దేశ పరిస్థితులపై ఓ కవితను చదివారు. దాని భావం: ‘‘మనం కొన్ని పూలను పూయించగలిగాము, మరికొన్ని వికసించాల్సి ఉంది. కాని, తోటలో ఇంకా కొన్ని పాత ముళ్లు మిగిలే ఉన్నాయి.’’ 2017లో, గత ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందుల నుండి దేశాన్ని గట్టెక్కించే క్రమంలో, జైట్లీ ఒక శక్తిమంతమైన ఉర్దూ కవితను స్మరించారు. ‘‘పడవను నడిపేవారు ఓటమిని అంగీకరించి చుక్కానిని మాకు అప్పగించినప్పుడు, ప్రతి అలపైనా మాకు తుఫానులు, సుడిగుండాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా నదిని ఎలా దాటాలో మేము నిరూపించాము, భవిష్యత్తులోనూ నిరూపిస్తాము.’’. సీతారామన్.. వేకువ పక్షులుఆర్థిక మంత్రులందరిలో నిర్మలా సీతారామన్ తన ఆలోచనలను, ప్రణాళికలను ఎంతో స్పష్టంగా స్వేచ్ఛగా వ్యక్తపరచే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె తన ప్రసంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్, పండిట్ దీనానాథ్ కౌల్, ప్రసిద్ధ మహిళా సాధ్వి అవ్వయ్యార్, కాళిదాసు, పిసిరాంతైయార్ వంటి వైవిధ్యభరితమైన మేధావుల నుండి తన బడ్జెట్ ప్రసంగానికి స్ఫూర్తిని అందుకొంటుంటారు. ఆమె ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్ ప్రసంగం ప్రధానంగా ‘‘ఆకాంక్షల భారతం, ఆర్థిక అభివృద్ధి, బాధ్యతాయుతమైన సమాజం’ అనే అంశాల చుట్టూ సాగింది. రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని వివరిస్తూ, ఆమె ఉర్దూ రచయిత మంజూర్ హష్మీ రాసిన ఒక కవితను పఠించారు. ‘‘నీపై నీకు నమ్మకం ఉంటే, ఏదో ఒక మార్గం తప్పకుండా కనిపిస్తుంది. గాలి బలంగా వీస్తున్నప్పటికీ, ఆ గాలిని అడ్డుగా పెట్టుకుని కూడా దీపం వెలుగుతుంది..’’ అని ఆ కవిత భావం. నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో చాణక్య నీతి గురించి చెబుతూ, పట్టుదలతో కూడిన కృషి గురించి మాట్లాడారు. ‘‘మనుషులు దృఢ నిశ్చయంతో శ్రమిస్తే, అనుకున్న కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది’’ అని ఆ నీతి భావం. అలాగే, 2020 కేంద్ర బడ్జెట్ ప్రారంభోపన్యాసంలో.. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత, భారతదేశ ఐక్యతను చాటి చెప్పడానికి కశ్మీరీ కవి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పండిట్ దీనానాథ్ కౌల్ రాసిన కవితను ఆమె చదివారు. ‘‘మన దేశం వికసించిన శాలిమార్ తోట వంటిది, దాల్ సరస్సులో విరిసిన తామర పువ్వు వంటిది, యువత ఉడుకు రక్తంలా శక్తిమంతమైనది. నా దేశం, నీ దేశం, మన దేశం.. ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన దేశం’’ అని ఆ కవిత భావం. ఇక 2021లో, కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన చీకటి నీడల నుండి దేశం కోలుకుంటున్న తరుణంలో, ఆశావాదాన్ని నింపడానికి ఆమె.. ‘‘తెల్లవారుజాములో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, వెలుగును ముందే పసిగట్టి పాట పాడే పక్షి వంటిదే నమ్మకం’’.. అనే రవీంద్రనాథ్ టాగోర్ కోట్ను జ్ఞప్తికి తెచ్చారు.చూడాలి, నేడు (1 ఫిబ్రవరి 2026) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏ ప్రాచీన కవులు, రచయితలు, తత్త్వవేత్తలు, ఆమెతో పాటుగా ‘ప్రసంగిస్తారో’!మొత్తంమ్మీద ఇలా, బడ్జెట్ అంకెల్లో ఎన్నో అక్షర నక్షత్రాలు మెరిశాయి. భారతదేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ‘కేంద్ర బడ్జెట్’ అంటే కేవలం ఆదాయ వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది దేశ ప్రజల ఆశలకూ, ఆకాంక్షలకు ప్రతిరూపం. లోక్సభ వేదికపై ఆర్థిక మంత్రులు ప్రసంగిస్తున్నప్పుడు, ఆ అంకెల ప్రవాహంలో అకస్మాత్తుగా ఒక ఉర్దూ శాయరీయో, సంస్కృత శ్లోకమో లేదా ఒక స్ఫూర్తిదాయక కవితో మెరిసి.. సభలోని వారినే కాదు, యావద్దేశాన్నే మంత్రముగ్ధులను చేస్తుంటాయి. జమాఖర్చుల ప్రసంగ పాఠానికి మనోరంజకమైన జీవిత సత్యాల కవితాత్మక జోడింపు ఇది. ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్ ప్రసంగాల్లో ఉపయోగించిన కొన్ని సూక్తులుసమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. – డాక్టర్ మన్మోహన్ సింగ్మన దేశం వికసించిన శాలిమార్ బాగ్ లాంటిది, దాల్ సరస్సులో విరిసిన తామర పువ్వు లాంటిది; ఇది యువత ఉడుకు రక్తం లాంటిది, నా దేశం, నీ దేశం, ప్రపంచం ప్రేమించే అత్యంత ప్రియమైన దేశం.– నిర్మలా సీతారామన్పరిస్థితులు మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతున్నాయి. తీరం వెంబడి ఎంతకాలం నడుస్తూ వెళ్తాం? – యశ్వంత్ సిన్హాలక్ష్యం స్పష్టంగా ఉండి, గమ్యం కళ్లముందు ఉన్నప్పుడు.. గాలులు కూడా నాకు అనుకూలించి, నేను ఎత్తుకు ఎగురుతాను.; ‘‘ఛాంపియన్లు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, కల.. ఇంకా వారి దార్శనికత నుండి పుడతారు.’’ – అరుణ్ జైట్లీ -
క్యాన్సర్కు ఆన్సర్!
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి దీర్ఘకాలిక వ్యాధి స్థాయికి చేరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా. డయాబెటిస్, బీపీ మాదిరిగానే క్యాన్సర్తో కూడా దీర్ఘకాలిక మనుగడ సాగించవచ్చు.ఏఐ, రోబోటిక్ సర్జరీలు క్యాన్సర్ పని పడుతున్నాయి. టార్గెటెడ్ థెరపీ, నానో మెడిసిన్, ప్రోటాన్ బీమ్ థెరపీలు క్యాన్సర్ కణాలను గురి తప్పకుండా నిర్మూలిస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సలో మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి . వీటి ఫలితంగా క్యాన్సర్కు ఆన్సర్ దగ్గరలోనే ఉంది.ఇమ్యూనో థెరపీ మరింతగా అభివృద్ధి సాధిస్తుంది. రోగుల శారీరక స్థితిగతులకు అనుగుణంగా రూపొందించే ‘హైపర్ పర్సనల్’ ఔషధాలు, వ్యాక్సిన్లు క్యాన్సర్ను మరింత సమర్థంగా ియంత్రించగలుగుతాయి.క్యాన్సర్ నిర్ధారణను, చికిత్సను ఏఐ మరింతగా మెరుగుపరుస్తుంది. చికిత్సకు ముందే ఔషధాల దుష్ప్రభావాలను ఏఐ ఇప్పటికే గుర్తించగలుగుతోంది. దీనివల్ల అతి తక్కువ దుష్ప్రభావాలతో కూడిన ఔషధాలను ఇవ్వడం ద్వారా వ్యాధిని సమర్థంగా అదుపు చేయడం సాధ్యమవుతోంది. ఏఐ సాయంతో సమీప భవిష్యత్తులో అతి తక్కువ దుష్ప్రభావాలు గల ఔషధాల రూపకల్పన కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.చాలా రకాల క్యాన్సర్లలో సర్వసాధారణంగా కనిపించే టెలోమెరేస్, సర్వినిన్, పీ53 ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని, వాటి ద్వారా వ్యాపించే క్యాన్సర్లను అరికట్టే వ్యాక్సిన్లను రూపొందించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తున్నారు. ఇవి విజయవంతమైతే క్యాన్సర్కు దాదాపు ఆన్సర్ దొరికినట్లే!‘క్యాన్సర్కు ఆన్సర్ ఉండదు’ అనేది ఇదివరకటి మాట. ఇప్పుడది దాదాపు అపోహ. వైద్యశాస్త్రం శరవేగంగా సాధిస్తున్న అభివృద్ధి క్యాన్సర్ దూకుడుకు కళ్లేలు వేయగలుగుతోంది. పలు రకాల క్యాన్సర్లను సమూలంగా నయం చేయగలుగుతోంది. కొన్ని రకాల క్యాన్సర్లు సోకకుండా వ్యాక్సిన్లను తయారు చేయగలుగుతోంది. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లోను, చికిత్స విధానాల్లోను వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు త్వరలోనే క్యాన్సర్కు ఆన్సర్గా ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్లను పూర్తిగా అరికట్టగల రోజులు త్వరలోనే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.క్యాన్సర్ అంటే ఒకప్పుడు ప్రాణాలపై ఆశలు వదిలేసుకునే రోజుల నుంచి క్యాన్సర్ను జయించడం ఏమంత కష్టం కాదనేంత వరకు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాయి. ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరిగాక రకరకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించి, అరికట్టడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణ కోసం ఒకప్పుడు తప్పనిసరిగా కోతపెట్టి, బయాప్సీ పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని క్యాన్సర్లకు కోతతో పనిలేకుండా, రక్తపరీక్ష ద్వారా జరిపే ‘లిక్విడ్ బయాప్సీ’, శ్వాస ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయగల ‘బ్రీతలైజర్లు’ వాడుకలోకి వచ్చాయి.క్యాన్సర్ రోగులను యమయాతనకు గురిచేసే కీమో థెరపీ, రేడియో థెరపీ చికిత్స పద్ధతుల్లోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘ఇమ్యూనో థెరపీ’తో చాలామంది క్యాన్సర్ నుంచి విజయవంతంగా కోలుకోవడం సాధ్యం అవుతోంది. వైద్యరంగంలో జరుగుతున్న పరిశోధనల ఫలితంగా సమీప భవిష్యత్తులోనే కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారించడం; ఇంకొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం; మరికొన్ని రకాల క్యాన్సర్లను ప్రాణాంతకంగా మారకుండా నియంత్రించడం సాధ్యమవుతుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స పద్ధతుల్లో ఇటీవలి కాలంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను తెలుసుకుందాం...లిక్విడ్ బయాప్సీ‘కోవిడ్–19’ తర్వాతి కాంలలో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స పద్ధతుల్లో రోగులకు మేలు చేసే కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిలో ‘లిక్విడ్ బయాప్సీ’ ఒకటి. రక్త నమూనా ద్వారానే క్యాన్సర్ను ముందుగా నిర్ధారించే పరీక్ష ఇది. సేకరించిన రక్తనమూనాలోని డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రొటీన్లను విశ్లేషించి, రోగిలో వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే క్యాన్సర్ గుర్తించేందుకు ‘లిక్విడ్ బయాప్సీ’ దోహదపడుతుంది. దీని వల్ల త్వరగా చికిత్సను ప్రారంభించి, ఎక్కువగా ఇబ్బంది లేకుండానే క్యాన్సర్ను పూర్తిగా నయం చేసేందుకు వీలవుతుంది. కోతపెట్టడం ద్వారా కణజాలం ముక్కను తీసుకునే చేసే బయాప్సీ పరీక్ష కంటే ఇది చాలా తక్కువ నొప్పితో కూడుకున్నది కావడమే కాకుండా, రోగనిర్ధారణలో సమర్థంగా ఉపయోగపడుతుంది.ఏఐ ఆధారిత పాథాలజీక్యాన్సర్ నిర్ధారణకు సీటీ, ఎంఆర్ఐ, పీఈటీ స్కానింగ్, మామోగ్రామ్, హిస్టోపాథాలజీ పరీక్షలు వంటివి చేస్తుంటారు. వీటిని విశ్లేషించి, చికిత్స చేయడం కొత్తేమీ కాదు. వీటి విశ్లేషణ కోసం ఇటీవలి కాలంలో ఏఐ వినియోగం మొదలైంది. ఏఐ వినియోగం వల్ల రకరకాల స్కానింగ్స్ వంటి ఇమేజింగ్ పద్ధతుల విశ్లేషణ చాలా సులభతరంగా మారింది. వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం గణనీయంగా మెరుగుపడింది. ఫలితంగా క్యాన్సర్లను త్వరితగతిన గుర్తించడానికి, తగిన చికిత్స అందించడానికి వీలవుతోంది. ఏఐ ఆధారిత ఇమేజింగ్ పద్ధతుల ద్వారా వైద్యులు మరిన్ని ప్రాణాలను కాపాడగలుగుతున్నారు.మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) పరీక్షలుఇవి కూడా ‘లిక్విడ్ బయాప్సీ’ మాదిరి పరీక్షలే! ఒకే రక్తనమూనాను పరీక్షించడం ద్వారా యాభైకి పైగా క్యాన్సర్లను ముందుగానే గుర్తించే విధానాన్ని ఇటీవలి కాలంలో వైద్య పరిశోధకులు అభివృద్ధి చేశారు. వీటివల్ల రోగులకు ముందుగానే చికిత్స ప్రారంభించి, ఎక్కువ ఇబ్బంది లేకుండానే వ్యాధిని నయం చేసే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఈ పరీక్షల్లో రోగి నుంచి సేకరించిన రక్తనమూనాల ద్వారా డీఎన్ఏలో వచ్చే మార్పుల ఆధారంగా దాదాపు యాభైకి పైగా రకాల క్యాన్సర్లు సోకే అవకాశాలను గుర్తించడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణలో ఇదొక విప్లవాత్మకమైన పరిణామం.జీనోమిక్ ప్రొఫైలింగ్– ప్రెసిషన్ ఆంకాలజీక్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఇటీవలి కాలంలో అధునాతనమైన మాలిక్యులర్, జీనోమిక్ ప్రొఫైలింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా జీవకణాల్లోని జన్యువుల్లో క్యాన్సర్కు దారితీసే ఉత్పరివర్తనలను ముందుగానే అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో రోగికి వారి వారి వ్యాధి పరిస్థితులను బట్టి ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ చికిత్సను అందించగలుగుతున్నారు. ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ వల్ల క్యాన్సర్ రోగులను మృత్యువాత పడకుండా కాపాడగలుగుతున్నారు.డిజిటల్ బయో మార్కర్స్ఇటీవలి ఆవిష్కరణల ఫలితంగా క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాలు, బయాప్సీ కోసం సేకరించిన కణజాలం నమూనాలు వంటి ‘బయో మార్కర్స్’ను హైరిజల్యూషన్ డిజిటల్ ఇమేజెస్గా మార్చడం వీలవుతోంది. డిజిటల్ బయో మార్కర్స్ ద్వారా క్యాన్సర్ రోగులకు తగిన చికిత్స అందించడానికి, వారి ప్రాణాలు కాపాడటానికి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. డిజిటల్ బయో మార్కర్స్ ఇమేజెస్ను సుదూరంలో ఉన్న నిపుణులకు పంపి, వారి సలహా సంప్రదింపులు పొందడానికి, వారి సూచనల ఆధారంగా మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతోంది. దీని వల్ల ఎక్కడి నుంచైనా అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలపై చికిత్స పొందడం సాధ్యమవుతోంది.క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు చికిత్సలోనూ పలు ఆశాజనమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానాలు కొన్ని రకాల క్యాన్సర్లను నయం చేయడానికి, రోగుల జీవితకాలాన్ని పొడిగించడానికి దోహదపడుతున్నాయి. ఇదివరకు క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్నేళ్లుగా ఇమ్యూనోథెరపీ కూడా విస్తృత వినియోగంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో మరిన్ని క్యాన్సర్ చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం...సీఏఆర్–టీ సెల్ థెరపీలుకీమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లను అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానం ‘కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ–సెల్ థెరపీ’ (సీఏఆర్–టీ సెల్ థెరపీ). ఇది కూడా ఇమ్యూనో థెరపీలో ఒక విధానం. అయితే, ఇది వ్యక్తిగత చికిత్స విధానం. ఈ విధానంలో రోగి శరీరంలో రోగనిరోధకతకు దోహదపడే ‘టీ–సెల్స్’కు జన్యుమార్పులు చేసి, రోగిలోని నిర్దిష్ట క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తారు. ఈ చికిత్స పొందుతూ రోగి సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది.టార్గెటెడ్ థెరపీకీమో థెరపీ, రేడియో థెరపీలలో క్యాన్సర్ కణాలతో పాటు క్యాన్సర్ సోకిన భాగాలకు చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల చికిత్స పొందే రోగులకు నొప్పులు, బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిని అరికట్టే ఉద్దేశంతోనే శాస్త్రవేత్తలు ‘టార్గెటెడ్ థెరపీ’ని అభివృద్ధి చేశారు. టార్గెటెడ్ థెరపీలో వాడే ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాల వ్యాప్తిని మాత్రమే నిరోధిస్తాయి. చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఇవి హాని చేయవు. టార్గెటెడ్ థెరపీతో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ సహా కొన్ని రకాల క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయడం సాధ్యమవుతోంది.ప్రెసిషన్ రేడియేషన్ థెరపీరేడియేషన్ చికిత్సలో సాధారణంగా రేడియేషన్కు గురిచేసే క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో రేడియేషన్ కిరణాలను కచ్చితంగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలకు దాదాపుగా నష్టం జరగకుండా ఉంటుంది. ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ, స్టీరియో టాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ వంటి పద్ధతుల ద్వారా ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో కచ్చితత్వం గణనీయంగా పెరిగి, రోగి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు హాని తగ్గుతోంది. ఫలితంగా రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గి, రోగి కోలుకునే అవకాశాలు కూడా బాగా పెరుగుతున్నాయి.నానో మెడిసిన్క్యాన్సర్ రోగులకు సురక్షితమైన చికిత్సను అందించడంలో నానో మెడిసిన్స్ సత్ఫలితాలనిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన నానో మెడిసిన్స్ను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. నానో మెడిసిన్స్లో 1–100 నానోమీటర్ల పరిమాణం గల ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. ఈ ఏడాది నానో మెడిసిన్ రంగం మరింతగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నానో కీమోథెరపీ, నానో మెడిసిన్ బేస్డ్ ఇమ్యూనోథెరపీ, జీన్ థెరపీలో నానో సాంకేతికత వినియోగం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.రోబోటిక్ క్యాన్సర్ సర్జరీక్యాన్సర్ కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో రోబోటిక్ సర్జరీ అత్యంత కచ్చితత్వం సాధిస్తోంది. హైడెఫినిషన్ త్రీడీ కెమెరాల ద్వారా క్యాన్సర్ కణితులను గుర్తించి, తొలగించడంలో రోబో చేతులు మనుషులను మించిన నైపుణ్యంతో పని చేయగలుగుతున్నాయి. తక్కువ కోత లేదా చిన్న రంధ్రం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం లేకుండా క్యాన్సర్ కణితులను తొలగించగలుగుతున్నాయి. దీనివల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతోంది. ప్రొస్టేట్, కిడ్నీ, లివర్, పేగులు, తల, మెడ, రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయం, అండాశయం తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడంలో రోబోటిక్ సర్జరీ సత్ఫలితాలను సాధిస్తోంది. ప్రోటాన్ బీమ్ థెరపీరేడియేషన్ చికిత్సలో అధునాతన పద్ధతి ప్రోటాన్ బీమ్ థెరపీ. సర్వసాధారణంగా రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ సోకిన కణాలపైకి ఎక్స్–రే రేడియషన్ కిరణాలను ప్రసరింపజేస్తారు. దీనిని ఫోటాన్ థెరపీ అంటారు. ఈ కిరణాలు ఆరోగ్యకరమైన కణాలు ఉన్న శరీర భాగాల నుంచి దూసుకుపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రోటాన్ బీమ్ థెరపీలో ప్రోటాన్ కిరణాలు అత్యంత కచ్చితంగా క్యాన్సర్ కణితి మీదకు ప్రసరించి, అక్కడ ఆగిపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హానీ జరగదు. ప్రోటాన్ థెరపీలో ప్రోటాన్ కిరణాల తీవ్రతను, లోతును నియంత్రించడానికి అవకాశం ఉండటం మరో సానుకూలత. దీని వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం లేకుండా, విడతలు విడతలుగా క్యాన్సర్ కణితిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుంది. మెదడు, వెన్నెముక, కన్ను, ప్రొస్టేట్, రొమ్ము తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడానికి ప్రోటాన్ బీమ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది.మరిన్ని చికిత్స పద్ధతులుక్యాన్సర్ను నయం చేయడానికి, నియంత్రించడానికి మరిన్ని చికిత్స పద్ధతులపై కూడా వైద్య నిపుణులు విస్తృత పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో ఇప్పటికే ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’, ‘ఎపిజెనెటిక్ థెరపీ’ వంటి పద్ధతులపై ప్రయోగాలు జరుపుతున్నారు. ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’లో జన్యుమార్పిడి చేసిన వైరస్ను రోగి శరీరంలోకి పంపడం ద్వారా క్యాన్సర్ను నిర్మూలిస్తారు. ఈ పద్ధతిని మెలనోమా వంటి చర్య క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ‘ఎపిజెనెటిక్ థెరపీ’లో క్యాన్సర్కు కారణమయ్యే ఉత్పరివర్తలను లోనైన జన్యువులను గుర్తించి, వాటి డీఎన్ఏను మార్చకుండానే, ఆ జన్యువుల్లో జరిగే ప్రమాదకర ఉత్పరివర్తనలను వెనక్కు మళ్లిస్తారు. లుకీమియా, లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ల చికిత్సల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్ససమీప భవిష్యత్తులోనే క్యాన్సర్ చికిత్సలో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేపడుతున్న చికిత్స విధానాల్లో రోగులు అందరికీ ఒకే విధమైన ఔషధం అనే పద్ధతులను కొనసాగిస్తున్నారు. త్వరలోనే రోగుల వ్యక్తిగత శారీరక స్థితిగతుల ఆధారంగా ‘హైపర్ పర్సనలైజ్డ్’ ఔషధాలను ఏఐ సాయంతో రూపొందించి, ప్రయోగించే అవకాశాలపై ప్రయోగాలు జరుపుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో పలు అధునాతనమైన ఔషధాలు, చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చినా, పలు రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం ఇంకా సాధ్యం కావడం లేదు. అందువల్ల క్యాన్సర్ను దీర్ఘకాలం నియంత్రించగల వ్యాధి స్థాయికి తీసుకొచ్చేలా అందుకు తగిన ఔషధాలను, చికిత్స విధానాలను రూపొందించడంలో వైద్య నిపుణులు ప్రయోగాలు చేస్తున్నారు. క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలించ లేకపోయినా; డయాబెటిస్, బీపీ వంటి వ్యాధుల మాదిరిగానే దీర్ఘకాలం నియంత్రణలో పెట్టుకోగల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. క్యాన్సర్ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణించే పరిస్థితులు లేకుండా చేయవచ్చని చెబుతున్నారు.క్యాన్సర్ వ్యాక్సిన్లుపలు రకాల క్యాన్సర్లను నిరోధించడానికి వీలుగా ఇటీవలి కాలంలో ‘ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లు’ అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను ఆయత్తం చేస్తాయి. నిర్దిష్ట క్యాన్సర్ ప్రొటీన్లకు అనుగుణంగా ఈ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లు. ఊపిరితిత్తుల క్యాన్సర్, మెలనోమా, పాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్లను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్లు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. -పన్యాల జగన్నాథదాసు -
ఇసుక బ్యాటరీ
ఆధునిక గడియారాలు అందుబాటులో లేకముందు ఇసుక గడియారాలను వాడేవారు. కాని, అధునాతన లిథియం అయాన్ బ్యాటరీలు కూడా అందుబాటులోకి వచ్చాక ఈ ఇసుక బ్యాటరీ తయారు కావడం వింతగా ఉంది కదూ! నిజానికి ఇది లిథియం అయాన్ బ్యాటరీల కంటే అధునాతనమైనది, అత్యంత సమర్థమైనది కూడా! ఫిన్నిష్ శాస్త్రవేత్తలు ఇటీవల ఈ ఇసుక బ్యాటరీని రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇసుక బ్యాటరీ. ఈ బ్యాటరీ సామర్థ్యం తెలుసుకుంటే, నోరెళ్లబెట్టాల్సిందే!ఈ బ్యాటరీతో ఏకంగా ఐదువేలకు పైచిలుకు ఇళ్లు గల ఒక చిన్న పట్టణానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయగలుగుతున్నారు. పోర్నాయినెన్ అనే పట్టణంలో ప్రయోగాత్మకంగా దాదాపు యాభై అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ ఇసుక బ్యాటరీని నెలకొల్పారు. ‘లోవీసన్ ల్యాంపో’ అనే కంపెనీ శాస్త్రవేత్తల సహాయంతో ఈ ఇసుక బ్యాటరీని తయారు చేసి, ఈ పట్టణంలో నెలకొల్పింది. పొడిగా చితక్కొట్టిన రాళ్లను ఇసుకగా మార్చి, దానిని విపరీతంగా వేడి చేయడం ద్వారా ఈ బ్యాటరీని రూపొందించారు.అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వేడెక్కిన ఇసుక దీర్ఘకాలం పాటు వేడిని నిక్షిప్తం చేసుకుని, విద్యుత్తు సరఫరా చేస్తుందని చెబుతున్నారు. ఎంత విద్యుత్ సరఫరా ఉన్నా, ఫిన్లండ్లో శీతకాలమైతే చాలు, ఇళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి కట్టెల వినియోగం కూడా తప్పనిసరి. అయితే, ఈ ఇసుక బ్యాటరీ వల్ల పోర్నాయినెన్ పట్టణంలో ఈ శీతకాలంలో కట్టెల వినియోగం దాదాపు అరవైశాతం వరకు తగ్గుతుందని చెబుతున్నారు. ఫిన్లండ్ తన విద్యుత్తు వినియోగంలో 43 శాతం మేరకు పునర్వినియోగ ఇంధనాల ద్వారానే పొందుతోంది. పునర్వినియోగ ఇంధనాలను మరింతగా పెంచడం ద్వారా 2035 నాటికల్లా పూర్తిగా పర్యావరణ హితమైన విద్యుత్తునే దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని ఫిన్లండ్ ప్రభుత్వం భావిస్తోంది. -
ఆ ఆనందమే వేరు!
మనసును తాకే అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నటి మమితా బైజు. ఆమె మనసులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి. అవన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే, మీ కోసం...⇒ అసలు పేరు నమిత. ‘మమిత’ అనే పేరు సినిమాలు ఇచ్చిన బహుమతి. ఇంట్లో మాత్రం ఇప్పటికీ పొన్నుమణి, మమ్మే అని పిలుస్తారు. ‘సూపర్ శరణ్య’ తర్వాత ‘సోనా’ కూడా అయ్యాను.⇒ నటనకంటే ముందే నాట్యం నా జీవితంలో ఉంది. చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నాను. స్టేజ్పై అడుగులు వేస్తే వచ్చే ఆనందం వేరే ఏదీ ఇవ్వలేదు.⇒ సినిమాల మధ్యలోనూ సైకాలజీ చదవాలని ప్రయత్నించాను. షూటింగ్స్ వలన క్లాసులు మిస్ అయ్యాయి. కాని, నేర్చుకోవాలనే కోరిక ఇంకా అలాగే ఉంది.⇒ మేకప్ లేకుండా, సింపుల్ దుస్తుల్లోనే ఎక్కువ హ్యాపీగా ఉంటాను. డిజైనర్ డ్రెస్సులు కాదు, నా అల్మరాలో ఉన్న వాటితోనే ఎక్కువగా స్టయిలింగ్ చేసుకుంటాను.⇒ నేనొక ఫూడీ. అందులోనూ నాన్వెజ్కి నో చెప్పలేను. పంచకర దోశ, బాషి బిర్యానీ నా ఫేవరెట్స్. మలయాళీ వంటకాలంటే ఇల్లు గుర్తు వస్తుంది. కాని, తమిళ సెట్ దోశ, నెయ్యి ఇడ్లీలకు కూడా పెద్ద ఫ్యాన్ను. వంకాయ మాత్రం నాకు చాలా బోరింగ్ కూర.⇒ మలయాళం నా మాతృభాష. కాని, ఇతర భాషా చిత్రాల్లో నటించాలంటే భాషను గౌరవించాలి అనిపించింది. ఒక్కో పదం నేర్చుకుని ఇప్పుడు తమిళం, తెలుగు చదవడం, రాయడం కూడా వస్తోంది.⇒ స్క్రీన్పై కెమిస్ట్రీ చూసి వచ్చే డేటింగ్ రూమర్స్ నాకు కొత్త కాదు. అవన్నీ సోషల్ మీడియా కథలే! నా రియల్ రిలేషన్ షిప్ నాకు మాత్రమే తెలుసు.⇒ సెట్లో ఉన్నప్పుడు చాలా కామ్గా ఉంటాను. కెమెరా ఆన్ అయితే పూర్తిగా మారిపోతాను. ఆ మాయే నన్ను నటన వైపు తీసుకొచ్చింది. పెద్ద కమర్షియల్ హిట్స్ కంటే, మనసును తాకే పాత్రలే నాకు నిజమైన విజయం.⇒ రాబోయే ఒక సినిమా నన్ను కొత్తగా పరిచయం చేస్తుంది. ఆ పాత్ర తర్వాత ‘మమిత’ను మరో కోణంలో చూడబోతున్నారు. -
సకుంభ నికుంభుల వధ
కుంభకర్ణుడి కొడుకులు సకుంభ నికుంభులు. రామ రావణ యుద్ధ కాలంలో వారు శాపవశాన మదగజాల రూపంలో అడవుల్లో సంచరిస్తూ ఉండేవారు. ఆ తర్వాత పులస్త్యుడి అనుగ్రహంతో శాపవిమోచన పొందారు. పూర్వరూపాలు పొందిన తర్వాత సకుంభ నికుంభులు యథావిధిగా ఇష్టానుసారం సంచరిస్తూ, లోకాలను పీడించడం ప్రారంభించారు. ‘రామ రావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాదులు హతమయ్యారు. వీరు కూడా హతమైపోయి ఉండే బాగుండేది, వీరి పీడ విగడయ్యేది’ అని ఇంద్రాది దేవతలు అనుకోసాగారు.ఇదిలా ఉండగా, ఒకనాడు నారద మహర్షి లోకసంచారం చేస్తూ సకుంభ నికుంభుల నిలయానికి వచ్చాడు. ఇద్దరు సోదరులూ ఆయనకు ఎదురేగి, అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, సగౌరవంగా స్వాగతించారు. ‘నారద మహర్షీ! విశేషాలేమిటి?’ అని అడిగారు.‘మహావీరులారా! దానవ వీరుల్లో హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సైతం నేను ఎరుగుదును. వారెవరూ బాహు పరాక్రమంలో మీకు సాటిరారు. మీరు కత్తి ఎత్తారంటే సహస్రాక్షుడు సైతం భయంతో తోక ముడిచి పరుగులు తీస్తాడు. మీ బలపరాక్రమాలకు భయపడి ఇంద్రుడు గజగజలాడుతున్నాడు. ముల్లోకాలలోని జనాలు మీ ధాటికి జడిసి నిద్రలో కూడా ఉలికిపడుతున్నారు’ అన్నాడు.‘ఔను నారద మహర్షీ! నువ్వు పలికినది సత్యం. ముల్లోకాలలోనూ మమ్మల్ని ఎదిరించగల వీరుడెవడు?’ అని గర్వంగా మీసాలు దువ్వుకున్నారు. ‘మిమ్మల్ని ఎదిరించేవారు ఎవరూ లేకున్నా, జ్ఞాతిద్రోహం చేసి, లంకకు పట్టాభిషిక్తుడైన విభీషణుడు ఉన్నాడు కదా, అతడే మీ శత్రువు. అతడిని జయించి, లంకను స్వాధీనం చేసుకున్నారంటే, మీ లంక మీకు దక్కినట్లవుతుంది’ అని అగ్గి రాజేసి చక్కా వెళ్లిపోయాడు నారదుడు.నారదుడి మాటలు విని సకుంభ నికుంభులు రగిలిపోయారు. వెంటనే ఒక దూతను విభీషణుడి వద్దకు పంపి, యుద్ధానికి సిద్ధం కమ్మని హెచ్చరిక సందేశం పంపారు.విభీషణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు. సకుంభ నికుంభులకు, విభీషణుడి సేనలకు మధ్య భీకర యుద్ధం మొదలైంది. సకుంభ నికుంభుల చేతిలో విభీషణుడి సైనికులు పెద్దసంఖ్యలో నేలకొరిగారు. పోరులో వారి ముందు నిలువలేక విభీషణుడు కూడా రథాన్ని వెనక్కు మరలించాడు.యుద్ధంలో నానాటికీ పరిస్థితులు దిగజారుతుండటంతో విభీషణుడు చింతాక్రాంతుడయ్యాడు. ‘ఇలాంటి విపత్కర పరిస్థితిలో నాకు రాముడే దిక్కు. ముందుగా ఈ సంగతిని హనుమకు తెలుపుతాను’ అనుకుని, వెంటనే ఆకాశమార్గాన గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ హనుమంతుడిని కలుసుకుని, సకుంభ నికుంభుల దురాగతాన్ని వివరించి, కన్నీళ్లు పెట్టుకున్నాడు.‘భయపడకు విభీషణా! వెంటనే మనం రామచంద్రుడిని కలుసుకుందాం. ఆయన అండ మనకు ఉన్నంత వరకు సకుంభ నికుంభుల వంటివారు ఎందరు వచ్చినా, నిన్నేమీ చేయలేరు’ అని అభయమిచ్చాడు. విభీషణుడిని వెంటబెట్టుకుని వెంటనే అయోధ్యకు చేరుకున్నాడు. విభీషణాంజనేయులు రాత్రివేళ అకస్మాత్తుగా రావడంతో రాముడు ‘ఇంత రాత్రివేళ మీరిద్దరూ ఇలా రావడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించాడు.హనుమంతుడు రాముడికి విభీషణుడి పరిస్థితిని వివరించాడు. విభీషణుడికి రాముడు ధైర్యం చెప్పి, ‘హనుమా! రేపు సూర్యోదయానికల్లా సేనలను సిద్ధం చేయి. మనం యుద్ధానికి బయలుదేరుతున్నాం’ అని ఆజ్ఞాపించాడు. మర్నాడు ఉదయమే లక్ష్మణుడికి అయోధ్యానగర బాధ్యతలను అప్పగించి, భరత శత్రుఘ్నులతో కలసి విభీషణాంజనేయులు, సేనలు వెంటరాగా రాముడు లంకకు బయలుదేరాడు.రాముడి రాకను వేగుల వల్ల తెలుసుకున్న సకుంభ నికుంభులు యుద్ధానికి సిద్ధమయ్యారు. హోరాహోరీ యుద్ధం మొదలైంది. భరత శత్రుఘ్నులు ముందుకు వెళ్లి సకుంభ నికుంభులను ఎదుర్కొన్నారు. భరత శత్రుఘ్నులు ఎంతకూ వెనక్కు తగ్గకుండా పోరాడుతుండటంతో దానవ సోదరులిద్దరూ తమ తండ్రి కుంభకర్ణుడికి యముడు ఇచ్చిన యమదండాన్ని వారి మీదకు ప్రయోగించారు. యమదండం తాకగానే భరతశత్రుఘ్నులు కుప్పకూలిపోయారు.తన సోదరులు రణరంగంలో కూలిపోవడంతో రాముడు క్రోధావేశంతో కోదండాన్ని అందుకున్నాడు. సకుంభ నికుంభలపైకి వాయవ్యాస్త్రాన్ని సంధించాడు. వాయువేగంతో దూసుకెళ్లిన ఆ దివ్యాస్త్రం సకుంభ నికుంభులిద్దరినీ యమపురికి పంపింది. అప్పటికీ భరతశత్రుఘ్నులు స్పృహలేకుండా ఉండటంతో రాముడు శోకతప్తుడై దుఃఖించాడు. ‘రామచంద్రా! నువ్విలా శోకించ తగునా! ఇలాంటి ఆపదలను గట్టెక్కించడంలో దిట్ట అయిన హనుమ మన చెంతనే ఉన్నాడు కదా! అతడిని పంపితే, ఇట్టే సంజీవనని సాధించుకు వచ్చి నీ తమ్ములను బతికించగలడు’ అని విభీషణుడు ఊరడించాడు.‘హనుమా! నువ్వే నా సోదరులను బతికించాలి’ వేడుకోలుగా అన్నాడు రాముడు.‘ప్రభూ! నీ ఆజ్ఞ అయితే, సంజీవనినే కాదు, ఇంద్రుడితో పోరాడి సాక్షాత్తు అమృతాన్నయినా తీసుకొస్తా’ అని పలికి హనుమంతుడు ఆకాశానికెగశాడు.హనుమంతుడు నేరుగా అమరావతికేగి, అక్కడి నుంచి అమృతకలశంతో తిరిగి వచ్చాడు. అమృతాన్ని తాగించడంతో భరత శత్రుఘ్నులు పునర్జీవితులయ్యారు. విభీషణుడికి వీడ్కోలు పలికి రాముడు సోదరులతో కలసి అయోధ్యకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
కథాకళి: మధురం
చావంటే అందరికీ భయం ఉంటుంది. కాని పాళ్ళల్లోనే తేడా. అమృతనాథానికి చావంటే చాలా భయం. చిన్నప్పుడు శవాన్ని పాడె మీద మోసుకెళ్తూ వాయించే డప్పులని వినలేక చెవులు మూసుకునేవాడు. శవం మీద చల్లిన పూలు రోడ్ మీద కనిపిస్తే, వాటిని తొక్కకుండా వెళ్ళేవాడు. శవం కనిపిస్తే ఆ రోడ్డులోంచి వెంటనే ఇంకో రోడ్డులోకి మళ్ళేవాడు. ఎంత దగ్గరి బంధువు మరణించినా సరే, వారి శవాన్ని చూడటానికి వెళ్ళేవాడు కాదు. ఎప్పుడో వెళ్ళి పరామర్శించేవాడు. టెలిగ్రామ్ రోజుల్లో వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ వస్తే వెంటనే బయటకి వెళ్ళిపోయి, చాలాసేపటికి తిరిగి వచ్చేవాడు. అతని తొమ్మిదో ఏట పొరపాటున తాత శవం ఉన్న గదిలో రాత్రంతా ఉండటం ఆ భయానికి ప్రధాన కారణం.ఈ భయాన్ని ‘తనటోఫోబియా’ అంటారని ఆయనకి ఓ సందర్భంలో మేనల్లుడు చెప్పి, సైకియాట్రిస్ట్ని కలిస్తే, దాన్ని జయించవచ్చని సూచించాడు. కాని ఆయన వెళ్ళలేదు.అలాంటి అమృతనాథానికి ఓరోజు హార్ట్ ఎటాక్ వచ్చి ముచ్చెమటలు పోశాయి. ఇంట్లోనే ఉన్న ఆయన కొడుకు వెంటనే అంబులె న్ ్సకి ఫో న్ చేసాడు. తెల్లవారుఝాము కాబట్టి ట్రాఫిక్ లేక అంబులె న్ ్స పన్నెండు నిమిషాల్లో వచ్చింది. పారామెడిక్స్ ఆయనకి ప్రాథమిక చికిత్స చేశారు.ఇంజక్ష న్ కే భయపడే అమృతనాథం హాస్పిటల్లో చేరాడని తెలిసి ఆయన శ్రేయోభిలాషులంతా బాధపడ్డారు. వైద్య పరీక్షలు చేశాక గుండెకి రక్తాన్ని చేర్చే రక్తనాళాల్లో చాలా బ్లాక్స్ ఉన్నాయని, ఆపరేష న్ తప్పదని డాక్టర్స్ చెప్పారు. ఆయన మరణిస్తానని భయపడి ఒప్పుకోలేదు. కాని భార్య, అల్లుడు, కొడుకు ఆయనకి నచ్చచెప్పారు.‘‘ఈసారి గుండెపోటు వస్తే పోవటం ఖాయమట! స్టాటిస్టిక్స్ ప్రకారం కేవలం పది శాతం మాత్రమే హార్ట్ సర్జరీలో పోయే అవకాశం ఉంది నాన్న.’’ కొడుకు చెప్పాడు.అంతా నచ్చచెప్పాక అందుకు అంగీకరించి కాగితం మీద సంతకం చేశాడు.అమృతనాథం ఆపరేష న్ ముందు రాత్రి తినటానికి ఏమీ పెట్టలేదు. మర్నాడు ఉదయం మంచినీళ్ళు కూడా తాగనివ్వలేదు. ఆయన్ని వీల్చైర్లో ఆపరేష న్ థియేటర్కి తీసుకెళ్తూంటే ఆయన మొహం చూసిన కొత్తవాళ్ళకి కూడా అందులో చావు భయం స్పష్టంగా కనపడింది. ఆయనని ఆపరేష న్ బల్ల మీద పడుకోబెట్టాక డాక్టర్ నవ్వుతూ భుజం మీద తట్టి చెప్పాడు.‘‘మీరు తేరుకున్నాక మా ఇంటికి స్వీట్స్ డబ్బాతో వస్తారు. నేను కాజూబర్ఫీ అభిమానినని గుర్తుంచుకోండి. అన్నట్లు మీకు అంకెలన్నీ వచ్చా?’’‘‘వచ్చు.’’‘‘వంద దాకా?’’‘‘ఇంకా పైనే వచ్చు.’’‘‘ఐతే ఇక నిశ్చింతగా వంద నించి వెనక్కి బయటకి లెక్క పెట్టండి.’’ఆయన ఆరంభించాడు.‘‘వంద... తొంభైతొమ్మిది... తొంభైఎనిమిది... తొంభైఏడు... తొంభైఆరు...’’తొంభై దాటకుండానే ఆయనకి ఎనస్తీషియాతో çస్పృహ తప్పింది.అమృతనాథానికి మెలకువ వచ్చింది. ఆయనకి శరీరం లేనట్లుగా ఎంతో తేలికగా అనిపించింది. చుట్టూ చూస్తే ఆహ్లాదకరమైన, విశాలమైన తోట కనిపించింది. ఎన్నడూ చూడని రంగుల పువ్వులు, పక్షులతోపాటు ఎన్నడూ వినని అత్యంత మధురమైన సంగీతం వినిపిస్తోంది. ముక్కుకి మధురమైన వాసనలు.‘‘అమృతం.’’ఆయన్ని తల్లి పిలిచే పిలుపది!‘‘అమ్మా... నేను ఎక్కడున్నాను?’’ ఆవిడని చూడగానే అమృతనాథం అడిగాడు.‘‘అత్యంత ఆనందకరమైన చోట. ఈయన్ని గుర్తుపట్టావా? మీ నాన్నగారు. నీ రెండో ఏట పోయారు. కాబట్టి మీరు ఒకరినొకరు గుర్తు పట్టలేరు.’’‘‘ఏరా అమృతం. ఎలా ఉంది నీకు?’’ ఆయన ప్రాణమిత్రుడు పలకరించాడు.‘‘నా మనసు ఎన్నడూ అనుభవించనంత అత్యంత ప్రశాంతంగా, కారణం లేకుండా అత్యంత ఆనందంగా ఉంది. ఇక్కడ నించి ఎక్కడికీ వెళ్ళాలని లేదు.’’ చెప్పాడు.‘‘రా. అందరినీ చూద్దువు గాని.’’అతని చేతిని పట్టుకుని నడిపించసాగారు. సర్జ న్ మాటలు వినపడ్డాయి.‘‘అమృతనాథంగారు... నా మాట వినపడుతోందా? వినపడితే నా వేలిని నొక్కండి... మీకు నా గొంతు వినపడుతోందా? నర్స్ ఆ ఇంజక్ష న్ ఇంకోటి ఇవ్వు.’’ ‘‘నన్నెవరో పిలుస్తున్నారు.’’ అమృతనాథం చెప్పాడు.‘‘ఓ. ఐతే వెళ్ళు.’’ తల్లి చెప్పింది.‘‘కాని నాకు వెళ్ళాలని లేదమ్మా.’’ ఆయన దిగులుగా చెప్పాడు.‘‘తప్పదు. పిలుపు వినపడితే వెళ్ళి తీరాలి. అలా అందరికీ వినపడదు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎదురు చూస్తూంటాం.’’ అమృతనాథం తండ్రి ఆప్యాయంగా చెప్పాడు.‘‘గుడ్బై రా.’’ మిత్రుడు కూడా అసంతృప్తిగా చెప్పాడు.‘‘ఎలక్ట్రిక్ షాక్స్, ఆ ఇంజక్ష న్ పని చేశాయి. గుండె మళ్ళీ ఆడుతోంది. రివైవ్ అయ్యారు.’’ సర్జ న్ ఆనందంగా చెప్పాడు.ఆయన త్వరగా కోలుకున్నాడు. ఇప్పుడు అమృతనాథంలో చావు భయం పూర్తిగా పోయింది. బదులుగా దాన్ని ఇష్టపడసాగాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఆ ఫొటోతో ఆచూకీ!
ఆర్మ్ రెజ్లర్ నుంచి క్రిమినల్గా మారిన ఓ రౌడీషీటర్ ‘మెంటల్’ అవతారం ఎత్తాడు. జైలు నుంచి ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు షిఫ్ట్ అయ్యాడు. రెండో భార్య తనను కలవడానికి ఆస్పత్రి అధికారులు ఒప్పుకోలేదనే కారణంగా ‘నిప్పుపెట్టి’, అదను చూసుకుని మరికొందరితో కలిసి ఎస్కేప్ అయ్యాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతగాడి ఆచూకీ చిక్కలేదు. ఓపక్క పోలీసులు ఈ ఎస్కేప్డ్ రౌడీషీటర్ కోసం నిద్రాహారాలు మాని గాలిస్తుండగా, సదరు నేరగాడు మాత్రం తన రెండో భార్యతో విహారయాత్రల్లో జల్సాలు సాగిస్తూ, ఆ ఫొటోలను వాట్సాప్ ద్వారా మొదటి భార్యకు షేర్ చేసి చిక్కాడు. 2013 డిసెంబర్లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. నాంపల్లి చాపెల్ రోడ్కు చెందిన ఖురేషీ గతంలో ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్. 2006 వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సీనియర్ ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని, నాలుగైదు మెడల్స్ కూడా సంపాదించాడు. ఇతడిపై అబిడ్స్, నాంపల్లి ఠాణాల్లో వరకట్న వేధింపుల కేసుతో పాటు మాదకద్రవ్యాల కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో అబిడ్స్ పోలీసులు ఇతడిపై రౌడీషీట్ తెరిచారు. ఓ డ్రగ్స్ కేసులో 2013 అక్టోబర్ 15న పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. తన మానసిక స్థి్థతి సరిగ్గా లేనట్లు జైలు అధికారులను నమ్మించిన ఖురేషీ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డుకు చేరాడు. 2013 డిసెంబర్ 2 రాత్రి 9.30 గంటల సమయంలో మీరాలం మండీ ప్రాంతానికి చెందిన ఖురేషీ రెండో భార్య అల్మాస్ అతడిని కలిసేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఈ మేరకు సిబ్బందిని అనుమతి కోరగా, వారు డ్యూటీ ఆర్.ఎం.ఓకు విషయం చెప్పారు. ములాకత్కు అది సమయం కాకపోవడంతో ఆయన నిరాకరించారు. ఇదే విషయాన్ని వార్డు సిబ్బంది ఖురేషీకి తెలిపారు. దీంతో తన భార్యను ములాకత్కు ఎందుకు అనుమతించడం లేదంటూ చిందులేశాడు. వార్డు కబోర్డులో ఉన్న తోటి రోగుల కేస్షీట్స్ తీసుకుని అగ్గిపెట్టెతో వాటికి నిప్పుపెట్టాడు. దీంతో తీవ్రంగా పొగ రావడంతో ఆందోళన చెందిన సిబ్బంది వార్డులో ఉన్న 50 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు సమాయత్తమయ్యారు. అప్పటికే వార్డు మొత్తం పొగతో నిండిపోయి రోగులు, సిబ్బంది ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఎస్కార్టు పోలీసుల సహయంతో 50 మంది రోగులను పక్కవార్డుకు మార్చారు. సిబ్బంది రోగులను మార్చే ప్రయత్నంలో హడావిడిగా ఉన్నట్లు గుర్తించిన ఖురేషీ మరో పదిమంది ఖైదీల సహయంతో అక్కడే ఉన్న ఆక్సిజన్ సిలిండర్తో గది కిటికీ కింది భాగంలో గోడను ధ్వసం చేసి రంధ్రం చేశాడు. అందులో నుంచి మనిషి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసుకుని ఒక్కోక్కరుగా బయటకు వచ్చి పారిపోయారు. ప్రిజనల్ వార్డుకు అనుకుని ఉన్న క్వార్టర్స్లో మాజీ ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. గది గోడను ధ్వంసం చేస్తున్నట్లు శబ్దం రావడంతో వారు బయటికి వచ్చారు. అప్పటికే రంధ్రంలో నుంచి ఖైదీలు బయటకు రావడాన్ని గమనించి దగ్గరికి వెళ్లి ఎవరు, ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో వారి వద్దకు వచ్చిన ఖురేషీ ‘ఇక్కడి నుంచి వెళ్లండి లేదంటే కత్తితో పొడిచేస్తా’ అంటూ వారిని భయపెట్టాడు. దీంతో భయపడిన వారు ఇంట్లోకి వెళ్లి... గోకుల్ థియేటర్ వైపు ఉన్న మార్గం ద్వారా కొందరు ఖైదీలు బయటకు వెళ్లిపోయాక ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఆస్పత్రి వద్ద నుంచి ఆటోలో తన రెండో భార్య అల్మాస్ వద్దకు వెళ్లిన ఖురేషీ ఆమెతో కలిసి టవేరా వాహనంలో ‘టూర్’ ప్రారంభించాడు. మొదటి భార్యతో ఐదుగురు పిల్లలు కలిగినప్పటికీ ఖురేషీ ఆ ఏడాది సెప్టెంబర్లో అల్మాస్ను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి విహారయాత్ర ప్రారంభించిన ఖరేషీ వాహనాలతో పాటు విమానాలు, రైళ్లు వినియోగించారు. ఎక్కడా ఒక్క రోజు కంటే ఎక్కువ బస చేయకుండా గుల్బర్గా, బెంగళూరు, మైసూరు, ఊటీ, అజ్మీర్, ఢిల్లీ, ముంబై, మహాబలేశ్వర్, హరిద్వార్, కాశ్మీర్, గోవా, ఆగ్రా, సిమ్లా, కులూమనాలీ, శ్రీనగర్, పటాన్కోట్, లడక్, విజయవాడల్లో తిరిగాడు. వీరి కోసం గాలిస్తున్న పోలీసులు అన్నీ మర్చిపోయి తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడకు వెళ్లాడో తెలియక అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అతడి ఫోన్ నంబర్ కూడా కనిపెట్టలేక సతమతం అవుతున్నారు. ఇదిలా ఉండగా, తాను రెండో భార్యతో కలిసి జల్సా చేస్తున్న విషయాన్ని మొదటి భార్యకు తెలిపి, ఆమెను సతాయించాలని ఖురేషీ భావించాడు. దీంతో ఆగ్రాలో రెండో భార్యతో కలిసి దిగిన ఫొటోలను వాట్సాప్ ద్వారా మొదటి భార్యకు షేర్ చేశాడు. దీంతో ఆమె ఈ ఫొటోలతో పాటు అతడు వినియోగిస్తున్న నంబర్ను పోలీసులకు అందించింది. వెంటనే అప్రమత్తమై, సాంకేతిక నిఘా ఉంచిన పోలీసులు ఖురేషీని నగరానికి వచ్చాక అరెస్టు చేయాలని భావించారు. చివరకు 2013 డిసెంబర్ 24న విజయావాడ నుంచి టోలిచౌకి వచ్చిన ఖురేషీ ఆచూకీని సాంకేతికంగా గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. రెండోభార్య అల్మాస్కు ఖురేషీ పరారైన ఖైదీ అని తెలిసీ అతడితో సంచరించడంతో ఆమెనూ నిందితురాలిగా చేశారు. ∙ -
ఈ వారం కథ: తిరిగొచ్చిన అహం
కృష్ణ విసురుగా బెడ్రూమ్లోకొచ్చి కోపంగా ‘‘అసలు నువు ఆలోచించే చేస్తున్నావా?’’ అన్నాడు భార్య అరవిందతో. ఉతికిన బట్టలు మడతపెట్టి బీరువాలో పెడుతున్న అరవింద వెనుదిరగకుండానే, ‘‘అన్నీ ఆలోచించే చేశాను.’’ అన్నది ప్రశాంతంగా, ‘అన్నీ’ అన్నపదాన్ని నొక్కిచెపుతూ. రెట్టింపైన కోపాన్ని ఉక్రోషం చుట్టుముట్టగా ఏమీచేయలేని అశక్తతతో బెడ్ పక్క కుర్చీలో కూలబడ్డాడు కృష్ణ. కొత్తగా కొన్న త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటులో తూర్పువైపుగా ఉన్న తండ్రి రూమ్ నిశ్శబ్దంగా ఉంది. అయిదేళ్ల చింటూ రూమ్లోంచి మాత్రం టీవీ సౌండ్ వినబడుతోంది. తనకేం సమస్య వచ్చినా తండ్రి దగ్గరకు పోయి కాసేపు కూర్చుని సేదతీరటం కృష్ణకు అలవాటు. ఇపుడు సమస్య తండ్రిదే! కాదు,కాదు సమస్య తనదే! కాదు, కాదు– తనే తండ్రికి సమస్య. రోజూలా మాటాడటం కాదు, ఆయన వంక చూడాలన్నా గిల్టీగా ఉంది కృష్ణకు తన భార్య వల్ల. తాళ్లూరులో గవర్నమెంటు స్కూలులో అటెండరుగా పనిచేసి, రిటైరైన తండ్రిని తల్లి మరణానంతరం కృష్ణ రెండు నెలల క్రితం తన వద్దకు తెచ్చుకున్నాడు. సాయంత్రం పది పదిహేను నిమిషాలు వాకింగ్కు తప్ప ఆయన పెద్దగా బయటకు వెళ్లడు. రెండు పూటలా స్నాక్స్, భోజనంలో ఏలోటూ చేయదు అరవింద. మూడు నెలలకొకసారి కృష్ణ తన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మీద తండ్రికి చెకప్ చేయిస్తాడు. అంతేకాదు, ఆయనకు ఏది ఎప్పుడు అవసరమో గ్రహించి తక్షణం అమరుస్తుంటాడు కూడా! ఆయన తనకు వచ్చిన బెనిఫిట్స్తో కొడుకు ఇంటి లోన్లో కొంత తీరుస్తానన్నా కృష్ణ, ముఖ్యంగా కోడలు అరవింద ఒప్పుకోలేదు. తర్వాత ఈ మధ్య ఆయన బెనిఫిట్స్ ప్లస్ ఈ రెండునెలల పెన్షన్కు తమ డబ్బు కొంత కలిపి అరవింద తాళ్లూరులోని ఆయన పాత ఇల్లు రీమోడల్ చేయించింది. అందులో అన్ని ఫెసిలిటీలతో ఓ చిన్న రూమ్ వేయించింది. మామగారు అపుడపుడూ తన ఫ్రెండ్స్తో ఒకటిరెండు రోజులు గడిపేందుకు. ఆ పనితో కృష్ణకు అరవింద మీద ప్రేమ రెట్టింపైంది. అపుడు రెట్టింపైన ప్రేమ, గత వారం రోజులుగా అరవింద చేష్టలతో ఒక్కసారిగా జీరోకు పడిపోతున్నది. అందులో మొదటి స్టెప్. ఈనెల నుండి అయిదువేలు అపార్ట్మెంటు లోను ఈఎంఐ కింద మామగారి పెన్షన్ ఎకౌంటు నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టించటం. ఆయనకొచ్చేదే పదహారువేలు. ఆయనకు దానిని ఖర్చుపెట్టే అవసరం లేకపోవచ్చు. కాని ఒక జీవితకాలపు ఆయన శ్రమను ఇలా దోచుకోవటం; అది కూడా తనకీ విషయం వేరేవారి ద్వార తెలియటం– ఇవన్నీ తలచుకుంటుంటే కృష్ణ మనసు ఉడికిపోతున్నది.. ‘తల్లి దేవత, కనబడే దైవం’ అన్నీ దొంగ మాటలు. తల్లి అనే రోల్లో మాత్రమే స్త్రీ దేవత. అత్త, భార్య, కోడలు వంటి పాత్రలలో కాదు. పిల్లలు పుట్టగనే ప్రపంచాన్నంతా వాళ్లకు దోచి పెట్టాలనే ఇన్స్టింక్టు దైవత్వమెలా అవుతంది?’ గతంలో ఏదో టీవీ చర్చావేదికలో తను విన్న విశ్లేషణలు గుర్తొచ్చాయి. అప్పుడవి ట్రాష్ అని కొట్టిపడేసినా, ఇప్పుడు మాత్రం అనుభవంలో అవన్నీ నిజమే ననిపిస్తుంది కృష్ణకు. తండ్రిని పలకరించటానికి కూడా మనస్కరించక కారు తీసుకుని నెల్లూరు బస్టాండు దగ్గర్లోని రత్నమహల్ హాలు వెనుక ఉన్న తన ఆడిట్ ఆఫీసుకు బయలుదేరాడు కృష్ణ. ఆదివారం నాడు ఆఫీసు దరిదాపులలో కనబడని తన బాస్ రాకను ఆశ్చర్యంగా చూస్తూ విష్ చేశాడు వాచ్మెన్. దానిని పట్టించుకోకుండా తన రూమ్లో కెళ్లి ఏసీ వేసుకుని టీవీ ఆన్ చేశాడు. ఏదో కొత్త సినిమా వస్తున్నది ఓటీటీలో. లడ్డూ బ్యాచ్ను పట్టుకునే ప్రయత్నంలో ఉండగా రిసార్టులో ఇద్దరు హత్యచేయబడ్డారని తెలుసుకుని వచ్చిన íసీఐ తలుపులు బాది చివరకు కాలితో తన్నగానే రంధ్రం ఏర్పడి తలుపులో బూటు ఇరుక్కుపోతుంది. దానిని అతి కష్టంమీద బయటకు లాక్కుంటూ అవస్థలు పడుతుండగా, పక్కనున్న కానిస్టేబులు తీరిగ్గా కీతో తాళం తీసి లోపలికి వెళతాడు. కృష్ణ చూస్తున్నది దానిని కాదు. తర్వాత షాట్లో తెరుచుకుంటున్నపుడు తలుపులో ఆ రంధ్రం లేకపోవటం గూర్చి. తన తండ్రికి సినిమాలంటే ప్రాణం. ఆ అలవాటే తనకొచ్చింది. సినిమా విశ్లేషణలు, విమర్శలు, ఆస్వాదనలు– మనసు బాలేనపుడు ఇవే తనకు రిలీఫ్ ఇచ్చేవి. ఇప్పుడవే నరకంగా అనిపించటంతో టీవీ ఆఫ్ చేసి కణతలు రుద్దుకున్నాడు. పోయిన వారం వాకింగ్ తర్వాత వీథి చివరలోఉన్న కిరాణాషాపు దగ్గర సిగరెట్ తీసుకుంటుంటే షాపతను, ‘‘ఆ తెల్లగా ఒడ్డూ పొడుగుండే పంచెకట్టాయన మీ మామగారా?’’ అన్నాడు ఆసక్తిగా.ఇతను మా నాన్నను ఎపుడు చూశాడా అనుకుంటూ, ‘‘దేనికి?’’ అన్నాడు అనుమానంగా. ‘‘మేడంగారు ఏవో సరుకులు కొనుక్కుని, డబ్బులు మర్చిపోయానని నాతో అంటే నేను ఫర్లేదమ్మా తర్వాత ఈయండి అన్నాను. వెంటనే ఆ పెద్దాయన అయిదు వందల నోటు తీసి ఇచ్చాడు’’కృష్ణ కోపాన్ని కంట్రోలు చేసుకుంటూ, ‘‘ఆయన మా నాన్నగారు’’ అన్నాడు. అతను పట్టించుకోకుండా ‘‘అవునా! చిల్లర ఇస్తుంటే అంతటి ఆఫీసర్ మేడమ్ ‘నాకు పెద్ద డైరీమిల్క్ కావాలి అనటం’ ఆయన కూడ భళ్లున నవ్వేసి ‘నీకన్నానా తల్లీ!’ అనటం చూస్తుంటే, తండ్రీ కూతుళ్లు అనుకుంటారు ఎవరైనా’’ అన్నాడు మురిపెంగా. ఆ షాపతని మాటలు గుర్తు కొస్తుంటే కృష్ణకు పుండు మీద కారం చల్లినట్టవుతున్నది. డబ్బు... డబ్బు... డబ్బు... నలభైయేళ్లు చెమటోడ్చిన ఫలితాన్ని అలా ఎలా దోచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా? మనుషుల మరోకోణం పెద్దపెద్ద మేధావులకే అర్థంకాదు. అరవింద దోపిడీ కిరాణాషాపు వాడికేం అర్థమవుతుంది? పోనుపోను భార్యమీద ద్వేషం రెట్టింపవుతున్నది. సెల్ మోగటంతో చూశాడు. ఫాదర్ అని డిస్ప్లే అవుతున్నది. సెల్ తీసుకుంటుంటే కృష్ణ చేతులు వణికాయి. ‘భార్యకు తండ్రికి మధ్య కచ్చితంగా వాగ్వివాదం జరిగి ఉంటుంది.’ ఏంచేయాలో పాలుపోక నిదానంగా సెల్ నొక్కాడు. ‘‘చింటూగాడి బర్త్డే ప్రెజంటేషన్ కొందామని డీమార్ట్ కొచ్చాం. ఆ బ్యాట్లు బాల్లు ఏరకం కొనాలో తెలీటం లేదురా!’’ తండ్రి గొంతులో కంగారు. బిత్తరపోయాడు కృష్ణ. అర్థమైంది. వారం క్రితం పడ్డ మూడోనెల పెన్షన్ ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా మొత్తం కాజేద్దామని అరవింద ప్లాను. అందుకే తిన్న తర్వాత మధ్యాహ్నం తప్పనిసరిగా కునుకు తీసే నాన్నను బలవంతంగా ఇలా పంపించింది. కృష్ణలో టెన్షన్, ఆవేదన క్రమంక్రమంగా తీవ్రమైన కోపంగా మారిపోతున్నది.ఏంచేయమంటావురా!’’ అన్న సెల్లో తండ్రి మాటకు ఉలిక్కిపడి ‘‘వాడికి తెలుసులే నాన్నా!’’ అన్నాడు కోపాన్ని కంట్రోలు చేసుకుంటూ. కాని అతని వల్లకాలేదు. భార్యమీద అసహ్యం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకోగా ఒక్కసారిగా లేచి ఆవేశంగా బయటపడ్డాడు. వంటయింట్లో స్నాక్స్ తయారు చేస్తున్న అరవింద తనను జబ్బపట్టుకుని ఎవరో లాగటంతో అదిరిపడింది. గోడకు కొట్టుకోబోయి తనను తాను కంట్రోలు చేసుకుని ఆగి తలతిప్పి చూచింది. ఎదురుగా నిప్పులు కక్కే కళ్లతో కృష్ణ. భర్తను భయంభయంగా చూస్తూ, ‘‘ఏమైంది?’’ అన్నది. భార్యను తీవ్రంగా చూస్తూ, ‘‘మా నాన్నను డీమార్టుకు ఎందుకు పంపావు? ఒక్క రూపాయి కూడా డబ్బులివ్వకుండా’’ పెద్దగా అరుస్తునట్లు అన్నాడు కృష్ణ.అరవింద తేలిగ్గా ఊపిరి పీలుస్తూ, ‘‘అదా! ఇంకేమో అనుకుని భయపడ్డాను. ముందు వాటర్ తాగు. కూల్ అవుతావు’’ అని ఫ్రిజ్ నుంచి బాటిల్ ఇస్తుండగా, కృష్ణ విసురుగా తల తిప్పుకున్నాడు.అరవింద కృష్ణ భుజాల మీద రెండు చేతులు వేస్తూ, ‘‘ముందు నింపాదిగా కూర్చో ’’ అన్నది.కృష్ణ చేతులు విదిలించుకుంటూ, ‘‘నీ నటనలు ఆవు. మా నాన్నకు పడేదే పదహారు వేలు. దానికీ ఎసరు పెట్టావా?’’ అన్నాడు రౌద్రంగా.అరవింద కాసేపు మాట్లాడలేదు. తర్వాత నిదానంగా తలెత్తి, ‘‘నీకు ఆయన నాన్న. నాకు మామయ్య. స్వయానా మేనమామ. నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోతే, ఒంటి చేత్తో మా కుటుంబాన్ని పోషించిన నా మేనమామ. నాన్నకన్నా ఎక్కువ’’ అన్నది ‘‘అందుకేనా పైసా ఇవ్వకుండా చింటూనిచ్చి పంపావు, చింటూగాడు అక్కడ కనబడ్డవన్నీ కొంటాడు. ఆ కాస్త బాలెన్స్ అయిపోయి, డబ్బు కట్టలేక నలుగురిలో మా నాన్న నవ్వులు పాలు అయితేగాని నీ కసి తీరదా?’’భార్య నవ్వటంతో కృష్ణ కోపం రెట్టింపై, ‘‘మాట్టాడవేం?’’ అని గద్దించాడు.అరవింద చిరునవ్వుతో కృష్ణ భుజాలు నొక్కి కుర్చీలో కూర్చో బెడుతూ, ‘‘ప్రతి దీపావళికి అమ్మా నేను మీ ఇంటికి వచ్చేవాళ్లం. గుర్తుందా! మామయ్య పట్టులంగాతో ఉన్న ఐదారేళ్ల నన్ను ఎత్తుకుని కిరాణాషాపుకు తీసుకెళ్లేవాడు. దారిలో కనబడ్డవారందరికీ నా మేనగోడలు అని గొప్పగా చెప్పుకుంటూ వాళ్లు అబ్బురంగా చూస్తుంటే ఆనందపడుతూ నన్ను అపురూపంగా చూసుకునేవాడు. మామయ్యను డబ్బులడిగి ఇబ్బంది పెట్టొద్దు అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి, నేను గుప్పిట్లో ఉన్న రూపాయిని గట్టిగా బిగిస్తూ. ‘మామయ్యా! టపాసులకు నువ్వు ఇవ్వొద్దు. నా డబ్బులతోనే కొనుక్కుంటా’ అనేదాన్ని’’ బాల్య జ్ఞాపకాల వల్ల మొహం వెలుగుతుండగా అరవింద అన్నది.కృష్ణ ఏం మాట్టాడలేదు. అరవింద కొనసాగించింది.‘‘కావల్సినవన్నీ కొనుక్కున్న తర్వాత కొట్టు తాతను, ‘ఎంతైంది తాతా?’ అని నేను అడిగితే. పక్కనుంచి మామయ్య, ‘సరిగ్గా రూపాయే విందా’ అనేవాడు తాతకు కన్నుకొడుతూ. నడుం మీద చేయి వేసి అడుగుతున్న నా బుగ్గలు పుణికి పుచ్చుకుంటూ తాత కూడా, ‘అంతే అంతే! రూపాయికి ఒక్కపైసా తక్కువా లేదు ఎక్కువా లేదు’ అనేవాడు. ఆ మందులన్నీ నేనే కొనుక్కున్నాననే నా గర్వాన్ని, ధీమాను తగ్గకుండా చూసిన మామయ్యకు మనమేం ఇవ్వగలం? అవి తిరిగి ఇవ్వటం తప్ప’’ అన్నది కళ్లు తుడుచుకుంటూ. జరుగుతున్నదంతా కృష్ణకు లీలగా అర్థమవుతూ కోపం, రౌద్రం క్రమేపీ తగ్గిపోసాగాయి. అయినా ఏదో గుర్తొచ్చి కృష్ణ ఏదో ఆనబోయేంతలో అరవింద చెయ్యెత్తి ఆపుతూ, ‘‘నీ డౌట్ అర్థమైంది. ఆ డీమార్ట్ మా కజిన్ పల్లవిది. చింటూగాడు ఎంత షాపింగ్ చేసినా, బిల్లు పదివేలకు ఒక్క రూపాయి తక్కువా ఉండదు, ఎక్కువా ఉండదు’’ అన్నది చిన్నప్పటి మామయ్య మాటలు అనుకరిస్తూ.కృష్ణ మనసు నిండా భార్యపట్ల కృతజ్ఞత చోటుచేసుకుంది. ఏదో సైకాలజీ బుక్లో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి.నేనొక్కడినే కుటుంబాన్ని నడుపుగలుగుతున్నాననే మగవాడి అహం, మేల్ ఇగో క్రమేపీ ఆత్మవిశ్వాసంగా మారి అతన్ని సమర్థుడిగా స్థిరపరుస్తుంది. విజయాలు సాధించటంలేదనో, విశ్రాంతి కావాలనో భార్యాపిల్లలు అతని మేల్ ఇగోని లాగివేసే చర్యలో భాగంగా అదృశ్యంగా ఉన్న అతని ఆత్మవిశ్వాసమూ ఊడిపడుతుంది. అది అతనిని వ్యర్థుడిగా మార్చివేసి, తనను తాను వస్తువుగా భావించే స్థాయికి దిగజారుస్తుంది. తన తండ్రిని ఆ ప్రమాదంలోంచి గట్టెక్కించి కోల్పోతున్న స్ధానాన్ని తిరిగి ఇవ్వటం ద్వారా మేనమామలో కాన్ఫిడెన్స్కు ఊపిరిలూదింది ఏ సైకాలజీ చదవని అరవింద’భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకోబోతుండగా చప్పుడు వినిపించి వాకిలివైపు తలతిప్పి చూచాడు. చింటూ ఒక్క అంగలో అరవింద దగ్గరకు దూకి చేతులో బ్యాట్, బాల్ చూపిస్తూ, గొప్పగా ‘‘ఇవన్నీ తాతయ్యే కొనిచ్చాడు. నా బర్త్డే ప్రజంటేషన్గా. డీమార్ట్లో తాతయ్యతో సెల్ఫీ తీసుకుని, మా ఫ్రెండ్స్కు పంపించాను కూడా’’ అన్నాడు గర్వంగా.వెనుకగా మాధవరావు చేతిలో బ్యాగ్తో వస్తూ, ‘‘అల్లాడిచ్చాడురా నీకొడుకు! మొత్తం పదివేలు మించలేదనుకో. లేకపోతే నీకు ఫోన్ చేద్దామనుకున్నా’’ అంటూ ఈ మధ్య కొత్తగా కొన్న చిన్న లాప్టాప్తో తన గదిలోంచి తన వద్దకు పరిగెత్తుకొచ్చిన మనవడిని ఆప్యాయంగా వెంటబెట్టుకుని తన రూమ్లోకి వెళ్లాడు.నాన్న చేయి మీసం మీదికి పోవటాన్ని చాలా రోజుల తర్వాత చూశాడు కృష్ణ. ఆయన మాటలలో సంతోషం, గాంభీర్యం, హుందాతనం తొణికిసలాడుతున్నాయి.‘‘లెఫ్ట్ హాండ్ ధంబ్, మిడిల్ఫింగర్లతో లాప్టాప్ మధ్యలో పైభాగాన్ని అదేవిధంగా రైట్హాండ్ తో కింది భాగాన్ని యూజ్ చేసి పైకి తెరవాలి. సైడ్ భాగాలతో కాదు. స్ప్రే డైరక్ట్గా చల్లకూడదు. క్లాత్ మీద చల్లి తర్వాత తుడవాలి. అంతేకాదు చార్జింగ్లో ఉన్నపుడు యూజ్ చేయకూడదు’’ శ్రద్ధగా వింటున్న మనవడికి వాడిభాషలో వాడికి అర్థమయ్యేట్లు వివరిస్తున్న మాధవరావు ఏదో అలికిడి వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా ఏదో సంశయిస్తూ కృష్ణ.‘‘ ఏరా! ఏం కావాలి?’’ కృష్ణ ఏం మాట్లాడలేదు.ఒళ్లోని లాప్టాప్ పక్కన పెడుతూ, ‘‘నా దగ్గర మొహమాటమేందిరా! డబ్బులేమైనా కావాలా?’’ అన్నాడు అనుమానంగా. కృష్ణ చిన్నగొంతుతో, ‘‘ఓ అయిదు వందలు’’ ససుగుతుంటే ఆయన భళ్లున నవ్వేసి, ‘‘ఈ మాత్రం దానికేనా ఇంత బిల్డప్. తీసుకో’’ అని రెండు అయిదువందల నోట్లు ఇచ్చాడు.వంటగదిలోంచి నవ్వు వినిపించి తల తిప్పిన మాధవరావు, ‘‘చూశావా విందా! లక్షలు సంపాదించే పెద్ద ఆడిటర్. ఆఫ్ట్రాల్ మామూలు పెన్షనర్ వద్ద డబ్బులు అడుగుతున్నాడు’’ అన్నాడు మీసం దువ్వుతూ. అరవింద ముందుకు వచ్చి, ‘‘ఇదంతా అప్పుగానే మామయ్యా! జీతం రాగానే వడ్డీతో సహా కట్టాలని మీ అబ్బాయిగారికి చెప్పండి’’ అన్నది పెద్దగా అందరి నవ్వులతో గదంతా ప్రతిధ్వనించింది.∙ఆర్ వి రాఘవరావు -
మానవ తప్పిదాలు చారిత్రక గాయాలు
తీర్మానాలు వేరు, నిర్ణయాలు వేరు. తీర్మానాలన్నవి.. ‘చేసుకునేవి’. నిర్ణయాలన్నవి.. ‘తీసుకునేవి’. తీర్మానాలు ఫెయిల్ అయితే పోయేదేమీ లేదు. కాని, నిర్ణయాలు మిస్ ఫైర్ అయితేనే... ఫలితం దారుణంగా ఉంటుంది. అందుకు చరిత్రలో అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఒక్కోసారి మనం తీసుకునే ‘చెత్త నిర్ణయం’ మన జీవితాన్నే ట్రాజెడీగా చేస్తుంది. అదే నిర్ణయాన్ని ఒక రాజుగారో,ఏ ప్రభుత్వం వారో తీసుకుంటే? చరిత్రలో అది ఒక ‘సీరియస్ కామెడీ’గా మిగిలిపోతుంది. అహంకారం వల్ల కావచ్చు, అజాగ్రత్త వల్ల కావచ్చు లేదా మన బ్యాడ్ లక్ వల్ల కావచ్చు... చెత్త నిర్ణయం తలపైకి ఎక్కి కూర్చున్నప్పుడు రాజైనా, రాజారావు గారైనా చేసేది ఏమీ ఉండదు. చరిత్రలో ఇలాంటి ట్రాజిక్ కామెడీలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో కొన్ని.. మీ కోసం :::చెంగీజ్ ఖాన్ కి ‘సారీ’ చెప్పనందుకు..!చెంగీజ్ ఖాన్ వీరుడు, శూరుడే కాని, క్రూరుడు మాత్రం కాడు. పైగా స్నేహశీలి. 1218వ సంవత్సరంలో ఒకరోజు ఆయనకు అనిపించింది– ఖ్వారెజ్మియన్ సామ్రాజ్యంతో (ప్రస్తుత ఇరాన్/ఇరాక్ ప్రాంతం) కలిసి బిజినెస్ చేద్దామని! మంచి విషయమే కదా. అందుకోసం 450 మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్లను పంపించాడు. కాని, అక్కడి లోకల్ గవర్నర్కి వాళ్లపై అనుమానం వచ్చి, వాళ్లంతా గూఢచారులేమోనని అందర్నీ చంపేయించాడు. ‘‘ఇట్స్ ఓకే’’ అని చెంగీజ్ ఖాన్ సర్దుకుపోయాడు. ‘‘కనీసం సారీ అయినా చెప్పండి’’ అని ముగ్గురు రాయబారులను ఖ్వారెజ్మియన్కు పంపాడు. అయితే అక్కడి రాజు అతి తెలివి ప్రదర్శించాడు. ముగ్గురిలో ఇద్దరికి గడ్డాలు గీయించి, మూడో రాయబారి తల నరికేయించాడు. ఫలితం: చెంగీజ్ ఖాన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన మంగోల్ సైన్యంతో బయల్దేరి వెళ్లి ఖ్వారెజ్మియన్ సామ్రాజ్యాన్ని రూపుమాపేశాడు. కోట్లాది మంది ప్రాణాలు పోయాయి.నీతి: పక్కింటి వాళ్లతో గొడవ పడితే పంచాయతీ అవుతుంది. కాని, చెంగీజ్ ఖాన్లాంటి వాళ్లతో గొడవ పడితే చరిత్రే మారిపోతుంది! ఇంకోలా చెప్పాలంటే – పులిని నిద్రలేపినా పర్లేదు కాని, చెంగీజ్ ఖాన్ ముఖం మీద చిటికెలు వేయకూడదు.చలికాలంలో దండయాత్రఇదొక క్లాసిక్ హిస్టరీ కామెడీ! 1812లో నెపోలియన్, 1941లో హిట్లర్.. ‘‘రష్యా ఎంత పెద్దదైతే మనకేంటి? ఉఫ్ అని ఊదేసి ఇంటికి వచ్చేద్దాం’’ అని ప్లాన్ వేశారు. ఉఫ్ అని ఊదేసేవారేనేమో కాని, వాళ్లు రెండు విషయాలను అస్సలు అంచనా వేయలేకపోయారు: ఒకటి రష్యా వైశాల్యం (అది ఒక దేశం కాదు, ఒక ప్రపంచం!), రెండోది అక్కడి భయంకరమైన చలి. ఫలితం: రష్యాపైకి నెపోలియన్ పంపిన 6 లక్షల మంది సైన్యంలో చివరికి మిగిలింది కేవలం లక్ష మంది మాత్రమే! అటు హిట్లర్ కూడా అదే తప్పు చేసి, తన నాజీ సామ్రాజ్యం కూలిపోవడానికి పునాది వేసుకున్నాడు.నీతి: రష్యా వాళ్లతో యుద్ధం గెలవొచ్చేమో కాని, వింటర్లో అక్కడి మైనస్ డిగ్రీల చలిని మాత్రం ఎవరూ గెలవలేరు. చలికాలంలో యుద్ధం చేయటం కంటే దుప్పటి కప్పుకుని పడుకోవడం ఉత్తమం అని నెపోలియన్, హిట్లర్ తెలుసుకుని ఉంటారు.కొంప ముంచిన గిఫ్ట్ ప్యాక్!క్రీ.పూ. 12వ శతాబ్దం నాటి సంగతి ఇది. సుమారు 10 ఏళ్లు యుద్ధం చేసినా గ్రీకులు ట్రాయ్ నగరాన్ని (ప్రస్తుతం టర్కీలోని ఒక భాగం) గెలవలేకపోయారు. అప్పుడు ఒక ‘ఐడియా’ వేశారు. ఒక పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి కోట ముందే వదిలేసి, ‘‘మేం ఓడిపోయాం. ఈ గుర్రాన్ని మీకు మా జ్ఞాపకార్థం కానుకగా ఇస్తున్నాం’’ అని చెప్పి అక్కడి నుంచి పడవల్లో వెళ్లిపోయినట్లు యాక్టింగ్ చేశారు. స్థానిక పూజారులు, జోస్యులు ‘‘ఒరేయ్ నాయనా.. ఇదేదో తేడాగా ఉంది, దీన్ని నమ్మకండి’’ అని అరిచినా, ట్రాయ్ పాలకులు వినలేదు. ‘‘అబ్బే.. గిఫ్ట్ వస్తుంటే వద్దంటారేంటి?’’ అని ఆ చెక్క గుర్రాన్ని లాక్కొచ్చి కోట లోపల పెట్టుకుని గ్రాండ్గా విజయోత్సవాలు జరుపుకున్నారు.ఫలితం: అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ చెక్క గుర్రం లోపల గ్రీకు సైనికులు దాక్కుని ఉన్నారు! అందరూ నిద్రపోయాక, వాళ్లు బయటకు వచ్చి కోట గేట్లు తెరిచేశారు. వెళ్లిపోయినట్లుగా మాయ చేసిన గ్రీకు సైన్యం మళ్లీ తిరిగొచ్చి ట్రాయ్ నగరాన్ని నామరూపాలు లేకుండా చేసేసింది.నీతి: శత్రువు సడన్గా వచ్చి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడంటే– అది ప్రేమతో ఇచ్చింది కాదు, మనకేదో ‘పెద్ద స్కెచ్’ వేశాడని!మావో గారి ‘పిచ్చుకల’ వేటచైనాలో 1958లో ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్’ పేరుతో మావో జెడాంగ్ ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఈ పిచ్చుకలు మన ధాన్యాన్ని తినేస్తున్నాయి, వీటిని అస్సలు వదలకూడదు. తరిమి కొట్టండి’’ అని ఆర్డర్ వేశారు. దాంతో జనం అంతా గిన్నెలు, డబ్బాలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి ఒకటే గోల.. గోల! ఆ శబ్దానికి పిచ్చుకలు భయపడి ఎక్కడా వాలకుండా గాల్లోనే ఎగురుతూ, ఎగురుతూ అలసిపోయి కిందపడి చనిపోయేవి. అలా లక్షల పిచ్చుకలను ఏరిపారేశారు.ఫలితం: పిచ్చుకలు ఉన్నప్పుడు అవి కేవలం గింజలనే కాదు, పంటను పాడుచేసే మిడతలను కూడా తినేవి. పిచ్చుకలు లేకపోయేసరికి మిడతల సంఖ్య బీభత్సంగా పెరిగిపోయింది. అవి వచ్చి పిచ్చుకల కంటే వంద రెట్లు వేగంగా పంటనంతా ఊడ్చేశాయి. దీనివల్ల వచ్చిన కరువులో దాదాపు 1.5 కోట్ల నుండి 4.5 కోట్ల మంది చైనా ప్రజలు చనిపోయారు.నీతి: ప్రకృతిని మనం కంట్రోల్ చేయాలనుకుంటే.. అది మనల్ని ‘అవుట్ ఆఫ్ కంట్రోల్’ చేసి పడేస్తుంది. అలాస్కాని ‘అణాపైసలకి’ అమ్మేసిన రష్యా ఇది 1867లో జరిగింది. అప్పట్లో రష్యాకి ఒకటే భయం ఉండేది. ‘‘భవిష్యత్తులో బ్రిటిష్ వాళ్లతో యుద్ధం వస్తే, ఈ అలాస్కా ప్రాంతాన్ని మనం కాపాడుకోలేం, వాళ్లు ఫ్రీగా లాగేసుకుంటారు’’ అని టెన్షన్ పడ్డారు. అందుకే ఉచితంగా పోయేదానికంటే, ఎంతో కొంతకి అమ్మేద్దాం అని అమెరికాకి ఆఫర్ ఇచ్చారు. ఎంతకో తెలుసా? కేవలం 7.2 మిలియన్ డాలర్లు! అంటే ఎకరం సుమారు రెండు సెంట్లే (మన లెక్కలో చెప్పాలంటే అణాపైసలకి అన్నమాట).ఫలితం: అమ్మేసిన కొన్నేళ్లకే అక్కడ భారీ బంగారు గనులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఏకంగా బిలియన్ల కొద్దీ బారెళ్ల ఆయిల్ నిక్షేపాలు దొరికాయి. చరిత్రలోనే ఇది అతిపెద్ద ‘రియల్ ఎస్టేట్ తప్పిదం’ అని చెప్పుకోవచ్చు.నీతి: పనికిరాని మంచుగడ్డ అనుకుని అమ్మేస్తే.. అది కాస్తా ‘బంగారు గని’ అని తర్వాత తెలిసింది. అందుకే ఆస్తి అమ్మే ముందు ఒకటికి పదిసార్లు సర్వే చేయించుకోవాలి!డ్రైవర్ కొట్టిన ‘రాంగ్ టర్న్’ 1914లో ఆస్ట్రియా యువరాజు ఆర్చ్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్కి ఆ రోజు లేచిన వేళ అస్సలు బాగోలేదు. ఉదయాన్నే ఆయన మీద ఒక బాంబు దాడి జరిగితే తృటిలో తప్పించుకున్నారు. ఆ వాడితో గాయపడిన తన మనుషులను పరామర్శించాలని ఆసుపత్రికి బయలుదేరారు. కానీ కొత్త రూట్ కావడంతో డ్రైవర్ కన్ఫ్యూజ్ అయిపోయి, ఒక చోట పొరపాటున రాంగ్ టర్న్ తీసుకున్నాడు. కారు రివర్స్ చేస్తున్నప్పుడు ఇంజిన్ ఆగిపోయింది. సరిగ్గా అక్కడే, ఆ ఉదయం బాంబు వేసి విఫలం అయిన హంతకుడు (గావ్రిలో ప్రిన్సిప్) సాండ్విచ్ తింటూ కూర్చున్నాడు.ఫలితం: యువరాజును చూసిన ప్రిన్సిప్, వెంటనే గన్ తీసి యువరాజుని కాల్చేశాడు. ఈ ఒక్క హత్య వల్ల ఐరోపా దేశాల మధ్య గొడవలు ముదిరి, ఏకంగా మొదటి ప్రపంచ యుద్ధం దాపురించింది.నీతి: రాంగ్ రూట్లో వెళ్తే ఫైన్ పడుతుంది అనుకుంటాం.. కానీ రాంగ్ టర్న్ కోట్లాది మంది ప్రాణాలు పోయే యుద్ధానికి దారి తీసింది.బీటిల్స్ని కాలదన్నిన డెక్కా టాలెంట్ని గుర్తించడంలో ఇంతకంటే దారుణమైన పొరపాటు చరిత్రలో ఇంకొకటి జరిగి ఉండదేమో! అప్పట్లో, అంటే 1962లో అప్పుడే మొదలైన ‘బీటిల్స్’ బ్యాండ్ టీమ్ తమ పాటలు వినిపించడానికి డెక్కా రికార్డ్ కంపెనీ దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆ కంపెనీ పెద్దాయన డిక్ రోవ్ ఒక ఆణిముత్యం లాంటి మాట అన్నాడు: ‘‘వద్దులే బాబోయ్.. ఈ గిటార్ వాయించే గ్రూపుల కాలం అయిపోయింది..’’ అని, వాళ్లను తిప్పి పంపించేశాడు.ఫలితం: బీటిల్స్ టీమ్ వేరే కంపెనీతో (ఇ.ఎం.ఐ. రికార్డ్స్) ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత వాళ్లు సృష్టించిన ప్రభంజనం తెలిసిందే! ప్రపంచ సంగీత చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడైన బ్యాండ్గా వాళ్లు రికార్డు సాధించారు. పాపం, ఆ డెక్కా రికార్డ్ వారు చేసిన ఈ తప్పుని సరిదిద్దుకోవడానికి దశాబ్దాల కాలం పట్టింది.నీతి: మన దగ్గరికి అదృష్టం గిటార్ వాయిస్తూ వచ్చినా సరే, అది మనకు నచ్చకపోతే ‘కాలం అయిపోయింది’ అని సాకులు చెబుతాం. అప్పుడప్పుడు పాత స్టెయిలే కొత్త ట్రెండ్గా అవుతుందేమోనని ఆలోచించాలి.అతి పెద్ద అచ్చుతప్పు ప్రింటింగ్ ప్రెస్లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జరిగితే ఏం చేస్తాం? సారీ చెప్పి సరిదిద్దుకుంటాం. కానీ రాబర్ట్ బార్కర్, మార్టిన్ లూకాస్ అనే ప్రింటర్లకు మాత్రం అది దిద్దుకోలేని తప్పు అయింది. 1631లో వాళ్లు బైబిల్ ప్రింట్ చేస్తున్నప్పుడు, బైబిల్లోని పది ఆజ్ఞలలో (టెన్ కమాండ్మెంట్స్) ఒక చిన్న పొరపాటు జరిగింది. ‘వ్యభిచారం చేయరాదు’ (Thou shalt not commit adultery) అనే వాక్యంలో పొరపాటున ’n్టౌ’ అనే పదం ఎగిరిపోయింది.ఫలితం: ఇంకేముంది.. ఆ ఎడిషన్ బైబిల్ కాస్తా ఘోరమైన ఆ అపరాధంతో పబ్లిష్ అయిపోయింది! ఇది చూసి కింగ్ చార్లెస్–1 కోపంతో రాజ›ప్రాసాదంలోని వస్తువులన్నీ విసిరి పారేశారు. ఆ ప్రింటర్ల మీద భారీ ఫైన్ వేసి, వాళ్లని దివాలా తీయించాడు. వాళ్ల లైసెన్సులు రద్దు చేశాడు. తప్పుగా ప్రింట్ అయిన ఆ కాపీలన్నీ తగలబెట్టేయాలని ఆర్డర్ వేశారు. (కానీ కొన్ని ‘కలెక్టర్స్ కాపీలు’ మాత్రం ఇప్పటికీ అక్కడక్కడా బయటపడుతున్నాయని అంటారు).నీతి: స్పెల్లింగ్ చెక్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపిస్తే పరువు పోతుంది. అదే మతగ్రంథంలో తప్పు చేస్తే మన చాప్టరే క్లోజ్ అయిపోతుంది! నాసా 125 మి. డాలర్ల మిస్టేక్ మనం కూరగాయలు కొనటానికి వెళ్లి, కిలోలకి బదులు లీటర్ల లెక్కన అడిగితే అంతా వింతగా చూస్తారు. సరిగ్గా అలాంటి తప్పునే నాసా శాస్త్రవేత్తలు చేశారు. 1999లో ‘మార్స్ క్లైమేట్ ఆర్బిటర్’ అనే రాకెట్ని అంగారక గ్రహం మీదకి పంపడానికి రెండు టీమ్లు పనిచేశాయి. అందులో ఒక టీమ్ లెక్కలన్నీ ఇంగ్లీష్ యూనిట్లలో (పౌండ్లు, ఫోర్స్) వేస్తే, రెండో టీమ్ మాత్రం మెట్రిక్ యూనిట్లను (న్యూటన్స్) వాడారు. దాంతో రెండు టీమ్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎవరి లెక్కలు వాళ్లు వేసుకున్నారు.ఫలితం: రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లాక, అది అప్లయ్ చేయాల్సిన ‘ఫోర్స్’ లెక్క తప్పింది. దాంతో ఆ రాకెట్ ఉండాల్సిన దానికంటే చాలా కిందకి వెళ్లిపోయి, అంగారక గ్రహ వాతావరణంలో కాలి బూడిదైపోయింది. అలా అప్పట్లోనే దాదాపు 1000 కోట్ల రూపాయలు (125 మిలియన్ డాలర్లు) గాలిలో కలిసిపోయాయి.నీతి: లెక్కల్లో తేడా వస్తే కోట్లలో లాస్ వస్తుంది.తగలబడిన అలెగ్జాండ్రియా లైబ్రరీఇది ఏ ఒక్కరో తీసుకున్న తప్పుడు నిర్ణయం కాదు. వరుస అతి తెలివి నిర్ణయాల వల్ల జరిగిన అనర్థం. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాలెడ్జ్ హబ్.. ఈజిప్టులోని ఈ అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రాచీన కాలపు విజ్ఞానమంతా అక్కడే ఉండేది. అయితే, జూలియస్ సీజర్ గారు యుద్ధం చేస్తూ పొరపాటున ఒక భాగాన్ని తగలబెట్టేశారు. ఆ తర్వాత వచ్చిన కొందరు పాలకులు ‘‘మాకు ఈ పుస్తకాలతో పనేంటి?’’ అని నిర్లక్ష్యం చేశారు, మరికొందరు రాజకీయం కోసమో, మతం పేరుతోనో మిగిలిన పుస్తకాలను కాల్చిపారేశారు.ఫలితం: ప్రాచీన చరిత్ర, సైన్స్కు సంబంధించిన దాదాపు 90 శాతం జ్ఞానం శాశ్వతంగా కాలి బూడిదైపోయింది. మన పూర్వీకులకు ఏమేం తెలుసో, వాళ్లు ఏయే టెక్నాలజీలు వాడారో ఇప్పుడు మనకు కేవలం ఒక అంచనా మాత్రమే ఉంది. ఒకవేళ ఆ లైబ్రరీ సేఫ్గా ఉండి ఉంటే, మనం ఈపాటికే అంతరిక్షంలో ఇల్లు కట్టుకుని ఉండేవాళ్లమేమో.నీతి: పుస్తకాన్ని చదివినా చదవకపోయినా పర్లేదు కానీ, దాన్ని పొరపాటున కూడా కాల్చకూడదు. ఎందుకంటే మనం నాశనం చేసేది పేపర్లను కాదు, తరతరాల జ్ఞానాన్ని!దేవుడా! ఈ దారుణమైన తప్పులు, పొరపాట్లు చూస్తుంటే.. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ చాలా బెటర్ అనిపిస్తోంది కదా! అలా అని అలక్ష్యంగా ఏ పనీ చేయకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. · సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఈ వారం కథ: పది రూపాయలు
తెల్లటి ఎండ ఎచ్చంగా కొడుతుంది, సరిగ్గా పన్నెండుగూడా కాలేదు టైము. అప్పటికి రొండుసార్లు అడిగి అడిగి మౌనంగా కూసుకున్నాడు జానుగాడు. రంగిసెట్టి కొట్టుకాడ పిల్లోడ్ని కూసోబెట్టి జొన్నసొప్ప కోయనీకి పోయింది రంగమ్మ. ‘సెట్టి దప్పికైతుంది ఒక్క గలాసు నీళ్లియవూ’ అని మూడోసారి అడగలేక ఎండిపోయిన పెదాల్ని నాలికతో రుద్దుకుంటూ కూసున్నాడు జానుగాడు అనబడే జాన్సన్.రంగమ్మ, ఆనందరావుల కొడుకు జాన్సన్ వయసు పదేళ్ళు. బడి మీన గాలి మల్లినప్పుడో, బడికి పంతులుగారు వచ్చినప్పుడో, ‘అయిదో క్లాస్ అబ్బీ’ నువ్వు అని చెబితే వినడమే తప్ప ఆ మాసిపోయిన పుస్తకాల సంచి వంక ఏనాడూ చూసిందే లేదు. పొద్దుగూకులు బస్టాప్ కాడ ఉండే పిచ్చి తుమ్మసెట్టు కింద సీట్లపేకలాడే వాళ్ల దగ్గర కూకోని పొద్దు ఎల్లబుచ్చుతుంటాడు. ఎప్పుడన్నా వాళ్ళమ్మ గట్టిగా అర్సుకుంటే ఉన్న ఒక్క బర్రెని మేపడానికి పోతాడు.ఆనందరావుకి, రంగమ్మకి పెళ్ళి జరిగి పదేళ్లు దాటింది. ఆనందరావూ అచ్చం జానుగాడిలాగానే ఉండేవాడు. పెళ్లయిన కాణ్ణుంచి రంగమ్మకి అది నచ్చేది కాదు. రంగమ్మ తీరు వేరే, ఉన్నంతలో కాపరాన్ని నడుపుకోవాలని ఆశ. ఎప్పుడో గవర్నమెంట్ వాళ్లు ఇచ్చిన ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది బాగుజేపియాల, ఇంటికి ఒక బలుబైనా కరంటు ఉండాల అని అనుకుంటా మొగుడికి చెవిలో ఇల్లుకట్టుకుని చెబుతా ఉంటది. ఊళ్ళో పనిలేదు. ఉన్న కరువు పనికి పోబుద్దిగాదు. పొద్దునే లేసుడు సీట్లపేక కాడ ఊసుపోని కబుర్లు. రంగమ్మకు ఇంట్లో ఉన్న ఒక్క బర్రెతో కాలం గడిచిపోయేది. దానిమేత, పాలు తీయడం, చల్ల జేసి అమ్మడం వల్లనే ఆ ఇల్లు ఆమాత్రమైనా గడుస్తుంది, నడుస్తుంది. రంగిసెట్టి కొట్టు ఆ ఊరికి ఒక రచ్చబండలాంటిది. బేల్దార్ పనికి కూలోళ్లు కావాలంటే యాడ దొరుకుతారో లోకంలో అందరికి తెల్సిన సంగతే, పల్లెటూళ్ళలో తక్కువ రేటుకు తేరగా దొరుకుతారని అసుమంటి వాళ్లకి రంగిసెట్టి లాంటి వాళ్ళు సాయం చేసి, నాలుగురాళ్లు యెనకేసుకుంటారు. ఊళ్ళోవాళ్ల బలహీనతలన్ని ఎలాగూ ముందే తెల్సిపోయి ఉంటాయి కాబట్టి బేరాలు తేలిగ్గానే తెగుతాయి. సదువు ఉండకూడదు, ఎదురు మాట్లాడితే పద్ధతిగాదు, ఇచ్చిన లెక్క కాడికి తలొంచుకుని ఎల్లిపోవాలో ఇట్టాంటోళ్లని యెతికి యెతికి మరీ పట్టుకుంటారు. కాతాలు రాసుకునే బొక్కులో నుంచి మడతలుపడిన ఒక కాయితాన్ని, సేట్కి ఇచ్చాడు రంగిసెట్టి. మాకు తెలుగు రాదు సెట్టి నువ్వే పిలు వాళ్లని అన్నారు వాళ్లు. పదిమందిని పిలిపించాడు రంగిసెట్టి. అందులో ఆనందరావుతో పాటు ఇంకో తొమ్మిదిమంది పేర్లున్నాయి.రంగమ్మకి శానా కుశాలుగా ఉంది. ఈ మడిసిగాని ఆ పనికి ఒప్పుకుని పోతే అనుకున్న పనులన్నీ సక్కంగా అయిపోతాయి. పిల్లోడికి సదువు వస్తది, ఇల్లు బాగుచేసుకోవచ్చనే ఆశ ఆమె కళ్ళలో కనబడుతుంది. ‘ఒదినా నిజంగానే మనోళ్ళు దేశం పోతారంటావా పనికి! మా యన్నకి ఏమి అలవాట్లు లేవు కాని మా ఇంటాయన ఏమంటాడో ఏమో అసలే మిడిమ్యాలపు మడిసి’ అని రంగమ్మ చెవిలో గుసగుసలాడింది ఓబుగాడి పెళ్లాం రాహేలమ్మ. ‘పోతారు లేమ్మే పోక ఈడేం జేత్తారు, గుడ్డి గుర్రానికి పండ్లు తోముతారా?’ అని విసుక్కుంది రంగమ్మ.పిలిచిన అందరూ రంగిసెట్టి కాడ గుమి గూడారు. అదిగో అప్పుడు చూశాడు జానుగాడు హైద్రాబాద్ సేట్ చేతిలో ఒక ఆకుపచ్చని సీసా. ఆగి ఆగి తాగుతున్నాడు సేటు. మధ్య మధ్యలో చిన్నగా తేపుతున్నాడు. రంగమ్మ సేట్ చెప్పబోయే మాటకోసం చూస్తుంటే; ఆనందరావు– ఇల్లు , పిల్లోడు, సీట్లపేక సావాసగాళ్ళని వదిలి వెళ్ళాలా అని దిగులుగా కూసున్నాడు. జానుగాడి చూపులన్నీ ఆ ఆకుపచ్చని సీసా మీదనే ఉన్నాయి. అదేందో కనుక్కోవాలని వాడికి మామూలు కుశాలుగా లేదు, అమ్మనో అయ్యనో అడిగినా చెప్పేలాగా లేరు. పక్కనే ఉన్న సావాసగాడ్ని అడిగాడు ‘ఏందిరా ఆ సీసా’ అని.వాడికి తెల్సి తెలియని మాటల్తో చెప్పాడు ‘ఒరే అది డింకు సీసా సల్లగ ఉంటది. తాగితే దీనబ్బా ఒహటే తేపులు, మొన్న మా అయ్య పెద్ద కూర తిని, ఇది తాగి రొంత నాగూడక ఇచ్చినాడు. ఓ యబ్బ చెప్పెటానికి కాదు, కాని పది రూపాయల్రా’ అని ఊరించాడు. జానుగాడికి అది మనాదిలో పడింది. పది రూపాయలు తెచ్చుకోవాలా ఆ డింకు తాగాలా...!పని చేయగలరు అని నమ్మకం కుదిరి, వాళ్ల కంటికి నదురుగా కనబడేసరికి రంగిసెట్టి ఇచ్చిన లిస్ట్కి టిక్కు పెట్టుకుని బేరాలు మొదులు పెట్టారు. ఏడాది ఎగ్రిమెంటు, నాలుగు నెలలకి వారం సెలవు, పెద్ద పండక్కి రొండు జతల బట్టలు, వారం వారం బటోడా, కాకుండా సమచ్చరానికి పదైదు వేలు డబ్బులు, తిండి, ఉండడానికి వసతి. రంగమ్మ కళ్ళు మెరిశాయి.అనందరావుకన్నా ఆ మాటకొస్తే ఆడికి వచ్చిన అందరికన్నా తనే ముందు సరే అని చెప్పేసేలాగా ఉంది. ఎవరూ ఏమీ మాట్లాడ్డం లేదు. రంగిసెట్టి గొంతు సవరించుకుని ‘ఏందిరా సాలవా..? ఇంకేమైనా ఉన్నాయా గొంతెమ్మ కోరికలు అడిగి సావండి’ అని గదమాయించాడు. ఏలియా గాని, యాకోబు గాని ఏం ఉలుకు లేదు పలుకు లేదు, వాళ్లకీ లోపల సంతోషంగానే ఉంది కాని ఇంకా ఎవరైనా ఎక్కువ ఏమైనా అడిగితే బాగుండు అని మెదలకుండా ఉన్నారు. అందరూ గొణుక్కుంటూఉన్న టయానికి దిగ్గున లేశాడు ఓబయ్య ‘ఏంది సేటు నీ సమత్కారం, ఊరుగాని ఊరు పెళ్లాం పిల్లల్ని వొదిలి అంతగాలం ఆడుంటే ఇయ్యేనా మీరిచ్చేది. ఇరవై వేలియ్యి. మిగతా అన్నీ మామూలే. అట్లయితే సెప్పు, లేకపొతే వచ్చిన కారెక్కిపో’ అని అరిసినట్టుగా మాట్లాడి కూకున్నాడు.రంగిసెట్టికి కోపం నెత్తికి అంటుకుంది. సేట్లు ఒద్దంటే తన కమీషన్ ఎక్కడ తనకి రాకుండా పోతుందో అని గుబులు పడ్డాడు. ‘ఏరా ఓబిగా! గతిలేని నా కొడకా! తాగుబోతు వాగుడంతా వాగి నోటి కాడ కూడు లాగేస్తావా ఈళ్లందరిదీ’ అని దిగ్గున లేచి తన్నబోయాడు. అక్కడున్న అందరూ వారించి ‘ఏంది సెట్టినోరు బో లేచ్చాంది తగ్గు తగ్గు’ అని ఆపినాక, నోట్లో ఉన్న పుగాక్కాడ తుప్పుక్కున ఊసి, ‘సూడు సేటు గారూ ఓబిగాడు అడిగిన దాంట్ల ఏమి తప్పులేదు. మీరే ఇంకోపాలి ఆలోసించుకోండి. మాదంతా ఇప్పుడు ఒకటే మాట. కావాలంటే మీరు రంగిసెట్టికిచ్చే కమీసన తక్కువ జేసుకోండి’ అని యాకోబు తగులుకునే తలికి అందరూ ‘అవునవును’ అని గొంతు కలిపారు. ‘మీకు బలిసిందిరా నా కొడకల్లారా ఏదో మీ కుటంబాలు బాగుంటాయని, నాలుగు మెతుకులు తింటారని అనుకుంటే నా కమీసన్ గురించి వాగుతున్నారు. పోండి మీరు ఎట్ట జత్తే నాకెందుకు, మీ సాడు మీరు తాగండి’ అని పైపంచె దులుపుకుని లోపలికి వెళ్ళిపోయాడు. దేశం అంతా తిరిగి పల్లేల్లో నుంచి ఇలా చదువు సంధ్య లేనివాళ్లని ఏరుకొచ్చి పనిలో పెట్టి, వాళ్లతో గొడ్డు చాకిరీ చేపించుకోవడం బాగా తెల్సిన పని. సిటీ బయట నీళ్లు దొరకని చోట కడుతున్న అపార్ట్మెంట్స్కి వీళ్లని తోలి ఆ ఇరవై వేలు ఇస్తే లెక్క సరిగ్గా సరిపోతుందని ఆ సేట్లకి తెల్సు. రంగిసెట్టికి నొప్పి తెలియకుండా మళ్ళీ అందరినీ పిలిపించి, ఓకే మీరు చెప్పినట్టే ఇస్తామని ఒప్పించారు. అలగా వాళ్లతో మాటపడ్డందుకు రంగిసెట్టి ఏమంత సంతోషంగా లేడు. అతని కడుపులో మంట ఇప్పట్లో తగ్గదు. నవ్వు పులుముకుని, ‘మీ కడుపు నేనెందుకు కొడతాన్రా అయ్యలారా’ అని అందరికీ కలిపి ఒకే ఒక నమస్కారం పెట్టి ఊరుకున్నాడు.జానుగాడు వాళ్ల నాన్న చెయి పట్టుకుని ‘అయ్యా ఆ డింకుసీసా గావాల’ అన్నాడు. అసలే ఊరు వదిలెల్తున్న చికాకు ఎవరి మీద సూపియాలో నెత్తి గోక్కుంటున్న వాడికి ఈ మాట వరంలా చిక్కింది. ‘నా కొడక ఊరొదిలి నేను పోతా ఉంటే నీకు డింకు గావాల్నా గాలికి బుట్టిన నాకొడకా’ అని రొండు జబురుకున్నాడు. గబుక్కున రంగమ్మ లాక్కుని, ‘యాందీ మడిసి ఒక సుకము లేదు దుక్కము లేదు పిల్లోడ్ని సావనూకుతున్నాడు’ అని తిట్లకి లంకించుకుంది. జానుగాడి కళ్ళలో ఏడుపు లేదు, వాడి మనసంతా సీసామీదే ఉంది. రంగిసెట్టి ఆ నల్లటి ఇనపదాంతో ఆ మూత తెరిస్తే చేత్తో పట్టుకుని సల్లగా తాగాలని ఉంది. పది రూపాయలు– పదంటే పది రూపాయలు గావాల. అందర్నీ రేత్రి పదింటికల్లా టేషను కాడికి రమ్మని వాళ్ల ఏజెంటుని అక్కడే పెట్టి సేట్లు కార్లో వెళ్ళిపోయారు. మాపటేలకి యాకోబు, సాలమాను, ఓబయ్య, ఆనందరావు, ఇంకా మిగిలినోళ్ళంతా పాస్టర్ కాడికి బోయి పార్ధన జేపిచ్చుకొని బయలుదేరుతూ, అయ్యగారి సేతిలో తలా ఒక ఇరవై రూపాయలు పెట్టి వొందనాలు జెప్పి బయలుదేరారు. అబ్బా ఆ డబ్బుల్లో నుంచి ఒక్క పది కాగితం జారిపడితేనా దీనెక్క ఇక ఆ సల్లటి సీసా మనదే అనుకున్నాడు జాను గాడు. అయ్యని అడుగుదామా అని అంటే నిన్న తిన్న దెబ్బలు యాదికొచ్చి యెనిక్కి తగ్గాడు.రంగమ్మ దిష్టి తీసింది మొగుడికి. ఇంట్లో ఉన్న రొండు వందకాయితాలు తీసి జేబీలో పెట్టి కళ్లనీళ్లు తిరుగుతుండగా ‘అయ్యో! నెత్తిన ఇత్తులు బడ్డా కాణ్ణుంచి నేను నిన్నేమీ కోరిక కోరలేదు. నువ్వు ఎట్టా తిరిగినా ఏదో నోటి తుత్తర కొద్దీ వసపిట్ట మోయిన వాగుంటా. అదంతా మతిలో బెట్టుకోమాక. పని జేసుకో యాలకి తిను, తాగుడు జోలికి పోమాక. నీకోసం నాలుగు నెలలదాక చూస్తా ఉంటా’ అని కళ్ళు తుడుచుకుంది. జాన్సన్ గాడు మాత్రం నాన్న జేబు వంకే చూస్తున్నాడు. అమ్మ ఇచ్చిన రొండు వందల్లో ఒక్క పది ఇస్తే బాగుండు అనుకున్నాడు కాని, అడగడానికి నిన్న దెబ్బలు ఇంకా మతికి ఉన్నాయి.‘ఓ అన్నా ఈ మడిసి సంగతి నీకు తెల్సుగద! అసలే తాగుడు మడిసి. నువ్వే రొంత కనిపెట్టుకుని నీ పక్కనే ఉంచుకోన్న నీ సెల్లెలు అనుకోని మాట కాసుకోన్నా! అంతా నీ మీన్నే పెడుతున్న రొంత జాగ్రత అన్నా!’ అని కళ్ళలో నీళ్ళు కళ్ళలో పెట్టుకుంది రాహేలమ్మ.‘పోవే నీ... నా గురించి నాకు తెల్వదా? ఏదో పొద్దుగాల పన్జేసి ఆనెక్కాలకి ఒక గుక్కెడు తాగుతా. దానికే ఏందీ ఇంత రంజీబు. అయినా తాగి పడుకోనీకి నేను మా అయ్య కాడికి కాదే పోయేది, పనికి. సేట్ల కాడ ఇయి నడవ్వు’ అని నవ్వుతూ తిడుతూ ముందుకు కదిలాడు. బస్సు పదిమంది వలస కార్మికులని ఎక్కించుకుని వెళ్ళిపోయింది. ప్రతి శనివారం రంగిశెట్టి దుకాణం కాడసందడి సందడిగా ఉంటది ఆడున్న కాయిన్ బాక్స్కి పనికి బోయినోళ్లు అందరూ పోన్ జేత్తారు. అందరూ అయిపోయినాకయితే రొంత ఎక్కువసేపు మాట్లాడొచ్చు అని అట్లనే నిల్చుకోని ఉండేది రంగమ్మ. అదే టైములో ఒకనాడు జానుగాడు పోయి ‘రంగిసెట్టి! మా అయ్య వచ్చాక ఇస్తా గాని సొమ్ములు, ముందు ఆ చల్ల సీసా ఇవ్వు’ అని గాలం వేశాడు. అసలే తనమాట కాదని ఎక్కువ సొమ్ములు పెరుక్కున్నారని కోపంలో ఉన్న రంగిసెట్టి , ‘యాడరా నీ అయ్య వచ్చి ఇచ్చేది? అప్పుడే నువ్వు డింకు తాగే మొగోనివయ్యావా! మీ అయ్యలు ఆడ నానా తిట్లు తిని సంపాదిస్తుంటే ఈడ ఈ గూద నా కొడుకులకు ఏం జేయాలో తెలియడం ల్యా’ అని చెడు తిట్లకి లంకించుకున్నాడు. ఎవురి గొడవలో వాళ్ళుండడం వల్ల జానుగాడికి, రంగిసెట్టికి మజ్జన జరిగింది ఎవురూ సూడలేదు. బిత్తరపోయిన జానుగాడు సల్లగా వొచ్చి అమ్మ పక్కన నిలబడుకొని ఫోను వచ్చేదాకా వాడి సూపంతా ఆడ్నే ఉంది.ఆ గుండ్రటి కుండ అందులో సల్లని నీళ్ల మధ్యలో ఆకుపచ్చని సీసాకాయ. ఆ కంగారులోనే ‘అయ్యా ఎట్లున్నావురా అయ్యా’ అంటే, ‘బాగున్నా’ అన్నాడే గాని, పది రూపాయలు అడగలేదు. రంగమ్మ ఇంట్లో ఎప్పుడు మంచం మీద పక్క శుభ్రంగా ఉంచుతుంది. గొడవ అయినాక దాన్ని కోపంతో చిందరవందర చేస్తూ మంచం మీద పడుకున్నాడు జాను గాడు. వాడికి పది రూపాయలు కావాలి. తలా ఒక రూపాయి అడుగుదామని ఆలోచన జేసీ అడిగాడు. నేరుగా రంగమ్మ కాడికి వచ్చి ‘ఏంది మీ పిల్లోడు రూపాయి అడిగినాడు ఏంది కత’ అని అడిగేతలికి జానుగాడి ఈపు సాపు జేసింది రంగమ్మ. ‘బడికి పోయి సదువుకోమంటే పోడుగాని ఈడికి డింకు సీసా గావాలంట నాకాడ సొమ్ములున్నా ఇప్పియ్యను గాక ఇప్పియన్ను నీ సొయ్యం నీకు అణగాల. ఎవురుకాడైనా చేయిజాపినా, ఇంట్లో రూపాయి కాన్రాకపోయినా నా కొడకా కొడితే మీ జేజవ్వ దిగిరావాల’ అని ఆ రోజంతా తిడతానే ఉంది.జాను గాడికి నిద్రలో అదే, మెలకువలో అదే! పదిరూపాయలు. పెద్ద కూర తిన్న రోజంతా ఆడి ధ్యాసంతా దానిమీన్నే ఉండేది. సీట్లపేక కాడికి కూడ పోవట్లే. ఒక్కొక్క రోజు ఎల్లి రంగిసెట్టి కొట్టు కాన్నే కూసోని, రోజుకి ఎంతమంది తాగుతున్నారా అని లెక్కేలేసే వాడు. దేవుడా ఒక్క పది రూపాయలు దొరికేలా చేయమని సెర్చీ కాడికి బోయి పార్ధన కూడా చేశాడు. ప్చ్.. అయినా గాని వాడికి ఆ వరం దక్కలేదు.ఆనందరావు పనిలో కుదురుకున్నాడు. బటోడ డబ్బులు దాచుకోవడం మొదులు బెట్టాడు. ఒక పక్కన అదిలించే వాళ్ళు లేక ఓబు తాగుడు ఎక్కువైంది. పనికి మూడు రోజులు బోతే మిగతా మూడు రోజులు నాగా లాగా తయారైంది. ముందు ఏజెంట్ చెప్పి జూశాడు. రాహేలుకి పోన్ జేశారు. ఆయమ్మ నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చి మరి జెప్పింది. నవ్వి నేను తాగలేదు అనేవాడు, ఆ మాట కూడా తాగే చెప్పేవాడు. మెల్లగా పనికి పోకుండా తాగుడుకు బానిసై అప్పులు జేసీ ఒంట్లో బాగోని కాడికి తెచ్చుకున్నాడు.మూడు నెలలు కావడానికి ఇంకో వారం ఉంది అనగా ఒక అర్ధరాత్రి కాడ రంగిసెట్టి పోన్ మోగింది. ‘ఏంది సెట్టి నీ కమీషన్ కోసం తాగుబోతు నాయాల్ని పంపినావు. వాడు తాగి తాగి ఈడ సచ్చిపోయినాడు. వాడికి సొమ్మేం రాదు. ఏదో మళ్లా ఆ ఊరికి పనోళ్ల కోసం రావాలిగాబట్టి రొంత సొమ్ము పంపుతున్నా అక్కడ నువ్వే సెటిల్ జేసుకో’ అని ఏజెంట్ చెడామడా తిట్టి పోన్ పెట్టేసినాడు. రంగిసెట్టికి గుండె దడ పెరిగింది. మాదిగ పల్లె వైపు ఉరికాడు. ముందు సలవాదిరిని లేపుకుని విషయం చెప్పి అందరికి చెబుదాం పదమన్నాడు. పల్లె మొత్తం నిద్ర లేచింది. రాహేలమ్మ స్పృహ కోల్పోయింది. రంగమ్మ పరుగెత్తి కెళ్లి ‘ఊరుకో వదినా’ అంటూ ఊరడిస్తోంది. ఆనందరావు, యాకోబు ఇద్దరు ఓబు శవాన్ని తీసుకుని బయలుదేరారు.మాదిగపల్లె ఓబు శవం కోసం ఎదురు చూస్తోంది. సంగతి తెల్సినకాణ్ణుంచీ జానుగాడు, రంగమ్మ ఆణ్నే ఉన్నారు. రాహేలుని ఆపడం ఎవురుతరం కావటం లేదు. రంగమ్మ పక్కనే కూర్చుని ‘ఊరుకో వొదినా! అంతా మన గాచారం’ అని అనునయిస్తోంది.‘గాచారం గాదు ఒదినా, మన తలరాత. ఈ ఊరిమీన ఉన్నంత ఎండ ఏఊర్లో అయినా ఉందా? ఎన్నడైనా ఇంత మబ్బు తునక చూసినమా, తోవ తడిసే వాన జూసినమా? రొండు బిందెల నీళ్లకు ఎంత దూరం పోతుంటిమీ, నీళ్ల కోసం గడప దాటని ఆడది ఉందా మనూళ్లో. వారానికి ఒక బిందె నీళ్ళు ఇది గదూ మన బతుకు. కాని సారాయి జూడు దానికి నీళ్ల కొదువే ఉండదు. ఇళ్ళూ, ఊళ్ళు ఆర్పి కూసుంటుంది. నీళ్ళు లేకపోయినా ఈ నా బట్టలు ఆ మందు తాగి ఇదిగో ఇట్టా మన తాళ్ళు తెంపుతున్నారు’ అని అంటూ మళ్ళీ ఏడవడం మొదులు బెట్టింది. రంగమ్మ కళ్ళు తుడుచుకుంది.ఆనందరావుకి తాగుడు లేదు. అదొక్కటే సంతోషం తనకి. ఓబు ఇంటికాడ శవాన్ని దించి నీళ్లుబోసుకుని వద్దామని ఆనందరావు, యాకోబు ఇళ్లకి వచ్చారు. రంగమ్మ కళ్లనిండా నీళ్ళు పెట్టుకుని అనందరావుకి ఎదురెళ్ళింది. పొంతలో నీళ్ళు తోడి, గాబులో నీళ్ళు కలిపి రేకుల తలుపున్న దొడ్లో పెట్టింది. జాను గాడికి నాన్న జోబు మీద కన్ను పడింది. ఒక్క పది రూపాయలు అయ్యొచ్చిండు. ఇగ ఇయాలో రేపో చేతిలో సల్లని సీసా గొంతులో తీయగా అబ్బా వాడికి వాడే ఊరించుకుంటున్నాడు.ఏందయ్య ఎందుకు మీరు పోయింది ..? పక్క పొంటి మనిషి అంతగనం తాగుతుంటే మీరు చెప్పొద్దా అంటూ ఆనందరావుని నిలదీసింది రంగమ్మ.‘నువ్వు మా పని కాడికి రావే ఆడజేసే గొడ్డు చాకిరీ నీకు తెలుస్తది. లేచిన కాణ్ణుంచి రేత్రి ఎనిమిది దాకా వొంచిన నడుము ఎత్తేదానికి ఉండదు. బువ్వ ఒక్కసారే పెడతారు. మారన్నం అడిగితే ఇంగ అంతే మా కత, రోజూ పచ్చడి, పప్పే! దానికి తోడు నీళ్ల మజ్జిగ. దీనమ్మ జీవితం ఆణ్నే సచ్చిపోతే బాగుండని ఎన్నితూర్లు అనుకున్నానో తెల్సునా. ఓబుగాడు పోయిన మూడో రొజునుంచే వాని స్యాతగాలే పని, వాడి పని గూడా మేమే జేసి, ఆ నాలుగు రాళ్లు ఇప్పిచ్చినం. వాడి బాదలకి మందు అదే అని తెల్సినాక యాడ్నే ఆపేది. వాడిని ఆసుపత్రికి తీసకపొమ్మని అడిగితే ఆ సేట్ నా కొడుకు తాగుబోతు నాయాళ్లు మాకు అక్కర్లేదు అని ఎల్లిపోయినాడు’ అని కళ్ళు తుడుచుకున్నాడు. రంగమ్మకి విషయం పూర్తిగా అర్థమైంది . ఇంతకి మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా మళ్ళీ ఆనందరావు ఎనిక్కి పోడని ఊహించి ఇంకేం మాట్లాడలేదు.ఎప్పటిలానే నేలని ఎండబెట్టడానికి మళ్ళీ ఎండ వచ్చింది. ఓబుని పూడ్చిపెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నీళ్ల టాంకి కోసమని పొయినోళ్లకి దొరకనే లేదు.ఆనందరావు, యాకోబు, ఇంకొంతమంది తలా ఇంత అని వేసుకుని అవసరమైన పెట్టే, తెల్లగుడ్డ, సెంటు సీసాలు, చల్లడానికి చిల్లర అన్ని సమకూర్చారు. పాస్టర్గారికి కబురు వెళ్ళింది.నీళ్ల బండి దొరకని కారణంగా స్నానం లేదు. సెంటు కొట్టి పెట్టెలో పెట్టడమే అని తీరుమానం చేసి పాస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు.జానుగాడు లేచేసరికి ఎదురుగుండా నోట్ల కట్టలు కనబడ్డాయి. ఇంట్లో అమ్మా, అయ్యా ఎవురూ లేరు. బయటకి వచ్చి మల్లొకసారి ఎవరూ లేరని సూసుకుని, మెల్లిగా ఒక నోటు లాగి నిక్కర జేబిలో పెట్టుకుని ఒక్క ఉదుటున బయటకి ఉరికాడు. వాడి మనసులో ఒకటే ఆశ ... ఆ సీసా సల్లగా గొంతులోకి పొయే కల. మధ్యలో బడికి పోతున్న తన సావాస గాళ్లని ఆపి, జేబులో నోటు చూపెట్టి సీసా తాగబోయే సంగతి చెప్పాడు. ఒక్కసారిగా వాళ్లంతా నవ్వడం మొదులు పెట్టారు. ‘ఒరే జానుగా! అది అసలు సొమ్ము గాదురా అది పిచ్చి నోటు. ఎవురైనా సచ్చిపొతే వాళ్లమీద జల్లడానికి తెచ్చే సొమ్ములు’ అనేసరికి జానుగాడికి ఎక్కడలేనినీరసం ఆవహించింది. ఉసూరుమంటూ వెనక్కి మరులుకొని ఓబు ఇంటిదగ్గరకి పోయాడు. అక్కడా ఉండబుద్ది గాలేదు. ఇంటికి పోయి ఆ నోటు ఆడ్నే పార్నూకి మంచమెక్కి పొనుకున్నాడు. మజ్జానం అవుతావుంది. రంగమ్మ ఇంటికి బోయి, ఒకమారు జానుగాడికి అన్నం బెట్టి వచ్చింది.సరిగ్గా రొండు గంటలకి బతికినంతకాలం తాగి తాగి సచ్చిపోయిన ఓబు పోయినాక కనీసం నీటిసుక్క గూడా ఒంటిమీన పడకుండా పెట్టెలో పడుకుని పోతున్నాడు. పల్లె పల్లె మొత్తం ఖాళీగా ఉంది. ఓబుని పెట్టెలో పెట్టి తీసుకుపోవడానికి లేపారు. పలకలు మోగుతున్నాయి.సరిగ్గా అదే టయానికి పడుకున్న జానుగాడు నిద్ర లేచాడు, బయటకి వచ్చి చూస్తే జనం పోతా ఉన్నారు.కళ్ళు నుల్చుకున్నాడు. తెల్లటి ఎండలో మిల మిలా మెరుస్తున్న రొండు రూపాయల బిళ్ల. దగ్గరకి వెళ్లాడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఇది కాగితం కాదు, బిళ్ల– చెల్లుతుంది అనుకుని తీసుకుని జోబిలో వేసుకున్నాడు, ఆనందం ఆగేలా లేదు వాడికి. ఇంకా ముందుకు పోయాడు ఇంకో రూపాయి, ఇంకా ముందుకు పోతే ఇంకో రెండు రూపాయలు... గులాం పూసుకుని కొన్ని పూలు మీదబడి కొన్ని దొరికాయి.సరిగ్గా లెక్క జూసుకున్నాడు మొత్తం పది రూపాయలు.రంగిసెట్టి కొట్టు ఒకటే కళ్లముందు కనబడుతుంది జానుగాడికి, వాడిలో వాడే లోపల్లోపల మాట్లాడుకుంటున్నాడు ‘ఎట్లుంటది? అది సోడాలాగే ఉంటదా. తియ్యగా, పుల్లగా, అసలు ఇంట్లో నీళ్లే తాగడానికి రొండు రోజుల తర్వాత పనికి రావు. ఇన్ని రోజులు ఆ సీసాలో నీళ్లు పాడైపోవా?’ బుర్ర నిండా గందరగోళం. ఇంక కాసేపట్లో ఆ సీసా తన చేతిలో ఉంటది. పరిగెత్తుతున్నాడు, కాళ్లు కాల్తున్నాయి. అయినా ఆగడం ల్యా, పలకల దరువు పెరిగే కొద్ది జానుగాడిలో హుషారు పెరుగుతుంది. దరువు దరువుకి ఒక అంగ వేసుకుంటూ సరిగ్గా రంగిసెట్టి కొట్టు దగ్గర ఆగిపోయాడు జానుగాడు.వీళ్లు అందరూ కనబడకుండా పోయాక తాగుదామని ఆలోచన చేశాడు. మళ్ళీ ఎవురైనా సొమ్ములు యాడివి అంటే దొరికినాయని చెప్పినా నమ్మరు. శవం కాడియి ఏరుకున్నావా అని తన్నినా తంతారని ఆగాడు. ఒక పక్క ఓబుని పాతిపెట్టే కార్యక్రమం నడుస్తోంది, ఏడుపులు ఇనొస్తున్నాయి.రంగిసెట్టి కొట్టుకాడ జేబిలో డబ్బులు తీసి సరిగ్గా లెక్కబెట్టి ‘ఇదిగో రంగిసెట్టి లెక్క. నాకో సీసా ఇయ్యి’ అని దాదాపుగా అరిసినంత పనిజేశాడు జానుగాడు. లెక్క సరిచూసుకున్నాడు సెట్టి, యాడియిరా అని అడగబోయి, యేముందిలే పట్నం సొమ్ము అనుకుని గల్లాలో వేసుకుని సీసా మూత తీసి ఇచ్చాడు.అదే సప్పుడు కోసమే జానుగాడు కలగన్నది. ఆ ఇనుప సువ్వ దీసుకుని రంగిసెట్టి మూత తీస్తుంటే జానుగాడి మనసులో బో కుశాలయింది.చేతిలో చల్లని సీసా, పైన ఎర్రటి ఎండ. నీళ్ళు గుడక ఇంత ప్రేమగా ఏనాడు తాగలేదు. ఓబు కార్యక్రమం అయిపోయింది. అందరూ యెనిక్కి మరలుకుని వస్తున్నారు, ఓబుని తల్సుకుని పనికి పోవాలా వద్దా అని ఆనందరావు గుబులు పడుతున్నాడు. రంగమ్మ కళ్లముందు బాగుజేసుకున్న ఇల్లు, బలుబు ఎల్తురు అగపడతున్నాయి. కళ్ళముందు కుర్చీలో కూర్చుని సల్ల డింకు సీసా తాగుతున్న జానుగాడు అగపడుతున్నాడు.చిరాగ్గా మొహం బెట్టుకుని రంగిసెట్టి ఆ ముగ్గురినీ జూత్తా ఉన్నాడు. -
కథాకళి: టైమ్ ట్రావెల్
జయవర్మకి చిన్నప్పుడు చంద్రుడి మీదకి మనిషి వెళ్ళాడని తండ్రి చెప్పడం గుర్తుంది. ఏడేళ్ళ వయసులోనే అతను రాత్రుళ్ళు చంద్రుడి మీదకి దిగిన మనిషి కోసం డాబా మీంచి చంద్రుడిని చూసేవాడు. తండ్రి అమెరికన్స్ ఎంబసీకి ఉత్తరం రాసి తెప్పించిన ముగ్గురు ఆస్ట్రొనాట్స్ ఉన్న కలర్ ఫొటోని ఫ్రేమ్ కట్టించి గోడకి తగిలించాడు. అతనిలో స్వతహాగా గల శాస్త్ర జిజ్ఞాసని ఆ ఫొటో బాగా ప్రభావితం చేసింది.అతని ఆసక్తిని గమనించిన జయవర్మ తండ్రి నండూరి రామ్మోహన్రావు రాసిన విశ్వ దర్శనం పుస్తకాన్ని కొనిచ్చాడు. పెద్దయ్యే కొద్దీ జయవర్మ చాలా సైన్స్ పుస్తకాలని చదివాడు. అతను హెచ్.జి.వెల్స్ 1895లో రాసిన ‘టైమ్ మెషీన్స్ ’ నవలని చదివాక టైమ్ ట్రావెల్ మీద ఆసక్తి కలిగింది. అంతకు మునుపు 1843లో చార్లెస్ డికెన్స్ రాసిన క్రిస్టమస్ కేరల్లో కూడా మనిషి భవిష్యత్తులోకి వెళ్ళి తిరిగి రావడాన్ని చదివాడు. మరికొన్ని టైమ్ ట్రావెల్ పుస్తకాలని చదివాక అతను ఎలాగైనా దాన్ని సాధించాలని సంకల్పించాడు. వీసా ఇంటర్వ్యూలో టైమ్ ట్రావెల్ మీద జయవర్మ అభిప్రాయాలని విన్న అమెరికన్స్ కాన్సులేట్ ఆఫీసర్ అతను అమెరికాకి అవసరం అనుకుని, స్టూడెంట్ వీసాని మంజూరు చేసి నవ్వుతూ చెప్పాడు. ‘‘వెల్కం. 1967లో షికాగోకి వెళ్తే, మార్సెలో ఫెలినీని కలిస్తే వాళ్ళబ్బాయి హలో చెప్పాడని చెప్పు.’’ ‘‘కచ్చితంగా వెళ్తాను సర్. 1967ని, మార్సెలో ఫెలినీని గుర్తుంచుకుంటాను.’’ జయవర్మ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. జయవర్మ కేలిఫోర్నియాలోని స్టా¯Œ ఫోర్డ్ యూనివర్సిటీలో తన ప్రొఫెసర్తో టైమ్ ట్రావెల్ గురించి తరచూ చర్చిస్తూండటంతో దాని మీద అంతదాకా జరిగిన రీసెర్చ్ని ఆయన జయవర్మకి ఇచ్చాడు. యూనివర్సిటీ లైబ్రరీలోని పుస్తకాల్లో దానిమీద ఎన్నో డయాగ్రమ్స్ని చూసి, థియరీలని చదివాక జయవర్మకి ఓ దారి దొరికింది. చివరకి అతను లేబరేటరీలో ఓ టైమ్ ట్రావెల్ మెషీన్స్ ని రూపొందించాడు. షికాగో నగరంలోకి, 1967కి వెళ్ళాడు. తను చూసిన ఆధునిక షికాగోలా లేదది. ప్రొహిబిషన్స్ సమయంలో ప్రసిద్ధ అమెరికన్స్ నేరస్తుడు అల్ కపోన్స్ తో సంబంధం గల ది గ్రీన్స్ మిల్ బార్కి చేరుకున్నాడు. లైవ్ జాజ్ మ్యూజిక్ జరుగుతోంది. జయవర్మని స్టీవార్డ్ మర్యాదగా ఆహ్వానించి అడిగాడు. ‘‘శుక్రవారం రాత్రి కాబట్టి బాగా బిజీగా ఉంది. దయచేసి ఇంకొకరితో టేబుల్ షేర్ చేస్తారా?’’ ‘‘అలాగే.’’ అతను జయవర్మని రెండు కుర్చీలున్న బల్ల దగ్గరికి తీసుకెళ్ళి ఖాళీ కుర్చీని చూపించి, ఇంకో కుర్చీలోని అరవై పైబడ్డ వ్యక్తిని పరిచయం చేశాడు.‘‘ఇతను మిస్టర్ డేవ్.’’ జయవర్మ తన పేరు చెప్పి, బడ్వైజర్ బీర్ ఆర్డర్ చేశాడు. ‘‘మిమ్మల్ని ఈ బార్లో ఎన్నడూ చూడలేదు? ఊరికి కొత్తా?’’ విస్కీ తాగే డేవ్ అడిగాడు. ‘‘అవును.’’ ‘‘ఎక్కణ్ణుంచి వచ్చారు?’’ ‘‘స్టాన్స్ ఫోర్డ్, కాలిఫోర్నియా.’’ ‘‘ఓ. ఐతే మీరు మేధావి అన్నమాట?’’ బాగా తాగి ఉన్న ఆ బ్లూ కాలర్ ఉద్యోగి నవ్వుతూ అడిగాడు. ‘‘రీసెర్చ్ స్కాలర్ని.’’ జయవర్మ చెప్పాడు. ‘‘దేని మీద రీసెర్చ్ చేస్తున్నారు?’’ ‘‘టైమ్ ట్రావెల్.’’‘‘అది ఎన్నటికీ మనిషికి సాధ్యం కాదు. సమయం అనేది ఓ ఆలోచన మాత్రమే. అది అసలు లేనేలేదని నా అభిప్రాయం.’’ ‘‘ఉంది. నేను 2016 నించి 1967కి వచ్చాను.’’ జయవర్మ చెప్పాడు.‘‘నేను దాన్ని నమ్మేంత ఇంకా తాగలేదు.’’ డేవ్ చెప్పాడు.‘‘నెల, తారీకు, సంవత్సరం చూడండి.’’ జయవర్మ తన డ్రైవింగ్ లైసెన్స్ని మౌనంగా ఆయనకి ఇచ్చి చెప్పాడు. దాన్ని చూడగానే ఆయన మొహం ఎర్రబడింది. ‘‘నీ పథకం ఏమిటి? నా నుంచి డబ్బు గుంజే స్కామ్ ఇది. అవునా?’’ కోపంగా అడిగాడు. ‘‘లేదు. ఇది నిజం. ఇది నా మొబైల్ ఫోన్. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. దీనికి వైర్లు ఉండవు. సాటిలైట్తో పనిచేస్తుంది. ఇంట్లోనే టీ.వీ.లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలు చూడొచ్చు. అందుకు టీ.వీ. ప్రసారం చేయక్కర్లేదు...’’ ‘‘ఆపు. ఇంకో అబద్ధం చెప్తే చంపేస్తాను.’’ తాగి ఉన్న డేవ్ అరిచాడు. ‘‘నిజం. ఓ నల్లజాతి వ్యక్తి మన ప్రెసిడెంట్.’’ జాతి విద్వేషం గల ఆయన వెంటనే బల్ల మీది మటన్ చాప్స్ కోసుకునే కత్తిని తీశాడు. బలాఢ్యుడైన జయవర్మ తనని పొడవబోయిన ఆయన చేతిని పట్టుకుని ఆపాడు. ఆ పెనుగులాటలో ఆ కత్తి ఆయన ఛాతీలో ఊపిరితిత్తుల్లో బలంగా దిగింది.‘‘ మై గాడ్. హత్య. పట్టుకోండి.’’ అరుపులు వినిపించాయి. ఓ మెరుపు మెరిసింది. వెంటనే జయవర్మ తనవైపు వచ్చేవారి వంక కత్తిని ఝుళిపిస్తూ తప్పించుకుని బయటపడ్డాడు. సరాసరి సమీపంలోని పార్క్లో ఆపిన తన వాహనం వైపు పరిగెత్తాడు. విరక్తితో అతను మళ్ళీ టైమ్ ట్రావెల్ చేయలేదు. 2025. జయవర్మ తనని అనుసరించే ముప్ఫై ఏళ్ళ యువకుడిని గమనించి అడిగాడు. ‘‘ఎందుకు నా వెంట పడ్డావు?’’ ‘‘ఇందుకు.’’ అతను వెంటనే బొడ్డులోంచి కత్తిని తీసి జయవర్మ ఊపిరితిత్తుల్లో దిగేలా క్రోధంగా పొడిచాడు. ‘‘ఎందుకు? ఎందుకు?’’ జయవర్మ బాధగా అడిగాడు. ‘‘నీ మొహం నాకు బాగా గుర్తు. 1967లో మా తాతని షికాగోలో గ్రీన్స్ మిల్ బార్లో పొడిచినప్పుడు అక్కడ ఒకరు తీసిన నీ ఫొటో మా ఇంట్లో వేలాడుతోంది.’’ అతను చెప్పాడు. -
రామేశ్వర లింగ ప్రతిష్ఠాపన
రావణ వధానంతరం పుష్పక విమానంలో సపరివారంగా బయలుదేరిన రాముడు మార్గమధ్యంలో సముద్ర తీరాన మజిలీ చేశాడు. రాముడి రాకను తెలుసుకున్న మునులందరూ ఆయన దర్శనం కోసం వచ్చారు. రాముడిని మునులందరూ వేనోళ్ల స్తుతించారు. రాముడు వారికి నమస్కరించి, ‘మునులారా! పులస్త్యబ్రహ్మ కుమారుడైన రావణుడు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పటికీ బ్రాహ్మణుడే! యుద్ధంలో నేను రావణుడిని చంపవలసి వచ్చింది. బ్రహ్మహత్య మహాపాతకమని శాస్త్రాలు చెబుతున్నాయి. నేను ఆ మహాపాతకాన్ని తొలగించుకోవాలంటే, ఏం చేయాలో తగిన ఉపాయం మీరే సెలవీయండి’ అని అడిగాడు.‘పరమాత్మా! నీకు దోషం అంటుతుందా? లోకాన్ని అనుగ్రహించటానికి అడిగావు. అయినా, పరిహారం చెబుతున్నాం విను! ఈ సాగర తీరంలో శంభు ప్రతిష్ఠాపన చెయ్యి. శివలింగ ప్రతిష్ఠాపన వల్ల వచ్చే పుణ్యాలను పరమేష్టి కూడా స్తుతించలేడంటే, మా బోటివారికి వివరించడం శక్యమా? కాశీ విశ్వేశ్వరుడిని సందర్శించుకున్నప్పుడు వచ్చే పుణ్యం కంటే, నువ్వు ఇక్కడ ప్రతిష్ఠించబోయే శివలింగాన్ని దర్శించుకున్న వారికి వెయ్యిరెట్లు పుణ్యం వస్తుంది’ అని మునులందరూ ముక్తకంఠంతో పలికారు.‘మరందుకు ముహూర్తాన్ని మీరే నిర్ణయించండి’ అన్నాడు రాముడు.‘మరో నాలుగు ఘడియలకు దివ్యమైన ముహూర్తం ఉంది’ చెప్పారు మునులు.రాముడు తన పక్కనే ఉన్న హనుమంతుడి వైపు చూసి, ‘హనుమా! కైలాస పర్వతం మీదనున్న శివలింగాన్ని మరో నాలుగు ఘడియల్లోగా ఇక్కడకు తీసుకురావాలి. తేగలవా?’ అని అడిగాడు.‘స్వామీ! నువ్వు ఆజ్ఞాపించాలే గాని, అదెంత పని?’ అని అంటూ మరుక్షణంలోనే ఒక్కసారిగా కుప్పించి, నింగిపైకి ఎగిశాడు. అకస్మాత్తుగా హనుమంతుడు అలా పైకెగిరే సరికి, నేల కంపించింది. చుట్టూ ఉన్న సుగ్రీవాది వానర ప్రముఖులు, విభీషణుడు, అతడి పరివారం హనుమంతుడిని సంభ్రమాశ్చర్యాలతో తిలకించసాగారు. హనుమంతుడి వేగాన్ని నింగి నుంచి గమనిస్తున్న దేవతలు, అతడు ఏకంగా కైలాస పర్వతాన్నే పెకలించుకుని వస్తాడేమోనని కలత చెందారు.హనుమంతుడు ఉత్తర దిశగా నింగిలో వాయువేగంతో దూసుకుపోయాడు. అరఘడియలోనే కైలాసానికి చేరుకున్నాడు. శివలింగం కోసం కైలాస పర్వతంపై అడుగడుగునా వెదికాడు. ఎక్కడా శివలింగం అతడికి కనిపించలేదు. తాను శివలింగం జాడ కనుగొనే సరికే గడువు మించిపోతుందేమోనని దిగులు చెందాడు. కాసేపు ఆలోచించాడు. మహత్తరమైన ఇలాంటి దైవకార్యాలు తపస్సు ద్వారా మాత్రమే నెరవేరుతాయని భావించి, ఒంటికాలిపై నిలబడి, నడినెత్తిన కనిపిస్తున్న సూర్యుడిపై చూపునిలిపి, చేతులు పైకెత్తి నమస్కరిస్తూ తపశ్చర్యకు పూనుకున్నాడు.హనుమంతుడి దీక్షాదక్షతకు సంతోషించిన శివుడు కొద్దిసేపటికే అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘నాయనా! ఏం కావాలో కోరుకో! అని అడిగాడు.‘పరమేశ్వరా! శ్రీరాముడు నీ అవ్యయలింగాన్ని భూలోకంలో ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాడు. గడువు మీరిపోక ముందే నీ అవ్యయలింగాన్ని అనుగ్రహించు. తీసుకుపోయి, శ్రీరాముడికి అందిస్తాను’ అన్నాడు.శివుడు వెంటనే హనుమంతుడి చేతికి తన అవ్యయలింగాన్ని ఇచ్చి, అంతర్ధానమయ్యాడు.హనుమంతుడు వెనువెంటనే ఆ లింగాన్ని తీసుకుని, ఆకాశ మార్గాన దక్షిణ సముద్రతీరంలో రాముడు నిరీక్షిస్తున్న ప్రదేశానికి బయలుదేరాడు. ఈలోగా వేళ మించిపోతూ ఉండటంతో, మునులందరూ ‘రామా! ముహూర్తం సమీపించింది. హనుమ వల్ల ఆలస్యమయ్యేలా ఉంది. వేళ మించిపోకుండానే సైకత లింగాన్ని ప్రతిష్ఠించు’ అని చెప్పారు. మునుల సలహాతో సీతారాములు సముద్రంలో స్నానాలు ఆచరించి, సైకత లింగ ప్రతిష్ఠాపనకు సిద్ధమయ్యారు. మునులు మంత్రాలు చదువుతుండగా, రాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. రాముడు శివలింగ ప్రతిష్ఠాపన జరుపుతున్న సమయానికే హనుమంతుడు గగన మార్గంలో అక్కడకు చేరుకున్నాడు. పైనుంచి తిలకించిన హనుమంతుడికి రాముడు సాగిస్తున్న శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం కనిపించింది. ‘స్వామి శివలింగం కోసం నన్ను కైలాసానికి పంపించి, ఇక్కడ అన్యలింగ ప్రతిష్ఠాపన చేయడమేమిటి’ అనుకుంటూ లోలోపల కలత చెందాడు. రాముడికి సమీపంలోనే నేల మీదకు దిగాడు హనుమంతుడు. అక్కడే ఉన్నవారందరినీ పలకరించాడు. నేరుగా రాముడి వద్దకు వచ్చాడు. ‘స్వామీ! నీ కార్యాన్ని సకాలంలో నెరవేర్చలేని నా జన్మవ్యర్థం’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుని పలికాడు.రాముడు అతడిని అనునయించాడు. ‘హనుమా! నువ్వు వేరు, నేను వేరు కాదు. నీలో ద్వైతబుద్ధి ఇంకా తొలగిపోలేదు. అందుకే ఈ దుఃఖం. ముహూర్తం మించిపోతోందని మునులు చెప్పడంతో సైకతలింగాన్ని ప్రతిష్ఠించాను. అంతమాత్రానికే శోకించడం తగునా! నువ్వు కూడా యుద్ధంలో ఎందరో బ్రహ్మరాక్షసులను సంహరించావు కదా! శివుడు అనుగ్రహించిన అవ్యయలింగాన్ని నీ పేరిట ప్రతిష్ఠించు’ అని పలికాడు.హనుమంతుడు తాను కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించాడు.∙సాంఖ్యాయన -
బయట ఆడకపోతే... నాలుగు నష్టాలు
ఒకప్పుడు బాల్యం ఇంట్లో కంటే, ఇంటి బయటే ఎక్కువ ఉండేది. పరుగులాట, కోతికొమ్మచ్చి, బిళ్లంగోడు, గాలిపటాలు, దొంగాట... ఇలా పిల్లలు ఇంటి బయటే ఎక్కువగా ఉండేవారు. చెమటలు కారుతున్నా ఆటలు ఆపకపోవడం, అమ్మ పిలుస్తున్నా పట్టించుకోకపోవడం, ఆకలయ్యేంత వరకు ఇల్లు గుర్తురాకపోవడం, ఒక్కోసారి ఆకలి కూడా మరచిపోయి ఆడుకోవడం... ఇవన్నీ సర్వసాధారణం. ఆ బాల్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈరోజు పిల్లల బాల్యం ఒక చిన్న స్క్రీన్లో మొదలై, అదే స్క్రీన్లో ముగుస్తోంది. ఇది అభివృద్ధి కాదు, ఒక తరం మౌనంగా కోల్పోతున్న జీవితం.ఇప్పటికీ ఆలస్యం కాలేదు. గేటు తెరవండి. ఫోన్ పక్కన పెట్టండి. పిల్లల బాల్యాన్ని మళ్లీ బయటకు తీసుకురండి. బాల్యం ఎందుకు బయటే ఎదగాలి?పిల్లల మెదడు పుస్తకాలతో కాదు, అనుభవాలతో ఎదుగుతుంది. ఆ అనుభవాలు ఎక్కువగా బయట ప్రపంచం నుంచే వస్తాయి. బయట ఆడే ఆటల్లో పిల్లలు కేవలం శరీరాన్ని కాదు, మెదడును కూడా ఉపయోగిస్తారు.ఎక్కడ పరుగెత్తాలి? ఎక్కడ ఆగాలి? ఎవరితో కలిసి ఆడాలి? ఎవరితో తగువుపడాలి? ఎప్పుడు ఒప్పుకోవాలి? ఎప్పుడు ఎదురు నిలవాలి?... ఇవన్నీ ప్లానింగ్, నిర్ణయాలు, స్వీయ నియంత్రణకు మూలాలు. వీటినే సైకాలజీలో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ‘సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్’ ప్రకారం, పిల్లలు బయట ఆడే ఆటలు మెదడులో న్యూరల్ కనెక్షన్లను సహజంగా బలపరుస్తాయి. కాని ఇప్పుడా అనుభవాలన్నీ స్క్రీన్కు అతుక్కుపోయియి. స్క్రీన్ ఎందుకు ప్రమాదకరం?స్మార్ట్ఫోన్ సమస్య అది చూపే కంటెంట్ కాదు, అది పనిచేసే విధానం. స్మార్ట్ఫోన్లోని యాప్ల ఉద్దేశం ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉంచడమే, పిల్లలకు ఉపయోగపడాలని కాదు. ఈ యాప్లు డోపమైన్ రసాయనాన్ని చిన్న చిన్న మోతాదుల్లో విడుదల చేస్తూ, పిల్లల మెదడును నిరంతర ఉత్సాహంలో ఉంచుతాయి.బయట ఆటల్లో ఆనందం రావాలంటే శ్రమ అవసరం. స్క్రీన్లో ఆనందం రావాలంటే ఒక టచ్ చాలు. మెదడు ఈ తేడాను త్వరగా నేర్చుకుంటుంది. దీనివల్ల పిల్లలు తక్షణ ఆనందానికి అలవాటుపడతారు. ఓర్పు తగ్గిపోతుంది. బోర్డమ్ను భరించలేని మనస్తత్వం, అసహనం, చిరాకు పెరుగుతాయి. బోర్ కూడా అవసరం.. ‘మా పిల్లాడు త్వరగా బోర్ అవుతున్నాడు సర్. అందుకే ఫోన్ ఇస్తుంటాం’ అని చాలామంది తల్లిదండ్రులు చెబుతుంటారు. వాస్తవానికి బోర్ అవ్వడం పిల్లలకు ఒక అవసరం. బోర్ అవ్వడం అంటే ఖాళీగా ఉండడం కాదు. అది మెదడుకు ఒక విరామం. ఆ విరామంలోనే ఊహాశక్తి పుడుతుంది, కొత్త ఆటలు పుట్టుకొస్తాయి, సృజనాత్మకత మేల్కొంటుంది. స్మార్ట్ఫోన్ పిల్లల జీవితంలో బోర్డమ్ను పూర్తిగా తొలగించింది.ప్రతి నిమిషం ఏదో ఒకటి చూపిస్తూ, పిల్లల మెదడును వినోదానికి బానిసగా మార్చేసింది. పరిష్కారాలు... → రోజుకు కనీసం గంట బయట ఆట తప్పనిసరి చేయండి. చలిగా ఉందని, ఎండగా ఉందని సాకులు చెప్పొద్దు. ఆటకు వాతావరణ అడ్డుకాకూడదు. → స్క్రీన్ను హక్కుగా కాదు, రివార్డుగా మార్చాలి → డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్, పడకగదిలో ఫోన్ అనుమతించకూడదు → పిల్లలతో కలిసి బయటకి వెళ్లండి. ఆడకపోయినా, అక్కడ ఉండండి → పిల్లలు బోర్ అయితే వెంటనే స్క్రీన్ ఇవ్వకండి. ఆ బోర్లోనే ఎదుగుదల ఉంటుందిబయట ఆటలు లేకపోతే... పిల్లలు బయట ఆటలు ఆడకపోతే నాలుగు ముఖ్యమైన సామర్థ్యాలు కోల్పోతారు. → రిస్క్ అంచనా వేసే సామర్థ్యం: ఎక్కితే పడిపోతామో లేదో తెలుసుకోవడం → సోషల్ నెగోషియేషన్: ఆటలో గొడవలు, ఒప్పందాలు, రాజీలు → శరీర అవగాహన: బ్యాలెన్స్, కోఆర్డినేషన్, స్థల జ్ఞానం → నిజమైన విజయ భావన: కష్టపడి సాధించిన ఆనందం ఈ నాలుగు అంశాలను ఏ స్క్రీన్ ఇవ్వలేదు.భయపెట్టే గణాంకాలుప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సిఫారసు ప్రకారం రెండేళ్ల లోపు పిల్లలకుస్క్రీన్ పూర్తిగా నిషిద్ధం. ఐదేళ్ల పిల్లలకు రోజుకు గంట కంటే ఎక్కువ స్క్రీన్ ఉండకూడదు. కాని, మనదేశంలో 3–6 ఏళ్ల పిల్లలు సగటునరోజుకు 3–5 గంటలుస్క్రీన్ చూస్తున్నారు. నగరాల్లో 60 శాతానికి పైగా పిల్లలు రోజుకు 30 నిమిషాలు కూడా బయట ఆడటంలేదు. 1990లతో పోలిస్తే పిల్లల ఔట్డోర్ ఆటల సమయం 70 శాతం తగ్గింది. -
డీప్ డేంజర్.. మనం మనమేనా?
ముఖం మనదే, స్వరం మనదే, శరీరం మనదే. కాని, అది మనం కాదు! డీప్ఫేక్ తెరలో మనం ఎవరో మనకు కూడా తెలియని మాయాజాలం నడుస్తోంది. ఇక్కడ మన గుర్తింపును ఎవరైనా కొనవచ్చు, అమ్మవచ్చు, దొంగిలించవచ్చు. అవసరమైతే ఆయుధంలా కూడా ఉపయోగించవచ్చు. అందుకే, నిజమైన గెలుపు ఇప్పుడు అంతా మన నమ్మకంలోనే! - దీపిక కొండిఇప్పుడు ఉదయం లేచి ఫోన్ ఓపెన్ చేస్తే మనకు ఎదురయ్యేది అద్దంలో కనిపించే మన ముఖం కాదు, స్క్రీన్ మీద తిరుగుతున్న మన డూప్లికేట్. అదే మనల్ని చూసి నవ్వుతుంది, మాట్లాడుతుంది, మనం ఎప్పుడూ చేయని పనులు కూడా చేసినట్టు చూపిస్తుంది. దీంతో, ఇప్పుడు మనుషుల అసలైన గుర్తింపు సంక్షోభం ఏర్పడుతోంది. ఒకప్పుడు ‘నువ్వు ఎవరు?’ అనే ప్రశ్నకు పేరు చెబితే సరిపోయేది. ఇప్పుడు మాత్రం ‘నువ్వు నిజంగా నువ్వేనా?’ అని అడగాల్సిన పరిస్థితి దాపురించింది. ముఖం మనదే, స్వరం మనదే, కాని, మాటలు మనవి కావు. వీడియోలో కనిపించేది మనమే, కాని, ఆ వీడియోలోని మనిషి మనం కాదు. దీనిని సింపుల్గా చెప్పాలంటే మీ ఫొటోను తీసుకుని, మీ వాయిస్ను జత చేసి, మీ స్థానంలో ఎవరో మాట్లాడించి నట్లుగా ఏఐ తయారు చేసే డీప్ ఫేక్ డిజిటల్ డ్రామా! ఈ నాటకం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి, మీ అమ్మ చూసినా ‘అయ్యో, నువ్వే కదా!’ అంటుంది. ‘అది నేను కాదు’ అని మీరు ఎంత చెప్పినా ‘అబద్ధం చెప్పొద్దు’ అని గద్దిస్తుంది. ఇంత పవర్ ఉన్న టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడితే, మన గుర్తింపు ఒక ఫైల్లా మారిపోతుంది.అప్పుడు వారు ఆ ఫైల్ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే వైరల్ కూడా చేయవచ్చు. ఇదే అసలు సమస్య మన ముఖం మన దగ్గరే ఉంటుంది, కాని, వాడకం మాత్రం వేరేవాళ్ల చేతుల్లో ఉంటుంది. ఇంతకుముందు సోషల్ మీడియాలో భయం ఏంటంటే ఫొటో బాగా రాలేదేమో, ట్రోల్ అవుతామేమో. ఇప్పుడు ఆ భయం వేరే లెవల్కు చేరింది. ‘నేను చేయని పనికి నన్ను ఎందుకు తిడుతున్నారు?’, ‘నేను చెప్పని మాటలకు నేను ఎందుకు వివరణ ఇవ్వాలి?’ అనే ప్రశ్నలు మనల్ని వెంటాడుతున్నాయి. ఇక్కడే గుర్తింపు సంక్షోభం మొదలవుతుంది. నిజంగా నేను ఎవరు? నేను చేసిన పనులా? లేక నా ముఖంతో ఏఐ చేసిన పనులా? అనే ఎవరి వారు ఒక్కసారి చెక్ చేసుకొని మరీ పోరాటం చేస్తున్నారు. సెలబ్రిటీ కావడమే సమస్య!ఒకప్పుడు ఫ్యాన్ ్స అభిమానమే సెలబ్రిటీలకు బలం. ఇప్పుడు అదే అభిమానం ఏఐ చేతుల్లో పడి ఒక పెద్ద డిజిటల్ బాంబులా మారుతోంది! భారతదేశంలో నటులు, రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలకు ఉన్న అపారమైన అభిమాన బలం ఇప్పుడు డీప్ఫేక్ మోసాలకు ఇంధనంగా మారిపోయింది. ఒక వీడియో చూసి ‘అరే, నిజంగానే ఆయనే చెప్పాడు!’ అనిపించిందా? ఒక వాయిస్ విని ‘ఇది కచ్చితంగా ఆయన స్వరమే!’ అని నమ్మేశామా? అంతే, ఆ నమ్మకమే మోసగాళ్లకు పెద్ద ఆయుధం. డీప్ఫేక్ వీడియోలు, ఏఐ వాయిస్ క్లిప్లు ఇక కేవలం టెక్నాలజీ అద్భుతాలు మాత్రమే కాదు.అవి ప్రజల అమాయకత్వాన్ని టార్గెట్ చేసే ప్రమాదకరమైన ట్రిక్కులు. అందుకే కరణ్ జోహార్ నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ వరకూ, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, అరిజిత్ సింగ్ లాంటి స్టార్లు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ‘నా ముఖం నాది, నా గొంతు నాది, అనుమతి లేకుండా వాడొద్దు!’ అని చట్ట రక్షణ కోసం వేడుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు ఎదురుచూస్తే, ఇప్పుడు అదే ఫేస్తో నకిలీ వెబ్సైట్లు, అనధికార మెర్చండైజ్, ఏఐతో తయారైన అసభ్య కంటెంట్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.స్టార్డమ్ అంటే స్పాట్లైట్ మాత్రమే కాదు, సైబర్ ప్రమాదాల ప్యాకేజీ కూడా! ఇక్కడితో ఆగిపోతే బాగుండేది. నిపుణుల హెచ్చరిక ఏమిటంటే ప్రమాదం ఇంకా పెద్దదే. ముఖ్యంగా ప్రజా నాయకులు, కార్పొరేట్ లీడర్లు మరింత రిస్క్లో ఉన్నారు. ఎందుకంటే వారి ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అన్నీ యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతాయి. అదే డేటా పట్టుకుని ఏఐ వాయిస్ క్లోనింగ్ చేస్తే చాలు బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం పిల్లల ఆటగా మారుతోంది. మొత్తానికి ఒకప్పుడు సెలబ్రిటీ కావడం గ్లామర్ అయితే, ఇప్పుడు అది ‘హై రిస్క్ ప్రొఫెషన్’గా మారింది. సామాన్యులకు కూడా సమస్యే!ఇది కేవలం స్టార్ల సమస్యే కాదు. ‘వాళ్లకు కోర్టులు, లాయర్లు ఉంటారు మనకేముంది?’ అనుకునే లోపే ఏఐ మోసాలు నేరుగా సామాన్యుడి ఇంటి తలుపు తడుతున్నాయి. సెలబ్రిటీ ముఖాలతో మొదలైన డీప్ఫేక్ తంతు ఇప్పుడు మీ అమ్మ, నాన్న, బాస్, పిల్లలు అందరి ముఖాలు, గొంతుల వరకు వచ్చేసింది. మీ తల్లిదండ్రుల స్వరంతో ఫోన్ చేసి ‘అర్జెంటుగా డబ్బు కావాలి’ అని అడిగే కాల్స్; స్కూల్ పిల్లల ఫొటోలు తీసుకుని ఫేక్ వీడియోలు తయారు చేయడం; ఉద్యోగుల ముఖాలతో నకిలీ వీడియో కాల్స్ చేసి ‘మీ మేనేజర్ మాట్లాడుతున్నాడు’ అని నమ్మించడం; మహిళలపై ఏఐ ఆధారిత డిజిటల్ వేధింపులు ఇవన్నీ ఇక అరుదైన వార్తలు కాదు, రోజూ జరుగుతున్న డిజిటల్ డ్రామాలు.ఇలా డీప్ఫేక్స్ ఇప్పుడు ప్రజాస్వామ్యం, భద్రత, గౌరవం అన్నింటినీ ఒకేసారి పరీక్షిస్తున్నాయి. ఐశ్వర్యరాయ్, కరణ్ జోహార్లాంటి ప్రముఖులే తమ గుర్తింపును కాపాడుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్లకు లాయర్లు ఉంటారు, తీర్పులు వస్తాయి. మనకు మాత్రం ఎవరికీ చెప్పుకోలేని బాధ. చెప్పినా నమ్మేవారు ఉండరు. ఇలా మొత్తానికి ఈ డిజిటల్ యుగంలో ‘చూశాం కదా విన్నాం కదా’ అనేది ఇక సాక్ష్యం కాదు. నమ్మకం కూడా ఒక రిస్క్ అయిపోయింది. సెలబ్రిటీ అయినా, సామాన్యుడైనా ఏఐ ముందు అందరం సమానమే! తేడా ఒక్కటే వాళ్లకు పేరు పోతుంది, మనకు డబ్బు, పరువు, మనశ్శాంతి అన్నీ పోతాయి. ఏం చేస్తుందంటే? ఈ రోజుల్లో గుర్తింపు అంటే పేరు, ఊరు, ఆధార్ నంబర్ కాదు. అది ఒక ఫోల్డర్లో దాచిన డేటా. అందులో ఒక ఫొటో, రెండు వీడియోలు, ‘హలో ఎలా ఉన్నారు?’ అన్నంత వాయిస్ ఉంటే చాలు. మిగతా పనంతా ఏఐ చూసుకుంటుంది. మీ ముఖం తీసుకుంటుంది. వేరే మనసు పెడుతుంది. వేరే మాటలు మాట్లాడిస్తుంది. అలా మనం ఎప్పుడూ కలలో కూడా ఊహించని స్థితిలోకి మనల్ని నెడుతుంది, మన గొంతుతోనే మనం ఎప్పుడూ మాట్లాడని మాటలు మాట్లాడిస్తుంది. ఫలితం? ఆ వీడియో చూసినవాళ్లు ‘ఇది ఫేక్ అయి ఉండదులే, మనవాడే’ అంటూ షేర్ బటన్ కొడతారు. ఎందుకంటే డీప్ఫేక్లో ఉన్న ముఖం, మాస్క్ కాదు, అసలైన మన ముఖమే! అది నిజమైనదే కాబట్టి, ప్రేక్షకులు కూడా నిజమే అనుకుంటారు. ఇక్కడే అసలు ట్విస్ట్. సమస్య ఏఐ ఎంత తెలివైనదో కాదు, మనం ఎంత అమాయకులమో. ఒకప్పుడు ‘చూశాను కాబట్టి నిజం’ అనేవాళ్లం. ఇప్పుడు కళ్లతో చూసే వాటిని కూడా నమ్మకూడదు. ఫిల్టర్ లేకుండా కనిపించిన ముఖం నిజమా? లేక ఏఐ సాఫ్ట్వేర్లో పుట్టిన పర్ఫెక్ట్ సినిమా సీనా? తెలియదు. మన మెదడే కన్ఫ్యూజ్ అవుతోంది. అందుకే, మనమే స్క్రీన్ పై ఉన్నా, మనమేనా కాదా అన్న డౌట్ మనకే క్రియేట్ చేస్తుంది. అందుకే, ఏఐని పూర్తిగా ఆపడం అంటే సముద్రానికి స్టాప్ బోర్డ్ పెట్టినట్టే. మన వివేచన, జాగ్రత్త, చట్టాలు కలిసి పనిచేయకపోతే, రేపు మన ముఖం మనదేనా అనే ప్రశ్నకే సమాధానం చెప్పలేని రోజులు రావచ్చు. న్యాయస్థానం! ఏఐ డిజిటల్ దొంగలా రోజుకో కొత్త వేషం మార్చుకుంటూ పరుగెడుతుంటే, కోర్టు మాత్రం ‘ఒక్క నిమిషం’ అంటూ స్టే ఆర్డర్లు ఇస్తూ హ్యామర్ ఎత్తుతోంది. అయితే, ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే కొన్ని కేసుల్లో కఠిన ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఏఐతో తయారైన వీడియోలు, వాయిస్ క్లిప్లు ఇకపై సరదా ఆటలు కాదు; అవి నేరాలే! అలాంటి కంటెంట్ను ఆపేయాలి, తొలగించాలి, అవసరమైతే తయారుచేసిన వాళ్లను కూడా లాక్కొచ్చి ప్రశ్నించాలి అని న్యాయస్థానం క్లియర్ సిగ్నల్ ఇచ్చింది. ఒకప్పుడు ‘వైరల్ అవుతుంది’ అనుకున్న వీడియో ఇప్పుడు ‘వారంట్ వచ్చే చాన్స్ ఉంది’ అనే స్థాయికి చేరింది.కాని, చట్టం ఇంకా అలర్ట్ మోడ్లోకి పూర్తిగా రాలేదు. ఐటీ చట్టంలోని కొన్ని నిబంధనలు అసభ్య కంటెంట్ను నిర్ణీత సమయంలో తొలగించాలంటున్నప్పటికీ, అమలు బలహీనంగా ఉంది. ఏఐ వేగానికి చట్టం వెనుకబడుతోంది. ఆ సమయంలో ఏఐ మాత్రం ఇంకో ఐదు కొత్త వీడియోలు, పది కొత్త ఫేక్ అకౌంట్లు తయారు చేసేస్తుంది. టెక్నాలజీ రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తుంటే, చట్టం మాత్రం ఫైల్ పట్టుకుని, నోటీసు రాసుకుంటూ ఉంటోంది. ఇలా ఒక వైపు ఏఐ అప్డేట్ నోటిఫికేషన్, ఇంకో వైపు కోర్ట్ హియరింగ్ డేట్ ఇద్దరి మధ్య స్పీడ్ మ్యాచ్ అసలు జరగట్లేదు. అందుకే చట్టాలు మరింత కఠినంగా మారాలి, అమలు బలపడాలి, ఎందుకంటే రేపు కోర్టులు తీర్పులు ఇస్తుండే సమయానికి, ఏఐ మాత్రం ఇంకో కొత్త వేషంలో నవ్వుతూ ముందుకెళ్లిపోతుంది. అసలైన యజమాని ఎవరు?ఈ డీప్ఫేక్ గందరగోళం మధ్యలో ఇంకొక పెద్ద ప్రశ్న నిశ్శబ్దంగా నిలబడి చూస్తోంది. ఏఐ యుగంలో ఒక మనిషి వ్యక్తిత్వానికి నిజమైన యజమాని ఎవరు? మనమా, టెక్నాలజీనా, లేక ‘డౌన్ లోడ్ చేసుకున్నాడు కాబట్టి వాడేసుకున్న వాడా?’ న్యాయ నిపుణుల మాటల్లో చెప్పాలంటే, భారతదేశానికి ఇప్పుడిప్పుడే సరిపడే చట్టాలు కాకుండా, ప్రత్యేకంగా ఏఐ కోసం తయారైన స్పష్టమైన చట్టం అవసరం. అనుమతి అంటే ఏంటి? ఒకసారి ఇచ్చిన అనుమతి జీవితాంతం చెల్లుతుందా, లేక ఒక ప్రాజెక్ట్ వరకేనా? వాణిజ్య వినియోగం ఎక్కడి వరకు సరైనది, ఎక్కడి నుంచి దోపిడీగా మారుతుంది? వ్యక్తి స్వేచ్ఛను కాపాడుతూనే, అతని ముఖం, స్వరం, గుర్తింపును ఎలా రక్షించాలి? ఇవన్నీ ‘కేసు వచ్చినప్పుడు చూస్తాం’ అనే విధంగా కాకుండా, ముందే కచ్చితంగా నిర్వచించాల్సిన ప్రశ్నలు.ఇక్కడే మరో బలమైన ట్విస్ట్. అధిక నియంత్రణ పెడితే సృజనాత్మకత ఊపిరాడకుండా పోతుందా? నియంత్రణ లేకపోతే అసురక్షితంగా మారుతుందా? ఇలా ఇది బ్రేక్–యాక్సిలరేటర్లాగా రెండూ ఒకేసారి బ్యాలెన్ ్స చేయాల్సిన డ్రైవింగ్. అంతే కాదు, మరణానంతర హక్కులు అనే కొత్త అధ్యాయం కూడా తెరమీదకి వస్తోంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని రూపం, స్వరం రక్షణలో ఉండాలా? లేక అతను చరిత్రలోకి వెళ్లగానే ఎవరికైనా వాడుకునే ఫ్రీ డేటాగా మారాలా? డిజిటల్ పునర్జన్మ సాధ్యమైన ఈ కాలంలో, చనిపోయిన తర్వాత కూడా మాట్లాడే ముఖాలు, పాడే గొంతులు కనిపిస్తున్నప్పుడు, ఇది కేవలం న్యాయపరమైన సమస్య కాదు, నైతిక సరిహద్దులపై జరుగుతున్న పెద్ద చర్చ. చివరికి సమాధానం ఒక్కటే కావాలి: ఏఐ ఎంత తెలివైనదైనా, వ్యక్తిత్వానికి అసలైన యజమాని మనిషే అని చట్టం కూడా, సమాజం కూడా స్పష్టంగా చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పోరాటం!డీప్ఫేక్ అనే వైరస్ నేడు పాస్పోర్ట్ లేకుండానే ప్రపంచమంతా తిరుగుతోంది. హాలీవుడ్ నుంచి హైకోర్టుల వరకూ అందరికీ ఇదే ప్రశ్న ‘ఇది నా గొంతేనా, నా ముఖమేనా?’ అమెరికాలో స్కార్లెట్ జోహాన్సన్, టామ్ హ్యాంక్స్, స్టీఫెన్ ఫ్రై లాంటి స్టార్లు తమ వాయిస్, ఇమేజ్ను అనధికారంగా వాడుతున్నారని గట్టిగా గళమెత్తారు. స్టార్ పవర్ ఉన్నవాళ్లే ఇలా మాట్లాడాల్సి వస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు, 2025 నాటికి 400 మందికి పైగా అంతర్జాతీయ కళాకారులు ఏఐ కంపెనీలపై నియంత్రణలు తీసుకురావాలని ప్రభుత్వాలను కోరారు.ప్రస్తుతం ఇదే ఒక గ్లోబల్ అలారంలా మారుమోగుతోంది. కాని, కథ అంతా పోరాటమే కాదు. కొందరు కళాకారులు ఏఐని శత్రువుగా కాకుండా, సరిగ్గా వాడితే శక్తిమంతమైన భాగస్వామిగా చూస్తున్నారు. పాప్ సింగర్ గ్రైమ్స్ తన అధికారిక ఏఐ వాయిస్ మోడల్ను విడుదల చేసి ‘ఇది నా గొంతు, నా షరతులపై’ అని స్పష్టం చేసింది. జాన్ లెనన్ పాత రికార్డింగ్ను ఏఐ సహాయంతో పాటగా మార్చినప్పుడు కూడా అదే సందేశం కనిపించింది. ఇలా సరైన అనుమతి, సరైన గడులు ఉంటే ఏఐ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో! సమస్య టెక్నాలజీలో కాదు; దాన్ని ఎవరు, ఎలా వాడుతున్నారన్న దానిపైనే ఉంటుందని మరికొందరి వాదన. నిపుణుల మాటల్లో...న్యాయ నిపుణులు ఈ మొత్తం ఏఐ గందరగోళాన్ని చూసి చెప్తున్న మాటలేంటంటే, ప్రస్తుతం భారతదేశంలో ఏఐకి సంబంధించిన అసలు లోపం చట్టాల్లో స్పష్టత లేకపోవడమే. ‘ఏఐ వ్యక్తిత్వ హక్కులు’ కోసం ప్రత్యేక చట్టం లేదు. ఐటీ యాక్ట్ ఉన్నా, అది ఏఐ చేసిన నష్టం తర్వాత మాత్రమే ‘ఈ కంటెంట్ తీసేయండి’ అని చెప్పగలదు. కాని, అది జరగకముందే ఆపే ప్రయత్నాలు చేయలేదు. అంటే ఇది తలుపు పగిలిన తర్వాత తాళం వేసినట్టే! అందుకే, ఇందుకోసం, ప్రత్యేక పర్సనాలిటీ రైట్స్ చట్టం రావాలి. అనుమతులు, వాణిజ్య వినియోగం, శిక్షలు స్పష్టంగా ఉండాలి.ప్యాచ్లతో పని జరగదు. ప్రశ్నలు మాత్రం ఇంకా ఉన్నాయి. అనుమతి ఒకసారి ఇచ్చితే జీవితాంతం వర్తించేదా? వాణిజ్య వినియోగం ఎక్కడి వరకే సరైనది, ఎక్కడ దోపిడీగా మారుతుంది? ఉల్లంఘన జరిగితే శిక్షలు నిజంగా భయపడేలా ఉండాలా? ఇవన్నీ కేసు వచ్చినప్పుడు కాకుండా, ముందే స్పష్టంగా రాయాలని సూచిస్తున్నారు. ఏఐ మన భవిష్యత్తు అని చెప్పడం సరైనది, కాని, సరైన దారిలో పెట్టకపోతే, అదే ఏఐ మన అసలైన గుర్తింపునే మెల్లగా మాయ చేసే శక్తిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ ఎన్ని వేషాలు వేసినా, ఈ డీప్ఫేక్ ప్రపంచంలో చివరి గెలుపు మనదే! ఎందుకంటే ముఖం, స్వరం కాదు, అసలు హీరో మన నమ్మకం, మన పరిధి, మన నియంత్రణ. రష్మిక మందన్న‘‘ఇది భయంకరం. ఇది కేవలం నా గురించి మాత్రమే కాదు. ప్రతి మహిళ గురించి.’’ అని డీప్ఫేక్ వీడియోలపై ఆమె బహిరంగంగా స్పందించడంతో, కేంద్ర ఐటీ శాఖ జోక్యం చేసుకుని ప్లాట్ఫామ్లకు కంటెంట్ తొలగింపు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఏఐ దుర్వినియోగంపై చర్చకు దారి తీసింది.సమంత రూత్ ప్రభు‘‘ఆన్ లైన్ లో మహిళలపై జరిగే డిజిటల్ వేధింపులు సాధారణం కాకూడదు.’’ తన పేరుతో ఫేక్ కంటెంట్, మార్ఫ్ చేసిన చిత్రాలపై ఆమె స్పందించడంతో, సైబర్ క్రైమ్ ఫిర్యాదుల ప్రాముఖ్యతపై అవగాహన పెరిగింది.కీర్తి సురేష్‘‘డిజిటల్ ప్రపంచంలో గౌరవానికి కూడా రక్షణ అవసరం.’’ మార్ఫ్ చేసిన ఫోటోలు, ఫేక్ అకౌంట్లపై ఆమె స్పందనతో ప్లాట్ఫామ్లు కంటెంట్ తొలగింపు చర్యలు వేగవంతం చేశాయి.పూజా హెగ్డే‘‘ఇది సరదా కాదు, దుర్వినియోగం.’’ ఫేక్ ప్రొఫైల్స్, మార్ఫ్ చేసిన కంటెంట్పై ఆమె జారీ చేసిన హెచ్చరికలతో, సైబర్ ఫిర్యాదులపై చర్చ మొదలైంది. అలా తనతో పాటు చాలామంది తమకు జరిగిన సైబర్ నేరాలను బహిరంగంగా ఫిర్యాదులు చేశారు.నయనతార‘‘నా వ్యక్తిగత జీవితం కంటెంట్ కాదు.’’ అనుమతి లేకుండా తన చిత్రాలు, వీడియోలు వినియోగించిన సందర్భాల్లో ఆమె లీగల్ నోటీసుల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశారు.నాగార్జున అక్కినేని‘‘నా పేరు, నా ఫోటో పెట్టి ఎలాంటి పెట్టుబడి స్కీమ్స్ను నేను ప్రచారం చేయడంలేదు.’’ తన పేరుతో ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ విభాగాలు అలాంటి కంటెంట్ను తొలగించాయి.విజయ్‘‘నా పేరు పెట్టి ఆర్థిక స్కీమ్స్ ప్రచారం చేయడం మోసం.’’ ఫేక్ క్రిప్టో, ఇన్వెస్ట్మెంట్ యాడ్స్పై ఆయన హెచ్చరికలు జారీ చేయడంతో, తమిళనాడులో సైబర్ మోసాలపై అవగాహన పెరిగింది.మహేష్ బాబు‘‘నా పేరు, నా ముఖం పెట్టి పెట్టుబడులు కోరితే నమ్మకండి.’’ ఫేక్ ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో ప్రకటనలు వైరల్ కావడంతో ఆయన అభిమానులను అప్రమత్తం చేశారు.అజిత్ కుమార్‘‘నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండను. ఫేక్ అకౌంట్లను నమ్మవద్దు.’’ అంటూ అభిమానులను ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు.అల్లు అర్జున్‘‘నేను ఎలాంటి ఆన్ లైన్ స్కీమ్స్ను ప్రమోట్ చేయడం లేదు.’’ ఫేక్ యాడ్స్, మార్ఫ్ చేసిన వీడియోలపై ఆయన స్పందించడంతో, ఆ ఫేక్ కంటెంట్ను తొలగించారు.రజినీకాంత్‘‘నా పేరు వాడుకుని ఎవరైనా డబ్బులు అడిగితే అది మోసమే.’’ ఫేక్ యాడ్స్, రాజకీయ–ఆర్థిక ప్రచారాలపై ఆయన స్పష్టత ఇవ్వడంతో, కంటెంట్ తొలగింపులు జరిగాయి.ప్రభాస్‘‘నా పేరుతో వస్తున్న ప్రకటనలు నావి కావు.’’ ఫేక్ సోషల్ మీడియా పోస్టులు, యాడ్స్లో తన ముఖం వాడిన ఘటనల తర్వాత ఆయన అభిమానులకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.మోహన్ లాల్‘‘నా పేరు, నా ముఖం వాడిన ఆన్ లైన్ ప్రకటనలు నావి కావు.’’ ఫేక్ యాడ్స్పై ఆయన ఫిర్యాదు చేయడంతో, కేరళలో సైబర్ మోసాలపై చర్చ ఊపందుకుంది.యశ్‘‘నా పేరు పెట్టి జరిగే ఆన్ లైన్ ప్రమోషన్లు నావి కావు.’’ ఫేక్ యాడ్స్పై ఆయన హెచ్చరికలతో, కన్నడ ప్రేక్షకుల్లో సైబర్ అవగాహన పెరిగింది.అభిషేక్ బచ్చన్ (2025)‘‘ఆటోగ్రాఫ్ అనేది నా అభిమానులతో నా అనుబంధం. కాని, నకిలీ సంతకాలు, డీప్ఫేక్ వీడియోలు ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.’’ ఈ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కేసును స్వీకరించి, ఆయన గుర్తింపును దుర్వినియోగం చేసిన అంశంపై విచారణ చేపట్టింది.ఐశ్వర్యరాయ్ బచ్చన్ (2025)‘‘ఇది నా ముఖం. నా పేరు. నా గుర్తింపు. కాని, ఏఐ దాన్ని తీసుకుని అసభ్య వీడియోలు చేసింది, అనుమతి లేకుండా టీషర్టులు, మగ్స్పై వాడింది. నేను నటిని కావచ్చు, కాని, నా గౌరవం సినిమా సీన్ కాదు’’ అంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు అనుమతి లేకుండా ఏఐ ద్వారా తయారైన కంటెంట్ను తక్షణమే నిలిపివేయాలని, తొలగించాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.అరిజిత్ సింగ్ (2024)‘‘నా స్వరం నా సాధన. అనుమతి లేకుండా దాన్ని వాడటం సంగీతం కాదు.’’ ఢిల్లీ హైకోర్టు ఆయన పేరు, స్వరాన్ని అనధికారంగా వినియోగించ కుండా స్టే ఆర్డర్ జారీ చేసింది.అనిల్ కపూర్ (2023)‘‘నా డైలాగ్లు, నా ముఖం ఏఐ యాప్స్లో వాడాలంటే నా అనుమతి కావాలి.’’ ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయన పేరు, రూపం, స్వరం వ్యక్తిగత హక్కులేనని స్పష్టం చేస్తూ చారిత్రక తీర్పు ఇచ్చింది.కరణ్ జోహార్ (2025)‘‘నా పేరు పెట్టి, నా ముఖం పెట్టి అసభ్య కంటెంట్ ప్రచారం చేస్తున్నారు. ఇది నా కథ కాదు, నా సినిమా కాదు.’’ అంటూ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయనఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.‘‘నా స్వరం నా సంతకం. దాన్ని పోలిన ఏఐ వాయిస్ను నేను అంగీకరించను.’’ ఈ వివాదం తర్వాత సంబంధిత ఏఐ కంపెనీ ఆ వాయిస్ మోడల్ను తొలగించింది. – స్కార్లెట్ జోహాన్సన్‘‘ఆ డెంటల్ యాడ్లో నేను లేను. అది నా ముఖం వేసుకున్న ఏఐ మాత్రమే.’’ ఈ ఘటనపై ఆయన బహిరంగంగా హెచ్చరిక జారీ చేయడంతో, న్యాయ చర్యలపై విస్తృత చర్చ మొదలైంది. – టామ్ హ్యాంక్స్‘‘నా తండ్రి స్వరాన్ని తిరిగి సృష్టించడం భావోద్వేగ దోపిడీ.’’ ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో న్యాయ నైతిక చర్చకు దారి తీశాయి. – జెల్డా విలియమ్స్‘‘నా గొంతు నా జీవితం. అనుమతి లేకుండా వాడటం తప్పు.’’ ఈ వ్యవహారంలో ఆయన యుకే కోర్టులో సంబంధిత ఏఐ కంపెనీపై కేసు వేశారు. – స్టీఫెన్ ఫ్రై -
చిన్న ట్విస్ట్!
చీర.. బ్రాండ్: స్వాతి షాపింగ్మాల్జ్యూలరీ బ్రాండ్: ది జ్యూయల్ గ్యాలరీధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.తల్లి కావడమంటే నన్ను నేనే కోల్పోవడమా? కాదు. గ్లామర్, స్టయిల్, కాన్ఫిడెన్స్ ఇవే నా ఐడెంటిటీ. అందుకే సింపుల్, సంప్రదాయ దుస్తుల్లోనూ చిన్న ట్విస్ట్ ఇస్తాను. కటౌట్ నెక్లైన్ , వన్ సైడ్ ఫ్లేర్ టాప్, ప్రీ–డ్రేప్డ్ చీరలకు బెల్ట్. అలాగే వెస్ట్రన్ వేర్లో లేయరింగ్, హెవీ అఫ్గాన్ జ్యూవెలరీతో ఎడ్జ్ ఇవ్వడం నా సిగ్నేచర్ స్టేట్మెంట్స్. ఇలా బోల్డ్గా ఉండటం అవమానం కాదు. నేను మోరల్ పోలీస్ కోసం కాదు, నా కోసం స్టయిల్ అవుతాను.– అనసూయ భరద్వాజ్. -
అవి చూస్తే వణుకు పుడుతుంది
అనుకోకుండా మొదలైన అనశ్వర రాజన్ ప్రయాణం,నేడు ఎన్నో లక్ష్యాలు, ఎన్నో కలలతో నిండిపోయింది. మనసులో ఎన్నో గాయాలను దాచుకుని ముందుకు నడుస్తున్న ఆమె ప్రపంచం గురించిన విషయాలు ఆమె మాటల్లోనే...⇒ నిజం చెప్పాలంటే, నేను ఎప్పుడూ హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. కరివెల్లూరులో చదువుతున్న రోజుల్లో, నా తొలి ఆడిషన్ కు ఒక ఫ్రెండ్ నన్ను లాక్కెళ్లింది.⇒ సినిమాల్లోకి వచ్చాక నా స్కూల్ జీవితం ఒంటరిగా మారిపోయింది. కొంతమంది టీచర్లు, పేరెంట్స్ నన్ను వేరుగా చూసేవారు. ‘‘నీకు సినిమాలు ఉన్నాయిగా, చదువు ఎందుకు?’’ అనే మాటలు ఇప్పటికీ బాధిస్తాయి. స్కూల్ మానేయాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి.⇒ ఐదో తరగతిలో ఉన్నప్పుడు బస్సులో ఎదురైన ఒక చేదు అనుభవం ఇప్పటికీ వెంటాడుతుంది. ఆ సంఘటన నా బాల్యాన్ని పెద్దదిగా చేసింది. ఇప్పటికీ బస్సు ప్రయాణం అంటే కొంత ఆందోళనగానే ఉంటుంది.⇒ ఇప్పుడు అంతకంటే భయం కలిగించేది డిజిటల్ ప్రపంచం. ఏఐతో మార్ఫ్ చేసిన ఫొటోలు, వీడియోలు చూస్తే నిజంగా వణుకు పుడుతుంది. వాటిని ఆపలేకపోవడం చాలా బాధగా ఉంటుంది.⇒ గత ఏడాది ఒక సినిమా ప్రమోషన్స్ సమయంలో జరిగిన వివాదం నాకు చాలా నేర్పింది. ఆ సమయంలో నేను బాధితురాలిలా మౌనంగా ఉండలేదు. నా పేరు, నా గౌరవం కోసం నిలబడ్డాను. అదే నా నిజమైన బ్రేక్త్రూ.⇒ ‘‘పెళ్లి గురించి కాదు, నీ కెరీర్, నీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచించు’’ అని చెప్పే ప్రోగ్రెసివ్ తండ్రి నాకు దొరికారు. ఆయనే నా అతిపెద్ద బలం. ఇప్పుడు నా దుస్తులు, నా ఎంపికల గురించి ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోవడం మానేశాను. నాకు ఎవరికీ వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని నేర్చుకున్నాను.⇒ షూటింగ్ లేనప్పుడు నా బ్యాగ్లో తప్పకుండా ఒక పుస్తకం ఉంటుంది. నేను పూర్తిగా రొమాంటిక్ నవలల ఫ్యాన్ ని. చదవకపోయినా, కొనకుండా ఉండలేను.⇒ స్కిన్ కేర్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. మేకప్ తప్పకుండా తీసేస్తాను. ముందుగా ఆయిల్తో క్లీనింగ్, తర్వాత మేకప్ రిమూవర్, ఆపై ఫేస్ వాష్ డబుల్ క్లీన్సింగ్ లేకపోతే నిద్రపోను. షూటింగ్ లేనప్పుడు ‘క్లీన్ గర్ల్ లుక్’ ఇష్టం. సింపుల్ స్కిన్, కాస్త డార్క్ కాజల్ అంతే.⇒ మలయాళం వరకు మాత్రమే కాదు, ఇప్పుడు తెలుగులోకి కూడా అడుగుపెడుతున్నాను. ‘చాంపియన్’ నా తొలి తెలుగు సినిమా. మరో తెలుగు ప్రాజెక్ట్ కూడా సైన్ చేశాను. -
ఆటపాటల అట్టహాసం
ఆటపాటల అట్టహాసం ఆ నగరంలో సందడి సందడిగా కనిపిస్తుంది. వీథుల్లో ఎక్కడ చూసినా సంప్రదాయ వాద్యాలకు అనుగుణంగా చిన్నా పెద్దా, ఆడా మగా చెట్టా పట్టాలేసుకుని అడుగులో అడుగులు కదుపుతూ నాట్యకేళితో కనువిందు చేస్తారు. ఒకరోజు కాదు, ఏకంగా పదిరోజులు అట్టహాసంగా సాగే ఆటపాటలతో సాగే అద్భుతమైన వేడుక ఇది. ఈ నాట్యోత్సవానికి వేదిక పెరులోని ట్రుజిలో నగరం. ట్రుజిలో నగరంలో ప్రతి ఏటా జనవరి నెలలో ‘ట్రుజిలో మరీనెరా’ పేరిట జరిగే ఈ నాట్యోత్సవాన్ని తిలకించేందుకు విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తారు. పెరు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే ఈ పదిరోజుల పండుగలో అశ్వికుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉరకలేసే పెరూవియన్ పాసో అశ్వాలను అధిరోహించిన అశ్వికులు నాట్యోత్సవం కొనసాగే వీథుల్లో విన్యాసాలు చేస్తూ తిరుగుతుంటారు. చిత్రవిచిత్ర గతులలో నాట్యమాడే నాట్యగత్తెలతో అశ్వాల మీద కూర్చునే సయ్యాటలాడుతుంటారు.పెరూ ప్రభుత్వం ఈ వేడుకను జాతీయ సాంస్కృతిక వేడుకగా గుర్తించింది. ట్రుజిలో నగరంలో జరిగే ఈ పది రోజుల పండుగలో జనాలు పెరూవియన్ సంప్రదాయ ‘మరీనెరా’ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అందువల్ల పెరు ప్రభుత్వం ట్రుజిలో నగరాన్ని ‘మరీనెరా రాజధాని’గా గుర్తించింది. ఈసారి ట్రుజిలోలో ఈ వేడుకలు జనవరి 20 నుంచి 30 వరకు జరగనున్నాయి.ఈ సందర్భంగా జాతీయ మరీనెరా పోటీలను కూడా నిర్వహిస్తారు. ఈ వేడుకలు జరిగే పది రోజుల్లోనూ ట్రుజిలో నగరం నలుమూలలా వీథుల్లో భారీ స్థాయిలో ఊరేగింపులు జరుగుతాయి. ఈ ఊరేగింపుల్లో రథాల వంటి వాహనాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగిస్తారు. ఈ రథాలపై కొందరు నర్తకీమణులు రాణుల వేషాలలో నర్తిస్తూ జనాలను అలరిస్తారు. వీథుల్లో రథాల వెంట నడుస్తూ ఆడా మగా అన్ని వయసుల వారు జంటలు జంటలుగా నాట్యాలు సాగిస్తుంటారు. -
సుదీర్ఘ సొరంగ రహదారి
ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన సొరంగ రహదారి. చైనా ప్రభుత్వం గత డిసెంబర్ 16న దీనిని ప్రారంభించింది. టియాన్షాన్ పర్వతశ్రేణుల వద్ద కొండలను తొలిచి నిర్మించిన ఈ సొరంగ రహదారి పొడవు 22.13 కిలోమీటర్లు. ఉరుంకీ నగరం నుంచి కోర్లా నగరానికి వెళ్లేందుకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో చైనా ప్రభుత్వం ఈ సొరంగ రహదారిని నిర్మించింది. ఉరుంకీ నుంచి కోర్లాకు ఇదివరకు ఏడుగంటలు పట్టేది.ఈ సొరంగం వల్ల ప్రయాణ సమయం మూడున్నర గంటలకు తగ్గింది. దాదాపు ఏడువందల మీటర్ల లోతున ఈ సొరంగ మార్గాన్ని నిర్మించడం వల్ల అతి శీతల వాతావరణంలో సునాయాసంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. టియాన్షాన్ పర్వతశ్రేణుల వద్ద శీతకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 42 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంటాయి. పూర్తిగా మంచు నిండిన మార్గంలో వాహనాలు ప్రయాణించడం దుస్సాధ్యంగా ఉండేది. ఈ సొరంగం నిర్మించడం వల్ల మంచు కారణంగా ఆటంకాలు లేకుండా, సురక్షితంగా సునాయాసంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. -
బ్రహ్మలోకానికి వెళ్లిన హనుమ
రామ రావణ యుద్ధం ముగిసింది. సుగ్రీవాది వానర ప్రముఖుల సమక్షంలో విభీషణుడిని లంకా«ధిపతిగా రాముడు పట్టాభిషేకం జరిపించాడు. విభీషణుడి అతిథి మర్యాదలు పొందిన తర్వాత రాముడు అయోధ్యకు బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. రాముడి ప్రయాణం కోసం విభీషణుడు పుష్పక విమానాన్ని సిద్ధం చేయించాడు. సీతా లక్ష్మణ సమేతంగా రాముడు పుష్పకంలోకి అడుగుపెట్టాడు. ఎందరు ఎక్కినా మరొకరికి చోటు మిగిలి ఉండే పుష్పక విమానంలో తమతో పాటు విభీషణుడిని, సుగ్రీవాది వానర వీరులను కూడా రమ్మని రాముడు ఆహ్వానించాడు. విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు సహా వానర వీరులంతా పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. విమానంలోకి అందరూ వచ్చారో లేరోనని రాముడు ఒక్కొక్కరినీ పరికించి చూశాడు. వానర వీరుల్లో గంధమాదనుడు కనిపించలేదు.‘గంధమాదనుడు ఏడీ?’ అడిగాడు రాముడు.‘యుద్ధంలో కుంభకర్ణుడి చేతిలో మరణించాడు’ బదులిచ్చాడు విభీషణుడు.‘అయ్యో! నాకు సహాయం చేయడానికి వచ్చి, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడా? ఈ దురవస్థను తప్పించేవారే లేరా?’ అని రాముడు ఎంతో విచారించాడు. ‘మన హనుమ చెంతనుండగా దిగులు ఎందుకు స్వామీ’ అన్నాడు జాంబవంతుడు.రాముడు వెంటనే హనుమంతుడిని చెంతకు పిలిచి, ‘హనుమా! గంధమాదనుడు ఏ లోకంలో ఉన్నా, తీసుకురా! ఈ పని నీ ఒక్కడికే సాధ్యం’ అన్నాడు.‘ప్రభూ! నీ ఆజ్ఞ! గంధమాదనుడు ఎక్కడ ఉన్నా, వెదికి నీ ముందుకు తీసుకొస్తా’ అంటూ హనుమ శరీరాన్ని భారీగా పెంచాడు. ఆకాశాన్ని ఆవరించుకున్న ఇంద్రధనుస్సులా తోకను పెంచాడు. నేలను పాదాలతో తాటించాడు. హనుమ పదఘట్టనలకు నేల కంపించింది. ఒక్కసారిగా హూంకరించి, నింగికెగశాడు హనుమ. నేరుగా యమపురికి చేరుకుని, యముడి కోట ద్వారం వద్ద నిలబడి భీకరంగా సింహనాదం చేశాడు. హనుమంతుడి సింహనాదానికి యముడి సింహాసనం అదిరిపడింది. యముడు క్షణకాలం భయకంపితుడయ్యాడు. పరుగు పరుగున బయటకు వచ్చి, హనుమ ఎదుట నిలిచి, అతడికి సగౌరవంగా అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, లోనికి తీసుకువెళ్లి, ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు.‘హనుమా! నీ రాకకు కారణమేమిటి?’ అడిగాడు యముడు. ‘రామ రావణ సంగ్రామంలో మరణించిన మా వానరయోధుడు గంధమాదనుడిని నాతో పంపాలి’ అన్నాడు.‘గంధమాదనుడు నా లోకంలో లేడయ్యా! యుద్ధంలో వీరమరణం పొందాక అతడు సత్యలోకానికి చేరుకున్నాడు!’ చెప్పాడు యముడు.యముడి వద్ద సెలవు తీసుకుని, హనుమంతుడు నేరుగా సత్యలోకానికి వెళ్లాడు. సత్యలోకంలో హనుమంతుడు బ్రహ్మదేవుడి సభామంటపానికి చేరుకునే సరికి అక్కడ ద్వాదశాదిత్యులు ముకుళిత హస్తాలతో బ్రహ్మదేవుడికి నమస్కరిస్తూ నిలుచున్నారు. నారదుడు మహతి మీటుతుండగా, మునీశ్వరులు సృష్టికర్త కీర్తిగానం చేస్తుండగా, అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు. సరస్వతీ సమేతంగా బ్రహ్మదేవుడు పద్మాసనంపై ఆసీనుడై ప్రసన్నవదనంతో అంతా తిలకిస్తూ ఉన్నాడు. సభా మంటపంలోకి హనుమంతుడు అకస్మాత్తుగా వచ్చేసరికి అందరూ అతడివైపు చూశారు. హనుమ వినయంగా బ్రహ్మదేవుడికి మొక్కాడు. ‘హనుమా! నీ రాక నాకు సంతోషం కలిగించింది. ఇంతకూ నీ రాకకు కారణమేమిటి?’ అడిగాడు బ్రహ్మదేవుడు.‘తాతా! నీకు తెలియనిదేమున్నది? రామ రావణ సంగ్రామంలో వీరమరణం చెందిన మా వానర యోధుడు గంధమాదనుడు నీ లోకంలోనే ఉన్నాడు. అతడిని వెంటబెట్టుకు రావాలని రామాజ్ఞ! అతడు లేకుండా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరేది లేదని, అతడిని ఎలాగైనా తీసుకురావాలని చెప్పి రాముడు నన్ను పంపాడు. అందువల్ల మా గంధమాదనుడిని నాతో పంపు’ అని చెప్పాడు హనుమంతుడు. ‘హనుమా! రామ కార్యార్థమై యుద్ధంలో శరీరత్యాగం చేసిన గంధమాదనుడు అమరుడయ్యాడు. అతడిని తిరిగి భూలోకానికి పంపకూడదు. అయినా, తనువుడిగిన వానిని తిరిగి తెస్తానని ప్రతినపట్టి మరీ చెల్లించుకోవడం నీకే చెల్లింది. రామాజ్ఞ అని నువ్వు చెబుతున్నావు కనుక కాదనేది ఏముంది?’ అని హనుమంతుడిని పొగిడి, గంధమాదనుడిని అతడితో పంపాడు బ్రహ్మదేవుడు.గంధమాదనుడిని తీసుకుని హనుమంతుడు నేరుగా పుష్పకవిమానంలో ఉన్న రాముడి వద్దకు చేరుకున్నాడు. రాముడు హనుమంతుడిని, గంధమాదనుడిని ఆలింగనం చేసుకున్నాడు. గంధమాదనుడి యోగక్షేమాలను కనుక్కున్నాడు. గంధమాదనుడి రాకతో కపివీరులందరూ సంతోషించారు. పుష్పక విమానం అయోధ్యకు బయలుదేరింది.∙సాంఖ్యాయన -
సిటీలో కొడితే దుబాయ్లో తగిలింది!
దుబాయ్ కేంద్రంగా మాఫియా నడిపించిన అలీ భాయ్, 2001లో హైదరాబాద్లోని టోలిచౌకి నుంచి పన్నెండేళ్ల సుమేధను తన అనుచరులతో కిడ్నాప్ చేయించాడు. ఆమె తండ్రికి ఫోన్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ చిన్నారిని రక్షించడానికి ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బృందాన్ని రంగంలోకి దింపారు. అలీ భాయ్ దుబాయ్లో ఉండటం; ఇక్కడి అనుచరుల ఆచూకీ తెలియకపోవడం; డిమాండ్ చేసిన మొత్తం చెల్లించకుంటే చిన్నారిని చంపేస్తామని బెదిరిస్తుండటంతో స్పెషల్ టీమ్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. అప్పుడే తనదైన పంథాలో ఆలోచించిన ఓ అధికారి ఇక్కడ కొందరిని ‘టచ్’ చేసి ఆ సౌండ్ దుబాయ్కి వినిపించేలా చేశారు. దెబ్బకు దిగివచ్చిన అలీ భాయ్ సుమేధను సురక్షితంగా జహీరాబాద్లో విడిచిపెట్టించాడు. అప్పుడు ఏం జరిగిందంటే..!మెదక్ జిల్లా జహీరాబాద్కు చెందిన సయ్యద్ అబిద్ హుస్సేన్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు. 1993లో దుబాయ్ వెళ్లి వ్యాపారం చేశాడు. అతడికి అక్కడే ముంబైకి చెందిన అబ్దుల్ ఖయ్యూం షేక్ అలియాస్ రాజ్, ఉత్తరప్రదేశ్లోని ఆజమ్గఢ్కు చెందిన అల్తాఫ్ ఆలం ఖాన్ అలియాస్ విక్కీతో పరిచయమైంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్లో కీలకంగా వ్యవహరించిన ఛోటా రాజన్కు ఈ ద్వయం అనుచరులుగా వ్యవహరించింది. వీరి పరిచయంతో అబిద్ తన పేరును అలీ భాయ్గా మార్చుకుని విక్కీకి అనుచరుడిగా మారాడు. అంతటితో ఆగకుండా ఆ ద్వయంతో కలిసి బెదిరింపు వసూళ్లు, కిడ్నాప్లు చేయాలని పథకం వేశాడు. దీనికి వాళ్లు అంగీకరించడంతో దుబాయ్ నుంచే హైదరాబాద్తో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్, ఆంధ్రప్రదేశ్ల్లో కొన్ని నేరాలు చేశారు. అక్కడ నుంచే కథ నడిపించిన ఈ ముగ్గురూ ఇక్కడ అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. దుబాయ్ నుంచి అలీ భాయ్ పథకం వేయడం; మిగిలిన ఇద్దరూ తమ అనుచరుల ద్వారా అమలు చేయడం; సెల్ ఫోన్, శాటిలైట్ ఫోన్ల ద్వారా టార్గెట్ను బెదిరించి డబ్బు వసూలు చేయడం– ఇలా కొన్నాళ్లు ఓ మాఫియా సామ్రాజ్యాన్నే నడిపారు. ఎక్కడిక్కడ స్థానిక రౌడీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని హడలెత్తించారు. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన మీర్జా అసద్ అలీ, మహ్మద్ నవీద్, బుద్వేల్కు చెందిన అహ్మద్ హుస్సేన్ తదితరులు అలీ భాయ్ కోసం పని చేశారు. అలీ భాయ్ 2001 మార్చి 23న జూబ్లీహిల్స్కు చెందిన బడా వ్యాపారి కుమార్తె సుమేధను కిడ్నాప్ చేయించాడు. అప్పట్లో తొమ్మిదో తరగతి చదవుతున్న ఆమె పాఠశాలకు వెళ్తుండగా టోలిచౌకిలో అపహరణకు గురైంది. ఈ చిన్నారిని తీసుకువెళ్లిన అలీ భాయ్ అనుచరులు జహీరాబాద్లో సిద్ధం చేసుకున్న డెన్లో దాచారు. దుబాయ్ నుంచి చిన్నారి తండ్రికి ఫోన్ చేసిన అలీ భాయ్ తమ అధీనంలో ఉన్న సుమేధను సురక్షితంగా విడిచిపెట్టడానికి రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. తాను దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడినని, ఈ మొత్తాన్ని డాలర్ల రూపంలో సిద్ధం చేసి ఉంచాలని, ఎక్కడ ఇవ్వాలో చెప్తానని చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, నిర్ణీత సమయంలో డబ్బు చెల్లించకపోయినా చిన్నారిని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ వ్యవహారంలో విక్కీ సైతం సుమేధ తండ్రితో బేరసారాలు చేశాడు. అలీ భాయ్, విక్కీ బెదిరింపులకు భయపడని సుమేధ తండ్రి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటికే అలీభాయ్ వ్యవహారాలపై సమాచారం ఉన్న ఉన్నతాధికారులు సుమేధ కేసు డీల్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. దీనికి నేతృత్వం వహించిన కీలక అధికారి తనదైన పం«థాలో ముందుకు వెళ్లారు. సుమేధను సురక్షితంగా తీసుకురావాలంటే అలీ భాయ్ని ఎమోషనల్గా డీల్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఓ బృందాన్ని జహీరాబాద్ పంపి అలీ పూర్వాపరాలు, ఆప్తుల వివరాలు ఆరా తీయించారు. అలీ భాయ్ అమితంగా అభిమానించే ఇద్దరు సమీప బంధువుల విషయం ఇలా పోలీసుల దృష్టికి వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయని పోలీసులు వారిని హైదరాబాద్ తీసుకువచ్చారు. అప్పటికే శివార్లలో ఓ రహస్య సేఫ్ హౌస్ను సిద్ధం చేసి ఉంచారు. అలీ భాయ్ సమీప బంధువులను అక్కడకు తరలించిన పోలీసులు తమదైన ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఇక్కడ సేఫ్ హౌస్లో ఉన్న వారిని ఇంటరాగేషన్ చేస్తూ వారి అరుపులు, మాటల్ని ఫోన్ ద్వారా దుబాయ్లో ఉన్న అలీ భాయ్కి వినిపించారు. ఆ చిన్నారిని చిన్న గాయమైనా వీళ్లను ఎన్కౌంటర్ చేస్తామని, 24 గంటల్లో సుమేధ సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరకుంటే మళ్లీ ఈ ఇద్దరు సన్నిహితులు నీకు కనిపించరంటూ అల్టిమేటం ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన ఈ షాక్కు భయపడిన అలీ భాయ్ దిగి వచ్చాడు. సుమేధను వదిలి వెళ్లిపోవాలంటూ తన అనుచరులకు చెప్పి, జహీరాబాద్ చిరునామాను పోలీసులకు అందించాడు. హైదరాబాద్ అధికారుల ద్వారా సమాచారం అందుకున్న మెదక్ పోలీసులు సుమేధను సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఆ తర్వాతే ప్రత్యేక బృందం అలీ భాయ్ సన్నిహితులను తమ సేఫ్ హౌస్ నుంచి బయటకు పంపింది. దీంతో పాటు మరికొన్ని నేరాలు చేసిన అలీ భాయ్, విక్కీలను పోలీసులు దుబాయ్ నుంచి రప్పించారు. అలీ భాయ్ని 2007లో హైదరాబాద్, విక్కీని దీనికి ముందే పుణేకు డిపోర్ట్ అయ్యారు. అలీ భాయ్ని బలవంతంగా దుబాయ్ నుంచి తీసుకువచ్చిన తర్వాత సుమేధ కేసు విచారణ కోసం విక్కీని సైతం హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఆ సమయంలో కేవలం ఇద్దరు అధికారులే వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించడానికి సిద్ధం అయ్యారు. ఎలాంటి సాయుధ ఎస్కార్ట్ లేకుండా కేవలం ఇద్దరు అధికారులు ఓ సుమోలో తీసుకువెళ్లడంతో ఆ ద్వయం కంగుతింది. తాము మాఫియా డాన్స్ అని, దావూద్ అనుచరులమని, ఇలా భద్రత లేకుండా తీసుకువెళ్తే ఎలా? అంటూ ప్రశ్నించింది. పోలీసులు ఇవేవీ పట్టించుకోలేదు. దీంతో ఓ దశలో ఇలా సింపుల్గా కోర్టుకు రావడానికి అలిగిన అలీ, విక్కీ తప్పనిసరి పరిస్థితిలో సుమో ఎక్కారు. -
ఈ వారం కథ: రైలు పట్టాలపై పదిపైసలు
‘‘పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుచుట కన్న పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినుర వేమ!’’ యాభైమంది ఐదో తరగతి పిల్లలతో ఉన్న ఆ క్లాసు కోలాహలంగా ఉంది. టీచర్ దృష్టిలో పడాలని ఒకరిని మించి ఒకరు పెద్దపెద్ద గొంతులతో బోర్డుపైన ఉన్న పద్యాన్ని అందరికంటే ముందు చెప్పడానికి తాపత్రయ పడుతున్నారు. పద్యం చెప్తున్న రమణ ఒక్కసారిగా గొంతు తగ్గించి, పక్కనున్న వెంకట్ డొక్కలో చిన్నగా పొడిచి ‘బయటికి వెళ్దాం’ అన్నట్టుగా కంటితో సైగ చేశాడు.వెంకట్ అతని వంక చూసి ‘వద్ద’న్నట్టుగా కళ్ళతోనే వారించాడు. ‘రాకపోతే నీ అంతు తేలుస్తా’ అన్నట్లుగా వేలు చూపిస్తూ బెదిరించాడు రమణ. కాసేపటికి రీసెస్ బెల్ కొట్టడంతో పుట్టలోంచి చీమలు వచ్చినట్లుగా క్లాసులోంచి పిల్లలంతా బయటకు వచ్చారు. ఒకర్నొకరు తోసుకుంటూ ఆడుకున్నారు. కనిపించే చెట్టుకొమ్మల్ని పట్టుకుని వేలాడారు. చిన్న చిన్న కర్రపుల్లల్ని చేతిలో పట్టుకుని కనిపించిన కుక్కల్ని తరుముతూ కొంతసేపు ఆడుకుని వెనక్కి తిరిగారు. ‘‘ఏరా.. రైలును చూట్టానికి ఎప్పుడెళ్తున్నావు’’ అన్నాడు శ్రీను.ఆ మాటలకు పెద్దగా నవ్వసాగాడు రమణ. వాడెందుకు నవ్వుతున్నాడో అర్థంకాక ‘‘పిచ్చిపట్టిందా... అలా నవ్వుతున్నావ్’’ అన్నాడు శ్రీను. నవ్వడం ఆపి శ్రీను వైపు చూస్తూ ‘‘ఈడిని క్లాసులో నుంచి రమ్మంటేనే బయటికి రావడానికి భయపడ్డాడు. ఇక రైలును చూశాడంటే అక్కడి నుంచి వెనక్కి రాడేమో! వీడొట్టి పిరికోడు..’’ అన్నాడు రమణ. ఆ మాటలకు వెంకట్ ఉక్రోషంగా చూశాడు. మిగతా పిల్లలంతా తన వైపు వేళాకోళంగా చూడడం అవమానంగా అనిపించింది. రమణ వైపు చూస్తూ ‘‘నాకేమీ భయం లేదు. తప్పకుండా రైలును చూసొత్తా’’ అన్నాడు. ఆ మాటలకు మళ్ళీ పెద్దగా నవ్వుతూ ‘‘రైలుని చూడ్డానికే ఇంత భయపడేవాడు ఇక రైలు పట్టాలపై పది పైసల బిళ్లనెలా పెడతాడు?’’ అన్నాడు రమణ. ఏమీ మాట్లాడకుండా వాడివైపు చూశాడు వెంకట్. వాడి చూపుల నిండా వేళాకోళం, వెక్కిరింత కనిపించింది. వెంకట్ వాడి వంక చూస్తూ ‘‘ఈరోజు ఎలాగైనా అక్కడికి వెళ్తాను. రైలును చూస్తాను. రైలు పట్టాలపై పదిపైసల నాణెం పెట్టి తీసుకొచ్చి, నీకు చూపిస్తాను’’ అన్నాడు ఉక్రోషంగా.‘అవేమీ జరిగే పనులు కాదులే... పద పద’ అన్నట్లుగా నవ్వాడు రమణ. పిల్లలంతా క్లాసుకు చేరుకున్నారు.టీచర్ మళ్ళీ పద్యాన్ని వల్లె వేయించసాగింది. ప్రతి పదం దగ్గరా ఆగుతూ, దాని భావాన్ని చెప్తూ, ఎవరైనా పిల్లలు తప్పు చెప్తే దాన్ని సరిచేసి మళ్లీ చెప్పసాగింది. వెంకట్ వింటున్నాడే గాని, కళ్లముందు రైలు కదలాడసాగింది. ఒక్కడే రైలు స్టేషన్ దగ్గరికి నడిచి వెళ్లగలడా? ధైర్యం చేసి వెళ్లినా, రైలు పట్టాలపై పదిపైసల బిళ్లను ఉంచగలడా? అనే ప్రశ్నలతో కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యాడు.వెళ్లగలనో లేదోననే సందేహం వచ్చింది. ఎలాగైనా వెళ్లాలనే పట్టుదల పెరిగింది. టీచర్ చెప్తున్న పద్యం మనసులో సుడులు తిరగసాగింది.మధ్యాహ్నం భోజనం బెల్ మోగింది. వినయ్ వంక ఒకసారి చూసి ఇంటికి బయల్దేరాడు వెంకట్.ఆవేశంలో కాళ్లకు చెప్పులేసుకోవడం కూడా మర్చిపోయి వచ్చాడు గాని, పగబట్టినట్లుగా తరుముతున్న ఎండను తట్టుకోలేక రోడ్డు పక్కనున్న మొక్కజొన్న చేను గట్టు మీద, దారి పక్కన గుట్టలుగా పేరుకుపోయిన ఎండుటాకుల మీదా నడవసాగాడు.నిర్లక్ష్యంగా గాలికి రేగుతున్న జుట్టును చేత్తో ఎగ దోసుకుంటున్నాడు. దాహంతో నాలుక పిడచకట్టుకు పోతోంది. పెదవుల్ని మాటిమాటికీ తడుపుకుంటున్నాడు. ధారగా కారుతున్న చెమటను ఒక చేత్తో తుడుచుకుంటూ, సూటిగా కళ్లమీద ఎండ పడకుండా మరో చేతిని అడ్డుపెట్టుకుంటూ నడకలో వేగం పెంచాడు. ‘ఎప్పుడెప్పుడు వెళ్లి రైలును చూస్తానా’ అనే కోరిక వాడిని నిలబడనీయట్లేదు. కాళ్లకు మొక్కజొన్న మోళ్లు గుచ్చుకుంటున్నాయో, ముళ్ళు గుచ్చుకుంటున్నాయో కూడా తెలియకుండా నడుస్తున్నాడు. వెంకట్ ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పెనుమాక రైల్వేస్టేషన్. సింగిల్ ట్రాక్ కావడం వల్ల నిర్దేశించిన సమయాల్లో తప్ప ఎక్కువగా రైళ్ల రాకపోకలుండవు. రైలొచ్చే ముందు కొట్టే గంట గురించి, పట్టాల మీదకి రైలు వచ్చేటప్పుడు చేసే చప్పుడు గురించి, అది వదిలే పొగ గురించి స్నేహితులంతా కథలు కథలుగా చెప్తే క్లాసులో చాలాసార్లు విన్నాడు. పైగా చాలామంది స్నేహితులు ‘రైలును చూడ్డానికి పెద్దవాళ్లతో వెళ్లాలని, ఒక్కరే వెళ్తే చాలా భయంగా ఉంటుందని’ చెప్పడం గుర్తొచ్చింది. మనసులో భయంగానే ఉన్నా ఎలాగైనా ఆ పూటే రైలును చూసి రమణగాడి నోరు మూయించి, అందరి ముందూ తానేంటో నిరూపించుకోవాలనే తపన వెంకట్ ఆశను మరింత బలపరచింది. కాలికేదో గుచ్చుకోవడంతో ‘అమ్మా’ అనుకుంటూ కాలివైపు చూసుకున్నాడు. మొక్కజొన్న మోడు రెండు వేళ్ల సందులో గుచ్చుకుని చర్మం చీరుకుపోయి రక్తం కారసాగింది. ఒక్కసారిగా వెంకట్ నడకలో వేగం తగ్గింది. గట్టుమీద కూర్చుండిపోయి రెండు వేళ్ల మధ్యలోనూ కొంచెం ఉమ్ము రాసుకున్నాడు. కాలి బొటనవేలినీ, తర్వాత వేలినీ మెల్లగా చేతితో రుద్దుకున్నాడు. కొంచెం నొప్పి తగ్గిందనుకున్నాక పైకి లేచి నడక సాగించాడు. అతనితో పాటే తేనెటీగల్లా ఆలోచనలు కూడా వెంబడించాయి. లేత వొంటిని ఎండ కిరణాలు తొలిచేస్తున్నాయి. ముందుకు వంగి కాళ్లవైపు చూసుకున్నాడు. చీరుకుపోయి, దుమ్ము కొట్టుకుపోయిన కాళ్లు కనిపించాయి. గూటం తెగిపోయి ఇంటి దగ్గర వదిలొచ్చిన చెప్పుల్ని వేసుకొచ్చినా బాగుండేదని అనుకున్నాడు మనసులో. మాటిమాటికీ ఆ చెప్పులకు గూటం బిగించుకుంటూ నడిస్తే నడక సాగదని అనుకుని వాటిని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాడు.తను వెళ్ళేసరికి రైలు వచ్చి వెళ్ళిపోతే స్నేహితుల ముందు తలవంపులవుతుందని, అందరూ తనను వెక్కిరిస్తారని భయపడ్డాడు. కడుపునిండా అన్నం తింటే ఆలస్యమవుతుందని, తిన్నానన్న పేరుకి నాలుగు మెతుకులు తిని బయల్దేరాడు. ఎలాగైనా రైలుబండిని చూసి, స్నేహితుల ముందు భుజాలెగరేయాలనే ఆశ వాడిని నిలవనీయట్లేదు. పక్కనున్న రోడ్డుమీద ఎడ్లబండ్లు వెళ్తూ కనిపించాయి. ఎద్దులు కదిలినప్పుడల్లా వాటి మెడలోని గంటల చప్పుడు వాడికి ఆహ్లాదంగా అనిపించింది. ఎతై ్తన మూపురాన్ని ముద్దుగా చూశాడు. బండికి ‘జల్ల’ కట్టి ఉంది.మండుతున్న ఎండకు రోడ్డుమీద పెద్దగా జనసంచారం లేదు. అక్కడక్కడా నడుస్తున్నవాళ్ళు గొడుగులు వేసుకుని నడుస్తున్నా చీర కొంగుతోనో, పైపంచెతోనే విసురుకుంటూ వెళ్తున్నారు. అలా ఎదురైనవాళ్ళు అంత ఎండలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్న వెంకట్ని పిచ్చివాడిని చూసినట్లుగా చూడసాగారు. వారిని దాటుకుని ముందుకు నడవసాగాడు.ఆకాశానికి కాసేపు కరుణ కలిగి వర్షం పడితే తప్ప భూమాత చల్లబడేలా లేదు. అడుగులు పొయ్యి మీదున్న పెనం మీద పడుతున్నాయో, రోడ్డు మీద పడుతున్నాయో తెలియనంత తీవ్రంగా ఉంది ఎండ. నోరు తడారిపోయింది. నీటికోసం చుట్టూ చూశాడు. దారిలో మొక్కజొన్న తోటలకు దూరంగా పొలంలో ఒకచోట మోటార్ కనిపించింది. అది చూడడంతో వెంకట్ ప్రాణం లేచి వచ్చింది.రెండు చేతులతోనూ చెమట పట్టిన బుగ్గల్ని తుడుచుకుంటూ ఆనందంగా ఆ నీటి మోటార్ వైపు నడిచాడు. గట్టుమీదగా పొలాల మధ్యలో నడుస్తుంటే వాళ్లమ్మ వెనకాల నడుస్తూ చీరచెంగును కప్పుకున్నట్లుగా అనిపించింది. కోతకు సిద్ధమైన మొక్కజొన్న తోట బంగారురంగులో మెరిసిపోతోంది.గబగబా నీటి మోటర్ దగ్గరకెళ్ళి కాసిని నీళ్లతో మొహం కడుక్కుంటే ప్రాణం లేచొచ్చింది. దోసిళ్లతో తీసుకుని తనివితీరా నీళ్ళు తాగాడు. చీరుకుపోయిన కాలివేళ్లను నీళ్లతో శుభ్రంగా కడిగాడు. పైన అంత ఎండకాస్తున్నా నీళ్ళు అంత చల్లగా ఉండడం ఎంతో హాయిగా అనిపించింది.అక్కడినుంచి వెనక్కి తిరిగాడు. బయటికి కనిపిస్తున్న మొక్కజొన్నల మీద పిట్టలేవో వాలి చిట్టి నోటితో అందినంత తింటూ తృప్తి పడుతున్నాయి. వాటివైపు చూస్తూ మళ్లీ గట్టును సమీపించాడు.దారిమధ్యలో ఏవో చిన్నచిన్న పాకలు, ఐస్ ఫ్యాక్టరీ కనిపించాయి. ఐస్ ఫ్యాక్టరీ ముందు ఆగి ఉన్న కొన్ని లారీల్లో పెద్ద పెద్ద ఐస్ బాక్సుల్ని ఎక్కిస్తున్నారు. ఐస్ బాక్సుని చూస్తుంటే వెంకట్ నోట్లో నీళ్లూరాయి.‘పాస్’ బెల్ కొట్టినప్పుడు వాడి స్నేహితుడు రమణ తినే సేమ్యా ఐస్ వాడి కళ్లముందు కదలాడింది. ‘ఉస్’ అని లోపలికీ బయటికీ లాగుతూ వాడు సేమ్యా ఐస్ చప్పరించినప్పుడల్లా వెంకట్ ప్రాణం అలా ఆకాశంలోకి ఎగిరి మళ్లీ నేలమీదకి వచ్చేది. ఒకసారి ధైర్యం చేసి ‘నాకోసారి ఇత్తావా, చప్పరించి ఇచ్చేత్తాను’ అని అడిగాడు.దానికి రమణ నుదురు ముడతలు పడింది. ‘‘ఛీ... అట్టాశేత్తే ఎంగిలి కదూ! నేనివ్వను’’ అన్నాడు. ఆ మాటలకు వెంకట్ ఉత్సాహమంతా వేడి పెనం మీద వేసిన నీటిబొట్టులా ఆవిరయింది. ఎలాగైనా సేమ్యా ఐస్ కొనుక్కుని వాడి ముందే తనివితీరా చప్పరించాలనే ఆలోచన కలిగింది.ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా వాడిలో ఏదో తెలియని అసంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు తన కళ్లముందు కనిపిస్తున్న రకరకాల ఐసుల్ని చూస్తుంటే వాడి నోట్లో అప్రయత్నంగా నీళ్లూరాయి. ముందుకు నడుస్తున్నాడే గాని, వాడి ప్రాణమంతా ఐస్ బాక్సుల మీదే ఉంది. దారివంక కాసేపూ, వెనక వైపు కాసేపూ చూస్తూ ముందుకు నడుస్తున్న వాడల్లా హఠాత్తుగా ఆగిపోయాడు.దారి చీలిపోయిన దగ్గర నుంచుని దిక్కులు చూశాడు. ఏ దారిలో వెళ్తే రైల్వేస్టేషను తొందరగా వస్తుందో తెలియక తికమకపడసాగాడు. ఎండ కుదురుగా నిలబడనివ్వడం లేదు. ఎండ బాధకంటే కొంచెం దూరం నడిచినా ఏం కాదులే అనుకుని తోచిన దారివైపు నడవసాగాడు.తాటాకు చూరుకింద నులకమంచం వేసుకుని కునికిపాట్లు పడుతున్న అవ్వ కనిపించింది. ఆమెకి దూరంగా నుంచుని ‘‘అవ్వా.. రైలుటేసను దెగ్గిరికి ఇటేపు ఎల్లొచ్చా?’’ అని అడిగాడు ఆయాసపడుతూ. మామ్మ బోసి నోట్లో నుంచి వింత నవ్వొకటి పెదాలపై కనబడకుండా మెరిసింది. కాసేపయ్యాక ‘‘రైలెక్కి ఏ దేశమెల్తన్నా. కాళ్లకి శెప్పులు కూడా లేకుండా బైలెల్లావ్’’ అంది. వెంకట్కి ఏమి చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ నిలబడిపోయాడు. వాడి అవస్థను గమనించిన అవ్వ ‘అటే పో’ అన్నట్లుగా చేతిని పైకెత్తి దారివైపు చూపించింది.కాలనీలా ఉన్న ఇళ్లను దాటిన తర్వాత కొంచెం దూరంగా రైలుపట్టాలు కనిపించాయి. వాటిని చూస్తూ ఎదురెదురుగా ఉన్న రైలు పట్టాలు ఎంతదూరం వెళ్తాయో అంచనా వేయసాగాడు. వాడి చిట్టిబుర్రకు తట్టలేదు, ఊహకు అందలేదు. ముందుకు వంగుని నాలుగురాళ్లను చేత్తో తీసుకున్నాడు. కాలుతున్న ఇనుపముద్దని చేత్తో తీసుకున్నట్లుగా చురుక్కు మనిపించి వదిలేశాడు. దూరంగా చెట్టుకింద నీడ కనిపించడంతో అటువైపు నడిచాడు.బరువైన సామాన్లను నెత్తిన మోసుకుంటూ, చంకలో చంటిపిల్లలతో వచ్చిన వాళ్లతో స్టేషనంతా కిటకిటలాడుతోంది. ఆ టైంలో ఒకటే రైలు కావడం వల్ల రద్దీ ఎక్కువగా ఉంది. పొరుగూరులో పనులకెళ్ళే వాళ్ళు సామాన్లు నింపిన గోతాల్ని తలమీద పెట్టుకుని అటుఇటూ తిరగసాగారు.వాళ్లవైపు చూస్తున్న కొద్దీ వెంకట్లో ఆత్రుత ఎక్కువైంది. అంతవరకూ రైలు గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదు. తర్వాత క్లాసులో ఏదైనా నాణేన్ని రైలుపట్టాలపై పెడితే పెద్దగా అవుతుందని రమణ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఎలాగైనా ఆ అనుభూతిని పొందాలనే తపనతో రూపాయి కోసం ఇల్లంతా గాలించాడు. చివరికి ఎక్కడో సత్తు పదిపైసల నాణెం కనిపించింది. దానిని జాగ్రత్తగా నిక్కరు జేబులో వేసుకుని బయల్దేరాడు. అది గుర్తుకొచ్చి జేబుల్ని తడుముకున్నాడు. పదిపైసల బిళ్ల చేతికి తగలడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న స్టేషనులో కలకలం మొదలయింది. టికెట్ తీసుకుని అక్కడక్కడా దూరంగా నిలబడ్డ ప్రయాణికులంతా హడావిడి పడుతూ ట్రైనులో ఎక్కడెక్కడ ఖాళీ ఉంటుందో అంచనా వేసుకుంటూ అక్కడికి చేరుకోసాగారు. మైకులో అనౌన్సుమెంటు వినిపిస్తోంది. రైల్వే కూలీల పరుగులు, తినుబండారాలు అమ్మేవాళ్ల పరుగులతో ప్రశాంతమైన వాతావరణం కాస్తా తిరునాళ్లలా మారిపోయింది.చెట్టు కింద నిల్చున్న వెంకట్ భయంభయంగా రైలుపట్టాల వైపు కదిలాడు. తనను ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూశారు. ఎవరి పనుల్లో వారుండడంతో ఊపిరి పీల్చుకున్నాడు. రైలొచ్చేటప్పుడు ఏదైనా స్తంభంలాంటి గట్టి ఇనుప వస్తువును పట్టుకోవాలని, లేకపోతే ఆ వేగానికి ట్రైన్ కిందకి వెళ్ళిపోతామని భయపెట్టిన రమణ గుర్తొచ్చాడు.ఎదురుగా కనిపిస్తున్న ట్రాక్ కొండచిలువలా కనిపించింది. జేబులో నుంచి పదిపైసల బిళ్ల తీసి పట్టా మీద పెట్టాడు. రైలు వేగానికి అదెక్కడికి ఎగిరిపోతుందో తెలియలేదు. దగ్గర నుంచోవాలంటే భయంగా ఉంది. పదిపైసలు బిళ్ళ పెట్టిన ప్రాంతానికి గుర్తుగా ఏమైనా ఉందేమోనని చుట్టూ చూశాడు. సమాంతరంగా ఉన్న రెండు రైలుపట్టాలకు మధ్యలో ఎర్రరంగు రాసిన చెక్కలు కనిపించాయి. చురుగ్గా దాని చుట్టూ చూసి దానికి ఎదురుగా పట్టా మీద పదిపైసలు బిళ్ల పెట్టి దూరంగా వచ్చాడు. దూరంగా రైలు కూత వినిపిస్తోంది. ప్రయాణికులందరిలో ఆదుర్దా మొదలయింది. దూరంగా నిల్చుని చూస్తున్న వెంకట్లో ఆందోళన ఎక్కువయింది.దుమ్ము రేపుకుంటూ స్టేషనులో ఆగింది ట్రైన్. దిగేవాళ్లతో ఎక్కేవాళ్లతో హడావిడిగా ఉంది. ఒకర్నొకరు తోసుకుంటూ నెట్టుకుంటూ సామాన్ల బరువుతో కంపార్టుమెంట్లలోకి ఎక్కుతున్న జనాల్ని చూస్తుంటే వెంకట్లో గుండెదడ మొదలయింది.ఒక పెట్టె వెనక ఇంకో పెట్టెతో ఇంటి దగ్గర చూసిన ‘రోకలిబండ’లా అనిపించింది ట్రైన్. ‘ఒక్క రోజులో ఎంతమందిని చేరవేస్తుందో’నని తనలో తానే ఆశ్చర్యపడ్డాడు. ట్రైన్ ఎప్పటికి కదులుతుందో తెలియదు, తన పదిపైసలు బిళ్ల ఎక్కడ పడుతుందో తెలియదు. తనలో తనే కాసేపు ఆరాటపడ్డాడు.ట్రైన్ బయల్దేరుతుందన్నట్లుగా మైకులో ప్రకటన వినిపించింది. ఇంజిన్ పెట్టెలో ఉన్న గార్డు పచ్చ జెండా ఊపడంతో రైలు కదిలింది. వెంకట్ చూపు మొత్తం తాను పెట్టిన పది పైసల బిళ్లవైపు మళ్ళింది. నెమ్మదిగా కదిలినంత సేపూ దృష్టి అక్కడ నిలిచిందిగాని, వేగాన్ని పుంజుకున్నాక చూపు మందగించింది.నెమ్మదిగా ముందుకు కదిలి పది పైసల నాణెం కోసం వెతికాడు. పెట్టిన ప్రాంతంలో కనిపించక కంగారుపడ్డాడు.ఎంతో కష్టపడి ఇల్లంతా వెతికి తెచ్చాడు. ఆ నాణెం పెద్దదైతే బడికెళ్లాక స్నేహితుల ముందు గొప్పగా చూపించాలనుకున్నాడు. కాని, చూస్తుంటే పరిస్థితి అలా జరిగేలా లేదు. నాణెం పెట్టిన ప్రాంతానికి అటూ ఇటూ వెతికాడు. ఎర్రరంగు పూసిన చెక్కదిమ్మకు కొద్ది దూరంలో కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. గబగబా పరిగెత్తి ఆ బిళ్లని అపురూపంగా చేతుల్లోకి తీసుకున్నాడు. పెద్దగా కనిపిస్తున్న నాణెం వంక ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ చూస్తుంటే వెంకట్ కళ్ళు పెద్దవయ్యాయి. కళ్లల్లో నీళ్ళు చిప్పిల్లాయి. జాగ్రత్తగా దాన్ని చేతుల్లోకి మార్చి మార్చి తీసుకుని కళ్ల నిండుగా చూసుకున్నాడు. ఆ తర్వాత జాగ్రత్తగా దాన్ని నిక్కరుజేబులో వేసుకున్నాడు. రాళ్లను, పట్టాలను దాటుకుంటూ వచ్చిన దారివైపు నడవసాగాడు. బాల్యంలో పుట్టిన కోరికలు చిరుగాలిలా మొదలై పెనుగాలిలా మారతాయి. తీరిపోయిన తర్వాత ఉత్సాహ తరంగాలై పట్టుకుని ఊపేస్తాయి. కారుతున్న చెమటను చేత్తో తుడుచుకుంటూ జేబులో వెడల్పుగా కనిపిస్తున్న పదిపైసల నాణేన్ని తడుముకున్నాడు.ఆనందంతో అడుగులెలా పడుతున్నాయో తెలియట్లేదు. అన్నం వేళ దాటిపోయినా ఆకలిగా లేదు. ఎండ నిలువునా తగలబెడుతున్నా స్పృహ లేదు. వెంకట్ కళ్లముందు ట్రైన్ చూసిన ఆనందం పదిపైసల నాణెం విస్తరించినట్లుగా రెట్టింపయింది. స్కూలుకెళ్లాక స్నేహితుల ముందు తానొక హీరో, అందరూ తనను ఆశ్చర్యంగా, అబ్బురంగా చూస్తారు. తన దగ్గరున్న పెద్దదైన పది పైసల నాణేన్ని చూడడానికి ఎగబడతారు. తాను మాత్రం ఎవరికీ చూపించకుండా కాసేపు దోబూచులాడతాడు. వాళ్లకు ఇచ్చినట్టే ఇచ్చి, చూపించినట్టే చూపించి వెంటనే దాచేస్తాడు. అందరికీ ఉక్రోషం మొదలవుతుంది. ఒక్కసారి జేబులో నాణేన్ని చేతిలోకి తీసుకుని గాల్లోకి ఎగరేశాడు.వాడి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ అది గాల్లో గిరికీలు కొట్టసాగింది. -
ఆత్మలకు ఆలవాలం!
ఆ ఊరు ఆత్మలకు ఆలవాలంగా పేరుమోసింది. నిజానికి ఆ ఊరు తొలిరోజుల్లో ప్రపంచంలో మిగిలిన అన్ని ఊళ్లలాగానే జనసంచారంతో కళకళలాడుతూ ఉండేది. ఇది ఆత్మలకు ఆలవాలంగా మారి, దయ్యాల ఊరిగా పేరుమోయడం వెనుక పెద్ద కథే ఉంది. బ్రెజిల్లో ఉన్న ఈ ఊరి పేరు పారానాపియాకాబా. బ్రిటిష్వారు కాఫీ రవాణా కోసం బ్రెజిల్లో రైలుమార్గం నిర్మించారు. సావో పాలో రైల్వే కంపెనీ రవాణా కేంద్రంగా ఇక్కడ 1860లో ఈ ఊరిని నిర్మించారు. అప్పట్లో ఇక్కడి నుంచి భారీ ఎత్తున కాఫీ రవాణా సాగేది.లండన్లోని బిగ్బెన్ గడియారం నమూనాలోనే ఈ ఊరి నడిబొడ్డున ఒక నిలువెత్తు గడియారాన్ని నెలకొల్పారు. ఊళ్లో ఏ మూల నుంచి చూసినా ఈ గడియారం కనిపిస్తుంది. సెర్రా డూ మార్ పర్వత శ్రేణుల మధ్యనున్న ఈ ఊరు అప్పట్లో ప్రశాంతతకు ఆలవాలంగా ఉండేది. ఈ ఊళ్లోనే లిడియా మాకిన్సన్ ఫాక్స్ అనే బ్రిటిష్ కులీన మహిళ తన పిల్లలతో కలసి కొండపై నిర్మించిన ప్యాలెస్లో ఉండేది. ఈ ఊళ్లో 1902లో యెల్లో ఫీవర్ విజృంభించింది. లిడియా తన పిల్లలతో ప్యాలెస్లోనే తలుపులు వేసుకుని ఉండిపోయింది. లిడియా, ఆమె పిల్లలు అందులోనే మరణించారు. అప్పటి నుంచి ఈ ఊళ్లో అతీంద్రియ సంఘటనలు జరగడం మొదలైనట్లు స్థానికులు చెబుతారు. ఊరి నడిబొడ్డున ఉన్న గడియారం రాత్రి 11.47 గంటలకు తనంతట తానే ఆగిపోతుందని, అర్ధరాత్రి వేళ చర్చిలోని గంట మోగుతూ ఉంటుందని చెబుతుంటారు. కొందరైతే, రాత్రివేళ లిడియా ఇంటి పరిసరాల్లో ఒక మహిళ, ఆమె నలుగురు పిల్లలు నడుస్తూ ఉండటాన్ని కూడా చూసినట్లు చెబుతారు. ప్రస్తుతం ఈ ఊళ్లో దాదాపు వెయ్యిమంది మాత్రమే మిగిలారు. ఈ ఊళ్లో విక్టోరియన్ నిర్మాణశైలికి అద్దంపట్టే పలు ప్రాచీన భవంతులు ఇప్పుడు పాడుబడిన స్థితికి చేరుకుని, భూత్ బంగ్లాలను తలపిస్తాయి. అతీంద్రియ శక్తులపై ఆసక్తిగల కొందరు పర్యాటకులు అప్పుడప్పుడు ఈ ఊరికి వస్తూ పోతుంటారు. -
సింపుల్ దుస్తులనే కొంటా!
పేరుకే స్టార్ కాని, సింప్లిసిటీ, సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ, తను చేసే ఫ్యాషన్ ఎంపికలే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ట్రెండ్స్కు దూరంగా, తనకిష్టమైన స్టయిల్ను నమ్ముతూ ముందుకెళ్లే కాజల్ అగర్వాల్ ఫాలో అయ్యే ఫ్యాషన్ టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం!డ్రెస్.. బ్రాండ్: కోరస్ ధర రూ. 36,800జ్యూలరీ బ్రాండ్: హైబా జ్యూవెల్స్ధర: రూ. 40,000బెల్ట్ బ్రాండ్: గూచిధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.వన్ టైమ్ వేర్ నాకు నచ్చదు. సింపుల్ దుస్తులనే కొనుగోలు చేస్తాను. అందులోనూ జ్యూయెల్ టోన్స్ అంటే చాలా ఇష్టం. వాటిల్లోనే గ్లామర్, సౌకర్యం రెండూ దొరుకుతాయి. చర్మ సౌందర్యం కోసం ప్రతి రోజు కోకోనట్ వాటర్ను ఐస్ క్యూబ్లా ఫ్రీజ్ చేసి ముఖంపై రుద్దుతాను. అప్పుడు చర్మం హైడ్రేటెడ్గా, ఫ్రెష్గా ఉంటుంది. కట్టిపడేసే అందం!కదిలే నడుమును కట్టిపడేసే అందాల మంత్రం ఈ బెల్ట్! ముఖ్యంగా మిడీ డ్రెస్సుకు ప్రాణం పోసే యాక్సెసరీగా ఇది పనిచేస్తుంది. పూర్వం బెల్ట్ను బరువులు, ఆయుధాలు తగిలించుకునేందుకు మాత్రమే ఉపయోగించేవారు కాని, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ఫార్మల్, ఫంక్షన్ రెండింటినీ మిక్స్ చేస్తూ ఒక స్టేట్మెంట్ పీస్గా మారింది. ప్రధానంగా పురుషుల దుస్తుల భాగంగా ప్రాచుర్యం పొందిన బెల్ట్, ఇప్పుడు మహిళల డ్రెస్సులపై నడుము ఆకృతిని హైలైట్ చేసే స్టయిల్ ఎలిమెంట్గా నిలుస్తోంది. ఇది నడుమును స్పష్టంగా చూపిస్తూ, మొత్తం అవుట్ఫిట్ను షేప్లోకి తీసుకొచ్చే మ్యాజిక్లా పనిచేస్తుంది. బెల్ట్ బకిల్ దగ్గర ఉండే డీటైల్స్, డిజైన్స్ మెరుస్తున్న టచ్తో కలిసి అందరి చూపును నేరుగా నడుము వైపు లాక్కుంటాయి. ఫ్లోయీ లేదా ఏలైన్ మిడీ డ్రెస్సులపై ఇలాంటి వైడ్ బెల్ట్లు ఎంతో బాగా సూట్ అవుతాయి. అంతేకాదు, లూజ్ డ్రెస్సులకు కూడా ఇవి ఇన్ స్టంట్గా హగ్గింగ్ టచ్ను ఇస్తాయి. డిజైన్స్, స్టయిల్స్ పరంగా మార్కెట్లో ఎన్నో వెరైటీల్లో ఇవి సులభంగా అందుబాటులో ఉన్నాయి. – కాజల్ అగర్వాల్ . -
ఇది ప్రభాస్ గిఫ్ట్
బలమైన క్రమశిక్షణతో పెరిగిన మనసు, కళను ప్రేమించే హృదయం ఈ రెండింటి మధ్య సమతుల్యతే ఆమె వ్యక్తిత్వం. భాషలు మారినా, పాత్రలు మారినా తన అసలైన స్వరాన్ని మాత్రం కోల్పోని నటి రిద్ధి కుమార్. ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే..⇒ ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, ఫోకస్, దేనికైనా ఈజీగా అడాప్ట్ అవడం అన్నీ సహజంగానే అలవాటయ్యాయి.⇒ భాషలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, ఫ్రెంచ్ సహా ఏడు భాషలు మాట్లాడగలను. కొత్త భాష అంటే నాకు కొత్త ప్రపంచం.⇒ మిస్ యూనివర్స్ ఇండియా వైల్డ్కార్డ్గా తిరిగి రావడం నాకే ఒక సర్ప్రైజ్. నటనతో పాటు నేనెవరో మళ్లీ గుర్తు చేసిన అనుభవం అది. అదే నన్ను సినిమాల్లోకి కూడా తీసుకొచ్చింది. ⇒ తొలిసారి ‘లవర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను. తర్వాత ‘అనగనగా ఓ అతిథి’, ‘రాధే శ్యామ్’ చేశాను. ఇలా ప్రతి సినిమా నాకు ఒక పాఠమే. ⇒ కెమెరా ముందు నటించడమే కాదు, కెమెరా వెనుక ప్రపంచాన్ని చూడడం కూడా నాకు చాలా ఇష్టం. ఫొటోగ్రఫీ చేస్తూ ‘ఈ క్షణం మళ్లీ రాదు’ అని అనిపిస్తుంది. ⇒ ట్రావెల్ అంటే టూరిస్టు స్పాట్స్ కంటే ‘హిడెన్ జెమ్స్’ నాకు ఎక్కువ ఇష్టం. ఇటీవల అహ్మదాబాద్ ఓల్డ్ సిటీ వైబ్స్ నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ⇒ పుస్తకాలు నా బలహీనత. చదివే సమయం లేకపోయినా, కొనకుండా ఉండలేను. ఫిలాసఫీ అంటే నాకు చాలా ఆసక్తి.⇒ ఎంత బిజీగా ఉన్నా చదువు మాత్రం వదల్లేదు. 2025లో కూడా మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ చేస్తున్నాను.⇒ స్కిన్ కేర్ విషయంలో కొన్ని తప్పులు చేశాను. మేకప్తోనే నిద్రపోవడం, వేడి నీళ్లతో ముఖం కడగడం ఇవన్నీ ఇప్పుడిప్పుడే మానేసి కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాను.⇒ ఫ్యాషన్ విషయంలో నా స్టయిల్ మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం దేసీ స్టయిల్ ఇష్టం. ముఖ్యంగా చీరలో ఉన్న అందం వేరే లెవల్. ఇప్పుడు నేను కట్టుకున్న చీర ప్రభాస్ గిఫ్ట్గా ఇచ్చిందే. ఇది వేసుకున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ⇒ నేనొక పెద్ద ఫూడీ. పుణేలోని ఒక టిబెటన్ స్ట్రీట్ ఫుడ్ స్పాట్ నాకు చాలా ఇష్టం. మోమోస్, థుక్పా అంటే ప్రాణం. అలాగే నెయ్యి దోశ, నెయ్యి కారంపొడి ఇడ్లీ, ఫిల్టర్ కాఫీ ఉంటే చాలు.⇒ ప్రతి ఒక్కరికీ కొన్ని ఆధ్యాత్మిక ట్రిప్స్ చాలా అవసరం. అలా శంకరాచార్య ఆలయంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.⇒ 2025 నాకు చాలా స్పెషల్. ‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్తో కలిసి నటించడం నా కెరీర్లో పెద్ద అడుగు. అలాగే ఈ న్యూ ఇయర్కు మరాఠీ సినిమాతో కొత్త ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టబోతున్నాను. -
రక్త నమూనాలతో రూఢి!
ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ పక్కన ఉన్న పార్కులో డిసెంబర్ 14న యూదులపై కాల్పుల సంఘటన తెలిసిందే! ఐసిస్ ఉగ్రవాదులైన తండ్రీ కొడుకులు జరిపిన ఈ కాల్పుల్లో పద్నాలుగు మంది మరణించారు. కాల్పులు జరిపిన వారిలో తండ్రి సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ పాతబస్తీలోని దూద్బౌలి. ఇలాగే అప్పుడప్పుడు జరిగే ఉగ్రవాద చర్యల్లో విదేశాల్లో ఉన్న భారత ఉగ్రవాదుల పాత్రలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటివారిలో జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబు జిందల్ ఒకడు. ముంబైలో జరిగిన 26/11 దాడుల్లో కీలక పాత్రధారి. ఇతడి గుర్తింపును రక్తనమూనాల ద్వారా నిఘా వర్గాలు రూఢి చేసుకుని, సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్పై తీసుకువచ్చాయి.ముంబైలో 26/11 దాడులు జరిగిన రెండున్నరేళ్ల వరకు అబు జిందల్ పాత్రను నిఘావర్గాలు గుర్తించలేదు. పాకిస్తాన్లోని కరాచీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్స్ నుంచి ఇక్కడి ఉగ్రవాదులకు ఆదేశాలు ఇచ్చిన వారిలో ఇతడూ ఉన్నాడని కనిపెట్టలేకపోయారు. అయితే, తమపై కూడా ఇదే తరహా దాడులు జరగవచ్చనే భయంతో అమెరికా అనేక కోణాల్లో నిఘా ముమ్మరం చేసింది. ఫలితంగా అబు జిందల్ పేరు వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియాలో లొకేట్ అయిన ఈ గజ ఉగ్రవాదిని భారత్కు రప్పించడంలో వాయిస్ శాంపిల్స్, బయోలాజికల్ ఎవిడెన్స్ కీలక పాత్ర పోషించాయి. మహారాష్ట్రంలోని భీండ్ జిల్లాకు చెందిన సయ్యద్ జబియుద్దీన్ అన్సారీ అలియాస్ అబు జిందల్ నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. నగరంలోని టోలిచౌకీలో కొన్నాళ్లు నివసించిన ఇతగాడు దిల్సుఖ్నగర్లోని ఓ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ కోర్సు చేశాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2006 నాటి ఔరంగాబాద్ ఆర్మ్స్ హౌల్ కేసులో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న జిందల్ పాకిస్తాన్కు మకాం మార్చాడు. ఉగ్రవాద నేత ఇలియాజ్ కశ్మీరీ ద్వారా లష్కరే తోయిబాతో (ఎల్ఈటీ) సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని, తన పేరును రియాసత్ అలీగా మార్చుకున్నాడు. ఎల్ఈటీ కమాండర్ హోదాలో రావల్పిండి యూనివర్సిటీ క్యాంపస్లోని సంస్థ కార్యాలయంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అబు జిందల్ ఫేస్బుక్ ద్వారా యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లించేవాడు. ఈ నేపథ్యంలోనే 26/11 దాడుల కోసం ఏర్పాటైన ఉగ్రవాద బృందానికి అవసరమైన స్థాయిలో మరాఠీ నేర్పించడంతో పాటు ముంబై భౌగోళిక పరిస్థితులపై అవగాహనæ కలిగించే బాధ్యతలు ఎల్ఈటీ ఇతడికి అప్పగించింది. ముంబై మారణహోమంలో పాల్గొన్న ఉగ్రవాదులకు కరాచీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి అనేక సూచనలు ఇచ్చాడు. జిందాల్ ఈ ఆపరేషన్లో అబు ఖాషిఫ్ పేరుతో పని చేశాడు. కమ్యూనికేషన్ కోసం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ)ని మార్గంగా ఎంచుకున్నారు. దీంతో భారత నిఘా వర్గాలకు జిందాల్కు సంబంధించిన వాయిస్ శాంపిల్స్ సేకరించగలిగారు. అప్పట్లో 26/11 ఉగ్రవాదుల వద్ద నాగోలు చిరునామాతో పాటు దిల్సుఖ్నగర్లోని ఓ కాలేజీ పేరుతో ఉన్న గుర్తింపు కార్డులు లభించాయి. వీటిని తయారు చేసి ఇచ్చింది కూడా అబు జిందలే! ఇలాంటి దాడులు తమపైనా జరగవచ్చని భావించిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ భారత్ నుంచి ఉగ్రవాదుల వాయిస్ శాంపిల్స్ సేకరించి, వేట ప్రారంభించింది. మరోపక్క ఎల్ఈటీలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు అనుమానిస్తున్న జిందల్ కదలికలను 2009లో గుర్తించింది. అనేక దేశాల్లో అమెరికా ఏర్పాటు చేసిన పర్సనల్ ఐడెంటిఫికేషన్ సెక్యూర్ కంపర్షన్ అండ్ ఎవల్యూషన్ సిస్టం (పీఐఎస్సీఈఎస్) ద్వారా జిందాల్ కదలికలు పాకిస్తాన్తో పాటు సౌదీ అరేబియాలో ఉన్నట్లు తెలుసుకుంది. 2009లోనే రియాసత్ అలీ పేరుతో పాకిస్తాన్ నుంచి పొందిన పాస్పోర్ట్తో జిందల్ సంచరిస్తున్నాడని గుర్తించి రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా)కు పూర్తి ఆధారాలతో సమాచారమిచ్చింది. అబు జిందల్ 2011 ఏప్రిల్లో పాక్ నుంచి దుబాయ్ చేరుకున్నట్లు గుర్తించిన సీఐఏ ఈ విషయంపై ‘రా’కు సమాచారమిచ్చి అతడిని ట్రాకింగ్లో ఉంచింది. సౌదీ–భారత్ల మధ్య నేరస్తుల మార్పిడి ఒప్పందం ఉన్నా, అందుకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తప్పనిసరి. తమకు వాంటెడ్గా ఉన్న జిందలే ఈ రియాసత్ అలీ అని చెప్పడానికి భారత నిఘా వర్గాల వద్ద వాయిస్ శాంపిల్స్ తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. దీని కోసం జిందల్ సంబంధీకుల రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించుకుంది. వీటిని సౌదీలో ఉన్న జిందల్ నమూనాలతో సరిపోల్చి బయోలాజికల్ ఎవిడెన్స్ రూపొందించేందుకు సిద్ధపడి సీఐఏ సహాయం కోరింది. జిందల్ సంబంధీకుల రక్తనమూనాల సేకరణకు ఎన్ఐఏను రంగంలోకి దింపిన ‘రా’ భీండ్ జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అనేక ప్రాంతాలతో పాటు జిందల్ స్వస్థలమైన జియోరాయ్లోనూ వాక్సినేషన్ పేరుతో అనేక మంది రక్తనమూనాలు సేకరించింది. ఈ రకంగా జిందల్ తల్లి నుంచి రక్తనమూనాలు సేకరించిన అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేయించారు. దీనికి సంబంధించిన అధికారిక నివేదికలను సీఐఏకు పంపారు. జిందల్ రక్తనమూనాల సేకరణ కోసం సీఐఏ సౌదీ అరేబియా పోలీసుల సహాయం తీసుకుంది. రియాసత్ అలీ పేరుతో బోగస్ పాస్పోర్ట్తో జిందాల్ ప్రయాణిస్తున్నాడని అక్కడి వారికి సమాచారం ఇవ్వడం ద్వారా అదుపులోకి తీసుకునేలా చేసింది. ఆ దేశ చట్టాల ప్రకారం నిందితులు, అనుమానితులకు సంబంధించిన పూర్తి నమూనాలు తీసుకునే అవకాశం ఉండటంతో సౌదీ పోలీసులు జిందల్ రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయడంతో పాటు నివేదికలను సీఐఏకు అందించారు. వీటిని భారత్ పంపిన జిందల్ కుటుంబీకుల నమూనాలతో పోల్చిన సీఐఏ జబియుద్దీన్ అన్సారీ, అబు జిందల్, అబు ఖాషిఫ్, రియాసత్ అలీ ఒక్కరేనని నిర్ధారిస్తూ ‘రా’కు సమాచారం ఇచ్చింది. ఈ నివేదికల ఆధారంగా సౌదీ పోలీసులను సంప్రదించిన ‘రా’ అధికారులు 2012 జూన్లో జిందల్ను భారత్ తీసువచ్చి అరెస్టు చేయగలిగారు. ∙ -
ఈ వారం కథ: డార్క్ లైఫ్
రాత్రి పదకొండు గంటలైంది. ఆత్రుతగా కారు బయటకు తీశాడు సంజయ్. అతని ముఖం నిండా ఆందోళన. దారికి ఇరువైపులా జాగ్రత్తగా గమనిస్తూ కారు వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. అంతటా నిర్మానుష్యంగా వుంది. ‘ఎటు వెళ్ళాడో?... ఎక్కడ ఉన్నాడో?’ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. క్షణక్షణం గుండె వేగం పెరుగుతోంది. ఓ చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మరో చేత్తో డాష్ బోర్డ్ మీద నుండి సెల్ఫోన్ తీసుకున్నాడు. నంబర్ డయల్ చేశాడు. ‘‘దిస్ నంబర్ ఈజ్ స్విచ్డాఫ్’’ అని వచ్చింది. చిరాకుగా సెల్ పక్కకు విసిరేసి, కారును మరో వీధివైపు తిప్పాడు. ఆలోచనలతో తడుస్తున్నాడు. రెండు గంటల క్రితం ఇంట్లో జరిగిన సన్నివేశాలు ఒక్కొక్కటిగా సినిమా రీలులా మెదడులో తిరుగుతున్నాయి. ‘‘ఎంతైనా అలా చేసి ఉండకూడదేమో... కాస్త ఓపిక పట్టాల్సింది... ఇంకోసారి మెల్లగా చెప్పాల్సింది. సహనం కోల్పోయి తప్పు చేశానా?’’ తన వైపు నుంచి కూడా ఆత్మ పరిశీలన చేసుకోసాగాడు. దాదాపుగా టౌన్ అంతా చుట్టేశాడు. అతని అన్వేషణ ఫలించలేదు. ఇక మిగిలింది టౌన్ చివరన ఉన్న బైపాస్ రోడ్డు ఏరియా. అది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ఎక్కువశాతం గుట్టలు, చెట్లు ఉన్నాయి. దూరం దూరంగా అక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లు తప్ప పెద్దగా జనావాసం లేదు.‘అటు వెళ్లాలా? వద్దా?’ నిర్ణయించుకోలేక కారు ఆపాడు. తల సీటు మీదకు వాల్చి, జుట్టులోకి చేతివేళ్ళు పోనిస్తూ గట్టిగా నిట్టూర్పు విడిచాడు. ఇంతలో సెల్ రింగైంది. చటుక్కున అందుకున్నాడు. ‘‘హలో.. జానూ..’’ అన్నాడు.‘‘ఏమండీ... కనిపించాడా?’’ దుఃఖ ప్రవాహం కొనసాగుతుందనడానికి సూచనగా ఆమె గొంతు గాద్గదికంగా పలికింది. ‘‘లే...దు... నువ్వు కంగారుపడకు.. దొరకడమే ఆలస్యం బతిమాలి తీసుకొస్తాను...’’ జవాబు చెప్పలేక చెప్పాడు. అతని గుండెలో భారం పెరుగుతోంది. టైం చూశాడు. రాత్రి పన్నెండు. ఫోన్ చేయడానికి సమయం కాకపోయినా, తప్పని పరిస్థితి కాబట్టి, కాంటాక్ట్ నంబర్స్లోని కొన్ని నంబర్స్కు డయల్ చేశాడు. రింగ్ మోగి మోగి అలసిపోయిందే కాని, అటునుంచి స్పందన లేదు. చిరాకుగా స్క్రీన్ పైకి కిందకు జరుపుతుంటే తెలిసిన నంబర్ ఇంకోటి కనిపించింది. రింగ్ చేశాడు... ఎత్తలేదు. మళ్ళీ రింగ్ చేశాడు... మళ్ళీ... చివరి ప్రయత్నంలో ‘‘హలో... ఎవరండీ...’’ నిద్ర మత్తులో పలికిందా గొంతు.‘‘బాబూ... నేను రాహుల్ వాళ్ళ ఫాదర్ని... మావాడు నీ దగ్గరకు ఏమైనా వచ్చాడా?’’‘‘లేదంకుల్... రాలేదు...’’‘‘బాబూ ప్లీజ్... ఒక్క హెల్ప్ చేయవా... వాడి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా వుంటే వాళ్ళ నంబర్స్ పంపవా..’’ వేడుకోలుగా అడిగాడు.‘‘మేము తప్ప వాడికి ఎవరు లేరు... అయినా ఈ టైం లోపల ఇంటికే వస్తాడు కదా అంకుల్... రాలేదా...?’’‘‘........’’‘‘అంకుల్... ఏమైంది...? మాట్లాడండి...’’చెంపలపై జారిన కన్నీళ్ళు తుడుచుకుంటూ ‘‘ఆ.. బాబూ... నైట్ మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాడు కోపంతో వెళ్ళిపోయాడు.’’‘‘సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలకు వాడలా చేయకూడదు అంకుల్. మేము కూడా చాలాసార్లు చెప్పాం, వాడు వినట్లేదు. ఈ మధ్య పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు.’’‘‘అవును బాబూ... నువ్వన్నది కరెక్టే... ఈరోజూ అలాగే చేశాడు. నేను చనిపోతానని బెదిరిస్తూ ఇంట్లో నుండి వాడి కారు వేసుకొని వెళ్ళిపోయాడు. కోపం తగ్గాక వస్తాడులే అని రెండు గంటల సేపు ఎదురు చూశాను. రాకపోగా సెల్ స్విచాఫ్ పెట్టాడు. నాకెందుకో భయంగా వుంది. టౌన్ మొత్తం తిరిగినా వాడు కనిపించలేదు. మీ దగ్గరికి కాకుండా ఇంకెక్కడికి వెళతాడో నీకేమైనా తెలుసా’’ అతని గొంతులో సన్నటి వణుకు. ‘‘నా....కు... ఆ... పెద్దగా గుర్తు లేదు కానీ ఒక్కసారి మాత్రం బైపాస్ రోడ్ దాటిన తరువాత గుట్ట మీదకు తీసుకుపోయాడు. అదే ఫస్టండ్ లాస్ట్’’ చెప్పడం పూర్తి కాకముందే....‘‘థాంక్యూ బాబూ...’’ ఠక్కున ఫోన్ కట్ చేశాడు. కారు స్టార్ట్ చేసి బైపాస్ రోడ్వైపు పోనిచ్చాడు.మట్టి రోడ్డు కావడం వలన గుంతలు ఎక్కువగా వున్నాయి. అక్కడక్కడా రాళ్ళు... కారు వేగంగా నడపలేకపోతున్నాడు. ఇక లాభం లేదనుకొని... కారు ఆపి నడక మొదలెట్టాడు. వీధిలైట్లు లేవు. ఇల్లు కూడా ఎక్కడో ఒకటి. అవి దాదాపు పూరి పాకలే. వెలుతురు సరిగా లేదని సెల్లులో టార్చిలైట్ ఆన్ చేశాడు. కొంత దూరం పోయాక అడుగుల శబ్దానికి కుక్కలు మేల్కొన్నాయి. ‘‘భౌ.. భౌ..’’మంటూ మొరగసాగాయి. ఒళ్ళు ఝల్లుమంది అతనికి. వెనక్కి పరుగెత్తాలన్నంత భయం వేసింది. చేతిలోని వెలుగును పరిసరాల మీదకు తిప్పాడు. అల్లంత దూరంలో పూరిపాక. దానిముందు ఓ వ్యక్తి కూర్చున్నాడు. ముఖం సరిగ్గా కనపడ్డం లేదు. ఇంత రాత్రి వేళ నిద్ర పోకుండా ఎవరు ఉంటారు? కచ్చితంగా తన కొడుకేనని అనుకున్నాడు.ఈ లోపు కుక్కలు అరుచుకుంటూ మీదకి వురికొస్తున్నాయి. ఐనా భయపడ్లేదు. ఏమైనా గానీ అనుకొని... ‘‘రాహుల్...’’ అనుకుంటూ పరుగు మొదలెట్టాడు. కుక్కల్ని ఎలా దాటాడో అర్థం కాలేదు క్షణాల్లో పాకను చేరుకున్నాడు. అక్కడ రాహుల్ లేడు, వేరే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. పాకలోని ఎర్రని బల్బు కాంతి తలుపు సందులోంచి కూర్చున్న వ్యక్తి ముఖంపై సన్నగా పడుతోంది. కళ్ళు ఎండిపోయిన కాలువల్లా వున్నాయి. మాసిన బట్టలు... పెరిగిన జుట్టుతో వున్నాడు. అతని ఆహార్యం చూడగానే తొలుత భయం వేసింది. కాని, అవసరం తనది కాబట్టి మాట్లాడక తప్పలేదు. ‘‘హలో... నాకో హెల్ప్ చేస్తారా?’’ వేడుకోలుగా అడిగాడు సంజయ్.పాకముందు కూర్చున్న వ్యక్తిలో చలనం లేదు. తన ముందు ఎవరూ లేనట్టు, తనకేమీ వినబడనట్టు ఉన్నాడు. ‘‘స్పృహలో వున్నాడా? లేక పిచ్చివాడా?’’ ఆశ్చర్యమూ, అనుమానమూ రెండు కలిగాయి సంజయ్లో. ‘‘హలో మిత్రమా మిమ్మల్నే... నాకో హెల్ప్ చేస్తారా?’’ మళ్ళీ అడిగాడు. అదే పరిస్థితి... సమాధానం లేదు... కనీసం చూడనూలేదు. ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. ఈలోపు మెసేజ్ సౌండ్ వినపడింది. రెప్పపాటులో మెసేజ్ చూశాడు. ‘‘సారీ డాడ్ నన్ను క్షమించు...’’. వెన్నులో వణుకు పుట్టింది. గబ గబా ముందుకు నడిచాడు. తెలియని పరిసరాలు. పైగా ఇవన్నీ కొత్త. తన పనే తనకు లోకంగా బతికినవాడు. తానెప్పుడూ ఇలా బయటకు రాలేదు. మరల పాక దగ్గరికి వచ్చాడు. రాహుల్ నంబర్కు డయల్ చేశాడు. ‘‘మీరు కాల్ చేస్తున్న నంబర్ కవరేజ్ ఏరియాలో లేదు’’ వాయిస్ రికార్డింగ్ వినపడగానే అతనిలో దుఃఖం ఆగలేదు. ఎలుగెత్తి ఏడ్వసాగాడు. అయినా కూర్చున్న వ్యక్తి కదల్లేదు.. మెదల్లేదు. సంజయ్ ఏడుపుకు పూరిపాక తడిక తెరుచుకుంది. అందులోంచి ఆవులిస్తూ ఒకావిడ బయటకు వచ్చింది. ఎదురుగా కూర్చున్న భర్తను చూసింది. మామూలుగానే ఉన్నాడు. ‘మరి ఏడ్చేదెవరు?’ అనుకుంటూ ఏడుపు వస్తున్న వైపు పరిశీలించింది. ఓ అపరిచిత వ్యక్తి. ‘గొప్పింటాయనలా ఉన్నాడు, పైగా ఏదో కష్టంలో ఉన్నాడు’ అనుకుంది. ‘‘ఇగో నిన్నే పైకి లే...’’ భర్త భుజాలు పట్టుకుని గట్టిగా ఊపింది. మెల్లగా ఈ లోకంలోకొచ్చాడు. ‘‘మూడు నెలల నుంచి ఇదే వరస. నిద్ర పట్టనప్పుడల్లా ఇలా ఆలోచనలో మునిగి నిన్ను నీవే మరచిపోతే ఎలాగయ్యా... త్వరగా పైకి లేవయ్యా! ఎవరో పెద్దాయన కావొచ్చు ఒకటే ఏడుస్తున్నాడు’’ అంటూ తొందర పెట్టింది.తాను ఆనుకున్న పందిరి గుంజను ఆసరాగా పట్టుకుని లేచాడు. ‘‘ఎక్కడ?’’ అంటూ ముందుకు కదిలాడు. ‘‘అదిగో’’ అంటూ దీపం పెట్టి చూపించింది. ఇద్దరూ దగ్గరకు పోయారు. అతన్ని పరిశీలనగా చూసారు. పెద్ద ఆఫీసర్లా ఉన్నాడు. ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. కాసేపు మౌనంగా వున్నారు. పాకతని భార్య నోరు తెరిచింది. ‘‘ఎవరు సార్ మీరు... ఎందుకేడుస్తున్నారు?’’ అన్నది.అంత రాత్రివేళ మనుషుల ఆసరా దొరకడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ‘‘నా కొడుకు కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పైగా చనిపోతానని బెదిరించాడు. టౌనంతా వెదుకుతూ వచ్చాను. ఎక్కడా లేడు. మిగిలింది ఈ ఏరియా మాత్రమే. ఇక్కడ చూస్తే దారి లేదు. చీకటిలో ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. వాడు ఇటు వైపే వచ్చుంటాడని నా అనుమానం... ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా... నా కొడుకు ప్రాణాలు కాపాడరా... వాడు లేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను’’ ప్రాధేయపడ్డాడు.సంజయ్ నోటి వెంట కొడుకు ప్రాణాలు అనే మాట వినగానే అప్పటి వరకు రాయిలా ఉన్న పూరిపాక వ్యక్తి చలించిపోయాడు. మరో ఆలోచన లేకుండా భార్యను లోపలికి వెళ్ళమని చెప్పి, ‘‘నాకు తెలియని చోటు లేదు సార్! చూసొద్దాం పదండి’’ అంటూ ఇంట్లోకెళ్ళి టార్చ్ తీసుకొచ్చాడు. తాను ముందు నడుస్తుంటే, సంజయ్ వెనుక నడవసాగాడు. ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లను దాటి కొంతదూరం వెళ్ళారు. అక్కడో కారుంది. కారును చూడగానే వెనుక నడుస్తున్న వాడల్లా జింకలా పరుగెత్తాడు సంజయ్. కారు ఖాళీగా వుంది. భయంతో అతని ముఖం నిండా చెమటలు పట్టాయి. ‘‘రాహుల్... నా బంగారం... నన్ను మన్నించరా... నాతో వచ్చెయ్ నిన్నేమీ అనను’’ అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు సంజయ్. ఆ అరుపులు, ఏడుపులు, పెడబొబ్బలు వింటుంటే పూరిపాక వ్యక్తి చలించిపోయాడు. నోరు తెరవలేకపోయాడు. టార్చ్ వెలుతురు చూపించి పదమన్నట్లు సైగ చేస్తూ ముందుకెళ్ళాడు. సంజయ్ అతన్ని అనుసరించాడు. సుమారు అర కిలోమీటరు దాటిన తరువాత ఎడమ వైపు తిరిగి గుట్ట దగ్గర ఆగాడు పాకతను. అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. ‘‘ఏమైంది’’ కంగారుగా అడిగాడు సంజయ్.‘‘ఏమీ లేదు’’ అంటూ గట్టిగా ఊపిరి పీల్చి, వదిలాడు. ఇద్దరూ ఇంకాస్త ముందుకుబోయారు. ఎదురుగా పురాతనమైన బావి. గబుక్కున బావి గోడ పట్టుకుని లోపలికి తొంగి చూశాడు సంజయ్. పాకతని చేతిలోని టార్చ్ తీసుకొని ఆత్రంగా వెదకసాగాడు. బావి వాడకంలో లేదనడానికి రుజువుగా పెరిగిన చెట్లు దర్శనమిచ్చాయి. బావి కింది భాగంలోనుండి ‘‘అ...మ్మా.. అ...మ్మా...’’ మూలుగులు. ‘‘అదిగో... రాహుల్... నా కొడుకు... ఈ టార్చ్ పట్టుకో...’’ అంటూ లోపలికి దిగే ప్రయత్నం చేయబోయాడు సంజయ్. ‘‘ఓ... ఆగండాగండి... భలేవారే... ఈ బావి గురించి తెలుసా మీకు... మనిషి లోపలికి పోతే ప్రాణాలు పైకి పోవడమే...’’ వెనక్కిలాగాడు పాకతను.‘‘అంత లోతుందా...?!’’ ఆశ్చర్యపోయాడు సంజయ్. ‘‘లోతొక్కటే కాదు... అడుగున తాచు పాములున్నాయి. బావిలో పడితే జీవితం ఖతమే’’ అంటూ టార్చ్ తీసుకొని ప్రక్కనున్న చెట్లవైపు పోయాడు. చాలాసేపు వెతికాడు. ‘హమ్మయ్యా! ఇక్కడే వుంది’ అనుకుంటూ కుప్పలా పడున్న తాడు తీసుకొని బావి దగ్గరకు వచ్చాడు. పక్కనే వున్న చెట్టుకు తాడు కట్టి మిగిలినది బావిలోకి విసిరాడు. తాడు పడిన వెంటనే పాములు బుసలు కొడుతున్న శబ్దం రాసాగింది. ‘‘లోపల ఎలావుందో విన్నారుగా’’ అంటూ బావి చుట్టూ టార్చ్ తిప్పుతూ సంజయ్ కొడుకును చూశాడు.బావి మధ్యలో చెట్ల కొమ్మలకు చిక్కుకున్నాడు. అదృష్టవశాత్తూ తాడు కట్టిన వైపే వున్నాడు. తనకి గతంలో ఆ బావిలో దిగిన అనుభవం ఉంది. కానీ పొరపాటున జరగరానిదే జరిగితే ఇద్దరి ప్రాణాలకూ ముప్పు. పైగా అర్ధరాత్రి దాటింది. అప్పటికే మూడు రోజులు నుండి సరిగా నిద్ర పోలేదు. నీరసంగా ఉన్నాడు. కానీ కన్నబిఢ్డ కోసం ఓ తండ్రి పడే వేదన తనకు బాగా తెలుసు. అందుకే వెనకా ముందూ ఆలోచించకుండా తువాలును నడుముకు కట్టుకుని, దాని మధ్యలో టార్చ్ పెట్టుకొని చిన్నగా వేలాడాడు. అతి కష్టం మీద అబ్బాయి వున్న చోటికి చేరుకున్నాడు. ఎన్నో ప్రయత్నాల పిదప ఇద్దరి నడుములకు తాడును బిగించాడు. ‘‘పైకి లాగండి... సార్’’ అంటూ గట్టిగా అరిచాడు. ఇద్ధరిని లాగడమంటే చాలా కష్టం. చావు బతుకుల పోరు కాబట్టి శక్తినంతా కూడగట్టుకుని మెల్ల మెల్లగా పైకి లాగాడు సంజయ్. క్షేమంగా కొడుకు బయటకు రావడంతో సంజయ్ ఆనందానికి అవధుల్లేవ్. రాహుల్ను వాటేసుకుని ముద్దులు పెట్టాడు. ‘‘మీరు దేవుడండి...! మీరు లేకపోతే నా కొడుకు నాకు దక్కేవాడు కాదు.’’ పాకతన్ని గుండెలకు హత్తుకొని కృతజ్ఞతలు చెప్పాడు సంజయ్. ఉన్నట్లుండి పాకతని కళ్ళెంట కన్నీటి ధారలు. సన్నగా మొదలైన ఏడుపు బిగ్గరగా ఏడస్తున్నాడు. ఆర్తధ్వని చేస్తున్నాడు. సంజయ్, రాహుల్లు స్థాణువులైనారు. అతనికేమైందో అంతుపట్టడం లేదు. ‘‘ఫ్లీజ్...! ఆగండీ...’’ ఓదార్చే ప్రయత్నం చేసాడు సంజయ్. పది నిమిషాలు గడిచాయి. ‘‘ఏమైంది?’’ అన్నాడు మళ్ళీ సంజయ్. ‘‘నా కొడుకయ్యా... కొడుకు....’’ గుండెలు బాదుకోసాగాడు పాకతను.‘‘అయ్యో!.... కంట్రోల్ చేసుకోండి... ఏం జరిగిందో చెప్పండి’’ సంజయ్లో ఆత్రుత మొదలైంది. మరికొన్ని నిమిషాలు గడిచాయి. మెల్లగా నోరు తెరిచాడు పాకతను. ‘‘మాది మామూలు పల్లెటూరు. నేను పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయం చేస్తుండేవాడిని. నాకు పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టలేదు. చాలా ఆసుపత్రులకు వెళ్ళాము. డాక్టర్లు పరీక్ష చేసి, పిల్లలు పుట్టరని చెప్పారు. నేను, నా భార్య కుమిలిపోయాం. ఏ దేవుడు దయచూపాడో తెలియదు కాని, చాలా యేళ్ళకు ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు. మా ఆనందం అంతా ఇంతా కాదు. వాడికి వినయ్ అని పేరు పెట్టుకున్నాం. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాము. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మంచి చదువులు చెప్పించాలని ఈ సిటీకి వచ్చి... ఇగో ఈ మూలకు ఓ గుడిసె వేసుకొని బతుకుతున్నాం. మా ప్రయత్నానికి తగ్గట్లుగా నా కొడుకు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి చదివేవాడు. అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. పీహెచ్డీ చేయడం కోసం హైదరాబాద్ వెళ్ళాడు. మొదటి సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఒకసారి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశాడు. మాకైతే పెద్ద పండగొచ్చినట్లయింది. నా భార్య వాడికి ఇష్టమైన కారçప్పూస, అరిసెలు, గారెలు నాలుగైదు రకాల పిండివంటలు చేసింది. నేను బట్టల షాపుకు వెళ్ళి మూడువేలు పెట్టి కొత్త బట్టలు తెచ్చాను. వాడు బస్టాండ్లో దిగేసరికి రాత్రి పదైంది. ఆరోజు వాడు బస్సు దిగి నా కళ్ళముందు కన్పడగానే నా సంతోషం ఆకాశమంత పెరిగింది. నా కంటే ఎత్తుగా ఎదిగిన కొడుకుని ప్రయాణీకులు అందరూ చూస్తుండగా అమాంతం పైకెత్తుకున్నాను. కొన్ని క్షణాల తర్వాత కిందకు దించి గుండెలకు హత్తుకున్నాను. మా కోటి ఆశల బంగారాన్ని బండిపై ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాను. మేము ఇంట్లోకి రాగానే ‘‘ఇలా చిక్కిపోయావేంట్రా వినయ్...?’’ అంటూ కన్నీళ్ళతో దగ్గరకు తీసుకుంది. అప్పటివరకు నేను కూడా గమనించలేదు. వాడి ముఖమంతా పాలిపోయి వుంది. కళ్ళల్లో జీవం తగ్గింది. లావుగా వుండేవాడు, బాగా చిక్కిపోయాడు. మాకేమీ అర్థం కాలేదు.ఆరోగ్యం ఏమైందోనని గుబులు మొదలైంది నాలో. వాడ్ని దగ్గరకు తీసుకొని ‘‘ఏందిరా... కొడకా? జ్వరమేమైనా వచ్చిందా?’’ అన్నాను. ‘‘అలాంటిదేం లేదు నాన్న, నీళ్ళు మారాయి, ఫుడ్ మారింది... దానివల్లనే కాస్త తగ్గాను.... ఇంతమాత్రం దానికే కంగారుపడతారెందుకు’’ తేలికైన సమాధానంతో మా భయాన్ని పోగొట్టాడు. ‘‘ఏయ్... నేనుబోయి చికెన్ తెస్తానే... పిల్లాడికి వేడి నీళ్ళు పెట్టు’’ అంటూ బయటకు వెళ్ళాను. నేనొచ్చేసరికి స్నానం చేశాడు. నేను తెచ్చిన కొత్త బట్టలు వేసుకున్నాడు. నిమిషాల మీద చికెన్ కూర రెడీ అయ్యింది. అందరం కలిసి భోజనం చేశాం. పిండివంటలు కూడా కొసరి కొసరి తినిపించాం. వాడి చదువు గురించి, చేయబోయే ఉద్యోగాల గురించి చెప్తుంటే మా కష్టానికి తగిన ఫలితం దక్కినట్లేనని సంబరపడుతూ నిద్రలోకి జారుకున్నాము. మాకు చీకటితోనే లేచే అలవాటు. పూర్తిగా తెల్లారలేదు. లేచి చూస్తే మంచం మీద మావాడు లేడు. ఇంత పెందలకడనే ఎటు వెళ్ళాడబ్బా అనుకుంటూ... వాడిని వెతుక్కుంటూ ఈ వైపే వచ్చాను. ఈ బావి వెనకనే రాళ్ళ గుట్టొకటుంది కదా, దాని మీద కూర్చుని ఏదో తాగుతున్నాడు. నేను అడుగులో అడుగేసుకుంటూ దగ్గరగా వెళ్ళాను. నన్ను చూడగానే కంగారుగా పైకి లేచి నిలబడబోయాడు. కానీ నిలబడటం వాడి వల్ల కాలేదు. చూస్తుండగానే కుప్పలా కూలిపోయాడు.నాకు పై ప్రాణాలు పైనే పోయినట్లైంది. వాడి చుట్టూ ఏదో ప్లాస్టిక్ పొట్లాలు... వాటిల్లో తెల్లటి పొడి వుంది. ప్రక్కనే సిగరెట్ బాక్స్, అగ్గిపెట్టె ఉన్నాయి. కదిలించి చూశాను. సోయిలో లేడు. మత్తుగా మూలుగుతున్నాడు. నా గుండె బరువెక్కింది... పైకి లేపి భుజాల మీద వేసుకున్నాను. పరుగు పరుగున ఇంటికి తీసుకొచ్చాను. మంచంలో పడుకోబెట్టాను. మే ఇద్దరం కన్నీరు మున్నీరుగా ఏడ్వసాగాము. కొంత సమయం తర్వాత చుట్టుపక్కల ఉండేవారు. కొంతమంది పోగయ్యారు. మాకు ధైర్యం చెప్పారు. ఆసుపత్రికి తీసుకెళ్ళమని ఆటోను తీసుకొచ్చి, మమ్మల్ని ఆటో ఎక్కించారు. డాక్టర్ పరిశీలించిన తర్వాత మావాడు డ్రగ్స్కు బాగా అలవాటుపడ్డాడని... ఏవేవో టెస్ట్లు చేసి, కొన్ని మందులు రాసిచ్చాడు. ఇకపై జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. గుండెనిండా బాధతో ఇంటికి చేరాము.ఒకసారి నిద్రపోతుండగా వాడి సెల్లులోంచి కాలేజీ సార్కు ఫోన్ చేశాను. ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే వాడి స్నేహితులే వాడి జీవితాన్ని ఆగం చేశారని, డ్రగ్స్ మత్తులో పడి తన భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నాడని అర్థమైంది మాకు. ఇక చదువు సంగతేమో గాని, వాడు మామూలు మనిషి అయ్యేవరకు బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడాలని అనుకున్నాం.మూడు రోజులు గడిచాయి. ఓ రోజు ఉన్నట్లుండి పిచ్చిపట్టినట్లుగా అరుస్తున్నాడు... కేకలు వేస్తున్నాడు... ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా, మమ్మల్ని నెట్టివేసి రాళ్ళ గుట్ట దగ్గరకు పరుగులు తీసాడు. నేను కూడా వేగంగా పరుగెత్తాను. అతి కష్టం మ్మీద వాడ్ని చేరుకున్నాను. డ్రగ్స్ పాకెట్స్ కోసం కాబోలు చుట్టూరా వెతుకుతున్నాడు, జుట్టు పీక్కుంటున్నాడు. వాణ్ణా స్థితిలో చూస్తుంటే నేనెందుకు బతికున్నానా? అనిపించింది.‘‘ఒరేయ్! నా బంగారమో... నాన్నా... నామాటినురా... ఇంటికెళదాం పదా!’’ ఎంతగానో ప్రాధేయపడ్డాను. నా మాట వినిపించుకోలేదు. నన్ను తప్పించుకొని ఈ బావి వైపు వేగంగా పరుగెత్తుకొచ్చాడు.నేను అనుసరించే క్రమంలో పట్టుతప్పి రాళ్ళ గుట్ట మీద నుంచి కిందకు దొర్లుకుంటూ వచ్చాను. మోచేతులు, మోకాళ్ళ నిండా గాయాలైనాయి. అయినా వాటిని లెక్కచేయక నేను చేరుకునే లోపే బావిలోకి దూకేశాడు. పడీ పడటమే పాములు కాటేసినట్లున్నాయి. ‘‘అమ్మా... నాన్నా...!’’ అంటూ గావుకేకలు పెడ్తూ ప్రాణాలు విడిచాడు. నానా తిప్పలుపడి ఎలాగోలా పైకి తీసుకొచ్చాను. ఎర్రగా మారాయి పాకతని కళ్ళు. ‘‘ఇంత బాధలో కూడా అర్ధరాత్రి వేళ నా కోసం ఇంత చేశారంటే... మీరు మనిషి కాదు... మహానుభావులు. ఊపిరున్నంత కాలం కాలాన్ని ఈదడమొక్కటే మనిషి చేయగలిగిన పని. బాధపడకండి... పోదాం... పదండి..’’ పాక దగ్గరకు తీసుకొచ్చాడు సంజయ్.సంజయ్ కొడుకు దొరికినందుకు సంతోషపడ్తూ... మరో వైపు తన కొడుకు గుర్తుకొచ్చి పాకతని భార్య కూడా కన్నీటిలో మునిగింది. ‘‘చేతికొచ్చిన కొడుకు చూస్తుండగానే వెళ్లిపోయాడు. ఇక మాకు దిక్కెవరు? పిల్లల జీవితాలతో ఆడుకునే ఈ మత్తు పదార్థాలను ఆపేదెవరయ్యా?’’ ‘‘వూర్కోండమ్మా! ఎంత ఏడ్చినా పోయిన ప్రాణం తిరిగిరాదు... మీరింత దుఃఖంలోనూ నాకు చేసిన సాయం ఎప్పటికి మర్చిపోలేను’’ అన్నాడు సంజయ్. రాహూల్ మనసులో పశ్చాత్తాపం మొదలైంది. వినయ్లాగా తన జీవితం కూడా ముగిసిపోతే తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురవుతారోననే అవగాహన తనలో కలిగింది. త్వరగా ఈ డ్రగ్స్ మానేయాలనే ఆలోచన చేయసాగాడు. సంజయ్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న ఒక నంబర్కు డయల్ చేశాడు. ‘‘నమస్తే సార్!’’ అన్నాడు అవతలి వ్యక్తి. ‘‘సురేష్... ఇన్ని రోజులు డ్రగ్స్ మహమ్మారికి డబ్బున్న పిల్లలే బలవుతున్నారని అనుకున్నాను కాని, పేద యువకులు కూడా దారుణంగా బలవుతున్నారు. మన నిఘాను బలోపేతం చేయాలి, డ్రగ్స్ రాకెట్ను నిర్మూలించాలి’’ అన్నాడు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంజయ్. ‘‘ఒరేయ్! నా బంగారమో... నాన్నా... నామాటినురా... ఇంటికెళదాం పదా!’’ ఎంతగానో ప్రాధేయపడ్డాను. నా మాట వినిపించుకోలేదు. నన్ను తప్పించుకొని ఈ బావి వైపు వేగంగా పరుగెత్తుకొచ్చాడు. -రాచమళ్ళ ఉపేందర్ -
కథాకళి: ప్రిన్స్
మా ఎదురింటి ఆయన మరణించాక ఆయన వారసులు ఆ ఇంటిని అమ్మేశారు. దాన్ని పడగొట్టి అపార్ట్మెంట్స్ కట్టడం ఆరంభించడానికి మునుపే ఆగాచారి ఆ స్థలానికి వాచ్మేన్ గా వచ్చాడు. యాసని బట్టి అతనిది కరీంనగర్ జిల్లా అని, అతని వెంట తిరిగే డాషన్ జాతి కుక్క ప్రిన్స్ అతని పెంపుడు కుక్కని త్వరలో గ్రహించాను. దాని విలువ వేలల్లో ఉండొచ్చు. కాబట్టి దాన్ని అతను కొని ఉండడు. దొంగిలించాడా? లేదా ఎవరిదైనా తప్పిపోయి వచ్చిందా? ఆ కుక్కంటే ఆగాచారికి బాగా ప్రేమని అతని చర్యల ద్వారా తెలిసిపోతూంటుంది.ఆగాచారి భార్య వయసు ముప్ఫై, ముప్ఫై ఐదు మధ్య ఉంటుంది. చూస్తే సినిమాల్లో గ్రూప్ డాన్స్ల్లో పాల్గొనే డాన్సర్లా అనిపించింది. కొద్దిగా పక్కకి వెళ్తే, ఆకర్షణీయమైన మొహం, చక్కటి శరీర సౌష్టవం గల డేన్సర్స్ ఎందుకు హీరోయిన్స్ కాలేదా అని నాకు అనిపిస్తూంటుంది.ఓ సోమవారం మధ్యాహ్నం మా ఆవిడ నన్ను అర్జెంట్గా కిటికీ దగ్గరికి రమ్మని అరిచింది. తక్షణం నేను వెళ్తే, అపార్ట్మెంట్స్ కట్టే ఎదురు స్థలంలోని ఆగాచారి షెడ్లోంచి ఏభై పైబడ్డ ఓ వ్యక్తి బయటికి వస్తూ కనిపించాడు. మడత నలగని తెల్లటి ఖాదీ చొక్కా, ఖాదీ పేంట్లోని ఆయన మెడలో బంగారు గొలుసు, చేతికి బంగారు బ్రేస్లెట్ కనిపించాయి. ఆయన బి.ఎం.డబ్ల్యూ. కారు ఎక్కి వెళ్ళాక మా ఆవిడ నిష్టూరంగా చెప్పింది.‘‘చూశారా?’’‘‘ఏమిటి?’’ అడిగాను.‘‘మీకు అర్థం కాలేదా?’’ విసుక్కుంది.దాదాపు రెండున్నర గంటల తర్వాత మా ఆవిడ మళ్ళీ పిలిచింది. కిటికీలోంచి చూస్తే ట్రాలీలో ఇనుప చువ్వలతో వచ్చి వాటిని దింపించే ఆగాచారి కనిపించాడు.‘‘వీడు ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న వీడి భార్య దగ్గరకి ఆ బిల్డర్ ఎందుకు వచ్చాడో ఇప్పుడైనా మీ మట్టిబుర్రకి అర్థమైందా?’’ ఎకసెక్కెంగా అడిగింది.‘‘ఇలాంటివి ఆడవాళ్ళే కనిపెట్టగలరు.’’ నవ్వుతూ చెప్పాను.తర్వాత మా ఆవిడ ఆఫీస్ నించి వచ్చిన నాతో అప్పుడప్పుడు ‘ఆ బిల్డర్ మళ్ళీ ఇవాళ వచ్చి వెళ్ళాడు’ అని చెప్పేది.తరచూ ఆగాచారి మాపై అపార్ట్మెంట్కి వచ్చి, వారిని పచ్చడి ఏదైనా ఇవ్వమని అడిగి తీసుకెళ్తూండటం అలవాటు. ఓరోజు ఆ అపార్ట్మెంట్ ఆయన నాతో చెప్పాడు.‘‘ఆగాచారి ప్రిన్స్ని వంద రూపాయలకి అమ్ముతాడట. కొంటారా? అని అడిగాడు. నాకు ఆసక్తి లేదు. అది అపార్ట్మెంట్లో పెంచుకోతగ్గది. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే కొనొచ్చు.’’‘‘అబ్బే. లేదండి.’’ చెప్పాను.ఆగాచారి మా అపార్ట్మెంట్స్లోని అందర్నీ ప్రిన్స్ని కొనమని అడిగాడు. కాని ఎవరూ కొనలేదు. ఆఖరుగా నన్ను అడిగాడు.‘‘అసలు నీకు అది ఎక్కడిది?’’ అడిగాను.‘‘మా ఊళ్ళో ఒకాయన పొలం పని చేసేవాడిని. ఆయన అమెరికా వెళ్తూ దాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు. ఊరికే ఇస్తే చాలామంది తీసుకుంటారు సార్. కాని డబ్బు ఇచ్చి కొనే వాళ్ళే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని.’’ ఆగాచారి చెప్పాడు. ‘‘ఎందుకు అమ్మదల్చుకున్నావు?’’ అడిగాను. అతను జవాబు చెప్పడానికి తబ్బిబ్బుపడ్డాడు.‘‘మా ఆవిడకి ప్రిన్స్ అంటే ఇష్టం లేదు.’’ చివరికి చెప్పాడు.భార్యని కంట్రోల్ చేయలేని అతని అసమర్థతకి నాకు జాలి వేసింది.‘‘అమ్మేటట్లయితే అంత తక్కువకి అమ్మక. దాన్ని ఐదారు వేలకి అమ్మొచ్చు.’’ సలహా ఇచ్చాను.ఆరోజు నేను ఆఫీస్ నుంచి రాగానే మా ఆవిడ చెప్పింది.‘‘మొత్తానికి ఆగాచారి కుక్కని అమ్మాడండి.’’‘‘ఎంతకి?’’ వెంటనే అడిగాను.‘‘తెలీదు. ఎదురు అపార్ట్మెంట్స్ని కొన్నవాళ్ళలో ఒకతను ఉడ్వర్క్ చేయించడానికి వచ్చిపోతున్నాడు. అతను కొన్నట్లున్నాడు. ఇందాక కారులో ప్రిన్స్ని ఎక్కించి తీసుకెళ్ళడం చూసాను. ఆగాచారి ఎవరో పోయినట్లుగా ఏడ్చాడంటే నమ్మండి.’’ చెప్పింది. ‘‘వాళ్ళ ఆవిడ లోని రెండో చెడ్డ గుణం, ఆ కుక్కని ప్రేమించకపోవడం.’’ చెప్పాను. గంటన్నర తర్వాత మా ఆవిడ టి.వి. చూసే నన్ను పిలిచి చెప్పింది.‘‘చూడండి. మన ఇంటి ముందు పోలీస్ కార్లు ఆగాయి. ఏమైందో కనుక్కురండి.’’నేను వెంటనే చెప్పులు తొడుక్కుని బయటికి వచ్చాను. ఎస్.ఐ. ఆగాచారి షెడ్ ముందు కుర్చీలో కూర్చుని అతని భార్యని ప్రశ్నిస్తూండటం చూసి అక్కడికి వెళ్ళాను.‘‘వాడు కొనుక్కొచ్చింది పురుగుల మందని తెలీదు సారూ. రంగు డబ్బా అనుకున్నా.’’‘‘అది ఎందుకు తాగాడో తెలీదంటావు?’’‘‘తెలీదు సారూ.’’ఆగాచారి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి అదిరిపడ్డాను. అపార్ట్మెంట్ టెర్రేస్లో అతని శవం ఉందని తెలిసింది. ఆగాచారి భార్యలో భర్త పోయినందుకు సహజంగా కనపడాల్సిన దుఃఖం కనపడలేదు.ఆగాచారి ప్రిన్స్ని మనస్ఫూర్తిగా ప్రేమించాడని, తన భార్యకి గల అక్రమసంబంధం గురించి తెలిశాక చావాలనుకుని ముందుగా దాన్ని అమ్మాడని, ప్రిన్స్ని ఎవరూ కొనకుండా ఉంటే అతని ప్రాణం ఇంకొంత కాలం నిలిచేదని నాకు అనిపించింది. -
శంబసాధనుడి వధ
పూర్వం కేసరి అనే వానరుడు ఉండేవాడు. హిమాలయాల దిగువ ప్రాంతంలో రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన అరవైవేల మంది వానర యోధులకు అధినాయకుడు. పార్వతీ పరమేశ్వర భక్తుడైన కేసరి ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు ప్రసన్నుడై, ప్రత్యక్షమైన పరమేశ్వరుడి నుంచి అనేక వరాలు పొందాడు. అదేకాలంలో శంబసాధనుడు అనే అసురుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మను మెప్పించి, అనేక వరాలు పొందాడు. వరగర్వంతో అతడు ముల్లోకాలలోని లోకులను పీడించడం మొదలుపెట్టాడు. దేవతలను, పన్నగులను, అప్సరకాంతలను హింసించేవాడు.‘నేను తప్ప మణులను మీరెవరూ ధరించరాదు’ అంటూ దేవతాసర్పాల తలలపైనున్న మణులను పెరికివేసి, వాటిని కిరీటంపై ధరించేవాడు. ‘ఇక నుంచి నన్నే కొలవండి’ అంటూ అప్సరకాంతలను కొప్పు పట్టి ఈడ్చుకొచ్చి, తన కొలువులో వారిచేత ఊడిగం చేయించుకునేవాడు. ‘యజ్ఞభాగాలన్నీ ఇకపై నాకే దక్కాలి’ అంటూ దేవతల కిరీటాలను కాళ్లతో తన్నేవాడు. వారిని చిత్రహింసలు పెట్టేవాడు. శంబసాధనుడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించసాగాయి. దేవతలు అతడిని నిలువరించడానికి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి చేరుకున్నారు. వారంతా బితుకు బితుకుమంటూ బతకసాగారు.దేవతలు ఎంతగా ఒదిగి ఉంటున్నా, వారి పట్ల శంబసాధనుడి దాష్టీకాలు నానాటికీ పెరగసాగాయి. అతడి పీడ ఎలా విరగడ అవుతుందోనని దేవతలు మథనపడసాగారు. చివరకు అతడికి వరాలు ఇచ్చిన బ్రహ్మదేవుడే తరుణోపాయం చెప్పగలడని తలచి, మూకుమ్మడిగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు. ‘బ్రహ్మదేవా! నీ వల్ల వరాలు పొందిన శంబసాధనుడు మా పాలిటి పీడగా మారాడు. వాడి సంహారానికి తగిన తరుణోపాయం చెప్పి, మమ్మల్ని అతడి బాధల నుంచి రక్షించు’ అని మొరపెట్టుకున్నారు.దేవతల మొర ఆలకించిన బ్రహ్మదేవుడు, ‘దేవతలారా! దిగులు చెందకండి. శంబసాధనుడు నా వరాలను దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అతడికి కాలంతీరే రోజులు ఆసన్నమయ్యాయి. అతడిని సమర్థంగా ఎదుర్కొని, అతడిని అంతమొందించగల వీరుడు ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడే వానరాధిపతి కేసరి. మీరంతా వెళ్లి అతడిని ఆశ్రయించండి. కేసరి తప్పక మీ మనోభీష్టాన్ని నెరవేర్చగలడు’ అని సెలవిచ్చాడు. బ్రహ్మదేవుడి మాటలతో దేవతలంతా కేసరి వద్దకు వెళ్లారు. ‘ఓ మహాత్మా! వానరశ్రేష్ఠా! శంబసాధనుడు మమ్మల్ని పీడిస్తున్నాడు. అతడిని ఎదిరించగల వీరాధి వీరుడవు నువ్వొక్కడివేనని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెబితే, నీ వద్దకు వచ్చాం. శంబసాధనుడిని సంహరించి, నువ్వే మమ్మల్ని రక్షించాలి’ అని అన్నారు. కేసరి వారికి అభయమిచ్చాడు. దేవతలు ఒకవైపు కేసరిని కలుసుకుని, అభయం పొందితే, మరోవైపు నారదుడు మహతి మీటుకుంటూ శంబసాధనుడి వద్దకు వెళ్లాడు. ‘దేవమునీ! ఎక్కడి నుంచి తమరి రాక, లోక విశేషాలేమిటి?’ అని అడిగాడు శంబసాధనుడు. ‘దైత్యశ్రేష్ఠా! నీ సంహారం కోసం దేవతలంతా వానర రాజును ప్రార్థిస్తున్నారు. ఈ సంగతి నీ వరకు రాలేదా? నీ గూఢచారులు ఏం చేస్తున్నారు? నెలగ్రాసం తీసుకుని నిద్రిస్తున్నారా?’ అన్నాడు.నారదుడు ఈ మాట చెప్పడంతోనే శంబసాధనుడు మండిపడ్డాడు. ‘పోనీ జ్ఞాతులే కదా అని ప్రాణాలతో విడిచిపెడితే, దేవతలంతా నా ప్రాణాలకే ఎసరుపెడతారా? కోతిమూకకు రాజైన వాడితో నన్ను అంతం చేయాలనుకుంటారా? వాళ్ల అంతుచూస్తాను’ అంటూ ఆయుధాలు ధరించి, దేవతల మీదకు దండెత్తాడు. శంబసాధనుడిని చూసి, దేవతలు కాలికి బుద్ధి చెప్పారు. కొందరు కొండగుహల్లో తలదాచుకున్నారు. కొందరు కేసరి వద్దకు వెళ్లి, శంబసాధనుడు దండెత్తి వస్తున్న సంగతి చెప్పారు. కేసరి దేవతలకు అండగా, శంబసాధనుడి ఎదుటకు వచ్చి నిలిచాడు.‘ఓరీ! రాక్షసాధమా! లోకకంటకుడవైన నిన్ను అంతం చేయడానికి వచ్చాను’ అన్నాడు. ‘ఓరీ! కోతీ! నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు. నాతో పోరుకు నిటలాక్షుడే తటపటాయిస్తాడు. నువ్వెంత? చిటికెలలో నిన్ను యమపురికి పంపిస్తాను’ అన్నాడు శంబసాధనుడు. ఇద్దరూ ఒకరితో ఒకరు కలపడ్డారు. శంబసాధనుడి మీదకు కేసరి ఒక బండరాయి విసిరాడు. అతడు తన గదతో బండరాయిని తుత్తునియలు చేశాడు. కేసరి వెంటనే మరో బండరాయి విసిరాడు. అది నేరుగా శంబసాధనుడి రొమ్మును తాకింది. ఆ దెబ్బకు అతడు తూలిపడ్డాడు.‘ఓరీ! వానరా! నువ్వు బలశాలివే, తగినవాడివే! ఈసారి చూడు’ అంటూ తన గదను కేసరి మీదకు విసిరాడు. ఆ గద కేసరిని తాకి పిండి పిండిగా నేల రాలింది. ఈసారి శంబసాధనుడు శూలం విసిరాడు. కేసరి దానిని ఒడిసి పట్టుకుని, ముక్కలుగా విరిచి అవతల పడేశాడు. ఆయుధాల పని అయిపోవడంతో శంబసాధనుడు కేసరితో బాహాబాహీకి తలపడ్డాడు. ఒకరినొకరు కొట్టుకుంటూ కలబడ్డారు. చివరకు కేసరి పిడికిలి బిగించి, శంబసాధనుడి ఛాతీపై ఒక్కపోటు పొడిచాడు. అతడు నెత్తురు కక్కుకుంటూ అక్కడికక్కడే చచ్చాడు. అది చూసి దేవతలంతా హర్షధ్వానాలు చేశారు.సాంఖ్యాయన -
పగటి వేషాలేనా రాత్రి కలలు?!
‘‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది..’’ అని అబ్దుల్ కలామ్ అనేవారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్య సాధన కోసం రేయింబవళ్లు నిద్రాహారాలు మాని మరీ కృషి చేయటం అనే అర్థంలో చెప్పిన మాట ఇది. ఇక్కడ ‘కల’ అన్నది ఒక లక్ష్యం. లక్ష్యంతో నిమిత్తం లేకుండా వచ్చే కలలు వేరు. అవి దాదాపుగా అందరికీ ప్రతిరోజూ నిద్రలో వస్తూనే ఉంటాయి. అవి మనిషి మానసిక స్థితికి సంకేతాలు అని శాస్త్రవేత్తలు అనటమే కానీ ఇంతవరకు వారికీ ఆ విషయమై ఒక స్పష్టత లేదు. అయితే ప్రతి కలకూ ఒక మూలం ఉంటుందని; అర్థం, అంతరార్థం కూడా ఉంటాయని శాస్త్రవేత్తలలోనే కొందరు విశ్వసిస్తున్నారు! ఆ వివరాల్లోకి వెళ్దాం.ఒక కల సాధారణంగా 5 నుండి 20 నిమిషాల వరకు మాత్రమే కొనసాగుతుంది. అయినప్పటికీ, మనకు పూర్తిస్థాయి సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది. ఎలాంటి సినిమా? ఎలాంటిదైనా కావచ్చు. ఆర్జీవీ ‘రాత్’ లేదా ‘భూత్’లాంటి కల కావచ్చు. లేదా, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఏమాయ చేసావె’లాంటి కమ్మటి ప్రేమ కల కావచ్చు. లేదంటే, ‘ఆదిత్య 369’, ‘ప్లే బ్యాక్’లాంటి టైమ్ ట్రావెల్ కలైనా కావచ్చు.అసలేంటీ కలలు?హాయిగా మన నిద్ర మనం పోతున్నప్పుడు మధ్యలో ఈ కలలకేం పని? పని గట్టుకుని వాటికేం పని లేదు కాని, కలలు కూడా మన నిద్రలో ఒక భాగమే. మనం నిద్రలో ఉన్నప్పుడు మన మనస్సు సృష్టించే కథలు, చిత్రాలే ఈ కలలు. మనం నిద్ర పోతున్నా, మనసు మేల్కొనే ఉంటుంది. కలలు అనేవి ప్రధానంగా నిద్రలోని కొన్ని దశలలో ఏర్పడే భ్రాంతి దృశ్యాలు (హెల్యూసినేషన్లు). ఇవి ముఖ్యంగా ‘ఆర్.ఇ.ఎం. నిద్ర’ దశలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చిత్రం ఏమిటంటే.. ఈ దశలోని కలలు మనకు అంత స్పష్టంగా కనిపిస్తాయా.. తెల్లారగానే, ఎందుకో అవి అస్పష్టంగా కూడా గుర్తుకు రావు. ఏదో కల వచ్చిందన్నత వరకే మైండ్లో ఉంటుంది! ‘ఆర్.ఇ.ఎం. స్లీప్’ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. కంటి కదలికలు వేగవంతంగా ఉండే దశలోని నిద్రన్నమాట. కలల అవసరం ఉందా?మనిషికి నిద్ర అవసరం ఏమిటో తెలిసిందే. జీవక్రియ సజావుగా సాగటానికి నిద్ర చాలా అవసరం. జీవక్రియనే ‘మెటబాలిజం’ అంటారు. రోజువారీ పనులు చేసుకోవటానికి అవసరమైన శక్తిని శరీరం ఉత్పత్తి చేసుకోవటంలో, జీవకణాలను ఎప్పటికప్పుడు మరమ్మతు చేయటంలో మెటబాలిజం పాత్ర ముఖ్యమైనది. ఇంకో రెండింటికి కూడా నిద్ర చాలా కీలకమైనది. ఒకటి రక్తపోటు, మరొకటి ఆరోగ్యానికి సంబంధించిన ఇతర అంశాల నియంత్రణకు! సరిపడా నిద్ర లేదా సౌఖ్యమైన నిద్రలేకుంటే ఈ మెటబాలిజం, రక్తపోటు, తక్కిన దేహధర్మాలు కుంటుపడి ఆరోగ్యం క్రమేణా దెబ్బతింటుంది. నిద్ర వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి కలల అవసరం ఏమిటి? ఈ ప్రశ్నకు మాత్రం ఇంతవరకు సమాధానం లేదు. ఏళ్ల తరబడిగా... ‘కలల అవసరం’పై పరిశోధనలు జరుగుతూనే ఉన్నా, వాటి అవసరాన్ని మాత్రం శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు.కలల వెనుక కారణాలుశాస్త్రవేత్తలు కలల అవసరం ఏంటో కనిపెట్టలేకపోయారు కాని, కలలు ఎందుకు వస్తాయనే విషయాన్ని మాత్రం కొంతవరకు రాబట్టగలిగారు. అందరికీ తెలిసిన ఒక సిద్ధాంతం ప్రకారం, కలలు మన జ్ఞాపకాల నుండి పుట్టుకొస్తాయి. మేల్కొని ఉన్నప్పుడు మనం ఆలోచిస్తుంటాం కదా, అలా.. నిద్రపోతున్నప్పటి మన ఆలోచనలే కలలు అనే భావన కూడా ఒకటి ఉంది! అయితే అది శాస్త్రీయంగా రూఢీ అవలేదు. ఇంకో సిద్ధాంతం ప్రకారం.. జీవితంలో మనకు ఎదురవబోయే సవాళ్లకు కలలు రిహార్సల్స్లా పనిచేస్తాయట! అలాగైతే మంచిదే. రేపు రాబోయే సమస్యకు ఇవాళ్టి కలలో పరిష్కారం దొరికినట్లే. కాని ఇది ఎంతవరకు నిజం?!కలలు పోషించే పాత్రేమిటి?నిపుణులైన కొంతమంది థెరపిస్టుల పరిశీలన ప్రకారం, మనం మేల్కొని ఉన్నప్పుడు (పగటి వేళల్లో) మనస్సు తప్పించుకునే, లేదా వదిలించుకునే ఇబ్బందికరమైన భావోద్వేగాలను తేలిక పరచటానికి కలలు మనకు సహాయపడతాయి. ఇది ఒక థెరపీలా ఉంటుంది. ఉచితమైన థెరపీ, కాస్త విడ్డూరమైన థెరపీ. కలల్లోని ఈ భావోద్వేగ స్థితిలో మన మెదడు, మనం మేల్కొని ఉన్నప్పుడు చేయలేని ఆలోచనలతో మనల్ని కనెక్ట్ చేస్తుంది. మరొక సిద్ధాంత ప్రకారం, మెదడులోని ‘అమిగ్డాలా’ అనే ఒక నిర్మాణం.. కలలు రావటానికి కారణం అవుతోంది. అమిగ్డాలా అనేది మెదడు మధ్యలో లోతుగా ఒక చిన్న భాగంగా బాదం పప్పు ఆకారంలో ఉంటుంది. అది మనలో అవసరమైన సమయాలలో ఆత్మరక్షణ జాగ్రత్తల్ని ప్రేరేపిస్తుంది. ఊహించని ప్రమాదం ఏదైనా మనకు ఎదురైనప్పుడు... ‘‘పోరాడు, లేదా పారిపో..’’ అనే సహజజ్ఞాన ప్రేరేపణను ఇస్తుంది. మనల్ని నిజ జీవితంలోని సవాళ్లకు సిద్ధం చేయటానికే ఈ అమిగ్డాలా కలల్ని సృష్టిస్తుందని ఒక వర్గం పరిశోధకులు భావిస్తున్నారు.కలల ప్రేరణకు మూలం!అనేకమంది శాస్త్రవేత్తలు, కవులు, కళాకారులు తమలోని సృజనాత్మకతకు కలలు ప్రేరణనిచ్చేవని వెల్లడించిన సందర్భాలూ ఉన్నాయి. ఐన్స్టీన్ సైతం తన ఆవిష్కరణలలో కొన్నింటికి కలల నుంచే ఆలోచనలు స్ఫురించాయని తెలిపారు. ఈ మాటను బలపరిచే సిద్ధాంతాలూ ఉన్నాయి. వాటిల్లోని ఒక సిద్ధాంత ప్రకారం, మేల్కొని ఉన్నప్పుడు నిజ జీవితంలోని సృజనాత్మక ప్రవాహాన్ని అడ్డుకునే తర్కపు వడపోత.. నిద్రలో ఉండదు. అందువల్ల నిద్ర సమయంలో ఆలోచనలు, భావనలు స్వేచ్ఛగా పురివిప్పుతాయి. విహరిస్తాయి. ఆ కారణంగానే అత్యద్భుతమైన సృజనలకు కలలు మూలాలు అవుతాయి.జ్ఞాపకాల అలలు, అరలుకలల అధ్యయనవేత్తలు చెబుతున్న దానిని బట్టి.. ఒక వరుస క్రమంలో లేని విషయాలను సక్రమంగా అమర్చు కోవడంలో కలలు మెదడుకు సహాయపడతాయి. ముఖ్యమైన జ్ఞాపకాలను భద్రపరుస్తాయి. అవసరం లేని వాటిని తొలగిస్తాయి. అలాగే క్లిష్టమైన ఆలోచనలకు, భావోద్వేగాలకు ఒక అమరికను కూర్చటంలో కలలు కీలక పాత్ర పోషిస్తాయి. కాగా, నిద్ర జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా ఒక కొత్త విషయం నేర్చుకున్న తర్వాత నిద్రపోతే, తిరిగి లేచాక అది వారికి బాగా గుర్తుంటుంది. విశ్రాంతి లేకుండా ఊరికే గుర్తు పెట్టుకున్న దానికంటే కూడా ఆ జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. దీని వెనుక కూడా కలలు చేసే మ్యాజిక్ ఉండొచ్చని పరిశోధకుల అంచనా.మరి పీడకలల మాటేమిటి?ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నట్లు, లేదా ఎక్కడో తెలియని ప్రాంతంలో మీరు చిక్కుకుపోయినట్లు, లేదా దెయ్యాలు, భూతాలు మీ కోసం పొంచి ఉన్నట్లు మీకు కల వచ్చి, భయంతో చెమటలు పట్టి, నిద్రలోంచి మీరు దిగ్గున లేచి కూర్చున్నారా? అదే పీడకల! నైట్మేర్. పీడకలలన్నవి కలతపెట్టే భావోద్వేగాలను రేపుతాయి. వాటిని గుర్తు చేసు కోవటానికి కూడా భయపడతాం. విశేషం ఏమిటంటే, మంచి కలల కంటే కూడా పీడకలలే స్పష్టంగా గుర్తిండిపోతాయి. అది మానవ స్వభావం కాదు. అటువంటి కలల స్వభావం.పీడకలలకు కారణాలుపీడకలలకు ప్రధాన కారణాలు వాస్తవ జీవితంలోని ఒత్తిడి, ఆందోళన, పి.టి.ఎస్.డి. (తీవ్ర మానసిక గాయం తర్వాత ఉండే భయానక స్థితి), భావోద్వేగ సమస్యలు, భయాలు, అనారోగ్యాలు! మీకు తెలుసా? జీవితకాలంలో ఒక్కసారైనా పీడకలలు రానివారు ఉండరు. అమెరికన్ స్లీప్ అసోసియేషన్ అంచనా ప్రకారం, ప్రపంచ జనాభాలో కేవలం సుమారు 5 శాతం మందికి ఒక నిద్ర సంబంధ రుగ్మతగా మాత్రమే పీడకలలు వస్తుంటాయి. మామూలు పీడకలలు మిగతా 95 శాతం మందికి వచ్చేవి.కల తెలుస్తూనే ఉంటుంది!కల అని తెలుస్తూనే, కనే కలలను లూసిడ్ డ్రీమ్స్ అంటారు. అంటే, మనం కలగంటున్నామని మనకు తెలుస్తూ ఉంటుంది! అలాంటప్పుడు ఆ కలపై నియంత్రణ కూడా ఉంటుంది. పీడకల అయితే ప్రయత్న పూర్వకంగా కల నుండి మేల్కోవటం సాధ్యం అవుతుంది. అయితే ఈ నియంత్రణ శక్తి వ్యక్తికీ, వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే.. కొంతమంది తమకు ఇష్టమైన కలలు కనేందుకు, ‘లూసిడ్ డ్రీమ్స్’ను అనుభవించేందుకు తమకు తాము శిక్షణ ఇచ్చుకుంటారు. అంటే.. ఎలాంటి కల రావాలనుకుంటే అలాంటి కల వచ్చేస్తుంది వారికి!!కలల నిజాలు కొన్ని· ప్రతి ఒక్కరూ ఒక్క రాత్రిలో సుమారు 3 నుండి 6 సార్లు కలలు కంటారు.· ప్రతి కల సుమారు 5–20 నిమిషాల పాటు ఉంటుంది.· ఉదయం కల్లా 95 శాతం మంది కలల్ని మరిచిపోతారు.· చూపులేని వారు ఎక్కువగా శబ్దాలు, వాసనలు, స్పర్శల ద్వారా కలలు కంటారు.· ఆహారం, నిద్ర నాణ్యత, నిద్రించే వ్యవధి, మానసిక ఆరోగ్యం, రోజువారీ కార్యకలాపాలు వంటి అంశాలు కలలపై ప్రభావం చూపుతాయి. సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఇకపై బట్టతలకు చెక్!
బట్టతల బాధితులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తారు. బట్టతలను కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బట్టతలపై జుట్టు మొలిపించుకోవడానికి రకరకాల తైలాలు, ఔషధ లేపనాలు రాసుకుంటూ ఎంతకూ రాని జుట్టుకోసం ఎదురు చూస్తుంటారు. ఇకపై బట్టతల బాధితులకు అలాంటి తంటాలు ఉండవు. బట్టతలపై జుట్టు మొలిపించే ఔషధాన్ని విజయవంతంగా రూపొందించినట్లు ఐరిష్ ఔషధ తయారీ సంస్థ ‘కాస్మో ఫార్మాసూటికల్స్’ ఇటీవల ప్రకటించింది.తాము ప్రత్యేకంగా రూపొందించిన ‘క్లాస్కోటెరాన్–5%’ సొల్యూషన్ను ‘బ్రీజులా’ అనే బ్రాండ్ పేరుతో 2027 నాటికి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రెండు దశల్లో విస్తృతంగా జరిపిన క్లినికల్ పరీక్షల్లో ఈ ఔషధం అద్భుత ఫలితాలను సాధించిందని, దీనిని ఉపయోగించిన వారి బట్టతలలపై జుట్టు మొలిచిందని ‘కాస్మో ఫార్మాసూటికల్స్’ తెలిపింది. మూడో దశ పరీక్షలు కూడా పూర్తయిన తర్వాత దీనిని మార్కెట్లో అందుబాటులోకి తేనున్నామని ప్రకటించింది. -
మా ఇల్లు చూస్తే అర్ధమవుతుంది
బాల్యం నుంచే కెమెరా వెలుగుల్లో పెరిగినా, ఆ వెలుగు ఆమె తలకెక్కలేదు. గ్లామర్ను అలవోకగా దాటేసి, క్రమశిక్షణను తన నిజమైన బలంగా మార్చుకుంది. అందుకే హిట్స్, ఫ్లాప్స్కు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో సైలెంట్గా, చాలా స్ట్రాంగ్గా స్థానం దక్కించుకుంది నటి మెహ్రీన్ పీర్జాదా. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే..⇒ చిన్నప్పటి నుంచే కెమెరా నాకు కొత్త కాదు. పదేళ్ల వయసులోనే ర్యాంప్పై నడిచాను. అప్పట్లో అది సరదా, ఇప్పుడు అదే నా జీవితం.⇒ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, నేను భరతనాట్యం డ్యాన్సర్ని, ఎయిర్ పిస్టల్ షూటర్ని నాట్యంలోను, పిస్టల్ షూటింగ్లోను నేర్చుకున్న క్రమశిక్షణే నన్ను జీవితంలో బ్యాలెన్స్సడ్గా ఉంచింది.⇒ ‘కృష్ణగాడి వీర ప్రేమగా«థ’ నా ప్రయాణానికి అసలు మలుపు. మొదటి సినిమా భయం, మొదటి విజయపు ఆనందం అన్నీ ఆ ఒక్క సినిమాతోనే.⇒ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ ఇలా ప్రతి సినిమా నాలో కొత్త కోణాన్ని బయటకు తీసింది. ఒక విధంగా నటనే నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకునేలా చేసింది.⇒ ట్రెక్కింగ్ అంటే నాకు ప్రాణం. గోముఖ్ ట్రెక్ చేసిన తర్వాత జీవితం మీద గౌరవం మరింత పెరిగింది. ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్లమో అప్పుడు తెలిసింది.⇒ నాకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. మా ఇల్లు చూస్తే అది మీకే అర్థమవుతుంది. ఆ రంగు నాకు ప్రశాంతత ఇస్తుంది.⇒ ప్రయాణాలు నాకు జ్ఞాపకాలే కాదు, ఆనందాలూ ఇస్తాయి. ప్రతి దేశం నుంచి తెచ్చుకున్న చిన్న ఫ్రిజ్ మాగ్నెట్స్ చూస్తేనే చిరునవ్వు వస్తుంది. ఫిన్లండ్లో ఇగ్లూ రూమ్ నుంచి చూసిన నార్తర్న్ లైట్స్ ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతాయి.⇒ లాక్డౌన్ సమయంలో నన్ను నేనే రీడిజైన్ చేసుకున్నాను. ఫిట్నెస్, వంట, పెయింటింగ్ నేర్చుకున్నాను. అప్పుడే మనతో మనమే ఉండటం కూడా అవసరమే అని అర్థమైంది.⇒ 2021లో రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య బిష్ణోయితో జరిగిన ఎంగేజ్మెంట్ రద్దుచేసుకున్నప్పడు, వచ్చిన గాసిప్స్కు చాలా బాధపడ్డాను. కాని, ఇప్పుడు అవి గాలి లాంటివే వస్తుంటాయి, పోతుంటాయని అర్థమైంది. ఫేక్ హెడ్లైన్స్స నాకు అస్సలు నచ్చవు. చిన్నపాటి ఫేమ్ కోసం అబద్ధాలు సృష్టించేవారికి నేను దూరంగా ఉంటాను.⇒ తెలుగు ఇండస్ట్రీ నాకు ఇల్లులాంటిది. ఇక్కడ ప్రేక్షకులు నటనలో నిజాన్ని వెంటనే గుర్తిస్తారు. అదే నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుతుంది. అందుకే, అభిమానుల నమ్మకమే నాకు అసలు అవార్డు. -
కోతి నిద్ర
ఒకరోజు ఉదయం నల్లబండ మీద కూర్చొని అంజి అనే కోతి ఆవులిస్తూ ఏదో ఆలోచిస్తోంది. అక్కడే తిరుగుతున్న అంజి మిత్రులు ఎలుగుబంటి, నక్క, తోడేలు, నెమలి, కోకిల అంజిని గమనించాయి.‘అంజీ! ఏంటి నీ కళ్లు ఎర్రగా ఉన్నాయి!?’ అడిగింది ఎలుగుబంటి...‘రాత్రి పూట సరిగా నిద్ర పట్టడం లేదు!’ అంది అంజి . ‘నువ్వు రోజూ సాయంత్రం తాటికల్లు తాగు, హాయిగా నిద్రపడుతుంది!’ అంది నక్క. ‘తాటి కల్లు వద్దు, ఈతకల్లు తాగావంటే మత్తుగా నిద్రపడుతుంది’ అంది తోడేలు.‘కాదు... కాదు నీళ్లలో తేనె కలుపుకొని తాగు! వెంటనే నిద్రలోకి జారుకుంటావు!’ అంది ఎలుగుబంటి. ‘తాగుడు కాదు! నువ్వు ప్రతిరోజూ అరగంట నాట్యం చేశావంటే అలసిపోయి బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది!’ అంది నెమలి.‘నాట్యంకన్నా అరగంట పాటలు విన్నావంటే, వద్దన్నా కునుకు పడుతుంది!’ అంది కోకిల.ఇలా కోతి అడగకుండానే తమకు తోచిన సలహాలు ఇచ్చాయి.అంజి అన్నిటి సలహాలు విని బుర్ర గోక్కుంటూ ఇంటికి పోయింది. తెల్లారి అంజి మళ్లీ నల్ల బండకు చేరింది. ‘అంజీ! రాత్రి తాటికల్లు తాగావా?’ ఆత్రంగా అడిగింది నక్క.‘లేదు!’ అంది అంజి.‘అయితే, నేను చెప్పినట్లు ఈత కల్లు తాగుంటావు!’ అంది ఆసక్తిగా తోడేలు.‘కాదు!’ అంది ‘అంజి మత్తు పానీయాలు ఎందుకు తాగుతుంది. నేను చెప్పిన తేనె నీళ్లు తాగుంటుంది’ అంది ఎలుగుబంటి. ‘లేదు... లేదు!’ అంది అంజి. ‘ఓహో! నేను చెప్పినట్లు నాట్యం చేసుంటుంది’ అంది నెమలి. ‘కాదు... కాదు’ అంది అంజి.‘ఇంకేముంది నా మాటకు విలువ యిచ్చి పాటలు విని ఉంటుంది’ అంది కోకిల. అంజికి చికాకు వేసింది. ‘ఆపండి మీగోల! నేను అసలు ఎవరి సలహానూ పాటించలేదు. మిమ్మల్ని సలహా ఇమ్మని కోరనూ లేదు’ అంది కోపంగా. వెంటనే నల్లబండ మీద నుంచి చెట్టు మీదకు దూకి, అక్కడి నుంచి నేరుగా వైద్యుడు ఏనుగు వద్దకు పోయింది. తన సమస్య చెప్పింది. ఏనుగు అంజిని పరీక్షించి, ‘ఇంకా ఆలస్యం చేసి ఉంటే, నీ కంటికి, ఒంటికి ప్రమాదం జరిగేది’ అంటూ కొన్ని వేరు మందులు ఇచ్చింది. ‘వీటిని వాడుతూ, ధ్యానం చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే రోగం నయమవుతుంది’ చెప్పింది ఏనుగు.‘ఈలోకంలో అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలిచ్చే వాళ్లకు లోటులేదు. పైగా సలహాలు పాటించకుంటే వారికి శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంది’ అని తెలుసుకుంది అంజి. -
చిన్న ప్రపంచంలో పెద్ద వెలుగులు
క్రిస్మస్ సందర్భంగా ఇంటి అలంకరణలో కొత్తదనం తేవడానికి గ్లాస్బౌల్లో మినియేచర్ డెకర్ చక్కగా సరిపోతుంది. చిన్న చిన్న వస్తువులతో పెద్ద క్రిస్మస్ ప్రపంచాన్ని ఇంట్లో మనమే సృష్టించుకోవచ్చు. క్రిస్మస్ డెకర్ బౌల్ను టేబుల్, షెల్ఫ్, కార్నర్లాంటి చోట్ల అమర్చుకుంటే, ఇంటికి పండుగ కళ వస్తుంది. రకరకాల మినియేచర్ క్రిస్మస్ డెకర్ బౌల్స్, జార్స్ రెడీమేడ్గా మార్కెట్లోనూ దొరుకుతున్నాయి.గ్లాస్ బౌల్ డెకర్పారదర్శకంగా ఉండే క్రిస్మస్ మినియేచర్ బౌల్స్, జార్స్కు చాలామంది ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆకాశమే హద్దు... నేలంతా పరుచుకున్న మంచు తివాచీ, వాటి మీదుగా మంచు తెరలు కప్పుకున్న వృక్షాలు, ఇళ్లు, క్రిస్మస్ తాత, మెరిసే తారలు.. ఇలా సమస్త విశ్వపు వేడుక అందాన్ని ఒక గాజు పాత్రలోకి ఇట్టే తీసుకురావచ్చు. ఫిష్ అక్వేరియంకు ఉపయోగించే గాజు పాత్రను కూడా ఈ మినియేచర్ ఆర్ట్కు కేటాయించవచ్చు. మంచు అనుభూతిని తెప్పించడానికి తెల్లని, మెత్తని దూది, చిన్న చిన్న క్రిస్మస్ ట్రీలు, మినీ సాంటా, జింక, స్నో మ్యాన్, హౌస్ ఫిగర్స్, పైన్కోన్స్, చిన్న చిన్న ఆర్నమెంట్స్, మినీ ఎల్ఈడీ ఫెయిరీ లైట్స్తో ఊహలకు ఓ రూపం తీసుకురావచ్చు. స్నో గ్లోబ్ స్టయిల్తెల్లటి ఫేక్ స్నో, ఒక ట్రీ + ఒక హౌస్ ఫిగర్తో మినిమలిస్టిక్ లుక్ తీసుకురావచ్చు. కృత్రిమ ఆకులు, చెర్రీపండ్లు, రిబ్బన్లు కూడా ఉపయోగించవచ్చు. క్రిస్మస్ విలేజ్ థీమ్చిన్న చిన్న ఇళ్లు, మంచు దారికి కాటన్ పాత్, ఎల్ఈడీ స్ట్రీట్ ల్యాంప్స్తో చిన్న గ్రామాన్ని గాజు పాత్రలో రూపొందించవచ్చు. ఎక్కడ ఉంచాలంటే.. సిద్ధం చేసుకున్న మినియేచర్ క్రిస్మస్ బౌల్ను లివింగ్ రూమ్లో సెంటర్ టేబుల్, షెల్ఫ్, ఎంట్రన్స్ టేబుల్, బెడ్సైడ్ లాంప్ పక్కన, డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్గా... ఎక్కడ పెట్టినా క్రిస్మస్ పండగ ప్రపంచం కళ్లకు కనువిందు చేస్తూ చూపులను ఇట్టే కట్టిపడేస్తుంది. - ఎన్నార్ -
పేరు చెప్పలేను!
యూట్యూబ్ ఫ్రేమ్ నుంచి సినిమా ఫ్రేమ్ దాకా చేరిన నటి వైష్ణవి ప్రయాణం మాటల్లో సులభం, కాని మనసుల్లో మాత్రం అద్భుతం! ఆ మార్గంలో ఆమె చూసిన ఆనందాలు, నేర్చుకున్న పాఠాలు అన్నీ ఆమె మాటల్లోనే, మీ కోసం!⇒ హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన అమ్మాయిని నేను. చిన్నప్పటి నుంచే టీవీలో పాటలు వస్తే డ్యాన్స్ చేస్తూ, పుస్తకాలలో ఉన్న కథలను యాక్ట్ చేస్తూ ఉండేదాన్ని. అదే నన్ను యూట్యూబ్ వీడియోలు చేయించి, ఈరోజు సినిమాల దాకా తీసుకువచ్చాయి.⇒ నా కెరీర్ నిజంగా ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ సిరీస్తో మలుపు తిరిగింది. ఆ సిరీస్ నాకు నటిగా నమ్మకం ఇచ్చింది. తర్వాత ‘అల వైకుంఠపురములో’ చిన్న పాత్రలో కనిపించాను. అవకాశం చిన్నదైనా, ఆ సినిమాలో కనిపించడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన ‘బేబీ’ సినిమా నా జీవితంలో ఒక అద్భుతం. ఆ సినిమాకు వచ్చిన ప్రేమ, గుర్తింపు, అవార్డులు ఇవన్నీ నాకింకా కలలా అనిపిస్తాయి.⇒ ఇష్టమైన హీరో ఎవరని అడిగితే, ఏ పేరూ చెప్పలేను. కాని, కష్టపడి ఎదిగిన నటులంటే చాలా గౌరవం.⇒ నేను పాతబస్తీ గల్లీలలో పెరిగిన అమ్మాయి కాబట్టి, ఆ ప్రదేశం ఇప్పటికీ నాకు హాయిగా అనిపిస్తుంది. తినే విషయానికి వస్తే నేనొక ఫూడీ. మసాలా నాన్ అయితే చాలు, చికెన్ ఉంటే ఇంకా ఇష్టం. టైమ్ దొరికితే సంగీతం వినడం, డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడడం, ప్రయాణాలు చేయడం నాకు రిలాక్సేషన్లా ఉంటుంది.⇒ అందం గురించి చెప్పాలంటే, నేను చాలా సింపుల్. ఉదయం నీటితోనే ముఖం కడుక్కుంటాను. తేలికపాటి మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ వాడతానంతే! ఇదే నా రొటీన్. జుట్టు విషయంలో మాత్రం గోట్ మిల్క్ షాంపూ, హెయిర్ ఆయిల్ వాడతాను.⇒ ఫ్యాషన్ ట్రెండ్లు ఎలా ఉన్నా, నాకు కంఫర్ట్ ఇచ్చే దుస్తులే వేసుకుంటాను. చీరలు, అనార్కలి, లెహెంగాలు వేసుకోవడం చాలా ఇష్టం.⇒ గాసిప్స్ విషయానికి వస్తే, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం నేను సింగిల్నే. రూమర్స్ వచ్చినా వాటికి స్పందించకుండా నేను నా పనిపైనే దృష్టి పెడతాను. ‘బేబీ’ తర్వాత నా రెమ్యునరేషన్ పెరిగిందని చెబుతారు, కాని, నిజంగా పెరిగింది ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమ, గౌరవం.⇒ ప్రస్తుతం ఒక ఎమోషనల్ స్టోరీ చేస్తున్నా. ఆ పాత్ర కూడా చాలా డీప్గా ఉంటుంది. ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను. కాని, ఇది నా కెరీర్లో మరో ప్రత్యేక పాత్రగా నిలవడం ఖాయం.⇒ నన్ను గుర్తు చేసుకునేప్పుడల్లా నేను చేసిన మంచి పాత్రలే ముందుగా కనిపించాలి. అందుకే, చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాను. -
అంతరించింది అనుకుంటే.. అంతలోనే కనిపించింది
అడవుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు, ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని మరోసారి నిరూపించింది ఒక చిన్న ప్రాణి. గత మూడు దశాబ్దాలుగా కనుమరుగైందనుకున్న ‘మౌస్ డీర్’, మళ్లీ అడవిలో నడుస్తూ కనిపించింది. ఇటీవలి రోజుల్లో వియత్నాం అడవుల్లో శాస్త్రవేత్తలు దీనిని కెమెరాల్లో గుర్తించారు. ముప్పై ఏళ్లుగా దాని జాడ కనిపించకపోవడంతో, శాస్త్రీయ రికార్డుల్లో ఏ ఆధారమూ లేకపోవడంతో, ఇది పూర్తిగా అంతరించిపోయిందని అందరూ నమ్మేశారు. కాని ప్రకృతి ఎప్పుడూ తన ప్రణాళికలను చివరి నిమిషంలోనే బయటపెడుతుంది. అన్నట్లు, అలా ఒక్కసారిగా సర్ప్రైజ్లా ప్రత్యక్షమైంది ఈ చిన్న జీవి. ప్రపంచంలోనే అతి చిన్న కాళ్లున్న, గొర్రెల కుటుంబానికి చెందిన ఈ మౌస్ డీర్ బరువు పది కిలోలు. అడవుల లోతుల్లో, వెలుగుకు దూరంగా జీవించే స్వభావం వల్ల దీని ఉనికి తెలుసుకోవడం అంత సులువు కాదు. అందుకే ఇన్ని ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించడమే ఒక అరుదైన అద్భుతం. -
స్టార్ స్టయిల్..!
ప్రతిరోజూ ఫ్యాషన్లో ఒక చిన్న అడ్వెంచర్! అదితిరావు స్టేట్మెంట్ యిల్! ఇందుకోసం, తను ఫాలో *అయ్యే చిన్న చిన్న స్టయిల్ హ్యాక్స్, స్పార్కింగ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూడండి!కొత్త ఆభరణాలు, కొత్త లుక్స్ ఇవన్నీ ప్రయత్నించడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. ఫ్యాషన్లో కొత్తదనం భయాన్ని కాకుండా, ఉత్సాహాన్ని ఇస్తుంది. నిజమైన మెరుపు ఆభరణాల్లో కాదు, వాటిని ధరించే మన వైబ్లోనే ఉంటుంది.– అదితిరావు హైదరీజుంకాల మ్యాజిక్!చెవులకు వేసుకునే ఆభరణాల్లో ఎన్నో రకాలున్నా, సంప్రదాయ అందాన్ని క్లాసీగా చూపించడంలో ఆక్సిడైజ్డ్ జుంకాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద డోమ్ ఆకారంలో మెరిసే ఈ జుంకాలు, మొత్తం లుక్ను మరింత అందంగా మార్చేస్తాయి. ఎక్కువగా ఇలాంటి జుంకాలు రంగురంగుల దారాలు, మిర్రర్ వర్క్తో ఉండే కుర్తాలు, డీప్ జ్యూల్ టోన్స్లో ఉన్న అనార్కలీలకు అద్భుతంగా సరిపోతాయి. కళ్లకు సాఫ్ట్ కాజల్, నేచురల్ మేకప్, చిన్న బొట్టు ఇవన్నీ కలిస్తే ఆభరణాల అందం మరింత మెరిసిపోతుంది. హెయిర్ స్టయిల్ సింపుల్గా వదిలి, మెడను బోసిగా ఉంచడం చాలా ముఖ్యం, అప్పుడే ఈ జుంకాలు హైలైట్ అవుతాయి. చేతులకు దుస్తుల రంగులకు తగ్గట్టు బీడెడ్ బ్రేస్లెట్లు లేదా చిన్న ట్రెడిషనల్ గాజులు వేసుకుంటే మొత్తం స్టయిల్కు కలర్ఫుల్ టచ్ వస్తుంది. ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్ష¯Œ ్స, కల్చరల్ ఈవెంట్స్ ఇలా ఎక్కడైనా ఇలాంటి జుంకాలు వేసుకుంటే, మీరు ప్రత్యేకంగా కనిపించడం ఖాయం!∙దీపిక కొండి -
ఆచి తూచి 'తగ్గొచ్చు'
ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. కాని, మనం ఆ ఆహారాన్ని అపసవ్యంగా తింటూ అనారోగ్యాల పాలవుతున్నాం. కారణాలేమైనప్పటికీ, ఆహారం తీసుకోవటంలో నియంత్రణ కోల్పోవటమే అసలు సమస్య. మనం ఊబకాయులుగా, రోగులుగా మారటానికి మూల కారణం మనం తింటున్న పదార్థాల మోతాదులే. పరిమాణం, నాణ్యత, సమతుల్యత గాడి తప్పింది. అవసరానికి మించి తిన్న ‘అసమతుల్య ఆహారం’ శరీరానికి శక్తిని ఇచ్చే క్రమంలో దేహాన్ని అతిగా బరువెక్కించి రోగాల పుట్టగా మార్చుతోంది. ఏది వీలైతే అది, ఎంత వీలైతే అంత తింటున్నాం. ఏయే పోషకాలు ఎంత మోతాదులో నాకు అవసరం ఉంది? ఎంత తింటున్నాను? అనే అవగాహన లోపించటం లేదా సమాచారం తెలిసినా విస్మరించడమే అధిక బరువుకు, ఆ పైన ఊబకాయానికి రాచబాటలు వేస్తోంది. ముఖ్యంగా పొట్ట చుట్టుకొలత పెంచుతోంది. చర్మం కింద శరీరం అంతటా పేరుకునే కొవ్వు కన్నా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ నిరోధకత ఫలితంగా కొవ్వు నిల్వలు పేరుకుంటాయి. ఫలితంగా బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, గుండెజబ్బు వంటి జీవనశైలి జబ్బులన్నీ వస్తున్నాయి. మనల్ని రోగాల పుట్టగా మార్చుతున్నది మనం తిన్న ఆహారమే అయినప్పుడు... ఆ ఆహారాన్నే తెలివిగా శక్తియుతమైన ఆయుధంగా వాడి రోగాలను, వాటికి మూలమైన ఊబకాయాన్ని ఎందుకు తగ్గించుకోకూడదు? అందుకు ఉన్న మార్గాలేమిటి?.. చర్చిద్దాం..ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్ను.. ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది.శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చునేను గత 47 సంవత్సరాలుగా వేలాది గుండె శస్త్రచికిత్సలు, ముఖ్యంగా బైపాస్ సర్జరీలు చేశాను. పిండి పదార్థాలను ఎక్కువగా తింటూ వ్యాయామాలు చేసినా శరీరంలో కొవ్వు కరగటం పెద్దగా జరగదు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయన ఫలితాలను స్టడీ చేశాను. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ‘ఆరోగ్యకరమైన కొవ్వులు’ ఉండే లోకార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్.) ఆహారం ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి సహాయకారిగా నిలిచిందని నా అధ్యయనంలో గుర్తించాను. ఆ తర్వాతే నేనూ ఇది పాటించి లబ్ధి పొందాను. 17 ఏళ్ల క్రితం మధుమేహం, రక్తపోటుకు ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడేవాడిని. మొదట్లో ఈ ఆహార పద్ధతిని నేనూ నమ్మలేదు. రెండేళ్లు పరిశోధన చేసి ఈ నియమావళిని నమ్మి ప్రారంభించాను. ఇందులో గానుగ ద్వారా తీసిన కొబ్బరి నూనె వాడకం చాలా ప్రధానం. 6 వారాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇన్సులిన్ ఇంజక్షన్, రక్తపోటుకు మందులు వాడటం ఆపేశాను. ‘లో కార్బ్ స్కూల్’ అనే యూట్యూబ్ చానల్లో.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పద్ధతులు పాటించాలో తెలిపే చాలా వీడియో ప్రసంగాలు కూడా చేశాను. ఎల్సీహెచ్ఎఫ్ డైట్ను శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చు. – డా. పి.వి. సత్యనారాయణ ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, ఎల్సిహెచ్ఎఫ్ ఆహార పద్ధతి నిపుణులు, హైదరాబాద్ఎంతెంత మోతాదుల్లో తినాలి?ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.ఏయే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ఎంతెంత ఉన్నాయో తెలుసుకొని, ఏ వ్యక్తి (పసిపిల్లలు, పిల్లలు, యుక్తవయస్కులు, నడివయస్కులు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు)కి ఎంత మోతాదుల్లో అవి అవసరమో లెక్క వేసుకొని తినటం ద్వారా సమతుల ఆహారం తీసుకోవచ్చు. లెక్క వేసుకొని తినాలన్న మాట విడ్డూరంగాను, అంత అవసరమా అనే సందేహం రావచ్చు. కానీ, సత్ఫలితాలు రాబట్టాలంటే అదే అవసరం. ఎంత తినాలో తెలుసుకొని, తెలివిగా తింటే అధిక బరువు/ ఊబకాయంతో పాటు వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఈ సమతులాహారం దోహదం చేస్తుంది. మనం ఏయే పదార్థాలను ఎంతెంత మోతాదులో తినాలో తెలియాలంటే మొదట ఆయా ఆహార పదార్థాల్లో అసలు పోషకాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతి ఆహార పదార్థంలోనూ స్థూల పోషకాలైన పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలతోపాటు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అయితే, వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి. కొన్నిటిలో పిండి పదార్థాలు ఎక్కువగా, ప్రొటీన్లు తక్కువగా, కొవ్వు పదార్థాలు మరీ తక్కువగా ఉంటాయి. మరికొన్నిటిలో కొవ్వు ఎక్కువ, ప్రొటీన్లు మోస్తరుగా, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇంకొన్నిటిలో అసలు పిండి పదార్థాలే ఉండవు. కాబట్టి, వ్యక్తిగతంగా మీకు ఏయే పోషకాలు ఎంత మోతాదులో కావాలో తెలుసుకొని, మీ ఆరోగ్య లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్య సాధనకు అవసరమైనన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని పనిగట్టుకొని లెక్క వేసుకొని తీసుకుంటే మీ ఆరోగ్య లక్ష్యాలను క్షేమకరమైన రీతిలో సాధించవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్ను.. ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. పిండి పదార్థాలను అతి తక్కువగా, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి వినియోగ పద్ధతి గ్లూకోజ్ నుంచి కీటోన్ బాడీస్కి షిఫ్ట్ అవుతుందని డాక్టర్ పీ వీ సత్యనారాయణ తెలిపారు. శక్తి వనరుగా (పిండి పదార్థాల ద్వారా అందే) గ్లూకోజ్కు బదులుగా (కొవ్వు పదార్థాల ద్వారా అందే) కీటోన్ బాడీస్పై శరీరం ఆధారపడుతుంది. బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీల ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించి వాడుకోవటానికి శరీరం అలవాటు పడుతుంది. పిండి పదార్థాలు తక్కువగా తినటం వల్ల ఇన్సులిన్ నాణ్యత మెరుగుపడుతుంది. క్రమంగా ఇన్సులిన్ నిరోధకత సమస్య కూడా తీరుతుంది. ఈ విధంగా ఇన్సులిన్ నిరోధకతతో వచ్చిన జీవన శైలి జబ్బులు సైతం మందులు లేకుండానే సమసిపోతాయని డా. సత్యనారాయణ వివరించారు.ఏమేమి తినొచ్చు?లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్లో కొవ్వులు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తినాలి అంతే. ఈ పరిమితుల్లో ఏయే ఆహార పదార్థాలను సమకూర్చుకోగలిగితే, ఏవి ఇష్టపడితే వాటిని తినొచ్చు. ఏయే ఆహార పదార్థాల్లో, ఏయే వంటకాల్లో మొత్తం ఈ మూడు పోషకాలు ఎనెన్ని గ్రాములు, ఎన్నెన్ని కిలో కేలరీలు ఉన్నాయో లెక్క వేసుకొని, పోషకాహార పట్టిక రాసుకొని మరీ తినాలి. మాంసాహారులు, శాకాహారులు, వీగన్లు ఎవరైనా ఈ డైట్ను అనుసరించవచ్చు. వంద గ్రాములు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలలో 50 గ్రాములకు పైగా పిండి పదార్థాలుంటాయి కాబట్టి అవిగానీ, వాటితో వండిన వంటకాలు గానీ తినటానికి లేదు. నెయ్యి, వెన్న, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, గింజలు, మాంసం తినొచ్చు. మసాలాలు మామూలే. కొబ్బరి గానుగ నూనె వాడాలి. కొబ్బరి పిండి రొట్టెలు, బాదం పిండి రొట్టెలు, అవిసె పిండి రొట్టెలు తినొచ్చు.ఏ నిష్పత్తిలో తీసుకోవాలి?ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలోని స్థూల పోషకాలు మూడు.. పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలు (హెల్దీ ఫ్యాట్స్). ఎల్సీహెచ్ఎఫ్ పద్ధతి ప్రకారం.. ఉదాహరణకు.. 172 సెం.మీ. ఎత్తు, 82 కిలోల బరువు ఉన్న వ్యక్తి.. బరువు తగ్గాలనుకుంటే.. రోజువారీ తీసుకోవాల్సినవి..నికర పిండి పదార్థాలు – 20 గ్రా.(పిండి పదార్థం నుంచి పీచును మినహాయిస్తే మిగిలేవి నెట్ కార్బోహైడ్రేట్లు)మాంసకృత్తులు – 70 గ్రా.ఆరోగ్యకరమైన కొవ్వులు – 100–150 గ్రా.ఈ మూడూ కలిపి కనిష్ఠంగా 1200 నుంచి గరిష్ఠంగా 1500 క్యాలరీల వరకు తీసుకోవాలి.ఈ ఆహార విధానం అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల దీనిపై అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే ఈ ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మనిషికి వారి వారి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య లక్ష్యాలు.. వీటన్నింటి ఆధారంగా వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ ఆహార నియమావళికి అలవాటు పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు సమయం పట్టవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్ను.. ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. -
అర్ధరాత్రి అతిథి
ఆ రాత్రి నాకు ఏదో చప్పుడుకి మెలకువ వచ్చింది. లేచి లైట్ వేసి పడక గదిలోంచి హాల్లోకి వచ్చాను. ఓ కొత్త వ్యక్తి నాకు కనపడ్డాడు. అతను ఎవరో, అక్కడ ఎందుకు ఉన్నాడో నాకు అర్థమైంది. ఇంట్లోకి ఎలా ప్రవేశించాడా అని చూశాను. వంటగదిలోని వెంటిలేటర్కున్న రెండు ఇనప కడ్డీలు వంచబడ్డాయి. అతని చేతిలోని రెండున్నర అడుగుల పొడవున్న పంపు గొట్టంతోనే వాటిని వంచాడని ఊహించాను. ‘‘డబ్బు.’’ అతను చెప్పాడు. ‘‘డబ్బు?’’ ‘‘డబ్బు, నగలు ఇస్తే హాని చేయకుండా వెళ్ళిపోతాను. లేదా...’’ చేతిలోని ఆయుధాన్ని ఝళిపించాడు.గోడకి వేలాడే నా షోల్డర్ బేగ్ని అందుకుని జిప్పుని లాగాను. అందులోంచి తీసిన పర్స్ చూపించాను. దాన్ని తనవైపు విసిరేయమన్నట్లుగా సౌంజ్ఞ చేశాడు. ఆ పని చేశాను. వంగి దాన్ని అందుకుని అందులోని డబ్బుని చూసి మొహం చిట్లించాడు. ‘‘నేను అడిగింది బిచ్చం కాదు.’’ కోపంగా చెప్పాడు. ‘‘ఇంట్లో ఉన్నదంతే.’’‘‘ఇంట్లో రెండు వందల ఏభై మాత్రమే ఉందంటే నమ్మను. నగలు ఎక్కడున్నాయి?’’ అడిగాడు. ‘‘నగలు లేవు. ఇంటి పైభాగం కొత్తగా కట్టించాను. నగలు బేంక్లో తాకట్టులో ఉన్నాయి. గోల్డ్ లోన్ తీసుకున్నాను.’’అతని మొహంలో అసంతృప్తి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ‘‘ఈ ఇంట్లో నువ్వు, నేను తప్ప ఇంకెవరూ లేరని నాకు తెలుసు. నువ్వు మళ్ళీ నీ ఫేమిలీ ఫోటోలోని అందరినీ చూడాలనుకుంటే నేను అడిగింది ఇచ్చి పంపు.’’ కసురుతూ చెప్పాడు. ‘‘నేను అబద్ధం చెప్పలేదు.’’ ‘‘బేంక్ గోల్డ్ లోన్ కాగితాలు చూపించు.’’ ఆ తెలివైన దొంగ కోరాడు. ‘‘అవి బేంక్ లాకర్లో ఉన్నాయి.’’ ‘‘లాకర్ తాళం చెవి చూపించు.’’ రెట్టిస్తూ అడిగాడు. నా భార్య బుర్రలా నాది చురుగ్గా ఆలోచించదు. అతన్ని భౌతికంగా ఓడించలేను. నా కష్టార్జితాన్ని అతనికి అప్పగించలేను. ‘‘ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు చెప్పింది కట్టు కథని నాకు తెలుసు. మీ పడక గదిలో బట్టల అలమర లోపల గోడకి ఫిక్స్ చేసిన ఐరన్ సేఫ్ని తెరు.’’ రుసరుసలాడుతూ ఆజ్ఞాపించాడు. అందులోని నా భార్య నగల విలువ పాతిక లక్షలకి తక్కువ ఉండదు. ‘‘పద.’’ ‘‘మా ఆవిడ దాని తాళంచెవి ఎక్కడ పెట్టిందో నాకు తెలీదు.’’ ‘‘సరే. ఆవిడకి ఫోన్ చేసి అడుగు.’’‘‘ఇప్పుడా?’’ ‘‘భార్యకి భర్త ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు. ముఖ్యంగా తన ప్రాణం మీదకి వచ్చిన సందర్భంలో. మీ ఆవిడతో తాళం చెవి గురించి తప్ప ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే తల పగులుతుంది. అందులో ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని, రేపు వాటి అవసరం ఉందని గుర్తొచ్చిందని చెప్పు. నువ్వు చెప్పిందంతా నేను నమ్మానని అనుకోక. నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రమే ఇస్తున్నాను. నేనీ ఇంట్లోంచి ఈ రాత్రి డబ్బు, బంగారంతో లేదా రక్తం తడిసిన చేతులతో వెళ్ళడం మాత్రం ఖాయం. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడు.’’ కఠినంగా చెప్పాడు. నేను మా ఆవిడకి ఫోన్ చేశాను. ఆమె ఆన్సర్ చేసింది. ‘‘బేంక్లో తాకట్టు పెట్టిన బంగారం రసీదు అవసరమైంది. మన లాకర్ తాళంచెవి ఎక్కడుంది?’’ అడిగాను. ‘‘మర్చిపోయారా? అక్వేరియంలో కత్తి పక్కనే.’’ ‘‘హాల్లో అక్వేరియంలో ఉంది.’’ లైన్ కట్ చేసి అతనివైపు తిరిగి చెప్పాను. ‘‘కత్తేమిటి?’’ అడిగాడు. ‘‘ఫిష్ టేంక్లోని చేపలకి ఐరన్ అందాలని ఓ కత్తిని ఉంచాం. అది ఎవరూ వెతకని చోటని అందులో లాకర్ తాళంచెవి ఉంచుతామన్న సంగతి మర్చిపోయాను.’’ అతను నా వెంట హాల్లోకి నడిచాడు. అక్వేరియంలో ఆరంజ్, నీలం రంగు చేపలు తిరుగుతున్నాయి. నేను నీళ్ళల్లో చేతిని ఉంచబోతే అరిచాడు. ‘‘ఆగు. కత్తిని తీద్దామనా? నేను తీస్తాను.’’ నన్ను పక్కకి నెట్టి అక్వేరియం నీళ్ళలో తన ఎడమ చేతిని ఉంచాడు. అరగంట తర్వాత ఆ దొంగని అంబులెన్స్లోకి ఎక్కిస్తూంటే చెప్పాను.‘‘అతనికి స్టింగ్ రే చేప ముల్లు గుచ్చుకుందని డాక్టర్కి చెప్పండి.’’ ఆ అక్వేరియంలోని చేపల్లో ఆ చేప ఖరీదైంది. కొరడాలా ఉండే దాని తోకతో కొడితే, దాని చివర ఉన్న విషపు ముల్లు ద్వారా శరీరంలోకి విషం ఎక్కి క్షణాల్లో మనిషికి స్పృహ తప్పుతుంది. మా ఆవిడ నాలా కాదు. ఏం జరుగుతోందో ఇట్టే ఊహించింది. అతనే అందులో చేతిని ఉంచాలని, కత్తిని ఉంచినట్లు అబద్ధం చెప్పింది. చెప్పాగా. ఆవిడ మెదడంత చురుగ్గా నా బుర్ర పని చేయదు.ఆ లాకర్ తాళంచెవి మంచానికి ఉన్న చిన్న రహస్య అరలో ఉందని నాకు తెలుసని మా ఆవిడకి తెలుసు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఇంటికీ నగధగలు
ఆభరణాల అలంకరణ ఇంటికీ వర్తిస్తుందని ఈ డిజైన్స్ చూస్తేనే అర్ధమవుతుంది. సంపన్నతకు అద్దం పట్టే ఈ జ్యూలరీ స్టైల్ డెకర్ ప్రత్యేక ఈవెంట్స్కు మరిన్ని హంగులను చేకూరుస్తుంది. సాధారణంగా కర్టెన్ అలంకరణ కిటికీలకు, గుమ్మాలకు స్టయిలిష్ టచ్ను జోడించడానికి ఫ్యాబ్రిక్, డిజైన్స్ ఎంపికలో శ్రద్ధ కనబరచేవారు. ఇప్పుడు వాటి మీదుగా క్రిస్టల్ లేదా ముత్యాలు, రంగు రాళ్లు, ఇతర పూసలతో చేసిన డిజైన్లు టై–బ్యాక్లు, హోల్డ్బ్యాక్లు, రింగులు అంటూ కర్టెన్ ఆభరణాలు మరింత ఆకట్టుకునేలా అందుబాటులోకి వచ్చేశాయి. ముత్యాల వరసవాడుకలో ఇవి ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. కృత్రిమ ముత్యాలు లేదా పూసల వరుసలు ప్లెయిన్ కర్టెన్లకు మరింత హంగునిస్తాయి.క్రిస్టల్ వెలుగులుకొన్ని డిజైన్లలో కాంతిని ఆకర్షించడానికి, గది అలంకరణకు విలాసవంతమైన అనుభూతిని జోడించడానికి వివిధ పూసలు, స్ఫటికాలు లేదా రైన్స్టోన్లు మంచి మెరుపునిస్తాయి.లోహాల ధగధగలుఅందమైన డిజైన్లతో లోహపు ఆభరణాలను కర్టెన్లు ఉన్న గోడలకు సెట్ చేస్తారు. కొన్నిసార్లు బంగారం లేదా వెండి లోహాలతో పూసలు, క్రిస్టల్స్ జత చేసినవీ ఇంటికి ధగధగలనిస్తాయిహుక్ రింగ్స్ కర్టెన్ హార్డ్వేర్ కూడా ‘నగల‘ సౌందర్యంతో అందుబాటులోకి ఉంటున్నాయి. మెటల్ లేదా ప్లాస్టిక్లో ఇవి లభిస్తాయి. ఈ రింగులు బంగారం, వెండి, రాగి లోహాలతో ఉంటాయి. వీటికి డిజైనర్లు ఆభరణాల హంగులన్నీ అద్దుతున్నారు. ఈ ఆభరణాలు కర్టెన్ రాడ్ చివరన, డ్రేప్లపైన సెట్ చేస్తారు. వీటిలో ఎన్నో డిజైన్ల వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. లోహాలు, నాణ్యత, డిజైన్లను బట్టి వందల రూపాయల నుంచి ఎంత ఖరీదైనా తమ స్థాయిని బట్టి ఏర్పాటు చేసుకునే వీలు ఈ ‘నగలకు’ ఉంది. – ఎన్నార్ -
కెమెరా ఆఫ్.. భూమి ఆన్!
బిగ్బాస్లో కనిపించిన నిజమైన మనసు, సహజమైన వెలుగు భూమి శెట్టిని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు ఆ నిరాడంబరతలో దాగి ఉన్న ధైర్యం, నిశ్శబ్దంగా పెరిగిన శక్తి ‘మహాకాళి’గా మారి సినీ ప్రపంచంలో ఒక కొత్త రూపాన్ని సృష్టించబోతోంది. ఆ ప్రయాణంలోని విశేషాలన్నీ ఆమె మాటల్లోనే మీ కోసం. నేను కర్ణాటకలోని కుందాపురలో పుట్టాను. సముద్రపు గాలి, ఇంటి ముందున్న చెట్ల నీడ, చిన్న చిన్న పండుగల హడావుడి అవే నా బాల్యపు ఆనందాలు.అమ్మానాన్న భాస్కర్ శెట్టి, బేబీ శెట్టిలది సాధారణ జీవితం, వాళ్లు నేర్పిన విలువలే నేడు నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాయి.ఇంజినీరింగ్ చేశాను. కాని, నా మనసు మాత్రం పూర్తిగా యాక్టింగ్పైనే ఉండేది. అలా నా నటన ప్రయాణం టీవీతో మొదలైంది. ‘కిన్నరి’ సీరియల్లో చేసిన ‘మణి’ పాత్ర నాకు సినిమాల ప్రపంచానికి తలుపులు తెరిచింది. 2019లో ‘బిగ్ బాస్ కన్నడ’లోకి వెళ్లినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు కాని, నా నిజమైన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. రన్నరప్గా బయటికి వచ్చినా కూడా, నాకు వచ్చిన ప్రేమ మాత్రం ఒక విజేతలా నిలిచింది.ఆ తర్వాత వచ్చిన ‘ఇక్కట్’ సినిమా ప్రేక్షకుల అభిమానం రెట్టింపు చేసింది. ఆ ప్రేమే నాకు సినిమా మీదున్న నమ్మకాన్ని మరింత బలపరచింది. తర్వాత వచ్చిన ‘షరతులు వర్తిస్తాయి’, ‘కింగ్డమ్’ వంటి ప్రాజెక్టులు నా నటనకు కొత్త షేడ్స్ ఇచ్చాయి. ప్రతి పాత్ర నాకు నాలో ఉన్న మరో భూమిని పరిచయం చేసింది.∙ఇప్పుడు నా ముందున్న పెద్ద మైలురాయి ‘మహాకాళి’. సూపర్హీరో ఫిల్మ్లో ఫీమేల్ లీడ్గా నిలవడం నాకు ఒక గౌరవం మాత్రమే కాదు. ఒక బాధ్యత కూడా. ఈ పాత్ర నా శక్తులను కొత్తగా పరీక్షించబోతోంది.∙నా రోజువారీ జీవితం మాత్రం చాలా సింపుల్. నాట్యం, కథలు, సంగీతం ఇవే నా హ్యాపీ స్పేస్.కెమెరా ముందు నటిస్తున్నంతసేపు ‘భూమి శెట్టి’ అనే వ్యక్తిని మరచిపోతాను. కాని, కెమెరా ఆఫ్ అయ్యాక మళ్లీ కుందాపుర అమ్మాయిగా నా చిన్న ప్రపంచంలోకి వెళ్తాను.∙అభిమానులు పంపే ప్రేమే నా ఎనర్జీ. వాళ్లే నా నమ్మకం. వాళ్ల వల్లే నా ప్రయాణం ప్రతి రోజూ మరింత అందంగా మారుతోంది. -
ఈ వారం కథ: సముద్రం
మలక్కా జలసంధి ..మలయా ద్వీపకల్పం సుమత్రా ద్వీపానికి మధ్య ఉన్న 930 కిలోమీటర్లు ఉన్న జలసంధి.అక్కడ నుండి పశ్చిమానికి 90 మైళ్ళ దూరంలో ఒక ఓడ ఆగి ఉంది. ఆ ఓడ మీద ఒక నలజెండా ఎగురుతూ ఉంది. దాని మీద ఒక పుర్రెబొమ్మ ఉంది.ఆ ఓడలో సుమారు ఒక ఇరవై మంది వరకు ఉన్నారు. ఓడ డెక్ మీద కూర్చున్న వారందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుంది వాళ్ళ వాలకం. వారందరి చేతుల్లోనూ పుర్రెలతో తయారు చేసిన మద్యం గ్లాసులు ఉన్నాయి. వాటిల్లో పోసిన ‘రమ్’ తాగుతూ వినోదిస్తున్నారు.ఇంతలో ఒక పెద్ద అల వచ్చి ఆ డెక్ మీదకు కొన్ని చేపలను విసిరేసి సముద్రంలో కలిసిపోయింది.చెవులకు రింగు పెట్టుకుని; తలకు నల్లటి పాగా కట్టుకుని, ఆ పాగాలో పిడిబాకు ఉంచిన ఒక వ్యక్తి తన పక్కన పడి ఉన్న పెద్దచేపను చేతిలోకి తీసుకున్నాడు.దాని నోరు తెరిచి, తాను తాగుతున్న రమ్ను నోటిలో పోశాడు. తర్వాత దాన్ని నోటిలో పెట్టుకుని నమలసాగాడు.అదంతా చూస్తున్న మిగిలిన అందరూ ‘హే నాయకా’ అంటూ అరవసాగారు. వాళ్ళందరూ అలా అరుస్తున్న సమయంలో సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి డెక్ మీదకు వచ్చాడు. అందరూ నిశ్శబ్దమై పోయారు. ‘నాయకా!’ అంటూ అతడికి సలాం చేశాడు.తరువాత తాను తెచ్చిన వివరాలతో ఒక మ్యాప్ అతడికి అందించాడు. అది చూసిన అతడు ‘మన ఓడను ఇక్కడి నుంచి ఉత్తరం దిశగా మళ్లించండి. మనం ఎదురు చూస్తున్న నౌక ఇంకొన్ని గంటల్లో బయల్దేరుతుంది’ అని ఆజ్ఞాపించాడు. ఓడ ముందుకు కదిలింది.అందరూ తమ వద్ద ఉన్న పిడిబాకులను తుపాకులను, కత్తులను పట్టుకుని ఉన్నారు. వారందరూ తమ నాయకుడి ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారు.వారందరూ స ..ము ..ద్ర.. పు .. దొం.. గ.. లు ... పైరేట్స్!సాల్ శెట్టి ద్వీపం..దేశంలో అత్యంత రద్దీగా ఉండే ముంబై ఓడరేవు.కదలడానికి సిద్ధంగా ఉన్న కార్గో నౌకలతో; సముద్రతీరానికి చేరుకుంటున్న ఇతర నౌకలతో; ప్రయాణికులతో; అటు ఇటు తిరుగుతూ తమతమ విధులు నిర్వర్తిస్తున్న ఓడల సిబ్బందితో కిటకిటలాడుతోంది.తీరంలో కొద్దిదూరంలో ఒక పెద్ద నౌక లంగరు వేసి ఉంది. అది ముంబై తీరం నుంచి సింగపూర్ వరకు ప్రయాణించే క్రూజ్ షిప్ అయిన ‘రాయల్ డైమండ్ డాన్’.ప్రయాణికులందరూ ఒక్కొక్కరుగా ఓడలోకి వెళ్తున్నారు. ఎంట్ర¯Œ ్స వద్ద వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే వారిని డెక్ మీదకు పంపిస్తున్నారు.ఓడ ఎక్కబోయే ముందు ఒక అందమైన యువతి ఫోన్ మాట్లాడుతూ అక్కడ నిలబడి ఉంది. మాట్లాడుతూ మాట్లాడుతూ యథాలాపంగా ముందుకు చూసింది. అక్కడ ఒక వ్యక్తి తన వద్దకే వస్తున్నట్టు ఆమెకు అనిపించింది. ఆ వ్యక్తి కలర్ గాగుల్స్ ధరించి, జేబుల్లో చేతులు పెట్టుకుని ముందుకు వస్తున్నాడు. తల పైకెత్తి ఓడను చూస్తూ వస్తున్నట్టు ఆమెకు అర్థమైంది.ఈలోగా ఆ గాగుల్స్ ఉన్న వ్యక్తి వచ్చి ఆమెను ఢీ కొట్టాడు. ఆ ఢీ కొట్టడంతో ఆమె పట్టుకున్న ఫోన్, అతను పెట్టుకున్న గాగుల్స్ ఒకేసారి కింద పడిపోయాయి. ‘ఏయ్ మిస్టర్ కళ్ళు పైకి పెట్టుకుని నడిస్తే ఇలాగే ఉంటుంది.’ అంటూ తన ఫోన్ కోసం కిందకు వంగింది. ‘సారీ మిస్’ అంటూ ఆ వ్యక్తి కూడా గాగుల్స్ కోసం కిందకు వంగాడు. అదే సమయంలో ఇద్దరి తలలు మరోసారి ఢీ కొట్టుకున్నాయి.అబ్బా అనుకుంటూ పైకి లేచింది ఆ యువతి. ‘ఏయ్ మిస్టర్ ఇలాంటి పెద్ద ఓడను ఎప్పుడూ చూడలేదా?’చిరుకోపంగా అడిగింది. ‘ఇప్పుడే మొదటిసారి ఇంత పెద్ద ఓడను చూస్తున్నాను.’ అమాయకంగా మొహం పెట్టి ఆమెకు బదులిచ్చాడు. అతడి కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి.ఆమెను చూస్తూ ‘మీరు చాలా అందంగా ఉన్నారు. మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు బాగా సరిపోతారు’ అని ముందుకు నడుస్తూ చెప్పాడు అతడు.‘అయినా నేను సింగపూర్లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్తున్నట్టు ఇతడికి అర్థమైందా?’ మనసులో అనుకుంటూ, ‘మిస్టర్ పోకిరి’ అనుకుంది ఆమె.తరువాత ఓడ ఎక్కడానికి వెళ్ళింది. మిస్టర్ పోకిరి కూడా డెక్ మీదకు చేరుకున్నాడు.అరగంట తర్వాత మెల్లిగా ‘రాయల్ డైమండ్ డాన్’ అరేబియా సముద్ర జలాల్లో ముందుకు కదిలి క్రమేణా వేగం పుంజుకుంది.ఇండియన్ నేవీ హెడ్ క్వార్టర్స్...ఒక బులెట్ ప్రూఫ్ కారు శరవేగంగా వచ్చి ఆ భవనం ముందు ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి కిందకు దిగాడు. ఆ వ్యక్తి మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతడిని చూడగానే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ‘సెల్యూట్’ చేస్తున్నారు. కాని, అదంతా పట్టించుకోని ఆ వ్యక్తి పరిగెడుతున్నట్టే లోపలకు అడుగు పెట్టాడు.నాలుగు అంతస్తులున్న ఆ భవనంలో మూడవ అంతస్తులో ఉన్న సౌత్ బ్లాక్ వింగ్. లిఫ్ట్ కోసం చూడకుండా క్షణానికి రెండు మెట్లు ఎక్కుతూ వింగ్లోకి దూసుకుపోయాడు.సౌండ్ ప్రూఫ్ గది అయిన ఆ గదిలోకి దూసుకువచ్చిన ఆ వ్యక్తిని చూశాడు నేవీ చీఫ్ అగర్వాల్. తన నోట్లో ఉన్న సిగార్ను బయటకు తీస్తూ ఆ వ్యక్తి వంక చూశాడు. ఆ వ్యక్తి నేవీ ఆఫీసర్ తరుణ్ మిశ్రా.‘బాస్! అక్కడ దాడి జరగబోతోంది. రాయల్ డైమండ్ డాన్ నౌకను పైరేట్స్ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని మనకు రహస్య సమాచారం అందింది. వెంటనే మన వాళ్ళను అలెర్ట్ చేయకపోతే నౌకలో ఉన్న ప్రయాణికులను సముద్ర దొంగలు ప్రాణాలతో వదిలిపెట్టరు.’ తరుణ్ కంగారుగా చెప్పాడు.అంతా వింటున్న అగర్వాల్ ఏమీ మాట్లాడకుండా మళ్లీ సిగార్ నోట్లో పెట్టుకుని, పైకి లేచాడు. అతడిని చూస్తూ .. ‘ఈ సమాచారం నాకు కొన్ని గంటల కిందటే వచ్చింది’ అన్నాడు తాపీగా.‘బాస్! మరిప్పుడు డైమండ్ డాన్ నౌకను కాపాడటం ఎలా?’ ఆందోళనగా అడిగాడు.‘మరేం పర్వాలేదు. సముద్రదొంగలను వెంటాడి వేటాడడానికి మన మెరైన్ కమాండో విజయ్ రాణా– డైమండ్ డాన్ నౌకలో ఉన్నాడనే సమాచారం కూడా వచ్చింది. పదిహేను రోజులు సెలవు తీసుకున్న విజయ్ ఆ షిప్లో వెళ్తున్నాడని తెలిసింది’ అన్నాడు.ఆ మాటలు వినగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు తరుణ్ మిశ్రా. తమ చీఫ్ కంగారు లేకుండా అలా తాపీగా ఎందుకున్నాడో అర్థమైంది.అనంత సాగర జలాలలో ‘డైమండ్ డాన్’ నౌక 2 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోంది. ప్రయాణికుల్లో కొంతమంది తమ తమ క్యాబిన్లలో ఉండిపోయారు. కొంతమంది నౌకలో ఉన్న ఫుడ్ కోర్ట్స్లో– నౌకను చూడాలని కుతూహలంతో ఇలా ఎవరికి వారు తమతమ పనులలో ఉన్నారు.‘డైమండ్ డాన్ రెస్టారెంట్’ తాటికాయలంత మెరిసే అక్షరాలతో రాసిన పేరుని చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు మిస్టర్ పోకిరి. అలా అడుగుపెట్టగానే అతడి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. కారణం అక్కడ మిస్ ఇంటర్నేషనల్ ఫుడ్ తింటూ కూర్చుని ఉంది. ఆమెను చూడగానే ‘ఈ బ్రహ్మచారి జీవితం ఈ భామకే అంకితం’ అని పాడుతూ.. ఫుడ్ తీసుకుని వెళ్లి ఆమె ముందు కూర్చున్నాడు. ఆమె అతడిని కళ్ళెత్తి చూసి ‘ఇక్కడకు కూడా వచ్చేసాడు మిస్టర్ పోకిరి’ అనుకుంటూ తినడం మొదలెట్టింది.‘హలో మిస్! నేను మిస్టర్ బ్రహ్మచారిని మాత్రమే కాని, పోకిరిని మాత్రం కాదు’ అన్నాడు. తినడం మొదలుపెడుతూ.తాను మనసులో అనుకున్న మాటలు ఇతడికెలా తెలిశాయనుకుంటూ ఆమె ఆశ్చర్యపోయింది.ఉన్నట్టుండి తమను ఎవరో గమనిస్తున్నట్టు బలంగా అనిపించసాగింది అతడికి.వెంటనే అతడు అలెర్ట్ అయ్యాడు. కనుచివరల నుంచి చుట్టూ గమనించాడు. అందరూ ఎవరి పనుల్లో వారున్నారు కాని, మిస్ ఇంటర్నేషనల్ వెనుక ఉన్న కుర్చీల్లో ఉన్నవారు యథాలాపంగా తమనే గమనిస్తున్నారు.వారు మొత్తం నలుగురు ఉన్నారు. ఏదో తింటూ, తాగుతూ కనురెప్ప వేయకుండా ఆమెనేచూస్తున్నారు. ఆమె తినడం ముగించి, లేచి బయటకు నడిచింది. మిస్టర్ పోకిరి కూడా లేచి, ఆమె వెనుక వెళ్ళడానికి అన్నట్టుగా ముందుకు కదిలాడు.అంతలో ఆ గమనిస్తున్నవారిలో ఒకడు అతడి వద్దకు అడ్డుగా వచ్చాడు. వాడిని చూసిన మిస్టర్ పోకిరి ‘ఎవరు బాస్ నువ్వు? అడ్డు తప్పుకో’ అన్నాడు మిస్ ఇంటర్నేషనల్ వెళ్లిన వైపుగా చూస్తూ...వాడితో ఉన్న మిగిలిన ముగ్గురూ మిస్టర్ పోకిరిని చుట్టుముట్టారు. అప్పుడు గమనించాడు వారందరినీ... వారి వాలకం... వారి మాటల్లో కరుకుదనం... వారి బలిష్టమైన చేతులు... శరీరాలు కనుచివరల నుంచి గమనించాడు అతడు. అక్కడ ఉన్న నలుగురూ అదే తీరులో ఉన్నారు.వాళ్లెవరో అతడికి అర్థమైపోయింది. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. చుట్టూ చూశాడు. స్త్రీలు, చిన్నపిల్లలతో సహా నౌకలో చాలామంది అక్కడున్నారు.వారందరినీ వీళ్ళు చుట్టుముడితే? అసలు వీళ్ళు నౌకలోకి ఎలా రాగలిగారు?ఎంతమంది వచ్చారు? ఆలోచిస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలాడు మిస్టర్ పోకిరి.ఆలోచిస్తూ డెక్ మీదకు వచ్చాడు.అప్పటికే అక్కడ మిస్ ఇంటర్నేషనల్ డెక్ మీద నిలబడి సముద్రాన్ని చూస్తోంది.అతడిని చూడగానే ఆమె ‘వచ్చేశాడు మిస్టర్ పోకిరి’ అని మనసులోనే తిట్టుకుంది.కాని, అతడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అతడి మెదడు శరవేగంగా ఆలోచిస్తోంది.అతడి వెనగ్గా వచ్చిన నలుగురిలో ఇద్దరు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టారు.అది చూసిన మిస్టర్ పోకిరి ఆమె చేయి పట్టుకుని ముందుకు పరుగు తీశాడు.వాళ్లిద్దరూ డెక్ చివరిభాగానికి చేరుకున్నారు. అక్కడ ఆ సమయంలో ఎవరూ లేరు.తమను చుట్టుముట్టిన ఆ ఇద్దరినీ మిస్టర్ పోకిరి గాలిలోకి డైవ్ చేస్తూ, ఊహించని వేగంతో ఒక్కసారిగా తన్నాడు. ఆ వేగానికి వాళ్లిద్దరూ అల్లంతదూరంలో పడ్డారు.పైకి లేచి అక్కడినుంచి పారిపోయారు. వారిని చూసి మిగిలిన ఇద్దరు కూడా అక్కడినుంచి జారుకున్నారు. అదే సమయంలో అతడి షూ నుంచి జారిపడిన ఐడీ కార్డును చేతిలోకి తీసుకున్న మిస్ ఇంటర్నేషనల్ ఆ కార్డు చూసి, స్థాణువులా అలా నిలబడిపోయింది.ఆమె ముందుకు వచ్చిన మిస్టర్ పోకిరి ‘హలో మిస్!’ అన్నాడు.ఆ మాటలకు ఉలిక్కిపడి తేరుకున్న ఆమె ‘మీరు మెరైన్ కమాండో విజయ్ రాణా’... అంటూ ఆగిపోయింది.తాను మిస్టర్ పోకిరి అనుకుంటున్నవాడు విజయ్ రాణా నా? అతడి గురించి తాను ఎన్నోసార్లు విని ఉంది. ఎన్నో నౌకలను, ఎందరో ప్రయాణికులను కాపాడటంలో విజయ్ రాణాను మించిన సాహసవంతుడు ఎవరూ లేరని ఎన్నోసార్లు విని ఉంది. అలాంటి వ్యక్తి తన ఎదురుగా తనతో పాటే ఉంటూ తనను కాపాడటం అనేది ఆమెకు నమ్మశక్యం కాకుండా ఉంది. ‘హలో మిస్!’... చిటికె వేస్తూ మళ్ళీ పిలిచాడు విజయ్ రాణా. తేరుకున్న ఆమె ‘నా పేరు అర్చన. మనదేశం తరపున నేను సింగపూర్లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్తున్నాను’ అన్నది.‘మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో అంతా నాకు తెలుసు’ అన్నాడు విజయ్ రాణా.ఆ మాటలకు అర్చన ఆశ్చర్యంగా ఉండిపోయింది.‘అర్చనా! మనం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాం. ఈ నౌకలో ఉన్న ప్రయాణికులందరినీ కాపాడాలి. నువ్వు వెంటనే నీ కేబిన్లోకి వెళ్ళిపో, క్విక్!’ అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలాడు విజయ్ రాణా.అర్చన ‘ఏమైంది?’ అని అడిగింది. వెళ్తూ వెళ్తూ ‘ఈ నౌకలో సముద్రపు దొంగలున్నారు’... చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్ రాణా.∙∙ దెబ్బ తిన్న దొంగలు కచ్చితంగా ఊరికే ఉండరు. ప్రయాణికులను భయపెట్టడమో, దోచుకోవడమో చేసే పనిలో తప్పకుండా ఉంటారని అనుకున్నాడు విజయ్ రాణా. ముందు ఈ నౌకలోకి పైరేట్స్ ఎంతమంది వచ్చారో తెలుసుకోవాలనుకుంటూ నౌక కెప్టెన్ శ్రీకర్ వద్దకు వెళ్ళాడు.‘కెప్టెన్ మన నౌకలో సముద్రపు దొంగలు ప్రవేశించారు. వారెంతమంది ఉన్నారో మొదటగా తెలుసుకోవాలి. తరువాత వారినెలా ఎదుర్కోవాలో చూద్దాం’ అన్న రాణా మాటలకు శ్రీకర్ అదిరిపడ్డాడు.‘అట్టే సమయం లేదు’ అని చెబుతున్న రాణా మాటలకు శ్రీకర్ వెంటనే వెళ్లి, నౌకలో ఉన్న కెమెరాల ఫుటేజీ మొత్తం విజయ్ రాణాకు చూపించసాగాడు.కిందటి రాత్రి నౌక ఒకచోట లంగరు వేసినప్పుడు లంగరు కోసం ఉపయోగించిన మోకులాంటి తాడు ద్వారా వాళ్ళందరూ నౌకలోకి సాధారణ ప్రయాణికుల రూపంలో వచ్చారు. వాళ్ళు సుమారు ఇరవై మంది వరకు ఉన్నారని కనిపెట్టాడు విజయ్ రాణా.అది చూడగానే వెంటనే, నౌకలో సిబ్బందిని ఆపదలో ఉన్నప్పుడు అలెర్ట్ చేసే అలారం మోగించాడు.శ్రీకర్ వెంటనే ‘మీరు విజయ్ రాణా కదా!’ అడిగాడు. చిరునవ్వుతో ఔనన్నట్లుగా తలాడించి, అక్కడినుంచి వెళ్ళిపోయాడు.ఇక ఎంతమంది సముద్రపుదొంగలు దాడి చేసినా తమకు ఎలాంటి భయం లేదనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు శ్రీకర్. అతను లోపలకు రాగానే అక్కడే ఉన్న దొంగల నాయకుడు అతడికి తుపాకీ గురి పెట్టాడు. తరువాత అతడిని బందీగా చేసుకుని, నౌకను దారి మళ్ళించమని ఆదేశించాడు.అలారం మోగగానే నౌకలో పై అంతస్తులలో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ప్రమాదాన్ని శంకించారు. అన్ని క్యాబిన్లకు ఉన్న లాక్ సిస్టమ్ను ఫ్రీజ్ చేసేశారు. దాని వల్ల లోపల ఉన్నవాళ్లు బయటకు రాలేరు. బయట వాళ్ళు లోపలికి పోలేరు. కాని, భయంతో కేకలు వేస్తున్న మిగిలిన ప్రయాణికులను సముద్రపు దొంగలు చుట్టుముట్టి, అందరి తలలకు తుపాకులు ఎక్కుపెట్టారు. అందరినీ నౌక డెక్ మీదకు తీసుకు వచ్చారు. వారిలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. డెక్ మీద ప్రయాణికులందరినీ నిలబెట్టారు. వారి చుట్టూ దొంగలు చుట్టుముట్టి ఉన్నారు.కెప్టెన్ శ్రీకర్ కాబిన్... దొంగల నాయకుడు అతడి పక్కనే ఉండి తలకు తుపాకీ గురిపెట్టి ఉన్నాడు. నౌకను తనకు ఇష్టం వచ్చిన దిశలో మళ్లిస్తున్నాడు.శ్రీకర్ చేసేదేమీ లేక అతడు చెప్పినట్టుగానే నౌకను నడుపుతున్నాడు.ఇంతలో ఒక్కసారిగా దొంగలనాయకుడు దూరంగా ఎగిరి పడ్డాడు. అతడి చేతిలోని తుపాకీ అల్లంత దూరంలో ఎగిరి పడింది.మెరుపువేగంతో కదిలి ఆ తుపాకీని అందుకున్నాడు విజయ్ రాణా. దొంగల నాయకుడిని ఇద్దరూ కలిసి పెడరెక్కలు విరిచి కట్టారు. అతడిని చెరోపక్క పట్టుకున్న విజయ్ రాణా, శ్రీకర్ డెక్ మీదకు వచ్చారు.అక్కడ తమ నాయకుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న దొంగలందరూ ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు.దొంగలనాయకుడి తలకు తుపాకీ గురిపెట్టిన విజయ్ వారిని చూస్తూ, ‘అందరూ మీ తుపాకులను, కత్తులను పక్కన పెట్టండి. లేకుంటే మీ నాయకుడి ప్రాణాలకు ముప్పు వస్తుంది’ అన్నాడు.దొంగలందరూ కలిసి తమ తుపాకులను, కత్తులను ఒక చోట పెట్టారు. ‘అందరినీ వదిలేయండి. లేకపోతే...’ అన్నాడు శ్రీకర్.అందరినీ వదిలి దొంగలందరూ ఒకపక్కగా వచ్చారు. వారిని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బంధించారు. అదే సమయంలో తప్పించుకున్న దొంగల నాయకుడు ముందుకు వేగంగా కదిలి తన తలపాగాలో దాచి ఉన్న పిడిబాకును బయటకు తీసి దగ్గరలో ఉన్న అర్చనను ముందుకు లాగి, ఆమె కంఠానికి గురి పెట్టాడు.అది చూసిన విజయ్ రాణా కదలకుండా అక్కడే ఆగిపోయాడు.‘మర్యాదగా మమ్మల్ని ఇక్కడనుండి వెళ్లనివ్వండి. లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తాను’ అన్నాడు దొంగల నాయకుడు.అందరూ అక్కడే ఆగిపోయారు. దొంగలందరినీ వదిలిపెట్టారు. అర్చనను ముందుకు తీసుకెళ్తున్నాడు దొంగలనాయకుడు. విజయ్ రాణా ఊహించని మెరుపువేగంతో కదిలి, దొంగలనాయకుడిని వెనుక నుంచి ఒక్క తోపు తోశాడు. ఆ దెబ్బకు దొంగల నాయకుడు ముందుకు తూలి పడిపోయాడు. కాని, రెప్పపాటులో మిగిలిన దొంగలందరూ అర్చనను చుట్టుముట్టారు. ఆమెను మధ్యలో పెట్టుకుని ముందుకు నడుస్తున్నారు.పైకి లేచిన దొంగలనాయకుడు విజయ్ రాణాను చూసి, వికటంగా నవ్వుతూ ముందుకు కదిలాడు.వారందరూ కలిసి డెక్ అంచుల వరకు వెళ్లారు. అర్చనను తీసుకుని సముద్రంలో ఉన్న తమ మరపడవలో వెళ్లిపోవాలని దొంగల నాయకుడు మిగిలినవారిని ఆదేశించాడు.అలాగే చూస్తూ ఉండిపోయిన విజయ్ రాణా మెరుపువేగంతో కదిలాడు. అతడు ఏం చేస్తాడా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. రెప్పపాటు వేగంలో డెక్ దగ్గరకు చేరుకోవడం... ఒక పెద్ద రాకాసి అల ఉవ్వెత్తున లేచి డెక్ మీదకు ఉరకడం రెండు ఒకేసారి జరిగాయి.అల ధాటికి కొట్టుకుపోతున్న అర్చనను ఒక చేత్తో గట్టిగా హత్తుకుని, డెక్ మీద ఉన్న బలమైన ఉక్కు పైపును మరొకచేత్తో గట్టిగా పట్టుకున్నాడు విజయ్ రాణా.ఆ అల ధాటికి సముద్రంలోకి కొంతమంది దొంగలు కొట్టుకుపోగా, మిగిలినవారిని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బంధించారు. సముద్రపు దొంగల దాడికి గురైన నౌకలో ఉన్న ప్రయాణికులను ప్రత్యేక భద్రతతో ఇండియాకు తిరిగి పంపిస్తున్నారు. ఆ నౌక డెక్ మీద విజయ్ రాణా పక్కన అర్చన కూడా ఉంది.ఆమెను చూస్తూ ‘మిస్ ఇంటర్నేషనల్ పోటీలు మిస్ అయిపోయావు’ అన్నాడు విజయ్ రాణా. ‘ఈ మిస్టర్ పోకిరికి మిసెస్ కావాలని.. కావాలనే ఆ పోటీలు మిస్ చేసుకున్నాను’ అన్నది అతడిని చుట్టేసి, అతని ప్రేమకు, సాహసానికి బందీ అవుతూ... ∙శ్రీసుధామయి -
కథాకళి: వన్ బై టు
గత ఆరేళ్ళుగా ఓ కార్పొరేట్ హాస్పిటల్లో నర్స్గా పని చేస్తున్న అద్విత ఆరోజు అంబులెన్స్లో ఓ ఫామ్ హౌస్కి వెళ్ళింది. ఆ ఇంటి సర్వెంట్ మెయిడ్ చెప్పింది.‘‘అతను మా సార్ డ్రైవర్. వెనక ఔట్ హౌస్లో ఉంటాడు. కారు సిద్ధం చేయమని చెప్పడానికి వెళ్ళి చూస్తే, అపస్మారకంగా కనిపించాడు. సార్కి చెప్తే మీకు ఫోన్ చేయమన్నారు.’’‘‘అతనికి ఎవరైనా ఉన్నారా?’’ ఆమె వెంట నడుస్తూ అద్విత అడిగింది.‘‘లేరు. బ్రహ్మచారి. ‘జీతం బానే వస్తుంది. పెళ్ళి చేసుకోలేదే’మని అడిగితే ఓ నవ్వు నవ్వుతాడు తప్ప జవాబు చెప్పడు.’’స్ట్రెచర్తో ఇద్దరు పేరామెడిక్స్ వారిని అనుసరించారు. సర్వెంట్ మెయిడ్ వాళ్ళని ఫామ్ హౌస్ వెనక ఉన్న పెంకుటింటికి తీసుకెళ్ళింది. అద్విత ఇనుప బద్దీలకి అల్లిన ప్లాస్టిక్ నవారు మంచం మీది సన్నటి పరుపు మీద స్పృహలో లేని రోగిని, ఓ మూల ఉన్న డంబెల్స్ని చూసింది.‘‘ఇతని వయసు తెలుసా?’’ అద్విత అతని బీపీని చూస్తూ అడిగింది.‘‘రాబోయే నెలకి ముప్ఫై ఒకటి వస్తాయి అనుకుంటా.’’‘‘బీపీ బాగా పడిపోయింది. హార్ట్ ఎటాక్. గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. ఇతన్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి.’’ స్టెతస్కోప్తో అతని గుండె చప్పుడుని విని, అతనికో ఇంజక్షన్ ఇచ్చి చెప్పింది. ‘‘రోజూ ఎక్సర్సైజ్ చేస్తాడు. చెడ్డ అలవాట్లు లేవు. కాఫీ, టీలు కూడా తాగడు. టీ ఇస్తానంటే, ఒంటరిగా తాగను అంటాడు. ‘నాతో కలిసి తాగు’ అంటే నీతో కాదు అంటాడు. అయినా ఇదేం ఖర్మ?’’‘‘ఈ రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యం కూడా ఓ రోగమే. చెడ్డ అలవాట్లు లేని కన్నడ నటుడు శివరాజ్ కుమార్కి చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ వచ్చి పోలా?’’అంబులెన్ ్సలో వెళ్ళేప్పుడు అతను కళ్ళు తెరిచి చూసి మూసుకున్నాడు. కాని వెంటనే మళ్ళీ కళ్ళు తెరచి అద్వితని చూశాడు. అతని మొహంలో బలహీనమైన చిరునవ్వు. ఏదో మాట్లాడాడు. కాని అది వినపడకపోవడంతో ఆమె తన చెవిని అతని నోటి దగ్గరికి తీసుకెళ్ళింది.‘‘నిన్ను చూస్తే సంతోషం వేస్తోంది.’’ బలహీనంగా వినిపించింది.‘‘ఫర్వాలేదు. భయపడక. నీకేం కాదు.’’ అతని భుజం తట్టి చెప్పింది.‘‘నర్స్గా కాదు సంతోషం.’’హాస్పిటల్కి చేరుకున్నాక అతన్ని ఎమర్జెన్సీ రూమ్కి షిఫ్ట్ చేయడంతో అద్విత బాధ్యత పూర్తయింది.అరగంట తర్వాత ఓ నర్స్ వచ్చి చెప్పింది.‘‘జూనియర్ డాక్టర్గారు నిన్ను రమ్మంటున్నారు.’’అక్కడికి వెళ్ళాక కార్డియాక్ మానిటర్ని చూసి, అతని గుండె ఎంత బలహీనంగా కొట్టుకుంటోందో గ్రహించింది.‘‘ఇతను నీతో మాట్లాడతాడట.’’‘‘మాట్లాడు.’’ ఆమె అతని నోటి దగ్గర తన చెవిని ఉంచి చెప్పింది.‘‘నర్సింగ్ కాలేజ్లో నేను బస్డ్రైవర్గా పని చేసేటప్పుడు నిన్ను చూశాను అద్వితా. రెండుసార్లు నీతో కలసి వన్ బై టు టీ తాగాలని ఉందని చెప్పాను. మూడోసారి నన్ను వేధించకు అన్నావు.’’‘‘ఓ. సారీ. నువ్వు నాకు గుర్తు లేదు.’’‘‘ఇప్పుడు నీతో కలిసి వన్ బై టు టీ తాగాలని ఉంది. ఆ టీ తాగుతూ ‘ఐ లవ్ యు’ అని చెప్పాలనుకున్నాను...’’ అతను రొప్పుతూ చెప్పాడు.‘‘మాట్లాడకు.’’ అద్విత చెప్పింది. జూనియర్ డాక్టర్ వెంటనే కేంటీన్ కి ఫోన్ చేసి వన్ బై టు టీ తీసుకురమ్మని చెప్పాడు. అది వచ్చేలోగా మాటిమాటికీ కార్డియాక్ మానిటర్ని, తలుపుని చూడసాగాడు. టీ వచ్చాక అద్విత ఓ కప్పుని అతని నోటికి అందించింది. అతను ఓ గుక్క తాగి తను చెప్పాలి అనుకున్నది ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాడు.‘‘అతన్ని ముద్దు పెట్టుకో. తర్వాత ప్రశ్నలు.’’ జూనియర్ డాక్టర్ వెంటనే అరిచాడు.ఆమె ఆ పని చేస్తే సరిదిద్దాడు.‘‘పెదవుల మీద.’’ఆమె అతని పెదవులని తన పెదవులతో చుంబించింది. అతను కళ్ళు తెరచి ఆమె వంక చూశాడు. ఆ కళ్ళల్లో అకస్మాత్తుగా వెలుగు! క్రమంగా అది ఆరిపోయింది. మానిటర్లోని ఆకుపచ్చ గీత స్ట్రైట్ లైన్ గా మారింది. జూనియర్ డాక్టర్ అతని మొహం మీద దుప్పటిని కప్పాడు.రెండు కన్నీటి చుక్కలు ఆ టీ కప్పుల్లో పడ్డాయి.‘‘ఇతను నిన్ను ప్రేమించాడని తెలిస్తే మన పెళ్ళి జరిగేది కాదేమో!’’ జూనియర్ డాక్టర్ అద్వితతో చెప్పాడు.∙∙ అద్విత టీ తాగటం మానేసింది. పూర్తిగా. ఒంటరిగా కూడా. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
హైహయుల కథ
హైహయ వంశంలో కార్తవీర్యార్జునుడు అనే మహారాజు ఉండేవాడు. నర్మదా తీరంలోని మహిష్మతీ నగరాన్ని రాజధానిగా చేసుకుని, రాజ్యాన్ని పాలించేవాడు. కార్తవీర్యార్జునుడి వద్ద భృగువంశ విప్రులు పురోహితులుగా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో కార్తవీర్యార్జునుడు అనేక యజ్ఞయాగాదులు చేశాడు. అతడు చేసిన దానాలతో, అతడి నుంచి అందుకున్న సంభావనలతో భృగువంశీయులందరూ సంపన్నులయ్యారు. కార్తవీర్యార్జునుడు స్వర్గస్థుడయ్యాక హైహయులు నిర్ధనులయ్యారు. ఒకసారి వారికి పెద్దమొత్తంలో ధనం అవసరమైంది. హైహయులు సుక్షత్రియులే అయినా, అహం చంపుకొని భృగువంశ పురోహితులను ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. లుబ్ధులైన భార్గవులు లేదు పొమ్మంటూ హైహయులకు మొండిచేయి చూపారు. హైహయులు తమ సంపదను బలవంతంగా దోచుకుంటారేమోనని భయపడిన భార్గవులు తమ వద్దనున్న అపార ధనరాశులను భూమిలో పాతిపెట్టి, తట్టా బుట్టా సర్దుకుని, భార్యా బిడ్డలతో పాటు మహిష్మతీ నగరాన్ని విడిచిపెట్టి, అడవుల్లోకి పారిపోయారు.హైహయులకు ఎక్కడా ధనం దొరకలేదు. మనసు చంపుకొని భార్గవులనే మరోసారి అడుగుదామని వారి ఆశ్రమాలకు వచ్చారు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. వారందరూ పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించిన హైహయులు ఇళ్లన్నీ తవ్వారు. అంతులేని ధనరాశులు దొరికాయి. ఈ సంగతి తెలిసిన భార్గవులలో కొందరు లబోదిబోమంటూ తిరిగి తమ ఆశ్రమాలకు వచ్చారు. క్షమించమంటూ హైహయుల కాళ్ల మీద పడ్డారు. తాము సవినయంగా అడిగితే ధనం లేదని చెప్పి, పాతిపెట్టి పారిపోయిన భార్గవులపై హైహయులు మండిపడ్డారు. వారిపై ధనుర్బాణాలను ఎక్కుపెట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగా మట్టుబెట్టారు. అడవులలో తలదాచుకున్న భార్గవులను వెదికి వెదికి మరీ సంహరించడం ప్రారంభించారు. ఈ బీభత్సానికి భార్గవుల పత్నులు రోదనలు ప్రారంభించారు. హైహయుల మారణకాండ వల్ల చెలరేగిన కలకలానికి, రోదనలకు చుట్టుపక్కల ఆశ్రమాల్లోని మునీశ్వరులు ఏదో దారుణం జరుగుతోందని తలచి పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకునే సరికి హైహయులు భార్గవులను ఊచకోత కోస్తూ కనిపించారు. మునిగణమంతా హైహయులకు అడ్డువెళ్లి, వారించారు. విప్రులను వధించడం పాపకృత్యమని, ఈ హింసాకాండను ఇక్కడితో విరమించుకోమని హెచ్చరించారు. మునిగణం వారించడంతో హైహయులు కొంత శాంతించారు. ఆగ్రహావేశాల నుంచి తేరుకుని, పెదవి విప్పారు.‘మునీశ్వరులారా! మీరు మమ్మల్ని నిందిస్తున్నారే గాని, వీరు మా పట్ల చేసిన పాపకృత్యం మీకు తెలియదు. వీరు మా పూర్వీకుల వద్ద పౌరోహిత్యం చేసేవారు. మా పూర్వీకుల నుంచి భూరి దానాలు, సంభావనలు స్వీకరించి ధనాఢ్యులయ్యారు. వీరు విప్రులు కాదు, నయవంచకులు, పరమ లోభులు. మాకు అత్యవసరం ఏర్పడి ధనాన్ని సర్దుబాటు చేయమని సవినయంగా అర్థిస్తే, కనికరమైనా లేకుండా, లేదు పొమ్మన్నారు. పైగా మేమెక్కడ బలవంతం చేస్తామోనని అనుమానించి, ధనరాశులను భూమిలో పాతిపెట్టి, అడవులకు చేరుకున్నారు. కృతజ్ఞత కలిగిన మనుషులు చేయదగిన పనేనా ఇది? వీరిని చంపుతున్నామంటే, చంపమా మరి? వీరికి ఈ ధనరాశులన్నీ మా పూర్వీకుడైన కార్తవీర్యార్జునుడు లోక క్షేమం కోసం యజ్ఞ యాగాదులు చేయమని, తాము సుఖంగా బతకమని, యాచకులకు దానం చేయమని వీరికి అపార ధనరాశులను ఇచ్చాడు. వీళ్లు ఈ మూడింటిలో ఏ ఒక్క పనీ చేయలేదు. పైగా లోభంతో ధనరాశులను భూమిలో పాతిపెట్టారు. పరమ లోభులైన ఈ నీచులను విప్రులు అనవచ్చునా? యజమానుల క్షేమం కోరుకోని వీరు లోకక్షేమాన్ని కాంక్షిస్తారనుకోగలమా? ధనానికి మూడే గతులు. దానం, భోగం, నాశం. దానం చేయక, తాను అనుభవించక ధనం కూడబెట్టిన లోభులు వంచకులు, దండనార్హులు. అందుకే మేము ఈ వంచకులను దండించాం. ఇందులో మా తప్పులేదని మా అభిప్రాయం. దీని గురించి మీరు మాపై కినుక వహించకండి’ అన్నారు.హైహయుల సమాధానానికి మునీశ్వరులెవరూ మారు పలకలేకపోయారు. అయితే, మునిగణం రాకతో హైహయులు ఆగ్రహం నుంచి బయటపడ్డారు. రోదిస్తున్న భార్గవుల పత్నులను ప్రాణాలతో విడిచిపెట్టారు. అప్పటికే భయకంపితులై ఉన్న ఆ స్త్రీలు, ప్రాణాలు దక్కడమే చాలనుకుని, అక్కడి నుంచి బయలుదేరి హిమవంతం చేరుకున్నారు.హిమాలయాలకు చేరుకున్న భార్గవుల పత్నులు కొన్నాళ్లకు భయాందోళనల నుంచి తేరుకున్నారు. వారంతా నదీతీరంలో మట్టితో గౌరీదేవి బొమ్మను చేసి, దీక్షగా అర్చించారు. వారి భక్తికి ప్రసన్నురాలైన దేవి కలలో కనిపించింది. ‘మీలో ఒకరికి ఊరు అంశతో కొడుకు పుడతాడు. అతడే మీ దుఃఖాలను తొలగించగలడు’ అని పలికింది. కొన్నాళ్లకు భార్గవపత్నులలో ఒకరికి తొడలో గర్భం ఏర్పడింది. ఒకనాడు వారు ఉంటున్నవైపు హైహయులు వచ్చారు. వారిని చూసి భార్గవపత్నులు భయకంపితులై పరుగులు తీశారు. హైహయులు వారిని వెంబడించారు. పరుగు తీయలేని ఊరుగర్భిణిని ఖడ్గధారులైన హైహయులు చుట్టుముట్టారు. ఊరుగర్భంలో ఉన్న బాలకుడు తన తల్లి దీనావస్థకు చలించిపోయి, గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. మార్తాండకాంతితో మెరిసిపోతున్న ఆ బాలుడిని చూడటంతోనే హైహయులకు కళ్లు పోయాయి. ఇది పాతివ్రత్య మహిమ అని గ్రహించిన హైహయులు రోదిస్తూ ఆ తల్లి కాళ్ల మీద పడ్డారు. ‘తల్లీ! కనికరించు’ అని ప్రాధేయపడ్డారు. ‘క్షత్రియవీరులైన మీరు నావంటి సామాన్య స్త్రీని ప్రాధేయపడటం తగదు. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. తన తాత తండ్రులను చంపినందుకు నా కుమారుడికే మీ మీద కోపంగా ఉంది. ఇతడు జగదీశ్వరి ప్రసాదంగా నాకు జన్మించాడు. అతడే మిమ్మల్ని క్షమించగలడు’ అని చెప్పింది. హైహయులు వెంటనే ఆ బాలుడి పాదాల మీద పడ్డారు. బాలభార్గవుడు ప్రసన్నుడై, వారికి దృష్టి ప్రసాదించాడు. ధర్మబద్ధంగా పాలన సాగించండి అని హితవు చెప్పి, వారిని పంపాడు.సాంఖ్యాయన -
అప్పుడే తెలిసిపోయింది
తన ప్రయాణం ప్లాన్ చేసినదేం కాదు. కాని, విధి పిలుపును మాత్రం ఆమె విన్నది. అలా హైదరాబాద్ వీధుల్లో పానీపూరీ తింటూ నవ్వుకున్న సాదాసీదా అమ్మాయి– నేడు తెరపై సహజ మంత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె శివాని నాగారం. ఆమె విషయాలు ఆమె మాటల్లోనే మీ కోసం!⇒ చిన్నప్పటి నుంచే నేర్చుకున్న కూచిపూడి నాట్యం నాకు ఒక థెరపీలా ఉంటుంది. ఏదైనా టెన్షన్ ఉన్నా, కొన్ని స్టెప్స్ వేస్తే చాలు, మనసంతా రిలాక్స్ అయిపోతుంది.⇒ హైదరాబాద్లోనే పెరిగాను. అందుకే రోడ్డు పక్కన నిలబడి మిర్చి బజ్జీ, పానీపూరీ తినడం, సాయంత్రం రోడ్ల మీద కార్లు వెళ్లే శబ్దం వినడం ఇవన్నీ నా చిన్న చిన్న ఆనందాలు.⇒ సినిమాల్లోకి రావడం నేను ముందే ప్లాన్ చేసుకున్న విషయం కాదు. కాని, నా ప్రయాణం పెద్ద తెరతో కాదు, చిన్న కథలతోనే మొదలైంది. ఒక చిన్న షార్ట్ఫిల్మ్లో కొద్దిసేపు మాత్రమే కనిపించినా, అలా మొదటిసారి కెమెరా ముందు నిలబడ్డ ఆ క్షణంలోనే ‘ఇదే నా దారి’ అని నాకు స్పష్టంగా తెలిసిపోయింది.⇒ మొదటి సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ విడుదలైనప్పుడు మనుసులో కొంచెం భయం ఉన్నా, ప్రేక్షకులు చూపిన ప్రేమ ఆ భయాన్ని పూర్తిగా కరిగించింది.⇒ రెండో, మూడో సినిమాలు వచ్చేటప్పటికి నాలోనే ఒక కొత్త శివానిని చూసుకున్నాను. ప్రతి పాత్ర నాకు ఒక కొత్త నేర్పు, ఒక కొత్త అనుభవం ఇచ్చింది.⇒ పూలంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఏ పువ్వైనా చేతిలో తీసుకుని అలా తిరగేస్తూ, వాసన చూస్తూ ఉండటం నాకు హాబీలా మారిపోయింది.⇒ కథలు చదవడం నా అలవాటు. పెద్ద నవలలు కాకుండా, హృదయానికి హత్తుకునే చిన్న కథలు బాగా నచ్చుతాయి.⇒ ఫ్యాషన్ విషయానికి వస్తే నేను చాలా సింపుల్. ఒక మంచి జీన్స్, క్లీన్స్ గా ఉండే కుర్తా, చిన్న చెవిపోగులు. అంతే, నేను సిద్ధం.⇒ చర్మ సంరక్షణ విషయంలో నేను ఎక్కువ క్రీములు వాడను. రోజూ తగినంత నీళ్లు తాగడం, రాత్రి మాయిశ్చరైజర్ మాత్రం తప్పనిసరి. వారానికి ఒకసారి పెసరపిండి రాసుకుంటే చాలు, చర్మం బాగా ఫ్రెష్గా మారుతుంది.⇒ నాకు ఇష్టమైన రంగులు పింక్లోని మృదువైన షేడ్స్, లైట్ బ్లూ.⇒ అభిమానులతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. వాళ్ల కామెంట్లు, మెసేజులు, వారి ప్రేమ– అవన్నీ నాకు కొత్త శక్తి ఇస్తాయి. -
ఆత్మరక్షణకు ‘ఆస్కార్’ నటన!
‘నేచర్ ఆస్కార్ అవార్డ్స్’లో బెస్ట్ యాక్టర్ ఇన్స్ సర్వైవల్ డ్రామా ట్రోఫీ ఎవరికి దక్కాలంటే, సందేహమే లేదు, ఒపాసమ్కే వస్తుంది! ఎందుకంటే ఈ చిన్న జంతువు సస్పెన్స్ థ్రిల్లర్ లెవెల్లో యాక్టింగ్ చేస్తుంది. ప్రమాదం ఎదురైతే ఒక్కసారిగా నేలపై పడిపోతుంది, శరీరాన్ని పూర్తిగా శవంలా మార్చేసుకుని, కళ్ళు మూసేసుకుని చచ్చిపోయినట్లు నటిస్తుంది.అంతే కాదు, తనను వేటాడటానికి వచ్చిన జంతువులకు తాను చచ్చినట్లు నమ్మకం కలిగించడానికి కుళ్లిన శవం వాసన కూడా విడుదల చేస్తుంది. దీన్ని ఆ పరిస్థితిలో చూసిన క్రూరమృగాలు ‘ఇది చచ్చిపోయింది, పైగా కుళ్లిపోతోంది కూడా!’ అని అనుకుని వెనక్కి తగ్గిపోతాయి. ఈ సీక్రెట్ సర్వైవల్ ట్రిక్నే ‘ప్లేయింగ్ పోసమ్’ అంటారు. ప్రకృతి ఇచ్చిన ఈ సహజ రక్షణ పద్ధతితో, శత్రువు వెళ్లిపోయాక మన ఒపాసమ్ నెమ్మదిగా కళ్లు తెరచి, డ్రామా పూర్తయ్యిందని తెలుసుకుని, సైలెంట్గా జంగిల్లోకి జారిపోతుంది! -
చలివెచ్చని జాగ్రత్తలు
కాలాలన్నింటిలోనూ శీతకాలం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఓవైపు చల్లటిగాలి జివ్వుమనిపిస్తుంటే– స్వెటర్ తొడుక్కుని లేదా శాలువలు కప్పుకుని తిరగడం దగ్గర నుంచి, వెచ్చటి చలిమంటల ముందో, రూమ్ హీటర్ ముందో ఒద్దికగా కూర్చోవడం వరకు, ఇవన్నీ ఆస్వాదించాల్సిన సందర్భాలే! త్వరగా చీకటిపడి, ఆలస్యంగా వెలుతురు రావడం, కాలం వేగంగా పరుగులు తీస్తున్న భావన కలగడం– ఈ సీజన్లో మరో ప్రత్యేకత! నిజానికి చాలామంది కాలాలన్నింటిలోనూ పసందైన కాలం చలికాలమే అంటారు. వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు ఎక్కువైనా, తక్కువైనా వాటిని భరించలేం కాని, చలికాలంలో స్వెటర్లు, గ్లౌజులు వేసుకుని చలి గజగజలను ఆస్వాదిస్తూ గమ్మత్తుగా గడిపేయవచ్చు మరి! అయితే శీతకాలంలో చలి మాత్రమే కాదు, వ్యాధులు కూడా వణికించేస్తుంటాయి. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు వస్తే తగ్గించుకోవడం ఏమంత సులభం కాదు.చలికాలంలో సాధారణంగా వచ్చే అనారోగ్యాలు ఎంతవరకు అంటువ్యాధులుగా మారతాయి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? వాటి సంగతి ఒకసారి పరిశీలిద్దాం... చలికాలంలో వాతావరణం పొడిగా ఉండటం, అలాగే మనుషులంతా ఇండోర్స్లో గుమిగూడటం వలన జలుబు చేసే క్రిములు, ఫ్లూ వైరస్లు, ఇతర శ్వాసకోశ వ్యాధులు సులభంగా వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు కనిపించక ముందు, లక్షణాలు తగ్గిన తర్వాత కూడా ఇవి ఇతరులకు సోకే అవకాశముంటుందని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ – క్లీవ్లాండ్ క్లినిక్ వెల్లడించింది. సాధారణంగా వ్యాధి సోకిన రెండు నుంచి మూడు రోజుల తర్వాత ఇతరులకు అంటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆ క్లినిక్ తేల్చింది. ఈ చలికాలంలో సర్వసాధారణంగా వచ్చే అనారోగ్యాలు, అవి ఎలా వ్యాప్తి చెందుతాయో ఇప్పుడు చూద్దాం!సాధారణ జలుబుఇది అంటువ్యాధి. లక్షణాలు కనిపించకముందే, లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు (సుమారు మూడవ రోజు వరకు) ఇతరులకు సులభంగా సోకుతుంది. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా రెండు వారాల వరకు వైరస్ ఇతరులకు అంటించే అవకాశవఫ్లూఇది కూడా త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధే! లక్షణాలు కనిపించకముందే ఇతరులకు అంటుతుంది. లక్షణాలు కనిపించిన తర్వాత ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇతరులకు సోకే అవకాశముంటుంది.కోవిడ్ 19ఇది చాలా సులభంగా, అలాగే వేగంగా వ్యాపిస్తుంది. లక్షణాలు కనిపించడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు, అలాగే లక్షణాలు మొదలైన తర్వాత రెండు నుంచి మూడు రోజుల పాటు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముంది. తేలికపాటి లక్షణాలున్నవారు ఐదు రోజుల వరకు, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు 20 రోజుల వరకు కూడా ఈ వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశముంది.రెస్పిరేటరీ సిన్సిషీయల్ వైరస్ఇది సాధారణంగా ఆరోగ్యవంతులలో జలుబులా ఉన్నప్పటికీ, శిశువులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేనివారికి ఇది ప్రమాదకరమైన వ్యాధి. లక్షణాలు కనిపించడానికి కొన్ని రోజుల ముందు, ఆ తర్వాత ఎనిమిది రోజుల వరకు ఇది అంటువ్యాధి. అయితే, శిశువులు, రోగనిరోధక శక్తి లేనివారు నాలుగు వారాల వరకు కూడా ఈ వైరస్ని వ్యాప్తి చెయ్యగలరు.చెస్ట్ కోల్డ్ (బ్రోంకైటిస్)బ్రోంకైటిస్ అంటువ్యాధి కాదు. ఇది వస్తే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాల వాపు, శ్లేష్మం ఎక్కువ ఉత్పత్తి కావడం, ఛాతీ బిగువుగా, నొప్పిగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే బ్రోంకైటిస్కు కారణమయ్యే జలుబు, ఫ్లూ లేదా ఇతర వైరస్లు మాత్రం అంటువ్యాధులే. వేరొకరి నుంచే వైరస్ వ్యాప్తి చెంది చెస్ట్ కోల్డ్లా మారుతుంది.న్యుమోనియావైరల్ న్యుమోనియా, బ్యాక్టీరియల్ న్యుమోనియా ఇవి రెండూ అంటువ్యాధులే. వైరల్ న్యుమోనియా జ్వరం పూర్తిగా తగ్గేంత వరకు వ్యాప్తి చెందుతుంది. బ్యాక్టీరియల్ న్యుమోనియా అయితే, యాంటీబయోటిక్స్ తీసుకున్నా, 48 గంటలు తర్వాతే అంటువ్యాధి తీవ్రత తగ్గుతుంది.పింక్ ఐవైరస్ లేదా బ్యాక్టీరియాతో వచ్చే పింక్ ఐ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. వైరల్ పింక్ ఐ లక్షణాలు ఉన్నంత కాలం, ఇంక్యుబేషన్ పీరియడ్లో ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తుంది. బ్యాక్టీరియల్ పింక్ ఐ యాంటీబయోటిక్స్ తీసుకున్న 24 గంటల వరకు లేదా లక్షణాలు పూర్తిగా తగ్గేంత వరకు అంటువ్యాధిగానే పరిగణిస్తారు.సైనస్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ సైనస్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి కాదు. కానీ, సైనస్కు కారణమయ్యే జలుబు మాత్రం ఇతరులకు సోకుతుంది. ఇతరుల వల్లే మనకొస్తుంది.స్ట్రెప్ థ్రోట్గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియాతో ఇది వస్తుంది. ఇది తీవ్రంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి! జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాత కనీసం 12 గంటల పాటు యాంటీబయోటిక్స్ తీసుకున్న తర్వాతే జనాల్లో తిరగడం ఉత్తమం. అంతవరకు ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది.ఆయుర్వేద చిట్కాలు ఆహార నియమాలుఆయుర్వేదం ప్రకారం, శీతకాలంలో జీవ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అవి శరీరంలో కఫాన్ని పెంచవచ్చు. నెయ్యి, నూనెలను మితంగా తీసుకోవడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో వెచ్చదనానికి, ఆరోగ్యం కోసం తినదగిన ఉత్తమ ఆహారాలను ఇప్పుడు చూద్దాం.ఆయుర్వేదం ప్రకారం, శీతకాలంలో జీవ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అవి శరీరంలో కఫాన్ని పెంచవచ్చు. నెయ్యి, నూనెలను మితంగా తీసుకోవడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో వెచ్చదనానికి, ఆరోగ్యం కోసం తినదగిన ఉత్తమ ఆహారాలను ఇప్పుడు చూద్దాం.అల్లం: ఆయుర్వేదంలో దీనిని ‘సార్వజనీన ఔషధం’ అని పిలుస్తారు. దీన్ని చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. టీలోను, కూరల్లోను, సూపుల్లోను అల్లం వాడటం మంచిది. అలాగే, అల్పాహారంలో శొంఠి లడ్డూలు, అల్లం చట్నీ తీసుకోవడం కూడా మంచిదిపసుపు: ముఖ్యంగా శీతకాలంలో పసుపు బాగా పనిచేస్తుంది. పసుపులో వాపును తగ్గించే రసాయనాలు ఉంటాయి. ఇది శరీరానికి, మెదడుకి, గుండెకు చాలా మంచిది. శీతకాలంలో కూరల్లోను, పాలల్లోను పసుపు తరచుగా తీసుకోవచ్చు.జాజికాయ : ఇది శరీరానికి వెచ్చదనాన్నిచ్చే సుగంధ ద్రవ్యం. నిద్ర మెరుగుపరచడానికి, జీర్ణక్రియకు ఇది బాగా సహాయపడుతుంది. వేడి పాలలోను, మిఠాయిల్లోను, కూరల్లోని మసాలా మిశ్రమాల్లోను జాజికాయ పొడిని వాడుకోవచ్చు. ఉసిరి: చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ నుంచి ఉసిరి రక్షణనిస్తుంది. ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. రోజుకి ఒకటైనా పచ్చి ఉసిరిని నేరుగా తినొచ్చు. తేనె లేదా పంచదారతో కలిపి కూడా తినవచ్చు. ఉసిరిని ఊరగాయలా కూడా తీసుకోవచ్చు.నువ్వులు: నువ్వులలో ప్రొటీన్, ఐరన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కాలేయానికి, గుండెకు రక్షణనిస్తాయి. ఈ చలికాలంలో నువ్వుల లడ్డూలు, నువ్వుల చిక్కీలు తీసుకోవచ్చు. రకరకాల వంటకాలపై నువ్వులపొడిని కలుపుకుని తినడం కూడా మంచిదే!బెల్లం: బెల్లం శరీరానికి వెచ్చదనాన్నిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లంతో చిక్కీలు, అరిసెలు, లడ్డూలు చేసుకుని తింటే ఉత్తమం.సజ్జలు– రాగులు : ఈ చిరుధాన్యాలు శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి. వీటిలో ఫైబర్, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఐరన్, బి విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడానికి సహాయపడతాయి. వీటితో రొట్టెలు, ఉప్మా, దోసె, అంబలి, లడ్డూలు వంటివి చేసుకోవచ్చు.నెయ్యి: చలికాలంలో నెయ్యి శరీరానికి శక్తిని, చురుకుదనాన్ని ఇస్తుంది. దీనిలో విటమిన్–ఎ, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మానికి కాంతినిస్తుంది. కిచిడీ, పప్పు, పరాఠాలు, హల్వా లేదా అన్నంతో కలిపి తీసుకోవచ్చు.మెంతులు–మెంతికూర: ఇవి చలికాలంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉంటాయి. మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి పేస్ట్ చేసుకుని తినడం మంచిది. మెంతి ఆకులను పరాఠాలు లేదా కూరల్లో కూడా వాడుకోవచ్చు.గోందు: చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే చక్కటి ఆహారం ఇది. తుమ్మచెట్ల నుంచి సేకరించే జిగురును గోందు కటిర అంటారు. ఇది బరువు నియంత్రణకు, కొలెస్ట్రాల్ను కరిగించడానికి, కాల్షియం పెరగడానికి సహాయపడుతుంది. దీంతో లడ్డూలు కూడా చేసుకుంటారు.బాదం – వాల్నట్లు: చలికాలంలో బాదం, వాల్నట్ వంటి గింజలు తినడం మంచిది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. వాల్నట్లలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, బాదంలో విటమిన్– ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టి చిరుతిండిగా తినడం లేదా డ్రై ఫ్రూట్ లడ్డూలలో కలిపి తినడం మంచిది.చిలగడ దుంపలు – క్యారట్లు: చలికాలంలో ఈ దుంపలు శరీరానికి వెచ్చదనాన్ని, రోగనిరోధక శక్తిని అందిస్తాయి. క్యారట్లలో విటమిన్ ఎ, చిలగడ దుంపలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపలను ఎక్కువగా ఉడికించి లేదా కాల్చి తింటారు. వీటిని సూప్లలో కూడా వాడుకోవచ్చు. క్యారట్ను కూరల్లో ఉపయోగించడంతో పాటు హల్వా రూపంలోను తీసుకుంటారు.ఆకు కూరలు: పాలకూర, తోటకూర వంటివి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఐరన్, కాల్షియం అందించడానికి సహాయపడతాయి. వీటిని పప్పు, పరాఠాలు, సూప్ల రూపంలో తీసుకోవడం మంచిది.జామకాయ: జామకాయల్లో విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జామకాయ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పచ్చిగా లేదా పండురూపంలో తినొచ్చు.స్టమక్ బగ్ఇది కూడా వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధే! వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు వ్యాధిగ్రస్థుల నుంచి ఇతరులకు సోకే అవకాశముంటుంది. పైగా ఈ వైరస్లు ఉపరితలాలపై వారాల తరబడి జీవించగలవు.ఇలాంటి అంటువ్యాధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన పేర్కొన్న అంటువ్యాధులతో పాటు చెవినొప్పి, చలి–జ్వరం, దవడ వాపు వంటివన్నీ చలికాలంలో వచ్చే సాధారణ వ్యాధులే.టాన్సిలైటిస్చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే మరో సమస్య టాన్సిలైటిస్. ఇది అంటువ్యాధి కాదు! గొంతు లోపలి భాగంలో గుండ్రటి కణజాలాలుంటాయి. వాటినే టాన్సిల్స్ అంటారు. బ్యాక్టీరియా లేదా వైరస్ సోకినప్పుడు వీటికి వాపు రావడాన్నే టాన్సిలైటిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, ఆహారం, నీళ్లు, లాలాజలం కూడా మింగడానికి కష్టంగా ఉంటుంది.ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు)మధ్య వయస్సు లేదా వృద్ధాప్యంలో ఉన్నవారికి శీతకాలపు కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. వీటిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ నొప్పులకు కచ్చితమైన కారణాన్ని వైద్య శాస్త్రం ఇంకా చెప్పలేకపోతోంది. నొప్పి, వాపు, కండరాలు బిగించినట్లుగా అనిపించడం ఇవన్నీ లక్షణాలే! ముఖ్యంగా బరువు పెరగకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఈ సమస్య కాళ్ళ కీళ్లపై భారం పడేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. కనీసం వాకింగ్ అయినా చేస్తుండాలి. బాడీ మొత్తం కప్పి ఉండేలా ఉన్ని దుస్తులు వేసుకోవాలి. ఎందుకంటే తీవ్రమైన చలికి గురికావడం కూడా కీళ్ల నొప్పికి కారణమవుతుంది. పొగతాగే అలవాటు ఉంటే మానేయాలి. సెకండ్హ్యాండ్ స్మోకింగ్కు కూడా దూరంగా ఉండాలి. ఈ కాలంలో ఆహారం, నీళ్లు, ఇతర వస్తువులను తోటివారితో పంచుకోకపోవడం ఉత్తమం.శీతకాలంలో డీహైడ్రేషన్!సాధారణంగా డీహైడ్రేషన్ అనే మాట మనం వేసవిలో ఎక్కువగా వింటాం. నిజానికి చలికాలంలో దాహం తక్కువగా అనిపించినా, డీహైడ్రేషన్ సమస్య రాకుండా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు. నారింజ, ద్రాక్ష, నిమ్మకాయ వంటి పండ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, చర్మానికి సహజ కాంతిని ఇవ్వడానికి వీటిని తీసుకోవడం ఉత్తమం. దానిమ్మ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. చలికాలంలో శరీరానికి శక్తినిస్తుంది. వీటితో పాటు వెచ్చని నీళ్లు లేదా హెర్బల్ టీలను తరచుగా తీసుకోవడంతో శరీరంలో తేమ శాతం నిలకడగా ఉంటుంది.చలికాలంలో వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి చిట్కాలు⇒ దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతులకు కాకుండా మోచేతి లోపలి భాగానికి అడ్డు పెట్టుకోవాలి.⇒ తలుపు నాబ్స్, కౌంటర్టాప్ల వంటి తరచుగా తాకే ఉపరితలాలను శుభ్రం చేయాలి.⇒ వ్యక్తిగత వస్తువులను పంచుకోకుండా ఉండాలి.⇒ లక్షణాలు తగ్గేంత వరకు ఇంటికే పరిమితం కావాలి.⇒ తరచుగా సబ్బు, గోరువెచ్చని నీటితో చేతులు కడుక్కోవాలి. ⇒ వైరస్లు– టేబుల్స్, డోర్నాబ్లు, కౌంటర్టాప్లు, ఆఫీస్ సామాగ్రి వంటి ఉపరితలాలపై కొన్ని గంటలు లేదా రోజులు కూడా జీవించగలవు. ఈ సాధారణంగా తాకే ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడానికి, సురక్షితమైన క్లీనర్లను ఉపయోగించాలి⇒ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తగినంత నిద్ర అవసరం. పెద్దలు రాత్రికి 7–9 గంటలు, పిల్లలు వారి వయస్సును బట్టి ఎక్కువ నిద్ర పోవాలి. నిద్ర లేమి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.⇒ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినడంతో రోగనిరోధక వ్యవస్థను కాపాడుకోవచ్చు. విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.⇒ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో రోగనిరోధక వ్యవస్థ పుంజుకుంటుంది. జలుబు దగ్గు వంటి లక్షణాల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. వారంలో ఎక్కువ రోజులు కనీసం30 నిమిషాలు తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. ⇒ చేతులతో తరచుగా ముఖం, నోరు తాకకుండా ఉండాలి. గొంతును తేమగా ఉంచడానికి క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. ⇒ వైరస్ లేదా బ్యాక్టీరియా బారిన పడితే రోజుకు రెండుమూడు సార్లు ఉప్పు నీటితో కొన్ని నిమిషాల పాటు పుక్కిలించాలి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ⇒ ఈ సీజన్లో ఎక్కువగా గోరువెచ్చని నీరు తాగాలి. ఇంటి వాతావరణాన్ని తేమగా ఉంచడానికి ఎయిర్ హ్యూమిడిఫైయర్ గాడ్జెట్ (చర్మం, గొంతు, ముక్కు, పెదవులు పొడిబారకుండా నివారించే పరికరం) ఉపయోగించాలి.ఇక ఈ కాలంలో చర్మం పొడిబారిపోకుండా కళావిహీనంగా మారిపోకుండా ఆలివ్ నూనె, వెన్న, కొబ్బరి నూనె వంటి వాటితో శరీరానికి మర్దన చేసుకున్నాక స్నానం చేయడంతో మంచి ఫలితముంటుంది. ఎక్కువగా క్రీమ్స్, లోషన్స్ వంటి కాస్మెటిక్స్ వాడటం కంటే వంటింటి చిట్కాలను పాటించడమే మేలు. ఆరోగ్యం, ఆహారం, అందం ఈ మూడింటా తగు జాగ్రత్తలు తీసుకుంటే వింటర్కి మించి సీజనే ఉండదు. - సంహిత నిమ్మన -
ఈ వారం కథ: కుందేలు కూర
ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. కౌంటర్ కేసులు పెట్టి అందర్నీ జైలుకు పంపారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు ఊళ్ళో పోలీసు పికెట్ నడుస్తుంది. గ్రామ పంచాయితీ ఆఫీసులో షెల్టర్ తీసుకున్నారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక ఇంచార్జ్ జందార్ ఉన్నారు. ఒక పోలీసు నిరంతరం తుపాకీ పట్టుకొని పహారాలో ఉంటాడు. మిగతా వారు తమ తుపాకులను పంచాయితీ ఆఫీసు లోపలి గదిలో పెట్టి బయట యాప చెట్టు కింద కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఆఫీస్ వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో భోజనాలు వండుతున్నారు. వంట వచ్చిన పోలీసు ఆ పనిలో ఉన్నాడు. గ్రామ మస్కురి చికెన్ కడుగుతున్నాడు. పోలీసుకు భోజనానికి కొదువ ఉండదు. కాకపోతే సమయానికి దొరకదు. ఇంతలో ఒక గ్రామస్తుడు వచ్చి జందార్ను పరిచయం చేసుకున్నాడు. ‘‘సర్... ఈరోజు రాత్రి మా ఇంటికి భోజనానికి రండి సార్’’ అన్నాడు. కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ ఉత్సాహం ప్రదర్శించి ‘‘దాందేముంది.. వస్తాం సార్’’ అన్నాడు. జందార్ కానిస్టేబుల్ వైపు గుర్రుగా చూసి ‘‘ఇంకోసారి వస్తాంలే బ్రదర్ ఈరోజుకు వంట అయిపోయింది’’ అని అతనితో అన్నాడు. దాంతో అతను వెళ్ళిపోయాడు. ‘‘ప్రజల్లో పోలీసుకు సహజ అనుకూలురు సహజ వ్యతిరేకులు ఉంటారు. అందుకు ఎవరి కారణాలు వారికుంటాయి. పోలీసుకు భోజనం ఎంత దూరమో అంత ప్రమాదం కూడా’’ అని కొత్త కానిస్టేబుల్తో అన్నాడు. కొత్త కానిస్టేబుల్ అయోమయంగా చూసి ‘‘ఎందుకు సార్?’’ అన్నాడు. ‘‘నీకు అనుభవం లేదు కాబట్టి, ఒక జరిగిన సంఘటన చెబుతా విను’’ అన్నాడు. 1 తుపాకుల నర్సయ్య తన చుట్టూ గుమికూడిన పోరగాండ్లని దూరంగా పొమ్మని గద్దించి, తన భుజానికి గట్టిగా బిగబట్టి ఢామ్మని తుపాకీ పేల్చాడు. తుపాకీ చప్పుడు విన్న వారి గుండెలు కొట్టుకున్నాయి. పిట్టలు దిగ్భ్రాంతి చెంది తుపాకీలోని ఛర్రాల లాగా చెల్లాచెదురయ్యాయి. రాయి చెట్టు మీద ఉన్న పచ్చ గువ్వలు, తపసు పక్షులు, గుడ్లగూబలు చెల్లా చెదురుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. బర్మార్ తుపాకీలో నుండి దూసుకొచ్చిన చర్రాలు పచ్చ గువ్వల వంట్లోకి దూసుకుపోయాయి. ఒక రెండు గువ్వలు చెట్టు మీది నుండి కింద పడ్డాయి. ఇంకో రెండు ఓ వంద గజాలు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్లి పొలంలో రాలిపోయాయి. తుపాకీని భుజానికి తగిలించుకొని, చెట్టు కింద పడ్డ గువ్వలను చేతిలోకి తీసుకున్నాడు నర్సయ్య. రక్తం ఓడుతున్న రెండిట్లో ఒకటి ఇంకా కదులుతూనే ఉంది. వాటిని తన భుజానికి ఉన్న గుడ్డ సంచిలో వేశాడు. నర్సయ్య వెంట వచ్చిన వెంకన్న పొలంలో పడ్డ రెండు పచ్చ గువ్వలను తెచ్చాడు. వాటిని కూడా సంచిలో వేసుకున్నాడు నర్సయ్య. నర్సయ్య ఆరడుగుల ఎత్తు ఉంటాడు. మోకాళ్ళ వరకు ఖాకీ రంగు నిక్కరు, నిండు చేతుల చొక్కా, కాస్త పెద్దగా ఉండే మీసాలు, కుడి భుజం మీద నుండి ఎడమ వైపుకు వేలాడే మందుగుండు సామగ్రి ఉండే సంచి, పిక్కల కంటే కొంచెం కిందుగా ఉండే నల్లని బూట్లు. చూడ్డానికి బలిష్టమైన జవాను లాగా ఉంటాడు. కాకపోతే ఒక్క ఎర్ర టోపీ మాత్రం ఉండదు. కానీ, ఎర్ర తువాలు నెత్తికి చుట్టుకునేవాడు. నర్సయ్య పోలీసు కంటే కూడా సీరియస్గా ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. వారానికోసారి వేటకు బయలుదేరేవాడు. వెంట ముగ్గుర్నో నలుగుర్నో సహాయంగా తెచ్చుకునేవాడు. సహాయకులు మాట్లాడుకునేవారు తప్ప నర్సయ్య మాత్రం మాట్లాడేవాడు కాదు. నర్సయ్య సైన్యాధ్యక్షుడిలా ముందు నడుస్తుంటే సైన్యం వెనకాల పరిగెత్తేది. ఊరి చుట్టుపక్కల చెట్ల మీది పచ్చ గువ్వలు, చమర కాకులు, కముజు పిట్టలను కొట్టేవాడు. నర్సయ్య మోకాళ్ళమీద కూసోని బర్మార్ తుపాకిని మోకాళ్ళ మధ్యన పెట్టుకొని, సంచిలో డబ్బాలో ఉన్న పచ్చటి పొడిని చెంచాలాగా చేసిన తాటాకు ముక్కతో తీసి తుపాకీ గొట్టంలో పోసేవాడు. దానిమీద సైకిల్ చర్రాల వంటి ఇనుప గుండ్లు పోసేవాడు. దానిమీద పిడకల పొడిని వేసేవాడు. తుపాకీకి తగిలించి ఉన్న పొడుగాటి ఇనుప సువ్వ తీసుకొని ఆ గొట్టంలో పెట్టి కూర్చేవాడు. ట్రిగ్గర్ తగిలే దగ్గర గొట్టంలో పచ్చటి పొడిని పోసి నెమ్మదిగా ట్రిగ్గర్ బిగించేవాడు. ఆ ట్రిగ్గర్ను పైకి లాగి వదిలితే తుపాకీ పేలుతుంది. పిట్టల కూర మీద మొహం మొత్తినప్పుడు కుందేళ్ళ వేటకు వెళ్ళేవాడు. అప్పుడు తుపాకీని కుడి చేత్తో పట్టుకుని రంగనాయకుల గుట్ట వైపు వేటకు పోయేవాడు. ఆయన వెంట ఆ ముగ్గురో నలుగురో సైనికుల్లా అనుసరించేవారు. అప్పుడు వాళ్ళలో ఒకరి చేతిలో పెద్ద బ్యాటరీ లైటు ఉండేది. ఆ లైటు ఫోకస్ కుందేళ్ళ మొకం మీద పడితే అవి కదలలేవట మరి. ఊర్లో ఇంకో ముగ్గురికి తుపాకులు ఉన్నాయి. కానీ, ఆ రాజసం మాత్రం ఎవరికీ లేదు. ఒకాయన పంచ కట్టుకొని, ఇంకొకాయన పాయింటు వేసుకొని, ఇంకొకాయన నిక్కరు వేసుకొని వేట చేసేవారు. కానీ, వారి తుపాకులకు ఎలాంటి రాజసమూ లేదు. వారి మీదున్న తుపాకులను చూస్తే పచ్చ గువ్వలు కాదు కదా ఊర పిచుకలు కూడా బెదరవు. వారు పట్టుకున్నందువల్ల మాత్రమే ఆ తుపాకులకు కళ పోయింది. తుపాకులు ఎప్పుడూ పిరికివి కావు. వాళ్ళు తుపాకులు పేల్చినా జనాలు పట్టించుకునేవారు కాదు. అదే నర్సయ్య పేల్చకపోయినా యుద్ధ సన్నద్ధం గోచరించేది. సరిహద్దు సైనికులకుండే నిబద్ధత ఏదో నర్సయ్యలో ఉంది. కేవలం వేట కోసమే తాను పుట్టినట్టు కనపడేవాడు. తనను ఎప్పుడు పేల్చుతాడా అని నర్సయ్య తుపాకీ ఎదురు చూసేది. రాత్రంతా వేటాడి కుందేళ్లు, రకరకాల పిట్టలను సంచిలో మోసుకుంటూ తెచ్చేవారు. రాత్రంతా నిద్ర లేక వారి మొహం అలసిపోయి ఉండేది. నర్సయ్య మొహంలో సంతృప్తో, అసంతృప్తో తెలియని గంభీరత ఉండేది. 2నర్సయ్యకు ఇద్దరు భార్యలు. ఇంటి ముందు గదిలో చిన్నపాటి కిరాణా కొట్టు నడిపేవాడు. ఆ కొట్లో కొన్నిసార్లు చిన్న భార్య, కొన్నిసార్లు పెద్దామె కూర్చునేవారు. చాలా అరుదుగా నర్సయ్య కూడా కొట్లో కూర్చునేవాడు. కొట్లో, ఇంట్లోనూ కూడా పోలీసు నిక్కరు మీదనే ఉండేవాడు. కొట్లో కొనుక్కోడానికి వచ్చే వాళ్లతో కూడా పేలడానికి సిద్ధంగా ఉన్న తుపాకీ మాదిరిగా గుంభనంగా ఉండేవాడు. పెద్ద మనుషులు ఎవరన్నా పలకరిస్తే ముక్తసరిగా మాట్లాడేవాడు. నర్సయ్య బయటి ఆడోళ్లవైపు చూసేవాడు కాదు. మొదటి పెండ్లికి ముందు చలాకీగా, రెండో పెండ్లికి ముందు కాస్త తక్కువ చలాకీగా ఉండేవాడని ఆయన వెంట ఉండే సైనికులు చెప్పేవారు. మరి ఇద్దరు భార్యలను ఎందువల్ల చేసుకోవలసి వచ్చిందో సరైన కారణం తెలియదు. మొదటి పెండ్లి తరువాత తగ్గిన చలాకీతనాన్ని ఆయన అంచనా వేసి ఉండకపోవచ్చు. ఆయన ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా వేటకు వెళ్లొచ్చిన రోజు తప్పకుండా గొడవ అయ్యేది. మొదటి గొడవ కూర వండను అన్నప్పుడు, రెండోది కూర బాలేకుంటే. అయితే ఆ గొడవ ఒక్కోసారి హఠాత్తుగా ముగిసిపోయేది. నర్సయ్య కాస్త ఎక్కువ తాగిన రోజున తుపాకీ లోడు చేసి భార్యల వైపు గురిపెట్టే వాడని, దాంతో గొడవ హఠాత్తుగా ముగిసిపోయేదని చెప్పుకునేవారు. 3నర్సయ్య ఇంటి పక్కనే బడి ఉంది. సర్పంచ్ ఎన్నికల కోసం ఆ రోజు మధ్యాహ్నానికే అధికారులు వచ్చి బళ్ళో విడిది చేశారు. ఆ ఊరుకు గతంలో ఫ్యాక్షన్ చరిత్ర ఉంది కాబట్టి నలుగురు పోలీసులను బందోబస్తుకు పంపారు. నలుగురి వద్ద నాలుగు 303 తుపాకులు ఉన్నాయి. వారి బసకు బళ్లో ఒక గదిని కేటాయించారు. తెల్లారితే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల అధికారి ఆ ఊరి మస్కురి సహాయంతో భోజన ఏర్పాట్లలో ఉన్నాడు. ఎన్నికల హడావిడి అంతా మాదే అన్నట్టు ఫీల్ అవుతారు ఎన్నికల అధికారులు. కానీ, అది నిజం కాదు. అసలైన హడావిడి అంతా పోలీసుల చుట్టే ఉంటుంది. పోలీసులకు చాలా ముందుచూపు ఉంటుంది. ఆ రాత్రికి పుష్టికరమైన భోజనం ఏర్పాటు చేసుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు లోకల్ పోలీసులు కాదు కాబట్టి ఆ ఊళ్ళో ఎవరూ పరిచయం లేదు. ఒక పోలీసు డ్రెస్ మార్చుకొని నింపాదిగా పక్కనే ఉన్న నర్సయ్య కిరాణం కొట్టుకు వెళ్ళాడు. సిగరెట్ కొనుక్కున్నాడు. నర్సయ్య చిన భార్య ఇచ్చిన అగ్గిపెట్టెతో సిగరెట్ ముట్టించాడు. కొట్టు ముందు అరుగు మీద కూసున్న కుర్రోళ్ల పక్కన కూసోని సిగరెట్ తాగాడు. రెండు సిగరెట్లు అయిపోయే లోపల నర్సయ్య చరిత్ర మొత్తం సేకరించాడు. నర్సయ్య పోలీసుల కంటే మేలైన విలుకాడు అని కూడా గుర్తించాడు. 4ఇంచార్జ్ పోలీసుకు ఉండాల్సింది సమాచారాన్ని వాస్తవ రూపం దాల్చేలా చేయడమే. మస్కురిని పంపి తుపాకుల నర్సయ్యని పిలిపించాడు. ‘‘నీ తుపాకీని స్టేషన్లో డిపాజిట్ చేయాలి కదా! ఎందుకు చేయలేదు?’’ అని గంభీరంగా అడిగాడు నర్సయ్యని. ‘‘నాకు తెలియదు సార్.. నాకు ఎవరూ చెప్పలేదు’’ అన్నాడు నర్సయ్య వినయంగా. ‘‘ఒక గంట లోపల అన్ని తుపాకులూ ఇక్కడికి తెప్పించాలి’’ అని మస్కురికి చెప్పాడు ఇంచార్జ్ పోలీసు. పోలీసు ఆదేశాలపట్ల గౌరవంతో తన తుపాకీ తేవడానికి నర్సయ్య వెళ్ళిపోయాడు. ‘‘మాజీ సర్పంచ్ వెళ్లి ఎస్సైతో మాట్లాడాడంట సార్. అందుకే వీళ్ళు తుపాకులు ఇవ్వలేదు’’ అన్నాడు మస్కురి.‘‘నాగ్గూడా తెలుసులేరా.. మరి పోలీసన్నాకా కొంచెం అన్నా అధారిటీ చూయించకపోతే జనాలకు భయం ఉండదు. రేపు ఓట్లు అయిపోయే వరకూ నేనే కదా ఇక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సింది? అందుకే అందర్నీ పిలువు. నా తడాఖా ఏందో నువ్వు చూద్దువుగానీ’’ అని మీసం మెలేశాడు. దర్పం ప్రదర్శించడంలోనే పోలీసు విలువ ఉందన్న సత్యం మస్కురికి తెలుసు. ఇంతలో ఇంకో పోలీసు వచ్చాడు. ఆయన లోకల్ పోలీసు. నాన్ లోకల్ పోలీసులకు గైడుగా వచ్చాడు. తుపాకులోళ్ళని పిలిపిస్తున్నట్టు తెలుసుకున్నాడు. ‘‘వాళ్ళని పిలిపిస్తే గొడవ అయిద్ది సార్. ఈ వూరు అసలే మంచిది కాదు. తుపాకులోళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు వదిలేయండి సార్’’ అన్నాడు లోకల్ పోలీసు. ఇంచార్జ్ ఏమీ అనలేదు. ‘‘నర్సయ్య దగ్గర ఏమన్నా కుందేళ్లు ఉన్నాయా?’’ అని మస్కురిని అడిగాడు లోకల్ పోలీసు. ‘‘రాత్రి యాటకు బొయ్యి పొద్దున్నే వచ్చిండు. ఉండొచ్చు సార్’’ అన్నాడు. ఇంతలో నర్సయ్య తుపాకీ తీసుకొని వచ్చాడు.‘‘ఏంది నర్సయ్యా.. ఎలక్షన్ల టైములోతుపాకీ తీసుకొని తిరుగుతున్నావు?’’ అని అడిగాడు లోకల్ పోలీస్. ‘‘బావుండ్రా సార్... మీరెప్పుడొచ్చారు?’’ అని నవ్వుతూ ‘‘మీవోళ్ళే తెమ్మన్నారు సార్’’ అన్నాడు. ‘‘ఏ..హే.. వాళ్లకు నీ గురించి తెల్వదులే.. ఏమి సంగతులు? రాత్తెర యాట బాగ జరిగిందంట గదా?’’ అన్నాడు. ‘ఏం లేదు సార్.. రెండు కుందేళ్లు, ఓ పది గల కముజు పిట్టలు పడ్డయి సార్! అన్నీ అమ్మిన. ఒక్క కుందేలు మాత్రం ఉంది సార్’’ అన్నాడు. ‘‘మరి ఇయ్యాల మాకు కుందేలు కూర తినిపియ్యరాదు. జందార్ సాబ్కు ఇష్టమట’’ అన్నాడు నవ్వుతూ. ‘‘సరే సార్.. దాందేముంది’’ అనుకుంటూ తుపాకీ తీసుకొని వెళ్ళిపోయాడు నర్సయ్య. 5గ్రామం నిశ్శబ్దంగా ఉంది. ఊళ్ళో పార్టీల నాయకులు పోల్ మేనేజ్మెంట్ పనిలో బిజీగా ఉన్నారు. అసలైన ప్రజాస్వామ్యానికి పునాది పడేది ఆరాత్రే. రాత్రి ఎనిమిదింటి సమయంలో బళ్ళో ఉన్న పోలీసులు రెండు పెగ్గులేసి, కుందేలు కూర సగం తిన్నారో లేదో.. నర్సయ్య ఇంట్లో హఠాత్తుగా గొడవ మొదలయింది. ఎన్నడూ లేనంత తారస్థాయిలో మాటలు పేలుతున్నాయి. నర్సయ్య ఇంట్లో గొడవతో జనాలు ఒక్కొక్కరుగా ఇండ్లల్లో నుంచి బయటకు వస్తున్నారు. బడికి ప్రహరీ గోడ లేదు. పోలీసులు గ్లాసులు పక్కకునెట్టి బయటకు వచ్చి నిలబడ్డారు. తుపాకీ తీసుకొని వెంటబడడంతో నర్సయ్య ఇద్దరు భార్యలూ ‘‘వామ్మోవ్.. ముండాకొడుకు కాల్చి సంపెట్టుండే’’ అని మొత్తుకుంటూ ఉరికొచ్చి పోలీసుల వెనకాల నిలబడ్డారు. పోలీసులు గద్దాయించినా కూడా నర్సయ్య గన్ను దింపకపోగా.. ‘‘దొంగ ముండల్లారా.. ఇయ్యాల మీరో నేనో తేలిపోవాలి’’ అని నేరుగా జందార్ సాబుకే తుపాకీ గురిపెట్టాడు. జందార్ సాబ్కు ఉచ్చ బడ్డది. ‘‘ఒరేయ్... వాని తుపాకీ గుంజుకోరా’’ అని మస్కురికి పురమాయించాడు. ఇంతలో జనం జమయ్యారు. పోల్ మేనేజ్మెంట్లో ఉన్న కార్యకర్తలూ నాయకులూ ఆ గలాటా దగ్గరికి వచ్చారు. ఎన్నికల అధికారి బ్యాలెట్ బాక్సుల గదికి తాళం వేసి ఆన్నే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆందోళనల్లోనుండే ప్రజాస్వామ్యం పురుడు పోసుకుంటదనే సోయి ఎన్నికల అధికారికి ఉంది. మిగతా సిబ్బంది కర్రలు పట్టుకుని ఆయన చుట్టూ నిలబడ్డారు. పోల్ మేనేజ్మెంట్లోని ఒక వర్గం కార్యకర్తలు నర్సయ్య భార్యల వెనకవైపు వచ్చి ‘‘ఏమైందీ?’’ అని ఆరా తీస్తున్నారు. ఇంకో వర్గం నర్సయ్య వెనకాలకు చేరి ‘‘ఏమైందీ?’’ అని అడిగారు. ‘‘ఈ పోలీసు సారు కుందేలు కూర అడిగితే వండమన్నా.. అదేమో వండనన్నది. ఇదేమో వండింది గని.. వండినంక.. ‘వాడెవనికి బుట్టిండు, వీడెవనికి బుట్టిండు! అన్నది. ఆఖరికి నువ్వెవనికి బుట్టినవు అని కూడా అన్నది. ఎప్పన్నుంచో ఓపికబడుతున్న. ఇయ్యాల ఈ ముండల సంగతి తేలాలి’’ అని భుజానికి తుపాకీని అదిమి పెట్టి పట్టుకున్నాడు. రోజుటికంటే ఇయ్యాల ఒక పెగ్గు ఎక్కువే తాగినట్టుండు నర్సయ్య. పైగా ఇద్దరు పెండ్లాలు ఏకమైనా కూడా కుందేలు కూర తిన్న పోలీసులు తనకే సపోర్ట్ చేస్తారనే ధైర్యం కూడా తోడయినట్టుంది. కొందరు తుపాకీని గుంజుకోవాలని చూసినా నర్సయ్య ఉడుం పట్టు వదలడం లేదు. భార్యల వైపు ఉన్న ఒక కార్యకర్త ‘‘ఇదంతా ఈ పోలీసుల వల్లనే వచ్చింది. కుందేలు కూర దొబ్బితిని మొగుడూ పెండ్లాలకు గొడవ పెట్టిండ్రు’’ అన్నాడు. ‘‘ఏయ్.. ఎవడ్రా నువ్వు.. మాటలు జాగర్తగా రానియ్యి’’ అని వాని మీదికి పొయ్యాడు జందార్ సాబ్. అంత మంది ముందు పోలీసు తన కార్యకర్త మీదికి పోయేసరికి వాళ్ళ నాయకుడు కోపానికి రావాల్సొచ్చింది. ‘‘ఏదీ.. మావోనిమీద చెయ్ వెయ్ చూస్తా’’ అని పోలీసు ఇంచార్జ్ మీదికి పోయాడు. ప్రత్యర్థి వర్గ నాయకునికి కూడా పౌరుషం వచ్చింది. ఇలాంటి సమయంలో దూసుకొని పోకపోతే రేపు తనకు ఓట్లు పడవు అనే డౌట్ వచ్చిన సర్పంచ్ అభ్యర్థి ‘‘ఏందిరా.. పోలీసు మీదనే చెయ్ వేస్తావా!’’ అని అతని మీదికి పోయాడు. ‘‘నువ్వెవర్రా?.. ఈ పోలీసులు నీవోల్లా?.. రిగ్గింగ్ చేయనీకి తెచ్చుకున్నవా?’’ అని అతని గల్లా పట్టనే పట్టిండు ఒక కార్యకర్త. సహనం కోల్పోయిన నర్సయ్య ఢాం అని తుపాకీ పేల్చాడు. పోలీసు ఇంచార్జ్ పక్కనుండి, ఇద్దరు భార్యల మీదకి గుండ్లు వెళ్ళేవే.. కానీ, ఎవరో తన చెయ్యి పట్టి లాగడం వల్ల అది పైకి గాల్లోకి పేలింది. ఇదే సందని రెండు వర్గాలూ గలాటాకు దిగాయి. ఒకరినొకరు నెట్టుకుంటూ రోడ్డు మీద నుండి బళ్లోకి వచ్చారు. పోలీసులకు తమ కర్తవ్యం గుర్తొచ్చి, డ్రెస్ వేసుకునే సమయం లేక, లుంగీలు కాశబోసి, లోపలికి ఉరికి తమ తుపాకులు తెచ్చి లోడు చేసి బ్యాలెట్ బాక్సుల ముందు వరుసగా నిలబడ్డారు. ‘‘నన్ను రిగ్గింగ్ చేసేటోడంటావురా’’ అని కర్రలతో కొట్టుకుంటూ, రాళ్లు విసురుకోవడం మొదలు పెట్టారు. ఈలోపు ఒక వర్గం కార్యకర్త గభాల్న ఉరికి బ్యాలెట్ గది తలుపుని తన్ననే తన్నాడు. బ్యాలెట్కు ఏదన్నా అయితే కనీసం ప్రతిఘటన అయినా ఇవ్వలేదని అధికారులు అడుగుతారని పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నర్సయ్య తన ఇంట్లోకి వెళ్ళి మరోసారి గన్ను లోడు చేయడం మొదలు పెట్టాడు. మస్కురి ఉరికి నర్సయ్య బయటకు రాకుండా గొళ్ళెం పెట్టాడు. నర్సయ్య భార్యలు పక్కింట్లో తల దాచుకున్నారు. బీపీ పెరిగి పడిపోయిన ఎన్నికల అధికారికి ఊళ్ళో పేరుమోసిన ఆర్ఎంపీ డాక్టర్ సపర్యలు చేస్తున్నాడు. ఇంతలో అదనపు బలగాలు వచ్చాయి. వీపుకు తుపాకులు, చేతిలో లాఠీలతో డీసీఎం వాన్ నుండి దూకిన స్పెషల్ పోలీసులు అందినకాడికి వీపులు, అందకపోతే పిర్రలు పగలగొట్టారు. అటు సగం మందిని ఇటు సగం మందిని గెదిమి రోడ్డుమీద నిలబడ్డారు పోలీసులు. కొందరు కార్యకర్తలు ఎంతో హుషారుగా ఉంటారు. వాళ్ళు నాయకుల కోసం ఎంతకైనా తెగిస్తారు. పోలీసులు లాఠీఛార్జ్ పనిలో ఉండగా, వారు తెరిచి ఉన్న గదుల్లో జొరబడ్డారు. వాళ్ళు ఏమి చేయాలనుకున్నారోగానీ ముందుగా కనపడ్డ మందు బాటిళ్ళూ, కుందేలు కూర ఎత్తుకుపోయారు. కొత్త కానిస్టేబుల్ తల విదిలించి ఉడుకుతున్న చికెన్ వాసనను గాఢంగా పీల్చుకున్నాడు. తుపాకులు ఉన్నా ఒక్కోసారి మన కూర మనకు దక్కదు అని అనుకున్నాడు. ‘‘వంట అయింది భోజనానికి రండి సార్’’ అని వంట కానిస్టేబుల్ పిలిచాడు. దూరం నుంచి తీవ్రంగా చర్చించుకుంటూ పంచాయితీ ఆఫీసు వైపు వస్తున్న జనాల గుంపును చూసి తుపాకులు తెచ్చుకొని బయట నిలబడ్డారు పోలీసులు. - గోపిరెడ్డి యేదుల -
పరుల సొమ్ము
అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది ప్రతిరోజూ ఆహారం కోసం అడవి చుట్టూతా ఉన్న గ్రామాలకు వెళ్లేది. అక్కడ ఆడవారు ధరించే నగలు, చూసి తాను కూడా ఒంటినిండా నగలు ధరించి తిరగాలనుకునేది.ఒక రోజు కోతి అడవికి దగ్గర్లో ఉన్న రామాపురం గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలోని చెరువులో నీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. ఆహారం తిన్నాక కోతి నీళ్లు తాగటానికి చెరువుకు వెళ్ళింది. దాహం తీర్చుకున్నాక పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది. చెరువు దగ్గరికి రాకుమారి ఆమె మిత్రబృందం రావటం గమనించింది. రాకుమారి తన ఒంటిమీది వజ్రాల హారం చెరువు ఒడ్డున పెట్టి నీటిలోకి దిగింది.రాకుమారి›స్నానం చేస్తుండగా, కోతి నెమ్మదిగా చెట్టు దిగి వజ్రాల హారం పట్టుకొని అడవిలోకి పరిగెత్తింది. అది గమనించిన రాకుమారి, ఆమె మిత్రబృందం ‘పట్టుకోండి పట్టుకోండి!!! కోతి వజ్రాలహారం పట్టుకుని పరిగెడుతోంది!’ అంటూ పెద్దగా కేకలు వేశారు. దూరంగా ఉన్న రాజ భటులు కోతి వెంట పరుగు తీశారు. కోతి చాలా వేగంగా పరిగెత్తి అడవిలోకి వెళ్ళింది. కోతి పరుగెత్తి, పరుగెత్తి అడవి మధ్యలో ఒక చెట్టు ఎక్కి ఆయాసం తీర్చుకోసాగింది. అక్కడే చెట్టు కింద ఒక పాము పుట్ట గమనించింది. అప్పుడే ఆ పుట్టలోంచి పాము బయటికి వచ్చింది. పాముని గమనించిన ముంగిస, పాముని పొదల్లోకి వెంబడించింది. కోతికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. ‘ఎలాగో పామును ముంగిస చంపేస్తుంది– నేను దొంగిలించిన వజ్రాల హారాన్ని దాచుకోటానికి ఈ పుట్టే సరైన ప్రదేశం. పుట్టలో పాము ఉందనుకుని ఎవరూ ఇక్కడికి రారు’ అనుకుంది. వెంటనే వజ్రాల హారాన్ని పుట్టలోకి జారవిడిచింది. తెల్లారి వచ్చి వజ్రాల హారాన్ని తీసుకోవచ్చని భావించింది.అక్కడి నుంచి రాజభటులకు కనిపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది. చీకటి పడటంతో రాజభటులు కోతి కోసం కొద్దిసేపు గాలించి, వెనుతిరిగి చెరువుకు వెళ్ళిపోయారు. తెల్లారి కోతి పుట్టలో చేయి పెట్టి వజ్రాల హారం తీసుకుంది. మెడలో ధరించి మురిసిపోయింది. ఇంతలో పుట్ట నుంచి పాము వచ్చి కోతిని చుట్టేసింది. అప్పుడే అటుగా రాజభటులు కోతిని వెతుక్కుంటూ వచ్చారు. కోతి మెడలో వజ్రాల హారం చూసి పుట్ట దగ్గరకు పరుగున వచ్చారు. పాము కోతిని విడిచి పుట్టలోకి దూరింది. రాజభటులు కోతిని బంధించి వజ్రాలహారాన్ని తీసుకున్నారు. దొంగిలించిన పరుల సొమ్ము విషపూరితమైనదని, ప్రమాదకరమైనదని గ్రహించింది కోతి.పల్లా శైలజ -
దారి చూపిన చెప్పులు
దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 10న చోటు చేసుకున్న విధ్వంసం మానవబాంబు దాడిగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సిటీ పోలీసు విభాగానికి గుండెకాయ లాంటి నగర పోలీసు కమిషనర్స్ టాస్క్ఫోర్స్ కార్యాలయంపై 2005 అక్టోబర్ 12న రాత్రి 7.20 గంటల సమయంలో ఇది చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఓ చెప్పుల జత ఆధారంగా ముందుకు వెళ్లారు. బేగంపేటలో గ్రీన్లాండ్స్ చౌరస్తాలోని నగర కమిషనర్స్ టాస్క్ఫోర్స్ కార్యాలయం (ప్రస్తుతం సికింద్రాబాద్కు మారింది) 2005 అక్టోబరు 12న మానవబాంబు దాడి జరిగింది. నగరానికి చెందిన గజ ఉగ్రవాది షాహెద్ అలియాస్ బిలాల్ తదితరుల నేతృత్వంలో జరిగిన ఈ కుట్రలో బంగ్లాదేశ్కు చెందిన మౌథసిమ్ బిల్హా అలియాస్ డాలిన్ మానవబాంబుగా మారాడు. ముందే పెట్టుకున్న ముహూర్తం ప్రకారం టాస్క్ఫోర్స్ కార్యాలయంపై దాడి చేశాడు. ఆ రోజు దసరా పండుగ కావడం, అప్పటికి కొద్ది నిమిషాల ముందే సిబ్బంది సమావేశం ముగించుకుని బయటకు వెళ్లిపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పి ఉగ్రవాదుల అంచనాలు తలకిందులయ్యాయి. సెంట్రీ డ్యూటీలో ఉన్న హోంగార్డు ఎ.సత్యనారాయణ చనిపోగా, కానిస్టేబుల్ వెంకట్రావుకు తీవ్రగాయాలయ్యాయి. పేలుడు జరిగిన కొద్దిసేపటి వరకు అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పంజగుట్ట పోలీసులు తొలుత ఇది టాస్క్ఫోర్స్ కార్యాలయంలో ఉంచిన బాణసంచా లేదా స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల వల్ల జరిగిందని భావించారు. కొంత సమయానికి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం అనేక కోణాల్లో పరిశీలించి, మృతదేహం శరీరభాగాలు సేకరించి, విశ్లేషించిన తర్వాతే మానవబాంబు దాడిగా నిర్ధారించింది. ఈ ఘాతుకం విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, హోంమంత్రి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే చాలా వరకు ధ్వంసమైన టాస్క్ఫోర్స్ కార్యాలయం మొండి గోడల నుంచి అప్పటికీ పొగలు వస్తూనే ఉన్నాయి. పోలీసుల్నే టార్గెట్గా చేసిన ఈ దాడి కేసును సవాలుగా తీసుకున్న అధికారులు పంజగుట్ట పోలీసుస్టేషన్ నుంచి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు.ఈ కేసును ఎంత సవాల్గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించినా, తొలి అడుగు వేయడానికి అవసరమైన ఒక్క ఆధారంగా కూడా అప్పటికి పోలీసుల వద్ద లేదు. టాస్క్ఫోర్స్ కార్యాలయంపై ఓ వ్యక్తి మానవబాంబుగా మారి దాడి చేశాడనే అంశం తప్ప అతడు ఎవరు? ఎక్కడి వాడు? వెనుక ఉన్నది ఎందరు? తదితర వివరాలేవీ అందుబాటులో లేవు. మానవబాంబు ఎవరనేది తెలిస్తేనే అడుగు ముందుకు పడుతుందని భావించిన పోలీసులు మరోసారి ఘటనాస్థలిని సమగ్రంగా పరిశీలించడానికి నిపుణుల బృందాన్ని రప్పించారు. అక్కడి అణువణువూ పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులకు ఓ జత తోలు చెప్పులు లభించాయి. ఆరో నంబర్ సైజుతో కూడిన వాటిని అంతకు ముందు సేకరించిన మానవబాంబు మృతదేహం పాదాలకు పోల్చిచూడగా సరిగ్గా సరిపోయాయి. దీంతో అవి మానవబాంబువే అని నిర్ధారించిన నిపుణులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే వాటిపై ఉన్న ‘టీకే 200’ అక్షరాలు నిపుణుల దృష్టిలో పడ్డాయి. అది ఆ చెప్పుల రేటును స్పష్టం చేసే అంశంగా తేల్చిని అధికారులు చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని కరెన్సీ వివరాలు ఆరా తీశారు. ఇలా టీకే అంటే బంగ్లాదేశ్ కరెన్సీ టాకా అని గ్రహించిన నిపుణులు సదరు మానవబాంబు బంగ్లాదేశ్కు చెందిన వాడని స్పష్టం చేశారు. దీంతో ఐఎస్ఐ, దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల ప్రమేయం కోణంలో దర్యాప్తు జరిగి కేసు కొలిక్కి వచ్చి, ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) పాత్ర వెలుగులోకి వచ్చింది. అలా దొరికిన తీగతో మొదలైన దర్యాప్తు దేశవిదేశీ కోణాలను వెలికి తీసింది. ‘టాస్క్ఫోర్స్’ కేసులో మొత్తం 20 మందిని నిందితులుగా గుర్తించిన సిట్ విదేశాల్లో, పరారీలో ఉన్న వారిని మినహాయించి మిగిలిన పది అరెస్టు చేసింది. మూడో నిందితుడిగా ఉన్న మానవబాంబు డాలిన్ ఘటనాస్థలిలోనే మరణించాడు. మిగిలిన తొమ్మిది మందిలో ప్రధాన నిందితుడు గులాం యజ్దానీ అలియాస్ నవీద్ 2006లో ఢిల్లీలో, రెండో నిందితుడిగా ఉన్న షాహెద్ అలియాస్ బిలాల్ 2007లో పాకిస్థాన్లో ఉన్న కరాచీలో ఎన్కౌంటర్ అయ్యారు. హైదరాబాద్కు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ, బంగ్లాదేశ్కు చెందిన షరీఫ్, ముతాలిబ్, ఇక్బాల్, అష్రాఫ్, పాకిస్తాన్కు చెందిన ఖాన్ అలియాస్ పఠాన్లతో సహా ఏడుగురు చిక్కనే లేదు. ఈ కేసుకు సంబంధించి సిట్ చార్జ్షీట్, సప్లమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ, అదనపు సెక్షన్లు చేర్చే విషయంపై స్టే కారణంగా సుదీర్ఘకాలం విచారణకు బ్రేక్ పడింది. చివరకు 2012లో మళ్లీ నాంపల్లి కోర్టులో ట్రయల్ ప్రారంభమైంది. పోలీసులు అరెస్టు చేసిన నిందితులపై నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ వైఫల్యం చెందింది. దీంతో ఈ కేసు వీగిపోయి నిందితులు బయటపడ్డారు. -
నాడు ఆఫీసు బాయ్... నేడు కంపెనీ సీఈఓ
ప్రతి వ్యక్తిలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే అదే మన జీవితాన్ని ఉన్నతంగా మార్చేస్తుంది.మనం చేయగలగింది ఎప్పుడైనా సమర్థత, ప్రతిభను అందిపుచ్చుకుంటూ ప్రయాణిస్తూ ఉండాలి. అప్పుడే డబ్బు కూడా వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో అందరు తల్లిదండ్రుల కల.. తమ బిడ్డ టెక్నాలజీ రంగంలో రాణించాలని. బీటెక్ చదివిన విద్యార్థుల ఆశలు.. పెద్ద పెద్ద కంపెనీలలో లక్షల్లో ప్యాకేజీ పొందాలని.‘కానీ, ఈ రోజుల్లో నైపుణ్యాల లేమి వల్ల వీరి కలలు నెరవేరడం లేదు’ అంటారు ఫణిరాజు జాలిగామ. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అజా (AJA Coding Tutor) కోడింగ్ ట్యూటర్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఫణిరాజు జాలిగామ సాఫ్ట్వేర్ కంపెనీలకు అర్హత కలిగిన ఉద్యోగులను అందించడంలో బిజీగా ఉన్నారు. ‘సాఫ్ట్వేర్ రంగంలో సెట్ అవడానికి ఇతర డిగ్రీలు చేసిన వాళ్లు కూడా అర్హత సంపాదించుకోవచ్చు’ అంటూ అందుకు తన జీవితమే గొప్ప ఉదాహరణగా చూపుతున్నారు. ఉక్కు నరాలున్న వందమంది యువతను అప్పగిస్తే దేశ తలరాతను మార్చి చూపుతా అన్న వివేకానందుడి మాటలను గుర్తు చేస్తూ ‘ప్రతి వ్యక్తిలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే అదే మన జీవితాన్ని ఉన్నతంగా మార్చేస్తుంది’ అంటారు. ఒకప్పుడు జిల్లా కోర్టులో ఆఫీస్ బాయ్గా పనిచేయడం నుంచి నేడు కోట్లాది రూపాయల ఐటీ సేవల సంస్థకు అధ్యక్షుడు, సీఈఓగా ఎదిగే వరకు ఫణిరాజ్ జాలిగామ ప్రయాణం అత్యంత స్ఫూర్తితో నిండినది. ఆఫీసు బాయ్గా.. డ్రైవర్గా! పూర్వ కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పట్టణవాసి ఫణిరాజు జాలిగామ. ఆయన తండ్రి అక్కడ రిజిస్ట్రేషన్ స్టాంపులు అమ్మేవారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టుడంతో తాతల నాటి కొద్దిపాటి ఆస్తి అమ్ముకొని రోజులు గడపాల్సి వచ్చింది. పదో తరగతి పూర్తయ్యేసరికి ఆ ఆస్తీ కరిగిపోయింది. టెన్త్లో 85 శాతం మార్కులు సాధించి, పై చదువులకు వెళ్లాలన్న తపన ఉన్నా ఆర్థిక ఇబ్బందులు అడ్డుగోడలా నిలిచాయి. ఎవరినీ చేయి చాపి అడగని మనస్తత్వం. కానీ, ఎదగాలి అంటే ఏదో ఒక పని చేయాలి. ఒక పాన్ షాపులో పనికి కుదిరాడు. ఓ తెలుగు వారపత్రికను ఇల్లిల్లూ చేర్చడానికి ఏజెంట్గా మారాడు. ఐటీఐ చేసి, ఎలక్ట్రీషియ¯Œ గా పనిచేశాడు. ఈ అన్ని పనుల ద్వారా వచ్చిన డబ్బుతో ఇంటర్మీడియట్ చదువును ప్ర«థమ శ్రేణిలో పూర్తి చేశాడు. కార్ డ్రైవర్గా పనిచేస్తూ కరీంనగర్ జిల్లా కోర్టులో ఆఫీస్ బాయ్ ఉద్యోగం సంపాదించాడు. అది అతని మొదటి ప్రభుత్వ ఉద్యోగం. ఎదగాలనే తపనే సోపానంకోర్టులో క్లర్క్ జాబ్కు ఉన్న ప్రాధాన్యం చూసి ఆ ఉద్యోగం పొందాలనుకున్నాడు. ఏ టేబుల్ మీద అయితే టీ, కాఫీలు అందిస్తూ వచ్చాడో ఆ టేబుల్ ముందు కూర్చొని వర్క్ చేయాలనుకున్నాడు. తెలిసినవారిని అడిగితే షార్ట్హ్యాండ్ పరీక్షలలో పాసైతే అదే హోదాతో కాపీయిస్ట్ ఉద్యోగం పొందవచ్చని సూచించారు. దీంతో బాయ్గా పనిచేస్తూనే షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. న్యాయమూర్తి అనుమతితో రాత్రిపూట కోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఉదయం షార్ట్ హ్యాండ్ నేర్చుకునేవాడు. కొద్ది రోజుల్లోనే షార్ట్హ్యాండ్లో నిమిషానికి 225 పదాలు రాయగలిగాడు. ఆ పరీక్షలో డిస్టింక్ష¯Œ లో పాస్ అయ్యాడు. ఆ సంవత్సరం జిల్లా కోర్టులో కాపీరైట్ల పోటీకి హాజరు కావడంతో ఆ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం, స్థిరమైన ఆదాయం జీవనం సాఫీగానే సాగిపోతోంది. ఈలోగా ఎంసీఏ చేసిన మేన మరదలు శ్రీలలితతో వివాహం జరిగింది. భార్య ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ‘నేను అప్పటికే కరస్పాండె¯Œ ్స డిగ్రీ పూర్తి చేశాను. నా టాలెంట్ను గమనించిన నా భార్య ఐటీ ఉద్యోగం అయితే మంచిదని సూచించడమే కాకుండా, ప్రయత్నించమని చెప్పింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి, కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడం ప్రారంభించాను. బంధువులు వద్దని వారించినా ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి, పూణేలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను‘ అని ఫణిరాజ్ తాను ఐటీ రంగంలోకి ప్రవేశించిన విధానాన్ని వివరిస్తారు.కంపెనీ డైరెక్టర్.. లక్షల్లో జీతం...ఐటీ కంపెనీలో ఫణిరాజ్ మొదటి జీతం రూ. 15,000. చేరిన ఆరు నెలల్లోనే, ఐటీ రంగంలో మంచి భవిష్యత్తు అని గ్రహించాడు. తర్వాత ఎంబీయే పూర్తి చేసి, టీసీఎస్లో సీనియర్ మేనేజర్గా చేరి నెలకు రూ. 4.5 లక్షల జీతం పొందాడు. ‘ఆ తర్వాత 2015లో కాగ్నిజెంట్ టెక్నాలజీలో అసోసియేట్ డైరెక్టర్గా ఎదిగారు. ‘అప్పుడే నా ఫ్రెండ్ సూచనతో స్వంత కంపెనీని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. డబ్బుల కోసం ఆలోచించలేదు. నా దగ్గర ఉన్న పనిని ఇంకొంత మెరుగ్గా, పదిమందికి ఉపయోగపడాలనేదే ఆలోచన. అప్పటికే సాఫ్ట్వేర్లోకి ఎంతో మంది ఉద్యోగులను తీసుకోవడం, వారి చేత వర్క్ చేయించడం... ఓ యజ్ఞంలా సాగుతూనే ఉంది.బంగారం అమ్మేసి.. ఎక్కడ చూసినా ప్రతిభావంతులు తక్కువ శాతమే కనిపిస్తున్నారు. సరైన నైపుణ్యాలు లేక ఐటీ రంగంలో జాబ్లు పోగొట్టుకున్నవారు ఎందరో. హైదరాబాద్లో అమీర్పేట్ లాంటి ప్లేసుల్లో రకరకాల టెక్నాలజీ కోర్సుల్లో చేరి, సాధారణ ఉద్యోగాలు పొందేవారు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా గమనించే ‘ఓజాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించాను. అయితే, ఇదంత సులువు కాలేదు. సొంత కంపెనీని స్థాపించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. తగినంత మొత్తం సమకూరలేదు. దీంతో మా ఆవిడ నగలు అమ్మేసి, లోన్లు తీసుకొని ఈ కంపెనీని స్థాపించాను. ఐదేళ్లలో 5000 మందికి ఉద్యోగవకాశాలు లభించాయి. కంపెనీ అతి త్వరలోనే ఏడాదికి దాదాపు రూ. 50 కోట్ల టర్నోవర్ పొందే స్థితికి చేరుకుంది. అమెరికాలోని సియమెన్స్, ఇన్ఫ్యూజన్ సాఫ్ట్ .. వంటి పెద్ద కంపెనీలు మా కస్టమర్లు అయ్యారు. మనం చేయగలగింది ఎప్పుడైనా సమర్థత, ప్రతిభను అందిపుచ్చుకుంటూ ప్రయాణిస్తూ ఉండటమే. అప్పుడే డబ్బు కూడా వస్తూ ఉంటుంది’ అంటారు ఈ ఐటీ దిగ్గజం. ఇంజనీర్ డిగ్రీ చేయకపోయినా.. ఉద్యోగంఐటీ రంగంలోకి ప్రవేశించడానికి ముందు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను మరచిపోలేదని చెబుతారు ఫణిరాజు. అందుకే, నాన్ టెక్నాలజీ వాళ్లవైపు తమ ఆలోచన ఉండేవని వివరిస్తారు. ‘కాలేజీల్లో టాప్ ర్యాంకర్లను మాత్రమే కాకుండా, అమీర్పేట్లో కోచింగ్ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న వారిని ఉద్యోగులుగా తీసుకున్నాం. 5 లక్షల వరకు ప్యాకేజీ ఇచ్చి మేమే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాం. రెండేళ్ల కిందట అజా పేరుతో కోడింగ్ ట్యూటర్ను ప్రారంభించాం. దీని ద్వారా బీయే, బీకామ్ చదివి ఐటీ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి కూడా శిక్షణ ఇచ్చి, కంపెనీలకు నియామకాలు చేస్తున్నాం. నేర్చుకోవాలనే తపన ముఖ్యం కానీ, డిగ్రీలు కావు. బీటెక్ చేసిన చాలా మంది విద్యార్థులకు నాలుగు లైన్ల కోడింగ్ రాయడం రాదు. కానీ, నలభై లక్షల ప్యాకేజీ కావాలన్నట్టుగా ఉంటారు. ఏదో విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగం తెచ్చుకున్నా మూడు నుంచి ఆరు నెలలలోపే బయటకు వస్తున్నారు. దీని వల్ల ఇటు ఉద్యోగి భవిష్యత్తు, కంపెనీల భవిష్యత్తుకు ప్రమాదంలో పడుతుంది. అందుకే, ముందు స్కిల్స్పైన దృష్టి పెట్టాలి. స్కిల్ నేర్చుకున్నవారికి మేమే సరైన కంపెనీల ద్వారా ఉద్యోగావకాశాలను ఇప్పిస్తున్నాం’ అని తెలియజేశారు.జీవితంలో రాణించాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే కోరిక అతను కోరుకున్న గమ్యస్థానాలకు దగ్గర చేసింది. ఇంకా, చేరుకోవాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి అంటారు ఈ ఐటీ నిపుణుడు. ఉన్న స్థానం నుంచి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపన తనను ఎప్పుడూ వెంటాడుతుందని, ఏదైనా సాధించాలనుకున్న ప్రతిసారీ ఈ భావనే ముందుకు నెడుతుందని చెబుతున్నారు ఫణిరాజ్. ఆ తపనే ఆఫీస్బాయ్ నుంచి ఐటీ కంపెనీకి సీఈఓగా మార్చిందని వివరించారు. ∙నిర్మలా రెడ్డిఫొటోలు: మోర్ల అనిల్కుమార్ -
పాత బొమ్మల కొత్త రి‘స్టోరీ’
గోల్డెన్ క్లాసిక్గా నిలిచిన ఆ తరం పాత సినిమాలను నేటి అధునాతన టెక్నాలజీ అయిన 4కే రిజల్యూషన్తో పునరుద్ధరించి, సరికొత్తగా జీవం పోస్తున్నారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే తాతయ్య అమ్మమ్మ జ్ఞాపకాలుగా ఇంట్లో ఉన్న పాత మరచెంబును అలా మూలకు పడకుండా చింతపండు వేసి తోమి తళతళా మిలమిలా మెరిపించి కొత్తదానిలా చేయడం. దానితో ఉన్న జ్ఞాపకాలను మరొక్కసారి మననం చేయడమే ఈ రిస్టోరేషన్.1962లో విడుదలైన ‘గుండమ్మ కథ’ సినిమాను ఫోర్ కే రిజల్యూషన్లోకి సరికొత్తగా మార్చి, అక్కినేని శత జయంతి సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్లో విడుదల చేశారు. ఒక తాతయ్య తన మనవరాలితో కలిసి ఆ సినిమా చూశాడు. మొదటిసారిగా ఆ సినిమా చూసినప్పుడు తనెంత చిన్న పిల్లాడో, ఆరోజున సినిమా టికెట్ ధర పది పైసలు సంపాదించడానికి తానెంత కష్టపడ్డాడో, ఆ నేల టికెట్ తీసుకొని కింద ఇసుకలో కూర్చున్న సంగతి నుంచి రాజనాల ఎన్టీఆర్ ఫైట్, అక్కినేని తాగి చేసిన అల్లరి, ‘కోలో కోలో’ పాటకు ఆనందంతో తాను చేసిన డ్యాన్స్ , ఆనాటి నుంచి తనతో పాటు ప్రయాణిస్తూ మదిగదిలో తడియారని జ్ఞాపకాలను మనవరాలితో పంచుకున్నాడు. ‘చదువుకోకుండా టీవీలు, సినిమాలు చూస్తే పాడైపోతారని అస్తమానం మందలించే తాతయ్య, తామంతా భయపడే నాన్న కూడా భయపడే తాతయ్యలో ఇంతటి అల్లరి సినీ ప్రేమికుడు ఉన్నాడా?’ అనుకుంటూ ఆ మనవరాలు ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుంచి తాతయ్యకు తనకు బాండింగ్ మునుపటి కంటే ఇంకా చిక్కగా అయ్యింది. ఈ అనుభవం ఒక్క ఆ తాత మనవరాలిదే కాదు. భారతదేశంలో ఉన్న చాలామంది సినీ ప్రేమికులది. దీనికంతటికీ కారణం ఫోర్కే రిజల్యూషన్తో రిస్టోర్ చేసిన ఓ సినిమా.వివిధ భాషలకు చెందిన అనేక క్లాసిక్ చిత్రాలను 4కేలో రిస్టోర్ చేసి, థియేటర్లోకి మళ్ళీ విడుదల చేస్తున్న సందర్భంగా ఈ రిస్టోర్ రీ రిలీజ్కు సంబంధించిన కథా కమామిషూ తెలుసుకుందాం!సామాన్యంగా ఏ సినిమా అయినా, అది తీసే నాటికి అందుబాటులో ఉన్న టెక్నాలజీతో తెరకెక్కిస్తారు. అప్పటికి అందుబాటులో ఉన్న కెమెరాలనే వాడతారు. పిక్చర్ క్వాలిటీ ఆ కెమెరాల పరిధి మేరకే ఉంటుంది. సరిగ్గా చెప్పాలి అని అంటే కీప్యాడ్ ఫోన్లు ఉన్నప్పుడు జనమంతా వాటినే వాడారు. తర్వాత ఆ కీప్యాడ్ ఫోన్లకి ఓ చిన్న కెమెరా అమర్చారు. అప్పటికి ఫోన్లకు కెమెరా ఉండటమే గొప్ప! తరువాత ఆ కెమెరా క్వాలిటీ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో కెమెరాతో 4కే లేదా 8కే వరకు వీడియోలు తీయవచ్చు. అప్పటికీ ఇప్పటికీ వీడియో క్లారిటీ చాలా పెరిగింది. ఇదే విధానం ఇప్పుడు సినిమా కెమెరాలకూ వర్తిస్తుంది. కీప్యాడ్ కెమెరాతో తీసిన వీడియోకు, ప్రస్తుతం ఐఫోన్తో తీసిన వీడియోకు వ్యత్యాసం ఎంత ఉందో; ఆనాడు మిచెల్ కెమెరాతో ఫిల్మ్ మీద తీసిన సినిమాలకు ఈనాడు అందుబాటులో ఉన్న కెమెరాలతో చీప్ మీద తీసిన సినిమాలకు అంత వ్యత్యాసం ఉంది. పాత కెమెరాలతో తీసిన సినిమాలను ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెమెరా టెక్నాలజీకి అప్ గ్రేడ్ చేయడమే రిస్టోరేషన్ పద్ధతి. సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్లో ఉన్న పాత తాతయ్య ఫోటోను సరికొత్త ఫొటోగా మార్చడం. తెలుగు సినిమా ప్రయాణాన్ని మలుపు తిప్పిన 1989 ‘శివ’ సినిమాను సరికొత్త ఫోర్ కేలోకి రిస్టోర్ చేసి ఇలానే విడుదల చేశారు.తొలి ఘనత ‘కల్పన’‘దీని వలన రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి పాత సినిమాలను నేటితరం కోసం, తర్వాతి తరాల కోసం జాగ్రత్త చేయడం; రెండు ఈ సరికొత్త చిత్రాన్ని రిలీజ్ చేసి వ్యాపారం చేయడం. ఇందులో పుణ్యం పురుషార్థం రెండూ ఉన్నాయి. వ్యాపారం చేసి, డబ్బులు సంపాదించడం ఒకటైతే; ప్రేక్షకుల జ్ఞాపకాలను మరొక్కసారి తట్టి లేపడం రెండవది. అయితే అన్ని చిత్రాలూ డబ్బు సంపాదించి పెట్టలేకపోవచ్చు’’ అంటున్నారు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ స్థాపకులు, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్. ఈ సంస్థ హాలీవుడ్ దర్శకుడు మార్టిన్ స్కోర్ససి స్థాపించిన ఫిల్మ్ రిస్టోరేషన్ సంస్థతో కలిసి పాత సినిమాల పునరుద్ధరణ నిర్వహిస్తుంది. ఈ ఫౌండేషన్ ఉదయ్ శంకర్ 1948లో తీసిన ‘కల్పన’ చిత్రాన్ని ఫోర్ కేలోకి రిస్టోర్ చేసి ఆ సినిమాకు పునరుజ్జీవం పోసింది. ‘కల్పన’ రిస్టోర్ అయిన మొదటి భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది.రిస్టోరేషన్ నేటి తరానికి అవసరంనేటి కమర్షియల్ సినిమాల్లో మితిమీరిన హింస, మతిలేని డ్రామా ఉంటోందని ఆనాటి సినిమా చూసిన పాతతరం ప్రేక్షకులు వాపోతుంటారు. వారి మాటల్లోనే చెప్పాలంటే, ‘కత్తి పట్టుకుంటే నరకటం, గన్ను పట్టుకుంటే కాల్చడం, శత్రువును క్షమించడం కంటే కనపడితే రెండుగా చీల్చడం– ఎలివేషన్లే కాని, ఎమోషన్ లేని సీన్లతో ఈ సినిమాలో కథ ఏముంది? అదే మా కాలంలోని సినిమాలోనైతేనా’ అంటూ ఆనాటి వారి సినిమాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.అయితే ఈ మాటను నేటి యువ సినీ ప్రేక్షకులు ఒప్పుకోరు. హీరో ఎంట్రీ ఎలివేషన్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్కి ఈలలు, చప్పట్లతో థియేటర్ని హోరెత్తించే నేటి బర్గర్ పిజ్జా బిర్యానీ తరానికి బ్లాక్ అండ్ వైట్ సినిమా పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. ఈతరం వారి సినిమాలను అప్పటి వారు మెచ్చుకోరు. ఆతరం వారి సినిమాలను ఇప్పటివారు ఒప్పుకోరు. ఫాస్ట్ కట్స్కి అలవాటుపడ్డ వారికి పాత సినిమాలు లాగ్ అనిపిస్తాయి. అయినా నలుపు తెలుపు రెండే రంగులున్న ఆ పాత సినిమాలు చూసేవారెవరు? చూడాలన్నా అందుబాటులో ఉండాలి కదా! అద్దం మొహం ఒక దగ్గర ఉంటేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకోసమైనా ఆ ఓల్డ్ గోల్డ్ క్లాసిక్స్ని నేటి టెక్నాలజీకి అనువుగా మార్చి ఈ జెన్ జీ తరానికి చేరువ చేయాలి. ఆ పాత సినిమాల్లో కథలు ఎలా ఉండేవి? ఆ నటుల నటనాస్థాయి ఏమిటి? హాస్యం, జుగుప్స లేకుండా ఎంత హాయిగా ఉండేది? సంగీతంలో లాలిత్యం, సాహిత్యంలో కవి భావం ఎంత లోతుగా ఉండేదో ఈ తరానికి తెలియాలంటే ఈ ఫోర్ కే రిస్టోరేషన్ అవసరం చాలా ఉంది.‘నేటి ప్రేక్షకుడు సాంకేతికంగా నాణ్యమైన సినిమాని చూడడానికి అలవాటు పడ్డాడు. సినిమా, టీవీ తెరలే కాదు, ఎక్కువ సమయాన్ని గడిపే మొబైల్ స్క్రీన్లు కూడా అద్భుతమైన ఫోర్ కే దృశ్యాలను చూపెడుతున్నాయి. అలాంటి వారికి సెవెంటీ ఎంఎంపై తీసిన సినిమాలు చూడమంటే ఇబ్బందే. అందుకే పాత సినిమాల రిస్టోరేషన్ చేయడం అవసరం’ అని శేమారూ ఎంటర్టైన్మెంట్ సీఈవో హిరేన్ గాడా అభిప్రాయపడ్డారు.‘ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్లు ప్రస్తుతం 4కేలో లేని సినిమాలను స్వీకరించడానికి ఆసక్తి చూపడం లేదు. పాత సినిమాలను ఫోర్ కేలో రిస్టోర్ చేసిన హక్కుదారులకు, అదే పాత సినిమాను నాన్ ఫోర్కే హక్కుదారులకు వ్యాపారపరంగా చాలా అంతరం ఉంది. పాత సినిమాలను పాత పద్ధతిలో ఉంచుకున్న వారికి ఆదాయ మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయి’ అని అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ సీఈవో సుశీల్ కుమార్ అగర్వాల్ తెలిపారు.‘బోల్తా’బొమ్మలతో రిస్టోరేషన్కు వేగంపాత క్లాసిక్స్ను ఫోర్ కేలో రిస్టోర్ చేసి, రిలీజ్ చేయడం వలన థియేటర్లో ప్రేక్షకుల రాక మళ్ళీ పెరిగింది. అమితాభ్ బచ్చన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 అక్టోబర్లో జరిగింది. ఇందులో అమితాభ్ బచ్చన్ పదకొండు హిట్ సినిమాలను దేశవ్యాప్తంగా ప్రదర్శించారు. ఆ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా రిలీజ్ అయిన హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం కూడా పాత సినిమాల 4కే రిస్టోరేషన్ను వేగవంతం చేసింది. మల్టీప్లెక్స్లకు కొత్త కంటెంట్ కావాలి. వారాల తరబడి, నెలల తరబడి అవి ఒకే సినిమాను ప్రదర్శించవు. అందులోనూ సినిమా సక్సెస్ను బట్టి రిలీజ్ అయిన రెండు వారాలలోపే ఓటీటీలోకి ఆ సినిమాలు వచ్చేస్తుంటే మల్టీప్లెక్స్లకు ఆడియన్స్ ఎందుకు వస్తారు? కాబట్టి ఓటీటీలోకి వచ్చిన సినిమాను మల్టీప్లెక్స్ నుంచి తీసేయాల్సిన పరిస్థితి. అందుకోసమైనా కొత్త కంటెంట్ కావాలి. కంటెంట్ లేమితో ఐపీఎల్ మ్యాచ్లు ప్రదర్శించడానికి కూడా మల్టీప్లెక్స్లు వెనుకాడటం లేదు. సరిగ్గా ఈ సందర్భాన్ని ఫోర్ కే రిస్టోరేషన్ సినిమాలు సమర్థంగా వాడుకుంటున్నాయి. సౌత్లో కూడా ఫోర్ కే రిలీజ్ ట్రెండ్గా మారింది. దానికంటూ కొత్తతరంలో సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా తయారైంది.కొంతమంది నిర్మాతలు దర్శకులు నటులు తమ తొలినాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఈ ఫోర్ కే రిస్టోరేషన్ను గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ‘శివ’ సినిమా 4కే విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నాగార్జున ‘శివ సినిమాను నాన్నగారు చూశారు. ఆరోజు మేమిద్దరం కారులో వెళుతున్నాం. నాన్నగారే డ్రైవింగ్ చేస్తున్నారు. పంజాగుట్ట శ్మశాన వాటిక దగ్గరకు వచ్చేసరికి ఆయన నా చేతి మీద చేయి వేస్తూ చాలా బాగా నటించావు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ ఎక్కడికెళ్ళి ఆగుతుందో అంచనా వేయడం చాలా కష్టం’ అని తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. ఈ ట్రెండ్ కొనసాగేనా..?ఆ పాత మధురాలను ఫోర్ కేలో రిస్టోర్ చేసి రిలీజ్ చేస్తే ప్రస్తుతానికైతే ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణను పరిగణనలోకి తీసుకొని చాలా సినిమాలను ఫోర్ కేలోకి మారుస్తున్నారు. అయితే ఈ ఆదరణ తాత్కాలికమేనా, లేదా దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉందా అంటే ‘అది ప్రేక్షక దేవుళ్లే చెప్పాలి’ అని సినిమా ప్రముఖులు సమాధానం చెబుతున్నారు. కొత్తగా సినిమా తీసి రిస్క్ చేయడం కంటే ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాను 4కేలో రిలీజ్ చేయడం ఖర్చుతో పాటు రిస్క్ను కూడా తగ్గిస్తుంది. పాత సినిమాలను 4కేలో రిస్టోర్ చేయడానికయ్యే ఖర్చు దాని నెగటివ్ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. నెగటివ్ నాణ్యతను బట్టి రూ. 20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చవుతుంది. అదే కొత్త సినిమా తీయాలంటే కనీసం ఐదు కోట్లయినా కావాలి. దాన్ని కూడా లో బడ్జెట్ చిత్రంగానే పరిగణిస్తారు. ఆ సినిమాలకు ఓపెనింగ్స్ ఉండవు. హిట్ టాక్ వస్తే ఆడియ¯Œ ్స వస్తారు. లేదంటే పోస్టర్ మైదా ఖర్చులు కూడా రావు. అదే పెద్ద సినిమాలైతే వందల కోట్లు కావాలి. ఎన్ని కోట్లు పెట్టినా సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ కూడా ఉండదు. అదే పాత సినిమాల విషయంలో ఆ భయం అవసరం లేదు. ఖర్చు తక్కువ, ఆదరణ ఎక్కువ. అలాగని పాత సినిమాలన్నీ సక్సెస్ అవుతాయని నమ్మకం లేదు.‘మేము గురుదత్ సినిమాలను 4కేలోకి రిస్టోర్ చేశాం. వాటిలో కొన్ని మాత్రమే లాభసాటి బిజినెస్ చేశాయి. ఉదాహరణకు బాజ్ (1953) సినిమాకు ప్రేక్షకులు లేరు. కాని, ప్యాసా (1953) మాత్రం బాగా వర్కౌట్ అయింది’ అని అగర్వాల్ చెప్పారు.ఇప్పుడు పాత సినిమా హక్కుదారులు జాగరూకులయ్యారు. 10–15 రీస్టోర్ చేసిన సినిమాలు దీర్ఘకాలికంగా తమకి ఎంత లాభాలు తీసుకువస్తాయో అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రదర్శన, సినిమా పాపులారిటీని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 4కే చేసిన పాత సినిమాల రిస్టోరేషన్ తర్వాత మూడు నుండి ఐదు సంవత్సరాల్లో మొత్తం ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అధికంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, రిస్టోరేషన్ ఒకసారి చేస్తే సరిపోతుంది. ప్రేక్షకుడిని చేరుకునే పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. టెక్నాలజీకి అనుగుణంగా మారి థియేటర్లో ప్రేక్షకుడికి పాత సినిమా సరికొత్త అనుభూతినిస్తుంది. ఫిల్మ్ రిస్టోరేషన్ రంగంలో పనిచేసే కంపెనీలు చెప్పిన దానిని బట్టి ‘ఈ ఫోర్ కే సినిమాల ఆదాయం స్మార్ట్ టీవీలు, యూట్యూబ్పై వచ్చే యాడ్స్ ఆదాయం పాత సినిమాల ఆదాయం కంటే అధికంగా ఉంటుంది. ఒక సినిమాని ఫోర్ కేలో చూడాలా లేదా పాత ఫార్మాట్లో చూడాలా అనే సంశయం ప్రేక్షకుడికి అస్సలు లేదు. ఫోర్ కే ఓకే అంటాడు. మారిన ప్రేక్షకుడి అభిరుచి కూడా ప్రకటనల ద్వారా మంచి ఆదాయం రావడానికి కారణమైంది. ప్రస్తుతం సగటున అగ్రిగేటర్ల లైబ్రరీలో కనీసం 10 శాతం సినిమాలు 4కేలోకి రిస్టోర్ అయ్యాయి. మిగతా 80–90% సినిమాలు కనీసం హెచ్డీ ఫార్మాట్ వరకు అప్డేట్ అయ్యాయి. లభ్యమయ్యే ఆదాయ మార్గాల దృష్ట్యా రాబోయే సంవత్సరాలలో 4కే రిస్టోరేషన్ మరింత పెరుగుతుందని పరిశ్రమ నిపుణుల అంచనా. మరోవైపు, అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేయలేకపోవడం, కంప్యూటర్ గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడం వలన సినిమాలు ముందుగా ప్రకటించిన తేదీలకు విడుదల కాకపోవడం, మరో తేదీకి వాయిదా పడడం కూడా ఈ రీ రిలీజ్ సినిమాలకు కలిసి వచ్చే అంశం అయింది. వాళ్ల తేదీలను వీళ్లు ఉపయోగించుకుంటున్నారు.‘క్లాసిక్ సినిమాలకు 20 ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు ఉంటారు. ఒక క్లాసిక్ సినిమాకు ప్రజాదరణ ఉన్నప్పుడు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మార్గాల ద్వారా తక్కువలో తక్కువ 300 నుంచి 400 శాతం లాభం తీసుకు రాగలదు’ అని ‘క్వాలిటీ మేటర్’ వ్యవస్థాపకుడు కౌశిక్ భట్టాచార్య చెప్పారు.అలా 4కే పుట్టింది! 4కేఅంటే సాధారణంగా ‘ఓకే, మంచి క్వాలిటీ’ మాత్రమే కాదు. ఆ స్క్రీన్ లోపల జరుగుతున్న మ్యాజిక్ తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు! 3840 ఎక్స్ 2160 పిక్సెల్స్ అంటే సామాన్యంగా అంటే 8.3 మిలియన్ చుక్కలు! ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ముఖం, రంగు, నీడ అన్నీ ఆ 83 లక్షల పిక్సెల్స్ కలిసి వేసే ఒక అందమైన చిత్రం. అందుకే దీన్నే అల్ట్రా హెచ్డీ అంటారు. ఒకసారి పోల్చితే 720 పిక్సెల్స్ హెచ్డీ నుంచి 1080 పిక్సెల్స్ అల్ట్రా హెచ్డీ నుంచి దానికి రెట్టింపు 2160 పిక్సెల్స్. ఇప్పుడిది సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 1980 నుంచి 1997 వరకు పాత సినిమాలు పాత ఫొటోల్లో ఉండే చిరునవ్వులా స్పష్టత లేని చిత్రాల్లా జీవించాయి. రీల్స్ మీద కాలం వేసిన మరకలు, రంగుల్లో మసక, శబ్దంలో జనాల చప్పట్లు అలా– అవి బతికి ఉండేవి కాని, మెరిసేవి కాదు. తర్వాత 2006లో ఒక్కసారిగా హెచ్డీ టెక్నాలజీతో వాటి రంగు మెరిసింది. ఒక్కో పాత రీల్ మేల్కొంటున్నట్టుగా, పాడైపోయిన ఫ్రేమ్స్కు రంగులు పూయడం మొదలయింది. ఇక 2015లో 4కే రాకతో అసలు పండుగ మొదలైంది. పాత సినిమాలకు పునర్జన్మ లభించినట్టుగా– అదే ఏడాదిలో 23 సినిమాలు పుట్టాయి. మరుసటి ఏడాదికి 43 అయ్యాయి. 2022 నాటికి 85. ప్రపంచం మొత్తం పాత ఖజానాలను తిరిగి వెలుగులోకి తెచ్చేందుకు పరుగెడుతోంది.ఈ కథ వెనుక నిశ్శబ్ద సూపర్ హీరో మార్టిన్ స్కోర్సేసీ. ఆయన 1990లో స్థాపించిన ఫిల్మ్ ఫౌండేషన్ సంస్థ. నటులు కథలను జీవిస్తే, ఈయన కథలను కాపాడతాడు. ఆయన ఒక్కరితోనే వందలాది సినిమాలు మళ్లీ శ్వాస పీల్చాయి. ఆ జ్వాల భారతదేశానికీ చేరింది. 2015లో నేషనల్ ఫిల్మ్ yð వలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) పాడైపోయిన రీల్స్ను చేతుల్లోకి తీసుకుని, డిజిటల్ ప్రపంచంలోకి లాగి, 4కే కాంతిలో మళ్లీ నిలబెట్టింది. అప్పటి నుంచే మనం పాత సినిమాలను చూసేటప్పుడు ‘అది పాత సినిమా కాదు, పాత కాలం కొత్తగా పుట్టింది’ అనిపిస్తోంది.సినీ పునరుద్ధరణ ప్రస్థానం∙1980 నుంచి 1997 నెగటివ్ నుంచి ఎస్డీ ఫార్మాట్ ∙2006 నుంచి 2013 హెచ్డీ ఫార్మాట్ ∙2015 2కే ∙2016 4కే ∙2022 8కే ∙1990 ఫిల్మ్ ఫౌండేషన్ అనే సంస్థను హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోర్సేసీ స్థాపించారు.∙2015 నుంచి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఐఎఫ్ఏఐ) ఫిల్మ్ రిస్టోరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
కథాకళి: పేపర్ బాయ్
నేను ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతూ సంపాదనకి రోజూ ఉదయం ఆరులోగా వంద ఇళ్ళల్లో దినపత్రికలని సరఫరా చేయసాగాను. అందుకు రెండు గంటల పైనే పడుతుంది. ఆ అదనపు ఆదాయం నా బస్ పాస్కి సరిపోతుంది. సమయం అంటే డబ్బు అని ఎందుకు అంటారో అలా నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. తక్కువ సమయం తక్కువ డబ్బు, ఎక్కువ సమయం ఎక్కువ డబ్బు. నా బీట్లో అపార్ట్మెంట్స్ తక్కువ. సొంత ఇళ్ళ వాళ్ళు ఎక్కువ. అపార్ట్మెంట్ సబ్స్క్రైబర్స్లోని సౌకర్యం, ఎక్కువ దినపత్రికలని తక్కువ సమయంలో డెలివరీ చేయొచ్చు. ఇండిపెండెంట్ ఇళ్ళల్లో ఇవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.నేను పేపర్లని వేసే ఓ ఇండిపెండెంట్ ఇంటి యజమానిని నెల నెలా కలిస్తే పేపర్ బిల్ని కేష్గా చెల్లిస్తూంటాడు. నా కస్టమర్స్ అందరిలోకి ఆయనే ఎక్కువ వయసు గలవాడు. ఆయన మిగిలినవారి కన్నా ప్రేమగా ఉంటాడు. నెల నెలా డబ్బు కలెక్ట్ చేసుకోడానికి వెళ్ళినప్పుడు నా గురించి అడిగి తెలుసుకునేవాడు. నా చదువు ఎలా సాగుతోందని అడిగేవాడు. ప్రతిసారి వాగ్బకరీ ఇన్ స్టంట్ కార్డమమ్ టీని ఇచ్చి కాని పంపేవాడు కాదు. నాలుగు నెలల క్రితం బిల్ కోసం వెళ్తే ఆయన కోరాడు.‘‘రేపటి నుంచి నువ్వు నాకో సహాయం చేయాలి.’’‘‘అలాగే, చెప్పండి.’’‘‘నువ్వు పేపర్ని కాంపౌండ్ గోడ మీంచి విసిరేసి వెళ్తున్నావు. అలా కాకుండా బెల్ కొట్టి నాకు ఇస్తూండు.’’‘‘అలాగే సర్. కాని నేను ఆ పేపర్ సరిగ్గా మీ తలుపుకి తగిలి దాని ముందు పడేలా చక్కగా విసురుతున్నాను. ఇంతదాకా ఎన్నడూ నేను మిస్ అవ్వలేదు. అయ్యానా సర్?’’ఆయన సన్నగా నవ్వి చెప్పాడు.‘‘లేదు. నీ టాలెంట్ని గుర్తించాను. కాని నువ్వా పని చేయాలి. నేను అడిగేది నీ సమయాన్ని ఎక్కువ తీసుకోవడం అని నాకు తెలుసు. నీ సమయానికి నీకు నెలకి ఐదు వందలు అదనంగా చెల్లిస్తాను. సరేనా?’’‘‘అది చాలా పెద్ద మొత్తం సర్. నూట ఏభై చాలు.’’ఆయన నవ్వి చెప్పాడు.‘‘నీకు. నాకు కాదు. నిజానికి నాకు అది చాలా చిన్న మొత్తం. ఎందుకంటే...’’ఆయన చెప్పింది విన్నాక మర్నాటి నుంచి ఆయన ఇంటి ముందు సైకిల్ దిగి స్టాండ్ వేసి లోపలికి వెళ్ళి డోర్ బెల్ కొట్టి తలుపు తెరచిన ఆయనకి ‘గుడ్ మార్నింగ్’ చెప్పి పేపర్ ఇవ్వసాగాను.ఆయన ప్రతిసారి కృతజ్ఞతగా ‘థాంక్యూ. గాడ్ బ్లెస్ యు’ అంటారు. ‘బై సర్. టేక్ కేర్ సర్’ లాంటి మాటలు చెప్పి నేను సైకిల్ ఎక్కుతాను. నెలకి ఐదు వందల రూపాయలు అదనపు ఆదాయానికి మా ఇంట్లో అందరికన్నా మా అమ్మ ఎక్కువ ఆనందించింది. ఇంట్లో కుట్టు మెషిన్ తో బ్లౌజులు కుట్టడానికి ఒకో దానికి మా అమ్మ సంపాదించే మొత్తం అది. ఓరోజు తలుపు తట్టినా ఆయన తెరవకపోవడంతో పేపర్ని తలుపు ముందు పడేసి వెళ్ళిపోయాను. నా బీట్ ముగిశాక ఆయన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆగి చూస్తే పేపర్ అక్కడే ఉంది. ఆయన కోరిక ప్రకారం నేను మధ్యాహ్నం పన్నెండున్నరకి మళ్ళీ వెళ్ళి చూస్తే ఆయన ఇంటి తలుపు ముందు దినపత్రిక నేను వేసిన చోటే కనిపించింది. ఆ తర్వాత ఆయన కోరింది చేశాను.పోలీసుల దగ్గరకి వెళ్ళి ఆయన ఇంటి డూప్లికేట్ తాళం చెవి ఎవరి దగ్గర ఉంటుందో చెప్పాను. ఆ వృద్ధుడు నాకు ఇచ్చిన తన మాజీ కొలీగ్ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్ గల కాగితాన్ని నేను ఎస్సైకి ఇచ్చాను. నేను చెప్పింది విని ఎస్సై ఓ కాన్ స్టబుల్ని ఆ పని చూడమన్నాడు. ఇద్దరం అక్కడికి చేరుకున్నాము.లోపల టీవీ ఆన్ లో ఉంది. దాని ముందు సోఫాలో కూర్చున్న ఆయన ఒరిగిపోయిన తీరు చూడగానే పోయాడని మాకు అర్థమైంది. ఆయన చేతిలోని రిమోట్ తీసే ప్రయత్నం చేసినా, రాకపోవడంతో కాన్ స్టబుల్ చెప్పాడు.‘‘రిగర్మార్టిస్. పోయి చాలా గంటలైంది.’’ఆయన మరణించాడని తెలిసి నేను బాధపడ్డాను. ఓ కస్టమర్ని కోల్పోయాననో, నెలకి ఐదు వందలు పోయాయనో కాదు. ఆయన పరిస్థితి గురించి తెలిశాక. ఆయన కొడుకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆ విచారకర వార్త చెప్పాను. అతను వచ్చేలోగా ఆయన మృతదేహాన్ని హాస్పిటల్లో భద్రపరిచే ఏర్పాటు ఆయన కొలీగ్ చేశాడు. ఆయన పోయిన పదమూడో రోజు నాకు ఆయన కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే తనని కలవమని చెప్తే వెళ్ళాను. ఓ కవర్ ఇచ్చాడు. దానిమీద నా పేరుంది. దాన్ని చింపి చదివాను.డియర్ పేపర్ బాయ్, థాంక్స్. నువ్వు డోర్ బెల్ నొక్కినప్పుడు నేను తలుపు తెరవక పోవడానికి కారణం తెలిశాక ఇది నీకు అందుతుంది. నా భార్య ఆరు నెలల క్రితం పోయింది. మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. నాకు వీసా దొరక్క ఇండియాలో ఉండాల్సి వచ్చింది. నా సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. నా శవం కుళ్ళిన వాసన వచ్చాక కాక, నేను పైకి వెళ్ళానన్న వార్త మా అబ్బాయికి వెంటనే తెలియచేయడానికి నీతో ఆ ఏర్పాటు చేసుకున్నాను. నన్ను ముఖాముఖి కలిసేవారు, నాతో మాట్లాడేవారు ఎవరూ లేరు. డోర్ బెల్ మోగి తలుపు తెరవగానే నువ్వు చెప్పే గుడ్ మార్నింగ్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. బాగా చదువుకో బై! గాడ్ బ్లెస్ యు.ఉత్తరానికి పెట్టిన జెమ్ క్లిప్కి నా పేర ఏభై వేల రూపాయలకి తారీఖు వేయని చెక్కు కూడా ఉంది. -
అమెరికా లెక్క
నారప్పకు దిక్కుతోచడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉన్నట్లు ఉంటున్నాడు.పని చేసేటప్పుడు, తినేటప్పుడు, పదిమందిలో కూర్చొని ఉన్నప్పుడు.. ఒక్కటేమిటి? నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడు చూసినా పరధ్యానంలోనే ఉంటున్నాడు. నారప్ప ఇలా ఉండబట్టి చాలా రోజులవుతోంది. అలాగని అలవిగాని కష్టాలేమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి కొదవలేని బతుకు. పిల్లల్ని బాగా చదివించాడు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. మనవలు, మనవరాళ్లను చూశాడు. ఆస్తి దండిగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే పెదరాయుడులా దర్జాగా కాలుమీద కాలేసుకొని బతకొచ్చు. అయినా, నారప్పలో ఏదో దిగులు మొదలైంది. చిన్నాపెద్దా లేకుండా ఊళ్లోవాళ్లంతా నారప్పను ‘నక్కజిత్తుల నారప్ప’అంటుంటారు. పైసా లాభం లేకుంటే ఏ పనీ చేయడనీ, పది పైసలు మిగులుతుందంటే ఏదైనా సరే చేస్తాడని ఆ పేరు పెట్టారు. ఇది నారప్పకూ తెలుసు. అయినా, తెలియనట్లే ఉంటాడు. ఎవరైనా మొఖమ్మీదే అన్నా పట్టించుకోడు. నవ్వుతూ తప్పించుకుంటాడు. నారప్ప ఇలా ఉండడం వెనక చాలా పెద్ద కథే ఉంది. నట్టనడి ఊళ్లో ముప్పై రెండు దూలాలు మోసే రాతిమిద్దెలో పుట్టాడు నారప్ప. ముందు అన్న బసప్ప, వెనక చెల్లెలు భీమక్క. అమ్మ వన్నూరమ్మ, నాన్న పుల్లప్ప. నారప్ప పుట్టేనాటికే వాళ్లకు వందెకరాల వరకు పొలం, వెయ్యికి పైగా జీవాలు ఉండేవి. ఆస్తి దండిగ ఉండడంతోపాటు పుల్లప్ప సర్పంచ్ కావడంతో ఆ ఇల్లు వచ్చేపోయే వాళ్లతో కళకళలాడేది. ఆ ఇంటికి ఎప్పుడు పోయినా తిండికి కొదవుండదని పేరు తెచ్చింది.కాలం చాలా కఠినమైనది. జీవితాలను తిప్పేస్తుంది. నారప్ప జీవితమూ అలాగే తిరిగింది. రెండోసారి సర్పంచ్ అయ్యాక పుల్లప్ప దారి తప్పాడు. పేకాటకు, బయటి సంబంధాలకు మరిగాడు. ఆస్తులు తరగడం, అప్పులు పెరగడం మొదలైంది. బసప్ప, నారప్ప చదువు ఊళ్లో బడితోనే ముగిసింది. ఇంటి వద్దకు జనాలు రావడం తగ్గింది. భర్త తిరుగుళ్లు చూసి వన్నూరమ్మ– ఆస్తి కరిగిపోక ముందే కూతురికి పెళ్లి చేయాలని పట్టబట్టింది. చివరికి ఊళ్లోనే ఉండే తన అన్న కదిరప్ప కొడుకు సోమప్పకు ఇచ్చి పెళ్లి జరిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే కాలంచేసింది.ఆలోగా పొలం ఇరవై ఎకరాలకు చేరుకుంది. గొర్లు, గొడ్లు ఊరు దాటాయి. పుల్లప్ప పదవీకాలం కూడా పూర్తయింది. మూడోసారీ సీట్లో కూర్చుందామని ఆశపడినా ఊళ్లోవాళ్లు ఒప్పుకోలేదు. ఆ కోపంతోనో బాధతోనో ఇల్లు విడిచి బయటికి రావడమే మానేశాడు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేశాక ఊరు విడిచి, కడప జ్యోతిక్షేత్రంలో కాశినాయన ఆశ్రమం జేరి అక్కడే కాలం చేశాడు.పుల్లప్ప పోయిన తర్వాత సర్పంచ్ సీట్లో కదిరప్ప కూర్చున్నాడు. దాని కోసమే తన కొడుక్కి చెల్లెలు కూతుర్ని చేసుకున్నాడనే సంగతి తండ్రీకొడుకులు చాటుగా మాట్లాడుకుంటుండగా విన్న నారప్పకు మాత్రమే తెలుసు. నాన్న, తమ కుటుంబం అనుభవించిన దర్జా, వైభోగం కాలంతోపాటు దూరమైనా నారప్ప మనసులోంచి మాత్రం పోలేదు. అయితే, పరిస్థితులకు తొందరగానే అలవాటు పడ్డాడు. లౌక్యం నేర్చుకున్నాడు. తినీతినక కూడబెట్టడం, వడ్డీలకివ్వడం మొదలుపెట్టాడు. ఆ అతితెలివితేటలు, లౌక్యం చూసే ‘నక్కజిత్తుల నారప్ప’ అని పేరు పెట్టారు.నారప్ప భార్య ఎర్రమ్మ అమాయకురాలు. భర్త మాట దాటదు. కొడుకు రవి బాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకొని, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి స్థిరపడ్డాడు. తన మాట వినకుండా తెల్లోళ్ల పిల్లను చేసుకున్నాడని కొడుకు మీద కోపమొచ్చినా, కావల్సినంత డబ్బు పంపుతుండడంతో ఏమీ అనలేకపోయాడు నారప్ప. కొడుకు పంపే డబ్బుతో కూతురిని తహసీల్దారుకిచ్చి పెళ్లి చేశాడు. ఊళ్లో డూప్లెక్స్ హౌస్ కట్టించాడు. కూడేరులో జాగాలు, అనంతపురం, హైదరాబాద్, బెంగళూరులో ఇళ్లు కొన్నాడు. నారప్ప బ్యాంకు అకౌంట్లన్నీ లక్షలతో నిండిపోయాయి. అదిగో అప్పటి నుంచే నారప్పకు మనసులో ఏదో దిగులు మొదలైంది. అదేంటో, దాన్ని ఎలా తీర్సుకోవాలో నారప్పకు తెలిసేలా చేసినవి ఆ రెండు సంఘటనలే!ఆ రోజు ఆదివారం. పొద్దున్నే బైక్ మీద తోటకు వెళ్లి, నిమ్మ చెట్లకు డ్రిప్పుతో నీళ్లు విడిచి ఇంటికి బయల్దేరాడు నారప్ప. ఊరికి ఆనుకొని వచ్చేసరికి ఎల్లప్ప గొర్రెల మంద ఎదురైంది. అసలే అది ఇరుకు దారి. పైగా ముందురోజు పడిన వానకు బురద ఉండడంతో బైక్ అదుపు తప్పింది. సర్రున జారి ఒక గొర్రెను బలంగా ఢీకొట్టింది. అది గట్టిగా అరుస్తూ వెనక్కిపడింది. బైక్ కూడా కింద పడుతుంటే ఒడుపుగా అదుపు చేశాడు. మంద వెనకాలే వస్తున్న ఎర్రిసామి అది చూసి ‘‘సచ్చెరా గొర్రె..’’ అని అరుస్తూ గబగబా గొర్రె దగ్గరకు వచ్చాడు. అదృష్టం కొద్ది గొర్రె బతికే ఉంది. అయితే, పొట్ట, బర్రెంకల మీద టైరు రాసుకొని పోవడంతో రక్తం కారుతోంది. అదాటున కింద పడడంతో తిరిగి పైకి లేవలేకపోతోంది. ఎర్రిస్వామికి కళ్ల నుంచి నీళ్లు జలజలా రాలాయి. వెనక్కి తిరిగి నారప్పను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు చెవినబడి పరుగెత్తుకుంటూ వచ్చాడు ఎల్లప్ప. గొర్రెను పట్టుకొని పైకి లేపడానికి ప్రయత్నిస్తూనే కొడుకుతోపాటు తిట్లు అందుకున్నాడు. ఇద్దరూ కలసి నారప్పను నోరు తెరవనీయలేదు. ఈ గోలకు బెదిరి మిగిలిన గొర్రెలన్నీ దూరంగా నిలబడి వీళ్లనే చూస్తున్నాయి. జనం గుమిగూడారు. అందరూ కలసి ఎర్రిసామికి, ఎల్లప్పకు సర్దిచెప్పారు. ఈలోగా కిందపడిన గొర్రె లేచి నడవడంతో తిట్లు ముగించి వెనక్కి కదిలారు అబ్బాకొడుకులు. ఇంటికొచ్చి మంచంమీద కూలబడ్డాడు నారప్ప. చెవుల్లో తిట్లు మోగుతున్నాయి. చుట్టూ చేరినవాళ్లు నవ్వుకోవడం కళ్లలో మెదులుతోంది. కోపం, అవమానం కలసి ఏంచేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు. మధ్యాహ్నం అన్నానికీ లేవలేదు. విషయం తెలిసి చీకటి పడుతుండగా వచ్చాడు చెన్నప్ప.‘‘న్నో.. అప్పుడప్పుడూ ఇట్టాంటివి జరుగుతాంటాయి.. మామూలే! అయన్నీ పట్టిచ్చుకుంటామా? ఎల్లప్ప నీకు మేనమామ వరస. ఎర్రిస్వామి మేనల్లుడు. మనోళ్లు ఏదో పొరపాటున మాట జారినారని అనుకోన్నా. లే.. అట్లా కూడేరు దాకా పోయొజ్జాం’’ అంటూ నారప్పను ఓదార్చాడు. ఇద్దరూ బైక్ మీద కూడేరుకు చేరుకునే సరికి ఏడయ్యింది. వైన్షాప్లో మందు, పక్కనే బజ్జీలు, ఉడకబెట్టిన చెనిక్కాయ విత్తనాలు తీసుకొని ఊరి చివర తోటలో కూర్చున్నారిద్దరూ. అప్పటిదాకా మౌనంగా ఉన్న నారప్ప... గొంతులోకి మందుపోగానే నోరు తెరిచాడు. ‘‘ఊరంతా సూచ్చాండంగా వోళ్లుతిట్నారు సెన్నప్పా. రేపట్నుంచి ఊళ్లో తలెత్తుకుని ఎట్ట తిరగల్ల? మానం, పానం రెండూ పోయినట్లు ఉండ్లా్య..’’ అంటూ కాసేపాగి ‘‘వోళ్లను ఏదో ఒకటి జేయాల.. ల్యాకపోతే అవమానంతో సచ్చేలా ఉండా..’’ అంటూ కళ్లనిండా నీళ్లు నింపుకున్నాడు. చెన్నప్పకు ఆ రోజెందుకో కొత్తగా కనిపించాడు నారప్ప. ‘ఎవరెన్ని అన్యా తుడ్సుకొని పోయే నారప్పన్న ఈ పొద్దెందుకు ఇట్టా అంటన్నాడు’ అని మనసులో అనుకుంటున్నాడు.‘‘సెప్పు సెన్నప్పా.. వోళ్లను ఏమిజెయ్యాల?’’ చెన్నప్పను కుదుపుతూ మళ్లీ అడిగాడు నారప్ప. ‘‘ఏంజేయాల్సిన పన్లేదులేన్నా.. రెండ్రోజులుంటే అంతా మర్సిపోతారు’’ చెప్పాడు చెన్నప్ప. వినలేదు నారప్ప. అవమానం అతన్ని వెనక్కి తగ్గనీయడం లేదు.‘‘కూడేరు స్టేషన్లో నా బామ్మర్ది ఉండాడు. వానికి సెప్పి ఎస్ఐతో మాట్లాడిజ్జాం. అంతో ఇంతో లెక్క కొడితే వాళ్లే స్టేషన్కు తీస్కపోయి అబ్బాకొడుకులకు మర్యాద జేస్తారు’’అన్నాడు చెన్నప్ప. ఒప్పుకున్నాడు నారప్ప. నేరుగా ఇద్దరూ స్టేషన్కు వెళ్లారు. చెన్నప్ప.. బామ్మర్దికి విషయం చెప్పడంతో లోపలికి వెళ్లి ఎస్ఐతో మాట్లాడాడు. బయటికొచ్చి చెన్నప్ప చెవిలో ఏదో గొణిగినాడు. వెంటనే నారప్ప దగ్గరికి వచ్చిన చెన్నప్ప ‘‘న్నో.. ఎస్ఐ ఇరవై వేలు అడుగుతనాడంటన్నా..’’ అన్నాడు.ఏమీ ఆలోచించలేదు నారప్ప. జేబులోంచి డబ్బు బయటికి తీశాడు. ‘‘లెక్క ఐదు వేలు ఎక్కువనే ఇచ్చనాగాని.. రెండ్రోజులు దాంకా ఇడ్సకండా తన్నమను’’ అన్నాడు పళ్లు కొరుకుతూ.చెన్నప్పకు అది కలో నిజమో తెలియడం లేదు. ఎప్పుడైనా అవసరానికి డబ్బడిగితే ఇవ్వడానికి ఎన్నో సాకులు చెప్పే నారప్పన్న ఇప్పుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం చూసి నోట మాట రాలేదు.మరునాడు తెల్లారే సరికి ఊరంతా ఒకటే గుసగుసలు. ఎల్లప్పను, ఎర్రిసామిని అర్ధరాత్రి పోలీసులు తీసుకుపోయారని, నారప్ప కేసు పెట్టించాడని మాట్లాడుకుంటున్నారు. అది తెలియడంతో నారప్ప మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది. ఎప్పుడు లేనిది ఆ రోజు హీరోహోండా పక్కన పెట్టి, రాయల్ ఎన్ఫీల్డ్ మీద తోట వద్దకు బయల్దేరాడు. కూలిపనికి పిలిచే సాకుతో ఊరంతా తిరిగాడు. ఖద్దరు చొక్కా, రామరాజు పంచె కట్టి దర్జాగా తిరుగుతున్న నారప్పను చూసి ఆరోజు ఊరు నోరెళ్లబెట్టింది. ఎల్లప్పను, ఎర్రిసామిని రెండ్రోజుల దాకా వదల్లేదు పోలీసులు. వాళ్లు కొట్టిన దెబ్బలతో నెలపాటు ఇంటి నుంచి బయటికి రాలేదు వాళ్లు. ఇది జరిగాక ఊళ్లో నారప్ప పరపతి అమాంతం పెరిగింది. ‘నక్కజిత్తుల నారప్ప’ అని కాకుండా వరుసలు పెట్టి పిలవడం, గౌరవంగా మాట్లాడడం మొదలైంది. అప్పుకో సప్పుకో జనం ఇంటికి రావడం మొదలు పెట్టారు. అది చూశాక తనలోని దిగులేందో మెల్లగా అర్థమవసాగింది నారప్పకు. అంతేకాదు, తన బలమేదో తెలిసొచ్చింది.అయితే, నారప్ప పూర్తిగా ఒళ్లు విరుచుకొని తిరిగేలా చేసింది మాత్రం తిమ్మప్పతో గొడవే!తండ్రి చేసిన అప్పుల కారణంగా తాము అమ్ముకున్న భూములన్నీ తిరిగి కొనుక్కున్నాడు నారప్ప.. ఒక్క తిమ్మప్ప పొలం తప్ప. అది కూడా తీసుకోవాలని ఒకరిద్దరితో అడిగించినా.. అమ్మడానికి తిమ్మప్ప ఒప్పుకోలేదు. దాంతో ఆ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పంతం పట్టాడు.పక్కూరికి వెళ్లే రోడ్డు పక్కనే నారప్ప, పెద్దన్న పొలాలు పక్క పక్కనే ఉంటాయి. పెద్దన్న పొలానికి పైభాగంలో తిమ్మప్ప పొలం ఉంది. అందులోకి వెళ్లాలంటే పెద్దన్న పొలం మీదుగా వెళ్లాలి. ఏళ్ల తరబడి ఉండే దారది. అది కాకుండా తిమ్మప్ప పొలానికి వెళ్లాలంటే చుట్టూ నాలుగు కిలోమీటర్లు కొండ వారగా వెళ్లాలి. రాళ్లూరప్పలు కంపచెట్లతో ఉండే ఆ దారి ప్రమాదకరం.ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు నారప్ప. పెద్దన్న పొలాన్ని కొనేశాడు. అందులో నుంచి తిమ్మప్ప పొలానికి వెళ్లే దారిని మూసేశాడు.తాను పొలం అమ్మలేదనే కోపంతోనే నారప్ప ఇదంతా చేస్తున్నాడని తిమ్మప్పకు అర్థమైంది. గొడవెందుకని బతిమాలాడు. కాని, నారప్ప చెవికెక్కించుకోలేదు. దాంతో తన మనుషులతో గొడవకు దిగాడు. దీనికి నారప్ప ముందే సిద్ధమై ఉన్నాడు. తన దగ్గర డబ్బు చేరాక చుట్టూ చేరిన దాయాదుల్ని, మనుషుల్ని వెంట బెట్టుకొని అడ్డుకున్నాడు. విషయం తెలిసి పోలీసులు వచ్చారు. నారప్పదే తప్పని అందరికీ తెలుసు. కాని, ఎవరూ నోరు తెరవడం లేదు. ఎందుకంటే నారప్ప దగ్గర కట్టలు కట్టలు మూలిగే డబ్బు.. దానితో అవసరం. అందుకే ఏమీ పట్టనట్టు ఉండిపోయారు. తిమ్మప్పను పోలీసులు స్టేషన్కు తీసుకుపోయారు.తిమ్మప్ప కూడా అంతో ఇంతో డబ్బున్నోడే. పైగా వెనక్కి తగ్గే రకం కాదు. కాని, రూపాయి కంటే డాలరుకు బలమెక్కువని ఆయప్పకే కాదు ఊరంతటికీ అర్థమవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.ఒకటికి రెండుసార్లు తనదే పైచేయి అయ్యే సరికి నారప్పకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. మందిని వెనకేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు తనను వెక్కిరించిన వాళ్లను, ఎగతాళి చేసినవాళ్ల మీద అవకాశం దొరికినప్పుడల్లా పగ తీర్చుకునేవాడు. ప్రతి తగాదాలో తలదూర్చేవాడు. సర్దిచెప్పే సాకుతో అవసరమైనవి లాక్కునేవాడు. మెల్లగా జనానికి నారప్ప సంగతి అర్థమైంది. ఎదిరించి ఇబ్బంది పడేకంటే, గొడవ పడకుండా బతకడమే మేలని నిర్ణయించుకున్నారు. కాని, విషయాలన్నీ నారప్ప కొడుక్కి, కూతురికి చెప్పడం మొదలుపెట్టారు.పిల్లల హితబోధను పట్టించుకోలేదు నారప్ప. భర్తకు చెప్పే ధైర్యం లేని ఎర్రమ్మ.. జరిగేవన్నీ మౌనంగా చూస్తోంది. ‘మీ నాయిన మాదిరే నువ్వూ తయారయితనావని, ఊరంతా శత్రువుల్ని చేసుకుంటనావ’ని చెప్పాలనుకున్న మాటలు ఆమె నోరు దాటి రాలేదు. అంతేకాదు, భర్త అంతిమ లక్ష్యం, దాని కోసం చేస్తున్న ప్రయత్నాలు తెలిసి భయంతో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతోంది. భార్యాపిల్లల ఆందోళనలు, ఆవేదనలు ఏవీ నారప్ప చెవికి, మనసుకు ఎక్కడం లేదు. అతని దృష్టంతా మిగిలిన ఆ ఒక్క కోరిక మీదనే ఉంది. అదీ తీరేదే.. ఆ మహమ్మారి రాకుంటే. ∙∙ ప్రపంచాన్ని భయం గుప్పిట్లో బందీ చేస్తూ కరోనా పుట్టుకొచ్చింది. దేశమంతా లాక్డౌన్ తెచ్చింది. జనం ఇళ్ల నుంచి కదలడం లేదు.ఎవరి వల్ల వచ్చిందో.. ఎలా వచ్చిందో.. నారప్ప కరోనా బారిన పడ్డాడు. లక్షణాలు వారంలోనే తగ్గాయి. అయినా మూడు వారాలు ఇల్లు దాటొద్దని వైద్య సిబ్బంది చెప్పడంతో ఇంటికే పరిమితమయ్యాడు. టీవీ చూడడం, ఫోన్లో మాట్లాడడం ఇదే పని. రెండు వారాలు భారంగా గడిచాయి. ఆ తర్వాత ఉండలేకపోయాడు. భార్యకు తెలియకుండా తోటకు బయల్దేరాడు.సాయంత్రం ఆరు సమయంలో ఊరంతా తెలిసిందా వార్త.. తోట దగ్గరి బావిలో పడి నారప్ప చనిపోయాడని. భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడం, కాల్ చేసినా కలవకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన ఎర్రమ్మకు.. ఊరు దాటాక కొద్ది దూరంలో ఉన్నబావి పక్కన బైక్, బావిలో తేలుతున్న నారప్ప శవం కనిపించింది. ఊళ్లో జనానికి విషయం తెలిసినా ఒక్కరూ రాలేదు. అది కరోనా భయం వల్లో, బతికున్నప్పుడు నారప్ప చేసిన పనుల వల్లో తెలియడం లేదు. చివరకు పోలీసులొచ్చి శవం బయటికి తీశారు.నారప్ప అల్లుడు తాసీల్దారు కావడంతో ఎలాగోలా కర్నూలు నుంచి భార్యను వెంటబెట్టుకుని వచ్చేశాడు. కాని, కొడుకు వచ్చేదానికి ఎలాంటి అవకాశమూ లేదు.పంచనామా పూర్తిచేసి మరుసటి రోజు శవాన్ని అప్పగించారు పోలీసులు. బావిలోంచి తీసేటప్పుడు నారప్ప శరీరం మీద కనిపించిన కముకు దెబ్బల గురించి పోలీసులు ఏమీ చెప్పలేదు. ఎర్రమ్మ కూడా ఏమీ అడగలేదు. అడగబోయిన కూతురు, అల్లుడినీ కూడా ఆపింది.∙∙ బ్యాండు మేళం, డప్పు లేకుండానే నారప్ప అంతిమయాత్ర మొదలైంది. ఎర్రమ్మ ఏడుపు ఊళ్లో జనానికి స్పష్టంగా వినిపిస్తోంది. అంతిమయాత్రలో నడుస్తున్న అల్లుడు, కూతురుతోపాటు కొద్దిమంది బంధువుల్లోనూ ఒకటే ఆలోచన... అసలు నారప్పను కొట్టి చంపి, బావిలో వేసిందెవరు? జైలులో పెట్టించి, కొట్టించినందుకు ఎల్లప్ప, అతని కొడుకు చేసిన పనా? తన పొలానికి దారి లేకుండా చేసినందుకు తిమ్మప్ప కుటుంబం చేసిన పనా? స్నేహితుడని నమ్మితే, వావీవరస చూడకుండా తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించినందుకు చెన్నప్ప చేసిన పనా? ఊళ్లో తాను చేసే తప్పుడు పనులు గురించి కొడుక్కు చెప్పాడనే అక్కసుతో ఓబుళప్ప పొలాన్ని ఆక్రమించుకున్నందుకా? ....వాళ్ల ప్రశ్నలన్నింటికీ అక్కడ సమాధానం తెలిసింది ఇద్దరికే.దారిలో.. సోమప్ప ఇంటి బయట.. కరోనా వచ్చినప్పటి నుంచి బయటికి తీయని టాటా సుమో టైర్లకు అంటిన బురద తాజాగా కనిపిస్తోంది.నారెప్ప పాడె మీద చల్లుతున్న చిల్లరలోని నాణేలు కిందపడి తళతళ మెరుస్తున్నాయి.అవి డాలర్లు... అమెరికా లెక్క. -
అద్దంతో అల్లుకుంటూ!
‘దర్యాప్తు అధికారికి సునిశిత దృష్టి, ప్రతి విషయాన్నీ అధ్యయనం చేసి, బేరీజు వేసే తత్త్వం ఉన్నట్లయితే; నేరస్థలిలోని లభించే, కనిపించే ప్రతి అంశమూ ఒక ఆధారం అవుతుంది’– ఇది ప్రపంచ వ్యాప్తంగా దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు నమ్మే అంశం. సాధారణంగా సంచలనాత్మక ఉదంతాల్లో మాత్రమే పోలీసులు దీన్ని కచ్చితంగా పాటిస్తుంటారు. అయితే, హైదరాబాద్లోని బొల్లారం పోలీసులు మాత్రం సాధారణ నేరంగా పరిగణించే గుర్తుతెలియని వాహనాల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదం (హిట్ అండ్ రన్) కేసునూ సంచలనాత్మక నేరం స్థాయిలో దర్యాప్తు చేశారు. ఘటనాస్థలిలో దొరికిన ఓ అద్దం (కుడివైపు సైడ్ మిర్రర్) ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అది 2013లో తొలిరోజైన జనవరి 1, సమయం ఉదయం 6.15 గంటలు. చలితో పాటు పొగమంచూ దట్టంగా ఉంది. బొల్లారం ప్రధాన రహదారిలోని సెయింట్ ఆన్స్ హోమ్లో ఉన్నవాళ్లు అప్పుడే నిద్రలేస్తున్నారు. అదే సమయంలో ప్రహరీగోడ పైనుంచి హోమ్ ఆవరణలోకి ఓ ఆకారం పడటం గమనించారు. పరుగున వెళ్లి చూసి మహిళ (65)గా గుర్తించారు. ప్రహరీకి ఆవలి వైపున్న రోడ్డు మీద ఓ యువతి (30) తీవ్రగాయాలతో పడినట్లు కలకలం మొదలైంది. అదే సమయంలో వాకింగ్ చేస్తున్న కొందరు ప్రత్యక్ష సాక్షులు గమనించిన దాని ప్రకారం 6037 నెంబర్ కలిగిన తెల్లరంగు స్విఫ్ట్ కారు శామీర్పేట వైపు నుంచి వేగంగా వస్తూ వీరిని ఢీ కొట్టింది. ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు. వృద్ధమహిళ అప్పటికే మరణించిందని, యువతికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు నిర్ధారించారు. ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న బొల్లారం పోలీసుస్టేషన్లో సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న షేక్ సాదిక్ ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాధితులు నివసించేది స్నేహ ఎన్క్లేవ్లో అని, మృతి చెందిన వృద్ధురాలు ఆశాదేవిగా, క్షతగాత్రురాలు ఆమె కుమార్తె శ్వేత సింగ్గా గుర్తించారు. సంఘటన జరిగిన ప్రధాన రహదారికి క్షుణ్ణంగా పరిశీలించిన సాదిక్ దృష్టి అక్కడ పడున్న ఓ కారు సైడ్ మిర్రర్పై పడింది. అది ప్రమాదానికి కారణమైన కారుదే అయి ఉంటుందనే ఉద్దేశంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి అదే కీలకాధారం అవుతుందని ఆ సమయంలో ఆయన అనుకోలేదు. అద్దం తీసుకుని నేరుగా పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. అప్పట్లో ఆ ఠాణా ఇన్స్పెక్టర్ పని చేస్తున్న టి.లక్ష్మీనారాయణకు కేసు పూర్వాపరాలు వివరించి, ఆ అద్దాన్ని ఆయన ముందుంచారు. ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇరువురూ దేశానికి సేవ చేసిన మాజీ సైనికాధికారి కుటుంబానికి చెందిన వారని తెలుసుకున్నారు. ఈ విషాదానికి కారణమైన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలని నిర్ణయించుకున్న ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆ కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆశాదేవి, శ్వేతలను ఢీ కొట్టింది స్విఫ్ట్ కారు అని స్థానికులు చెప్పడంతో ముందుగా ఆ మోడల్స్ పైనే దృష్టి పెట్టారు. ప్రమాద సమయంలో ఆ కారు శామీర్పేట వైపు నుంచి వస్తోందని నిర్ధారణ కావడంతో ఆ దిశలో ముందుకు వెళ్లారు. ఆర్టీఓ డేటాబేస్ ఆధారంగా హైదరాబాద్తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ల్లో నమోదైన తెల్లరంగు స్విఫ్ట్ కార్ల వివరాలు సేకరించారు. అది భారీగా ఉండటంతో విశ్లేషించే పనిలో పడ్డారు.ఆయా వాహనాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? ఎవరైనా ఆ రోజు బొల్లారం మీదుగా ప్రయాణించారా? ఇలాంటివి తేల్చడానికి కొంత సమయం తీసుకుంటుందని భావించిన ఇన్స్పెక్టర్ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలెట్టారు. బొల్లారంలో ఉన్న ఓ కార్ మెకానిక్ను పిలిపించి ఘటనాస్థలిలో లభించిన అద్దాన్ని చూపించారు. దాన్ని పరిశీలించిన ఆ మెకానిక్ అది స్విఫ్ట్ కారుది కాదని, ఫోర్డ్ కంపెనీకి చెందిన కారుదని నిర్ధారించారు. దీనికి తోడు రెండుగా విడిపోయిన ఆ అద్దం వెనుక భాగంలో ‘22.6.2012’ అని రాసి ఉండటాన్ని అదే సమయంలో ఇన్స్పెక్టర్ గుర్తించారు. ఈ ఆధారాలను బేరీజు వేస్తూ సదరు కారు ఆ తేదీ తరవాత వినియోగదారుడికి డెలివరీ అయి ఉంటుందని అంచనా వేశారు. ఆ రోజు తరవాత రిజిస్టర్ అయిన ఫోర్డ్ కార్ల వివరాలు సేకరించిన ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ వాటిలో నాలుగు తెల్లరంగువి ఉన్నట్లు తేల్చారు. ఆయా కార్ల రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా యజమానుల చిరునామాలు గుర్తించారు. ఈ నాలుగు చిరునామాలకు స్వయంగా వెళ్లి, విచారణ చేసి రావడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. చందానగర్ చిరునామాతో రిజిస్టర్ అయి ఉన్న కారును వెతుక్కుంటూ వెళ్లిన ఈ టీమ్ ఓ ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న ‘ఏపీ 29 ఏవీ 6037’ నెంబర్ కారును గుర్తించింది. ఆ కారుకి కుడివైపు సైడ్ మిర్రర్ య«థాతథంగా ఉండటం, ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా లేకపోవడంతో తాము వెతుకుతున్న కారు అది కాదేమోనని అనుకుంటూ విషయాన్ని ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణకు చెప్పింది. ఆయన సూచనల మేరకు ఆ కారుకు కొత్తగా రంగు వేసిన దాఖలాలు, దానికి సంబంధించిన ఆధారాల కోసం సమీపంలోకి వెళ్లి పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే ఆ కారుకు కొత్తగా రంగు వేస్తుండగా దాని టైర్పై పడిన పెయింట్ చుక్కలు గమనించింది. వెంటనే అప్రమత్తమైన టీమ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని యజమానుల్ని పోలీసుస్టేషన్కు రావాలని చెప్పింది.అలా వచ్చిన యజమానుల్ని విచారించడంతో జనవరి ఒకటో తేదీన ఆ కారుని తన సమీప బంధువైన ఎంటెక్ విద్యార్థి, నేరేడ్మెట్ వాసి డి.భరద్వాజ్ తీసుకువెళ్లాడని, తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నట్లు చెప్పాడని వెల్లడైంది. దీంతో అతడి కోసం గాలింపు ప్రారంభించారు. తన వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారనే విషయం తెలుసుకున్న భరద్వాజ్ నేరుగా బొల్లారం పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ఆ రోజు పొగమంచు కారణంగా ఓ ప్రమాదం జరిగిందని, అయితే తాను గొడను ఢీ కొట్టానని భావించానని పోలీసులకు తెలిపారు. ప్రమాదం జరిగినట్లు కారు యజమానులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందనే కారుకు రంగు వేయించానని అంగీకరించాడు. దీంతో బొల్లారం పోలీసులు భరద్వాజ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భరద్వాజ్ నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు మరణించడంతో పాటు ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఇంజనీరింగ్ చదువుతున్న మరో కుమార్తె సుదీర్ఘకాలం షాక్లో ఉండిపోయి మాట పలుకు లేకుండా తనను తాను మర్చిపోయారు. ఎవరైనా దగ్గరకు వెళ్లి పలకరిస్తే... ‘అమ్మ వెళ్లి చాలాసేపు అయింది. రమ్మని చెప్పండి’ అని మాత్రమే అంటూ కోలుకోవడానికి చాలా రోజులు తీసుకుంది. ∙ -
కంపెనీలు కావు.. కల్పతరువులు
ఉద్యోగులు మంచి కంపెనీలను కోరుకుంటారు. కంపెనీలు మంచి ఉద్యోగులను కోరుకుంటాయి. మంచి ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం, వారిని కాపాడుకోవడం వల్లనే కంపెనీలు విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు. మంచి ఉద్యోగులను కాపాడుకోగలిగే కంపెనీలు ఉత్తమ కంపెనీలుగా ఎదుగుతున్నాయి. అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు పనిచేయడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండే వంద అత్యుత్తమ కంపెనీలను ఎంపిక చేసిన ఫార్చూన్ పత్రిక ‘బెస్ట్ కంపెనీస్ టు వర్క్’– 2025 పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది. వీటిలోని పది అత్యుత్తమ కంపెనీల కథా కమామిషు చూద్దాం. వీటిలో పనిచేయాలని ఉద్యోగులు ఎందుకు ఉవ్విళ్లూరుతుంటారో తెలుసుకుందాం...మంచి కంపెనీలు అంటే అపర కుబేరుల ఆ«ధ్వర్యంలో నడిచే కంపెనీలు అనుకుంటే పొరపాటేనని ‘ఫార్చూన్’ జాబితా రుజువు చేస్తోంది. ఉద్యోగులకు మంచి వేతనాలు చెల్లించడమే కాకుండా, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల కోసం చర్యలు తీసుకోవడం; ఉద్యోగుల అభివృద్ధిలో పైరవీలకు తావు లేకుండా పనితీరుకు మాత్రమే ప్రాధాన్యమివ్వడం; ఉద్యోగుల అనుభవాన్ని, పనితీరును మదింపు వేసి పదోన్నతులు కల్పించడం; పని ప్రదేశంలో ఆహ్లాదకర పని వాతావరణాన్ని కల్పించడం; ఉద్యోగుల కష్టసుఖాలను పరిగణనలోకి తీసుకుని, వారికి తగిన వెసులుబాట్లు కల్పించడం వంటి మానవీయ చర్యల కారణంగానే ఈ కంపెనీలు అత్యుత్తమ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘ఫార్చూన్’ జాబితాలోని టాప్–10 కంపెనీల పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం...1 హిల్టన్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న బహుళజాతి సంస్థ హిల్టన్ వరల్డ్వైడ్. ఆతిథ్యరంగంలో ఈ కంపెనీ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. వర్జీనియాలోని మెక్లీన్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. కాన్రాడ్ హిల్టన్ 1919లో ప్రారంభించిన ఈ కంపెనీకి ప్రస్తుతం క్రిస్టఫర్ నాసెట్టా సీఈవోగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో దాదాపు రెండులక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అన్ని స్థాయుల్లోనూ ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడమే కాకుండా, ‘హిల్టన్’ యాజమాన్యం వారి సంక్షేమానికి, అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతోంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ‘కేర్ ఫర్ ఆల్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ‘హిల్టన్ ఫ్లెక్స్’ కార్యక్రమం పేరిట ఉద్యోగులు తమకు అనువైన వేళల్లో వచ్చి పనిచేసి వెళ్లే వెసులుబాటును కల్పిస్తోంది. ‘గో హిల్టన్’ పేరిట ఉద్యోగుల పర్యాటక ఖర్చులను చెల్లిస్తోంది. ‘హిల్టన్’ సంస్థ తన విజయాలకు ఉద్యోగులే కారణమని చెబుతుంది. నిజానికి ఉద్యోగులకు పూర్తి సంతృప్తికరమైన జీవితాన్ని అందించడమే ‘హిల్టన్’ను ‘ఫార్చూన్’ జాబితాలో మొదటి స్థానంలో నిలిపింది.2 సింక్రనీఅమెరికా కేంద్రంగా ప్రధానంగా ఆర్థిక, బీమా రంగాల్లో పనిచేస్తున్న బహుళజాతి సంస్థ సింక్రనీ. కనెక్టికట్లోని స్టామ్ఫర్డ్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కంపెనీ 1932లో తొలుత ఆర్థిక సేవల సంస్థగా ప్రారంభమైంది. తర్వాతికాలంలో ఆరోగ్య, గృహవసతులు, రీటైల్ తదితర రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం ఇందులో దాదాపు ఇరవైవేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ తన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, ఉద్యోగులు ఇంటి నుంచి కార్యాలయానికి రాకపోకలు జరపడానికి వీలుగా విద్యుత్ వాహనాలు, విద్యార్హతలను మెరుగుపరచుకోవాలనుకునే ఉద్యోగులకు ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చుల చెల్లింపు వంటి ప్రయోజనాలను అందిస్తోంది. అలాగే, ఉద్యోగులకు పిల్లలు పుడితే, తల్లిదండ్రులకు వేతనంతో కూడిన సెలవులు, సంతానలేమితో బాధపడే ఉద్యోగులకు ఐవీఎఫ్ చికిత్స ఖర్చులను కూడా చెల్లిస్తోంది. వీలైన వేళల్లో పనిచేసుకునే వెసులుబాటు, నిర్ణీత వేళల్లో పనిచేసేవారికి కూడా ప్రతి శుక్రవారం ‘ఫ్లెక్స్ ఫ్రైడే’ వెసులుబాటు తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఉద్యోగుల ఫీడ్బ్యాక్ ప్రకారం తన పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరచుకునే నిబద్ధత ‘సింక్రనీ’ని ఈ స్థాయికి తెచ్చింది. ఉద్యోగం చేయడానికి ఇది అద్భుతమైన సంస్థ అని ఇందులో పనిచేసే 94 శాతం ఉద్యోగులు చెబుతుండటమే దీని విజయానికి గీటురాయి.3 సిస్కోఇది కూడా అమెరికన్ బహుళజాతి సంస్థల్లో ఒకటి. కాలిఫోర్నియాలోని శాన్జోస్లో ప్రధాన కార్యాలయం గల ఈ కంపెనీ ఐటీ రంగంలో సేవలందిస్తోంది. నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ సహా పలు సాంకేతిక సేవలు అందించే ఈ కంపెనీ 1984లో ప్రారంభమైంది. ఉద్యోగులకు సంతృప్తికరమైన పనివాతావరణం కల్పించడానికి సిస్కో అనేక చర్యలను అమలు చేస్తోంది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పలు వసతులు కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు ఉద్యోగుల ఫీడ్బ్యాక్ ఆధారంగా వారికి ఆర్థిక ప్రయోజనాలను, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. పని ప్రదేశంలో మార్పు చేర్పులను ఉద్యోగుల అభిప్రాయాలకు అనుగుణంగా చేపడుతోంది. ఉద్యోగుల నైపుణ్యాల మెరుగుదల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేస్తుండటం సిస్కో ప్రత్యేకత. ఉద్యోగుల అభిప్రాయాలకు విలువనిస్తూ, వారికి తగిన ప్రయోజనాలను అందించడంలో ముందంజలో ఉండటమే సిస్కోను అత్యుత్తమ స్థాయికి చేర్చించింది. తమ అభిప్రాయాలకు యాజమాన్యం విలువనివ్వడం వల్ల ఈ సంస్థలోని ఉద్యోగులు పూర్తి సంతృప్తితో పనిచేసుకోగలుగుతున్నారు.4 అమెరికన్ ఎక్స్ప్రెస్ఆర్థిక సేవల రంగంలో 175 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ అమెరికన్ బహుళ జాతి కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లోని బఫెలో నగరంలో ఉంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ట్రావెలర్స్ చెక్కులు, బీమా, పర్యాటక రంగాల్లో ఈ కంపెనీ పనిచేస్తోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కంపెనీలో దాదాపు 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థలో పనిచేయడం తమ అదృష్టంగా ఉద్యోగులు భావిస్తారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగం వల్ల ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఉద్యోగులు కోరుకునే వేళల్లో పనిచేసే వెసులుబాటుతో పాటు వారు ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తోంది. సంతృప్తికరమైన వేతనాలు; ఉద్యోగాల్లో అభివృద్ధి సాధించడానికి వీలుగా విద్యార్హతలు పొందడానికి చదువుకునే విద్యార్థులకు చదువుల ఖర్చుల చెల్లింపు; ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత ఆరోగ్య బీమా; పారదర్శకమైన నాయకత్వం ఈ సంస్థను అగ్రగామిగా నిలుపుతున్నాయి. ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగులందరికీ సమానావకాశాలు కల్పించడం; ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంలో తోడ్పాటునందించడం వంటి చర్యల ద్వారా ‘అమెరికన్ ఎక్స్ప్రెస్’ తన ఉద్యోగుల మనసులను చూరగొంటోంది.5 ఎన్విడీయాఐటీ రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ముప్పయ్యేళ్లకు పైగా పనిచేస్తున్న ఈ సంస్థ ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వైవిధ్యభరితమైన సేవలను అందిస్తోంది. చిప్స్ తయారీ, డిజైనింగ్, గేమింగ్, ఏఐ సహా పలు సేవలను ప్రపంచవ్యాప్తంగా అందిస్తోంది. ఎన్విడీయా కంపెనీలో దాదాపు 36 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకసారి ఇందులో ఉద్యోగంలో చేరాక మానేసే వారు అతి తక్కువ. ఉద్యోగ భద్రత, సంతృప్తికరమైన వేతనాలు, సంస్థలోని వివిధ బృందాలు ఉన్నా, ఏ బృందానికి ఆ బృందం స్వయంప్రతిపత్తితో పనిచేసేలా ప్రతి బృందానికి స్వేచ్ఛాయుత వాతావరణం, ఉద్యోగులు అందరూ ఒకేసారి సెలవులను ఆస్వాదించేలా వారాంతపు సెలవులు మాత్రమే కాకుండా, ప్రతి మూడునెలలకు ఒకసారి వరుసగా రెండు రోజులు సెలవులు, ప్రతి ఏడాదిలో ఇరవైరెండు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు తీసుకునే వెసులుబాటు ఈ సంస్థను ఉద్యోగుల పాలిటి ఉత్తమ సంస్థగా నిలుపుతున్నాయి. ఉద్యోగులకు నచ్చిన వేళల్లో పనిచేసుకునే వెసులుబాటు, వారి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఆర్థిక మద్దతు, దిగువ స్థాయి ఉద్యోగుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని విధానపరమైన మార్పులు చేపట్టడం వంటి చర్యలు ఈ సంస్థను అగ్రగామిగా నిలుపుతున్నాయి.6 వెగ్మాన్జ్రిటైల్ రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళ జాతి సంస్థ న్యూయార్క్లోని రోషెస్టర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. జాన్ వెగ్మాన్, వాల్టర్ వెగ్మాన్ అనే సోదరులు 1916లో ఈ సంస్థను ప్రారంభించారు. ‘వెగ్మాన్జ్’ సంస్థకు ఇప్పుడు అమెరికాలో మొత్తం 111 సూపర్ మార్కెట్ స్టోర్లు ఉన్నాయి. ‘ఫార్చూన్’ పత్రిక 1998లో ‘బెస్ట్ కంపెనీస్ టు వర్క్’ జాబితాను విడుదల చేయడం ప్రారంభించిన నాటి నుంచి వెగ్మాన్ ఈ జాబితాలోని తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకుంటూ వస్తోంది. ఈ కంపెనీలో దాదాపు 54 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత, సంతృప్తికరమైన వేతనాలు, పనితీరు ఆధారంగా పదోన్నతులు, ప్రతి ఆరునెలలకు ఒకసారి వేతనాల పెంపు, యాజమాన్య నిర్ణయాల్లో పారదర్శకత, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఉచిత ఆరోగ్య బీమా, పనివేళలను కోరుకునే రీతిగా ఎంపిక చేసుకునే వెసులుబాటు, ఉద్యోగులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తోంది. ఇన్ని సౌకర్యాలు ఉండటం వల్ల ‘వెగ్మాన్జ్’ ఉద్యోగులు తమ యాజమాన్యం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.7 యాక్సెంచర్ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగానికి చెందిన ఈ బహుళ జాతి సంస్థ ఐర్లండ్ రాజధాని డబ్లిన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దాదాపు 120 దేశాలలో కార్యాలయాలు ఉన్న ఈ కంపెనీలో 7.79 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్ట్రాటజీ, కన్సల్టింగ్, ఆపరేషన్స్ తదితర సేవలు అందిస్తున్న ఈ కంపెనీ తన క్లయింట్స్కు ఎప్పటికప్పుడు కావలసిన పరిష్కారాలను అందించే దిశగా పరిశోధనలపై భారీగా ఖర్చు చేస్తుంది. ఉద్యోగులను నిరంతర అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తుంది. ప్రాజెక్టుల ఎంపికలోను, కెరీర్ రంగాల ఎంపికలోను, పనివేళల ఎంపికలోను ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తుంది. అధ్యయనానికి, సృజనాత్మకతకు పెద్దపీట వేయడమే కాకుండా, పనితీరు ఆధారంగా ఉద్యోగుల పురోభివృద్ధికి భరోసా కల్పిస్తుండటంతో ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేయడానికి ఇష్టపడతారు. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, పిల్లలు పుట్టినప్పుడు తల్లి దండ్రులకు వేతనంతో కూడిన సెలవులు మాత్రమే కాకుండా, సంతాన సాఫల్య చికిత్సలు పొందేవారికి, పిల్లలను దత్తత తీసుకునేవారికి కూడా వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తుండటం ఈ కంపెనీ ప్రత్యేకత.8 మేరియట్ఆతిథ్య రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ మేరీలాండ్లోని బతీజ్దా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది మేరియట్ ఇంటర్నేషనల్ సంస్థకు వివిధ దేశాల్లో ఆరువందలకు పైగా హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ‘మనుషులే ప్రధానం’ సిద్ధాంతంతో పనిచేసే మేరియట్ సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి, సంతృప్తికి అత్యధికంగా ఖర్చు చేస్తుంది. కంపెనీ అంతర్గత వ్యవహారాల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. ఉద్యోగులతో తరచు సమావేశాలు నిర్వహించడం, ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుని, విధాన నిర్ణయాలలో మార్పులు చేయడం వంటి చర్యల ద్వారా మేరియట్ సంస్థ ఉద్యోగుల విశ్వాసాన్ని, అభిమానాన్ని చూరగొంటోంది. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతులు, బహుమతులు ఇవ్వడం, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, సెలవులలో ఉద్యోగులు పర్యటనలకు వెళ్లేటప్పుడు తమ హోటళ్లలో డిస్కౌంట్కు బస, ఆహార పానీయాలు అందించడం, ఉత్తమ పనితీరు కనబరచిన ఉద్యోగులకు ప్రత్యేక బోనస్ చెల్లింపు, ఉద్యోగులకు కంపెనీలో వాటాల కేటాయింపు వంటి చర్యల ద్వారా మేరియట్లో పనిచేయడాన్ని ఉద్యోగులు గొప్ప అవకాశంగా భావిస్తారు.9 పినాకిల్ఆర్థిక సేవల రంగానికి చెందిన ఈ అమెరికన్ కంపెనీ టెనెసీలోని నాష్విల్లె ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్, మార్టిగేజ్ తదితర సేవలను అందించే ఈ కంపెనీలో దాదాపు మూడున్నర వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలతో పాటు కంపెనీలో పరిమిత మొత్తాల మేరకు వాటాల కేటాయింపు; ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది లేని పనివేళలు; లక్ష్యాలను సాధించిన ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహకాలు; ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా; రిటైరైన ఉద్యోగులకు పింఛను చెల్లింపు; వేతనంతో కూడిన సెలవులు; ఉద్యోగులపై ఆధారపడే తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రత్యేక అలవెన్సు వంటి చర్యల ద్వారా పినాకిల్ సంస్థ ఉద్యోగులు పనిచేయడానికి అన్ని విధాలా అనువైన సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలుస్తోంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుండటం దీని విజయానికి నిదర్శనం.10 వరల్డ్ వైడ్ టెక్నాలజీసాంకేతిక రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ మిసోరీలోని మేరీలాండ్ హైట్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. అప్లికేషన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, స్ట్రాటెజిక్ రిసోర్సింగ్, గ్లోబల్ సప్లై చెయిన్, ఇంటిగ్రేషన్ నెట్వర్కింగ్ తదితర సేవలను అందిస్తున్న ఈ కంపెనీలో దాదాపు పన్నెండువేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలను చెల్లించడంతో పాటు వరల్డ్ వైడ్ టెక్నాలజీ కంపెనీ వారికి అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, ప్రమాద బీమా; ఉద్యోగ విరమణ తర్వాత జీవితం సజావుగా సాగడానికి రిటైర్మెంట్ పథకం; ఉద్యోగుల్లో ఎవరికైనా పిల్లలు పుడితే తల్లులతో పాటు తండ్రులకు కూడా వేతనంతో కూడిన సెలవులు; సంతాన సాఫల్య చికిత్సల కోసం ఆర్థిక సాయం, సెలవులు, పిల్లలను దత్తత చేసుకోవడానికి వేతనంతో కూడిన సెలవులు; అనువైన పనివేళలను ఎంపిక చేసుకునే వెసులుబాటు; నాయకత్వ శిక్షణ తదితర కార్యక్రమాల ద్వారా వరల్డ్ వైడ్ టెక్నాలజీ ఉత్తమ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇందులో పనిచేసే వారిలో తొంభైఐదు శాతానికి పైగా ఉద్యోగులు పూర్తి సంతృప్తితో ఉన్నట్లు చెబుతారు.ఉద్యోగులు లోటులేని జీవితాలను గడపడానికి తగినట్లుగా సంతృప్తికరమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పనివేళల్లో వెసులుబాట్లు, వివిధ అవసరాలకు వేతనాలతో కూడిన సెలవులు, పనితీరుకు తగిన గుర్తింపు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల పట్ల పట్టింపు వంటి చర్యల ద్వారానే ఈ కంపెనీలు ఉద్యోగుల పాలిటి కల్పతరువుల్లా ఉంటూ అగ్రశ్రేణిలో నిలుస్తున్నాయి. -
మర్చిపోయారా? గ్యాడ్జెట్ గుర్తు చేస్తుంది!
ప్రతి చిన్న విషయం గుర్తుపెట్టుకోలేని వారంతా ఇప్పుడు, టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ మీ జ్ఞాపకాలను జాగృతం చేసే గ్యారంటీ ఇస్తున్నాయి.చంద్రుడి వెలుగులా!చీకట్లో బెడ్మీద పుస్తకం చదవాలంటే ఒకవైపు లైట్ కోసం పోరాటం, మరోవైపు ‘స్విచ్ ఆఫ్ చెయ్యి!’ అనే డిస్టర్బ్ చేసే డైలాగులు! ఇవన్నీ దూరం చేయడానికి ఇప్పుడు ఒక హీరో వచ్చేశాడు. అదే గ్లోకుసెంట్ బుక్ లైట్! చిన్నగా కనిపించే ఈ లైట్ పనిలో మాత్రం బాస్ లెవెల్! మూడు కలర్ మోడ్లు, ఐదు బ్రైట్నెస్ లెవెల్స్తో కళ్లకు ఇబ్బంది లేకుండా సాఫ్ట్గా వెలిగిస్తుంది. పుస్తకానికి క్లిప్లా తగిలించుకుని చీకట్లో చంద్రుడి వెలుగులో చదివేయొచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే ఎనభై గంటల వరకు నిరంతరామంగా వెలుగుతుంది. యూఎస్బీ రీచార్జబుల్, ఫ్లెక్సిబుల్, పోర్టబుల్, క్యూట్ పుస్తకప్రియుల రాత్రుల కోసం పర్ఫెక్ట్ స్నేహితుడు! దీని ధర రూ. 1,449.మాయా ట్యాగ్!తాళాలు ఎక్కడో, వాలెట్ ఏ సోఫా కిందో, బ్యాగ్ ఎవరో తీసుకెళ్లారో? ఇలా మీ రోజూ వివిధ వస్తువుల ‘సర్చ్ మిషన్’లా మొదలవుతుందా? ఇకపై ఏది పోయినా కంగారు పడాల్సిన పని లేదు! ఎందుకంటే నీ వస్తువులకి ఇప్పుడు బాడీగార్డ్ వచ్చేశాడు. అదే అమెజాన్ బేసిక్స్ ఏరో ట్యాగ్! ఇది మీ వస్తువులు ఎక్కడ ఉన్నాయో చెప్తుంది, అది కూడా ఒక్క బీప్తోనే! ఈ చిన్న తెల్ల ట్యాగ్లో బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, ఆపిల్ ఫైండ్ మై నెట్వర్క్ సపోర్ట్, 80 డెసిబెల్స్ సౌండ్ అలర్ట్ ఉన్నాయి. వాలెట్, కీస్, బ్యాగ్ ఇలా దేనికైనా తగిలించుకొని వాడుకోవచ్చు. అవి కనిపించనప్పుడు, ఒక్కసారి ఫోనులో యాప్ ఓపెన్ చేసి బటన్ నొక్కితే చాలు, ఆ వస్తువు ఎక్కడుందో చెప్తుంది. తేలికగా ఉంటుంది, సిమ్ అవసరం లేదు, బ్యాటరీతో పనిచేస్తుంది. ధర రూ. 537 మాత్రమే!టచ్తోనే తెలిసిపోతుందిచల్లని నీళ్లు తాగాలనుకుని బాటిల్ ఓపెన్ చేస్తే లోపల మరిగిన నీరు! చేతికి వేడి, ముఖానికి షాక్! ఇక ఆ కన్ఫ్యూజన్ స్టోరీకి ఎండ్! ఎందుకంటే ఎల్ఈడి స్మార్ట్ టెంపరేచర్ బాటిల్ నీళ్లు చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా ముందే చెప్తుంది. ఈ బాటిల్లోని డిస్ప్లేను టచ్ చేస్తే వెంటనే నీళ్ల ఉష్ణోగ్రత చూపిస్తుంది. చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా అన్నది సెకన్లలో బాటిల్ ఓపెన్ చేయకుండానే తెలుసుకోవచ్చు. హాట్ డ్రింక్స్ను పన్నెండు గంటలు, కూల్ డ్రింక్స్ను ఇరవై నాలుగు గంటల వరకు అదే టెంపరేచర్లో ఉంచుతుంది. స్టెయిన్లెస్ స్టీల్తో తయారైన ఈ బాటిల్ తేలికగా, క్యూట్గా, ఫ్యాన్సీగా ఉంటుంది. ధర రూ. 295 మాత్రమే! -
ఏం ఫీలున్నది మామా!
సాధారణంగా ప్రేక్షకులు థియేటర్కు వెళ్లి చూసేవి యాక్షన్, అడ్వెంచర్, డ్రామా; ఇంట్లో ఉండి ఓటీటీల్లో చూసేవి క్రైమ్, కామెడీ, ఫాంటసీ. ఇవి కాకుండా.. ఒక ‘బీభత్స, భయానక, భూత, ప్రేత, పిశాచ’ జానర్ కూడా ఉంది. అదే... హారర్! ఈ చిత్రాల ప్రత్యేకత ఏంటంటే.. థియేటర్కు వెళితే స్నేహితులతో, ఇంట్లోనైతే కుటుంబ సభ్యులతో కలిసి చూస్తాం. ‘బాబోయ్ హారర్!’ అనుకుంటాం కాని, చూడటం మాత్రం మానం. అదొక మజా. ఫీల్. దెయ్యాలతో సయ్యాట!ఎందుకంత పడి చచ్చిపోతాం?!గుండెల్లో దడ పుట్టించే, అరచేతులకు చెమటలు పట్టించే హారర్ సినిమాలను ఎందుకు మనం ఏరి కోరి చూస్తుంటాం? నడిచే శవాలు, భూత్ బంగళాలు కథాంశంగా ఉన్న సినిమాలను క్షణ క్షణం భయపడుతూనే ఎందుకు ఆస్వాదిస్తుంటాం? భయం అన్నది.. నిజ జీవితంలో వెనకడుగు వేసేలా చేస్తుంది. కాని, భయానకమైన సినిమా అనగానే ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా అడుగు ముందుకేస్తారు! ఎందుకిలా ప్రేక్షకులు భయాన్ని ‘కొని’ చూస్తుంటారు? ఎందుకు కొరివి దెయ్యం లాంటి భయంతో తల గోక్కుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం మనస్తత్వశాస్త్రంలో లేకపోలేదు. ‘పోరాడు.. లేదా, పారిపో..’భయమంటే మనం ఇష్టపడటానికి ముఖ్య కారణం ‘స్టిమ్యులేషన్’’! మెదడుకు చురుకు పుట్టించే ఇంద్రియ చలనం. సైన్స్ పరిభాషలో నాడీ మండల విద్యుత్ ప్రేరణ. భయం మానసికంగా, శారీరకంగా ఉద్రేకాన్ని జనింపజేస్తుంది. గుండె ఝల్లుమనటం ఇందుకే. థ్రిల్లింగ్ కోసం ‘కోరి తెచ్చుకునే’ భయంలో ఆందోళన, ఉత్సాహం.. రెండూ సమపాళ్లలో మిశ్రమంగా ఉంటాయి. ఊపిరి బిగబట్టి, సినిమాలో ఒక భయానక దృశ్యం చూస్తున్నప్పుడు, హఠాత్తుగా ఎదురయ్యే ఊహించని మలుపుతో మన శరీరంలో ఒక్కసారిగా విడుదలయ్యే అడ్రినలిన్ (ఎపినెఫ్రిన్) హార్మోన్.. ‘పోరాడు లేదా పారిపో’ అని సంకేతాలిస్తుంది. సినిమా కనుక మనం పోరాడేది, సీట్లోంచి పారిపోయేదీ (మరీ భయస్థులు అయితే తప్ప) ఏమీ ఉండదు. బదులుగా ఇంద్రియాలు పదునెక్కి థ్రిల్ కలుగుతుంది. అందుకే హారర్ సినిమాలంటే మనం భయపడుతూనే ఇష్టపడుతుంటాం. ‘హారి దేవుడా.. బయట పడ్డాను..’భయపెట్టే థీమ్లో ఉండే ఆసక్తికరమైన అంశం.. ‘కొత్తదనం’. ఆ కొత్తదనమే భయం పట్ల మనకు విపరీతమైన ఆకర్షణను కలుగజేస్తుంది. ‘అపోకలిప్టిక్’ సినిమాలు మీరు చూసే ఉంటారు. ఉదా : ‘ది డే ఆఫ్టర్ టుమారో’, ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’, ‘ఆర్మగడాన్’ వంటివి. అవి మనకు వాస్తవ ప్రపంచానికి భిన్నంగా కొత్త భయానక లోకాలను చూపిస్తాయి. భూగోళం సమూలంగా ధ్వంసమైపోయి, మనిషి మళ్లీ మొదట్నుంచి పునరుజ్జీవనం పొందే సినిమాల్లోని (పోస్ట్–అపోకలిప్టిక్) భయానక సన్నివేశాలు కూడా థ్రిల్ను రేపుతాయి. భూగోళంపై గ్రహాంతర జీవుల దాడి, సమాధుల్లోంచి పైకి లేచి వచ్చే ‘జాంబీ’లు.. మన లోపల సృష్టించే కల్పిత భయాన్ని ‘తట్టుకోవటం’ అన్నది మనం ఏదో సాహసం చేస్తున్నామన్న భావనను, సంతృప్తిని కలిగిస్తుంది. అందుకే హారర్ సినిమాలను అంతా ఇష్టపడతారు. సినిమా పూర్తయ్యాక.. ‘హారి దేవుడా.. ప్రాణాలతో భయపడ్డాను..’ అని సినిమా హాలు నుండి పకపకా నవ్వుతూ బయటికి అడుగులు వేయటం కూడా ఓ గొప్ప అనుభూతిలా, ‘‘ఏం ఫీలున్నది మామా?’’ అనిపించేలా ఉంటుంది. బిక్కు బిక్కుమంటూ లుక్కుస్క్రీన్ మీద కనిపించే పాత్రల్లోని భయం, సినిమా చూస్తున్న వాళ్లలో కలిగే భయం ‘సింక్’ అవటం అన్నది ఒక మంచి బీభత్స, భయానక సినిమాలో ఉంటుంది. అందుకే భయం అంటే మనకు అంత క్రేజు. నరమాంస భక్షణ; దౌర్భాగ్యమైన, మానవత్వం లేని హింసాత్మక జీవితాన్ని గడిపే పాత్రలుండే ‘డిస్టోపియన్’ యాక్షన్ చిత్రాల్లోని హారర్ పట్ల ఉండే మన ఆసక్తిని అలాంటి సినిమాలు సంతృప్తి పరుస్తాయి కనుక, పైకి చెప్పకపోయినా లోలోపల ఆ సన్నివేశాలను బిక్కుబిక్కుమంటూనే చూడటానికి ఇష్టపడతాం. సురక్షిత భయాస్వాదనభయానక దృశ్యాలను ఆస్వాదించే మన సామర్థ్యం.. సైకాలజిస్టులు చెబుతున్న దానిని బట్టి ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ (భద్రతా చట్రం), డిటాచ్మెంట్ ఫ్రేమ్ (నిర్లిప్త చట్రం), కంట్రోల్ ఫ్రేమ్ (నియంత్రణ చట్రం) అనే మూడు మానసిక స్థితులపై ఆధారపడి ఉంటుంది. భయపడుతున్నప్పుడు కూడా మనం సురక్షితంగా ఉన్నామని వెనుక నుంచి వెన్ను తట్టి చెబుతుండే చట్రాలు ఇవి. హారర్ సినిమా చూస్తున్నప్పుడు... అదంతా నిజం కాదని, లోపలి పాత్రలు బయటికి వచ్చి మన పీక పట్టుకోవని ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ మనకు చెబుతుంటుంది. ఇక తెరపై కనిపిస్తున్న హారర్ నుంచి భావోద్వేగాల పరంగా మనల్ని నిర్లిప్తంగా ఉంచి, భయంలోని మజాను మాత్రమే మన వరకు తెచ్చేది ‘డిటాచ్మెంట్ ఫ్రేమ్’. మూడవదైన ‘కంట్రోల్ ఫ్రేమ్’... భయం పట్ల మన ధీమాను సడలనివ్వకుండా, థ్రిల్స్ని మాత్రం ఆనందించేలా చేస్తుంది.కొందరెందుకు ఇష్టపడరు?హారర్ను ఇష్టపడే వాళ్లు ఉన్నట్లే, హారరంటే అస్సలు ఆసక్తి లేని వాళ్లు కూడా ఉంటారు. ఇందుకు కారణం అందరి మెదడూ భయానికి ఒకేలా స్పందించక పోవటం. విపరీత సంచలనాలను, ఉరిమే ఉత్సాహాన్ని కోరుకునే వారు ఈ హారర్ చిత్రాలను లైక్ చేస్తారు. హారర్లోని సృజనాత్మకతను, కొత్త అనుభవాలను ఇష్టపడేవారు భయాన్ని కోరుకుంటారు. ‘దయ్యాల్లేవ్, గియ్యాల్లేవ్’ అనుకునేవారు; కల్పనలపై కుతూహలం లేనివారు హారర్ చిత్రాలను పట్టించుకోరు. ‘నీ బాధను అర్థం చేసుకోగలను’‘సహానుభూతి’ కూడా హారర్ చిత్రాల్లోని భయాన్ని ఇష్టపడటానికి ఒక కారణం అవుతుంటుంది. సహానుభూతి స్థాయి ఎక్కువగా ఉన్న వారు భయానక చిత్రాలను చూస్తున్నప్పుడు.. దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తెరపై పాత్రలతో తాము సహానుభూతి చెందుతారు. తెరపై బాధను తమ మనసులోపల మరింత లోతుగా అనుభవిస్తారు. అయితే వయస్సు; స్త్రీ పురుష అంశం కూడా ఇక్కడ ముఖ్యమైనవే. యువ ప్రేక్షకులు, పురుషులు హారర్ చిత్రాలను ఎక్కువగా ఆస్వాదిస్తారు. అందుకు భిన్నంగా మహిళలు తరచుగా చెడును ఓడించి, సమాజాన్ని సవ్యంగా ఉంచే కథలను ఇష్టపడతారు.హారర్.. కలవారి కాలక్షేపం!ఇదొక ఆసక్తికరమైన విషయం. సంపన్న దేశాలలోని వారే హారర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడతారట! దీనినే ఇంకోలా చెప్పాలంటే హారర్ చిత్రాలు చూసే వారు సంపన్నులనే అర్థం తీసుకోవచ్చు. ‘రీసెర్చ్గేట్’ సైట్లో పొందుపరచి ఉన్న వివరాలను బట్టి, 2020లో 82 దేశాలలో జరిగిన అధ్యయనంలో సంపన్న దేశాల ప్రజలు (తలసరి జి.డి.పి. ఎక్కువగా ఉన్నవారు) హారర్ చిత్రాలను ఎక్కువగా చూస్తున్నట్లు వెల్లడైంది. దీనర్థం? ఆర్థిక భద్రత అనేది వ్యక్తులకు హారర్ పట్ల ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ని ఏర్పరుస్తోందని! జీవితం సమస్య కానప్పుడు వినోదం కోసం మనం భయంతో ఒక ఆట ఆడుకోవచ్చు. నవ్వులుగా మారే అరుపులుభయం ఇద్దర్ని ఏకం చేయడమే కాదు. మానవ సమూహాల మధ్య బంధాన్ని కూడా ఏర్పరుస్తుంది. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని భయానక చిత్రాలను చూస్తున్నప్పుడు.. భయం లేదా ఒత్తిడి కలిగే సమయంలో విడుదలయ్యే ‘కనెక్షన్ హార్మోన్’ అయిన ఆక్సిటోసిన్ క్రియాశీలం అవుతుంది. అందుకే భయంతో వేసే అరుపులు చివరికి ఉమ్మడి నవ్వులుగా మారుతాయి.భయం తర్వాత ప్రశాంతతహారర్ మూవీలో చివరికి భయానక పాత్ర ఓడిపోయి సినిమా హాల్లో లైట్లు వెలిగినప్పుడు అదొక అద్భుతమైన ప్రపంచంలా ఉంటుంది. మంచి అనుభూతిని కలిగించే రసాయనాలైన ‘ఎండార్ఫిన్’లను మెదడు విడుదల చేస్తుంది. ఫలితంగా సంతృప్తి, సంతోషం కలుగుతాయి. కుదుపు తర్వాతి స్థిరత్వం అది. కొంతమంది తీవ్ర భయం తర్వాత ఎందుకు ఉల్లాసంగా ఉంటారన్న దానికి ఇదే సమాధానం. ఏమైనా అదొక ఫీల్!· సాక్షి, స్పెషల్ డెస్క్ -
గుజరాతీ సమాచారం!
ఒక్కో కేసుదీ ఒక్కో తీరు. కొన్నిసార్లు చిల్లర దొంగతనం కేసు కూడా నెలల తరబడి పరిష్కారం కాదు. ఒక్కోసారి కోట్లు కొల్లగొట్టిన చోరులు కూడా సొత్తుతో సహా గంటల్లో దొరికేస్తారు. పంజగుట్టలోని అలుకాస్ జ్యూలర్స్లో 2006లో జరిగిన భారీ చోరీ కేసు అటువంటిదే! కేవలం 48 గంటల్లో కొలిక్కి వచ్చిన దీని దర్యాప్తులో తొలి అడుగు ఘటనాస్థలిలో దొరికిన గుజరాతీ పత్రికతో పడింది. అలా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు ఘరానా దొంగ వినోద్ రాంబోలీ సింగ్తో పాటు అతడి అనుచుడు శ్రీకాంత్ సింగ్ను పట్టుకుని, చోరీ సొత్తు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ నిందితులను న్యాయస్థానంలో 2011లో దోషులుగా నిర్ధారించిన శిక్ష కూడా విధించింది. అది 2006 మే 16.. పంజగుట్ట పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలో అలుకాస్ జ్యూలరీ షోరూమ్ అప్పటికి అది ప్రారంభమై రెండు నెలలైనా కాలేదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఉదయం 11 గంటల సమయంలో హడావుడిగా మారిపోయింది. సైరన్లు కొట్టుకుంటూ వరుసగా వచ్చిన పోలీసు వాహనాలు ఆ షోరూమ్ వద్ద హడావుడి చేస్తుండటంతో చుట్టుపక్కల షాపుల్లో కొనుగోళ్ల కోసం వచ్చిన కస్టమర్లకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అంతలోనే ఓ వార్త ఆ ప్రాంతంతో పాటు నగరమంతటా దావానలంలా వ్యాపించింది. అలుకాస్ షోరూమ్లో ముందు రోజు రాత్రి దొంగలు పడి, రూ.10 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారనేది దాని సారాంశం. నాలుగు అంతస్తుల్లో నిర్మించి ఉన్న కార్ప్హౌస్లోని గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తుల్లో అలుకాస్ షోరూమ్ ఉంది. భవనం వెనుక కుడివైపుగా నిర్మాణంలో ఉన్న మరో నాలుగు అంతస్తుల భవనంపైకి ఎక్కిన చోరులు పంజా విసిరేందుకు అనువైన సమయం కోసం అక్కడ మాటు వేశారు. అంతా సద్దుమణిగాక ఆ భవనం టెర్రాస్ పైనుంచి మూడడుగుల దూరంలో ఉన్న అలుకాస్ షోరూమ్ భవనంపైకి చేరుకుని, మెట్ల మార్గంలో రెండో అంతస్తుకు వచ్చారు. షట్టర్ పగులకొట్టి; రెండు, మొదటి అంతస్తుల్లోని డిస్ప్లేల్లో ఉన్న ఆభరణాలను తమతో తెచ్చుకున్న బ్యాగుల్లో సర్దుకున్నారు. లాకర్ల జోలికి వెళ్లని వీళ్లు దుకాణంలోని లైట్లన్నీ ఆర్పేసి, టార్చ్లైట్ల వెలుతురులో తమ పని పూర్తి చేసుకున్నారు. మళ్లీ రెండో అంతస్తులోకి వెళ్లిన చోరులు అక్కడ నుంచి ఓ తాడు సాయంతో పక్కనే ఉన్న మరో బిల్డింగ్పైకి దూకి పరారయ్యారు. మర్నాడు ఉదయం ఈ దొంగతనం విషయం యాజమాన్యం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత రూ. ఆరు కోట్ల విలువైన సొత్తు చోరుల పాలైనట్లు అధికారులకు తెలిపింది. పోలీసులు సైతం చోరీ జరిగిన తీరును గుర్తించారు. మరిన్ని కీలక ఆధారాల కోసం షోరూమ్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను అధ్యయనం చేయాలని భావించారు. ఆరాతీస్తే, షోరూమ్లో ఉన్న 12 కెమెరాలకు ఆ రోజు 10 పని చేయలేదని తేలింది. మిగిలిన రెండు మాత్రం ఇద్దరు వ్యక్తులు తచ్చాడుతున్నట్లు చూపించాయి. చోరీ జరిగిన తీరు, షోరూమ్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం పరిశీలించిన పోలీసుల దృష్టి తొలుత సంస్థ ఉద్యోగులపైనే పడింది. వారిలో ఎవరైనా లేదా వారి సహకారంతో ఎవరైనా ఈ నేరం చేశారా అనే దిశగా దర్యాప్తు చేసినా ఫలితం దక్కలేదు. చోరులు అలూకాస్లోకి ప్రవేశించడానికి ఉపయోగించిన నిర్మాణంలో ఉన్న భవనంపై పోలీసుల దృష్టి పడింది. అక్కడే అసంకల్పితంగా వెతకబోయిన తీగ పేపర్ రూపంలో పోలీసుల కాలికి తగిలింది. ఆ భవనం నాలుగో అంతస్తులో ఖాళీ బిర్యానీ పొట్లాలు, సిగరెట్ పీకలు ఉండటాన్ని బట్టి చోరులు అక్కడే వేచి ఉన్నారని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అదే ప్రాంతంలో ‘గుజరాత్ సమాచార్’ దినపత్రిక పడి ఉండటాన్నీ గమనించారు. దానిని చోరులే తెచ్చి ఉంటారని భావించిన పోలీసులు ఆ కోణంలో ఆరా తీశారు. ఆ పత్రిక గుజరాత్తో పాటు ముంబైలోనూ దొరుకుతుందని తేలడంతో ఆ రెండు రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. నగరం నుంచి బయలుదేరిన ప్రత్యేక బృందం ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులను కలిసింది. దుకాణంలోని సీసీ కెమెరాల్లో లభించిన ఫీడ్ను వారికి చూపించడంతో పాటు నేరం జరిగిన విధానాన్నీ వివరించింది.అవన్నీ చూసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారుల మదిలో మెదిలిన పేరు వినోద్ రాంబోలీ సింగ్. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇతను మహారాష్ట్రలోని సౌత్ ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహిసార్లో స్థిరపడ్డాడు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ అప్పటికే అతడిపై ఇరవైకి పైగా చోరీ, దోపిడీ కేసులు నమోదై ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న వేగులను ఆరా తీయగా, వారం రోజులుగా అతడు కనిపించలేదని, రెండ్రోజుల క్రితమే తిరిగి వచ్చాడని తెలిసింది. దీంతో అలుకాస్ భారీ చోరీ అతడి పనిగా నిర్ధారించిన పోలీసులు 2006 మే 18 అర్ధరాత్రి బరివోలిలోని ఓ బార్పై దాడి చేశారు. అక్కడ రాంబోలీ సింగ్తో పాటు చోరీ సొత్తు కొనుగోలుకు వచ్చిన సూరత్ వజ్రాల వ్యాపారి అజయ్ షా పట్టుబడ్డారు. వీరి నుంచి రూ. 6 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను రికవరీ చేశారు. రాంబోలీ సింగ్కు సహకరించిన శ్రీకాంత్ సింగ్ను కొన్ని రోజుల తరవాత అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు 2011లో శిక్ష విధించింది. 1982 నుంచి నేరాలు చేస్తున్న వినోద్ రాంబోలీ సింగ్ కదలికలు అలుకాస్ నేరం తర్వాత హైదరాబాద్లో కనిపించలేదు. 2017లో థానేలోని అంబర్నాథ్లో ఉన్న జ్యూలరీ షాపు నుంచి రూ.1.7 కోట్ల నగలు, 2022లో దాదర్లో ఉన్న పీడీ పెడ్నేకర్ జ్యూలరీ షాపు నుంచి రూ.1.24 కోట్ల విలువైన నగలు చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. అంబర్నాథ్ చోరీ తన ‘వృత్తి’లో భాగంగానే చేసినా, పీడీ పెడ్నేకర్లో మాత్రం ప్రతీకారంతో చేశాడు. 2022 జూలైలో ఆ దుకాణానికి వెళ్లిన రాంబోలీ సింగ్ కొంత బంగారం ఖరీదు చేశాడు. కేవలం రూ.2 వేల డిస్కౌంట్ విషయంలో దాని యజమాని సోనాలీ ముడ్కేఖర్తో వాగ్వాదం జరిగింది. తనకు రాయితీ ఇవ్వని ఆ దుకాణంపై కక్షకట్టిన రాంబోలీ సింగ్ మరో అనుచరుడితో కలిసి ఆ ఏడాది ఆగస్టు 24న ఈ చోరీ చేశాడు. -
మా అమ్మే నా శత్రువు
ఆ టెలిగ్రామ్ చూడగానే రామ్ సదై బాబులో ఆందోళన మొదలైంది. గబుక్కున స్టూలుమీద నుంచి లేచి, ‘‘ఈ ఉద్యోగం మానేయాలి. నా వల్ల కాదు’’ అనుకుంటూ భార్య ఉన్న గదిలోకి ప్రవేశించాడు.ఆమె గర్భవతి. మంచం మీద విశ్రాంతి తీసుకుంటోంది. భర్త చేతిలో టెలిగ్రామ్ చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. ‘‘ఇంతకీ ఏమైంది?’’ భర్తను ఆత్రంగా అడిగింది.‘‘నా సెలవుకు అనుమతి లభించలేదు’’ నిస్పృహగా అన్నాడు రామ్ సదై. ‘‘నీ పరిస్థితి గురించి అంతా పూసగుచ్చినట్టు వివరించాను. వాళ్లకు కనీసం కనికరం కలగలేదు. రేపు మధ్యాహ్నం నేను బయలుదేరాలి’’ అని ఒక నిముషం ఆగి మళ్లీ చెప్పాడు. ‘‘ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్న పొలాన్ని సాగు చేసుకోవటం మంచిదనిపిస్తోంది’’.శశిముఖి మధ్యలోనే అందుకుంది. ‘‘మనిద్దరమే అయితే మీకు ఉద్యోగం ఉన్నా, లేకపోయినా ఫరవాలేదు. కానీ ఇప్పుడు..’’ అర్ధోక్తితో ఆగిపోయింది.ఆమె పూర్తిగా చెప్పవలసిన పనేం లేదు. తమ ఆర్థిక పరిస్థితి గురించి రామ్ సదైకి పూర్తి అవగాహన ఉంది. అందుకే వెంటనే స్పృహలోకి వచ్చి, కోపాన్ని అదుపు చేసుకున్నాడు. తర్వాత కోర్టు పని మీద బయటకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత భార్య అడిగింది. ‘‘ఇంతకీ మీరేం నిర్ణయించుకున్నారు?’’. ‘‘నేనేం చేయాలో నువ్వే చెప్పు?’’ అన్నాడు రామ్ సదై. ‘‘ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలేసి నేను ఎలా వెనక్కి తిరిగి వెళ్లేది? ఒకవేళ తీసికెళదామనుకున్నా అది దగ్గరా దాపూ కాదు. డాక్టర్లు నిన్ను ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. పోనీ మనకు తెలిసిన వాళ్లను సాయం చేయమని అడుగుదామా?’’‘‘హాస్పిటల్లో పనిచేసే మంత్రసానిని రోజూ రమ్మనమని చెబుతాను. అవసరమైతే తను నీతోనే ఉంటుంది. ఎలాగూ ఏడెనిమిది రోజుల్లో మథుర్ కాకా వచ్చేస్తారు. ఈలోపు నీకు ఇబ్బంది ఉండదు..’’.అతని మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ.. ‘‘నయన్ దీదీని రమ్మని పిలవకూడదూ.. ఇక్కడికి దగ్గరేగా. తనొచ్చి నాకు తోడుగా ఉంటుంది’’ అంది శశి. ‘‘నువ్వు భలే చెప్పావు. నీకు సాయం చేయటానికి ఎవరెవరిని పిలవాలా అని సతమతమవుతున్నాను. నాకెందుకు నయన్ పేరు తట్టలేదో? ఈ మధ్య నా బుర్ర పనిచేయటంలేదు’’తలకొట్టుకుంటూ అన్నాడు రామ్ సదై.నయనతార భర్త హరిపాద గంగూలీ. దర్భంగాలో రైల్వేలో పనిచేస్తున్నాడు. తనకి వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకు రావటానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యనే వాళ్లకు ఒక బాబు పుట్టాడు.రామ్ సదై తన భార్య పరిస్థితిని పూర్తిగా వివరించి నయనతారను వెంటనే బయలుదేరి రావలసిందిగా లేఖ రాశాడు. ఆమె ఖర్చులకు డబ్బులు కూడా పంపాడు. ఆమె శశిముఖికి దూరపు చుట్టం. వరసకు అక్క అవుతుంది. ఓ వైపు డబ్బుకు కటకటలాడటం, మరో వైపు తన కంటే డబ్బు ఉన్న చెల్లెలి కుటుంబానికి సాయపడితే కొంతయినా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో వెనకా ముందు ఆలోచించకుండా ముజారఫ్పూర్ బయలుదేరింది నయన.రామ్ సదై వెళ్లే రైలులోనే ఆమె దిగింది. తల మీద నుంచి మోకాళ్ల వరకూ షాల్ కప్పుకుని పసిపిల్లవాడిని చేతిలో ఉంచుకున్న నయనతారను చూడగానే అతనికి సంతోషం కలిగింది. ‘‘నువ్వొచ్చావు. నాకు కొంచెం ఆందోళన తగ్గింది. ఇద్దరు ఆడవాళ్లను ఒంటరిగా వదిలేసి వెళుతున్నందుకు దిగులుగానే ఉంది. ఏం చేయను తప్పటం లేదు. కాకా త్వరలోనే వచ్చేస్తాడు. ఈలోపు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నాను’’ అని జాగ్రత్తలు చెప్పాడు. ఆ తర్వాత తన దగ్గర పనిచేసేవాడిని పిలిచి ఆమెకి వాహనం సిద్ధం చేయమని చెప్పి రైలెక్కేశాడు. ఆ మర్నాడే శశిముఖికి ప్రసవం అయ్యింది. మరి కాసేపటికే ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. నయనతారకి ఆమెను ఎలా ఊరడించాలో అర్థం కాలేదు.తన పరిస్థితి అర్థం చేసుకున్న శశిముఖి ‘‘అక్కా, ఖోకాను ఒక్కసారి నాకు చూపిస్తావా? అనడిగింది.వెంటనే నయనతార పసిబిడ్డను తీసుకొచ్చి ఆమె పక్కలో ఉంచింది. ‘‘దీదీ.. నాకు ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాను. నీ బిడ్డ మాదిరిగానే వాడిని సాకుతానని మాటివ్వు’’. అంది శశిముఖి. ‘‘వీడొకటి.. నా బిడ్డకొకటి వేర్వేరు కాదు. ఇద్దరూ నాకు సమానమే.. పైగా ఇప్పడు ఈ మాటలన్నీ ఎందుకు? నీకేం కాదు. నువ్వు బాగానే ఉంటావు. భయపడకు. ఒకవేళ భగవంతుడు అలా రాసిపెట్టి ఉండి ఏదయినా అనుకోనిది జరిగితే, మీ అబ్బాయికి తల్లి లేని లోటు ఉండదు.’’ ధైర్యం చెప్పింది నయన.కానీ అర్ధరాత్రి గడిచేసరికి శశిముఖి ప్రాణాలు విడిచింది. రామ్ సదై బాబుకు రెండు టెలిగ్రామ్లు వెంట వెంటనే అందాయి. తన భార్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదనే సమాచారంతో ఒకటి, హఠాత్తుగా ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిందన్న విషాదకర వార్తతో మరొకటి. అంతగా వెలుతురు లేని గదిలో ఉంది నయన. శశిముఖికి పరిచయం ఉన్న వాళ్లెవరో పరామర్శకని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో తన బిడ్డను మంచం మీద పడుకోబెట్టి శశిముఖి బిడ్డకు పాలిస్తోంది నయన. అదే మంచం మీద వచ్చిన అతిథులను సర్దుకుని కూర్చోమని చెప్పింది. లాంతరు ఒత్తిని కొంచెం పెద్దది చేసింది. గదిలో కొంచెం వెలుతురు ఎక్కువయ్యింది.అక్కడికొచ్చిన వినోద్ బాబు భార్య.. ‘‘ఈ పిల్లవాడు దీదీ బిడ్డ అన్న మాట. అచ్చం అమ్మలాగా ఎంత అందంగా ఉన్నాడు. కనీసం అమ్మను చూసుకోలేకపోయాడు పాపం’’ అంది. అంతలోనే ఆమె పక్కన కూర్చున్న మరో ఆమె అందుకుంది. ‘‘వాడి మొహం చూడు. అచ్చు వాళ్లమ్మలా మిసమిసా మెరిసిపోతుంది. తను ఎంత మంచిది! ఆరోగ్యం సరిగ్గా లేదని మాకు ముందే చెప్పి ఉంటే ఎలాగోలా కాపాడుకునేవాళ్లంగా ’’ ఇలా చెప్పుకుపోతోంది.ఆ బిడ్డ శశిముఖి సంతానం కాదని, తన బిడ్డ అని చెప్పబోయి నయనతార ఆగిపోయింది. ఇద్దరు పిల్లల్లో ఎవరు ఎవరి బిడ్డ అని తేల్చి చెప్పటం ఇతరులకు చిక్కు సమస్యే! నల్లగా బలహీనంగా ఉన్న బిడ్డను నయనతార బిడ్డగానూ, అప్పుడే పుట్టిన వాడికంటే బాగా పుష్టిగా ఉన్న నయనతార బిడ్డను శశి బిడ్డగానూ వాళ్లు భావించారు. అందరూ వెళ్లిపోయాక తీరిగ్గా చాలాసేపు ఆలోచించింది నయన. అసలు చిక్కుముడిని విడతీయకపోతే పోయేది ఏం ఉంది అన్న ఆలోచన చేసింది. తన బిడ్డకు తల్లి లేని లోటు లేకుండా చేస్తానని శశిముఖికి మాటిచ్చాను. దానిని కాపాడుకోవచ్చు.అలాగే మరో వైపు డిప్యూటీ బాబు సంపదతో తన బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు. దానికి అడ్డుకోవటం ఎందుకు? తల్లి లేని బిడ్డకు తల్లినవుతున్నాను కదా..? అని తనను తాను సమాధానపరుచుకుంది. శశిముఖి వార్త తెలియగానే పదిరోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు రామ్ సదై. ఆమె మరణించిందన్న వాస్తవాన్ని జీర్ణించుకో లేకపోయాడు. ఆమె ఉన్నదనే భావనతోనే ఇంట్లో కలియతిరుగుతున్నాడు. డాబా మీద, వంటింట్లో, స్నానాల గదిలో ఇలా ఆమె కోసం వెతుక్కుంటున్నాడు. గుండె బద్దలై పిచ్చివాడిలా వ్యవహరిస్తున్నాడు.ఇదంతా చూసి కదిలిపోయినట్టుగా నటించింది నయనతార. రాని కన్నీళ్లను తుడుచుకుంటూ.. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. ఆమె ఇక తిరిగి రాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకో. లోపలికి వచ్చి కాస్త ఎంగిలిపడి ఆ తర్వాత విశ్రాంతి తీసుకో’’ అంది.ఆమెను చూడగానే స్పృహలోకొచ్చాడు. ఆమె చెప్పినట్టే స్నానం చేసి, భోజనం చేసి ఆ తర్వాత వాలు కుర్చీలో కూర్చున్నాడు. పనివాడు అందించిన హుక్కాను పీలుస్తూ ఆలోచనల్లోకి జారుకున్నాడు. నయన్ చేతిలో పసిపిల్లవాడితో అక్కడకి వచ్చింది. ‘‘పిల్లవాడు కాస్త సన్నగా ఉన్నాడు. కానీ మీ ఇద్దరికి బాగా పోలికలున్నాయి’’ అని చెప్పి పిల్లవాడిని అతని పొత్తిళ్లలో ఉంచబోయింది.రామ్ సదైకి వాడిని చూడాలనిపించలేదు. ‘‘తల్లిని మింగేసిన రాక్షసుడు’’ అన్నాడు పరుషంగా. ‘‘నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ వాడిని వదిలేస్తే..’’రామ్ సదై ఆ చిన్నారిని సరిగా ఒడిలో పడుకోబెట్టుకోలేదు. దాంతో అసౌకర్యంగా అనిపించి ఆ పిల్లవాడు ఏడుపు అందుకున్నాడు. ‘‘ఏమిటో ఈ పిల్లాడు.. పెద్దమ్మ అయిన నా దగ్గరకి తప్ప ఎవరి దగ్గరకీ వెళ్లడు’’ అంటూ నయన ఆ పిల్లవాడిని తీసుకుని భుజం మీద వేసుకుంది. ఆ తర్వాత చెల్లెలి భర్తతో భవిష్యత్తు గురించి చర్చించటం మొదలుపెట్టింది.‘‘నువ్వొచ్చేశావ్ కదా? నేను మా ఊరు బయలుదేరతాను. నేను సర్దుకోవలసిన చాలా ఉన్నాయి’’ అంది. ‘‘వద్దొద్దు ఆ పని మాత్రం చేయొద్దు. ఈ పిల్లవాడిని నేను పెంచి పెద్ద చేయలేను. ఉద్యోగంలో టూర్లు చేస్తూ వీడిని చూసుకోవటం కాని పని. నువ్విక్కడే ఉండు. మీ ఆయనకు కూడా ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూస్తాను’’ అన్నాడు. అది చాలా భారమైన పని అన్నట్టు ప్రవర్తించింది నయనతార. ‘‘ఇతరుల పిల్లలను సొంత పిల్లల్లా పెంచటం కష్టం. అదీగాక సమాజం కూడా ఏదో ఒక తప్పు ఎంచుతూ ఉంటుంది. కానీ నీ ఇబ్బందిని చూసిన తర్వాత కాదనాలనిపించటం లేదు. నాకు శక్తికి మించిన పనే అయినా చేస్తాను’’ అంటూ రామ్ సదై కి తన పట్ల సానుభూతి కలిగేలా జీవితాంతం అతను తన మీద కృతజ్ఞత చూపేలా మాట్లాడింది. ‘‘శశిముఖి బిడ్డను తన బిడ్డలా సాకుతోంది. అంతే కాదు. తనకు కూడా ఓ పసిబిడ్డ ఉన్నాడన్న స్పృహనే ఆమెకు లేదు’’.చాలామంది నయనతార గురించి గొప్పగా చెప్పటం ప్రారంభించారు. రామ్ సదైలో కూడా ఇదే అభిప్రాయం ఏర్పడింది. తన బిడ్డకు లోటు లేకుండా చూస్తున్న ఆమె సాధారణ వ్యక్తి కాదు అనుకునేవాడు. గుండ్రంటి అందమైన తన పిల్లవాడిని అతని బిడ్డగా చెప్పేది. అది అతనూ నిజమేనని భావించేవాడు. రామ్ సదై టూర్కి వెళ్లి వచ్చినప్పుడల్లా ఇద్దరు పిల్లలకు కొత్త బట్టలు కొని తెచ్చేవాడు.తన బిడ్డగా ఆమె చెప్పుకుంటున్న పిల్లవాడికి కొత్త బట్టలు ఇచ్చినప్పుడు, ‘‘వాడికి ఇదంతా అలవాటు చేయకు. వాడు పేద ఇంటి పిల్లాడు. అలాగే పెరగనివ్వు. లేకపోతే వాడు పరిస్థితులకు సర్దుకోవటం కష్టం’’ అని వారించేది. దాంతో నయన తారపైన రామ్ సదైకి మరింత అభిమానంపెరిగింది. ఎంత ఆత్మగౌరవం ఉన్న మనిషి అనుకుని ముచ్చటపడేవాడు. దాంతో మరింత ఎక్కువగా అతనికి బహుమతులు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ రకంగా డిప్యూటీ బాబు కుమారుడు జతిన్, నయనతార కుమారుడు ఉపేన్లు స్థానాలు మార్చుకుని భిన్నమైన పాత్రల్లో పెరగటం మొదలుపెట్టారు. ప్రతిరోజూ పాఠాలు చెప్పటానికి ట్యూటర్ ఇంటికి వచ్చేవాడు. జతిన్ చిన్నతనంలోనే ఓ విషయం గ్రహించాడు. తను పేదింటి బిడ్డ కావటంతో ప్రపంచం పెద్దగా తన పట్ల ఆసక్తిని చూపదు అని సరిపెట్టుకున్నాడు. స్కూలులో అతను ఎంతగా ప్రయత్నించినా కూడా ప్రధానోపాధ్యాయుల ప్రశంసలన్నీ ఉపేన్ వైపే ఉండేవి. జతిన్ ప్రయత్నాలను, తెలివితేటలను గుర్తించి ట్యూటర్ అతనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ప్రారంభించాడు. ఉపేన్ ఒక క్లాసులో తప్పితే అతన్ని అదే క్లాసులో ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ నయనతార పోరాడి అతను పై తరగతిలో అడుగుపెట్టేలా చేయగలిగింది. దాని వల్ల అతనికి బహుమతులు లభించాయి. జితిన్ ఇలాంటి అడ్డదారులను నమ్ముకోలేదు.తల్లి ప్రేమకు నోచుకోకుండానే పెరిగి పెద్దవాడయ్యాడు జతిన్. కానీ సరస్వతీదేవి అనుగ్రహం మాత్రం అతనికి పుష్కలంగా ఉండేది. దాంతో అతనికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అతని సొంతమయ్యాయి. అతనికి ఫీజులు చెల్లించటం మానేయమని, ఏదయినా చిన్న ఉద్యోగంలో అతన్ని చేర్చమని నయనతార అప్పుడప్పుడు రామ్ సదైతో అనేది. అతను ఈ మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దాంతో జతిన్ను పిలిచి మందలించింది. ‘‘ఇంకోళ్ల డబ్బుతో చదువుకోవటానికి సిగ్గులేదా నీకు. ఇప్పటికి చదివింది చాలు. రామ్ సదై మంచివాడు కాబట్టి ఇంతకాలం నిన్ను బాగా చూసుకున్నాడు. ఇంకొకళ్లయితే నిన్ను వీధిలోకి విసిరేవాళ్లు’’.తల్లి మాటలకు బాగా నొచ్చుకున్న జతిన్– రామ్ సదైని కలిశాడు. తాను కోల్కత్తా వెళుతున్నానని, స్కాలర్ షిప్పు డబ్బులతో చదువుకుంటానని చెప్పాడు. ‘‘ఏమైంది. ఇక్కడ ఏదయినా ఇబ్బంది అనిపిస్తోందా?’’ అడిగాడు రామ్ సదై.‘‘అదేం లేదు. పై చదువులు చదువుకోవటానికి కోల్కత్తా అనుకూలంగా ఉంటుందని..’’ జవాబు చెప్పాడు జతిన్.ఆ తర్వాత కోల్కత్తా వెళ్లి అక్కడ ఒక మెస్సులో ఉన్నాడు. ఎవరి నుంచి పైసా సాయం ఆశించకుండా తన సొంత డబ్బుతో కష్టపడి చదువుకున్నాడు. ముందు బీఏ డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత లాయర్ అయ్యాడు.ఉపేన్ అతనికి దరిదాపుల్లో లేడు. చదువులోగానీ, పేరు ప్రఖ్యాతుల్లో గానీ.కానీ అతని పెద్దమ్మగా నయనతార అన్ని విషయాల్లో అతన్ని పొగుడుతూండేది. ఇది ఇంకెంత కాలం కొనసాగేదో గానీ, ఇంతలోనే అనుకోని పరిణామం సంభవించింది.హఠాత్తుగా కలరా వ్యాపించటంతో పనిచేస్తున్న చోటే మృత్యువు పాలయ్యాడు రామ్ సదై. ∙∙ ‘‘ఉపేన్, మనకి ఏమవుతుంది? మీ నాన్న వదిలేసిన దాన్ని ఎలా మేనేజ్ చేస్తావో కూడా తెలియటం లేదు’’ నయనతార ఆందోళనగా అంది.‘‘ఫరవాలేదు పెద్దమ్మా.. మనం ఉన్నదానితో సర్దుకోగలం’’ జవాబిచ్చాడు ఉపేన్.‘‘అది వీలుకాని పని. మనకు అప్పు ఇచ్చే వాళ్లు కూడా కనిపించటం లేదు’’ దీనంగా చెప్పింది నయన.‘‘ఒకసారి తాతగారిని కలుద్దాం. ఆయన మనకు ఏమైనా సలహా ఇస్తారు’’ అన్నాడు ఉపేన్.ఈ సమయానికి జతిన్ లాయర్గా దర్భంగాలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. సంపాదన బాగా పెరిగింది. ఉపేన్ని తన సొంత తమ్ముడిలా ప్రేమించేవాడు. వాళ్ల పరిస్థితి తెలిసిన తర్వాత అప్పులన్నీ తీర్చేశాడు. అంతే కాదు. వాళ్లను తనతో వచ్చెయ్యమని కోరాడు.జతిన్ ఆస్తిపాస్తులన్నీ చూసిన తర్వాత నయనతార అసూయ కలిగింది. మాటల్లో వర్ణించలేనంత పశ్చాత్తాపానికి లోనయ్యింది. పిల్లలను అటూ ఇటూ మార్చటం వల్ల తాను సాధించింది ఏమీ లేదని గుర్తించింది. కనీసం తనే అతని తల్లిని అనే మాటను కూడా జతిన్కు చెప్పుకోలేని స్థితిలో ఉన్నందుకు చింతించింది. ఉపేన్కు చెడ్డ స్నేహితులు ఎక్కువయ్యారు. ఎక్కువ సమయం వాళ్లతో గడుపుతూ జులాయిగా తిరిగేవాడు. ‘‘నీకోసం మంచి ఉద్యోగం చూశాను. అందులో చేరావంటే అంతా సక్రమంగా సాగుతుంది. నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది’’ అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు జతిన్.ఉపేన్కి ఈ సలహా నచ్చలేదు. నయనతార చాలా రోజులుగా అతనికి బ్రెయిన్ వాష్ చేస్తోంది. జతిన్ తమకు రుణపడ్డాడని. ఉపేన్ అతన్ని ఏమైనా అని సాధించవచ్చని సలహా ఇచ్చింది. ‘‘నువ్వు నన్ను వదుల్చుకోవాలనుకుంటున్నావా?’’ అడిగాడు ఉపేన్.ఈ మాటలకు జతిన్ మనసు గాయపడింది. ‘‘ఇంకెప్పుడూ నిన్ను పనిచేయమని నేను అడగను’’ అని అక్కడ నుంచి చకచకా కదిలి వెళ్లిపోయాడు. హరిపాద, అతని భార్య తీవ్రస్థాయిలో తగువు పడ్డారు. జతిన్కి అతను మంచి సంబంధం తెచ్చాడు. అమ్మాయి పేరు సరోజిని. ప్రభుత్వ ప్లీడరు కార్తీకబాబు కుమార్తె. అతను బాగా ఆస్తిపరుడు. జతిన్, సరోజినిల జంట బావుంటుందని, స్వర్గంలో కుదిరిన సంబంధం అని ఎంతగానో భావించాడు. అతను వంశచరిత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. నయనతార ఈ మాట వినగానే ఇంతెత్తున ఎగిరింది. ‘‘మన జీవితాలను తీర్చిదిద్దిన వ్యక్తిని ఆయన లేనంత మాత్రాన మరచిపోతామా? పాపం ఆయన బిడ్డను అలాగే వదిలేస్తామా? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా ఎప్పటికీ జరగనివ్వను. మీరు ఆ అమ్మాయిని ఉపేన్కి ఇచ్చి వివాహం చేయండి. లేకపోతే నేను ఉరిపోసుకుని చస్తా’’ అని హెచ్చరించింది.భార్య ప్రవర్తనతో కంగుతిన్నాడు హరిపాద. ఆమెతో వాదించి ప్రయోజనం లేదనిపించి అక్కడ నుంచి మాయమయ్యాడు.ఎలాగయినా ఈ పెళ్లిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్న నయన ముందుగా జతిన్కి కబురు పెట్టింది. ఉపేన్కి అతను ఎలా రుణపడ్డాడో చెప్పుకొచ్చింది.అతను అనుభవిస్తున్న సంపద అంతా రామ్ సదై బాబు దయ వల్లనే సాధ్యపడిందని, వాళ్లిద్దరి రుణం తీర్చుకునే సందర్భం వచ్చిందని వివరించింది. ‘‘ఇప్పుడు అంత దుర్మార్గంగా ఎలా వ్యవహరించగలుగుతున్నావ్’’ అని నిలదీసింది. ‘‘అమ్మా, ఈ పెళ్లి సంబంధం కుదిర్చింది నాన్న కదా? ఆయనతోనే నువ్వు మాట్లాడు’’ అని జతిన్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లిపోయాడు.దాంతో నయనతారకు మరే ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఉపేన్ను కలుసుకుని, ‘‘బాబూ, నీతో మాట్లాడాలి’’ అంది.‘‘జతిన్ పెళ్లి గురించి నువ్వు వినే ఉంటావు. నువ్వేం కంగారు పడకు. కిందా మీదా పడయినా సరే, అదే అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తా’’ అని ప్రకటించింది. దాంతో కంగుతిన్నాడతను.‘‘పెద్దమ్మా? ఏమిటి నువ్వు అంటున్నది?’’ గట్టిగా అరిచాడు. ‘‘పూర్వీకులు, వంశ చరిత్ర, సామాజిక స్థితి అన్నింటిని పరిశీలించారు. వాళ్లిద్దరి జాతకాలు కుదిరాయి. ముహూర్తం నిశ్చయించారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు తన కూతురిని తమ్ముడికి కాకుండా నాలాంటి మూర్ఖుడికివ్వటానికి సిద్ధపడే వాళ్లు ఎవరు ఉంటారు చెప్పు’’ అనడిగాడు. ‘‘నువ్వు ఏ వంశచరిత్ర, పూర్వీకుల గురించి మాట్లాడేది?’’ ఎన్నో సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని బట్టబయలు చేయటానికి సిద్ధమవుతూ అంది నయన. ‘‘నువ్వు గొప్పగా చెప్పే వంశవృక్షాన్ని జతిన్ నీ దగ్గర నుంచి గుంజుకున్నాడు. ఇప్పుడు నేను ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తే జతిన్ పెళ్లి ఎలా అవుతుందో చూస్తాను’’ సవాల్ చేస్తున్నట్టుగా అంది.ఉపేన్ మళ్లీ అరిచాడు. ‘‘నీకేమయినా పిచ్చి పట్టిందా? తను నా వంశచరిత్రను ఎలా గుంజుకోగలుగుతాడు?’’ అన్నాడు.‘‘పిచ్చోడా? నీ వంశచరిత్రకు నువ్వు విలువ ఇవ్వాలి. వంశచరిత్ర ముందు సంపద, సామాజిక స్థాయి ఎందుకూ కొరగావు అనేది నేను అనుకుంటే, నా కొడుకుని ఇంకొకరితో మార్చే దానినా?’’ఉపేన్ మంచం మీద ఎగిరి దూకాడు. ‘‘పెద్దమ్మా..?’’‘‘ఇంకా పెద్దమ్మా ఏమిటి? అమ్మా అని పిలువు. నువ్వెప్పుడూ నన్ను నువ్వు అలా పిలవలేదు. నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. నేను నీ కోసం ఎంతో చేశాను. చివరికి దీని వల్ల నాకేం మిగిలింది? ఇప్పుడు నేను అందరికీ చెబుతాను. పుట్టినప్పుడు మీ ఇద్దరిని నేను ఎలా మార్చానో? ఈ రోజు వాడికి రెండు డిగ్రీలు ఉన్నందుకు అహంకారం, తలపొగరు నెత్తికెక్కి హద్దులు లేకుండా వ్యవహరిస్తున్నాడు. వంశచరిత్ర.. దాన్ని ఇప్పడే నాశనం చేస్తా. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి దొరికేలా లేదు’’ అంది గట్టిగా నిట్టూర్పు విడుస్తూ. ‘‘నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను నేను చంపేస్తా’’ ఉగ్రుడయ్యాడు ఉపేన్..ఆ రోజు మధ్యాహ్నం భోజనాల సమయంలో అతని జాడ కనిపించలేదు. అలా అప్పుడప్పుడు అతను మాయం కావటం మామూలే. అందుకే ఎవరూ అంతగా పట్టించుకోలేదు.సాయంత్రం జతిన్కి అతని పేరుతో ఓ టెలిగ్రామ్ వచ్చింది. ‘‘దాదా, నేను రంగూన్ వెళ్లిపోతున్నాను. మీరంతా సుఖసంతోషాలతో జీవించాలి. అదే నేను మీ నుంచి కోరుకుంటాను. ఇకపోతే నేను చేసిన తప్పులను నువ్వు క్షమిస్తావనే అనుకుంటున్నాను. ఉంటున్నాను– ఉపేన్’’ అని ఉంది అందులో. బెంగాలీ మూలం: మాధురీలతా దేవి అనువాదం: డాక్టర్ పార్థసారథి చిరువోలు -
హిమకరం... హితకరం
స్పీకింగ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, హైడ్రోథెరపీ, ఫిజియోథెరపీ, రేడియోథెరపీ, ఫార్మాథెరపీ ఇలా చికిత్స విధానాల పేరు ఏదైనా సమస్య మాత్రం ఒకటే ‘అనారోగ్యం’. నిజానికి ఈ రకమైన థెరపీలు లెక్కకు మించినవి. శారీరక రోగాలకే కాక, మానసిక ఆరోగ్యం కోసం ఉద్దేశించిన సైకోథెరపీ, ఆహార నియమాలతో మెరుగుపరచే డైటరీథెరపీ, రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూనోథెరపీ వంటివి ఎన్నో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేదంలో అయినా, ఆధునిక వైద్యంలో అయినా– కాలాన్ని బట్టి, వ్యాధి స్వభావాన్ని బట్టి చికిత్స విధానాలు మారుతూ, మెరుగుపడుతూ వస్తున్నాయి. నిరంతరం సాగే ప్రయోగాల్లో పరిశోధనల్లో, ఆధునిక విజ్ఞానం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అన్వేషించిన వాటిని మరింతగా విశ్లేషించి అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో, వైద్య ప్రపంచాన్ని అబ్బురపరచిన సరికొత్త థెరపీనే, క్రయోథెరపీ! ప్రస్తుతం డెర్మటాలజిస్ట్లు, ఫిజియోథెరపిస్ట్లు, సర్జన్లు ఇలా చాలామంది మెడికల్ స్పెషలిస్ట్ల నోట వినిపిస్తున్న వైద్య పద్ధతి క్రయోథెరపీనే!వారంతా ఈ నాన్–ఇన్వేసివ్ (శరీరానికి కత్తి కోతలు, సూది పోట్లు లేని) చికిత్స విధానానికే ఓటేస్తున్నారు.క్రయో అంటే గ్రీకు భాషలో చల్లని లేదా గడ్డకట్టిన మంచు అని అర్థం. చల్లదనంతో చేసే చికిత్స కాబట్టి దీనికి క్రయోథెరపీ అని పేరొచ్చింది. ఇది– ప్రస్తుతం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం ఉన్న ఒక ఆధునిక చికిత్స విధానం! మొత్తం శరీరానికి లేదా సమస్య ఉన్న శరీరభాగాలకు అతి శీతల ఉష్ణోగ్రతలను అందించి, చికిత్స చేయడమే ఈ క్రయోథెరపీ పద్ధతి. ఈ చికిత్సతో క్యాన్సర్ వంటి కొన్నిరకాల అసాధారణ కణజాలాలను నాశనం చేయొచ్చు. నైట్రోజన్ లిక్విడ్ లేదా ఆర్గాన్ గ్యాస్ వంటి పదార్థాలను ఉపయోగించి ప్రమాదకరంగా మారిన కణాలను తొలగించడానికి కావలసిన తీవ్రమైన చలిని పొడిగాలుల రూపంలో ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఇది వెల్నెస్ ట్రీట్మెంట్లలో వినూత్న పద్ధతిగా ప్రాచుర్యం పొందుతోంది. ఒకప్పుడు కేవలం క్రీడాకారులకు మాత్రమే పరిమితమైన ఈ హిమ చికిత్స ఇప్పుడు పలు ఆరోగ్య సమస్యల నివారణకు, మానసిక ఉల్లాసానికి, సౌందర్య చికిత్సలకు ఉపయోగపడుతోంది. దీనిలో ప్రధానంగా రెండు రకాల చికిత్స విధానాలు ఉన్నాయి. మొదటిది ‘లోకల్ లేదా ఫోకల్ క్రయోథెరపీ’. ఇది శరీరంలోని ఒక నిర్దిష్ట భాగంలో ఉన్న అసాధారణ లేదా ప్రమాదకరమైన కణజాలాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. దీనిని క్రయో అబ్లేషన్ లేదా క్రయో సర్జరీ అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు, క్యాన్సర్ కణాలు, పులిపిర్లు లేదా ఇతర చర్మ గాయాలను సరి చేయడం వంటివి ఈ చికిత్సలోకే వస్తాయి.రెండవది ‘హోల్ అండ్ బాడీ క్రయోథెరపీ’. ఈ ట్రీట్మెంట్లో కొన్ని నిమిషాల పాటు క్రయోచాంబర్ అనే ప్రత్యేక గదిలాంటి అతిశీతల పేటికలో ఉంచుతారు. అది కూడా 2 నుంచి 4 నిమిషాల పాటు మాత్రమే చికిత్స ఉంటుంది. ఆ గది చాలా చల్లగా ఉంటుంది. క్రయోథెరపీలో భాగంగా, శరీరంలోని రక్తనాళాలు అతి శీతల వాతావరణంలో (సుమారు మైనస్ 110 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 140 డిగ్రీల సెల్సియస్ వరకు) సంకోచించి, చికిత్స అవసరమైన అవయవాలకు రక్తప్రసరణను పెంచుతాయి. చికిత్స అనంతరం బయటకు రాగానే – ఆక్సిజన్, పోషకాలు సమృద్ధిగా ఉన్న తాజా రక్తం కండరాలకు, చర్మానికి వేగంగా చేరుతుంది. ఈ ప్రక్రియ వాపును తగ్గిస్తుంది, కండరాల రికవరీలో వేగం కనిపిస్తోంది. నిజానికి అంత మైనెస్ డిగ్రీల చలంటే తలచుకుంటేనే వణుకు పుడుతుంది కదా అనే అనుమానం రావచ్చు. అయితే ‘తడి చలిలో ఉండలేం కానీ పొడిగా ఉండే చలిగాలిలో శరీరం కొద్దిసేపు ఉండగలదు’ అని చెబుతున్నారు క్రయోథెరపీ నిపుణులు.ఈ చికిత్సతో ఓపెన్ సర్జరీ లేకుండానే వ్యాధిగ్రస్థ కణజాలాన్ని తొలగించొచ్చు. దాంతో చాలామంది త్వరగా, తక్కువ నొప్పితో కోలుకుంటారు. పులిపిర్లు, మచ్చలు, ప్రోస్టేట్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కిడ్స్ రెటినోబ్లాస్టోమా (కంటి క్యాన్సర్), ఎముకల క్యాన్సర్ ఇలా చాలా రకాల సమస్యలను, వ్యాధులను ఈ ట్రీట్మెంట్తో నయం చేయొచ్చు.ఈ హిమ చికిత్సకు పునాది ఎక్కడ?చికిత్స కోసం చల్లదనాన్ని ఉపయోగించే క్రయోథెరపీ ఇప్పటిది కాదు. ఈ పద్ధతి వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. నిజానికి క్రయోథెరపీ చరిత్ర పురాతన నాగరికతలతో ప్రారంభమైంది. ఈజిప్షియన్లు, గ్రీకులు, రోమన్లు అసాధారణ వాపులను తగ్గించడానికి, గాయాలకు చికిత్స చేయడానికి మంచుగడ్డను ఉపయోగించేవారు. ప్రసిద్ధ వైద్యుడు హిపోక్రాట్స్ సైతం గాయాలకు, వాపులకు చల్లదనాన్ని ఉపయోగించమని సిఫారసు చేశారట. చల్లని నీటిలో మునగడం, మంచు ముక్కల్లో కూర్చోవడం ఇవన్నీ నాటి మొదటి అడుగులే!1800ల నాటి వైద్యులు ‘ఐస్ బాత్’ను (మంచు స్నానాన్ని) వైద్య చికిత్సలో భాగం చేశారు. కండరాల నొప్పి, కీళ్ల నొప్పుల చికిత్సకు ఐస్ బాన్ క్లినిక్స్ అథ్లెటిక్ శిక్షణ కేంద్రాలలో సర్వసాధారణమయ్యాయి. అనంతరం వైద్యులు శస్త్రచికిత్సల సమయంలో కోల్డ్ ప్యాక్లను ఉపయోగించడం మొదలుపెట్టారు. 19వ శతాబ్దం మధ్యలో ఆధునిక క్రయోథెరపీకి పునాది వేసిన నాటి ప్రసిద్ధ వైద్యుడు జేమ్స్ ఆర్నాట్ను క్రయోథెరపీ పితామహుడు అంటారు. ఆయన నొప్పులు, కణితుల నివారణకు ఈ శీతల చికిత్సను ప్రారంభించిన మొదటి వ్యక్తి.20వ శతాబ్దం వచ్చేనాటికి క్రయోసర్జికల్ విధానంలో లిక్విడ్ నైట్రోజన్ను ఉపయోగించడంతో పరికరాల అభివృద్ధికి దారితీసింది. ఈ చికిత్స ప్రయోజనాలను ప్రాచీన ఈజిప్షియన్లు క్రీ.పూ. 2500 నాటికే గుర్తించారు.హిపోక్రాట్స్– క్రీ.పూ. 400 ప్రాంతంలో, నొప్పి నివారణ, వాపు కోసం మంచుగడ్డలు ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి.క్రయోథెరపీ చరిత్రలో కీలక మలుపు 1978లో వచ్చింది. జపాన్ కు చెందిన డా. తోషిమా యమగుచి– రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న రోగులకు చల్లటి గాలి చికిత్సలను ఉపయోగించడం ప్రారంభించారు. చల్లటి నీటిని ఉపయోగించకుండానే గాలిని వాడి– కీళ్ల నొప్పులు, వాపును త్వరగా తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయోగాలు మంచి ఫలితాలను సాధించడంతో క్రయోథెరపీ చాంబర్ ఆవిష్కరణకు దారి తీసింది. ఇందులో రోగులు తక్కువ సమయం పాటు అతి శీతల ప్రదేశంలో నిలబడతారు. ఇదే ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.భారతదేశంలో క్రయోథెరపీ అభివృద్ధి– భవిష్యత్తు!ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య స్పృహ పెరుగుతున్న తరుణంలో భారత్ కూడా క్రయోథెరపీవైపు బాగానే మొగ్గు చూపుతోంది. రానున్న రోజుల్లో హెల్త్ అండ్ వెల్నెస్లో ఈ చికిత్సకు ప్రాధాన్యం పెరుగుతోంది. భారత్లోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి వాటిలో అధునాతన వెల్నెస్ సెంటర్లు, క్రయోథెరపీ క్లినిక్లు పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో ఆరోగ్య స్పృహ ఉన్న ప్రజలు, కొత్త వెల్నెస్ థెరపీలను అన్వేషించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ధోరణికి క్రీడాకారులు, సెలబ్రిటీల మద్దతు కూడా తోడైంది. వారి సానుకూల అనుభవాలే ఇప్పుడు ప్రజల్లో క్రయోథెరపీపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుతున్నాయి.ప్రధాన ప్రయోజనాలుకండరాల నొప్పిని వేగంగా, పూర్తిగా తగ్గించడం, గాయాలను త్వరగా నయం చేయడం వంటి ఫలితాలతో– క్రీడాకారులలో, ఫిట్నెస్ ఔత్సాహికులలో ఈ చికిత్స బాగా ప్రాచుర్యం పొందింది.ఫైబ్రోమయాల్జియా, కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) వంటి దీర్ఘకాలిక సమస్యలకు ఉపశమనం అందించడానికి ఈ ట్రీట్మెంట్ సహాయపడుతుంది.డెర్మటాలజిస్టులు, కాస్మెటిక్ క్లినిక్లు ఈ థెరపీని యాంటీ–ఏజింగ్ లక్షణాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, వృద్ధాప్యం వల్ల శరీరంపై ఏర్పడే ముడతలను తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. ‘ఇన్ఫ్లమేజింగ్’ (వయసు పెరగడంతో వచ్చే దీర్ఘకాలిక వాపుల సమస్య)ను తగ్గించి, వృద్ధాప్య సంకేతాలను కాస్త దూరం చేయగలుగుతుంది. క్రయోథెరపీతో జీవక్రియ వేగం పెరుగుతుంది. ఇది బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుంది. కొవ్వును కరిగించే చికిత్సగా ఇది ఫిట్నెస్ మెయింటెనెన్స్లో భాగమవుతోంది.క్రయోథెరపీ ఎండార్ఫిన్ ల (ఫీల్–గుడ్ కెమికల్స్) విడుదలకు ఉపయోగపడుతుంది. దాంతో ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి లక్షణాలను తగ్గుతాయి.నగరాల్లో నివసించే ప్రజలు ఇలాంటి చికిత్సల కోసం ఖర్చు చేయడానికి ఎక్కువ ఆసక్తిగా ఉంటున్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇది క్రయోథెరపీకి పెద్ద మార్కెట్ను సూచిస్తుంది. అలాగే సోషల్ మీడియా, హెల్త్ బ్లాగులతో ఈ చికిత్స గురించి అవగాహన కూడా బాగానే పెరుగుతోంది.స్పోర్ట్స్–ఫిట్నెస్ల మీద అవగాహన, ఆసక్తి పెరుగుతున్న కొద్దీ ఈ థెరపీకి ప్రాధాన్యం పెరుగుతోంది. అథ్లెట్ల తమ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవడానికి, క్రీడా అకాడమీలు ఈ థెరపీని తమ శిక్షణ కార్యక్రమాలలో భాగం చేసుకుంటున్నాయి.ఫిజియోథెరపీ, కైరోప్రాక్టిక్, స్పాలు వంటి ఇతర వెల్నెస్ చికిత్సలతో క్రయోథెరపీని అనుసంధానం చేయడంతో భవిష్యత్తులో పూర్తి ఆరోగ్య ప్యాకేజీని కోరుకునే కస్టమర్లను ఆకర్షించవచ్చు.‘తక్కువ ధర, అధిక నాణ్యత’ అనే స్లోగన్తో భారత్ ఇప్పటికే చాలా వైద్య విధానాలతో విదేశీ రోగులను ఆకర్షిస్తోంది. క్రయోథెరపీని మెడికల్ టూరిజం ప్యాకేజీలలో చేర్చడంతో అంతర్జాతీయ రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.∙ఈ చికిత్సలో సాంకేతిక పురోగతులు వేగంగా వస్తున్నాయి. క్రయో పోర్టబుల్ యంత్రాలలో, మెరుగైన, సురక్షితమైన క్రయో చాంబర్లలో టెక్నాలజీ మరింత అప్డేట్ అవుతోంది.క్రయోథెరపీ మార్కెట్ ఎన్నుకునేవారికి సవాళ్లు–సూచనలుసామర్థ్యం ఉన్నప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో క్రయోథెరపీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. రానున్న రోజుల్లో ప్రపంచ వైద్యరంగాన్ని తనవైపు తిప్పుకోనున్న క్రయోథెరపీ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? పెట్టుబడిపరంగా, విద్యపరంగా ఈ రంగాన్ని ఎంచుకునేవారికి ఎలాంటి సూచనలు కనిపిస్తున్నాయి?ఆధునిక క్రయోథెరపీ యంత్రాల దిగుమతి, సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటోంది, ఇది కొత్త పారిశ్రామికవేత్తలకు అడ్డంకిగా మారుతుంది.సాధారణ ప్రజలు, వైద్య నిపుణులలో కూడా క్రయోథెరపీ ప్రయోజనాలు, భద్రత గురించి మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉంది.ఈ క్రయో చికిత్సలకు సంబంధించి – భారత్లో సంక్లిష్టమైన చట్టపరమైన నిబంధనలను పాటించడం కాస్త సవాలుగా మారుతుంది.ఈ సవాళ్లను అధిగమించడానికి, ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అవసరం. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాతో కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడం, అలాగే వ్యాయామశాలలు, వెల్నెస్ రిసార్ట్లతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం ఈ చికిత్సను ప్రజలకు చేరువ చేయగలవు. అంతేకాకుండా, ప్రారంభ ఖర్చులను తగ్గించడానికి తక్కువ–ధర కలిగిన నాణ్యమైన పరికరాలపై దృష్టి పెట్టాలన్నది ఒక సూచన.లాభనష్టాలు!ఈ చికిత్సతో ఏర్పడిన పుండు సాధారణంగా ఒకటి నుంచి మూడు వారాల్లో నయమవుతుంది. క్రయోసర్జరీ తర్వాత, కొద్ది రోజులు ఆ ప్రాంతంలో తేలికపాటి నొప్పి లేదా పుండ్లు ఉండొచ్చు. కొన్నిసార్లు, అసాధారణ కణజాలాన్ని పూర్తిగా తొలగించడానికి ఒకరికంటే ఎక్కువ క్రయోథెరపీలు అవసరం కావచ్చు. అయితే ఈ థెరపీతో నరాలు దెబ్బతినడం, స్పర్శ జ్ఞానం కోల్పోవడం వంటి సమస్యలతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్లు, ఎముకల పగుళ్లు (క్రయోసర్జరీ కారణంగా), గర్భాశయం చుట్టూ రక్తస్రావం లేదా తిమ్మిరి వంటివి తలెత్తొచ్చు. ఇవన్నీ అరుదుగా ఏర్పడే సమస్యలు మాత్రమే! చాలామంది క్రయోథెరపీ తీసుకున్న తర్వాత త్వరగా కోలుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం చాలామంది ఆర్థోపెడిక్స్ నుంచి ఆంకాలజీల వరకూ క్రయోథెరపీ గురించే చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిశోధనలు ఫలించగానే ప్రత్యేక శిక్షణలు తీసుకుంటారు. మార్కెట్లోకి వస్తున్న ప్రతి క్రయోటెక్నాలజీని నేర్చుకునేందుకు చొరవ చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ క్రయోథెరపీ– అన్ని వైద్య సేవలతో అన్ని అనారోగ్యాలకు తిరుగులేని చికిత్సగా మారితే ఈ ప్రపంచం వైద్యశాస్త్రంలో మరో మెట్టు ఎక్కినట్లే!భారతదేశంలో క్రయోథెరపీ భవిష్యత్తుపై భారీ అంచనాలు ఉన్నాయి. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ, స్పోర్ట్స్ మెడిసిన్ లో ఈ థెరపీ పాత్ర ఇలా– పలు కారణాలతో ఈ రంగంలో అభివృద్ధికి విస్తృతమైన అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా కండరాల రికవరీ, వాపును తగ్గించడం, బరువు తగ్గడం, చర్మ సంరక్షణ వంటి వివిధ పరిస్థితులకు క్రయోథెరపీని ఉపయోగించడంపై నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన పెరిగే కొద్దీ, భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో క్రయోథెరపీ తప్పకుండా ప్రత్యేక స్థానంలో నిలుస్తుందనేది ఒక అంచనా.గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థల నివేదిక ప్రకారం, భారతదేశంలో క్రయోథెరపీ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందుతుందని అంచనా. ఈ క్రయోథెరపీ మార్కెట్ 2024లో 3.6 మిలియన్ డాలర్ల (రూ.31.74 కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది. ఆ లెక్కన 2030 నాటికి 7.0 మిలియన్ డాలర్ల (రూ.61.72 కోట్లు) ఆదాయాన్ని చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2025 నుంచి 2030 వరకు 11.6% వార్షిక వృద్ధి రేటు ఉంటుందని లెక్కలేస్తున్నారు.ప్రపంచంలో క్రయోథెరపీ మార్కెట్పై సర్వేప్రపంచవాప్తంగా ప్రముఖ క్రయోథెరపీ సంస్థలు– డెన్మార్క్, ఐర్లండ్, జర్మనీ, పోలండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో ఉన్నాయి. ఈ సంస్థలు సర్జికల్, లోకలైజ్, హోల్–బాడీ క్రయోథెరపీ పరికరాలను తయారు చేసి, అన్ని ఆసుపత్రులకు, చికిత్స కేంద్రాలకు అమ్ముతున్నారు. అలాగే నిర్వహణ సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా క్రయోథెరపీ మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఎలా అభివృద్ధి చెందబోతుంది? అని ‘డేటా బ్రిడ్జ్ మార్కెట్ రీసర్చ్’ అనే కన్సల్టింగ్ సంస్థ చేసిన సర్వేల్లో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్, ఏషియా–పసిఫిక్, దక్షిణ అమెరికా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో క్రయోథెరపీ అభివృద్ధి గురించి ఈ రీసెర్చ్ సెంటర్ స్పష్టమైన లెక్కలిచ్చింది. ప్రతి సంవత్సరం కొత్త దేశాలు, కొత్త వినియోగదారులు పెరుగుతున్నారని తేల్చింది. ఆ వివరాలు ఈ చార్ట్లో చూడొచ్చు.క్రయోథెరపీలో పద్ధతులు– జాగ్రత్తలుక్రయో చాంబర్లోకి ప్రవేశించే ముందు, చర్మం పొడిగా, శుభ్రంగా ఉండాలి.చికిత్సకు 6–12 గంటల ముందు రోగి తినడం, తాగడం మానేయమని చెబుతారు. ముందు నుంచి కోల్డ్ అలెర్జీ, రక్తనాళాల సమస్యలు, రేనాడ్స్ వ్యాధి వంటివి ఉన్న వారు ఈ థెరపీ చేయించుకోరాదు.క్రయో చాంబర్కి తడి బట్టలు వేసుకోకూడదు. ఎలాంటి గాడ్జెట్లను తీసుకెళ్లకూడదు.గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవారితో పాటు గర్భవతులు కూడా ఈ చికిత్సకు దూరంగా ఉండాలి. -
ఫిట్నెస్కి పప్పీ టచ్!
జిమ్కి వెళ్లడం బోర్గా అనిపిస్తోందా? అయితే ఈ కొత్త ఫిట్నెస్ ట్రెండ్ మీకు ఒక ‘ఫన్ వర్కౌట్’లా అనిపించొచ్చు! ఎందుకంటే ఇందులో మనుషులు జంతువుల్లా చేతులు, కాళ్లు నేల మీద వేసుకుని పరుగెడతారు. పేరు ‘క్వాడ్రోబిక్స్(Quadrobics)’! కాని, ఫిట్నెస్ ప్రేమికులు దీన్ని ‘ఫుల్ బాడీ ఫన్నీ వర్కౌట్’ అంటున్నారు. అంతే కాదు, సాధారణ వర్కౌట్స్ మాదిరి గంటల తరబడి కాకుండా, కేవలం ఐదు నిమిషాలే చేస్తే ఊపిరి బిగుసుకుంటుంది! అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే, వైద్యులు మాత్రం ‘ఇది కాస్తా జంతువుల్లా ప్రవర్తించే అలవాటుగా మారితే ప్రమాదం!’అని హెచ్చరిస్తున్నారు. చేతులు, మణికట్టు, భుజాలు ఇవన్నీ మన బాడీకి ఈ లోడ్కి అలవాటు ఉండవు. కాబట్టి ఫిట్నెస్ కన్నా ఫ్రాక్చర్ ఫాస్ట్గా రావచ్చు! అని చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ‘ఫోర్ లెగ్ ఫిట్నెస్’ శరీరానికి కాకపోయినా, లైక్స్కి మాత్రం బాగా పని చేస్తోంది! -
సరిపోయారు ఇద్దరూనూ!
అనగనగా ఒక అడవిలో ఒక మర్రిచెట్టు ఉండేది. మర్రిచెట్టు తొర్రలో ఉడత, కొమ్మ మీది గూటిలో కాకి నివసించేవి.ఉడుత, కాకి రెండూ స్నేహంగా ఉండేవి.ఒకరోజు ఉదయం ఆహారం కోసం చెట్టు దిగింది ఉడుత.ఒక కుందేలు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి చెట్టు నీడలో కాసేపు ఆయాసం తీర్చుకుంది. ఉడుతతో ‘మిత్రమా! నాకు చాలా దాహంగా ఉంది. చెరువుకు దారి చెప్తావా!’ మర్యాదగా అడిగింది కుందేలు.‘చెరువుకు దారి ఎటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ తల గోక్కుంది.చెట్టు మీదనే ఉన్న కాకి విషయం తెలుసుకొని, ‘నేరుగా వెళ్లి కుడి చేతి వైపు తిరిగితే చెరువు వస్తుంది!’ అంది.‘అవునవును.. గుర్తుకొచ్చింది!’ అంది ఉడుత.అప్పుడు ఉడుత వైపు వింతగా చూసింది కుందేలు.‘నువ్వేమీ కంగారు పడకు! ఉడుతకు మతిమరుపు. అది కొద్దిసేపైతే నువ్వు అడిగింది కూడా మర్చిపోతుంది. అందుకే నేను ఉడుతకు తోడుగా ఉంటాను!’ అంది కాకి.‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకుంటూ చెరువు వైపు పరిగెత్తింది కుందేలు.కాకి ఆహారం కోసం ఎగిరి బయటకి వెళ్లింది. ఉడుత దాచుకున్న గింజల కోసం చెట్టు తొర్రంతా వెతికింది గాని, కనపడలేదు. ఏదో గుర్తొచ్చి చెట్టుకిందకు దూకింది.నేల తవ్వి అక్కడ దాచుకున్న గింజలు తింటుండగా నక్క అక్కడికి వచ్చింది.‘మిత్రమా! నేను పక్క అడవి నుంచి వస్తున్నాను. పులిరాజు గుహకు దారి చెపుతావా!’ అని అడిగింది.‘పులిరాజు గుహకు దారి ఎటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ నెత్తి గోక్కుంది. అప్పుడే ఆహారంతో తిరిగి వచ్చిన కాకి విషయం తెలుసుకుని, ‘నేరుగా వెళ్లి ఎడమ చేతి వైపు తిరిగితే పులిరాజు గుహ వస్తుంది!’ అంది కాకి‘అవునవును.. గుర్తుకొచ్చింది!’ అంది ఉడుత.అప్పుడు ఉడుత వైపు విచిత్రంగా చూసింది నక్క.‘నువ్వేమీ అనుకోకు! ఉడుతకు మతిమరుపు. అది కొద్దిసేపైతే నువ్వు వచ్చిన సంగతి కూడా మర్చిపోతుంది. అందుకే నేను ఉడుతకు సాయంగా ఉంటాను!’ అంది కాకి.‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకుంటూ గుహ వైపు నడిచింది నక్క.నక్క పులిరాజు గుహకు దారి అడగటంతో..ఉడుత చెట్టు పైకి చూసి, ‘మిత్రమా! నీకు చెప్పటం మరచా! నీకోసం మంత్రి ఎలుగుబంటి వచ్చింది. పులిరాజు చాటింపు వేయమన్నాడని చెప్పమంది’ అంది ఉడుత. ‘ఏమి చాటింపు?’ అడిగింది కాకి.‘చాటింపు ఏమిటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ బుర్ర గోక్కుంది.‘పులిరాజు ఏమి పురమాయించాడో గుర్తుకు తెచ్చుకుని చెప్పకపోయావో నా చేతిలో నీచావు తప్పదు!’ అంది కోపంగా కాకి.‘ఆ.. చావంటే గుర్తొచ్చింది. రేపు పులిరాజు తల్లి చనిపోయిన రోజట! అడవంతా విందుకు రమ్మని చాటింపు వేయమని మంత్రి ఎలుగుబంటి నీకు చెప్పమంది!’ అంది ఉడుత. కాకి వెంటనే అడవంతా చాటింపు వేసింది.మరునాడు అడవి జీవులన్నీ పులిరాజు గుహకు చేరాయి. అక్కడ పులిరాజు చిట్టి కూన పుట్టిన రోజు వేడుక జరుగుతోంది. కాకి తప్పు చాటింపు వేశాడని వేడుకకు వచ్చిన అడవి జీవులన్నీ గుసగుసలాడుకున్నాయి. ఆ విషయం ఎలుగుబంటికి, పులికి కూడా తెలిసింది. ఎలుగుబంటి ఉడుతను, కాకిని పిలిచింది. పులిరాజు చేతిలో చచ్చామనుకున్నాయి. కాకి, ఉడుత భయంతో వణుక్కుంటూ వెళ్లాయి. ఉడుత మతిమరపు విషయం చెప్పింది కాకి. పొరపాటుకు క్షమించమని పులి కాళ్లు పట్టుకున్నాయి కాకి, ఉడుత.‘భయపడకండి! మీరు మంచే చేశారు. ఈరోజు నా చిట్టికూన పుట్టినరోజే కాదు, మా అమ్మ చనిపోయిన రోజు కూడా! మా అమ్మే గత యేడు చనిపోయి, చిట్టి కూనగా పుట్టింది. మతిమరపు ఉడుతది కాదు, కూన పుట్టిన ఆనందంలో మరచిన నాదే!’ అంది పులిరాజు.కాకి, ఉడుతలకు విలువైన కానుకలిచ్చాడు పులిరాజు. అడవి జీవులన్నీ కమ్మటి విందు చేశాయి. చేతిలో విలువైన కానుకలతో తిరుగుతున్న కాకి, ఉడుతలను చూసి అడవి జీవులన్నీ ‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకున్నాయి. పులిరాజు రాజ వైద్యుడు కోతితో ఉడుతకు వైద్యం చేయించి, మతిమరపు పోగొట్టాడు. ∙ముద్దు హేమలత -
టీచర్ కాబోయి యాంకర్.. ఈమె ఎవరో తెలుసా?
ఎమ్మెస్సీ బీఈడీ చదివిన ఆమె.. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఇంట్లో కూర్చోలేదు. తన మధుర స్వరం, సంభాషణ చాతుర్యం ఆమెను ముందుకు నడిపించాయి. వ్యాఖ్యాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. యాంకరింగ్ చేస్తూనే ఈవెంట్స్ నిర్వహణతో మరో యాభై మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కామారెడ్డికి చెందిన ప్రసన్నలక్ష్మి.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్లో జన్మనిచ్చిన ప్రసన్నలక్ష్మి కులకర్ణి.. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. కామారెడ్డికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధు విజయవర్ధన్తో ఆమెకు వివాహమైంది. ప్రస్తుతం ఆమె భర్త, కుమారుడితో కలిసి పట్టణంలోని దేవి విహార్లో నివసిస్తున్నారు. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన ఆమె ఉపాధ్యాయ ఉద్యోగం కోసం రెండుసార్లు డీఎస్సీ రాసినా ఎంపిక కాలేదు. అయినా నిరుత్సాహ పడలేదు. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లి ష్, మరాఠీ, కన్నడ భాషల్లో ప్రావీణం ఉన్న ప్రసన్నలక్ష్మికి చదువుకునే సమయంనుంచి ప్రసంగాలు చేయడం, పాటలు పాడడం, రాయడం అలవాట్లున్నాయి. అదే ఆమెకు బతుకుబాట చూపింది. భర్తతో పాటు కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతో ఏడేళ్ల క్రితం వ్యాఖ్యాతగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. మంచి గాత్రంతోపాటు సంభాషణ చాతుర్యం ఉన్న ఆమె ఈ రంగంలో సక్సెస్ అయ్యారు. వందలాది కార్యక్రమాల్లో ఆమె తన మాట, పాటలతో వేలాది మందిని ఆకట్టుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అధికారిక కార్యక్రమాల్లోనూ తనదైన యాంకరింగ్తో మెప్పిస్తున్నారు.పెళ్లిళ్లు, ఫంక్షన్లలో...ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఆట, పాటలతో అలరింపజేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైనవన్నీ ఈవెంట్ ఆర్గనైజర్లే చూసుకుంటున్నారు. ప్రసన్నలక్ష్మి అన్నపూర్ణ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో జరిగే ఫంక్షన్లు, పెళ్లిళ్లకు ఈ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్... ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా బుకింగ్స్ ఉంటున్నాయి. తమ సంస్థలో యాభై నుంచి అరవై మందికి ఉపాధి కలి్పస్తున్నామని ప్రసన్నలక్ష్మి తెలిపారు.మాట, పాటలతో...ప్రసన్నలక్ష్మి ఐదు భాషలలో మాట్లాడడంతో పాటు శ్రావ్యంగా పాటలూ పాడతారు. వీడియోలకు అవసరమైన వాయిస్ ఓవర్ కూడా ఇస్తారు. ఉద్యోగుల సన్మాన కార్యక్రమాలు, ఉద్యోగ విరమణ కార్యక్రమాలు, బదిలీ కార్యక్రమాలలో వారికి సంబంధించిన సక్సెస్ స్టోరీలను ప్రిపేర్ చేసి తన మాట, పాటలతో ఆహూతులను ఆకట్టుకుంటారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో దాండియా, కోలాటం, బతుకమ్మ ఆటలు కూడా ఆడించడం ద్వారా అందరినీ ఉత్తేజపరుస్తుంటారు. తన వెంట ఉండే బృందంతో నృత్యాలు చేయిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. -
దండుడి వృత్తాంతం
ఇక్ష్వాకుడికి వందమంది కొడుకులు. వారిలో అందరికంటే చిన్నవాడు చదువు సంధ్యలు లేక మూఢుడిగా మారాడు. పెద్దలను ఏమాత్రం లెక్కచేసేవాడు కాదు. అన్నలను ధిక్కరించేవాడు. ‘వీడి శరీరంపై దండం పడక తప్పదు’ అనుకునేవాడు ఇక్ష్వాకుడు. అల్పతేజస్కుడైన చిన్న కొడుకుకు దండుడు అని పేరుపెట్టాడు. సమస్త భూమండలాన్నీ పాలించిన ఇక్ష్వాకుడు తన కొడుకులందరికీ రాజ్యాలు ఇచ్చాడు. చిన్నకొడుకైన దండుడికి తగిన రాజ్యం కోసం అన్వేషించి, చివరకు వింధ్య, శైవల పర్వతాల మధ్యగల ప్రదేశాన్ని దండుడికి రాజ్యంగా ఇచ్చాడు.దండుడు ఆ పర్వత మధ్య ప్రాంతానికి వెళ్లి, అక్కడ నివాసయోగ్యమైన గొప్ప పట్టణాన్ని నిర్మించుకుని, దానికి మధుమంతమని పేరుపెట్టాడు. మధుమంతపురాన్ని రాజధానిగా చేసుకుని, దండుడు పరిపాలన సాగించేవాడు. దానవ గురువైన శుక్రాచార్యుడిని తన పురోహితుడిగా నియమించుకున్నాడు. దండుడు తన రాజ్యాన్ని వైభవోపేతంగా పాలించసాగాడు. బృహస్పతిని పురోహితుడిగా చేసుకున్న దేవేంద్రుడిలా; శుక్రాచార్యుడిని పురోహితుడిగా చేసుకున్న దండుడు తన రాజ్యాన్ని స్వర్గతుల్యంగా తీర్చిదిద్దాడు. తన శౌర్య పరాక్రమాలతో రాజ్యానికి శత్రుబాధ లేకుండా చేశాడు. దండుడి పరిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు.ఇలా సాగుతుండగా దండుడు చైత్రమాసంలో ఒక రోజున వనవిహారానికి వెళ్లాడు. వసంత శోభతో వనమంతా కళకళలాడుతూ ఉల్లాసభరితంగా ఉంది. పక్షుల కిలకిలరావాలు తప్ప అక్కడ మరెలాంటి రణగొణలు లేకపోవడంతో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అదే వనంలో శుక్రాచార్యుడి ఆశ్రమం ఉంది. శుక్రాచార్యులను దర్శించుకుందామని దండుడు ఆయన ఆశ్రమం వైపు బయలుదేరాడు. శుక్రాచార్యుడి ఆశ్రమ వాటికలో ఒక ముగ్ధమనోహరి పూలు కోసుకుంటూ కనిపించింది. ఆమె శుక్రాచార్యుడి కుమార్తె. ఆ సమయంలో శుక్రాచార్యుడు ఆశ్రమంలో లేడు. సమిధల కోసం శిష్యులతో కలసి అడవిలోకి వెళ్లాడు.ఆశ్రమం ఆవరణలో ఒంటరిగా కనిపించిన శుక్రాచార్యుడి పుత్రికను చూసి, దండుడికి మతి చలించింది. ఆమెను చూసీ చూడటంతోనే మోహావేశం పొందాడు. వడివడిగా ఆమెను సమీపించాడు.‘సుందరీ! నువ్వెవరివి? నిన్ను చూసిన క్షణంలోనే నా మనసు వశం తప్పింది. నీ పొందుతోనే నాకు మోక్షం లభించగలదు. నన్ను కాదనకు’ అని పలికాడు.అతడి మాటలకు ఆమె విచలితురాలైంది.‘రాజా! నేను శుక్రాచార్యుల జ్యేష్ఠపుత్రికను. నా పేరు అరజ. నా తండ్రి నీ గురువు. నువ్వు ఆయన శిష్యుడివి. మహా తపశ్శాలి అయిన ఆయనకు ఆగ్రహం కలిగిస్తే, నీకు అనర్థం తప్పదు. నన్ను పరిణయం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లయితే, ధర్మసమ్మతమైన మార్గంలో నా తండ్రిని అర్థించు. అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే, నీకు ముప్పు తప్పదు’ అని హెచ్చరించింది. మోహావేశంలో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన దండుడు ఆమె మాటలను పట్టించుకోలేదు. ‘సుందరీ! అనవసరంగా కాలాన్ని వృథా చేయకు. నువ్వు కాదంటే, నా ప్రాణం పోయేలా ఉంది. నిన్ను పొందిన తర్వాత నాకు మరణమే వచ్చినా, పాపమే చుట్టుకున్నా, మరే ఆపద వచ్చినా నేను చింతించను. ఇక జాగు చేయకు’ అంటూ ఆమెను తన బాహువులతో బంధించాడు. ఆమె విలపిస్తూ, వారించినా వినిపించుకోకుండా ఆమెను బలాత్కరించి, అక్కడి నుంచి తన రాజధానికి వెళ్లిపోయాడు.కొద్దిసేపటికి శుక్రాచార్యుడు ఆశ్రమానికి వచ్చాడు. దీనురాలిలా విలపిస్తున్న అరజను చూశాడు. జరిగిన ఘోరాన్ని తెలుసుకుని ఆగ్రహోదగ్రుడయ్యాడు. పక్కనే ఉన్న శిష్యులతో, ‘దండుడికి ఎలాంటి ఘోరమైన ఆపద రాబోతోందో వినండి. అగ్నిజ్వాలలాంటి నా కుమార్తెను స్పృశించిన దురాత్ముడు దండుడి పరివారానికి వినాశనం సమీపించింది. ఈ దుర్మార్గుడు తన పాపకర్మకు తప్పక తగిన ఫలితాన్ని అనుభవించగలడు. ఇతడి దేశానికి నూరుయోజనాల పరిధిలో ఇంద్రుడు ధూళి వర్షాన్ని కురిపించి, నాశనం చేయగలడు. ఏడురోజులు అహోరాత్రులు కురిసిన ధూళివర్షంలో దండుడి రాజ్యం పూర్తిగా నశిస్తుంది. మీరందరూ రాజ్యానికి సరిహద్దులు దాటి వెళ్లండి’ అని చెప్పాడు.తర్వాత అరజతో ‘నువ్వు ఈ ఆశ్రమంలోనే యోగాభ్యాసం చేస్తూ కాలం గడుపు. ఈ ఆశ్రమం, దీని ఎదుట యోజనం విశాలమైన సరోవరం, ఈ ఆశ్రమ పరిధిలో నీ చెంత ఉండే ప్రాణులకు ధూళివర్షం వల్ల ఎలాంటి ఆపదా రాదు. నువ్వు కాలం కోసం నిరీక్షించు’ అని పలికి, దండుడి రాజ్యాన్ని విడిచి శిష్యసమేతంగా శుక్రాచార్యుడు వెళ్లిపోయాడు.శుక్రాచార్యుడు దండుడి రాజ్యాన్ని విడిచి వెళ్లగానే, ధూళి వర్షం కురిసింది. ఏడురోజులు తెరిపి లేకుండా కురిసిన ధూళి వర్షంలో దండుడి రాజ్యం నామరూపాలు లేకుండా సర్వనాశనమైంది. దండుడు, అతడి పరివారం, భృత్యులు ప్రాణాలు కోల్పోయారు. కొంతకాలం గడిచాక దండుడు రాజ్యం ఏలిన ప్రాంతంలో దట్టమైన కీకారణ్యం ఏర్పడింది. మునులు అక్కడకు చేరుకుని, ఏకాంత ప్రదేశంలో తపస్సు చేసుకునేవారు. దండుడి రాజ్యంలో ఏర్పడిన అరణ్యం కనుక దీనికి దండకారణ్యం అనే పేరు వచ్చింది. మునిజనులు నివాసం ఏర్పరచుకోవడం వల్ల జనస్థానమనే పేరు కూడా వచ్చింది. వనవాస సమయంలో రాముడు కొన్నాళ్లు దండకారణ్యంలో గడిపాడు. ఆ కాలంలోనే అగస్త్య మహర్షి రాముడికి దండకారణ్యానికి సంబంధించిన ఈ వృత్తాంతాన్ని చెప్పాడు.∙సాంఖ్యాయననిన్ను పొందిన తర్వాత నాకు మరణమే వచ్చినా, పాపమే చుట్టుకున్నా, మరే ఆపద వచ్చినా నేను చింతించను. -
బారిష్ బాబా!
2016 జూన్ 15– హైదరాబాద్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇల్లు– కుటుంబ సభ్యులంతా ‘ప్రత్యేక’ పూజలో నిమగ్నమయ్యారు. పూజ పూర్తయితే ఇంట్లో కరెన్సీ వర్షం కురవాల్సి ఉంది. ఇంటి హాలులో వేసిన ముగ్గులో పెట్టిన రూ.1.33 కోట్లు ఏకంగా రూ.10 కోట్లుగా మారాల్సి ఉంది. పూజ చేయిస్తున్న బాబా కొద్దిసేపటికి ప్రసాదంగా పరమాన్నం పెట్టాడు. అది తిన్న కుటుంబ సభ్యులు స్పృహ కోల్పోయారు. కొన్ని గంటలకు లేచి చూసేసరికి, బాబాతో పాటు నగదు కూడా గల్లంతవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరవైనాలుగు గంటల్లోనే పోలీసులు బుడ్డప్పగారి శివ అనే బురిడీ బాబాను, అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన శివ తండ్రి విద్యుత్ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఇంటర్ చదువును 1996లో మధ్యలోనే ఆపేసిన శివ తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బెంగళూరు వెళ్లిన ఇతగాడికి రవి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా ఒక హోటల్లో ఉద్యోగంలో చేరాడు. తర్వాత అక్కడి తిప్పసముద్రంలో ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి, విద్యుత్, పారిశుద్ధ్య కార్మికులను పనికి పంపిస్తూ కమీషన్ తీసుకునేవాడు. కొన్నాళ్లకు ఆ పనీ మానేసి, అక్కడి ఓ ఆశ్రమంలో విద్యుత్ పనులు చేసే ఉద్యోగిగా చేరాడు. కొన్నాళ్లకు తిరుపతి సమీపంలోని కరువాయల్ ఆయుర్వేద ఆశ్రమంలో చేరాడు. అక్కడ షణ్ముగం అనే వ్యక్తి నుంచి కొంత ఆయుర్వేదం నేర్చుకున్నాడు. అప్పుడే ఇతడికి ఉమ్మెత్త గింజల గుజ్జుతో ఎదుటి వారిని మత్తులో దించవచ్చని తెలిసింది. అక్కడ నుంచి తిరిగి మళ్లీ తిప్పసముద్రంలోని ఆశ్రమానికే చేరాడు. శివకు అక్కడ అనంతాచార్యులు అనే ‘స్వామి’తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారానే పూజలతో నగదు రెట్టింపు మోసం నేర్చుకున్నాడు. ఈ గురువుతోనే కలిసి హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో 2009లో తొలిసారిగా పంజా విసిరాడు. అక్కడ రూ.25 లక్షలు, బెంగళూరులోని కుమ్మలగూడలో రూ.40 లక్షలు స్వాహా చేశాడు. ఆపై శనేశ్వర్ బాబా అనే మరో దొంగ స్వామితో కలిసి కర్ణాటకలోని చామరాజనగర్లో రూ.10 లక్షలు దోచుకున్నాడు. ఈ మూడు ఉదంతాలతో అనుభవం పెంచుకున్న శివ తానే స్వయంగా ‘పూజలు’ చేయడం ప్రారంభించాడు. తాను ఎంచుకున్న ‘టార్గెట్’ దగ్గర పూజ చేయడానికి ముందే శివ నిర్ణీత మొత్తాన్ని తొడ భాగంలో కట్టుకుని, పంచె ధరించి కూర్చుంటాడు. లక్ష్మీ కటాక్షం కోసం కొంత మొత్తాన్ని పూజలో పెట్టాలని, పూజ పూర్తవగానే అది రెట్టింపు అవుతుందని చెప్తాడు. భక్తుల పెట్టిన మొత్తానికి తాను ‘తొడలో’ దాచిన నగదు చాకచక్యంగా కలిపేస్తాడు. రెట్టింపు మొత్తాన్ని పూజా ఫలితం అంటూ భక్తులకు ఇచ్చేస్తాడు. ఇది చూసిన వారికి బురిడీ బాబాపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అక్కడితో బురిడీ బాబా అసలు కథ« ప్రారంభించి అందినకాడికి దోచుకుంటాడు. కొందరు భక్తులకు తాను చెప్పిన మొత్తం పూజలో పెడితే దానికి పది రెట్లు వర్షం రూపంలో (బారిష్) కురుస్తుందని నమ్మిస్తుంటాడు. భక్తులు ‘ముగ్గులోకి’ దిగాక ‘పెద్ద పూజ’కు రంగం సిద్ధం చేస్తాడు. ఉమ్మెత్త గింజల గుజ్జును తనతో గుట్టుగా తీసుకువస్తాడు. అత్యాశకుపోయే భక్తులు ఈసారి గతంలో పెట్టిన మొత్తానికి ఎన్నో రెట్లు సమీకరించుకుని పూజకు సిద్ధమవుతారు. పూజ చేసేప్పుడు ఇతరులెవ్వరూ ఉండకూడదంటూ కుటుంబీకుల్ని మాత్రమే ఇంట్లో ఉంచుతాడు. తంతు పూర్తయ్యే తరుణంలో ప్రసాదమంటూ పరమాన్నం సిద్ధం చేసే ఈ బురిడీ బాబా అందులో ఉమ్మెత్త గింజల గుజ్జు కలిపేస్తాడు. అది తిన్న వారంతా మత్తులోకి జారుకున్నాక పూజలో ఉంచిన సొత్తు, సొమ్ముతో ఉడాయిస్తాడు. ఈ దొంగ బాబా శివ 2012లో కూకట్పల్లిలో ‘పూజ’ చేసి పోలీసులకు చిక్కాడు. ఆపై బెంగళూరుకు మకాం మార్చి 2014 జూన్ 6న తిరుపతి అర్బన్ జిల్లా అలిపిరి ఆటోనగర్లో ఉండే రియల్టర్ ఆర్కే యాదవ్ కుటుంబంపై ‘మత్తు మందు’ జల్లాడు. పూజలో ఉంచిన రూ.63.43 లక్షలు తీసుకునే లోపే యాదవ్ సంబంధీకులు దామోదర్ రావడంతో ఉడాయించాడు. మత్తులో ఉన్న కుటుంబాన్ని చూసిన దామోదర్ ఆ మొత్తం తస్కరించి దొంగ బాబా దొరకడనే ఉద్దేశంతో నేరాన్ని అతడి మీదికి నెట్టాడు. అలిపిరి నుంచి నెల్లూరు చేరుకున్న బురిడీ బాబా అక్కడి ఆనంద్రెడ్డి ఇంట్లో ‘పూజ చేసి’ రూ.40 లక్షలు ఎత్తుకుపోయాడు. యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అలిపిరి పోలీసులు శివ హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. అమీర్పేటలోని ఓ లాడ్జిని అడ్డాగా చేసుకుని నల్లగొండకు చెందిన మరో బడా బాబును మోసం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్నారు. ఆ లాడ్జిపై మెరుపుదాడి చేసిన పోలీసులు శివను పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో దామోదర్ను అరెస్టు చేసి ఇరువురి నుంచి మొత్తం రూ.1.30 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రియల్టర్కు కొంపల్లి వాసితో పరిచయం ఉంది. శివ ఇతడి ద్వారానే హైదరాబాద్ రియల్టర్కు పరిచయమయ్యాడు. బెంగళూరు శివార్లలో స్థిరపడిన శివను 2015లో ఆ స్నేహితులు ఇద్దరూ వెళ్లి కలిశారు. పక్కా పథకంతో అక్కడి గోల్ఫ్ కోర్ట్లో ‘ప్రత్యేక’ పూజ’ చేసిన శివ వీళ్లు తెచ్చిన రూ.లక్షను రూ.2 లక్షలు చేసిచ్చాడు. దీని కోసం దక్షిణ తప్ప అదనంగా ఏమీ తీసుకోకపోవడంతో హైదరాబాద్ రియల్టర్కు పూర్తి నమ్మకం ఏర్పడింది. 2016లో మళ్లీ ఈయన్ను సంప్రదించిన శివ తన వద్ద 1616 నాటి రైస్పుల్లర్గా పిలిచే ఇరీడియం కాయిన్ ఉన్నట్లు చెప్పాడు. దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో రూ.వందల కోట్లకు అమ్మవచ్చని, జర్మనీలో పార్టీని వెతుకుదామని చెప్పాడు. ఈ కాయిన్తో పాటు డబ్బును రెట్టింపు చేయడానికి మీ ఇంట్లో పూజ చేద్దామంటూ మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్ చేరాడు. 2016 జూన్ 15 హైదరాబాద్ రియల్టర్ ఇంట్లో ముగ్గు వేసి పూజ ప్రారంభించిన శివ ఆ ముగ్గులో హ్యారీపోటర్ పుస్తకాన్నీ ఉంచడం గమనార్హం. అదేమంటే మహిమలకు అతడు ప్రతీకంటూ నమ్మించాడు. బురిడీ బాబా శివ 2009–16 మధ్య పదిమంది నుంచి రూ.4.25 కోట్ల మేర స్వాహా చేశాడు. హైదరాబాద్లోని బంజారాహిల్స్, కేపీహెచ్బీ, మైలార్దేవ్పల్లి; చిత్తూరు జిల్లా అలిపిరి, బెంగళూరులోని కుంబులుగుడ్డు, కడప జిల్లా రాజంపేట, నెల్లూరుల్లో అరెస్టు అయ్యాడు. రైస్పుల్లింగ్ కాయిన్ పేరుతో బెంగళూరు గోల్ఫ్ కోర్ట్లో ఇద్దరి నుంచి రూ.52 లక్షలు, చెన్నైలోని ఓ త్రీ స్టార్ హోటల్ యజమాని నుంచి రూ.35 లక్షలు కాజేసిన ఉదంతాల్లో వాంటెడ్గా ఉన్నాడు. 2016 తర్వాత ఇతడి పేరు మళ్లీ రికార్డుల్లోకి ఎక్కలేదు. -
ఈ వారం కథ: లక్కీ యాప్
టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్టోన్ మోగుతోంది.‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లు’’ అని పాట వినిపిస్తోంది.ఫోన్ చేసింది ఎవరో అనే ఆలోచన లేకుండా, అదే పాటను హమ్ చేస్తూ...‘‘నేనో జీరోని, వ్యాల్యూ లేనోన్ని’’ అంటూ ఫోన్ ఎత్తాడు రఘువరన్ .వెంటనే, ఆ పక్కనుంచి ‘‘ఒరేయ్! రాసిన లాస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యింది రా!’’ అని బాధతో చెప్పాడు ఫ్రెండ్. రఘువరన్ మాత్రం షాక్ కాకుండా, చిరునవ్వు చిందిస్తూ, హీరో రజనీకాంత్లా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, ‘‘చూడు ఇదంతా మామూలే, నువ్వు బాధపడకు’’ అన్నాడు.‘‘ఒరేయ్! ఫెయిల్ అయ్యింది నువ్వురా!’’ అన్న వెంటనే, రఘువరన్, ‘‘తెలుసు! నన్ను అదృష్ట దేవత డైరెక్ట్గా వచ్చి వరాలు ఇచ్చినా, నా బెస్ట్ ఫ్రెండ్ వాటిని సక్సెస్ఫుల్గా ఫెయిల్ చేయగలడు’’ అన్నాడు. ‘‘ఎవర్రా వాడు? చెప్పు వాడ్ని చంపేద్దాం..’’‘‘రేయ్, వాడ్ని ఏం అనకు. నేను పుట్టినప్పటి నుంచి నన్ను ఒక్క క్షణం కూడా వీడని ఫ్రెండ్రా వాడు. నా వన్ అండ్ ఓన్లీ బెస్ట్, బ్లడ్ ఫ్రెండ్ నా బ్యాడ్ లక్! బై!’’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. తర్వాత మళ్లీ అదే పాట పెట్టుకొని ‘‘నా బాధే నాకు భంగు, నే చెత్త కుప్ప కింగు, నా ఫేట్ నల్లరంగు, నే కొమ్మల్లో పతంగు!’’ అని పాడుతూ, డ్యాన్ ్స చేస్తూ స్నానం పూర్తి చేసి, ఇంటర్వ్యూకి బయలుదేరాడు. ఇలా దాదాపు దశాబ్దంపాటు, రఘువరన్ రోజూ ఉదయం రెడీ అవ్వడం, మధ్యాహ్నం ఇంటర్వ్యూ అటెండ్ కావడం, సాయంత్రం స్నేహితుల గొప్పలు వింటూ ఇంటికొచ్చి భోజనం చేయడం, రాత్రి కొత్త ఉద్యోగానికి అప్లయ్ చేసి నిద్రపోవడం అంతే! ఇదే రఘువరన్ జీవితం.ఇలా ఒక తుప్పు పట్టిన చక్రంలా, రోజులన్నీ ఒకేలా గడుస్తున్న సమయంలో ఒక రాత్రి ల్యాప్టాప్ మూసి పడుకోబోతుంటే, తెర మీద వింత అక్షరాలు మెరిశాయి. ‘‘బ్యాడ్ లక్కి బై చెప్పి, లక్కి హాయ్ చెప్పాలనుందా?అయితే వెంటనే ఈ ఆర్టిఫిషియల్ లక్ యాప్ను ఇన్ స్టాల్ చేసుకోండి.ఇది నంబర్ వన్ లక్ గ్యారంటీ యాప్!’’రఘువరన్ రెండు క్షణాలు స్క్రీన్ చూస్తూ ఆగిపోయాడు.‘‘ఇలాంటి యాప్స్ కూడా ఉంటాయా? ఉన్నా పనిచేస్తాయా?’’ అని అనుకుంటూ ఇన్ స్టాల్ బటన్ నొక్కాడు. యాప్ ఓపెన్ చేయగానే, కంప్యూటరైజ్డ్ వాయిస్, ‘‘వెల్కమ్! ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్యాకేజ్. డైలీ ఫ్రీ లక్. ప్రీమియం లక్. జాక్పాట్ లక్.’’ ‘‘అబ్బో! ఇప్పడు అదృష్టం కూడా డేటా ప్లాన్ ్స ఇస్తుందా?’’ అనుకుంటూ... ఫ్రీ లక్ సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పుడే యాప్ నుంచి ఫన్నీ నోటిఫికేషన్ :‘‘ఈ రోజు ఇంటర్వ్యూలో మిస్టర్ రఘువరన్ కడియాలా, యూ ఆర్ సెలెక్టెడ్!’’ ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటూ బెడ్ మీద పడ్డాడు. ‘‘ఏమో, ఏడేళ్ల తర్వాత ‘బేవార్స్, ఇడియట్’ అన్నవాళ్లు, నిజంగానే ‘మిస్టర్ రఘువరన్ ’ అంటారేమో!’’ అని అనుకుంటూ కళ్ళు మూశాడు. మరుసటి ఉదయం టింగ్..! ఫోన్ నోటిఫికేషన్: ‘‘యువర్ డైలీ ఫ్రీ లక్ యాక్టివేటెడ్!’’తన బ్యాడ్ లక్ గురించి బాగా తెలిసిన రఘువరన్ ఏమాత్రం ఎగై్జట్ కాలేదు. మూమూలుగానే ఇంటర్వ్యూకి రెడీ అయ్యి బైక్లో బయలుదేరాడు. ఆరోజు ఎందుకో, అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ గ్రీన్ . జేబులోని పెన్ ఇంక్ లీక్ కాలేదు. షూస్కి దుమ్ము అంటలేదు. లిఫ్ట్ కరెక్ట్గా వర్క్ అయ్యింది. వేడి కాఫీ కిందపడకుండా తాగాడు. ఇంటర్వ్యూలో కూడా అచ్చం యాప్ చెప్పిన ట్టు. ‘‘మిస్టర్ రఘువరన్ కడియాలా, యూ ఆర్ సెలెక్టెడ్!’’ అన్నారు. జాబ్ ప్యాకేజీ కూడా బాగానే ఉంది. ఆ తర్వాత కూడా ఆడగకుండానే షాపింగ్ చేసిన తర్వాత ఆఫర్ అంటూ డిస్కౌంటు ఇచ్చారు. బైక్కి టైర్ పంచర్, పెట్రోల్ అయిపోవటం లాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి వెళ్లాడు. అపార్ట్మెంట్లో కూడా పార్కింగ్ ఈజీగా దొరికింది. ఆ రోజు అంతా బాగా గడిచిపోయింది. అంతా యాప్ చెప్పినట్టు రోజంతా అదృష్టంతో నిండిపోయింది. దీంతో, అప్పటి దాకా, రింగ్ టోన్ మోగితే కానీ, చూడని ఫోన్ ముఖాన్ని కళ్లార్పకుండా చూశాడు. కుతూహలంతో ఆ యాప్ తెరిచాడు. ఇదంతా నిజమేనా? అని సందేహంతోనే నిద్రపోయాడు. మళ్లీ ఉదయాన్నే ఫోన్ నోటిఫికేషన్ . ‘‘యువర్ ఫ్రీ లక్ ఈజ్ ఓవర్! అప్డేట్ కోసం రూ. 99 ప్రీమియం ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’ఇదంతా నమ్మాలా వద్దా అన్న అయోమయంలోనే రఘువరన్ ప్రీమియం ప్యాకేజీని సెలెక్ట్ చేసుకున్నాడు.ఆ రోజూ కూడా రఘువరన్ కి అదృష్టమే కలిసివచ్చింది. బస్సులో ఎక్కినప్పుడల్లా కిటికీ సీటు ఖాళీగా ఉంటుంది. బిస్కెట్ను టీలో ముంచినప్పుడు కూడా జారిపోకుండా తింటున్నాడు.బార్ బిల్లు ఎప్పుడూ ఫ్రెండ్గాడికే పడుతోంది. దొంగిలించిన వాలెట్ని దొంగే తిరిగి తెచ్చి ఇస్తున్నాడు.అడుగు బయట పెట్టగానే ఘోరంగా కురుస్తున్న వాన ఒక్కసారిగా సైలెంట్గా మారుతోంది. ఆఫీసులో బాస్ అడక్కుండానే పొగుడుతున్నాడు. ఆఫీస్ బాయ్ కూడా అడక్కుండానే వాటర్, టీ కాఫీలు తెచ్చి టేబుల్ పై పెడుతున్నాడు. మొబైల్ బ్యాటరీ వన్ పర్సెంట్ ఉన్నా, మూడు రోజులు వరకు ఆన్గానే ఉంటుంది. ఫేవరెట్ వైట్ షర్ట్ని వాషింగ్ మెషీన్లో వేసినా, అది ఏ కలర్ అంటకుండా, చాలా చక్కగా మారి, మృదువుగా, సువాసనతో బయటకు వస్తుంది. అనుకోకుండా, చేయి ఎత్తితే, అటుగా వెళ్తున్న వక్తి, లిఫ్ట్ అనుకొని, నేరుగా స్కూటీ మీద ఎక్కించుకొని ఇంటి వద్ద దింపాడు. ఇంతేకాదు, ఏటీఎమ్లో ఐదు వందల రూపాయలు విత్డ్రా చేసుకోగా, మెషిన్ ఐదు వంద నోట్లకు బదులు యాభై నోట్లను ఇచ్చేసింది. ఆన్లైన్లో బ్యాటరీ ఆర్డర్ పెడితే, డెలివరీలో స్మార్ట్ వాచ్, బ్లూటూత్ స్పీకర్ వచ్చాయి. ఇలా అప్పటి వరకు హారర్ సినిమాలా సాగిన రఘువరన్ జీవితం, ఒక్కసారిగా, సూపర్ హిట్ కామెడీ సినిమాలా సాగిపోతోంది. సరిగ్గా, ఒక నెల తర్వాత మళ్లీ ఫోన్ నోటిఫికేషన్ ‘‘యువర్ ప్రీమియం లక్ ఈజ్ ఓవర్! అప్డేట్ కోసం రూ. 999 జాక్పాట్ లక్ ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’ ఈసారి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే పేమెంట్ చేశాడు.వెంటనే నోటిఫికేషన్ , ‘‘బొంబాయి లాటరీ నంబర్ 5834.’’ ఆ నంబర్ చూసిన వెంటనే రఘువరన్ పరుగెత్తుకుంటూ వెళ్లి లాటరీ కొన్నాడు. నంబర్ కూడా అదే 5834. ఇక అప్పటి నుంచి రఘువరన్ కి నిద్ర పట్టడం లేదు. ప్రతిరోజూ అదృష్టం ఇచ్చే ఆనందాలను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.క్యూలో నిల్చున్నా, వెయిట్ చేసే పని లేకుండా గణేశ్ అన్నదానంలో భోజనం దొరికినా ఆస్వాదించలేకపోయాడు.ఆఫీసులో అందమైన అమ్మాయి నవ్వుతూ పొగుడుతున్నా తిరిగి నవ్వలేకపోయాడు.చికెన్ బిరియానీ ఆర్డర్ చేస్తే, అందులో లెగ్పీస్ వచ్చినా ఎంజాయ్ చేయలేకపోయాడు. బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్ అడ్రస్ని పది సార్లు అడగకుండానే వేగంగా డెస్టినేషన్ కు తీసుకెళ్తున్నా సంతోషం లేదు. తన పాత క్రష్ సడెన్ గా ‘నిన్ను కలవాలని ఉంది’ అని మెసేజ్ పంపినా, అతను ‘ఊమ్’ అని రిప్లయ్ ఇస్తున్నాడు. అమెజాన్ లో బ్యాటరీ ఆర్డర్ చేశాడు, డెలివరీలో డ్రోన్ , స్మార్ట్వాచ్, బ్లూటూత్ స్పీకర్ వచ్చాయి! ‘సారీ సర్, సిస్టమ్ గ్లిచ్’ అని కంపెనీ వాళ్లు చెప్పి, మీరు ఆ వస్తువులను కావాలనుకుంటే మీ వద్ద పెట్టుకోవచ్చు అని చెప్పి, ప్రతి సారి గ్లిచ్ కేవలం రఘుకే వస్తున్నాయి. అలా ప్రతిరోజూ అదృష్టం తన తలుపు తట్టి మరీ ఇచ్చే ఆనందాలు అన్నీ క్రమంగా తనకు బోరింగ్గా మారిపోయింది. షాపింగ్కి వెళ్లినా రఘు ఏ షర్ట్ పట్టుకున్నా దానిపైనే ‘టుడే ఫ్రీ ఆఫర్!’ బోర్డు వొచ్చేస్తుంది! చాలా డిస్కౌంట్ ఆఫర్తో షాపింగ్ చేసినా, తరువాత కాసేపటికే బ్యాంక్ నుంచి మెసేజ్ ‘మీ కొనుగోలుపై క్యాష్బ్యాక్ రూ. 4999.’ వచ్చినా కూడా తనకు ఆనందం లేదు. ఎప్పుడూ లాటరీ విన్నర్ అనౌన్ ్సమెంట్ కోసమే ఎదురుచూస్తూ, అదృష్టంపై చిన్న చూపు మొదలయింది. సరిగ్గా, నలభై ఐదు రోజుల తర్వాత ఆ రోజు వచ్చింది.విన్నింగ్ నంబర్ను అనౌన్ ్స చేశారు. యాప్ చెప్పినట్టుగానే విన్నింగ్ లాటరీ నంబర్ 5834.ఇక రఘువరన్ ఆనందానికి అవధులు లేవు.లాటరీ ప్రైజ్ వంద కోట్లు.‘‘ఇక నా కష్టాలన్నీ పోయాయి!’’ అని ఆ రోజంతా ఫుల్ పార్టీ చేసుకొని పడుకున్నాడు.ఉదయం లేవగానే ఫోన్ నోటిఫికేషన్ , ‘‘యువర్ జాక్పాట్ లక్ ఈజ్ ఓవర్! అప్డేట్ కోసం రూ. 9999 జాక్పాట్ లక్ అప్డేషన్ ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’‘‘వంద కోట్లు ఉంటే నాకు ఇంకా లక్తో పని ఏముంది’’ అనుకొని యాప్ను అన్ఇన్ స్టాల్ చేసి బొంబాయి లాటరీ ఆఫీసుకు వెళ్లాడు. చాలా కాన్ఫిడెంట్గా లాటరీ టికెట్ ఇచ్చి. ‘‘ఐ వాంట్ ఓన్లీ క్యాష్’’ అన్నాడు.కౌంటర్లోని వ్యక్తి టికెట్ తీసుకొని, ‘‘సారీ సార్, ఈ లాటరీ టికెట్ ఎక్స్పైర్ అయింది’’ అన్నాడు.వెంటనే షాక్తో టికెట్ తీసుకొని చెక్ చేసుకున్నాడు. నిజంగానే అది లాస్ట్ ఇయర్ టికెట్.‘‘మరి నాకు డబ్బులు రావా!’’ అని బాధతో అడిగాడు.‘‘సారీ సార్!’’ అంటూ టికెట్ తిరిగి అతని చేతిలో పెట్టారు.వెంటనే రింగ్టోన్ మోగింది. ‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లో’’. ఈసారి చాలా సైలెంట్గా ఫోన్ ఎత్తాడు.‘‘రఘువరన్ , డ్యూ టు యువర్ లోయర్ పర్ఫార్మెన్ ్స అండ్ నో కమిట్మెంట్ ఫర్ ఆఫీస్ వర్క్, లాట్ ఆఫ్ లీవ్స్, యూ ఆర్ టెర్మినేటెడ్’’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు.రఘువరన్ కి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు.‘‘ఇదంతా నేను కేవలం పదివేల రూపాయలకు కక్కుర్తి పడి కోల్పోయానా!’’ అని అనుకుంటూ అయోమయంలో పడ్డాడు.యాప్ అప్డేట్ చేసుకోకపోవడమే కారణం అనుకొని వెంటనే యాప్ను మళ్లీ ఇన్ స్టాల్ చేయడానికి ప్రయత్నించాడు. ఎంత వెతికినా ఆ యాప్ దొరకలేదు. ఇక చేసేదేమీ లేక లాటరీ ఆఫీసు నుంచి బయటకు వచ్చాడు.కాలు బయట పెట్టగానే చెప్పు తెగిపోయింది. చాలా కష్టంగా రోడ్డు దాటుకొని నిల్చుంటే వెంటనే ఓ కారు అటుగా పోయి బకెట్ బురదను అతని బట్టలపై చల్లి వెళ్లింది. పైపై తుడుచుకొని బస్స్టాండ్కు పరుగెత్తుకుంటూ వెళ్తే, అప్పటిదాకా ఆగి ఉన్న బస్సు రఘువరన్ రాగానే చాలా అర్జెంట్ పని ఉన్నట్లు వేగంగా బయలుదేరింది. దీంతో, ‘ఓరి దేవుడా! ’ అని కాస్త పైకి తలెత్తి చూస్తే, ఎదురుగ్గా, ఒక బోర్డింగ్.. ‘ఐ యామ్ బ్యాక్!’. అది చూడగానే, అప్పటిదాకా దిగాలుగా ఉన్న రఘువరన్ ముఖం ఒక్కసారిగా చిరునవ్వు చిందించింది. ‘‘ఇన్ని రోజులు బ్యాడ్లక్ నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, కాదు.. కాదు.. బ్యాడ్లక్కే నేను బెస్ట్ ఫ్రెండ్ని!’’ అని అనుకొని స్టయిల్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లో’’ అని పాడుకుంటూ చెప్పులు చేతిలో పట్టుకొని నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ∙కొండి దీపిక -
కథాకళి: తల్లి ప్రేమ
డాక్టర్ రాగానే ఆ తల్లి కళ్ళల్లో నీళ్ళు చూశాడు.‘‘డాక్టర్గారు. నెలల పిల్ల. ఒళ్ళు కాలిపోతోంది.’’ ఆ తల్లి దుఃఖంగా చెప్పింది.ఆయన ఆ పిల్ల టెంపరేచర్ చూశాడు.‘‘నూట రెండు! తగ్గకపోగా పెరిగింది. నాకు చేతనైన చికిత్స చేస్తున్నాను. ఆపైన దైవం మీదే భారం. నుదుటి మీద ఉడుకులాం పట్టీని తడిపి వేయడం మానకండి. టెంపరేచర్ ఇంకో గంటలో తగ్గితే సరే, లేదా ప్రమాదం.’’ ఆయన హెచ్చరించాడు.దేవుడిని నమ్మేవారు అసాధ్యాలు సాధ్యాలు అవచ్చని నమ్ముతారు. ఆయన వెళ్ళాక ఆమె పూజగదిలోకి వెళ్ళి, ఏడు తరాల నుంచి తమ కులదైవమైన హూళిగాదేవి విగ్రహం ముందు మోకాళ్ళ మీద కూర్చుని, మనసులో ఆ దేవి రూపాన్ని నింపుకుని, తను అంతదాకా ఏదీ కోరలేదని, తన కూతుర్ని కాపాడే కోరికని తీర్చమని ప్రార్థించసాగింది.‘‘దైవం కొన్ని కోరికలని ఎందుకు తీర్చడంటే అవి చేటు చేస్తాయని.’’ మృదుమధుర కంఠం వినబడి ఆమె కళ్ళు తెరచి చూసింది.ఎదురుగా చిరునవ్వుతో కనపడ్డ దేవిని చూసి ఆ తల్లి కోరింది.‘‘నా కూతుర్ని బతికించు మాతా.’’ఆ పాపకి అమ్మవారి నామాలలో ఒకటైన క్రియేశ్వరి పేరుని ఆ దంపతులు పెట్టుకున్నారు.మూడో ఏడు వచ్చేసరికి క్రియేశ్వరికి అన్ని వస్తువులని విసరడం అలవాటైంది. కనిపించిన వస్తువుని తీసుకుని విసిరి కొడుతుంది.‘‘తప్పు. అది ఎవరికైనా తగలొచ్చు.’’ తల్లి మందలిస్తుంది.ఆరో ఏట క్రియేశ్వరి విసిరిన పుస్తకం అంచు భాగం తండ్రి కంట్లో గుచ్చుకోవడంతో రక్తం కారసాగింది. తక్షణం హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆయన కుడి కంటి చూపు శాశ్వతంగా పోయింది. ‘‘మంచిది. పోయింది నా కన్నేగా. ఇదే పరాయి వాళ్ళ కన్నైతే ఎంతో తగువులాట జరిగేది.’’ తండ్రి చెప్పాడు.క్రియేశ్వరి వస్తువులని విసరడం ఏడో ఏడు దాకా ఆపలేదు.క్రియేశ్వరి ఎనిమిదో ఏట స్కూల్ హెడ్ మాస్టర్ ఆమె తల్లిదండ్రులని పిలిచి టీసీ ఇచ్చి చెప్పాడు.‘‘మీ అమ్మాయి ప్రవర్తన, చదువు ఏ మాత్రం బాలేవు. మీ అమ్మాయిని సరైన దారిలో పెట్టమని నాలుగైదుసార్లు హెచ్చరించినా మీరు పట్టించుకోలేదు. తోటిపిల్లల పుస్తకాలు ఎత్తుకెళ్ళి మిఠాయి షాపుల్లో ఇచ్చి మిఠాయి కొనుక్కుంటోంది. అందరితోనూ పోట్లాటే.’’క్రియేశ్వరికి పన్నెండో ఏడు వచ్చేసరికి మూడు స్కూల్స్ మారింది. తమ కూతురిలోని చెడ్డ లక్షణాలకి ఆ దంపతులకి రంపపు కోతగా ఉంది. క్రియేశ్వరి బంధువులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు తమ ఇంటికి క్రియేశ్వరితో రావద్దని నిష్కర్షగా చెప్పారు.పధ్నాలుగో ఏట వాళ్ళకి క్రియేశ్వరి పెద్ద కష్టాన్ని తెచ్చింది. ఆమె డబ్బు కోసం మగాళ్ళతో గడుపుతోందని ఆమె తల్లిదండ్రులకి తెలిసింది. కుటుంబ గౌరవం మంట కలుపుతోందని మొదటిసారి తండ్రి కూతుర్ని కొట్టాడు. ఆమె ఎదురు తిరిగి తండ్రి కళ్ళజోడుని విరగ్గొట్టి చొక్కాని చింపేసి, ఆయన్ని గదిలో బంధించి తలుపు గడియ పెట్టింది. గంట తర్వాత ఓ వీధి రౌడీ వచ్చి క్రియేశ్వరి తండ్రిని చితకబాదాడు.‘‘ఖబడ్దార్ గుడ్డి నాయాల. క్రియ నాది. దాన్నేమైనా అంటే నిన్ను చంపేస్తాను.’’ బెదిరించాడు.‘‘నేనంటే వాడికి ఎంత ప్రేమో చూశారా?’’ క్రియేశ్వరి నవ్వుతూ చెప్పింది.మరో ఆరు నెలల తర్వాత మరో కష్టం వారికి వచ్చింది. క్రియేశ్వరి గర్భవతైంది. ఆమె బిడ్డని కంటానని పట్టుపట్టింది. బలవంతంగా అబార్షన్ చేయించారు.క్రియేశ్వరికి పదిహేడో ఏట ఆల్కహాల్ అలవాటైంది. పంతొమ్మిదో ఏట కాల్ సెంటర్లో చేరింది. అయితే, ఆమెని మూడు వారాల తర్వాత ఉద్యోగంలోంచి తీసేశారు. తల్లితండ్రులు ఆమెకి పెళ్ళి చేయకూడదని నిర్ణయించుకున్నారు. తన ఇరవై మూడో ఏట క్రియేశ్వరి ఓ ఏభైరెండేళ్ళ ఆయనతో వచ్చి చెప్పింది.‘‘ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు. పెళ్ళి చేసుకుంటాడు. మా పెళ్ళి ఘనంగా చేయండి.’’ఆ పెళ్ళి మానుకోమని బతిమాలారు. క్రియేశ్వరి ఎప్పటిలా పట్టినపట్టు విడవలేదు. ఆమె తండ్రి పీఎఫ్ మొత్తం విత్డ్రా చేసి కూతురి పెళ్ళి జరిపించాడు. వృద్ధాప్యంలో వాళ్ళని ఆదుకునే ప్రధాన వనరు అలా మాయమైంది. ఆమె తన ఇరవై ఎనిమిదో ఏట తండ్రి మీద దావా వేసి గెలిచి, ఇంట్లోని తన భాగాన్ని కావాలని పరాయి మతస్తులకి అమ్మింది. ఆ పొరుగుని భరించలేక వాళ్ళు అద్దె ఇంటికి మారారు. తన తండ్రి తన భాగాన్ని అమ్మాడని రెండేళ్ళ తర్వాత తెలిసి వచ్చి ఆ డబ్బు ఇవ్వమని గొడవ చేసింది. ఆయన నిరాకరిస్తే జరిగిన ఘర్షణలో క్రియేశ్వరి కొట్టిన దెబ్బలకి ఆయన మరణించాడు.‘‘ఇల్లమ్మి ఆ డబ్బు నాకు ఇవ్వనందుకు.’’ అరిచింది.ఎర్రబడ్డ కూతురి మొహంలోని రోషాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని చూసి ఆ తల్లి భయంతో వణికిపోయింది. ఆవిడ చూస్తూండగానే క్రియేశ్వరి మొహంలో క్రమంగా వయసు తగ్గసాగింది. ఇరవై మూడు నించి పదిహేనుకి, పదికి, ఐదుకి, ఏడాదికి, చివరకి మూడు నెలల పసిపాప మొహం కనిపించింది. ఆమె కళ్ళు తెరచి చూస్తే ఉయ్యాలలోని, ఇంకా పేరు పెట్టని తన కూతురు కనిపించింది. తను కలగనలేదని, అమ్మవారు భవిష్యత్తును చూపించిందని గ్రహించింది. మళ్ళీ అశరీరవాణి వినిపించింది.‘‘నీ ప్రార్థనని నువ్వు మన్నిస్తావో లేదో నీ చేతుల్లో ఉంది. పాపని నువ్వు మరో మూడు నిమిషాల్లో ఎత్తుకుంటే బతుకుతుంది. లేదా మరణిస్తుంది.’’అత్యంత అమాయక మొహం గల ఆ పాప కళ్ళు తెరిచి నీరసంగా తల్లి వంక చూస్తూంటే ఆ పాప నోట్లోంచి బలహీనమైన శబ్దాలు వినిపించాయి. రెండు నిమిషాలు తటపటాయించాక ఆమె లేచి పక్కగదిలోకి వెళ్ళింది. అంతలోనే పరిగెత్తుకు వచ్చి ఉయ్యాలలోంచి కూతుర్ని తీసుకుని గుండెలకి హత్తుకుంది. క్రమంగా నూట రెండు నించి టెంపరేచర్ నూట ఒకటికి, వందకి, తొంభై తొమ్మిదికి, చివరకి నార్మల్కి దిగింది.తల్లి తన బిడ్డల మీద ప్రేమని ఎన్నటికీ కోల్పోదు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
స్క్రోలాటం చిట్టి రీల్స్.. గట్టి ఆదాయం
నవ్వించు, ప్రేరేపించు, షేర్ చేయించు ఇవన్నీ రెండు నిమిషాల్లోనే! ఇక్కడ సమయం తక్కువ, ఐడియాలు ఎక్కువ. కాని, పవర్ మాత్రం మ్యాక్స్! టైమింగ్లో రీల్స్ కంటే ఎక్కువ, షార్ట్ ఫిల్మ్ కంటే తక్కువ. కానీ, ఫుల్ ఎంటర్టైన్ మెంట్, ఫుల్ ఇంపాక్ట్, ఫుల్ మనీ! అవే, ఈ టూ మినిట్స్ వీడియోల చిన్న సినిమాలు! అందుకే, ఇవి రీల్స్నే కాదు, రియల్ లైఫ్లోనూ ఫాస్ట్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి.చిన్న వీడియోల పెద్ద హంగామాఒకప్పుడు సినిమా థియేటర్లో మూడు గంటలు కూర్చుని ఒక కథ చూస్తే, ఇప్పుడు అదే ఎమోషన్, అదే మెసేజ్, అదే ఫీల్ను రెండు నిమిషాల వీడియోలోనే చూస్తున్నాం! కారణం? డిజిటల్ ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, డేటా ఇవన్నీ కలసి మనకు రీల్స్ స్క్రోలింగ్ అనే ఒక కొత్త అలవాటు తెచ్చాయి. ఇప్పుడు ఆ రీల్సే కాస్త పెద్దవై షార్ట్ స్క్రోలింగ్ సినిమాలుగా మారాయి. అందుకే, ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, జోష్, మోజ్ ఏ యాప్ తెరిచినా ఒక్కో స్క్రోల్లోనే నవ్వు, డ్రామా, పాట, డ్యాన్ ్స, ట్రెండ్, ఎమోషన్ అన్నీ మీ చేతిలోకి వస్తున్నాయి, అది కూడా రెండు నిమిషాల్లోనే! ఇంతలోనే వాటికి మిలియన్ల వ్యూస్, కోట్ల లైక్స్, సూపర్స్టార్ ఫేమ్. ఈ రెండు నిమిషాల ఫేమ్తో లక్షల ఆదాయం కూడా వస్తోంది.ఎందుకు ఈ పిచ్చి?మనిషి మైండ్ ఇప్పుడు ఫాస్ట్ మోడ్లో ఉంది. తక్కువ టైమ్లో ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ కావాలని కోరుకుంటోంది. పది నిమిషాల వీడియో ఎవరు చూస్తారు? అదే తొంభై సెకన్లలో నవ్వు, ప్రేమ, డ్యాన్ ్స, డ్రామా అన్నీ ఇస్తే, దాన్ని మిస్సవ్వడం కష్టం! అందుకే మనసు వెంటనే ‘నెక్ట్స్’ అంటుంది. ఇదే డోపమైన్ లూప్. ప్రతి స్క్రోల్లో చిన్న సంతోషం, ప్రతి వీడియోలో కొత్త హిట్. సైకాలజిస్టుల మాట ప్రకారం, చిన్న వీడియోలు మన మెదడులో ‘ఇన్ స్టంట్ రివార్డ్’ ఫీలింగ్ కలిగిస్తాయి. అందుకే మనం ‘ఇంకో వీడియో మాత్రమే’ అని మళ్లీ మళ్లీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం! వీటిలో యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్కు ఎక్కువ క్రేజ్ రావడంతో, క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్, వీడియోస్ కంటే రీల్స్లోనే తమ క్రియేటివిటీతో కథలను సృష్టిస్తున్నారు. అలా ‘ఒక్క నిమిషం చాలదు, రెండు నిమిషాలైనా ఇవ్వండి!’ అని క్రియేటర్లు డిమాండ్ చేసినప్పుడు, యూట్యూబ్ ‘సరే! మీకు 180 సెకన్లు!’ అని అంగీకరించింది. ఈ నేపథ్యం వలనే వివిధ రకాల సోషల్ మీడియా యాప్స్ కూడా ఈ రెండు, మూడు నిమిషాల వీడియోలకు ఆసక్తి చూపించడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం, టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్ నిడివి మూడు నిమిషాల వరకు పొడుగవుతుండగా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా పొడవవుతున్నాయి! అలా ఇప్పుడు ప్రపంచం మొత్తం టూ మినిట్స్ రివల్యూషన్ మొదలైంది. క్విక్ కరెన్సీగా!వాణిజ్య ప్రకటనలు అంటే పెద్ద క్యాంపెయిన్, టీవీ యాడ్స్, బిల్బోర్డులను అనుకుంటే, ఇప్పుడు అవి మొబైల్లో ఒక్క స్క్రోల్తో సరిపోతుంది! మార్కెటింగ్ ఇప్పుడు డైలాగ్ కాదు, రెండు నిమిషాల డ్రామాగా మారింది. ఫ్లిప్కార్ట్ రీల్స్లో డిస్కౌంట్ చెబుతుంది, స్విగ్గీ రీల్స్లో కర్రీ చూపిస్తుంది, మీషో రీల్స్లో సేల్స్ పెంచుతుంది! పక్కా మార్కెటింగ్ కన్సల్టెంట్స్ అందరూ ఇదే మంత్రం ‘ప్రోడక్ట్ ఎంత గొప్పదో కాదు, రెండు నిమిషాల్లో ఎవరి మనసు దోచుకుంటామో అదే బ్రాండ్ సక్సెస్!’ అంటున్నారు. వీటికి కంటెంట్ క్రియేటర్స్, ఇన్ ఫ్లుయెన్సర్స్ తోడవటంతో, బ్రాండ్స్కు క్రియేటర్లకు షార్ట్ వీడియోలు ఒక క్విక్ కరెన్సీగా మారాయి. స్టార్టప్స్ కూడా ఈ షార్ట్ వీడియోస్ ఆధారంగా కస్టమర్ను కట్టిపడేస్తున్నాయి. సంక్లిష్టమైన టెక్నాలజీని కేవలం రెండు నిమిషాల్లో అర్థమయ్యేలా చూపించి, మార్కెటింగ్లో కొత్త ఫ్యాషన్ క్రియేట్ చేశారు. మార్కెటింగ్ నిపుణుల ప్రకారం, 2026 నాటికి ప్రపంచం చూసే కంటెంట్లో 70 శాతం షార్ట్ వీడియోలే ఉంటాయి. సినిమా ట్రైలర్లు, యూనివర్సిటీ క్యాంపెయిన్లు, ఏ సందేశాలు అయినా ఇప్పుడు రీల్ రూట్లోనే అందరికీ చేరుతున్నాయి.అంతర్జాతీయ స్థాయిలో..ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘స్క్రోల్, ప్లే, షేర్!’ అనే రిథమ్లో నడుస్తోంది. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, క్వాయ్, మోజ్, జోష్ కలిపి 80 శాతం మొబైల్ డేటా వినియోగానికి కారణం. ఈ కారణంగానే 2020లో యూజర్లు రోజుకు సుమారు 35 నిమిషాలు స్క్రోల్ చేస్తే, ఇప్పుడు 80 నిమిషాలు స్క్రోల్ చేస్తున్నారట! అందులో మన దేశం ముందు వరుసలో ఉంది. రోజుకు సుమారు 65 కోట్ల మంది యూజర్లు ఈ షార్ట్ వీడియోస్ వీక్షిస్తారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల కంటెంట్కు డిమాండ్ ఎక్కువ. అందుకే, స్థానిక క్రియేటర్లు ఇప్పుడు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో, ‘2025 గ్లోబల్ షార్ట్ వీడియోస్ ట్రెండ్స్’ సర్వే ప్రకారం, వివిధ సంస్థలు పరిశీలించిన ఫలితాలను వెల్లడి చేశారు. వివిధ మొబైల్ యాప్ల డేటా, యూజర్ సర్వేలు, సోషల్ మీడియా విశ్లేషణల ద్వారా, ఒక్కో దేశంలో ప్రత్యేక కంటెంట్, ట్రెండ్స్ స్పష్టమయ్యాయి. ప్రతి చోటా స్థానిక భాషలు, సంస్కృతులు ఆధారంగా షార్ట్ వీడియోలు కొత్త దారులు సృష్టిస్తున్నాయి.డబుల్ లైఫ్!ఉదయం బాస్ ‘మీటింగ్ టైమ్’ అంటాడు, రాత్రి ఫాలోవర్స్ ‘రీల్ టైమ్’ అంటారు! ఇలా రెండు ప్రపంచాల మధ్య బ్రిడ్జ్ వేసుకుని నడుస్తున్నవారే డబుల్ లైఫ్ ఇన్ ఫ్లుయెన్సర్లు! పగలు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ్స చేసి, రాత్రి కెమెరా ముందు ప్రెజెన్ ్స ఇస్తున్నారు. ఇలా ఇండియాలో ఇప్పటి వరకు 45 లక్షల షార్ట్ వీడియో క్రియేటర్లు ఉన్నారని, వారిలో దాదాపు 60 శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు లేదా ఫ్రీలాన్సర్లు అని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం చూస్తే, సోషల్ మీడియాలోని క్రియేటర్లలో 40 శాతం మంది రెండు ఉద్యోగాలు చేస్తున్నార ని అంచనా. వీరిలో దాదాపు 6 లక్షల మంది క్రమంగా వీడియోల ద్వారా ఆదాయం పొందుతున్నారు. అంటే పగలు జీతం, రాత్రి వైరల్ వీడియోల ఆదాయం! దీంతో చాలామంది ప్రొఫెషనల్ ఉద్యోగం కంటే ఈ సైడ్ ఇన్ కమ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆఫీస్లో ఇంక్రిమెంట్ రాకపోయినా, రీల్లో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది! అందుకే, ఒక్క రీల్ సక్సెస్ అయితే నెల జీతం కన్నా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. వీరంతా ప్రతిరోజూ ల్యాప్టాప్ బ్యాగ్లో లంచ్ బాక్స్తో పాటు మరో పక్క ట్రైపాడ్తో ఆఫీస్లకు వెళ్తూ, ఒక కొత్త వర్క్ కల్చర్తో పనిచేస్తున్నారు. మరికొందరు ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ మాదిరి ‘వర్క్ ఫ్రమ్ రీల్’ అనే కొత్త ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు! ఇలా వచ్చిన పాపులారిటీతో టీవీ షోలు, ఇంటర్వ్యూలు, బ్రాండ్ కొలాబరేషన్లు, సిల్వర్ స్క్రీన్ చాన్ ్సలు కూడా దక్కించుకుంటున్నారు. ఇలా సాధారణ ఉద్యోగుల కంటే వీరి జీవితం ఇప్పుడు మరింత ఆదాయభరితంగా, ఆనందభరితంగా, వైరల్గా మారింది. ఏఐ క్రియేటర్లు! ఇప్పటి క్రియేటర్లకు కెమెరా మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స కూడా పెద్ద సహాయంగా మారింది. వీడియో తీసేందుకు డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డిజైనర్ అవసరం లేదు. ఏఐ వాయిస్, ఫేస్ ఫిల్టర్, స్మార్ట్ ఎడిటింగ్ యాప్లు ఇవే కొత్త టెక్నాలజీ టీమ్ మెంబర్స్. ఒక క్లిక్తో బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది, వాయిస్ టోన్ అడ్జస్ట్ అవుతుంది, మూడ్కి సరిపోయే మ్యూజిక్ వచ్చేస్తుంది. కెమెరా ముందు ఉన్నది మనిషే కాని, వెనుక ఆలోచిస్తున్నది మొత్తం ఏఐనే. ఇదే కారణంగా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ల వేగం పెరిగింది. ఒకప్పుడు వీడియోకి రోజులు పట్టేది, ఇప్పుడు నిమిషాల్లో సిద్ధమవుతోంది!రీల్లోనే ఫీల్స్, డ్రీమ్స్! బ్రేక్అప్ అయినా, బర్త్డే అయినా ఇప్పుడు ప్రతి ఒక్క సందర్భానికి రీల్ తప్పనిసరి! ముఖ్యంగా 16 నుంచి 25 ఏళ్ల వయసు వారు ‘రియల్ లైఫ్ కంటే రీల్ లైఫ్ బెటర్!’ అని నమ్ముతున్నారు. సినిమా చూడటానికి ఓపిక లేదు కానీ, రీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ‘ఒక్క నిమిషం లవ్ స్టోరీ’, ‘30 సెకండ్ల అడ్వెంచర్’, ‘45 సెకండ్ల ట్రాజెడీ’ ఇవే ఇప్పుడు న్యూ ఏజ్ బ్లాక్బస్టర్స్! జెన్ జీ కి రీల్ అంటే భాష కాదు లైఫ్ స్టయిల్. ఇదే కారణంగా ఈ వయసు వారు సోషల్ మీడియాలో అత్యధికంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఫ్యాషన్ నుంచి ఫుడ్ వరకూ, ట్రావెల్ నుంచి ట్రెండ్ వరకూ అన్నీ వీళ్ల చేతుల్లోనే! అందుకే, అసలైన వైరల్ పవర్ కూడా వీరివద్దే దాగుంది. ప్రాంతీయ భాషల శక్తిప్రపంచం ఇంగ్లీష్లో మాట్లాడినా, సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రాంతీయ భాషలే రాజ్యం చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఉన్న కంటెంట్ ఎక్కువగా వైరల్ అవుతోంది.వీక్షకులు తమ భాషలో ఉన్న కంటెంట్కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇందుకే ఇప్పుడు ప్రతి యాప్ కూడా ‘మీ భాషలో రీల్ క్రియేట్ చేయండి’ అని ప్రోత్సహిస్తోంది. తెలుగు క్రియేటర్ల రీల్స్ ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్స్లోకి చేరాయి!రేపటి రియాలిటీ!భవిష్యత్తులో షార్ట్ వీడియోల ప్రపంచం మరింత టెక్ రిచ్గా మారబోతోంది. త్రీడీ వీడియోలు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ కంటెంట్ ఇవే రేపటి రీల్స్. క్రియేటర్లు ఇప్పుడు కెమెరాతో కాదు, మెటావర్స్లో రికార్డు చేయబోతున్నారు! అప్పుడు ప్రేక్షకులు కేవలం వీడియో చూడరు, దానిలోకి అడుగుపెడతారు. అంటే రేపటి రీల్ కేవలం వినోదం కాదు. ఒక వాస్తవిక అనుభవం అవుతుంది! ఇప్పటికే కొంతమంది క్రియేటర్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. త్వరలోనే రీల్స్ చూడటం కాదు, అందులో జీవించబోతున్నాం. భవిష్యత్తులో రెజ్యూమేలో డిగ్రీ కాదు. ఫాలోవర్స్ కౌంటే కెరీర్ డిసైడ్ చేస్తుందేమో! హై పెయిడ్ జాబ్స్లో షార్ట్ వీడియో క్రియేటర్ ఒకటిగా మారచ్చు కూడా! అప్పుడు, డాక్టర్ రీల్ మధ్యలో ఆపరేషన్ చేస్తాడు. లాయర్ వాదన మధ్యలో ‘లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్!’ అంటాడు. టీచర్ కూడా కెమెరా ముందు ‘టుడేస్ ట్రెండ్!’ అని క్లాస్ మొదలుపెడుతుంది. ఇలా చాలామంది కంటెంట్ క్రియేటర్నే మెయిన్ జాబ్గా, మిగతా ఉద్యోగాలను పార్ట్టైమ్లా చేస్తారేమో!కిచెన్ నుంచి కెమెరా వరకు!భారతదేశంలో షార్ట్ వీడియోల రంగంలో మహిళల సంఖ్య ఆశ్చర్యకరంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం 40 శాతం పైగా షార్ట్ వీడియో క్రియేటర్లు మహిళలే! వంటింటి కథల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ టిప్స్, ఫ్యాషన్ నుంచి ఫిట్నెస్ వరకు, మహిళలు కంటెంట్ ప్రపంచాన్ని కొత్తగా మలుస్తున్నారు. ఇప్పుడు వాళ్లు కేవలం కంటెంట్ క్రియేటర్లు మాత్రమే కాదు, బ్రాండ్ అంబాసిడర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లు, స్టార్టప్ ఫేస్లు కూడా అయ్యారు.లక్షల్లో ఆదాయం!చూస్తున్న వీడియోలు కేవలం రెండు నిమిషాలే అయినా, క్రియేటర్లకు మాత్రం లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇందులో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న క్రియేటర్ మార్కెట్. 2019లో షార్ట్ వీడియో మార్కెట్ విలువ 1.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2025 నాటికి అది 3 బిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా. 2027 నాటికి ఇండియాలో క్రియేటర్ ఎకానమీ 45,000 కోట్ల రూపాయల విలువకు చేరనుంది. అందుకే మార్కెటింగ్ కూడా రీల్ ఫార్మ్లోకి వచ్చేసింది. రెండు నిమిషాల్లో బ్రాండ్ కథ చెప్పగలిగిన వారే గెలుస్తున్నారు. ఒక్క స్క్రోల్కి కోట్ల రూపాయల మార్కెట్– ఇదే కొత్త డిజిటల్ వండర్! ఈ కారణంగానే ఇండియాలో ఇప్పటికే పదకొండు వేలకు పైగా చానెల్స్ మిలియన్ల సబ్స్క్రైబర్లు దాటాయి. రోజూ కోటాను కోట్ల వ్యూస్! అంటే ఒక్కొక్క షార్ట్ వీడియో చూస్తే, మన ఫింగర్స్ స్క్రోల్ చేస్తూ ‘ఓ మై గాడ్!’ అని చెప్పాల్సిందే. మనీకంట్రోల్ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం 45 లక్షల ఇండియాలో క్రియేటర్లలో సుమారు 6 లక్షల మంది డబ్బు సంపాదిస్తున్నారు. వారి సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ ఆధారంగా ఆదాయం వస్తుంది. యూట్యూబ్ గత మూడు సంవత్సరాల్లో 5.8 లక్షల కోట్ల రూపాయలు క్రియేటర్లకు చెల్లించిందట! ఎవరికి తెలుసు? ఈరోజు మీరు చూసిన చిన్న రీల్ రేపటికి లక్షలు తెచ్చే కంటెంట్ కావచ్చు! -
టేస్టీ.. టేస్టీ..పాకిస్తాన్ హల్వా పూరీ, తమిళనాడు పిడి కొళుకట్టై చేసేద్దాం ఇలా..!
తమిళనాడు పిడి కొళుకట్టై కావలసినవి: బియ్యప్పిండి– ఒక కప్పు, బెల్లం తురుము– రుచికి సరిపడా, నీళ్లు– కొన్ని, పచ్చికొబ్బరి తురుము– అర కప్పు, ఏలకుల పొడి– కొద్దిగా, నెయ్యి– ఒక టీ స్పూన్, ఉప్పు– చిటికెడుతయారీ: ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోండి. అందులో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు వేసి స్టవ్పై పెట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, అందులో ఏదైనా చెత్త ఉంటే తొలగించడానికి ఆ బెల్లం నీటిని వడకట్టుకోవాలి. వడకట్టిన బెల్లం నీటిని తిరిగి పాన్లో పోసి, పాకం పట్టించాలి. అందులో ఏలకుల పొడి, కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా గరిటెతో కలపాలి. నీరు బాగా మరుగుతున్న సమయంలో, మంటను పూర్తిగా తగ్గించాలి. ఇప్పుడు, బియ్యప్పిండిని కొద్దికొద్దిగా చల్లుతూ, గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. పిండి దగ్గరపడుతూ, ముద్దలా మారడం మొదలవుతుంది. ఆపకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మొత్తం మిశ్రమం దగ్గరపడి, గిన్నె అంచులను వదిలి ముద్దలా మారిన తర్వాత, వెంటనే మంటను ఆపెయ్యాలి. ఈ ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకుని, కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకుని, ఆ మిశ్రమాన్ని చేతులతో బాగా పిసికి, చిత్రంలో ఉన్న విధంగా చేతులతో ఒత్తుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ పిడి కొళుకట్టైను పూజా సమయాల్లో నైవేద్యంగా కూడా పెడతారు.పాకిస్తాన్ హల్వా పూరీకావలసినవి: బొంబాయి రవ్వ– ఒక కప్పుపంచదార – అర కప్పు, బటర్– పావుకప్పు (కరిగించాలి)పాలు– రెండున్నర కప్పులు, పలుకులుగా చేసిన నట్స్ – ఒక గుప్పెడు, ఏలకులు – 3, నెయ్యి– 3 టేబుల్స్పూన్లుపూరీలు– 4 లేదా 5 (అభిరుచిని బట్టి పిండిలో పంచదార కూడా వేసుకోవచ్చు)తయారీ: ముందుగా ఒక పాత్రలో బొంబాయి రవ్వ, నెయ్యి వేసి, గరిటెతో తిప్పుతూ వేయించాలి. రవ్వ మంచి వాసన వచ్చాక, బటర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఏలకుల పొడి వేసి కలపాలి. తర్వాత పంచదార వేసి, కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి. అనంతరం నట్స్ వేసి బాగా కలపాలి. చివరిగా, పాలను నెమ్మదిగా పోస్తూ, జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. దగ్గరపడే వరకు కలుపుతూ, ఉడికించాలి. హల్వా వేడిగా ఉన్నప్పుడే, నెయ్యి వేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పూరీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.క్రిస్పీ కోకోనట్ చికెన్కావలసినవి: బోన్లెస్ చికెన్– అరకిలో (నిలువుగా కట్ చేసుకోవాలి)జొన్న పిండి, కొబ్బరి తురుము– పావు కప్పు చొప్పున, గుడ్లు– 2పాలు– 3 టేబుల్ స్పూన్లు(చిక్కటివి)పచ్చిమిర్చి పేస్ట్– ఒక టీ స్పూన్అల్లం వెల్లుల్లి పేస్ట్– అర టీ స్పూన్ఇంగువ– చిటికెడు, నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి– అర టీ స్పూన్ చొప్పునఉప్పు, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని, అందులో చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి ముక్కలకు మొత్తం ఆ మిశ్రమాన్ని పట్టించి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో జొన్న పిండి, ఇంకో బౌల్లో పాలు–గుడ్లు మిశ్రమం, మరో బౌల్లో కొబ్బరి తురుము వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్క తీసుకుని, మొదట జొన్నపిండిలో, తర్వాత గుడ్ల మిశ్రమంలో, ఆ తర్వాత కొబ్బరి తురుములో ముంచి, బాగా పట్టించి– నూనెలో డీప్ఫ్రై చేసుకోవాలి. (చదవండి: ‘విలేజ్ హాలోవీన్ పరేడ్’కి వెళ్లాలంటే..గట్స్ ఉండాలి..!) -
కథాకళి: డేంజర్ డివైజ్
అది హైద్రాబాద్లోని పాపులర్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటి. దాని ప్రిన్సిపాల్ వైద్యరాజ్ గదిలోకి వచ్చిన ప్యూన్ ఓ కాగితాన్ని ఇచ్చాడు. దాని వెనక ‘మీ స్టూడెంట్ ఫాదర్ని. దయచేసి ఓ ఐదు నిమిషాలు మీతో మాట్లాడే సమయం కేటాయించగలరా?’ అని ఇంగ్లీష్లో రాసుంది.‘‘రమ్మను.’’ ఆయన చెప్పాడు.లోపలకి వచ్చిన ఆయన వయసు నలభైఐదు– ఏభై మధ్య ఉండచ్చని వైద్యరాజ్ అనుకున్నాడు. అతని దుస్తులని బట్టి మధ్యతరగతి మనిషని కూడా గ్రహించాడు.‘‘రండి. కూర్చోండి.’’ మర్యాదగా ఆహ్వానించాడు.‘‘థాంక్ యు సర్. మీరు బిజీ అని నాకు తెలుసు.’’ ఆయన కంఠం సౌమ్యంగా ఉంది.‘‘నేను ఉన్నది మీ కోసమే. చెప్పండి.’’‘‘నా సమస్యని మీకు చెప్పాలని వచ్చాను. మా రెండో అమ్మాయి మీ కాలేజ్లో థర్డ్ ఇయర్ స్టూడెంట్. మీ కాలేజీలో చేరక మునుపే దానికి మొబైల్ కొనిచ్చాను.’’ కొద్దిగా బాధగా చెప్పాడు.‘‘ఈ రోజుల్లో కుటుంబంలో ప్రతివారికీ ఓ మొబైల్ తప్పనిసరి.’’ వైద్యరాజ్ చెప్పాడు.‘‘ఇప్పుడు ప్రతి మొబైల్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ తో వస్తోంది. కాబట్టి నేను మా నలుగురి పాస్వర్డ్స్ని ఓ కాగితం మీద రాసి దాన్ని ఫ్రిజ్కి మేగ్నెట్తో తగిలించాను. నిన్న రాత్రి నేను మా ఆవిడకి పంపే ఈమెయిల్ మెసేజ్ని పొరపాటున మా అమ్మాయికి పంపాను. అది మా అమ్మాయి పెట్టే అధిక ఖర్చు గురించిన వివరాలు. నా తప్పుని గ్రహించాక వెంటనే దాన్ని మా అమ్మాయి జీమెయిల్లోంచి డిలీట్ చేయాలని అనుకున్నాను. అది ఆ సమయంలో నిద్రపోతోంది. పాస్వర్డ్ చూసి మా అమ్మాయి ఫోన్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే అది తెరచుకోలేదు. మా అమ్మాయి నిద్ర లేచాక ఫోన్ పాస్వర్డ్ ఎందుకు పని చేయలేదని అడిగాను. మార్చానంది. కొత్తది చెప్పమంటే నీళ్ళు నమిలింది. దాన్ని తెరచి ఇవ్వమంటే సందేహించింది. నేను గట్టిగా అరిస్తే వణుకుతూ తెరిచింది. వాట్సప్ ఓపెనైంది. అందులో టాప్లో ఓ అబ్బాయి నుంచి అప్పటికే ఐదారు మెసేజెస్ వచ్చి ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తే...’’అతను స్వల్పంగా సిగ్గుతో ఆగాడు. తర్వాత కొనసాగించాడు.‘‘రెండు బూతు వీడియోలు, అలాంటి ఫొటోలు నాలుగు కనిపించి షాకయ్యాను.’’‘‘ఓ!’’ వైద్యరాజ్ వెంటనే ఆశ్చర్యంగా చెప్పాడు.‘‘ఆ అబ్బాయి తన సీనియర్ అని చెప్పింది.’’‘‘పేరు?’’‘‘నేను ఆ అబ్బాయి మీద ఫిర్యాదు చేయడానికి రాలేదు. మీ స్టూడెంట్స్ అంతా ఇలా విచ్చలవిడిగా ఉన్నారేమోనని ఫిర్యాదు చేయడానికి వచ్చాను. మీరు మీ స్టూడెంట్స్ తల్లిదండ్రులకి తమ పిల్లల మొబైల్స్ మీద ఓ కన్నేసి ఉంచమని సూచించమని చెప్పడానికి వచ్చాను సార్. వయసులోని వారికి మొబైల్ ద్వారా సీక్రెసీ, ఏక్సెసిబిలిటీ అందుబాటులోకి వచ్చాక మన కళ్ళముందే ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలీదు. వయసు మహిమ. ఇది మీ దృష్టికి తెస్తే కొందరి జీవితాలైనా బాగుపడచ్చు అనిపించింది.’’‘‘ఇది సీరియస్ ప్రాబ్లం. ఇది నాకు చెప్పినందుకు థాంక్స్. దీని గురించి ఏం చెయ్యాలో ఆలోచిస్తాను.’’ఆయన ఇంకా ఏదో చెప్పాలనుకుని ఆగాడు. ఆయన మొహంలోని అనిశ్చితిని గమనించాక ప్రిన్సిపాల్ అడిగాడు.‘‘ఇంకేదైనా ఉందా?’’‘‘ఎస్. తర్వాత మా ఆవిడ ఫోన్ ని కూడా నేను పంపింది డిలీట్ చేయడానికి తెరవాలని ప్రయత్నించాను. కాని ఆవిడ కూడా తన పాస్వర్డ్ని మార్చేసింది! మార్చినా నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను. వెంటనే ఆమె మొహం పాలిపోయింది. తెరిపించి చూస్తే వాట్సప్లో ఎవరికో ఆమె పంపిన రొమాంటిక్ పోస్ట్లు, అక్కడి నుంచి వచ్చినవి కనిపించాయి. అది ఆర్కైవ్స్లో దాక్కుని ఉంది! నా దిమ్మ తిరిగిపోయింది సర్. మొబైల్ వరం అనుకున్నాను. కాని శాపం కూడా సార్. చాలామందికి ఈ కొత్తరకం టైమ్పాస్ జీవితాలని నాశనం చేసే శాపం అనుకుంటున్నాను.’’ ఆయన బాధగా చెప్పాడు.వైద్యరాజ్కి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు. అతను వెళ్ళాక కాగితం అందుకుని విద్యార్థుల తల్లితండ్రులకి ఓ సర్కులర్ని డ్రాఫ్ట్ చేయసాగాడు.ఇంటికి వెళ్ళాక ప్రిన్సిపాల్ వైద్యరాజ్ తన భార్య స్నానానికి వెళ్ళేదాకా ఆగి, ఆవిడ మొబైల్ని తెరిచే ప్రయత్నం చేసి, పాస్వర్డ్ మారిందని గ్రహించాడు.ఆవిడ వచ్చాక తన మొబైల్ ని ఆవిడకి ఇచ్చి చాలా మామూలుగా చెప్పాడు.‘‘పాస్వర్డ్లు ఓ పట్టాన గుర్తుండవు. ఫింగర్ ప్రింట్స్తో కూడా తెరిచే మొబైల్స్ మనవి. నా దాంట్లో నీ ఫింగర్ ప్రింట్, నీ దాంట్లో నా ఫింగర్ ప్రింటూ పెట్టుకుందాం. ముందు నా దాంట్లో మారుద్దాం.’’ఆమె మొహం కొద్దిగా పాలిపోయింది. తన ఫింగర్ ప్రింట్ని కూడా ఆమె దాంట్లో నమోదు చేశాడు. నివారణ చర్య జరిగింది కాబట్టి తన భార్య మొబైల్లో ఏం ఉందోనని వెదికి ఆ విద్యార్థిని తండ్రిలా ఆయన తన మనసు పాడుచేసుకోదలచుకోలేదు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
చావుతెలివి!
ఇన్సూరెన్స్ కోసం హత్యలు చేసిన వాళ్లని; ఆస్తులు తగలపెట్టుకున్న వాళ్లని; అక్రమాలకు పాల్పడిన వాళ్లని చూస్తూనే ఉంటాం. వీటన్నింటికీ భిన్నమైన వ్యవహారం 2012లో చోటు చేసుకుంది. అమెరికాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రవాస భారతీయుడు (ఎన్నారై) ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. వీటి నుంచి బయటపడటానికి తనపై ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడమే మార్గమని భావించాడు. దీనికోసం తానే చనిపోయినట్లు కథ అల్లాడు. దీనికి సంబంధించిన వ్యవహారం ఆద్యంతం పక్కాగానే నడిచినా, ఇన్సూరెన్స్ కంపెనీ క్రాస్ వెరిఫికేషన్లో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ హైడ్రామాలో సూత్రధారితో పాటు పాత్రధారులుగా ఉన్న ఓ వైద్యుడు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిబ్బందికీ ఉచ్చు బిగిసింది. హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్లో ఉన్న హైదర్గూడ ప్రాంతానికి చెందిన సోమారం కమలాకర్ రెండో కుమారుడు రాజ్కమల్. ఇతడికి తొమ్మిది నెలల వయస్సు ఉన్నప్పుడే ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి మేరీలాండ్లో స్థిరపడింది. కమలాకర్ మేల్ నర్స్గా, ఆయన భార్య స్టాఫ్ నర్స్గా పని చేసేవాళ్లు. రాజ్కమల్ అక్కడే ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఇతడి తల్లి అక్కడ ఓ ఇల్లు కొనుగోలు చేయడానికి అప్పులు చేసింది. ఆ అప్పులతోనే తిప్పలు ప్రారంభమయ్యాయి. అప్పులకు తోడు వడ్డీలు పెరిగిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఓ దశలో రాజ్కమల్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల కార్డులన్నీ బ్లాక్ అయిపోయాయి. దీంతో గత్యంతరం లేక అతడి సన్నిహితురాలైన శ్రీలంక జాతీయురాలికి చెందిన కార్డుల్నీ వినియోగించేశాడు. దీంతో మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.రాజ్కమల్ అమెరికాలోని మెట్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 75 వేల డాలర్లు (దాదాపు రూ.15 లక్షలు) విలువైన పాలసీ తీసుకున్నాడు. దీనికి తన సోదరిని నామినీగా పెట్టాడు. 2012లో రాజేంద్రనగర్లోని స్వస్థలానికి వచ్చిన రాజ్కమల్ అప్పుల బాధ నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను అన్వేషించాడు. ఇక్కడే తాను చనిపోయినట్లు నాటకమాడి, అందుకు అవసరమైన ధ్రువీకరణలు సంపాదించాలని పథకం వేశాడు. వీటిని దాఖలు చేయించడం ద్వారా అమెరికాలో ఉన్న ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకోవాలని కుట్రపన్నాడు. దీన్ని అమలులో పెట్టడానికి సహకరించాల్సిందిగా రాజేంద్రనగర్లోని శివరామ్పల్లిలో నివసించే తన బంధువు, అప్పట్లో జీహెచ్ఎంసీ ఉద్యోగి అయిన ప్రసన్నకుమార్ను సంప్రదించాడు. రాజ్కమల్ ‘చావు’కు సహకరించడానికి ప్రసన్నకుమార్ అంగీకరించారు. ఈ హైడ్రామాకు అవసరమైన పత్రాల సమీకరణ కోసం ఈ ద్వయం అనేక ఫోర్జరీలు చేసింది. ప్రసన్నకుమార్ తొలుత హైదర్గూడలో ఓ నర్సింగ్హోమ్ నిర్వహించే తన పరిచయస్తుడిని సంప్రదించాడు. బాగా కావాల్సిన వారి తరఫు వారు మృతి చెందారని, డెత్ సర్టిఫికెట్ కావాలని కోరాడు. నిజమని నమ్మిన ఆయన పూర్వాపరాలు పట్టించుకోకుండా, అంగీకరించారు. ఇలా రాజ్కమల్ పేరుతో డెత్ సర్టిఫికెట్ సిద్ధమైంది. 2012 డిసెంబర్ 12న ప్రసన్న కుమార్కు కుమారుడు పుట్టి చనిపోయాడు. ఆ శిశువును శివరామ్పల్లిలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ ధ్రువీకరణలను ఫోర్జరీ చేయడం ద్వారా రాజ్కమల్ను ఖననం చేసినట్లు పత్రాలు సృష్టించారు. వీటి ఆధారంగా రాజేంద్రనగర్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పని చేసే కుమార్ను సంప్రదించారు. అతడి ద్వారా జీహెచ్ఎంసీ రికార్డుల్లోకి ఈ మరణాన్ని జొప్పించారు. ఆపై ఈ–సేవ కేంద్రం నుంచి రాజ్కమల్ చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం పొందారు. ఇవన్నీ కలిపి రాజ్కమల్ చనిపోయినట్లు మెట్లైఫ్ కంపెనీకి తన స్నేహితుడి ద్వారా క్లెయిమ్ పంపారు. రాజ్కమల్ చనిపోయినట్లు వచ్చిన క్లెయిమ్ పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీ సైతం పరిగణనలోకి తీసుకుంది. అయితే నగదు విడుదల చేయడానికి ముందు ప్రాథమిక పరిశీలన చేపట్టింది. ఇందులో భాగంగా హైదర్గూడలోని సదరు నర్సింగ్హోమ్ అధిపతిని సంప్రదించింది. కంపెనీ అడిగిన ప్రశ్నలకు, ఆయన చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో అనుమానం వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ తమ ప్రతినిధుల్ని రంగంలోకి దింపి లోతుగా ఆరా తీయించింది. ఇలా రాజ్కమల్ ‘చావు’తెలివి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో నేరం జరిగినట్లు గుర్తించిన పోలీసులు రాజ్కమల్తో పాటు ప్రసన్నకుమార్, కుమార్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులూ అంతర్గత విచారణ చేశారు. బాధ్యుల్లో కొందరిని సస్పెండ్ చేయడంతో పాటు మరికొందరిని విధుల నుంచి తొలగించారు. -
ఈ వారం కథ: ఒక్క క్షణం!
నిత్యకు పెళ్లి చూపులు. పెళ్లిచూపులు అనగానే సాధారణంగా వయసొచ్చిన ఏ ఆడపిల్ల మొహంలోనైనా పెళ్లి కళ ఉట్టిపడే మెరుపు కనిపిస్తుంది. దానికి భిన్నంగా నిత్య మొహంలో ఏదో టెన్షన్!నిత్య భయాందోళనలకు కారణం వచ్చిన సంబంధం నచ్చకపోవడం కాదు – మొదటిసారి పెళ్లి చూపుల పేరుతో మగపెళ్లివారి ముందు కూర్చోవడం. పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఎన్ని సంబంధాలు వచ్చినా, తల్లి తాయారమ్మ వాటిని నిత్య నిర్ణయం వరకు రానివ్వలేదు. అందం, గుణం, చదువు అన్నిటిలోనూ ముందు వరసలో నిలిచే ఒప్పుల కుప్ప నిత్య. అలాంటి నిత్యను పెళ్లి చేసుకోవడానికి ఒక మాదిరి వరుడెవరూ సరిపోడని, నవలా నాయకుడు వంటి వాడు రావాలని తాయారమ్మ దృఢమైన అభిప్రాయం. అందువల్లనే వచ్చిన సంబంధాలన్నీ తాయారమ్మ వడపోతలోనే వీగిపోతున్నాయి. కాని, ఈసారి వచ్చిన జానకి రామయ్య సంబంధం బంగారం లాంటిదని, దీనిని కాదనడం అదృష్ట దేవత తలుపు తడుతుంటే తెరవక పోవడమేనని పెళ్లిళ్ల పేరయ్య మరీ మరీ చెప్పడంతో తాయారమ్మ కొంచెం మెత్తబడింది. పెళ్లిచూపులు ఏర్పాటు చెయ్యడానికి ఒప్పుకుంది.ఎప్పుడూ యెటువంటి పరీక్షల భయం లేకుండా, నల్లేరు మీద నడకలా ‘బి.టెక్.’ వరకు నిరాటంకంగా ఉత్తీర్ణురాలవుతూ పట్టా తీసుకున్న నిత్యకు పెళ్లి చూపుల పరీక్ష అంటే భయం పట్టుకుంది. తీరా వరుణ్ణి చూసిన తర్వాత తన నిర్ణయం చెప్పడానికి, బాగోగులు చర్చించి సలహాలివ్వడానికి తల్లి, అన్నయ్య మాత్రమే ఉన్నారు. అన్నయ్య చందు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆఫీసులో అత్యవసరమైన పని తగిలిందనీ, సమయానికి వచ్చేస్తాననీ, ఈలోగా ముహూర్తం ప్రకారం తంతు కానివ్వమనీ ఫోన్ చేశాడు. ఒకవేళ చందు రావడం ఆలస్యమయితే ఈలోగా ఏ మాటా చెప్పమని అవతలి వాళ్లు వొత్తిడి చేస్తే – అమ్మ మాత్రమే గతవుతుంది. కాని అమ్మ ఏ విషయంలోనూ ఓ పట్టాన నిర్ణయం తీసుకోలేని నిత్యశంకితురాలు.తల్లి ఆమె పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయానికి యిప్పటికీ బాధపడుతుండడం తనకు తెలుసు. అందువల్ల పూర్తిగా తల్లి మీద ఆధారపడ్డం కంటె మరొకరెవరైనా వుంటే మంచిదని నిత్య చిన్నప్పటి నుంచి తనతో కలిసి చదువుకొన్న సత్యను తోడుగా రమ్మని పిలిచింది. సత్య కుటుంబం వుండేది పక్క వీథిలోనే గనుక ఆమె పిలిచింది తడవుగా వచ్చింది. సత్య కూడా నిత్య ఈడుదే గనుక ఆమెను పెళ్లిచూపుల్లో పక్కన కూర్చోపెట్టుకోవద్దని తాయరమ్మ నిత్యను చాటుకు పిల్చి చెప్పింది. తల్లి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న నిత్య తనకే విషయంలోనూ సత్య పోటీ కాదని, కొత్తవాళ్ల ముందు తను ‘నెర్వస్’ కాకుండా ఆమె తోడుగా వుంటుందని తన చర్యను సమర్థించుకొంది.నిత్యతో పోలిస్తే సత్య అంత తెలివైంది కాదు. పరీక్షల్లో మాత్రం యెక్కడా తప్పకుండా తను కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అనిపించుకుంది. సత్య తల్లిదండ్రులిద్దరూ ఒక పేరున్న ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు. కాంపౌండర్ గా పనిచేస్తున్న సత్య తండ్రి తాగుడు వ్యసనంతో విధులకు సరిగా హాజరు కాకపోయినా, డాక్టర్ గారు పట్టించుకోరని, నర్స్గా మంచి నైపుణ్యం వున్న సత్య తల్లి శకుంతలను మాత్రం ఆయన ప్రత్యేకాభిమానంతో చూస్తారని జనం చెప్పుకుంటారు. ఆ అభిమానానికి అక్రమసంబంధం కూడా కారణమని డాక్టర్ ఆంతరంగికులు చెవులు కొరుక్కుంటారు. నిజానిజాల మాటెలావున్నా సత్య కుటుంబ నేపథ్యం మీద సదభిప్రాయం లేని తాయారమ్మ సత్య తరచుగా తమ యింటికి రావడానికి యిష్టపడదు. చనువు పెరిగితే కొడుకు చందుకు సత్య యెక్కడ వల వేస్తుందోనని కూడా తాయారమ్మ అనుమానం.సిద్ధాంతిగారు పెట్టిన ముహూర్త సమయానికి వధువును చూపించాలని పెళ్లిళ్ల పేరయ్య అవధాని తొందర పెట్టడంతో ఆ చాదస్తం నచ్చక విసుక్కుంటున్న నిత్యను బతిమాలి మగపెళ్లివారి ముందుకు తీసుకెళ్లింది తాయారమ్మ. నిత్య కోరిక ప్రకారం సత్య కూడా ఆమెకు తోడుగా వెళ్లింది. పెళ్లికూతుర్ని చూడ్డానికి వరుడు జానకిరామయ్య కూడా అతని చిన్నాన్న, పిన్ని మాత్రమే వచ్చారు. తల్లి సూచన మేరకు సంప్రదాయాన్ని పాటిస్తూ తలవంచుకుని కూర్చున్న నిత్యను తలెత్తి వరుణ్ని చూడమన్నట్టు గిల్లి, సైగ చేసింది సత్య. వరుడు జానకి రామయ్య వంక నిత్య ఓరగా చూసింది. డ్రెస్సింగ్ విషయంలో సింపుల్ గా వున్నా, అందమైనవాడే అనుకుంది. మధ్యవర్తి అవధాని ముందుగానే వర్ణించి చెప్పినట్టు లక్షణంగా వున్న నిత్యను చూసి పెళ్లికొడుకు చిన్నాన్న, పిన్ని పెళ్లికొడుకు అభిప్రాయాన్ని ప్రత్యేకంగా అడక్కుండానే తమకు నచ్చినట్టు కళ్లతో వ్యక్తం చేశారు. అదను చూసుకొని అవధాని ఇరుపక్షాలను వుద్దేశించి పరిచయ ప్రసంగం ప్రారంభించాడు.‘అయ్యా, నేను ముందే మనవి చేసినట్టు వధూవరులు ఒకరికొకరు సరిపోతారు. అమ్మాయిని చూశారు కదా! సాక్షాత్తూ మహాలక్ష్మే. తన చదువు సంధ్యల గురించి, గుణగుణాల గురించి తెలియజేసిన తర్వాతే తమను తీసుకొచ్చాను. ఇక అబ్బాయి పేరుకు తగ్గట్టుగానే అపర శ్రీరామచంద్రుడు. ఈ కాలంలో వుండాల్సిన కుర్రాడు కాదు. పోతే ఇతని చిన్నతనంలోనే తల్లి దండ్రులు గతించడం వల్ల పిన్ని బాబాయిల పెంపకంలో పెరిగాడు. ఇక్కడి చదువులు సరిపోక ఢిల్లీలో వుండి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు చదువుతున్నాడట. ఆరోగ్యం దృష్ట్యా వండి పెడుతూ ఆలనా పాలనా చూసేవాళ్లుంటే చదువుమీద దృష్టి పెట్టడానికి వీలుగా వుంటుందని పెళ్లిప్రయత్నాలు ప్రారంభించారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏ జిల్లా కలెక్టరో అవుతాడు. ఇంతవరకు కల్యాణ ఘడియలు రాకపోవడం వల్ల ఈ సంబంధం మీ వరకు వచ్చింది...!’’అవధాని చెప్పడం పూర్తికాకుండానే వరుడి బాబాయి శివయ్య కలిగించుకొని వరుడి విషయంలో తమ పాత్ర గురించి తెలియజేశాడు.‘పూర్వజన్మలో యెంతో పుణ్యం చేసుకుంటే తప్ప మా జానకిరాముడు లాంటి బుద్ధిమంతుడు భర్తగా దొరకడు. మా అన్నయ్యకిచ్చిన మాట ప్రకారం పెంచి పెద్ద చెయ్యడం తప్ప పెళ్లయాక తనమీద మా పెత్తనం కూడా వుండదు. తన తెలివికి, చదువు మీద శ్రద్ధకూ తప్పకుండా కలెక్టరు అవుతాడని అందరూ అంటున్నారు. ఒకవేళ వుద్యోగం లేకపోయినా మా వాడు బతకడానికి లోటులేని ఆస్తి, అతని వాటామీద నేను కూడబెట్టిన డబ్బు వున్నాయి. అందువల్ల కట్నకానుకలు కూడా మేము ఆశించడం లేదు. అమ్మాయి మాకు నచ్చింది. మీరు అమ్మాయిని లోపలకు తీసుకెళ్లి అభిప్రాయం తెలుసుకుంటే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుందాం...’’‘‘అమ్మా నిత్యా, అన్నీ విన్నావు కదా. అయినా అబ్బాయితో కూడా మాట్లాడతానంటే లోపలకెళ్లి మాట్లాడుకోవచ్చు. ఉభయులూ చదువుకున్నవాళ్లు గనుక ముందుగా మనసులు విప్పి మాట్లాడుకోవడంలో తప్పు లేదు...’’ అంటూ అవధాని చేసిన ప్రతిపాదనను ఆ అవసరం లేదన్నట్టు యిద్దరూ సున్నితంగా తిరస్కరించారు.నిత్యను లోపలకు తీసుకెళ్లిన తర్వాత ముగ్గరి మధ్య పెళ్లికొడుకు గురించిన చర్చ ప్రారంభమైంది.‘‘పెళ్లి కొడుకు బొత్తిగా నోట్లో నాలుకలేని మెత్తని మనిషిలా వున్నాడు’’ అంటూ ముందుగా తాయారమ్మ అనుమానాన్ని వ్యక్తం చేసింది.‘‘అవసరం లేనిదే నోరువిప్పని అల్లుడు దొరికితే మీకే మంచిది కదా ఆంటీ. చీటికీ మాటికీ గొంతెమ్మ కోర్కెలు కోరకుండా వుంటాడు. ఆ పైన సంసారంలో ఆడదాని మాటే చెల్లుతుంది.’’ సత్య పెళ్లికొడుకు మౌనాన్ని సమర్థించింది.‘‘నాకయితే పెళ్లికొడుకు తెగ నచ్చేశాడు. ఇలాంటి బుద్ధుడు దొరికితే నేనెగిరి గంతేసి చేసుకుంటాను. నిత్యా, నీకు ఓకేనా? ఏమైనా అనుమానాలున్నాయా?’’ సత్య నిత్యను కదిలించింది.‘‘ముసలోడి పేరులా ఆ పాత తరహా పేరు నచ్చలేదు. కళ్లజోడు పెట్టుకోవడం వల్ల యెక్కువ వయసున్నవాడిలా కనిపిస్తున్నాడు. పెళ్లిచూపుల్లో నయినా ‘షూ’ వేసుకొని ‘ఇన్ షర్ట్’ చేసుకొని రాలేదంటే అచ్చటా ముచ్చటా తెలియని అడవిమనిషిలా వున్నాడు. ఇంకా...’’‘‘ఊ... ఇంకా ఈ కాలపు కుర్రాళ్లలా ఫ్యాషన్ పేరుతో గడ్డం పెంచి బూచాడి అవతారంలో రాలేదు. లేకపోతే ఏమిటీ నీ సిల్లీ డౌట్స్? అబ్బాయి నీట్గా ‘హేండ్సమ్’గా పాత సినిమాల్లో హీరోలా వున్నాడు. ఈ ఆఫర్ నీకు ‘జాక్ పాట్’ లాంటిది ఎక్కువగా ఆలోచించక ముందు ‘ఊ’ అను...’’సత్య హితోపదేశం పూర్తి కాకుండా తలుపు తోసుకొని అవధాని లోనికొచ్చాడు.‘‘ఏమ్మా? మీ ఆలోచనలింకా తెమల్లేదా? మగపెళ్లివారు మీ నుంచి తీపికబురు కోసం యెదురు చూస్తున్నారు. సాధారణంగా పెళ్లిచూపుల్లో ఆడపిల్ల యిష్టం తెలుసుకోకుండా పెళ్లికొడుకు తరఫువాళ్లు ‘స్పాట్’లో అవునో కాదో తేల్చకుండా తర్వాత కబురు చేస్తామని వెళ్లిపోతారు. అలాంటిది వీళ్లు మంచివాళ్లు గనుక ముందుగా తాము ‘సరే’ అని, ఆ తర్వాత పెళ్లి కూతురికి నోరు విప్పే స్వేచ్ఛనిస్తున్నారు. నిజానికి యిప్పుడు కాకపోతే మూడేళ్ల వరకు వివాహం జరగదని సిద్ధాంతి హెచ్చరించకపోతే యిప్పుడీ సంబంధం మీ వరకు వచ్చేది కాదు. అబ్బాయి ఏ వ్యసనాలు లేని వజ్రం. అత్త పెత్తనం, ఆడబిడ్డ పోరు లేవు. అందువల్ల మీరు యెక్కువగా ఆలోచించి సంబంధం దాటపెట్టుకోకండి. ఏ వయసులో ఆ ముచ్చట ఆ వయసులో జరగాలి. మీరు అవునంటే ఈ శుభవార్త వారికి చెప్పేస్తాను. ‘ఆలస్యాత్ అమృతం విషం’ అన్నారు. ఏం తాయారమ్మగారూ, సరేనా?...’’అటు సత్య, యిటు అవధాని ‘బ్రెయిన్ వాష్’ చెయ్యడంతో తల్లీ కూతుళ్లిద్దరూ సానుకూలమైన ధోరణికి వచ్చారు. తాయారమ్మ అవధానికి ‘సరే’ అని చెపుదామని నోటి చివరి వరకు వచ్చేసరికి చందు హడావిడిగా వచ్చి వాళ్లలో చేరాడు. కొడుకు సమయానికి రావడం శుభసూచికంగా భావించిన తాయారమ్మ పెళ్లికొడుకు వివరాలు అతనికి చెప్పి అంతిమనిర్ణయం అతనికి విడిచిపెట్టి వూగిసలాట నుంచి బయటపడింది. చందు పెళ్లివారి దగ్గరకెళ్లి, తనను పరిచయం చేసుకొని పెళ్లికొడుకుతో మాట్లాడి, తిరిగి లోపలకొచ్చి తల్లికి, చెల్లికి తన అభిప్రాయం తెలియజేశాడు.‘‘సంబంధం నిస్సందేహంగా మంచిదే. కాని ‘సివిల్ సర్వీసెస్’ పరీక్ష లాటరీ లాంటిది. దానిలో సక్సెస్ కావడానికి ‘మెరిట్’తో పాటు అదృష్టం కూడా కలసిరావాలి. దానినే లక్ష్యంగా పెట్టుకొని సాధించలేక చతికిలపడిన మేధావులెందరో వున్నారు. సో, నిత్యకింకా వయసు దాటిపోలేదు గనుక రెండేళ్లు ఆగగలిగితే ఈ సంబంధం చేసుకుందాం...’’అసలే చప్పున ఏ నిర్ణయమూ తీసుకోలేని తాయారమ్మకు ‘కర్ర విరక్కుండా పాము చావకుండా’ రీతిలో కొడుకు చెప్పిన మాటలు రుచించాయి. అవధాని ద్వారా విషయం విన్న పెళ్లివారు నిరాశగా వెనుదిరిగారు!తాయారమ్మకు నలభయ్యేళ్ల నాటి తన పెళ్లి సంగతి గుర్తొచ్చింది. క్లాసులో యెప్పుడూ ఫస్ట్ వచ్చే తనను పెళ్లీడు వచ్చిందని సవతితల్లి చదువు మానిపించి సంబంధాలు వెతకడం ప్రారంభించింది. తండ్రి ఆమెకెదురు చెప్పలేని నిస్సహాయుడు. ఎవరో ఒకడికి కట్టబెట్టి తనను వదిలించుకోవడమే ధ్యేయంగా ఆమె అడ్డమైన సంబంధాలకు యెగబడేది. అలా తెచ్చిన సంబంధాలలో గుడ్డిలో మెల్లలాంటిది వెంకటేశ్వర్లు మాష్టారిది. ‘గవర్నమెంటు వుద్యోగం, నీ మొహానికి యింతకంటె యెవరొస్తారు, ఒప్పుకో’మని సవతితల్లి అనసూయ బలవంతపెట్టింది. తండ్రి కూడా భార్యా విధేయతతో తనకు సర్ది చెప్పబోయాడు. అయినా, నల్లగా నాజూగ్గా లేని వరుణ్ని చూసి తను యిష్టపడలేదు. ధైర్యం చేసి నచ్చలేదని చెప్పబోతుండగా సమయానికి గుమ్మంలోకొచ్చిన వరసకు అన్నయ్య అయిన రాఘవులు కలుగజేసుకొని పెళ్లికొడుకు స్థితిగతులు తెలుసుకొని ‘ఫర్వాలేదు, చేసుకొ’మ్మని సలహాయిచ్చాడు. తన శ్రేయోభిలాషి అయిన రాఘవులు మీద నమ్మకంతో ‘సరే’ అంది. కాని పెళ్లయిన యేడాది తిరక్కుండానే వెంకటేశ్వర్లు రంగు బయటపడింది. అతను పచ్చి తాగుబోతు, పేకాటరాయుడు. బతికిన ఆరేడేళ్లు నరకం చూపించి ‘లివర్ సిరోసిస్’తో చనిపోయాడు. అప్పటి నుంచి అతని పెన్షన్, తను వెతుక్కున్న కాన్వెంట్ టీచర్ వుద్యోగం ఆధారంగా పిల్లలు చందు, నిత్యను ఏలోటు యెరక్కుండా పెంచి, చదివించింది. రాఘవులు మాట మీద మొగ్గి ఆ క్షణంలో తప్పుడు నిర్ణయం తీసుకోకపోతే తన బతుకిలా కాలిపోయేది కాదని జీవితం పొడుగునా మథనపడేది అందుకే. తన కూతురు నిత్య జీవితమైనా తనలా కాకూడదని ఆమె పెళ్లి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే నిశ్చయంతోనే – నిత్య కొస్తున్న సంబంధాలన్నిటినీ మొగ్గలోనే తుంచేసింది!జానకిరామయ్య సంబంధాన్ని కాదనడంలో తన నిర్ణయం సరయినదేనని తృప్తిపడిన తాయారమ్మ వారం తిరక్కుండా ఒక వార్త తెలిసి నిర్విణ్ణురాలైంది. జానకిరామయ్యకి పెళ్లి కుదిరిందనీ పెళ్లికూతురు యెవరో కాదు – సత్య అని రూఢిగా తెలిసిన తాయారమ్మ ఆవేశంతో చిందులు తొక్కింది. ముందుగా తన మాట లెక్కచెయ్యకుండా పెళ్లి చూపులకు సత్యను తోడుగా తెచ్చుకున్న నిత్యను చీవాట్లు పెట్టింది. ఆ తర్వాత మా కొచ్చిన సంబంధాన్ని లాక్కొన్నారంటూ సత్య కుటుంబం మీద తగవుకు వెళ్లింది. ఆఖరి ప్రయత్నంగా అవధానిని పిల్చి, తాము పొరపాటు చేశామని యెలాగైనా చేజార్చుకున్న సంబంధాన్ని తిరిగి నిత్యకు ఖాయం చెయ్యమని బతిమాలింది. డబ్బు ఆశ చూపి ప్రలోభపెట్టింది. కాని మాట తప్పడానికి మగపెళ్లివారు అంగీకరించలేదు. వాళ్ల తిరస్కారానికి అవమానంతో రోషంతో రెచ్చిపోయిన తాయారమ్మ నిత్యకు అంతకంటె పదిరెట్లు మంచి సంబంధం చేస్తానని సవాల్ విసిరింది.ఆనాటి నుంచి నిత్యకు యెన్ని సంబంధాలు వచ్చినా, వాటిని తప్పిపోయిన జానకిరామయ్య సంబంధంతో పోల్చి, తన గీటుకు రాక తాయారమ్మ తిరస్కరిస్తూనే వుంది. నిత్య తల్లి మాటను కాదని స్వతంత్ర నిర్ణయం తీసుకోలేకపోతోంది. అలా క్రమంగా యేళ్లు గడుస్తున్న కొద్దీ నిత్య వయస్సు ముప్పైలోకి రావడంతో సీను మారిపోయింది. అంత వయసున్న పెళ్లికొడుకులు దొరక్కపోవడంతో రెండోపెళ్లి సంబంధాలు రావడం తాయారమ్మను కలవరపరిచింది.సత్య జానకిరామయ్యల కల్యాణ శుభలేఖ మొదలుకొని అనేక సందర్భాలకు ఆ జంట నుంచి నిత్యకు, తాయారమ్మకు ఆహ్వానాలు అందుతూనే వున్నాయి. వాటిలో అతి ముఖ్యమైంది జానకిరామయ్య ఐఏఎస్కు సెలక్ట్ కావడం. ఒక్కక్షణం నిదానించకుండా చేజేతులా జారవిడుచుకున్న అదృష్టాన్ని తలచుకొని స్వయంకృతాపరాధానికి అవ్యక్తమైన ఆవేదనతో అనుక్షణం కుమిలిపోతున్న తల్లీ కూతుళ్లు సత్యకి సంబంధించిన ఏ వేడుకలకు హాజరుకావడం లేదు. ఇటీవల సత్య జానకిరామయ్య దంపతులు తమ ఏకైకపుత్రిక నిశ్చితార్థానికి రావలసిందిగా స్వయంగా వచ్చి యిచ్చిన ఆహ్వానపత్రిక చూసి నిత్య మనసు వుద్విగ్నభరితమైంది. చూస్తుండగానే నలభైయ్యేళ్ల వయసు మీద పడిన కుమారి నిత్య కన్నీటి బొట్లు పడిన ఆ ఆహ్వానం ఆమెను అవహేళనం చేస్తున్నట్టుంది...! -
తిండిలో మనోళ్లు పిండియన్స్
ఆరోగ్యంగా జీవించాలంటే అన్ని పోషకాలూ సమపాళ్లలో తీసుకోవటం అవసరమని తెలిసినా వాటి గురించి పట్టించుకుంటున్న వారు కొందరే. మన ఆహారంలో రోజుకు 55% పిండి పదార్థాలు, 30% కొవ్వు పదార్థాలు, 15% మాంసకృత్తులు ఉండాలని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సిఫారసు చేసింది. అయితే, మనం చౌకగా దొరుకుతున్నాయి కదా అని 62% పిండి పదార్థాలతో పొట్ట నింపేస్తున్నాం. మాంసకృత్తులను తక్కువగా (11.5%) తింటున్నాం. అవసరానికి మించి మనం తినే నూనెలతో పాటు పిండి పదార్థాలు కూడా కొవ్వుగా మారి మన దేహాల్లో, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోతున్నాయి. ఈ ‘పిండి కొవ్వు’ పుణ్యమే అధిక బరువు, ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు. ఈ విధంగా తిండి సరిలేక రోగాల బారిన పడుతున్న వారిలో పిల్లలు, పెద్దలని, ఆడా మగా అనే తేడా లేదు. ఇప్పటికైనా మేలుకొని పిండి పదార్థాలను 5%వరకైనా తగ్గించి, ఆ మేరకు మాంసకృత్తులను పెంచితే ఆరోగ్యం మెరుగవుతుందని, జబ్బుల మోత కొంతైనా తగ్గుతుందని ఐసీఎంఆర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇది సరే. ఆహారాన్ని ‘సమతూకంగా తీసుకోవాల’ని నిపుణులు సూచిస్తున్నప్పటికీ.. అదెలా పాటించాలన్నది స్పష్టంగా తెలుసుకోలేక దొరికింది తిని ఎలాగోలా బతుకు బండి లాగించేస్తున్నాం. మనలో చాలామంది ఈ కోవలోని వారే! అసలు తిండిలో పిండి పదార్థాలను తగ్గించటం ఎలా? మాంసకృత్తులను పెంచుకోవటం ఎలా? ఈ మార్పులను ఏ విధంగా వర్కవుట్ చేసుకోవాలి?అపసవ్య ఆహారంతో కొనితెచ్చుకున్న జబ్బుల్ని ఆహారంలో గుణాత్మక మార్పులతో తగ్గించుకునేదెలా?.. ఈ విషయాలపై అవగాహన కల్పించే ప్రయత్నమే ఈ కథనం.ఆరోగ్యంగా జీవించటం వ్యక్తి బాధ్యత ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో)వ్యక్తి ఆరోగ్యం చాలా వరకు ఆహార విహారాలపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక పదార్థాన్ని లేదా ఒక అలవాటును నియంత్రించలేని కోరికతో, హానికరమైన పరిణామాలు ఎదురవుతున్నప్పటికీ, బలవంతంగా ఉపయోగించటాన్నే ‘వ్యసనం’ అనుకోవచ్చు. ఈ వ్యసనం మెదడు పనితీరును మార్చి, స్వయం నియంత్రణను బలహీనపరుస్తుంది. మనిషిని చుట్టుముట్టే వ్యసనాలు వివిధ రూపాల్లో ఉంటాయి. జూదం, షాపింగ్ వంటివి ప్రవర్తన వ్యసనాలు. మద్యం, డ్రగ్స్.. వంటివి పదార్థ వ్యసనాలు. మనం అనుసరిస్తున్నది పిండి పదార్థాలకు పెద్దపీట వేసే ఆహార పద్ధతి. కొవ్వుతో పాటు పిండి పదార్థాలను కూడా మితంగానే తినాలి. కాని, ఎంత పడితే అంత తింటున్నాం. ముఖ్యంగా తెల్ల వరి అన్నానికి! మనకు ఇదెలాగో ఉత్తరాది వారికి గోధుమ రొట్టె అలా! ఆ విధంగా మనం ‘పిండి వ్యసన’ పరులమై అతిగా బరువెక్కి, రోగాల బారిన పడుతున్నాం.పిండి పదార్థంతోనూ కొవ్వు పెరుగుతుందని తెలుసా?దేహం అవసరాలకన్నా ఎక్కువగా తిన్న పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు మన శరీరంలో వివిధ రూపాల్లో కొవ్వుగా పేరుకుంటున్నాయి. కేవలం కొవ్వు పదార్థాల వల్లనే శరీరంలో కొవ్వు పెరుగుతోందన్న అపోహ చాలా మందిలో ఉంది. అవసరానికి మించి తినే నూనెల వల్ల ఎలా శరీరంలో కొవ్వు పెరుగుతుందో, అతిగా తినే పిండి పదార్థాల వల్ల కూడా శరీరంలో కొవ్వు పెరుగుతుందని గుర్తించాలి. అందువల్ల కొవ్వు పదార్థాలు తగ్గించి తినేవారు కూడా పిండి పదార్థాలను తెలిసో తెలియకో అతిగా తినటం కొనసాగిస్తుంటే, వారిలో కొవ్వు నిల్వలు పెరుగుతూనే ఉంటాయి, తగ్గవు. దైనందిన అవసరాలకు మించి తిన్న ఆహార పదార్థాలు ఇన్సులిన్ హార్మోన్ నాణ్యతను చెడగొట్టి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తున్నాయి. అదే ఇప్పుడు అసలు ముప్పు. ఇన్సులిన్ నిరోధకత తీవ్రత పెరిగేకొద్దీ అధిక బరువు, ఊబకాయం తీవ్రత పెరుగుతుంటుంది. ఈ ఇన్సులిన్ నిరోధకతే టైప్– 2 మధుమేహం, గుండెజబ్బులు, రక్తపోటు వంటి 200కి పైగా రోగాలను మన శరీరంలోకి వెంటబెట్టుకొస్తోంది. ఆహార సంబంధమైన వ్యసనాలను ఎవరికి వారు గుర్తెరిగి, వాటిని అధిగమించే ప్రయత్నం చెయ్యకుండా వర్తమానంలో గానీ, భవిష్యత్తులో గానీ ఆరోగ్యవంతంగా జీవించగలగటం అసాధ్యమేనని చెప్పక తప్పదు. ఆహారంలో స్థూల, సూక్ష్మపోషకాల సమతూకం లోపించటం వల్ల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. దైనందిన జీవనం ఆరోగ్యవంతంగా, ఆనందమయంగా కొనసాగాలంటే మనం తినే ఆహారంలో ఏయే పోషకాలు ఉండాలి? వాటిని ఏయే పాళ్లలో తీసుకోవాలి? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాం? ఎక్కడ తేడా పడుతోంది? ఏం మార్చుకోవాలి? ఎలా మార్చుకోవాలి?.. ఇలాంటి విషయాలను అర్థం చేసుకోవాలి. అసలు భారత ప్రభుత్వం ఏమి సిఫారసు చేస్తోందో మొదట మనం తెలుసుకోవాలి. మన ఆహారంలో 62% పిండి పదార్థాలే!భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) దేశ ప్రజలకు ఆహార, ఆరోగ్య విషయాలపై మార్గదర్శకాలను విడుదల చేస్తుంటుంది. భారతీయులు ఏం తింటున్నారు, జబ్బులు ఎలా పెరుగుతున్నాయో తెలుసు కునేందుకు ఇటీవలే ఐసీఎంఆర్ – ఇండియా డయాబెటిస్ (ఇండియాఐబీ) అధ్యయనం చేసింది. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎండీఆర్ఎఫ్)తో కలసి ఐసీఎంఆర్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 1,21,077 మంది ఆడ, మగవారిపై ఈ అధ్యయనం చేసింది. ‘నేచర్ మెడిసిన్’ జర్నల్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. భారతీయులు సగటున రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాలను మితంగానే తీసుకుంటున్నట్లు వెల్లడైంది. అయితే, పిండి పదార్థాలను అతిగా 62% మేరకు తింటున్నారు. మాంసకృత్తులను తక్కువగా 12% మాత్రమే తింటున్నారు. ఈ అసమతుల్య ఆహారమే మూల కారణంగా ఊబకాయం, రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్లు, టైప్–2 మధుమేహం వంటి జబ్బులను పెంచి పోషిస్తోందని నివేదిక తేల్చింది. ముఖ్యంగా శుద్ధి చేసిన పిండిపదార్థాలు ఎక్కువగా తినటం వల్ల టైప్–2 మధుమేహం బారిన పడే ముప్పు 14% పెరుగుతుందని ఈ అధ్యయనం గుర్తించింది. ఏపీ, తెలంగాణలోనూ ఎక్కువేదక్షిణ భారత దేశంలో రోజువారీ ఆహారంలో పిండి పదార్థాలను 62.5% తీసుకుంటుంటే (55%కి మించకూడదు).. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగటున 61.8% (కనిష్ఠం 58.2%, గరిష్ఠం 65.4%) తీసుకుంటున్నారు. తెలంగాణలో 61.4% (కనిష్ఠం 57%, గరిష్ఠం 65.5%) మేరకు పిండి పదార్థాలు తింటున్నారు. అంటే, తెల్ల బియ్యంతో పాటు కొద్దిగా గోధుమ పిండి, చిరుధాన్యాల పిండి వాడుతున్నారు. ముడి చిరుధాన్యాలు వండుకొని తింటే పర్వాలేదు. వాటిని పిండి పట్టించి తింటే షుగర్ తదితర వ్యాధుల ముప్పు తెల్ల బియ్యం తిన్నప్పటి మాదిరిగానే ఉంటున్నదని ఐసీఎంఆర్ అధ్యయనం స్పష్టం చేసింది. కొవ్వు పదార్థాలను (30%కి మించకూడదు) కొంచెం అటూ ఇటుగా అవసరమైనంతే తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 26.4% (కనిష్ఠం 23.4%, గరిష్ఠం 29.8%), తెలంగాణలో 27.1% (కనిష్ఠం 22.8%, గరిష్ఠం 30.8%) తింటున్నారు. ఇక మాంసకృత్తుల విషయానికొస్తే రెండు రాష్ట్రాల్లోనూ (కనీసం 15% తీసుకోవాలి) తక్కువగానే తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 11.5% (కనిష్ఠం 10.5%, గరిష్ఠం 12.5%), తెలంగాణలో 11.5% (కనిష్ఠం 10.6%, గరిష్ఠం 12.5%) తింటున్నారు. వయసు, ఎత్తు, బరువును బట్టి ఏ వ్యక్తి ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రతి రోజూ తీసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి ఎన్ని కేలరీల శక్తి అవసరమో తెలియాలంటే ఆ వ్యక్తి బేసల్ మెటబాలిక్ రేటు (బీఎంఆర్), బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఎంతో తెలియాలి. ఆ వ్యక్తి శరీరంలో ప్రాణాధార జీవక్రియల సక్రమ నిర్వహణకు ఎన్ని కేలరీలనిచ్చే ఆహారం తీసుకోవాలో బీఎంఆర్ చెబుతుంది. బాడీ స్కేల్ వంటి డిజిటల్ పరికరాల ద్వారా బీఎంఆర్తో పాటు బీఎంఐ, శరీరం మొత్తంలో కొవ్వు శాతం ఎంత, పొట్టచుట్టూ / చర్మం కింద కొవ్వు ఎంత, ప్రొటీన్ ఎంత ఉంది? వంటి 12 రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సమాచారం తెలుసుకుంటే, ప్రస్తుతం మీ శరీర బరువు; శరీరంలో పేరుకున్న కొవ్వు నిల్వలు ఉండాల్సినంత ఉన్నాయా లేదా ఎక్కువ ఉన్నాయా అనేది అర్థమవుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం ఉంటే, దాన్ని తగ్గించుకునేలా మీ ఆహార ప్రణాళిక ఉండాలి. బీఎంఐ 25 ఉంటే సాధారణం అని చెబుతుంటారు. అయితే, అది యూరోపియన్లు, అమెరికన్లకు ఉద్దేశించినదని, ఆసియావాసులు 23 కంటే ఎక్కువ ఉండే అధిక బరువుతో ఉన్నట్లే గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు. బరువు వయసు, ఎత్తుకు తగిన విధంగా ఉండే సాధారణ వ్యక్తి రోజుకు 2 వేల కేలరీల ఆహారం తీసుకోవాలని ఎన్ఐఎన్ సూచిస్తోంది. ఒకవేళ మీ బీఎంఐ 23 కంటే ఎక్కువగా ఉండి, పొట్టచుట్టూ కొవ్వు అధికంగా పేరుకొని ఉంటే, మీకు ఇప్పటికే ఇన్సులిన్ నిరోధకత ఉందని గుర్తించాలి. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకోవాలంటే మీరు తీసుకునే ఆహారంలో మొత్తంగా కేలరీలను తగ్గించాలి. ముఖ్యంగా పిండి పదార్థాలను తీసుకోవటం తగ్గించుకోవాలి. మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటూ ఉంటే, శరీర నిర్వహణకు కేలరీల కొరత ఏర్పడి, మీ శరీరంలో ఇప్పటికే పేరుకొని ఉన్న కొవ్వును కరిగించి, శక్తిగా మార్చి ఉపయోగించుకోవటాన్ని మీ శరీరం నేర్చుకుంటుంది. అలా చెయ్యగలిగితే కాలక్రమంలో మీ బరువుతో పాటు బీఎంఐ తగ్గి ఆరోగ్యం మెరుగవుతుంది. మందులు వాడి లేదా వ్యాయామం ద్వారా తాత్కాలికంగా బరువు తగ్గినా అవి మానేస్తే మళ్లీ బరువు పెరుగుతారు. కాబట్టి, ఆహారంలో గుణాత్మక మార్పు చేసుకోవటం ద్వారా తగ్గటం మేలైన పద్ధతి.నడుము కొలతే మీ ఆరోగ్యానికి సూచిక!ఈ బీఎంఆర్, బీఎంఐ వంటివి తెలుసుకునే డిజిటల్ పరికరాలు, పరీక్షలు అందుబాటులో లేకపోయినా మీరు అధిక బరువున్నారా? మీకు ఇన్సులిన్ నిరోధకత ఉందా? మొత్తంగా కేలరీలతో పాటు పిండి పదార్థాలను తీసుకోవటం మీరు తగ్గించుకోవాల్సి ఉందా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మరొక సింపుల్ టెస్ట్ ఉంది. మీ ఎత్తు ఎంత ఉందో మీ నడుము చుట్టుకొలత అందులో సగం ఉండాలి. ఉదాహరణకు మీ ఎత్తు 170 సెం.మీ. అయితే మీ నడుము చుట్టుకొలత 85 సెం.మీ. కన్నా ఎక్కువ ఉండకూడదు. మీ ఎత్తు ఎంత ఉందో అంత పొడవైన తాడును తీసుకొని, దాన్ని రెండు ముక్కలు చెయ్యండి. ఒక ముక్కను మీ నడుము/పొట్ట చుట్టూ ఎక్కడ ఎక్కువ ఎత్తు ఉందో అక్కడ నడుము చుట్టూ పెట్టుకొని చూడండి. దాని రెండు కొసలు కలిస్తే మీరు అధిక బరువు లేరని అర్థం. రెండు కొసలకు మధ్య గ్యాప్ ఎంత ఉంటే మీరు అంత ఎక్కువ ఆరోగ్యపరమైన ముప్పును ఎదుర్కొంటున్నారని అర్థం. అలాంటప్పుడు వైద్యుల సలహా తీసుకొని, తగిన పరీక్షలు చేయించుకొని, ఆహారంలో తగిన మార్పులు చేసుకోవటం మేలు. బరువు తగ్గాలంటే తక్కువ కేలరీల ఆహారాన్ని, ముఖ్యంగా పిండి పదార్థాలు తగ్గించి తినటం ప్రారంభించటం మేలు. కేలరీలు, గ్రాముల లెక్క ఎలా?ఒక వ్యక్తి రోజు మొత్తంలో ఇన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు ఏయే పదార్థాలను ఎన్ని గ్రాముల బరువైనవి తీసుకుంటే నిర్దేశిత మోతాదుకు (55% పిండి పదార్థాలు, 15% మాంసకృత్తులు, 30% వరకు కొవ్వు పదార్థాలు) సరిపోతుందో తెలుసుకోవటం ముఖ్యం. మనం తినే దాదాపు ఆహార పదార్థాలన్నిటిలో పిండి పదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు ఎంతో కొంత శాతం ఉంటాయి. కాబట్టి, మీరు తినే ప్రతి పదార్థంలో కేలరీలతో పాటు ఈ మూడు పోషకాలు ఎంతెంత ఉన్నాయో తెలుసుకొని, మీ అవసరాలకు తగిన రీతిలో రోజువారీగా పట్టిక రూపొందించుకొని, ఏవి ఎంత బరువైనవి తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. ఎన్ఐఎన్ సంకలనపరచిన ‘ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ 2017, న్యూట్రిటివ్ వాల్యూస్ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్’లో సాధారణంగా వాడే 17 రకాల ఆహార పదార్థాల్లో పోషకాల వివరాలు పొందుపరిచింది. 100 గ్రాముల ముడి పదార్థాల్లో పిండి పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు, కేలరీలు ఎన్ని ఉన్నాయో పట్టిక రూపొందించింది.ఉదాహరణకు 100 గ్రాముల బియ్యానికి, గోధుమలు వంటి ‘ఆహార ధాన్యాల’లో మాంసకృత్తులు 9.3 గ్రా., కొవ్వు 1.2 గ్రా., పిండిపదార్థాలు 72 గ్రా., 343 కిలో కేలరీల శక్తితో పాటు 6 గ్రాముల పీచు ఉన్నాయి. తెల్ల బియ్యానికి, ముడి బియ్యానికి, బియ్యం, గోధుమల రకాన్ని బట్టి వాటిలో పోషక విలువలు కొద్దోగొప్పో మారుతుంటాయి. 100 గ్రాముల ‘మాంసం, కోడి మాంసం’లో ప్రొటీన్ 20.8 గ్రా., ఫాట్ 6.8 గ్రా., కార్బొహైడ్రేట్లు 0 గ్రా., 250 కిలో కేలరీల శక్తి ఉన్నాయని ఎన్ఐన్ న్యూట్రిషన్ టేబుల్ చెబుతోంది. కోడి మాంసానికి, మేక మాంసానికి పోషకాల్లో కొంత వ్యత్యాసం ఉన్నా, స్థూలంగా మనకో అవగాహన కల్పించడానికి ఈ టేబుల్ పనికొస్తుంది. ఇలా 17 వర్గాల ఆహార పదార్థాల్లో పోషకాల వివరాలను ఎన్ఐన్ పొందుపరిచింది. గూగుల్లో కూడా ప్రతి ఆహార పదార్థానికి సంబంధించిన న్యూట్రిషన్ టేబుల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి పోషక విలువలను బట్టి, మన అవసరాన్ని బట్టి అవసరమైన కేలరీలలో, అవసరమైన గ్రాముల బరువైన ఆహారాన్ని లెక్కవేసుకొని తినటం ద్వారా ఖచ్చితత్వంతో కూడిన ఆహార నియమాలను పాటించటానికి అవకాశం ఉంది. అయితే, అసలు ఏ లెక్కా చూసుకోనప్పటి కన్నా ఇది మెరుగు. ఇంకా కచ్చితమైన సమాచారం కావాలంటే ఆయా ఆహార పదార్థాలకు సంబంధించిన వెబ్సైట్లు లేదా బుక్స్ ద్వారా న్యూట్రిషన్ డేటాను తెలుసుకోవచ్చు. ఆ రోజులో ఏమేమి పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవాలో లెక్కించుకోవటం ఆహార ప్రణాళికలో చాలా కీలక ఘట్టం. పిండి పదార్థాలను ఎక్కువ శాతం తీసుకునే వారితో పాటు.. ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ డైట్ను అనుసరించే వారు కూడా ఇలాగే లెక్క వేసుకొని తినటం ద్వారా నిర్దేశించుకున్న ఆరోగ్య లక్ష్యాలు సాధించవచ్చు. జీవితాంతం ఈ లెక్కలు వేసుకోవలా అన్న బెంగ అక్కర్లేదు. కొన్నాళ్లు చేస్తే ఏమేమి ఎంత తింటే సరిపోతుందో తెలిసి వస్తుంది. ఆ తర్వాత లెక్క వేసుకోకుండానే ఆరోగ్యకరమైన పరిమాణంలో ఆహారం తీసుకోవచ్చు. తొలుత కష్టమే అయినా, అసాధ్యం అయితే కాదు. ఆహారం 10 రకాలురోజువారీ ఆహారాన్ని పది వర్గాలుగా విభజించారు. వీటిలో స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. స్థూల పోషకాలు 3 రకాలు.. పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వు పదార్థాలు (ఫ్యాట్స్). వీటిని సమతుల్యంగా (అంటే.. నిపుణులు సూచించిన పాళ్లలో) తీసుకోవటంతో పాటు.. ఏవో కొన్ని రకాలకే పరిమితం కాకుండా పది రకాల వైవిధ్యభరితమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటే విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా అందుతాయి. పోషక లోపాలు, వ్యాధుల నుంచి రక్షించుకుంటూ ఆరోగ్యదాయకంగా జీవించడానికి భారతీయుల పళ్లెంలో ముఖ్యంగా స్థూల పోషకాల కూర్పు ఏది ఎంత శాతం ఉండాలో తెలియజెపుతూ ‘మై ప్లేట్ ఫర్ ద డే’ను ఎన్ఐఎన్ ప్రకటించింది.2000 కిలో కేలరీల శక్తి(రోజుకు)భారతీయుల ఆహారంపై, ఆరోగ్య స్థితిగతులపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తూ పాలకులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు సంపూర్ణ ఆరోగ్య భారత్ నిర్మాణం దిశగా మార్గదర్శనం చేస్తుంటుంది. ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ అయిన జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) ఈ కృషిలో కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్ఐఎన్ 2024లో ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. రోజుకు 2,000 కిలో కేలరీలుతీసుకునే ప్రతి ఆహార పదార్థమూ మనకు శక్తినిస్తుంది. ఈ శక్తిని కిలో కేలరీలలో కొలుస్తారు. ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ద డే’ సిఫారసుల ప్రకారం.. సగటున ఒక వ్యక్తికి ఒక రోజులో మొత్తం కావాల్సిన శక్తి 2,000 కిలో కేలరీలు. ఒక కిలోగ్రాము బరువున్న నీటిని ఒక డిగ్రీ సెంటీగ్రేడు మేరకు వేడి చేయడానికి అవసరమైన ఉష్ణశక్తికి ప్రమాణమిది. ఏ ఆహారాన్ని మండిస్తే ఎంత వేడి వస్తుందన్న దాన్ని ఈ ప్రాతిపదికపై కొలుస్తారు. శారీరక శ్రమ తక్కువగా చేసే లేదా ఒక చోట కూర్చొని పనిచేసే బుద్ధి జీవులకు రోజుకు 1,500–2000 కేలరీల శక్తి సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది వయసును బట్టి, శారీరక శ్రమను బట్టి మారుతుంది. కాయకష్టం చేసే వారికి రోజుకు 3 వేల కేలరీలు అవసరమవు తాయని అంచనా.రోజుకు ఎన్ని గ్రాములు..?ఎన్ఐఎన్ మై ప్లేట్ ఫర్ ద డే సిఫారసుల(2024) ప్రకారం.. సగటున వ్యక్తి రోజుకు 2 వేల కిలో కేలరీల శక్తి అవసరం అనుకున్నాం కదా. వాటిని సమకూర్చుకోవాలి అంటే ప్రతి రోజూ ఆహారంలో పిండి పదార్థాలు 55%, 15% మాంసకృత్తులు, 30% కొవ్వు పదార్థాలు ఉండాలి. ఆహార పదార్థాల మోతాదు గ్రాముల్లో చెప్పుకోవాలంటే.. బియ్యం/ గోధుమలు వంటి ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు కలిపి 250 గ్రాములు, పాలు–పెరుగు 300 ఎం.ఎల్., కూరగాయలు 400 గ్రా., పండ్లు 100 గ్రా., పప్పులు, గుడ్లు, మాంసం ఉత్పత్తులు 85 గ్రా., పిక్కలు, గింజలు 35 గ్రా., నూనెలు/కొవ్వు పదార్థాలు 27 గ్రాముల మేరకు తీసుకోవాలి. మీరు మాంసాహారులా, శాకాహారులా అన్న దాన్ని బట్టి ఈ పాళ్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అయితే, ఎన్ఐఎన్ చెప్పిన పాళ్లలో పోషకాలు తీసుకోకపోవటం, ముఖ్యంగా పిండి పదార్థాలను అతిగా తినటం, మాంసకృత్తులు, కూరగాయలు, పండ్లను తక్కువగా తింటూ జబ్బుల పాలవుతున్నాం. కార్బోహైడ్రేట్లు పెంచుతున్న కొవ్వు వల్ల మన ఆరోగ్యానికి ముప్పు ముంచు కొచ్చింది.కొవ్వు ద్వారా అధిక శక్తిపిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలను సాధారణంగా గ్రాముల్లో కొలుస్తారు. అయితే, పిండి పదార్థాలు, మాంసకృత్తులతో పోల్చితే కొవ్వు పదార్థాలు రెట్టింపు కన్నా ఎక్కువ శక్తినిస్తాయి. 1 గ్రాము పిండి పదార్థం లేదా 1 గ్రాము మాంసకృత్తుల నుంచి 4 కిలో కేలరీల చొప్పున శక్తి వస్తుంది. అయితే, 1 గ్రాము కొవ్వు పదార్థం ద్వారా 9 కిలో కేలరీల శక్తి చేకూరుతుంది.∙పంతంగి రాంబాబు -
పిప్పలుడి గర్వభంగం
కశ్యపుడి వంశంలో పిప్పలుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు శమదమాది సద్గుణ సంపన్నుడు. శీత వాత ఆతపాదులను ఒకేరీతిలో సహించగల స్థిరచిత్తుడు. వేదవేదాంగాలను అధ్యయనం చేసిన పండితుడు. పిప్పలుడు నిత్య దరహాస ముఖారవిందంతో ఉండేవాడు. నిత్య నైమిత్తిక కార్యాలను క్రమం తప్పకుండా ఆచరించేవాడు. ఒకసారి పిప్పలుడు తపస్సు ప్రారంభించాడు. అతడి తపస్సు నానాటికీ తీవ్రం కాసాగింది. అతడు తపస్సు ప్రారంభించి వెయ్యేళ్లు గడిచింది. కేవలం వాయుభక్షకుడిగా ఉంటూ నిశ్చలంగా ఒకేచోట కూర్చుని తపస్సు చేస్తుండటంతో అతడి శరీరం శల్యావశిష్టమైంది. శరీరంపై చీమల వంటి కీటకాలు పుట్టలు పెట్టాయి. వాటి చుట్టూ తీగలు, లతలు పాకాయి. పిప్పలుడి చుట్టూ ఏర్పడిన పుట్టలలోంచి అగ్నిజ్వాలలు వెలువడసాగాయి. దేవతలు అతడి తపోతీవ్రతను నివ్వెరపోయి తిలకించసాగారు. అతడి తపస్సు ఎన్నాళ్లకూ చెదరకపోవడంతో సంతోషించిన దేవతలు, అతడి మీద పుష్పవృష్టి కురిపించారు.‘విప్రోత్తమా! నువ్వు వేదవేదాంగ కోవిదుడవు. శ్రుతిస్మృతి విహిత ధర్మజ్ఞుడవు. నీ తపస్సుకు మేమంతా సంతోషించాం. ఏ వరాలు కావాలో కోరుకో! తప్పక నెరవేరుస్తాం’ అని పలికారు.దేవతల మాటలు వినిపించగానే పిప్పలుడు కళ్లు తెరిచాడు. ఎదుట కనిపించిన దేవతలకు వినయంగా నమస్కరించాడు. ‘దేవతలారా! మీ దయానుగ్రహాలకు పరవశుడనయ్యాను. నేను విద్యాధరుడనై, కామగమనుడనై, సువర్ణ రత్నఖచిత దివ్యరథంలో సకల లోకాలలో సంచరించేలా వరాన్ని అనుగ్రహించండి’ అని ప్రార్థించాడు. దేవతలు ‘తథాస్తు’ అని వరం అనుగ్రహించి, అంతర్ధానం చెందారు.దేవతల వరప్రభావంతో పిప్పలుడు సకల విద్యావిశారదుడై, విద్యాధరుడయ్యాడు. మణిమయ స్వర్ణ విమానంలో సకల లోకాలలోనూ యథేచ్ఛగా సంచరించసాగాడు. జగమంతా తన స్వాధీనమైందని సంబరపడసాగాడు. సంకల్ప మాత్రాన ఎక్కడికైనా స్వేచ్ఛా విహారం చేయగల శక్తి సంక్రమించడంతో పిప్పలుడిలో గర్వం పెరిగింది.‘ముల్లోకాలలోనూ నన్ను మించినవాడు వేరొకడు లేడు. దేవ దానవ మానవులలో నన్ను మించినవాడు మరొకడు ఉండడు’ అనుకోసాగాడు.ఒక నదీతీరంలో నివాసం ఉండే ఒక సారసపక్షి పిప్పలుడి తీరుతెన్నులను చాలాకాలంగా గమనించసాగింది. ఒకనాడు ఆ సారసపక్షి ‘ఓ విప్రోత్తమా! జగమంతా నీ స్వాధీనమైందని, సంకల్పమాత్రాన సకలలోక సంచారం చేయగలుగుతున్నందున మహామహిమాన్వితుడవయ్యానని గర్విస్తున్నావు. ఘోర తపస్సులు చేసి, దేవతల నుంచి అనేక దివ్యవరాలు పొందినా, గర్వోన్నతి వల్ల అధోగతి పాలైన వారి గురించి నువ్వు ఎరుగవు. నువ్వు పరాపరాలను ఎరుగవు. నువ్వు మూఢుడివి. కుండలపుత్రుడైన సుకర్ముడనే విప్రుడు పరాపరాలైన ఆత్మానాత్మలను ఎరిగిన విజ్ఞుడు. అతడితో సమానుడైన జ్ఞానవంతుడు ముల్లోకాలలోనూ మరొకడు లేడు. వేదాధ్యయన సంపన్నుడు, సకల శాస్త్రకోవిదుడు అయిన సుకర్ముడు యజ్ఞయాగాదులేవీ ఆచరించలేదు. బాల్యం నుంచి అనునిత్యం మాతృపితృ సేవలో తరిస్తూ, ఆ కర్మయోగ ప్రభావంతో మహాజ్ఞానిగా ఎదిగాడు. నువ్వు జ్ఞానహీనుడివై అనవసరంగా గర్విస్తున్నావు’ అని పలికింది.సారసపక్షి మాటలకు పిప్పలుడు ఉక్రోషం చెంది, ‘పక్షి రూపంలో నన్ను నిందిస్తున్నావు. దేవ దానవ యక్ష గంధర్వాదులలో నువ్వెవరివి? పరాపరాలైన ఆత్మానాత్మలు ఏవి? వాటి స్వరూపమేది? చెప్పు’ అన్నాడు.‘కుండల పుత్రుడైన సుకర్ముడి వద్దకు వెళ్లి, అడుగు. ఆత్మానాత్మ స్వరూపాన్ని అతడే నీకు చెప్పగలడు’ అని పలికింది సారసపక్షి.పిప్పలుడు కుండలుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సుకర్ముడు తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తూ కనిపించాడు. అది చూసి, పిప్పలుడు ద్వారం వద్దనే నిలిచిపోయాడు.సుకర్ముడు ద్వారం వద్ద నిలిచి ఉన్న పిప్పలుడిని గమనించి, వెంటనే లేచి వెళ్లి అతడిని స్వాగతించి, లోనికి తీసుకువచ్చాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టి, కుశల ప్రశ్నలు వేశాడు.‘పిప్పలా! నీ వృత్తాంతం నాకు తెలుసు. సారసపక్షి నీ గర్వాన్ని పరిహసించి, నా వద్దకు పంపడం వల్లనే ఇలా వచ్చావు కదూ’ అన్నాడు సుకర్ముడు.సుకర్ముడి మాటలతో పిప్పలుడికి కాసేపు నోట మాట రాలేదు. కొద్దిసేపటికి తేరుకుని, ‘నువ్వు మహాజ్ఞానివని, పరాపరాలైన ఆత్మానాత్మలను నువ్వెరుగుదువని ఆ పక్షి నాతో చెప్పింది. ఆత్మానాత్మల నిజస్వరూపమేది? నాకు వివరంగా చెప్పు’ అని అడిగాడు.పిప్పలుడికి తన పట్ల శంక తొలగిపోలేదని అతడి ప్రశ్నల ద్వారా గ్రహించాడు సుకర్ముడు.అతడికి విశ్వాసం కలిగించడానికి ఇంద్రాది దేవతలను ఆహ్వానిస్తూ ఆవాహన మంత్రాలు పఠించాడు.వెంటనే అక్కడ ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. ‘సుకర్మా! మమ్మల్ని ఎందుకు పిలిచావు?’ అని అడిగారు.‘దేవతలారా! ఈ పిప్పలుడికి విశ్వాసం కలిగించడానికే మిమ్మల్ని ఆహ్వానించాను. అంతకంటే వేరే ప్రయోజనం ఏదీ ఆశించి కాదు. ఇక మీరు మీ నిజస్థానాలకు వెళ్లవచ్చు’ అన్నాడు.‘నిష్ఫలంగా వెళ్లడం మాకు తగదు. ఏదైనా వరం కోరుకో’ అన్నారు దేవతలు.‘నాకు అనవరతం మాతా పితృభక్తిని, వారికి వైకుంఠవాస ప్రాప్తిని కలిగించండి. అంతే చాలు’ అన్నాడు సుకర్ముడు.దేవతలు ‘తథాస్తు’ అని పలికి అంతర్ధానమయ్యారు.ఇదంతా పిప్పలుడు చేష్టలుడిగి తిలకించాడు.సుకర్ముడు అతడితో ‘పిప్పలా! నిన్ను నా వద్దకు పంపిన సారసపక్షి సాక్షాత్తు చతుర్మఖ బ్రహ్మ’ అని చెప్పి, ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.∙సాంఖ్యాయన -
కథాకళి: ముప్పు
భూమికి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీ నుంచి వచ్చిన ఆ వ్యోమనౌకలోంచి కొందరు దిగారు. వారందరి సగటు ఎత్తు నాలుగు అడుగుల రెండు అంగుళాలు. వారు తమ వెంట తెచ్చిన ఓ డజనుమంది ఖైదీలని భూగోళం మీద దింపారు. వారంతా జంటలే. వారి చేతులకి వేసిన బేడీలని విప్పారు. ‘‘మీరు చేసిన ఘాతుకాలకి మిమ్మల్ని మనం గ్రహం నుంచి వెలివేయడంతో ఇక్కడికి తెచ్చి వదలమనే తీర్పుని అమలు చేస్తున్నాం. చివరగా మీరు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా?’’ ఆ నౌక కెప్టెన్ అడిగాడు.‘‘మా స్వగ్రహం నుంచి ఇలా దూరంగా మమ్మల్ని పంపడం సబబు కాదని, ఇక మీదట ఎలాంటి నేరాలు చేయమని, తిరిగి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళమని కోరుతున్నామని మన రాజుకి చెప్పండి.’’ ఆ డజనుమందిలోని ఒకరి భార్య ఆవేదనగా చెప్పింది.‘‘చెప్తాం. మీ సందేశం ఆయనకి చెప్పినా ప్రయోజనం ఉంటుందని అనుకోము. ప్రశాంతంగా జీవించేవారికే ఆ గ్రహం. మనలో ఎవరిలో నేరప్రవృత్తి ప్రవేశిస్తుందో వారి డీఎన్ఏ పుట్టేవారు మన గ్రహంలో ఉండకూడదని, వారిని వెలివేయాలనే చట్టాన్ని మన రాజుగారు అమలు చేశారు. ఇది మన గ్రహంలోని శాంతికి ముఖ్యమని రాజుగారు భావిస్తున్నారు.’’‘‘అక్కడ మీరు చేసిన నేరం ఘోరాతి ఘోరమైంది. మన గ్రహవాసులు అందర్నీ ఒకేసారి చంపే మారణాయుధాన్ని తయారు చేసి, మన రాజుని బెదిరించి డబ్బు కోరారు. కాబట్టి గ్రహ బహిష్కరణ శిక్షని అమలు జరిపి వెళ్ళిపోతున్నాం.’’ మరొకరు చెప్పారు.వాళ్ళు ఆ వ్యోమనౌకలోకి ఎక్కడం, అది పైకిలేచి క్రమంగా దూరమై కనపడకుండా పోవడాన్ని చూశారు. క్షణాల్లో కనుమరుగైన ఆ వ్యోమనౌకని చూశాక వారిలోని ఒకడు క్రూరంగా నవ్వి చెప్పాడు.‘‘వాళ్ళు తిరిగి వెళ్ళాక కాని మన శక్తి తెలీదు. సమయానికి మనం డీయాక్టివేట్ చేయడం లేదు కనుక ఆ మారణాయుధాలన్నీ పేలిపోయి, ఆ గ్రహానికి వెళ్ళాక వాళ్ళకి అక్కడ శ్మశానం తప్ప మరేం కనిపించకపోవడంతో మన తడాఖా అర్థమవుతుంది.’’ఆ నేరస్తులంతా చుట్టూ చూశారు. రాళ్ళు, రప్పలు, మట్టి. దూరంగా పచ్చదనం కనిపించడంతో అటువైపు నడిచారు. ఆ చెట్లకి కాసిన పళ్ళవంక చూసి వారిలోని ఒకరు ఆనందంగా చెప్పారు.‘‘అమ్మయ్య! ఈ గ్రహంలో తిండికీ, నీళ్ళకి కొరత లేదు.’’‘‘నీళ్ళేవి?’’ మరొకరు చుట్టూ చూస్తూ అడిగారు.‘‘వెదికితే కనిపిస్తాయి. నీళ్ళు లేకుండా చెట్లు జీవించలేవు కదా?’’ఆ డజనుమంది భార్యాభర్తలు ఆ గ్రహాన్నంతా తిరిగి చూడసాగారు.వందేళ్ళల్లో వారు ఏడు వందల ముప్ఫై రెండుమందిగా మారారు. మరో వందేళ్ళల్లో పదిహేను వేల ఆరువందల ఎనభై నాలుగు మందిగా... అలా ప్రతి శతాబ్దానికీ ఆ జాతి అభివృద్ధి చెందసాగింది. ఒకే భాష మాట్లాడే గ్రహం నుంచి వాళ్ళు వచ్చారు. కాని ఈ గ్రహంలోని వారు దెబ్బలాడుకుని అనేక ప్రాంతాలకి వెళ్ళడంతో అనేక భాషలు ఏర్పడ్డాయి. వాతావరణం వల్ల చర్మం రంగులో మార్పు సంభవించింది. చట్టాల్లో, ఆచార వ్యవహారాల్లో వారి మధ్య స్పష్టమైన భేదం ఉంది. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాక కాలంతో పాటు వారి మేధస్సు కూడా అభివృద్ధి చెందింది.తమ పూర్వీకులు ఓ గ్రహం నుంచి బహిష్కరించబడ్డారన్న సంగతే నేటి ఆ గ్రహవాసులకి తెలీదు. కారణం తెలీకపోయినా ఈ గ్రహానికి ఎందుకు పంపబడ్డారో సరిగ్గా ఆ నేరాన్నే వాళ్ళు కొత్త గ్రహంలో చేశారు. వారి డీఎఏ కారణంగా అలాంటి మారణాయుధాలను ఆ జీవులు కనిపెట్టి తయారు చేశారు. అప్పటికి వారి సంతతి సంఖ్య మూడు వందల డెబ్భైరెండు కోట్లకి చేరుకుంది.ఓ రోజు ఓ దేశపాలకుడు పిచ్చి ఆవేశంతో మారణాయుధాలు లేని దేశం మీదకి తమ మారణాయుధాలని ప్రయోగించాడు. దాంతో ఆ దేశం లొంగింది. ఆ తర్వాత మరో పది దేశాలు కూడా ఆ మారణాయుధాలని తయారు చేసుకున్నాయి. ఆ గ్రహం మీది జనాభా పధ్నాలుగు వందల ఏభై నాలుగు కోట్లకి చేరుకున్నాక ఓ రోజు ఉన్మాదైన మరో దేశపాలకుడు తోటి మారణాయుధాలు గల దేశం మీదకి ఆకస్మికంగా తమ మారణాయుధాలని ప్రయోగించాడు. అది తెలిసి ఆ దేశం కూడా అవి తమని చేరుకునేలోగా జవాబుగా ఆ దేశం మీదకి తమ మారణాయుధాలని కూడా ప్రయోగించింది. మొదటగా ప్రయోగించిన దేశానికి చెందిన మిత్రదేశం అదే అదనుగా భావించి అది మద్దతు ఇచ్చే తమ శత్రుదేశం మీదకి మారణాయుధాలని ప్రయోగించింది. వారం రోజులు గడవకుండానే ఆ గ్రహంలోని మారణాయుధాలన్నీ ప్రయోగించబడ్డాయి. అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరగడంతో ఓ ఖండంలోని మంచు శిలలు కరిగి ప్రవహించి, ఆ గ్రహం ఉపరితలం మీదకి ఐదు వేల అడుగుల పైకి నీరు చేరుకుని ముంచేసింది.ఏ అపరాధం వల్ల లక్షల సంవత్సరాల క్రితం ఆ గ్రహానికి ఆ జీవులు పంపబడ్డారో అదే అపరాధం వల్ల ఆ గ్రహంలోని వారి జాతి అంతరించి, ఆ గ్రహం మీద తిరిగి ప్రశాంతత నెలకొంది.జరగబోయేది ముందే గ్రహించిన, మొదటగా ఆ గ్రహం మీదకి వచ్చిన మేధావులైన ఆ డజనుమంది, జలప్రళయంతో తమ జాతి అంతరిస్తుందని చెప్పిన విషయం తరతరాలుగా కథగా చెప్పబడింది.FEED ME A STORY : మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
ఈ వారం కథ: సెవ్వుసాని
చుక్కపొద్దున కోళ్ళ కూతలతో తిరుపతి గోవిందరాజ స్వామి గుడి చుట్టూ ఉన్న మాడవీధుల్లోని వాళ్ళు మేలుకొని స్నాన పానాదులతో సిద్ధమౌతున్నారు. ఉత్తర మాడ వీధిలోని చిన్న జియ్యంగారు మఠం నుండి దివిటీ పట్టుకొని, తాళం పెట్టెను భుజం మీద పెట్టుకొని ఆలయ తలుపులు తెరవడానికి కైకాలరెడ్డి జియ్యంగారుతో బయలుదేరాడు. కొంచెంసేపటికి ఆలయ గుడిలో నుండి స్వామి వారిని మేలుకొలుపుతూ అర్చకులు పాడే సుప్రభాత సేవ మొదలైంది. ఎద్దుల బండ్ల మీద నుంచి వచ్చిన సుదూరప్రాంత యాత్రికులు బండ్ల వీధిలో బండ్లను నిలిపి గ్రామ చావడిలో తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు. అక్కడే వారికి అడ్డంగా మూసిన ఇనుప ప్రవేశ ద్వారాన్ని తెరిచారు. నాలుగు కాళ్ళ మంటపం వరకు గుమిగూడిన జనం ‘గోవింద! గోవిందా!!’ అంటూ గుడివైపు వెళ్ళారు. గుడితో పాటు మాడ వీధులన్నీ యాత్రికుల రాకతో సందడిగా మారిపోయాయి. స్వామివారి నైవేద్య గంటలు ఆ ప్రాంతమంతా మారుమోగాయి. ఉత్తర మాడ వీధిలోని నమ్మాళ్వారు గుడి పక్కనుండే ఓ విశాల ప్రాంగణం కలిగిన చిన్న అంతఃపురంలాంటి భవనం ముందు దివిటీలు పట్టుకొని కొందరున్నారు. అలాగే తలకు తెల్లని పాగాలను చుట్టుకొని, మోకాళ్ళ వరకు గోచీ పంచె కట్టుకొని ఆరుగురు బలిష్టమైన బోయలున్నారు. చూడచక్కని పల్లకి ఆ భవనం ముందు ఆగి ఉంది. బాగా అలంకరించుకొని ఉన్న అందమైన స్త్రీలు భవనం నుండి బయటకొచ్చారు. తిరుపతిని కప్పేసిన చీకటి తొలగిపోలేదు. మేలిముసుగులో ఒక అప్సరలాంటి స్త్రీ అటు ఇటు చెలికత్తెలతో బయటకొచ్చింది. కాంతిపుంజంలాంటి ఆమెను చూసిన చీకటి సూర్యకాంతేమోనని భయపడినట్లు ఆ ప్రాంగణంలో చిన్నబోయింది. ఆమె ఒయ్యారంగా పల్లకీలో ఎక్కి కూర్చుంది. పల్లకీకి అటు ఇటు ఉన్న పారదర్శక పరదాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. పట్టు చమ్కీ పరదాలు మెరుపు తీగలాంటి ఆమె ముందు మెరియలేక తమ ఓటమిని అంగీకరిస్తూ తలలు వాల్చేశాయి. పున్నమి ముందు రోజు చంద్రుడు ఆమెను చూసి అసూయతో పడమటి కొండల్లోకి జారుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బోయలు ముందు ముగ్గురు, వెనుక ముగ్గురు పల్లకీ కొయ్య తండులను లేపి భుజం మీదకు ఎత్తుకొని బయలుదేరారు. పల్లకీ ముందు దివిటీ పట్టుకొన్న వ్యక్తులు కదిలారు. పల్లకి వెనుక వైపు చెలికత్తెలు, పరివార జనం కదిలారు. కత్తులు, బల్లేలు చేత పట్టుకొని చుట్టూ భటులు రక్షణగా వెంట నడిచారు. వీళ్ళు సమ్మాళ్వారు గుడికి పడమరవైపు ఆనుకొని ఉండే దారి గుండా వెళ్తూ తీర్థకట్ట వీధిలోకి ప్రవేశించారు. ‘హరోం హరహర హరహర’ అంటూ బోయలు పల్లకీని మోసుకొంటూ నాదముని అగ్రహారాన్ని దాటుకొని తీర్థకట్ట వీధిలోని కొత్త వీధి మొదటనున్న వేంకటేశ్వరస్వామి గుడి ముందు ఆపి అందరూ నమస్కారాలు చేసుకున్నాక కపిలతీర్థం రహదారి మీదకొచ్చారు. అక్కడి నుంచి జియ్యంగార్ గుడి దాటుకొని, మంగలోళ్ల బావి, అచ్యుతరాయపురం మీదుగా కపిలతీర్థం ముందుకొచ్చి ఆగారు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో కపిలతీర్థంలో పుణ్యస్నానాలు చేయడానికి కొందరు జనం అప్పటికే ఉన్నారు. పల్లకీ దిగుతూనే అరుణోదయమైంది. మెల్లగా వెలుగు రేఖలు పడుతూనే చీకట్లు తొలిగాయి. వెలుతురు విరజిమ్మింది. పల్లకీలో దిగిన స్త్రీని గుర్తుపట్టి అక్కడున్న జనం ఆమెను చూడడానికి ఎగబడ్డారు. అందాలను రాశి బోసినట్లు ఉండే ఆమె మంద గమనంతో అక్కడున్న జనానికి చిరునవ్వుతో నమస్కరిస్తూ సాయుధ భటుల సహాయంతో కపిలతీర్థంలోని కోనేరుకు పడమర వైపున్న సంధ్యావందన మంటపంలోకి అడుగు పెట్టింది. చిన్నగా వెళ్ళి దుస్తులు మార్చుకొనే గదిలోకి వెళ్ళింది. ఆమె పరివారం ఆమె ఆభరణాలను, దుస్తులను తీసి జాగ్రత్త చేసి, స్నానాలాచరించే దుస్తుల్ని ధరింపజేసి కపిల తీర్థం జలపాతం దగ్గరకు తీసుకెళ్ళారు. వారం ముందు కురిసిన వానల వల్ల జలపాతం ఆకాశగంగలా కోనేటి గట్టుమీదికి దుముకుతోంది. ఆమెను చెలికత్తెలు జలపాతంలో పవిత్ర స్నానాలు చేయించారు. ముఖానికి, చేతులు కాళ్ళకు పసుపు రాశారు. ఆమె భక్తితో నమస్కరిస్తూ కపిలతీర్థం జలపాతంలో స్నానమాచరించింది. బట్టలు మార్చుకోవడానికి చెలికత్తెలతో స్నానాల గదికి వెళ్ళింది. ‘ఇంతకీ ఎవరామె మనల్ని ఎందుకు ఇక్కడే ఆపేశారు?’ అడిగారు ఒక భక్తుడు అక్కడున్న ఆలయ సిబ్బందిలోని ఒక వ్యక్తితో. ‘ఆమె సెవ్వుసాని. గోవిందరాజస్వామి గుడి దేవదాసి. ఆమెకున్న పలుకుబడి సామంతరాజులకు కూడా లేదు. ఆమె కపిలేశ్వరస్వామి గుడిలోకెళ్ళేంత వరకు మీరు వేచి ఉండాల్సిందే’ అన్నాడు ఆలయ ఉద్యోగి వెంకటయ్య. ‘మమ్మల్ని ఈ కోనేటి ఒడ్డున నిలిపితే నిలిపారు గానీ ఒక దేవకన్యను కళ్లారా చూసినట్లైంది’ అన్నాడు ఆ గుంపులోని మరొకడు. ‘ఇంతకీ మీరు ఏ ఊరి నుండి వచ్చారు? మీ పేరేమి?’ అడిగాడు వెంకటయ్య. ‘మాది శ్రీరంగం. నా పేరు రంగరాజన్. మేము పదిమంది కలిసి బండ్ల మీద తిరుపతికొచ్చాం. కపిలతీర్థంలో స్నానం చేశాకే కదా కొండెక్కాలి. అందుకని ఇక్కడికొచ్చాం. పైగా ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఇక్కడకు వస్తారని మేము ఊహించలేదు. మేము తమిళప్రాంతం నుండి వచ్చాము కాబట్టి ఈమె గురించి మాకు తెలియదు. అందుకని ఈమె ఎవరని అడిగాం. ఇంతటి అప్సరస తిరుపతిలో దేవదాసీగా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. మా శ్రీరంగంలోని దేవదాసీ కూడా ఇంత అందంగా లేదు. ఈమె ఇక్కడే పుట్టిందా?’ అడిగాడు రంగరాజన్, ‘ఈ సెవ్వుసాని విజయనగర రాజధానిలో పుట్టి పెరిగింది. తన నృత్యంతో శ్రీకృష్ణదేవరాయలను మంత్రముగ్ధుల్ని చేసేది. రాయలవారు ఈమె పట్ల ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించేవారు. ఆమెకు ఎనలేని సంపదలను బహూకరించారు. ఆమెకు తిరుపతి అంటే ఎంతో మక్కువ. అప్పుడప్పుడు తిరుపతికి వచ్చినప్పుడు చంద్రగిరిలో ఉండే అచ్యుత దేవరాయల ఆతిథ్యం తీసుకొని తిరుమలేశుని సందర్శించి, తన పరివారంతో విజయనగర రాజధానికి చేరుకొనేది. ఆమె అంటే అచ్యుతదేవరాయలకు ఎనలేని అభిమానం. అనురాగం. శ్రీ కృష్ణదేవరాయల మరణానంతరం ఆయన మరణ శాసనాన్ని అనుసరించి తమ్ముడైన అచ్యుత దేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అచ్చుత దేవరాయలు ఇరవై ఏళ్ళు చంద్రగిరిలో ఉండడం వల్ల ఆయన తరచు చంద్రగిరి చుట్టు పక్కలుండే గుళ్ళను దర్శించేవారు. ఆయన సందర్శించే గుళ్ళల్లో శ్రీ గోవిందరాజస్వామి గుడి ఒకటి. ఆ గుడి పురోభివృద్ధికి సాధ్యమైనంత వరకు తన సహాయ సహకారాలను అందించేవారు. ఉత్సవ, ఊరేగింపుల్లో గోవిందరాజస్వామికి నృత్యగానాలు లేకపోవడం వెలితిగా తోచింది అచ్యుత దేవరాయలకు. తనకు ఏదైనా మంచి జరిగితే ఒక దేవదాసీని ఆలయానికి బహూకరిస్తానని మొక్కుకున్నాడు. ఊహించని విధంగా తన అన్న కృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి తాను సమస్త విజయనగర సామ్రాజ్యానికి ప్రభువైనాడు. కొన్నాళ్ళకు తన మొక్కుబడిని గురించి అంతఃపురంలో ఉన్న నాట్యకత్తెలకు తెలియజేశాడు. అందరూ తటపటాయిస్తుంటే సెవ్వుసాని తాను దేవదాసీగా గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్తానని ముందుకొచ్చింది. విజయనగరంలోనే మేటి అందగత్తె సెవ్వుసాని సమ్మతించగానే ఆమెను తిరుపతికి పంపి గోవిందరాజస్వామికిచ్చి వివాహం చేసి ఆ దేవునికి దాసిగా మార్చారు’ అన్నాడు వెంకటయ్య.‘అప్పటి వరకు ఆమెకున్న సంపదను ఏమి చేశారు?’ అడిగాడు రంగరాజన్.‘ఆమె సకల సంపదలతో పాటు మంది మార్బలాన్ని, పరివారాన్ని, చెలికత్తెలను తిరుపతికి పంపుతూ అచ్యుతదేవరాయలు మరికొంత సంపదను ఆమె వెంట ఆనందంగా పంపాడు. త్వరలో తానొచ్చి గోవిందరాజస్వామిని దర్శిస్తానన్నాడు. అన్న ప్రకారం కొన్నాళ్ళకు జైత్రయాత్రలో భాగంగా తిరుపతికొచ్చి స్వామి వారిని దర్శించుకొన్నాడు. ఆ సందర్భంగా రెండు రోజులు ఏర్పాటు చేసిన ఉత్సవ ఊరేగింపుల్లో పాల్గొన్నాడు. సెవ్వుసాని ధ్వజస్తంభం ముందుండే నాట్య మంటపాల్లో చేసిన నృత్యానికి పరవశించిపోయాడు. చెంతనే ఉన్న సామంత రాజులు పులకించిపోయారు. ప్రధాన వీధుల్లో స్వామి ఊరేగింపుల్లో పాల్గొన్నాడు. ఇసుకేస్తే రాలని జనంతో తిరుపతి నిండిపోయింది. దారి వెంబడి పూలతో, మామిడి తోరణాలతో, అరటి మానులతో అలంకరించారు. మిద్దెలపై నుండి జనం పూల వర్షం కురిపించారు. అచ్యుతరాయలు సెవ్వుసాని గానంతో కూడిన నాట్యాన్ని తనివితీరా వీక్షించాడు. చివరిరోజు స్వామివారికి అనేక వజ్రవైఢూర్యాలతో కూడిన ఎన్నో ఆభరణాలను బహూకరించాడు. మరెన్నో ఇనాంలను ప్రకటించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామి తనని ఇంతటి వాడిని చేశాడనే కృతజ్ఞతతో. ఆ తర్వాత ఆలయం పక్కనే ఉత్తర మాడవీధిలో ఉన్న సెవ్వుసాని భవనానికెళ్ళి ఆమెను బంగారు వరహాలతో అభిషేకించాడు. తన మాట నిలిపినందుకు విలువైన ఆభరణాలను అందజేశాడు. తర్వాత దక్షిణ దేశ జైత్రయాత్రలో విజయుడై విజయనగరానికి చేరుకొన్నాడు.‘అప్పటి నుండి సెవ్వుసాని తిరుపతిలోనే స్థిరపడిపోయిందా?’ అడిగాడు రంగరాజన్.‘అవును అప్పటినుండి ఇప్పటికీ ఆమె తిరుపతిని వీడలేదు. గోవిందరాజస్వామిని నృత్య నీరాజనాలతో ఆరాధిస్తోంది. ఆమెను చూడడానికి ఎంతో పెద్ద ధనవంతులు ఆమె ఇంటి ముందు వరుసలో నిల్చొని ఎదురు చూస్తుంటారు. ఆమె దేవుడినే తన భర్తగా భావించి, ఎలాంటి వారినీ ఇంట్లోకి అనుమతించేది కాదు. పైగా చుట్టు పక్కల సామంత రాజులకు కూడా ఆమె అంటే ఎంతో భయం. ఆమె జోలికి వెళ్ళేవారు కాదు. అంతేగాక పరిపాలనా అనుకూలతల కోసం ఆమె సహాయ సహకారాలను అర్థించేవారు. ఎందుకంటే ఆమె విజయనగర సామ్రాజ్యాధీశునికి అత్యంత సన్నిహితురాలు. ఆమె తలచుకొంటే పదవులు వూడిపోతాయి. తలలు తెగిపడతాయి. ఆమె పరపతి అలాంటిది’ అన్నాడు వెంకటయ్య.సెవ్వుసాని రాకముందే పుణ్యస్నానాలు ఆచరించిన వాళ్ళు కపిలేశ్వరస్వామిని దర్శించి వెళ్ళిపోయారు. సెవ్వుసాని పరివారంతో కలిసి కోనేటిగట్టు మీదుండే సంధ్యావందన మంటపం నుండి వయ్యారంగా నడుస్తూ రాతి మెట్లెక్కి కపిలేశ్వర స్వామిని దర్శించడానికెళ్ళింది. స్వామివారిని దర్శించాక నాగ పడిగలను ప్రదక్షిణం చేసుకొని చక్కటి ముగ్గువేసి మధ్యలో 365 ఒత్తులతో పిండి దీపం వెలిగించి దణ్ణం పెట్టుకొంది. అర్చకులు అందజేసిన ప్రసాదాలను తిని; కపిలేశ్వరస్వామి మహిమల్ని గూర్చి; కార్తీక పౌర్ణమి విశిష్టతను గూర్చి; కోనేటి ప్రవేశ ద్వారంలోని సువిశాల మంటపానికి అటు ఇటు ఉన్న లక్ష్మీ నారాయణస్వామిని గూర్చి; శ్రీకృష్ణ సమేత దేవేరులను గూర్చి అర్చకస్వాములు చెప్తుండగా ఆనందంగా వింటూ తిరుమల కొండను దగ్గర నుండి చూస్తూ పరవశించిపోసాగింది. ఇంతలో గాలులు మొదలయ్యాయి. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. తుంపర్లతో మొదలవ్వాల్సిన వాన అనుకోని ఉపద్రవంలా పెద్ద పెద్ద చినుకులతో హఠాత్తుగా దండయాత్ర చేసింది. కాసేపటికి తగ్గిపోతుందనుకున్నారంతా. కాని, రాను రాను వర్షం భీకరమైంది. మెరుపులు, ఉరుములతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మనుషుల్ని సైతం నెట్టేసే గాలులు మొదలయ్యాయి. కపిలేశ్వరస్వామి గుడి ఆవరణ నుండి కోనేటి గట్టున పెద్దగా నిర్మించి ఉన్న ముఖద్వారం మంటపానికి సెవ్వుసాని పరివారం చేరుకున్నారు.పెద్ద గాలివాన. ఉన్నట్టుండి వాతావరణం ఇంత ప్రళయంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. రెండు గడియలపాటు కుంభవృష్టి కురిసింది. జలపాతం హెూరు చెవులు చిల్లు పడేలా ఉంది. కొండల్లోని ఎర్రని మట్టితో కలిసి జలపాతం విస్తరించి దుముకుతోంది. కోనేరు అలల తాకిడితో కంపించిపోతోంది. నల్లని మబ్బులతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. అందరి గుండెల్లో గుబులు పుట్టింది. వరుణదేవుని ప్రతాపానికి ప్రముఖులు లేదు సామాన్యులు లేదు– అందరూ అటు ఇటు వాయించిన వర్షానికి కుడితిలో పడ్డ ఎలుకల్లా ముద్దయిపోయారు. ఉరుములు గుండెల్లో ఉరుము వాద్యాలు వాయిస్తున్నాయి. మెరుపులు అలముకున్న చీకట్లను చీల్చుతున్నాయి. అక్కడక్కడా పిడుగులు పడ్డ శబ్దాలు భయం గొల్పుతున్నాయి. ఇంతలో ఒక పిడుగు కపిలేశ్వరస్వామి గుడి మీద పడ్డట్టయింది. అందరూ ఆ శబ్దానికి, వెలుతురుకు భయ కంపితులైపోయారు. వణుకు మొదలైంది. కళ్ళల్లో దైన్యం ఆవహించింది. గుడిలో నుండి ఒక అర్చక స్వామి బతుకు జీవుడా అనుకొంటూ, పరిగెత్తుకొని అందరూ ఉన్న మంటపంలోకొచ్చాడు.‘కపిలేశ్వర స్వామికి ఏమీ కాలేదు. అయితే గుడి ప్రాకారాలు పడిపోయాయి. ఆగ్నేయంలో ఉండే వంటశాల మీద పిడుగు పడింది. వంటశాల ధ్వంసమైపోయింది. నేను పుట్టి బుద్ధెరిగాక ఇంత పెద్దవానను ఈ కపిలతీర్థంలో చూడలేదు’ అన్నాడు. ‘అమ్మగారూ! ప్రళయమొచ్చిందేమో? ననిపిస్తోంది’ అంది ఒక చెలికత్తె.‘ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అధైర్యపడకండి’ అని అందరికీ ధైర్యం చెప్పింది సెవ్వుసాని.‘అమ్మగారూ! కోనేట్లో నీటి ఉద్ధృతికి సంధ్యావందన మంటపం కంపించిపోతోంది. నీటి ధారలు జల ఖడ్గాలుగా విరుచుకుపడుతున్నాయి. మనమున్న ఈ మంటపాన్ని ఒరుసుకొని నీళ్ళు ప్రవహిస్తున్నాయి. ఈ మంటపానికి ప్రమాదం రాదు కదా?’ అంది మరో చెలికత్తె.‘మనం చేయగలిగిందేమీ లేదు గోవింద నామ స్మరణం తప్ప’ అంది సెవ్వుసాని.అక్కడున్న వాళ్ళంతా ‘గోవిందా గోవింద’ అని గోవిందలు పెట్టడం మొదలెట్టారు. దూరభారం నుండి వచ్చిన వాళ్ళంతా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమని చూస్తున్నారు. బతుకు మీద ఆశ వదిలేసుకున్నారు. మెల్లగా వాన తగ్గు ముఖం పట్టింది. ఉన్నట్టుండి తెరపి ఇచ్చింది.‘ఇక బయలు దేరుతాం అమ్మగారూ! మళ్ళీ వాన మొదలయ్యేలోగా వెళ్ళిపోదాం’ అన్నాడు రక్షణాధికారి.సెవ్వుసాని పరివార జనమంతా బయలుదేరి ముఖమంటపం వెలుపలికొచ్చారు. సెవ్వుసాని పల్లకీ ఎక్కుతుంటే పెళపెళమని చెట్టు కొమ్మ విరిగింది. అక్కడే ఉన్న ఆలయ ఏనుగు ముందుకు అడుగేయడంతో కొమ్మ ఏనుగు వీపుమీద పడింది. ఏనుగు పెద్ద ఘీంకారం చేసింది. అక్కడున్న వాళ్ళంతా భయంతో వణికిపోయారు. ‘మంచి కాలం అమ్మగారూ! ఈ ఏనుగు ముందుకు రాకపోయుంటే ఆ చెట్టు కొమ్మ సరిగ్గా మన పల్లకి మీద పడుండేది. అంతా చిత్రంగా ఉంది. బయలుదేరుదాం పదండి’ అంటూ బోయలు పల్లకీని భుజంపై ఉంచుకొని హరోం హర హర... హర హర... అంటూ తిరుపతి వైపుకెళ్ళిపోయారు. సెవ్వుసాని పరివారంతో పాటు క్షేమంగా తమ భవనానికి చేరుకున్నారు. సాయంత్రం చీకటి పడ్డాక గోవిందరాజస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా సగం కుండల్లో పెద్ద వత్తులతో వెలిగించిన దీపాలతో స్వామివారికి హారతిచ్చి; గుడి ప్రాంగణంలో, వెలుపల దీపాల ప్రదర్శన చేసి, ఆలయ నృత్య నీరాజనంలో పాల్గొని తన భవనానికి చేరుకొంది సెవ్వుసాని. భవనం మీద నుండి తన చెలికత్తెలతో పాటు కపిలతీర్థం కొండ కొమ్ముమీద వెలిగించిన దీపాన్ని దర్శించుకొని రాత్రి భోజనానంతరం సెవ్వుసాని తన పడక గదికెళ్ళింది. ఎంత దొర్లినా ఆమెకు నిద్ర పట్టలేదు. ఇదంతా ఎందుకు జరిగిందని ఆలోచించాక ఏం చేయాలో ఒక నిర్ణయానికొచ్చింది. పరోపకారార్థం ఇదం శరీరం అనుకొంది. రెండు రోజుల తర్వాత వానలు కుదుట పడ్డాక మళ్ళీ కపిలతీర్థానికి తన పరివారంతో పాటు వెళ్ళి దెబ్బతిన్న ఆలయ కట్టడాలను బాగుచేయాలనుకొంది.‘కోశాధికారీ! ఈ కపిలతీర్థం గుడి ప్రాకారాలను, వంటశాలను పునర్నిర్మించాలనుకొంటున్నాను. అలాగే దెబ్బతిన్న సంధ్యావందన మంటపాలకు మరమ్మత్తులు చేయాలి. నన్ను కాపాడిన గజరాజుకు ఏమీ కాకపోయినా, ఆ వినాయకుడే నన్ను కాపాడాడనిపిస్తోంది. అందుకని కపిల తీర్థంలోని ఆలయ ప్రాంగణంలో కపిలేశ్వరుని చెంత వినాయకుడ్ని ప్రతిష్ఠించి ఆయన నైవేద్యాలకు దానాలు చేయాలి. ఎన్ని సొమ్ములు ఖర్చు అయినా ఫర్వాలేదు’ అంది సెవ్వుసాని‘అలాగే అమ్మగారు’‘అందుకుగాను ఈ ప్రాంత సామంతరాజు రాచవీడు నాయకుని అనుమతిని తీసుకోండి’‘అవసరం లేదమ్మా! మీరు ఇంత మంచి పని చేస్తానంటే సామంత రాజులు కాదంటారా? మీరడిగిందే మహాభాగ్యంగా భావిస్తారు’ అన్నాడు కోశాధికారి.‘అది తప్పు. మనం రాచరికపు వ్యవస్థలో ఉన్నాం. విజయనగర సామ్రాజ్యాధీశుడు మనకు ఆత్మీయులు కావొచ్చు. స్థానిక సామంత రాజును గౌరవించడం మన కర్తవ్యం’‘అలాగే అమ్మగారు’సామంతరాజు అనుమతి తీసుకొన్న సెవ్వుసాని అన్ని పనులను పూర్తి చేసింది. నేటికీ సంధ్యావందన మంటపాలు చెక్కు చెదరలేదు. కపిలేశ్వరస్వామి ఆలయ ప్రాకారాలు, వంటశాల ఆమె ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. ఇక ఆలయంలో ధ్వజస్తంభం పక్కనుండే వినాయకుడు ఇప్పటికీ నిత్యం పూజలందుకుంటూ భక్తులకు కొంగు బంగారమైనాడు. సంపదలు ఉంటాయి, పోతాయి. కాని, సెవ్వుసాని ధార్మికత ఎల్లకాలం నిలిచే ఉంటుంది. ∙ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి -
ఆ రషీద్ని నేనే..!
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు 2007లో నమోదు చేసిన నకిలీ పాస్పోర్టుల కుంభకోణం కేసు దర్యాప్తులో రీల్ సీన్ను తలపించే రియల్ సీన్ జరిగింది. ఆ స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్న మహ్మద్ రషీద్ అలీ లొంగుబాటు నేపథ్యంలో అది చోటు చేసుకుంది. టూరిస్ట్ సహా వివిధ వీసాలపై వచ్చి, అక్రమంగా స్థిరపడుతున్న వారిని అరికట్టడానికి అమెరికా, యూకే తదితర దేశాలు గుజరాత్కు చెందిన మహిళలు, యువతులకు వీసా ఇవ్వడం మానేశాయి. అయితే రాజకీయ నాయకుల సిఫారసుతో వారి కుటుంబీకులు, సంబంధీకులకు మాత్రం వీటిని జారీ చేసేవి. దీంతో మనుషుల అక్రమ రవాణా కుంభకోణానికి తెరలేచింది.గుజరాత్కు చెందిన వారిని అనేకమందిని ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సంబంధీకులుగా చూపించారు. అలా నకిలీ పాస్పోర్ట్స్ జారీ చేయించి, ప్రత్యేక సిఫారసులతో వీసాలు సంపాదించి అక్రమ రవాణా చేశారు. 2007 ఏప్రిల్లో నాటి బీజేపీ ఎంపీ బాబూభాయ్ కటారా ఢిల్లీ విమానాశ్రయంలో అరెçస్టయ్యారు. అలా దొరికిన ఈ మనుషుల అక్రమ రవాణా తీగ లాగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ డొంక కదిలింది. దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులకు ఈ స్కామ్లో ‘దళారి’గా వ్యవహరించిన రషీద్ పేరు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని చాదర్ఘాట్కు చెందిన మహ్మద్ రషీద్ అలీ, చప్పల్బజార్ వాసి రాజు పిత్తీ 2005 నుంచి స్నేహితులు. వ్యాపారి, క్రికెట్ బుకీ అయిన రాజు– రషీద్కు అవసరమైన సొమ్మును వడ్డీకి ఇచ్చేవాడు. ఓసారి రషీద్ మనుషుల అక్రమ రవాణా వ్యవహారాన్ని రాజుకు చెప్పాడు. ఆపై గుజరాత్కు చెందిన భరత్ భాయ్ని రాజు కలుసుకున్నాడు. అతడితో కలిసి నకిలీ పాస్పోర్ట్స్ తయారీ ప్రారంభించాడు. ఈ ద్వయం అనేక మంది గుజరాతీలను ప్రముఖ రాజకీయ నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులుగా చెబుతూ నకిలీ పాస్పోర్ట్స్ ఇప్పించే వారు. దీని కోసం సదరు నేతలకు భారీగానే ముట్టచెప్పేవారు. 2006 నవంబరులో రషీద్ నుంచి రాజు పిత్తీకి ఓ సందేశం అందింది. నేరెళ్ల, బో«ద్ నియోజకవర్గాలకు చెందిన అప్పటి ఎమ్మెల్యేలు కాసిపేట లింగయ్య, సోయం బాబూరావు తమకు సహకరించడానికి సమ్మతించారన్నది దాని సారాంశం.ఇలా ప్రారంభమైన వ్యవహారం 2007 మేలో ఢిల్లీలో బాబూభాయ్ కటారా, నగరంలో లింగయ్య, బాబూరావు అరెస్టులతో సంచలనంగా మారింది. హైదరాబాద్ సీసీఎస్లోనూ నకిలీ పాస్పోర్టు స్కామ్, మనుషుల అక్రమ రవాణాపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో రషీద్ అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. ఇతడితో పాటు మహ్మద్ ముజఫర్ అలీఖాన్, భరత్భాయ్, షకీల్ల కోసం వేట ప్రారంభమైంది. ఆ కేసు నమోదైన రోజు నుంచి సీసీఎస్ కార్యాలయం హడావుడిగా మారింది. స్థానిక, జాతీయ మీడియా తాకిడితో ఉక్కిరిబిక్కిరైన సీసీఎస్ పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించవద్దంటూ గేటు వద్ద విధుల్లో ఉండే సెంట్రీకి స్పష్టం చేశారు. అయినా కొందరు మీడియా ప్రతినిధులు సెంట్రీ కళ్లుగప్పి లోపలకు వెళ్లారు. దీంతో ఉన్నతాధికారులు ఆ సెంట్రీని హెచ్చరించి, గేటుకు తాళాలు వేయించారు. రషీద్ కోసం ఢిల్లీ, సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసుల వేట ముమ్మరమైంది. అయితే అప్పటికి అతడి ఫొటో ఎవరి వద్దా అందుబాటులో లేదు. రషీద్ ఒక దశలో పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. వారి ‘ట్రీట్మెంట్’ను తప్పించుకోవడానికి కొందరు మీడియా ప్రతినిధుల ద్వారా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాడు. చివరకు 2007 మే 3న అతడి లొంగుబాటుకు ముహూర్తం ఖరారైంది. ఆ రోజు రషీద్ తన న్యాయవాది, ఇద్దరు మీడియా వ్యక్తులతో కలిసి నేరుగా సీసీఎస్ వద్దకు వచ్చాడు. కాస్త దూరంలో వాహనం దిగిన వీళ్లు నడుచుకుంటూ ఆ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్నారు. రషీద్ లొంగిపోవాలనే ఉద్దేశంతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ అతడితో పాటు వెంట ఉన్న వారినీ అడ్డుకున్నాడు. ‘నేను రషీద్ని... లొంగిపోతా’ అని చెబుతున్నా వినకుండా బయటకు నెట్టేసినంత పని చేశాడు. దీంతో అవాక్కైన రషీద్ వెంట వచ్చిన మీడియా ప్రతినిధులు విషయాన్ని ఫోన్ ద్వారా కేసు దర్యాప్తు అధికారికి చెప్పారు. అంతే! రెండో అంతస్తు నుంచి ఉరుకులు పరుగుల మీద వచ్చి ఆయన బృందం రషీద్ను తమ వెంట తీసుకువెళ్లింది. రషీద్ విచారణ, అరెస్టు తతంగాలు పూర్తి కావడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరెస్టు జరిగిన పుష్కర కాలం తర్వాత రషీద్ మరోసారి కటకటాల్లోకి వెళ్లాడు. ఆదాయపు పన్ను శాఖ పేరు చెప్పి ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.91 లక్షలు కాజేసిన కేసులో అదే సీసీఎస్ పోలీసులు 2018 జూన్ 20న జైలుకు పంపారు.హైదరాబాద్, ఢిల్లీలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో తనకు భారీగా ఆస్తులు ఉన్నట్లు రషీద్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. తాను ఆదాయపు పన్ను శాఖకు పన్ను బకాయి పడినట్లు, వారు నోటీసులు జారీ చేసినట్లూ నకిలీ నోటీసులు సృష్టించాడు. నోటీసులు అందుకున్నప్పటికీ తాను ఆ మొత్తం చెల్లించకపోవడంతో తనకున్న ఆస్తుల్ని ఐటీ విభాగం అధికారులు సీజ్ చేస్తూ వారు జారీ చేసినట్లు ఓ సీజర్ రిపోర్ట్ సైతం రూపొందించాడు. దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన లోగోలు, అధికారుల సంతకాలు సైతం తయారు చేశాడు. ఈ సీజర్ రిపోర్ట్తో పాటు ఆస్తుల జాబితా కూడా రూపొందించిన రషీద్ అలీ వీటితో పాటు అప్పటికే సిద్ధం చేసి ఉంచిన నకిలీ ఆస్తుల పత్రాలను జత చేశాడు. ఇలా రూపొందించిన ఫైల్ను వెంటేసుకునే ఇతగాడు ఖరీదైన కార్లతో తిరుగుతూ పరిచయస్తులతో పాటు వారి ద్వారా పరిచయమైన వారికీ చూపించాడు. కేవలం రూ.కోటి, రూ.2 కోట్ల పన్ను చెల్లించనందుకు రూ.200 కోట్ల ఆస్తులు సీజ్ అయ్యాయంటూ నమ్మించాడు. తాను చెల్లించాల్సిన పన్ను మొత్తం ఏర్పాటు చేస్తే ఐటీ విభాగానికి జమ చేసి తన ఆస్తులు విడిపించుకుంటానని, ఆ వెంటనే కొన్నింటికి విక్రయించి అసలుతో పాటు భారీ మొత్తం వడ్డీగా ఇస్తానంటూ ఎర వేసేవాడు. ఈ పేరుతో సయ్యద్ అనీస్ హైదర్, హరీష్ కుమార్ల నుంచి రూ.91 లక్షలు తీసుకుని మోసం చేశాడనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ∙ -
కాలానికి రివైండ్ బటన్
సినిమాల్లో టైమ్ మిషన్ లోకాన్ని చూసి ‘మనకీ ఒకటి ఉంటే బాగుండేది’ అని అనుకున్నారా? అయితే, ఈసారి శాస్త్రవేత్తలు నిజంగానే టైమ్ను వెనక్కి తిప్పేశారు! అది కూడా ఒక్క సెకను. ఈ అద్భుతం రష్యా, అమెరికా, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కలయికతో సాధ్యమైంది. ఐబీఎమ్ క్వాంటమ్ కంప్యూటర్ ప్రాసెసర్పై ప్రత్యేక అల్గారిథమ్ వాడి, ఒక కణం స్థితిని రివైండ్ చేసి, మునుపటి స్థితికి తీసుకెళ్లగలిగారు. సాధారణంగా మనకు తెలిసిన ప్రపంచంలో టైమ్ ఒకే దిశలో ముందుకు వెళ్తుంది. కాని, క్వాంటమ్ లోకంలో మాత్రం వేరే నియమాలు వర్తిస్తాయి. అవే ఒకటి సూపర్పోజిషన్ , అంటే ఒకే సమయంలో కణం రెండు స్థితుల్లో ఉండటం. రెండు ఎంటాంగిల్మెంట్, అంటే రెండు కణాలు దూరంలో ఉన్నా ఒకదానిపై మరొకటి ప్రభావం చూపటం. ఇవన్నీ మ్యాజిక్లా అనిపించే కాన్సెప్ట్లు. వీటిని ఉపయోగించే శాస్త్రవేత్తలు టైమ్ని ‘ఒక్క సెకను వెనక్కి’ నెట్టగలిగారు. ఇప్పుడిది చిన్న అంచనా ప్రయోగమే అయినా, ‘పోయిందనుకున్న సమాచారం కూడా తిరిగి వస్తుంది’ అని ఇది రుజువు చేసింది. క్వాంటమ్ కంప్యూటర్లకు ఇది గోల్డెన్ ఆప్షన్ . ఎందుకంటే భవిష్యత్తులో డేటా రికవరీ, ఎర్రర్ కరెక్షన్ , సిస్టమ్ స్టేబిలిటీ అన్నీ సులభం కానున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలా అయితే, త్వరలోనే టైమ్కి రివైండ్ బటన్ వచ్చే రోజులు కూడా రానున్నాయన్నమాట! -
Diwali: జగమంతా దీపావలి
ఇంటింటా దివ్వెల వరుసలతో అమావాస్య చీకటిని తరిమే పండుగ బాణసంచా రంగుల వెలుగులతో నింగీ నేలా మెరిసి మురిసే పండుగ దేశ దేశాల్లో పిన్నా పెద్దా జరుపుకొనే జగమంత పండుగ దీపావళిశరన్నవరాత్రులు ముగిశాక కొద్దిరోజుల విరామంలోనే దీపావళి సందడి మొదలవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజులు ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దక్షిణాదిలో దీపావళికి ముందు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి, అమావాస్య రోజున దీపావళి, కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలి పాడ్యమి జరుపుకొంటారు. ఉత్తరాదిలో ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకొంటారు. అమావాస్య రోజున దీపావళి, కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలి పాడ్యమి, కార్తీక శుక్ల విదియ రోజున యమద్వితీయ జరుపుకొంటారు. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల్లో దీపావళి వేడుకలలో మరికొన్ని ఆచార భేదాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో విలక్షణమైన వేడుకలు, పూజలు కూడా జరుపుతారు.దీపావళికి మూలమైన నరకాసుర వధ పురాణగాథ అందరికీ తెలిసినదే! వరాహమూర్తికి భూదేవికి పుట్టిన కొడుకు నరకుడు. పెరిగి పెద్దవాడయ్యాక ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. నరకుడికి శోణితపుర పాలకుడైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. బాణుడి ప్రోద్బలంతో నరకుడు దుర్మార్గం పట్టాడు. చుట్టుపక్కల రాజ్యాలపై దండెత్తి, ఆ రాజ్యాల రాజకుమార్తెలను తెచ్చి బంధించాడు. అలా పదహారువేల మందిని చెరపట్టాడు. కామాఖ్య అమ్మవారిని ఆరాధించే నరకుడు అమ్మవారి ద్వారా అనేక వరాలు పొందాడు. వరగర్వంతో ముల్లోకాలలోనూ జనాలను పీడించడం మొదలుపెట్టాడు. చివరకు స్వర్గంపై దండెత్తి, ఇంద్రుడిని తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. నరకుడి ఆగడాలు శ్రుతి మించడంతో దేవతలందరూ శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా నరకుడితో యుద్ధం చేసి, అంతమొందించాడు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరకుడు అంతమొందడంతో ఆ వార్త తెలిసిన జనాలు మర్నాడు అమావాస్య రోజున ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. అప్పటి నుంచి దీపావళి పండుగ రోజున ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వరుసగా వెలిగించడం ఆనవాయితీగా వస్తోందనేది పురాణాల కథనం. దీపావళి వేడుకల సందర్భంగా పాటించే ఆచారాల గురించి వివిధ వ్రతగ్రంథాలు విపులంగా తెలిపాయి. వీటి ప్రకారం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున– ధనత్రయోదశి నాడు అపమృత్యు భయ నివారణ కోసం దీపం పెట్టాలి. దీనినే యమదీపం అంటారు. నరకచతుర్దశి రోజున నరకభయ నివారణ కోసం వేకువ జామునే అభ్యంగన స్నానం చేయాలి. సాయంకాలం దేవాలయాలలో దీపాలు వెలిగించాలి. అమావాస్య నాడు మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు బెరళ్లను నీటిలో నానబెట్టి; ఆ నీటితో అభ్యంగన స్నానం చేయాలి. ప్రదోష కాలంలో– అంటే సూర్యాస్తమయానికి ముందు దీపదానం చేసి, ఇంటి బయట జువ్వి కొమ్మలకు మంటపెట్టి, ఆ దివిటీలు తిప్పాలి. వీటిని ఉల్కలు అంటారు. దివిటీలు తిప్పిన తర్వాత లక్ష్మీపూజ చేసి, తీపి పదార్థాలను ఆరగిస్తారు. సూర్యాస్తమయం కాగానే ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించాలి. దీపావళి అమావాస్య రోజు రాత్రి కొన్ని ప్రాంతాల్లోని స్త్రీలు ఇళ్లల్లో చేటలు, పళ్లేలు, తప్పెట్లు వాయిస్తారు. ఇలా చేయడం వల్ల అలక్ష్మి తొలగి, అషై్టశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. దీపావళి అమావాస్య రాత్రివేళలోనే ఇళ్లలో బలి చక్రవర్తిని స్థాపిస్తారు. మర్నాడు పాడ్యమి రోజున ఉదయం బలి చక్రవర్తికి ఉత్సవం చేస్తారు. బలి చక్రవర్తి పూజ ముగిశాక ఉదయం వేళలోనే జూదం ఆడతారు. బలి పాడ్యమినాడు ఆడే జూదంలో గెలిచేవారికి ఏడాది మొత్తం శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇదే రోజున కొన్ని ప్రాంతాల్లో గోవర్ధనపూజ చేస్తారు. ఆ రోజు పాడి పశువులను అలంకరించి, వాటికి ఆటవిడుపునిస్తారు. యమ ద్వితీయ రోజును భ్రాతృ ద్వితీయ అని కూడా అంటారు. ఆ రోజున సోదరీమణులు తమ సోదరులను ఇళ్లకు పిలిచి, విందుభోజనాలు పెడతారు.బాణసంచా సందడిదీపావళి రోజున బాణసంచా కాల్చడం తరతరాలుగా సాగుతోంది. చైనాలో పుట్టిన బాణసంచా అక్కడి నుంచి దేశదేశాలకు వ్యాపించింది. దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చడం దాదాపు పదిహేనో శతాబ్ది నుంచి మొదలై ఉంటుందని చరిత్రకారుల అంచనా. పద్దెనిమిది, పంతొమ్మిదో శతాబ్దాలలో బాణసంచాకు ఆదరణ తారస్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ రోజున మాత్రమే కాకుండా; పెళ్లిళ్లు తదితర వేడుకల్లో కూడా బాణసంచా కాల్చడం పదిహేనో శతాబ్ది నుంచి కొనసాగుతోంది. గుజరాత్ ప్రాంతంలో 1518 సంవత్సరంలో ఒక పెళ్లివేడుకలో వీథుల్లో బాణసంచా కాల్పులతో జరిగిన సంరంభాన్ని పోర్చుగీసు యాత్రికుడు బార్బోసా విపులంగా రాశాడు. మొఘల్ సామ్రాజ్యంలో బాణసంచాకు అమితమైన ఆదరణ ఉండేది. ఔరంగజేబు మినహా మొఘల్ చక్రవర్తులందరూ బాణసంచా కాల్పులను, బాణసంచా తయారీ నిపుణులను బాగా ఆదరించారు. బ్రిటిష్ హయాంలో కూడా బాణసంచా కాల్పుల ప్రదర్శనకు మంచి ఆదరణ ఉండేది. బ్రిటిష్ కాలంలోనే తమిళనాడులోని శివకాశి బాణసంచా తయారీకి ప్రధాన కేంద్రంగా ఏర్పడింది. తొలిరోజుల్లో శివకాశిలో ఎవరికి వారు కుటీర పరిశ్రమలా బాణసంచా తయారు చేసేవారు. సరిగా వందేళ్ల కిందట– 1925లో అయన్ నాడద శివకాశిలో ‘నేషనల్ ఫైర్వర్క్స్’ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత శివకాశిలో ఇబ్బడి ముబ్బడిగా బాణసంచా తయారీ సంస్థలు ఏర్పడ్డాయి. శివకాశిలో తయారయ్యే బాణసంచా ఉత్పత్తులు విదేశాలకు కూడా భారీ ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. దేశంలో తయారయ్యే బాణసంచా సామగ్రిలో ఎనభై శాతం శివకాశిలోనే తయారవుతున్నాయంటే, ఈ పట్టణంలో బాణసంచా పరిశ్రమ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శివకాశిలో బాణసంచా ఉత్పత్తుల విక్రయాల విలువ ఏటా రూ.26 వేల కోట్ల మేరకు ఉంటుందని తాజా అంచనాలు చెబుతున్నాయి.పెరిగిన కాలుష్య స్పృహబాణసంచా వల్ల వాతావరణ కాలుష్యం, ధ్వని కాలుష్యం ఫలితంగా ఏర్పడే ఆరోగ్య సమస్యలపై గడచిన పాతికేళ్లుగా జనాల్లో అవగాహన పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు బాణసంచా తయారీ, వినియోగాలపై ఆంక్షలు విధించడం కూడా మొదలైంది. ప్రభుత్వాల ఆంక్షల వల్ల బాణసంచా తయారీ సంస్థలు నిబంధనలకు లోబడి పర్యావరణానికి తక్కువ హాని కలిగించే, ‘గ్రీన్ క్రాకర్స్’ తయారు చేస్తున్నాయి. బాణసంచా తయారీలో ధ్వనికాలుష్య నియంత్రణకు సంబంధించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. బాణసంచా తయారీ సంస్థలు ఈ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనంటూ 2001లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి దేశంలోని బాణసంచా తయారీ సంస్థలు నిబంధనలకు లోబడి ‘గ్రీన్ క్రాకర్స్’ తయారీని ప్రారంభించాయి. అయినప్పటికీ పలుచోట్ల పాత పద్ధతిలోనే బాణసంచా తయారీ కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’ (ఎన్జీటీ) 2020లో సంప్రదాయ బాణసంచాపై పూర్తి నిషేధం విధించింది. బాణసంచా కాలుష్య ప్రమాణాలను ధ్రువీకరించే లాబొరేటరీ ఇదివరకు నాగపూర్లో ఉండేది. శివకాశిలో తయారయ్యే బాణసంచా నమూనాలను అక్కడకు పంపేవారు. అక్కడి నుంచి ధ్రువీకరణ లభించాక మార్కెట్లోకి విడుదల చేసేవారు. శివకాశిలోనే బాణసంచా ప్రమాణాలను పరిశీలించి, ధ్రువీకరించేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి) ఉమ్మడిగా ‘సీఎస్ఐఆర్–నీరి’ లాబొరేటరీని 2019 ఆగస్టులో రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఈ లాబొరేటరీ శివకాశిలో తయారయ్యే బాణసంచా నమూనాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, సత్వరమే ధ్రువీకరిస్తోంది.బాణసంచాతో ఆరోగ్య సమస్యలుబాణసంచా కాల్చడం వల్ల ఎక్కువగా చిన్నారులలో, వృద్ధులలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారితో పాటు ఇదివరకే ఉబ్బసం తదితర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి, గర్భిణులకు, అలెర్జీలతో బాధపడేవారికి ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. బాణసంచా కాల్పుల్లో వెలువడే పొగలో అత్యంత సూక్షా్మతి సూక్ష్మమైన (పీఎం2.5) పరిమాణంలోని రసాయనిక కణాలు ఊపిరితిత్తుల్లోకి చొరబడి శ్వాసనాళం వాపు, విపరీతమైన దగ్గు, ఉబ్బసం, బ్రోంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు తలెత్తుతాయి. ఈ సూక్ష్మ రసాయనిక కణాలు రక్తంలోకి చేరితే అధిక రక్తపోటు, గుండెజబ్బులు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, వాటి మంటలు అంటుకుని, కాలిన గాయాలు, పేలుళ్ల శబ్దతీవ్రతకు చెవుల వినికిడి శక్తి దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బాణసంచా వెలుగులు, రంగులు ఆహ్లాదాన్ని ఇచ్చినా, తగిన జాగ్రత్తలతో కాల్చితేనే పండుగ ఆనందభరితంగా ఉంటుంది.జైనులకు, సిక్కులకు పర్వదినందీపావళి హిందువులకు మాత్రమే కాదు జైనులకు, సిక్కులకు కూడా పర్వదినం. జైనుల ఇరవైనాలుగో తీర్థంకరుడైన మహావీరుడు ఇదేరోజున నిర్యాణం పొందాడు. అందువల్ల దీపావళి రోజున జైనులు తమ మందిరాలను దీపాలతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. జైన పండితుడు ఆచార్య జినసేన క్రీస్తుశకం 705లో రచించిన ‘హరివంశపురాణం’లో దీపావళిని ‘దీపాలికాయ’ అనే పేరుతో ప్రస్తావించాడు. మహావీరుడు నిర్యాణం చెందిన ఈ రోజున దీపాలను వెలిగించే సంప్రదాయాన్ని జైనులు తప్పనిసరిగా పాటిస్తారు. దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమి నుంచి జైనులకు కొత్త సంవత్సరం మొదలవుతుంది.సిక్కులు దీపావళిని ‘బందీ ఛోడ్ దివస్’గా జరుపుకొంటారు. సిక్కుల ఆరో గురువు హరగోబింద్, తన 52 మంది అనుచరులతో కలసి ఖైదు నుంచి విడుదలైన రోజు కావడంతో సిక్కులు దీపావళిని ఖైదు విమోచన దినంగా జరుపుకొంటారు. హరగోబింద్ను నాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ గ్వాలియర్ కోటలో బంధించాడు. తర్వాత 1619 సంతవ్సరం దీపావళి రోజున ఆ చెర నుంచి విడుదల చేశాడు. సిక్కులు దీపావళి రోజున గురుద్వారాలలో దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాలు జరుపుకొంటారు. రాత్రివేళ బాణసంచా కాలుస్తూ సందడి చేస్తారు.దీపావళి ముమ్మతాల పండుగదీపావళి జగమంతా వేడుకదీప ప్రశస్తిదీపం చీకటిని తరిమికొట్టి వెలుగును వెదజల్లుతుంది. దీపాన్ని జ్ఞానానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి ప్రతీకగా భావిస్తారు. దీపాన్ని లక్ష్మీస్వరూపంగా ఆరాధిస్తారు. దీప ప్రశస్తిని తెలిపే పురాణగాథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది దేవేంద్రుడు దుర్వాసుడి ఆగ్రహానికి గురికావడం వల్ల తన రాజ్యాన్ని, సంపదలను పోగొట్టుకున్న ఉదంతం. దుర్వాసుడు ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. దేవేంద్రుడు అతడికి స్వాగత సత్కారాలు చేసి, చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. ఇంద్రుడి ఆతిథ్యానికి దుర్వాసుడు తృప్తిచెందాడు. స్వర్గం నుంచి తిరిగి బయలుదేరే ముందు ఇంద్రుడికి కానుకగా ఒక హారాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు ఆ హారాన్ని నిర్లక్ష్యంగా అందుకుని, తన పట్టపుటేనుగు ఐరావతానికి అందించాడు. ఐరావతం ఆ హారాన్ని నేలపై పడేసి, కాళ్లతో తొక్కి చిందరవందర చేసింది. ఈ దృశ్యం చూసి ఆగ్రహించిన దుర్వాసుడు ఇంద్రుడిని శపించాడు. ఫలితంగా ఇంద్రుడు తన స్వర్గాన్ని, సిరిసంపదలను కోల్పోయాడు. సర్వం కోల్పోవడంతో ఇంద్రుడు దిక్కుతోచక శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. శ్రీమహావిష్ణువు ఒక దీపాన్ని వెలిగించి, ఇంద్రుడి చేతికి ఇచ్చాడు. ఆ దీపాన్ని మహాలక్ష్మీదేవిగా తలచి, పూజించమన్నాడు. దేవేంద్రుడు ఆ దీపాన్ని పూజించాడు. మహాలక్ష్మి అనుగ్రహం పొంది; తిరిగి స్వర్గాధిపత్యాన్ని, కోల్పోయిన సమస్త సంపదలను పొందాడు. ఈ పురాణ గాథ నేపథ్యంలోనే దీపావళి రోజున దీపాలు వెలిగించి, మహాలక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళి తర్వాత వచ్చే కార్తీక మాసమంతా దీపారాధన చేయడం కూడా సంప్రదాయంగా వస్తోంది. దీపదానం చేయడం వల్ల నరకబాధ తప్పుతుందని కొందరు నమ్ముతారు.దేశదేశాల్లో దీపావళిదీపావళి వేడుకలు భారత్తో పాటు భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే వివిధ దేశాల్లో ఘనంగా జరుగుతాయి. దాదాపు ఇరవై దేశాలలో దీపావళి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. హిందువులు ఎక్కువగా నివసించే నేపాల్, శ్రీలంక, మారిషస్ దేశాలతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సురినేమ్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, మలేసియా, థాయ్లాండ్, మయాన్మార్, ఫిజి, గయానా తదితర దేశాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతాయి. నేపాల్లో దీపావళి సందర్భంగా ‘తీహార్’ వేడుకలను ఐదురోజుల పాటు జరుపుకొంటారు. ఈ సందర్భంగా విందు వినోదాలు; బాణసంచా సంబరాలు జరుపుకోవడంతో పాటు కాకులు, శునకాలు, గోవులను పూజించి, వాటికి ప్రత్యేకంగా ఆహారం పెడతారు. సింగపూర్లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో దీపావళి వేడుకలు దేదీప్యమానంగా జరుగుతాయి. దీపావళి పండుగను ఫిజి, గయానా, మలేసియా, మారిషస్, మయాన్మార్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, సురినేమ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు అధికారిక సెలవుదినంగా పాటిస్తున్నాయి. అమెరికాలో కూడా దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించే దిశగా అక్కడ స్థిరపడ్డ భారత సంతతి ప్రజలు అమెరికన్ ప్రభుత్వంపై కొన్నేళ్లుగా ఒత్తిడి తెస్తున్నారు. అమెరికాలో దీపావళి అధికారికంగా జాతీయ సెలవుదినం కాకున్నా, పెన్సిల్వేనియా వంటి కొన్ని రాష్ట్రాలు దీపావళిని సెలవు దినంగా పాటిస్తున్నాయి. కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్హౌస్లో వేడుకలు జరుపుతున్నారు. అలాగే బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో కూడా కొన్నేళ్లుగా దీపావళి వేడుకలు జరుపుతూ వస్తున్నారు. -
ఈ ఆదివారం వెరైటీగా టేస్టీ.. టేస్టీ..ఉప్మా సమోసా ట్రై చేయండిలా..!
ఉప్మా సమోసాకావలసినవి: బొంబాయి రవ్వ– ముప్పావు కప్పు, పెరుగు– అర కప్పుమైదాపిండి– ఒక కప్పుఉల్లిపాయ– ఒకటి (చిన్నగా తరగాలి)అల్లం తురుము– కొద్దిగాపచ్చిమిర్చి– 2 (చిన్నగా కట్ చేసుకోవాలి)పచ్చి బఠానీలు– 50 గ్రాములు (నానబెట్టి ఉడబెట్టి పెట్టుకోవాలి), క్యారెట్– ఒకటి (తురుముకోవాలి)క్యాప్సికం– ఒకటి (సన్నగా తరగాలి)ఉప్పు, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పాన్లో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అనంతరం అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి గరిటెతో తిప్పుతూ వేయించాలి. అనంతరం బఠానీలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు ఇలా అన్నీ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించాలి. ఉప్పు కూడా వేసి కలపాలి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుని ఉప్మా బాగా మగ్గించి, స్టవ్ ఆఫ్ చేసుకుని, చల్లారనివ్వాలి. ఈలోపు ఒక గిన్నెలో మైదాపిండి, తగినంత ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకుని, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీల్లా చేసుకుని సమోసాలా చుట్టుకుని దానిలో కొద్దికొద్దిగా ఉప్మా మిశ్రమాన్ని నింపుకుని ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించి టమోటో సాస్తో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.ఫ్రాన్స్ లాబ్స్టర్ థెర్మిడార్ కావలసినవి: లాబ్ట్సర్ (పీత జాతి) – ఒకటి (రెండు లేదా మూడు రొయ్యలతో కూడా ఇలా చేసుకోవచ్చు, లాబ్స్టర్ను శుభ్రం చేసుకుని, సగం ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇరువైపులా ఉండే కాళ్ల భాగాలను మరో వంటకానికి వినియోగించుకోవచ్చు)ఆలివ్ నూనె– 2 టేబుల్ స్పూన్లుబటర్– 3 టేబుల్ స్పూన్లుఉల్లిపాయ ముక్కలు– అర కప్పువెల్లుల్లి తరుగు– ఒక టీ స్పూన్మైదా– 2 టేబుల్ స్పూన్లుపాలు– ఒక కప్పు, ఫ్రెష్ క్రీమ్– పావు కప్పుఆవాల పేస్ట్– అర టీ స్పూన్ , చికెన్ స్టాక్– పావు కప్పు, పార్మెసాన్ చీజ్– అర కప్పు, ఉప్పు– సరిపడామిరియాల పొడి– కొద్దిగాకొత్తిమీర తురుము– కొద్దిగాతయారీ: ముందుగా ఒక పాన్ లో బటర్ వేసి కరిగించాలి. బటర్ కరిగిన తర్వాత, తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు గరిటెతో తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు మైదా వేసి 2 లేదా 3 నిమిషాలు వేయించాలి. నెమ్మదిగా పాలు, చికెన్ స్టాక్ వేసి, ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత, ఆవాల పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. చివరగా, కట్ చేసి పెట్టుకున్న లాబ్ట్సర్ ముక్కలు లేదా రొయ్యలు, ఫ్రెష్ క్రీమ్ వేసి, కొన్ని నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పున్ లో బేక్ చేసుకోవాలి. చీజ్ బంగారు రంగులోకి మారి కరిగేవరకు 10–15 నిమిషాలు బేక్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.త్రిపుర మాయిదుల్కావలసినవి: అన్నం– 2 కప్పులు, ఉప్పు– సరిపడావెల్లుల్లి రెబ్బలు– 4 (తురుములా చేసుకోవాలి)పచ్చిమిర్చి పేస్ట్– ఒక టీ స్పూన్, బియ్యప్పిండి– ఒక టేబుల్ స్పూన్బేకింగ్ సోడా, అల్లం పేస్ట్– కొద్దికొద్దిగాతయారీ: ముందుగా అన్నాన్ని చేత్తో పిసికి బాగా మెత్తగా చేసుకోవాలి. దానిలో సరిపడా ఉప్పు, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి పేస్ట్, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, అల్లం పేస్ట్ ఇలా అన్నీ బాగా కలిపి.. కొద్దికొద్ది మిశ్రమంతో గుండ్రటి బంతుల్లా చుట్టుకోవాలి. వాటిని బొగ్గులపై దోరగా కాల్చి, వేడి వేడిగా ఉన్నప్పుడు టొమాటో సాస్ లేదా నచ్చిన చట్నీలతో తినొచ్చు. (చదవండి: మెరిసే చర్మం కోసం యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్..) -
సేఫ్ హ్యాండిల్స్!
డోర్ హ్యాండిల్ అంటే మనం పెద్దగా పట్టించుకోని చిన్న వస్తువు. కాని, అక్కడే నిత్యం బ్యాక్టీరియా కణాలు పార్టీ చేసుకుంటుంటాయి. తెలియకుండానే వ్యాధులను లోపలికి ఆహ్వానించే ఈ హ్యాండిల్స్ని చూసి, ‘ఇక చాలు’ అనుకున్నాడు జమైకా యువ ఆవిష్కర్త రేవాన్స్ స్టూవర్ట్ట్. వెంటనే సెల్ఫ్ క్లీనింగ్ డోర్ హ్యాండిల్కు ప్రాణం పోశాడు. జమైకా తీరం దగ్గర పుట్టిన అతడి ఆలోచన ఇప్పుడు ఆసుపత్రుల తలుపులకు చేరి వేలాది మంది ప్రాణాలను రక్షిస్తోంది. రేవాన్స్ స్టూవర్ట్.. జమైకా పర్వతాల మధ్యలోని మౌంట్ ప్రాస్పెక్ట్ అనే చిన్న ఊరిలో పెరిగిన అబ్బాయి. జమైకా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న విద్యార్థి. అయితే, కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యే విద్యార్థి కాదు, వాస్తవ సమస్యలను గమనించి, వాటికి పరిష్కారాలను వెతికే క్రియేటర్. చిన్నప్పటి నుంచి వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఆటబొమ్మలు, రేడియోలు విప్పదీసి మళ్లీ కలపడం అతని ఫేవరెట్ గేమ్. అందుకే అతని తల్లి ఎప్పుడూ అతనికి ‘రేవాన్స్ , వస్తువులను పగలగొట్టడం మానెయ్యి!’ అని చెబుతుండేది. కుటుంబంలో ఎవరికీ అక్షరాలు రాకున్నా, రేవాన్స్ యూనివర్సిటీలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఇన్నోవేషన్లపై ప్రేమ పెంచుకున్నాడు. వర్చువల్గా దుస్తులు ట్రై చేసుకునే సాఫ్ట్వేర్ను కూడా తయారు చేశాడు. కాని, అసలైన మలుపు ఒక ఆసుపత్రిలో వాలంటీర్గా పనిచేసేటప్పుడు వచ్చింది. అక్కడే గ్రహించాడు ‘డోర్ హ్యాండిల్స్ అంటే అనారోగ్యానికి నేరుగా ఫ్రీ ఎంట్రీ పాస్ల లాంటివి’. అప్పుడే ‘జెర్మోసోల్’ అనే మ్యాజిక్ డోర్ హ్యాండిల్ను తయారు చేశాడు. ఎలా పనిచే స్తుందంటే? సూర్యరశ్మిని సూక్ష్మజీవులు తట్టుకోలేవు కదా! అదే సూత్రాన్ని ఇక్కడ వాడాడు. హ్యాండిల్లో ఒక చిన్న అల్ట్రావయొలెట్ లైట్ అమర్చాడు. మనం తాకగానే అది వెలుగుతుంది. అందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కాంతి ముప్పయి సెకన్లలో హ్యాండిల్పై ఉన్న బ్యాక్టీరియాను అంతం చేస్తుంది. దాదాపు 99.9 శాతం శుభ్రత సాధ్యం! ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, కరీబియన్స్ వాతావరణానికి సరిపోయే ప్రాణరక్షక కవచం. ఆసుపత్రులు, స్కూళ్లు, ఆఫీసులు సహా ఎక్కడ తలుపులు ఉంటాయో, అక్కడ దీని రక్షణ అవసరం. ఈ అద్భుత ఆవిష్కరణ రేవాన్స్ కి జమైకా ప్రధాని చేతుల మీదుగా జాతీయ యువ శాస్త్రవేత్త అవార్డు, అలాగే కామన్వెల్త్ హెల్త్ ఇన్నోవేషన్స్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తలుపు తీయడం అంటే కేవలం లోపలికి వెళ్లడం కాదు, సూక్ష్మజీవులను బయటే వదిలేయడం కూడా! ఈ విషయమై రేవాన్స్ మాట్లాడుతూ, ‘ఎన్ని కష్టాలు వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ఒకటిగానే నిలిచింది. వాళ్లే నా బలం, వాళ్లే నా ప్రేరణ’. అని చెప్పాడు. ∙ -
అసలైన అంధుడు
సూరారంలో సుబ్బయ్య అనే ఆస్తి పరుడు ఉండేవాడు. అతను పరమ లోభి. అనేక అక్రమ వ్యాపారాలు చేసి డబ్బు కూడబెట్టాడు. దానం చేసే బుద్ధి, పరోపకార గుణం సుబ్బయ్యలో మచ్చుకైనా లేకుండేవి. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు.అయితే, అతనికి దేవునిపై నమ్మకం ఎక్కువ. వీలు దొరికినప్పుడల్లా ఏదో ఒక దేవాలయానికి వెళ్లి తన కోరికలు చెప్పుకునేవాడు.పండరిపుర పాండురంగడు కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడని సుబ్బయ్య చెవిన పడింది. వెంటనే పండరిపురం వెళ్లాడు. చంద్రవంక నదిలో స్నానం చేసి పుండరీకుని దర్శనం చేసుకున్నాడు. తన కోరికలు పాండురంగనికి చెప్పమని కోరుకున్నాడు. ఆ తర్వాత పాండురంగని ఆలయానికి చేరుకున్నాడు.పాండురంగని ఆలయం ఎంతో సుందరంగా ఉంది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. దైవ దర్శనానికి ఉన్న వరుస ఎంతో పొడవుగా భక్తులతో కిటకిటలాడుతోంది.సుబ్బయ్య అక్రమ బుద్ధి అక్కడ కూడా చూపించాడు. వరుసలో భక్తులు ఒకరి వెంట ఒకరు నెమ్మదిగా పాండురంగని భజన చేసుకుంటూ వెళుతున్నారు. సుబ్బయ్య మాత్రం వెంటనే భగవంతుని దర్శనం చేసుకోవాలని వరుసలోంచి పక్కకు వచ్చి అందర్నీ తోసుకుంటూ ముందుకు పోయాడు. పాండురంగని దర్శించుకుని బయటకు వెళ్లాడు. ‘అయ్యా! దానం చేయండి!’ అంటూ బిచ్చగాళ్లు చుట్టుముట్టారు. అందర్నీ విదిలించుకుని వెళ్ళి దూరంగా ఉన్న అరుగు మీద కూర్చున్నాడు.అక్కడ కంటికి నల్ల అద్దాలు పెట్టుకుని పాండురంగని కీర్తిస్తున్న అంధురాలు ‘అయ్యా! గర్భగుడిలో ఇటుక మీద పాండురంగ స్వామి రెండుచేతులు నడుం మీద పెట్టుకుని ఠీవిగా నిల్చున్న అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు చాలవట కదా!’ అడిగింది.సుబ్బయ్య మాట్లాడలేదు. ‘పాండురంగని పాదాలు మన చేతులతో, శిరస్సుతో స్పృశించవచ్చట కదా! మందిరంలో ఎటు చూసినా తులసి మాలలేనట కదా!?’ తిరిగి అడిగింది. ఆమెకు కళ్లు కనిపించవు. అందుకే చూడలేక అడిగింది. సుబ్బయ్యకు రెండు కళ్లున్నా వెంటనే దర్శనం చేసుకుని బయట పడాలని, ఇతర భక్తులను తోసుకు వెళ్లాడు. అందుకే ఆ అందాన్ని ఆస్వాదించలేకపోయాడు.తన కళ్ళకూ, కళాత్మకంగా చూసే కళ్లకు చాలా భేదం ఉంది. కళాత్మక హృదయం లేని తనకు గొప్ప శిల్పం కూడా బండరాయి లాగే కనిపించింది’ అనుకున్నాడు సుబ్బయ్య. పరోపకారం, దానగుణం లేని తాను కళ్లున్న అసలైన అంధుణ్ణనుకున్నాడు. అక్రమ మార్గం విడిచి సక్రమంగా జీవించాలనుకున్నాడు. అలా అనుకున్నాక పేదలకు దానధర్మాలు చేస్తూ, భగవంతుని సుందరరూపాన్ని చూడగలిగాడు సుబ్బయ్య. పువ్వులు∙ గుండాల నరేంద్రబాబుపూలమ్మా పువ్వులు రంగు రంగుల పువ్వులురంగేళీ రవ్వలురాసగుమ్మ గువ్వలురక రకాల పువ్వులురమ్యమైన పువ్వులురా రమ్మను పువ్వులురామచిలుక చిన్నెలుముద్ద ముద్ద బంతులుముద్దుల చేమంతులుమల్లెలు మందారాలుఎర్రనైన గులాబీలుఅరవిరిసిన సింగారాలు -
జిలుగుల జింజు వెలుగుల రంజు
దక్షిణ కొరియాలోని జియోంగ్సాంగ్ ప్రావిన్స్లో ఉన్న జింజు నగరంలో ఏటా జరిగే ఈ జింజు లాంతర్ ఫెస్టివల్ చాలా ప్రత్యేకంగా నడుస్తుంది. రంగురంగుల లాంతర్లతో జింజులోని నామ్గాంగ్ నది ప్రాంగణం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతుంది.ప్రతి సంవత్సరం అక్టోబర్లో వచ్చే ఈ దీపాల పండుగ.. సుమారు రెండువారాలకు పైగానే కొనసాగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 19 వరకు జింజు నగరాన్ని మెరిపిస్తుంది. ఈ పండుగ మూలాలు సుమారు 400 సంవత్సరాల నాటి పురాతన చరిత్రను చెప్పుకొస్తాయి. జింజు నగరం 1592లో సైనిక కేంద్రంగా ఉండేది. ఆనాడు జపాన్ దండయాత్ర జరిగినప్పుడు జింజు కోటను రక్షించుకోవడానికి వేలాది మంది దక్షిణ కొరియా సైనికులు ప్రాణాలను కోల్పోయారు. వారి ప్రాణత్యాగాలకు గుర్తుగా నేటికీ ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. జపాన్ సైన్యం నామ్గాంగ్ నదిని దాటకుండా నిరోధించడానికి, వారిని తికమకపెట్టడానికి– కొరియన్ సైనికులు నీటిపై లాంతర్లను వదిలేవారని, అలాగే యుద్ధసమయంలో తమ కుటుంబ సభ్యులకు తమ క్షేమ సమాచారం తెలియజేయడానికి కూడా తేలియాడే లాంతర్లను ఉపయోగించేవారని చరిత్ర చెబుతుంది.ఈ వేడుకలో సాంస్కృతిక, వినోదాత్మక కార్యక్రమాలు చక్కగా సాగుతాయి. వేలకొద్దీ రంగురంగుల దీపాలు నామ్గాంగ్ నదిపై తేలుతూ, కళ్ళకు ఇంపుగా మెరుస్తాయి. ఈ వేడుకలో పాల్గొనేవారు తమ కోరికలు రాసిన లాంతర్లను నదిలో వదలిపెట్టవచ్చు లేదా ఆ ఆర్టిఫిషియల్ బ్రిడ్జీలకు వేలాడదీయవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాల మైలురాళ్లను పోలిన భారీ లాంతరు శిల్పాల ప్రదర్శన కనువిందు చేస్తుంది. పండుగ సందర్భంగా పర్యటకులకు, నదిపై తాత్కాలికంగా నిర్మించిన వంతెనలపై నడుస్తూ, లాంతర్లను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తారు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో రాత్రిపూట– కళ్లు చెదిరే బాణాసంచాలు, డ్రోన్ లైట్ షోలతో ఆకాశం కాంతిమయమవుతుంది.అరుదైన లైట్హౌస్బోనవిస్టా ద్వీపకల్పంలో తీరం వెంబడి తరతరాలుగా ప్రయాణించే నావికులకు– కేప్ బోనవిస్టా లైట్హౌస్తో గొప్ప అనుబంధం ఉంది. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో ఉపయోగించిన సీల్ (ఒక సముద్రజీవి) ఆయిల్తో మండే అరుదైన కాటోప్ట్రిక్ లైట్ ఉపకరణాన్ని ఇక్కడ చూడొచ్చు. న్యూఫౌండ్లాండ్, లాబ్రడార్లలో అత్యధికంగా ఫొటోలు తీసిన ప్రదేశాలలో ఇది ఒకటి! తిమింగలాలు, మంచు పర్వతాలు, పఫిన్ పక్షులను చూడటానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. అందుకే ఇక్కడికి పర్యాటకులు ఎగబడుతుంటారు. -
రావణుడి లంకాక్రమణ
రావణుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి వరాలు పొంది, త్రికూట పర్వతానికి వచ్చాడు.ఈ సంగతి తెలిసి, రావణుడి మాతామహుడు సుమాలి తన మంత్రులైన మారీచుడు, సుబాహుడు, ప్రహస్తుడు, మహోదరుడు, విరూపాక్షుడు సహా తన అనుచరులతో కలసి రావణుడిని కలుసుకోవడానికి వచ్చాడు.‘నాయనా! నువ్వు బ్రహ్మదేవుడి నుంచి ఉత్తమ వరాలు పొందావు. విష్ణువు వలన భయం కారణంగా మేమంతా లంకను విడిచి వెళ్లి, రసాతలంలో తలదాచుకుంటూ వస్తున్నాం. లంకానగరం మనది. ఒకప్పుడు రాక్షసులు నివసించిన నగరం అది. ఇప్పుడు నీ సోదరుడు, బుద్ధిమంతుడు అయిన కుబేరుడు లంకను తన నివాసంగా చేసుకున్నాడు. నువ్వు బుద్ధిబలంతో గాని, సామ దాన భేద దండోపాయాలతో గాని తిరిగి లంకను స్వాధీనం చేసుకున్నట్లయితే, మంచి పని చేసినట్లవుతుంది. నువ్వు లంకకు అధిపతివి కాగలవు. నువ్వు మన రాక్షసులందరికీ ప్రభువువు కాగలవు’ అని అన్నాడు.‘తాతా! కుబేరుడు మాకు అగ్రజుడు, పూజ్యుడు. నువ్విలా మాట్లాడటం తగదు’ అన్నాడు రావణుడు.ప్రహస్తుడు కలగజేసుకుని, ‘రావణా! నీ మాటలు వీరోచితంగా లేవు. శూరులకు భ్రాతృప్రేమ ఉండరాదు. తోబుట్టువులైన అదితి, దితి సౌందర్యవతులు. వారిద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలు. అదితి ముల్లోకాలకు ప్రభువులైన దేవతలను, దితి దైత్యులను కన్నారు. సాగర పర్వత వన సమన్వితమైన ఈ భూలోకంపై దైత్యులు అధికారం కలిగినవారై ఉండేవారు. విష్ణువు యుద్ధాలలో దైత్యులెందరినో చంపి, ముల్లోకాలను దేవతల వశం చేశాడు. సోదరులతో విరోధం పెట్టుకోవడం అనే విపరీతాన్ని నువ్వొక్కడివే చేయడం లేదు. పూర్వం సురాసురులు ఇదే పని చేశారు. కాబట్టి నేను చెప్పినట్లు చేశావంటే, లంకాధిపత్యమే కాదు, నీకు త్రిలోకాధిపత్యం కూడా లభించగలదు’ అన్నాడు.ప్రహస్తుడి మాటలతో రావణుడు ఆలోచనలో పడ్డాడు.కాసేపు ఆలోచించాక, ‘సరే! అలాగే చేస్తాను’ అని పలికాడు. రావణుడి మాటలతో సుమాలి, అతడి మంత్రులు, అనుచరులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు.మాతామహుడితోను, అతడి మంత్రులతోను చర్చలు జరిపిన తర్వాత కుబేరుడి వద్దకు మాటకారి అయిన ప్రహస్తుడిని రాయబారిగా పంపాలని రావణుడు నిర్ణయించాడు.‘‘ప్రహస్తా! నువ్వు లంకకు వెళ్లు. ధనాధిపతి అయిన కుబేరుడితో సామ మార్గంలో ఇలా చెప్పు’ అని తన సందేశాన్ని ఇలా చెప్పాడు: ‘సౌమ్యుడైన కుబేరా! మహాత్ములైన రాక్షసులకు చెందిన లంకా నగరంలో నువ్వు నివాసం ఏర్పరచుకున్నావు. ఇది నీకు తగదు. అందువల్ల ఇప్పుడు లంకను తిరిగి మాకు ఇచ్చేసినట్లయితే, నాకు సంతోషాన్ని కలిగినవాడివి, ధర్మాన్ని పాలించిన వాడివి కాగలవు’ అని ఆదేశించాడు.రావణుడి ఆదేశంతో ప్రహస్తుడు లంకకు బయలుదేరాడు. కుబేరుడి మందిరానికి చేరుకుని, అతడితో ‘బుద్ధిశాలివైన కుబేరా! నీ సోదరుడైన దశకంఠుడు రావణుడు నన్ను నీ వద్దకు పంపాడు. రావణుడి ఆజ్ఞపై నేను చెబుతున్న మాటలు విను– పూర్వం ఈ లంకానగరాన్ని సుమాలి మొదలైన రాక్షసులు ఏలుకున్నారు. అందువల్ల సౌమ్యంగా అర్థిస్తున్న నీ సోదరుడైన రావణుడికి ఈ లంకను అప్పగించు’ అని చెప్పాడు.‘ప్రహస్తా! రాక్షసులెవరూ లేని ఈ లంకను నా తండ్రి నాకు అప్పగించాడు. ప్రజలకు తగిన దాన గౌరవాలు కల్పించడం ద్వారా దీనిని నేను నివాసయోగ్యం చేశాను. నువ్వు వెళ్లి రావణుడితో ఇలా చెప్పు’ అని– ‘రావణా! ఈ లంకానగరం, ఈ రాజ్యం నీకు చెందినదే! ఏ బాధలు లేకుండా రాజ్యాన్ని అనుభవించు. నా రాజ్యాన్ని, నా ధనాన్ని నీతో ప్రత్యేకంగా పంచుకోవలసిన పనిలేదు. ఇవి మనిద్దరమూ కలసి అనుభవించవలసినవి’ అని చెప్పి ప్రహస్తుడిని సాగనంపాడు.తర్వాత కుబేరుడు తన తండ్రి విశ్రవసుడి వద్దకు వెళ్లాడు. లంకను అప్పగించాలంటూ రావణుడు తన వద్దకు దూతను పంపిన విషయం చెప్పి, ఇప్పుడు తానేం చేయాలో చెప్పమన్నాడు.‘కుమారా! రావణుడు ఈ సంగతి నాకు కూడా చెప్పాడు. నేను మందలించాను. అయినా వాడు నా మాట పట్టించుకోవడం లేదు. దుష్టబుద్ధితో లంకను ఆక్రమించుకుంటే నశిస్తావని కూడా వాడికి చాలాసార్లు చెప్పాను. వాడికి మంచిచెడులు తెలియడం లేదు. హితవు వినే పరిస్థితిలో లేడు. కుమారా! ఈ పరిస్థితుల్లో ధర్మసమ్మతం, శ్రేయోదాయకం అయిన మార్గం చెబుతాను విను. నువ్వు నీ అనుచరులతో కలసి లంకను విడిచిపెట్టు. ఉత్తర దిశలో కైలాసపర్వత ప్రాంతంలో ఉత్తమమైన మందాకినీ నది ఉంది. ప్రశాంతమైన ఆ ప్రదేశంలో దేవ గంధర్వ కిన్నెర కింపురుషాలదులు ఆనంద విహారాలు చేస్తుంటారు. అలాంటి మందాకినీ తీరంలో నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించుకో’ అని సలహా ఇచ్చాడు.తండ్రి సలహాతో కుబేరుడు తన భార్యా పుత్రులతో, అమాత్యులతో, పరిజనంతో రథాది వాహనాలను సిద్ధం చేసుకుని, కైలాసం వైపు ప్రయాణం ప్రారంభించాడు. కుబేరుడు లంకను ఖాళీ చేసేయడంతో ప్రహస్తుడు సంతోషించాడు. వెంటనే రావణుడి వద్దకు వెళ్లి, లంకానగరం ఇప్పుడు శూన్యంగా ఉంది. నువ్వు నీ సోదరులు, అమాత్యులు, పరివారంతో చేరుకుని, లంకను యథేచ్ఛగా అనుభవించవచ్చు’ అని చెప్పాడు.రావణుడు లంకను ఆక్రమించుకుని, రాక్షసుల చేత రాజ్యాభిషిక్తుడయ్యాడు. లంకను విడిచి వెళ్లిన కుబేరుడు కైలాస పర్వతం వద్ద మందాకినీ తీరానికి చేరువలో అలకాపురి నగరాన్ని నిర్మించుకున్నాడు.∙సాంఖ్యాయన -
కాలేజీ క్రీమినల్!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న నేరగాడు బత్తుల ప్రభాకర్. కాలేజీలను టార్గెట్గా చేసుకుని, స్టూడెంట్ ముసుగులో రెక్కీ చేసి, నల్లధనాన్ని దోచుకుపోయే ఈ గజదొంగ ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు వద్ద పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో నేరాలకు పాల్పడ్డ ఈ అంతర్రాష్ట్ర నేరగాడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రూ.333 కోట్లు సంపాదించాక నేరాలు మానేయాలని, అప్పటికే తన జీవితంలో వందమంది యువతులతో సన్నిహితంగా ఉండాలనీ లక్ష్యంగా పెట్టుకున్న ఘరానా దొంగ ఇతడు.పెద్ద పెద్ద కాలేజీలను టార్గెట్గా చేసుకుని, చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం ఎనిమిదో తరగతే. చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయస్సు నుంచే చోరీల బాటపట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్లలో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాడు. ఇతడికి బిట్టూ, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారు పేర్లు ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద, షాపింగ్కు వెళ్లినప్పడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట రూ.3 వేలు చోరీ చేయడంతో తన నేరచరిత్ర మొదలైంది. అప్పట్లో ఒకే రోజు రూ.3 లక్షలు, మొత్తమ్మీద రూ.33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. అందుకే బత్తుల ప్రభాకర్ తన ఛాతీ కుడివైపు 3 సంఖ్యను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని రూ.333 కోట్లకు పెంచుకున్నాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమని, విలాసవంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40 మందితో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి గుర్తుగానే ఛాతీ ఎడమ వైపు 100 సంఖ్యను టాటూ వేయించుకున్నాడు. విలాస జీవితం గడిపే ఇతగాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముసుగుతో ఉంటాడు. గేటెడ్ కమ్యూనిటీల్లో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకొని ఉంటూ ఇతర రాష్ట్రాల యువతులతో సహజీవనం చేస్తుంటాడు. ప్రతిరోజూ ఉదయం జిమ్కు వెళ్లడం, వీకెండ్స్లో పబ్స్లో జల్సాలు చేయడం ఇతడి నైజం. కేవలం హైఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్ సెకండ్ హ్యాండ్ వాహనాలను స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. ఓ ఫ్లాట్ ఖాళీ చేసిన తర్వాత మరో దాంట్లోకి చేరే వరకు ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్స్లో ఉంటాడు. ఓ కాలేజీని టార్గెట్గా చేసుకున్న తర్వాత ప్రభాకర్ ముందుగా రెక్కీ చేస్తాడు. దీనికోసం ఆ కాలేజీ విద్యార్థి మాదిరిగా కొన్ని పుస్తకాలు పట్టుకుని, అందుకు తగ్గ దుస్తులు ధరించి లోపలకు ఎంటర్ అవుతాడు. క్లాసుల్లోకి వెళ్లకపోయినా.. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఆ కాలేజీకి వెళ్తాడు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆఫీస్ రూమ్, లాకర్ తదితరాలు ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి? పరిశీలిస్తాడు. ఈ రెక్కీ పూర్తయ్యాక తన రూమ్లో ఓ పేపర్ మీద డ్రాయింగ్ వేస్తాడు. అందులో లాకర్ రూమ్తో పాటు అక్కడకు ప్రవేశించడానికి ఎంచుకోవాల్సిన మార్గాలను గీస్తాడు. లాకర్ను కట్ చేయడానికి ఎలక్ట్రిక్ కట్టర్ వాడే ప్రభాకర్... దానికి ప్లగ్ పెట్టడానికి పాయింట్ ఎక్కడ ఉందో కూడా చూసుకుంటాడు. నేరం చేశాక చేతికి చిక్కిన సొమ్ముతో జల్సాలు చేసే ప్రభాకర్, సాధారణంగా ఆ డబ్బు మొత్తం ఖర్చయ్యే వరకు మరో నేరం చేయడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వరుసపెట్టి నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫ్లాట్లో కలిసి ఉండే క్రమంతో తనకు స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా జాగ్రత్తపడతాడు. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నోరు మూయిస్తాడు. చోరీ నగదును స్నేహితుల అకౌంట్లలో వేసి, వారి యూపీఐలు తన ఫోన్లో యాక్టివేట్ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్, పబ్స్తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్లినా తన ముఖం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కచ్చితంగా మాస్క్ ధరిస్తాడు. ఇతడు చోరీ చేసే డబ్బు డొనేషన్లకు సంబంధించిన నల్లధనమైతే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసే వారు కాదు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న ఇతగాడిని అనకాపల్లిలో నమోదైన కేసు విచారణ నిమిత్తం 2022 మార్చి 23న అక్కడి కోర్టుకు తీసుకువెళ్లారు. విచారణ అనంతరం వైజాగ్ తీసుకువచ్చిన ఎస్కార్ట్ పోలీసులు సంకెళ్లు తీసి జైలు అధికారులకు అప్పగిస్తుండగా తప్పించు కున్నాడు. అప్పటినుంచి సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, సూర్యాపేట్ పరిధిలో కాలేజీలలో చోరీలు చేశాడు. విశాఖపట్నం జైల్లో ఉండగా పరిచయమైన, వివాదం జరిగిన ఓ వ్యక్తిని చంపడానికి తుపాకీ తూటాలు ఖరీదు చేశాడు. వీటితో సంచరిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. ∙ -
కథాకళి: దాగుడుమూతలు
వరియార్ నా కొలీగ్. మలయాళీ అయిన అతనికి అలెప్పీ నుంచి హైద్రాబాద్కి బదిలీ అయి రెండున్నర ఏళ్లైంది. మా అందరికన్నా సీనియర్. మెయింటెనెన్స్ పనిలో అనుభవజ్ఞుడు. తన భార్య ఆరోగ్యంగా లేదని ఓసారి చెప్పాడు. మూడు నెలల క్రితం ఆమె మరణించింది. మృతదేహాన్ని ఆవిడ సొంత ఊరు ఎర్నాకులానికి తీసుకెళ్ళాడు. తిరిగి వచ్చాక వరియార్ మా ఆఫీస్లో పనిచేసే ఓ బ్రహ్మచారిని తన అపార్ట్మెంట్కి వచ్చి ఉండమని కోరాడని నాకు తెలిసింది. నేనున్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్స్ చాలా ఖరీదుగా ఉంది. హాస్టల్స్లో సౌకర్యాలు బాగుండవు. అందుకని వరియార్ పనిచేసే మెషి¯Œ షాప్కి వెళ్ళి అడిగాను.‘‘మీ అపార్ట్మెంట్లో నేను ఉండచ్చా?’’వరియార్ మొహం వికసించింది.‘‘తప్పకుండా. ఇద్దరిని అడిగితే రామన్నారు.’’ చెప్పాడు.‘‘నెలకి ఎంత ఇవ్వాలి?’’ అడిగాను.‘‘మీ ఇష్టం. ఇవ్వకపోయినా ఫర్వాలేదు.’’‘‘ఉచితంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను భోజనంతో కలిపి ఇప్పుడు నేను నెలకి పదిహేనువేల ఐదొందలు చెల్లిస్తున్నాను. మీకు ఏడువేల ఐదొందలు ఇస్తాను.’’ చెప్పాను.‘‘అలాగే. మీ ఇష్టం అన్నాగా. కాని సాధ్యమైనంత త్వరగా రాగలరా? వీలుంటే ఇవాళే...’’భార్య పోవడంతో కలిగిన ఒంటరితనం అతన్ని బాధిస్తోందని నాకు అర్థమైంది.ఇంటికి వెళ్ళగానే నేనున్న ఇంటి యజమానికి ఆదివారం ఖాళీ చేస్తానని చెప్పాను.∙∙ నేను వరియార్ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత రెండు రోజులు వరుసగా అరుణిక వచ్చింది.‘‘ఈమె అరుణిక. మన పక్క అపార్ట్మెంట్లో ఉంటుంది.’’ పరిచయం చేశాడు.ఆ తర్వాత ఆమె రెండు మూడుసార్లు వచ్చింది. ఆమె కేరళ వాళ్ళు చేసుకోని కందిపొడో, పచ్చి పులుసో, ములక్కాడ, టొమాటోల కూరో ఇలా ఏదో ఒకటి తెచ్చిచ్చేది. ఆమెకీ, వరియార్ భార్యకి మంచి దోస్తీ ఉండి ఉంటుందని అనుకున్నాను.ఆఫీస్ అయ్యాక నేను ఏదైనా సినిమాకి వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్తే దానికి తాళం ఉండేది. లోపల వరియార్ ఉండేవాడు కాదు. సెలవు దినాల్లో నేను బయటికి వెళ్తూంటే అతనూ నాతోపాటే బయటికి వచ్చేవాడు. రెండు వారాల తర్వాత అతను అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదని గ్రహించాను.ఓ రాత్రి చెప్పాను.‘‘మిత్రమా. మీరు మీ ఆవిడని బాగా మిస్ అవుతున్నారు. మీ భార్యని మీరు ప్రేమించినంతగా ఎప్పుడు ఎవరూ తమ భార్యని ప్రేమించలేరు.’’అతను బదులుగా పకపక నవ్వాడు. మర్నాడు ఆదివారం అరుణిక తెచ్చిన గుమ్మడి పులుసుని అన్నంలో కలుపుకుని తింటూండగా చెప్పాడు.‘‘మీకో విషయం నిజాయితీగా చెప్పాలి. నేను అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండకపోవడానికి కారణం మా ఆవిడ మీద ప్రేమ కాదు.’’‘‘మరి?’’‘‘ఇది రహస్యం. అయినా చెప్తున్నాను. ఎవరికీ చెప్పకండి. కారణం అరుణిక.’’‘‘అరుణికా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘అవును. ఆమె భర్త నించి విడాకులు తీసుకుంది. కూతురు, కొడుకుతో మన పక్క అపార్ట్మెంట్లో ఉంటోందని మీకు తెలుసుగా?’’‘‘తెలుసు?’’కొద్దిగా సందేహించాక చెప్పాడు.‘‘ఆమెతో దాగుడుమూతలాట ఆడుతున్నాను. కొన్ని నెలల క్రితం మా మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. మా ఆవిడ ఓ రెండు గంటలు బయటకి వెళ్తే మాకు ప్రైవసీ దొరకగానే రమ్మనేవాడిని. వచ్చేది. మా ఆవిడ హాస్పిటల్లో చేరినప్పుడు కూడా. ఆమె మరణించాక నాకు ప్రైవసీకి లోపం లేకపోవడంతో రోజూ వచ్చి శారీరక సంపర్కం కోరుతోంది. ఆమెకి మన అపార్ట్మెంట్ బయట తాళంకప్ప కనపడితే సరే. లేదా వచ్చేస్తుంది. ఆమె మీద నాకు ఎన్నడో మొహం మొత్తింది. రావద్దని చెప్పి ఆమెని హర్ట్ చేయలేను. ఇది మన కంపెనీ నాకు కేటాయించిన అపార్ట్మెంట్ కాబట్టి ఖాళీ చేయలేను. ఇంట్లో ఇంకొకరు ఉంటే అరుణికని దూరంగా ఉంచొచ్చని నిన్ను రమ్మన్నాను.’’ వివరించాడు.ప్రైవసీ కోసం లోకంలోని ప్రేమికులు వెతుకుతూంటే, వరియార్ దాన్ని దూరంగా ఉంచి దాగుడుమూతలాట ఆడటం నాకు నవ్వు తెప్పించింది. FEED ME A STORY : మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు క్లైమాక్స్ ఏమి రాస్తారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
ఈ వారం కథ: జీవన మాధుర్యం
‘‘అరేయ్ రాజూ! మాధురికి పెళ్లి కుదిరింది. అబ్బాయి పేరు జీవన్. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్’’ సంతోషంగా చెప్పాడు ప్రకాష్. ‘‘ఓహ్ కంగ్రాట్స్రా ప్రకాష్! అబ్బాయి సొంత ఊరేది? అతడి అమ్మానాన్నలు ఎక్కడుంటారు?’’ అడిగాడు రాజీవ్.‘‘అబ్బాయి తండ్రి హైదరాబాద్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. తల్లి గృహిణి, వాళ్లకు మొదట అమ్మాయి, తరువాత అబ్బాయి. అమ్మాయికి పెళ్లయిపోయింది. తను కూడా అమెరికాలోనే కాపురముంటోందట!’’ అన్నాడు ప్రకాష్.‘‘చూడబోతే గొప్పింటి సంబంధంలాగా అనిపిస్తోంది. మనలాంటి మధ్యతరగతి వాళ్లకు ఎలా తూగారు?’’ అనుమానంగా అన్నాడు రాజీవ్.‘‘వాళ్ళు డబ్బుతో పాటు మంచి మనసున్న మారాజులురా! కానీ కట్నం వద్దని కచ్చితంగా చెప్పారు’’ అన్నాడు ప్రకాష్.‘‘అయితే మాధురి అదృష్టవంతురాలు. ఎప్పుడూ ఎలాంటి సంబంధం వస్తుందో, ఎంత కట్నం అడుగుతారోనని భయపడేవాడివి. కుదిరిపోయింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకో’’ అన్నాడు రాజీవ్.‘‘రాజూ! వాళ్ళు కట్నం వద్దన్నారని మనమేమీ ఇవ్వకుండా ఊరుకుంటే మర్యాదగా ఉంటుందా? మనకూ, వెళ్లిన చోట పిల్లకూ కూడా అవమానమే’’ అన్నాడు ప్రకాష్.‘‘అడిగింది ఇవ్వకపోతే అవమానం కానీ అడగకపోతే ఇవ్వడమెందుకు?’’‘‘అరేయ్ రాజూ! అడిగిన కట్నం ఇచ్చేస్తే ఎటువంటి గొడవుండదు. అడగకపోతే కట్నం లేదని మిగిలిన అన్ని లాంఛనాలు ఘనంగా పెట్టాలి’’‘‘అదీ నిజమే అనుకో! ఇంతకీ తాంబూలాలు పుచ్చుకునేది ఎప్పుడు?’’ అన్నాడు రాజీవ్.‘‘ప్రత్యేకంగా తాంబూలాలు మార్చుకోవడమేమీ లేదు. అమ్మాయిని చూడటానికి వచ్చిన రోజునే అమ్మాయి మెడలో అత్తగారు హారం వేశారు. అబ్బాయి తన చేతికున్న ఉంగరం తీసి అమ్మాయి వేలికి తొడిగాడు. ఇదే నిశ్చితార్థం అనుకుందాం అని మా వియ్యంకులుగారు అన్నారు.’’‘‘అదేంట్రా? ఈ రోజుల్లో ఇంత సింపుల్గా నిశ్చితార్థం జరుపుకున్నవారిని మిమ్మల్నే చూశాను. ఎంగేజ్మెంట్ పేరుతో ఇరువైపులా బట్టలు పెట్టుకోవటం; తరువాత పెద్ద హోటల్లోనో, ఫంక్షన్ హల్లోనో భారీ ఎత్తున భోజనాలు, డ్రోన్లతో రక రకాల ఫొటోలు తీయడం దాదాపు పెళ్ళి చేసినంత ఆర్భాటంగా చేస్తున్నారు. వీళ్లేంటీ అలికిడి లేకుండా మన కాలంలో చేసుకున్నట్లు ఇంట్లో క్లుప్తంగా ముగించారు? అబ్బాయి ఎవరి తాలూకా? కుటుంబం గురించి సరైన విచారణ చేశావా?’’ ఆరా తీశాడు రాజీవ్.‘‘హహ...’’ అంటూ నవ్వేశాడు ప్రకాష్.‘‘నవ్వుతావేంట్రా? అసలే అమెరికా సంబంధం అంటున్నావు. ఈ మధ్యన అమెరికా పెళ్లిళ్ల గురించి టీవీలో చాలా వింటున్నాము. ఎవరికీ తెలియనివ్వకుండా తాంబూలాలు కానిచ్చారంటే చాలా ఆలోచనలు వస్తున్నాయి’’ అన్నాడు రాజీవ్.‘‘అలాంటి అనుమానాలు నాకూ వచ్చాయి. వాళ్ళు మా అత్తగారికి కాస్త దగ్గరి బంధువులవుతారు. ఎవరిని అడిగినా మంచి కుటుంబమనే చెప్తున్నారు. వాళ్ళు రాజమండ్రిలో స్థిరపడ్డారు, అబ్బాయి చదువుకోవడానికి అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అసలు ముందుగా పెళ్లిళ్ల పేరయ్య ద్వారా ఈ సంబంధం మనకు వచ్చింది. వాళ్లకు ఫొటోల్లో మన అమ్మాయి నచ్చిందని చెప్పడంతో విషయం మనదాకా వచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు చుట్టరికం బయటకు వచ్చింది. అబ్బాయి వీడియో కాల్లో అమ్మాయిని చూసి, మాట్లాడి తన అంగీకారం తెలిపాడు. తరువాత ఇరుపక్షాల మాటలు జరిగాయి. అంతా సరే అనుకున్నాక పెళ్ళికి సిద్ధపడ్డాం’’ అన్నాడు ప్రకాష్.‘‘తెలిసినవాళ్లేనా? అయితే ఇంకా కంగారు పడటానికేముంది? ఇంతకీ పెళ్లెప్పుడు?’’ అన్నాడు రాజీవ్.‘‘అబ్బాయి పెళ్లయ్యాక అమ్మాయిని కూడా తీసుకెళ్లాలంటే వీసా ప్రక్రియ కోసం పెళ్లి తొందరగా చేయాలని వియ్యంకుడు జగదీష్ చెప్పాడు. పెళ్లి మరో పదిహేను రోజుల్లో’’...‘‘అయితే పెళ్లి పనుల కోసం నువ్వు రేసు గుర్రంలాగా పరుగులు తీయాలి’’ నవ్వుతూ అన్నాడు రాజీవ్.‘‘అవునురా డబ్బున్నవాళ్లతో వ్యవహారం కదా ఎలా చేస్తానో అని కంగారుగా అనిపిస్తుంది. నువ్వు మాత్రం అమ్మాయి అత్తారింటికి వెళ్ళేదాకా తోడుండాలి’’...‘‘అది ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా?’’ అన్నాడు రాజీవ్.∙∙ ప్రకాష్ చిన్న వ్యాపారస్తుడు రమ అతడి భార్య, వారికిద్దరు పిల్లలు మాధురి పెద్దది, బీటెక్ పూర్తిచేసి ఊర్లో ఉన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తోంది. తరువాత మహేష్ బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రకాష్ సంపాదనతో ఉండటానికి సొంత ఇల్లు కట్టుకున్నాడు. అంతకు మించి అతడికి ఎటువంటి స్థిరాస్తులూ లేవు. కూతురికి తన స్తోమతకి తగిన సంబంధాలు చూడామని పెళ్ళిళ్ళ పేరయ్యకు చెప్పాడు. ఆయన వీళ్ళు కట్నం వద్దంటున్నారు, అమ్మాయి గుణగణాలు బాగుంటే చాలంటున్నారని ఈ సంబంధం తీసుకువచ్చాడు. తీరాచూస్తే అది దగ్గరి సంబంధం కావడంతో ప్రకాష్ చాలా సంతోషించాడు. దానికితోడు బంధువులందరూ కూతురికి గొప్ప సంబంధం వచ్చిందని అతడి అదృష్టాన్ని పొగుడుతుంటే మరింత ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ‘‘రమా! మన ఇల్లు తాకట్టు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నాడు ప్రకాష్. రమ తుళ్ళిపడింది.‘‘అదేంటండీ? ఎందుకలా? మనం అమ్మాయి పెళ్లికోసం కొంత డబ్బు పక్కన పెట్టాం కదా? ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించింది రమ.‘‘పిచ్చిదానా! అప్పుడు మనం దాచిన డబ్బు మనబోటి సంబంధం కోసం. ఇప్పుడు మన తాహతుకి మించిన గొప్పవారి సంబంధం కుదిరింది. మరి వారికి నచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలిగా?’’ ప్రశ్నించాడు ప్రకాష్ . ప్రకాష్ చేతిలో డబ్బు లేక తగ్గి ఉంటాడు కాని, సహజంగా దుబారా మనిషే! రమ ఎంత నచ్చచెప్పాలని చూసినా అతడు వినలేదు. ఇంటి దస్తావేజులు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు. ముందూ వెనుకా చూడకుండా ధారాళంగా ఖర్చు పెడుతున్నాడు. తండ్రి అలా డబ్బులు గుమ్మరిస్తుంటే పిల్లలకు చిత్రంగా అనిపిస్తోంది. మహేష్ అదంతా చూసి సంబరపడినా, మాధురి మాత్రం తల్లి దగ్గర నుండి విషయం రాబట్టింది. తండ్రి చేస్తున్న అప్పు చూసి ఆమె మనసు తల్లడిల్లింది. పెళ్ళిబట్టలకు, నగలకు తాహతుకు మించి కొంటుంటే భవిష్యత్తు తలచుకుని ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.ఒకరోజు ప్రకాష్ పిల్లలను, భార్యను దగ్గరకు పిలిచాడు.‘‘మధూ! మహేష్! మీకు తెలిసిన కొత్తరకం వంటకాల పేర్లు చెప్పండి. మీకు తెలియకపోతే మీ స్నేహితులనైనా అడిగి తెలుసుకోండి. పెళ్ళిలో మనం పెట్టే భోజనాలు చూసి మగపెళ్లివారు అబ్బో భలే ఉన్నాయే అంటూ నోరు తెరవాలి’’ అన్నాడు ప్రకాష్.‘‘డాడీ! నేను చెప్తాను– మొన్న మా ఫ్రెండు అక్క పెళ్ళిలో కోవా వెరైటీస్ కొత్త రకానివి పెట్టారు. పనీర్ జిలేబీ, కోవా కజ్జికాయలు వేడి వేడిగా వేసిస్తుంటే మేమంతా బోలెడన్ని తినేశాం’’ అన్నాడు మహేష్.‘‘డాడీ! తమ్ముడు అలాగే చెప్తాడు కాని, వంటవాళ్ళని అడిగితే కొత్తగా చేస్తున్న వంటకాలు చెప్తారు. ఎక్కువ రకాలు అవసరం లేదు. రుచికరమైనవి కొన్ని చేయిస్తే సరిపోతుంది’’ అంది మాధురి.‘‘మధు సరిగ్గా చెప్పింది. మీరు అనవసరమైన ఆర్భాటాలకు పోకండి’’ అంది రమ.‘‘మనం కట్నం ఇవ్వడం లేదు, భోజనాలైనా మంచిగా పెట్టకపోతే ఎలా?’’ అన్నాడు ప్రకాష్.‘‘ముందు మనం మధూ పెళ్ళికి అనుకున్నదాని కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. పెళ్లి అవగానే సరికాదు, తరువాతే ఎక్కువ అవసరాలుంటాయి. ఇలా అయితే తరువాత ఇబ్బంది పడతాం’’ అంది రమ.ప్రకాష్కి ఆ మాటలు రుచించలేదు. స్నేహితుడిని సంప్రదించాడు. ‘‘మధ్య తరగతి వాళ్ళం చూసుకుని ఖర్చు పెట్టకపోతే పెద్ద దెబ్బ తగులుతుంది. వాళ్ళు అడగకపోయినా బంగారం, బట్టలు అంటూ చాలా డబ్బులు గుమ్మరిస్తున్నావు. చెల్లెమ్మ చెప్పినట్లు విను’’ అన్నాడు రాజీవ్.ప్రకాష్ అతడి మాటలు కూడా పెడచెవిన పెట్టాడు. వంటవాళ్లతో తనే స్వయంగా మాట్లాడి భారీ ఎత్తులో మెనూ తయారుచేశాడు. పెళ్లిరోజు దగ్గరకు వచ్చింది. పెద్ద కళ్యాణమండపం, దానికి అలంకరణ బ్రహ్మాండంగా చేయించాడు.భోజనాలకు ముందు అల్పాహారంలో పానీపూరీ. బజ్జీమసాలా, సమోసా చాట్, చిన్న పునుగు, వెజ్ కట్లెట్, పనీర్ టిక్కా, పావ్ భాజీ, చిన్న పిజ్జా, బఠాణీ చాట్, పెసర దోశ ఏర్పాటు చేశాడు. వచ్చిన జనం అక్కడ కిక్కిరిసిపోయి ఉన్నారు. ఎన్నో రకాల పదార్థాలు నోరూరిస్తూ కనిపిస్తుంటే, అందులోనూ ఉచితంగా ఆకర్షిస్తుంటే ఆపడం ఎవరి తరం?... ఒకో స్టాల్ దగ్గర ఆగడం అక్కడ ఉన్న వంటకం పెట్టించుకోవడం... కొంచెం రుచి చూడటం, అది పారేసి మళ్ళీ మరోదాని కోసం వెళ్లడం, అక్కడ మరో ప్లేట్ తీసుకుని అది వేయించుకోవడం, అది కొంచెం తినగానే మరో కొత్త వంటకం కనిపించగానే చేతిలో ఉన్నది పూర్తిగా తినకుండానే చెత్త డబ్బాలో పడేసి, అక్కడకు వెళ్లి మరో ప్లేట్ అందుకోవడంలో జనం బిజీ అయ్యారు. అల్పాహారాలు తినడంతో సగానికి పైగా పొట్టలు నిండిపోయాయి. తరువాత అందరూ కాసేపు లోపలకు వెళ్లి పెళ్లి చూస్తూ కూర్చున్నారు. కాసేపటి తరువాత మళ్ళీ భోజనాల దగ్గరకు వచ్చారు. అక్కడ సుమారు పది రకాల స్వీట్లు, ఇరవై రకాల వంటకాలు, పది రకాల ఫ్రూట్స్, పది రకాల డిజర్ట్స్ ఉన్నాయి. అన్ని వంటకాలూ వేడిగా ఉండేందుకు అన్నింటి కిందా చిన్న స్టవ్లు కూడా ఉన్నాయి. నోరూరించే ఎన్నో రకాల పదార్థాలను చూసి, అన్నీ రుచి చూడాలనే అతృతతో అన్నీ వేయించుకుని, పొట్టలో పట్టకపోవడంతో తినకుండానే వృథాగా చెత్తడబ్బాలో పారేస్తున్నారు. మనిషి తన నోటితో తను ఇక చాలని చెప్పగలిగేది ఆహారం విషయంలో మాత్రమే! ప్రకాష్ దంపతులు పెళ్ళికి వచ్చిన అతిథులను పలకరించి వేదిక మీద కూర్చున్నారు. వేదమంత్రాల సాక్షిగా మంగళవాయిద్యాల నడుమ బంధుమిత్రుల సమక్షంలో మాధురి, జీవన్ల పెళ్లి జరిగింది. తరువాత నూతన వధూవరులు, అమ్మాయి తల్లితండ్రులు, అబ్బాయి తల్లితండ్రులు భోజనాలు చేయడానికి భోజనశాల వైపుకి వస్తున్నారు. వారి వెనుక రాజీవ్ కూడా నడుస్తున్నాడు. భోజనశాలలో రెండు విభాగాలున్నాయి. ఒకటి బంతి భోజనాలు, మరొకటి బఫే భోజనాలు. వీళ్ళు బఫే భోజనాలు దాటి బంతి భోజనాల వైపుకి వెళ్తుండగా నడుస్తున్న జగదీష్ ఆగిపోయాడు. ‘‘బావగారు! బఫే భోజనం చేద్దామంటారా?’’ వెనక్కు తిరిగి వచ్చి అడిగాడు ప్రకాష్.‘‘ఆ డస్ట్ బిన్ వైపు చూశారా? అందులో ప్లేట్స్లో తినకుండా పారేసిన స్వీట్లు, హాట్లు, ఇతర ఆహార పదార్థాలు చూడండి. ఎంత ఆహారం వృథాగా నేలపాలయిందో చూశారా?’’ అన్నాడు జగదీష్.‘‘బావగారు! ఎక్కువ రకాల వంటకాలు చేయించాం కదండీ! ఒక్కసారే అన్నీ తినలేక పారేసుంటారు అంతే కాని, రుచిగా ఉండకపోవడం వల్ల కాదండీ’’ అన్నాడు ప్రకాష్.‘నా ప్రశ్న మీకలా అర్థమైందా?’ మనసులో అనుకున్న జగదీష్ ఒకసారి ఆయన వైపు అదోలా చూసి మౌనంగా వాళ్లతో నడిచాడు. ప్రకాష్ భోజనాల దగ్గర తనే స్వయంగా ‘‘బావగారు! ఈ స్వీటు తినండి బాగుంటుంది, చెల్లెమ్మా! ఈ పెసర పునుగు ఆవడ తినండి బాగుంటుంది, బాబూ! పుదీనా రైస్ రుచి చూడండి’’ అని పెట్టించబోయాడు. అతను ఎంత బలవంతం చేసినా జగదీష్, అతని భార్య, జీవన్ కొన్ని రకాల పదార్థాలు మాత్రమే తిన్నారు. అదిచూసి ప్రకాష్ ముఖం మాడిపోయింది. అప్పగింతలయ్యాక మగ పెళ్లివాళ్ళు వెళ్లిపోతున్న సమయంలో అందరూ కళ్యాణమండపం బయటకు వచ్చారు. అక్కడ ఒక పక్కన చెత్తబండి పెట్టుంది. ఫంక్షన్ హాల్ లోపల నిండిపోయిన టబ్లు తెచ్చి అందులో వేస్తున్నారు. కొంతమంది బిచ్చగాళ్ళు అందులో నుంచి ఆహార పదార్థాలు ఏరుకుని, వాళ్ళ దగ్గరున్న సత్తుగిన్నెల్లో వేసుకుంటున్నారు. కొన్ని తడిసిపోయిన వాటిని తీసి, వారి చినిగిన దుస్తులకు తుడుస్తూ గిన్నెలో వేస్తున్నారు. రెప్పవాల్చకుండా అటువైపే చూస్తున్న జగదీష్ కనుకొలకులలో నీటి బిందువులు నిలిచాయి. జేబులోంచి కర్చీఫ్ తీసుకుని తుడుచుకున్నాడు.‘‘బావగారు! మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకు బాధపడుతున్నారు’’ కంగారుగా అడిగాడు ప్రకాష్.‘‘అదేం లేదు’’ అంటూ కారెక్కి కూర్చున్నాడు జగదీశ్.పెళ్ళికూతురుని తీసుకుని మగపెళ్లివాళ్ళు హైదరాబాద్ వెళ్లిపోయారు. వెళ్ళేముందు రెండవరోజు జరుగబోయే సత్యనారాయణస్వామి వ్రతానికి, అదేరోజు సాయంత్రం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్కి అందరినీ తప్పకుండా రమ్మని మరీ మరీ ఆహ్వానించారు. ‘‘రమా! ఎందుకో జగదీష్గారు సంతృప్తిగా ఉన్నట్లనిపించడం లేదు’’ వాళ్ళు వెళ్ళాక అన్నాడు ప్రకాష్.‘‘అదేం లేదు లెండి!’’ అంది రమ.‘‘ఎందుకో ఆయన కళ్ళు కూడా తుడుచుకున్నాడు’’ అన్నాడు ప్రకాష్. ‘‘ఇప్పుడవన్నీ ఆలోచించే వ్యవధి లేదు. రేపు మనం హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. వ్రతానికి పీటలమీద కూర్చున్నప్పుడు అమ్మాయి అల్లుడుగారికి అలాగే వాళ్ళ అత్తమామగార్లకు కూడా మనం బట్టలు పెట్టాలి. పళ్ళు, స్వీట్స్ కూడా పట్టుకెళ్ళాలి’’ అంది రమ. ‘‘రమా! మళ్ళీ చాలా డబ్బులు కావాలి... నా దగ్గరున్న డబ్బంతా అయిపోయిపోతుంది. కట్నం లేదన్న మాటే కానీ పై ఖర్చులు చాలా అయ్యాయి’’ అన్నాడు ప్రకాష్.‘‘ఆర్భాటాలకు పోతే అలాగే అవుతుందని నేనెంత చెప్పినా మీకు అర్థం కాలేదు. ఇప్పుడనుకుని ఏం లాభం? స్వీట్స్ అన్నాను కదా అని ఖరీదు ఎక్కువ వాటి జోలికి పోకండి. లడ్డు, కాజాలు చాలు’’ అంది రమ . ప్రకాష్ కుటుంబం మరి కొందరు దగ్గరి బంధువులతో కలిసి రెండవరోజు ఉదయం మగ పెళ్లివారింటిలో దిగారు. వారు మర్యాదగా ఆహ్వానం పలికారు. అల్పాహారంగా ఇడ్లీ, వడ, కొబ్బరి చట్నీ, కారప్పొడి వేసి పెట్టారు. సత్యనారాయణ స్వామి పూజకు ఇంట్లో బంధువులు మాత్రమే ఉన్నారు. వియ్యాలవారు భోజనాలు ఎంత గొప్పగా పెడతారోనని ఊహించుకున్న ప్రకాష్కి నిరాశే ఎదురైంది. పులిహోర, పూర్ణం, మిరపకాయ బజ్జీ, వంకాయ చట్నీ, ముద్దపప్పు, రసం, బెండకాయ వేపుడు, అప్పడం, గడ్డపెరుగు పెట్టారు. అందరూ శుభ్రంగా పదార్థాలన్నీ వదలకుండా తినేశారు. ‘‘అరేయ్ రాజూ! భోజనాలు మరీ ఇంత సింపుల్గా పెట్టారేంట్రా?’’ అన్నాడు గుసగుసగా ప్రకాష్.‘‘ఇప్పుడు ఇంట్లో వాళ్లకు మాత్రమే కదా! అందుకే ఇలా పెట్టుంటారు సాయంత్రం రిసెప్షన్లో బాగా పెడతారనుకుంటా. అయినా కొన్ని వంటకాలు పెట్టినా మంచి భోజనం పెట్టారు’’ మెచ్చుకుంటూ అన్నాడు రాజీవ్. సాయంత్రం అందరూ రిసెప్షన్కి వెళ్లారు. అది పెద్ద ఫంక్షన్ హాల్. సహజమైన పూలతో చాలా తేలికపాటి అలంకరణ చేశారు. చూడటానికి చాలా అందంగా అనిపిస్తోంది. బయట ఎక్కడా అల్పాహారాల స్టాల్స్ లేవు. లోపలకు వెళ్ళగానే ముందుగా అందరికీ వెల్కమ్ డ్రింక్గా బాదంపాలు ఇచ్చారు. మరే ఇతర స్నాక్స్ పెట్టలేదు. రిసెప్షన్కి వచ్చిన వాళ్లంతా వధూవరులకు అక్షింతలు వేశాక, కుటుంబ సభ్యులు డైనింగ్ హాల్ వైపు నడిచారు. అక్కడ ఎంన్లోస్ ఒక రైతు వరి కంకులు పట్టుకుని నిలబడిన చిత్రం పెట్టారు. దాని కింద ‘ఒక వరి కంకి తయారు కావాలంటే రైతు నూట ఎనిమిది రోజులు కష్టపడతాడు’ అని రాసుంది. అది దాటుకుని లోపలకు వెళ్ళగానే, అక్కడక్కడా కొన్ని పేపర్ కటింగ్స్ పుల్ల ఆధారంగా నిలబెట్టబడి ఉన్నాయి. ‘అన్నదాతా సుఖీభవ!’...‘ఆహారం వృథా చేయకండి’...‘మీరు ఏది తినగలరో అదే తీసుకోండి’‘తినలేనిది పెట్టుకుని నేలపాలు చేయకండి’...‘పారేసేముందు పంటలు పండించే రైతు కష్టాన్ని గుర్తుచేసుకోండి’...‘పిల్లల పెళ్ళిచేయడానికి ఆ తండ్రి పడే కష్టాన్ని తలచుకుంటే ఒక్క పదార్థం కూడా పారేయకుండా తింటారు’...అనే క్యాప్షన్స్ ఉన్నాయి. అందరూ వాటిని చదువుతూ మాట్లాడుకుంటున్నారు. ‘భలే రాశారు కదా?’...‘ఇలాంటివి చదివాక ఎవరైనా ఆహారం వృథా చేస్తారా?’... ‘అన్ని చోట్లా ఇలాంటి బోర్డులు పెడితే ఎవరూ తినే పదార్థాలు పొరపాటున కూడా పారేయరు’అక్కడున్న అందరూ పైకే మాట్లాడుకుంటున్నారు. ప్రకాష్, రమ, మాధురి, రాజీవ్ ఆశ్చర్యంగా చూస్తున్నారు.‘జీవన్ గారు! ఈ విధమైన ఏర్పాట్లు ఎవరి సూచనలతో చేశారు? నాకు చాలా నచ్చింది’ అంది మాధురి.ప్రకాష్ అల్లుడి జవాబు కోసం అటే చూస్తున్నాడు.‘డాడీ చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. డబ్బు, ఆహారమే కాదు ఏదీ వృథా చేయడం ఆయనకు ఇష్టముండదు. ఆర్భాటాలకు పోయి అప్పు చేయడం కూడా నచ్చదు. నిన్న అక్కడ పెళ్ళిలో భోజనాలు పారేయడం చూసి చాలా బాధపడ్డారు. అన్నపూర్ణను గౌరవించిన వారి దగ్గర ఆమె కొలువుంటుందని ఎప్పుడూ చెప్తుంటారు. ఆయన మన పెళ్లి సందర్భంగా ఈరోజు చాలామంది హోమ్లెస్ పీపుల్కి ఆహారం సరఫరా చేశారు’’ అన్నాడు జీవన్.ఆ మాటలు వినగానే ప్రకాష్ ముఖంలో రంగులు మారాయి. రమ ముఖంలో ఆనందం కనిపించింది. ‘‘మామయ్య గారి అభిప్రాయాలు చాలా ఆదర్శవంతంగా అనిపిస్తున్నాయి’’ అంది మాధురి చిన్నగా. ‘‘థాంక్స్ అమ్మా!’’ అన్నాడు జగదీష్. ‘‘బావగారు ! నేను మీ విషయంలో చాలా అపోహపడ్డాను. నన్ను మన్నించండి, ఇంత మంచి కుటుంబానికి నా కూతురిని ఇచ్చినందుకు గర్వపడుతున్నాను’’ ఆనందంగా అన్నాడు ప్రకాష్. ‘‘బావగారు! ఆడపిల్ల పెళ్ళి చేసి బరువు దించుకోవాలనే తాపత్రయంతో మీరు బరువు పెంచుకున్నారని నాకు తెలిసింది. మా అబ్బాయి మీ ఇంటి అల్లుడయ్యాడు. మీ కష్టసుఖాలలో భాగం పంచుకోవడానికి అనుమతిస్తే మన్నిస్తాను’’ నవ్వుతూ అన్నాడు జగదీష్.‘‘ఏమిటది? కొంపదీసి ఇల్లు తనఖా పెట్టిన విషయం తెలిసిందా?’’ ఆలోచిస్తున్నాడు ప్రకాష్. ‘‘బావగారూ! మీరు అంతగా ఆలోచించకండి. ఏ ఆడపిల్లయినా పుట్టింట్లో ఇబ్బందులు లేకుండా ఉంటేనే తను అత్తింట్లో సంతోషంగా ఉండగలుగుతుంది. మా కోడలి సంతోషం మాకు కావాలి. ఇకనుండి మన రెండు కుటుంబాలు ఒకటే’’ అన్నాడు జగదీష్.‘‘అరేయ్ ప్రకాష్! జీవన్, మాధురి పెళ్ళిలో నాకు జీవనమాధుర్యం అంటే ఏమిటో తెలిసిందిరా!’’ అన్నాడు రాజీవ్.ఆ మాటలకు పెళ్లివారింట్లో అందరి నవ్వులు చిచ్చుబుడ్డీలలా వెలుగులపూలు జిమ్మాయి. ‘డాడీ చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. డబ్బు, ఆహారమే కాదు ఏదీ వృథా చేయడం ఆయనకు ఇష్టముండదు. ఆర్భాటాలకు పోయి అప్పు చేయడం కూడా నచ్చదు. నిన్న అక్కడ పెళ్ళిలో భోజనాలు పారేయడం చూసి చాలా బాధపడ్డారు. ∙కె.వి.సుమలత -
అమెరికా కాదన్నా.. ఆప్షన్స్ అన్లిమిటెట్
‘టాలెంట్ ఉన్న ప్రతిచూపు అమెరికా వైపే’ అన్నట్లుగా సాగింది ఇంతకాలం. అమెరికాలో సెటిల్ అయినవారి పేరెంట్స్ దగ్గర నుంచి అమెరికన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వరకు ప్రతి ఒక్కరూ అమెరికా కాలమానానికి అనుగుణంగా నడుచుకోవడం పరిపాటి అయిపోయింది! కాని, అమెరికా తీరు మార్చింది. పొమ్మనకుండానే ఇండియన్స్కు పొగబెడుతోంది.చదువు, ఉద్యోగం, స్థిరనివాసం కోసం అమెరికా చేరుకోవడమనేది చాలామంది భారతీయుల కల! అందుకోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధంగా ఉంటారు. కాని, అపారమైన ఆశలతో అమెరికా వైపు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల కలలు ఇప్పుడు కరిగిపోతున్నాయి. దీనికి, అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలే కారణం! ఎన్నో ఏళ్లుగా ఇండియా–అమెరికాల మధ్య కొనసాగుతున్న బలమైన అనుబంధం ఇప్పుడు మెల్లమెల్లగా బీటలువారుతోంది. ఈ బంధానికి ప్రధాన వారధి అయిన విద్యారంగంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ఈ పరిస్థితుల్లో, విదేశీ విద్య కోసం అమెరికా తప్పితే మరో మార్గమే లేదా? మరో దేశమే లేదా?! అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు పలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి సాదర ఆహ్వానాలు అందుతున్నాయి.క్రమంగా అమెరికాకే కాదు జర్మనీ, కెనడా యూకే వంటి దేశాలకు ఇండియా నుంచి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అమెరికాకు బ్రేక్స్ పడుతున్న తరుణంలో భారత యువత తమ విదేశీ ప్రయాణాల గమ్యాలను మార్చుకుంటూదూసుకుని పోతున్నారు. ఏటా విదేశాలకు వెళ్లే మన విద్యార్థులు హెచ్–1బీ వీసా అనేది అమెరికా– తమ దేశంలో ప్రత్యేక నైపుణ్యంతో నిర్వహించే ఉద్యోగాల కోసం– విదేశీ నిపుణులకు ఇచ్చే ఒక వలస వీసా! ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ (స్టెమ్) రంగాల్లో అమెరికాకు చెందిన నిపుణుల కొరతను తీర్చుకోవడానికి ఈ వీసాను 1990లో నాటి అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టింది. దీనివల్ల అమెరికన్ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకోగలిగాయి. ఇది అమెరికా ఆర్థిక వృద్ధికి, సాంకేతిక ఆవిష్కరణలకు ఎంతో తోడ్పడింది! ఇప్పటి వరకూ హెచ్–1బీ వీసాలు పొందినవారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ట్రంప్ నిర్ణయంతో ఎందరో భారతీయుల కలలు చెదిరిపోయాయి. ఈ క్రమంలోనే ‘అమెరికా వద్దంటే ఆగిపోనక్కర్లేదు మా దేశం రండి’ అంటున్నాయి ఎన్నో దేశాలు. ఆ లిస్ట్లో జర్మనీ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లండ్, ఫ్రాన్స్, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), పోలండ్ ఇలా చాలా దేశాలు చక్కటి భవిష్యత్ కోసం ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో చూద్దాం విదేశీయులకు సైతం ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను, అది కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో దాదాపు ఉచితంగా అందించే అరుదైన దేశం జర్మనీ. ఇది కేవలం ఉన్నత ప్రమాణాలకు, ఆధునిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందడమే కాక, ప్రపంచంలోని అగ్రశ్రేణి సాంకేతిక, ఇంజనీరింగ్ కోర్సులకు కేంద్రంగా ఉంది. జర్మనీలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివే అంతర్జాతీయ విద్యార్థులకు సాధారణంగా ట్యూషన్ ఫీజులుండవు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కేవలం సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఫీజు మాత్రమే ఉంటుంది. విద్యార్థులు తమ చదువుపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఏడాదికి గరిష్ఠంగా 140 పూర్తి రోజులు లేదా 280 సగం రోజులు పనిచేయడానికి అనుమతి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా, సెమిస్టర్ కాలంలో వారానికి 20 గంటల వరకు పనిచేయవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, అంతర్జాతీయ విద్యార్థులు తమ అర్హతకు సరిపోయే ఉద్యోగం వెతుక్కోవడానికి 18 నెలల వరకు జర్మనీలో ఉండొచ్చు. అందుకు జాబ్–సీకింగ్ రెసిడె¯ పర్మిట్ పొందాల్సి ఉంటుంది. ఈ 18 నెలల కాలంలో వారు పూర్తి సమయం ఉద్యోగం వెతుక్కుంటూనే తమ ఖర్చుల కోసం తాత్కాలిక ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. గడువులోపు ఉద్యోగం సంపాదించి, దానిని వర్క్ పర్మిట్గా మార్చుకున్నట్లయితే, జర్మనీలో స్థిరపడటానికి మార్గం సులభమవుతుంది.కెనడానిజానికి కెనడియన్ విద్యార్హతలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అలాగే కెనడాలో ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి, ఇవి విద్యార్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలనందిస్తాయి. కెనడాలో ప్రభుత్వ నిధులు పొందే విశ్వవిద్యాలయాలలో కూడా విదేశీ విద్యార్థులకు ఫీజులుంటాయి. అయితే కోర్సులను బట్టి, యూనివర్సిటీ స్థాయిని బట్టి ఫీజులు మారుతుంటాయి. స్టడీ పర్మిట్ ఉన్న విద్యార్థులు తమ చదువుల సమయంలో వారానికి గరిష్ఠంగా 20 గంటలు క్యాంపస్లో లేదా క్యాంపస్ వెలుపల పనిచేయడానికి అనుమతి ఉంటుంది. సెమిస్టర్ బ్రేక్స్ సమయంలో పూర్తి సమయం పనిచేయవచ్చు. కెనడియన్ డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అర్హత కలిగిన ప్రోగ్రామ్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు తమ కోర్సు వ్యవధిని బట్టి గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు కెనడాలో ఉండొచ్చు. ఉద్యోగం వెతుక్కోవడానికి పనిచేయడానికి అనుమతించే పోస్ట్–గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ పొందవచ్చు. ఈ పర్మిట్ పొందిన తరువాత, ఒక సంవత్సరం కెనడియన్ గ్రాడ్యుయేట్స్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ వంటి ఇమ్మిగ్రేషన్ మార్గాలతో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కెనడా ప్రభుత్వం వలసదారులను స్వాగతిస్తుంది కాబట్టి, విద్యార్థులకు ఇది ఒక చక్కటి మార్గమవుతుంది.యూకే విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గమ్యస్థానం యునైటెడ్ కింగ్డమ్ (యూకే). బెస్ట్ కోర్సులు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలు, గ్రాడ్యుయేషన్ తర్వాత సులభంగా ఉద్యోగం వెతుక్కోవడానికి వీలు కల్పించే విధానాలతో యూకే అంతర్జాతీయ విద్యార్థులకు స్వర్గధామం. అక్కడి విశ్వవిద్యాలయాలు క్వాలిటీ ఎడ్యుకేషన్కు ప్రసిద్ధి. ఇక్కడి బ్యాచిలర్ కోర్సులు సాధారణంగా 3 సంవత్సరాలు, మాస్టర్స్ కోర్సులు ఒక సంవత్సరంలోనే పూర్తి అవుతాయి. యూకేలో విదేశీ విద్యార్థులకు ఫీజులు సాధారణంగా దేశీయ విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటాయి. యూనివర్సిటీ ర్యాంకింగ్, నగరంతో పాటు కోర్సును బట్టి ఫీజు మారుతుంది. స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, విద్యార్థి తమ ట్యూషన్ ఫీజుతో పాటు తమ జీవనానికి సరిపడా కనీస రాబడిని చూపించాల్సి ఉంటుంది. అలాగే ఎంపికైన యూనివర్సిటీ/కాలేజ్ (లైసె¯Œ ్స పొందిన స్పాన్సర్) నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రం సిద్ధంగా ఉంచుకోవాలి. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ వంటి అనేక యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో రాయితీ లేదా పూర్తి స్థాయి స్కాలర్షిప్లను అందిస్తాయి. కామ¯Œ వెల్త్ దేశాలకు చెందిన ప్రతిభావంతులకు కామ¯Œ వెల్త్ స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. విద్యార్థులు ఎటువంటి తక్కువ జీతం పొందే ఉద్యోగాన్ని చేస్తున్నా స్కిల్డ్ వర్కర్ వీసాకు మారే అవకాశం కూడా ఉంటుంది.ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థులకు చక్కటి విద్యను, అధిక జీవన ప్రమాణాలను, పట్టభద్రులైన తర్వాత గొప్ప ఉద్యోగ అవకాశాలను పుష్కలంగా అందించే దేశాలలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అంతర్జాతీయ విద్యార్థి వీసా (సబ్క్లాస్ 500) ఉన్నవారు చదువుకునేటప్పుడు ప్రతి రెండు వారాలకు 48 గంటల వరకు పని చేసుకోవచ్చు, ఇంకా చదువు విరామ సమయాల్లో అపరిమిత గంటలు పనిచేసే వెసులుబాటు కూడా ఉంది. ఇది విద్యార్థులకు తమ ఖర్చులను తాము భరించడానికి, నెట్వర్క్ను పెంచుకోవడానికి, చక్కటి అనుభవాన్ని పొందడానికి సహాయపడుతుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత, విద్యార్థులు తమ అర్హతలను బట్టి, 18 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు (కోర్సుతో పాటు ప్రాంతాన్ని బట్టి) ఆ దేశంలోనే ఉండి, తగిన ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు.న్యూజీలండ్అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత సురక్షితమైన, నాణ్యమైన విద్యను అందించే దేశాల్లో న్యూజీలండ్ కూడా ప్రత్యేకమే! ఇక్కడ పర్యావరణం చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. న్యూజిలాండ్లో పలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వరల్డ్ క్యూఎస్ (కోక్వారెల్లి సైమండ్స్) ర్యాంకింగ్స్లో స్థానాన్ని పొందాయి. కాబట్టి అక్కడ విద్యాప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించొచ్చు. అంతర్జాతీయ విద్యార్థులు పీహెచ్డీ (డాక్టోరల్) కోర్సులు చదివితే, వారికి దేశీయ విద్యార్థులతో సమానమైన, చాలా తక్కువ ఫీజు వర్తిస్తుంది. ఇక విదేశీ విద్యార్థి వీసా కోసం జీవన వ్యయాలు, తిరుగు ప్రయాణ ఖర్చులు చూపించాల్సి ఉంటుంది. విరామ సమయాల్లో పూర్తి సమయం పనిచేయడానికి అనుమతి ఉంది. న్యూజీలండ్లో చదువుకున్న తర్వాత అక్కడ స్థిరపడటం కూడా సులభమే.మొత్తానికీ అమెరికా చాన్స్ పోయిందని నిరాశపడే భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా దేశాలు వెల్కమ్ బోర్డ్తో ఎదురుచూస్తున్నాయి. ఆ నిరాశను వదిలేసి చుట్టూ ప్రపంచం వైపు చూస్తే మారేదేం లేదు.. విమానాశ్రయంలో ఫ్లైట్ పేరు తప్ప అంటున్నారు అనుభవజ్ఞులు.ఉత్తమమైన దేశాన్ని ఎలా ఎంచుకోవాలి?విదేశాల్లో కెరీర్ని ప్లాన్ చేసుకునే యువతకు ఆయా దేశాల్లో చదువుకోవడానికి, ఆపై అక్కడే పని చేయడానికి, అక్కడే స్థిరపడటానికి ఏ దేశాన్ని ఎంచుకోవాలి అనేది ప్రధాన సమస్య. కొన్ని దేశాలు సులభమైన పోస్ట్–స్టడీ వర్క్ వీసా, అలాగే పర్మనెంట్ రెసిడెన్స్ (స్థిరనివాసం) పొందే మార్గాలను అందిస్తాయి. అయితే ఏ దేశాలను ఎంచుకుంటే మేలు జరుగుతుంది?సులభమైన పోస్ట్–స్టడీ వర్క్ వీసా, స్థిరనివాస మార్గాలు ఎక్కువగా ఉన్న దేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్ వంటి దేశాలు అంతర్జాతీయ విద్యార్థులకు చాలా అనుకూలమైన వీసా విధానాలను పాటిస్తున్నాయి. దాంతో ఈ దేశాలలో పర్మనెంట్ రెసిడెన్సీ (స్థిరనివాసం)పొందే మార్గాలు కూడా సులభంగా ఉంటాయి.కెరీర్ వృద్ధి కోసం ఇంగ్లీష్ మాట్లాడే లేదా ఇంగ్లీష్ బోధించే దేశాలను ఎంచుకోవాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, యూకే వంటి ఇంగ్లిష్ మాట్లాడే దేశాలు మన భారతీయులకు భాషాపరంగా సౌకర్యంగా ఉంటాయి. అయితే జర్మనీ, నెదర్లండ్స్ వంటి కొన్ని నాన్–ఇంగ్లిష్ దేశాలు ఇంగ్లిష్ భాషలో కోర్సులను అందిస్తాయి. కాని, ఉద్యోగం పొందాలంటే మాత్రం స్థానిక భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడే సెటిల్ అవ్వాలి అనుకునేవారు ఎడ్యుకేష సమయంలో స్థానిక భాష నేర్చుకోవడంపై కాస్త దృష్టిపెట్టాలి.ఏ రంగంలో చదువుకోవాలనుకుంటున్నారో దాని ఆధారంగా మనం ఎన్నుకునే యూనివర్సిటీల విషయంలో కోక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్), టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) వంటి సంస్థల ప్రపంచ ర్యాంకింగ్లను పరిశోధించుకోవాలి. ఆయా విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లకు ఎంత సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయో, వారి సగటు జీతాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. యూనివర్సిటీల అధికారిక వెబ్సైట్లు లేదా లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫారమ్లలో ఈ వివరాలు లభిస్తాయి.ఒక దేశాన్ని ఎంచుకునే ముందు, అక్కడ అంతర్జాతీయ విద్యార్థులకు ఎంత భద్రత ఉందో తెలుసుకోవాలి. విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు ఎలాంటి సహాయక సేవలు (అకాడెమిక్ సపోర్ట్, కౌన్సెలింగ్, కెరీర్ గైడె¯Œ ్స) అందిస్తున్నాయో పరిశీలించుకోవాలి. ఆ దేశంలో జీవన వ్యయం (అద్దె, ఆహారం, రవాణా) సహా విద్యార్థి సంఘాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి.చదువుకునే సమయంలో ఆయా దేశాల్లో తమ వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకోవడానికి స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. చదువుతున్నప్పుడే ఇంటర్న్షిప్లు లేదా పార్ట్–టైమ్ ఉద్యోగాలు లభించే అవకాశాలున్న దేశాలను ఎంచుకోవడంతో వృత్తి అనుభవాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, స్థానిక భాష కూడా నేర్చుకోవచ్చు. -
అభాగ్యుల పాలిటి అన్నదాత
∙విఎస్ సాయిబాబాఅతనొక మధ్యతరగతి యువకుడు. బంధువుల ఇళ్లకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లినపుడు వృద్ధులు, ఆస్తి ఉన్నా పట్టెడన్నం పెట్టే దిక్కులేని, కుటుంబసభ్యులు పట్టించుకోని అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్న వైనం అతడిని ఎంతగానో బా«ధించింది. అలాంటి అభాగ్యుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని సంకల్పించుకున్నాడతను. అతడే మళ్ల తులసీరామ్ (రాంబాబు). అతడి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని పంజా వేమవరం.రాంబాబు ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు. నాలుగెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే సాదాసీదా యువరైతు. ఉన్న భూమిలోనే కొంత విస్తీర్ణంలో రొయ్యల సాగు చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. క్రమంగా రియల్ ఎస్టేట్, రైస్మిల్లుల వ్యాపారాల్లోకి ప్రవేశించి, ఆర్థికంగా మరింత పుంజుకున్నారు. తులసీ కన్వెన్షన్ పేరుతో కల్యాణమండపం నిర్మించారు.ఆర్థికంగా బలపడటంతో అన్నార్తులు, అభాగ్యులైన వృద్ధుల కోసం ఏదైనా చేయాలనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కార్యాచరణకు దిగారు. భార్య, కుమారుడు, కుమార్తె కూడా తన సంకల్పానికి ప్రోత్సాహం ఇవ్వడంతో 2019 అక్టోబర్ నుంచి ఇంటింటికీ భోజనం క్యారియర్స్ పంపడం ప్రారంభించారు.18 గ్రామాల్లోని 160 మందికివీరవాసరంలో తాను నిర్మించిన తులసీ కల్యాణ మండపంలోనే ప్రతి రోజు ఉదయం వంట తయారు చేసి పంజా వేమవరం పరిసర గ్రామాలైన చింతలకోటిగరువు, తోకలపూడి, తోలేరు, రాయకుదురు, కొణితివాడ, జొన్నలగరువు, నవుడూరు, అండలూరు, ఉత్తరపాలెం, బలుసుగొయ్యపాలెం తదితర 18 గ్రామాల్లోని 160 మందికి ప్రతిరోజూ ఇంటి వద్దకే భోజనం క్యారియర్స్ పంపడం మొదలుపెట్టారు.వివక్షకు తావు లేకుండా...కులమత ఆర్థిక తారతమ్యాలకు తావులేకుండా, వయోభేదం లేకుండా కడుపునిండా భోజనానికి నోచుకోని వారిని ఎంపిక చేసుకుని, వారికి ప్రతిరోజూ భోజనం క్యారియర్లు పంపుతున్నారు. ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు ఉండి, తల్లిదండ్రులను పట్టించుకోని కొందరికి రాంబాబు పంపే క్యారియర్ ఒక చెంపదెబ్బ! తమ తల్లిదండ్రులకు రాంబాంబు క్యారియర్ పంపడంతో, పరువుపోతుందని భయపడిన పిల్లలు తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకోవడం మొదలుపెట్టిన సంఘటనలు అనేకం!విరాళాలు నిరాకరిస్తూ..ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకే వంట తయారుచేసి క్యారియర్స్లో సర్ది, అన్నార్తుల ఇంటికి ఒక ఆటో బయలుదేరుతుంది. సుమారు ఉదయం 11 గంటల లోపుగానే రాంబాబు పంపించే భోజనం క్యారియర్ 160 మందికి చేరిపోతుంది. రోజూ ఒకే రకమైన వంటకం కాకుండా; ప్రతి సోమ, గురు, శనివారం రోజుల్లో పప్పు, మంగళ, శుక్రవారాలు కూరగాయలు, బు«ధ, ఆదివారాలు చేపలు లేదా మాంసం లేదా రొయ్యల కూరతో భోజనం కార్యియర్స్ సిద్ధం చేస్తారు. వారం రోజులపాటు రసం, మజ్జిగపులుసు, సాంబారు ఏదో ఒకటి తప్పనిసరి. మాంసాహారం తినని వారికి శాకాహార భోజనమే పంపిస్తారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, వీరందరికీ క్రమం తప్పకుండా ప్రతిరోజూ భోజనం క్యారియర్లు వేళకు అందుతాయి. ఈ పని సజావుగా సాగడానికి ఆరుగురు పనిమనుషులను నియమించుకున్నారు. ఎప్పుడైనా వంటమనిషి రాకుంటే, రాంబాబే స్వయంగా వంట చేస్తారు. కుటుంబ సభ్యులు అతనికి సహకరిస్తారు. ఈ మహత్కార్యంలో తామూ భాగస్వాములం అవుతామని కొందరు విరాళాలు ఇస్తామంటూ ముందుకు వచ్చినా, రాంబాబు సున్నితంగా తిరస్కరిస్తారు. తన తదనంతరం కూడా ఈ కార్యక్రమాన్ని తన కుటుంబ సభ్యులు నిరంతరాయంగా కొనసాగించేందుకు వీలుగా తానే ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రాంబాబు చెబుతున్నారు.అన్నం పెట్టి ఆదుకుంటున్నారుగత రెండేళ్లుగా రాంబాబు పెట్టే భోజనంతోనే బతుకుతున్నాను. నన్ను చూసుకునేవారు ఎవరూ లేరు. గ్రామస్థులు చెప్పిన మాటతో భోజనం క్యారియర్ పంపిస్తున్నారు. భోజనం చాలా బాగుంటుంది.వరహాలు,జొన్నలపాలెం, వీరవాసరం మండలం.రాంబాబే దిక్కునా భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్నా, వారు నన్ను పట్టించుకోరు. నాకు తిండిపెట్టే దిక్కులేని సమయంలో రాంబాబే నాకు దిక్కయ్యారు. ప్రతిరోజూ ఆయన పంపే భోజనం తింటున్నాను.వెంకటేశ్వరరావు, కొణితివాడ, వీరవాసరం మండలం.పదికాలాలు క్షేమంగా ఉండాలిరాంబాబు పంపించే భోజనం చాలా బాగుంటుంది. ప్రతిరోజూ ఒకే రకమైన భోజనం కాకుండా, పండుగ రోజుల్లో మరింత ప్రత్యేంగా భోజనం అందించడం చాలా సంతోషం. అడగకుండానే అన్నంపెట్టే రాంబాబులాంటి వ్యక్తి పదికాలాలపాటు క్షేమంగా ఉండాలి.అప్పారావు, కొణితివాడ.కడుపు నింపడంలోనే సంతృప్తిసంపాదించిన దానిలో కొంతమొత్తంతో కొందరి ఆకలి తీర్చడం కన్నా సంతృప్తి మరొకటి లేదు. ఈ పని తలపెట్టినప్పుడు ఎంతో ఆలోచించాను. నా కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో ముందడుగు వేశాను. ‘కోవిడ్’ సమయంలో రెండు మూడు నెలలు మినహా ప్రారంభించిన నాటి నుంచి నిరంతరాయంగా ఈ భోజనం క్యారియర్ల పంపిణీ కొనసాగుతోంది. ఇన్నాళ్లుగా భోజనాలు పంపుతున్నా, రాంబాబు అనే పేరు తప్ప నేనెవరో క్యారియర్లు అందుకుంటున్న చాలామందికి ప్రత్యక్షంగా తెలియదు.మళ్ల తులసీరామ్(రాంబాబు), నిర్వాహకుడు, పంజా వేమవరం. -
దుర్వాసుడి నరక సందర్శనం
దుర్వాసుడు ఒకసారి పితృలోకానికి వెళ్లాడు. శరీరం నిండా విభూతిని అలంకరించుకుని, రుద్రాక్షమాలలు ధరించి, ‘శివా! శంకరా! పరమేశ్వరా! జగన్మాతా! జగదంబికా!’ అంటూ పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తూ అడుగుపెట్టిన దుర్వాసుడిని కవ్యవాలాదులైన పితృదేవతలు ఎదురేగి స్వాగతించారు. దుర్వాసుడిని వారు ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి, అతిథి మర్యాదలు చేశారు. కుశల ప్రశ్నలు వేశారు. కబుర్లతో వారు కాలక్షేపం చేస్తుండగా, ఎక్కడి నుంచో ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించసాగాయి.ఆ ఆర్తనాదాలకు, హాహాకారాలకు దుర్వాసుడు కలత చెందాడు. ‘హృదయవిదారకంగా ఉన్న ఈ రోదనలు, హాహాకారాలు ఎక్కడివి?’ అని అడిగాడు.‘మునీశ్వరా! ఇక్కడికి సమీపంలోనే యమలోకం ఉంది. అక్కడ పాపులను శిక్షించడానికి యమధర్మరాజు ఉన్నాడు. అతడి అధీనంలో వేలాదిగా యమదూతలు ఉన్నారు. యమలోకంలో ఎనభైఆరు నరకకూపాలు ఉన్నాయి. వాటిలో భయంకరమైనది కుంభీపాక కూపం. మహాపాపులను తెచ్చి, అందులో పడవేసి, వారిని యమదూతలు ఘోరంగా శిక్షిస్తుంటారు. వారి శిక్షల యాతనను వర్ణించడం అసాధ్యం. శిక్షలు అనుభవిస్తున్న పాపుల ఆర్తనాదాలు, రోదనలు ఇక్కడి వరకు వినిపిస్తూ ఉంటాయి. దైవనింద, గురునింద, పరపీడన, నారీపీడన, మాతృ పితృనింద, మిత్రద్రోహం, స్వామిద్రోహం వంటి మహాపాపాలు చేసి వచ్చిన వారికి శిక్షలు అత్యంత దారుణంగా ఉంటాయి. శిక్షల బాధ తాళలేక ఆ పాపులు చేసే ఆర్తనాదాలు మేము రోజూ వింటూనే ఉంటాం. వారి ఆర్తనాదాలు వింటే చాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది’ అని చెప్పారు.నరకం నుంచి వినిపించే పాపుల ఆర్తనాదాలు వింటూ దుర్వాసుడు పితృలోకంలో ఉండలేకపోయాడు. చటుక్కున లేచి, వడివడిగా అడుగులు వేస్తూ నరకం వైపు బయలుదేరాడు. కొద్దిసేపటికే అతడు నరకానికి చేరుకున్నాడు. పెద్దపెట్టున ఆర్తనాదాలు వినిపిస్తున్న కుంభీపాక కూపం వద్దకు వెళ్లాడు. గట్టున నిలబడి లోనికి చూశాడు. అప్పటి వరకు మిన్నుముట్టిన ఆర్తనాదాలు ఆగిపోయి, కేరింతలు మొదలయ్యాయి. కుంభీపాక కూపంలో ఉన్న పాపులు ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆనంద కేళీ విలాసాలు సాగిస్తూ కనిపించారు. యమలోకం గురించి పితృలోకంలో తాను విన్నదొకటి, తాను స్వయంగా చూస్తున్నది వేరొకటిగా ఉండటంతో దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు.దుర్వాసుడు మాత్రమే కాదు, పాపులకు శిక్షలు అమలు చేస్తున్న యమదూతలు కూడా ఈ ఆకస్మిక పరిణామానికి నివ్వెరపోయారు. కఠిన శిక్షలకు యాతనలు అనుభవిస్తూ హాహాకారాలు చేయవలసిన పాపులందరూ కేరింతలు కొడుతూ ఆనందకేళీ నృత్యాలు చేస్తుండటం వారిని అయోమయంలో పడేసింది. కుంభీపాకంలోని మహాపాపులందరూ స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉండటం విడ్డూరంగా తోచింది. ఎంతగా తరచి చూసినా ఈ పరిస్థితికి కారణమేమిటో కనిపించలేదు. ఇదేదో మాయలా ఉందని తలచి యమదూతలు హుటాహుటిన యమధర్మరాజు వద్దకు వెళ్లారు. ‘స్వామీ! కుంభీపాకంలోని మహాపాపులందరూ స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉన్నారు. కొద్దినిమిషాల కిందటి వరకు హాహాకారాలు చేసిన వారే ఇప్పుడు ఉల్లాసంగా కేరింతలు కొడుతున్నారు. దీనికి కారణమేమిటో మాకు ఏమాత్రం అంతుచిక్కకుంది. మీరే ఒకసారి స్వయంగా వచ్చి పరిశీలించండి’ అని చెప్పారు.యమదూతల మాటలకు యమధర్మరాజు ఉలిక్కిపడ్డాడు. కుంభీపాకంలో ఏం జరుగుతోందో చూడటానికి వెంటనే మహిష వాహనాన్ని అధిరోహించాడు. ఎందుకైనా మంచిదని ఇంద్రుడు సహా ఇతర దిక్పాలకులకు, బ్రహ్మ విష్ణువులకు కబురు పెట్టాడు.యముడు, ఇంద్రాది దిక్పాలకులు, బ్రహ్మ విష్ణువులు దాదాపు ఒకేసారి కుంభీపాక కూపం వద్దకు చేరుకున్నారు. లోపల ఉన్న పాపులు ఆనంద పరవశులై కేరింతలు కొడుతున్న దృశ్యాన్ని కళ్లారా చూశారు. ఇది నరకకూపం కాదు, పాపుల కోసం ఏర్పాటు చేసిన భోగకూపంలా ఉందని వారంతా నివ్వెరపోయారు. ఈ విడ్డూరానికి కారణమేమిటో వారెవరికీ అంతుచిక్కలేదు.బ్రహ్మ విష్ణువులు ఇంద్ర యమధర్మరాజులతో తర్జనభర్జనలు జరిపారు. ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణమేమిటో వారికి తోచలేదు. పరమశివుడిని అడిగితే దీనికి కారణమేమిటో చెప్పగలడని వారంతా ఏకగ్రీవంగా అనుకున్నారు. దిక్పాలకులను, ఇంద్రుడిని, యముడిని వెంటబెట్టుకుని బ్రహ్మ విష్ణువులు నేరుగా కైలాసానికి వెళ్లారు. వారంతా శివుడికి నమస్కరించారు. యమలోకపు వింతను వివరించారు. ‘మహేశ్వరా! ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణమేమిటో మాకు తోచకున్నది. నువ్వు సర్వజ్ఞుడివి. దీనికి కారణమేమిటో నువ్వే చెప్పాలి’ అన్నాడు విష్ణువు.‘మహావిష్ణూ! ఇందులో వింతా లేదు, విడ్డూరమూ లేదు. ఇదంతా విభూతి మహిమ. కుంభీపాకం వద్దకు దుర్వాసుడు వచ్చాడు కదా! నా భక్తుడైన దుర్వాసుడు విభూతిని ధరించాడు. కుంభీపాకం వద్ద అతడు నిలిచి, తలవంచి లోనికి చూశాడు. అప్పుడు అతడి నుంచి విభూతి రేణువులు రాలి ఆ పాపుల మీద పడ్డాయి. అవి పడిన వెంటనే పాపుల యాతనలు మటుమాయమైపోయాయి. కుంభీపాక కూపం స్వర్గతుల్యంగా మారింది. ఇకపై అది పితృలోక వాసులకు పవిత్ర తీర్థమవుతుంది. అందులో స్నానమాచరించిన పితృదేవతలు సుఖపడతారు. అక్కడ ఆలయం నిర్మించి, మా దంపతులను ప్రతిష్ఠించండి. ప్రీతీశ్వరి, ప్రీతీశ్వరులుగా అందులో కొలువుదీరుతాం. పితృలోక వాసుల పూజలు అందుకుంటాం. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోనూ ఇదే పవిత్ర తీర్థమవుతుంది’ అని ప్రకటించాడు శంకరుడు. దేవతలందరూ శివుడి వద్ద సెలవు పుచ్చుకుని బయలుదేరారు. పరమశివుడు చెప్పినట్లుగానే కుంభీపాకం వద్ద తీర్థాన్ని, ఆలయాన్ని నిర్మించారు. అప్పటి వరకు కుంభీపాకంలో ఉన్నవారంతా దివ్యవిమానాల్లో కైలాసానికి చేరుకున్నారు.∙సాంఖ్యాయన -
శాంతి కోసం యుద్ధం చేశారు!
మహిళలు శాంతి దూతలు. శాంతి కోసం అవసరం అయితే వారు వీధి పోరాట యోధులు కూడా కాగలరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కళ్లెదుటి వర్తమానం. నోబెల్ బహుమతులు మొదలయ్యాక ఈ 125 ఏళ్లలో ఇప్పటి వరకు 19 మంది మహిళలు శాంతి విజేతలయ్యారు. ఇది చిన్న సంఖ్యలా అనిపించినా, శాంతి సాధనలో మహిళల సంకల్ప బలానికి ఆకాశమంత సాక్ష్యం. 20 వ మహిళా శాంతి బహుమతి విజేత ఎవరన్నది (ఒకవేళ మహిళే విజేత అయితే) ఈ నెల 10 న నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. ఈసారి ‘శాంతి’ బహుమతికి 224 మంది వ్యక్తులు, 94 సంస్థలు పోటీలో ఉండగా... వాళ్లలో కొందరు మహిళలూ ఉన్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతిని పొందిన పందొమ్మిది మంది మహిళల వివరాలు.. మీ కోసం, క్లుప్తంగా.1905 బెర్తా వాన్ సట్నర్ (1843–1914) ఆస్ట్రియా యుద్ధాన్ని వ్యతిరేకించటంలో చూపిన తెగువకు బెర్తాకు ‘నోబెల్ శాంతి’ లభించింది. 19వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన పుస్తకాలలో ఒకటైన యుద్ధ వ్యతిరేక నవల ‘లే డౌన్ యువర్ ఆర్మ్స్’ (1889) బెర్తా రాసిందే. ఈ నవల పేరు అప్పట్లో చాలామందికి రెచ్చగొట్టేదిగా అనిపించింది. బెర్తా అంతర్జాతీయ శాంతి ఉద్యమ నాయకులలో ఒకరు. 1891లో ఆస్ట్రియన్ శాంతి సమాజాన్ని స్థాపించారు. పురుషాధిక్య శాంతి సమావేశాలలో శక్తిమంతమైన నాయకురాలిగా నిలిచారు.1931జేన్ ఆడమ్స్ (1860–1935), అమెరికామానవాళిలో శాంతి స్ఫూర్తిని రగిలించడానికి చేసిన నిరంతర కృషికి జేన్కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. జేన్ 1915లో ‘విమెన్స్ ్స ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్’ను స్థాపించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నెదర్లండ్స్లోని హేగ్లో జరిగిన మహిళల శాంతి సమావేశానికి జేన్ అధ్యక్షత వహించారు. అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్స్ అమెరికాను యుద్ధంలోకి దింపినందుకు వ్యతిరేకంగా జేన్ చాలా బిగ్గరగా నిరసన తెలిపారు. 1946ఎమిలీ గ్రీన్ బాల్చ్ (1867–1961), అమెరికానిరాయుధీకరణ, శాంతి స్థాపనల కోసం ఎమిలీ జీవితాంతం చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ ఆమెకు అమెరికా ప్రభుత్వం నుండి ఎటువంటి అభినందనలూ అందలేదు! మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె 1931 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జేన్ ఆడమ్స్తో కలిసి, యుద్ధాన్ని ఆపడానికి జోక్యం చేసుకోవాలని తటస్థ దేశాల దేశాధినేతలను ఒప్పించారు. 1935లో ఎమిలీ ‘విమెన్స్ ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్’ కు నాయకత్వం వహించారు.1976 బెట్టీ విలియమ్స్ (1943–2020), యు.కె.ఉత్తర ఐర్లండ్లో ప్రొటెస్టెంట్లకు, కేథలిక్కులకు మధ్య రగులుతున్న హింసాత్మక సంఘర్షణలకు ముగింపు పలికేందుకు చేసిన కృషికి, మైరీడ్ కొరిగన్ అనే మహిళతో పాటుగా బెట్టి విలియమ్స్కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1976 ఆగస్టులో, బెల్ఫాస్ట్లో (ఉత్తర ఐర్లండ్) జరిగిన కాల్పుల ఘటనలో అమాయకులైన ముగ్గురు చిన్నారులు మరణించారు. గృహిణి అయిన బెట్టీ విలియమ్స్ ఆ విషాదాన్ని చూసి, ఉత్తర ఐర్లండ్లో ఘర్షణలు ఆపాలని నిర్ణయించుకుని, శాంతి పునరుద్ధరణకు పాటు పడ్డారు. 1976 మైరీడ్ కొరిగన్ (1944 –), యు.కె.మైరీడ్ బెల్ఫాస్ట్లో ఒక పేద కుటుంబంలో పెరిగారు. యువతిగా ‘లెజియన్ ఆఫ్ మేరీ’ అనే కాథలిక్ సంస్థలో సేవలందించారు. 1976, 1977లలో ఉత్తర ఐర్లండ్లో ఘర్షణలు, హింసకు వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు వేలాది మందిని ఒకచోట చేర్చారు. బెట్టీ విలియమ్స్తో కలిసి పని చేశారు. ఆమెతో నోబెల్ శాంతిని పంచుకున్నారు. 1979మదర్ థెరిసా (1910 – 1997), ఇండియామానవాళికి అసమాన సేవలను అందించినందుకు మదర్ థెరిసాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అల్బేనియా కేథలిక్ బాలిక అయిన ఆగ్నెస్ గోంక్షా బోజాక్షియు తన పన్నెండేళ్ల వయసులోనే మానవాళి సేవకు అంకితం అయ్యారు. తదనంతర కాలంలో ఇండియాకు వచ్చి థెరిస్సాగా మారిపోయారు. పేదలను ఆదుకునేందుకు ఆమె స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ కలకత్తాలో అనాథల కోసం ఇళ్లు, కుష్ఠురోగులకు నర్సింగ్ హోమ్లు, ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల కోసం ఆశ్రమాలను నిర్మించింది.1982అల్వా మిర్డాల్ (1902–1986), స్వీడన్1962లో స్వీడిష్ పార్లమెంటుకు ఎన్నికవటానికి ముందే అల్వా మిర్డాల్ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. యుద్ధానంత కాలంలో సోషల్ డెమోక్రాట్ పార్టీ ద్వారా కార్మికవర్గ పరిస్థితులను మెరుగుపరచడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. మహిళల హక్కుల ప్రచారకర్తగా ప్రసిద్ధి చెందారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రముఖ పదవులను నిర్వహించారు. ఆమె చేసిన నిరాయుధీకరణ ప్రయత్నాలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1991ఆంగ్ సాన్ సూకీ (1945–) బర్మాబర్మాలో పౌర ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించాలని సైనిక నాయకులతో పోరాడారు. 1990లో ఆమె పార్టీ ఎన్.ఎల్.డి. స్పష్టమైన విజయం సాధించినా, అప్పటికే గృహ నిర్బంధంలో ఉన్న సూకీని విడుదల చేయటానికి సైన్యం నిరాకరించింది. 21 సంవత్సరాలలో దాదాపు 15 సంవత్సరాలు ఆమె గృహ నిర్బంధంలోనే ఉన్నారు. 2021 ఫిబ్రవరి 1న సైనిక దళాలు తిరుగుబాటు చేసి, సూకీకి మళ్లీ 8 సంవత్సరాల జైలు శిక్ష విధించాయి. ఆమె అహింసాయుత ప్రజా పోరాటం ఆమెకు నోబెల్ శాంతిని తెచ్చిపెట్టింది.1992రిగోబెర్టా మెంచు తుమ్ (1959–) గ్వాటెమాలారిగోబెర్టా మెంచు తుమ్ స్థానిక ఆదివాసీల హక్కుల కోసం కృషి చేసినందుకు గాను నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేటాడుతున్న సైన్యం ఆమె సొంత కుటుంబంలోని అనేక మందిని చంపింది. దాంతో ఆమె 1980ల ప్రారంభంలో మెక్సికోలో తలదాచుకున్నారు. అక్కడ మానవ హక్కుల కోసం పనిచేస్తున్న యూరోపియన్ సమూహాలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గ్వాటెమాలా తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వం – గెరిల్లా సంస్థల మధ్య చర్చలలో మధ్యవర్తిగా పని చేశారు. 1997జోడీ విలియమ్స్ (1950 –) అమెరికాజోడీ మందు పాతరల వ్యతిరేక ఉద్యమ నాయకురాలు. 1980లలో యుద్ధంలో దెబ్బతిన్న ఎల్ సాల్వడార్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ కాలంలో మందు పాతరలు పౌర జనాభాకు నిరంతరం ముప్పుగా ఉండేవి. వాటి వల్ల చేతులు, కాళ్లు కోల్పోయిన పిల్లలకు కృత్రిమ అవయవాలను అందించే బాధ్యతను ఆమె తీసుకున్నారు. 1991 నుండి మందుపాతరలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించడంలో ముందు నిలిచారు. నోబెల్ విజేత అయ్యారు.2003షిరిన్ ఎబాది (1947–), ఇరాన్ఇస్లామిక్ ప్రపంచం నుంచి తొలి మహిళా శాంతి బహుమతి గ్రహీత. ఇరాన్ తొలి మహిళా న్యాయమూర్తులలో ఒకరు. బ్యూరోక్రసీ పీడనను వ్యతిరేకించారు. పై అధికారులను విమర్శించినందుకు జైలుపాలు అయ్యారు. కనీస మానవ హక్కుల కోసం; ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కుల కోసం పోరాటాన్ని చేపట్టారు. ఇందుకే ఆమెకు నోబెల్ లభించింది. మతం నుండి రాజకీయాలను వేరుచేయాలనే వాదనకు ఎబాది మద్దతుగా నిలిచారు. 2004వంగారి మాతై (1940–2011), కెన్యానోబెల్ శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆఫ్రికన్ మహిళ. తూర్పు, మధ్య ఆఫ్రికా నుండి డాక్టరేట్ (జీవశాస్త్రంలో) పొందిన తొలి మహిళ. స్వదేశమైన కెన్యాలో తొలి మహిళా ప్రొఫెసర్ కూడా. కెన్యా ప్రజాస్వామ్య పోరాటంలో చురుకైన పాత్ర వహించారు. 1977లో అడవుల సంరక్షణకు ఉద్యమం ప్రారంభించారు. ‘గ్రీన్ బెల్ట్’ అనే ఆ ఉద్యమం ఇతర ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది, మూడు కోట్లకు పైగా చెట్లను నాటడానికి దోహదపడింది. సుస్థిరాభివృద్ధి కోసం ఆమె చేసిన కృషికి నోబెల్ దక్కింది. 2011ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ (1938 –), లైబీరియాఆఫ్రికాలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన తొలి మహిళా దేశాధినేత. శాంతిని ప్రోత్సహించ డానికి, మహిళల హక్కుల కోసం పోరాడారు. 2005లో అధికారంలోకి వచ్చి, దేశంలో శాంతి సుస్థిరతకు, ఆర్థిక పురోగతికి, మహిళల హక్కుల కోసం పాటుపడ్డారు. ఇందుకే నోబెల్ పొందారు. ఇతర ఆఫ్రికన్ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ అమెరికాలో చదువుకున్నారు. అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చాక రాజకీయ ఉద్యమబాట పట్టారు. 2011లేమా బోవీ (1972–), లైబీరియాశాంతిని నెలకొల్పటానికి, మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. 1990లో లైబీరియాలో అంతర్యుద్ధంలో గాయపడిన బాల సైనికుల సంరక్షణ కోసం ట్రామా థెరపీలో శిక్షణ పొందారు. లేమా నేతృత్వంలోని ‘విమెన్ మాస్ యాక్షన్ ఫర్ పీస్’.. క్రైస్తవ, ముస్లిం మహిళల సంయుక్త ఆధ్వర్యంలో శాంతి, అహింసల సందేశాన్ని అందించే సమావేశాలను నిర్వహించారు. 2008లో, లైబీరియన్ అంతర్యుద్ధంలో మహిళల పోరాటంపై వచ్చిన అవార్డు డాక్యుమెంటరీ చిత్రం ‘ప్రే ది డెవిల్ బ్యాక్ టు హెల్‘లో లేమా కీలక పాత్ర పోషించారు. 2011తవక్కోల్ కర్మాన్ (1979–), యెమెన్జర్నలిస్ట్. యెమెన్స్ లో భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం కృషి చేశారు. అధ్యక్షుడు సలేహ్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అనేక నిరసనలకు నాయకత్వం వహించారు. ‘విమెన్ జర్నలిస్ట్స్ వితౌట్ చైన్స్ ్స’ అనే సంస్థను స్థాపించారు. ఉద్యమశీలిగా జైలు శిక్ష అనుభవించారు. హింసలకు గురయ్యారు. 2011లో షియా– సున్నీ ముస్లింల మధ్య; ఇస్లాం–ఇతర మతాల మధ్య సయోధ్యను ప్రోత్సహించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ప్రశంసలు అందుకున్నాయి. 2014 మలాలా యూసఫ్జాయ్ (1997–), యు.కె.ప్రతి చిన్నారికీ చదువుకునే హక్కు ఉందని పోరాడినందుకు మలాలాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె పాకిస్తాన్స్ లోని స్వాత్ లోయలో జన్మించారు. 2012లో తాలిబాన్లు పాఠశాల బస్సుపై కాల్పులు జరిపినప్పుడు మలాలా తలపై గాయమైంది. ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అవటంతో ఆమె బ్రిటన్లో ప్రవాసంలో నివసించాల్సి వచ్చింది. ఆమె తన 16వ పుట్టినరోజున ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల విద్యకు సమాన హక్కుల కోసం పిలుపునిచ్చారు. 2018నాదియా మురాద్ (1993–), ఇరాక్లైంగిక హింసను యుద్ధాలలో ఆయుధంగా ఉపయోగించటంపై పోరాటం చేశారు. ఇరవై ఒక్క ఏళ్ల నాదియాను, ఇతర యువతులను ‘ఐ.ఎస్.’ ఉగ్రవాదులు అపహరించి లైంగిక బానిసలుగా చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత, నాదియా తప్పించుకుని 2015లో జర్మనీ చేరుకున్నారు. ‘ది లాస్ట్ గర్ల్‘ అనే పేరుతో ఆత్మకథను రాశారు. తనపై జరిగిన దురాగతాలను అందులో వివరించడం ద్వారా, భవిష్యత్ తరాల బాలికలు, యువతులు యుద్ధంలో లైంగిక హింసకు బాధితులుగా మారకుండా ఉంటారని ఆకాంక్షించారు.2021మరియా రెస్సా (1963–), ఫిలిప్పీన్స్పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడారు. ఫిలిప్పీన్స్ ్స డిలిమాన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన రెస్సా, సీఎన్ఎన్ స్థానిక కరస్పాండెంట్గా పనిచేశారు. ప్రధానంగా ఆగ్నేయాసియాలో ఉగ్రవాదం విస్తరించడంపై ప్రత్యేక వార్తా కథనాలు రాశారు. అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే పాలనాధికార దుర్వినియోగాన్ని, హింసాత్మకమైన నిరంకుశత్వాన్ని బహిర్గతం చేశారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి, ప్రత్యర్థులను వేధించడానికి డూటెర్టే సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారో బయటపెట్టారు.∙∙ 2023నర్గేస్ మొహమ్మది (1972–), ఇరాన్ఇరాన్స్ లో మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా 20 ఏళ్లకు పైగా పోరాడారు. మరణశిక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసి 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు విధించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ఎంపిక జరిగినప్పుడు ఆమె టెహ్రాన్స్ లోని ఎవిన్ జైలులో బందీగా ఉన్నారు. నర్గేస్ తన శాంతి బహుమతి గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వాల కోసం కృషి చేయటాన్ని నేను ఎన్నటికీ ఆపను..’’ అని వ్యాఖ్యానించారు. · సాక్షి, స్పెషల్ డెస్క్ -
శోకగర్భ
నుదుటి మీద అరచేయి అడ్డుపెట్టి, కళ్ళు విప్పార్చి, ఆకాశంలో ఎగిరే గెద్ద వేపు చూసే పిల్లల కోడిలా దూరంగా కన్పించే వ్యక్తులను ఆందోళనగా చూడసాగేడు మజ్జి సూరపు నాయుడు...వారం రోజులుగా యేదో వేళ, యెవరెవరో వస్తున్నారు. పొలాలను పరిశీలిస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరితోనూ ఏమీ మాటాడడం లేదు. ‘వాళ్ళెవరు?’ ప్రశ్నార్థకంగా చూస్తున్న సూరపు నాయుడి చొక్కా జేబులోని సెల్ మోగింది. నుదుటి మీది అరచేయి తీసి, చొక్కా జేబులోని సెల్ తీసి పట్టుకొని... ‘‘అలో...ఎవుళూ’’ అని ప్రశ్నించాడు. అవతలి వ్యక్తి తాను ఎవరో చెప్పాడు. ‘‘నువ్వా?’’ అన్నాడు సూరపు నాయుడు. అవతలి వ్యక్తి యేమేమో చెప్తున్నాడు. నాయుడు అన్యమనస్కంగా వింటూ, దూరంగా కన్పించే వ్యక్తుల కదలికలు గమనిస్తున్నాడు.‘‘ఇంటన్నవా నా మాటలు? ఉలకవూ పలకవు. ఏటి చేస్తన్నావ్ బావా?’’ అని ప్రశ్నించాడు అవతలి వ్యక్తి.‘‘వోయ్... వోరమ్ రోజుల నించి పొలాలంట ఎవులెవులో తిరగతన్నారోయ్. ఏటో అనుమానంగా వుందోయ్. పొలాలకి గాలి వొచ్చీటట్టుగా వుందోయ్’’ – అని భయాన్ని వ్యక్తం చేశాడు నాయుడు.‘‘ఏనుగులో, ఎలుగుబంట్లో, జెంతువులేవో పొలాలంట తిరిగితే బయపడాల గాని మనుషులు తిరిగితే బయపడతావేటి బావా?’’ ‘‘జెంతువులయితే పంటల్ని తిని ఎలిపోతాయి, మనుషులు గాని అలికిడి అయితే పారిపోతాయి’’... అని బదులు చెప్తున్నాడు నాయుడు.‘‘అయితేటి ఆలెవులో పొలాల్ని వొట్టుకుపోతారా?’’‘‘వొట్టుకుపోరు, తీసీసుకుంటారు.’’‘‘ఇచ్చీ బావా, మంచి ధర గాని ఇస్తే ఇచ్చీబావా. ఏల ఏటా అప్పుల్ని పండిస్తావు? పిల్లల బతుకులు పాడు చేస్తావు. ఇచ్చీ, ఆ డబ్బు వొట్టుకొని ఇక్కడికి వొచ్చీ.’’సూరపు నాయుడిని వొచ్చేయమని పిలిచిన అవతలి వ్యక్తి సూరపు నాయుడి మేనమామ కొడుకు, పసరాపల్లి వూరివాడు.మేనమామకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఫోనులో మాటాడే అవతలి వ్యక్తి మేనమామ చిన్నకొడుకు, సూరపు నాయుడి కంటే నాలుగేళ్ళు పెద్ద. మేనమామ చనిపోయాక అతని ఇద్దరు కొడుకులు ఆస్తి వాటాలు వేసుకుని, వేరు కాపురాలు అయిపోయారు. పసరాపల్లి ప్రాంతాన థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదన రావడం, ఆ ప్రాంత భూములను సేకరించడానికి ప్రభుత్వం పూనుకోవడం, రైతులు ప్రతిఘటించడం, పోలీసు కాల్పుల్లో తన అన్న చనిపోవడం, కేసులు, కోర్టులతో విసిగి, రెండు కుటుంబాలతో హైదరాబాద్ వలస వచ్చేశాడాయన. రెండు కుటుంబాలు కూలీ, నాలీ చేసుకు బతుకుతున్నాయి. తిప్పలెన్ని పడినా, తిండికీ, గుడ్డకీ లోటు లేకుండా గడిచిపోతున్నాయి రోజులు. అందుకే ఆయన సూరపునాయుడ్ని వొచ్చేయమన్నాడు. సూరపు నాయుడు ఆ వ్యక్తితో మాటాడుతూనే పొలం నుంచి వూరి గోర్జీ తోవలోకి నడిచాడు. నడుస్తున్న వాడు ఆగి – ‘‘ఏటివోయ్? పొలం అమ్మీసి, పట్నమొచ్చి ఆ డబ్బులు తిని కూకోమంటావా?’’ అని ప్రశ్నించాడు. ‘‘తిని కూకోడం ఏల బావా? పట్నంల వొవ్వో... బోల్డు పనులు... అపార్ట్మెంట్లల్ల వాచ్మెన్, పెద్ద పెద్దోల్ల బంగ్లాల గేటు కాపలా, యేదో చిన్నా చితకా ఫేక్టరీలల్ల లేబర్ ... ఇలాటివి దొరకవా?’’ అనన్నాడు. ‘‘దొరకవా అని నన్నడుగుతావు? నాకేటి తెలుసు?’’ ప్రశ్నించాడు సూరపు నాయుడు.అవతలి వ్యక్తి, ఆ ప్రశ్నను పట్టించుకోకుండా – ‘‘కాదంటావా... తాపీ పనికో, కళాసీ పనికో యెళ్తే డయిలీ ఇన్కమ్ బావా’’ – అని ఇంగ్లీషులో చెప్పాడు సూరపు నాయుడులో ఆశలు రగిలించడానికి.‘‘వోయ్... రైతోడు చేపలాంటోడువోయ్. పొలమొదిలేస్తే వొడ్డున పడ్డ చేప అయిపోతాడు’’... అన్నాడు నాయుడు. ‘‘వోస్... నీను మరి రైతుని కానేటి? భూమి పోయినపుడు వొచ్చీలేదేటి? వొచ్చిన తొలినాళ్ళు కసింత బెంగగా వుంటాది. ఏదో పని దొరికిన తరాత అలవాటయి పోతాది – వొచ్చీవోయ్. ఒచ్చీ. భూమి ఇచ్చీవోయ్ ఇచ్చీ, పరిహారం అందుకో. అందల కొంత సొమ్ముతో, కూతురుకి పెళ్లిచేసి, అత్తోరింటికి తోలీ. మిగిలిన సొమ్ము తీసుకొని, కొడుకుని తీసుకొని వొచ్చీ. ఆడికి ఆటో ఒకటి కొనీసి ఇచ్చీ. ఇక్కడ ఆటోకి మంచి గిరాకీ. ఇంకోపక్క నువ్వు ఏదో పనికి కుదిరి పోనావనుకో, ఇంక మరి సూడక్కర్లేదు మీకు’’... అని భవిష్యత్ ఆశాజనకంగా చెప్పాడు అవతలి వ్యక్తి. రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఆశాజనకంగా చెప్తున్నారు. కంపెనీలు వొస్తే, ఉజ్జోగాలొస్తాయి. హోటళ్ళు, లాడ్జింగులు, బిల్డింగ్లు, రోడ్లుతో ప్రాంతం రూపురేఖలే మారిపోతాయ్ అంటన్నారు. సూరపు నాయుడికే ఏమీ తోచడం లేదు. నిలబడినవాడు, నడుస్తూ – ‘‘నాకు రైత్వారీ పని తప్ప, ఇంకొక పని రాదుగదా’’... అన్నాడు దిగాలుగా. ∙∙∙కొద్ది రోజులకు సూరపునాయుడు భయపడ్డట్టుగానే పొలాలను పరిశీలించిన వారు పొలాలను ఏదో కర్మాగారం కోసం తీసుకున్నారు. రైతులు కొన్నాళ్లు వ్యతిరేకించారు. పోరాడేరు గాని, కొసకు భూములు ఇవ్వక తప్పలేదు. మేనమామ చిన్న కొడుకు చెప్పినట్టే సూరపు నాయుడు ఆడపిల్ల పెళ్లి చేసి, తరవాత కొడుకుని పట్టుకొని హైదారాబాద్ వెళిపోయాడు. మిగిలిన సొమ్ము ఆటో కొనడానికి చాలలేదు, కొంత ఫైనా¯Œ ్స వాడేడు. కొడుకు ఆటో తిప్పుతూ ఫైనా ్స నక్షత్రకుడికి కిస్తీలు కడుతున్నాడు. సూరపు నాయుడు రకరకాల కూలిపనులు చేస్తూ చివరికి ఒక కోటీశ్వరుని ఇంటనున్న రెండు కుక్కల ఆలనా పాలనా చూడడానికి కుదురుకున్నాడు. పొద్దున్న ఏడో గంటకి ఆ కోటీశ్వరుని ఇంటికి చేరితే, రెండు కుక్కలూ రెడీగా ఉంటాయి షికారుకి. షికారుకి వెళ్ళినపుడే అవి ఒంటికీ, రెంటికీ కానిస్తాయి. సూరపు నాయుడే వాటిని శుభ్రం చేయాలి. రెండూ నాయుడి భుజాల దగ్గరకు ఉంటాయి. నాయుడి కంటే బలంగా ఉంటాయి. ఉండవా మరి? అవి తినేవో? మన్లాగా అంబలీ, గెంజీ తాగుతాయేటి? అనుకున్నాడు నాయుడు. తొలినాళ్ళల్లో నాయుడు వాటిని తిప్పడానికి నానా అవస్థలు పడ్డాడు. వాట్ని చూసి భయపడ్డాడు. ‘బేపుల్లాగా లేవివి, బెమ్మ రాచ్చసుల్లాగ వున్నాయి’ అనుకునీవోడు. రాన్రాను మచ్చికయినాయి. కోటీశ్వరుని ఇంటిలో విని నేర్చుకున్న ఇంగ్లీషు పదాలతో... ‘కమాన్, గో,గో, వెయిట్, వెయిట్’ వంటి ఆర్డర్లు వేస్తున్నాడు. షికారుకి కుక్కల్ని తీసుకు వెళ్ళే సమయంలో ఆపుడపుడూ వాటితో ఊసులాడుతుంటాడు. అవి కూడా సూరపు నాయుడి ‘ఊరు ఎలా ఉంటుంది? నగరంలా బాగుంటుందా? అన్నీ పూరిపాకలేనా,పెద్ద,పెద్ద భవంతులుంటాయా? అక్కడ మాలాంటి డాగ్స్ ఉంటాయా?’ అని ప్రశ్నించేవి. సూరపు నాయుడికి ఆ ప్రశ్నలకు జవాబులు చెప్తుంటే పల్లెకూ, నగరానికీ మధ్య అంతరం తెలిసొచ్చేది. దాంతో విచారంగా మౌనంగా నడిచేవాడు. మౌనంగా నడిచే నాయుడిని – ‘మీ ఊరిలో మాలాటి డాగ్స్ లేవుకదా’, ఉండబోవన్న ధీమాగా ప్రశ్నించేవి ఆ కుక్కలు.అప్పుడు... ‘మా ఊరిలో మిమ్మల్ని డాగ్స్ అనరు. బేపులు అంటారు’... అని చెప్పి, తమ ఊరి బేపులెలాగుంటాయో, ఎంత మంచివో, ఇళ్లనీ, ఊరినీ ఎలాగ కాపలా కాస్తాయో చెప్పేవాడు. వాటిని మనుషులు ఎవులో తిప్పక్కర లేదనీ, అవే తిరగతాయనీ, తిండీ ఒకలెవులో తెచ్చి పెట్టక్కర లేదనీ, అవే సంపాయిస్తాయనీ... చెప్పేవాడు. అపుడు ఆ కుక్కలు నిసాకారంగా సూరపు నాయుడి వేపు చూసి – ‘మీ వూరి వాళ్ళు వాటికి తిండీ, తిప్పలు చూడరా? ఏం మనుషులోయ్’ అననేవి. ‘మా వూళ్ళంట బేపులకి మెడలకి బెల్టులు, గొలుసులూ కట్టరు. ఫ్రీగా వొదిలేస్తారు. ఆటి ఇష్టం ఇళ్ళల్లోకి దూరతాయి, వీధుల్లో తిరగతాయి, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎళ్తాయి, కట్టడి వుండదాటికి. సిత్త కార్తే వొచ్చిందంటే ... సూడాల ఆటి బాగోతం’ అననేవాడు. ఆ కుక్కలకు ఆ బాగోతం ఏమిటో తెలీలేదు గానీ, ఈ నాయుడోడు వాడి వూరి బేపులు తమ కంటే గొప్పవి సుమా అని తమకు చెప్తున్నాడని భావించి, చిరాకెత్తి, కోపగించి, భౌభౌభౌ అని అరచి తమ నిరసన తెలియ జేసేవి. ∙∙∙కొన్నాళ్ళకు నగరంలో బతకటానికి అలవాటుపడ్డాడు సూరపు నాయుడు. నగరం భయపెట్టటం లేదు. భద్రం కొడుకో అని హెచ్చరిక చేస్తోంది. కిక్కిరిసిన జన సమూహంలో ఒంటరివే సుమా అన్న ఎరుకను కలిగించింది. ఒంటరితనం పోగొట్టుకోడానికి అపుడపుడూ తన మేనమామ చిన్నకొడుకుని కలుస్తుంటాడు. ఇద్దరూ కాసేపు తమ గత జీవనాన్ని, తమ తాత, ముత్తాతల తరతరాల జీవనాన్ని ఎరిగిన మేరకు కలబోసుకుంటారు. తామే కాక తమ ప్రాంత జనులంతా శాపగ్రస్తులనీ, ఒడ్డు కనిపించని ప్రవాహంలో ఈదులాడే వాళ్ళనీ... తమ ప్రాంతం చిరకాల శోకగర్భ ప్రాంతమని చింతిస్తారు.కడుపులు కెరలిపోతాయి. ఊరట కోసం సారా కొట్టు చేరుతారు. అపుడపుడూ వీరికి తోడు వీరిలాగే వలస వచ్చిన వాళ్ళు ఎవరో తోడవుతారు. వాళ్లూ లోపలి శోకాన్ని వెళ్లగక్కుతారు... అవెంతో గొప్ప అడివిలున్నాయి. సాగరతీరమా ఎక్కవే వుంది, సారవంత బూములున్నాయి... ఎందుకు మనం ఇలగ వొలసలు రావలసొచ్చింది? ఎందుకు? అక్కరకు రాని కంపెనీల బదులు నదులకి ఆనకట్టలు, పంటలకి కిట్టుబాటు ధరలందితే, జనప, చెరకు వంటి పంటల మీద మిల్లులెడితే మనకీ దుర్గతి రాదుగదా – అని విలపిస్తారు.మద్యపాన దుకాణాల్లో కడుపుల్లోకి మద్యం వెళ్తుంది, గానీ, లోపలి దుఖం బయటకు వెళ్ళదు. మత్తు ఎక్కినా, నొప్పి ఏదో మోస్తూ, తూలుతూ ఇళ్ళు చేరుతారు.అయిదేళ్లు గడిచిపోయాయి. ఎన్నికల ప్రకటన వచ్చింది. తమలాగా నగరానికి వలస వచ్చిన వారికోసం పోటీ చేసిన ప్రధాన పార్టీల వారు బస్సులు వేశారు. వోట్ల కోసం సరఫరా చేయాల్సినవన్నీ చేశారు. ఆ బస్సుల్లో సూరపు నాయుడి కుటుంబమే కాక, ఆ ప్రాంతపు కుటుంబాలు మరికొన్ని ప్రయాణించాయి. ఆ కుటుంబాలు చీపురుపల్లి, రణస్థలం, భోగాపురం తదితర ప్రాంతాల నుండి వలస వచ్చినవి. ప్రయాణం మధ్యలో భోజనాలకు ఆగినపుడు మరికొన్ని బస్సుల్లో మరికొన్ని కుటుంబాలు కలిశాయి. అవి అటు పార్వతీపురం పరిసరాల నుండి ఇటు అనకాపల్లి, చోడవరం, అరకు ప్రాంతాల నుండి వచ్చినవి. కళింగం అంతా దాదాపు వలసలు పోయిందా ఏటి అన్పించింది సూరపు నాయుడికి. ఓటు వేశాక వెంటనే బయల్దేరలేదు. రెండు రోజులు వుండిపోయాడు. ఫ్రీ బస్సులు వెలిపోయాయి. స్వంత వూరిలో ఒకరోజు వున్నారు..స్వంత వూరు రూపు రేఖలు మారిపోయాయి, ఊరినిండా ఏవేవో బిల్డింగులు, దుకాణాలు, ఆఫీసులు... ఒంటినిండా పచ్చబొట్లు పొడుచుకున్న అమ్మవారిలా వుంది ఊరు. పరాయి ఊరులా అన్పించీ, మరసటి రోజే కూతురి వూరు వెళిపోయారు.కూతురి ఊరు ఉద్దాన ప్రాంతం. అరటి, కొబ్బరి, పనస, జీడి తోటలతో ఆకుపచ్చగా ఉంటుంది. కూతురి అత్తవారికి ఒక ఎకరా తోట వుంది. అత్త, మామలు ఉన్నారు. రెండు గదుల ఇల్లుంది. అల్లుడు కష్టజీవి. తోట మీద ఫలసాయంతో ఇబ్బందులు లేకుండా బతుకుతున్నారు. కూతురికి మూడేళ్ళ కొడుకు. ఇపుడు గర్భిణీ. పలాసలో ఏవో స్వీట్స్, పళ్ళు కొని తీసుకు వెళ్లారు. రాత్రివేళ భోజనాలయ్యాక కూతురి కాపురం బాగుందని సంతోషించిన సూరపు నాయుడు – ‘‘ఎంతయినా మీ ఉద్దానం మా మడక కంటే శ్రేష్టమైనిది’’ అనన్నాడు. ‘‘నిజిమే గాని, ఇక్కడి బతుకులూ గాలిలో దీపాలే మామా, చేతులు అడ్డుబెట్టి దీపాలు ఆరకుండా సూస్తన్నాం’’ అని బదులిచ్చాడు అల్లుడు. కలుక్కుమన్నాది సూరపునాయుడి గుండె. ‘‘తుఫానులు, మార్కెట్లూ దెబ్బగొడతన్నా కాసుకుంటన్నాంలే’’ అనన్నాడు అల్లుడు. ఆ మాటతో కాస్త ఊరట చెందాడు నాయుడు.ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. మరో ఏడాది గడిచింది. రోజు పొద్దుటి పూట. కోటీశ్వరుని కుక్కలకు ఫుడ్ పెడుతుండగా సూరపు నాయుడికి ఫోన్ వచ్చింది.జేబులో ఫోన్ తీసి – అలో అన్నాడు ‘..నీను మామా...’ అన్నాడు అల్లుడు అవతల నుంచి ‘... నువ్వా? బాగున్నావా నాయినా? మాయమ్మీ,పిల్లలూ బాగున్నారా? ‘...ఆ, ఆ, అంతా బాగున్నాం, గానీ...’‘...ఆ..కానీ..?’ఆందోళనగా అడిగాడు సూరపునాయుడు. ‘మేమూ అక్కడకి వలస వొచ్చేస్తాము. మీకు తెలిసిన వోరి దగ్గిర ఏదేనా పని చూడు మామా, వొచ్చేస్తాము...’ ‘...వొచ్చెత్తారా? ఏమీ? మీ తోటలూ, దొడ్లూ ఏటి చేస్తారు?’ ‘...ఏదో పెద్ద కంపెనీ వొస్తందట, ఇంకోపక్క విమానాశ్రయం కడతారట... ఆటికి భూమి కావాలగదా? దగ్గిర, దగ్గిర మా మడకల నాలుగైదు ఊళ్లు ఖాళీ అయిపోతాయి... తొందరగా ఏదేనా పని చూడు మామా...’ ఎలుగుగొడ్డు ఏదో గోళ్ళతో తన గుండెను రక్కినట్టన్పించింది సూరపునాయుడికి. అల్లుడికి ఏమి చెప్పాలో తెలీక, మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలోనే యజమాని వచ్చి, ఏదో పేకెట్ చేత్తో పరిశీలిస్తూ – ‘‘ఓయ్, నాయుడూ, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పేకెట్ తెచ్చీసావోయ్. ఇది డాగ్స్కి పెట్టకు సుమీ. షాప్ వాడికి రిటనిచ్చేయి’’ అనన్నాడు. నాయుడికి అర్థం కాలేదు. అవతల ఫోన్లో అల్లుడు ఏదో చెప్తున్నాడు, అయోమయంగా చూశాడు యజమాని వేపు. ‘‘...ప్రతీ దానికీ కొన్నాళ్లే గడువు వుంటుంది..’’ అని యజమాని పేకెట్లో తేదీని చూపి – ‘‘ఈ తేదీ దాటినాక ఇది వాడకూడదు... వాడితే డేంజర్’’ అని విడమరిచాడు.యజమాని వివరణ, అల్లుడి సంభాషణ, నాయుడి మనసులో ప్రశ్నలు రేపాయి. –‘ఈ ఎక్స్పైరీ డేట్ అనేది మాకూ, మా వలస బతుకులకీ ఉండదా?’ నిజానికి సూరపు నాయుడు మనసులో ఆ ప్రశ్న అనుకున్నాడు కాని, అసంకల్పితంగా నోటి నుండి బయటకి వచ్చేసింది. ఆ యజమానికి ఏమీ అర్థం కాలేదు. ‘‘ఏమిటోయ్ నాయుడూ? ఏమంటున్నావ్?’’ అని ప్రశ్నించాడు.శోకంతో పూడుకు పోయిన సూరపు నాయుడి గొంతు పెగలలేదు, మౌనంగా ఉండిపోయాడు. కొన్నాళ్ళకు నగరంలో బతకటానికి అలవాటుపడ్డాడు సూరపు నాయుడు. నగరం భయపెట్టటం లేదు. భద్రం కొడుకో అని హెచ్చరిక చేస్తోంది. కిక్కిరిసిన జన సమూహంలో ఒంటరివే సుమా అన్న ఎరుకను కలిగించింది. -
ఆహ్వానించి అపహరణ!
వీరారెడ్డి పేరుతో ఇల్లు, ఇల్లాలు, వాహనం, జైల్లో పరిచయమైన అనుచరులను సిద్ధం చేసుకున్న గౌరు సురేష్– ఆ తర్వాత ఎవరిని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలనేది ఆలోచించాడు. ఏమాత్రం ఇబ్బంది, హడావుడి లేకుండా పని జరగాలంటే, హైదరాబాద్కు చెందిన వారు కాకపోతేనే ఉత్తమమని భావించాడు. తన ‘భార్య’తో తిరుమలకు వెళ్లిన గౌరు సురేష్ అక్కడి నుంచి తిరిగి వస్తూ తిరుపతికి చెందిన వ్యాపారి గంగయ్యను టార్గెట్గా చేసుకున్నాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఓ డ్రైఫ్రూట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దానికి అతడే వైస్ ప్రెసిడెంట్గా మారి, విజిటింగ్ కార్డులు సిద్ధం చేసుకున్నాడు. మరోసారి తిరుపతి వెళ్లిన సురేష్– గంగయ్యను కలిసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. త్వరలో హైదరాబాద్లో డ్రైఫ్రూట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నానని, తప్పకుండా రావాలని చెప్పి ఆహ్వానపత్రం అందించాడు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని గంగయ్య దీనిని మరచిపోయాడు. కిడ్నాప్ పథకాన్ని అమలులో పెట్టడానికి సురేష్– గంగయ్య పేరుతో తిరుపతి నుంచి హైదరాబాద్కు విమానం టిక్కెట్, తాజ్ కృష్ణలో ఓ గదిని బుక్ చేశాడు. ఎగ్జిబిషన్ పేరుతో ఆహ్వానపత్రిక ముద్రించి, ఇవన్నీ కొరియర్ ద్వారా గంగయ్యకు పంపాడు. గంగయ్యకు సురేష్ ఫోన్ చేసి, తప్పకుండా రావాలని, ఎయిర్పోర్టుకు కారు పంపిస్తానని చెప్పాడు. దీంతో గంగయ్య తాను హైదరాబాద్ వచ్చేటప్పుడు వీరారెడ్డి అవతారంలో ఉన్న సురేష్కు చెప్పాడు. గంగయ్య వచ్చేరోజు వెంకటరెడ్డి వద్దకు వెళ్లిన సురేష్, భార్యతో కలసి బయటకు వెళ్లడానికంటూ కారు తీసుకున్నాడు. ఆ కారులో విమానాశ్రయానికి వెళ్లి, గంగయ్యను రిసీవ్ చేసుకున్నాడు. ఎగ్జిబిషన్ పనుల్లో తలమునకలై ఉన్నానని, ఉప్పల్లో చిన్న పని చూసుకుని వెళ్దామని సురేష్ నమ్మబలికాడు. అలా అతడిని వారాసిగూడలోని మల్లారెడ్డి ఫ్లాట్కు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న గ్యాంగ్కు గంగయ్యను అప్పగించి, తాను చెప్పే వరకు జాగ్రత్తగా చూసుకోవాలంటూ తన ఫ్లాట్కు వెళ్లిపోతూ వెంకట్రెడ్డికి కారు అప్పగించేశాడు. గంగయ్య నుంచి అతడి సోదరుడి ఫోన్ నెంబర్ తీసుకున్న సురేష్, ‘మీ అన్నను కిడ్నాప్ చేశామని, విడిచిపెట్టాలంటే రూ.30 లక్షలు ఇవ్వాల’ని డిమాండ్ చేశాడు. విషయం ఏమాత్రం బయటకు వచ్చినా హైదరాబాద్ శివార్లలో గంగయ్య శవం పడి ఉంటుందని భయపెట్టాడు.ఈ ఫోన్ కాల్తో భయపడిన గంగయ్య సోదరుడు విషయం పోలీసులకు చెప్పకుండా, డబ్బు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. డబ్బు సిద్ధం చేసుకోవడానికి అతడు రెండుమూడు రోజుల పాటు పలువురిని సంప్రదించాడు. ఇలా విషయం బయటకు రావడంతో చిత్తూరు పోలీసులు రంగంలోకి దిగి, గంగయ్య సోదరుడి నుంచి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించారు. అయితే తన సోదరుడికి హాని జరుగుతుందనే భయంతో విషయం పోలీసులకు చెప్పడానికి గంగయ్య సోదరుడు వెనుకాడాడు. దీంతో అతడి కదలికలపై పోలీసులు నిఘా వేసి ఉంచారు.తన అన్నను విడిపించుకోవడానికి రూ.30 లక్షలు సిద్ధం చేసిన గంగయ్య సోదరుడు ఫోన్ చేసి సురేష్కు విషయం చెప్పాడు. ఎవరికీ చెప్పకుండా ఒక్కడివే బయలుదేరి రావాలని, భారత్ ట్రావెల్స్ బస్సులో సీట్ నెం.17 బుక్ చేసుకోవాలని, జడ్చర్ల వద్ద బస్సు దిగిపోవాలని సూచనలు ఇచ్చాడు. ఏమాత్రం తేడా వచ్చినా గంగయ్య ప్రాణాలతో ఉండడని బెదిరించాడు. గంగయ్య సోదరుడు అదే బస్సులో అదే సీటు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. విషయం తెలిసిన చిత్తూరు పోలీసులు– అదే బస్సులో వెళ్లి, కిడ్నాపర్లను పట్టుకోవడానికి ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు టికెట్లు బుక్ చేశారు. గంగయ్య సోదరుడు, ఈ ముగ్గురు పోలీసులు ఒకే బస్సులో బయలుదేరారు. తనను అనుసరిస్తూ పోలీసులు వస్తున్న విషయం గంగయ్య సోదరుడికి తెలీదు. అదే రోజు రాత్రి మరోసారి వెంకట్రెడ్డి వద్దకు వెళ్లే సురేష్ మళ్లీ భార్యతో ట్రిప్ అంటూ ఇండికా కారు తీసుకున్నాడు. గంగయ్య సోదరుడు ప్రయాణిస్తున్న భారత్ ట్రావెల్స్ బస్సు జడ్చర్లకు చేరుకునే సమయానికి సురేష్ కారుతో సçహా అక్కడ సిద్ధంగా ఉన్నాడు. బస్సు అక్కడకు చేరుకున్నాక గంగయ్య సోదరుడు బ్యాగ్ పట్టుకుని దిగడంతో, అది గమనించిన ఎస్సై కూడా అతడితో పాటు కిందికి దిగారు. అతడిని చూడగానే పోలీసు అని గుర్తించిన సురేష్, దృష్టి మళ్లించడానికి క్షణాల్లో మరో పథకం వేశాడు. ఆ పోలీసుని ఉద్దేశించి ‘మీరూ హైదరాబాద్ వెళ్లాలా..? లగేజీ తెచ్చుకోండి’ అని చెప్పాడు. ఎదుటి వారికి తనపై అనుమానం రాకూడదని భావించిన సదరు ఎస్సై తన బ్యాగ్ తీసుకువచ్చి కారు ఎక్కాలని భావించారు. బ్యాగ్ కోసం బస్సు ఎక్కగా, అప్పటికే కింద ఉన్న గంగయ్య సోదరుడిని కారులో ఎక్కించుకున్న సురేష్ రాంగ్ రూట్లో ఉడాయించాడు. ఈ పరిణామంతో కంగుతిన్న చిత్తూరు పోలీసులు విషయాన్ని తమ ఉన్నతాధికారులకు చెప్పారు. చిత్తూరు పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగింది. అయితే అప్పటికే గంగయ్య సోదరుడి నుంచి డబ్బు తీసుకుని, అతడిని శంషాబాద్ వద్ద వదిలేసిన సురేష్ నేరుగా వనస్థలిపురం వెళ్లిపోయాడు. కారు వెంకట్రెడ్డికి అప్పగించిన తర్వాత ‘తన భార్య’కు పేమెంట్ సెటిల్ చేసి పంపించేశాడు. డీసీఎం వ్యాన్లో ఫ్లాట్లోని సామాను మొత్తం సర్దుకుని, మల్లారెడ్డిని సంప్రదించి, ‘ప్యాకేజ్’ని వదిలేసి నాంపల్లికి రావాలని చెప్పాడు. గంగయ్యను తీసుకుని బయలుదేరే మల్లారెడ్డి గ్యాంగ్ అతడిని ఎంజీబీఎస్ వద్ద వదిలేసి, ఖర్చుల కోసం రూ.10 వేలు ఇచ్చింది. వీళ్లు నాంపల్లికి చేరుకునేసరికి సురేష్ డీసీఎంలోని ఇంటి సామాను మొత్తం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేసి, సిద్ధంగా ఉన్నాడు. మల్లారెడ్డి గ్యాంగ్కు కొంత మొత్తం ముట్టజెప్పి, అక్కడ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గంగయ్య, అతడి సోదరుడు బతుకు జీవుడా అనుకుంటూ తిరుపతి చేరుకున్నారు. ఈ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు మల్లారెడ్డితో పాటు మిగిలిన గ్యాంగ్ను పట్టుకుని చిత్తూరు పోలీసులకు అప్పగించారు. అయితే సురేష్ మాత్రం చిక్కలేదు. తన నేర పరంపరను కొనసాగిస్తూ 2006 సెప్టెంబర్ 13న జూబ్లీహిల్స్కు చెందిన వ్యాపారవేత్త జి.కృష్ణంరాజును ఆయన పెంపుడు శునకంతో సహా కిడ్నాప్ చేశాడు. ఈ కేసులో అరెస్టు అయినప్పుడే, గంగయ్య కిడ్నాప్ స్కెచ్ బయటకు వచ్చింది. ఇలాంటి అనేక నేరాలు చేసిన గౌరు సురేష్ 2008 జూలై 18న బేగంపేటలోకి ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. (సమాప్తం) -
నేరము శిక్ష
ఆ చీకటి కేబిన్ లోని ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. దైవజ్ఞ తన చేతి గడియారాన్ని చూసుకుని లేచాడు. రో 23జి సీట్కి చేరుకుని, అందులో కూర్చుని గాఢనిద్రలో ఉన్న ఏభైపైబడ్డ ఆవిడ మెడ కింద, డిన్నర్తో ఇచ్చిన స్టీల్ కత్తితో కసుక్కున అడ్డంగా కోశాడు. ఆవిడ మెలకువ వచ్చి చిన్నగా కేకపెట్టింది. రక్తం చిందింది. కాని పూర్తిగా తెగలేదు. మరోసారి, ఇంకోసారి. గరగర శబ్దంతో పాటు ఆ మెడలోంచి ఎర్రటి గాలి బుడగలు బయటికి వచ్చాయి. దైవజ్ఞ ఆవిడ సీట్ మీది రీడింగ్ లైట్ని వెలిగించి, కాల్ బటన్ ని నొక్కాడు. నిమిషంలో ఏర్హోస్టెస్ అక్కడికి వచ్చింది. రీడింగ్ లైట్లో ఆవిడ మెడ నించి తల అతి అసహజ రీతిలో పక్కకి వేలాడటం, ఆవిడ ఛాతీ రక్తంతో తడిసి ఉండటం చూసి ఆమె భయంగా రెండు అడుగులు వెనక్కి వేసింది. దైవజ్ఞ ఆమెకి మడిచిన కాటన్ నేప్కిన్ ని ఇచ్చి చెప్పాడు.‘‘నేనే చంపాను. ఇది హత్యాయుధం.’’అయోమయంగా చూసే ఆమె తన చెవులని తనే నమ్మలేకపోయింది.‘‘మీ పైలెట్కి ఈ విషయం చెప్పండి. లాగ్ బుక్లో రాస్తారు.’’ అతను శాంతంగా చెప్పాడు.ట్రాన్ ్సలో ఉన్నట్లుగా ఆమె కాక్పిట్లోకి వెళ్ళింది. గజ గజ వణుకుతూ వగరుస్తూ మధ్య మధ్యలో ఆపి చెప్పింది.‘‘సీట్ 23జిలోని లేడీ మెడ తెగింది. ఒకతను తనే చంపానని, ఇందులో కత్తి ఉందని చెప్పి ఇచ్చాడు.’’‘‘నువ్వు చూస్తూండు.’’ తక్షణం కెప్టెన్ లేస్తూ ఫస్ట్ ఆఫీసర్తో చెప్పాడు.ఇద్దరూ 23 జి దగ్గరకి వచ్చారు. దైవజ్ఞని ఇద్దరు ప్రయాణికులు కదలకుండా చేతులు బిగించి పట్టుకున్నారు.‘‘కెప్టెన్ . నా పేరు దైవజ్ఞ. నన్ను వదలమని చెప్పండి. తలుపు తెరుచుకుని పారిపోతానా?’’ దైవజ్ఞ నవ్వుతూ సూచించాడు.‘‘ఇతను ఈవిడని పొడవడం నేను చూశాను. ఇదే వరుసలో లేప్టాప్లో పని చేసుకుంటున్నాను.’’ ఒకడు చెప్పాడు.‘‘ఎందుకు చంపావు?’’ హతురాలి మీద దుప్పటిని కప్పుతూ కెప్టెన్ అడిగాడు.‘‘ఇక్కడ చంపితే నాకు శిక్ష పడదని.’’‘‘నువ్వు నేరాన్ని ఒప్పుకున్నావు. సాక్షులు కూడా ఉన్నారు. ఎందుకు శిక్ష పడదు?’’ కెప్టెన్ అడిగాడు.‘‘నా నేరానికి నన్ను ఎవరు శిక్షిస్తారు?’’ దైవజ్ఞ ప్రశ్నించాడు.‘‘మన విమానం షికాగోలో దిగగానే అక్కడి పోలీసులు.’’‘‘వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే ఫాల్స్ అరెస్ట్కి వాళ్ళ మీద నష్టపరిహార దావా వేస్తానని కూడా చెప్పండి. చూస్తూండండి. నేను స్వేచ్ఛగా తిరుగు విమానంలో వెళ్ళిపోతాను.’’అతను పిచ్చివాడని అనుమానించిన కెప్టెన్కి కాదని, మేధావి అయుండొచ్చని అనిపించింది. చాలామంది ప్రయాణికులు లేచారు.‘‘ఈ లేడీ విలన్ ని చంపటానికి నేను ఈ ప్రదేశాన్ని, ఈ సమయాన్ని ఎన్నుకున్నాను కెప్టెన్. ప్రపంచంలో ఎవరూ నా నేరానికి శిక్షించలేరు. అందుకు సాంకేతికతలు అడ్డు వస్తాయి.’’ దైవజ్ఞ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.‘‘సాంకేతికతలా? ఏమిటవి?’’ ప్రయాణికుల్లోని ఒకరు ప్రశ్నించారు.‘‘నన్ను ఈ నేరానికి అరెస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. చేస్తే నన్ను ఎక్కడ విచారిస్తారు?’’‘‘ఇండియాలో. నేను లాయర్ని.’’ ఒకరు చెప్పారు.‘‘మీరు మళ్ళీ లా క్లాస్లో చేరండి లాయర్గారు. నేరం ఇండియా భూభాగం మీద జరగలేదు. ఇది ఇండియా విమానం తప్ప ఇండియన్ కన్సులేటో లేదా ఎంబసీనో కాదు. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో, ఆకాశంలో ఈ నేరం జరిగింది. నేరం జరిగిన స్థలం నుంచి రెండు వందల నాటికల్ మైల్స్లో ఏ దేశం లేదు. ప్రపంచంలోని ఏ దేశానికి జ్యూరిస్డిక్షన్ లేని చోటుని ఎంచుకుని మరీ ఈవిడని చంపాను.’’ దైవజ్ఞ చిరునవ్వుతో చెప్పాడు.‘‘ఎందుకు చంపారు?’’ ఏర్హోస్టెస్ ప్రశ్నించింది.‘‘ఈవిడ న్యూరాలజిస్ట్. హైద్రాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో సంవత్సరానికి కోటి రూపాయల పేకేజ్తో పని చేస్తోంది. అంత జీతం పొందటానికి ఆవిడకి నెలకి హాస్పిటల్కి ఎంత సంపాదించి పెట్టాలో టార్గెట్స్ ఉంటాయి. నా భార్యకి బ్రెయిన్ ట్యూమర్. మరణం తథ్యమని తెలిసీ హాస్పిటల్లో చేర్పించమంది. ఎన్ని టెస్టులు రాసిందో! పన్నెండు రోజులకి ముప్ఫైరెండు లక్షల బిల్ని సొంత ఇంటిని అమ్మి కట్టాను. నేను ఓ ఫేక్టరీలో టర్నర్ ఉద్యోగం చేస్తున్నాను. ఈవిడ వల్ల మా ఆవిడతో పాటు నాకు నిలువ నీడ కూడా పోయింది. నా భార్యకి ఇచ్చిన మందుల సైడ్ ఎఫెక్ట్ల వల్ల తిన్నది తిన్నట్లుగా వాంతైపోయి, ఎప్పుడూ మైకంలో ఉండేది. మా ఆవిడ బతకదని తెలిసీ మభ్యపెట్టి నన్ను దోపిడీ చేసింది. ఆ శిక్ష పడని నేరానికి, నేనూ శిక్ష పడకుండా ఈవిడని ఎలా చంపాలా అని చాలా రీసెర్చ్ చేసి, ఆవిడ విమాన ప్రయాణం కోసం ఏడు నెలలుగా వేచి చూస్తున్నాను. ఇక్కడ నా పగ తీర్చుకున్నాను. షికాగోలో దిగాక తిరిగి విమానంలో మళ్ళీ హైద్రాబాద్ వెళ్ళిపోతాను. ప్రపంచంలోని అన్ని దినపత్రికలు నా గురించి రేపు రాస్తాయని పందెం.’’ ‘‘నీ పథకంలో ఓ ఎదురుచూడని భాగం కూడా ఉంది.’’ అతన్ని పట్టుకున్న వ్యక్తి నెమ్మదిగా చెప్పాడు.‘‘ఏమిటది?’’‘‘ఇది. నీకెంత పగ ఉందో నాకు అంతే పగ ఉంది. ఇక్కడ జరిగిన నేరానికి నీకులా నాకూ శిక్ష పడదు.’’ చెప్పి అతను ఓ సిరంజిలోని నీడిల్ని చటుక్కున దైవజ్ఞ భుజంలో గుచ్చి ఇంజెక్ట్ చేశాడు.దైవజ్ఞ తల పక్కకి వాల్చగానే ప్రయాణికులు మరోసారి దిగ్భ్రాంతి చెందారు.‘‘మీరెవరు?’’ కెప్టెన్ అడిగాడు.‘‘ఆవిడ మా అమ్మ.’’ అతను కూడా దైవజ్ఞ అంత శాంతంగా జవాబు చెప్పాడు.‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ శీర్షిక పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
ఆటో ఆపద్బాంధవి!
‘ఓహో.. ఈ చెన్నై అర్ధరాత్రి వీ«థుల్లో ఒంటరిగా ఏలారా వెళ్లడం!’ అని మీరు ఆలోచిస్తున్న సమయానికే, పసుపు, ఆకుపచ్చ ఆటో ఒక సూపర్ హీరో ఎంట్రీ ఇచ్చినట్టుగా బ్రేక్ వేసి మీ ముందుకు ఆగుతుంది. అదే మన రాజి అక్క!రాజి అక్కకి ఆటో అంటే వాహనం మాత్రమే కాదు, అది ఒక ఇల్లులాంటిది. అంతకంటే, ఎక్కువగా ఆ ఆటోలో ప్రయాణం కొండంత భరోసా, భద్రత! ఇరవై ఏళ్లకు పైగా ఆటో నడుపుతున్న ఆమె, ఒక డ్రైవర్ మాత్రమే కాదు; వేలమంది మహిళలకు రక్షకురాలు, ఆపద్బాంధవురాలు కూడా! ఒక భయంకరమైన ఘటన తన కళ్ల ముందే జరగడం చూసి, నిర్ణయించుకుంది ‘ఇకపై ఒక్క మహిళ కూడా భయపడుతూ ఇంటికి చేరకూడదు’ అని. అప్పటి నుంచి ఆమె ఆటో చక్రాలు కేవలం మీటరు చూపించడం మాత్రమే కాదు; భద్రత, స్నేహం, మనసులో నమ్మకం కూడా అందిస్తున్నాయి. ఆమె ఆటోలో కూర్చుంటే అందులో ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాటర్ బాటిల్, బిస్కట్ ప్యాకెట్, సానిటరీ న్యాప్కిన్ అలా అలా! చాలా కనిపిస్తాయి. అప్పుడు అడుగుతారు ‘అక్కా, నువ్వు డ్రైవరా లేక ట్రావెల్ మమ్మీనా?’ అని, దానికి అక్క నవ్వుతూ ‘ఇవి ఉంటే ఎవరికైనా కష్టంలో ఉపయోగపడతాయి. అంతే, సేల్స్ కాదు, ప్రమోష¯Œ ్స కాదు మచ్చీ!’ అని చెబుతుంది. ఇలా ఆడుతూ పాడుతూ రోజుకు ముప్పై ట్రిప్స్ పూర్తి చేసి, శరీరం అలసిపోయినా సరే, అర్ధరాత్రి ఎవరో ఒక అమ్మాయి కాల్ చేస్తే? రాజి అక్క వెంటనే ఆటో స్టార్ట్ చేస్తుంది. ‘మహిళలు సేఫ్గా ఇంటికి చేరితేనే నాకు నిద్ర వస్తుంది’ అంటుంది. అంతేకాదు సీనియర్ సిటిజన్ ఎక్కితే ఫ్రీ. పిల్లాడు స్కూల్కి ఆలస్యమైతే ఫ్రీ. ఎవరికైనా సడెన్ ఎమర్జెన్సీ అయితే ‘మీటర్ ఆఫ్, హాస్పిటల్ ఆన్!’ ఇంతా చేస్తుంది తన ఖాళీ సమయంలో కాదు, తన జీవిత పోరాటంలో భాగంగానే!ఆమె కష్టాలకు కుటుంబమే సాక్ష్యంరాజి అక్కకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇంజినీర్ అయ్యాడు, కూతురు నర్సింగ్ చదువుతోంది. భర్త అనారోగ్యం వల్ల పని మానేశాడు. అప్పటి నుంచి ఈ ఆటోనే వారికి అన్నం పెడుతోంది. కానీ రాజి అక్క ధైర్యం ముందు ఇవేమీ ఇబ్బంది కాలేదు. ‘ఈ చక్రాలు తిరిగేంత వరకు నా ఫ్యామిలీకి ఏ భయం లేదు’ అని గర్వంగా చెబుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘ఎనయుమ్ కైకల్’ అనే మహిళా ఆటో డ్రైవర్ల గ్యాంగ్ లీడర్ కూడా రాజి అక్కే! ఆమె ఆటోకి పంక్చర్ అయితే, ఐదు ఆటోలు సూపర్ ఫాస్ట్గా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టయిల్లో వచ్చేస్తాయి. మరెంతోమందికి ఉచిత డ్రైవింగ్ క్లాసులు కూడా ఇస్తుంది. ఆటో నడపడం నేర్చుకోవాలనుకునే మహిళలకు ఆమె గురువు. ప్రస్తుతం అక్క ఆటో ప్రయాణ కథలను విన్నవారంతా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని నగరాల్లోనూ ఇలాంటి అక్క ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. ఎందుకంటే, రాజి అక్క డ్రైవర్ మాత్రమే కాదు ఆపదలో ఆదుకునే అక్క, అమ్మ, ఫ్రెండ్, బాడీగార్డ్ అన్నీ. నారీ భగీరథ! కర్నాటకలోని సిర్సి దగ్గర ఒక చిన్న గ్రామం. అక్కడ ఒకప్పుడు నిత్యం నీటి కొరత, ఎండిన పంటలు, దాహంతో అలమటిస్తున్న జీవులు కనిపించేవి. అలాంటి సమయంలో చాలామంది ‘ఎవరైనా వచ్చి పరిష్కరిస్తారు’ అని చేతులెత్తేసి కూర్చుంటే, యాభై మూడు ఏళ్ల గౌరి నాయక్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. తన పంటలు పచ్చగా మారాలని తపనతో ముందడుగు వేసింది. స్వయంగా తన చేతులతో బావి తవ్వడం మొదలుపెట్టింది. యంత్రాలు లేవు, సహాయం లేదు, కేవలం ఒక గిలక, తాడు, బకెట్ మాత్రమే. రోజూ ఆరు గంటలపాటు కష్టపడి, ఆరు నెలల పాటు శ్రమించింది. పక్కవాళ్లు ‘ఇది అసాధ్యం’ అన్నారు. కాని, గౌరి మాత్రం ఆగలేదు. ఆమె పట్టుదల ఫలించింది. అరవై అడుగుల లోతులో నీరు దొరికింది. ఆ నీటితో ఆమె పంటలు తిరిగి పచ్చగా మారాయి. అక్కడితో ఆగిపోకుండా, మరో బావి తవ్వింది. ఈసారి తనకోసం కాదు– పొరుగువారి కోసం. ‘నా పంటలు బతికితే సరిపోదు, నా ఊరి ప్రజలందరికీ జీవం రావాలి’ అని అనుకుంది. పాఠశాల దగ్గర బావి తవ్వొద్దని అధికారులు ఆపినా, గౌరి వెనక్కి తగ్గలేదు. స్కూల్ పిల్లలకు కూడా నీరు అందేలా చేసింది. మధ్యలో ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, అలసట– అన్నింటినీ తట్టుకుంది. అందుకే, ఈరోజు అందరూ ఆమెను ‘లేడీ భగీరథ’ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఆమె బావులు రైతులకు, పిల్లలకు, జంతువులకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. ఇంకా గౌరి ఆగలేదు. గ్రామస్తులు దూరంగా నడుస్తూ నీరు తెచ్చుకోకూడదనే తపనతో, మూడో బావిని కూడా తవ్వుతోంది. -
హృదయ నదులు
హృదయ నదులు కొన్నిసార్లు సైన్స్ కన్నా, కవిత్వమే ఎక్కువ లాజికల్గా అనిపిస్తుంది! అందుకు ఒక ఉదాహరణ... బహుముఖసృజనశీలి అయిన ఇటాలియన్ చిత్రకారుడు, ఇంజినీరు లియోనార్డో డా విన్సీ నదుల్ని మానవ శరీరంలోని ధమనులు, సిరలతో పోల్చటం! నదులు, ఉపనదులు భూగోళానికిజీవ ప్రవాహ నాళాలు అని వాటి ప్రాముఖ్యాన్ని ఈ ఒక్కమాటతో చక్కగా అర్థం చేయించారు డా విన్సీ. 51 కోట్ల, 72 వేల చ.కి. మీ. విస్తీర్ణంలో ఉన్న మన భూమిపై లక్షన్నరకు పైగా నదులు ఉన్నాయని ఒక అంచనా. ఈ నదుల ప్రాముఖ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేందుకని గత ఇరవై ఏళ్లుగా ఏటా మనం సెప్టెంబరు నాల్గవ ఆదివారాన్ని (నేడు)‘ప్రపంచనదుల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పురాణాల్లో, సాహిత్యంలో, సినీ గీతాల్లో ఉన్న నదుల మననాలు కొన్ని.. మీ కోసం!ప్రవాహమే నది రూపంనదుల గురించి అల మాత్రంగానైనా మాట్లాడుకోవటం అంటే మహా సముద్రంలో ఈత కొట్టటమే! మొదలు–తుది; అంతము– ఆరంభమూ లేని ప్రవాహం... సమస్త మానవాళి జీవితాన్ని పెనవేసుకుని ఉన్న ఈ నదీ ప్రస్థానం. గ్రీకు తత్వవేత్త హెరాహ్లిటస్ అన్న మాట ఈ నదీ ప్రస్థానానికి, నదీ ప్రస్తావనకు చక్కగా సరిపోతుంది. ‘‘ఒకే మనిషి ఒకే నదిలో రెండోసారి అడుగు పెట్టడు. ఎందుకంటే– ఆ నది ఒకేలా ఉండదు. ఆ మనిషీ ఒకేలా ఉండడు’’ అంటారాయన. అంటే ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనిషి కూడా నదీ ప్రవాహంలా ఒకేలా ఉండడు అని అంతరార్థం.సాగిపోయే జీవిత నౌకనదుల పోలికతో పాశ్చాత్యులవే మరికొన్ని అద్భుతమైన జీవిత సత్యాలు ఉన్నాయి. లెబనీస్–అమెరికన్ కవి ఖలీల్ జిబ్రాన్ ఏమంటారో చూడండి, ‘‘నది వెళ్లి సముద్రంలో కలిసినట్లే జననం వెళ్లి మరణంలో కలుస్తుంద’’ట! ఇక దివంగత బ్రిటన్ రాజనీతిజ్ఞుడు ఎనోచ్ పావెల్, ‘‘నా ఓడ కనిపించకుండాపోతే, నా ప్రయాణం ముగిసిందని కాదు. నది వంపు తిరిగిందని..’’ అని అంటారు! ఎంత చక్కగా చెప్పారు. ‘కొండగాలి తిరిగింది’ అని ఆరుద్ర అన్నట్లు – కొండగాలి మాత్రమే కాదు, నది కూడా తిరుగుతుంది. ప్రాప్తమున్న తీరానికి జీవిత నౌక సాగిపోతుంది. ఇదీ ఆరుద్ర మాటే. వయ్యారి గోదారమ్మ..!ఒక అమ్మాయికి యుక్త వయస్సు అనేది విశాలమైన నది నుండి సముద్రంలోకి తేలుతున్నట్లుగా ఉంటుంది అంటారు జి.స్టాన్లీ హాల్. 19వ శతాబ్దపు మనో వైజ్ఞానిక నిపుణుడు ఈయన. నదిలా నూత్న యవ్వనం పరవళ్లు తొక్కుతుందని చెప్పటం స్టాన్లీ ఉద్దేశం. ‘వయ్యారి గోదారమ్మ ఒళ్లంత ఎందుకమ్మ కలవరం..’ అని వేటూరి అడిగిన ప్రశ్నకు స్టాన్లీ ఆల్రెడీ సమాధానం చెప్పేసే ఉంచారన్న మాట! అమెరికన్ సంగీతకారుడు జాన్ విలియమ్స్, నదిని సంగీతంలో పోల్చారు. ‘‘సంగీతంలో నేను ఎక్కువ తక్కువల్ని చూడను. సంగీతం అన్నది మనమందరం కప్పులతో ముంచుకుని తాగ గల అమృతవాహిని అయిన నది’’ అన్నారు విలియమ్స్. ఇళయ రాజా దృష్టిలో సంగీతం అంటే ఏ ఉద్దేశమూ లేనిది! ‘‘నది ప్రవాహంలా సంగీతం సహజంగా, ఉద్దేశరహితంగా ఉండాలి’’ అంటారు ఇళయరాజా.స్వర్గలోక వెండి ప్రవాహంప్రాచీన కాలపు చైనా దేశీయులు పాలపుంతను కూడా ఒక ప్రకాశవంతమైన నదిగానే ఊహించారు. ఆ నదిని స్వర్గంగా, ఆ ప్రవాహాన్ని వెండిగా భావించారు. బౌద్ధ దార్శనికుడైన ఆచార్య నాగార్జునుడు మానవ జీవితంలోని దుఃఖం గురించి మాట్లాడుతూ, ‘‘నదిలో కలిసి, కదిలే చెక్క దుంగలు ప్రతి అల చేత విడిపోతాయి. అనివార్యంగా అలా వేరు అవటం దుఃఖానికి కారణం కాకూడదు’’ అంటారు. ప్రసిద్ధ బ్రెజిల్ నవలా రచయిత పాలో కోయెలో మరికాస్త లోతుకు వెళ్లి, ‘‘మీరు నదిలో పడటం వల్ల మునిగిపోరు, కానీ దానిలో మునిగిపోవటం వల్ల మునిగిపోతారు’’ అంటారు. జీవితాన్ని భయంతో ఈదలేమని చెప్పటం కావచ్చు. ఇంగ్లిష్ నటి జూలీ ఆండ్రుస్ (89)కు నది వాసన అంటే ఇష్టం. నది సౌమ్యత ఇష్టం. ఆమె చిన్నతనం అంతా నదితోనే గడిచింది. నది ఆమెను ప్రశాంతపరచింది. ఆమెకు ఓదార్పునిచ్చింది. ఈ విషయాన్ని జూలీ అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. గంగా తీరాన రిషికేశ్హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్కు భారతదేశంలోని సాయంత్రాలు అంటే చాలా ఇష్టమట. ఎందుకు ఇష్టమో ఆయన మాటల్లోనే విందాం. ‘‘సూర్యుడు ప్రపంచం అంచుకు చేరుకుంటాడు. శబ్దాలు అస్తమిస్తుంటాయి. పది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సైకిళ్లపై నదీ ప్రవాహంలా ఇంటికి చేరుకుని, శ్రీకృష్ణుడి గురించి, జీవన వ్యయం గురించి ఆలోచిస్తూ ఉండే మాయా క్షణాలవి’’ అంటాడు కామెరాన్. సైకిళ్లపై ఒక ఒరవడిగా వెళ్లే శ్రామికులను ఆయన ఒక నదీ ప్రవాహంగా ఊహించుకున్నారు. మైకేల్ ఎడ్వర్డ్ లవ్ కూడా భారతదేశం గురించి గొప్పగా చెప్పారు. ఆ గొప్పకు కారణం గంగా నది. మైకేల్ అమెరికన్ సింగర్, సాంగ్రైటర్. ‘‘1968 వసంతకాలంలో, ‘ది బీటిల్స్’ బ్యాండ్కు, నాకు మహర్షి మహేష్ యోగి నుండి భారతదేశంలోని రిషికేశ్కు రమ్మని ఆహ్వానం అందింది. రిషికేశ్ అనేక సంవత్సరాలుగా లక్షలాది మందికి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది హిమాలయాల నుండి గంగా నది ప్రవహించే ప్రదేశంలో ఉంది. ఆ వాతావరణంలో ఉండటం చాలా ప్రత్యేకమైనది’’ అంటారు మైకేల్. పురుష నది.. బ్రహ్మపుత్ర!భారతీయ పురాణాలలో అనేక నదులు ప్రవహించాయి. అయితే అవి కేవలం భౌతిక ప్రవాహాలు కావు. దైవత్వం పొందినవి. దేవతలతో సమానంగా గౌరవాన్ని పొందినవి. పూజలను అందుకున్నవి. గంగా, యమునా, సరస్వతి, గోదావరి నదులను స్త్రీ దేవతలుగా పూజిస్తారు. ఆ పవిత్ర జలాలలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి పురుష నదులే లేవా? లేనట్లున్నాయి. బ్రహ్మపుత్ర నదిని మాత్రం ‘పురుష నది’గా పరిగణిస్తారు. మన నదులన్నీ కూడా రుగ్వేదం, మహాభారతం, రామాయణం వంటి పురాణ, ఇతిహాసాలలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. ‘గంగావతరణ’ ఘట్టందశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిందీ, శ్రీరాముడి అవతార పరిసమాప్తి అయిందీ ‘సరయూ’ సమీపంలోనే. రామాయణంలోని ‘గంగావతరణ’ ఘట్టం అయితే ఒక అద్భుతమైన చిత్రణ. సీతను వెదకి రమ్మని వానరులను పంపేటప్పుడు ఆమెను ఎక్కడెక్కడ వెతకాలో చెబుతూ శరావతి, కావేరి, తామ్రపర్ణి, నర్మద, కౌశికీ, యమునా నదులను ప్రస్తావిస్తాడు సుగ్రీవుడు. ఇక కవుల గురించి చెప్పక్కర్లేదు. నది ఊసు లేనిదే వారి కలాలు పరవళ్లు తొక్కవు. ‘కవుల కవిత్వంలో పొంగిన నదులు’ అంటూ రాజన్ పి.టి.ఎస్.కె. అనే రచయిత తెలుగులో ఒక పుస్తకమే రాశారు. కృష్ణవేణి.. విరిబోణి.. అలివేణినది పేరుతో అనేక తెలుగు నవలలు, కథలు వచ్చాయి. అదొక అంతే లేని జాబితా. అలాగే తెలుగు సినిమా పాటలు వందలు, వేలు! పూర్తిగా ఒక నదిపైనే వచ్చిన పాట మాత్రం బహుశా డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోణి / కృష్ణవేణి నా ఇంటి అలివేణి’ కావచ్చు. ఆ పాటలో కృష్ణానది విశేషాలన్నిటినీ సినారె పొందుపర1చారు. భక్తిగీతంలా మొదలై పరవళ్లు తొక్కుతూ వెళ్లి సాగర హృదయాన సంగమిస్తుంది. ఈ పాట ‘కృష్ణవేణి’ (1974) చిత్రం లోనిది.వేదంలా ఘోషించే గోదావరికృష్ణవేణికి దీటైన ఇంకో తెలుగు సినిమా పాట.. ‘వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి’. 1983 నాటి ‘ఆంధ్ర కేసరి’ సినిమా కోసం ఆరుద్ర ఈ పాటను రాశారు. అయితే ఆ పాట పూర్తిగా గోదావరి విశేషాల మీద కాకుండా, గోదావరికి అనుసంధానమై ఉన్న సుందర నగరాలు, కవులు–కావ్యాలు, ఏలిన రాజులు మీద సాగుతుంది. గోదావరి మీదే వేటూరి గారు రాసిన పాట ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’. ఇంకా.. ‘ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుందీ’ (ఆత్రేయ–‘చక్రవాకం’), ‘నవ్వుల నదిలో పువ్వుల పడవ’ (ఆరుద్ర–‘మర్మయోగి’), ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ’ (శేషేంద్ర శర్మ–‘ముత్యాల ముగ్గు’) ‘చినుకులా రాలి.. నదులుగా సాగి’ (వేటూరి–నాలుగు స్తంభాలాట), ‘గోదారి గట్టుంది.. గట్టు మీద సెట్టుంది..’ (దాశరథి కృష్ణమాచార్య–‘మూగ మనసులు’)... వంటి పాటలు పూర్తిగా నది చుట్టూ తిరిగినవి కాకపోయినా, దోసెడు నది నీళ్లను పట్టి ప్రేక్షకుల తలపులపై చిలకరించినవి. నదులపై మంచి మంచి సినిమా పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి కొన్ని రేణువులు మాత్రమే. నదులు కేవలం నీళ్లు కాదు, కేవలం ప్రవాహాలు కాదు, కేవలం ప్రయాణ మార్గాలు అంతకన్నా కాదు. మనిషిని బతికించే సంజీవినులు మాత్రమే కాదు. డా విన్సీ అన్నట్లు – భూగోళానికే జీవాన్ని, చేవను ఇచ్చే సిరలు, ధమనులు.· సాక్షి, స్పెషల్ డెస్క్శ్రీశ్రీ అనుసంధానం!‘మరో ప్రపంచం’ (1970) సినిమాలో శ్రీశ్రీ ‘అణగారిన బ్రతుకులలో..’ అనే పాట రాశారు. అందులోని ఒక చరణంలో... ‘గంగా, కావేరీ – నదులను కలుపుదాం..’ అన్నారు ఆయన. ఆ చరణం ఇలా ఉంటుంది : ‘ఈ దేశం నీదీ నాదని / ఇది ఒక్కరికే సొంతం కాదని / గంగా, కావేరి నదులు కలుపుదాం / కలిపి, సరిహద్దు చెరిపి, చెలిమి నిలుపుదాం..’ అని. యాభై ఏళ్ల క్రితం తొలిసారి 1972లో అప్పటి కేంద్ర మంత్రి కె.ఎల్.రావు గంగ–కావేరి నదులను అనుసంధానించాలని ప్రతిపాదించారు. అంటే, శ్రీశ్రీ తన పాట ద్వారా అంతకు రెండేళ్లకు ముందే గంగ, కావేరీలను అనుసంధానించారు! అందుకే, సృజనశీలులను కాలజ్ఞానులు అని కూడా అంటారు. నదుల అనుసంధానం గురించి 1974లో కెప్టెన్ దిన్షా జె.దస్తూర్ మరో ప్రతిపాదన తెచ్చారు. హిమాలయ నదులైన గంగ, సింధు, బ్రహ్మపుత్రలను... ద్వీపకల్ప నదులైన గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, నర్మద, తపతి, పంబ వంటి వాటితో కలపొచ్చని! ఆ తర్వాత కేంద్ర జల వనరుల శాఖ ఇంకో ప్రతిపాదన తెచ్చింది. ఇవేవీ ఆచరణకు రాలేదు. -
కకుత్థ్స విజయం
అయోధ్య పాలకుడు ఇక్ష్వాకుడు ఒకనాడు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తన పెద్దకొడుకు వికుక్షిని పిలిచి, శ్రాద్ధ భోజనాల కోసం అడవికి వెళ్లి మాంసం తెమ్మని ఆజ్ఞాపించాడు. అతడు ఆయుధం ధరించి, రథంపై అడవికి వెళ్లాడు. వరాహాలను, జింకలను, కుందేళ్లను వేటాడాడు. వేటలో అడవంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు. అలసట వల్ల ఆకలి దప్పులను తాళలేకపోయాడు. ఆకలి తీర్చుకోవడానికి వేటాడిన జంతువుల్లో ఒక కుందేలును భుజించాడు. మిగిలిన వాటిని తీసుకొచ్చి, తండ్రికి అందించాడు. ఇక్ష్వాకుడి చేత శ్రాద్ధ కర్మ జరిపిస్తున్న వసిష్ఠుడు ఆ జంతువుల మాంసాన్ని సంప్రోక్షించబోతూ, అది భుక్తశేషమని గుర్తించాడు. ‘ఈ మాంసం భుక్తశేషం. ఇది శ్రాద్ధకర్మకు పనికిరాదు’ అని కోపంగా పలికాడు.ఇక్ష్వాకుడు వెంటనే కొడుకును పిలిచి, ఏం జరిగిందో చెప్పమని నిలదీశాడు.‘వేట ముగిశాక ఆకలికి తాళలేక వేటాడిన వాటిలో ఒక కుందేలును తిన్నాను’ అని చెప్పాడు వికుక్షి.శ్రాద్ధకర్మలో విధిలోపం చేసినందున ఇక్ష్వాకుడు అతడికి దేశబహిష్కారం విధించాడు. శ్రాద్ధానికి తీసుకు రావలసిన కుందేలు మాంసాన్ని భుజించడం వల్ల వికుక్షికి శశాదుడనే పేరు వచ్చింది. తండ్రి ఆజ్ఞ ప్రకారం శశాదుడు ఇల్లు విడిచి అడవులకు వెళ్లిపోయి, అక్కడే నివసించసాగాడు.కొన్నాళ్లకు ఇక్ష్వాకుడు కాలధర్మం చెందాడు. తండ్రి మరణంతో శశాదుడు తిరిగి రాజధానికి వచ్చి, మంత్రుల సలహాతో రాజ్యభారం స్వీకరించాడు.శశాదుడికి కకుత్థ్సుడు అనే కొడుకు కలిగాడు. కకుత్థ్సుడు ఆదిపరాశక్తి అపరభక్తుడు. నిత్యం అమ్మవారిని సేవిస్తూ ఉండేవాడు. శశాదుడి మరణం తర్వాత కకుత్థ్సుడు రాజ్యపాలన చేపట్టాడు. అమ్మవారి అనుగ్రహంతో అతడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయసాగాడు. అతడి పాలనలో రాజ్యం సుఖశాంతులతో తులతూగుతూ ఉండేది.అయోధ్యలో కకుత్థ్సుడి పాలన కొనసాగుతున్న కాలంలో దేవదానవులకు సంగ్రామం జరిగింది. అసురుల చేతిలో దేవతలు చిత్తుగా ఓడిపోయి, స్వర్గం నుంచి పలాయనం చిత్తగించారు. దిక్కుతోచని స్థితిలో ఇంద్రాది దేవతలందరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు.‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! శరణు.. శరణు! నువ్వే మాకు దిక్కు’ అని శేషతల్పంపై చిద్విలాసంగా శయనిస్తున్న శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకున్నారు.‘దేవతలారా! దిగులు చెందకండి. అయోధ్య రాజు శశాద తనయుడైన కకుత్థ్సుడిని సాయం కోరండి. అతడికి ఆదిపరాశక్తి అనుగ్రహం అపరిమితంగా ఉంది. అతడు యుద్ధంలో మీ పక్షాన నిలబడి, పోరాడి మిమ్మల్ని గెలిపించగలడు’ అని చెప్పాడు విష్ణువు.విష్ణువు సలహాతో దేవతలందరూ అయోధ్యకు వచ్చి, కకుత్థ్సుడిని దర్శించుకున్నారు.కకుత్థ్సుడు వారికి ఉచిత మర్యాదలు చేశాడు.‘దేవతలారా! మీ రాకతో నా జన్మ ధన్యమైంది. దేవతలు స్వయంగా ఇంటికి రావడమంటే, నిజంగా అరుదైన సంఘటనే! ఆజ్ఞాపించండి! మీ కోసం నేనేం చేయాలన్నా చేస్తాను. మానవమాత్రులకు దుస్సాధ్యమైన పని అనుకున్నా మీ కోసం నేను తప్పక చేస్తాను’ అని పలికాడు.‘రాజేంద్రా! నువ్వు దేవేంద్రుడికి బాసటగా మాకు యుద్ధంలో సాయం చేయాలి. అసురులను ఓడించాలి’ అని చెప్పారు దేవతలు.‘నేను తప్పక మీ తరఫున అసురులతో యుద్ధం చేసి, వారిని ఓడిస్తాను. కాకుంటే, నాదొక షరతు. రణరంగంలో దేవేంద్రుడు నాకు వాహనంగా ఉండాలి. అప్పుడే నేను సంగ్రామంలో విజృంభించి, అసురులను తరిమికొడతాను’ అని పలికాడు కకుత్థ్సుడు.కకుత్థ్సుడి షరతుకు దేవతలు నివ్వెరపోయారు. తమలో తాము తర్జనభర్జనలు పడ్డారు. అవసరం తమది కనుక అతడి షరతుకు ఒప్పుకోమని ఇంద్రుడిపై ఒత్తిడి తెచ్చారు. చివరకు విష్ణువు కూడా అదే సలహా చెప్పాడు. చేసేదేమీ లేక ఇంద్రుడు సరేనంటూ వృషభరూపం ధరించి, కకుత్థ్సుడికి వాహనంగా మారేందుకు అంగీకరించాడు. కకుత్థ్సుడు వృషభరూపంలో ఉన్న ఇంద్రుడిపైకి అధిరోహించి, రణరంగానికి బయలుదేరాడు. వృషభాన్ని అధిరోహించిన కకుత్థ్సుడు నందీశ్వరుడిని అధిరోహించిన పరమశివుడిలా కనిపించడంతో అసురులు కొంత కంగారు పడ్డారు. అయినా, శక్తి కూడదీసుకుని, దేవతలపై యుద్ధానికి సిద్ధమయ్యారు.హోరాహోరీగా సాగిన పోరులో కకుత్థ్సుడు అసురులను చిత్తుగా ఓడించాడు. వారి నగరాన్ని స్వాధీనం చేసుకుని, ఇంద్రుడికి అప్పగించాడు.ఇంద్రుడిని వాహనంగా చేసుకున్నందుకు కకుత్థ్సుడికి ఇంద్రవాహనుడని, అసురుల నగరాన్ని స్వాధీనం చేసుకున్నందున పురంజయుడని పేరు వచ్చింది.∙సాంఖ్యాయననేను తప్పక మీ తరఫున అసురులతో యుద్ధం చేసి, వారిని ఓడిస్తాను. కాకుంటే, నాదొక షరతు. రణరంగంలో దేవేంద్రుడు నాకు వాహనంగా ఉండాలి. -
‘వీడు ఒలింపిక్స్కు వెళ్లి ఉంటే ఇండియాకు కచ్చితంగా గోల్డ్మెడల్ వచ్చేది’
నంద గోపాల్ పాత్రలో మహేష్బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమా గుర్తుందా! అందులో ఓ సీన్ ఉంటుంది. బాజిరెడ్డి (కోట శ్రీనివాసరావు) హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ (ప్రకాష్రాజ్) రంగంలోకి దిగుతాడు. బాజిరెడ్డిని కాల్చడానికి వినియోగించిన బిల్డింగ్ పైకి వెళ్లి సహచరుల నుంచి వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఆ భవనం పైనుంచి తాడు సాయంతో పక్కనే ఉన్న రైల్వేస్టేషన్లో రైలు మీదికి నంద గోపాల్ దూకాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ‘వీడు ఒలింపిక్స్కు వెళ్లి ఉంటే ఇండియాకు కచ్చితంగా గోల్డ్మెడల్ వచ్చేది’ అంటాడు. అలాంటి తెలివైన నేరగాళ్లు బయటి ప్రపంచంలోనూ ఉన్నారు. అలాంటి వారిలో గౌరు సురేష్ ఒకడు. డబ్బు కోసం కిడ్నాప్స్ చేయడంలో పేరుమోసిన ఈ నేరగాడి ప్లానింగ్కు 2005 నాటి తిరుపతి వ్యాపారి కిడ్నాప్ ఓ ఉదాహరణ. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గౌరు సురేష్ బీకాం పూర్తి చేశాడు. ఎంబీఏ చదవాలనే లక్ష్యంతో 1999లో హైదరాబాద్కు వచ్చి బద్రుకా కాలేజీలో చేరాడు. అనివార్య కారణాలతో ఆ కోర్సులో డ్రాపౌట్గా మిగిలిన సురేష్.. బతుకుతెరువు కోసం దిల్సుఖ్నగర్లో ‘మార్చ్ స్టడీ సర్కిల్’ ఏర్పాటు చేశాడు. ఈ స్టడీ సర్కిల్ నష్టాలను మిగల్చడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాల బాట పట్టాడు. 17 దోపిడీలు, 11 బందిపోటు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. 2003 నుంచి కిడ్నాపర్గా మారి, పలువురు బడా బాబులను కిడ్నాప్ చేసి భారీ మొత్తాలు వసూలు చేసుకున్నాడు. ఈ నేరాలకు సంబం«ధించి ఆరు కేసులు నమోదు కాగా, పోలీసు రికార్డుల్లోకి ఎక్కని కిడ్నాప్లు 14 వరకు ఉంటాయి. 2008లో ఎన్కౌంటర్ అయ్యే వరకు ఇతగాడు ఉమ్మడి రాష్ట్ర పోలీసుల్ని పరుగులు పెట్టించాడు. గౌరు సురేష్ ఏదైనా ఓ కేసులో జైలుకు వెళితే బయటకు వచ్చిన తర్వాత చేయాల్సిన నేరానికి అక్కడే స్కెచ్ వేస్తాడు. అందుకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లనూ అక్కడ నుంచే పూర్తి చేస్తాడు. 2004లో ఇలానే ముషీరాబాద్ జైల్లో ఉన్న సురేష్– బెయిల్పై వచ్చాక చేయాల్సిన కిడ్నాప్లో ‘వాడుకోవడానికి’ ఓ ముఠాను తయారు చేసుకోవాలని భావించాడు. దీనికోసం జైల్లో ఉన్న మాజీ నక్సలైట్ మల్లారెడ్డిని, అతడి అనుచరులను పరిచయం చేసుకున్నాడు. తాను త్వరలో చేయబోయే కిడ్నాప్కు సహకరించాలని కోరాడు. కథ మొత్తం తానే నడిపిస్తానని, కేవలం తాను అప్పగించిన ప్యాకెట్ను (కిడ్నాప్ చేసిన వ్యక్తి) రెండు మూడు రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని, తాను చెప్పినప్పుడు వదిలేస్తే చాలని చెప్పాడు. దీనికి మల్లారెడ్డి అంగీకరించడంతో ఓ కిడ్నాప్ స్కెచ్కు జైల్లోనే నాంది పడింది. అయితే అప్పటికి ఎవరిని కిడ్నాప్ చేయాలన్నది సురేష్ నిర్ణయించుకోకపోవడం కొసమెరుపు. ముషీరాబాద్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన సురేష్ మరో కిడ్నాప్ కోసం ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన పని ఎలాంటి ఆటంకాలు, హడావుడి, ఆర్భాటాలు లేకుండా పూర్తి కావాలంటే ఇల్లు, ఇల్లాలు, వాహనం కావాలని భావించాడు. ప్రాథమికంగా వీరారెడ్డి అనే బోగస్ పేరు, వివరాలతో గుర్తింపుకార్డులు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా కొన్ని సిమ్కార్డులు తీసుకుని తన వద్ద ఉంచుకున్నాడు. హోల్సేల్ కిరాణా వ్యాపారి అవతారం ఎత్తాడు. ఆ పేరుతోనే వనస్థలిపురంలోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కొత్తగా పెళ్లి అయిందని, త్వరలోనే భార్యను తీసుకువస్తానని చెప్పి యజమానికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఓ చిన్న కుటుంబం సంసారం చేయడానికి అవసరమైన సామాన్లు ఖరీదు చేసి ఆ ఫ్లాట్లో పెట్టాడు. ఆపై కృష్ణనగర్కు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్టును సంప్రదించి నెల రోజుల పాటు తన భార్యగా నటించాలని, రోజుకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆమెను తీసుకుని వనస్థలిపురంలోని ఫ్లాట్కు వెళ్లిన గౌరు సురేష్ అలియాస్ వీరారెడ్డి ‘కొత్త కాపురం’ ప్రారంభించాడు. ఇలా ఇంటిని, ఇల్లాలిని సిద్ధం చేసుకున్న గౌరు సురేష్ తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాహనం ఇచ్చే వ్యక్తి కోసం గాలించాడు. అప్పట్లో సెల్ఫ్ డ్రైవింగ్స్ కార్స్ విధానం మొదలు కాలేదు. ఎవరికి వాహనం అవసరమైనా ట్రావెల్స్ నుంచి తెప్పించుకోవాల్సిందే! ఆ కారుతో పాటు డ్రైవర్నీ ట్రావెల్స్ నిర్వాహకులే పంపిస్తుంటాడు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ఏ దిశలో దర్యాప్తు జరిగినా తన ఉనికి బయటపడకుండా ఉండటానికి అవసరమైన స్కెచ్ వేశాడు. అలా జరగాలంటే తనతో పాటు కారులో డ్రైవర్ ఉండకూడదు. ఈ కోణంలో ఆలోచించిన సురేష్ అలియాస్ వీరారెడ్డి వనస్థలిపురం పరిసరాల్లోని ట్రావెల్ ఏజెన్సీల విషయం ఆరా తీశాడు. చివరకు వెంకట్రెడ్డి అనే ట్రావెల్స్ నిర్వాహకుడిని ఎంచుకున్నాడు. ఆయన వద్ద రెండు మూడుసార్లు వాహనం బుక్ చేసుకున్న సురేష్... తన ‘భార్య’తో కలిసి శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ వెళ్లి వచ్చాడు. ఆయా సందర్భాల్లో వెంకట్రెడ్డి కారుతో పాటు డ్రైవర్నీ పంపిస్తాడు. ఇలా వెంకట్రెడ్డికి రెగ్యులర్ కస్టమర్గా మారిపోయిన సురేష్... ప్రతిరోజూ సాయంత్రం వేళ ఆయన ట్రావెల్స్ వద్దకే వెళ్లి కూర్చునేవాడు. తాను వ్యాపారినని, కొత్తగా పెళ్లి అయిందంటూ పథకం ప్రకారం మాటల సందర్భంలో చెప్పాడు. తన భార్యతో కలిసి తరచు బయటకు వెళ్లి వస్తుంటానని, అలా సరదాగా వెళ్లేప్పుడు కారులో డ్రైవర్ ఉండటం తమ ప్రైవసీకి భంగంగా ఉందంటూ వెంకట్రెడ్డికి చెప్పాడు. దీంతో సురేష్ ఇబ్బందిపడుతున్నట్లు భావించిన ఆయన... ‘మీకు డ్రైవింగ్ వచ్చా?’ అని ప్రశ్నించాడు. వచ్చంటూ సురేష్ చెప్పడంతో ఈసారి కారు కావాలంటే మీరే తీసుకువెళ్లండని ఆఫర్ ఇచ్చాడు. ఈ మాట కోసమే ఎదురు చూసిన సురేష్– రెండు సందర్భాల్లో అలానే తీసుకువెళ్లి చెప్పిన ప్రకారం తిరిగి ఇచ్చేశాడు. మరోపక్క తాను ఉంటున్న అపార్ట్మెంట్ వాచ్మెన్కు తరచు డబ్బులు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. ఇలా సురేష్ అలియాస్ వీరారెడ్డి ఇల్లు, ఇల్లాలు, వాహనం సిద్ధం చేసుకునే సమయానికి మల్లారెడ్డితో పాటు అతడి అనుచరులు ముషీరాబాద్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ వెంటనే మల్లారెడ్డి తాము విడుదలైన సమాచారాన్ని సురేష్కు చేరవేశాడు. దీంతో అతడిని వనస్థలిపురం పిలిపించుకున్న సురేష్... ఎవరికీ అనుమానం రాని, ఎవరి దృష్టీ పడని ఓ సురక్షిత ప్రాంతంలో ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలని, అందులో కాస్త సెటిల్ అయ్యాక అసలు కథ మొదలుపెడదామని, ఆ ఫ్లాట్కు అద్దె, అడ్వాన్స్ కూడా తానే చెల్లిస్తానని చెప్పాడు. దీంతో మల్లారెడ్డి వారాసిగూడ ప్రాంతంలో ఫ్లాట్ ఎంపిక చేసి, ఆ విషయం సురేష్కు చెప్పాడు. దానికి అవసరమైన అడ్వాన్స్తో పాటు ఖర్చుల కోసం కొంత మొత్తం మల్లారెడ్డికి ఇచ్చిన సురేష్– అప్పుడు టార్గెట్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. (తరువాయి వచ్చేవారం) -
ఈ వారం కథ: లిఖితం
తూర్పు ఇంకా తెల్లవారలేదు. వీధి లైట్లు మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నాయి. కార్తీకమాసంలోనూ చలిగాలులు వీస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చాడు గణపతి శాస్త్రి. పంచె పైకిలాక్కుని, భుజం మీద కండువా వేసుకుని, రాగిచెంబు చేత్తో పట్టుకుని ఆ మసకచీకటిలో కేదార్ ఘాట్కేసి నడవడం మొదలుపెట్టాడు. కాశీలోని ఆ ఇరుకు రోడ్లమీద నడవడం కొత్తవాళ్ళకు సవాలే! శాస్త్రికి ప్రతి సందు తెలుసు. అతనికి తెలియని వాడ, చూడని ప్రదేశం లేదు.నెమ్మదిగా కేదార్ ఘాట్లో మెట్లు దిగాడు. మూడుసార్లు ‘హరహర మహాదేవ్’ అంటూ గంగలో మునిగి గట్టు మీదకు వచ్చాడు. కండువాతో వొళ్ళు తుడుచుకుని, పంచె పిండుకుని కట్టుకున్నాడు. నుదుట విభూతి ధారణ చేసి, శివ పంచాక్షరి మంత్రం మనసులో జపిస్తూ, రాగి చెంబులోని గంగా జలంతో శ్రీగౌరీ కేదారేశ్వరుడితో బాటు, అరుణాచలేశ్వరుడికి, దక్షిణామూర్తికి అభిషేకం చేశాడు. ఛప్పన్న గణపతిని, మీాక్షి అమ్మవారిని కూడా దర్శించుకొని, మళ్ళీ చెంబుతో గంగాజలం తీసుకుని బయల్దేరాడు. ఉత్తర వాహినిగా సాగే గంగా ప్రవాహాన్ని , నదీ జలాలమీద గిరికీలు కొడుతున్న తెల్లని కొంగల్ని చూస్తూ, నెమ్మదిగా మానస సరోవర్ ఘాట్, క్షేమేశ్వర్ ఘాట్, చౌసెట్టి ఘాట్ల మీదుగా దశాశ్వమేధ ఘాట్ చేరుకున్నాడు. అలాగే ఘాట్ల మీద నడక సాగిస్తూ మణికర్ణిక ఘాట్కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మృతిచెందిన అదృష్టవంతుల కాష్టాలు కాలుతున్నాయి.‘ఆ అదృష్టం కోసమే కదా తను పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. రిటైరయిన తర్వాత వచ్చిన డబ్బులతో కాశీలో ఇల్లు కొనుక్కున్నదే అందుకోసం. పిల్లలు ఇద్దరూ బాగా స్థిరపడ్డారు. తన శేషజీవితాన్ని విశ్వేశ్వరుని సన్నిధిలో గడపాలని, తన కాష్టం ఇక్కడే కాలాలని ఇక్కడకు వచ్చేశాడు. మానవజన్మ దుర్లభం. ఈ జన్మలో కాశీలో మరణిస్తే మోక్షమే. మళ్ళీ జన్మంటూ ఉండదు’ అనుకున్నాడు. అక్కడున్న తారకేశ్వర లింగానికి గంగాజలంతో అభిషేకం చేశాడు శాస్త్రి. మళ్ళీ రాగి చెంబుతో గంగా జలం తీసుకున్నాడు.భక్తిభావం పొంగుతుంటే తన్మయత్వంతో ‘విశ్వేశ్వరా! నా ఆఖరిశ్వాస నీ సన్నిధిలో, ఈ కాశీక్షేత్రంలోనే తీసుకునే అదృష్టం ప్రసాదించు తండ్రీ!’ అంటూ చేతులు జోడించి మనస్సులోనే ప్రార్థించి విశ్వనాథుని మందిరంలోకి అడుగుపెట్టాడు. సర్కారువారి పుణ్యమాని మందిరం దగ్గర కొన్ని ఇరుకు ఇరుకు వీధులన్నీ విశాలమయ్యాయి. భక్తులు గంగానదిలో స్నానం చేసి సరాసరి విశ్వనా«థుని దర్శనం చేసుకోవచ్చు. అక్కడి మందిరంలో పండిట్స్తో బాటు భద్రతా సిబ్బంది కూడా గణపతి శాస్త్రికి పరిచయం అయినవాళ్లే. శాస్త్రికి క్యూలతో పనిలేదు. సరాసరి అంతరాలయంలోకి వెళ్లి, అక్కడే ఎంతసేపైనా ధ్యానం చేసుకోగలడు. రాగిచెంబులో తెచ్చిన గంగాజలంతో విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకున్నాడు.బయటకు వచ్చి అన్నపూర్ణని, ఆ ప్రాంగణంలో భాస్కర రాయులవారు ప్రతిష్ఠించిన శ్రీచక్ర లింగాన్ని, విశాలాక్షిని దర్శనం చేసుకున్నాడు. గదోలియా చౌక్లో పనులు చూసుకొని, జంగంబాడి మఠ్, పాండే హవేలీ, సైకిల్ స్వామి సత్రం మీదుగా గదికి బయలుదేరాడు. ఇరుకు సందుల్లో తాపీగా తిరుగుతున్న ఆవుల్ని, భయపెట్టే కుక్కల్ని తప్పించుకుంటూ, రుద్ర జపం చేసుకొంటూ నడవడం శాస్త్రి ప్రతిభ.‘ఈ దారుల్లో ఆవులు మనుషుల్ని పొడవవు. ఆలయం మీద నుంచి గద్దలు ఎగరవు. బల్లులు అరవవు. శవాలు వాసన పట్టవు. ఇంతకంటే గొప్ప పుణ్యక్షేత్రం ప్రపంచంలో ఉందా?’ అనుకున్నాడు శాస్త్రి.‘అయ్యా! విశ్వనాథుని గుడికి ఎలా వెళ్ళాలి?’ అన్నారు ఎవరో. కాశీలో చాలామంది తెలుగు మాట్లాడుతుంటారు. పక్కకు చూశాడు శాస్త్రి. ఓ అరవయ్యేళ్ళ పైబడిన పెద్దాయన కుటుంబంతో నిలబడి ఉన్నాడు.‘శివ శివ అనుకుంటూ వెళ్ళండి. లేకపోతే ఓం నమశ్శివాయ అనుకుంటూ వెళ్ళండి’ అన్నాడు.‘అది కాదు స్వామీ! మందిరానికి దారెటని’ అన్నాడు ఆ పెద్దాయన.‘ఎక్కడనుంచి వచ్చారు? ఎక్కడ దిగారు?’ అన్నాడు శాస్త్రి. ‘రాజమండ్రి నుంచి వచ్చామండి. ఎక్కడా ఆశ్రమాలు ఖాళీ లేవండి. గంగలో మునిగి బట్టలు మార్చుకున్నాం’ అన్నాడు ఆయన.‘సరే! ఒక పనిచేయండి. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. అక్కడ మీరు మీ సామాన్లు పెట్టుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. అదిగో అలా తిన్నగా వెళ్లి ఎడమపక్కకు తిరిగితే విశ్వనాథుని ఆలయం. నాకూడా రండి’ అని వాళ్ళ సమాధానం కోసం చూడకుండా తన ఇంటికేసి దారితీశాడు. వాళ్ళు ఆనందంగా శాస్త్రిని అనుసరించారు.‘ఇదిగో ఇదే విశ్వనాథుని మందిరం. పది నిమిషాలు నడవ గలిగితే మా ఇల్లు’ ఆన్నాడు శాస్త్రి.‘అయ్యా! తమరు పుణ్యాత్ములు. నా పేరు రామనాథం. రిటైర్డ్ స్కూల్ టీచర్ని. ఈమె నా భార్య వైదేహి. వీడు నా కొడుకు రవి. వాడి భార్య రేవతి. వాళ్ళు నా మనవలు’ అని కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశాడు. శాస్త్రి తన ఇల్లు చూపిస్తూ, ‘నాదో నాలుగు గదుల చిన్న ఇల్లు. మీకు నచ్చితే ఆ గదిలో మీ సామాన్లు పెట్టుకుని గుడులన్నీ తిరిగి రావొచ్చు. మీ గదికి తాళం వేసుకుని వెళ్ళిరండి‘ అన్నాడు గది చూపించి. అప్పుడే మిగిలిన రెండు రూముల్లో వసతి దొరకని తెలుగు వాళ్ళ కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లాయి. ‘అయ్యా! మేము ఓ నాలుగు రోజులుండి ఇక్కడ చుట్టుపక్కల ఆలయాలు అన్నీ చూసుకుంటాము. రోజుకు ఎంత ఇవ్వాలో చెప్పండి’ అన్నాడు రామనాథం.‘నేను భక్తులకు సేవ చెయ్యడం భగవంతునికి సేవ చెయ్యడంగా భావిస్తాను. బంధుమిత్రులకు, వసతి దొరకని వారికి నా గదులు ఉచితంగానే ఇస్తాను. ఇక్కడ స్టౌ, పాత్రలు ఉన్నాయి. మీ పిల్లలకు పాలు కాచి ఇచ్చుకోవచ్చు. మీరు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు తలుపుకు గొళ్లెం పెట్టి వెళ్ళిపోవచ్చు. భోజనానికి ఇక్కడ సత్రాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అందరూ ఉచితంగానే భోజనం పెడతారు. మీరు ఇవ్వాలనుకున్న డబ్బులు ఎవరైనా అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వండి’ అన్నాడు శాస్త్రి. రామనాథం కుటుంబం వారికి చూపించిన గదికి వెళ్ళిపోయారు. తన గదికి వెళ్లి మళ్ళీ స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, ప్రాణాయామం, ధ్యానం చేసి, యోగాసనాలు వేసి పది నిముషాలు మౌనంగా కూర్చున్నాడు. కరోనా సమయంలో భార్య పోవడంతో శాస్త్రి ఒంటరి వాడయిపోయాడు. ‘అందరూ పోయేవాళ్ళమే, కాస్త ముందు వెనుక. అదృష్టవంతురాలు కనుకనే అనసూయ కాశీలో పోయింది’ అని సర్దిచెప్పుకున్నాడు. కాశీ వచ్చిన వారికి సేవ చెయ్యడం అంటే విశ్వనాథుడికి సేవ చెయ్యడంలాగే భావిస్తాడు శాస్త్రి.రామనాథం వాళ్ళు సామాన్లు గదిలో పెట్టుకుని తాళం వేసుకుని గుడికి వెళ్ళిపోయారు. ఇంతలో సెల్ మోగింది. చూస్తే బెంగళూరు నుంచి పెద్దకొడుకు విశ్వనాథ్. శాస్త్రి సెల్ ఆన్ చేశాడు.‘ఎలా ఉన్నారు నాన్నా?’ అన్నాడు విశ్వనాథ్.‘భేషుగ్గా ఉన్నాను. చెప్పు’ అన్నాడు శాస్త్రి.‘మీకు చెప్పాను కదా నాన్నా కొత్తగా విల్లా తీసుకుంటున్నాను అని.. రేపు పదిహేనో తారీఖున గృహప్రవేశం. నాలుగు రోజులుండి వెళ్ళండి. రాను పోను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను’ అన్నాడు.‘ఈ భవబంధాలు తెంచుకుంటేనేగానీ నేను అనుకున్న గమ్యం చేరలేనురా. రిటైర్ అయ్యాక ఐదేళ్లు ప్రతి ఏడాదీ అమలాపురం నుంచి కాశీ వచ్చేవాడ్ని. పదేళ్ల క్రితం ఇల్లు కొన్నప్పటి నుంచి మీ అమ్మ పోయినా ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాను. ఎందుకని? నా ఆఖరి శ్వాస ఇక్కడే తీసుకోవాలని, నా కాష్టం ఇక్కడే కాలాలని. నువ్వు బెంగళూరు నుంచి, చిన్నాడు అమెరికా నుంచి ఫోన్ చేస్తారు. అప్పుడు నా మనసు అటే లాగుతుంది. మీరు జీవితాల్లో బాగా స్థిరపడ్డారు. నాకా పెన్షన్ వస్తుంది. నా గురించి ఆలోచించొద్దురా. అస్తమానూ ఫోన్లు చేసి నా ప్రస్థానానికి ఆటంకం కలిగించకండి రా! రావడానికి కుదరదు’ అన్నాడు శాస్త్రి్త. ‘అయ్యో! అదేమిటి నాన్నా! కన్నబిడ్డ శుభమాని గృహప్రవేశానికి రమ్మని పిలుస్తే కుదరదంటారేమిటి? ఈ ఒక్కసారికి నామాట వినండి. రాకపోతే మేం అంతా బాధపడతాం. మీరు రాకపోతే అసలు గృహప్రవేశమే చేసుకోము’ అన్నాడు బాధగా.‘ప్రతిదానికి ఈ ఏడుపొకటి. సరే! రెండు రోజుల కంటే ఉండటానికి కుదరదు. ఇదేఆఖరిసారి. సరేనా?’ అన్నాడు శాస్త్రి్త అయిష్టంగానే. ‘అలాగే.. థాంక్యూ! నాన్నా’ అన్నాడు విశ్వనాథ్ ఆనందంగా. సెల్ కట్ చేశాడు. కాఫీ తాగుదామని చూశాడు. పాలు లేవు. చిన్న గ్లాసుడు బియ్యం సింగిల్ బర్నర్ స్టవ్ మీద పడేశాడు. రాత్రి మిగిలిన మజ్జిగ ఉంటే వేసుకుని తిన్నాడు. ఏది ఉంటే అది తినడం, లేకపోతే పస్తుండటం; మరీ ఆకలనిపిస్తే ఏ ఆంధ్ర ఆశ్రమానికో, గాయత్రి సత్రానికో, కరివెన సత్రానికో వెళ్ళడం; అక్కడ భోజనం అయ్యిందనిపించడం; అక్కడ సత్రంవారికి, యాత్రికులకు ఏదో ఒక సేవ చెయ్యడం అలవాటయిపోయింది.మళ్ళీ సెల్ మోగింది.చూస్తే అమలాపురం నుంచి చిరకాల మిత్రుడు రామ్మూర్తి. కాల్ లిఫ్ట్ చేశాడు.‘ఒరేయ్! శాస్త్రి! నువ్వు అస్తమానూ ఫోన్ చేసి కాశీ రా, గంగలో మునుగు, విశ్వేశ్వరుని దర్శనం చేసుకో అని చెబుతున్నావు కదా! నా భార్య కూడా వెళదామండి అని గొడవ చేస్తోంది. రేపు పన్నెండో తారీఖు ఉదయం కాశీ వస్తున్నాం. మాకు ఆశ్రమంలో వసతి ఏర్పాట్లు చెయ్యరా’ అన్నాడు రామ్మూర్తి.‘అలాగే. ఎంతమంది వస్తున్నారురా?’‘నేను, నాభార్య, కొడుకు, కోడలు’ ఆన్నాడు రామ్మూర్తి.‘ఏనాడూ గుడికి వెళ్ళనివాడివి, భగవన్నామం జపించనివాడివి, శుద్ధబద్ధకస్తుడివి. ఇంటిపని, బయటపని మీ ఇల్లాలే చేస్తుందికదా! ఇన్నాళ్ళకు విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని నీకు బుద్ధిపుట్టింది. శుభం. తప్పకుండా రండి. నేను చూసుకుంటా’ అన్నాడు శాస్త్రి. ‘థాంక్స్ రా!’ అన్నాడు రామ్మూర్తి.తర్వాత నెమ్మదిగా ఆంధ్రాశ్రమం ఆఫీసులోకి వెళ్ళాడు. అక్కడ యాత్రికులకు ఆశ్రమం తరపున సేవ చేస్తూ గడిపాడు. సాయంత్రం ఆరు అయ్యింది దశాశ్వమేధ ఘాట్కు బయల్దేరాడు. గంగా హారతికి సమయం. కనుల విందుగా జరిగే హారతుల్ని చూడడానికి వచ్చిన జనాలు మెట్ల మీద కూర్చొన్నారు. మైకులో శ్రావ్యంగా భక్తి సంగీతం సాగుతోంది. కొంతమంది విదేశీయులతో బాటు మిగతా యాత్రికులు కూడా ఆ సుందర దృశ్యాలని తమ కెమెరాలలో భద్రపరచుకుంటున్నారు. అంతలో పట్టు పంచెలు కట్టుకున్న యువకులు హారతులు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. నదిలో అందమైన పడవల మీద జనం కూర్చుని, తమ కనుల ముందు జరుగుతున్న గంగా హారతుల్ని భక్తి శ్రద్ధలతో గమనిస్తున్నారు.ఎప్పుడూ కూర్చునే మండపంలోనే కూర్చున్నాడు శాస్త్రి. హారతి ప్రారంభమయ్యింది. రోజూ చూసే హారతులయినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది శాస్త్రికి. హారతి అవగానే ఆశ్రమానికి వచ్చాడు. గిన్నెలు ఖాళీగా ఉన్నాయి.రెండు అరటిపళ్ళు తిని శివపురాణం తీశాడు. పది గంటల దాకా పారాయణం చేసి నడుము వాల్చాడు. శివనామ స్మరణ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రోజులు గంగా ప్రవాహంలా నెమ్మదిగా గడుస్తున్నాయి.ఉదయాన్నే ఎవరో తలుపు కొడుతూంటే తలుపు తీశాడు. ఎదురుగా రామ్మూర్తి, భార్య, కొడుకు, కోడలు చిరునవ్వుతో నిలబడ్డారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రామ్మూర్తి పన్నెండో తారీఖు వస్తానన్నాడని.‘రండి...రండి’ అంటూ ఆహ్వానించాడు.అప్పటికే శాస్త్రి గంగాస్నానం చేసి, మణికర్ణిక ఘాట్లో కాలుతున్న కాష్టాల్ని కనులనిండుగా చూసి, విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకు వచ్చి సంధ్య వార్చుకోడం ముగించాడు.రామ్మూర్తిని చూడగానే ‘రా... రా... రామ్మూర్తి! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు’ అంటూ ఆహ్వానించాడు.‘మీకు ఇంట్లోనే రెండు రూములు ఏర్పాటు చేశాను. కాలకృత్యాలు తీర్చుకుని రండి. గంగా స్నానం చేసి, విశ్వేశ్వరుని దర్శించుకుందురుగాని’ అన్నాడు శాస్త్రి.వారికి గదులు చూపించాడు.‘కార్తీకమాసంలో కాశీ వచ్చారు. మంచి పని చేశారు, త్వరగా తయారై రండి’ అన్నాడు.ఓ అరగంటలో అందరూ వచ్చారు. అందర్నీ కేదార్ ఘాట్కు తీసుకెళ్ళి, సంకల్పం చెప్పించి స్నానాలు చేయించాడు.‘ఏం చలిరా నాయనా! వణికిపోతున్నాను. నా వల్ల కాదు బాబోయ్ అంటున్నా మా అన్నపూర్ణ బలవంతంగా లాక్కొచ్చింది’ అన్నాడు రామ్మూర్తి గజగజ వణుకుతూ.‘ఈ మాత్రం చలికే ఇంత హడావిడి చేస్తున్నావ్. ఈ చలిని గులాబ్ సర్దీ అంటారు ఇక్కడ వాళ్ళు. జనవరి నెలలో చూడాలి, చలికి కాలు బయట పెట్టలేం. అయినా పుణ్యం ఊరికే రాదుగా. పుణ్యం కావాలంటే ఆమాత్రం కష్టపడక తప్పదు’ అన్నాడు శాస్త్రి. ఘాట్ల మీద నడిపిస్తూ, ఆ విశేషాలు వర్ణిస్తూ విశ్వనాథుని దర్శనం చేయించాడు. ఆ తర్వాత సహస్ర లింగేశ్వరుడు, మనోకామేశ్వరుడు, ధనేశ్వరుడు, ప్రీతికేశ్వరుడు, సాక్షి గణపతి, ఢుండి గణపతి, అన్నపూర్ణ, విశాలాక్షిల దర్శనం చేయించాడు. ‘ఇళ్ళల్లోను, షాపుల్లోనూ గుళ్ళు కట్టుకోవడమేమిటిరా? వీళ్ళ భక్తి పాడుగాను!’ అన్నాడు రామ్మూర్తి.‘కాదురా. ఒకనాటి గుళ్లనే, షాపులుగా, ఇళ్లుగా మార్చేశారు. ఏం చెయ్యగలం?’ అన్నాడు శాస్త్రి్త.రామ్మూర్తికి చాలా అలసటగా ఉంది. భారీకాయంతో నడవలేక పోతున్నాడు. ఆతని భార్యకి మాత్రం ఇంకా చూడాలని ఉంది. ఉత్సాహంగా శాస్త్రి్త ముందుకు సాగుతూ, మంగళగౌరి, మాయుఖాదిత్యుడు బిందుమాధవుడు, కాలభైరవుడు, దండపాణి, కృత్తివాసేశ్వరుని దర్శనాలు చేయించాడు.రామ్మూర్తికి కాఫీ చుక్క గొంతులో పడకపోవడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. అతగాడి దృష్టి అంతా కాఫీ మీదే ఉండి చిరాకుగా ఉంది.‘ఈ ఊరేమిటిరా శాస్త్రి్త! ఈ ఇరుకిరుకు సందులు గొందులు, వాటిల్లో అడ్డంగా పడుకున్న కుక్కలు, తాపీగా సాగే ఆవులు వాటి మలమూత్రాలు, దుర్గంధం... మోటార్ సైకిళ్ళ విన్యాసాలు, కిక్కిరిసిన జనం... వాళ్ళ జరదాలు, కిళ్ళీల కంపు... అబ్బబ్బ! ఎలా ఉంటున్నావురా బాబూ? దేవుడు కాశీలోనేగాని, కూచిమంచి అగ్రహారంలో లేడా? ఆ పండిట్లు ఏమిటిరా? వాళ్ళ దౌర్జన్యం ఏమిటి? వాళ్ళ చెయ్యి తడిపితే కాని విశ్వనాథుని దర్శించుకోనివ్వరా?’ అన్నాడు రామ్మూర్తి అసహనంగా.‘నువ్వు కాశీయాత్రకు వచ్చావు. విహార యాత్రకు కాదు. ఇది మహోన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రం. అందమైన ప్రదేశాలు చూడాలంటే కాశ్మీర్కు వెళ్లొచ్చు. జన్మ సార్థకం కావాలంటే కాశీకే రావాలి. దీన్ని మహా శ్మశానం అంటారు. నువ్వు చెప్పే ఈ అసౌకర్యాలన్నీ మన భక్తిని, సహనాన్ని పరీక్షించడానికి విశ్వనాథుడు పెట్టే పరీక్షలు’ అన్నాడు శాస్త్రి్త. దర్శనాలయ్యి ఆశ్రమానికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు అయ్యింది. ‘కాఫీ’ అన్నాడు రామ్మూర్తి.‘ఇక భోజనాలే. ఆంధ్రా ఆశ్రమంలో భోజనం చాలా బాగుంటుంది. భోజనాలు అయ్యాక విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం ఆరుగంటలకు హారతికి వెళ్దాం’ అని భోజనాలకు తీసుకెళ్లాడు.తను కూడా విశ్రాంతి తీసుకుని సాయంత్రం దశాశ్వమేధ ఘాట్కు తీసుకెళ్ళి హారతి చూపించాడు. రామ్మూర్తికి ఈ దర్శనాలు, హారతుల మీద ఆసక్తి లేదు. ఎక్కడ మంచి భోజనం దొరుకుతుందా, ఎక్కడ సుఖంగా కునుకు తీయవచ్చా అన్నదాని మీదే ధ్యాస!రెండో రోజు మనిషిని తోడు ఇచ్చి, చింతామణి గణపతి, సంకట మోచన్ హనుమాన్, దుర్గా దేవాలయం, కాశీరాజు కోట, అస్సీ ఘాట్, బెనారస్ విశ్వవిద్యాలయం చూసే ఏర్పాటు చేశాడు. మూడోరోజు శాస్త్రి కారు ఏర్పాటు చేశాడు.‘ఈ కారు డ్రైవర్ జగన్నాథ్ మన కోనసీమ వాడే. ఎక్కడ ఏం చెయ్యాలో, ఎక్కడ పిండప్రదానం చెయ్యాలో అన్నీ అతనే చూపిస్తాడు. రేపు త్రివేణి సంగమం వెళ్లి రండి. ఎల్లుండి గయలో ఎక్కడ ఏది చెయ్యాలో అన్నీ చూపిస్తాడు. గయలో పిండ ప్రదానం చేస్తే పితృ దేవతలు తరిస్తారు. మన జన్మ కూడా ధన్యమే అంటారు. నేను రేపు మా పెద్దాడి గృహప్రవేశానికి బెంగళూరు వెళ్లి రెండు రోజుల్లో వచ్చేస్తాను. మీరు అన్నీ చూడటానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఈలోపు నేను వచ్చేస్తాను’ అన్నాడు శాస్త్రి రామ్మూర్తి భుజం మీద చెయ్యేసి.‘నువ్వున్నావు కాబట్టి వచ్చానురా శాస్త్రి! లేకపోతే గుమ్మం దిగే ప్రసక్తే లేదు. నీకు తెలుసుగా, ఇంటి పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికే వెళ్లను. అవునూ గాయత్రి సత్రంలో భోజనాలు చాలా రుచిగా ఉంటాయని విన్నాను’... అన్నాడు రామ్మూర్తి బొజ్జ చేత్తో రాసుకుంటూ.‘నీకు భుక్తి మీద ఉన్న రక్తిలో పదోవంతు భక్తి మీద ఉంటే బాగుండేది రా! సరే అలాగే కానీయ్’ అన్నాడు శాస్త్రి్త.రామ్మూర్తి కుటుంబం కార్లో కూర్చోగానే కారు బయల్దేరి, మలుపు తిరిగింది.ఇంతలో రామనాథ కుటుంబంతో వచ్చాడు. కుటుంబం అంతా శాస్త్రికి దండం పెట్టి వెళ్ళిపోయారు.తన నివాసానికి వచ్చి పూజాకార్యక్రమాలు ముగించుకొని, ఫలహారం తిని, ఆశ్రమానికి వచ్చి యాత్రికుల సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. మర్నాడు ఉదయమే సెల్ మోగింది. కొడుకు జగన్నాథ్. ఆన్సర్ చేసి ‘చెప్ప రా!’ అన్నాడు.‘ఈరోజు సాయంత్రం ఫ్లయిట్కు టికెట్ పంపించాను. అందింది కదా! మళ్ళీ మీకు పదహారో తారీఖుకు కాశీకి టికెట్ బుక్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి నాన్నా!’ అన్నాడు విశ్వనాథ్.‘అలాగేలేరా! వస్తున్నాను’ అన్నాడు అయిష్టంగానే. ఆ సాయంత్రం ఫ్లైట్కు బెంగళూరు బయల్దేరాడు. విశ్వనాథ్ ఎయిర్ పోర్ట్కు కారులో వచ్చి తండ్రిని రిసీవ్ చేసుకున్నాడు.ఆరాత్రి కొడుకు, కోడలు మనవడితో సంతోషంగా గడిపాడు. మరునాడు గృహప్రవేశానికి బంధుమిత్రులందరూ వచ్చారు. అందరూ శాస్త్రి్త అదృష్టాన్ని, ఆధ్యాత్మిక చింతననూ పొగిడేవారే! విశ్వనాథ్ కొన్న విల్లా చాలా ఖరీదైనది. కొడుకుతో అటువంటి ఇంటిలో ఉండే అవకాశం వదులుకున్నందుకు కొందరు శాస్త్రి మీద జాలి పడ్డారు. గృహప్రవేశానికి వచ్చినవాళ్ళందరితో మంచి హడావుడిగా ఉంది. మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, తోరణాలతో, పట్టుచీరలతో ఇల్లు కళకళలాడుతోంది. ఇంతలో శాస్త్రి్త సెల్ మోగింది. చూస్తే డ్రైవర్ జగన్నాథ్ కాల్ చేస్తున్నాడు. పక్కకు వెళ్లి ఆన్ చేశాడు.‘చెప్పు జగన్నాథ్’ అన్నాడు.‘సార్! ఘోరం జరిగిపోయింది సార్! మీ ఫ్రెండ్ రామ్మూర్తి గారిని గయలో విష్ణుపాదాల దగ్గర పిండ ప్రదానం చేయించి, కాశీలో కేదారఖండం తీసుకురాగానే హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణం వదిలేశారు సార్! బాడీని మణికర్ణికా ఘాట్కు తీసుకొచ్చాం సర్!’ అన్నాడు జగన్నాథ్. శాస్త్రి్త నిర్ఘాంతపోయాడు. స్థాణువులా నిలబడిపోయాడు. తేరుకుని ‘అయ్యో! నేను రేపు వస్తున్నాను. నువ్వు దగ్గరుండి కార్యక్రమాలన్నీ సజావుగా చేయించు’ అని సెల్ కట్ చేశాడు. టైం చూస్తే మధ్యాహ్నం రెండు అయ్యింది. ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. కొందరు భోజనాలు చేస్తున్నారు. శుభం జరుగుతున్న ఈ ఇంట్లో ఎవరికీ ఈ వార్త చెప్పడానికి లేదు. వెంటనే బాత్రూంలో దూరి తల స్నానం చేసి వచ్చాడు.‘ఇదేమిటి నాన్నా! మిట్టమధ్యాహ్నం వేళ ఈ స్నానం ఏమిటి?’ అన్నాడు జగన్నాథ్.‘నాకు కాశీలో అలవాటు రా!’ అన్నాడు. ఇంతలో కొడుకు ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు.శాస్త్రి్త ఆలోచనలో పడ్డారు.‘ఎంత అదృష్టవంతుడు రామ్మూర్తి! బాధ్యతలు తీరిపోయాయి. ఒక్కనాడు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోని వాడు కాశీలో, అందులోనూ భైరవ యాతనలకు తావు లేని కేదార ఖండంలో ఆఖరిశ్వాస తీసుకున్నాడంటే విశ్వనాథుని దయలేకుండా జరుగుతుందా? పుణ్యాత్ములు పాపాత్ములని మనం ఏవో లెక్కలు వేస్తాం. కానీ ఆ విశ్వేశ్వరుని లెక్కలు వేరే ఉంటాయి. ఎవరికి ఏది, ఎప్పుడు ఇవ్వాలో లిఖించేది ఆయనే’ అనుకున్నాడు శాస్త్రి. అతగాడికి బాధపడాలో, సంతోషించాలో అర్థం కావడం లేదు. ‘అది పూర్వజన్మ సుకృతం. ఈ జన్మలో కాకపోతే గత జన్మలో చేసుకున్న పుణ్యం’ అనుకున్నాడు. సాయంత్రానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. శాస్త్రి కుటుంబసభ్యులు మాత్రమే మిగిలారు.. ‘రేపు ఉదయమే కదా ఫ్లయిట్. బట్టలు, మందులు, పూజాసామాన్లు అన్నీ సర్డుకోవడం అయిపోయింది. పెందరాళే పడుకోవాలి. ప్రొద్దున్నే లేవాలి కదా!’ అన్నాడు శాస్త్రి.‘సరే! నాన్నా! పడుకోండి. తెల్లవారు ఝామునే లేపుతాను’ అన్నాడు విశ్వనాథ్.శాస్త్రికి మనసంతా వికలం అయిపోయింది. పడుకున్నాడన్న మాటేగాని, చిన్ననాటి మిత్రుడు అలా అకస్మాత్తుగా శివైక్యం చెందడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఏ అర్ధరాత్రికో నిద్రలోకి జారుకున్నాడు. రోజు బ్రహ్మమూహూర్తంలో లేచే శాస్త్రి్త ఇంకా లేవలేదు. విశ్వనాథ్ రెడీ అయ్యి టైమ్ చూసుకున్నాడు. ఫ్లయిట్కి టైమవుతోంది. లేపుదామని తండ్రి గదిలోకి వచ్చాడు. శాస్త్రి్త ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు.‘ప్రయాణానికి టైమవుతోంది. లేవండి నాన్నా!’ అంటూ శాస్త్రి వంటిమీద చెయ్యివేశాడు. చల్లగా మంచులా తగిలింది తండ్రి శరీరం. జరిగింది నమ్మలేక పోయాడు. తిరిగి రానిలోకాలకు తండ్రి ప్రయాణం ఎప్పుడో ప్రారంభమయ్యిందని విశ్వనాథ్కు తెలియగానే ‘అయ్యో! నాన్నా’ అని గట్టిగా అరిచాడు. ఆ కేకకి విశాలాక్షి పరిగెత్తుకొచ్చింది.దీనినే లాలటలిఖితం అంటారేమో! విశ్వనాథుని లిఖితం... అగోచరం..అదృశ్యం...అనూహ్యం. -
Vijaya Dashami: సర్వం శక్తిమయం!
ఆదిశక్తి అయిన అమ్మవారిని ఆరాధించడం తరతరాల సంప్రదాయం. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని శరన్నవరాత్రులలో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వీటినే దసరా నవరాత్రులని అంటారు. ‘దేవీభాగవతం’ వంటి పురాణగాథల ప్రకారం ఆదిశక్తి దుర్గాదేవిగా ఆవిర్భవించి, రక్తబీజ, చండ ముండ, శుంభ నిశుంభ, మహిషాసురాది రాక్షసులను సంహరించింది. దుష్టసంహారానికి ప్రతీకగా నవరాత్రులలో చివరి రోజున విజయ దశమినాడు దసరా పండుగను జనాలు వేడుకగా జరుపుకొంటారు.దసరా నవరాత్రులలో పూజాదికాలు శాక్తేయ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. సింధులోయ నాగరికత కాలం నుంచి శాక్తేయ సంప్రదాయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. సింధులోయ నాగరికతలో మొదలైన శాక్తేయ సంప్రదాయం దేశం నలువైపులకు విస్తరించింది. ఇందులో భాగంగానే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. వీటితో పాటు యాభైఒక్క శక్తిపీఠాలు ఉన్నాయి. దేవీ భాగవతం నూట ఎనిమిది శక్తిపీఠాలను పేర్కొంది. వీటిలో కొన్ని భారతదేశంతో పాటు పాకిస్తాన్, టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో ఉన్నాయి. ఈ శక్తిపీఠాలు ఏర్పడటానికి మూలంగా దక్షయజ్ఞం గాథను చెబుతారు. శక్తిపీఠాల మూలగాథఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం తలపెట్టాడు. ఈ యజ్ఞానికి సమస్త దేవతలను, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులను, మునిగణాలను ఆహ్వానించాడు. కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడిని మాత్రం పిలవలేదు. తండ్రి మాటను కాదని సతీదేవి శివుడిని పెళ్లాడింది. అందువల్లనే దక్షుడు కూతురిని, అల్లుడిని తాను నిర్వహించే యాగానికి ఆహ్వానించకుండా విస్మరించాడు. పుట్టింటి వేడుకకు పిలుపుతో పనేముంది అనుకుని సతీదేవి భర్త వారిస్తున్నా పట్టించుకోకుండా ప్రమధగణాలను వెంటబెట్టుకుని దక్షయజ్ఞానికి వెళ్లింది. ఆమెను చూసిన దక్షుడు ఆమెను, శివుడిని దారుణంగా నిందించాడు. శివనింద భరించలేని సతీదేవి యోగాగ్నిగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. సతీ వియోగంతో శివుడు జగద్రక్షణ బాధ్యతను మానేశాడు. ఆమె మృతకళేబరాన్ని భుజం మీద మోసుకుంటూ దిక్కుతోచక తిరగసాగాడు. శివుడిని తిరిగి కార్యోన్ముఖుడిని చేయాల్సిందిగా దేవతలందరూ విష్ణువుకు మొరపెట్టుకున్నారు. సతీ కళేబరం చెంత ఉన్నంత వరకు శివుడు యథాస్థతికి రావడం అసాధ్యమని తలచిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, ఆమె శరీరాన్ని ఖండించాడు. సతీదేవి ఖండితావయవాలు భూమ్మీద ఒక్కోచోట చెల్లాచెదురుగా పడ్డాయి. అవి పడిన చోట శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. వీటిలోని ప్రధానమైన పద్దెనిమిది శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తింపు పొందాయి. స్కాంద పురాణం వంటి పురాణాల ప్రకారం యాభైఒక్క శక్తి పీఠాలు ఉన్నాయి. దేవీభాగవతం ప్రకారం నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల గురించి చాలామందికి తెలుసు. మిగిలిన శక్తిపీఠాలలో కొన్ని విశేషమైనవి, విలక్షణమైనవి ఉన్నాయి. వీటిలో కొన్ని అరుదైన శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం.మహామాయ పీఠం – జమ్ము కశ్మీర్మహామాయ శక్తిపీఠం జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా అమర్నాథ్లో ఉంది. ఇది గుహాలయం. బయటి నుంచి చూడటానికి సాధారణమైన కొండగుహలా కనిపిస్తుంది గాని, లోపల పురాతనమైన మహామాయ విగ్రహం ఉంటుంది. అమర్నాథ్లో శివాలయం పొందినంతగా ఇది ప్రసిద్ధి పొందలేదు. అమర్నాథ్ యాత్రికుల్లో చాలామంది ఈ మహామాయ ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇది సతీదేవి గొంతు భాగం పడిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. ఇది పార్వతీపీఠంగా ప్రసిద్ధి పొందింది.దాక్షాయనీ పీఠం – టిబెట్దాక్షాయని శక్తిపీఠం టిబెట్లో ఉంది. కైలాస పర్వతానికి సమీపాన మానస సరోవరానికి చేరువలో ఉన్న ఒక మంచుకొండ మీద ఈ శక్తిపీఠం ఉంది. మానస సరోవరం వద్ద వెలసినందున దీనిని మానసా శక్తిపీఠం అని కూడా అంటారు. సతీదేవి కుడిచేయి ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాల కథనం. గోపురంలా కనిపించే శిఖరం కింద సహజంగా ఏర్పడిన గుహలోని పురాతన దాక్షాయని విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటుంటారు. గండకీ చండీ పీఠం – నేపాల్గండకీ చండీ శక్తిపీఠం నేపాల్లో ఉంది. హిమాలయ సానువుల్లో గండకీ నదీ తీరానికి చేరువలో ముస్తాంగ్ పట్టణానికి సమీపంలో ఈ శక్తిపీఠం ఉంది. హిందువులకు, బౌద్ధులకు పవిత్ర క్షేత్రమైన ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలోనే గండకీ చండీ ఆలయం కూడా ఉంది. సతీదేవి ముఖ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో పురాతన శాక్తేయ సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహిస్తుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటుంటారు.సావిత్రీ పీఠం – హరియాణాసావిత్రీ శక్తిపీఠం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా థానేసర్లో ద్వైపాయన సరోవరం ఒడ్డున ఉంది. ఈ క్షేత్రంలోనే కురుపాండవ సంగ్రామం జరిగిందనే మహాభారత కథనం అందరికీ తెలిసినదే! కురుక్షేత్రలో వెలసిన సావిత్రీ శక్తిపీఠం స్థానికంగా భద్రకాళి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల విజయం కోసం శ్రీకృష్ణుడు ఇదే శక్తిపీఠంలో అమ్మవారిని అర్చించాడట! యుద్ధానంతరం పాండవులు ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి, కానుకగా గుర్రాలను సమర్పించారట! ఈ ప్రదేశంలో సతీదేవి కుడిచేతి చీలమండ పడినట్లు పురాణాల కథనం. దసరా నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి.గాయత్రీ పీఠం – రాజస్థాన్గాయత్రీ శక్తిపీఠం రాజస్థాన్లోని అజ్మేర్ నగరానికి చేరువలో ఉన్న పుష్కరక్షేత్రంలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి మణికట్లు పడ్డాయని పురాణాల కథనం. అందువల్ల ఈ శక్తిపీఠాన్ని మణిబంధ పీఠం, మణివేదిక ఆలయం అని కూడా ఉంటారు. గాయత్రీ మంత్రసాధనకు ఈ శక్తిపీఠం అత్యుత్తమ క్షేత్రమని, ఇక్కడ చేసే గాయత్రీ మంత్రసాధన శీఘ్రంగా ఫలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పుష్కర క్షేత్రంలోని బ్రహ్మదేవుడి ఆలయానికి అతి చేరువలో ఉన్న ఈ ఆలయ నిర్మాణంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది.దేవగర్భ పీఠం – హిమాచల్ప్రదేశ్దేవగర్భ శక్తిపీఠం హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా పట్టణంలో ఉంది. ఇక్కడ వెలసిన దేవగర్భదేవినే వజ్రేశ్వరి అని, స్థానికులు కాంగ్రాదేవి అని అంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి ఎడమ స్తనభాగం పడినట్లు పురాణాల కథనం. వజ్రేశ్వరిని దుర్గాదేవి ఉగ్రరూపంగా భావిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయంలోని విలువైన సంపదను మహమ్మద్ ఘజనీ దోచుకున్నాడు. ఆ తర్వాత 1905లో సంభవించిన భూకంపంలో ఆలయ నిర్మాణం బాగా దెబ్బతినడంతో తర్వాత ప్రస్తుతం కనిపిస్తున్న రీతిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. దసరా నవరాత్రులు ఈ ఆలయంలో వైభవోపేతంగా జరుగుతాయి.త్రిపురసుందరీ పీఠం – త్రిపురత్రిపురసుందరీ శక్తిపీఠం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉదయపూర్ పట్టణంలో ఉంది. చిన్న కొండపై ఉన్న ఈ ఆలయ నిర్మాణం కూర్మాకృతిలో కనిపిస్తుంది. అందువల్ల దీనిని కూర్మపీఠం అని కూడా అంటారు. ఈ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరి రూపంలో కొలువై కనిపిస్తుంది. సతీదేవి కుడిపాదం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో అసోంలోని కామాఖ్య పీఠం తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయంగా త్రిపురసుందరీ పీఠం ప్రసిద్ధి పొందింది.భవానీ పీఠం – బంగ్లాదేశ్భవానీ పీఠం బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ జిల్లా సీతాకుండ్ వద్ద చంద్రనాథ్ కొండపై ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ఛత్తల్ భవానీ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు చంద్రశేఖరుడిగా కొలువై ఉండటంతో ఈ ప్రదేశం చంద్రకాంత్ ధామ్గా కూడా ప్రసిద్ధి పొందింది. సతీదేవి కుడి భుజం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దసరా నవరాత్రి వేడుకలు ఈ శక్తిపీఠంలో ఘనంగా జరుగుతాయి.శివానీ పీఠం – ఉత్తరప్రదేశ్శివానీ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా రామ్గిరిలో ఉంది. ఇక్కడ కామదగిరి ప్రదక్షిణ మార్గంలో కొండ మీద ఉన్న అనేక ఆలయాల్లో పురాతనమైన శివానీ పీఠం కూడా ఉంది. సతీదేవి కుడి స్తనభాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. రామాయణ కథనం ప్రకారం సీతా రామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ చిత్రకూట పర్వతంపైనే కొన్నాళ్లు గడిపారట! కామదనాథుడి పేరిట శివుడు వెలసిన కొండ కావడంతో ఈ కొండకు కామదగిరి అనే పేరు వచ్చింది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరికలు ఈడేరుతాయని భక్తుల నమ్మకం.హింగ్లాజ్ పీఠం – పాకిస్తాన్హింగ్లాజ్ శక్తిపీఠం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ మర్కన్ తీరంలో ఉన్న హింగ్లాజ్ పట్టణంలో ఉంది. హింగ్లాజ్ నేషనల్ పార్కలో ఉన్న కొండ పైభాగంలో ఉన్న గుహలో హింగ్లాజ్ ఆలయం ఉంది. ఇక్కడి దేవతను హింగ్లాజ్ దేవి అని, హింగులా దేవి అని అంటారు. సతీదేవి లలాట భాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. పాకిస్తాన్లోని హిందువులతో పాటు మన దేశంలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ దసరా నవరాత్రులతో పాటు వసంత నవరాత్రి వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. మహామాయ పీఠం – జమ్ము కశ్మీర్మహామాయ శక్తిపీఠం జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా అమర్నాథ్లో ఉంది. ఇది గుహాలయం. బయటి నుంచి చూడటానికి సాధారణమైన కొండగుహలా కనిపిస్తుంది గాని, లోపల పురాతనమైన మహామాయ విగ్రహం ఉంటుంది. అమర్నాథ్లో శివాలయం పొందినంతగా ఇది ప్రసిద్ధి పొందలేదు. అమర్నాథ్ యాత్రికుల్లో చాలామంది ఈ మహామాయ ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇది సతీదేవి గొంతు భాగం పడిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. ఇది పార్వతీపీఠంగా ప్రసిద్ధి పొందింది.దాక్షాయనీ పీఠం – టిబెట్దాక్షాయని శక్తిపీఠం టిబెట్లో ఉంది. కైలాస పర్వతానికి సమీపాన మానస సరోవరానికి చేరువలో ఉన్న ఒక మంచుకొండ మీద ఈ శక్తిపీఠం ఉంది. మానస సరోవరం వద్ద వెలసినందున దీనిని మానసా శక్తిపీఠం అని కూడా అంటారు. సతీదేవి కుడిచేయి ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాల కథనం. గోపురంలా కనిపించే శిఖరం కింద సహజంగా ఏర్పడిన గుహలోని పురాతన దాక్షాయని విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటుంటారు. గండకీ చండీ పీఠం – నేపాల్గండకీ చండీ శక్తిపీఠం నేపాల్లో ఉంది. హిమాలయ సానువుల్లో గండకీ నదీ తీరానికి చేరువలో ముస్తాంగ్ పట్టణానికి సమీపంలో ఈ శక్తిపీఠం ఉంది. హిందువులకు, బౌద్ధులకు పవిత్ర క్షేత్రమైన ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలోనే గండకీ చండీ ఆలయం కూడా ఉంది. సతీదేవి ముఖ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో పురాతన శాక్తేయ సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహిస్తుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటుంటారు.సావిత్రీ పీఠం – హరియాణాసావిత్రీ శక్తిపీఠం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా థానేసర్లో ద్వైపాయన సరోవరం ఒడ్డున ఉంది. ఈ క్షేత్రంలోనే కురుపాండవ సంగ్రామం జరిగిందనే మహాభారత కథనం అందరికీ తెలిసినదే! కురుక్షేత్రలో వెలసిన సావిత్రీ శక్తిపీఠం స్థానికంగా భద్రకాళి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల విజయం కోసం శ్రీకృష్ణుడు ఇదే శక్తిపీఠంలో అమ్మవారిని అర్చించాడట! యుద్ధానంతరం పాండవులు ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి, కానుకగా గుర్రాలను సమర్పించారట! ఈ ప్రదేశంలో సతీదేవి కుడిచేతి చీలమండ పడినట్లు పురాణాల కథనం. దసరా నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి.గాయత్రీ పీఠం – రాజస్థాన్గాయత్రీ శక్తిపీఠం రాజస్థాన్లోని అజ్మేర్ నగరానికి చేరువలో ఉన్న పుష్కరక్షేత్రంలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి మణికట్లు పడ్డాయని పురాణాల కథనం. అందువల్ల ఈ శక్తిపీఠాన్ని మణిబంధ పీఠం, మణివేదిక ఆలయం అని కూడా ఉంటారు. గాయత్రీ మంత్రసాధనకు ఈ శక్తిపీఠం అత్యుత్తమ క్షేత్రమని, ఇక్కడ చేసే గాయత్రీ మంత్రసాధన శీఘ్రంగా ఫలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పుష్కర క్షేత్రంలోని బ్రహ్మదేవుడి ఆలయానికి అతి చేరువలో ఉన్న ఈ ఆలయ నిర్మాణంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది.దేవగర్భ పీఠం – హిమాచల్ప్రదేశ్దేవగర్భ శక్తిపీఠం హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా పట్టణంలో ఉంది. ఇక్కడ వెలసిన దేవగర్భదేవినే వజ్రేశ్వరి అని, స్థానికులు కాంగ్రాదేవి అని అంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి ఎడమ స్తనభాగం పడినట్లు పురాణాల కథనం. వజ్రేశ్వరిని దుర్గాదేవి ఉగ్రరూపంగా భావిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయంలోని విలువైన సంపదను మహమ్మద్ ఘజనీ దోచుకున్నాడు. ఆ తర్వాత 1905లో సంభవించిన భూకంపంలో ఆలయ నిర్మాణం బాగా దెబ్బతినడంతో తర్వాత ప్రస్తుతం కనిపిస్తున్న రీతిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. దసరా నవరాత్రులు ఈ ఆలయంలో వైభవోపేతంగా జరుగుతాయి.త్రిపురసుందరీ పీఠం – త్రిపురత్రిపురసుందరీ శక్తిపీఠం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉదయపూర్ పట్టణంలో ఉంది. చిన్న కొండపై ఉన్న ఈ ఆలయ నిర్మాణం కూర్మాకృతిలో కనిపిస్తుంది. అందువల్ల దీనిని కూర్మపీఠం అని కూడా అంటారు. ఈ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరి రూపంలో కొలువై కనిపిస్తుంది. సతీదేవి కుడిపాదం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో అసోంలోని కామాఖ్య పీఠం తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయంగా త్రిపురసుందరీ పీఠం ప్రసిద్ధి పొందింది.భవానీ పీఠం – బంగ్లాదేశ్భవానీ పీఠం బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ జిల్లా సీతాకుండ్ వద్ద చంద్రనాథ్ కొండపై ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ఛత్తల్ భవానీ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు చంద్రశేఖరుడిగా కొలువై ఉండటంతో ఈ ప్రదేశం చంద్రకాంత్ ధామ్గా కూడా ప్రసిద్ధి పొందింది. సతీదేవి కుడి భుజం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దసరా నవరాత్రి వేడుకలు ఈ శక్తిపీఠంలో ఘనంగా జరుగుతాయి.శివానీ పీఠం – ఉత్తరప్రదేశ్శివానీ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా రామ్గిరిలో ఉంది. ఇక్కడ కామదగిరి ప్రదక్షిణ మార్గంలో కొండ మీద ఉన్న అనేక ఆలయాల్లో పురాతనమైన శివానీ పీఠం కూడా ఉంది. సతీదేవి కుడి స్తనభాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. రామాయణ కథనం ప్రకారం సీతా రామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ చిత్రకూట పర్వతంపైనే కొన్నాళ్లు గడిపారట! కామదనాథుడి పేరిట శివుడు వెలసిన కొండ కావడంతో ఈ కొండకు కామదగిరి అనే పేరు వచ్చింది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరికలు ఈడేరుతాయని భక్తుల నమ్మకం.హింగ్లాజ్ పీఠం – పాకిస్తాన్హింగ్లాజ్ శక్తిపీఠం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ మర్కన్ తీరంలో ఉన్న హింగ్లాజ్ పట్టణంలో ఉంది. హింగ్లాజ్ నేషనల్ పార్కలో ఉన్న కొండ పైభాగంలో ఉన్న గుహలో హింగ్లాజ్ ఆలయం ఉంది. ఇక్కడి దేవతను హింగ్లాజ్ దేవి అని, హింగులా దేవి అని అంటారు. సతీదేవి లలాట భాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. పాకిస్తాన్లోని హిందువులతో పాటు మన దేశంలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ దసరా నవరాత్రులతో పాటు వసంత నవరాత్రి వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలుదేశ విదేశాల్లో పలుచోట్ల అమ్మవారి ఆలయాల్లో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. దసరా వేడుకల సందర్భంగా పలుచోట్ల వీథుల్లో అమ్మవారి మండపాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోను, తెలంగాణలో ఆలంపురంలోని శక్తిపీఠమైన జోగులాంబ ఆలయంలోను ఈ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఈసారి దసరా వేడుకలు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజైన సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అక్టోబర్ 2న విజయదశమి నాటితో దసరా నవరాత్రులు పూర్తవుతాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని రోజుకో అవతారంలో రోజుకో తీరులో అలంకరిస్తారు. రోజుకో ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని నవరాత్రులలో చేసే అలంకరణలు, నైవేద్యాల వివరాలు: -
ఘాఘ్రా–చోళీలో గోల్డ్ మెడల్!
వయసు తొంభై ఏళ్లు దాటితే చాలామంది కూర్చుని మోకాలికి నూనె రాసుకోవడం, మనవరాళ్లకు కథలు చెప్పడం, రక్తపోటు–షుగర్ మందులు సరిగ్గా తీసుకున్నామా అని చెక్ చేసుకోవడం చేస్తుంటారు. కాని, ఈ అమ్మమ్మ మాత్రం అలా కాదు. ట్రాక్లోకి దూకి గోల్డ్ మెడల్ కొట్టేసింది. ఆమె తొంభై మూడేళ్ల పానీదేవి.పానీదేవి కథ సాధారణం కాదు. అమ్మాయిలకు చదువూ ఆటలూ దూరమైన కాలంలో పుట్టింది. పదిహేను ఏళ్లకే పెళ్లి, యాభై ఏళ్లకే భర్తను కోల్పోయింది. ఎనిమిది మంది పిల్లలకు తల్లి, తండ్రి తానే అయి పెంచింది. చిన్న వయసు నుంచే పొలాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. జీవితం అంతా బాధ్యతలతో నిండిపోయినా, ఆమె మనసులో ఎప్పుడూ ఒక కల మేల్కొని ఉండేది. ఆ కలను నిద్రపుచ్చాలా లేక సాకారం చేసుకోవాలా అనే ప్రశ్నకు సమాధానం ఆమె రెండేళ్ల క్రితం చెప్పింది. ఒకరోజు తన మనవడు జైకిష పారా అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా, పానీదేవి ఒక్కసారిగా ‘నేనూ చేస్తాను’ అని చెప్పింది. ఇంత వయసులో విశ్రాంతి తీసుకోమని కాకుండా, మనవడు ‘పరుగెత్తు’ అని ప్రోత్సహించాడు. అలా ఆ మనవడు, అమ్మమ్మ కాస్తా గురుశిష్యులుగా మారారు. కొత్త జీవితం! ఇంటి పనులు ముగించుకుని మైదానానికి వెళ్లడం, పాదాలు నొప్పితో వణికినా ఆగిపోకుండా శిక్షణ కొనసాగించడం, చుట్టుపక్కల వాళ్ల నవ్వులు వినిపించినా తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తడంతో ఆమె కొత్త జీవితం ఆరంభమైంది. ప్రేక్షకులు మొదట ‘ఈ వయసులోనా?’ అని ఆశ్చర్యపోయినా, ఘాఘ్రా–చోళీతో ట్రాక్లోకి దూకి కేవలం 45 సెకన్లలోనే 100 మీటర్లు పూర్తి చేసేసరికి చప్పట్లతో మైదానం మార్మోగిపోయింది. ఆ పోటీకి ముందు గుంతలో పడిపోయి ఆమె మోకాళ్లు గాయపడ్డాయి. డాక్టర్లు ‘విశ్రాంతి తీసుకోండి’ అన్నారు. కాని, పానీదేవి మాత్రం ‘మహా అయితే ఓడిపోతాను. కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఆగిపోవడం మాత్రం అసలు చేయను’ అంటూ పట్టుదలతో ట్రాక్లోకి దిగింది. అలా 2023లో అల్వార్లో మొదటి మెడల్, 2024లో పుణేలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె ఇవన్నీ ఇంట్లో అల్మారాలో దాచేసింది! మనవడు వీడియో పోస్ట్ చేయకపోతే, దేశం మొత్తం ఆమెను అసలు చూడకపోయేది. ఇప్పుడు ఆమె కల మరింత పెద్దది. త్వరలోనే ఇండోనేషియాలో జరగబోయే ఆసియ మాస్టర్స్ గేమ్స్లో భారత్ తరపున పతకం గెలవడానికి సిద్ధమవుతోంది. · -
దుబాయ్ రోడ్ల మీద డ్రైవరమ్మ జోరు!
ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా లెఫ్ట్ ఇండికేటర్ వేసి, రైట్కి తిరిగిందంటే, వెనక వున్నవాళ్లు తక్షణమే ‘లేడీ డ్రైవర్!’ అని ఫిక్స్ చేసేసుకుంటారు. కాని కొంతమంది ఓవర్టేక్ చేసి ముందుకు వచ్చి చూస్తే, చీర కట్టుకుని, పూలు పెట్టుకుని, స్టీరింగ్పై స్పీడ్ రేస్ చేస్తున్న మహిళలని చూసి షాక్ అవుతుంటారు. ఇలా సమాజంలో మహిళల డ్రైవింగ్పై ఇంకా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. కాని కేరళకు చెందిన డెబ్బై రెండేళ్ల మణి అమ్మ ఆ మాటలన్నింటినీ రోడ్డుమీద దుమ్ము దులిపేసింది. అందుకే ఆమెను అందరూ ‘డ్రైవర్ అమ్మ’ అని పిలుస్తారు. మణి అమ్మ కేవలం యాక్టివా నడిపే స్థాయిలో ఆగిపోలేదు. లగ్జరీ కార్లు, బస్సులు, ట్రక్కులు, క్రేన్లు, రోడ్ రోలర్లు ఇలా మీరు పేరు చెప్పండి, ఆమె ఆ వాహనాన్ని నడిపేందుకు సిద్ధంగా ఉంటుంది. మొత్తం పద్దెనిమిది రకాల వాహనాలను నడిపేందుకు కావలసిన పదకొండు లైసెన్సులు ఆమె చేతిలో ఉన్నాయి. 2004లో భర్త మరణం తర్వాత అతని ‘ఏ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్’ అనే డ్రైవింగ్ స్కూల్ను మూసేయకుండా, తానే స్కూల్ నడిపించి, తన జీవితాన్నే రేస్ ట్రాక్లా మార్చేసుకుంది. ఇటీవల దుబాయ్ వీథుల్లో, సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఆత్మవిశ్వాసంగా రోల్స్–రాయిస్ ఘోస్ట్ కారును నడుపుతున్న ఆమె వీడియో వైరల్ అవ్వడంతో, అది చూసి ‘మహీంద్రా’ అధినేత ఆనంద్ మహీంద్రా కూడా ఆమెకు సెల్యూట్ చేశారు. ప్రస్తుతానికి ఈ అమ్మ ఒక్క విమానం నడపటం మాత్రమే మిగిలి ఉంది, అది కూడా నేర్చుకుని నడిపించే ధైర్యం ఉంది అంటోంది మణి అమ్మ. -
Tirumala: శ్రీవారి భక్తులకు మార్గదర్శకాలు
తిరుమలకు బయలు దేరేముందు ఇష్టదేవతలను పూజించుకోవాలి.శ్రీ వారిని దర్శించేముందు పుష్కరిణిలో స్నానంచేసి, ముందుగా వరాహస్వామిని పూజించాలి. ఆ తర్వాతే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించాలి.ఆలయంలో నిశ్శబ్దాన్ని పాటిస్తూ ‘ఓం శ్రీవేంకటేశాయ నమః’ అని స్మరిస్తూ ఉండాలి.స్వామిపైనే ధ్యాసను ఉంచాలి. తిరుమల సమీపంలో ఉన్న ఆకాశగంగ, పాపవినాశనం తీర్థాలలో స్నానం చేస్తే, సకల పాపాలు హరిస్తాయి. తిరుమలలో ఉన్నప్పుడు సనాతన భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విధిగా పాటించాలి.తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలి కానుకలు, ముడుపులను ఆలయంలోని స్వామి హుండీలోనే సమర్పించాలి.తిరుమలలో భక్తులు చేయకూడనివిఆలయం చుట్టూ నాలుగు మాడవీథుల్లో పాదరక్షలు ధరించరాదు. ఈ వీథుల్లోనే ఉత్సవమూర్తులు నిత్యం ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తుంటారు.విలువైన ఆభరణాలు, ఎక్కువ నగదు మీ వద్ద ఉంచుకోకూడదు.శ్రీవారి దర్శనం కోసం కాకుండా ఇతర ఉద్దేశాలతో తిరుమలకు రాకూడదు.స్వామి దర్శనం కోసం త్వరపడకుండా మీవంతు వచ్చేవరకు ఆగాలి. ఆలయార్హత లేని సందర్భాల్లో ఆలయంలోకి రాకూడదు. స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో పువ్వులు అలంకరించుకోరాదు. తిరుమల గిరుల్లోని విరులన్నీ స్వామి సేవకే.కాటేజీల్లో నీరు, విద్యుత్ వృథా చేయకూడదు. అపరిచితులను వసతి గృహాల్లోకి అనుమతించరాదు. వారిని నమ్మి, గది తాళాలను ఇవ్వకూడదు.పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదు. తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం మొదలైనవి పూర్తిగా నిషేధం. పేకాట, జూదం వగైరాలు పూర్తిగా నిషేధం.శ్రీవారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించరాదు. వారిని ప్రోత్సహించరాదు. దళారుల నుంచి నకిలీ ప్రసాదాలను కొనుగోలు చేయరాదు. ఆలయప్రాంగణంలో ఉమ్మివేయరాదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధం.వివిధ రాజకీయసభలు, బ్యానర్లు, ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్లు మొదలైనవి నిషేధం.ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు వంటి పరికరాలు తీసుకువెళ్లరాదు. ఆయుధాలు తీసుకురాకూడదు.జంతువధ నిషేధం.భిక్షుకులను ప్రోత్సహించరాదు.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలన్న నిబంధనను టీటీడీ కచ్చితంగా అమలు చేస్తోంది.పురుషులు ధోవతి–ఉత్తరీయం, కుర్తా–పైజామా... మహిళలు చీర–రవిక, లంగా–ఓణి, చున్నీతో పాటు పంజాబీ డ్రస్, చుడీదార్ ధరించాల్సి ఉంటుంది.స్వచ్ఛంద సేవ ‘శ్రీవారి సేవ’లో పాల్గొనదలచిన వాలంటీర్లు కూడా డ్రెస్కోడ్ను విధిగా పాటించాలి. తొక్కిస లాటలకు, తోపులాటలకు తావులేకుండా ఆలయ అధికారులకు, స్వచ్ఛంద సేవకులకు సహకరిస్తే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం లభిస్తుంది. తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి దర్శనానుగ్రహాలు పరిపూర్ణంగా లభించాలని కోరుకుందాం. -
కలియుగ వైకుంఠం.. తిరుమల ఆలయం
కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయం. క్రీ.పూ. 12వ శతాబ్దంలో తిరుమలలో శ్రీవెంకటేశ్వర ఆలయం నిర్మితమైంది. 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆలయ గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు.. పవిత్ర వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరచేందుకు వేరువేరు గదులు. లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగది. మొదటి ప్రాకారం..మహాద్వార గోపురంఏడుకొండల్లో కొలువైన వెంకన్న స్వామిని దర్శించుకునే ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ప్రవేశద్వార గోపురమే మహాద్వార గోపురం. పడికావలి, సింహద్వారం, ముఖద్వారం అని వేరువేరు పేర్లు ఉన్నాయి. పెద్దవాకిలి. తమిళంలో ‘పెరియ తిరువాసల్’ అని కూడా పిలుస్తారు. ఈ మహాద్వారాన్ని గోపురంతో అనుసంధానిస్తూ నిర్మించిన ప్రాకారమే మహా ప్రాకారం అంటారు. వైకుంఠం క్యూ కంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటారు. లోనికి అడుగుపెట్టక మునుపు పైపుల ద్వారా వచ్చే నీటితోనే భక్తులు పాదాలను శుభ్రం చేసుకుని ప్రవేశించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ వాకిలి గోడపై అనంతాళ్వారులు వినియోగించిన గునపం ఇప్పటికీ కనిపిస్తుంది.శంఖనిధి.. పద్మనిధిమహాద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల్లా పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. వీరే శ్రీవారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ఉంటాయి. కుడివైపున ఉన్న మరో రక్షక దేవత పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి.కృష్ణదేవరాయమండపంమహాద్వారానికి ఆనుకుని లోపలివైపు 16 స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపమే శ్రీకృష్ణదేవరాయ మండపం. దీనినే ప్రతిమ మండపం అని కూడా అంటారు. ఈ మండపం లోనికి ప్రవేశిస్తున్నప్పుడు కుడివైపున రాణులు తిరుమలదేవి, చిన్నమదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మణ్ణి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడు పర్యాయాలు తిరుమల యాత్ర చేసి శ్రీవారికి ఎన్నో కానుకలు సమర్పించారు. అచ్యుతరాయలు తనపేరిట బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు.అద్దాల మండపంప్రతి మండపానికి 12 అడుగుల దూరంలో ఎతై ్తన అధిష్ఠానంపై నిర్మించిన దాన్నే అద్దాల మండపం లేదా ఆయినా మహల్ అంటారు. ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు. ఈ అరలు ఉన్న ప్రాంతాన్ని ప్రసాదం పట్టెడ అంటారు.తులాభారంశ్రీకృష్ణదేవరాయల మండపానికి ఎదురుగా ఉంటుంది తులాభారం. భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణా తులాభారంగా స్వామివారికి సమర్పించుకుంటుంటారు. తులాభారానికి అవసరమైన వస్తు సామగ్రిని భక్తులు తిరుమలకు మోసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆలయం లోపలే తులాభారంలో వేయాల్సిన వస్తువులకు తగిన నగదు రూపంలో చెల్లిస్తే టీటీడీనే ఆ వస్తువులను సమకూరుస్తుంది.రంగనాయక మండపంకృష్ణదేవరాయ మండపానికి దక్షిణం వైపుగా 108 అడుగల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో శిల్ప శోభితమై విరాజిల్లుతూ కనిపించేదే రంగనాయక మండపం. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపం అని పిలుస్తారు. ఒకప్పుడు నిత్యకళ్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలైన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వాచనంతో పాటు స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు.తిరుమలరాయ మండపంరంగనాయక మండపాన్ని ఆనుకుని పడమరవైపున ఉన్న ఎత్తైన స్తంభాలతో, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి ఈ మండపం. ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించారు. స్వామివారికి ‘అన్నా ఊయల తిరునాళ్లు’ అనే ఉత్సవాన్ని నిర్మించే నిమిత్తం క్రీశ 1473లో ఈ మండపాన్ని నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించారు. బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.రాజా తోడరమల్లుఅక్బర్ ఆస్థానంలో మంత్రిగా ఉన్న లాలా ఖేమార్ము క్షత్రియ వంశస్థుడు. ఈయన రాజా తోడరమల్లుగా ప్రసిద్ధి పొందాడు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశించేటప్పుడు ధ్వజస్తంభానికి సమీపంలో రాజా తోడరమల్లు, తల్లి మాత మోహనాదేవి, భార్య పితబీబీ విగ్రహాలు స్వామివారికి అభిముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్నట్టు కనిపిస్తాయి. 17వ శతాబ్దంలో ముస్లిం పాలకుల దాడులు, బ్రిటిష్ దండయాత్రల నుంచి శ్రీవారి ఆలయాన్ని సంరక్షించిన పాలకుల్లో రాజా తోడరమల్లు ఒకరు. నాటి నుంచి వీరి లోహ విగ్రహాలు తిరుమల ఆలయంలో ఉన్నాయి.ధ్వజస్తంభంధ్వజస్తంభ మండపం వెండి వాకిలికి ఎదురుగా చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంలా ఎత్తైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం. ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండి వాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్న ధ్వజారోహణం అంటారు. బలిపీఠంధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఆనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారురేకు తాపడం ఉంటుంది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని (అన్నాన్ని) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.క్షేత్రపాలక శిలధ్వజస్తంభానికి ఈశాన్య మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే క్షేత్రపాల శిల అంటారు. ఇది రాత్రి పూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్లేటప్పుడు గుడికి తాళం వేసి తరువాత ఈ శిలపై ఉంచి నమస్కరించి తాళం చెవులను తీసుకెళుతారు. మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి తాళం చెవులతో గుడి తలుపులు తెరుస్తారు. సంపంగి ప్రాకారంమహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థలవృక్షాలనేవి ఉండటం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం సంపంగి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందున ఇలా పిలువబడుతోంది. కళ్యాణమండపందక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంలో ఈ కళ్యాణమండపాన్ని నిర్మించారు. ఇందులో తూర్పుముఖంగా ఉన్న కళ్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కళ్యాణోత్సవం జరుగుతుంది.ఉగ్రాణంస్వామివారి ప్రసాదాలకు తయారయ్యే ముడిసరుకులు నిల్వ ఉంచే గది. ఇది వాయవ్య మూలగా ఉంటుంది.విరజానదివైకుంఠంలోని పరమ పవిత్రమైన ఈ నది శ్రీవారి పాదాల క్రిందగా ప్రవహిస్తుంటుందని నమ్మకం. ఆలయం లోపలి బావుల్లో ఈ నది నీరు ప్రవహిస్తుందని, అందుకే ఆలయ బావుల్లోని నీరు పరమ పవిత్రమైనదిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వినియోగిస్తుంటారు.నాలుగుస్తంభాల మండపంసంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వనరసింహ రాయలు, ఆయన భార్య, ఇద్దరు కుమారుల పేర స్తంభాలు కట్టించారు.పూలబావిపూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామివారికి ఉపయోగించిన పూలను ఇందులో వేస్తారు. దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్లేటప్పుడు ఎతైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.వగపడి భక్తులు దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది. ముఖ మండపం అద్దాల మండపానికి ముందు భాగంలో ఉంటుంది. కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు ఇక్కడ అందజేస్తారు.రెండవ ప్రాకారం..వెండి వాకిలి.. నడిమి పడికావలి ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండి వాకిలి. నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండి వాకిలి మీదుగా భక్తులు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రవేశ ద్వారమంతటా వెండిరేకు తాపడం చేసినందున దీన్ని వెండివాకిలి అంటారు. ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీవారు పాచికలాడుతున్న శిల్పం ఉంటుంది.విమాన ప్రదక్షిణంవెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అని కూడా అంటారు. సుప్రభాత సేవ జరిగే సమయంలో భక్తులు వెలుపల అంగప్రదక్షిణం చేస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలో వెండి వాకిలికి ఎదురుగా శ్రీరంగనాథస్వామి, వరదరాజస్వామి ఆలయాలు ఉంటాయి. ఇంకా ప్రధాన వంటశాల, పూలబావి, అంకురార్పణ మండపం, యాగశాల, నాణేల పరకామణి, నోట్ల పరకామణి, చదనపు అర, విమాన వేంకటేశ్వరస్వామి, రికార్డులగది, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి సన్నిధి, ప్రధాన హుండి, విష్వక్సేనుల వారి ఆలయం మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్లుగా పేర్కొంటారు.బంగారు బావిదర్శనాంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడం ఉంటుంది. ఇందులో నీటినే స్వామి వారి అభిషేకాలకు, ప్రసాదాలకు వినియోగిస్తారు. ఇందులో వైకుంఠంలోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.వకుళాదేవిబంగారుబావి పక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది. శ్రీవారి తల్లి. ద్వాపరయుగంలో యశోదాదేవే ఈ కలియుగంలో స్వామివారి కళ్యాణం చూడటానికి వకుళాదేవిగా అవతరించింది.అంకురార్పణ మండపంబంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు. ఇంకా గరుడ, విష్వక్సేన, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.యాగశాలహోమాది క్రతువులు నర్వహించే ప్రదేశం. ఇప్పుడు సంపంగి ప్రాకారంలోని కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.సభ అరకైంకర్యాలకై ఉపయోగించే బంగారు, వెండి పాత్రలు, కంచాలు, గొడుగులు ఉంచే ప్రదేశం. ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విసనకర్రలను ఇక్కడే భద్రపరుస్తారు.సంకీర్తన భాండాగారంసభ అర పక్కనే ఈ గది ఉంటుంది. ఇరువైపులా తాళ్లపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్లపాక వంశం వారు రచించిన సుమారు 32వేల సంకీర్తనలను భద్రపరచారు. వేటూరి ప్రభాకర శాస్త్రి, సాధు సుబ్రమణ్యశాస్త్రి వంటి వారి విశేష కృషి వలన ఈ రోజు మనం వాటిని చూస్తున్నాం.భాష్యకార్ల సన్నిధిఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏ కైంకర్యాలు ఏ విధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి. తన 120 సంవత్సరాల కాలంలో మూడు పర్యాయాలు తిరుమలకు మోకాళ్లపై వచ్చారు. అలా వస్తున్నప్పుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ల పర్వతం. నేటికీ కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్లతో ఎక్కుతుంటారు.పోటుప్రధాన వంటశాల. విమాన ప్రదక్షిణంలో ఈ పోటు ఉంది. ఇక్కడ దద్ధోజనం, చక్కెర పొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరాతో పాటు కళ్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్ పాయసం, అప్పం మొదలైనవి తయారు చేస్తుంటారు. ఆనందనిలయ విమానంఆనందనిలయంపై ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు. గరుత్మంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుంచి భూమి మీదకు తీసుకొచ్చారని చెబుతారు. దీని మీద దాదాపు 64 మంది దేవతామూర్తుల ప్రతిమలు ఉన్నట్లు చెబుతుంటారు. ఈ గోపురంపైనే వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామినే విమాన వెంకటేశ్వరస్వామి అంటారు.రికార్డు గదిస్వామివారి అభరణాల వివరాలు, జమ ఖర్చులు వివరాలను భద్రపరచు గది.వేదశాలరికార్డుల గది పక్కనే వేద పండితులు పఠనం చేసే గది. ఇక్కడ మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.యోగనరసింహస్వామి సన్నిధిరామానుజాచార్యులుచే శ్రీనరసింహాలయం ప్రతిష్ఠితం చేయబడింది. క్రీశ 1330–1360 మధ్య కాలంలో నిర్మించినట్లు పరిశోధకుల అభిప్రాయం. క్రీశ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. అళగియ సింగం (అందమైన సింహం) అని, వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది. చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండటం ప్రత్యేకం. ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.శంకుస్థాపన స్తంభంరాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.పరిమళ అరశంకుస్థాపన స్తంభం నుంచి తిరిగి వచ్చే మార్గంలో ఈ పరిమళ అర ఉంది. స్వామివారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.శ్రీవారిహుండీభక్తులు కానుకలు వేసే ప్రాంతం. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగినా ఇప్పటికీ ఎటువంటి మార్పు చెందని ఒకే ఒక స్థలం. దీని కింద శ్రీచక్రయంత్రం, ధనాకర్షణ యంత్రం ఉన్నాయని నమ్మకం.బంగారు వరలక్ష్మిహుండీ ఎడమగోడపై బంగారు లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ఈవిడ భక్తులకు అషై్టశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.కటాహ తీర్థంఅన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టిలాంటి నిర్మాణం. ఇందులో స్వామివారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.విష్వక్సేనహుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ఘంటా మండపంబంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్య ఉన్న ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామివారి సందర్శనకు వేచి ఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు. పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయంలో వీటిని మోగించేవారు. దీనిని ఘంటపని అనేవారట. ఈ గంటలను అనుసరించే స్వామివారి ఆహారసేవలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం తీసుకునేవారట. ప్రస్తుతం రెండూ ఒకేచోటుకు చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం పక్కనే ఉంటాయి.గరుడ సన్నిధిమూలవిరాట్టుకు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారు మండపం. బంగారువాకిలి ఎదురుగా, గరుడాళ్వార్ మందిరం ఉంది. శ్రీవారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో ఉన్న గరుడాళ్వారు దర్శనమిస్తాడు. ఈ మందిరానికి వెలుపల అంతటా బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.ద్వారపాలకులుబంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు. మహాలఘు దర్శనం ఇక్కడే చేసుకుంటారు.మూడవ ప్రాకారం..బంగారు వాకిలిశ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లటానికి అత్యంత ప్రధానమైన ఏకైక ద్వారం బంగారు వాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారు వాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాత పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీమలయప్పస్వామి వారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. స్నపన మండపంబంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే స్నపనమండపం. క్రీ.శ. 614లో పల్లవరాణి సామవై ఈ మండపాన్ని నిర్మించి భోగశ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించారట. ఈ స్నపన మండపాన్నే తిరువిలాన్కోయిల్ అంటారు. ఆనందనిలయం జీర్ణోద్ధరణ సమయంలో ఈ మండపాన్ని నిర్మించినట్లు చెబుతారు. ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునికి ఆరోజు పంచాంగం చెప్పే పూజారులు, క్రితం రోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు. రాములవారి మేడస్నపన మండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపులా ఎత్తుగా కనిపిస్తుంది రాములవారి మేడ. తమిళంలో మేడు అంటే ఎతై ్తన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆనంద నిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పేరుపొందింది.శయన మండపంశ్రీవారి గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయన మండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.కులశేఖరపడిశ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరపడి. పడి అనగా మెట్టు, గడప అని అంటారు.ఆనందనిలయంకులశేఖరపడి అనే బంగారు గడప దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. ఈ ఆనందనిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయం అంటారు.శ్రీవేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు)గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిల్చొని ఉన్న శిలాదివ్యమూర్తి శ్రీవేంకటేశ్వరస్వామి. నిలబడి ఉన్నందున ఈ అర్చామూర్తిని ‘స్థానకమూర్తి’ అంటారు. అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ‘ధ్రువమూర్తి’ అని, ‘ధ్రువబేరం’ అని కూడా అంటారు. శ్రీవారు అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నారు. ఈ మూలమూర్తికి ప్రతినిధులుగా కొలువు శ్రీనివాసమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మలయప్ప స్వామి అనే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా సీతారామలక్ష్మణులు, శ్రీకృష్ణ రుక్మిణులు, చక్రత్తళ్వారులు, సాలగ్రామ శిలలు ఉన్నాయి (స్వామివారికి ప్రతిరూపాలుగా వారికి నిత్య అభిషేకాలు జరుగుతుంటాయి)∙ -
Tirumala: ఆ దేవదేవుడికి కునుకే కరువు..!
కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే భూలోకవైకుంఠం తిరుమలక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు. పూర్వం చీమలపుట్టలో దాగి ఎండకు ఎండి, వానకు తడిసిన స్వయంవ్యక్త దివ్యతేజో సాలగ్రామ శిలామూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి నేడు కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. ఆ దేవదేవుడికే ఇప్పుడు కొత్త కష్టం ఎదురైంది. యేళ్ల తరబడి ఆ స్వామికి కంటిమీద కనుకు కష్టమైపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..!! అవును.. పూర్వం వేళ్ల మీద లెక్క పెట్టగలిగేంత మంది భక్తజనం రావటంతో స్వామి దర్శనం కేవలం పగటిపూట మాత్రమే కలిగేది. రానురానూ తిరుమలకొండ మీద సౌకర్యాలు పెరిగాయి. భక్తులు పెరిగారు. క్యూలు పెరిగాయి. వారి వేచి ఉండే సమయం పెరిగింది. ఆ ప్రభావం సాక్షాత్తు మన స్వామి దర్శనం మీద పడిందనటంలో అతిశయోక్తిలేదు. కష్టాలు తొలగాలని కోర్కెల చిట్టాలతో వచ్చే భక్త జనులకు దివ్యాశీస్సులు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే అన్నట్టుగా స్వామి క్షణకాలం కూడా తీరికలేకుండా అనుగ్రహిస్తున్నారనటంలో ఆవంతైనా అనుమానం లేదు. మన స్వామికి కంటి మీద కనుకు లేకపోవడానికి కారణ విశేషాలేమిటో తెలుసుకోవాల్సిందే మరి!!నాటి కుగ్రామం నుండి ప్రపంచ స్థాయి క్షేత్రంగా విరాజిల్లుతూ..1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆవిర్భవించే నాటికి ఈ క్షేత్రం కుగ్రామమే. కనీసం మట్టిరోడ్డు కూడా లేని దట్టమైన అటవీ ప్రాంతం. తిరుమల కొండకు రెండు ఘాట్రోడ్ల ఏర్పాటుతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తొలగాయి. ఎలాంటి మౌలిక వసతుల్లేని తిరుమలలో ప్రస్తుతం స్టార్ హోటళ్ల స్థాయి సౌకర్యాలు ఏర్పడ్డాయి.ఒకప్పుడు చేతివేళ్లపై లెక్కపెట్టగలిగేలా ఉన్న సిబ్బంది నేడు వేలసంఖ్యకు పెరిగారు. రోజూ వందల సంఖ్యలోపే వచ్చే భక్తులు నేడు 70 వేలు దాటారు. అప్పట్లో వేలల్లో లభించే ఆలయ హుండీ కానుకలు కూడా ఆ మేరకు పెరిగి రూ.2.5 నుండి రూ.3 కోట్లకు చేరుకున్నాయి. రూ.లక్షల్లో ఉన్న స్వామి ఆస్తిపాస్తులు నేడు లక్షన్నర కోట్లరూపాయలకు పైబడ్డాయి. పగలు మాత్రమే దర్శనమిచ్చిన స్వామికి నేడు అర్ధరాత్రి దాటినా కూడా కునుకు దొరకని విధంగా భక్తులు పెరిగిపోయారు. ⇒ నాడు దట్టమైన అరణ్యంలో దాగిన తిరువేంగడమే నేడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల క్షేత్రం. పూర్వం తిరుమలకొండను ‘తిరువేంగడం’ అని, శ్రీవేంకటేశ్వర స్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అనీ కీర్తించేవారు. మహనీయులెందరో..!⇒తిరుమల „ó త్రానికి పల్లవులు, చోళులు, పాండ్యులు, కాడవ రాయరులు, తెలుగుచోళులు, తెలుగు పల్లవులు, విజయనగర రాజులు విశిష్ట సేవ చేశారు. ఆలయ కుడ్యాలపై ఉన్న శాసనాలే ఇందుకు ఆధారం. ఆ తర్వాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తెల్లదొరలు, ఆర్కాటు నవాబులు, మహంతులు, అధికారులు తిరుమలేశుని కొలువులో సేవించి తరిస్తూ ఆయా కాలాల్లో ఆలయ పరిపాలనలో భక్తులకు తమవంతుగా సేవలు, సౌకర్యాలు కల్పించారు. ⇒ఇక ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, అన్నమాచార్యులు, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వంటి వారెందరో ఈక్షేత్ర మహిమను వేనోళ్ల కొనియాడారు. తిరుమలేశుని వైభవ ప్రాశస్త్యాన్ని దశదిశలా చాటారు. బ్రిటిష్ చట్టాలపైనే దేవస్థానం పునాదులురెండొందల ఏళ్లకుపైగా దేశాన్ని పరిపాలించిన తెల్లదొరలు కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులేనని చెప్పొచ్చు. దేవస్థానం పాలన కోసం వేసిన పునాదులు వారి కాలంలోనే పటిష్ఠంగా ఏర్పడ్డాయనటానికి టీటీడీ వద్ద లభించే రికార్డులే ఆధారం. ⇒1843 నుండి 1933 వరకు మహంతుల పాలన జరిగింది. ఆలయ పరిపాలన కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆలయ కమిషనర్తోపాటు ధర్మకర్తల మండలి కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టింది. ⇒ చివరి మహంతు ప్రయాగ్దాస్ దేవస్థాన కమిటీకి తొలి అధ్యక్షులుగా 1933 నుంచి 1936 వరకు సేవ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 52 మంది అ«ధ్యక్షులు, స్పెసిఫైడ్ అథారిటీ ప్రత్యేక పాలనాధికారులుగా పనిచేశారు.⇒ధర్మకర్తల మండళ్లలోని చైర్మన్, ఈవోలు ఎవరికి వారు ఆయా కాలాల్లో అవసరాలకు అనుగుణంగా భక్తుల బస కోసం సత్రాలు, కాటేజీలు నిర్మించారు. ప్రయాణ సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. తొలినాళ్లలో పగటిపూటే స్వామి దర్శనం⇒1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత కూడా తిరుమలకు నడిచేందుకు సరిగ్గా కాలిబాట మార్గాలు లేవు. తిరుమల మీద కూడా అలాంటి పరిస్థితులే కనిపించేవి. చుట్టూ కొండలు, బండరాళ్లే కనిపించాయి.⇒కొండకు వచ్చే భక్తులు ఆలయం ఎదురుగా ఉండే వేయికాళ్ల మండపం, ఆలయ నాలుగు మాడ వీథుల్లోని మండపాలు, స్థానిక నివాసాల్లో తలదాచుకునేవారు. అప్పట్లో ఎలాంటి క్యూలు ఉండేవికావు. ⇒మహాద్వారం నుండే గర్భాలయం వరకు వెళ్లేవారు. స్వామిని తనివితీరా దర్శించుకునేవారు. అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రమైన మంచు, చలి ఉండేవి. అందుకే సూర్యుడు కనిపించే సమయంలోనే ఆలయాన్ని తెరిచి ఉంచేవారు. ఘాట్రోడ్ల నిర్మాణంతోనే భక్తుల పెరుగుదల ⇒ఈ పరిస్థితులలో మద్రాసు ఉమ్మడి రాష్ట్ర బ్రిటిష్ గవర్నర్ సర్ ఆర్థ్థర్ హూప్ నేతృత్వంలో ప్రముఖ భారతీయ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఘాట్రోడ్కు రూపకల్పన చేశారు.⇒1944 ఏప్రిల్ 10న మొదటి ఘాట్రోడ్డు ప్రారంభమైంది. తొలుత ఎడ్లబండ్లు, తర్వాత నల్లరంగు బుడ్డ బస్సులు (చిన్న బస్సులు) ఈ మొదటి ఘాట్రోడ్డులోనే తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి. దీంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ⇒1951 నవంబర్ నెల మొత్తానికి కలిపి శ్రీవారి దర్శనానికి దేవస్థానం బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య 27,938 మంది, 1953, ఏప్రిల్లో 52,014 మంది మాత్రమే. ⇒1961, నవంబర్ మొత్తంగా తిరుమల ఘాట్రోడ్డులో 1,986 కార్లు, బస్సులు, 81 మోటారు సైకిళ్లు తిరిగాయి.⇒తర్వాత 1974లో అందుబాటులోకి వచ్చిన రెండో ఘాట్రోడ్డుతో తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు మరింత మెరుగుపడ్డాయి.⇒ప్రయాణ సమయం తగ్గింది. నునుపైన తారు, సిమెంట్ రోడ్లు అందుబాటులోకి రావటం, వాటిపై వాహనాలు రివ్వున తిరగటంతో తిరుమలేశుని దర్శించే భక్తుల రాక క్రమంగా పెరుగుతూ వచ్చింది.⇒రెండో ఘాట్రోడ్డు అందుబాటులోకి రావటంతో రోజుకు పదివేల మంది భక్తులు పెరిగారు. టీటీ డీ రవాణా సంస్థ వాహనాల బదులు 10.8.1975 నుండి రెండు ఘాట్రోడ్లపై ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో తిరగటంతో భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు 500 ఆర్టీసీ బస్సులు, రోజుకు 3,200 ట్రిప్పులు సాగిస్తూ.. బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. నాడు నిమిషాల్లోనే దర్శనం.. నేడు రోజు పైబడి...∙1933 నుంచి 1970కి ముందు వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు.⇒మొదటి ఘాట్రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 5 వేలు, 1974లో పూర్తిస్థాయిలో రెండవ ఘాట్రోడ్డు వచ్చేనాటికి ఈ సంఖ్య రోజుకు సుమారు 10 వేలకు పెరిగింది. ⇒తిరుమలలో పాతపుష్కరిణి కాంప్లెక్స్ నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. దీంతో 1990 నాటికి రోజుకు 20 నుంచి 25 వేలు, 1995కు 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు పెరిగింది.⇒2003 నాటికి రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మించారు. క్యూలైన్లు పెరిగాయి. భక్తుల నిరీక్షణ సమయం రెండు రోజులకు పెరిగింది. 2010 నాటికి రోజువారీ భక్తుల సంఖ్య 60 వేలకు చేరింది.⇒ఇలా 2010 సంవత్సరంలో మొత్తం 2.14 కోట్ల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 2011లో 2.43 కోట్లు, 2012లో 2.73 కోట్లు, 2013లో ఈ సంఖ్య 1.96 కోట్లు (సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం), 2014లో 2.26 కోట్లు, 2015లో 2.46 కోట్లు, 2016లో 2.66 కోట్లమంది భక్తులు వచ్చారు. ⇒ఇక ఈ యేడాది 8 నెలలకే సుమారు 2 కోట్లకు చేరగా, ఈ సంఖ్య ఏడాదికి 3 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.⇒స్వామి దర్శనానికి రోజువారీగా పోటెత్తే భక్తులకు ఈ రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 64 కంపార్ట్మెంట్లు చాలటం లేదు. శుక్ర, శని, ఆదివారాల్లో కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో భక్తులు నిరీక్షించటం రివాజుగా మారింది. ⇒పెరుగుతున్న రద్దీ వల్ల భక్తులు రోజుల తరబడి తిరుమలలో నిరీక్షించకుండా 2000 సంవత్సరంలో దర్శనానికి సుదర్శనం కంకణ విధానం, ఆన్లైన్ రిజర్వేషన్ పద్ధతికి రూపకల్పన చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా ఈ–దర్శన్ కౌంటర్ల ద్వారా దర్శనం టికెట్లు, ఆర్జితసేవా టికెట్ల కేటాయింపును చేపట్టారు. 2009వ సంవత్సరం నుండి ప్రవాస భారతీయులకు, ఏడాదిలోపు వయసున్న చంటిబిడ్డతోపాటు వారి తల్లిదండ్రులను ‘సుపథం’ ద్వారా అనుమతిస్తున్నారు. ⇒2010వ సంవత్సరంలో అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో నడచి వచ్చే భక్తులకు దివ్య దర్శనం (ప్రస్తుతం టైమ్ స్లాట్ విధానం) ఆరంభించారు.⇒అదే ఏడాదే ఎటువంటి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా టికెట్లు కొనుగోలు చేసేవిధంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆరంభించారు. ప్రస్తుతం ఆ¯Œ లైన్ టైంస్లాట్లో మాత్రమే టికెట్ల అమ్మకం చేస్తున్నారు. ⇒ఆలయ మహద్వారం నుండి (పస్తుతం దక్షిణ మాడవీ«థి నుండి) వికలాంగులు, 65 ఏళ్ల వయసు నిండిన వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులను అనుమతించారు.⇒ఇక సిఫారసులతో రూ.500 టికెట్ల వీఐపీ దర్శనాలు, అన్ని రకాల ఆర్జితసేవా టికెట్లతో ప్రత్యేక దర్శనాలు.. ఇలా అన్ని కేటగిరీల్లోని భక్తులకు ఏదో రూపంలో సుమారు పది రకాలకు పైగా దర్శనాలను టీటీడీ కల్పిస్తోంది. కోనేటిరాయని కునుకు పదినిమిషాలే! ⇒మహంతుల కాలం (1843 నుంచి 1933)లో తిరుమల ఆలయంలో గర్భాలయ దివ్యమంగళ మూర్తికి గంటల తరబడి విశ్రాంతి ఉండేది. నిత్య ఏకాంత కైంకర్యాలన్నీ నిర్ణీత వేళల్లో సంపూర్ణంగా జరిగేవి.⇒2000వ సంవత్సరం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయి పట్టుమని పదినిమిషాలు కూడా స్వామికి విశ్రాంతి లభించటం లేదు. ⇒ఇక తప్పని పరిస్థితుల్లో లాంఛనంగా తలుపులు వేసి మమ అనిపిస్తున్నారు. ఆగమం ప్రకారం ఆరు గంటలు విరామం, ఏకాంత కైంకర్యాలుండాలి⇒వైఖానస ఆగమం ప్రకారం గర్భాలయ మూలమూర్తి దర్శనానికి కనిçష్ఠంగా 6 గంటలపాటు విరామం ఉండాలి. అదే స్థాయిలోనే స్వామికి ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి ఏకాంత కైంకర్యాలు ఉండాలని పండితులు చెబుతున్నారు.⇒ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. 24 గంటల్లో కేవలం 4 గంటల కంటే తక్కువ సమయాన్ని స్వామివారి కైంకర్యాలకు కేటాయిస్తున్నారు. మిగిలిన 20 గంటలపాటు వివిధ రకాల పేర్లతో టికెట్లు కేటాయించి దర్శనం అమలు చేస్తున్నారు. ⇒ఇక నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ పేరుతో పట్టుమని పది నిమిషాలు కూడా స్వామికి విరామం ఇవ్వటం లేదు. ఏకధాటిగా 22 గంటలపాటు స్వామి దర్శనం సాగించే పరిస్థితులు పెరిగాయి. అర్ధరాత్రి దాటాక ఏకాంత సేవ, ఆ వెంటనే సుప్రభాతం నిర్వహిస్తూ స్వామి కైంకర్యాలు నిర్వహించే పరిస్థితులు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి టీటీడీ అధికారులు చెబుతున్న ప్రధాన కారణం ఒక్కటే. భక్తుల రద్దీ...రద్దీ.. భక్తుల రద్దీకి తగ్గట్టు స్వామి దర్శనం కల్పించవలసిన బాధ్యత ఎంత మేరకు ఉందో, పూర్వం నుండి ఆగమోక్తంగా అమలు చేసే స్వామి కైంకర్యాల్లో కోత విధించటం, స్వామికి విరామం లేకుండా చేయటం సమాజ శ్రేయస్కరం కాదని ఆగమ పండితుల హెచ్చరికల్ని కూడా దేవస్థానం అధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి!! -
Tirumala: తిరుమలలో అదృశ్య ఆలయం!
పచ్చని తోరణాలు, చుట్టూ ఎతైన పర్వతాలు– నలువైపులా ఎటు చూసినా ప్రకృతి రమణీయత. దైవకళ ఉట్టిపడేలా నిత్యం గోవింద నామ సంకీర్తన. స్వామివారి వైభవాన్ని చాటే ఆనంద నిలయం తిరుమల. అందుకే మహర్షులు, పురాణేతిహాసాలు పేర్కొన్నట్లుగా సకల సృష్టిలో వేంకటాచల పర్వతాన్ని మించిన పర్వతం మరొకటి లేదు. ఆపద మొక్కులవాడు, అభయప్రదాత అయిన శ్రీవేంకటేశ్వరుడు అర్చావతార మూర్తిగా కలియుగంలో ఆనంద నిలయంలో కొలువై ఉన్నాడు. సామాన్య మానవులు ఇదే ఆలయాన్ని దర్శించుకుని, స్వామివారిని కొలుచుకుంటూ ఉంటారు. అయితే, దేవతలు, రుషుల కోసం స్వామివారు మరో ఆలయాన్ని తిరుమలపై నిర్మించుకున్నారట! సకల దేవతల నిలయమైన ఈ ఆలయానికి దేవతలు, మహర్షులు వస్తుంటారట! బ్రహ్మాది దేవతలు, సప్తర్షులు, అష్టదిక్పాలకులు ఈ కలియుగంలో శ్రీమహావిష్ణువు ధరించిన శ్రీ శ్రీనివాసుని అవతారాన్ని దర్శించి, సేవించి తరిస్తుంటారట! స్వయంభూ మన్వంతర కాలంలో ఆది కృతయుగంలో శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి శ్రీదేవీ భూదేవీ సమేతంగా వచ్చి ఇక్కడ వెలశాడట! శ్వేతవరాహ కల్పం చివరి వరకు ఇక్కడే ఉంటానని శ్రీవారు దేవతలకు చెప్పారట! స్వామివారి ఆదేశంపై దేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన ఈ ఆలయం అదృశ్యంగా ఉందని, స్వామివారు ఈ ఆలయంలో సజీవంగా సకల సేవలను అందుకుంటున్నారని శ్రీ వేంకటాచల మహాత్మ్యం చెబుతోంది. భౌతిక జీవితాలను గడిపే మానవమాత్రులకు ఈ ఆలయం గోచరించదని స్థలపురాణం చెబుతుంది. -
స్వామివారి పాదాల కింద విరాజిల్లిన విరజానది
స్వామివారి పాదాల కింద ప్రవహించే విరజానది ఆలయంలో సంపంగి ప్రదక్షిణంలో ఉగ్రాణం ముందున్న చిన్న బావినే విరజానది అంటారు. వైకుంఠంలోని ఈ దేవనది స్వామి పాదాల కింద ప్రవహిస్తోందంటారు. నదిలో కొంత భాగాన్నే బావి అంటారు. దీన్ని చతురస్రాకారంలో చెక్కిన రాళ్ళతో నిర్మించారు. రాళ్లపై నాలుగు అంచుల్లో వానరులతో కలిసి ఉన్న సీతారామలక్ష్మణులు, హనుమంత, సుగ్రీవులు, కాళీయమర్దనంలో శ్రీకృష్ణుని వేడుకుంటున్న నాగకన్యలు, ఏనుగును అదిలిస్తున్న వేంకటేశ్వరుడు, గరుడుని బొమ్మలు మలిచారు. అందుకే ఈ బావిని ఆలయ అర్చకులు, స్థానికులు బొమ్మలబావిగా పిలుస్తుంటారు.స్వామి పవిత్ర నిర్మాల్యం పూలబావికే సొంతం అద్దాల మండపానికి ఉత్తర దిశలో ఈ పూల బావి ఉంది. స్వామికి సమర్పించిన తులసి, పుష్ప, పూమాలలను ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం లేదు. అందుకే ఆ పవిత్రమైన నిర్మాల్యాన్ని ఎవ్వరూ తిరిగి వాడకుండా ఈ పూలబావిలో వేస్తారు. స్వామికి నివేదించిన అన్ని రకాల నిర్మాల్యం పూలబావి తన ఉదరంలో దాచుకుంటుందని అర్చకులు చెబుతారు. అందుకే దీనికి పూలబావిగా నామం సార్థకమైంది. దీనినే భూ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోవడంతో శ్రీనివాసుని ఆదేశంతో రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూ తీర్థం పునరుజ్జీవం పొందిందని చెబుతారు. రంగదాసు మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి స్వామిని సేవించారని పురాణాల కథనం. అభిషేక సేవకు బంగారుబావి నీళ్లువకుళమాత కొలువైన పోటు(వంటశాల) పక్కనే బంగారు బావి ఉంది. స్వామి దర్శనం చేసుకుని బంగారు వాకిలి వెలుపలకు వచ్చిన భక్తులకు ఎదురుగానే ఈ బంగారుబావి దర్శనమిస్తుంది. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని జలాన్నే వాడతారు. బావికి చుట్టూ భూ ఉపరితలానికి చెక్కడపు రాళ్లతో వర నిర్మించారు. దీనికి బంగారు తాపడం చేసిన రాగి రేకులు అమర్చడం వల్ల బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. దీనినే శ్రీతీర్థం, సుందర తీర్థం, లక్ష్మీ తీర్థం అని కూడా పిలుస్తుంటారు. వైకుంఠం నుంచి వేంకటాచలానికి వచ్చిన శ్రీమన్నారాయణునికి వంట కోసం మహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేశారట! త్రైలోక్య దుర్లభాలుశ్రీవారి పుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శన భాగ్యం, కటాహ తీర్థపానం... ఈ మూడు త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. కటాహ తీర్థం శ్రీవారి హుండీకి వెలుపల ఆనుకుని తొట్టిమాదిరిగా ఎడమ దిక్కున ఉంది. దీన్ని తొట్టి తీర్థమని కూడా అంటారు. స్వామి పాదాల నుండి వచ్చే అభిషేకతీర్థం ఇది. ఈ తీర్థాన్ని స్వీకరించినప్పుడు అష్టాక్షరి లేదా కేశవాది నామాలు లేదా శ్రీవేంకటేశుని నామాలు ఉచ్చరిస్తే పుణ్యం దక్కుతుందని పెద్దలు చెబుతారు.మోక్షప్రాప్తి కలిగించే పుష్కరిణి పుణ్యస్నానంబ్రహ్మాండంలోని సర్వతీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. శ్రీమహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుండి క్రీడాద్రితోపాటు పుష్కరిణిని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి తీసుకొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నానమాచరించడం వల్ల సకల పాపాలు తొలగి ఇహంలో సుఖ శాంతులతోపాటు పరలోకంలో మోక్షమూ సిద్ధిస్తుందని నమ్మకం. ప్రతి యేటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే ఇందులో ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.పుష్కరిణిలో ప్రాచుర్యంలోని తొమ్మిది తీర్థాలుముక్కోటి తీర్థాల సమాహారమే శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో ప్రధానంగా తొమ్మిది తీర్థాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. అవి: మార్కండేయ తీర్థం (పూర్వ భాగం), ఆగ్నేయ తీర్థం (ఆగ్నేయ భాగం), యమ తీర్థం (దక్షిణ భాగం), వసిష్ట తీర్థం (నైరుతి), వరుణ తీర్థం (పడమర), వాయు తీర్థం (వాయు భాగం), ధనద తీర్థం (ఉత్తర భాగం), గాలవ తీర్థం (ఈశాన్యం), సరస్వతీ తీర్థం(మధ్య భాగం). «పూర్వం శంఖనుడు అనే రాజు స్వామివారి పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానమాచరించడం వల్ల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాడట! దశరథ మహారాజు పుష్కరిణి తీర్థాన్ని సేవించి స్వామిని వేడుకోవటంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే పుత్రునిగా పొందే భాగ్యం పొందాడు. కుమారస్వామి తారకాసురుని సంహరించడంతో వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని ఈ పుష్కరిణిలో స్నానమాచరించి పోగొట్టుకున్నాడట! ఎందరెందరో భక్తులు ఇందులో స్నానమాచరించి రోగ రుగ్మతలు పోగొట్టుకుని, భోగభాగ్యాలు సంపాదించుకున్నారని పెద్దలు చెప్పే మాట! -
Tirumala: ఆనంద నిలయం అఖండ తేజోమయం
తనమీద అలిగి వెళ్లిపోయిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠాన్ని వీడిన విష్ణుమూర్తి భూలోక వైకుంఠమైన వేంకటాచల క్షేత్రానికి విచ్చేశాడు. అక్కడ స్వయంవ్యక్త సాలగ్రామ శిలామూర్తిగా వెలసి భక్తకోటిని కటాక్షిస్తున్నాడు. స్వామి కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనంద నిలయం. గర్భాలయంపై నిర్మించిన బంగారు గోపురమే ‘ఆనంద నిలయ విమానం’గా ప్రసిద్ధి పొందింది.⇒ శ్రీవేంకటేశ్వరస్వామి వారు గర్భాలయంలో ‘ఉపధ్యక’ అనే పవిత్రస్థానంలో కొలువై నిత్యపూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో మూడు విగ్రహాలుంటాయి. వాటినే ధ్రువమూర్తి, మూలమూర్తి, మూలవిరాట్టుగా కొలుస్తారు. యోగ, భోగ, విరహ రూపాలతోపాటు ‘వీర స్థానక’ విధానంలో నిలబడిన స్వామి ముగ్ధమనోహరంగా ప్రకాశిస్తాడు. స్థిరంగా ఉంటాడు. ఈ విగ్రహాన్నే ఆగమ పరిభాషలో ధ్రువబేరంగా సంబోధిస్తారు. ⇒ సుప్రభాతంతో వేకువజామున 2.30 గంటలకు స్వామిసేవను ప్రారంభించి, తిరిగి రాత్రి 12.30 గంటలకు జోలపాటతో నిద్రపుచ్చుతారు. వైఖానస ఆగమబద్ధంగా తోమాల, అర్చన, కొలువు ఇతర నిత్యసేవా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో మూడుపూటలా అన్నప్రసాదాలు, పిండి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తూ అర్చకులు లోకకల్యాణం కోసం శరణు వేడుతారు. ⇒ పుష్పకైంకర్యంలో భాగంగా సాలగ్రామ హారాలు, శిఖామణి, శంఖుచక్రం, శ్రీదేవి, భూదేవి కంఠహారాలు, అలంకార బిట్లు, 25 రకాల పూలకుచ్చులతో కూడిన సువాసనలు వెదజల్లే పుష్పాలతో స్వామిని అలంకరిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పుష్పకైంకర్యాలు చేస్తారు. నిత్య దిట్టం కింద 300 కేజీల పుష్పాలు వాడతారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాలు, ఆస్థాన కార్యక్రమాల కోసం 10 నుంచి 20 టన్నుల వరకు పుష్పాలు వినియోగిస్తారు. ⇒ తననే శరణు వేడండంటూ కటి, వరదహస్తాలతో స్వామి తన పాదపద్మాలను చూపిస్తూ భక్తులకు హెచ్చరికతో కూడిన హితబోధ చేస్తూ దర్శనమిస్తుంటారు. అలాంటి దివ్యమైన బంగారు పాదాలను నిత్యం పుష్పాలు, తులసి సేవిస్తుంటాయి. వేకువజాము సుప్రభాత దర్శనంలో మాత్రమే తులసి, పుష్పాలు లేకుండా దర్శించవచ్చు. ఇక శుక్రవారం అభిషేకం, ఆ తర్వాత దర్శన సమయంలో మాత్రమే బంగారు పాద తొడుగులు లేకుండా స్వామి పాద పద్మాలు (నిజపాద సేవలో) దర్శించవచ్చు. ⇒ ప్రతి రోజూ నిత్యకట్ల అలంకారంలో 120 రకాల ఆభరణాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలు, పర్వదినాల్లో ప్రత్యేక అలంకారాలు చేసేందుకు అదనంగా ఆభరణాలు వాడతారు. రోజూ చేసే అలంకారాన్ని నిత్య కట్ల అలంకారమని, పండుగలు, ఉత్సవాలు, ప్రముఖుల రాక సందర్భంగా చేసే అలంకారాన్ని విశేష అలంకారమని అంటారు. స్వామికి వజ్రకిరీటం, శంఖ, చక్ర, వరద హస్తాలు, ప్రత్యేక ఆభరణాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. ⇒ శ్రీ స్వామి, ఉత్సవమూర్తుల అలంకరణలకు వాడే కిరీటాలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు, ఇతర నిల్వలు దాదాపుగా 11 టన్నులు ఉంటాయి. వీటితోపాటు వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నవరత్నాల నగలు కూడా ఉన్నాయి. ⇒ ఆకాశరాజు కిరీటం, వేంకటాద్రిని పాలించిన రాజులు, బ్రిటిష్ పాలకులు, మహంతులు, భక్తులు సమర్పించే కానుకల వివరాలను నమోదు చేసేందుకు టీటీడీ 19 తిరువాభరణ రిజిస్టర్లు నిర్వహిస్తోంది. ⇒ శుక్రవారం అభిషేకం తర్వాత స్వామికి ఊర్ధ్వపుండ్రాలు (తిరునామం) సమర్పిస్తారు. దీనినే ‘తిరుమామణికాపు’ అంటారు. ఇందుకోసం 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరి సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భాల్లో తిరుమామణికి వాడే ద్రవ్యాలు రెట్టింపు స్థాయిలో వాడతారు. ⇒ అభిషేకం తర్వాత మూలమూర్తికి అంతరీయం (ధోవతి)గా 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు పెద్ద పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగా ధరింప చేస్తారు. ⇒ విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు ఇతర సామాజ్య్రాలపై దండయాత్రకు వెళ్ళి విజయుడై తిరిగి వస్తూ స్వామివారిని దర్శించుకునేవారు. ఆ సందర్భంగా విలువైన ఆభరణాలు, కిరీటాలు, ఖడ్గాలను బహూకరించారు. మలయప్పకు అలంకరించే గుండ్రని కిరీటం, మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక ఉత్సవాల్లో ఎదపై అలంకరించే పెద్ద పచ్చ రాయలు సమర్పించినవే. ⇒ ఆలయంలోని జయవిజయలు ఉన్న బంగారువాకిలి దాటుకున్న తర్వాత రాములవారి మేడలో ఉండే రహస్య అలమరాలో శ్రీవారికి వినియోగించే ఆభరణాలు భద్రపరుస్తారు. వీటిని ఆలయ డిప్యూటీ ఈవో, పేష్కార్ పర్యవేక్షిస్తారు. ఏ రోజు, ఏ ఉత్సవంలో ఏయే ఆభరణాలు అవసరమో అర్చకుల సూచన మేరకు వాటిని సమకూరుస్తారు. ⇒ శ్రీవారి ఆలయంలో గర్భాలయ మూలమూర్తితోపాటు భోగ శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, ఉగ్ర శ్రీనివాసుడు కొలువై ఉన్నారు.⇒ పంచమూర్తులే కాకుండా సుదర్శన చక్రత్తాళ్వార్, సీతారామ లక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు వంటి పంచలోహ మూర్తులు కూడా గర్భాలయంలోనే కొలువై ఉన్నారు. ఇక్కడే దేవతామూర్తులతోపాటు పవిత్ర సాలగ్రామాలు కూడా నిత్య పూజలందుకుంటున్నాయి.∙గర్భాలయానికి ఆగ్నేయం, ఈశాన్య దిశల్లో అటు ఇటుగా ‘బ్రహ్మ అఖండం’ నిత్యదీపారాధన వెలుగుతూనే ఉంటుంది. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ఈ దీపాలను వెలిగించాడని విశ్వాసం.∙రాత్రి పవళింపు సేవ చివరి సమయంలో బంగారు నవారు పట్టె మంచంపై ‘మనవాళ పెరుమాళ్’ (భోగశ్రీనివాసుడు) వేంచేపు చేస్తారు. అదే సమయంలోని గర్భాలయ మూలమూర్తికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారి ‘ముత్యాల హారతి’ మంగళ కర్పూర నీరాజనం సమర్పిస్తారు. ∙తెలుగు నూతన సంవత్సరాధి పర్వదినమైన ఉగాది (మార్చి/ఏప్రిల్), ఆణివార ఆస్థానం (జూలై), శ్రీవారి బ్రహ్మోత్సవం (సెప్టెంబరు/అక్టోబరు), వైకుంఠ ఏకాదశి (డిసెంబరు/జనవరి) పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహిస్తారు. ∙కోయిల్ ఆళ్వారు తిరుమంజనం రోజున ఆనంద నిలయం నుంచి మహాద్వారం వరకు శుద్ధ జలంతో శుద్ధి చేస్తారు. ఈ క్రమంలో నీరు, దుమ్ము, ధూళి పడకుండా ఉండేందుకు మూలమూర్తి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళ వస్త్రాన్ని కప్పుతారు. ఈ వస్త్రాన్నే ‘మలైగుడారం’ అని అంటారు. తిరుమంజన సేవలు పూరి ్తకాగానే కురాళం అనే దీర్ఘచతురస్రాకారపు మఖమల్ వస్త్రాన్ని పైకప్పునకు కడతారు.∙గర్భాలయంలో కేవలం అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పునకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. ∙తిరుమంజనానికి ముందురోజే ఎక్కువ మోతాదులో నామంకోపు (సుద్దపొడి), శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారు చేస్తారు. భారీ గంగాళాల్లో సిద్ధం చేసిన ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనంగా పూస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు క్రిమికీటకాలు ఉండకుండా ప్రాకారం పటిష్ఠతకు దోహద పడతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. నిత్యం సుప్రభాతసేవలో స్వామికి గోక్షీర సేవనం, నవనీత హారతి ఇస్తారు. అప్పుడే పితికిన గోవుపాలు, అప్పుడే తీసిన వెన్న, పచ్చకర్పూరపు తాంబూలంతో కూడిన పళ్లెరంతో హాథీరామ్ మఠం మహంతుల సన్యాసి/బైరాగి ఆలయానికి సమర్పించగా హాథీరామ్ మహంతు పేరుతో అర్చకులు ఈ కైంకర్యాలు నిర్వహిస్తారు. -
మాడవీథుల ప్రాశస్త్యం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి ఆలయం 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. స్వామివారి ఆలయం పక్కనే వున్న పుష్కరిణి ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అటు తర్వాత లడ్డు కౌంటర్లు, బూందీ కౌంటరు, లడ్డు తయారీ కేంద్రం వంటివి రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండగా వరాహస్వామి ఆలయం మిగిలిన ప్రాంతం కలుపుకొని దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ మాడవీథులు ఏర్పడ్డాయి. తూర్పు మాడవీథి 750 అడుగుల పొడవున; దక్షిణ, ఉత్తర మాడ వీథులు ఎనిమిది వందల అడుగుల పొడవున; పడమటి మాడవీథి 900 అడుగుల పొడవున ఉంటాయి. శ్రీవారి ఆలయం చుట్టూ ఏర్పడిన ఈ మాడవీథులకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు తన ఉభయ దేవేరులతో నిత్యం తిరుగాడే ప్రాంతం మాడవీ«థులు. గతంలో వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే స్వామివారి వాహన సేవలు నిర్వహించేవారు. దీనితో మాడవీథుల్లో ఏడాదికి తొమ్మిది రోజులు పాటు మాత్రమే స్వామివారి ఊరేగింపు నిర్వహించేవారు. ఆ తర్వాత వీ«థి ఉత్సవం పేరుతో స్వామివారు నిత్యం మాడవీ«థులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చేవారు. సహస్ర దీపాలంకరణ సేవను ఆలయం వెలుపలకు మార్చిన తర్వాత ప్రతినిత్యం స్వామివారు దీపాలంకరణ సేవ పూర్తయ్యాక మాడవీ«థులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఇలా మాడ వీథుల్లో నిత్యం స్వామివారి సంచారం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగుతుంది.మాడవీ«థుల చుట్టూ ఉన్న నిర్మాణాలను భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2004 నాటికి పూర్తిగా తొలగించి, గ్యాలరీల నిర్మాణం చేపట్టింది. దీనితో మాడవీథుల ఆధునికీకరణ కూడా చేపట్టింది. మాడవీ«థుల్లో భక్తుల తాకిడి పెరుగుతూ రావడంతో 1970 నుంచి టీటీడీ మాడవీ«థులలో ఆంక్షలు విధించడం ప్రారంభించింది. గతంలో వీవీఐపీలు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సమయంలో దక్షిణ మాడవీ«థి గుండా ఆలయం ముందు వరకు వారి వాహనంలోనే చేరుకునేవారు. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపం వరకు వాహనంలో విచ్చేసే వీవీఐపీలకు అక్కడి నుంచి అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికేవారు. భక్తుల సౌకర్యార్థం అప్పటి ఈవో చంద్రమౌళీశ్వర్ రెడ్డి 1970 ఫిబ్రవరి 22 నుంచి మాడవీ«థులలోకి వాహనాల అనుమతిని నిలిపివేశారు. వీఐపీల కోసం ఆలయం ఎదురుగా టీటీడీ మరో రోడ్డు నిర్మాణం చేపట్టింది. 1996 నుంచి ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వీవీఐపీలు ఈ మార్గం గుండానే మాడవీ«థుల వరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే, వాహనాలను మాడవీథులలోకి అనుమతించరు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయి వ్యక్తులు అయినా కూడా బ్యాటరీ వాహనాల ద్వారానే ప్రయాణం చేయవలసి ఉంటుంది. మాడవీథుల్లో భక్తులు పాదరక్షలు ధరించకుండా టీటీడీ 2007 నుంచి నిబంధనలను అమలు చేసింది. నిత్యం స్వామివారి వాహన ఊరేగింపులు జరిగే మాడవీ«థులను అంతే పవిత్రంగా చూడవలసిన బాధ్యత భక్తులపై కూడా ఉందంటూ ఈ నిబంధనలను టీటీడీ అమల్లోకి తీసుకువచ్చింది.∙ -
ఆపదమొక్కులతో తొలగేను చిక్కులు
దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరునికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తూ భక్తితో శరణు కోరుతుంటారు. భక్తి తత్పరులు, కోర్కెలు నెరవేరినవారు, కోర్కెలు నెరవేరాల్సిన వారు ఆపదమొక్కులవాడికి ఎన్నోరకాల మొక్కులు చెల్లిస్తారు. ఏడుకొండల వాడికి మొక్కులు చెల్లించేందుకు నిర్ణీతకాలంలో ప్రత్యేకంగా దీక్షా మార్గాన్ని ఎంచుకుంటారు. భూ శయనం, బ్రహ్మచర్య దీక్ష, ఏకభుక్తం వంటి నియమాలతో తల వెంట్రుకలు తీయకుండా దీక్షను చేపడతారు. పూర్తికాగానే కాలినడకన యాత్రగా తిరుమలకు చేరుకుంటారు. భక్తిశ్రద్ధ్దలతో తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. దివ్యమైన కాలినడకకోర్కెలు తీర్చే కోనేటిరాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తొలుత చేసేది... నడచి వచ్చి స్వామివారిని దర్శించుకోవడమే. కొందరు మోకాళ్లతో, మరికొందరు పొర్లుదండాలతో ఎక్కుతూ మొక్కులు చెల్లిస్తుంటారు. ఇంకొందరు మెట్టు మెట్టుకూ పూజలు, మరికొందరు ప్రతిమెట్టుకూ çపసుపు, కుంకుమ పూసి, కర్పూరం వెలిగిస్తే, మరి కొందరు కొబ్బరికాయలు కొడుతూ తిరుమల కొండెక్కుతారు. రోడ్డు, వాహన సదుపాయాలు లేనిరోజుల్లో కాలిబాటే తిరుమలకు ఏకైక మార్గం. అధునాతనమైన రెండు ఘాట్రోడ్లు ఏర్పడి రోజుకు పదివేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా తిరుమలకు నడిచివెళ్లే భక్తుల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోందంటే ఈ మొక్కుపై భక్తులకు ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ రోజుల్లో 15 వేలు, సెలవు రోజులు, ఉత్సవాల రోజుల్లో 40 వేల మంది వరకు భక్తులు కాలినడకన కొండెక్కుతున్నారు.‘తల’ నీలాల సమర్పణవెంకన్న మొక్కులో తలనీలాల మొక్కు అత్యంత ప్రధానమైంది. అనాదిగా వస్తున్న ఈ ఆచారానికి ఆధునిక కంప్యూటర్ యుగంలో కూడా భక్తులు బ్రహ్మరథం పడుతుండటం విశేషం. క్రీ.శ.1830కు ముందు నుండే తలనీలాలు మొక్కుగా చెల్లించే ఆచారం ఉన్నట్టు శాసనాధారం. పుష్కరిణి పుణ్యస్నానం భక్తుల మొక్కులలో పరమ పవిత్రమైంది పుష్కరిణీ స్నానం. బ్రహ్మాండంలోని సర్వతీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నానం ఆచరించడంతో సర్వపాపాలు తొలగి, మోక్షం సిద్ధి్దస్తుంది. ప్రతియేటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే, ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. వరాహస్వామి దర్శనంతిరుమల క్షేత్రంలో ఆదిదైవం శ్రీ వరాహస్వామి. అందుకే ఈ పుణ్యతీర్థాన్ని ఆది వరాహ క్షేత్రమని పిలుస్తుంటారు. వైకుంఠం వదిలి భూలోకం వచ్చిన శ్రీనివాసునికి వరాహస్వామివారే స్థలాన్ని ప్రసాదించారు. దీనికి ప్రతిఫలంగా భక్తుల తొలి దర్శనాన్ని వరాహస్వామి పొందారు. దానితోపాటు తొలిపూజ, తొలినైవేద్యం వరాహస్వామికే! సామాన్య భక్తుడి నుండి ప్రముఖుల వరకు తొలుత వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీన్ని కొనసాగిస్తేనే ఫుణ్యఫలం దక్కుతుంది. తులా ‘భారం’.. నిలువుదోపిడీ తిరుమలేశునికి భక్తులు తులాభార రూపంలో చిల్లర, బెల్లం, పటిక బెల్లంతో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు ముడుపుల రూపంలో పోగుచేసిన నగదును హుండీలో సమర్పిస్తారు. వెంకన్నను కొలిచే భక్తుల్లో దాదాపుగా పుట్టిన ప్రతి బిడ్డనూ ఏదో ఒక సందర్భంలో స్వామివారికి ఏదో ఒక రూపంలో తులాభారం సమర్పించి మొక్కులు చెల్లిస్తుంటారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అ«ధికారులు కూడా తులాభారం సమర్పిస్తుంటారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి నిలువుదోపిడీ రూపంలో తాము ధరించిన ఆభరణాలన్నిటినీ హుండీలో సమర్పిస్తారు. వెంట తీసుకొచ్చిన నగదు, ఇతర కానుకల్ని కూడా సమర్పిస్తారు. -
శ్రీవారి ఆలయ చరిత్ర
తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయం. ఎన్నో శతాబ్దాలుగా వెలుగొందుతున్న శ్రీవారి ఆలయం వెనుక ఎంతో చరిత్ర, ఎన్నో స్థలపురాణాలు ఉన్నాయి. రాజుల పాలన నుంచి బ్రిటిష్ పాలకుల చేతిలోకి వెళ్లినప్పటికీ, శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోగలిగింది. వాటిని నేటికీ కొనసాగించగలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో శేషాచలంలో ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుమల. కలియుగ వైకుంఠంగా పిలుస్తున్న ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడిగా కొలువై కోరిన కోరికలను తీరుస్తున్నాడని భక్తుల విశ్వాసం. బ్రిటిష్ ఈస్టిండియా పాలన నుంచి ప్రత్యేక బోర్డుగా ఏర్పడే వరకు ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. బ్రిటిష్ హయాంలో మద్రాసు ప్రభుత్వం ఏడవ రెగ్యులేషన్ ద్వారా 1817లో శ్రీవారి ఆలయాన్ని ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నియంత్రణలోకి తెచ్చింది. 1821లో బ్రూస్ అనే బ్రిటిష్ అధికారి ఆలయ నిర్వహణ కోసం ‘బ్రూస్ కోడ్’ రూపొందించారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆలయ పరిపాలనను 1843లో హథీరామ్జీ మఠం మహంతులకు అప్పగించింది. అప్పటి నుంచి 1933 వరకు మహంతుల పాలనలోనే ఆలయం విలసిల్లింది.టీటీడీ పాలక మండలి ఏర్పాటుతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి స్వాతంత్య్రం రాకముందే ఏర్పాటైంది. అంతకు ముందు మహంతుల పాలనలో ఉన్న ఆలయాన్ని ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం 1933లో టీటీడీకి పాలక మండలి పరిధిలోకి తీసుకురావడం వల్ల మహంతుల వ్యవస్థ ముగిసింది. దీంతో పాలనా వ్యవహారాలు అధికారుల చేతిలోకి వెళ్ళాయి. పాలనా వ్యవహారాలు మారినా, సుదీర్ఘకాలం తిరుమల వ్యవహారాలను పర్యవేక్షించిన మహంతులకు నేటికీ ప్రత్యేక గౌరవం కొనసాగుతోంది. హాథీరామ్జీ మఠంతో అనుబంధంఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని క్రేడల్ క్రేల గ్రామంలో రామానంద మఠం ఉండేది. మఠం అధిపతి అభయ్ ఆనంద్జీ శిష్యుడు హాథీరామ్జీ దేశయాత్రలో భాగంగా వెంకటాచలానికి చేరుకున్నాడు. శ్రీవేంకటేశ్వరుడిని అయోధ్య రాముడి అంశగా భావించి, కొలుస్తూ ప్రసన్నం చేసుకునేవాడు. హాథీరామ్జీ భక్తికి ముగ్ధుడైన శ్రీవారు నిత్యం ఆనందనిలయం దాటి ఆలయానికి సమీపంలోనే ఉన్న హాథీరామ్జీ మఠానికి వచ్చి, ఆయనతో పాచికలాడుతూ, భక్తుడిని గెలిపించి, ఆనందపడేవారనే కథలు ఉన్నాయి.తిరుమలలో శ్రీవారి పేరు తరువాత వినిపించే పేరు విష్వక్సేనుడు. టీటీడీ పాలనా వ్యవహారాలు మహంతుల చేతికి ఈస్టిండియా కంపెనీ అప్పగించినప్పటికీ, ఆలయ నిత్యకలాపాల్లో లోటు లేకుండా చేశారు. అదే సమయంలో పాలనా పగ్గాలు చేతికి తీసుకున్న మహంతులు (çహాథీరామ్జీ బాబా వారసులు) తమ పాలన వ్యవహారాలలో విష్వక్సేనుడి అధికార ముద్రను వాడేవారు. మొదటి మహంతు సేవాదాస్ కాలంలోనే శ్రీవారి పుష్కరిణిలో జలకేళీ మండపోత్సవం పేరిట తెప్పోత్సవం ప్రారంభించారు. తిరుమల శ్రీవారికి మహంతు బాబాజీ పేరుతో సుప్రభాత సేవలో గోక్షీర నివేదన, నవనీత హారతి సమర్పించే ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజూ వేకువజామున సుప్రభాత సమయంలో శ్రీవారికి సంప్రదాయబద్ధంగా హారతి అందిస్తున్నారు.ఆణివార ఆస్థానం వెనుకవందల సంవత్సరాలు కాలంలో కలిసిపోయినా, తిరుమలలో మాత్రం ఆనాటి ఆచార వ్యవహారలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా కొనసాగిస్తున్నారు. అందులో ఒకటి ఆణివార ఆస్థానం కార్యక్రమం. శాస్త్రోక్తంగా నిర్వహించడంలో టీటీడీ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తిరుమలలో ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక పెద్ద కథే ఉంది.ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆర్కాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈస్టిండియా కంపెనీ పాలన సాగించింది. దీంతో 1843 ఏప్రిల్ 21 నుంచి 1933 వరకు ఆలయ పాలన హాథీరామ్జీ మఠం మహంతుల పాలనలో సాగింది. తిరుమల ఆలయానికి మొదటి మహంతుగా1843 జూలై 10న మహంత్ సేవాదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆణివార ఆస్థానం రోజే బ్రిటిషర్లు శ్రీవారి ఆలయ ఆస్తులు, ఆభరణాలు, ఉత్సవ మూర్తులు, ఉత్సవర్లకు ఊరేగింపులో వాడే వాహనాలు, నిత్య కైంకర్యాలకు వాడే పురాతన వస్తువులు, రికార్డులు, లెక్కల అప్పగింత జరిగింది.ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తరహా సమీక్ష జరిగేది. టీటీడీ పాలక మండలి ఏర్పడిన తరువాత ఇది వార్షిక బడ్జెట్గా మారింది. వందల ఏళ్ల నాటి సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూనే, ఆనాటి చరిత్ర మరుగున పడకుండా, మహంతుల పరిపాలనా కాలం నాటి పద్ధతుల్లోనే శ్రీవారికి ఆణివార ఆస్థానం ద్వారా లెక్కలు నివేదించే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. -
ఈ వారం కథ: హృదయ స్పర్శ
‘థాంక్యూ మేడం..! ఐ లవ్ యు మేడం..!!’ కృతజ్ఞతా ప్రేమపూర్వకంగా చెప్పాడు రాజేష్.‘ఇట్స్ ఓకే..!... బట్ లవ్..?! నా కౌన్సెలింగ్తో పూర్తిగా నయమయ్యావు కదా! ఇక జాగ్రత్తగా జీవితాన్ని గడుపు. లవ్ అంటూ మరో మానసిక రోగివి కాకు! సీరియస్గా హితవు చెప్పింది సైకాలజిస్ట్ కోమలి.‘సారీ మేడం..! నా ఉద్దేశం అది కాదు..! అదీ..!’... సంజాయిషీ ఇచ్చుకోబోతుండగా...‘స్టాప్ నాన్సె¯Œ ్స... సారీ ఒకటి..! ఒక అమ్మాయి నాలుగు రోజులు మంచిగా మాట్లాడితే అడ్వాంటేజ్గా తీసుకొని ‘లవ్’... ఆ తర్వాత ఇంకోటి అంటూ వచ్చే మగాళ్ళ తీరు అసహ్యం వేస్తుంది. వృత్తిరీత్యా సన్నిహితంగా ఉంటే, ఈ విధంగా వచ్చే వారి పట్ల ఏ విధంగా ఉండాలో నాకు బాగా తెలుసు. ‘లవ్’ అనే పేరుతో ట్రాప్ చేయాలనుకునే మనస్తత్వం గలవాళ్లను ఒక కౌన్సెలర్గా దూరం పెట్టడమూ తెలుసు.కుదుటపడిన ఆరోగ్యంతో మంచిగా బతుకు. నా ట్రీట్మెంట్ పూర్తయింది. ఇంకెప్పుడూ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. బై!’ అంటూ ఫోన్ పెట్టేసింది కోమలి. ఏదో చెబుదామనుకొని మళ్లీ కాల్ చేయాలని చూస్తే, ఎంతకూ కలవకపోవడంతో తనను బ్లాక్ చేసిందని అర్థమైంది రాజేష్కి.‘ఏమిటి..? ఈ రోజు మూడీగా ఉన్నావు. ఏమైంది..? ఏమంటున్నారు మీ పేషెంట్లు?’ఏదో ఆలోచనలో పరధ్యానంగా ఉన్న కోమలిని అడిగాడు ప్రదీప్.‘ఆ... ఏమీ లేదు లెండి..! కొందరు మగవాళ్లకు తిక్క ఎక్కువైంది. ఎవరైనా అమ్మాయి నాలుగు రోజులు మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళ పైత్యం చూపిస్తున్నారు. రాజేష్ చెప్పిన విషయం ప్రదీప్కి చెప్పింది. ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రదీప్ వెంటనే స్పందిస్తూ, నువ్వు అందరినీ సమదృష్టితో చూడాలని, కౌన్సెలింగ్పరంగా వారికి దగ్గరవుతావు కదా! ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంతకుముందు నీ కౌన్సెలింగ్ తీసుకున్న రాజీవ్, చక్రి, సురేష్.. వీళ్లంతా చివరకు లవ్ ప్రపోజల్ తెచ్చారు కదా! ఇప్పుడు అదే జాబితాలో రాజేష్ చేరాడేమో!? అవునూ! నీ పేషెంట్లను కొందరిని వాయిస్ కాల్లో, మరికొందరిని వీడియో కాల్లో కౌన్సెలింగ్ చేస్తావెందుకని?’ చికిత్స విధానం గురించి ఆరా తీశాడు ప్రదీప్.‘నేను చేసేది మానసిక చికిత్స. అది కూడా కౌన్సెలింగ్ మాత్రమే! వారి మానసిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఎంచుకుంటాను. సమస్య పరిష్కారం కావాలి’ తను ప్రత్యేకంగా ఉపయోగించే చికిత్స విధానాన్ని చెప్పింది కోమలి.‘నీ కౌన్సెలింగ్ ఏమో గాని, చివరకు నాకు దక్కకుండా పోతావా ఏంది?’ నవ్వుతూ చురకేశాడు ప్రదీప్.‘నో.. నెవర్..! అంత సీన్ లేదు. ఆ పరిస్థితి నాకు రాదు. ఈ ప్రదీప్కి కాకుండా ఇంకెవరికీ నో చా ఎటాల్! అవతలి వాళ్ళ ఆటిట్యూడ్ ప్రకారం నేను వెళ్తుంటాను. వృత్తిరీత్యా ఇవన్నీ తప్పవండీ..!’‘కొందరికి కౌన్సెలింగ్ ఫీజు కూడా లేకుండా ఉచితంగా సర్వీస్ చేస్తావెందుకని?’‘ఏమండీ..! చెదిరిన వాళ్ల జీవితాలు చక్కబడితే, మానసిక వేదన, ఒత్తిడి నుంచి బయటపడి సాధారణ జీవితంలోకి వస్తే, అంతే చాలు. అదే వెలకట్టలేని ఫీజు. అది కూడా వాళ్ల స్థాయిని బట్టి పోతుంటాను. కొందరికి ఉచితం తప్పదు. అయినా నా రీసెర్చ్ పని కోసం రెండు సంవత్సరాల పాటు కౌన్సెలింగ్ ప్రాక్టీస్కి ఫుల్స్టాప్ పెడుతున్నాను’ అంటూ తన రూమ్లోకి వెళ్లి రీసెర్చ్ బుక్ ముందరేసుకుంది కోమలి.కోమలి.. పేరుకు తగ్గట్టుగానే కోమలంగా ఉంటుంది. మూడేళ్ల కిందట దంపతులైన ప్రదీప్, కోమలి ఇద్దరూ వారి వారి వృత్తులలో బిజీగా ఉంటున్నారు. ప్రదీప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, కౌన్సెలర్గా ఆన్లైన్లో కావాల్సిన వారికి కౌన్సెలింగ్ ఇస్తుంది కోమలి. ఆమె మాట తీయదనం, సమస్యల పరిష్కార దిశలో ఓ అమ్మలా లాలించడం, సాంత్వన చేకూర్చడంతో మానసికతత్త్వ వికాస నిపుణురాలిగా మంచిపేరు తెచ్చుకొని ఎందరికో నూతన జీవితాలను అందించింది. కాని ‘లవ్’ పేరుతో కొందరి ప్రవర్తనతో విసిగివేసారింది. ఆ మాట అంటేనే హృదయం భగ్గుమంటుంది. లవ్ అంటూ శారీరక వాంఛతో దానిని పూర్తి చేసుకోవాలనుకునే వారిని తప్పిస్తూ, తన వృత్తిని కొత్త చాలెంజ్గా ఎదుర్కొంటూ మంచి కౌన్సెలర్గా రాణిస్తుంది కోమలి. వ్యక్తిగతంగా లవ్ విషయంలో తన జీవితంలో జరిగిన అనేక చేదు అనుభవాలు, మానసిక అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఒక సైకాలజిస్ట్గా తన మనసును దిటవుపరచుకొని, ఇక ‘లవ్’ని దరిచేరనీయకుండా స్ట్రాటజీస్ ఉపయోగించుకుంటూ వృత్తిని విజయవంతంగా కొనసాగిస్తోంది.‘ఏవండీ..! ఈ అసోసియేషన్ వాళ్లు వాచ్మన్ను మార్చారా? కొన్ని రోజులుగా నాగయ్య, లక్ష్మి కనిపించడం లేదు’ అనుమానంగా అడిగింది కోమలి.‘ఆ.. అవును..! వాళ్లు వాళ్ల ఊరు వెళ్లిపోయారట! కొత్త వాచ్మన్ను పెట్టారు..చంద్రయ్య అట!’‘సర్లేండి..! వర్షం వస్తోంది. టాబ్లెట్స్ తేవాలి ఎలా? వాచ్మన్కి చెప్పనా?’‘చెప్పి చూడు కొత్తవాడు కదా! వీలుంటే తెస్తాడేమో!’ఇంటర్ కమ్ నొక్కి కబురు పంపగానే, పరుగు పరుగున రెండవ అంతస్తుకు చేరుకున్నాడు చంద్రయ్య.‘నువ్వేనా కొత్త వాచ్మన్వి? సార్ వర్క్ చేసుకుంటున్నారు. గొడుగేసుకుని వెళ్లి ఈ టాబ్లెట్స్ తెస్తావా?’ మృదువుగా అడిగింది కోమలి .‘అలాగే అమ్మగారూ..!’ పీల గొంతుతో, తలూపి ఆమె ఇచ్చిన ఖాళీ స్ట్రిప్, పైసలు తీసుకుని పది నిమిషాల్లో తిరిగొచ్చాడు చంద్రయ్య.తడిసి వచ్చిన చంద్రయ్యను చూసి‘అదేంటి..? గొడుగు వేసుకొని వెళ్లలేదా పూర్తిగా తడిసిపోయావు’‘గొడుగు లేదమ్మగారూ..!’‘అవును.. నీ పేరేమిటి అన్నావ్..?’‘చంద్రయ్య.. అమ్మగారు’ అంటూ మిగిలిన చిల్లర ఇవ్వబోతుండగా,..‘ఉంచుకో..! టీ తాగు..’ అంది‘వద్దమ్మగారు..’ అంటూ వణుకుతూ వెళుతున్న చంద్రయ్య వైపు జాలిగా చూసింది కోమలి.వర్క్ చేసుకుంటూ ఇదంతా గమనిస్తున్న ప్రదీప్‘తల్లీ..! అతనికేం కౌన్సెలింగ్ అవసరం ఉండదులే..! వదిలేయ్..! నీ మంచితనంతో చస్తున్నా..!’ సరదాగా నవ్వుతూ అన్నాడు ప్రదీప్.‘సహానుభూతి ఉండాలండీ..! మనకు సాయం చేసే వాళ్లకు కనీసం మంచి మాటైనా తిరిగి ఇవ్వకపోతే, మనం మనుషులమే కాదు’ తనలో పురివిప్పిన సైకాలజిస్ట్ మాటలకు చెప్పేదేమీ లేక ‘మరి.. అంతేగా.. అంతేగా..’ అనుకుంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు ప్రదీప్.కాసేపటికి మళ్ళీ ఏదో గుర్తొచ్చి,‘ఇంకో విషయం.. ఈ వాచ్మన్కు భార్య లేదట! రెండేళ్ల కొడుకున్నాడు. వాడితోనే ఇక్కడికి వచ్చాడు. మరి పాత వాచ్మన్ భార్య నీకు అంట్లు, బట్టలు, ఇంటి పని ఆమెనే చేసేది కదా, ఇప్పుడెలా?’ అన్నాడు ప్రదీప్.పనిమనిషి సమస్య ఎప్పుడూ రావణకాష్టమే! ‘ఒకసారి చంద్రయ్యను అడిగి చూద్దాం! ఎవరినైనా కుదురుస్తాడేమో!’ అంది.ఇస్త్రీ బట్టలు పైకి తీసుకొచ్చి ఇవ్వడానికి వచ్చిన చంద్రయ్యను ఇదే విషయం అడిగింది.‘అమ్మా! మీకు అభ్యంతరం లేకపోతే, నేనే అంట్లు, బట్టలు, ఇంటి పని చేస్తాను. చిన్నోడి ఖర్చులకు వెళుతుంది కదమ్మా! మీరు ఎంత ఇచ్చినా పర్లేదు’ బావిలో నుంచి వచ్చినట్లుగా లో గొంతుకతో అన్నాడు.‘అవును..! మా ఇద్దరికీ టైం ఉండదు. ఎంతైనా పనిమనిషి లేనిది వెళ్లదు. ఇంటి పనిలో ఇతనిని పెట్టుకుంటే పదిమంది ఏమైనా అనుకుంటారా? కాని, అతని పిల్లాడి పోషణ ఖర్చుకు పనికొస్తుంది కదా! ఎవరేమైనా అనుకోనీ! అనుకున్న వాళ్లు ఏమీ చేయరు. నా ప్రదీప్ ఓకే అంటే చాలు’ అనుకుంటూ భర్తను ఒప్పించి, ఇంటి పని మొత్తాన్ని చంద్రయ్యకు అప్పగించింది కోమలి.అప్పటì æనుంచి చంద్రయ్య వాళ్ళ కుటుంబంలో ఒకడయ్యాడు. చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఏ సమస్య వచ్చినా, అందరికన్నా ముందుండేది అతనే. వాచ్మన్గా డ్యూటీ చేస్తూనే, సమయాన్ని కుదుర్చుకుంటూ కార్ డ్రైవర్గా, సర్వెంట్గా, ప్రదీప్కు అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఏమీ ఆశించడు. కల్మషం లేని చిత్తశుద్ధి. మొదటిసారి చంద్రయ్యను నిశితంగా చూడాలనిపించింది కోమలికి. ముప్పయ్యేళ్ళు వుంటాయేమో! మాసిన గడ్డం.. తెల్లగా చెదిరిన మనసుకు అద్దంలా వున్నాడు. మంచి డ్రెస్ కూడా వేసుకోకుండా బేలగా ఓ పిల్లోడిలా కనిపించాడు.వారం రోజులుగా చంద్రయ్య ఇంటి వైపుకు రాకపోవడంతో ‘మీరు కిందికి వెళ్ళినప్పుడు, చంద్రయ్యను రమ్మనమని చెప్పండి’ భయాందోళనగానే అంది కోమలి.‘ఇంకెక్కడి చంద్రయ్య! పిల్లోడిని తీసుకొని తన ఊరెళ్ళాడట! ఆరోగ్యం దెబ్బతిందని అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. మళ్ళీ మనకు మరో కొత్త వాచ్మన్.. అంతే!’చంద్రయ్య లేకపోవడంతో కోమలి మనసులో మనసు లేదు. ఏదో వెలితి ఆవరించినట్లయింది.‘ఏవండీ! మనకు ఇంత సర్వీస్ చేసిన చంద్రయ్యను వాళ్ల ఊరెళ్ళి ఒకసారి చూసొద్దాం అండీ’ బతిమాలింది కోమలి.‘ఏం చేస్తాం! కాదంటానా? నీ మాటే నా మాట. ఈ రోజే పోదాం పద’ కోమలి మాటను ఎప్పుడూ కాదనని ప్రదీప్– చంద్రయ్య ఊరు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అసోసియేషన్ వాళ్ళకు చంద్రయ్య ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంతో ఆ అడ్రస్తో ఆ ఊరికి చేరుకుని చంద్రయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి ఆరా తీయగా, ఇంట్లో వాళ్లు బయటకు వచ్చి‘చంద్రయ్య గొంతు వ్యాధితో నాలుగు రోజుల క్రితం చనిపోయాడు. మీరు కోమలి, ప్రదీప్ గారేనా?హైదరాబాద్ నుంచి వచ్చారా? మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారని, చనిపోయే ముందురోజు మాకు చెప్పి ఈ ఉత్తరం మీకు ఇవ్వమన్నాడు’ అంటూ ఉత్తరాన్ని ఇచ్చారు.అప్పటికే ఆ విషాద వార్త విన్న కోమలి గుండె చెరువై బరువవుతుండగా, ఆ ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది.‘ఐ లవ్ యూ.. మేడం..!’ఈ పిలుపు మీకు ఎక్కడో తాకుతుంటుంది.. నేనమ్మా..! మీ పాత పేషెంట్ రాజేష్ చంద్రను. గుర్తొచ్చానా అమ్మా! ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నన్ను మీ కౌన్సెలింగ్తో బతికించి ఊపిరి పోశారు. అంతేకాదు ఓ నెలరోజుల పాటు ప్రతిరోజూ ఫోన్లో క్రమం తప్పకుండా వేసుకునే మందులను సూచించడం, చేయాల్సిన వ్యాయామం, మంచి మాటలు, జీవన నైపుణ్యాలు, మానవ సంబంధాలను ఓ అమ్మలా చెప్పారు. ఆ విధంగా నాకు మీరు పునర్జన్మనిస్తే, చాలాకాలం తర్వాత కడుపుతో ఉన్న నా భార్య సైకోగా, హిస్టీరిక్గా చేస్తుంటే, ఆమెకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చి, మంచి డాక్టర్ తో వైద్యం చేయించి మామూలు మనిషిని చేసి.. ఇదిగో...! ఈ వారసుడి జననానికి కారణమయ్యారు. ఆ తర్వాత నా భార్య అనారోగ్యంతో పోయింది. మీకు ఈ విషయాలు చెప్పుకోవాలని తపించినా, ఎంత తాపత్రయపడినా, ఫోన్ కలవకపోవడంతో చెప్పుకోలేకపోయాను. ఒక రోజు అటక పైన ఉన్న ఆనాడు మీరు నాకు పంపిన మందుల పార్సిల్ కవర్ కింద పడటంతో దాని పైన గల ఫ్రమ్ అడ్రస్తో పిల్లాడితో ఈ సిటీకి చేరుకున్నాను. మీ అపార్ట్మెంట్లో వాచ్మన్ ఉద్యోగం కోసం నాలుగు నెలలు వేచి చూస్తే గాని ఈ ఉద్యోగం నాకు దొరకలేదు. ఆ భగవంతుడు మీ దగ్గరికి రప్పించేందుకు కూడా నాకు వరం ఇచ్చాడు తల్లి..! అదేంటో తెలుసా..? నాకు కౌన్సెలింగ్ ఇచ్చే ఆ రోజుల్లో నా గొంతు మీకు తెలిసి ఉంటుంది కదా! మరి మీ సన్నిధికి రావడానికి నన్ను గుర్తుపట్టకుండా ఉండేందుకు నాకు గొంతు వ్యాధిని ఇచ్చాడు. దాంతో పీలగా అయిన గొంతును గుర్తుపట్టలేకపోయారు. మీ తీయటి మాట, పలకరింపు, ప్రేమ, వాత్సల్యం, మానవత్వం ఫోన్కాల్లో చూశాను. దగ్గరుండి అవన్నీ మీ చల్లని చూపుల్లో, చేతల్లో చూసే అదృష్టం కలిగింది. కౌన్సెలర్గా మాలాంటి వాళ్లను బాగు చేసేంత వరకే మీ బాధ్యతగా, ఆ తర్వాత మాతో సంబంధాలను ఎంతవరకు ఉంచాలో అంతవరకే చేసే మీ విధానం నిజంగా గ్రేట్ మేడం! ఎందుకంటే కౌన్సెలింగ్ పరంగా ఏర్పడే మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకునే కొందరు వెధవల్ని దరిచేరనీయకపోవడమే కరెక్ట్. ఒక డాక్టర్, ఒక రోగికి ఉన్న సంబంధంలాగా అంతవరకే! కాని, త్వరలో చనిపోయే నాకు మీ రుణం తీర్చుకోవాలనిపించింది. ఆ రుణం తీర్చుకోవడమే ఈ ‘లవ్’ మేడం.. అంతే! మన మధ్య ఏ బంధమున్నదని ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా కౌన్సెలింగ్ చేసి, మా రెండు జీవితాలను బతికించి, పిల్లాడిని కూడా అందించారు చెప్పండి! పూర్వజన్మ సంగతి, మరుజన్మ సంగతి నాకు తెలియదమ్మా! కాని, ఈ జన్మలో మీరు చేసిన సహాయానికి నేను తిరిగి నా వంతుగా బాధ్యత గల సర్వీసును అందించాలని మీ చెంతకు చేరాను.నేనెలాగో ఎక్కువకాలం బతకనని తెలుసు. బతికినన్ని రోజులు మీరు చేసిన దానికి రుణం తీర్చుకునేందుకు నా చేతనైనంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీ వద్దకు చేరాను. ఈ బంధానికి పేరేమి పెడతారో తెలియదు కాని, చెదిరిపోని ‘లవ్’ ఉంటుంది. అంతే! ఆనాడు మీరు మాపై చూపించింది కూడా బాధ్యతగల ప్రేమనే!నేను చూపించేది కూడా కొందరి అవాంఛిత దృష్టి మాదిరిగా స్వార్థం, కోరికతో కూడిన ప్రేమ కాదు. ఇది బాధ్యతతో ఒక అమ్మకు చేసే సేవా ప్రేమ ఇది. కాదంటారా అమ్మా! ఒప్పుకుంటారా తల్లీ..? నిశీధిలో కొట్టుమిట్టాడుతున్న ఎందరో నాలాంటి జీవితాలకు వెలుగునిచ్చే వెలుగు దివ్వెమ్మా..! మీకు, మీ కుటుంబానికి చేసే ప్రతి పనిలో కష్టమనిపించలేదు, ఇష్టంతో చేశాను. ఎండలో వానలో, తినీ తినక అనారోగ్యాన్ని లెక్క చేయక చేసిన నా ఇష్టమైన పనులే నా ఆత్మ శాంతించడానికి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చిన్నోడి రూపంలో వున్న ఈ ఆత్మరుణానుబంధానికి మీ పేరే పెట్టుకున్నానమ్మా! వాడే ఈ కోమల్!!ఇక నా ప్రాణం పోయినా పర్లేదు. ఆత్మసంతృప్తి మిగిలింది. ఆ రాత్రి గొంతు నొప్పి ఎక్కువ కావడంతో, ఇక నేను ఎక్కువ రోజులు బతకనని తెలిసి పిల్లోడిని తీసుకొని మా ఊరు వచ్చాను. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకే ఈ లేఖ ముందస్తుగా రాస్తున్నా. మీ మంచితనం, మానవత్వం పదికాలాలపాటు చెరిగిపోకుండా మరెందరో అభాగ్యులకు కొత్త జీవితాలు అందిస్తే అదే చాలు. నేను చేసిన దానికి అర్థం! పరమార్థం!ఇంకో విషయం తల్లీ! మన సార్ పాత బండికి సరిగా బ్రేకులు లేవు. ఇంజిన్ కూడా రిపేరుకు వచ్చింది. అందుకే నేను చేసిన సర్వీస్కు మీరిచ్చిన జీతాన్ని దాచుకొని, ఆ పైకంతో మన సార్కు నా గిఫ్ట్గా కొత్త బైక్ కొన్నాను. సెల్లార్లో మీ పార్కింగ్లో పెట్టాను. కీస్ వాచ్మెన్ రూమ్లో ఉన్నాయి. తీసుకోండి!ఇక... సార్..నమస్తే..! మేడంకు ఇవ్వడమే కాని, ఎవరి నుంచి ఏదీ తీసుకోదు. అందుకే నేనెవరో తెలియకుండా వచ్చి నా రుణం నేను తీర్చుకున్నాను. మీరు ఆపద్బాంధవులు. ఒకరోజు నా పిల్లోడికి జ్వరం వస్తే రాత్రికి రాత్రి మీరు ఆసుపత్రికి తీసుకెళ్లి దగ్గరుండి వైద్యం చేయించిన గుర్తులు మరువలేనివి. ఒకసారి గుర్తుందా సార్ మీకు...! మీ డ్రైవింగ్లో బైక్ పైన ఇద్దరం వెళ్తుంటే, మీ బైకుకు బ్రేకులు సరిగా లేవుగా.. అదుపుతప్పి ఇంకో బైక్కు తగిలితే పెద్ద గొడవైంది ఆరోజు.. వెంటనే మిమ్మల్ని ఆటో ఎక్కించి ఇంటికి పంపాను కదా..! ఆ తర్వాత అక్కడికి పోలీసులు వస్తే, నేనే డ్రైవ్ చేశానని చెబితే వాళ్లు కొట్టిన లాఠీ దెబ్బలు ఇంకా మానలేదు.. అయితేమాన్లే సార్..! ఇష్టంతో తిన్న దెబ్బలు కదా..! అవి తీయగా తడుముతున్నాయి.. ఈ విషయం ఎందుకు చెప్పానంటే అది యాక్సిడెంట్ కేస్ చేశారు కదా! పోలీసులు నాకోసం మీ దగ్గరికి వస్తారేమో? లేడు.. చనిపోయాడని చెప్పండి! ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నానని అనుకోకండి! కాని, చెప్పకుండా అదృశ్యమైతే మీరన్న జాబితాలో చేరిన మనిషిగానే మిగిలిపోతాను కదా సార్!ఒక్కసారి నవ్వండి సార్..! ‘చంద్రా’..! అని కేకేయండి! మీ ముందు వాలుతానేమో!ఇక ఉంటాను..! సెలవు!’చదువుతున్న కోమలి కంట నీటి ధార కారుతుండగా ఆ కాగితం తడుస్తుంటే, అక్షరాలు చెదిరిపోకుండా ఆ కాగితాన్ని మృదువుగా తడుముకుని హృదయానికి హత్తుకుంది. మెలి పెడుతున్న బాధతో వున్న కోమలిని పొదివి పట్టుకుని నిలబడ్డాడు ప్రదీప్.తల్లి, తండ్రిని కోల్పోయి బేలగా చూస్తున్న కోమల్ వైపు చూస్తూ..‘ఏవండీ! ఆ బాబు! కన్నీటితో అంటుండగా... అర్థం చేసుకున్న ప్రదీప్,‘నీ ఇష్టమే నా ఇష్టం! మన చంద్రయ్య గుర్తులు మానవ సంబంధాలకు, అనుబంధాలకు చాలా అవసరం’ అంటూ ఆ పిల్లోడిని అక్కడి వారి అనుమతితో కారులో ఎక్కించుకొని, హైదరాబాద్ బయలుదేరారు. తన వెచ్చని ఒడిలో చల్లగా నిద్రపోతున్న ఆ పిల్లోడు కోమలి తలపై నిమురుతూ, ‘ఆత్మబంధాన్నిచ్చావా.. చంద్రయ్యా! పిల్లలు లేరని బాధపడుతున్న తమకు ఆ దేవుడు ఈ రూపేణా వీడిని ప్రసాదించాడా? ఈ రుణానుబంధాన్ని బాధ్యతగా చూసుకుంటా! ఇది కదా! నిజమైన ‘లవ్ ’... ఐ లవ్ యు టూ రాజేష్..! ఐ మిస్ యు.. రాజేష్ చంద్రయ్య!’ అనుకుంటూ తన అంతరంగ తరంగాలను సముదాయించుకుంటూ, హృదయస్పర్శతో మనసులోనే చంద్రయ్య పాదాలను తడిమింది కోమలి. -
బతుకుతున్న సంస్కృత నాటక పరంపర
భారత ఉపఖండంలో వేల సంవత్సరాలు సాహిత్య భాషగా వున్న సంస్కృతం సుమారు వెయ్యేళ్ళకు పైగా ఒక ప్రదర్శన కళారూపంగా కూడా బతికి ఉండటం విశేషం. అదే కేరళలోని కూడియాట్టం. కూడియాట్టం అంటే కలిసి ఆడే నాట్యం అని అర్థం. ఇది కేరళలోని నాట్య ప్రక్రియలలో ప్రాచీనమైనది. కేరళలోని ప్రాచీన దేవాలయాలలో ఈ నాట్య ప్రదర్శనకు ప్రత్యేకమైన మందిరం ‘కూతాంబళం’ ఉంటుంది. సుమారు 5వ శతాబ్దిలో ప్రారంభమైన సంస్కృత నాటకాలలో పురాణేతిహాసాలు నేపథ్యంగా ఉన్న నాటకాలను పూర్వం చాక్యార్ బ్రాహ్మణులు మాత్రమే కూతాంబళాలలో ప్రదర్శించేవారు. ఇప్పుడు ఇతర కులాల వారు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ నాట్యాన్ని యునెస్కో మౌఖిక వారసత్వ కళారూపంగా గుర్తించడంతో కొన్ని దశాబ్దాలుగా ఖండాంతరాలలో ప్రదర్శితమవుతోంది. త్రిసూర్ కళామండలం, తిరువనంతపురం మార్గి, మూడికుళం నేపథ్య వంటి సంస్థలు ఈ వ్యాప్తికి కృషి చేస్తున్నాయి.ఐదు నుండి పది అంకాల సంస్కృత నాటకాన్ని పూర్తిగా ప్రదర్శించడానికి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ రోజులే పట్టవచ్చు. ఒక్కొక్క శ్లోకాన్ని దాదాపు అరగంట వరకు ప్రదర్శించడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. నాటకం మొదలు పెట్టడానికి ముందు ఒకరోజు మొత్తం ప్రదర్శన అంతా ఒకే నటుడు నాటక నేపథ్యం చెప్పడం, ప్రతిరోజూ ముందు సంక్షేపం, నిర్వహణం అనే ప్రదర్శనా పద్ధతులు ఉండటం వల్ల నాటకం మొత్తం పూర్తవడానికి ఎక్కువ రోజులు పడుతుంది.ప్రదర్శన ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి పది, పదకొండు గంటలకు ముగుస్తుంది. ప్రదర్శనలో ముఖ్యమైన వాయిద్యం మిళావు. గంగాళంలాంటి రాగి పాత్రకు ఉన్న సన్నటి మూతిపై బిగుతుగా కట్టిన తోలు మీద వాయిద్యకారులు దరువులు వేస్తారు. ఈ దరువుల శబ్దం ప్రేక్షకులను తాదాత్మ్యతలోకి తీసుకువెళ్తాయి. మిళావుకి తోడుగా ఎడక్క అనే మృదంగం కూడా నాటక ప్రదర్శన సాంతం వాయిస్తూ వుంటారు. ఆడవాళ్ళు మాత్రమే తాళం వాయిస్తారు. కర్ణాటక సంగీత తాళగతులకు భిన్నంగా ఈ తాళాలు వుంటాయి. ‘ఎడక్క’ వాయిద్యకారుడే అవసరమైన సందర్భాలలో శంఖం కూడా ఊదుతాడు. ప్రదర్శనకు ముందు వేదిక ముందుభాగం మధ్యలో ఉంచిన పెద్ద దీపపు సెమ్మెలోని వత్తులు వెలిగిస్తారు. వెంటనే మిళావు ఆహ్వాన దరువుతో ప్రదర్శన ప్రారంభమవుతుంది.కూడియాట్టంలో పాత్రలకు అనుగుణమైన ప్రత్యేక అలంకరణ వుంటుంది. సూత్రధార, దైవిక, రాజ పాత్రలకు ఒక విధంగానూ; సూత, విదూషక మొదలైన ద్వితీయశ్రేణి పాత్రలకు ఒక విధంగానూ అలంకరణ వుంటుంది. మగ పాత్రలకు దవడ మొత్తం చుట్టి వుండే ‘చుట్టి’ అనే సన్నటి తెల్లటి పట్టా వేయడం కూడియాట్టం నుండే కథాకళికి కూడా సంక్రమించింది. చుట్టి వేయడానికి ప్రదర్శనకు ముందు మూడుగంటల నుండి నటుడు సిద్ధం కావలసి వుంటుంది. స్త్రీ పాత్రలు ఎర్రటి అంచులు వుండే తెల్లటి చీరలు ధరిస్తారు.ఈ నాట్యంలో వుండే ముద్రలు ప్రత్యేకమైనవి. భరతుని నాట్యశాస్త్రానికి అనుగుణంగా ఉంటూనే ప్రత్యేక రీతిలో పాద, హస్త ముద్రలు వుంటాయి. సన్నివేశానికి అనుగుణంగా మానవ అనుభూతులకు ప్రదర్శించేటపుడు నటుల ముఖ కవళికలు, కనుబొమల విన్యాసాలు వివరణాత్మకంగా ఉండి ప్రేక్షకుని తమలో లీనం చేసుకుంటాయి. సంస్కృత శ్లోకాలను నటులు స్పష్టంగా ఒక ప్రత్యేకమైన రీతిలో పాడతారు. అవసరమైన సందర్భాలలో శ్లోకాన్ని పద విభాగం చేసి కూడా వినిపిస్తారు. ఒకసారి శ్లోకాన్ని పాడి అర్థ వివరణల ముద్రలతో నటించి మళ్ళీ శ్లోకాన్ని పాడతారు. నేపథ్యం చెప్పే సందర్భంలో వచ్చే శ్లోకాలను తాళం వాయించే నంగియార్లు పాడతారు.కాళిదాసు శాకుంతలం, భాసుని ప్రతిమ, అభిషేకం, స్వప్న వాసవదత్తం, శక్తిభద్రుని ఆశ్చర్య చూడామణి, హర్షుని నాగానంద, కులశేఖర వర్మ తపతీ సంవరణం, బోధాయనుని భగవదజ్జుకం మొదలైన నాటకాలను కూడియాట్టంలో ప్రదర్శిస్తూ వుంటారు. కాలానుగుణంగా కూడియాట్టం కూడా మార్పు చేర్పులతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక రోజు ప్రదర్శనలు, ఏక పాత్రాభినయాలు కూడా చేస్తోంది. శూద్రకుని మృచ్ఛకటికాన్ని కూడియాట్టం ప్రదర్శనకు అనుగుణంగా మార్చి వేణు.జి. ఇటీవల ప్రదర్శిస్తున్నారు. కొచ్చికి నలభై కి.మీ.ల దూరాన ఉన్న మూడికుళం గ్రామంలోని నేపథ్య థియేటర్ మధు చాక్యార్, డా.ఇందు తన బృందంతో కలిసి కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. నేపథ్య బృందం, కపిల వేణు బృందం దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్, డా. సుధా గోపాలక్రిష్ణన్, ప్రొఫెసర్ పౌలోస్ వంటివారు కూడియాట్టం మీద ఇంగ్లిష్లో పరిశోధనాత్మక గ్రంథాలు రాశారు. ఆగస్టు మొదటి వారంలో కూడియాట్టం అంతర్జాతీయ ఉత్సవాన్ని కళామండలం సంస్థ, వారం రోజుల పాటు త్రిసూర్లో ఘనంగా నిర్వహించారు. మలయాళీల పెద్ద పండగ ‘ఓణం’కు ముందు పదిరోజుల కూడియాట్టం ఉత్సవాలను మూడికుళం నేపథ్య సెంటర్ గత పదహారేళ్లుగా నిర్వహిస్తునారు.ఇజ్రాయెల్ హీబ్రూ యూనివర్సిటీ ఎమిరిటస్ ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్ ఆధ్వర్యంలోని దక్షిణాసియా విభాగపు ‘నీమ్’ ప్రాజెక్ట్, యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా 7వ శతాబ్దపు పల్లవ మహేంద్రవిక్రమవర్మ రచించిన ‘మత్తవిలాస ప్రహసనాన్ని’ మూడికుళంలో పూర్తిగా ఆరురోజులపాటు ప్రదర్శించారు. కంచిలోని కల్లు దుకాణాల దగ్గర జరిగిన కథ ఇందులోని ఇతివృత్తం. బౌద్ధ, శైవ మత శాఖలలోని లోపాలను హాస్యభరితంగా విమర్శించిన ప్రహసనంగా ప్రఖ్యాతి పొందిన ఈ ప్రహసనం సంస్కృత ప్రహసనాల్లో మొదటిదని అంచనా. కాపాలిక, దేవసోమ, శాక్యభిక్షు, పాశుపత, ఉన్మత్తుని పాత్రలతో వున్న ఈ ఏకాంక ప్రహసనాన్ని గత కొన్ని వందల సంవత్సరాలుగా పూర్తిగా ఎక్కడా ప్రదర్శించలేదు. అందువల్ల ఈ కూడియాట్టం ప్రదర్శనను చూడటానికి దేశ విదేశాల సంస్కృత పండితులు, పరిశోధకులు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడియాట్టం చూడడానికి వీరంతా మూడికుళం వస్తూనే ఉంటారు. ∙డా. కె.రామచంద్రారెడ్డి -
త్రిశంకుస్వర్గం
సూర్యవంశ రాజులలో త్రిశంకుడు ఒకడు. అతడు ధర్మపరాయణుడు, సద్గుణవంతుడు. ఒకసారి అతడికి చిత్రమైన కోరిక కలిగింది. తన మానవ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనేదే ఆ కోరిక. ‘మహర్షీ! బొందితో స్వర్గానికి వెళ్లాలని నా కోరిక. అది నెరవేరడానికి తగిన యజ్ఞం నిర్వహించండి’ అని కులగురువు వసిష్ఠుడిని కోరాడు. ‘రాజా! నీ కోరిక అసమంజసమైనది, అస్వాభావికమైనది. నీ కోరిక తీర్చడానికి నేనెలాంటి సాయం చేయలేను’ అంటూ వసిష్ఠుడు నిరాకరించాడు.వసిష్ఠుడి నిరాకరణతో త్రిశంకుడు దిగులు చెందాడు. సింహాసనాన్ని విడిచిపెట్టి, దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రయాణంలో అతడు వసిష్ఠుడి కుమారులను కలుసుకున్నాడు. తపస్సంపన్నులైన వసిష్ఠుడి నూరుగురు కుమారులు తన కోరిక ఈడేర్చగలరని భావించి, వారికి తన కోరికను తెలిపి, తగిన యజ్ఞాన్ని చేయమని కోరాడు.త్రిశంకుడి కోరిక విని వసిష్ఠ కుమారులు ఆగ్రహోదగ్రులయ్యారు.‘మా తండ్రి నిరాకరించిన తర్వాత అదే కోరికను నెరవేర్చమని మమ్మల్ని అడగటానికి నీకెంత ధైర్యం? నీ కోరిక కుర్రతనమో, వెర్రితనమో అర్థం కాకుండా ఉంది. ఇది అస్వాభావికం, అనుచితం. నువ్వు మూర్ఖుడివి, పాపాత్ముడివి. అందుకే మా తండ్రి నిరాకరించినా పట్టించుకోకుండా, అదేపనిగా పాకులాడుతున్నావు’ అని నిందించారు.వసిష్ఠ కుమారుల మాటలకు త్రిశంకుడు చిన్నబోయాడు. ‘మా కులగురువైన వసిష్ఠులవారు నిరాకరించారని, గురుపుత్రులైన మిమ్మల్ని ఆశ్రయించాను. మీరు నన్ను అర్థం చేసుకోకుండా దూషిస్తున్నారు. మీరు కూడా నా కోరికను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో నాకు ఒకటే ఉపాయం మంచిదనిపిస్తోంది. నా కోరికను నెరవేర్చగల మరో గురువు కోసం అన్వేషించడమే ఇప్పుడు నేను చేయదగిన పని’ అన్నాడు త్రిశంకుడు.త్రిశంకుడి మాటలకు వసిష్ఠపుత్రులు మండిపడ్డారు.‘పాపాత్ముడా! నువ్వు గురుద్రోహాన్ని తలపెడుతున్నావు. మీ వంశానికి తరతరాలుగా గురువైన మా తండ్రిని కాదని, మరో గురువును చూసుకుంటానని అంటున్నావు. ఈ క్షణం నుంచి నువ్వు చండాలుడివి అవుతావు’ అని శపించారు.త్రిశంకుడు విచారంతో రాజధానికి వచ్చాడు. రాత్రి అశాంతిగా నిద్రించాడు. రాత్రి గడిచేసరికి తాను చండాలుడైనట్లు కనుగొన్నాడు. బంగారు వన్నెతో ఉన్న అతడి శరీరం నల్లగా మారింది. స్ఫురద్రూపి అయిన త్రిశంకుడు కురూపిగా మారిపోయాడు. అతడి ఆకారాన్ని చూసి, మంత్రులు కూడా నమ్మలేకపోయారు. ప్రజలు హేళన చేశారు. తన పరిస్థితికి త్రిశంకుడు కుంగిపోయాడు. దీర్ఘంగా ఆలోచించాడు. తన దుస్థితిని తప్పించి, తన కోరికను తీర్చగలవాడు ఒక్కడే ఒక్కడు– మహా తపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు అని తలచాడు. అతడి కోసం వెదుకులాడుతూ బయలుదేరాడు. త్రిశంకుడు విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరుకునే వేళకు విశ్వామిత్రుడు ధ్యానంలో ఉన్నాడు. కాసేపటికి విశ్వామిత్రుడు కళ్లు తెరిచాడు.ఎదురుగా దీనవదనంతో కురూపిగా ఉన్న త్రిశంకుడు కనిపించాడు. అతడిని దగ్గరకు పిలిచాడు. ‘నువ్వు అయోధ్య రాజువైన త్రిశంకుడివని నాకు తెలుసు. నీ పరిస్థితి ఎందుకు ఇలాగైంది? నువ్వు ఏదో దిగులుతో ఉన్నావు, కారణమేంటి? నీకు నేను చేయగల ఉపకారమేముంది?’ అని అడిగాడు.విశ్వామిత్రుడు ఆదరంగా పలకరించే సరికి త్రిశంకుడు కన్నీళ్లు పెట్టుకుని, చేతులు జోడించాడు.‘మహర్షీ! బొందితో స్వర్గానికి వెళ్లాలనేది నా కోరిక. మా కులగురువు వసిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన పుత్రులను ఆశ్రయించాను. వారు కూడా నా కోరికను నిరాకరించారు. అంతేకాదు, నన్ను శపించారు. వారి శాపం వల్లనే ఇలా మారాను. నా కోరిక నెరవేర్చగల సమర్థులు మీరు మాత్రమే! అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. ఇక మీరే నాకు దిక్కు’ అన్నాడు.విశ్వామిత్రుడు అతడి దుస్థితికి జాలిపడ్డాడు. ‘నీ కోరికను నేను తీరుస్తాను’ అని అభయమిచ్చాడు.త్రిశంకుడి కోసం విశ్వామిత్రుడు ఒక మహాయాగం నిర్వహించాడు.విశ్వామిత్రుడి తపోబలం వల్ల త్రిశంకుడు బొందితోనే స్వర్గానికి చేరుకున్నాడు.త్రిశంకుడు స్వర్గానికి చేరడం ఇంద్రుడికి ఇష్టంలేక, ‘త్రిశంకూ! గురుపుత్రుల శాపం పొందిన నువ్వు స్వర్గంలో ఉండటానికి అనర్హుడవు. వెంటనే భూలోకానికి వెళ్లిపో!’ అన్నాడు. ఇంద్రుడి ఆజ్ఞతో దేవతలు అతడిని తోసేశారు.‘మహర్షీ! దేవతలు నన్ను తోసేశారు. నేను కిందకు పడిపోతున్నాను. కాపాడండి’ అంటూ త్రిశంకుడు ఆర్తనాదాలు చేశాడు. విశ్వామిత్రుడు ‘నువ్వు అక్కడే నిలు’ అని పలికి, తన మంత్రబలంతో త్రిశంకుడు ఉన్నచోటునే మరో స్వర్గాన్ని నిర్మించాడు. ‘త్రిశంకూ! ఇది నీ స్వర్గం. నీ పేరుతో త్రిశంకు స్వర్గంగా ప్రఖ్యాతి పొందుతుంది. ఇంద్రుడి స్వర్గం అంతరించిపోతే అంతరించవచ్చు గాని, నేను నీ కోసం నిర్మించిన స్వర్గం నిలిచి ఉంటుంది.’ అన్నాడు విశ్వామిత్రుడు.∙సాంఖ్యాయననువ్వు అయోధ్య రాజువైన త్రిశంకుడివని నాకు తెలుసు. నీ పరిస్థితి ఎందుకు ఇలాగైంది? నువ్వు ఏదో దిగులుతో ఉన్నావు, కారణమేంటి? నీకు నేను చేయగల ఉపకారమేముంది? -
సాధారణ దొంగ కాదు... సాహు
ఒక నగల దుకాణంలోకి చొరబడిన వ్యక్తిని సాధారణ దొంగగా భావించి, పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు పేరుమోసిన ‘గుడి’దొంగ ప్రకాశ్కుమార్ సాహుగా తేలడంతో వారు అవాక్కయ్యారు. ఈ ఉదంతం 2012లో జరిగింది. ఛత్తీస్గఢ్లోని జమునాచౌక్ సమీపాన ఉన్న డాక్బంగ్లా ప్రాంతానికి చెందిన ప్రకాశ్కుమార్ సాహు 1996 నుంచి కొన్నేళ్ల పాటు దేవాలయాల్లోనే చోరీలు చేశాడు. ఇతడు ఆంజనేయస్వామి భక్తుడు కావడంతో ఆంజనేయుడి ఆలయాలు తప్ప మిగిలిన అన్ని ఆలయాల్లోనూ చేతివాటం చూపించాడు. ఎక్కువగా సాయిబాబా, అమ్మవార్ల ఆలయాలపైనే కన్నువేసేవాడు. ఇతగాడు 1998లో విజయవాడ కనకదుర్గ ఆలయంలోకి చొరబడి అమ్మవారి ముక్కుపుడక, కిరీటం సహా ఆభరణాలను చోరీ చేశాడు. ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి ఆలయంలో 2001 నవంబర్ 10 అర్ధరాత్రి చొరబడి, పదమూడో శతాబ్ది నాటి మదనమోహన, అంబస్యనారాయణ విగ్రహాలను ఎత్తుకుపోయాడు. ఈ రెండు సంఘటనల్లోనూ అప్పటి ముఖ్యమంత్రులు స్పందించాల్సి వచ్చింది.తొలినాళ్లల్లో కేవలం దేవాలయాలను మాత్రమే టార్గెట్గా చేసుకునే సాహు కొన్నాళ్లకు తన పంథా మార్చుకున్నాడు. జగన్నాథస్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసులో సాహు అదే ఏడాది నవంబర్ 27న భువనేశ్వర్ రైల్వేస్టేషన్లో చిక్కాడు. ఈ విచారణ నేపథ్యంలోనే ఇతగాడు బరంపురంలోని పెద్దబజారు ప్రాంతంలో ఉన్న రెండు నగల దుకాణాలనూ లూటీ చేసినట్లు అంగీరించాడు. వీటికి ముందే భువనేశ్వర్లోని లింగరాజ్ దేవాలయంలోనూ దొంగతనానికి పాల్పడ్డాడు. జగన్నాథస్వామి, లింగరాజ్ దేవాలయాల చోరీ కేసుల్లో సాహు జైలు శిక్ష పడింది. ఇతడు ఏ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకుంటాడో, అక్కడ ‘పని’ చేయడానికి ముందు భక్తుడిగా ప్రవేశించి ప్రార్థనలు చేస్తాడు. పూరీ గుడిలో చోరీకి వెళ్లిన సందర్భంలో విగ్రహాలు ముట్టుకునేప్పుడు, తీసేప్పుడు కళ్లు మూసుకుని చేశాడు. ఆపై భయపడిన సాహు మదనమోహన విగ్రహాన్ని భువనేశ్వర్ శివార్లలోని ఓ నూతిలో పడేశాడు. ఇతడు చేతివాటం ప్రదర్శించిన వాటిలో అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పురాతన ఆలయాలూ ఉన్నాయి. ఇతడు కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ నేరాలు చేశాడు. 2010లో హైదరాబాద్ను టార్గెట్ చేసిన సాహు అనేక ఆలయాల్లో చోరీలు చేశాడు. ఆపై కేపీహెచ్బీ భాగ్యనగర్ కాలనీలోని వాసవి జ్యూలర్స్, జూబ్లీహిల్స్లోని శ్రీకృష్ణానగర్లో బాబూలాల్ హీరాచంద్ జైన్ జ్యూలరీ షాపుల్లో నేరాలు చేశాడు. 2012 అక్టోబర్ 11న ఉప్పల్లోని మహాలక్ష్మీ జ్యూలర్స్ను టార్గెట్ చేసుకున్న సాహు ముందే రెక్కీ చేశాడు. ఆ రోజు అర్ధరాత్రి అక్కడకు తన అనుచరులతో కలిసి వచ్చి ‘పని’ ప్రారంభించాడు. తన వెంట తెచ్చుకున్న పరదాను జ్యూలరీ షాపు ముఖద్వారం రోడ్డుపైకి కనిపించకుండా అడ్డుగా కట్టాడు. దుకాణం పైఅంతస్తులో ఉండే యజమాని కిందికి రాకుండా దర్వాజా, గ్రిల్స్ను బిగించేశాడు. తొలుత జ్యూలరీ షాపు గ్రిల్స్కు వేసిన తాళాలను కట్టర్లతో కట్ చేశాడు. షట్టర్ మధ్య భాగంలో గ్యాస్ కట్టర్తో కట్ చేసి, ఆ భాగం తెరిచి దుకాణం లోపలికి ప్రవేశించి, రెండు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. అయితే, ఆలోపే ఒక దాంట్లో సాహు కదలికలు రికార్డు అయ్యాయి. అనంతరం ఇన్వర్టర్ను ఆఫ్ చేశాడు. లాకర్ను కట్టర్తో కట్ చేస్తుండగా పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.సాహు ఈ దుకాణంలోని ఇన్వర్టర్ విషయంలో చిన్న పొరపాటు చేశాడు. యజమాని హస్తామల్ శర్మ నివసించేది షాపు పైన ఉన్న ఇంట్లోనే. దుకాణానికి, ఇంటికి కలిపి ఒకే ఇన్వర్టర్ను ఏర్పాటు చేసుకున్నారు. షాపులోకి ప్రవేశించిన సాహు గ్యాంగ్ అవసరం లేకపోయినా ఇన్వర్టర్ వైరు కట్ చేసింది. ఆ రోజు అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఉప్పల్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పటికే ఇన్వర్టర్ వైర్ కూడా తెగి ఉండటంతో అదికూడా పని చేయలేదు. ఉక్కపోతతో మెలకువ వచ్చిన శర్మ బాల్కనీలోకి వచ్చి చూశాడు. గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి పొగలు కనిపించడంతో అప్రమత్తమై చుట్టుపక్కల వారితో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. శర్మ పిలుపుతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు ఇళ్లల్లో లైట్లు వేశారు. ఇది గమనించిన సాహు అనుచరులు పరారవగా, ఆ అవకాశం లేని సాహు దుకాణం మెట్ల కిందే నక్కాడు. చుట్టుపక్కల వారు దుకాణం వద్దకు చేరుకోవడంతో పాటు అదే సమయంలో పోలీసులూ వచ్చారు. అప్పటి వరకు మెట్ల కింద నక్కిన సాహు ఈ హడావుడితో కంగారు పడ్డాడు. బయటకు వచ్చి జనం మధ్య నుంచి కొంతదూరం వెళ్లి ఒక్కసారిగా పరిగెత్తడం ప్రారంభించాడు. దీంతో స్థానికులు, పోలీసులు వెంబడించి అతడిని పట్టుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. మామూలు దొంగగా భావించిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇతడు సాహు అనే విషయం బయటపడింది. దీంతో మల్కాజ్గిరి సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు తరలించారు. అప్పట్లో గుడులు, జ్యూలరీ దుకాణాలు కలిపి 13 చోరీలు అంగీకరించిన సాహు ఆ సొత్తును మహారాష్ట్రలో ఉన్న మిత్రుడి వద్ద దాచినట్లు చెప్పాడు. ఆఖరుసారిగా సాహు 2023 ఫిబ్రవరిలో కేరళలోని కొచ్చి పోలీసులకు చిక్కాడు. -
గగన యంత్రడికి ఘనమైన వీడ్కోలు
మనుషులకైనా, యంత్రాలకైనా ‘విధుల విరమణ’ వీడ్కోలు ఇవ్వటం అన్నది భావోద్వేగ భరితంగా ఉంటుంది. ఆగస్టు 25న మిగ్–21 యుద్ధ విమానాలకు చివరి టేకాఫ్తో లాంఛనంగా వీడ్కోలు పలకటానికి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్వయంగా ఒక మిగ్–21ను నడిపారు. ఆ క్షణాలలో అక్కడున్న వారి హృదయాలన్నీ భారమైన కళ్లతో ఆ దృశ్యాన్ని వీక్షించాయి. ‘మిగ్–21’ను కనుక మనిషి అనుకుంటే.. యుద్ధ యోధుడు అనాలి. ఆయుధం అనుకుంటే కనుక... ఆకాశపు ఏకే–47 అనాలి. ఎన్నో యుద్ధాలలో భారత్ వెన్నుదన్నుగా ఉన్న ఈ గర్జించే ‘గన్ను’, కనిపించని టార్గెట్ను సైతం ఒక్క చూపుతో భస్మం చేసే ఈ ‘కన్ను’... రూపురేఖలకు విహంగమే కాని, ఇండియన్ ఆర్మీలో సకల బలాల, దళాల ‘అక్షౌహిణి!’ ఇండియన్ ఎయిర్ఫోర్స్కు ఆరు దశాబ్దాలకు పైగా దోస్త్ మేరా దోస్త్!!పాం ర్స్... కోబ్రాస్భారత వైమానిక దళం (ఐ.ఎ.ఎఫ్) ఈ నెల 26న మిగ్–21 యుద్ధ విమానాలకు ఘనంగా వీడ్కోలు పలకబోతోంది. దీనర్థం – ఇకపై ఈ ఫైటర్ జెట్లను మన ఆర్మీ ఏ విధమైన విధులకూ ఉపయోగించదు. 62 ఏళ్లుగా సైన్యానికి సేవలు అందిస్తున్న మిగ్–21 లకు స్వస్తి చెప్పటం కోసం భారత ప్రభుత్వం చండీగఢ్లో ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఐ.ఎ.ఎఫ్లో ప్రస్తుతం మిగ్–21 విమానాలకు చెందిన స్క్వాడ్రన్లు రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి : ‘పాంథర్స్’ (23వ స్క్వాడ్రన్), రెండు : ‘కోబ్రాస్’ (3వ స్క్వాడ్రన్). రాజస్థాన్లోని బికనీర్కు సమీపంలో – ‘నల్’ ఎడారి యుద్ధ విమానాల స్థావరం నుంచి ఇవి పని చేస్తుంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ విమానాలు, నిర్వహణా సిబ్బంది, వాటిని నడిపే పైలట్లతో కూడిన విభాగాన్ని ‘స్క్వాడ్రన్’ అంటారు. వేరియంట్లలో చివరి మిగ్ఐ.ఎ.ఎఫ్. ఈ ఆరు దశాబ్దాలలో పలు రూపాంతర (వేరియంట్) రకాలైన మిగ్–21లను యుద్ధాలలో ప్రయోగించింది. అవి : మిగ్–21 ఎఫ్, మిగ్–21 పిఎఫ్, మిగ్–21 ఎఫ్.ఎల్, మిగ్–21 ఎం, మిగ్–21 బిస్, మిగ్–21 బైసన్. చివరి వేరియంట్ అయిన ఈ బైసన్ మిగ్లనే ఇప్పుడు మన వైమానిక దళం పక్కన పెట్టబోతున్నది. స్క్వాడ్రన్ 3, స్క్వాడ్రన్ 23లో కలిపి ప్రస్తుతం మొత్తం 36 మిగ్–21 బైసన్లు ఉన్నాయి. అరవై ఏళ్లకు పైగా భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలిచిన ఈ మిగ్–21 యుద్ధ విమానాలలో ఒక దానిని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గత నెలలోనే నడిపి మిగ్లకు లాంఛనంగా వీడ్కోలు పలికారు. (పైన ఫోటోలు). రష్యన్ సంతతికి చెందిన ఈ ఫైటర్ జెట్పై శిక్షణ పొందిన పైలట్లు ఆ వీడ్కోలు క్షణాలలో భావోద్వేగానికి లోనయ్యారు. నిజానికి భారత వైమానిక దళం దశల వారీగా మిగ్–21ల వాడకాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. ఆ క్రమంలో ఇది చిట్టచివరి ఉపసంహరణ. ప్రధానంగా భద్రతా సంబంధ కారణాలతో ఐ.ఎ.ఎఫ్. వీటిని నిలిపివేస్తోంది. టెక్నాలజీ పాతపడి పోవటం, ఫైటర్ స్క్వాడ్రన్లను ఆధునికీకరించవలసిన అవసరం ఏర్పడటం వల్ల కూడా మిగ్–21 ల నుంచి భారత్ ఆధునాతన దేశవాళీ ఎల్.సి.ఎ. ఎంకె–1ఎ ఫైటర్ జెట్లకు మళ్లుతోంది. రష్యా నుంచి తొలి మిగ్మిగ్–21 అన్నది 1950లలో సోవియట్ యూనియన్ వృద్ధి చేసిన సూపర్సోనిక్ యుద్ధ విమానం. ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి అయిన జెట్గా కూడా దీనికి రికార్డు ఉంది. భారత్ మొట్టమొదట 1963లో సోవియెట్ యూనియన్ నుండి మిగ్–21ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత, రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని, విడి పరికరాలు దిగుమతి చేసుకుని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హాల్)లో స్వయంగా మిగ్లను తయారు చేసుకోవటం మొదలుపెట్టాం. మిగ్–21లోని వేరియంట్లన్నీ భారత్ వృద్ధి చేసుకున్నవే. అంతేకాదు, ఐ.ఎ.ఎఫ్. దగ్గరున్న మొత్తం 850 మిగ్–21లలో అత్యధికంగా ‘హాల్’ ఉత్పత్తి చేసినవే. 1987 తర్వాత çహాల్లో మిగ్–21ల తయారీ వివిధ కారణాలతో ఆగిపోయింది. రష్యా 1986లోనే పూర్తి స్థాయిలో మిగ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. మిగ్–21ల ఘన చరిత్ర వియత్నాం యుద్ధం (1955–1975) : ఉత్తర వియత్నాం వైమానిక దళం మిగ్–21 లను విస్తృతంగా ఉపయోగించి అమెరికాపై విజయం సాధించింది. 1966లో అమెరికా డ్రోన్లను కూల్చేసింది! అరబ్–ఇజ్రాయెల్ ఘర్షణలు: 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో (జూన్ 5 నుంచి 10 వరకు), ఆ తర్వాతా జరిగిన ఘర్షణల్లో ఈజిప్ట్, సిరియా, ఇరాక్... ఇజ్రాయెల్పై మిగ్–21లతో తలపడ్డాయి. అయితే ఆరు రోజుల యుద్ధం ప్రారంభంలోనే చాలా వరకు మిగ్లు ధ్వంసం అయ్యాయి!ఇరాన్–ఇరాక్ యుద్ధం (1980–1988):ఇరాన్, ఇరాక్ రెండూ కూడా ఈ ఎనిమిదేళ్ల దీర్ఘ పోరాటంలో పరస్పరం మిగ్–21లను ప్రయోగించుకున్నాయి. సిరియా అంతర్యుద్ధం, లిబియా ఘర్షణలు: సిరియన్ వైమానిక దళం, లిబియా ఘర్షణల్లో లిబియా వైమానిక దళం మిగ్–21లను ఉపయోగించాయి. భారత్–పాక్ యుద్ధాలు 1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో మిగ్–21ల పాత్ర పరిమితంగానే ఉంది. గగనతల దాడులేమీ జరగలేదు. 1971లో మిగ్–21 లు భారత్కు గగనతల పోరాటంలో ఆధిక్యతను చేకూర్చాయి. పాక్ విమానాలను కూల్చేశాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తా¯Œ సేనలపై భారత్ మిగ్–21 యుద్ధ విమానాలు విరుచుకుపడిన తీరు ప్రపంచ దేశాలను సైతం విస్మయపరచింది. డిసెంబర్ 13వ తేదీన ఢాకాలోని గవర్నర్ అధికార భవనంపై భారత్ మిగ్–21 బాంబులతో దాడిచేసింది. ఆ మర్నాడే గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాతి రోజే 93,000 మంది పాక్ సైనికులు భారత సైన్యం ఎదుట లొంగిపోయారు.1999 కార్గిల్ వార్లో ఎత్తయిన ప్రదేశాల నుండి ఉపరితల దాడులకు భారత్ మిగ్–21 లను సంధించింది. వైమానిక రక్షణ కార్యకలాపాల కోసం కూడా వీటిని ఉపయోగిం చింది. ఆపరేష¯Œ సఫేద్ సాగర్లో భాగంగా ఆనాడు పాకిస్తానీ అట్లాంటిక్ విమానాన్ని మిగ్ ఒక్క దెబ్బతో నేలమట్టం చేసింది. 2019లో పాక్తో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పాక్పై భారత్ జరిపిన భారీ దాడిలో మిగ్–21లు కీలక పాత్ర పోషించాయి. అత్యంత శక్తిమంతమైన ఎఫ్–16ను సైతం నేల కూల్చాయి. మిగ్కు ఆ పేరెలా వచ్చింది?మాస్కోలో 1939లో ప్రారంభమైన ‘మికోయన్’ ఏరోస్పేస్ కంపెనీ సంస్థాపకుల పేర్ల నుండి మిగ్–21 అనే మాట వచ్చింది. ఇందులో 21 అనేది మిగ్ విమానం మోడల్ నెంబరు. ‘మికోయన్’ సంస్థ.. ఆర్టెమ్ మికోయన్, మిఖాయిల్ గురేవిచ్ అనే ఇద్దరు ఏరో డిజైనర్ల ఆలోచన నుంచి ఆవిర్భవించింది. అన్నీ ఇన్నీ కాని ప్రత్యేకతలు!మిగ్లు తేలికపాటి, సూపర్సోనిక్ ఫైటర్ జెట్లు. గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుండి భూతలంలోకి ఇవి సులువుగా మెరుపు దాడులు చేయగలవు. బాంబులను, మిసైళ్లను మోసుకుపోగలవు. సెకనుకు 250 మీటర్ల వేగంతో నిట్టనిలువుగా కూడా ప్రయాణించి శత్రు దేశాలను భయభ్రాంతులకు గురి చేయగలవు. కొన్ని సాంకేతికతలైతే అత్యంత అధునాతనమైనవి. కంటికి కనిపించని సుదూర లక్ష్యాలపైనా నేరుగా దాడి చేయగల రాడార్ వ్యవస్థ మిగ్లలో ఉంది. ప్రస్తుతం 60 కంటే ఎక్కువ దేశాల వాయుసేనల్లో 11,000కు పైగా మిగ్–21 విమానాలు పని చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దొంగిలించింది!భారత వైమానిక దళానికి చేరిన తొలి సోపర్సోనిక్ ఫైటర్ జెట్లు మిగ్–21 లు. 1960–70 ల మధ్య భారత్కు గగనతల యుద్ధంలో ఇవి శక్తిమంతమైన అదనపు బలగాలు అయ్యాయి. పశ్చిమ దేశాలకు పక్కలో బల్లెంలా మారాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ మిగ్–21ల టెక్నాలజీని దొంగిలించిందని కూడా అంటారు! ఒకసారి వీటిని నడిపిన పైలట్లు మరే విమానాన్నీ నడపటానికి ఆసక్తి చూపరనే మాటా వినిపిస్తుంటుంది. గాలిలో చురుగ్గా కదలటం, అత్యధిక వేగాన్ని అందుకోవటం మిగ్లలోని మరికొన్ని ప్రత్యేకతలు. సాధారణ యుద్ధ విమానాలు ‘ఫ్లయ్–బై–వైర్’ అనే సిస్టమ్తో వేగాన్ని నియంత్రించుకుంటాయి. మిగ్లు గేర్ సిస్టమ్తో పని చేస్తాయి. దాంతో గంటకు 2000 కి.మీ. వేగాన్ని కూడా ఇవి అందుకోగలవు! అంత వేగంలో పైలట్ పట్టు కోల్పోవటమే తరచు జరిగే మిగ్ల ప్రమాదాలకు కారణం అని నిపుణులు చెబుతున్నారు. ‘ఎగిరే శవపేటికలు’!మొదట్లో గగన సింహాలై గర్జించి, విజయ చిహ్నాలుగా గుర్తింపు పొందిన మిగ్–21 లు తర్వాత్తర్వాత తరచు ప్రమాదాలకు గురవుతూ పైలట్లు, పౌరులు మరణిస్తుండటంతో ‘ఎగిరే శవపేటిక’లు అనే అప్రతిష్ఠను, అపకీర్తిని మోయవలసి వచ్చింది. కాలం చెల్లిన మిగ్లను ఇంకా ఎన్నేళ్లు ఉపయోగిస్తాం అనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. మరోవైపు సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాల రాకతో వీటికి ప్రాముఖ్యం తగ్గిపోయింది. భారత వాయుసేన ఆధ్వర్యంలోని 872 మిగ్ విమానాల్లో 482 విమానాలు పలు ప్రమాదాల్లో నేలకూలాయని 2012లోనే ఆనాటి రక్షణమంత్రి ఏకే ఆంటోని రాజ్యసభలో వెల్లడించారు కూడా. ఆనాటి లెక్కల ప్రకారమే చూసుకున్నా... 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు మరణించారు. పైగా భారత వాయుసేనలో అత్యధికంగా కూలిపోయిన యుద్ధ విమానాలు కూడా ఇవే. యాదృచ్ఛికంగా – 1963లో తొలిసారిగా ఎక్కడైతే భారత వాయుసేనలోకి వీటిని తీసుకుని జాతికి అంకితం చేశారో అదే వైమానిక స్థావరంలో తుది వీడ్కోలు పలకనున్నారు. మిగ్ల స్థానంలో ‘ఎంకె–1ఎ’లుభారత వాయు సేన 1963 నుండి మిగ్–21లను ఉపయోగిస్తోంది. ఇప్పుడు వీటి స్థానంలోకి, దేశీయంగా తయారౌతున్న ఎల్.సి.ఎ. తేజస్ ఎంకె–1ఎ విమానాలను వినియోగంలోకి తేబోతోంది. ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ (హెచ్.ఎ.ఎల్.) ఈ ఎంకె–1ఎ లను ఉత్పత్తి చేస్తోంది. హెచ్.ఎ.ఎల్.తో ఇప్పటికే 83 ఎంకె–1ఎ ల కోనుగోలు కోసం ఆర్డర్ పెట్టిన ప్రభుత్వం, భారత వాయుసేన ను మరింత బలోపేతం చేయటానికి ఇటీవలే మరో 93 ఎంకె–1ఎల కోసం రూ.66,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగేళ్ల క్రితం తొలి విడతగా 2021 ఫిబ్రవరిలో రూ.48,000 కోట్లతో ప్రభుత్వం ఆర్డరు ఇచ్చిన 83 విమానాల డెలివరీ కూడా మొదలు కావలసి ఉంది. -
ఒకప్పుడు కల, నేడు కలిసిన వాస్తవం
ఒకప్పుడు తెరపై మాయాజాలం ప్రదర్శించిన వస్తువులు నేడు మన చేతిలోకి వచ్చేశాయి. సారథిలేని రథాలు కలల దృశ్యాల్లో నడిచేవి. ఇప్పుడు డ్రైవర్లెస్ కార్లు రోడ్ల మీదకు వచ్చేశాయి. పురాణాల్లో అక్షయపాత్ర కోరిన భోజనాన్ని వెంటనే వడ్డించేది. నేడు ఫుడ్ డెలివరీ యాప్లు దాదాపు అదే తీరులో పనిచేస్తున్నాయి. విలన్ కోటలోని మంత్రదర్పణం నిఘా సాధనంగా ఉంటే, ఇపుడు సీసీ కెమెరాలు ప్రతిచోటా కాపలా కాస్తున్నాయి.శాస్త్ర సాంకేతికతలు ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో సినిమాలు ప్రేక్షకులకు చూపిన అద్భుత స్వప్నాలివి. మానవ మేధ వీటిని ఒక్కొక్కటిగా సాకారం చేస్తూ, వాస్తవ జీవితంలోకి తీసుకొచ్చేసింది.ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు గాల్లో రెక్కలు కట్టుకొని ఎగిరిపోతే, కార్లు డ్రైవర్ లేకుండా పరిగెత్తితే, గడియారం తిప్పగానే కాలంలో వెనక్కు వెళ్లిపోతే – థియేటర్లో కూర్చున్న మనకు ఒక్కటే అనిపించేది: ‘అయ్యో! ఇది కలల్లోనూ జరగదు.’ కాని, జీవితం కూడా ఒక సినిమా కథలాంటిదే కదా! అందుకే, ఆ కల్పనలు ఒక్కొక్కటిగా నిజం అవుతూనే ఉన్నాయి. నేడు స్మార్ట్వాచ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాం. తెరపై కనిపించిన మాయా అక్షయపాత్రలాగా, ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్ రూపంలో ఇంటి గుమ్మం వద్దకే పిజ్జా చేరుస్తోంది. వర్చువల్ కళ్లజోడు పెట్టుకుంటే మనం గదిలో కూర్చుని కూడా చంద్రుడి మీద నడుస్తున్నాం. మరమనిషి ఒకప్పుడు హీరోకి తోడుగా పోరాడితే, ఇప్పుడు మనకి ఇళ్లలో వాక్యూమ్ క్లీనర్ రూపంలో గచ్చు తుడుస్తోంది. మనుషులు, వస్తువులను మాయం చేసే అదృశ్యశక్తుల పరికరాల ఆవిష్కరణలు, ఇప్పుడు పరీక్షల్లో నిజమయ్యే ఫలితాలను చూపిస్తున్నాయి. మొత్తానికి, సినిమాల్లో కనిపించిన కలల గాడ్జెట్లు ఒక్కొక్కటిగా మన దగ్గరికి వచ్చి, మనల్ని బులిపిస్తున్నాయి, ఆశ్చర్య పరుస్తున్నాయి. రేపు తెరపై కనిపించే కొత్త గాడ్జెట్ ఏ రూపంలో మన ఇంటి లివింగ్ రూమ్లో దిగిపోతుందో! ఒకవేళ అలా దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.జెట్ప్యాక్ – థండర్బాల్ (1965)సినిమాలో హీరో జెట్ప్యాక్ వేసుకొని భవనం మీద నుంచి ఎగిరిపోతాడు. ఆ సన్నివేశం చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయి ‘ఇది అసలు సాధ్యమేనా?’ అనుకున్నారు. కాని, 1961లోనే అమెరికా రక్షణ పరిశోధన సంస్థ బెల్ ఏరోసిస్టమ్స్ కంపెనీతో కలిసి మొదటి జెట్ప్యాక్ను పరీక్షించింది. తర్వాత 2011లో ఫ్రాన్స్లో, 2019లో అమెరికాలో పర్యాటక ప్రదర్శనల్లో వాడారు. కొన్ని దేశాల సైన్యాలు కూడా శిక్షణలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నాయి. ఇంకా మన దగ్గరకు రాలేదు కాని, ఒకవేళ వస్తే? మొదటగా ట్రాఫిక్ దాటడానికి ఉపయోగించవచ్చు. లేజర్ కట్టర్ – గోల్డ్ఫింగర్ (1964)సినిమాలో హీరోను కుర్చీకి కట్టి, కింద నుంచి లేజర్ ఆన్ చేసే సన్నివేశం మరచిపోలేనిది. అప్పట్లో అది కత్తి కంటే భయంకరంగా అనిపించింది. ఆ కాలంలో లేజర్ టెక్నాలజీ కొత్తగా ఉండేది, ప్రజలు అద్భుతంగా భావించారు. కాని, 1960లో అమెరికా శాస్త్రవేత్త థియోడోర్ మైమన్ మొదటి లేజర్ను రూపొందించారు. 1970ల నుంచి వైద్యరంగంలో కంటి శస్త్రచికిత్సలకు, 1980లలో పారిశ్రామిక రంగంలో లోహాలను కత్తిరించడానికి ఉపయోగించడం మొదలైంది. నేడు పచ్చబొట్లను తొలగించడం నుంచి ఎన్నోరకాల శస్త్రచికిత్సల వరకు లేజర్ వాడకం సాధారణంగా మారింది. రోలెక్స్ గాడ్జెట్ వాచ్ – లివ్ అండ్ లెట్ డై (1973)గడియారం అంటే అప్పట్లో సమయం చెప్పే యంత్రం మాత్రమే! కాని, బాండ్ వాచ్? శత్రువు బుల్లెట్లను దూరంగా తోసే మాగ్నెట్, తలుపులు తెరిచే లేజర్, అవసరమైతే విద్యుత్ షాక్ కూడా! అది చూసి, ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ పనులన్నీ మన వాచ్ కూడా చేస్తుంది. 1972లో హామిల్టన్ కంపెనీ మొదటి డిజిటల్ వాచ్ విడుదల చేసింది. 2010లలో యాపిల్, శాంసంగ్ స్మార్ట్వాచ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒకప్పుడు బాండ్ వాచ్ శత్రువులను ఎదుర్కొంటే, ఇప్పుడున్న వాచ్ అంతకంటే ఎక్కువ పనులే చేస్తుంది. అడుగులు లెక్కపెడుతుంది, నిద్ర కొలుస్తుంది, గుండె కొట్టుకోవడమే కాదు – ‘నువ్వు ఎక్కువగా కూర్చున్నావు, ఇక లే’ అని హెల్త్ అలర్ట్ కూడా ఇస్తుంది. సబ్మరైన్ కారు – ది స్పై హూ లవ్డ్ మీ (1977)బాండ్ లోటస్ కారు నీటిలోకి దూకి సబ్మరైన్ గా మారిపోతే థియేటర్లో చప్పట్లు మిన్నంటాయి. ఆ సమయంలో ఇలాంటిది ఊహించడమే గొప్ప. ఇప్పుడు చిన్న పర్సనల్ సబ్మరైన్ ్స ఉన్నాయి. 2008లో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ కారుకు ప్రేరణగా ఒక సబ్మరైన్ కారు ప్రాజెక్ట్ ప్రకటించాడు. చిన్నపాటి వ్యక్తిగత సబ్మరైన్లు ఇప్పటికే లగ్జరీ యాట్స్లో ఆటబొమ్మల్లా వాడుతున్నారు. మన దగ్గర అయితే? పెద్ద పెద్ద చేపలు పట్టి బజారులో అమ్మడానికి కూడా వాడుతున్నారు. కమ్యూనికేటర్ వాచ్ – డిక్ ట్రేసీ (1946)హీరో తన గడియారంలోనే ఫోన్ కాల్ మాట్లాడిన సీన్ అప్పట్లో ప్రేక్షకులకు అద్భుతం. చాలామందికి అది జాదూగా అనిపించింది. ఇప్పుడేమో మనకు స్మార్ట్వాచ్లు సాధారణమే. 1970లలో మొదటి వాచ్ రేడియో వచ్చింది. 2000ల తర్వాత స్మార్ట్వాచ్లు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు వాచ్తోనే వీడియో కాల్స్ కూడా చేయగలుగుతున్నారు. దీంతోనే జీపీఎస్ ఆధారంగా లొకేషన్ షేరింగ్, అలెర్ట్ బటన్స్ వంటివి కూడా ఉపయోగించుకోగలుగుతున్నారు.స్టార్ట్రెక్ కమ్యూనికేటర్ – స్టార్ట్రెక్ (1966)చిన్న పరికరంలా కనిపిస్తూ ఓపెన్ చేసే ఫోన్. అంటే మన ఆధునిక భాషలో ఫోల్డబుల్ ఫోన్. అప్పట్లో ఫోన్ మూసే శబ్దం ‘క్లక్!’ ఒక స్టయిల్ ఐకాన్గా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ ఆకట్టుకున్న విషయం. ఇప్పుడు మనకు టచ్ స్క్రీన్ ఫోన్లకు డిమాండ్ ఉన్నా, ఫ్లిప్ ఫోన్ డిజైన్కే క్రేజ్ ఉంది. ట్రైకార్డర్ – స్టార్ట్రెక్ (1966)ఒక చిన్న పరికరం శరీరాన్ని స్కాన్ చేసి ఆరోగ్య ఫలితాలు చెబుతుంది. అప్పట్లో అది అద్భుతం. కాని, 2017లో అమెరికా ‘క్వాల్కమ్ ట్రైకార్డర్ ఎక్స్ ప్రైజ్’ పోటీలో కొన్ని కంపెనీలు వాస్తవికంగా రోగ నిర్ధారణ చేసే స్కానర్లు అభివృద్ధి చేశాయి. ఇప్పుడు పోర్టబుల్ మెడికల్ స్కానర్లు సాధారణం అవుతున్నాయి. మన ఇంట్లో ఉంటూనే రోజూ స్కాన్ చేసి మన ఆరోగ్య విషయాలను తెలుసుకోవచ్చు. హోవర్బోర్డ్ – బ్యాక్ టు ది ఫ్యూచర్ 2 (1989)గాల్లో ఎగిరే స్కేట్బోర్డ్ అప్పట్లో కలలా కనిపించింది. 2015లో లెక్సస్ కంపెనీ మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో హోవర్బోర్డ్ను ప్రదర్శించింది. ఇప్పుడు వాటిల్లో ఎన్నో ప్రోటోటైప్లు ఉన్నాయి, అయితే ఖరీదు ఎక్కువ. వినియోగం పరిమితం. మన దగ్గర ఉంటే? ఎక్కువగా వర్షకాలంలో గుంతలు దాటడానికి ఉపయోగిస్తామేమో! ఎలక్ట్రికల్ కారు, ఎగిరే కార్లు – బ్యాక్ టు ది ఫ్యూచర్ (1985)ఇంధనంతో నడిచే కార్లు కామన్ కాని, విద్యుత్ శక్తితో నడిచే కారు– అది కూడా అవసరమైనప్పుడల్లా గాల్లో ఎగురుతుంది. ఇది చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. కాని, ప్రపంచంలోనే మొదటి విద్యుత్ కారు 1880లలోనే తయారైంది! కాలక్రమంలో పెట్రోల్ చౌక కావడంతో దాదాపు శతాబ్దానికి పైగా అవి మూలపడ్డాయి. పూర్తిగా, 1996లో అమెరికా ‘జీఎం ఈవీ1’ అనే ఆధునిక ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తెచ్చింది. 2008 తర్వాత టెస్లా రాకతో విద్యుత్ కార్లు మళ్లీ పుంజుకున్నాయి. భారత్లో 2010 తర్వాత టాటా, మహీంద్రా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి. 2021లో జపాన్ ‘స్కైడ్రైవ్’ కంపెనీ ఫ్లైయింగ్ కారును విజయవంతంగా పరీక్షించింది. ఒకవేళ మన దగ్గర వస్తే? ట్రాఫిక్ టెన్షనే ఉండదు.వాయిస్ కార్ (కిట్) – నైట్రైడర్ (1982)హీరో కారుతో మాట్లాడుతూ – ‘హే కిట్, రా!’ అని పిలిస్తే వెంటనే కారు వచ్చేది. ఇప్పటి సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్ ఇదే చేస్తున్నాయి. కాని, కొన్నిసార్లు ఇవి పొరపాటున తప్పు దారి చూపించడం మాత్రం ఇంకా మానలేదు. భారతీయ సినిమాలు ఎప్పటి నుంచో కేవలం వినోదం మాత్రమే కాదు, ఊహాశక్తికి అద్దం పట్టే వేదికలు కూడా. ఇక్కడ హీరో పాట పాడితే పూలు కురుస్తాయి, విలన్ చేతిలోంచి మంటలు ఎగసిపడతాయి, దేవతలు ఆకాశం నుంచి దిగిపోతారు. కాని, వీటన్నింటికంటే ఆసక్తికరమైనవి సినిమాల్లో కనిపించే గాడ్జెట్లు. ‘మాయాబజార్’లో ఘటోత్కచుడు తెరిచిన మాయాపేటిక– ప్రియదర్శిని, ‘ఆదిత్య 369’లో టైమ్ మెషిన్, జగదేకవీరుడు అతిలోకసుందరిలో కనిపించిన శ్రీదేవి ఉంగరం. ఇవన్నీ అప్పట్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాయి. ‘ఇలాంటివి నిజంగా ఎప్పుడైనా వస్తాయా?’అనుకున్నారు. ఆ కలలే తర్వాత ఒక్కొక్కటిగా వాస్తవ రూపం దాల్చాయి.టైమ్ మెషిన్ – ఆదిత్య 369 (1991)బాలకృష్ణ టైమ్ మెషిన్ లో కూర్చుని గతానికి, భవిష్యత్తుకి వెళ్తాడు. ఈ కాలయానం ఇప్పటికీ పూర్తిగా ఊహే. కానీ 1905లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం కాంతి వేగానికి దగ్గరగా వెళ్తే కాలప్రవాహం మారుతుందని నిరూపించారు. అంటే సినిమా కల్పన అయినా, దానికి శాస్త్రీయ పునాది ఉంది. భవిష్యత్తులో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అదృశ్య గడియారం – మిస్టర్ ఇండియా (1987)అనిల్ కపూర్ గడియారం పెట్టుకున్న వెంటనే కనబడకుండా పోతాడు. ఇది 2006లో అమెరికాలో శాస్త్రవేత్తలు మెటా పదార్థాలు వాడి చిన్న వస్తువులను అదృశ్యం చేయగలిగారు. 2015లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మరింత మెరుగైన ప్రయోగాలు చేసి, మరికొన్ని వస్తువులను అదృశ్యం చేయడాన్ని ప్రదర్శించింది. మాయాపేటిక – మాయాబజార్ (1957)ఘటోత్కచుడు పెట్టె తెరిస్తే ఎవరు కోరుకున్నవి వాళ్లకు కనిపిస్తాయి– బంగారం కావచ్చు, భోజనం కావచ్చు. ఇప్పుడు ఒక్క బటన్ నొక్కితే భోజనం మన ఇంటి తలుపు దగ్గరే! 2010 తర్వాత ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఈ కలను వాస్తవం చేశాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా అచ్చం ఆ పెట్టెలా – మనం ఏం కోరుకుంటామో, దాన్నే చూపిస్తుంది.మరమనిషి – రోబో (2010)రజనీకాంత్ ఈ సినిమాలో ‘చిట్టి’ పాత్రలో జనాలను మెప్పించారు. ‘చిట్టి’ చదివే, ప్రేమించే, కోప్పడే మరమనిషి. 2016లో హాంకాంగ్ ‘హాన్సన్ రోబోటిక్స్’ రూపొందించిన ‘సోఫియా’ రోబో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2021లో టెస్లా కూడా మానవాకార రోబో ప్రాజెక్ట్ను ప్రకటించింది. నేడు రోబోలు ప్రధానంగా పరిశ్రమల్లో, స్మార్ట్ హోమ్లలో సహాయకులుగా ఉన్నా, మన ‘చిట్టి’లా భావోద్వేగాలు పంచుకునే రోబోలు ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు.భవిష్యత్ కళ్లజోడు – రావన్ (2011)ఈ సినిమాలో కళ్లజోడు పెట్టుకుంటే హీరో ఆటలోకి ప్రవేశిస్తాడు. 2012లో మొదటి వర్చువల్ రియాలిటీ పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని గేమ్స్, పాఠశాలలు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల్లో వాడుతున్నారు.శక్తిమంతమైన దుస్తులు – క్రిష్ (2006)హీరో ప్రత్యేక దుస్తులు వేసుకున్న వెంటనే అద్భుత శక్తులు పొందుతాడు. 2013లో అమెరికా సైన్యం ‘ఎక్సోస్కెలిటన్ ’ సూట్లను అభివృద్ధి చేసింది. ఇవి ధరిస్తే భారాన్ని మోయడం సులభం అవుతుంది, ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. భవిష్యత్తులో ఇవి సామాన్యులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. మాయా పరికరం– జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)శ్రీదేవి దగ్గర ఉన్న మాయా ఉంగరం ఏ పనైనా ఇట్టే చేసేస్తుంది. 2007 తర్వాత స్మార్ట్ఫోన్లు మన జీవితంలోకి వచ్చి బ్యాంకింగ్, షాపింగ్, భోజనం ఆర్డర్, సంభాషణ – అన్నీ ఒకే పరికరంలో సాధ్యమయ్యాయి. సినిమాలో మాదిరే బటన్ నొక్కగానే ఇంట్లో తలుపులు తెరుచుకోవడం, భోజనం సిద్ధమవ్వడం, బట్టలు మడతవేయడం చూసి ప్రేక్షకులు ‘అరే వాహ్!’ అనుకున్నారు. కాని, నేడు మన ఇళ్లలోని వాషింగ్ మెషిన్ , డిష్ వాషర్, మైక్రోవేవ్, వాక్యూమ్ క్లీనర్ అన్నీ ఆటోమేటిక్. ఇంకా మొబైల్తో నియంత్రించే ‘స్మార్ట్ హోమ్’ అప్లికేషన్స్ ఎన్నో వచ్చేశాయి. ఒక్క సైగ చేస్తే లైటు వెలిగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది. సీసీ కెమెరా – రాక్షసరాజు, గజని గంధర్వుడుపాత సినిమాల్లో విలన్ కోటలోకి ఎవరెవరు వస్తున్నారో కనిపెట్టడానికి ఒక పెద్ద అద్దం ముందు కూర్చుని ‘సీసీ టీవీ’లా చూపించే సన్నివేశాలు గుర్తున్నాయా? అప్పట్లో అది మాంత్రిక ప్రభావంలా అనిపించింది. కాని, 1960లోనే మొదటి సీసీ కెమెరాలను జర్మనీలో సైనిక వినియోగానికి వాడారు. తర్వాత 1990లలో వాణిజ్య రంగంలోకి వచ్చి, 2000ల తర్వాత భారత్లో ఇళ్లలో, ఆఫీసుల్లో, రోడ్లపైకి కూడా విస్తరించాయి. ఇప్పుడు ఇవి లేకుండా భద్రత ఊహించలేము.హోలోగ్రామ్ సన్నివేశం – జీన్స్ (1998)హీరోయిన్ హోలోగ్రామ్ టెక్నాలజీని వినియోగించి సంగీతం, నృత్యం, కొన్ని విచిత్ర సందర్భాలు చూపిస్తూ నవ్వించే ప్రదర్శన ఇస్తుంది. ఆ హోలోగ్రామ్ సన్నివేశం అప్పట్లో కేవలం సినిమా మ్యాజిక్, స్పెషల్ ఎఫెక్ట్ మాత్రమే! కాని, హోలీగ్రామ్ టెక్నాలజీ నిజ జీవితంలో అంతకుముందే రూపుదిద్దుకుంది. 1960లో లేజర్ ఆవిష్కరణతో హోలోగ్రఫీ శాస్త్రానికి పునాది పడింది. 2012లో టుపాక్ షకూర్ అనే ర్యాపర్ మరణించినా, అతని హోలోగ్రామ్ ప్రదర్శన కోచెల్లా స్టేజ్పై ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఆ తర్వాత మైకేల్ జాక్సన్ , ఎల్విస్ ప్రెస్లీ వంటి ప్రముఖుల ప్రదర్శనలకు కూడా హోలోగ్రామ్ను వినియోగించారు. నేడు హోలోగ్రామ్లు విద్య, వైద్యం, వ్యాపార సమావేశాలు, వర్చువల్ ఈవెంట్స్ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. ఇక భవిష్యత్తులో మన ఇళ్లలో, పెళ్లిళ్లలో, సమావేశాల్లో హోలోగ్రామ్ రూపంలో అతిథులకు ‘హాయ్!’ చెప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. డ్రైవర్ లేని కార్లు – శ్రీకృష్ణ పాండవీయమ్ (1966)ఘటోత్కచుడు తన మాయాశక్తితో రథాన్ని సారథి లేకుండానే నడిపిస్తాడు. ఇదే విధంగా మరెన్నో పాత చిత్రాల్లో రథం లేదా కారు దేవతా శక్తితో తనంతట తానే నడుస్తుంది. డ్రైవర్ లేని వాహనం అప్పట్లో కల్పన. 2010 తర్వాత గూగుల్, టెస్లా, ఊబెర్ వంటి కంపెనీలు అమెరికా, జపాన్ , యూరప్లలో స్వయంచాలిత కార్లను రోడ్లపై పరీక్షించాయి. 2020లలో కొన్ని నగరాల్లో టాక్సీ సర్వీసులుగా కూడా ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. నిన్న సినిమాల్లో కలలా కనబడినవి, నేడు శాస్త్రవేత్తల చేతుల్లో వాస్తవమయ్యాయి. రేపు మరెన్నో ఆవిష్కరణలతో, ఊహలకు కూడా అందని పరికరాలు జీవితంలో భాగమవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా రీల్ నుంచి రియల్కి ప్రయాణించే ఈ గాడ్జెట్ కథలు అంతులేని కథలా కొనసాగుతూనే ఉంటాయి! ఊహలకు అందని ఆవిష్కరణలు! భవిష్యత్తు ఊహలు ఇప్పటికీ తెరపై మాయాజాలంలా కనబడుతున్నా, రేపటికి అవి మన జీవితంలో రొటీన్ గా మారిపోవడం ఖాయం. ఒక టెలిపోర్టేషన్ మెషిన్ తో ఇంటి గుమ్మం నుంచి నేరుగా ఆఫీసు కుర్చీలో కూర్చోవచ్చు. అప్పుడు ట్రాఫిక్ అనే టెన్షన్ ఉండదు. మెమరీ ట్రాన్ ్సఫర్ గాడ్జెట్తో పరీక్ష ముందు రాత్రుళ్లు నిద్ర మానుకుని పుస్తకం చదవాల్సిన అవసరమే లేదు, సబ్జెక్ట్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు! ఆలోచన చదివే పరికరం మన మైండ్లో దాగి ఉన్న మాటల్ని బయటపెడుతుంది, అప్పుడు ‘ఏం అనుకుంటున్నావు?’ అనే ప్రశ్నే ఉండదు. రోబో–షెఫ్ మన ఇష్టం అడిగి భోజనం సిద్ధం చేస్తాడు, డ్రోన్లు కిరాణా వస్తువులను గుమ్మం ముందు పడేస్తాయి. నిద్రలో చూసిన కలలను కలల ప్రొజెక్టర్లో సినిమాలా తిరిగి చూడగలిగే రోజులు కూడా వస్తాయి. గాల్లో ఎగిరే మనుషుల్లా మారిపోతే, ట్రాఫిక్ను చరిత్రలోకి నెట్టేయవచ్చు. స్వయంచాలిత డ్రోన్ ప్యాకేజీలతో పాటు మనల్ని కూడా ఎయిర్టాక్సీలా తీసుకెళ్తాయి. ఇక ఇంట్లో పనులు? రోబో మేడ్స్, స్మార్ట్ ఫర్నిచర్ అన్నీ స్వయంగా చూసుకుంటాయి. నేడు ఇవన్నీ సైన్ ్స ఫిక్షన్ లా అనిపిస్తున్నా, నిన్న ఫోన్ లేకుండా ఊహించలేనట్టు, రేపు ఈ గాడ్జెట్లు లేకుండా కూడా జీవితాన్ని ఊహించలేకపోవచ్చు. -
అక్కడ చనిపోయి... ఇక్కడ బతికాడు!
అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ముప్పయ్యారు బాంబు పేలుళ్లకు పాల్పడిన డాక్టర్ బాంబ్ అలియాస్ జలీస్ అన్సారీ ప్రధాన అనుచరుడు సయ్యద్ ముసద్దిక్ వహీదుద్దీన్ ఖాద్రీ వింత కథ ఇది. ముంబైలోని ఏడు విధ్వంసాలకు బాధ్యుడైన ఖాద్రీ అక్కడి పోలీసుల రికార్డుల ప్రకారం 2003లో చనిపోయాడు. రికార్డుల్లో చనిపోయిన ఇతగాడు రహస్యంగా హైదరాబాద్కు మకాం మార్చి, 2010 వరకు గుట్టుగా బతికాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి తన అనుచరులకు ఈ–మెయిల్ పంపడంతో మహారాష్ట్ర ఏటీఎస్కు పట్టుబడ్డాడు. ప్రస్తుతం పరవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.సినిమాను తలపించే ఖాద్రీ ఉదంతం ఇదీ...ముంబైకి చెందిన డాక్టర్ జలీస్ అన్సారీ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తరవాత అతివాద భావాలు గల కొందరిని అనుచరులుగా చేసుకుని ముఠా కట్టాడు. వారిలో ఖాద్రీ కూడా ఒకడు. ఈ ముఠా 1993–94ల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 36 ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడింది. వీరు టార్గెట్ చేసిన వాటిలో రైళ్లు, రైల్వేస్టేషన్లే ఎక్కువగా ఉన్నాయి. జలీస్ అన్సారీ ముఠా 1993లో హైదరాబాద్లోని నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్లలో పేలుళ్లుకు ఒడిగట్టింది. తక్కువ ప్రభావం గల బాంబులను తయారు చేయడంలో దిట్ట అయిన జలీస్ అన్సారీని పోలీసు, నిఘా వర్గాలు ‘డాక్టర్ బాంబ్’ అని పిలుస్తుంటాయి. 1994 జనవరి 3న పోలీసులకు చిక్కడంతో ఇతడి విధ్వంసాలకు పుల్స్టాప్ పడింది. జలీస్ అన్సారీకి ప్రధాన అనుచరుడు ఖాద్రీపై ముంబైలో అనేక కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉన్న జంజీరామురాజ్ ఇతడి స్వగ్రామం. ముంబైలోని కేసులన్నీ 1998లో వీగిపోవడంతో నిర్దోషిగా బయటకు వచ్చాడు. కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన అంతర్రాష్ట్ర గజదొంగ యాడ వసంత్ గ్యాంగ్లో చేరి ఇతని ప్రధాన అనుచరుడైన గోపాల రమణ శెట్టితో కలిసి మహారాష్ట్రలో దోపిడీలకు పాల్పడ్డాడు. 2004లో హైదరాబాద్ అబిడ్స్లోని రాజ్యలక్ష్మీ జ్యూలర్స్ నుంచి రూ.1.5 కోట్లు సొత్తు దోపిడీ చేసింది ఈ ముఠానే! అయితే, ఆ కేసులో ఖాద్రీ ప్రమేయం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో జరిగిన దోపిడీల్లోనే ఇతను పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలోనే 2001లో ముంబై పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఆ తరవాతి ఏడాది బెయిల్పై విడుదలయ్యాడు. ఖాద్రీపై ముంబై ఏటీఎస్తో పాటు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నిఘా పెరగడంతో ఓ పెద్ద కుట్ర పన్నాడు. పోలీసుల దృష్టిలో, ప్రభుత్వ రికార్డుల ప్రకారం తాను చనిపోయినట్లు నమ్మిస్తేనే నిరాటంకంగా తన కార్యకలాపాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుందని భావించిన ఖాద్రీ భార్యతో కలిసి పక్కా ప్లాన్ వేశాడు. 2003 ఆగస్టు 15న ముంబైలోని మీరారోడ్లో ఉన్న ఎస్ఏ అపార్ట్మెంట్స్లోని తన ఫ్లాట్కు సలీమ్ అనే అనుచరుడిని పిలిచాడు. మాటల్లో పెట్టి అతడి గొంతు నులిమి చంపేశాడు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టలేనంతగా అదే గదిలో కాల్చేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పట్లో ఆ మృతదేహాన్ని చూసిన ఖాద్రీ భార్య అది తన భర్తదే అంటూ వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ఖాద్రీ చనిపోయాడని, గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసు కొలిక్కి రాకపోయినా, పోలీసు రికార్డుల్లో మాత్రం ఖాద్రీ చనిపోయాడు. తన భార్య, సోదరుడి సాయంతో తానే చనిపోయినట్లు ముంబై పోలీసులను నమ్మించిన ఖాద్రీ– తర్వాత జలీస్ అన్సారీ ముఠాలోని వ్యక్తుల సహకారంతో హైదరాబాద్కు వచ్చాడు. 2003 నుంచి 2006 వరకు సికింద్రాబాద్ ప్రాంతంలో నివసించాడు. ఆపై ఇమ్రాన్ అబు మన్సూర్ హత్మీ పేరుతో గోల్కొండలోని మొహల్లాగంజ్ ప్రాంతంలో అద్దె ఇంట్లో దిగాడు. అత్తర్లు, సుగంధ ద్రవ్యాలు విక్రయించే వ్యాపారి ముసుగు ధరించాడు. 2008లో ఇదే పేరు, చిరునామాతో డ్రైవింగ్ లైసెన్స్, 2009లో ఓటర్ గుర్తింపు కార్డు పొందాడు. తన కుటుంబాన్ని మాత్రం మహారాష్ట్రలోని చింబూర్లో ఉంచిన ఖాద్రీ తరచు అక్కడికి వెళ్లి వచ్చేవాడు. ఎప్పటికైనా మళ్లీ ముంబై వెళ్లాలని భావించిన ఇతగాడు అందుకోసం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపురేఖలు మార్చుకోవాలని భావించాడు. దీనికోసం హైదరాబాద్లోని ఓ డాక్టర్ను సంప్రదించాడు. ఇక్కడ ఉంటూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించిన ఖాద్రీ 2003 చివరలో పాకిస్తాన్ వెళ్లివచ్చాడు. అప్పటి నుంచి ఇతగాడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొందరు ఉగ్రవాద సానుభూతిపరులైన వ్యక్తులతో పాటు తన అనుచరులతోనూ ఈ–మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. వీటి కోసం ఆసిఫ్నగర్లోని ఓ జిరాక్స్ అండ్ ఇంటర్నెట్ సెంటర్లో ఉన్న కంప్యూటర్లను వినియోగించాడు. ఆ ఉగ్రవాదుల్లో కొందరి ఈ–మెయిల్స్పై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దృష్టి హైదరాబాద్ నుంచి వారికి వస్తున్న మెయిల్స్పై పడింది. తరచుగా ఇవి వస్తుండటంతో వాటిలోని సంభాషణలను అధ్యయనం చేశాయి. వీటిని పంపుతున్నది 2003లో ‘చనిపోయిన’ ఖాద్రీగా నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకుని రంగంలోకి దిగిన ముంబై ఏటీఎస్ అధికారులు ఈ–మెయిల్స్ పంపుతున్న ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్ ఆధారంగా మెహదీపట్నంలోని ఇంటర్నెట్ సెంటర్ను గుర్తించారు. అక్కడ దాదాపు పది రోజులు మాటు వేసిన ప్రత్యేక బృందం 2010 ఆక్టోబర్లో ఖాద్రీని పట్టుకుని ముంబై తరలించింది. ఇతడు ఇప్పటికీ మహారాష్ట్ర జైలులోనే ఉన్నాడు. -
హయగ్రీవ అవతారం
శ్రీమహావిష్ణువు ఒకప్పుడు దానవులతో పదివేల సంవత్సరాలు యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధంలో దానవులను దునుమాడిన తర్వాత అలసిన అతడు పద్మాసనంపై కూర్చుని, ధనుస్సుకు చివర తలవాల్చి, నిద్రలోకి జారుకున్నాడు.అదే సమయంలో ఇంద్రాది దేవతలు విష్ణువు సహాయంతో ఒక యాగాన్ని చేయాలని సంకల్పించుకున్నారు. ఈ సంగతిని విన్నవించుకోవడానికి దేవతలందరూ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు. అప్పుడు ఆయన ఆదమరచి నిద్రపోతూ కనిపించాడు. అలాంటి పరిస్థితిలో ఆయనకు మేల్కొలపడం ఎలాగని దేవతలు చింతాక్రాంతులయ్యారు. ‘నిద్రాభంగం చేయడం దోషం. అలా చేయవద్దు’ అన్నాడు ఇంద్రుడు.అప్పుడు బ్రహ్మ కలగజేసుకుని, ‘నేను ఒక చెదపురుగును సృష్టించి, దానిని విష్ణుధనువు నారిని కొరికేలా ఆజ్ఞాపిస్తారు. నారి తెగినప్పుడు ఏర్పడే ధ్వనికి దేవదేవుడు మేల్కొంటాడు’ అని చెప్పి, చెదపురుగును సృష్టించి, వింటినారిని కొరకమని ఆజ్ఞాపించాడు. ‘ఈ పాపకార్యం చేయడం వల్ల నాకు నరకం తప్ప ఒరిగేదేమిటి?’ అని బ్రహ్మదేవుడిని అడిగింది చెదపురుగు.‘నీకు నరకం ఉండదు. మేం తలపెట్టిన యాగంలో నీకూ కొంత భాగం ఇస్తాం’ అని మాట ఇచ్చాడు బ్రహ్మదేవుడు.చెదపురుగు వెంటనే వెళ్లి, విష్ణువు వింటినారిని కొరికింది. భీకరమైన ధ్వని ఏర్పడింది. దేవతలు చూసేసరికి కిరీట కుండలాలతో ప్రకాశించే విష్ణువు తల కనిపించలేదు. నారి తాకిడికి అతడి తల తెగిపోయింది. ఇది చూసి దేవతలు హాహాకారాలు చేశారు. బృహస్పతి జోక్యం చేసుకుని, ‘ఇప్పుడు ఇలా ఏడ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? తరుణోపాయం ఏమిటో ఆలోచించాలి గాని’ అన్నాడు. ‘ఇంతటి విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలంటే, పరదేవతను ఆశ్రయించడం తప్ప గత్యంతరం లేదు’ పలికాడు బ్రహ్మదేవుడు.దేవతలందరూ హుటాహుటిన జగన్మాత వద్దకు వెళ్లి, ఆమెను వేనోళ్ల స్తుతించి, తమను ఈ విషమ పరీక్ష నుంచి గట్టెక్కించమని ప్రార్థించారు.‘దేవతలారా! వినండి. శ్రీహరి శిరస్సు తెగిపడటానికి ఒక కారణం ఉంది. పూర్వం అతడు తన ప్రియురాలి ముఖం చూసి నవ్వాడు. ఆమె కుపితురాలై, నీ తల తెగిపడుగాక అని శపించింది. ఆ శాపం ఇప్పుడిలా ఫలించింది. ఇందులో మరో విషయం కూడా ఉంది. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు సరస్వతీ నదీతీరంలో నా గురించి ఘోరతపస్సు చేశాడు. నేను అతడికి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, మరణం లేకుండా వరం కావాలన్నాడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు గనుక అది అసాధ్యమని చెప్పాను. దానికి బదులుగా మరో వరం కోరుకోమని చెప్పాను. తనకు గుర్రం ముఖం ఉండేవాని వల్ల తప్ప మరెవరివల్లా మరణం లేకుండేలా అనుగ్రహించమన్నాడు. నేను సరేనని వరమిచ్చాను. అతడు వరగర్వంతో లోకులను, బ్రాహ్మణులను పీడించడం మొదలుపెట్టాడు. అతడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించుతుండటంతో భక్తులు మొరపెట్టుకుంటున్నారు. అతడి అంతానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అందువల్ల ఇప్పుడు బ్రహ్మదేవుడు గుర్రం తలను తెప్పించి, శ్రీహరికి అతికించినట్లయితే, అతడు పునర్జీవితుడై, ఆ రాక్షసుడిని సంహరించగలడు’ అని జగన్మాత పలికింది.ఆమె మాటలకు దేవతలు సంతోషించి, ఆమెను మరోసారి స్తుతించారు.బ్రహ్మదేవుడు వెంటనే విశ్వకర్మను పిలిపించాడు.అతడికి జరిగినదంతా చెప్పి, తెగిపడిన శిరస్సు స్థానంలో శ్రీహరికి గుర్రం శిరస్సును అతికించాలని ఆదేశించాడు. విశ్వకర్మ ఒక గుర్రం తలను నరికి తీసుకువచ్చాడు. దానిని విష్ణువుకు అతికించాడు. అలా విష్ణువు హయగ్రీవ అవతారం దాల్చాడు. హయగ్రీవుడిగా మేల్కొన్న శ్రీహరికి ఇంద్రాది దేవతలందరూ జయజయ ధ్వానాలు పలికారు. హయగ్రీవుడనే అసురుడి ఆగడాలను తెలిపి, జగన్మాత చెప్పిన ప్రకారం అతడిని సంహరించి, లోకాలకు పీడను విరగడ చేయమని కోరారు.హయగ్రీవావతారంలో శ్రీహరి హయగ్రీవుడనే అసురుడిపై యుద్ధానికి వెళ్లాడు.హోరాహోరీగా సాగిన యుద్ధంలో శ్రీహరి తన సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, హయగ్రీవాసురుడిని సంహరించాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: పరోపకారార్థం ఇదం శరీరం
‘‘అన్నయ్యా! రామారావు బాబాయికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఈసారి ఆయన కండిషన్ క్రిటికల్ అన్నాడు డాక్టర్. నువ్వు చూసి వెళితే బావుంటుంది’’ సొంత బాబాయి అనారోగ్యం కబురు తెలిసిన రెండురోజుల తర్వాత ఊళ్లో ఉన్న అన్న విశ్వనాథ్కి తీరిగ్గా ఫోన్ చేశాడు తమ్ముడు శంకరం.‘‘నేను సిటీకి నిన్ననే వచ్చాను. హాస్పిటల్లో ఉన్నాను. బాబాయి ఇంతకు ముందే పోయాడు. కబురింకా ఎవరికీ చెప్పలేదు. బిల్లు డబ్బు పూర్తిగా కడితే గాని శవాన్ని ఇవ్వరట. చంద్రం డబ్బు కోసం వెళ్లాడు’’ నిర్లిప్తంగా అన్నాడు విశ్వనాథ్.‘‘ఓ నిన్ననే వచ్చావా? చంద్రం నిన్నేమైనా డబ్బు అడిగాడా?’’ ఆతృతగా అడిగాడు శంకరం.‘‘అడిగాడు. అవసరానికి నేనేమీ సర్దలేకపోయాను. సమయానికి వాడి దగ్గర డబ్బు లేదట. అప్పో సప్పో చేసి తెద్దామంటే సమయం లేదు. ఉత్త చేతులతో వచ్చాను. బిల్లు ఆరు లక్షల ప్యాకేజీ. చంద్రం ఇబ్బంది పడుతున్నాడు’’ బాధగా అన్నాడు విశ్వనాథ్ తమ్ముడు శంకరంతో.‘‘అన్నయ్యా! వాళ్ల దగ్గర డబ్బు లేకపోవడమేమిటి? జాలి కబుర్లు! నీ దగ్గర్నుంచి ఎంతో కొంత గుంజుదామని చంద్రం ప్రయత్నం. వాడు డబ్బు తిరిగిచ్చే మనిషి కాదు. నన్నూ అడిగాడు. నిర్మొహమాటంగా లేదని చెప్పాను’’ అన్నాడు శంకరం కఠినంగా.‘‘అవేం మాటలురా! కష్టంలో సాయం చేయకపోతే ఎలా? అందునా మనకి సాయం చేసిన బాబాయి కుటుంబానికి...’’ తమ్ముడిని మందలించాడు విశ్వనాథ్.‘‘నీదంతా అమాయకత్వం. నేనన్న దాంట్లో తప్పేముంది? అందరినీ నమ్ముతావు. చంద్రం సంగతి నీకు తెలియదు. అటు ఉద్యోగం, ఇటు రియల్ ఎస్టేట్ బిజినెస్. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. బాబాయి మాత్రం తక్కువా? బోలెడంత వెనకేసుకున్నారు. వాళ్లకేం తక్కువని మనల్ని డబ్బడగాలి?’’ తమ్ముడి మాటల్లో ఈర్షా్య ద్వేషాలు విశ్వనాథ్ని కలవరపెట్టాయి.‘‘ఎవరెంతటి వారైనా సమయానికి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు. అత్యవసరమని అడిగినా సాయం చేయలేకపోయాము. ఇక ఆ విషయం వదిలెయ్’’ అసహనంగా అన్నాడు విశ్వనాథ్.‘‘అయినా నీ దగ్గర డబ్బెక్కడుంది అప్పనంగా ఇవ్వడానికి? అయినాదానికి, కానిదానికి అప్పు చేస్తావు. వడ్డీలు కడతావు. నీకలవాటేగా!’’ అన్నని రెట్టించి దెప్పుతూ అన్నాడు శంకరం.తమ్ముడి మాటలు మౌనంగా భరించాడు విశ్వనాథ్.‘‘సరేలే! ఈ వాదులాట మనకెప్పుడూ ఉన్నదేగా! నిన్ననంగా సిటీకి వచ్చినవాడివి ఇంటికి రాలేదు. నీ ఆరోగ్యం మాత్రం పట్టించుకోవు’’ నిష్ఠూరమాడాడు శంకరం.‘‘బాబాయి దగ్గర నేనొక్కడినే ఉన్నాను. ఇంకెవరూ రాలేదు. అందుకే రాలేకపోయాను’’ సంజాయిషీ ఇచ్చాడు విశ్వనాథ్.‘‘ఏం వాడింట్లో మనుషులేమయ్యారు? అన్నీ నాటకాలు..’’ ఉడుక్కుంటూ అంటుండగానే సిస్టర్ వచ్చి, ‘రామారావు పేషెంటు తాలూకు ఎవరున్నారో లోనికి రండి’ అని చెప్పి వెళ్లింది. తమ్ముడి ఫోన్ కట్ చేసి లోనికి వెళ్లాడు విశ్వనాథ్.‘‘డబ్బు కట్టి రూమ్ నంబరు పద్దెనిమిదికి వెళ్లండి. బాడీ ఎంబామ్ అవుతోంది’’ అంటూ తొందరపెట్టింది సిస్టర్.‘‘ఎంబామ్ అవుతోందా? అంటే?’’ ప్రశ్నించాడు విశ్వనాథ్.‘‘ఏం లేదు! బాడీని రెడీ చేస్తున్నాం’’ అని వివరం చెప్పకుండా లోనికి వెళ్లింది నర్సు.చంద్రం సాయంకాలం ఆరుగంటలకు వచ్చి బిల్లు కట్టాక శవాన్ని ఇచ్చారు. చంద్రం తన కారులో, విశ్వనాథ్ బాడీతో అంబులెన్సులో చంద్రం ఇంటికి బయలుదేరారు.మరుసటిరోజు రామారావు దహన సంస్కారాలు పూర్తయ్యే సరికి ఉదయం పదకొండు గంటలు దాటింది. అక్కడికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరుగా శ్మశానం వీడి వెళుతున్నారు. స్నానం చేసి, బట్టలు ఆరేసి ఓ మూల బెంచీ మీద నీరసంగా కూర్చుని ఉన్నాడు విశ్వనాథ్.‘‘శంకరం ఇంటికి వెళుతున్నావుగా! కర్మలకు రా అన్నా!’’ అని చెప్పి వెళ్లాడు చంద్రం.‘‘పద! ఇక మనం కూడా వెళదాం’’ అన్నాడు శంకరం అన్న దగ్గరకొచ్చి.ఆరేసిన బట్టలు మడిచి సంచిలో పెట్టుకుని, ‘‘ఒంట్లో నలతగా, తల దిమ్ముగా ఉందిరా! నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు. ఆకలవుతోంది. అన్నం తిని వెంటనే ఊరికి బయలుదేరాలి. తెచ్చుకున్న డబ్బు ఖర్చయిపోయింది. దారి ఖర్చుకు డబ్బులు కావాలి’’ శ్మశానం బయటకు నడుస్తూ, మొహమాటపడుతూ తమ్ముడితో మెల్లగా అన్నాడు విశ్వనాథ్.అదే సమయానికి వారి పక్కనుంచి మహాప్రస్థానం వ్యాన్ పెద్ద శబ్దం చేస్తూ వెళ్లింది. ఆ రొదలో విశ్వనాథ్ మాటలు గాలిలో కలిసిపోయాయి. తన మాటలు శంకరం వినలేదని విశ్వనాథ్ గమనించలేదు. ఇద్దరూ శ్మశానం నుంచి బయట రోడ్డు మీద ఆటో స్టాండ్కి వచ్చారు. అదే సమయానికి ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడాడు శంకరం.తిరిగి వస్తూనే, ‘‘అన్నయ్యా! మీ మరదలు ఫోన్ చేసింది. తనకు పట్టింపులు ఎక్కువ. శ్మశానం నుంచి ఎవరిళ్లకు వారు వెళ్లాలట. నీకు తెలిసే ఉంటుంది. అందుకే నువ్వు సరాసరి ఊరికి వెళ్లు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు’’ అని పక్కన నిలబడి, పాసింజర్ కోసం తమనే గమనిస్తున్న ఆటోను పిలిచాడు శంకరం.‘‘సార్ని బస్టాండ్లో దింపు’’ అని ఆటో డ్రైవర్కి చెప్పి, ఇంకొక ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు శంకరం నిర్దయగా.తమ్ముడేమన్నాడో సరిగ్గా అర్థమయ్యీ కాక క్షణంపాటు తొట్రుపాటుకు లోనయ్యాడు విశ్వనాథ్.తమ మధ్య జరిగిన సంభాషణ మననం చేసుకున్నాడు. తమ్ముడన్న మాట అప్పుడు అర్థమైంది.‘అవును వాడన్నది నిజమే! కొందరికి ఇలాంటి పట్టింపులు ఉంటాయి. అయినా సొంత అన్నదమ్ముల మధ్య ఇలాంటి ఆంక్షలా?’ విరుద్ధ ఆలోచనలతో విశ్వనాథ్ మనసు కళ్లెంలేని గుర్రంలా పరుగెట్టింది. అంతటి నిస్సత్తువ, అశక్తతలోను అతని పెదవులపై వెర్రి చిరునవ్వొకటి తళుక్కుమని మాయమైంది. ఇంటికి చేరాలి. ఎలా వెళ్లాలి? అన్న ఆలోచన మిగతా ఏ ఆలోచనను దరిచేరనివ్వలేదు. ఏం చేయాలో తోచడం లేదు.తెచ్చుకున్న డబ్బు బాబాయి అత్యవసర మందులకు ఖర్చయింది. ఆ డబ్బును చంద్రాన్ని అడిగి తీసుకుందామనుకున్నాడు. మనసొప్పక అడగలేదు. ఇప్పుడు బస్సు టికెట్కి కూడా సరిపడా డబ్బులు లేవు. ఎవర్ని అడగాలి? దిక్కుతోచని స్థితి. శరీరంలో సత్తువ క్షీణించింది. నాలుగు పిడచగట్టింది. మెదడు మొద్దుబారింది. చుట్టూ ఏం జరుగుతోందో, తనెక్కడ ఉన్నాడో సైతం అర్థం కావడంలేదు అతనికి. ఆలోచనా శక్తి మందగించింది. ఎవరో.. ఏదో.. అడుగుతున్నట్లుగా అనిపిస్తోంది.‘‘ఏ బస్టాండ్కి వెళ్లాలి సార్?’’ అడుగుతున్నాడు ఆటో డ్రైవర్.సమాధానం ఏం చెప్పాలో తోచడం లేదు. అతనికి మెదడు నుంచి నోటి మాటకు సంకేతం అందడం లేదు. యాంత్రికంగా జేబులు తడుముకున్నాడు విశ్వనాథ్.జేబులో మిగిలి ఉన్న ఒక్క యాభై రూపాయల నోటు, మొబైల్ ఫోను చేతిలోకి తీసుకున్నాడు.‘‘ఎక్కడికి వెళ్లాలి సార్?’’ మళ్లీ అడిగాడు ఆటో డ్రైవర్, విశ్వనాథ్ని పరికించి చూస్తూ.‘‘ఆటో వద్దు, డబ్బుల్లేవు..’’ అతని నోటి మాటలు ముద్దగా వచ్చాయి.‘‘గూగుల్ పే ఉంది సార్!’’‘‘నాకు లేదు. బస్టాండ్కి దారి చెప్పు. నడిచి వెళతాను’’ ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని అంటూనే, మొదలు నరికిన మానులా కుప్పకూలిపోయాడు విశ్వనాథ్.ఆటో అతను కంగారుపడుతూ ఆటో పక్కకు ఆపి, ఇంజిన్ ఆఫ్ చేసి, పడిపోయిన విశ్వనాథ్ని తట్టి లేపుతూ, స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్నాడు. పరుగున ఆటో నుంచి వాటర్ బాటిల్ తెచ్చి, విశ్వనాథ్ ముఖం మీద నీళ్లు చల్లుతూ, ‘‘సార్.. సార్!’’ అంటూ తట్టి లేపే ప్రయత్నం చేశాడు.రెండు మూడు నిమిషాల తర్వాత కొద్ది తెలివి వచ్చి, మగతగా కళ్లు తెరిచాడు విశ్వనాథ్.విశ్వనాథ్ వీపు చుట్టూ చేయి వేసి, కూర్చోవడానికి సాయం చేసి, వాటర్ బాటిల్ అందించి, ‘‘కాసిని నీళ్లు తాగండి సార్’’ అన్నాడు ఆటో డ్రైవర్.నీళ్లు తాగి, ‘‘నాకేమైంది?’’ పీలగా లోగొంతుతో ప్రశ్నించాడు విశ్వనాథ్.‘‘మీరు స్పృహతప్పి పడిపోయారు. మీరు పడిపోయినప్పుడు.. మీ ఫోను, యాభై రూపాయల నోటు కింద పడ్డాయి’’ అని వాటిని, బట్టలున్న బ్యాగును విశ్వనాథ్ చేతికి అందించాడు ఆటో డ్రైవర్.ఆ నోటును అతనికే తిరిగి ఇచ్చి, తినడానికి ఏమైనా తెమ్మని సైగ చేశాడు విశ్వనాథ్.అతను పరుగున వెళ్లి, పక్కనే ఉన్న పాన్షాపులో బిస్కట్ ప్యాకెట్ తెచ్చి, ‘‘ఇవి తినండి! మీ సుగర్ లెవల్ పడిపోయినట్లుంది’’ అని పక్కనే ఉన్న పళ్ల బండి మీద నుంచి రెండు అరటిపండ్లు తెచ్చి ఇచ్చాడు.నీళ్లు తాగి, నాలుగు బిస్కట్లు, అరటిపండు తిని, రెండో పండు బ్యాగులో వేసుకుని,‘‘చాలా సాయం చేశావు. థాంక్యూ తమ్మీ! ఒంట్లో ఇప్పుడు బాగుంది. కొద్దిగా శక్తి వచ్చింది’’ అని లేచి, వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు.‘‘నిన్ను ఇందాక నా ఆటో కాడ వదిలి వెళ్లినతను ఎవరు?’’ అడిగాడు ఆటో డ్రైవర్.‘‘నా తమ్ముడు’’ అన్నాడు విశ్వనాథ్.‘‘సొంత తమ్ముడా? ఇందాక ఆయనన్న మాటలు నేను ఇన్నా. నిన్ను ఇంటికి రావద్దు. సీదా ఊరికి పొమ్మన్నడు కదా!’’ అన్నాడు ఆటో డ్రైవర్.మౌనంగా లేచి నిలబడి, ‘‘నేను వెళతాను’’ అన్నాడు విశ్వనాథ్.‘‘ఎలా వెళతారు? డబ్బులు లేవన్నారు కదా!’’ అన్నాడు ఆటో డ్రైవర్.‘‘నడిచి వెళతాను. ఎవరైనా తెలిసిన వాళ్లకి ఫోను చేద్దామన్నా ఫోన్ చార్జ్ అయిపోయినట్టుంది. నంబర్లు అందులో ఉన్నాయి. దేవుడు ఏదో విధంగా తప్పక సాయం చేస్తాడు’’ అన్నాడు విశ్వనాథ్ ఆకాళంలోకి చూస్తూ.‘‘అంతదూరం నడవడం కష్టమన్నా! నువ్వు నడిచే స్థితిలో లేవు. నిన్ను బస్టాండులో దింపి వెళతాను’’ అని విశ్వనాథ్ భుజం చుట్టూ చేయి వేసి, ఆటో దగ్గరికి నడిచాడు అతను.‘‘నీ పేరేంటి?’’ అడిగాడు విశ్వనాథ్.‘‘శంకర్’’‘‘ఓ.. నీది నా తమ్ముడి పేరే’’‘‘తమ్ముళ్లందరూ ఒకేలా ఉండరన్నా’’‘‘ఎందుకలా అన్నావు?’’‘‘మీకు తెల్వదా?.. ఇంతకీ ఏ ఊరెళ్లాలి?’’ మాట మారుస్తూ అడిగాడు శంకర్.‘‘కోదాడ వెళ్లాలి.. శంకర్! నువ్వు నా ఫోన్ తీసుకో. నాకు బస్సు చార్జి మందం మూడువందలు ఇవ్వు. ఫోను ఖరీదు పదిహేను వందలు ఉంటుంది’’ అన్నాడు విశ్వనాథ్.‘‘తప్పు సార్! అట్టా మాట్లాడొద్దు. అవసరం ఎప్పుడు ఎట్టా ఎవరికి ఎవరితో వస్తుందో ఎవరికి ఎరుకన్నా! సాయానికి వెల కట్టకూడదు’’ అన్నాడు ఆటో శంకర్.ఆటో స్పీడ్ అందుకుంది. కాసేపట్లో బస్టాండ్ ఎంట్రీ గేటు దాటి ఆటోను ఓ మూలగా పార్క్ చేశాడు శంకర్. విశ్వనాథ్ని క్యాంటీన్కి తీసుకువెళ్లి భోజనం అయ్యాక, కోదాడ టికెట్ తీసుకుని బస్సు ఎక్కించాడు.‘‘శంకర్! నీ ఫోన్ నంబరు ఒక చిట్టీ మీద రాసివ్వు. ఊరికెళ్లగానే డబ్బు పంపిస్తాను. నువ్వు చేసిన సాయం జీవితాంతం గుర్తుంచుకుంటాను. నీకు కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే! మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. చిన్నవాడివైనా చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను’’ నమస్కరిస్తూ అన్నాడు విశ్వనాథ్.చిట్టీ మీద తన ఫోన్ నంబరు రాసి ఇస్తూ, ‘‘అన్నా! అట్టా చేయకు. నాకస్సలు నచ్చదు. నీ పానం బాగా లేదని కండక్టర్కి చెప్పి, నా ఫోన్ నంబరు ఇంకో చిట్టీ మీద రాసిచ్చిన. తోవలో అవసరమొస్తే నాకు ఫోన్ చెయ్యమని చెప్పిన. ఎందుకైనా మంచిది, నీ తమ్ముడి ఫోన్ నంబరు నోటికి గుర్తుంటే నాకు చెప్పన్నా’’ అడిగాడు ఆటో శంకర్.ఫోన్ నంబరు చెప్పాడు విశ్వనాథ్. నంబరు నోట్ చేసుకుని, ‘‘ఇంటికి చేరగానే ఫోను చెయ్యన్నా. నమస్తే! నేనుంట’’ అని చెప్పి బయటకు వచ్చి, బస్టాండులోని పబ్లిక్ ఫోన్ నుంచి విశ్వనాథ్ తమ్ముడు శంకరానికి ఫోన్ చేశాడు ఆటో శంకర్.‘‘హలో! సంకరం గారేనా మాట్లాడేది?’’ అన్నాడు ఆటో శంకర్.‘‘నా పేరు శంకరం.. సంకరం కాదు’’‘‘సంకరన్నా! ఇది ఇను. ఇందాక ఒక పెద్దాయన అమీర్పేట శ్మశానం బయట ఆటో స్టాండు కాడ స్పృహ తప్పి పడిపోయిండు. ఆయన ఫోను నుంచి గిదే నంబరుకి చివరి ఫోన్ చేసిండు. అందుకే నీకు ఫోన్ చేసిన. ఆయన నీకు చుట్టమో పక్కమో నాకు తెల్వదు. అంబులెన్సుకు నేనే ఫోను చేసిన. వాళ్లొచ్చి ఆయన్ని తీసుకుపోయిన్రు. ఏ హాస్పిటల్కి తీసుకుపోయిన్రో నాకు తెల్వదు. ఆ మనిషి నీకు తెలిసుంటే వివరం కనుక్కుంటావని, ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోను చేసిన, గంతే!’’ అని ఫోను పెట్టేశాడు ఆటో శంకర్.అన్న విశ్వనాథ్కి ఏమైనా ప్రమాదం జరిగిందా అనే అనుమానం వచ్చి భయపడ్డాడు శంకరం. వెంటనే అన్నకి ఫోన్ చేశాడు. ఫోన్ పనిచేయడం లేదని రికార్డెడ్ మెసేజ్ వస్తోంది.‘‘రమా! అన్నయ్య శ్మశానం దగ్గర స్పృహతప్పి పడిపోయాడట! అంబులెన్స్ వాళ్లు ఏదో ఆస్పత్రికి తీసుకెళ్లారట. నీ మాట విని బుద్ధిలేని పనిచేశాను. నీకు పట్టింపని నన్ను పెంచిన అన్నని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి వచ్చాను. ఇంటికి రాకూడదన్నాను. మానవత్వం లేకుండా ప్రవర్తించాను. చేతిలో డబ్బుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అన్నయ్యను ఎక్కడని వెదకాలి?’’ అని తల పట్టుకుని బాధపడుతూ వెంటనే బయలుదేరాడు.అమీర్పేట చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులన్నీ మూడుగంటల పాటు వెదికాడు.గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ చెక్ చేశాడు. జాడ తెలియలేదు. మళ్లీ అన్నకి ఫోన్ చేశాడు. ఇంకా ఫోన్ పనిచేయడం లేదని మెసేజ్ వస్తోంది. ఏం చేయాలో పాలు పోలేదు.ఊళ్లో వదినకు ఫోన్ చేశాడు. అన్న ఇంకా రాలేదని, ఆయన ఫోను పనిచేయడంలేదని వదిన చెప్పింది. శంకరానికి కంగారు ఇంకా ఎక్కువైంది. తను చేసిన పనికి శంకరం మనసు వ్రయ్యలైంది.ఇంతలో ఫోను మోగింది. ఫోను తీశాడు శంకరం. ఏదో ల్యాండ్లైన్ నుంచి ఫోను.‘‘శంకరం! ఇప్పుడే కోదాడ బస్సు దిగి, నువ్వు కంగారు పడుతున్నావేమోనని బస్టాండు నుంచి ఫోను చేస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్లాక నీరసంతో కళ్లు తిరిగి కూలబడ్డాను. ఎవరో ఆటో అతను.. అతని పేరు కూడా శంకరమే! సొంత తమ్ముడిలా నాకు భోజనం పెట్టించి, టికెట్ కొని బస్సు ఎక్కించి వెళ్లాడు. క్షేమంగా ఊరికి చేరానని చెప్పడానికి ఫోన్ చేశాను. ఉంటాను’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విశ్వనాథ్! -
ఆకలేస్తే.. స్మార్ట్ఫోన్ ఉందిగా..
ఆకలేస్తే కిచెన్ వైపు చూసే రోజులు పోయాయి.ఆకలేస్తే జనాలిప్పుడు స్మార్ట్ఫోన్ చూస్తున్నారు.ఫుడ్ డెలివరీ యాప్లను క్షుణ్ణంగా శోధిస్తున్నారు.నచ్చిన వంటకాలను వెతికి మరీ ఆర్డర్ చేస్తున్నారు.కూర్చున్న చోటుకే కావలసిన వాటిని రప్పించుకుంటున్నారు.మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలన్నాడు ‘ముత్యాలముగ్గు’లో రావుగోపాల్రావు. ఆ సినిమాలో ఆయన ముళ్లపూడివారు రాసిన ఆ డైలాగు చెప్పాడని కాదు గాని, మనవాళ్లు ఎంతోకొంత కళాపోషకులు. ఒక్కొక్కరి కళాపోషణ ఒక్కొక్కరకం. ఇప్పుడు ఈ ఆన్లైన్ జమానాలో భోజన కళాపోషణ తాజా ట్రెండ్. పొద్దున్న లేచినది మొదలుకొని అర్ధరాత్రి దాటే వరకు మనవాళ్లు ఎడాపెడా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లతో బిజీ బిజీగా భోజన కళాపోషణ కానిస్తున్నారు. ఒకవైపు రెస్టరెంట్లు, హోటళ్లపై ఆహార భద్రతా అధికారులు తరచుగా దాడులు చేస్తూ, ఆహార కల్తీ వ్యవహారాలను బయటపెడుతున్నా, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ‘స్విగ్గీ’, ‘జొమాటో’, ‘ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’ (ఓఎన్డీసీ) వంటి సంస్థలు వెల్లడించిన తాజా నివేదికలు మన భారతీయుల ఆహారప్రీతికి అద్దం పడుతున్నాయి. మనవాళ్ల ఆహార ధోరణులపై ఒక విహంగ వీక్షణం...బిర్యానీ నంబర్ వన్ భారతీయులు ఆన్లైన్లో అత్యధికంగా ఆర్డర్ చేస్తున్న వంటకం బిర్యానీ. గడచిన 2024 సంవత్సరంలో ఏకంగా 8.30 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారు. అంటే, ప్రతి సెకనుకు సగటున 2.63 బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలకు వస్తున్నాయి. ఇవే గణాంకాలను చూసుకుంటే, 2023లో ప్రతి సెకనుకు సగటున 2.5 బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. బిర్యానీ తర్వాత పిజ్జాకు 2024 సంవత్సరంలో అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ ఏడాది పిజ్జాకు 5 కోట్ల ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో మసాలా దోసెకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ఏకంగా 2.30 కోట్ల ఆర్డర్లతో మసాలా దోసె మూడో స్థానంలో నిలిచింది. ఇదే సంవత్సరంలో చాకో లావా కేక్కు 36 లక్షలు, చికెన్ రోల్కు 24.80 లక్షలు, చికెన్ బర్గర్కు 18.40 లక్షలు, చికెన్ మోమోస్కు 16.30 లక్షల ఆర్డర్లు, బంగాళ దుంపల ఫ్రెంచ్ ఫ్రైస్కు 13 లక్షలు చొప్పున ఆన్లైన్ ఆర్డర్లు నమోదయ్యాయి. తాజా ఆహార ధోరణులుఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు సునాయాసంగా వండిన పదార్థాలను ఇళ్లకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగని వీటి ప్రయోజనం అంతవరకు మాత్రమే పరిమితం కాదు. వీటి గణాంకాలను అధ్యయనం చేస్తే, జనాల్లో మారుతున్న ఆహార ధోరణులు అవగతమవుతాయి. వివిధ ఫుడ్ డెలివరీ సంస్థలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఈ ఏడాదిలో జనాల ఆహార ధోరణుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. జనాలలో వచ్చిన మార్పులకు తగినట్లుగానే ప్రముఖ రెస్టరెంట్లలోని షెఫ్లు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటూ, జనాలు కోరుకునే ఆహారాన్ని వండి వడ్డిస్తున్నారు. స్విగ్గీ తాజాగా విడుదల చేసిన ‘టాప్ ఫుడ్ ట్రెండ్స్– 2025’ నివేదిక ప్రకారం ఈ ఏడాది ప్రాచుర్యంలోకి వచ్చిన ఆహార ధోరణులు ఇవీ:ఏఐ డైట్ ప్లాన్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం అన్ని రంగాల్లోనూ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య స్పృహ ఉన్నవారు తమ శరీరతత్త్వానికి, ఆరోగ్య పరిస్థితులకు తగిన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నారు. ఏఐ సూచనల ఆధారంగానే ఆన్లైన్లో తమకు నచ్చిన వంటకాలను ఆర్డర్ చేసుకుంటున్నారు.పర్యావరణ స్పృహప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరుగుతోంది. ఇది ప్రజల ఆహారపు ఎంపికలోనూ ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తోంది. పర్యావరణానికి హాని కలిగించరాదనే ఉద్దేశంతో చాలామంది తక్కువ కర్బన ఉద్గారాలు కలిగిన ఆహార పదర్థాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఆన్లైన్ ఆర్డర్లు చేసేటప్పుడు ఈ మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. జనాల్లో వచ్చిన ఈ మార్పును గమనించిన షెఫ్స్ చాలావరకు స్థానికంగా కాలానుగుణంగా దొరికే పదార్థాలను, పర్యావరణానికి చేటు కలిగించని రీతిలో కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండే పదార్థాలను తమ వంటకాల కోసం ఎంపిక చేసుకుంటున్నారు.జీరో వేస్ట్ కుకింగ్జీరో వేస్ట్ కుకింగ్ ట్రెండ్ మాత్రమే కాదు, ప్రపంచానికి అవసరం కూడా! ఆహార పదార్థాలను వండటంలో ఎంతో కొంత వృథా కావడం సహజం. ఇటీవలి కాలంలో వండేటప్పుడు ఆహార వృథాను అరికట్టేందుకు షెఫ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనాలు కూడా జీరో వేస్ట్ కిచెన్లలో వండిన ఆహారానికే మొగ్గు చూపుతున్నారు. ఆహార వృథాను వీలైనంతగా అరికట్టాలనే స్పృహ జనాల్లో పెరుగుతూ వస్తుండటం ఒకరకంగా మంచి పరిణామమే!చక్కెర తక్కువడయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో జనాలు చక్కెర కలిగిన పదార్థాల పట్ల ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. చక్కెరను అతి తక్కువగా వినియోగించే పదార్థాల వైపు, చక్కెరకు ప్రత్యామ్నాయ పదార్థాల వైపు మళ్లుతున్నారు. పలు రెస్టరెంట్లలోని షెఫ్లు కూడా జనాలలో వచ్చిన ఈ మార్పుకు అనుగుణంగా చక్కెర తక్కువగా వినియోగిస్తున్నారు.ప్రోబయోటిక్స్జీర్ణకోశ సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. అందువల్ల చాలామంది రోజువారీ ఆహారంలో ప్రోబయోటిక్స్ ఉండేటట్లు చూసుకుంటున్నారు. ప్రజల్లో వచ్చిన ఈ మార్పుకు అనుగుణంగా చాలా రెస్టరెంట్లలోని షెఫ్లు కడుపుకు, పేగులకు మేలు చేసే పెరుగు, పులియబెట్టిన పిండి, పులియబెట్టిన ఇతర పదార్థాలతో వంటకాలను వండి వడ్డిస్తున్నారు.ఫ్యూజన్ రుచులుఆరోగ్య స్పృహతో వంటకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలు రుచుల్లో కొత్తదనాన్ని కూడా కోరుకుంటున్నారు. ప్రజల అభిరుచికి తగినట్లుగానే పలు రెస్టరెంట్లు దేశ దేశాల రుచులను సమ్మిళితం చేసి, ఫ్యూజన్ రుచులను అందిస్తున్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఈ జాబితాలో ఇండియన్ రామెన్, కొరియన్ టాకోస్, మెడిటరేనియన్ సూషి వంటివి చాలానే ఉన్నాయి. అంతేకాదు, ఈ జాబితాలోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాత్మక వంటకాలు చేరుతూనే ఉన్నాయి.మూడ్ బూస్టింగ్ ఫుడ్ఇటీవలి కాలంలో జనాలు ఆహారం వల్ల ఆరోగ్యంతో పాటు అంతకు మించిన ప్రయోజనాలను కూడా కోరుకుంటున్నారు. ఉదయాన్నే రోజును తాజాగా ప్రారంభించడానికి; సాయంత్రం పని ఒత్తిడి పోగొట్టుకోవడానికి; రాత్రివేళ ప్రశాంతమైన నిద్రకు తగిన ఆహారాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. జనాల ‘మూడ్ బూస్టింగ్’ ఎంపికను గమనించిన రెస్టరెంట్లు కూడా అందుకు తగిన పదార్థాలను ఎప్పటికప్పుడు వండి వడ్డిస్తున్నాయి.హైపర్ లోకల్భోజన ప్రియుల్లో కొందరు కొత్తదనం కోసం ఫ్యూజన్ రుచులను కోరుకుంటూ ఉంటే, ఇంకొందరు మాత్రం పూర్తిగా స్థానిక రుచులకే ప్రాధాన్యమిస్తున్నారు. స్థానికంగా పండే పంటలు, స్థానికంగా పేరుపొందిన వంటకాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పలు రెస్టరెంట్లు స్థానికంగా పండే చిరుధాన్యాలు, కూరగాయలతో వండిన పదార్థాలను; స్థానికంగా ప్రసిద్ధి పొందిన వంటకాలను అందిస్తున్నాయి.ఐదో స్థానంలో భారత్ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల మార్కెట్లో 2024 సంవత్సరం నాటికి భారత్ ఐదో స్థానంలో ఉంది. భారత్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ 2019 నాటితో చూసుకుంటే, 2024 నాటికి 2.8 రెట్ల వృద్ధి సాధించినా, ఇప్పటికి ఐదో స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ఈ మార్కెట్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ దేశాల ఆన్లైన్ ఫుడ్ మార్కెట్ విలువ 2024 నాటికి నమోదైన వివరాలు:టాప్ 5 నగరాలుమన దేశంలోని మెట్రో నగరాలు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో ముందంజలో ఉంటున్నాయి. వీటిలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పుణే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆన్లైన్లో ఈ నగరాలు ఎంత శాతం మేరకు ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నాయంటే...విస్తరణకు మరిన్ని అవకాశాలుజనాభాలో చైనాను అధిగమించినప్పటికీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో భారత్ ఇప్పటికి కొంతవరకు వెనుబడే ఉంది. అయితే, మెట్రో నగరాల నుంచి ఈ ధోరణి శరవేగంగా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ మార్కెట్ శరవేగంగా విస్తరించగలదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడం; నగర జీవితాలు తీరికలేకుండా మారడం; చిన్న నగరాలు, పట్టణాల్లో సైతం జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటుండటం; జనాల్లో ఆరోగ్య స్పృహతో పాటు రుచుల వైవిధ్యాన్ని చవిచూడాలన్న కోరిక పెరగడం వంటి కారణాల వల్ల చాలామంది ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదివరకు సెలవు రోజుల్లోను, తీరిక వేళల్లోను సకుటుంబంగా లేదా బంధు మిత్రులతో కలసి రెస్టరెంట్లకు స్వయంగా వెళ్లేవారు సైతం ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నారు. నగరాల్లోని ఇరుకిరుకు ట్రాఫిక్లో తంటాలు పడటం కంటే, నేరుగా ఇంటికే కోరుకున్న వంటకాలు వచ్చేస్తుండటం సౌకర్యవంతంగా ఉండటంతో ఎక్కువమంది ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు చేయడానికే ఇష్టపడుతున్నారు. ‘కోవిడ్’ కాలం నుంచి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల సంఖ్య వెయ్యికి లోపు మాత్రమే ఉంది. దేశంలోని ప్రధానమైన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో జొమాటో 800 నగరాల్లోను, స్విగ్గీ 580 నగరాల్లోను సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికి ఈ సేవలు అందుబాటులో లేని నగరాలు, పట్టణాలకు సేవలను విస్తరించడానికి ఈ సంస్థలకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద రెస్టరెంట్లకు దీటుగా నగరాలు, పట్టణాల్లో క్లౌడ్ కిచెన్లు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ దేశంలో గణనీయంగా విస్తరించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఒకేసారి పది ఆపరేషన్లు
ఫోన్ స్క్రీన్ పై మెరిసే ముఖం మాయలో పడిపోతున్నారు. నిలువుటద్దం చూపే నిజాన్ని మరచిపోతున్నారు.యాప్లు గుప్పించే భ్రాంతిలో మునిగిపోతున్నారు.అందచందాల కోసం శస్త్రచికిత్సలకు సిద్ధపడుతున్నారు.అత్యాశతో సినీ తారలు కూడా ఈ గేమ్లో బలైపోతున్నారు.తమ సహజ అందాన్ని అన్ ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు.ఒకవైపు ఇది ‘రిస్కీ రోడ్’ అని డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు.అయినా, యువత ఆరాటం ఏమాత్రం ఆగడంలేదు.చివరికి చేతులు కాలాక అసలు సంగతి గ్రహిస్తున్నారు. మెరుపు కోసం వెళితే, మిగిలేది మాయని మచ్చలేనని!యువతలో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే డిజిటల్ ఫేస్ కావాలనే కోరిక! రీల్స్లో ఫిల్టర్స్తో అందంగా కనిపించే విధంగా నిజజీవితంలోనూ ఉండాలని కోరుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్, ఫొటో యాప్స్లో కనిపించే గ్లాస్ స్కిన్ , షార్ప్ జాలైన్ , పర్ఫెక్ట్ లిప్స్ చూసి ‘ఇదే నా ముఖం కావాలి!’అంటూ బ్యూటీ పార్లర్స్కు పరుగులు తీస్తున్నారు. అప్పటికీ సంతృప్తి చెందక కాస్మెటిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్నారు. ఇరవై నుంచి ముపై ్ప ఏళ్ల వయసులో ఉన్న యువతే ఎక్కువగా రియల్ ఫేస్ ఫిల్టర్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లిప్ ఫిల్లర్స్, నోస్ రీషేపింగ్, లిపోసక్షన్ , బోటాక్స్ వంటి శస్త్రచికిత్సలు ఫ్యాషన్ గా మారిపోయాయి. అంతేకాదు, డిజిటల్ ఫిల్టర్స్ను నిజజీవితంలో దక్కించుకోవాలనే ఆశతో శరీర నిర్మాణం, చర్మంపై గరిష్ఠ హద్దులు దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక యువతి లిపోసక్షన్ చేసినా ఇన్ స్టా వీడియోలో కనిపించిన ఫిల్టర్ లుక్ రాక నిరాశ చెందింది. మరో విద్యార్థిని పదికి పైగా లేజర్ సెషన్లు చేయించుకుని కూడా తాను నెట్లో చూసినట్టే ఫలితం రాలేదని స్కిన్ గ్రాఫ్ట్కే పట్టుబట్టింది. ఇవే ఉదాహరణలు ఈ ట్రెండ్ ఎంత దూరం వెళ్ళిందో చూపిస్తున్నాయి. ఇంతకుముందు అందం మెరుగుదల కోసం వచ్చేవారు, ఇప్పుడు పర్ఫెక్షన్ కోసం వస్తున్నారు. ఫిల్టర్ లుక్ అంటే ఎడిటింగ్, అది నిజజీవితంలో సాధ్యం కాదని డాక్టర్లు స్పష్టంగా చెబుతున్నప్పటికీ యువతలో మార్పు రాకపోగా, విపరీతంగా ఈ రియల్ ఫిల్టర్ ఫేస్ భ్రాంతి పెరుగుతోంది.అతి అనర్థం!అందంగా కనిపించాలనే ఆశతో బ్యూటీ పార్లర్ వెళ్లి తీసుకునే చికిత్సలు మొదట మెరిసే కాంతి ఇచ్చినా, తర్వాత సమస్యల వరదనూ సృష్టిస్తాయి. హెయిర్ స్ట్రెయిటెనింగ్తో జుట్టు మృదువుగా మారుతుంది. కాని, కొంతకాలానికి బలహీనమై రాలిపోతుంది. స్కిన్ పాలిష్, బ్లీచింగ్ వంటివి చర్మానికి తాత్కాలికంగా మెరుపునిస్తాయి. కాని తర్వాత మచ్చలు, ఎర్రదనమే మిగులుతాయి. ఇక తరచు మేకప్ వాడితే చర్మానికి ఊపిరాడక మొటిమలు, పొడిబారిన పెదవులు తప్పవు. ఐ లైనర్లు, మస్కారా ఎక్కువ వాడితే కళ్లకు ఇన్ఫెక్షన్లు వస్తాయి. టాటూలు స్టయిల్గా అనిపించినా, జీవితాంతం అలానే ఉండిపోతాయి. తొలగించాలంటే నొప్పి, ఖర్చు, ప్రమాదం ఎక్కువ. ఇక ముక్కు, చెవులకు ఆభరణాలను పెట్టుకోవాలని అనవసరంగా అనేక రంధ్రాలు చేయించుకుంటే తరచుగా ఇన్ఫెక్షన్లు, గాయాలు రావడం సహజం. ఇలా తాత్కాలిక మెరుపు కోసం చేసే ఈ చర్యలు శాశ్వత నష్టాలను కలిగిస్తాయి.అందంగా ఉండాలని మామూలు మనుషులూ కోరుకుంటారు. అయితే, సెలబ్రిటీలకు అది బతుకుబండిని లాగించే ఆక్సిజన్ లాంటిది. కెమెరా ముందు ప్రతి ఏజ్లైన్ , ప్రతి ముడత, ప్రతి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి రోజూ మిలియన్ల కళ్లు, కెమెరా లెన్సులు, పాపరాజ్జీ ఫ్లాష్లు వారిని గమనిస్తూనే ఉంటాయి. అందుకే వారు ‘ఎప్పటికీ యవ్వనంగా, నాజుకుగా కనిపించాలి’ అనే ఒత్తిడిలో జీవిస్తారు. ఈ నిరంతర ఒత్తిడి వారిని సాధారణ మనుషుల కంటే ఎక్కువగా రిస్కీ ప్రయోగాల వైపు నెట్టేస్తోంది. అందుకే ఎంతోమంది నటీనటులు, మోడల్స్, గాయకులు అందం కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో భారీ మూల్యం చెల్లించుకున్నారు. సాధారణ మనిషి చేసిన తప్పులను సమాజం పెద్దగా పట్టించుకోదు గాని, సెలబ్రిటీలు చేసిన తప్పులు మాత్రం ప్రపంచం ముందు బహిర్గతమవుతాయి. అలాంటివారిలో తీవ్రంగా నష్టపోయిన సెలబ్రిటీలు వీరే:లిన్ మే – చీప్ అందం ఖర్చు, మొత్తం జీవితంమెక్సికో నటి లిన్ మే తక్కువ ఖర్చుతో త్వరగా బాగుపడతానని నమ్మి ఇరవై డాలర్లకు ఇంజెక్షన్ వేసుకుంది. కాని, అది నైపుణ్యం లేని వ్యక్తి చేసిన మోసం. బేబీ ఆయిల్, కుకింగ్ ఆయిల్, నీరు కలిపి ఆమె ముఖంలోకి పంపించడంతో, ముఖం వాచిపోయి శాశ్వతంగా దెబ్బతింది. అనేక సర్జరీలు చేసినా ఆమె అందం తిరిగి రాలేదు.ప్రిసిల్లా ప్రెస్లీ – సిలికాన్ మోసంహాలీవుడ్ ఐకాన్ ప్రిసిల్లా ప్రెస్లీ ఒక నకిలీ వైద్యుడి వలలో చిక్కుకుంది. పరిశ్రమల్లో వాడే నాసిరకం సిలికాన్ ని ముఖంలో ఇంజెక్ట్ చేయడంతో, ఆమె అందం శాశ్వతంగా దెబ్బతింది. ఒకప్పుడు వెండితెరపై మెరిసిన ముఖం, ఇప్పుడు పశ్చాత్తాపానికి గుర్తుగా మిగిలిపోయింది.కోర్ట్నీ కాక్స్ – మితిమీరిన ఇంజెక్షన్ల తలనొప్పి‘ఫ్రెండ్స్’ సీరియల్తో ప్రపంచాన్ని అలరించిన కోర్ట్నీ కాక్స్ యవ్వనం నిలబెట్టుకోవాలన్న ఒత్తిడితో వరుసగా ఇంజెక్షన్లు వేసుకుంది. ఫలితంగా ముఖం సహజత్వాన్ని కోల్పోయింది. చివరికి ఆమె స్వయంగా ‘ఇదంతా నా తప్పే’ అని ఒప్పుకొని సహజ వృద్ధాప్యాన్ని అంగీకరించింది.డొనాటెల్లా వెర్సేస్ – శస్త్రచికిత్సల బలిప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ డొనాటెల్లా వెర్సేస్ పలు శస్త్రచికిత్సలు చేయించుకుంది. ఆ శస్త్రచికిత్సలు ఆమె రూపాన్ని సహజంగా మెరిపించకపోగా, విరూపం చేశాయి. ప్రజలు ఇప్పుడు ఆమె కొత్త ముఖాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు.హైడి మాంటాగ్ – ఒకేసారి పది ఆపరేషన్లుఅమెరికా రియాలిటీ స్టార్ హైడీ మాంటాగ్ ఒకేసారి పది సర్జరీలు చేయించుకుంది. ముక్కు సవరణ నుంచి ఫేస్లిఫ్ట్ వరకు అన్నీ ఒకేసారి. కాని, ఆ నిర్ణయం తన జీవితంలోనే పెద్ద పొరపాటు అని తర్వాత తానే ‘అవసరం లేని సమయంలో నా సహజ అందాన్ని నాశనం చేసుకున్నాను.’ అని ఒప్పుకుంది. కోయనా మిత్రా – విఫలమైన ముక్కు సర్జరీఒకప్పుడు స్పెషల్ సాంగ్స్తో ఫేమస్ అయిన కోయనా ముక్కు సర్జరీ చేయించుకుంది. కాని, అది విఫలమై, మరో పెద్ద ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ పొరపాటు ఆమె కెరీర్కే అడ్డుగీత వేసింది.అనుష్కా శర్మ – లిప్ ఇంజెక్షన్ల వివాదంఅనుష్కా శర్మ లిప్ ఇంజెక్షన్లు పెద్ద చర్చనీయాంశ మయ్యాయి. మొదట ఆరోగ్య సమస్య కోసం చేశానని చెప్పినా, తర్వాత అది అందం కోసం చేసుకున్నదేనని అంగీకరించింది.రాఖీ సావంత్ – విఫలమైన ప్రయోగాలురాఖీ సావంత్ ఎన్నో సర్జరీలు చేయించుకుంది. వాటిల్లో కొన్ని విఫలమయ్యాయి. ముఖ్యంగా లిప్, నోస్ జాబ్స్ ఆమె సహజ అందాన్ని పూర్తిగా మార్చేశాయి.శ్రుతి హాసన్ – ధైర్యంగా ముందుకుశ్రుతి హాసన్ ముక్కు సర్జరీ చేయించుకుంది. ఫిల్లర్లు వాడింది. ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్న వెంటనే ‘ఇది ప్లాస్టిక్ సర్జరీ షాప్’ అంటూ కామెంట్లు చేశారు. కానీ, ‘నేను ఏమి చేశానో నాకు తెలుసు. ఇంకా ఎక్కువ చికిత్సలు చేసుకున్నవారూ ఉన్నారు. గ్లామర్ ప్రపంచంలో చాలామంది నిజాలను దాచిపెడతారు’ అంటూ అనేక విమర్శలు ఎదురైనా, తన నిర్ణయాన్ని ధైర్యంగా సమర్థించుకుంది.అదితిరావు హైదరి – సహజ అందానికి దగ్గరగాఅదితిరావు హైదరి పలు ట్రీట్మెంట్లు చేయించు కున్నప్పటికీ, సహజమైన అందాన్ని కాపాడుకోవ డానికి ప్రయత్నించింది. అయినా రూపంలో వచ్చిన మార్పులను అభిమానులు గమనించి ట్రోల్ చేశారు. హీరోలు కూడా!హీరోలు కూడా అందం కోసం వెనకడుగు వేయడంలేదు. షాహిద్ కపూర్ చేయించుకున్న ముక్కు సర్జరీని అభిమానులు ఎగతాళి చేశారు. సైఫ్ అలీ ఖాన్ బోటాక్స్ ట్రీట్మెంట్లు తీసుకున్నట్టు బహిరంగంగానే చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ అతన్ని ఊపిరి తీసుకోనివ్వ లేదు. ఆమిర్ ఖాన్ వృద్ధాప్య రేఖలు తగ్గించుకోవడానికి చికిత్సలు తీసుకున్నాడని వార్తలు రావడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ డెర్మల్ ఫిల్లర్లు చేయించుకున్నట్లు బయటపడగానే అతడూ ట్రోలింగ్ బారిన పడ్డాడు. సినిమా ప్రపంచం యవ్వనాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. కాని, అందం కోసం చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతం కాకపోవచ్చు. కొన్నిసార్లు అందం కోసం చేసిన రిస్క్ పశ్చాత్తాపంగా మిగిలిపోతుందని ఈ కథలే నిరూపిస్తున్నాయి.అందమైన హాలీడే ప్యాకేజీ!మెరుగైన అందంతో పాటు ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే అందమైన హాలిడే ప్యాకేజీలు. అంటే హాలిడే ట్రిప్తో పాటు కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవడం ఒకే ప్యాకేజీగా వస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ హాలీడే కమ్ కాస్మెటిక్ సర్జరీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో యువకులు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా టర్కీకి వెళ్లి సర్జరీ చేయించుకోవాలన్న ఆలోచన చాలామందికి బాగా నచ్చుతోంది, ఎందుకంటే అక్కడ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. కాని, ఈ ప్యాకేజీల వెనుక నిజం మాత్రం వేరేలా ఉంటుంది. ఉదాహరణకు, హైదరాబాద్లోని గచ్చిబౌలికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల ఇస్తాంబుల్లో హెయిర్ ట్రాన్ ్సప్లాంట్ చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్ తో బాధపడ్డాడు. ఆ శస్త్రచికిత్స పూర్తిగా విఫలమైంది. టర్కీని ఆకర్షణీయంగా చూపించే సోషల్ మీడియా పోస్టులు ఎంత మెరిసిపోతున్నాయో, వాస్తవంలో అనుభవాలు అంత దారుణంగా ఉంటున్నాయి. ఇలాంటి సమస్యలు చాలా దేశాల్లో తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో పోస్ట్ సర్జికల్ కేర్ లోపించడం వలన సమస్యలు మరింత పెరుగుతున్నాయి. పైగా అక్కడ చాలా సర్జరీలు అర్హతలేని టెక్నీషియన్ల చేతిలో జరుగుతున్నాయి. మొదట ఆకర్షణీయమైన ఫోటోలు చూపిస్తారు కాని, తర్వాత వచ్చే సమస్యల గురించి ఎవరూ చెప్పరు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు మరింత పెరుగుతున్నాయి, ఎందుకంటే ఎక్కువమంది చికిత్స వివరాల కోసం కేవలం సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు.ప్రయోజనాలు నష్టాలు!జీవితంలో ప్రతి నిర్ణయంలాగే, కాస్మెటిక్ సర్జరీ విషయంలో కూడా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఉంటాయి. వాస్తవాన్ని గుర్తించి, నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే చికిత్స తీసుకుంటే ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయి. కాని అత్యాశతో, విపరీతమైన చికిత్సలు తీసుకుంటే మాత్రం ప్రమాదాలు తప్పవు. ప్రయోజనాలు!ఆత్మవిశ్వాసం పెరుగుతుంది: మనసులో చాలాకాలం నుంచి ఉన్న చిన్న లోపం (ఉదాహరణకు చదునుగా కనిపించే ముక్కు లేదా పాత మచ్చ) పోయినప్పుడు, అద్దం ముందు నిలబడి చూసుకున్నప్పుడల్లా ఉత్సాహం రెట్టింపవుతుంది.వైద్యపరమైన సాయం లభిస్తుంది: కొందరికి ముక్కు ఆకారం వల్ల శ్వాస సమస్యలు లేదా యాక్సిడెంట్ వలన ఏర్పడిన మచ్చలు, ఎగుడుదిగుడులు ఉంటాయి. అలాంటివి సరిచేయడానికి శస్త్రచికిత్స శాస్త్రీయ పరిష్కారం అవుతుంది. అంటే అందం కోసమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.సహజమైన ఫలితాలు రావచ్చు: సరైన వైద్య నిపుణుల దగ్గర, సరైన పద్ధతిలో చేస్తే సర్జరీ ఫలితాలు దీర్ఘకాలం నిలిచే సహజమైన అందాన్ని తలపిస్తాయి. నష్టాలు!ఫిల్టర్ మాయాజాలం కాపీ కాదు: డిజిటల్ ఫిల్టర్ లుక్ను నిజ జీవితంలో కాపీ చేయడం అసాధ్యం. ఎంత సర్జరీ చేసినా ఫలితం ఊహించినట్టుగా రాకపోవడంతో నిరాశ తప్పదు.వైద్య సమస్యల రిస్క్: ప్రతి శస్త్రచికిత్సలోనూ ఇన్ఫెక్షన్లు, గాయాలు, శాశ్వత మచ్చలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖం అనేది వ్యక్తిత్వానికి ప్రతిబింబం కాబట్టి చిన్న తప్పిదం కూడా జీవితాంతం కనిపిస్తూనే ఉంటుంది.మానసిక ఆరోగ్యంపై ప్రభావం: ఫలితాలు కోరుకున్న మాదిరిగా రాకపోతే నిరాశ, ఆందోళన పెరిగి మానసిక సమస్యలు తలెత్తవచ్చు.అలవాటుగా మారే ప్రమాదం: మొదట పెదవులు, తర్వాత చీక్స్, ఆపై జాలైన్ – ఇలా ఒకదాని తర్వాత మరొకటి చేస్తూ నియంత్రణ కోల్పోతే, చివరికి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టమే మిగులుతుంది.ఎక్కువ చెల్లించేది సెలబ్రిటీలే!యువతలో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే డిజిటల్ ఫేస్ కావాలనే కోరిక! రీల్స్లో ఫిల్టర్స్తో అందంగా కనిపించే విధంగా నిజజీవితంలోనూ ఉండాలని కోరుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్, ఫొటో యాప్స్లో కనిపించే గ్లాస్ స్కిన్ , షార్ప్ జాలైన్ , పర్ఫెక్ట్ లిప్స్ చూసి ‘ఇదే నా ముఖం కావాలి!’అంటూ బ్యూటీ పార్లర్స్కు పరుగులు తీస్తున్నారు. అప్పటికీ సంతృప్తి చెందక కాస్మెటిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్నారు. ఇరవై నుంచి ముపై ్ప ఏళ్ల వయసులో ఉన్న యువతే ఎక్కువగా రియల్ ఫేస్ ఫిల్టర్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లిప్ ఫిల్లర్స్, నోస్ రీషేపింగ్, లిపోసక్షన్ , బోటాక్స్ వంటి శస్త్రచికిత్సలు ఫ్యాషన్ గా మారిపోయాయి.అంతేకాదు, డిజిటల్ ఫిల్టర్స్ను నిజజీవితంలో దక్కించుకోవాలనే ఆశతో శరీర నిర్మాణం, చర్మంపై గరిష్ఠ హద్దులు దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక యువతి లిపోసక్షన్ చేసినా ఇన్ స్టా వీడియోలో కనిపించిన ఫిల్టర్ లుక్ రాక నిరాశ చెందింది. మరో విద్యార్థిని పదికి పైగా లేజర్ సెషన్లు చేయించుకుని కూడా తాను నెట్లో చూసినట్టే ఫలితం రాలేదని స్కిన్ గ్రాఫ్ట్కే పట్టుబట్టింది. ఇవే ఉదాహరణలు ఈ ట్రెండ్ ఎంత దూరం వెళ్ళిందో చూపిస్తున్నాయి. ఇంతకుముందు అందం మెరుగుదల కోసం వచ్చేవారు, ఇప్పుడు పర్ఫెక్షన్ కోసం వస్తున్నారు. ఫిల్టర్ లుక్ అంటే ఎడిటింగ్, అది నిజజీవితంలో సాధ్యం కాదని డాక్టర్లు స్పష్టంగా చెబుతున్నప్పటికీ యువతలో మార్పు రాకపోగా, విపరీతంగా ఈ రియల్ ఫిల్టర్ ఫేస్ భ్రాంతి పెరుగుతోంది.అతి అనర్థం!అందంగా కనిపించాలనే ఆశతో బ్యూటీ పార్లర్ వెళ్లి తీసుకునే చికిత్సలు మొదట మెరిసే కాంతి ఇచ్చినా, తర్వాత సమస్యల వరదనూ సృష్టిస్తాయి. హెయిర్ స్ట్రెయిటెనింగ్తో జుట్టు మృదువుగా మారుతుంది. కాని, కొంతకాలానికి బలహీనమై రాలిపోతుంది. స్కిన్ పాలిష్, బ్లీచింగ్ వంటివి చర్మానికి తాత్కాలికంగా మెరుపునిస్తాయి. కాని తర్వాత మచ్చలు, ఎర్రదనమే మిగులుతాయి. ఇక తరచు మేకప్ వాడితే చర్మానికి ఊపిరాడక మొటిమలు, పొడిబారిన పెదవులు తప్పవు. ఐ లైనర్లు, మస్కారా ఎక్కువ వాడితే కళ్లకు ఇన్ఫెక్షన్లు వస్తాయి. టాటూలు స్టయిల్గా అనిపించినా, జీవితాంతం అలానే ఉండిపోతాయి. తొలగించాలంటే నొప్పి, ఖర్చు, ప్రమాదం ఎక్కువ. ఇక ముక్కు, చెవులకు ఆభరణాలను పెట్టుకోవాలని అనవసరంగా అనేక రంధ్రాలు చేయించుకుంటే తరచుగా ఇన్ఫెక్షన్లు, గాయాలు రావడం సహజం. ఇలా తాత్కాలిక మెరుపు కోసం చేసే ఈ చర్యలు శాశ్వత నష్టాలను కలిగిస్తాయి.అందంగా ఉండాలని మామూలు మనుషులూ కోరుకుంటారు. అయితే, సెలబ్రిటీలకు అది బతుకుబండిని లాగించే ఆక్సిజన్ లాంటిది. కెమెరా ముందు ప్రతి ఏజ్లైన్ , ప్రతి ముడత, ప్రతి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి రోజూ మిలియన్ల కళ్లు, కెమెరా లెన్సులు, పాపరాజ్జీ ఫ్లాష్లు వారిని గమనిస్తూనే ఉంటాయి. అందుకే వారు ‘ఎప్పటికీ యవ్వనంగా, నాజుకుగా కనిపించాలి’ అనే ఒత్తిడిలో జీవిస్తారు. ఈ నిరంతర ఒత్తిడి వారిని సాధారణ మనుషుల కంటే ఎక్కువగా రిస్కీ ప్రయోగాల వైపు నెట్టేస్తోంది. అందుకే ఎంతోమంది నటీనటులు, మోడల్స్, గాయకులు అందం కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో భారీ మూల్యం చెల్లించుకున్నారు. సాధారణ మనిషి చేసిన తప్పులను సమాజం పెద్దగా పట్టించుకోదు గాని, సెలబ్రిటీలు చేసిన తప్పులు మాత్రం ప్రపంచం ముందు బహిర్గతమవుతాయి. అలాంటివారిలో తీవ్రంగా నష్టపోయిన సెలబ్రిటీలు వీరే:లిన్ మే – చీప్ అందం ఖర్చు, మొత్తం జీవితంమెక్సికో నటి లిన్ మే తక్కువ ఖర్చుతో త్వరగా బాగుపడతానని నమ్మి ఇరవై డాలర్లకు ఇంజెక్షన్ వేసుకుంది. కాని, అది నైపుణ్యం లేని వ్యక్తి చేసిన మోసం. బేబీ ఆయిల్, కుకింగ్ ఆయిల్, నీరు కలిపి ఆమె ముఖంలోకి పంపించడంతో, ముఖం వాచిపోయి శాశ్వతంగా దెబ్బతింది. అనేక సర్జరీలు చేసినా ఆమె అందం తిరిగి రాలేదు.ప్రిసిల్లా ప్రెస్లీ – సిలికాన్ మోసంహాలీవుడ్ ఐకాన్ ప్రిసిల్లా ప్రెస్లీ ఒక నకిలీ వైద్యుడి వలలో చిక్కుకుంది. పరిశ్రమల్లో వాడే నాసిరకం సిలికాన్ ని ముఖంలో ఇంజెక్ట్ చేయడంతో, ఆమె అందం శాశ్వతంగా దెబ్బతింది. ఒకప్పుడు వెండితెరపై మెరిసిన ముఖం, ఇప్పుడు పశ్చాత్తాపానికి గుర్తుగా మిగిలిపోయింది.కోర్ట్నీ కాక్స్ – మితిమీరిన ఇంజెక్షన్ల తలనొప్పి‘ఫ్రెండ్స్’ సీరియల్తో ప్రపంచాన్ని అలరించిన కోర్ట్నీ కాక్స్ యవ్వనం నిలబెట్టుకోవాలన్న ఒత్తిడితో వరుసగా ఇంజెక్షన్లు వేసుకుంది. ఫలితంగా ముఖం సహజత్వాన్ని కోల్పోయింది. చివరికి ఆమె స్వయంగా ‘ఇదంతా నా తప్పే’ అని ఒప్పుకొని సహజ వృద్ధాప్యాన్ని అంగీకరించింది.డొనాటెల్లా వెర్సేస్ – శస్త్రచికిత్సల బలిప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ డొనాటెల్లా వెర్సేస్ పలు శస్త్రచికిత్సలు చేయించుకుంది. ఆ శస్త్రచికిత్సలు ఆమె రూపాన్ని సహజంగా మెరిపించకపోగా, విరూపం చేశాయి. ప్రజలు ఇప్పుడు ఆమె కొత్త ముఖాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు.హైడి మాంటాగ్ – ఒకేసారి పది ఆపరేషన్లుఅమెరికా రియాలిటీ స్టార్ హైడీ మాంటాగ్ ఒకేసారి పది సర్జరీలు చేయించుకుంది. ముక్కు సవరణ నుంచి ఫేస్లిఫ్ట్ వరకు అన్నీ ఒకేసారి. కాని, ఆ నిర్ణయం తన జీవితంలోనే పెద్ద పొరపాటు అని తర్వాత తానే ‘అవసరం లేని సమయంలో నా సహజ అందాన్ని నాశనం చేసుకున్నాను.’ అని ఒప్పుకుంది. కోయనా మిత్రా – విఫలమైన ముక్కు సర్జరీఒకప్పుడు స్పెషల్ సాంగ్స్తో ఫేమస్ అయిన కోయనా ముక్కు సర్జరీ చేయించుకుంది. కాని, అది విఫలమై, మరో పెద్ద ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ పొరపాటు ఆమె కెరీర్కే అడ్డుగీత వేసింది.అనుష్కా శర్మ – లిప్ ఇంజెక్షన్ల వివాదంఅనుష్కా శర్మ లిప్ ఇంజెక్షన్లు పెద్ద చర్చనీయాంశ మయ్యాయి. మొదట ఆరోగ్య సమస్య కోసం చేశానని చెప్పినా, తర్వాత అది అందం కోసం చేసుకున్నదేనని అంగీకరించింది.రాఖీ సావంత్ – విఫలమైన ప్రయోగాలురాఖీ సావంత్ ఎన్నో సర్జరీలు చేయించుకుంది. వాటిల్లో కొన్ని విఫలమయ్యాయి. ముఖ్యంగా లిప్, నోస్ జాబ్స్ ఆమె సహజ అందాన్ని పూర్తిగా మార్చేశాయి.శ్రుతి హాసన్ – ధైర్యంగా ముందుకుశ్రుతి హాసన్ ముక్కు సర్జరీ చేయించుకుంది. ఫిల్లర్లు వాడింది. ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్న వెంటనే ‘ఇది ప్లాస్టిక్ సర్జరీ షాప్’ అంటూ కామెంట్లు చేశారు. కానీ, ‘నేను ఏమి చేశానో నాకు తెలుసు. ఇంకా ఎక్కువ చికిత్సలు చేసుకున్నవారూ ఉన్నారు. గ్లామర్ ప్రపంచంలో చాలామంది నిజాలను దాచిపెడతారు’ అంటూ అనేక విమర్శలు ఎదురైనా, తన నిర్ణయాన్ని ధైర్యంగా సమర్థించుకుంది.అదితిరావు హైదరి – సహజ అందానికి దగ్గరగాఅదితిరావు హైదరి పలు ట్రీట్మెంట్లు చేయించు కున్నప్పటికీ, సహజమైన అందాన్ని కాపాడుకోవ డానికి ప్రయత్నించింది. అయినా రూపంలో వచ్చిన మార్పులను అభిమానులు గమనించి ట్రోల్ చేశారు. హీరోలు కూడా!హీరోలు కూడా అందం కోసం వెనకడుగు వేయడంలేదు. షాహిద్ కపూర్ చేయించుకున్న ముక్కు సర్జరీని అభిమానులు ఎగతాళి చేశారు. సైఫ్ అలీ ఖాన్ బోటాక్స్ ట్రీట్మెంట్లు తీసుకున్నట్టు బహిరంగంగానే చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ అతన్ని ఊపిరి తీసుకోనివ్వ లేదు. ఆమిర్ ఖాన్ వృద్ధాప్య రేఖలు తగ్గించుకోవడానికి చికిత్సలు తీసుకున్నాడని వార్తలు రావడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ డెర్మల్ ఫిల్లర్లు చేయించుకున్నట్లు బయటపడగానే అతడూ ట్రోలింగ్ బారిన పడ్డాడు. సినిమా ప్రపంచం యవ్వనాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. కాని, అందం కోసం చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతం కాకపోవచ్చు. కొన్నిసార్లు అందం కోసం చేసిన రిస్క్ పశ్చాత్తాపంగా మిగిలిపోతుందని ఈ కథలే నిరూపిస్తున్నాయి.అందం వెనుక దాగున్న నేరాలు!బంగారు కాంతి లాంటి చర్మం కావాలని, వయసు నిలిచిపోవాలని కలలు కనే ధనవంతుల కోరికలే కొన్ని భయంకరమైన నేరాలకు కారణమవుతున్నాయి. బయటకు మెరిసే ప్రకాశవంతమైన సెలూన్లు, సౌందర్య కేంద్రాల లోపల ఎన్నో చీకటి రహస్యాలు దాగి ఉంటాయి. కొన్ని ఉత్పత్తుల వెనుక వాస్తవాలు విస్తుగొలుపుతాయి. ఉదాహరణకు, కొన్నిసార్లు ఫేస్క్రీమ్లలోని మెత్తదనానికి చిన్నారి చర్మపు ముక్కలే మూలమని, ఒక శాశ్వత యవ్వన ఇంజెక్షన్ వెనుక టీనేజ్ యువతుల దగ్గర నుంచి బలవంతంగా తీసిన అండాలను ఉపయోగిస్తారంటే ఎవ్వరూ నమ్మలేరు.కాని, ఇవన్నీ నిజమేనని రుజువు చేసే కథనాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. తల్లిదండ్రుల నుంచి దూరం చేసిన పిల్లలను బందీలుగా ఉంచి వారి శరీరాలను ప్రయోగశాలలాగా వాడేస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్, లక్నో ప్రాంతాల్లో పిల్లల చర్మం, రక్తం అమ్మడం ఒక వ్యాపారంలా మారిందని బయటపడింది. ఇక నేపాల్లో అయితే, చిన్నారులు, టీనేజ్ యువతుల చర్మపు ముక్కలు కోసి కాస్మెటిక్ ఉత్పత్తులుగా అమ్ముతున్న దారుణ నేరాన్ని పోలీసులు బయటపెట్టారు. ఇలా తెలియకుండానే అందం వెనుక దాగి ఉన్న ఆ భయంకర నిజాన్ని బయటివాళ్లు గ్రహించలేరు. ఎందుకంటే బయట మాత్రం ‘అందం కోసం అద్భుత రహస్యం’ అంటూ మెరుస్తున్న బోర్డులు మాత్రమే కనిపిస్తాయి. లోపల మాత్రం నిస్సహాయుల ఆర్తనాదాలు వినిపిస్తాయి. అందం అంటే కేవలం బాహ్య రూపం కాదు. అది సహజత్వం, ఆరోగ్యం, ఆనందాల కలయిక. శరీరానికి నిజంగా అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిదే కాని, ఫొటో ఫిల్టర్స్లో కనిపించే కృత్రిమ అవతారాలను వెంబడిస్తే, చివరికి మిగిలేది నిరాశ మాత్రమే! -
ఈ వారం కథ: బుగ్గ మీద పుట్టుమచ్చ
‘ఏంటి ఇంకా పడుకున్నావ్? చుట్టూ ఉన్నదంతా చెత్తే, సమాజం కుళ్లిపోయింది. ఈ కంపులో ఎలా నిద్ర పడుతోంది? లే.. లే.. లే..’ నిద్రలో ఎవరో కుదిపినట్టు అనిపిస్తే చటుక్కున లేచాడు సీతారామారావు.మనిషి సన్నగా, బీడు భూమిలో మొలిచిన బలహీనమైన మొక్కలా ఉంటాడు. ఆ కట్ బనీన్ , లుంగీలో మరింత పీలగా కనిపిస్తున్నాడు. అశాంతి, అనుమానం తన దగ్గరి బంధువుల్లా ఎప్పుడు పడితే అప్పుడు అతని జీవితంలోకి వచ్చేస్తుంటాయి. ఎప్పుడూ ఏవేవో ఆలోచనలతో కుస్తీ పడుతుంటాడు. మనిషి ఇక్కడ, కళ్లు ఎక్కడో, మనసు ఇంకెక్కడో..?!రాత్రి బాగా పొద్దుపోయాక పడుకొన్నాడేమో నిద్ర సరిపోలేదు. మండుతున్న కళ్లతోనే అలారం వంక చూశాడు. ఆరైతే మోగేదే. ఇంకా పది నిమిషాలుంది. అలారం పెడతాడే తప్ప, ఎప్పుడూ దానికంటే ముందే మేల్కొంటాడు.టక్.. టక్.. టక్...గడియారంలో చిన్న ముల్లు గోల పెడుతోంది. మంచం మీద భార్య శాంత ప్రశాంతంగా పడుకొంది. ఫ్యాను గాలికి ముంగురులు అటూ ఇటూ కదులుతున్నాయి. దుప్పటి మెడ వరకు కప్పుకొని, ఆదమరచి నిద్రపోతోంది. మరొకరైతే కాసేపు భార్య మొహాన్ని చూస్తూ రొమాంటిక్ మూడ్లోకి వెళ్లిపోయేవారు. సీతారామారావుకు ఇవేం పట్టవు. తన ఉద్యోగం, ఎదురవుతున్న మనుషులు, అర్థమవుతున్న నిజాలు అతన్ని యాంత్రికంగా మార్చేశాయి. కాని, భార్యపై విపరీతమైన ప్రేమ. చుట్టూ ఇంత నెగటివిటీ మధ్య తానో పాజిటివ్ వైబ్రేషన్ .ఎందుకో తాను చేస్తున్న ఉద్యోగం గుర్తొచ్చింది. అది జాబ్ కాదు, అతని ఎమోషన్స్ని విచ్ఛిన్నం చేసిన న్యూక్లియర్ బాంబ్. ఆ వృత్తి ఎందుకు ఎంచుకున్నానా అనే బాధ తనని ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంది.సీతారామారావు సీక్రెట్ ఏజెన్సీలో పని చేస్తుంటాడు. సీక్రెట్ ఏజెన్సీ అనగానే ఏదేదో ఊహించుకోవద్దు. అందులో అంతా జేమ్స్బాండ్స్లా సూటూ కోటూ వేసుకొని, స్టైల్గా ఇన్వెస్టిగేషన్ చేసే ఉద్యోగులే ఉండరు. గప్చుప్గా వాళ్లకు సహాయం చేసే సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. సీతారామారావు కూడా అంతే! తను బగ్ తయారు చేయడంలో స్పెషలిస్టు. చిన్న చిన్న మైక్రో కెమెరాలూ, స్పీకర్లూ అమర్చడం తన పని. పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీల కదలికలపై అనుమానం వచ్చినప్పుడు సీతారామారావు బగ్స్ అమర్చి వాళ్ల బండారాన్ని బయటపెడుతుంటాడు. రిస్ట్ వాచ్, ఫ్లవర్ వాజ్, చొక్కా గుండీ, రాళ్ల ఉంగరాలు, కూలింగ్ గ్లాసెస్– అన్నిట్లోనూ కెమెరాలే! వందలమంది నిజ స్వరూపాల్ని లోకానికి చూపించడంలోని అదృశ్య హస్తం సీతారామారావు. లేచి కిటికీ తలుపు మెల్లగా తీశాడు. సిగరెట్ వెలిగించి, ఆ పొగల మధ్య బయట ప్రపంచాన్ని చూశాడు. మనుషులు నవ్వుతూ పలకరించుకుంటున్నారు. ప్రేమతో మాట్లాడుకుంటున్నారు. ఆ నవ్వులు, ప్రేమలూ అన్నీ అవసరాల కోసమే! ఒక్కొక్కరికీ ఒక్కో సీక్రెట్ కెమెరా అమరిస్తే, వాళ్ల వికృత రూపాలు బయట పడతాయి. ఎందుకీ నటన? ఎవరి కోసం? సీతారామారావు మనసులో ఎప్పటి నుంచో నాటుకున్న ప్రశ్నలు ఇవి. వాటికి ఇంత వరకూ సమాధానం దొరకలేదు.టింగ్...సెల్ఫోన్ లో మెసేజ్ మోగింది.‘ఒకరి బుగ్గమీద పుట్టుమచ్చ పెట్టాలి. ఆఫీస్కు త్వరగా వచ్చేయ్’ తన పై ఆఫీసరు నుంచి సందేశం.‘బుగ్గమీద పుట్టుమచ్చ’– డిపార్ట్మెంట్ కోడ్ భాష. అంటే, ఎవరికో బగ్ పెట్టాలన్నమాట! ఈసారి ఎవరి నగ్నత్వం చూడాల్సివస్తుందో? కళ్లకు ఏవగింపు వచ్చింది. ఆఫీసరుకు ఫోన్ చేశాడు.‘హలో..’‘మెసేజ్ చూశా’‘ఇంకేం త్వరగా వచ్చేయ్. బోలెడు పని ఉంది. ఈ ఆపరేషన్ మనకు చాలా ఇంపార్టెంట్’.‘నా ప్రమోషన్ సంగతి ఏం చేశారు? ఈ ఉద్యోగం చేయలేకపోతున్నా. కనీసం నా భార్యకు కూడా నేనేం చేస్తున్నానో తెలీదు’.‘చూడు సీతా! ఈ డిపార్ట్మెంట్లో నీలాంటి సిన్సియర్ ఉద్యోగిని నేనింత వరకూ చూళ్లేదు. పైగా బగ్స్ పెట్టడం నీకు తప్ప ఇంకెవ్వరికీ చేతకాదు. గొడ్డులా కష్టపడతావ్. నీ వల్ల పెద్ద పెద్ద తిమింగలాలనే పట్టాం. నీకు కాకపోతే ఎవరికిస్తాం ప్రమోషన్ . ముందు ఆఫీసుకు బయల్దేరు. నువ్వు వచ్చేలోగా నీ ప్రమోషన్ సంగతి తేల్చేస్తా. క్విక్..’.ఫోన్ కట్ అయ్యింది.ఆరయ్యింది. అలారం మోగింది. శాంత బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ కళ్లు తెరిచింది.‘మీరెప్పుడు లేచారు?’‘ఇప్పుడే.. పది నిమిషాలైంది.’‘నన్నూ లేపొచ్చు కదా.. కాఫీ ఇచ్చేదాన్ని’‘పర్వాలేదు. నిద్ర సరిపోలేనట్టుంది. ఇంకాసేపు పడుకో!’‘లేదు.. శుక్రవారం కదా, గుడికెళ్లాలి. మీరూ వస్తారా?’‘నువ్వెళ్లు. నేను ఆఫీసుకు వెళ్లాలి. అర్జంటు పని పడింది.’‘ఆ.. ఆఫీసు.. పొద్దస్తమానూ ఆఫీసే. పెళ్లయి ఇంతకాలమైంది. ఏం ఉద్యోగం వెలగబెడుతున్నారో అర్థం కాదు. అప్పుడప్పుడూ మీరు నక్సలైటో, టెర్రరిస్టో అని అనుమానం కూడా వేస్తుంటుంది. ఆ కోడ్ భాషలూ మీరూనూ.. ఒక్క ముక్క కూడా బుర్రకెక్కి చావదు.’శాంత విసుక్కుంటోంది. ఏవేవో మాట్లాడుతోంది. సీతారామారావు మనసుకు పట్టడం లేదు. ఈసారి ఎవరికి బగ్ పెట్టాలి? ఎలా పెట్టాలి? ఇవే ఆలోచనలు. సగం కాలిన సిగరెట్ నడుం విరగ్గొట్టుకొంటూ యాష్ ట్రేలో పడింది.ఆఫీసులో అడుగు పెట్టగానే ఒకటే హడావుడి. బొకేలు, కేకులు, స్వీట్లూ, కంగ్రాచ్యులేషన్సూ, థ్యాంక్యూలూ. ఎందుకంటే... ప్రమోషన్ వచ్చింది. తనక్కాదు. తన కొలీగ్ ఉమా మహేశ్వరరావుకి.‘ఏంటి సార్ ఇది..’‘ఏమైంది’‘ప్రమోషన్ అన్నారు..’‘ఓ అదా.. ఉమ బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. రికమెండేషన్ గట్టిగా ఉంది. అందుకే ఈసారికి తనకు ఇచ్చేశాం. నెక్ట్స్ టైమ్ నువ్వే లే’‘ఇలా ఎన్నిసార్లు మోసపోవాలి..’‘ఏంటి సీతా? మరీ ఇంత ఎమోషనల్ అయిపోతే ఎలా? డిపార్ట్మెంట్ అన్నాక ఇలాంటివి మామూలే. చెప్పా కదా, హై రికమెండేషన్ అని. మళ్లీ కలుద్దాం. అవతల చాలా పని వుంది. ఆ.. అన్నట్టు మర్చిపోయా. సాయంత్రం తాజ్ బంజారాలో ఉమకి పార్టీ ఇస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి’.ఆఫీసరు వెళ్లిపోయాడు. ఆ క్యాబి¯Œ లో సీత ఒంటరిగా మిగిలిపోయాడు. మామూలుగా అయితే ఆ మాటలకు సీతారామారావు గుండెలు బద్దలైపోవాలి. కోపం, ఉక్రోషం తన్నుకు రావాలి. కాని, ఈ సమాజం గురించి, మనుషుల గురించి తనకు అందరికంటే కాస్త ఎక్కువ తెలుసు. అందుకే ఎలాంటి ఫీలింగ్ లేదు. అగ్గిపుల్ల భగ్గుమంది. సిగరెట్ తన ఒళ్లు కాల్చుకుంటూ పొగలు కక్కింది.∙∙ తాజ్ బంజారా– కొలీగ్స్ అందరి చేతుల్లోనూ గ్లాసులు ఘల్లుమంటున్నాయి. వాటికి పోటీ పడుతూ ఉమా మహేశ్వరరావు మొహం వెలిగిపోతోంది. ఎవరో బాస్కు మైక్ ఇచ్చారు.‘హలో.. హలో... అటెన్షన్ ఎవ్రీబడీ..’అందరి కళ్లూ అటు వైపు తిరిగాయి.‘మనందరి తరపున ఉమకు కంగ్రాచ్యులేషన్స్. తన హార్డ్ వర్క్కి, డెడికేషన్ కి దక్కిన గుర్తింపు ఇది. అసలు ఉమానే లేకపోతే మనం ఇన్ని కేసులు సాల్వ్ చేసేవాళ్లం కాదు. బ్ల... బ్ల... బ్ల...’అందరూ చప్పట్లు కొడుతున్నారు. మైకు చేతులు మారుతోంది. కాని, మాటలే మారడం లేదు.‘ఉమా మహేశ్వరరావు అంత వర్క్హాలిక్ను నేను ఎక్కడా చూళ్లేదు’ ఎవరో పొగుడుతున్నారు.‘ఉమకు ఈ ప్రమోషన్ చాలా తక్కువ. రాష్ట్రపతి అవార్డు ఇచ్చినా తప్పులేదు’ తాగిన మైకంలో ఒకరి పిచ్చి వాగుడు.అటు తిరిగి, ఇటు తిరిగి మైకు సీత చేతికి వచ్చింది. సీత ఏం మాట్లాడతాడో అని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. సీత మైకు తీసుకొన్నాడు.‘నేను పెద్దగా మాట్లాడనని మీకు తెలుసు. అందుకే నా భావాల్ని విజువల్స్ రూపంలో తీసుకొచ్చా’.మళ్లీ చప్పట్లు.‘ఈ ఆలోచన నాకెందుకు రాలేదబ్బా’ బాస్ ఫీలయ్యాడు. కళ్లన్నీ తెరపైకి మళ్లాయి. ఏవీ ప్లే అయ్యింది.ఉమా మహేశ్వరరావు వస్తాడనుకుంటే స్క్రీన్ పైకి బాస్ వచ్చాడు.‘ఈ ఉమగాడు ఉన్నాడు చూశారా? వీడికి పని చేయడం చేతకాదు. ఎప్పుడు చూడూ ఆ టైపిస్టు ముందు కూర్చుని కుళ్లు జోకులు వేస్తుంటాడు..’ఉమ గురించి బాస్ ఎవరితోనో మాట్లాడుతుంటే సీత క్యాప్చర్ చేసిన వీడియో అది. బాస్ సీత వైపు గుర్రుగా చూస్తున్నాడు. ఉమ మొహం మాడిపోయింది. కొలీగ్స్ అంతా ఘొల్లున నవ్వారు.‘నాకే బగ్ పెడతావా రాస్కెల్. నీ అంతు చూస్తా’ బాసు చేతిలోని గ్లాసు భళ్లుమంది. వెంటనే మరో విజువల్.‘రికమెండేషన్ తో ప్రమోషన్ తెచ్చుకోవడం కూడా గొప్పే! ఈ ప్రమోషన్ కోసం ఉమ ఎవడెవడి కాళ్లు పట్టుకొన్నాడో, ఎవడెవడి ... (అక్కడో బూతు మాట) నాకు తెలీదా’ ఇందాక రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని మైకులో గొంతుచించుకొన్న అతగాడి నిజ ‘స్వరం’.‘ఏంట్రా.. పిచ్చి పిచ్చిగా ఉందా? మా మాటలన్నీ దొంగచాటుగా రికార్డ్ చేస్తావా? నీ అంతు చూస్తా’ ఊగుతూనే సీతపైకి వచ్చేశాడు.తరవాత ఎవరి బండారం బయట పడుతుందో అని మిగిలిన వాళ్లంతా ఆత్రంగా తెరని మింగేసేలా చూస్తున్నారు.‘ఉమ పైకి పోజులు కొడతాడు కానీ, తేడాగాడండీ’,‘బంజారాహిల్స్లో వీడికి సెకండ్ సెటప్ ఉంది తెల్సా’,‘అసలు వీడు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించాడని నా డౌటు’ఒకొక్కరి మెదడులోంచి ఉమ బట్టలిప్పుకొని బయటకు వస్తున్నాడు. అందరూ తెల్లమొహాలు వేసేశారు. ఉమ తాజ్ బంజారా వదిలేసి చాలా సేపయ్యింది.‘సీతా.. ఆఫీసు పరువు మొత్తం గంగపాలు చేశావ్.. ఏంటిదంతా’ ఎవరో అరుస్తున్నారు.‘ఆపరేషన్ బుగ్గ మీద పుట్టుమచ్చ’ ఎగతాళిగా నవ్వాడు సీతా రామారావు.ఆ కోపంలో ఎవరో సీత చంప ఛెళ్లుమనిపించారు. బాస్ ఓ పిడిగుద్దు విసిరాడు. ఆ మందంతా మూకుమ్మడిగా సీతారామారావు మీద పడిపోయింది. తొక్కిసలాటలో సీత చొక్కా చిరిగింది. కళ్లజోడు కిందపడి ఒంటికాలిదయ్యింది. పెదవి చిట్లి రక్తం కారుతోంది. పడుతూ, లేస్తూ, ఒగరుస్తూ మళ్లీ మైకు అందుకొన్నాడు.‘ఇవీ ఫ్రెండ్స్ మనందరి అసలు స్వరూపాలు. ఎవరూ ఎవరితోనూ నీతిగా నిజాయితీగా ఉండడం లేదు. అలాంటి మనమంతా కలిసి మరొకరి కుళ్లుని తోడుతున్నాం.. షేమ్ షేమ్..’ సీత మాటలకు అందరి మైకం వదిలిపోతోంది.‘ఒరేయ్.. పిచ్చోడా లోకం అంతా ఇలానే ఉందిరా’‘అంటే మేమంతా వెధవలం. నువ్వు పత్తిత్తువా?’‘నీ పెళ్లానికి పెట్టకపోయావా కెమెరా.. ఎవరెవరితో తిరుగుతుందో తెలిసేది’ ఎవడో కారు కూత కూశాడు. మొదటిసారి సీతారామారావుకి నిజమైన కోపం వచ్చింది.‘ఏం కూశావ్ రా..’ సీత చేయి పైకెత్తాడు. కాని, అప్పటికే నలుగురు కలిసి సీతని వెనక్కి లాగేశారు. కింద పడేసి, కాళ్లతో తన్నుతున్నారు. జరుగుతున్న తతంగం గమనించి హోటల్ మేనేజ్మెంట్ అలర్ట్ అయ్యింది. సెక్యురిటీ గార్డులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. సీతని ఎవరో లేపి కూర్చోబెట్టారు. ఒకొక్కరుగా ఆ హాలు ఖాళీ చేస్తున్నారంతా. చివరికి సీత ఒక్కడే మిగిలాడు.‘కాస్త మంచి నీళ్లు తాగండి సార్..’ హోటల్ మేనేజర్ వాటర్ బాటిల్ అందించారు.‘ఓ పెగ్ కావాలి.. ఇస్తారా’పెగ్ ఏం ఖర్మ బాటిల్ ఖాళీ అయ్యింది.‘నీ పెళ్లానికి పెట్టకపోయావా బగ్.. ఎవడెవడితో తిరుగుతుందో తెలిసేది’ఈ మాటలే గిర్రున తన చుట్టూ తిరుగుతున్నాయి.‘నా శాంత తప్పు చేస్తుందా.. ఇంపాజిబుల్’ ఖాళీ బాటిల్ నేలనేసి కొట్టాడు సీత.‘నా శాంత తప్పు చేస్తుందా.. ఇంపాజిబుల్’ సీత తన డైరీలో ఆ రోజు రాసుకున్న చివరి వాక్యం. డైరీ తనకు ఓ స్వాంతన.ఈ ప్రపంచంలో తన భార్య తరవాత తనకు అంత నిజాయితీగా కనిపించేది ఆ డైరీనే.శాంత వంక చూశాడు. ఎప్పటిలానే చాలా ప్రశాంత వదనంతో తనని చూస్తోంది. ఆ రోజు చాలాసార్లు దగ్గరకు వచ్చి లాలించింది.‘ఏంటండీ.. ఎప్పుడూ లేనంత డల్గా కనిపిస్తున్నారు. ఆఫీసులో ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా..’‘కాఫీ పెట్టనా స్ట్రాంగ్గా’‘మీకు ఇష్టమైన చిక్కుడుకాయ కూర చేయనా’టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ కేరింగ్, ఆ ప్రేమ... సీతని ఇంకా ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.‘మనం జీవితంలో ఇంకా స్థిరపడలేదు, అప్పటి వరకూ పిల్లలొద్దు’ అంటే ఆగిపోయింది.‘నేను చేస్తున్న ఉద్యోగం ఏమిటన్నది నేను చెప్పేంత వరకూ అడక్కు’ అంటే ఆ మాటకు కట్టుబడిపోయింది.తనకు షాపింగులు లేవు. సినిమాలు షికార్లు లేవు. ఓ సగటు భార్య హక్కులన్నీ ఉద్యోగం పేరుతో సీత ఏనాడో కాలరాసేశాడు. అయినా భరించింది. అలాంటి శాంత తప్పు చేయడం ఏమిటి? నెవ్వర్.కాని పార్టీలో జరిగినదంతా కళ్ల ముందు కదులుతోంది. కొలీగ్స్ అన్న మాటలే తనని బాగా డిస్ట్రబ్ చేస్తున్నాయి.‘ప్రతీ నవ్వులోనూ, ప్రేమలోనూ కల్మషమే అని నమ్మావుగా. ఇప్పుడు నీ భార్యలో నీకు నిజాయతీ మాత్రమే కనిపిస్తోందా? తనని వెంటాడితే, తన తప్పులన్నీ తెలిసిపోతే, నీ నమ్మకం వమ్ము అయిపోతుందని భయమా. ఇప్పుడు పెట్టి చూడు నీ భార్య బుగ్గపై పుట్టుమచ్చ’ అంతరాత్మ వికృతంగా నవ్వుతోంది.ఇప్పుడు సీత ముందున్న మార్గాలు రెండే. ఒకటి అంతరాత్మని ఎదిరించి భార్యని గుడ్డిగా నమ్మడం. లేదంటే... శల్య పరీక్ష చేసి, తన భార్య గుణవంతురాలే అని అంతరాత్మకు రుజువు చేయడం. ఎందుకో రెండో మార్గమే బెటర్ అనిపించింది. ఆపరేషన్ మొదలైంది.‘ఆఫీసు పనిమీద అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నా. మూడ్రోజుల వరకూ రాను. ఈలోగా ఫోన్లు కూడా ఉండవు. సరేనా..’శాంతని అబద్ధాలతో బుజ్జగించి అదే ఊర్లోని ఓ థర్డ్ క్లాస్ లాడ్జిలో దిగబడ్డాడు సీత.అప్పటికే ఇంట్లో చాలా చిన్న చిన్న సీక్రెట్ కెమెరాలు అమర్చాడు. హాల్లో, బెడ్ రూమ్లో, మేడ మీద, వంటింట్లో, ఆఖరికి బాత్రూమ్లో కూడా. ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ మినిట్ టూ మినిట్ ఆ లాడ్జ్లో కూర్చుని లాప్టాప్ ద్వారా గమనిస్తూనే ఉన్నాడు.వంటింటికీ, పూజగదికీ సగం రోజు కేటాయిస్తోంది శాంత. టీవీ చూడడం, పడుకోవడం.. ఇదే దినచర్య.మొదటిరోజు చాలా భారంగా గడిచింది. రెండోరోజు తనపై తనకే కోపం వచ్చింది.‘ఇక చాల్లే వెళ్లిపోదాం’ అంటూ మనసు ఆరాట పడుతోంటే, ‘ఇంకెంత? ఒక్క రోజు ఆగొచ్చు కదా’ అంటూ అంతరాత్మ అడ్డుపడుతోంది.మూడోరోజు క్షణాలు యుగాల్లా దొర్లుతున్నాయి. తెల్లారితే ఇంటికి వెళ్లిపోవాలి. శాంతకు ‘సారీ’ చెప్పాలి. చెప్తాడు సరే, ‘ఎందుకు?’ అని అడిగితే, తన దగ్గర సమాధానం ఉంటుందా? కనీసం దగ్గరకు తీసుకొని గుండెకు హత్తుకోవాలి. కనీసం అలాగైనా తన గిల్టీ ఫీలింగ్ కాస్త తగ్గుతుంది. చాలారోజుల తరవాత ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు.ఆ రోజు మామూలుగా తెల్లారింది. పక్క మీద నుంచి హుషారుగా లేచాడు సీత. రెండంటే రెండు నిమిషాల్లో రెడీ అయిపోయాడు. ఇంటికి వెళ్లిపోవాలన్న ఆత్రంతో హడావుడిగా బట్టలు సర్దుకొన్నాడు. లాప్టాప్ క్లోజ్ చేసి, బ్యాగ్లో వేసుకుంటున్నప్పుడు, అంతరాత్మ ‘ఆగు...’ అంటూ బ్రేకేసింది.‘నీ ఉద్యోగ ధర్మం నువ్వు సక్రమంగానే నిర్వర్తించావా..’ అంటూ ప్రశ్నించింది.‘తప్పు జరగడానికి, దొంగ దొరకడానికి ఒక్క క్షణం చాలు.. నువ్వేమో రాత్రంతా ఆదమరచి పడుకున్నావు’ అంటూ ఇన్వెస్టిగేషన్ క్లాసుల్లో తాను నేర్చుకొన్న పాఠాలు తనని మళ్లీ అలర్ట్ చేశాయి.ఇష్టం లేకుండానే లాప్టాప్ తెరిచాడు. రాత్రి ఫుటేజీ ఒక్కసారి రివైండ్ చేశాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి.‘ఏ ఘోరం చూడకుండా కాపాడు దేవుడా’ ఎప్పుడూ నమ్మని దేవుడ్ని తొలిసారి మనసులోనే దండం పెట్టుకున్నాడు. కాని, దేవుడు మొర ఆలకించలేదు. రివెంజ్ తీర్చుకున్నాడు.తానెప్పటికీ చూడలేననుకున్న దృశ్యం ఒకటి కళ్ల ముందు ఆవిష్కృతమైంది.‘నీ భార్య ఎవడితో రంకు వెలగబెడుతుందో నీకు తెలుసా’ అనే ప్రశ్నకు దొరికిన సమాధానం అది.‘నీ పెళ్లానికి పెట్టకపోయావా కెమెరా’ అనే సవాలుకు పర్యావసానం అది.అవకాశం లేక కొంతమంది మంచివాళ్లుగా మిగిలిపోతారు అని తాను నమ్మిన సిద్ధాంతానికి మరో నిలువెత్తు సాక్ష్యం అది.‘శాంతా...’ఒక్కసారిగా అరిచాడు.సీత మనసు ఆకలిగా ఉన్న నాలుగు కుక్కలకు వీధిలో దొరికిన ఒంటరి విస్తరాకైంది.‘శాంతని చంపాలి’ ఇదే సీతారామారావు మిషన్ .తన పరిచయాల్ని వాడుకొని ఓ పిస్తోల్ తీసుకొన్నాడు. శాంత మరణానికి ముహూర్తం నిర్ణయించాడు. మరో రెండు రోజుల్లో శాంత పుట్టినరోజు. ఆ రోజే చంపేయాలి. ప్రతిరోజూ రాత్రి సరిగ్గా 12 గంటలకు పవర్ ఒక్కసారి ఆఫ్ అయి, ఆన్ అవ్వడం ఆ వీధిలో చాలా సాధారణంగా జరిగే విషయం. సరిగ్గా అప్పుడే శాంత నుదుటిమీద పాయింట్ బ్లాంక్లో పిస్తోల్ పేలాలి. అంతే. తన మనసులో శాంతపై పేరుకుపోయిన కోపం అంతా చల్లారిపోతుంది. తరవాత తాను ఏమైపోయినా పర్వాలేదు. అన్యమస్కంగానే ఇంటికి వెళ్లాడు.‘మూడ్రోజుల్లో ఇంత చిక్కిపోయారేంటండీ’‘ఈసారి మీరెక్కడికి వెళ్లినా నన్నూ తీసుకెళ్లండి. ఒంటరిగా ఉండడం నా వల్ల కాదు బాబోయ్’ శాంత నటన మొదలైంది.‘రేపే నా పుట్టిన రోజు.. ఏం గిఫ్ట్ ఇస్తున్నారు’ అంటూ పదే పదే అడుగుతుంటే,‘నీ చావు..’ అని గట్టిగా చెప్పాలనిపిస్తోంది. కాని, దాన్ని పెదవి అంచులపై అదిమి పెట్టుకొంటున్నాడు.టేబుల్ సొరుగులో ఉన్న పిస్తోల్ పదే పదే ‘నన్ను వాడేయ్.. వాడేయ్’ అంటూ గోల చేస్తోంది.సీత మనిషి మనిషిలా లేడు. ఏవో ఆలోచనలు వేధిస్తున్నాయి. ఎప్పుడూ డైరీలో ఏవో రాసుకొంటూ, గాల్లోకి పిచ్చి చూపులు విసిరేస్తున్నాడు.రాత్రయ్యింది. శాంత తలనొప్పంటూ పెందలాడే పడుకుంది. అలవాటు ప్రకారం కాసేపు డైరీ రాసుకొని, తానూ పక్కమీద వాలాడు. సమయం గడుస్తోంది.10 అయ్యింది.గడియారం 11వ గంట కొట్టింది.11.30 అయ్యింది.సరిగ్గా 12 గంటలకు కరెంట్ పోయింది. ప్లాన్ ప్రకారం ఆ గదిలో పిస్తోల్ శబ్దం వినించింది. ఓ చావుకేక గాల్లో కలిసిపోయింది. కరెంట్ వచ్చింది.కాని, చచ్చింది శాంత కాదు– సీత.చంపింది సీత కాదు– శాంత.గోడ మీద రక్తపు మరక. దుప్పటంతా ఎరుపు రంగు పులుముకుంది. పక్క మీద భర్త శవం. గదంతా నిశ్శబ్దం. శాంత కుర్చీలో కూర్చుని నిర్జీవంగా పడున్న భర్త వంక కళ్లార్పకుండా చూస్తోంది. చేతిలో పిస్తోల్ అలానే ఉంది.‘ఇందులో నా తప్పేముంది? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ . నేను బతకాలంటే మీరు చావాలి. నా దగ్గర ఇంకో మార్గం లేదు’ కళ్లతోనే భర్తతో మాట్లాడుతోంది.టక్.. టక్.. టక్ గడియారం చప్పుడు.శాంత తల తిప్పింది. డైరీ కనిపించింది. దాన్ని చేతుల్లోకి తీసుకొంది.‘మీ గురించి నాతో ఒక్కసారైనా చెప్పారా? ఈ డైరీ చెప్పింది. ఇతరుల డైరీ చదవడం తప్పే. కాని, మీరు నా ఇతరుల జాబితాలో లేరు’ నవ్వూ, ఏడుపూ కలగలిపిన భావోద్వేగం శాంతలో.‘ఈ పేజీలూ అక్షరాలూ నాతో మాట్లాడాయి. చస్తావా చంపుతావా అని బెదిరించాయి. ఏం చేయమంటారు’ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉంది.సడన్ గా శాంత కళ్లు డైరీలోని ఆఖరి పేజీ దగ్గర ఆగాయి. అంతకు ముందే తన భర్త రాసిన వాక్యాలు పలకరిస్తున్నాయి. ఈ డైరీలో శాంత చదవని పేజీ అదొక్కటే. శాంత కళ్లు ఆ అక్షరాల వెంట పరుగులు పెట్టాయి.‘సీక్రెట్ కెమెరా పెడితే భగవంతుడు కూడా తప్పు చేస్తూ దొరికి పోతాడని ఓ రోజు నా మిత్రుడు చెప్పాడు. అది నిజమే అని ఈరోజు అనిపిస్తోంది. నా కొలీగ్స్కి బగ్ పెట్టాను. వాళ్ల నిజ స్వరూపం వెలుగులోకి వచ్చింది. నా భార్యని రహస్యంగా వాచ్ చేశా. తన బలహీనత బయటపడింది. మరి నేనేం చేశాను? నేను శీలవంతుడ్నా? అందమైన అమ్మాయి కనిపిస్తే నా మనసు ఎన్ని వికృత చేష్టలు చేస్తుందో నాకు మాత్రమే తెలుసు. ఆ మానసిక వ్యభిచారం బయట పెట్టే కెమెరా ఎక్కడుంది? నేనేంటో తెలుసుకోవడానికి నాకు ప్రత్యేకంగా బగ్ అవసరం లేదే? అద్దం ముందు నిలబడితే నా అంతరాత్మ నన్ను కడిగేస్తుంది. నా తప్పుల తక్కెడ వేస్తుంది. నా నిజాయితీ, ఆత్మసాక్షి దాని ముందు తూగగలవా? ఈ ప్రపంచంలో అందరూ గురువింద గింజలే. తప్పు చేయని వాడికే ఎదుటి వాళ్ల తప్పుల్ని వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. నా భార్యని నేనెందుకు చంపాలి? ఆ హక్కు నాకు లేదు. వీలైతే మరింత ప్రేమిస్తా. రేపే ఉద్యోగానికి రాజీనామా చేస్తా. అదే నాకు నేను ఇచ్చుకొనే క్షమాభిక్ష..’తరువాత కూడా ఏదో రాసి ఉంది. అప్పటికే శాంత కళ్లని కన్నీటి పొరలు కమ్మేశాయి. ఇంకో అక్షరం చదివే ధైర్యం, ఇంకో నిమిషం బతికే అర్హత తనకు లేవనిపించాయి. భర్త వంక ఈసారి ప్రేమతో చూసింది. కళ్లతోనే క్షమాపణ అడిగింది. పిస్తోల్ నుదుటి మీద పెట్టుకొంది. అది ఆమె చివరి వీడ్కోలు.ఆ గదిలో మరో బుల్లెట్ పేలిన శబ్దం. -
ఈ సబ్బు క్యాన్సర్కు ఆన్సర్!
అందం కోసం వాడే సబ్బును ఒక బాలుడు క్యాన్సర్ వ్యాధి మీద ప్రయోగించే ఆయుధంగా మార్చాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని, ఇది నిజం. అమెరికాకు చెందిన పదిహేనేళ్ల హీమన్ బెకెలె తయారు చేసిన ఈ సబ్బు ప్రస్తుతం స్కిన్ క్యాన్సర్ రోగులకు వరంగా మారింది. ఈ ప్రత్యేకమైన సబ్బు చర్మంలోని రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరచి, క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఈ సబ్బు వాడితే చర్మంపై ఉన్న మలినాలకే కాదు, చర్మం లోపల చాపకింద నీరులా దాగి ఉన్న క్యాన్సర్ కణాలకు కూడా గుడ్బై చెప్పొచ్చు! కీమోథెరపీ, వేల కొద్దీ మాత్రలు అవసరం లేకుండా, ఒక చిన్న సబ్బుతోనే క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశోధనల దశలో ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు దీని పనితీరుపై విశ్వాసంతో ఉన్నారు. ఇది కచ్చితంగా ఉపయోగకరమైన ఫలితాలను ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అద్భుత ఆవిష్కరణకు గుర్తింపుగా హీమన్ బెకెలెకు టైమ్ మ్యాగజైన్ ‘2024 కిడ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. అంతేకాదు, ‘త్రీ ఎమ్ యంగ్ సైంటిస్టు’ చాలెంజ్లో పాల్గొని, పాతికవేల డాలర్లు (అంటే రూ. 21,82,600) నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఇంత డబ్బు వచ్చిందని పుస్తకాలకు గుడ్బై చెప్పలేదీ హీమ¯Œ . స్కూల్లో క్లాసులు, హోమ్వర్క్ల మధ్యలో కూడా ఫార్ములాలను కలిపి ఈ క్యాన్సర్ కిల్లింగ్ సబ్బు మీద తన పరిశోధనను కొనసాగిస్తున్నాడు. దీనిని త్వరలోనే పెద్దస్థాయిలో ఉత్పత్తి చేసి, అవసరమున్నవారికి ఉచితంగా అందించాలన్న ఆశయంతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలని కలలు కంటున్నాడు.అలా మొదలైంది!ఇంత చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప ఆలోచన రావడానికి ఓ గట్టి కారణం ఉంది. హీమన్ పుట్టిన ఇథియోపియాలో ప్రజలకు తగినన్ని వైద్య సౌకర్యాలు లేకపోవడాన్ని చిన్నప్పుడే గమనించాడు. అందుకే, ‘అందరికీ వైద్య సౌకర్యాలు అందాలంటే ఎలా?’అనే ప్రశ్నతో మొదలుపెట్టి, అందరికీ చౌకగా, సులభంగా చికిత్స అందించే మార్గాన్ని వెతికాడు. ఆ వెతుకులాట చివరకు బాత్రూమ్ షెల్ఫ్పై ఉన్న సాధారణ సబ్బు దగ్గర ఆగింది. అలా రోజూ వాడే సబ్బులో శాస్త్ర విజ్ఞానాన్ని, రసాయనాలను కలిపి, ఒక మహాశక్తిమంతమైన ఆయుధంగా మార్చేశాడు. -
ఏకదంతుడిగా వినాయకుడు
మహాశివుడు ప్రసాదించిన అస్త్ర శస్త్రాలతో, దివ్యకవచ ప్రభావంతో పరశురాముడు కార్తవీర్యార్జునుడిని, అతడి కుమారులను, సమస్త పరివారాన్నీ యుద్ధంలో వధించాడు. యుద్ధం ముగిసిన తర్వాత తన మిత్రుడు అకృతపర్ణుడితో కలసి సదాశివుడిని దర్శించుకోవాలని కైలాసానికి బయలుదేరాడు.ఆ సమయంలో శివపార్వతులు కైలాస మందిరంలో ఏకాంతంలో ఉన్నారు. మందిర ద్వారం వద్ద కాపలాగా వినాయకుడు, కుమారస్వామి ఉన్నారు.పరశురాముడు ద్వారం వద్ద శివపార్వతీ తనయులైన వినాయకుడు, కుమారస్వామిని చూసి వారికి నమస్కరించాడు. పక్కనే ఉన్న క్షేత్రపాలకులు నంది, భృంగి తదితరులకు నమస్కరించి, తన మిత్రుడు అకృతపర్ణుడితో కలసి నేరుగా లోపలకు ప్రవేశించబోయాడు. అది గమనించిన వినాయకుడు, ‘ఆగాగు! భార్గవరామా! ఆగు! లోపల మాతాపితరులు ఏకాంతంలో ఉన్నారు. నేను లోపలకు వెళ్లి వారి ఆజ్ఞ తీసుకుని వస్తాను. అంతవరకు ఇక్కడే నిలిచి ఉండు’ అని వారించాడు.‘సోదరా! నాకు అనుమతి ఎందుకు? నేనిప్పుడే వెళ్లి వారిని దర్శించుకుంటాను. భూలోకంలో కార్తవీర్యాది మహావీరులను మహాశివ వరప్రసాదంతో యుద్ధంలో సంహరించి వచ్చాను. వారికి ఈ విషయమే చెప్పి, ఆశీస్సులు తీసుకుని పోతాను’ అని పలికి పరశురాముడు, అకృతపర్ణుడితో కలసి చొరవగా ముందుకు నడిచాడు.‘పరశురామా! మాతా పితరుల ఏకాంతానికి భంగం కలిగించడం దోషం. కాసేపు ఓపిక పట్టు’ మృదువుగా చెప్పాడు వినాయకుడు.‘నేనూ శివుడికి పుత్రసమానుడినే! నాకు అనుమతి అవసరం లేదు’ అని పలికి, ద్వారం తలుపులు తోసుకుని అకృతపర్ణుడితో కలసి లోపలకు అడుగు పెట్టాడు.పరశురాముడి దురుసుతనానికి వినాయకుడిలో సహనం నశించింది. వారిద్దరినీ చెరో జబ్బ పట్టుకుని, లాగి అవతలకు పడేశాడు.పరశురాముడికి కోపం వచ్చింది.వినాయకుడి మీదకు గండ్రగొడ్డలి ఎత్తాడు. వినాయకుడు లాఘవంగా ఆ చేతిని ఒడిసి పట్టుకున్నాడు. అలాగే అమాంతంగా పరశురాముణ్ణి పైకి లేపాడు. తనతో పాటే ఏడు ఊర్ధ్వలోకాలకు, తర్వాత ఏడు అధోలోకాలకు తిప్పాడు. అక్కడి నుంచి మళ్లీ ఊర్ధ్వలోకాలకు తీసుకుపోయి, ఒక సరోవరంలోకి విసిరేశాడు.పరశురాముడు భయభ్రాంతుడయ్యాడు. తనను రక్షించమంటూ వినాయకుడిని వేడుకున్నాడు.జాలితలచిన వినాయకుడు అతడిని తిరిగి కైలాస ద్వారం ముందుకు తీసుకువచ్చి, విడిచిపెట్టాడు. యథాస్థితికి వచ్చినందుకు పరశురాముడు ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, తనను పరాభవించిన వినాయకుడి మీద కోపంతో రగిలిపోయాడు. కోపాన్ని అణచుకోలేక తన చేతిలోని పరశువును వినాయకుడి మీదకు విసిరాడు.పరశురాముడి చేతిలోని పరశువు అజేయమైనది. పరమేశ్వరుడు స్వయంగా అనుగ్రహించిన ఆయుధం అది. దానికి తిరుగులేదు. తండ్రి ప్రసాదించిన పరశువును గౌరవించి, వినాయకుడు దానికి తన ఎడమ దంతాన్ని తాకించాడు.పరశువు తాకిడికి వినాయకుడి ఎడమదంతం నేలరాలింది. దంతం నేలపడగానే భూమి కంపించింది. దంతం నుంచి కారిన రక్తంతో నేల తడిసింది. ఈ దృశ్యం చూసి, కుమారస్వామి, ప్రమధ గణాలు పెద్దగా రోదించడం మొదలుపెట్టారు. ఈ అలజడికి పార్వతీ పరమేశ్వరులు బయటకు వచ్చారు.రక్తసిక్తమైన ముఖంతో ఏకదంతుడిగా కనిపించిన కుమారుడిని చూసి పార్వతీదేవి చలించిపోయింది. ఏం జరిగిందంటూ కుమారస్వామిని అడిగింది. అతడు జరిగినదంతా చెప్పాడు. అది విన్న పార్వతికి కోపం వచ్చింది.‘చూశారా నాథా! మీ శిష్యుడైన భార్గవుడు మీరిచ్చిన ఆయుధాన్ని మీ కుమారుడి మీదనే ప్రయోగించాడు. నాకు ఇంతకన్నా అవమానం లేదు. నేను నా తనయులను తీసుకుని మా పుట్టింటికి పోతాను’ అని కోపంగా పలికి, రుసరుసా లోపలకు పోయింది. ఆమె మాటలు విన్న పరమశివుడు సంధానకర్తలైన రాధాకృష్ణులను స్మరించాడు. వారు తక్షణమే ప్రత్యక్షమయ్యారు. వారికి విషయమంతా చెప్పి, ఎలాగైనా పార్వతీదేవికి నచ్చజెప్పమని కోరాడు.రాధాకృష్ణులు లోపలకు రావడంతో పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం పలికింది. వెనుకనే పరశురాముడు వచ్చి, పార్వతీదేవి పాదాల ముందు సాష్టాంగపడి క్షమించమంటూ అభ్యర్థించాడు. అయినా పార్వతీదేవి కోపం చల్లారలేదు. అతడిని మన్నించలేదు.అప్పుడు శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుని, ‘పార్వతీ! నీ వంటి జగన్మాతకు కోపం తగదు. ఈ పరశురాముడు కూడా నీకు పుత్రసమానుడే! అపరాధం చేసినందుకు పశ్చాత్తాపంతో బాధపడుతూ పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు. ఇకనైనా కాస్త కనికరించి, ఇతణ్ణి క్షమించవమ్మా! ఏకదంతుడైనంత మాత్రాన నీ కుమారుడి కీర్తికి మచ్చ రాదులే!’ అని నచ్చజెప్పాడు.పార్వతీదేవి శాంతించి, పరశురాముడిని క్షమించింది. అప్పటి నుంచి వినాయకుడు ఏకదంతుడిగా పూజలందుకోసాగాడు.∙సాంఖ్యాయన -
క్రెడిట్ లాగితే కాల్ దొరికింది
తీగ లాగితే డొంక కదిలినట్లు క్రెడిట్ కార్డ్స్ క్లోనింగ్ గురించి ఆరా తీస్తే, అంతర్జాతీయ కాల్ డైవర్షన్ వ్యవహారం బయటపడింది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు 2009లో ఈ అనుభవం ఎదురైంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, అసాంఘిక శక్తులకు సహకరిస్తున్న ఈ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.సాధారణంగా విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్పై భద్రతా సంస్థల నిఘా ఉంటుంది. అనుమానాస్పద కాల్స్ వచ్చే నంబర్లను అవసరమైతే టాప్ చేస్తుంటారు కూడా! అంతర్జాతీయ కాల్స్పై నిఘా కోసం వాడే ఉపకరణాలు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్వే లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్డీ) ఆపరేటర్ల వద్ద ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే కాల్స్ అక్కడి ఎక్స్చేంజ్ లేదా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్కు చేరుతాయి. అక్కడి నుంచి ఐఎల్డీ ఆపరేటర్కు వచ్చి, ఆపై ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇవి ఢిల్లీ, ముంబై, చెన్నై కోల్కతాలలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్వే ఆఫ్ ఐఎల్డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్స్చేంజీల ద్వారా ఇక్కడ రిసీవ్ చేసుకునే ఫోన్కు వస్తుంది.సర్వీస్ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్వే ఆఫ్ ఐఎల్డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు నిర్ణీత మొత్తాలు చెల్లిస్తారు. ్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకునే ఈ సంస్థలు తమ ఆదాయం నుంచి నిర్దేశిత మొత్తాన్ని పన్నుగా చెల్లిస్తాయి. విదేశీ ఆపరేటర్లు ఇక్కడి వారికి డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించేలా కొన్నేళ్ల కిందట కాల్ డైవర్షన్ పద్ధతిని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంతమందికి సోషల్ మీడియా ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తుంటారు. ఇలా ఈ బాక్సులు ఏర్పాటైన తర్వాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్వే ఆపరేటర్కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మార్చేస్తారు. దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారి వద్ద ఏర్పాటు చేయించిన బాక్సులకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే Vó ట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్డబ్ల్యూటీగా పిలిచే పరికరాలకు చేరుతుంది. స్థానికంగా తీసుకున్న సిమ్కార్డులను ఈ సీడీఎమ్ఏ ఎఫ్డబ్ల్యూటీల్లో నిక్షిప్తం చేస్తారు. విదేశీ గేట్వే నుంచి డేటా రూపంలో వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్గా మారిపోయి, అందులో నిక్షిప్తం చేసిన సిమ్కార్డు నంబరు నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వ్యక్తికి చేరుతుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి కాల్ చార్జీలు తగ్గుతాయి. వాట్సాప్ నిషేధం ఉన్న దేశాల నుంచి ఈ కాల్స్ ఎక్కువగా చేస్తుంటారు. ఫలితంగా దేశంలోని ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను దెబ్బతింటాయి. దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్స్ ఆ మొత్తాన్ని మిగుల్చుకుని, ఇక్కడ పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులకు హవాలా రూపంలో కమీషన్ పంపిస్తుంటారు.విదేశాల్లో ఉంటున్న ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్స్తో ఈ–మెయిల్ ద్వారా పరిచయం పెంచుకున్న హైదరాబాదీలు వి.రమేష్, మహ్మద్ అబ్దుల్ ఖదీర్, ఆర్డీ శ్రీనివాస్, నజీబ్ అహ్మద్ ఖాన్ కాల్ డైవర్షన్కు సహకరించడానికి అంగీకరించారు. వీరు హైదరాబాద్లోని రెండు ప్రాంతాల్లో గేట్వేలతో కూడిన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వినియోగించే సిమ్కార్డులను మారుపేర్లతో సంగ్రహించారు. వాటి బిల్లులు చెల్లించడానికి క్లోనింగ్ చేసిన క్రెడిట్ కార్డులను వినియోగించారు. ఇలాంటి కాల్ డైవర్షన్స్ను ఎక్కువగా వాట్సాప్ నిషేధంగా ఉన్న దేశాల్లో ఉంటున్న వారితో పాటు ఉగ్రవాదులు, మాఫియా కార్యకలాపాలు సాగించేవారు వాడుతున్నారు. ఈ విధానంలో ఫోన్ ఎక్కడ నుంచి వస్తోందనేది తెలుసుకోవడం స్థానికంగా డైవర్షన్ పరికరాలు ఏర్పాటు చేసిన వారికీ సాధ్యం కాదు. ఈ ముఠా టాస్క్ఫోర్స్ పోలీసులకు చిత్రంగా చిక్కింది. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు 2009 జనవరి 29న సికింద్రాబాద్ ప్రాంతంలో తిరుగుతున్నారని, క్లోనింగ్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారని ఓ కానిస్టేబుల్కు సమాచారం అందింది. ఆయన ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వి.రమేష్, మహ్మద్ ఖుద్దూస్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తమకు క్లోనింగ్ క్రెడిట్ కార్డులను ముంబైకి చెందిన ముగ్గురు వ్యక్తులు అందిస్తున్నారంటూ బయటపెట్టారు. వీటితో షాపింగ్స్ చేస్తున్నామని చెప్పారు. వీరిని అరెస్టు చేయడానికి సిద్ధపడ్డ పోలీసులు, వీరి వస్తువులను సోదా చేశారు. రమేష్ దగ్గర లభించిన ఓ పుస్తకంలో సీడీఎమ్ఏ ఫోన్కు చెందిన ‘9298’ సిరీస్తో సీరియల్గా 20కి పైగా నంబర్లు కనిపించాయి. వీటిని చూసి అనుమానించిన పోలీసులు కాస్త లోతుగా విచారించారు. ఫలితంగా పంజగుట్టలోని సఫైర్ అపార్ట్మెంట్స్, మాసబ్ట్యాంక్లోని మహేశ్వరి కాంప్లెక్స్ల్లో అత్యాధునిక ఉపకరణాలు ఏర్పాటు చేసి, అంతర్జాతీయ ఇన్కమింగ్ కాల్స్ను లోకల్స్గా మారుస్తూ జరుగుతున్న కాల్ డైవర్షన్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతాల్లో దాడి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితులను పట్టుకుని, కాల్ డైవర్షన్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.· -
విభీషణుడికి వినాయకుడి పరీక్ష
రామ రావణ యుద్ధంలో చివరకు రావణుడు హతమయ్యాడు. రావణుడి అంత్యక్రియల తర్వాత రాముడు విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ తర్వాత యుద్ధంలో తనకు సాయం చేసిన సుగ్రీవ ఆంజనేయ, అంగదాది వానర ప్రముఖులను, విభీషణుడిని వెంటబెట్టుకుని సీతా లక్ష్మణ సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు.అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది.పట్టాభిషేకం పూర్తయిన తర్వాత కొన్నాళ్లు రాముడి ఆతిథ్యం స్వీకరించిన వారంతా తమ తమ నెలవులకు తిరిగి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. యుద్ధంలో తనకు సహకరించిన వానర ప్రముఖులందరికీ రాముడు స్వర్ణాభరణాలు సహా అనేక విలువైన కానుకలను ఇచ్చి సాగనంపాడు.రావణుడికి సోదరుడై ఉన్నప్పటికీ, యుద్ధంలో తన పక్షాన నిలిచిన విభీషణుడికి సాగనంపేటప్పుడు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకున్నాడు. అందుకని తమ ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుడి విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చాడు.విభీషణుడికి శ్రీరంగనాథుడి విగ్రహాన్ని అందిస్తూ, ‘విభీషణా! ఇది మా ఇలవేల్పు శ్రీరంగనాథుడి విగ్రహం. నీ రాజ్యానికి శ్రీరంగనాథుడి అనుగ్రహం ఉండాలని దీనిని నీకు ఇస్తున్నాను. నీ ప్రయాణంలో ఈ విగ్రహాన్ని ఎక్కడా నేల మీద విడిచిపెట్టకు. అలా విడిచిపెడితే, ఈ విగ్రహం అక్కడికక్కడే పాతుకుపోతుంది. దీనిని తిరిగి తరలించడం అసాధ్యం’ అని చెప్పాడు.‘సరే’నని చెప్పి, రాముడి వద్ద వీడ్కోలు తీసుకుని, విభీషణుడు లంకకు తిరుగు ప్రయాణమయ్యాడు. దక్షిణ దిశగా లంక వైపు సాగించిన ప్రయాణంలో కావేరీ తీరానికి చేరుకున్నాడు.దారిలో ఎదురైన పవిత్ర కావేరీ నదిలో స్నానం చేయాలని తలచాడు విభీషణుడు. అయితే, విగ్రహాన్ని నేలపై ఉంచరాదని రాముడు చెప్పిన మాట అతడికి గుర్తుకు వచ్చింది. స్నానం చేసి వచ్చేంత వరకు ఎవరైనా విగ్రహాన్ని పట్టుకునేవారు దొరుకుతారేమోనని వెదకసాగాడు.విభీషణుడు అలా కావేరీ తీరం వెంబడి వెదుకుతూ నడుస్తుండగా, కొంత దూరంలో ఒక బాల బ్రహ్మచారి కనిపించాడు.విభీషణుడు ఆ బాల బ్రహ్మచారిని పిలిచాడు.అతడు విభీషణుడి దగ్గరకు వచ్చి నిలిచాడు.‘బాలకా! నేను ఈ పవిత్ర కావేరీ జలాలలో స్నానం చేసి, సంధ్య వార్చుకోవాలనుకుంటున్నాను. నా చేతనున్న ఈ విగ్రహాన్ని నేల మీద పెట్టకూడదని నియమం ఉంది. అందువల్ల నేను స్నానం చేసి తిరిగి వచ్చేంత వరకు దీనిని పట్టుకోగలవా?’ అభ్యర్థనగా అడిగాడు విభీషణుడు.‘విగ్రహాన్ని పట్టుకుంటాను గాని, ఒక షరతు’ అన్నాడా బాల బ్రహ్మచారి దర్పంగా విభీషణుడికేసి చూస్తూ.‘ఏమిటా షరతు’ అడిగాడు విభీషణుడు.‘నాకు బోలెడు పనులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ సేపు ఉండలేను. నువ్వు త్వరగా స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని వచ్చేయాలి. నాకు కాలాతీతమైతే నిన్ను మూడుసార్లు పిలుస్తాను. నేను మూడోసారి పిలిచే సరికి నువ్వు వచ్చి, విగ్రహాన్ని తీసుకోవాలి. లేకుంటే, ఇక్కడ ఆ విగ్రహాన్ని ఉంచి వెళ్లిపోతాను’ చెప్పాడు బాలబ్రహ్మచారి.‘సరే’నంటూ విభీషణుడు విగ్రహాన్ని ఆ బాలకుడికి అప్పగించి, స్నాన సంధ్యల కోసం నదికి వెళ్లాడు.విభీషణుడు నదిలోకి ఇలా దిగాడో లేదో, ‘ఇదిగో, పెద్దమనిషీ! తొందరగా వచ్చేసేయ్. నాకు సమయం మించిపోతోంది’ అంటూ కేకవేశాడు.విభీషణుడు స్నానం ముగించుకునే లోపునే రెండోసారి కేక వేశాడు.సంధ్యవార్చుకుంటూ ఉండగా, మూడోసారి కేక వేశాడు. విభీషణుడు పరుగు పరుగున వచ్చేలోగానే ఆ బాల బ్రహ్మచారి విగ్రహాన్ని నేల మీద ఉంచి, చక చకా నడుచుకుంటూ ముందుకు సాగాడు. శ్రీరంగనాథుడి విగ్రహం అక్కడే నేలలోకి పాతుకుపోయింది.విగ్రహాన్ని పైకెత్తడానికి విభీషణుడు తన బలమంతా ఉపయోగించి ప్రయత్నించాడు. అతడి ప్రయత్నం విఫలమైంది.రాముడు ఇచ్చిన విగ్రహాన్ని లంకకు తీసుకుపోలేని తన నిస్సహాయతకు అతడికి అంతులేని ఆవేదన ముంచుకొచ్చింది. అంతలోనే విగ్రహాన్ని నిర్లక్ష్యంగా ఉంచేసి వెళ్లిపోతున్న బాలబ్రహ్మచారి మీద పట్టరాని కోపం తన్నుకొచ్చింది. అతడిని నెత్తి మీద ఒక్కటిచ్చుకుని బుద్ధి చెప్పాలనుకుని, వడి వడిగా బాల బ్రహ్మచారిని అనుసరించాడు. అది గమనించిన బాల బ్రహ్మచారి పరుగందుకున్నాడు. విభీషణుడు కూడా పరుగున వెంబడించాడు. బాల బ్రహ్మచారి రూపంలో ఉన్న వినాయకుడు సమీపంలోని పర్వత శిఖరానికి చేరుకుని, తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. ‘విభీషణా! చింతించకు. విష్ణువు విగ్రహాన్ని దక్షిణంగా ఉంచే ఆచారం ఎక్కడా లేకున్నా, నీ లంకా రాజ్యానికి తన ఆశీస్సులు కురిపించేలా నేను విగ్రహాన్ని దక్షిణం వైపు ఉంచాను’ అని పలికాడు. విభీషణుడు తన ప్రాప్తమింతేననుకుని లంకకు బయలుదేరాడు.∙సాంఖ్యాయన -
సామాన్యుడు విసిరిన సవాల్!
ప్రముఖ కంపెనీలు తమ వెబ్సైట్లు, డేటాబేస్ పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగాలకు ఏర్పాటు చేసుకుంటాయి. వీటిలో నిపుణులను నియమించుకుని రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తుంటాయి. ఆయా వెబ్సైట్లలో ఉన్న లోపాలను, హ్యాకింగ్కు ఆస్కారాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సరిదిద్దేందుకు ఈ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ పని చేస్తుంటాయి. అలాంటిది ఏకంగా విదేశాంగ శాఖ అధీనంలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం వెబ్సైట్ను ఒక డిప్లొమా హోల్డర్ హ్యాక్ చేసి, సవాలు విసిరారు. సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం 2010లో అత్యవసరంగా పాస్పోర్టులు పొందాలనుకునే వారి కోసం తత్కాల్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. దీని కింద దరఖాస్తుదార్లు కేవలం ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. పెద్ద సంఖ్యలో స్లాట్స్ ఇస్తుండటంతో పనిభారం పెరిగిన పాస్పోర్ట్ కార్యాలయం ఆ ఏడాది ఫిబ్రవరిలో వాటి సంఖ్యను 350కి పరిమితం చేయడంతో తత్కాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని భావించిన చాలామందికి నిరాశే ఎదురయ్యేది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు దళారులు ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటకు చెందిన లతాధర్రావు ద్వారా హ్యాకింగ్ కథ నడిపారు. కంప్యూటర్ అప్లికేషన్స్లో పీజీ డిప్లొమా పూర్తి చేసిన గోరంట్ల లతాధర్రావు అప్పట్లో నరసరావుపేటలో లలితా ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడు టీపీ వర్క్ కూడా చేస్తుండటంతో ఆ పనిలో భాగంగా అక్కడి గాంధీచౌక్లో ఆకాశ్ ట్రావెల్స్ నిర్వహించే షేక్ సుభానీతో పరిచయం ఏర్పడింది. లతాధర్కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో తన వద్దకు వచ్చే పాస్పోర్ట్ అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి సుభానీ ఇతని సాయం తీసుకునేవాడు. ప్రతిఫలంగా ఒక్కో అప్లికేషన్కు రూ.100 చొప్పున చెల్లించేవాడు. అప్పట్లో పాస్పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేసే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ చేపట్టేది. తత్కాల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన ఆన్లైన్ స్లాట్స్ను 2010 ఫిబ్రవరి నుంచి తగ్గించారు. దీంతో ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలని భావించిన వారు దళారులను ఆశ్రయించడం ప్రారంభించారు. త్వరగా ఆన్లైన్ స్లాట్ ఇప్పిస్తే భారీ మొత్తాలను చెల్లించడానికి ముందుకు వచ్చేవారు. దీంతో పాస్పోర్ట్ వెబ్సైట్ను హ్యాక్ చేసి స్లాట్స్ బ్లాక్ చేయాలన్న ఆలోచన లతాధర్, సుభానీలకు వచ్చింది. తన కంప్యూటర్ పరిజ్ఞానంతో లతాధర్ ఈ పని చేశాడు. వెబ్సైట్లోకి హ్యాకింగ్ ద్వారా ఎంటర్ అయిన లతాధర్ దాని నుంచి నేరుగా ఎన్ఐసీ సర్వర్కు కనెక్ట్ అయ్యేవాడు. రోజూ స్లాట్స్ విడుదల చేసే సమయంలో ఇతరుల లాగాన్లో మార్పులు చేసేవాడు. తమను ఆశ్రయించిన వారి అప్లికేషన్స్ అప్లోడ్ చేశాకనే మిగిలిన స్లాట్స్ను ఫ్రీ చేసేవాడు. నరసరావుపేటకు చెందిన సుభానీ, లతాధర్ల ద్వారా ఆన్లైన్ స్లాట్స్ వేగంగా దొరుకుతుండటం, పాస్పోర్ట్ అపాయింట్మెంట్స్ వస్తుండటంతో హైదరాబాద్కు చెందిన పాస్పోర్ట్ ఏజెంట్లు మహ్మద్ జహంగీర్, భూమా శ్రీహరి, గిడ్డా చిన్నా, సయ్యద్ వలీయుద్దీన్, కె.పెంచల్రెడ్డి, ఖలీమ్, శ్రీనివాస్లు వీరికి సబ్–ఏజెంట్స్గా మారిపోయారు. తత్కాల్ పాస్పోర్ట్స్ కోసం తమను ఆశ్రయించే వారి దరఖాస్తులను ఈ–మెయిల్ ద్వారా వారిద్దరికీ పంపడం ప్రారంభించారు. ఈ వ్యవహారాన్నే వ్యాపారంగా చేసుకున్న ‘లతాధర్ అండ్ కో’ దరఖాస్తుదారుల నుంచి భారీగా వసూలు చేసింది. సాధారణంగా తత్కాల్ దరఖాస్తుకు అప్పట్లో రూ.2 వేలు చెల్లిస్తే సరిపోయేది. అయితే ఈ ముఠా సభ్యులు మాత్రం అదనంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసేవారు. ఈ మొత్తంలో రూ.1000 నుంచి రూ.2000 వరకు సుభానీకి ఇచ్చే వారు. అతను ముఠా సూత్రధారి అయిన లతాధర్కు రూ.500 నుంచి రూ.1000 వరకు కమిషన్ అందించే వాడు. ఈ రకంగా లతాధర్ గ్యాంగ్ కేవలం రెండు నెల్లలో మూడువేల తత్కాల్ పాస్పోర్ట్ దరఖాస్తులు అప్లోడ్ చేశారు. అప్పట్లో సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం చుట్టూ దాదాపు 20 మంది ఏజెంట్లు ఉండేవారు. ఆన్లైన్ బుకింగ్ స్లాట్స్ సంఖ్య తగ్గించినప్పటి నుంచి వీరిలో కేవలం జహంగీర్, శ్రీహరి, చిన్నా, వలీయుద్దీన్, పెంచల్రెడ్డిలకు మాత్రమే స్లాట్స్ దొరుకుతున్నాయని టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వరుసగా ఇలాగే జరుగుతుండటంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీరిపై నిఘా పెంచిన టాస్క్ఫోర్స్ పోలీసులు జహంగీర్కు చెందిన కంప్యూటర్ను సైబర్ నైపుణ్యం కలిగిన పోలీసులతో తనిఖీ చేయించారు. ఈ కంప్యూటర్ను ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్లు గుర్తించేందుకు వీలు లేకుండా ప్రాక్సీ ఐపీలతో వాడుతున్నట్లు గుర్తించారు. మరోపక్క అనేక పాస్పోర్ట్ ఆన్లైన్ దరఖాస్తులు ఫార్వర్డ్ చేయకుండా ఫిల్ చేసి సిద్ధంగా ఉంచడాన్ని కూడా గుర్తించారు. దీంతో జహంగీర్ను అదుపులోకి తీసుకుని విచారించారు.పాస్పోర్ట్ దరఖాస్తులను ఈ–మెయిల్ ద్వారా నరసరావుపేటకు చెందిన సుభానీకి పంపుతున్నట్లు జహంగీర్ చెప్పడంతో అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం సుభానీని విచారించగా, లతాధర్రావు సహాయంతో చేస్తున్న పనిని బయటపెట్టాడు. లతాధర్రావును అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు విచారించగా ఆన్లైన్ స్లాట్స్ కేటాయింపునకు ఉపయోగపడే పాస్పోర్ట్ వెబ్సైట్కు చెందిన సోర్స్ కోడ్ను హ్యాక్ చేయడం ద్వారా స్లాట్స్ బ్లాక్ చేసి, వాటిని తమ ఏజెంట్ల ద్వారా ఫిల్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు లతాధర్రావు, సుభానీ, జహంగీర్లతో సహా ఏడుగురు నిందితులకు 2010 జూన్ 4న అరెస్టు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడిన పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు వెబ్సైట్లో లోపాలు లేకుండా సరిచేసి పకడ్బందీగా తయారు చేశారు.· -
ఈ వారం కథ: ఓ కాయ కాస్తోంది!
‘తుంటిమీద కొడితే మూతి పళ్ళు రాల్తాయా?’ అని ఎవరైనా అడిగితే, ఇదివరకైతే అందరిలాగే ‘‘అలా ఎలా రాలతాయండీ’’ అంటూ దబాయించేసేది ముద్రిక. ఇప్పుడడిగితే, అనుమానంగా చూసి, ‘రాలినా రాలవచ్చు’ అంటోంది! అనుభవం అలాగుంది మరి!కాకపోతే, పుట్టింట్లో ఆమె అక్క పురుడు జరిగితే, అదే సమయంలో మెట్టినిల్లు పీలికల పందిరి అయిపోవటం ఏమిటి?అదేమని ఎవర్ని అడగటానికి ఏముందీ, వాళ్ళాయన నిర్వాకమే అలా ఉన్నప్పుడు?తల పట్టుకు కూర్చుంది ముద్రిక, తన విభుడితో తలపడేదెలాగో, తగవు తెగేదెలాగో తోచక!‘‘నాకు ఆరోగ్యం బాగుండటంలేదే. ఓ రోజు లేస్తే, రెండు రోజులు పడకేస్తున్నాను. ఇటు మీ అక్కనేమో డెలివరీ అయ్యేదాకా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు. చిన్నవాళ్ళు, మిమ్మల్ని విడదీయటం భావ్యం కాదు గాని, తప్పటం లేదు. అల్లుడుగారు ఒప్పుకుంటే, ఈ నాలుగు నెలలూ ఇక్కడికి వచ్చి, అక్క ఓ పాపని ఎత్తుకునే దాకా సాయం చేయగలవా?’’ అని నాలుగు నెలల క్రితం అడిగింది ముద్రిక తల్లి.ముద్రికకి అక్క అంటే చాలా ప్రేమ. పసివయసు నుంచి ఒక్క క్షణం విడిచి ఉండేవాళ్లు కాదు. అక్కకు పెళ్ళై, వెళ్లిపోతున్నప్పుడు ఇద్దరూ గుండెలవిసేలా ఏడ్చారు.‘‘మూడేళ్ల నుంచి, పిల్లలు కలగటంలేదని చింతలో మునిగిపోయిన అక్కకి, ఇన్నాళ్ళకి శుభ ఘడియలు వస్తుంటే, సాయం చేయకుండా ఎలా ఉంటాను? మనం కాస్త ఇబ్బంది పడదాం సుబ్బూ!’’ అంది బెంగ పడుతున్న భర్తతో.శుభప్రదమైన కార్యం కోసం వెళ్తున్నాననుకుంది గానీ, ఉపద్రవం ముంచుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు.విధి విధానం అదే కదా!ఈ నాలుగూ నెలలలోనూ, రెండుసార్లు వచ్చివెళ్ళాడు సుబ్బారావు. వచ్చిన ప్రతిసారీ ఒక్క రోజు మాత్రమే ఉండి వెళ్ళాడు. ఇంకొక్క రోజయినా ఉండమని బ్రతిమాలినా, ‘అమ్మో– నీళ్ళు–నీళ్ళు’ అంటూ కాళ్ళు చెప్పుల్లో దూర్చుకుని పారిపోయేవాడు.‘‘ఎలా ఉంటున్నావ్ సుబ్బూ’’ అని శయ్యా గృహంలో గుండెల మీద తలపెట్టుకుని ముద్రిక బెంగగా అడిగితే, ‘తలపెట్టుకున్న కార్యంలో తల మునకలవుతున్నానని’ చెప్పేవాడు. ఆ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నంచేసే తీరికలేక, దొరికిన ఆ కాస్త సమయాన్నీ సద్వినియోగం చేసుకునే కార్యంలో మునిగిపోయేది ముద్రిక.కార్య నిర్వహణానంతరం, నిద్రలో కూరుకుపోయి ఏవేవో కలవరించేవాడు సుబ్రావు.‘అదిగదిగో చిగురింత’ అనేవాడు.‘బుజ్జిముండలు లుకలుకలాడుతున్నాయి’ అని నిద్రలోనే నవ్వుకునేవాడు.‘అంత బావుందా పానీయం? లొట్టలు వేస్తున్నారు?’ అనేవాడు.సగం సగం వినబడే ఈ కొత్తరకం పలవరింతలు అర్థమయ్యేవి కావు ముద్రికకి. ఆమె సీరియస్గా తీసుకోలేదు.కష్టకాలం ముంచుకొస్తుంటే, ఇష్ట సఖుడి మాటలైనా సరే, అర్థంకావు కదా!అక్కకి పండంటి కొడుకు పుట్టాక, ఘనంగా జరిగిన బాలసారెకి వచ్చిన మొగుడితో కలిసి వెనక్కు బయల్దేరింది ముద్రిక. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఏదో తేడా కొట్టింది. కిచెన్లోకి వెడుతూనే స్పష్టంగా తెలిసింది.కిచెన్ కమ్ డైనింగ్ రూమ్ సగానికి సగం కుంచించుకుపోయి దర్శనమిచ్చింది. ఆనుకుని ఉండే బాల్కనీ ‘సుబ్బ’రంగా రెట్టింపయి కనిపించింది. పెరిగిన బాల్కనీలో కాలు పెట్టే చోటు కూడా లేకుండా చిన్నవీ, పెద్దవీ మట్టికుండీలు!‘‘ఏమిటిది సుబ్బూ, ఏమిటిదంతా?’’ అయోమయంగా అడిగింది.‘‘కనిపిస్తోందిగా, కిచెన్ గోడ ఇవతలికి జరిపించి, బాల్కనీ వైశాల్యం పెంచేశాను. ఆరోగ్య మహాభాగ్యానికై పెరటి కూరల పెంపకం.’’‘‘ఇదేమిటీ కొత్త వెర్రి?’’ కోపంగా అడిగింది.‘‘నువ్వు వెళ్ళాక, నా మానాన నేను మాడిపోయిన వంట తింటున్నానా, అది చూసి జాలిపడ్డ మా కొలీగ్ మిరియాల్రావ్ నన్ను ఓ ఆదివారం లంచ్కి పిలిచాడు. భోజనంలో వాళ్ళావిడ వడ్డించిన కూరలు నా జిహ్వను గిచ్చి లేపాయి. గుత్తి వంకాయలు నోట్లో కరిగిపోయాయి. కూరలోని బెండకాయలు అంత వేపినా, ‘తగ్గేదిలే’ అంటూ ఆకుపచ్చగా నవనవలాడుతూనే ఉన్నాయి. మడిలోంచి నేరుగా పులుసులో పడితే, కొత్తిమీర ఘుమ ఘుమ అంతగా పెరిగిపోతుందని అవాళే తెలిసొచ్చింది.‘చెల్లెమ్మ వంట అదుర్స్’ అన్నాను తిని లేస్తూ.‘నాదేముంది అన్నయ్యగారూ, రుచి అంతా కూరగాయల్లోనే ఉంది’ అంది చెల్లెమ్మ చిరుగర్వానికి, వినయం చొక్కా తగిలిస్తూ. అప్పుడు తీసుకెళ్ళి చూపించాడు మిరియాల్రావ్ – పెరటి తోట వైభవం. వంగ, బెండ మొక్కలు, దొండ, బీర పాదులు! ఇంకా ఆకుకూరలు– మైక్రో గ్రీ¯Œ ్స అనబడే బుల్లి మొలకలు– ఆహా... అలాగే కోసుకుని, నోట్లో వేసుకోవాలనిపించింది! ఇలా మొత్తం లిస్టు చదివితే, కూరగాయల బండి వాడి కేక గుర్తుకు వస్తుంది నీకు. అపుడు అర్థమయింది నాకు, నా వంట ఎందుకలా అఘోరిస్తోందో! నేరం నాది కాదు – కూరలది! బజార్లో దొరికే కూరల్లో రుచి ఉండట్లేదు, పురుగులు, పుచ్చులు తప్ప. ఆకు కూరలు కొంటే వాటినిండా మచ్చలు, చిల్లులు. మిరియాల్రావ్ ఒక్క పూటే భోజనం పెట్టినా, జీవితకాల భోజనానికి తగ్గ హితబోధ చేసిపారేశాడు.‘శ్రీమతి పుట్టింటికి వెళ్ళినా, ఏ సుబ్బయ్యనీ ఆశ్రయించలేదు నువ్వు. సుబ్బరంగా వొండుకు తింటూ ‘సుబ్బ’రావనే పేరుని సార్థకం చేసుకున్నావు. అంటే, నీకు ఆరోగ్య స్పృహ నిండుగా ఉందన్నమాట. ఇంత స్పృహ ఉన్న నువ్వు ఇక రెండో స్టెప్పు తీసుకోవాలి. బయటి వంటలకే కాదు, బయటి కూరగాయలకి కూడా నీ కిచెన్లో ప్రవేశించే అవకాశం లేకుండా చేయాలి. అప్పుడే, నీ ఆరోగ్యం వంద సంవత్సరాల పాటు వర్ధిల్లుతుంది. పెరటి తోట కోసం పడే శ్రమ, మానసికంగా కూడా ఉల్లాసం ఇస్తుంది. మెంటల్ హెల్త్ అన్నమాట. ఇన్ని లాభాలూ అతి తక్కువ ఖర్చుతోనే! పనికిరావని పారేసే వ్యర్థాలు, మనం మెలకువగా పట్టుకుంటే, పని తీరు ప్రదర్శిస్తాయి! అమలు చేయి నేడు, అనుభవించి చూడు.’మిరియాల్రావ్ సలహాకి పడిపోయాను. మనకి పెరడు లేదు గనుక, బాల్కనీని డిసైడ్ చేసేశాను.ఒంటి రాతి పార్టిషన్ గోడ పడగొట్టి ఇవతలికి జరపటానికి, నాలుగు రోజులు కూడా పట్టలేదు. వెంటనే కుండీలు, మొక్కలు, విత్తనాలు సమస్తం సమకూర్చేశాను – మన వంటింటి తోట రెడీ!’చెప్పటం ఆపాడు సుబ్రావు. ముద్రిక పరిశీలనగా చూసింది. కుండీలన్నిటిలోనూ ఏవేవో మొక్కలు. కొన్ని ఎండిపోతూ, కొన్ని వంగిపోయీ!.‘‘ఇదేమిటీ? ఏ మొక్కకీ పిందెలన్నా లేవు?’’పగలబడి నవ్వాడు సుబ్రావు.‘‘వెనకటికి ఓ అమ్మాయి అశ్వత్థ ప్రదక్షిణం చేస్తూ, అడుగడుక్కీ కడుపు తడిమి చూసుకుందట! అలా ఉందినీ హడావిడి. కాస్తాయ్, కాస్తాయ్. తొందర పడితే అవుతాయా పనులు. ఎంతటి మహర్షి అయినా, తపస్సులో కూర్చోగానే వరం పొందలేడు. పుట్టలు కట్టాలి– జడలు పెరగాలి– ఎన్ని సినిమాలలో చూళ్ళేదూ?’’అతడి ధోరణి సాగిపోతూనే ఉంది.‘‘మొక్కలన్నాక తెగుళ్ళుంటాయ్. పోషణ చూసుకోవాలి. పిచ్చి మొహాలు– ఒక్క పూట నీరు పెట్టకపోతే, దిగాలు పడి చూస్తాయ్. వేళ్ళ కింది నేల గట్టిపడిపోతే, లోపలికి పాకలేక విలవిల్లాడిపోతాయి. పురుగులు పట్టుకుంటే, గిలగిల్లాడతాయి. ఎన్ని ఉంటాయి వాటికి బాధలు! అన్నీ మనమే చూసుకోవాలి.’’అతడిని అతడి ధోరణికి వదిలి లోపలికి వెళ్ళిపోయింది ముద్రిక.మర్నాడు తెల్లవారకముందే గుప్పున వస్తున్న దుర్వాసనకి మెలకువొచ్చిన ముద్రికకి.ప్రక్కనే ఉండే సుబ్రావ్ కనిపించలేదు. ముక్కుకి చున్నీ అడ్డంపెట్టుకుని వాసన వస్తున్నవైపు నడిచింది.అది బాల్కనీలోకి దారితీసింది. అక్కడ సుబ్రావు మూతికి, ముక్కుకీ కలిపి ఓ గుడ్డ చుట్టుకుని, రెండు లీటర్ల ప్లాస్టిక్ సీసాలోంచి, సదరు దుర్వాసనకి హక్కుదారు అయిన నల్లటి ద్రావకం బయటకు తీస్తున్నాడు.‘‘యాక్. ఏమిటిదీ?’’ అనడిగింది ముఖం వికారంగా పెట్టిన ముద్రిక.‘‘అయ్యో, అలా అసయ్యించుకోకూడదు. ఇదేం పరాయి పదార్థం కాదు. మన పళ్ల తొక్కులు, కూరగాయల తొక్కులు, మిగిలిపోయిన కూరముక్కలు, మనం పూజ చేసి తీసేసిన పూలు... వీటన్నిటిని ఇలా ఓ రెండువారాలు ఈ బాటిల్లో బంధించి ఉంచితే, మన మొక్కలకి ప్రియాతి ప్రియమైన పానీయం తయారవుతుంది. అదే ఇది. ఇవిగివిగో చూశావా, ఈ బాటిల్లో... లుకలుకలాడుతున్నాయి బుజ్జి ముండలు... ఇవి రైతు నేస్తం పురుగులు. ఇవి వొచ్చేశాయంటే, ఇంక మన ద్రావకం ముదిరినట్టే. నేలలోకి చొచ్చుకుపోయి, గుల్లబారుస్తూ, మొక్కల వేళ్ళకి దారి చేస్తాయి ఇవి. ఒక లీటరు నీళ్ళలో వంద గ్రాముల పానీయాన్ని గనక కలిపి, మొక్కలకి తాగించామంటే ...’’ముక్కుతో పాటు చెవులు కూడా మూసుకుని లోపలికి పరుగెత్తింది ముద్రిక. తల తిప్పుకుని, తన పనిలో పడిపోయాడు సుబ్రావు.మర్నాడు మధ్యాహ్నం కునుకు తీస్తున్న ముద్రికని బెల్లు కొట్టి లేపాడు అమెజాన్ వీరుడు.‘ఏం తెప్పించాడబ్బా ఈ మహానుభావుడు?’ అనుకుంటూ వెళ్లి సుబ్రావు పేరుమీదున్న పార్సిల్ అందుకుంది.తొమ్మిదొందల డెబ్భై రూపాయలు వసూలు చేసుకుపోయాడు వాడు. తెరిచి చూసిన ముద్రిక తెల్లబోయింది.పాకెట్లో వేపాకులు!‘వేపాకులు అమెజాన్ నుంచి? ఏం చేసుకుంటారు? ఇవీ మొక్కలకేనా?’‘‘అవును. వీటిని మిక్సీలో గ్రైండ్ చేసి, వేపాకు ముద్ద నీళ్ళలో కలిపి, ఒక రాత్రి నిద్ర చేయిస్తే, మహత్తరమైన పురుగుల మందు తయారవుతుంది. నిద్ర చేసిన వేపరసాన్ని వడగట్టి, ఆ పసరు నిలవ చేసుకోవచ్చు. వారానికి ఒకసారి వంద గ్రాముల వేప పసరు ఒక లీటరు నీళ్ళలో కలిపి...’’సాయంత్రం రాగానే, ప్యాకెట్ విషయం చెప్పిన అర్ధాంగికి వివరించబోయిన సుబ్రావు ముద్రిక సగంలోనే నిష్క్రమించిన వైనం గమనించి నిట్టూర్చాడు –‘దీనికి మొక్కలమీద ఎప్పటికి ప్రేమ ఏర్పడేనో... ఏమో..’నాలుగు రోజుల తరవాత పొద్దునే వచ్చింది రావమ్మ ,‘‘తెచ్చావా రావమ్మా’’ అన్నాడు సుబ్రావు తలుపు తీసి.‘‘ఆయ్...’’ అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్ సంచిలో తెచ్చిన ఆవుపేడ అందించింది రావమ్మ. మరో బాటిల్ విడిగా ఇస్తూ, ‘‘మూత్రవండి’’ అంది.బెడ్రూమ్లోంచి వచ్చిన ముద్రికకి చెప్పాడు సుబ్రావ్,‘‘ఏం లేదు. తాజా గోమయం, గోమూత్రం తెప్పించాను. ఈ రెండింటినీ కలిపి తొట్టెలో పోసి, ఆరారగా కర్రతో కలియతిప్పుతూ మూడు నిద్రలు చేయిస్తే, భేషయిన ఫెర్టిలైజర్ తయారౌతుంది. దాన్ని నాలుగింతల నీటిలో కలిపి....’’‘‘మనమేమైనా ఓ ఎకరం పొలం కొంటున్నామా? ఎందుకింత హడావిడి? ఒక్క మొక్క అయినా పైకి వచ్చి, కాయ కాయలేదు.’’‘‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు పెద్దలు. పెరటి తోటే కదా అని అశ్రద్ధ చేస్తే, ఫలసాయమూ అలాగే ఉంటుంది. శ్రద్ధ తీసుకోవటానికి ఎకరాలే అక్కర్లేదు. శ్రద్ధగా పెంచాలన్న మనసుంటే చాలు.’’‘‘కావచ్చు. కానీ, మన టూ బెడ్ రూమ్ ఫ్లాట్లో ఎరువుల తయారీ పెడితే, ఫ్లాటంతా కంపు కొడుతోంది కదా!’’అనునయంగా చెప్పాలని చూసింది.‘‘చూడు ముద్రీ, మన రైతన్నలు ఇలాగే కంపుకి జడిసి, దూరంగా ఉంటే, మన నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళేవా? మనం ఈ మాత్రమైనా చేసి, వారి బాట మనకి పూబాట అని చాటనవసరం లేదా?’’భర్త అంత హెవీ డైలాగులు చెప్తుంటే, భరించలేక సీన్లోంచి నిష్క్రమించింది ముద్రిక.అంతటితో ఆగలేదు. ఆ ఆదివారం పెద్ద దుకాణమే పెట్టుక్కూర్చున్నాడు సుబ్రావ్.ముద్రిక కన్నా ముందే కిచెన్లోకి దూరాడు. అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు కలిపి, నీళ్ళు పోస్తూ మిక్సీలో మెత్తగా రుబ్బాడు. ఆ మిశ్రమాన్ని ఒక పెద్ద బాటిల్లో నింపి, 3ఎ సొల్యూషన్ అని రాసి పెట్టుకున్నాడు.ఆ ఘాటుకి కళ్ళు మండి, ముక్కులోంచి, చెవులలోంచి పొగలు వచ్చి, ఫ్రేమ్లోంచి పారిపోయింది ముద్రిక.తరవాత ఒక గిన్నెలో ముందే సిద్ధంగా ఉంచుకున్న అరటికాయ, పండు తొక్కల్ని, ఉల్లి పొట్టుని వేసి, నీళ్ళు పోసి, అరగంట సేపు బాగా ఉడకబెట్టాడు.మధ్యలో వచ్చింది ముద్రిక, ‘‘ ఏమిటి సుబ్బూ, ఇవేళ బ్రేక్ఫాస్ట్ నువ్వే తయారు చేస్తున్నావా?’’‘‘బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్. మనక్కాదు, మొక్కలకి. ఇవేళ్టికి కాదు, పై వారానికి.’’ సీరియస్గా చెప్పాడు సుబ్రావ్, తల తిప్పకుండా.తల కొట్టుకు వెళ్లిపోయింది ముద్రిక, స్విగ్గీకి ఫలహారాల ఆర్డరు పెట్టటానికి.అదేం పట్టించుకోకుండా, మరిగిన నీళ్ళని వడగట్టి మరో బాటిల్లో నింపాడు. ఉత్సాహంగా హాల్లోకి వచ్చి చెప్పాడు,‘‘మొక్కలకి ఊరగాయలు రెడీ! ఈ ద్రావకాలు ఏటికేడాదీ నిలవ వుంటాయి. రెండు వారాల కొకసారి లీటరు నీళ్ళలో వంద గ్రాముల ద్రావకం కలిపి, మొక్కలకి పోశామనుకో, లొట్టలేసుకుంటూ తాగుతాయి. దిట్టంగా పెరుగుతాయి.’’జవాబు చెప్పలేదు ముద్రిక – ఆ తరవాత కూడా, చాలా రోజుల దాకా! సుబ్రావు కిచెన్ తోట పెంపకం సాగుతూనే ఉంది – కిచెన్లోంచి రకరకాల పోషకాలు వెళ్తూనే ఉన్నాయి. ఇంకా తోటలోంచి వంటలోకి దిగుబడులు మాత్రం మొదలు కాలేదు, ఎప్పుడన్నా ఓ కొత్తిమీర ఆకు, నాలుగు మెంతి ఆకులు తప్ప. ఒక వంగ చెట్టు తాడెత్తున పెరిగింది గాని, అది పోతు మొక్క అన్నారు. దానికి విగ్రహపుష్టి తప్ప, ఒక్క పువ్వు కూడా పూయలేదు, ఒక్క కొమ్మక్కూడా కడుపు పండలేదు! బెండ మొక్కలు పెరిగాయి గానీ, వాటి కాయలు కంచంలోకి వచ్చే ముందే, పురుగులు ఎగరేసుకు పోయాయి – ముక్కలు గిల్లుకుంటూ. వేసిన సేంద్రియ ఎరువులు ఎటు పోయాయో తెలియదు.‘ఇలా కాదు – ఇలా కాదు’ అనుకున్నాడు సుబ్రావు, ‘ఇంకా ఏదో చేయాలి’ అని గొణుక్కున్నాడు.‘ఏదో చేయాలి’ అన్న విషయంతో ముద్రిక కూడా ఏకీభవించింది.‘పెరటి తోట పెంపకం– హరిత విప్లవం– పర్యావరణ పరిరక్షణ – ఆలోచనలన్నీ మంచివే. అయితే, వంద అడుగుల చదరంలో వెయ్యి మొక్కలు పెంచటం, లీటర్ల కొద్దీ ద్రావకాలు పొయ్యటం, ఉన్న రెండు గదుల్లోనూ కంపు కొట్టే సంచులు నింపటం... మొక్కలతో పాటు మన ఆరోగ్యం కూడా కాస్త చూసుకోవాలి కదా! కన్ను సైజుని బట్టే కదా కాటుక పెట్టుకోవాలి!’ అనుకుంది.‘తిన్నంత తేలిక కాదు కూరలు వండటం – కొన్నంత తేలిక కాదు వాటిని పెంచడం’ అన్న విషయం ఇతగాడికి ఎలా తెలియచెప్పాలబ్బా?’ఏం చేయాలో ఓ క్లారిటీ వచ్చేసరికి, కాలమూ కలిసొచ్చింది – బహు విధాలా!వారం రోజుల కోసం హెడ్డాఫీసుకి టూరు వెళ్ళిన సుబ్రావు తిరిగి వచ్చేసరికి సీను మారిపోయింది.బాల్కనీలో ఒక్క కుండీ లేదు. అంతా చదునుగా విశాలంగా ఉంది. మట్టి కొట్టుకు మాసిపోయిన పాలరాతి పలకలు బయటపడి మెరుస్తూ కనుపించాయి.‘‘మై గాడ్! నా కుండీలు, నా మొక్కలు...’’ అంటూ చిందులు తొక్కబోయాడు సుబ్రావు.గోముగా అతడి భుజంమీద తలపెట్టి, తలపెట్టిన పథకం చెప్పేసింది ముద్రిక.‘‘ఇదీ ఆరోగ్య ప్రణాళికే సుబ్బూ! రేపు వచ్చే బుల్లి సుబ్బారావు ఈ బాల్కనీలోనే పాకుతూ పెరగాలి. ఈ మట్టిలోనూ, కుండీల మధ్య ఎలా.. అందుకే నేను వీటిని తీయించేసి, బాల్కనీ కడిగించేశాను.’’ఒక్క క్షణం ఒళ్ళు మండిపోయింది– ఆనక ఆమె మాటలు స్లో మోషన్లో బుర్రలోకి చొరబడ్డాయి. కొండలమాటు చంద్రబింబంలా సుబ్రావు ముఖం మీదికి నెమ్మది నెమ్మదిగా విస్మయంతో కూడిన చిరునవ్వు ఎక్కి వచ్చింది.‘‘అహ్హో .. ఒహ్హో .. అంటే... మనకో బుల్లి సుబ్రావు...’’‘‘మరో ఏడు నెలల్లో...’’ జవాబు చెప్తూ గబుక్కున సిగ్గుపడి, సుబ్రావు ఎదనే ముఖానికి కప్పేసుకుంది ముద్రిక. సుబ్రావు ఉత్తేజితుడైపోయాడు– ‘ఓ కాయ కాస్తోంది!’ఒక వంగ చెట్టు తాడెత్తున పెరిగింది గాని, అది పోతు మొక్క అన్నారు. దానికి విగ్రహ పుష్టి తప్ప, ఒక్క పువ్వు కూడా పూయలేదు, ఒక్క కొమ్మక్కూడా కడుపు పండలేదు! బెండ మొక్కలు పెరిగాయి గానీ, వాటి కాయలు కంచంలోకి వచ్చే ముందే, పురుగులు ఎగరేసుకు పోయాయి.నాదేముంది అన్నయ్యగారూ, రుచి అంతా కూరగాయల్లోనే ఉంది’ అంది చెల్లెమ్మ చిరుగర్వానికి, వినయం చొక్కా తగిలిస్తూ. అప్పుడు తీసుకెళ్ళి చూపించాడు మిరియాల్రావ్ – పెరటి తోట వైభవం. -
జపానీ జిందగీ
మనిషై పుట్టాక ఊహించని ఉత్పాతాలు, ఉలిదెబ్బలు, ఉలికిపాటులు తప్పవు! అందుకే ‘మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి సుఖము లేదంతే’ అన్నారు ఆత్రేయ! అయితే ‘మనసు ఉండాలే కాని, సుఖశాంతులను మనంతట మనమే సొంతం చేసుకోవచ్చు’ అంటున్నారు జపనీయులు.‘మదిలో ఎంత అనురాగం నిండితే అంత వైరాగ్యం’ ఇది మనిషిని స్థిరచిత్తుడిగా మార్చగలిగే గొప్ప మంత్రం! కానీ రాగద్వేషాల నియంత్రణలో ఓటమి లేని కథలు చాలా అరుదు! కాలంతో పరుగులు తీయడం, కాలం రాయని రాతల కోసం తహతహలాడటం, గడచిపోయిన గతాన్ని పదేపదే విశ్లేషించుకోవడం, మిగిలి ఉన్న వయసుని లెక్కలేసుకోవడం ఇవే, ఇవే మనిషికి తీరని వేదనలు. వాటికి తోడు మరణ భయం! ఆ భయం ఊహ తెలిసినప్పటి నుంచి వేధించే మనోగతం! అదెప్పటికీ తప్పని, తప్పించుకోలేని జీవన చక్రం! మనిషిని, మనసునీ అతలాకుతలం చేసే ఆ నిర్వేదం నుంచి బయటపడటానికే ఇప్పుడు ప్రపంచమంతా జపనీయుల వైపు చూస్తోంది. వారు అవలంబించే కొన్ని జీవన విధానాలు మనసుని కుదుటపరుస్తాయట. మనిషిని ఆనందకేళిలో విహరింపజేస్తాయట! అసలేంటా జపాన్ సిద్ధాంతాలు? అవి అంత గొప్పవా?సంతృప్తికరమైన జీవితాన్ని పొందడానికి జపాన్ లో చాలా సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రస్తుతం ప్రపంచవాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఇంచుమించు ఒకేలాంటి భావాలతో, లోతైన అర్థాలతో రూపొందిన వారి జీవిన విధానం గొప్ప తాత్వికతకు నిదర్శనం! వాటిలో కొన్ని, శతాబ్దాల నాటి సంస్కృతిలో ముడిపడినవి కాగా, మరికొన్ని ఆధునిక జీవనశైలితో తలపడేవి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆ జీవన విధానాలు వేస్తున్న బాటలేంటీ?జీవితంలో అహ్లాదాన్ని నింపుకోవడానికి జపనీస్ తత్త్వశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోవాలంటే.. ముందుగా అక్కడ అత్యంత ప్రాచుర్యం పొందిన ‘ఇకిగాయ్’ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఇకిగాయ్లో ‘ఇకి’ అంటే జీవితం, ‘గాయ్’ అంటే విలువ లేదా ప్రయోజనం. ఇది జీవితానికి ఒక కారణాన్ని, ఉద్దేశ్యాన్ని ముందుగానే నిర్ధేశించుకోమని చెబుతుంది. రోజు మొదలయ్యేందుకు ఒక కారణాన్ని ఏర్పరచుకుని ప్రయాణించడం ఉత్తమమని బోధిస్తుంది. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి. ఆ నాలుగింటినీ ఒకదానితో ఒకటి మిళితం చేసుకోగలిగినప్పుడు మనం ఇకిగాయ్ అనే లక్ష్యాన్ని సాధించినట్లే. అందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నాలుగు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.‘మీరు దేనిని ప్రేమిస్తారు?’ అనేది మొదటి ప్రశ్న. దానికి అనుబంధంగా మీ అభిరుచులు, హాబీలు, ఏ పని చేసినప్పుడు మీరు సమయం గురించి మర్చిపోగలరు? సంతోషంగా ఉండగలరు? అనే అంశాలన్నీ ఆ ప్రశ్నతో పాటే ఉద్భవిస్తాయి. ‘మీ నుంచి ప్రపంచానికి ఏం అవసరం?’ అనేది రెండవ ప్రశ్న. దానిలో భాగంగా ‘మీ చుట్టూ ఉన్న సమాజానికి లేదా ప్రపంచానికి మీరు ఎలా సహాయపడగలరు? ఏ సమస్యలను పరిష్కరించగలరు? సమాజంలో దేన్ని సరిచేయగలరు?’ అనే అంశాలు తోడవుతాయి. ‘మీరు దేనిలో సమర్థులు?’ ఇది మూడవ ప్రశ్న. దానికి అనుబంధంగా మీ నైపుణ్యాలు, ప్రతిభ, మీకు సహజంగా వచ్చే పనులు అన్నీ లెక్కలోకి వస్తాయి.‘దేని నుంచి మీరు డబ్బు పొందగలరు? లేదా సంపాదించుకోగలరు’ ఇది నాలుగవ ప్రశ్న. ఈ ప్రశ్నతో ఇకిగాయ్ సంపూర్ణమవుతుంది. దీనిలో మీ నైపుణ్యాలు, ప్రతిభలను ఉపయోగించి మీరు జీవనోపాధిని ఎలా పొందగలరు?’ అనేది నిర్థారించుకోవచ్చు. ‘ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు దొరికి, ఒకదానితో ఒకటి కలిసే చోట, మీ ఇకిగాయ్ ఏర్పడుతుందని జపనీస్ సంస్కృతి చెబుతుంది.జపాన్ లో, ముఖ్యంగా ఒకినావా వంటి ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు నూరేళ్లకు పైగా, సంతోషంగా జీవిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇకిగాయ్ అని అక్కడి వారు చెబుతున్నారు. తమ జీవితానికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉండటం వల్లే, వారు రోజూ ఉత్సాహంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారట.మా అనేది రెండు వస్తువుల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని లేదా రెండు సంఘటనల మధ్య ఉన్న విరామాన్ని సూచిస్తుంది. ఆ ఖాళీకి కూడా విలువ ఉంటుందని, ఇది కేవలం శూన్యం కాదని జపనీయులు నమ్ముతారు. సంగీతంలో రెండు స్వరాల మధ్య ఉండే నిశ్శబ్దం, మాటల మధ్య ఏర్పడే చిన్నపాటి విరామం.. ఇవన్నీ ఇందుకు ఉదాహరణలుగా ఈ సిద్ధాంతం చెబుతుంది. మా అనేది ఆలోచించడానికి, ప్రతిబింబించడానికి, అర్థాన్ని కనుగొనడానికి కొంత శూన్యాన్ని సృష్టిస్తుంది. ఆ శూన్యమే మనసుని తేలిక పరుస్తుందని ఈ సిద్ధాంత సారాంశం. జీవితంలో తొందరపడకుండా, ప్రతి క్షణాన్ని ఆస్వాదించమని చెప్పడమే మా ఉద్దేశం.నూరేళ్ల జీవనంప్రపంచ ఆరోగ్య లెక్కల ప్రకారం భారతీయుల సగటు ఆయుర్ధాయం 69 నుంచి 70 సంవత్సరాలు. 80 నుంచి 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తున్న వారి దేశాల జాబితాలో జపాన్ ముందువరసలో ఉంది! అయితే మలిదశలో కూడా జపనీయులు చాలా సంతోషంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారట! అందుకు వారి జీవన విధానమే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.జపనీయులు ఎల్లప్పుడూ బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ని పాటిస్తారు. ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు ఆరోగ్య సంస్థలు పనిచేస్తుంటాయి. అవి ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి.చాలామంది జపనీయులు ఎంత రుచికరమైన ఆహారాన్ని తింటున్నా 80 శాతం కడుపు నిండాక ఆపేస్తారు. అలా చేస్తే దీర్ఘాయువు కలిగి ఉంటామని అక్కడి ప్రజలు నమ్ముతారు.జపాన్ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఒల్డ్ ఏజ్ హోమ్లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం వారి సంప్రదాయంగా భావిస్తారు. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, సంతోషంగా జీవిస్తారని, పెద్దలతో కలిసి జీవనం సాగిస్తే భవిష్యత్తుకి ఉపయోగకరమని అక్కడి వారు నమ్ముతారు.నిజానికి జపనీయులు అధిక పరిశుభ్రతను పాటిస్తారు. అక్కడ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యానవనాలు, రోడ్లు, పబ్లిక్ ప్రదేశాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి.జపాన్ ప్రజలు నెమ్మదిగా, నమిలి నమిలి తినే శైలిని ఇష్టపడతారు. ఒకే పెద్ద ప్లేట్లో కాకుండా చిన్నచిన్న ప్లేట్లలో లేదా చిన్నచిన్న బౌల్స్లో ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యమిస్తారు.అక్కడివారు ఎక్కువగా తినే సమయంలో టీవీ చూడటం, సెల్ ఫోన్ వాడటం వంటివి చేయకుండా కుటుంబ సభ్యులంతా కలిసి తింటుంటారు, పైగా చాలామంది డైనింగ్ టేబుల్స్, కుర్చీలు వాడకుండా నేలపై కూర్చుని భోజనం చేయడానికి ఇష్టపడతారు.జపనీస్ ప్రజలు సమతుల ఆహారాన్ని తీసుకుంటారు. పండ్లు, తృణధాన్యాలు, సోయా, ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటారు. వారు తీసుకునే ఆహారాలన్నీ తక్కువ మొత్తంలో కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. దాంతో గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. వారు తీసుకునే ఆహారం వల్లే జపాన్ లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉందని తేలింది.జపాన్లో అన్ని వయసుల వారు నడవడానికే ఇష్టపడతారు. సమీపంలోని ఉన్న గమ్యస్థానాలకు నడిచి వెళ్లిపోతుంటారు. లేదంటే సైకిల్ వాడతారు. అలాగే బాతాఖానీ వేసేటప్పుడు ఎక్కువగా నేలపైనే కూర్చుంటారు. ఈ పద్ధతుల వల్ల పేగులకు, కండరాలకు మంచి వ్యాయామం అవుతుంది. వారి ఆయుర్దాయం పెరగడానికి అవి కూడా దోహదం చేస్తున్నాయి.మొత్తానికి జపనీయులు– సమతుల ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఇతరులకు సహాయం చేయడం, ప్రతి దానిపట్ల కృతజ్ఞతతో ఉండటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రేమగా కలిసి జీవించడం ఇలా ఎన్నో అంశాలు వారి ఆయుర్దాయాన్ని రెట్టింపు చేస్తున్నాయి.సమస్యల వలయంలో జపాన్ లో జననాల రేటు చాలా తక్కువగా ఉంది, అదే సమయంలో, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల పని చేసేవారి సంఖ్య తగ్గి, సామాజిక భద్రత, ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడుతోంది. 2060 నాటికి జపాన్ జనాభా 8.67 కోట్లకు పడిపోవచ్చని అంచనా!మరోవైపు వివిధ నివేదికల ప్రకారం, జపాన్లో 15 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య సుమారు 13.7 మిలియన్లు ఉండగా.. ఆ దేశప్రజలు పెంచుకుంటున్న కుక్కలు, పిల్లుల సంఖ్య కలిపి 15.9 మిలియన్లకు పైగా ఉంది. జపాన్ సమాజంలో ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి పెంపుడు జంతువులను ఆశ్రయిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పక్కన పెడితే, ఎక్కువ కాలం సంతోషంగా జీవిస్తున్న వారి సంఖ్య జపాన్లో ఎక్కువగా ఉండటంతో ప్రపంచ దేశాలు వారి జీవన విధానంపై దృష్టిపెడుతున్నాయి.యుటోరిఇది జపాన్ లో ఒక విశిష్టమైన భావన. దీనిని తెలుగులో ‘మనసుకి విశ్రాంతినివ్వడం’ లేదా ‘సమయం కేటాయించడం’ అని చెప్పవచ్చు. ఆధునిక ప్రపంచంలో మనం నిరంతరం పరుగులెత్తుతూ, పనిఒత్తిడిలో మునిగిపోతూ, మనసుకి అవసరమైన విరామాన్ని ఇవ్వాలని ఈ సిద్ధాంతం చెబుతోంది.యుటోరి అంటే కేవలం విశ్రాంతి తీసుకోవడమే కాదు, ఇది జీవితంలోని ఆనందాన్ని గుర్తించడానికి ఉద్దేశపూర్వకంగా సమయం కేటాయించుకోవడం కూడా! మరి అందుకేం చెయ్యాలి?వేగాన్ని తగ్గించుకోవాలి – ప్రతి పనిని తొందరగా పూర్తి చేయాలనే ఒత్తిడిని పక్కన పెట్టి, నెమ్మదిగా చేయడం అలవరచుకోవాలి.చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించుకోవాలి– మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవితంలోని చిన్న చిన్న అద్భుతాలను గమనించడానికి మనసుకు కాస్త సమయం ఇవ్వాలి. ఉదాహరణకు, ఉదయం సూర్యోదయాన్ని చూడడం, ఒక పూలమొక్కను పరిశీలించడం, పక్షుల కిలకిలరావాలు వినడం ఇవన్నీ మనసుని ఉత్తేజపరుస్తాయి.సహజంగా శ్వాస తీసుకోవాలి– నిజానికి ఉరుకుల పరుగుల జీవనంలో కొన్ని రోజుల పాటు మనం ఊపిరి పీల్చుకునే విధాన్ని కూడా గమనించకుండా గడిపేస్తాం. ఒక్క క్షణం ఆగి ఆ పక్రియను గమనిస్తుండాలి. శ్వాస తీసుకోవడాన్ని గమనిస్తే, మనసుకు ఎనలేని హాయి కలుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం ఈ తరహాకు చెందినవే!మానసిక విరామం పొందాలి– పనికి, ఆలోచనలకు ఒక విరామమిచ్చి, మనసును ఖాళీగా ఉంచడం నేర్చుకోవాలి.వీటన్నింటినీ పాటిస్తూ మన జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రశాంతంగా మార్చుకోవడమే యుటోరీ లక్ష్యం. ఇది మనస్సుకి ప్రశాంతతను అందించి, జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుంది.మోటైని మోటైని అంటే ‘వృథా చేయవద్దు’ లేదా ‘విలువను గుర్తించు’ అని అర్థం. ఏదైనా వస్తువు, సమయం, శక్తి లేదా వనరులను వృథా చేయకుండా, వాటిని పూర్తిగా వినియోగించుకోమని ఈ సిద్ధాంతం చెబుతుంది. సృష్టిలో ప్రతిదానిపైనా కృతజ్ఞత కలిగి ఉండాలని, ప్రతిదానికీ విలువను, గౌరవాన్ని ఇవ్వాలని ఇది చెబుతుంది. ఉదాహరణకు మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయకుండా తినడం, పాత వస్తువులను, వస్త్రాలను తిరిగి ఏదో ఒక రూపంలో వినియోగించడం వంటి ఎన్నో విలువలను ఇది నేర్పిస్తుంది.షిన్–రిన్ యోకు ఇది జపనీయుల మానసిక చికిత్సా విధానంలో ఒక పద్ధతి. షిన్–రిన్ యోకు అంటే ‘ప్రకృతిలో లీనం కావడం’ అని అర్థం. ఇది ప్రకృతిలో, ముఖ్యంగా సురక్షితమైన అటవీ ప్రాంతాల్లో గడిపే ఒకరకమైన వైద్య విధానం. ఇది అడవిలోని ప్రశాంతతను, శబ్దాలను, సువాసనలను, దృశ్యాలను మనసారా పంచుకోమని చెబుతుంది. చెట్ల సువాసనలను పీల్చడం, పక్షుల కిలకిలరావాలు వినడం, ప్రకృతి అందాలను తాకడం, ప్రకృతితో మమేకం కావడం ఇలా ప్రతి అనుభూతిని మన పంచేంద్రియాలతో పూర్తిగా ఆస్వాదించడమే దీని ముఖ్య ఉద్దేశం. అడవుల్లోని ప్రశాంత వాతావరణం, మొక్కల నుంచి వెలువడే కొన్ని రకాల సుగంధాలు ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటును తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. ప్రకృతిలో గడిపినప్పుడు మనసు తేలికపడి, ఏకాగ్రత పెరుగుతుంది. ఇది ఆధునిక జీవితంలో ఏర్పడే ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడటానికి ఒక సహజమైన, ప్రభావవంతమైన మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.వాబీ– సాబీ అసంపూర్ణతలోనూ అందం ఉంటుందని చెప్పే గొప్ప తాత్త్వికత ఇది. ప్రతి వస్తువు, ప్రతి మనిషి అసంపూర్ణమేనని చెప్పడంతో పాటు, అందులో కూడా ఒక ప్రత్యేకమైన సౌందర్యం ఉందని, దాన్ని చూడటం నేర్చుకోమని ఈ సిద్ధాంతం చెబుతుంది. నిజానికి దీని ప్రకారం పరిపూర్ణత అనేది ఒక భ్రమ. ఉదాహరణకు పాతబడిన చెక్క బల్లలోనూ, పగిలిన కప్పులోనూ అందాన్ని వెతకగలిగినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలమట. ‘కాలంతో పాటు వచ్చే మార్పులు, పగుళ్లు, లోపాలు, ముడతలు ఇవన్నీ చాలా కథలను చెబుతాయి. వినగలిగితే అవెంతో అద్భుతంగా ఉంటాయి’ అని చెబుతుంది ఈ సిద్ధాంతం. దీని ప్రకారం, లోపాలను లోపాలుగా చూడకుండా వాటిని జీవితంలో ఒక భాగంగా స్వీకరించడంతో, జీవితం పట్ల ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుందని వివరిస్తుంది. ఈ విధానాన్ని అనుసరిస్తే మనకు జీవితంలోని మార్పులను, వృద్ధాప్యాన్ని కూడా అంగీకరించగలిగేంత ఓర్పు, నేర్పు అలవడుతుంది.షోషిన్ షోషిన్ అనే సిద్ధాంతం ‘ఎంతటి జ్ఞాని అయినా ఎల్లప్పుడూ జిజ్ఞాసతో జీవించాలి’ అని చెబుతుంది. అంటే ఎంత జ్ఞానమున్నా, ఎంత తెలుసుకున్నా, ‘నాకు అన్నీ తెలుసు’ అని భావించకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. నిత్యం కుతూహలంతో, పూర్వపు ఆలోచనల ప్రభావం మనసుపై లేకుండా ప్రతిదాన్ని స్పష్టంగా చూడమని, తెలుసుకోమని ఈ విధానం ప్రోత్సహిస్తుంది. దాంతో సృజనాత్మకత పెరుగుతుంది. అలాగే భయం లేకుండా కొత్తకొత్త ప్రయోగాలు చేయగలిగే సత్తా ఏర్పడుతుంది. దాని వల్ల కూడా ఒక సంతృప్తి ఏర్పడుతుంది.నిజానికి ఎంత గొప్ప నియమమైనా, ఎంత గొప్ప విధివిధానమైనా వివరించి, విశ్లేషించి, అనుభవపూర్వకంగా తెలుసుకుని సిద్ధాంతాలుగా మార్చడమే గొప్ప అనుకుంటే పొరబాటు! దాన్ని తు.చ. తప్పకుండా పాటించి, తాము పాటించిన తత్త్వాన్ని తర్వాత తరాలకు అందించడమే అసలైన గొప్పతనం! అదే చేస్తున్నారు జపనీయులు! గమాన్గమాన్ అంటే సహనం లేదా ఆత్మనిగ్రహం అని అర్థం. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా నిశ్చలంగా, గౌరవంగా ఉండమని ఈ భావన సూచిస్తుంది. సమస్యలకు కష్టాలకు నిరాశ చెందకుండా, ఎవరితో చర్చించకుండా, ఫిర్యాదులు చేయకుండా, నిశ్శబ్దంగా పరిస్థితులను ఎదుర్కోమని చెబుతుంది. జపనీస్ సంస్కృతిలో, గమాన్ అనేది ఒక బలమైన లక్షణం. ఇది వ్యక్తిగత కష్టాలను ఎదుర్కోవడానికి, సంఘంలో సామరస్యాన్ని కొనసాగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. -
బాసే రైటు
మీ బాస్ను ఎలా మేనేజ్ చేయాలో మీకు ఎవరూ నేర్పించరు. వారిని మేనేజ్ చేయడానికి, ముందుగా వారు ఎలాంటి వ్యక్తో మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు మీకు ఎం.బి.టి.ఐ. (మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్) సహాయపడవచ్చు. బాస్లు ఎలా పని చేస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, అనే అంశాలపై ఆధారపడి ఈ ఇండికేటర్ బాస్లను కమాండర్, విజనరీ, హార్మనైజర్, స్ట్రాటిజిస్ట్, ఎనలిస్ట్, సపోర్టర్, మ్యావరిక్, ఫ్రీ స్పిరిట్ అనే 8 రకాల వ్యక్తులుగా విభజించింది. ఈ ఎనిమిది మందిలో మీ బాస్ ఏ టైపు మనిషో కింద ఇచ్చిన ఇండికేటర్ ‘కీ’ చెబుతుంది. కనుక ఇండికేటర్ను ఫాలో అయిపోండి. ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అంటారు కనుక బాస్ తత్త్వానికి అనుగుణంగా మీరు మారండి. ప్రశాంతంగా ఉండండి. కెరీర్లో విజయం సాధించండి.కమాండర్లు వీళ్లు ఫలితాలనే నమ్ముతారు. పనిలో వేగాన్ని, స్పష్టతను కోరుకుంటారు. సామర్థ్యం, నాయకత్వం, తర్కం వీళ్లలో ముఖ్యమైనవి. వీళ్లకు సమావేశాలు, డెడ్లైన్లు ముఖ్యం. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాత్మకంగా వ్యవహరించే ఉద్యోగులను వీరు అభిమానిస్తారు. ఇలాంటి వారితో పేరాల్లో కాకుండా బుల్లెట్ పాయింట్లలో మాట్లాడాలి. కుంటి సాకులు, భావోద్వేగాలు వీళ్లు నచ్చవు. గడుపులోపే చెప్పిన పని అయిపోవాలి. ఇలాంటి వాళ్ల దగ్గర అస్తవ్యస్తంగా, అనిశ్చితంగా ఉంటే మీ కెరీర్ దెబ్బతిన్నట్లే. విజనరీలు వీరు శక్తిమంతులు. ఐడియాల పుట్టలు. వినూత్న ఆవిష్కరణల్ని ఇష్ట పడతారు. వీరు వర్క్ప్లేస్ని శక్తిమంతంగా మార్చేస్తారు. భవిష్యత్తుపై దృష్టి ఉంటుంది. పని ఎలా జరుగుతోందో చూడరు. ఎంత జరిగిందో అడుగుతారు. వీరిని ఆకట్టుకోవడానికి ఫ్రెష్ ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనల్ని అప్పటికప్పుడు ఆచరణలో పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగి ఆఫీస్కి వచ్చేటప్పుడు, ఆఫీస్ నుండి వెళ్లేటప్పుడు ఆ ప్రయాణంలో సైతం ఆఫీస్ పని చేయవలసి వస్తుంది. రూల్స్ మాట్లాడకూడదు. స్ప్రెడ్షీట్లను కుమ్మరించకూడదు. అంతులేని ఫాలో–అప్లతో వారిని ముంచెత్తకూడదు. ఉద్యోగికి సమయస్ఫూర్తి లేకపోవడం వారిని నిరాశపరుస్తుంది.హార్మౖనైజర్లుఉద్యోగులతో వీరు స్నేహపూర్వకంగా ఉంటారు. అందర్నీ కలుపుకుని పోతారు. సామరస్యాన్ని కోరుకుంటారు. టీమ్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తారు. మీ పుట్టినరోజును గుర్తుంచుకుంటారు. లేదా మీ కుటుంబం బాగోగుల గురించి అడుగుతారు. హెల్ప్ చేసేందుకు రెడీగా ఉంటారు. వీరి నాయకత్వం పరస్పర విశ్వాసం, భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. వీరితో పనిచేయడానికి కమ్యూనికేటివ్గా ఉండాలి. టీమ్ కల్చర్ నిర్మాణానికి మీ సహకారాన్ని కోరుకుంటారు. ఘర్షణాత్మక ధోరణిని అస్సలు ఇష్టపడరు. టీమ్ ఒకలా ఆలోచిస్తే మీరు టీమ్కు విరుద్ధంగా ఆలోచించటం వీరిలో అసహనం కలిగిస్తుంది. స్ట్రాటెజిస్టులుఆలోచనాత్మకమైనవారు. లక్ష్యాలే ముఖ్యమైన దార్శనికులు. లోతుగా ఆలోచిస్తారు. జాగ్రత్తగా ప్రణాళిక వేస్తారు. స్వేచ్ఛ, వ్యూహాత్మకత విలువైనవిగా భావిస్తారు. నాటకీయతను ఇష్టపడరు. అన్నీ తెలుకుని ఉంటారు. పైకి వ్యక్తపరచరు. నాణ్యమైన పనిని ఆశిస్తారు. వీరి దగ్గర భావోద్వేగ ప్రకోపాలు, నిస్సారపు ఆలోచనలు, అస్తవ్యస్తమైన ఆలోచనలు ఉద్యోగికి నష్టాన్ని తెస్తాయి. నిర్మాణాత్మక వాదనలు మాత్రమే వీరి దగ్గర చేయాలి.ఎనలిస్టులు కచ్చితమైనవారు, తార్కికంగా ఉంటారు. ప్రతిదీ వివరంగా తెలుసుకుంటారు. స్పష్టత ముఖ్యం. ఆధారాలు అవసరం. మీరు వాగ్దానం చేసిన వాటిని అమలు చేయాలని వీరు ఆశిస్తారు. అరకొర పనులను, నిర్ణయాలలో ఊగిసలాటను ద్వేషిస్తారు. డేటా, నిర్మాణం, దృఢమైన తార్కికతతో వీరికి సహాయకారిగా ఉండండి. నాటకీయత వద్దు. ప్రాక్టికల్గా ఉండండి. భావోద్వేగ విజ్ఞప్తులతో, అస్పష్టమైన నిబద్ధతలతో లేదా ఒక పనిని దాటవేయడం ద్వారా వారిని నిరాశపరచకండి.సపోర్టర్లు నిశ్శబ్దంగా ఉంటారు. నమ్మదగినవారు. సేవా దృక్పథం కలిగినవారు. స్థిరమైన జట్లకు వెన్నెముకగా ఉండాలని కోరుకుంటారు. స్థిరంగా, శ్రద్ధగా, విశ్వాసపాత్రంగా ఉంటారు. వ్యక్తిగత సంబంధాలకు విలువ ఇస్తారు. వీరి దగ్గర మీరు స్థిరంగా, సానుభూతితో, మర్యాదగా ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అదనపు పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు బాగా రాణిస్తారు. మాటలతో కాకుండా చేతలతో మీరు నమ్మకాన్ని సంపాదించాలి. మీలోని దూకుడు ప్రవర్తన, ఆకస్మిక మార్పులు, టీమ్ని విమర్శించటం వంటి పనులతో వీరికి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది.మ్యావరిక్లు చురుగ్గా, వేగంగా, వ్యూహాత్మకంగా ఉంటారు. వీరిది నో–నాన్సెన్ ధోరణి. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. పనులు పూర్తి చేసే వారిని విలువైనవారిగా భావిస్తారు. తన ఉద్యోగులు సమయాన్ని గౌరవించాలని, ఒత్తిళ్లను స్వీకరించాలని కోరుకుంటారు. మితిమీరిన ప్రణాళికల్ని ఇష్టపడరు. అధిక డాక్యుమెంటేషన్ను కూడా లైక్ చెయ్యరు. ప్రతిదానికీ నెమ్మదిగా ప్రతిస్పందిస్తుంటే మిమ్మల్ని నిష్కర్షగా పక్కనపెట్టేస్తారు.ఫ్రీ స్పిరిట్ కలిగినవారు స్వతంత్రమైన, సృజనాత్మకమైన, హృదయపూర్వకమైన గుణాలున్నవారు. వీరికి విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. తన టీమ్కు స్వేచ్ఛను ఇస్తారు. మీలో అభిరుచి, చొరవ ఉంటే మిమ్మల్ని టీమ్ లీడర్గా గుర్తిస్తారు. వీరితో నిజాయితీగా, దాపరికం లేకుండా ఉండాలి.మీ బాస్ సరే, మీరు ఎలాంటి వారు?ఇది తెలుసుకోవాలంటే 41 క్యూ.కామ్ లేదా 16 పర్సనాలిటీస్.కామ్లో ఈ ఎం.బి.టి.ఐ. ఆన్లైన్ పరీక్ష రాయండి. ఎలాంటి బాస్ మీకు సరిపడతారో తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్· సాక్షి, స్పెషల్ డెస్క్ -
సొరకాయ, కీరదోసతో స్నాక్స్ చేసేద్దాం ఇలా..!
గోవా ప్రాన్స్ రిషాయిడోకావలసినవి: రొయ్యలు– ఒక కప్పు (శుభ్రపరిచి హాఫ్ బాయిల్ చేçసుకోవాలి)ఉల్లిపాయ– ఒకటి (చిన్నది, తరిగినది)పాలు– అర కప్పుఉప్పు, మిరియాల పొడి– రుచికి తగినంతమైదాపిండి– ఒక కప్పు పైనేనీళ్లు, నూనె– సరిపడాగుడ్లు– 2 (పగలగొట్టి, కొద్దిగా పాలల్లో కలిపి పెట్టుకోవాలి)బ్రెడ్ పౌడర్– ఒక కప్పుతయారీ: ముందుగా కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని; ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగిన తర్వాత రొయ్యలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకుని; మూతపెట్టి చిన్నమంట మీద బాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు మైదాపిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఉండను పూరీలా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. రొయ్యల మిశ్రమం బాగా ఉడికిన తర్వాత కాస్త చల్లారనిచ్చి, కొద్దికొద్దిగా పూరీల్లో నింపుకుని చిత్రంలో చూపిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని గుడ్లు, పాల మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి.సొరకాయ మంచూరియాకావలసినవి: సొరకాయ తురుము– 1 కప్పుమైదాపిండి– 4 టేబుల్ స్పూన్లు, కార్న్ పౌడర్– 1 టేబుల్ స్పూన్ , గోధుమపిండి– 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్– అర టీ స్పూన్, కారం– 1 టీ స్పూన్ , జీలకర్ర– అర టీ స్పూన్ , ఉల్లిపాయ ముక్కలు– 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి), పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి), కొత్తిమీర తురుము, కరివేపాకు– కొద్ది కొద్దిగా (అభిరుచి బట్టి), ఉల్లికాడ ముక్కలు– కొద్దిగా, టమాటో సాస్– 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్– 2 టీ స్పూన్లు, సోయా సాస్– 1 టీ స్పూన్ , నూనె– సరిపడా, ఉప్పు– తగినంతతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని; అందులో సొరకాయ తురుము, మైదాపిండి, కార్న్ పౌడర్, గోధుమపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. తర్వాత మరో కళాయి తీసుకుని; అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని; ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని, ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.పికిల్డ్ కుకుంబర్కావలసినవి: కీర దోసకాయలు– 3 లేదా 4 మధ్యస్థ పరిమాణంలో వెల్లుల్లి– 2 రెబ్బలు (సన్నగా తరగాలి)అల్లం– ఒక చిన్న ముక్క (సన్నగా తురుముకోవాలి)సోయా సాస్, వెనిగర్– 2 టేబుల్ స్పూన్లు చొప్పుననువ్వుల నూనె– ఒక టీ స్పూన్చిల్లీ ఫ్లేక్స్– అర టీస్పూన్పంచదార పొడి– ఒక టీస్పూన్పుల్లలు– 2–3 తయారీ: ముందుగా కీర దోసకాయలను శుభ్రంగా కడిగి, చివరలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై చిత్రంలో ఉన్న విధంగా కీర దోసకాయల తొక్కతీసి, కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిపై ఉప్పు జల్లి పది నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత దోసకాయలను చల్లటి నీటితో శుభ్రంగా కడిగి, పొడిగా తుడవాలి. ఈలోపు ఒక గిన్నెలో సన్నగా తరిగిన వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, సోయా సాస్, వెనిగర్, నువ్వుల నూనె, పంచదార వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బ్రష్తో కీరాలకు పూయాలి. ఇప్పుడు వాటిని ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచి, సర్వ్ చేసుకునే ముందు వాటికి పుల్లలు గుచ్చి సర్వ్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. (చదవండి: ఈ చిరుజల్లుల్లో టేస్టీ టేస్టీ స్నాక్స్ చేసేద్దాం ఇలా..!) -
ఓ చూపు చూశారు!
పెళ్లి, పెళ్లి చూపులు... ఈ రెండు సందర్భాల్లోనూ ఇరుపక్షాలు తమ స్థాయిని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ వీక్నెస్నే క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన ఓ గ్యాంగ్ 2011లో దేశ వ్యాప్తంగా అనేక కుటుంబాలను ఓ చూపు చూసింది. వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చి, పెళ్లి చూపులకి రమ్మంటూ ఆహ్వానించి, మత్తుమందు కలిపిన పానీయాలు ఇచ్చి అందినకాడికి దోచుకుపోయిన ఆ ముఠా ఆరు రాష్ట్రాల్లో హడలెత్తించింది. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అన్నదమ్ములు శ్రీనివాస్, రుషికేశ్లతో పాటు అదే ప్రాంతానికి చెందిన రమేష్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. 2003లో నాలుగేళ్ల బాలుడిని డబ్బు కోసం కిడ్నాప్ చేసి జైలుకు వెళ్లడంతో నేర జీవితం ప్రారంభించారు. 2010లో హైదరాబాద్ శివారులోని ఓ పంచాయతీ సర్పంచ్ని డబ్బు కోసం బెదిరించారు. ఇలాంటి నేరాలు చేస్తే పోలీసులకు దొరికిపోయి జైళ్లు, బెయిళ్లతో ఇబ్బందులు పడుతున్నామని భావించింది. అందువల్ల పోలీసులకు చిక్కే అవకాశాలు తక్కువగా ఉండే లాభసాటి నేరాలు చేయాలనుకున్న ఈ ముఠా తమను గుర్తుపట్టని ప్రాంతాలకు వెళ్లి, అప్పటికే సంబంధం తెగిపోయే టార్గెట్లను ఎంచుకుని, పక్కా పథకం ప్రకారం నేరాలు చేయాలని నిర్ణయించుకుంది. తమ పథకాన్ని అమలులో పెట్టడంలో భాగంగా వీళ్లు వేసిన ఎత్తే డమ్మీ పెళ్లి చూపులు. దీనికోసం ఈ ముగ్గురూ ఇంటర్నెట్ నుంచి అందమైన యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేసుకున్నారు. వీటి ఆధారంగా తయారు చేసిన బయోడేటాల్లో ఆ యువతి ఉన్నత విద్యనభ్యసించినట్లు, పెద్ద సంస్థలో పని చేస్తున్నట్లు ఆకర్షణీయమైన వివరాలు చేర్చి, అలాంటి యువతికి అదే స్థాయి సంపన్నుడైన వరుడు కావాలంటూ వివిధ మేట్రిమోనియల్ సైట్స్లో పోస్ట్ చేసింది. సంప్రదింపుల కోసం బోగస్ వివరాలతో రూపొందించిన ఈ–మెయిల్ ఐడీలను పొందుపరచేది. కొన్ని పత్రికల్లోనూ ఇదే తరహాలో ప్రకటనలు ఇచ్చింది. వీటికి ఆకర్షితులై సంప్రదించిన వారిని మాటలతో ముగ్గులోకి దింపేది. వాళ్లు పెళ్లి కుమార్తె వివరాలు కోరితే... తక్షణం చెప్పే వాళ్లు కాదు. అలా చేస్తే ఎదుటి వారికి పూర్తిగా నమ్మకం రాదనే భావనతో కొత్త కథ నడిపే వాళ్లు. అంతకు ముందే యువతిని చూసి వెళ్లిన ఐఏఎస్/ఐపీఎస్ అధికారి అభిప్రాయం చెప్పడానికి రెండుమూడు రోజుల సమయం కోరారని, వారి నుంచి సమాధానం రాకుండా మీకు ఏ విషయం చెప్పలేమంటూ నమ్మబలికే వాళ్లు. ఈ సంప్రదింపులన్నీ ఈ–మెయిల్స్ ద్వారానే జరిపేవాళ్లు. అలా కొన్ని రోజులు గడిచాక వరుడి తరఫు వారికి సదరు ఐఏఎస్/ఐపీఎస్ అధికారికి తమ అమ్మాయి నచ్చిందని చెప్పారని, అయితే ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో పని చేస్తున్నందున పెళ్లి చేయమని చెప్పామని నమ్మబలికే వాళ్లు. ఆపై తమ ఆస్తిపాస్తులు వివరాలు తెలుసుకోవడానికి, అమ్మాయిని చూడటానికి, తమ ఆతిథ్యం స్వీకరించడానికి వివిధ ప్రాంతాలకు రావాలంటూ ఆహ్వానించేది. ఇలా పెళ్లి చూపులకు వచ్చే ముందు ఆ వరుడి తరఫు వాళ్లు భారీగా బంగారు నగలు తీసుకుని వచ్చే వాళ్లు. వీళ్లు రావడానికి ముందే ‘జస్ట్ డయల్’ సాయంతో అక్కడి అనువైన ప్రాంతంలో సర్వీస్ అపార్ట్మెంట్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లు సైతం అద్దెకు తీసుకునేది. అవి తమ సొంతమే అన్నట్లు నమ్మించడానికి అనువుగా ఏర్పాటు చేసేది. కొన్ని సందర్భాల్లో రిసార్టుల్లో సూట్స్ బుక్ చేసి సిద్ధం చేసేది. ‘అతిథుల’ కోసం ఖరీదైన కార్లనూ ‘జస్ట్ డయల్’ సహాయంతోనే బుక్ చేసి.. వాటిలోనే ఎయిర్పోర్టుకు వెళ్లి వారిని రిసీవ్ చేసుకునేది. అక్కడ నుంచి వారిని సిద్ధం చేసి ఉంచిన సర్వీస్ అపార్ట్మెంట్లు, రిసార్టులకు తీసుకువెళ్లి, కాబోయే వియ్యంకుల మాదిరి బిల్డప్ ఇస్తూ రెండు మూడు రోజుల పాటు అతిథి మర్యాదలు చేసేది. ఆపై అదను చూసుకుని వారు తినే/తాగే పదార్థాల్లో మత్తుమందు కలిపి వారివద్ద ఉన్న బంగారం, డబ్బు తీసుకుని ఉడాయించేది. మత్తు వదిలాక నిద్రలేచే అతిథులు నిలువు దోపిడికీ గురయ్యామని తెలుసుకుని గొల్లుమనే వాళ్లు. ఈ గ్యాంగ్ ఓ పక్క ఈ పంథాలో దోపిడీలు చేస్తూనే, మరోపక్క ట్రావెల్స్ కార్లపైనా పంజా విసిరేది. ‘జస్ట్ డయల్’ నుంచి ట్రావెల్స్ నిర్వాహకులకు ఫోన్ నెంబర్ తీసుకుని సంప్రదించేది. వివిధ పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలంటూ వాహనాన్ని బుక్ చేసుకుని, ప్రయాణాల్లో కొన్ని చోట్ల లాడ్జిల్లో బస చేసేది. అక్కడ కారు డ్రైవర్కు మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి, అతడు స్పృహతప్పాక, కారు తాళాలు తీసుకుని, కారుతో ఉడాయించేది. మత్తు వదిలాక డ్రైవరే లాడ్జి బిల్లు చెల్లించి బయటపడాల్సి వచ్చేది. ఇలా కార్లు చోరీ చేసే ఈ ముఠా, వాటిని బోగస్ పత్రాల సాయంతో అమ్మి సొమ్ము చేసుకునేది. ఈ ముఠా హైదరాబాద్, జహీరాబాద్, కేరళ, కర్నూలు, తిరుపతి, ఏలూరు, కర్ణాటక, ముంబై, తమిళనాడు, పాండిచ్చేరీల్లో 24 నేరాలు చేసింది. ఈ ముఠా ఇదే పంథాలో 2003 నుంచి నేరాలు సాగిస్తున్నా, 2011 వరకు ఎక్కడా చిక్కలేదు. పెళ్లి చూపులు, అద్దెకు కార్లు పేరుతో జరుగుతున్న నేరాలపై 2011లో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు సమాచారం అందింది. బాధితులను మత్తులోకి దించేందుకు టాబ్లెట్లు వినియోగించినట్లు తేలడంతో ఆ నేరాలన్నీ ఒకే గ్యాంగ్ పనిగా అనుమానించింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, కేజీ బంగారం, ఐదు వాహనాలు, చోరీ సొమ్ముతో కొన్న ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఈ ముఠాపై నమోదైన కేసుల్లో అత్యధికం కోర్టుల్లో రుజువు కాలేదు. కేసులు నమోదులో జాప్యం, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే కాకుండా, ఫిర్యాదుదారులూ ధైర్యంగా ముందుకు రాకపోవడంతో వీగిపోయాయి. -
ఈ వారం కథ: పునీతులు
పొద్దెక్కుతోంది. మబ్బుల్నే లేచిన ఈశ్వరి చకచకా బీడీల ఆకు కత్తిరిస్తోంది. పక్కనే ఉయ్యాలలో పడుకోబెట్టిన పాప ఉలిక్కిపడి లేచి ఏడుపందుకుంది. తప్పదన్నట్లు లేచి, బిడ్డకు పాలిస్తూ ‘ఇంకొంచెంసేపు పడుకోవే తల్లీ!’ అంటూ మురిపెంగా పాప బుగ్గలు నిమిరింది. పాప మెరిసే కళ్ళతో తల్లినే నిటారుగా చూస్తోంది. ఆడపిల్ల అయినా తండ్రి కళ్లే వచ్చాయి. అచ్చం రాజేష్ చూస్తున్నట్లే ఉంది అని మురిసిపోతున్న ఆమె మనసు భర్త వైపు మళ్లింది.ప్రసవానికి వచ్చిన ఈశ్వరికి బిడ్డ పుట్టి ఆరు నెలలైనా తల్లిగారింట్లోనే ఉంటోంది. తన ఇంటికి వెళితే తనూ, తన భర్తనే. ఇక్కడైతే తనకు, పసిపిల్లకు తోడుగా తల్లి, తమ్ముడు ఉన్నారు. ఎమ్మెస్సీ చదివిన రాజేష్ తమ ఊర్లోనే ప్రైవేటు కాలేజీలో పాఠాలు చెబుతున్నాడు. రెండు ఊర్ల మధ్య గంట బస్సు ప్రయాణం. అందుకే శని, ఆదివారాలు తానే వచ్చిపోయేవాడు. అలా హాయిగా ఉంటున్న వారి మధ్య ఏడాది పరీక్షలు వచ్చి అడ్డుగా నిలిచాయి. ఉదయం, సాయంత్రం కాలేజీలో స్పెషల్ క్లాసులు నడుస్తున్నాయి. ఆదివారాల్లో కూడా భార్య, కూతురును చూసి వచ్చేంత తీరిక లేని పని. రాజేష్ రాక దాదాపు నెల రోజులవుతోంది.పాలు తాగుతూ నిద్రపోయిన బిడ్డను హమ్మయ్య అనుకుంటూ ఈశ్వరి మెల్లగా ఉయ్యాలలో వేసి మళ్ళీ ఆకును ముందేసుకుంది. డెలివరీ అయిన నెల రోజులు తప్ప వచ్చిన్నుంచి రోజుకు వేయి బీడీలు చేస్తోంది. తమ్ముడిది బీడీ కంపెనీలో గుమస్తా కొలువు. తన డెలివరీకి అయిన ఖర్చులైనా ఇంటికి ముట్టజెప్పాలని ఆమె ఆరాటం.అప్పుడే దూరం నుంచే ‘అక్కా!’ అని అరుచుకుంటూ వస్తున్నాడు ఆమె తమ్ముడు.‘ఏందిరా శ్రీనూ.. మెల్లగరా!’ అని ఆయన్నే చూస్తోంది.‘బావను పోలీసులు పట్టుకుపోయిండ్రట’ అంటూ ఇంట్లోకి వచ్చాడు.‘ఎందుకురా!’ అంటూ లేచి నిలబడింది ఒక్కసారిగా.తమ్ముని వెనుకే కాలేజీ వాచ్మన్ మల్లన్న కూడా వచ్చాడు.‘ఏంటిదే మల్లన్నా.. సారుకేమైందే?’ అని ఎదురెళ్ళింది.లోపలున్న తల్లి అరుగు మీదికి వచ్చింది.మల్లన్న నోరిప్పటానికి కిందిమీద అయితున్నాడు.‘చెప్పే అన్నా.. ఏమైంది!’ అని ఏడుస్తూ ఆయన భుజాలు పట్టి కుదిపింది ఈశ్వరి.‘సారు కాలేజీల ఆడపిల్లను పాడు చేసిండట’ అని మెల్లగా అని, ఇంకేమీ చెప్పలేకపోయాడు.‘ఎప్పుడు. ఎక్కడ!’ అంది నమ్మబుద్ధికాక.‘నిన్న పొద్దుగూకంగ. కాలేజీలనేనట!’ అంటూ తనకు తెలిసింది చెప్పాడు.‘నేనత్తపా!’ అని బిడ్డను చంకలో వేసుకుంది.‘అక్కడేమున్నది. కోపంతోటి ఊరోళ్లు మీ సామాన్లను బజార్లేసి కాలవెట్టిన్రు. నువ్వు ఊర్లెకస్తే ఊకోరు’ అన్నాడు ఊర్లోని తీవ్రత ఆమెకు అర్థమయేలా.‘ఇదెక్కడి అన్యాలముల్లో..’ అని రాగం తీస్తూ కూలబడింది.‘ఇప్పుడు బావ ఎక్కడున్నడు?’ అని శ్రీను మల్లన్నను అడిగాడు.‘జగిత్యాల పోలీసులచ్చి తీసుకపోయిండ్రు’ అన్నాడు.ఏడుస్తూనే ఈశ్వరి బిడ్డని చంకనేసుకొని తమ్ముణ్ణి తీసుకోని బయలుదేరింది. వాకిట్లోకి వచ్చినంక ‘మల్లన్నా.. అన్నం తిని పో!’ అని తల్లివైపు చూసి, ముందుకు నడిచింది.జగిత్యాల పాత బస్టాండులో దిగి పిల్లను భుజం మీద వేసుకొని ఈశ్వరి దబదబా నడుచుకుంటూ పోలీస్స్టేషన్ గేటు ముందట నిలబడింది. ఆమె వెనుకాలే వచ్చిన శ్రీను– జవాన్తో ‘పొద్దుగాల్ల పూడూర్ నుంచి మా బావను పోలీసులు పట్టుకచ్చిండ్రు’ అన్నాడు.‘రేప్ కేసోడా! ఆన్ని ఇప్పుడే జైలుకు తీసుకపోయిండ్రు’ అని రోడ్డుకు ఆ వైపున్న జైలు వైపు చేయెత్తి చూపాడు.ఈ మాట వినగానే ఏడ్చుకుంటూ రోడ్డు దాటి కోర్టు వెనుకాల ఉన్న జైలు గేటు వైపు ఉరికింది ఈశ్వరి.‘అక్కా ఆగే.. గిట్లురుకుతే బస్ కిందవడి సత్తవ్!’ అంటూ ఆమె వెనుక నడిచాడు శ్రీను.జైలు గేటు దగ్గరికి పోగానే ‘ఏయ్! దూరం జరుగు’ అని గదమాయించాడు జైలు పోలీస్.శ్రీను ఆయనకు తమ పరిస్థితిని శాంతంగా వివరించాడు.‘ఇప్పుడే తెచ్చిండ్రు. గింత జల్ది ములాఖత్ ఇయ్యరు’ అన్నాడు జవాన్. ‘ఈమె మా అక్క, ఆయన పెండ్లాం. మా బావ మంచోడు. అట్ల చదువుకొనే పిల్లను పాడు చేసేటోడు కాదు. ఒక్కసారి మేం మాట్లాడాలె. గంతే! లోపలికి పంపిత్తే నూర్రూపాలిత్త’ అని జేబులో చేయి పెట్టిండు శ్రీను.‘ఓయ్ గదంత నడవదిక్కడ’ అని జవాన్ అంటుండగా మోటార్ సైకిల్ మీద ఒకాయన సరాసరి ఈశ్వరి, శ్రీనుల దగ్గరికి వచ్చి, ‘నా పేరు రాజేందర్. వకీలును. మా బావ పూడూర్ సర్పంచ్. మీ గురించి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిండు’ అన్నాడు.‘యాళ్ళకచ్చిండ్రు. మా బావను చూడాలే!’ అన్నాడు శ్రీను దండం పెడుతూ.‘సరే!’ అనుకుంటూ ఆయన లోపలి పోయాడు. ఈశ్వరి, శ్రీను కూడా ఆయన వెంట వెళ్లి లోపల ఓ చెట్టు కింద నిలబడ్డారు.వకీలు వెంట రాజేష్ వస్తున్నాడు. దూరం నుంచే ఆయన ముఖం కమిలిపోయినట్లు కనబడుతోంది. బహుశా ఊర్లో దెబ్బలు బాగానే కొట్టినట్లున్నారు.ఈశ్వరి కళ్ళల్లో నీళ్లు అప్పటికే ఏడ్చి ఏడ్చి ఎండిపోయాయి. ఇప్పుడామెకు రాజేష్లో తన భర్త కనబడ్తలేదు. ఒక పిల్లను బలాత్కారం చేసిన మృగాడు అగుపడుతున్నాడు.రాజేష్ దగ్గరికి రాగానే, ‘పాపపుముండ కొడుకా! నీ బతుకు చెడ. నిన్ను నమ్మి చదువుకోనికి వచ్చిన పిల్లను పాడు జేస్తవా! అంత మదమెక్కిందా! ఆగలేకపోతే నేనే వస్తుంటి కదా! నిను నమ్మి పోతే బతుకే ఆగం చేసినవ్ గద! పో బాడకవ్, నీ సావు నువ్వు సావుపో!’ అని ముఖం మీద ఉమ్మేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఎంతో దిగులుగా భర్తను చూడ్డానికి వచ్చిన మల్లీశ్వరి ఇట్లా ఆడపులి అవుతుందని ఎవరూ అనుకోలేదు. వకీలు ఇదంతా చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు.రాజేష్ను లోపలికి తీసికెళ్లారు.కాసేపటికి కోలుకున్న వకీలు ‘ఏందయ్యా మీ అక్క అట్ల జేసింది?’ అన్నాడు శ్రీనుతో.‘అక్క అట్లంటదని నేను కూడా అస్సలు అనుకోలేదు సార్. మీదవడి ఏడుస్తదనుకుంటే ఇట్లజేసింది. దానికి బావ అంటే మస్తు ఇష్టం. అసుంటోడు ఇట్ల జేసేసరికి దానికి వశం కాని కోపమచ్చినట్లుంది. అది సల్లవడ్డంక నేను సముదాయిస్తా గని ఇప్పుడు మనం ఏంజెయ్యాలె?’ అన్నాడు శ్రీను.‘మీ బావ చేసింది పెద్ద తప్పు. బెయిల్ దొరకుడు కష్టం. అయితే ఆ పిల్లతోటి మా సారుది తప్పేం లేదు. అంత నా ఇష్ట ప్రకారమే జరిగింది అని కోర్టుల చెప్పించాలె. పోలీసులతోని ఎఫ్ఐఆర్ల వేరే సెక్షన్లు పెట్టించాలె. బాగనే ఖర్చయితది. అంతా లక్ష దాక..’ అంటూ ఆగాడు వకీలు.‘అట్లయితే మా బావ బయిటికస్తడా?’ అన్నాడు శ్రీను ఆశగా.‘కోషిష్ చేద్దాం. చేతుల పైసలుంటె..’ అని మళ్ళీ సగమే మాట్లాడాడు వకీలు.‘పైసల సంగతి నేను చూసుకుంటా!’ అని వకీలుకు భరోసా ఇచ్చి, అక్కను వెతుక్కుంటూ శ్రీను బస్సెక్కి ఇంటికి వచ్చాడు.ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రోజుటి తీరే ఈశ్వరి బీడీలు చేస్తూ కూచుంది. పాప నిద్రపోతోంది.ఏమైందిరా అన్నట్లు తల్లి శ్రీను మొకం చూసింది. కొంచెం ఆగమన్నట్లు సైగ చేశాడు.కొద్దిసేపటికి ‘అక్కా! బావను బయటికి తేవచ్చు అని వకీల్ సాబ్ అన్నడు. పైసలు ఖర్చయితయట లక్ష రూపాయల దాకా’ అని ఆగాడు.ఈశ్వరి ఏమీ మాట్లాడలేదు.‘మాట్లాడవేమే! మొగాడు జైల్ల ఉంటె ఇట్లనేనా చేసేది?’ అంది తల్లి.‘అట్ల జేసినంక ఆడు నా మొగడే కాదు. ఉంచుకుంటే మీతోటి ఉంటా. ఎల్లగొడితే నా బతుకు నేను బతుకుత’ అంది ఈశ్వరి మొండిగా.‘అది గట్లనే అంటది గని నువ్వు అప్పోసప్పోజేసి బావనైతే బయటికిదే. అటెనుక అన్ని సుదురాయిస్తయి’ అంది తల్లి ఇంటి పెద్దగా.ఓ రోజు బాధితురాలి వాంగ్మూలం జడ్జి రూములో రికార్డు అయింది.‘ఆ రోజు ఏం జరిగింది.. రాజేష్ నిన్ను ఏం చేశాడో చెప్పు’ అని జడ్జి శాంతంగా అడిగాడు. తడుస్తున్న కళ్ళను తుడుచుకోవడం తప్ప నోరిప్పలేదు.‘క్లాసులో మీ సార్ నిన్ను ఏం చేశాడు? అప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా?’ అడిగాడు జడ్జి మరింత ఓపిగ్గా.ఏడుపే సమాధానం.‘ఆయన ఏం చేశాడో నీ మెడికల్ రిపోర్ట్స్లో ఉంది. అది ఎలా జరిగిందో నీ నోట చెబితే కేసు ముందుకు పోతుంది’ అన్నాడు కొంత అసహనంగా.ఆమె ఏడ్పు ఆపకపోవడంతో ‘ఈ మాటకైనా సమాధానం చెప్పు.. రాజేష్ నీపై చేయి వేస్తే వద్దని చెప్పవా?’ అన్నాడు.దించి ఉన్న తలను నిలువుగా, అడ్డంగా ఊపింది.కేసు కాగితాల్లో జడ్జి ఆమె వయసును చూశాడు. పద్దెనిమిదేళ్ళకు నెల రోజులు తక్కువగా ఉంది. ఇంకేమీ అడగకుండా ‘సరే.. వెళ్లు’ అంటూ ఆమెను పంపించేశాడు.‘బెయిల్ పిటిషన్ వేయాలి’ అని వకీలు శ్రీను వంక చూశాడు.ఆయన చూపులు పసిగట్టి ‘అయిదు వేలు ఉన్నయ్!’ అన్నాడు శ్రీను.‘సరే తే!’ అని డబ్బులు పాకెట్లో పెట్టుకొని వకీల్ వెళ్ళిపోయాడు.బెయిల్ రోజు కేసు తిరగబడింది.అంతా ముందే తెలిసినట్లు జడ్జి ‘ఇది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కిందికి వస్తది. అది నాన్ బెయిలెబుల్ అఫె. కరీంనగర్లో పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది. ఈ కేసును అక్కడికి బదిలీ చేస్తున్న’ అని చెప్పి ఫైలును పక్కన పెట్టేశాడు.రాజేష్ను పోలీసులు తీసికెళ్లారు.ఏమీ అర్థం కాక శ్రీను వకీల్ దగ్గరికి వెళ్ళాడు.‘పోక్సో కేసయింది. కరీంనగర్ కోర్టుకు పోవాలే. ఆన్నే ఫ్రీ లీగల్ సెల్ ఉంటది. వకీలును ఇస్తరు’ అని శ్రీనుకు ఓ చీటీ రాసిచ్చి, నా పని అయిపోయింది అన్నట్లుగా వకీలు జారుకున్నాడు.తెల్లారే శ్రీను కరీంనగర్ వెళ్లి కోర్టులో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని కలిశాడు. వాళ్లు వివరాలు తీసుకొని, ఒక వకీలు దగ్గరికి పంపారు. ‘పోక్సో కేసు కాబట్టి నెల రోజుల్లోపలే తీర్పు వస్తది’ అన్నాడు కొత్త వకీలు.ఆయన అన్నట్లే పదిహేను రోజులకే విచారణకు వచ్చింది.జడ్జి ప్రశ్నలకు రాజేష్ తల వంచుకొని మౌనమే నా సమాధానం అన్నట్లు నిలబడ్డాడు.‘మైనర్ బాలికపై లైంగిక అత్యాచారం చేసిన ముద్దాయి రాజేష్కు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష, యాభై వేల రూపాయల జరిమానా విధిస్తోంది’ అని ఒకే వాక్యంలో జడ్జి తీర్పు చెప్పేశారు. స్పీడ్ కోర్టు తన పవర్ చూయించింది.నిజామాబాద్ జైల్లో చోటు లేదని రాజేష్ను చర్లపల్లి జైలుకు పంపారు.రాజేష్ కాలం మౌనంగా, విచారంగా సాగుతోంది. భార్య ఘాటైన తిరస్కారంతో ఆయన మనసు మరింత కుంచించుకు పోయింది. జైలులో బతకడానికి పర్వాలేదు కాని, చావడానికే మార్గం లేదని విషాదంగా నవ్వుకున్నాడు. బయట చావడానికి ఎన్నో దారులు. ఉరి వేసుకోవచ్చు, రైలు కింద పడవచ్చు, విషం తాగవచ్చు, కత్తితో కోసుకోవచ్చు. ఇక్కడ అవేవీ కుదురవు. ఖైదీ చస్తే నేరం జైలు అధికారులు మోయాలి. అందుకే చావనీయరు.చర్లపల్లి జైలు అధికారుల్లో శోభన్ ఒకరు. ఆయన మనిషికి ఎక్కువ, పోలీసుకు తక్కువ. తన బ్యారక్లోని ప్రతి ఖైదీనీ ఆయన కళ్లు స్కాన్ చేస్తుంటాయి. కోర్టు శిక్ష వేసినా, మనిషిలోని మంచి చెడులను ఆ కళ్లు వేరు చేసి చూడగలవు. కొన్నాళ్లుగా రాజేష్ ఒంటరితనాన్ని గమనించిన శోభన్ ఓ రోజు అతన్ని తన ఆఫీసుకు పిలిపించాడు.‘రా! కూచో.. కోర్టుకు సాక్ష్యాలు కావాలి కాని, జైలుకు వాటితో పనిలేదు. మాతో ఏదైనా మాట్లాడచ్చు’ అన్నాడు.జైలర్ ఇచ్చిన చొరవతో రాజేష్ చాలా రోజుల తర్వాత నోరు విప్పాడు.‘నేను కాలేజీలో మ్యాథ్స్ చెప్పేవాణ్ణి. డెలివరీకి వెళ్లిన భార్య, పుట్టిన పాప ఇంకా అత్తవారింట్లోనే ఉన్నారు. ఈలోగా ఈ సంఘటన జరిగింది. ఒక టీచర్గా నేను చేసింది తప్పే. కారణమేదైనా విధి నిర్వహణకు నాది నమ్మక ద్రోహమే. పోక్సో చట్టం దృష్టిలో నాది నేరమే. అంతా నా ఇçష్ట ప్రకారమే జరిగింది అని పదిహేడేళ్ల అమ్మాయి జడ్జికి చెప్పినా మగాడే నేరస్తుడు అని బొంబాయి కోర్టు శిక్ష వేసింది. మంచీ చెడూ అని గీత గీసి వేరుచేయలేని సున్నితమైన విషయం ఇది. నా విషయంలో మాత్రం నా కుటుంబానికి తీరని ద్రోహం చేశాను. ఐదేళ్ల తరవాత బయటికి వెళ్లినా, మళ్ళీ నా వాళ్ల ముందు నిలబడే మొకం నాకు లేదు’ అన్నాడు తల దించుకుంటూ.తప్పు ఎలా జరిగిందో చెప్పకున్నా జరిగిన నష్టాన్ని రాజేష్ లెక్కేస్తున్న తీరు శోభన్ను కదిలించింది. స్త్రీ పరువు, వృత్తి ధర్మం, కుటుంబ బాధ్యతలకు విలువిచ్చే మనిషి కూడా ఓ ఉద్రేక క్షణాన విచక్షణ కోల్పోవడం దురదృష్టమే అనిపించింది. ఎమ్మెస్సీ చదవాడని తెలిశాక రాజేష్కు జైలు స్కూల్లో పని దొరికింది. తన చదువు నలుగురికి పనికొస్తున్నందుకు రాజేష్కు కొంత తృప్తిగా ఉంది.అలా రెండేళ్లు గడిచాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా రాజేష్ను కలవడానికి ఎవరూ రాలేదు. అసలు అక్కడి పరిస్టితి ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో శోభన్ ఓ సెలవు రోజు సరాసరి రాజేష్ అత్తవారింటికి వెళ్ళాడు.తానెవరో చెప్పగానే శ్రీను ‘నమస్తే సార్!’ అంటూ కుర్చీ వేశాడు.గోడవారగా కూచొని బీడీలు చుడుతున్న ఈశ్వరి తలెత్తి ఆయన్ని చూడలేదు. ఆమె పక్కనే పాపను ముందేసుకుని అమ్మమ్మ కూచుంది.‘ఏమయ్యా మీ బావను చూడ్డానికి రావచ్చు కదా!’ అన్నాడు శోభన్ చొరవగా.‘ఎవరూ పోవద్దని మా అక్క ఒట్టేయించుకుంది సార్!’ అన్నాడు శ్రీను.అప్పుడాయన ఈశ్వరి వైపు తిరిగి ‘నీ భర్త తప్పే చేశాడు కాని చెడ్డవాడు కాదమ్మా!’ అన్నాడు శాంత స్వరంలో.ఆమె జవాబీయలేదు.‘తప్పు చేసినంక మంచోడెట్లయితడు అంటది. బావ గురించి ఇంకో మాటే మాట్లాడది’ అన్నాడు శ్రీను.‘జైల్లో బతుకుతున్నవాళ్లకు తమవారిని కలవడమే పరమానంద క్షణాలు. తమ కోసం ఎవరు రాని ఖైదీలు భోజనం కూడా సరిగా చేయరు. నలుగురిలో కలవరు. రాజేష్ పరిస్థితి అలాగే ఉంది. అందుకే నేను ఇక్కడి దాకా వచ్చాను.’ అన్నాడు శోభన్.ఈశ్వరిలో కదలిక లేదు. ఆ మాటలు విననట్లే ఉంది.‘అది చాలా మొండిది సార్.. మేం చెప్పి చెప్పి చాలించుకున్నాం’ అన్నాడు శ్రీను.‘తమ వారు జైల్లో ఉంటే ఏ కుటుంబానికైనా నలుగురి ముందు తలవంపే! ఓ రకంగా కుటుంబమంతా శిక్ష అనుభవిస్తున్నట్లే! కాలాన్ని వెనుకకు తిప్పలేం. కాబట్టి ఏదో తోవ పట్టుకొని మనమే ముందుకు నడవాలి’ అని ఆగి, జవాబు కోసం ఈశ్వరి వైపు చూశాడు. షరా మామూలే. ఆమెలో ఏ మార్పు లేదు. అంతలో ఒకామె టీ తీసుకోని వచ్చింది.కప్పు అందుకుంటూ ‘ఈమె ఎవరు?’ అన్నాడు శోభన్. ‘అదే పిల్ల, విమల. మా బావకు శిక్ష..’ అని ఆగాడు శ్రీను.ఆ మాట వినగానే చేయి కాలినట్లు కప్పు వెంటనే పక్కన పెట్టాడు.‘ఈ ఊరేనా?’‘‘కాదు. దూరమే. కాని, కోర్టు తీర్పు వచ్చినంక ఊర్లె కుల పంచాయతీ పెట్టిండ్రు. ‘దీని బతుకు ఖరాబు చేసినోనికి ఐదేండ్లు జైలు శిక్ష, యాభై వేలు జుల్మానాతో సరిపోయింది. మరి దీన్ని ఎవడు చేసుకుంటడు’.. అని విమల నాయన అడిగిండు. ‘కోర్టులనే పంచాయతీ తెగింది. ఇంకేముంటది’ అని పెద్దమనుషులు అన్నరు. అప్పుడు విమల నాయన మా అక్కతోటి ‘అవునే ఈశ్వరీ.. నువ్వు ఆడదానివే కదా.. ఆడు నీ మొగడే కదా.. న్యాయం నువ్వే చెప్పు. నీ మాటే ఖరారు’ అన్నడు. అప్పుడు అక్క లేచి విమల చేయి పట్టుకోని.. రాజేష్ వచ్చినంక సంసారం చేసేది విమలతోనే’ అని ఈమెను ఇంటికి తెచ్చింది’’ అన్నాడు శ్రీను.ఈశ్వరి శిల్పంలా అలాగే ఉంది. ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో శోభన్ బుర్రకు తట్టడం లేదు. ఈశ్వరి పట్ల గౌరవం పెరిగినా, ఆమెను కరిగించే విద్య తన వద్ద లేదనుకున్నాడు. ప్రత్యర్థి చెక్ పెట్టాక దారి తెలియని ఆటగాడిలా లేచి నిలబడ్డాడు.‘సరే.. వెళ్ళొస్తా!’ అంటూ బయటికి వచ్చాడు. ఈశ్వరి గంభీర మౌనాన్ని ఛేదించలేక శోభన్ వాగ్బాణాలన్నీ విరిగిపోయాయి. ఆయన మనసంతా గందరగోళంగా ఉంది.ఊరి బయట ఉన్న చిన్న హోటల్లో టీ తాగుతూ కాసేపు గడిపాడు. చేసేదేమి లేక కొంత గ్యాప్ తీసుకోని మళ్ళీ రావాలని అనుకుంటూ బయటికి వచ్చాడు. కారు డోర్ తెరుస్తుండగా కొద్ది దూరంలో రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టు కింద విమల నిలబడి ఈయన్నే చూస్తూ కనబడింది. ఆమెను గుర్తు పట్టి అక్కడే ఉండు అని చేయి ఊపి కారును తీసికెళ్ళి ఆమె ముందు ఆపాడు.కారు దిగుతూ ‘ఏంటమ్మా ఈమె ఎవరికీ అర్థం కాకుండా ఉంది’ అన్నాడు తాను చెట్టు కిందికి వెళుతూ.‘పట్టింపులు ఎక్కువైనా.. ఈశ్వరక్క చాలా మంచిది. నన్ను మా ఇంట్లో కన్నా మంచిగా చూసుకుంటది. డిగ్రీ కూడా చదివిస్తానంటున్నది. తర్వాత ఏదైనా ఉద్యోగం చేస్తాను. అయితే..’ అని విమల అటు ఇటు చూసింది.‘నీకేం కాదమ్మా.. నేను ఉన్నాను కదా! మనసులో ఉన్నదంతా చెప్పేయ్!’ అన్నాడు.‘నాకు శ్రీను అంటే ఇష్టం’ అంది మెల్లగా.ఈ ట్విస్టుకు అడ్జస్టు కావడానికి శోభన్కు కొంత సమయం పట్టింది.‘జరిగింది ఓ పీడకల అనుకుంటా సార్! దాన్నే తలుచుకుంటూ ఏడుస్తూ కూచుంటే ఇక్కడ కొన్ని జీవితాలు, కుటుంబాలు కోలుకోలేని దెబ్బ తింటున్నాయ్’ అంది.విమల మాటలు ఆయనకు ఎన్నడూ చదవని పాఠంలా అనిపించాయి. గాయపడిన పక్షి ఎగరడానికి రెక్కలను టపటప ఆడిస్తున్నట్లుగా ఉన్నాయి.‘మరి శ్రీను..’ అన్నాడు విషయంలోకి వస్తూ.‘శ్రీనుకు కూడా ఇష్టమే. అసలైతే రాజేష్ సార్ జైలు నుంచి రాగానే మేమిద్దరం దూరంగా వెళ్లిపోదామనుకున్నాం. అయితే ఈశ్వరక్క నమ్మకాన్ని దెబ్బ తీశామనే బాధ వదిలేది కాదు. మీరు తలుచుకుంటే మా నలుగురి బతుకుల్ని సరిదిద్దగలరని ఆశ పుడుతోంది’ అంది చేతులు జోడిస్తూ. ఆ మాటలకు ఈశ్వరి వేసిన కటికముడి కొద్దిగా విచ్చుకుంటున్న ఆశ శోభన్ మనసులో కదిలింది.‘గుడ్ విమలా! మీ నిర్ణయం వండర్ ఫుల్. నా సర్వీసులో ఇదొక డిఫరెంట్ చాలెంజ్. వదిలి పెట్టను. మళ్ళీ వస్తాను. మళ్ళీ మళ్ళీ వస్తాను. విజయం మనదే. ఆల్ ది బెస్ట్!’ అంటూ కారులో కూచున్నాడు.‘మెనీ మెనీ థాంక్స్ సార్. బై బై!’ అంటూ విమల వీడ్కోలు చెప్పింది. -
ఏఐ కారణంగా... వచ్చే ఉద్యోగాలేవి? పోయే ఉద్యోగాలేవి?
ప్రతి నాణేనికీ బొమ్మ బొరుసులు ఉంటాయి; ప్రతి పరిణామానికీ మంచి చెడులు ఉంటాయి; కృత్రిమ మేధకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) కూడా ఉభయ కోణాలూ ఉంటాయి. ఏఐ దెబ్బకు ఇప్పటికే ఉన్న అనేక ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ సాంకేతికత కొత్త ఉద్యోగాలకు ఊపిరి పోస్తుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఏఐ కారణంగా...వచ్చే ఉద్యోగాలేవి? పోయే ఉద్యోగాలేవి? ఏఐ కాయిన్కి అటూ ఇటూ ఒకసారి పరిశీలించి చూద్దాం.ఏఐ దెబ్బకు ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు పోయిన మాట నిజమే! సమీప భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకూ ఎసరొచ్చే పరిస్థితులు కూడా నిజమే! కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన తర్వాత టైపిస్టుల ఉద్యోగాలు క్రమంగా తెరమరుగైపోయాయి. చిన్నా చితకా పట్టణాల్లోనూ కనిపించే టైప్ ఇన్స్టిట్యూట్లు శాశ్వతంగా మూతబడ్డాయి. కొత్త సాంకేతికత ఏదైనా విరివిగా వాడుకలోకి వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. నిజానికి లెక్క చూసుకుంటే, కంప్యూటర్ల వల్ల పోయిన ఉద్యోగాల కంటే కొత్తగా వచ్చిన ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన కొత్తలో టైపిస్టుల ఉద్యోగాలు పోయినా, కనీస నైపుణ్యాలు కలిగినవారికి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు వచ్చాయి. కంప్యూటర్ల వాడకం పెరిగాక రకరకాల అవసరాల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. అదే రీతిలో ఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు లేకుండా పోయినా, ఇంకొన్ని కొత్త తరహా ఉద్యోగాలు రానున్నాయి. ఏఐ కారణంగా పోయే ఉద్యోగాల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అమెరికన్ కంపెనీ ‘ఆంత్రోపిక్’ సీఈవో, ‘క్లాడ్’ ఏఐ మోడల్ రూపకర్త డేరియో అమోడీ ఏఐ ప్రభావం వల్ల వచ్చే ఐదేళ్లలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు సగానికి సగం తగ్గిపోతాయని చెబుతుంటే, ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ వంటి అంతర్జాతీయ సంస్థలు భిన్నమైన అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఏఐ ప్రభావం వల్ల వచ్చే ఐదేళ్లలో కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఈ సంస్థలు చెబుతున్నాయి.కోట్లలో కొత్త ఉద్యోగాలుఈ ఏడాది పూర్తయ్యేలోగా ఏఐ వల్ల వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 9.7 కోట్ల ఉద్యోగాలు కొత్తగా పుట్టుకొస్తాయని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ అంచనా వేస్తోంది. వైద్యరంగంలో రోగనిర్ధారణ చేయడంలో ఏఐ మానవ వైద్యులను మించిన పనితీరును ఇప్పటికే ప్రదర్శిస్తోంది. అకౌంటింగ్, భాషానువాదం వంటి రంగాల్లోనూ ఏఐ తన సత్తా చాటుకుంటోంది. ఏఐ ఎన్ని సేవలకు ప్రత్యామ్నాయం కాగలిగినా, అంతిమ నిర్ణయం తీసుకునే శక్తి మాత్రం మానవులదే! మానవ నిర్ణయాత్మక శక్తికి ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు. రానున్న కాలంలో ఏఐ మరింతగా అభివృద్ధి చెంది, పరిశ్రమల తీరుతెన్నులను మార్చేస్తుందని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఆరోగ్య, ఆర్థిక, సాంకేతిక తదితర రంగాల్లో ఏఐ ప్రభావం వల్ల 2030 నాటికల్లా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు5 కోట్ల వరకు కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘మెక్ కిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్’ అంచనా వేస్తోంది. సాంకేతిక నైపుణ్యానికి తోడు మానవ కౌశలం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, భావోద్వేగ మేధాశక్తి అవసరమయ్యే ఉద్యోగాలు పలు రంగాల్లో కొత్తగా పుట్టుకొస్తాయని, వీటికి తగినట్లుగా శరవేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలను సాధించగలిగితే, ఏఐ ఆధారిత ఉద్యోగాలను దక్కించుకోవడం అంత కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా వచ్చే ఉద్యోగాలుఏఐ వాడకం పెరగడం వల్ల పలు రంగాల్లో కొన్ని సాంకేతిక, సాంకేతికేతర ఉద్యోగాలు రానున్నాయి. ఆ కొత్త ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల్లోపనిచేసేవారు నిర్వర్తించే విధుల గురించి సంక్షిప్త సమాచారండేటా సైంటిస్ట్డేటా సైంటిస్టులు సంస్థకు అవసరమైన డేటాను విశ్లేషించి, అందులోని సమాచారాన్ని సంస్థ నిర్ణయాలకు ఉపయోగపడేలా క్రోడీకరించి అందిస్తారు.మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్: మెషిన్ లెర్నింగ్ మోడల్స్కు రూపకల్పన చేయడం, వాటిని వాస్తవ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ల ప్రధానమైన పనులు. వీరు డేటా సైంటిస్టులకు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు మధ్య వారధిలా పనిచేస్తారు.రోబోటిక్స్ ఇంజినీర్: రోబోల రూపకల్పన, నిర్మాణం, ఆటోమేటెడ్ సిస్టమ్స్తో రోబోలను అనుసంధానం చేయడం రోబోటిక్స్ ఇంజినీర్ల ప్రధానమైన పనులు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్స్ ఇంజినీరింగ్ విభాగాల సమ్మిళిత పరిజ్ఞానంతో వీరు పనిచేస్తారు.ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్: ఏఐ రీసెర్చ్ సైంటిస్టులు కొత్త ఆల్గోరిథమ్స్ను, ఏఐ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చేసేందుకు కావలసిన మెలకువలను రూపొందించడం; డిజైనింగ్ ప్రయోగాలు చేయడం; నమూనాలను రూపొందించడం; వాటికి అవసరమైన పరిశోధనలు సాగించడం వంటి పనులు చేస్తారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) ఇంజినీర్: ఎన్ఎల్పీ ఇంజినీర్లు– మనుషుల భాషను అర్థం చేసుకుని, విశ్లేషించేలా కంప్యూటర్లను రూపొందిస్తారు. మనుషుల భాషలోని ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేలా కంప్యూటర్లను తీర్చిదిద్దుతారు.కంప్యూటర్ విజన్ ఇంజినీర్: ఫొటోలు, ఇతర చిత్రాలు, వీడియోలను చూసి, వాటిని అర్థం చేసుకుని విశ్లేషించేలా కంప్యూటర్లను రూపొందించడంలో కంప్యూటర్ విజన్ ఇంజినీర్లు కీలకంగా పనిచేస్తారు.ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్: ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించుకునే సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందిస్తారు. సంస్థ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తారు.ఏఐ ఆర్కిటెక్ట్: సంస్థకు అవసరమైన ఏఐ సిస్టమ్స్ను రూపొందించడంలోను, వాటిని వినియోగంలోకి తేవడంలోను ఏఐ ఆర్కిటెక్ట్లు కీలకంగా పని చేస్తారు. ఏఐ సాంకేతిక ఉపయోగానికి అవసరమైన అవకాశాలను గుర్తించడంలోను, ఏఐ సాంకేతికతకు తగిన సాధనా సంపత్తిని సమకూర్చడంలోను వీరిదే ప్రధాన పాత్ర.ఏఐ ట్రైనర్: ఏఐ సిస్టమ్స్కు శిక్షణ ఇవ్వడం ఏఐ ట్రైనర్ల పని. డేటాను, ఫీడ్బ్యాక్ను అర్థం చేసుకుని, పనితీరును మెరుగుపరచుకునేలా ఏఐ సిస్టమ్స్ను వీరు అభివృద్ధి చేస్తారు.ప్రాంప్ట్ ఇంజినీర్: జెనరేటివ్ ఏఐ మోడల్స్ నుంచి ఆశించిన ఔట్పుట్ను రాబట్టేందుకు అవసరమయ్యే ఆదేశాలను, సూచనలను రూపొందించడంలో ప్రాంప్ట్ ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఏఐ అప్లికేషన్ల పనితీరును గరిష్ఠస్థాయిలో మెరుగుపరచే దిశగా వీరు వాటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంటారు.ఏఐ ఎథిసిస్ట్: ఏఐ వినియోగం పెరిగే కొద్ది ఏఐ ఎథిసిస్టుల అవసరం కూడా పెరుగుతుంది. ఏఐ వల్ల జరిగే అనుకోని పొరపాట్లను, వాటి కారణంగా ఎదురయ్యే నైతిక సమస్యలను నివారించేందుకు తగిన రీతిలో ఏఐ సిస్టమ్స్ను తీర్చిదిద్దడం, ఏఐ వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ఏఐ ఎథిసిస్టుల ప్రధానమైన పనులు.ఎక్స్ప్లెయినర్స్ఏఐ డెవలపర్స్కు, ఏఐ సేవలను వినియోగించుకునే వ్యాపార సంస్థల యాజమాన్యాలకు మధ్య ఎక్స్ప్లెయినర్స్ వారధిలా పనిచేస్తారు. ఏఐ విధానాలు పారదర్శకంగా ఉండేలా చూడటం, వాటి పనితీరును, ప్రయోజనాలను వ్యాపార సంస్థల యాజమాన్యాలకు వివరించడంలో ఏఐ డెవలపర్స్ కీలక పాత్ర పోషిస్తారు. మార్పులకు లోనయ్యే ఉద్యోగాలుఏఐ ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న పలు ఉద్యోగాల్లో మార్పులు ఇప్పటికే మొదలయ్యాయి. ఏఐ వినియోగం పెరిగే కొద్ది ఈ ఉద్యోగాల్లో మరిన్ని మార్పులు కూడా జరగనున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పని ఏఐ వల్ల మరింత సులభతరం అవుతుంది. కోడింగ్ వంటి కొన్ని పనులను ఏఐ చేసేయగలుగుతుంది. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పనిభారం తగ్గుతుంది. అంతమాత్రాన వారి అవసరం పూర్తిగా లేకుండాపోదు. సంక్లిష్టమైన పనులు సజావుగా జరిగేలా చూడటంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పాత్ర కొనసాగుతుంది. డేటా అనలిస్టుల పని కూడా ఏఐ వల్ల సులభతరం అవుతుంది. డేటా సేకరణ, విశ్లేషణ వంటి పనులను ఏఐ స్వయంగా చేసేస్తుంది. మార్కెట్ ధోరణులను గుర్తించడం, డేటా ఫలితాలను విశ్లేషించడం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో డేటా అనలిస్టులు మరింత సమర్థంగా పనిచేసేందుకు వీలు చిక్కుతుంది. ఏఐ వల్ల సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్ ఉద్యోగుల పని కూడా చాలా వరకు తేలికవుతుంది. టార్గెటెడ్ యాడ్స్ గుప్పించడం వంటి పనులను ఏఐ స్వయంగా చేసేస్తుంది. మనుషులతో నేరుగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఈ ఉద్యోగులు స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది.కనుమరుగయ్యే ఉద్యోగాలుఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు అతి త్వరలోనే తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలైతే దాదాపుగా కనుమరుగైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. టైపింగ్, కాపీయింగ్, పేస్టింగ్ వంటి పనులను ఏఐ స్వయంగా చేయగలుగుతోంది. దీనివల్ల డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏఐతో పనిచేసే అధునాతన డ్రైవర్లెస్ వాహనాలు ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి పెద్దసంఖ్యలో వాడుకలోకి వస్తే, ఇక డ్రైవర్ ఉద్యోగాలు కూడా కనుమరుగైపోతాయి. కర్మాగారాల్లో బరువులు ఎత్తడం, బరువైన వస్తువులను ఒకచోటి నుంచి మరొక చోటికి చేర్చడం వంటి పనులను సునాయాసంగా చేయగలిగే ఏఐ రోబోలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే వాడుకలోకి వచ్చాయి.ఇవి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేటట్లయితే, కర్మాగారాల్లో పనిచేసే నైపుణ్యాలు లేని కార్మికుల ఉద్యోగాలు అంతరించిపోతాయి. ఈ–కామర్స్ రంగంలో ఏఐ వాడకం మెల్లగా పెరుగుతోంది. ఇది మరింతగా పెరిగితే, రిటైల్ సేల్స్ ఉద్యోగులు ఇతర ఉపాధి మార్గాలను వెదుక్కోక తప్పదు. అకౌంటింగ్ రంగంలో బుక్ కీపింగ్ సహా ప్రాథమిక అకౌంటింగ్ పనులన్నీ ఏఐ సాయంతో ఆటోమేషన్ ద్వారా జరిగిపోతున్నాయి. దీనివల్ల కిందిస్థాయి అకౌంటింగ్ ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏఐ ద్వారా అందుబాటులోకి వచ్చిన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) సిస్టమ్స్ పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో త్వరలోనే పత్రికా సంస్థలు, ప్రచురణ సంస్థల్లో ప్రూఫ్ రీడర్స్, ట్రాన్స్లేటర్స్ ఉద్యోగాలు ఇకపై ఉండకపోవచ్చు. ఏఐ ప్రభావం వల్ల మనుషులు చేసే ఉద్యోగాల్లో చాలావరకు అంతరించిపోతాయని, ఉద్యోగాల్లో మనుషుల అవసరం గణనీయంగా తగ్గిపోతుందనే వాదనలు జనాల్లో గందరగోళం రేపుతున్నాయి. ఏఐ ప్రభావం వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నా, అంతకు మించి కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏఐ సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోగలిగే వారికి సమీప భవిష్యత్తులోనే పుష్కలంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయని ప్రపంచస్థాయి ప్రీఎమినెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ‘గోల్డ్మన్ సాక్స్’ అంచనా వేసింది. ఏఐ కారణంగా 25 శాతం వరకు నైపుణ్యాలు లేని కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఉన్నట్లు చెబుతోంది. మరోవైపు ఏఐ కారణంగా 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం ఉద్యోగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అమెరికన్ బహుళజాతి ఆర్థిక సంస్థ ‘జేపీ మోర్గాన్ చేజ్’ అంచనా వేస్తోంది. ఏఐ ప్రభావంతో వచ్చే ఉద్యోగాలు, పోయే ఉద్యోగాల పరిస్థితులు ఎలా ఉన్నా, ఏఐ ప్రభావం వల్ల ప్రపంచం మరింత ముందుకు పురోగమించడం మాత్రం ఖాయం. -
జాలరి చిన్నయ్య..!
కుంతలదేశాన్ని రత్నాకరుడు పాలించేవాడు. అతని కూతురు ప్రభావతి. ఒకసారి ప్రభావతి తన ఇష్టసఖులతో చెరువు గట్టున ఉన్న చెట్టుకు తాడుతో ఊయలలు వేసుకుని ఊగుతుండగా, పట్టు జారి నీళ్లలో పడిపోయింది. ఇష్టసఖులు ‘కాపాడండి... కాపాడండి’ అని గట్టిగా కేకలు వేశారు. అటుపక్కగా పడవలో ఉన్న జాలరి చిన్నయ్యకు ఆ కేకలు వినిపించాయి. వెంటనే అతడు నీటిలోకి దూకాడు. ఈదుతూ వెళ్లి, మునిగిపోతున్న ప్రభావతిని కాపాడి, ఒడ్డుకు చేర్చి తాగిన నీటిని కక్కించాడు. ‘కొన్ని క్షణాలు ఆలస్యం అయితే ఆమె ప్రాణానికే హాని కలిగేది’ అన్నాడు చిన్నయ్య. ఇష్టసఖులు ఆతనికి కృతజ్ఞతలు చెప్పారు.యువరాణితో పాటు అందరూ రథంలో కోటకు చేరారు. విషయం తెలిసిన మహారాజు ఇక మీదట నీటి ప్రాంతం వైపు వెళ్లవద్దని యువరాణిని మందలించాడు. మహారాణి ప్రభావతి మెడలో వజ్రాలహారం కనబడలేదు అని గుర్తించింది. మంత్రితో చెప్పి ఆ జాలరిని పిలిపించమన్నాడు రాజు. చిన్నయ్య వచ్చాడు. ‘యువరాణిని కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు. కాని, ఆమె మెడలో వజ్రాలహారం మాయమైంది. ఇందుకు నీ సమాధానం!’ అన్నాడు రాజు.‘మహారాజా! అరుపులు విని యువరాణిని కాపాడాను. ఆ హారం గురించి నాకేమీ తెలియదు!’ అన్నాడు చిన్నయ్య. ‘ఆ హారం దొరికే వరకు ఇతణ్ణి చెరసాలలో బంధించండి’ అని ఆదేశించాడు రాజు. విషయం తెలిసిన చిన్నయ్య తల్లిదండ్రులు లచ్చి,పెద్దయ్య వచ్చి, మహారాజును ఎంతగా వేడుకున్నా ఫలితం లేకపోయింది. ‘మహారాజా! ఆ జాలరి లేకపోతే ఆ సమయంలో యువరాణిని ఎవరు కాపాడేవారు’ అన్నాడు న్యాయాధికారి. ‘యువరాణిగారి జాతకంలో ఆమెను ప్రాణాపాయం నుండి కాపాడిన వాడితోనే వివాహం జరుగుతుంది అని ఉంది మహారాజా!’ అన్నాడు మంత్రి. ఇద్దరి మాటలూ విన్న రాజు మౌనంగా తన ప్రత్యేక మందిరానికి వెళ్లిపోయాడు. ఇంటికి విచారంగా వచ్చిన పెద్దయ్య, లచ్చి ‘మనవాడు రెండు, మూడుసార్లు బంగారు రంగు చేప గురించి చెప్పాడు. వలలో పడ్డా విడిచి పెట్టానని’ అన్నాడు పెద్దయ్య. ‘అవును మావా! రేపు మనం కూడా పడవ వేసుకుని ఆ చెరువులోకి వెళదాము’ అంది లచ్చి.మరుసటి రోజు పడవలో చెరువుకు వెళ్లి వల వేశారు కాని, బంగారు రంగు చేప పడలేదు. అలా రెండు మూడు రోజులు వెళ్ళాక ఒక రోజు చిన్నయ్య పడవను గుర్తు పట్టిన ఆ బంగారు చేప వలలో పడింది.‘చినయ్య లేడా... మీరు ఎవరు?’ అని అంది ఆ చేప. ‘మేము చిన్నయ్య అమ్మా అయ్యలం’ అని జరిగింది చెప్పారు. ‘నేను నీటిలో దొరికిన చాలా వస్తువులను నీటి అడుగున ఒక స్థలంలో దాచాను. ఈ మద్యనే ఒక వజ్రాల హారం దొరికింది. రేపు రాజుగారిని ఇదే చోటుకు తీసుకు రండి. ఇక నన్ను వదలండి, ఊపిరి ఆడడం లేదు’ అంది ఆ బంగారు రంగు చేప. ‘అలాగే’ అని నీటిలో వదిలేశారు లచ్చి, పెద్దయ్యలు. మరుసటి రోజు లచ్చి,పెద్దయ్యలు కోటకు వెళ్లి చేప విషయం చెప్పారు. రాజు, మంత్రి వారితో కలసి పడవలో ఆ చెరువుకు వెళ్లి చేప చెప్పిన ప్రదేశం వద్ద ఆగారు. కాసేపటికి ఆ బంగారు చేప వచ్చి వారిని చూసి ‘ఇప్పుడే వస్తాను’ అని మళ్లీ నీటిలోకి వెళ్లి, నోటితో ఒక్కొక్క నగ తెచ్చి వారికి ఇచ్చింది. వాటిలో ఎన్నో నగలతో పాటు ప్రభావతి వజ్రాలహారం కూడా ఉంది. ‘ఇందులో మా రాజవంశానికి చెందిన వారు పోగొట్టుకున్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. నీకు కృతజ్ఞతలు’ అన్నాడు రాజు.‘నీటిలో దొరికిన వీటిని మా పిల్లల కోసం దాచాను’ చెప్పింది బంగారు చేప. మంత్రి కూడా చేపను మెచ్చుకున్నాడు.‘రాజా! ఇక చిన్నయ్యను వదిలేయండి. నేను ఉంటాను’ అని నీటిలోకి వెళ్లిపోయింది ఆ చేప. ‘కోటకు చేరుకోగానే మీ అబ్బాయిని విడుదల చేస్తాము’ అన్నాడు రాజు, చిన్నయ్య తల్లిదండ్రులతో.‘అలాగే మారాజా!’ అన్నారు వారు. మహారాజుతో మంత్రి, న్యాయాధికారి సమావేశమయ్యారు. ‘చూశారా మహారాజా... అమాయకుడు అయిన జాలరి చిన్నయ్యను చెరలో పెట్టించారు. పోయిన వజ్రాల హారంతో ఎప్పుడో పోయిన విలువైన బంగారు వస్తువులు అతని వల్లనే కదా దొరికాయి. అతని వలలో పడ్డ ఆ బంగారు చేపను మన కోటకు తెచ్చి అమ్ముకొని ఉంటే ఆ ధనం కొన్ని నెలలు వారి కుటుంబ పోషణకు వచ్చేది. చిన్నయ్య దయగల వాడు కనుకనే నీటిలో వదిలేశాడు’ అన్నాడు న్యాయాధికారి. ‘అవును మహారాజా! అతను జాలరి అయితే కావచ్చు. అతనిని గురుకులంలో చేర్పించి, అన్ని విద్యలూ నేర్పించి ప్రయోజకుడు అయ్యాక యువరాణిని ఇచ్చి వివాహం జరిపించడం ఉత్తమమైన పని’ అన్నాడు మంత్రి. ‘అవును మీరు అన్నట్లు ప్రాణాలు కాపాడినవాడు ఉత్తముడు’ అన్నాడు రాజు. తరువాత చిన్నయ్యను గురుకులంలో చేర్పించి, అతడు సకల విద్యలూ పూర్తి చేశాక యువరాణితో వివాహం జరిపించాడు రాజు. చిన్నయ్యతో పాటు అతని తల్లిదండ్రులు, గూడెం ప్రజలు రాజుగారి సంస్కారాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. జాలరి చిన్నయ్య..! -
విష్ణుదత్తుడికి దత్తాత్రేయుడి దర్శనం
సహ్యాద్రి ప్రాంతంలో మాతాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో విష్ణుదత్తుడనే విప్రుడు ఉండేవాడు. ఆయన నిష్ఠాగరిష్ఠుడు. ఆయన భార్య పేరు సుశీల. పేరుకు తగినట్లే భర్తకు అనుగుణంగా నడుచుకునేది. విష్ణుదత్తుడు నిత్యనైమిత్తిక కర్మలను క్రమం తప్పక ఆచరించేవాడు. అతడి ఇంటి ఆవరణలో రావిచెట్టు ఉండేది. ఆ రావిచెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటుండేవాడు.విష్ణుదత్తుడు ప్రతిరోజూ నిత్యకర్మలను పూర్తి చేసుకున్న తర్వాత భోజనానికి ముందు రావిచెట్టు కింద భూతబలి సమర్పిస్తుండేవాడు. అలా సమర్పించిన ఆహారాన్ని రావిచెట్టు మీదనున్న బ్రహ్మరాక్షసుడు కాకిరూపంలో వచ్చి ఆరగించేవాడు. ఆ ప్రసాదాన్ని రోజుల తరబడి ఆరగిస్తుండటంతో బ్రహ్మరాక్షసుడిలో తామస ప్రవృత్తి నశించింది. ఒకరోజు ఆ రాక్షసుడికి ఒక సద్బుద్ధి పుట్టింది. తనకు చాలా రోజులుగా తిండిపెడుతున్న విష్ణుదత్తుడికి ఏదైనా మేలు చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే, బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుడి ఎదుట సౌమ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ‘విప్రవర్యా! రోజూ నువ్వుపెడుతున్న అన్నం తింటున్నాను. నీకు ఏదైనా మేలు చేయాలని అనిపించింది. నేను ఏదైనా చేయగల సమర్థుడిని. ఏమాత్రం సంకోచించక నీకు నేను చేయగల ప్రత్యుపకారం ఏమిటో చెప్పు. తప్పక చేస్తాను’ అన్నాడు.విష్ణుదత్తుడు తన భార్యతో చర్చించి, ‘రాక్షసోత్తమా! మాకు తీరని కోరిక ఒకటి ఉంది. దత్తస్వామి ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని వినడమే గాని, ఏనాడూ వారి దర్శనభాగ్యం మాకు కలగలేదు. వారిని ఒకసారి చూపించు, చాలు’ అని చెప్పాడు.‘చాలా మంచి కోరిక. కాని, ఒక షరతు. దత్తస్వామిని అల్లంత దూరం నుంచి చూపించే ప్రయత్నం మూడుసార్లు చేస్తాను. ఆయన చిత్ర విచిత్ర రూపాలలో తిరుగుతూ ఉంటాడు. గుర్తించి ఆయనను పట్టుకోగలిగితే నీ అదృష్టం’ అన్నాడు రాక్షసుడు. విష్ణుదత్తుడు సరేనన్నాడు.ఒకరోజు విష్ణుదత్తుడు ఏదో పనిలో ఉండగా, బ్రహ్మరాక్షసుడు హఠాత్తుగా వచ్చాడు. ‘దత్తస్వామి ఇక్కడకు దగ్గరలోనే తిరుగుతున్నాడు. వెంటనే నాతో రా’ అని పిలిచాడు. విష్ణుదత్తుడు హుటాహుటిన అతడి వెంట బయలుదేరాడు. బ్రహ్మరాక్షసుడినే అనుసరిస్తూ ఒక వీథిలోకి చేరుకున్నాడు. ఆ వీథిలో మద్య మంసాదులు విక్రయిస్తున్న అంగళ్లు ఉన్నాయి. అక్కడ ఒక వ్యక్తి తప్పతాగి, పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. రాక్షసుడు ఆ వ్యక్తిని చూపించి, ‘అతడే దత్తస్వామి. వెళ్లి దర్శించు’ అని విష్ణుదత్తుడికి చెప్పి వెళ్లిపోయాడు. కళ్ల ముందు ఉన్న ఉన్మాదిని దత్తస్వామి అని నమ్మలేకపోయాడు విష్ణుదత్తుడు. రాక్షసుడు తనను ఆటపట్టించడానికి అలా చెప్పి ఉంటాడని భావించి, అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.రాక్షసుడు మళ్లీ విష్ణుదత్తుడికి కనిపించి, ‘విప్రోత్తమా! ఏమి మందమతివయ్యా! నీకు ముందే చెప్పాను కదా, దత్తస్వామి చిత్రవిచిత్ర రూపాల్లో తిరుగుతుంటాడని. మరచినట్లున్నావు. అందుకే గుర్తించలేక వెనుదిరిగావు. పోనీలే, ఈసారి మళ్లీ చూపిస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు.కొన్నాళ్లకు రాక్షసుడు మళ్లీ వచ్చాడు. ‘విష్ణుదత్తా! రా రా! దత్తస్వామి ఇక్కడకు దగ్గరలోనే తిరుగుతున్నాడు’ అని పిలిచాడు. విష్ణుదత్తుడు అతడితో పాటే వెళ్లాడు. ఈసారి రాక్షసుడు శ్మశానానికి దారితీశాడు. శ్మశానంలో దుమ్ముకొట్టుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అతడి చేతిలో కపాలం ఉంది. చుట్టూ నాలుగు కుక్కలు ఉన్నాయి. ‘అతడే దత్తస్వామి’ చెప్పాడు రాక్షసుడు. విష్ణుదత్తుడు అతడి వద్దకు చేరుకోబోయాడు. అతడు కస్సుమంటూ చేతికందిన కట్టెతో విష్ణుదత్తుడిని కొట్టాడు. విష్ణుదత్తుడు భయంతో గజగజలాడుతూ వెనుదిరిగి చూడకుండా ఇంటికి పరుగు తీశాడు. రాక్షసుడు దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉన్నాడు. ‘వెర్రిబాపడు ఈసారి కూడా అవకాశాన్ని పాడుచేసుకున్నాడు’ అనుకుని విచారించాడు.ఇంకొన్నాళ్లకు రాక్షసుడు మళ్లీ వచ్చాడు. ‘విష్ణుదత్తా! నీకు ముందే చెప్పాను. మూడుసార్లు దత్తస్వామిని దూరం నుంచి చూపిస్తానని. ఇదే చివరిసారి. దత్తస్వామి దగ్గర్లోనే ఉన్నాడు. వెంటనే నాతో రా’ అన్నాడు. విష్ణుదత్తుడు రాక్షసుడి వెంట బయలుదేరాడు. ఈసారి ఏం జరిగినా, దత్తస్వామి పాదాలను వదలకూడదని ముందే నిశ్చయించుకున్నాడు.రాక్షసుడు ఈసారి ఊరవతలి వెలివాడకు దారితీశాడు.కొంతదూరంలో ఒక వికృతాకారుడు కనిపించాడు. అతడు ఒక గాడిద కళేబరం నుంచి మాంసం ముద్దలను పెకలించి, వాటిని కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు విందుగా పెడుతున్నాడు. ‘విష్ణుదత్తా! అతడే దత్తస్వామి. వెళ్లి అతడి పాదాలను ఆశ్రయించు’ అని చెప్పి బ్రహ్మరాక్షసుడు వెళ్లిపోయాడు.కాకులూ గద్దలకూ, కుక్కలూ నక్కలకూ గాడిద మాంసం పంచుతున్న వికృత స్వరూపుణ్ణి చూడగానే విష్ణుదత్తుడికి ఒళ్లు జలదరించింది. ఏదైతే అదే జరుగుతుంది అనుకుని, విష్ణుదత్తుడు ధైర్యం కూడదీసుకున్నాడు. నేరుగా వికృతాకారుడి వద్దకు చేరుకుని, అతడి పాదాలు పట్టుకున్నాడు. ‘ఓరీ మూఢుడా! నా కాళ్లు పట్టుకుంటావేమిరా?’ అంటూ గద్దించాడు ఆ వికృతాకారుడు.విష్ణుదత్తుడు పాదాలను మరింత గట్టిగా పట్టుకున్నాడు. వికృతాకారుడు విష్ణుదత్తుడి వీపు మీద మాంసం ముద్దలతో బాదాడు. ఎంత బాదుతున్నా, విష్ణుదత్తుడు చలించలేదు. తన పట్టువీడలేదు. కాసేపటికి వికృతాకారంలో ఉన్న దత్తస్వామి ప్రసన్నుడయ్యాడు. ‘విష్ణుదత్తా! ఈ వికృతాకారుడితో నీకు పనేమిటయ్యా? నాకోసం మూడుసార్లు వచ్చావు’ అని సౌమ్యంగా అడిగాడు.ఆయన అలా అడగడంతోనే విష్ణుదత్తుడి వీపుమీద మాంసం ముద్దల బరువు ఎవరో తీసేసినట్లుగా మాయమైంది. అతడి కాళ్లు, చేతులు పులకరించాయి. నెమ్మదిగా కళ్లు తెరిచి, తల పైకెత్తి చూశాడు.కళ్లెదుట పీతాంబరాలతో దత్తాత్రేయస్వామి దర్శనమిచ్చాడు. విష్ణుదత్తుడు పులకాంకితుడయ్యాడు.∙సాంఖ్యాయన -
చమన్ కే ఫూల్
హైదరాబాద్లో విమానం దిగిన కిషోర్ అక్కడ నుండి రాజమండ్రిలో తన కోసం వచ్చిన కోటయ్యతో కారులో బయలుదేరాడు. సుమారు ఒక గంటలో ఊరికి చేరుకున్నారు.భూదేవి ఆకుపచ్చటి చీర కట్టుకున్నట్లుగా ఉన్న ఆ పచ్చటి పొలాలు, ఎత్తయిన ఆ కొబ్బరిచెట్లు, అందమైన ఆడపిల్లలా వంపులు తిరిగిన ఆ గోదావరిపాయ– మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని గొడుగులు పాతినట్లుగా ఆకాశంలో పచ్చాపచ్చని గూళ్ళు అల్లే కొబ్బరిచెట్లు.. మధ్యమధ్యలో అరటిచెట్లు, అల్లంత దూరాన సరిహద్దులు గీసే తాడిచెట్లు, పచ్చని పొలాలకు పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూలమొక్కలూ, పళ్ళచెట్లూ.. ఎంత బావుందో ఇక్కడ అనుకున్నాడు కిషోర్.తాత చిన్నారావు ఒకప్పుడు మోతుబరి రైతు. బోలెడు ఎకరాల పొలాలు, కొబ్బరితోటలు, చక్కటి ఫలసాయం వచ్చేది. క్రమేపి ఆస్తులు తరిగిపోయాయి. పైగా భాగాలూ పంచుకోవడంతో చిన్నచిన్న ముక్కలయిపోయాయి.ఆ ఉన్నదాన్నే జాగ్రత్తగా పెట్టుకుని కొంతదాంట్లోనే ఈ పూల నర్సరీ పెట్టాడు. అలా ఆ చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాల్లో చాలామంది ఈ పూల నర్సరీలు పెంపొందించారు. అంతేకాదు, అన్నిచోట్లా అందమైన పూలమొక్కలు హొయలొలుకుతూ క్రమపద్ధతిలో కొలువుదీరిన దృశ్యాలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. కేవలం హృదయాన్ని తాకే సోయగాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ, వందలకోట్ల రూపాయల వ్యాపారం, వేలమందికి ఉపాధిని కల్పిస్తున్నాయవి. మాటల్లో కోటయ్య చెప్పాడు.ఈప్రాంతం టూరిస్టులను బాగా ఆకర్షించడంతో దేశం నలుమూలల నుండి పూల నర్సరీల సందర్శనకు బాగా వస్తున్నారు. ఇక సినిమా షూటింగులు కూడా బాగానే జరుగుతున్నాయని కూడా చెప్పాడు.‘‘ఏడాదికో సారైనా రావాలిరా కిషోర్. బంధాలను నెమరేసుకోవాలి. బంధుత్వాల్ని పలకరించుకోవాలి. జ్ఞాపకాలను తడిమి చూసుకోవాలిరా.’’ అని తాత ఫోనులో అంటుంటే ఆ మాటలు అప్పుడు చాదస్తం అనిపించినా, ఇప్పుడు ఎంతో నిజం ఉందనిపించింది. ప్రతివారు పలకరించే వారే మా చిన్నారావు మనవడివా అంటూ ఆప్యాయంగా దగ్గరగా వచ్చి చూసేవారే! ఇంత ఆత్మీయత అసలు ఊహించనేలేదు. క్షణం తీరికలేని జీవితం... తాత పోయినప్పుడు కూడా రాలేకపోయేంత బిజీలో ఉన్నాడు. ఒక్కోసారి మార్పు అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అలా కిషోర్లో అంతర్మథనం మొదలయింది. దానికితోడు మూడునెలల క్రితం తాతయ్య స్నేహితుడు వ్రాసిన ఉత్తరం కూడా తోడయ్యింది. అదే కిషోర్ ఈ పల్లెటూరుకు రావడానికి కారణం.‘‘ఇది మన ఊరి చెరువు. ఒకప్పుడు అది మంచినీళ్ళ చెరువు కూడా. అయితే, ఈమధ్య మన ఊరికి నది కాలవ నుంచి పైపుల ద్వారా నీళ్ళు వస్తున్నాయని తెలిసింది. నాకు గుర్తుంది చిన్నప్పుడు ఈ చెరువు గట్టున ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళం. ఈత కొట్టడానికి మటుకు పెద్దవాళ్లు వద్దనేవారు. చెరువంతా తామరాకులు, పువ్వులతో నిండి ఉండేది. అప్పుడప్పుడు బాతులు కూడా కనపడేవి’’ అన్న కిషోర్ మాటలకు కోటయ్య,‘‘అవును బాబు ఇప్పుడు ఈ చెరువు ప్రభుత్వ పథకం కింద ఉంది. బాగానే మెయింటైన్ చేస్తున్నారు’’ బదులిచ్చాడు,కొంచెం దూరం నడిచాక కోదండ రామాలయం వచ్చింది. పెద్ద గోపురంతో ఠీవిగా నిలబడి ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమికి ఇక్కడ పెద్ద కళ్యాణం జరుగుతుంది.‘‘ఏమి కోటయ్యా! అప్పట్లోలానే కళ్యాణం జరుగుతోంది కదా! తొమ్మిది రోజులు చేస్తున్నారా?’’ అతను సమాధానం చెప్పే లోపల అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు కిషోర్.ఊరిని తలచుకుంటేనే ఎన్ని జ్ఞాపకాలు! ఏ పండుగ వచ్చినా, ఏదో ఒక హరికథ, తోలుబొమ్మలాటల నాటకం ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా వినాయకచవితి తొమ్మిది రోజులు; అలాగే, శ్రీరామనవమికి పందిళ్ళు వేసి స్టేజికి కట్టిన రంగుల దీపాలతో భలే బావుండేది. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళు. అలా ఒక్కోసారి పిల్లల గ్యాంగ్ అందరూ హరికథలు, బుర్రకథలు ఆ వయసులో అర్థం తెలియకపోయినా, పోయి కూర్చునేవాళ్ళు. మధ్యమధ్యలో దాసుగారు చెప్పే పిట్టకథలు భలే బాగుండేవి.ఆయన గజ్జెలు కట్టుకుని డాన్స్ చేస్తూ, చేతిలో చిడతలు వాయిస్తూ ఏ కథనైనా తన్మయత్వంతో చెబుతుంటే కళ్ళప్పగించి చూస్తుండేవాడు.ప్రోగ్రాం జరుగుతుండగా నిద్ర వస్తే, అక్కడే పడుకుండిపోడం ఇంకా గుర్తుంది.ఆ తరువాత అమ్మా, నాన్నా వాళ్ళు వచ్చి నిద్రలేపి తీసుకు వెళ్ళేవారు. ఊరి జనమే కాకుండా, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చేవారు. పిల్లలు, యువతులు, యువకులు, పెద్దవాళ్ళతో ఊరంతా కళకళలాడుతూ ఓఉత్సవంలా గడిచేవి రోజులు. అప్పటికే ఇలాంటి కళలు తగ్గిపోయాయి. వాటి స్థానాన్ని టీవీ అందునా, ఓటీటీలతో ఇంట్లోనే వినోదం వచ్చేసినా, ఇంకా ఊర్లో తాతలాంటి వాళ్ళు ఉండబట్టి అవన్నీ అప్పుడప్పుడు నడుస్తున్నాయి. తలచుకుంటేనే ఎంత బావుందో తన్మయత్వంతో మురిసిపోయాడు. తమ ఊర్లో ప్రతి ఇల్లు, వసంతకన్యలా మెరిసిపోతోంది. సంపెంగలు, చేమంతులు, పేరు తెలియని ఎన్నో రంగురంగుల పూలు, ఊదాపూలు, ఎఱ<టిపూలు, పచ్చటిపూలు, తెల్లటిపూలు, మరువం, దవనం సువాసనలు వెదజల్లుతున్నాయి. మొత్తానికి అన్నీ కలిపి ఒక కదంబవనంలా ఉన్నాయి. ఇళ్లన్నీ చక్కగా అందంగా రంగవల్లులు తీర్చిదిద్ది ఉన్నాయి. అంతేకాదు, ప్రతి ఇంటి ముందు ఉన్న ఏదో ఓ పెద్దచెట్టుకి ఒక ఉయ్యాల కూడా ఉంది. ‘‘కిషోర్ బాబు! ఇక్కడ అందరూ ఒకరితో ఒకరు సామరస్యంగా జీవిస్తున్నారు. అలాగే జీవనోపాధి కోసం సాధారణ వ్యవసాయ పనులతో పాటు ఈ నర్సరీ నిర్వహణ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు మన ఊరు ఒక ఆదర్శవంతమైన íపిక్నిక్స్పాట్గా మారింది. ప్రజలు మార్పు కోరుతున్నారు. అందుకే, ఎవరి ఊరిని వాళ్ళు బాగు చేసుకోవాలి అన్న మీ తాతయ్య మాటలు విని నడుంకట్టుకున్నారు మన ఊరివాళ్ళు’’ అంటూ చెప్పుకుపోతున్నాడు కోటయ్య. కిషోర్కి కళ్ళముందు అతని మాటలు ఏవేవో దృశ్యాలుగా కదిలిపోతున్నాయి. పొలం గట్టున ఉన్న పెద్దచెట్టు దగ్గర నించొని ఉన్న సూరిబాబుని ఒక పెద్దపాము కాటేయటం, బాధతో లుంగలు చుట్టుకు పోవడం ఒకేసారి జరిగింది. అది చూసిన చిన్నారావు వెంటనే పరుగులు పెట్టుకుంటూ దగ్గరగా వెళ్ళాడు. అప్పటికే అతను కిందపడి గిలగిల కొట్టుకుంటున్నాడు. బాధతో ఆర్తనాదాలు చేస్తుంటే, పరుగులు పెట్టుకుంటూ వచ్చి, ‘ఎంతపని జరిగిందిరా కొడకా ఇప్పుడే కదా నీకు చెప్పి ఒంటేలు పోసుకోవడానికి వెళ్ళాను. అంతలోకే ఇలా పాము వచ్చి కాటేసిందా’ అని వలవల ఏడ్చాడట!ఏదో జరిగిందని పక్క పొలాలలో పని చేసుకుంటున్న వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. అందరూ కలిసి అతన్ని మోసుకుంటూ, ఊర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకొని బయల్దేరారు. కాని, లాభం లేకపోయింది. అప్పటికే సూరిబాబు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.చిన్నారావు దంపతులు కొడుకుని తలచుకుని కుమిలిపోతున్నారు. సూరిబాబు భార్య దుఃఖానికి అంతు లేకుండా పోయింది. కొన్ని రోజులకి సూరిబాబు భార్య కొడుకుని తీసుకుని పుట్టింటికి చేరుకుంది.ఆమె వెళ్ళిన కొన్నిరోజులకి సూరిబాబు తల్లి, కొడుకు మీద బెంగతో కన్నుమూసింది.పుట్టింటికి వెళ్ళిన సూరిబాబు భార్య, అత్తగారు కూడా పోవడంతో ఇక ఈ ఊరి మొహం చూడలేదు. అప్పుడప్పుడు చిన్నారావు ప్రేమని చంపుకోలేక వెళ్లి మనవడిని చూసి వచ్చేవాడు.సూరిబాబు భార్య చాలా కష్టపడి కిషోర్ని పెంచి పెద్దచేసింది. పైచదువులు చదివించింది. ఆ తరువాత అనుకోని అదృష్టం కిషోర్ని అమెరికా వెళ్ళేలా చేసింది. అయితే, విధి ఇంకోలా ఆడుకుంది. కొడుకు అభివృద్ధిని చూడకుండానే కరోనా మహమ్మారితో కన్నుమూసింది. అతను అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు.∙∙ కొడుకు పోయాడు, భార్య పోయింది, ఉన్న ఒక్క మనవడు దూరమయిపోయాడు. అప్పటి నుంచి చిన్నారావులో ఒక మార్పు వచ్చింది. జీవితం భగవంతుడు ఇచ్చింది. చేతనయినంత వరకు పొరుగువాడికి సాయపడాలి అనుకున్నాడు. ఏడుస్తూ చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. తమ ఇంట్లో విషాదం ఎవరికీ కలగకూడదు అని నమ్మాడు. అందుకే తనకున్న పొలాన్ని జాగ్రత్తగా సాగు చేసుకుంటూ, ఊర్లో అందరినీ ఒక్కచోట చేర్చి, ‘‘చూశారుగా, మా ఇంట్లోజరిగింది. దేన్నయినా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. కష్టాలు పడనివాళ్ళు ఎవరూ ఉండరు’’ అని మా అందరిలో ఉత్సాహం నింపాడు.ఊరిలోని ప్రతిఇంటినీ చక్కగా ఒక పూలతోటగా మార్చారు. ఎంతోమంది సలహాలు తీసుకుని, కొంతమందిని జట్టుగా తయారయి పనులు చేసునేవారు. క్రమక్రమంగా ఊరికి పేరు రాసాగింది. మొదటగా సినిమా షూటింగులు జరగసాగాయి. ఆ తరువాత మన ఊరిలోనే ఉండే జానపద కళాకారులతో వచ్చిన వాళ్ళకి వినోదం కలిగించడం లాంటివి మొదలుపెట్టారు. సందర్భాన్ని బట్టి చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేయసాగారు. కిషోర్బాబు! మీ తాత అందర్నీ ఇందులో కలిపేశాడు. ఆయనకి తన ఒక్కడి పేరు చెప్పడం ఇష్టం ఉండదు. ఇదిగో ఇదే మీ ఇల్లు’’ అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా చిన్నప్పటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. పూల సౌరభాన్ని మించిన జ్ఞాపకపు పరిమళం పిల్లతెమ్మెరలా కమ్మేసింది. ‘‘ఇదిగో ఇదే మీ తాతగారి ఫొటో’’ అంటూ పెద్ద పూలదండతో ఉన్న చిన్నారావు ఫొటోని చూపించాడు. అది చూస్తూ ఆలోచనలలోకి జారుకున్నాడు. హఠాత్తుగా ఒకరోజున కోటయ్య ఆస్తి డాక్యూమెంట్స్ పంపినప్పుడు ఈ పల్లెటూరులో ఆస్తి నాకెందుకు అమ్మేద్దామని వచ్చాడు, అతని రాకలోని ఆంతర్యం పసిగట్టాడు కోటయ్య.తను కూర్చున్న ఉయ్యాలబల్ల మీద డాక్యుమెంట్స్ కవర్ పెట్టి, ‘‘కోటయ్యగారు! ఇవాళ భోజనం ఏర్పాట్లు ఎక్కడ’’ అని అడిగాడు. ఆ మాటకి ‘‘ఇక్కడే బాబు! అన్నీ సిద్ధంగా ఉన్నాయి’’ అన్నాడు.అతను ఏదో అడగాలని అనుకుంటున్నాడు. అడగలేకపోతున్నాడు. అది చూసి కూడా గమనించనట్లున్నాడు కిషోర్.ఇంతలో అతని ఫోన్ మోగింది. ‘‘హలో.. అవునండీ. ఓహ్ సారీ ఆ ప్రాపర్టీని నేను అమ్మబోవటంలేదు, ఆ డీల్ చెయ్యబోవటంలేదు. ఆపేశాను’’ అని ఫోన్ పెట్టేశాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. ఫోన్లో మాట్లాడుతున్న అతన్ని కోటయ్య, అతని భార్య ఇద్దరూ ఆదుర్దాగా చూస్తున్నారు. ‘‘ హే గీతూ మన పొలాలు అమ్మటంలేదు. అదే ఈ నర్సరీ, పూలతోటలు, కోటయ్యగారు చూసుకుంటారు. వివరంగా నేను అక్కడికి వచ్చి చెబుతాను.ఇంకో ఇంట్రెస్టింగ్ సంగతి, మన నెక్స్›్ట విజిట్ నేను అన్నట్లు స్విస్, ఆమ్స్టర్డామ్ మటుకు కాదు, అచ్చమైన మన ఊరికి. చూస్తే వదలవు మన ఊరు ఇప్పుడు ఓ పెద్ద పూలవనంలా ఉంది.అంతేకాదు, పూల నర్సరీల యాజమాన్యాలతో చర్చలు జరిపి, ఎకోటూరిజం డెవలప్ చెయ్యాలనే ప్రతిపాదనను అందరూ ఇష్టపడుతున్నారు.అలా కొన్ని పూల నర్సరీలను కలుపుతూ సైక్లింగ్తో పాటు నడక, ఈ రెండింటికీ ఒక మార్గం అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన కూడా ఉందట! సో, అప్పుడు ఇంకా ఈ నర్సరీల అందాలను చూసేందుకు మరింతమంది రావడానికి ఉంటుందట! పర్వాలేదు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నీకు బాగా నచ్చుతుంది’’ అంటూ భార్యతో మాట్లాడుతున్న మాటలు ఆ దంపతులు విన్నారు.వాళ్ళ అనుమానం పటాపంచలయింది. కృతజ్ఞతతో కిషోర్వైపు అభిమానంగా చూశారు. -
అపహరణ్తో అన్నీ మారిపోయే!
హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వ్యవహారం వివిధ ప్రాంతాల నుంచి సాగిన చైల్డ్ ట్రాఫికింగ్ను బయటపెట్టింది. నిరుపేద తల్లిదండ్రుల నుంచి చిన్నారులను కొన్నివేల రూపాయలకు కొనుగోలు చేసి, సరోగసీ పేరుతో వారిని రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంది డాక్టర్ నమ్రత గ్యాంగ్. ఈ కారణంగా ఓ వర్గం, ప్రాంతం, రాష్ట్రానికి చెందిన పసిమొగ్గలు మరో చోటుకు తరలివెళ్లిపోయారు. కొన్నేళ్ల కిందట హైదరాబాద్ కేంద్రంగా సాగిన చైల్డ్ కిడ్నాపింగ్స్లోనూ ఇలాంటి ఆసక్తికర కోణం ఉంది. అప్పట్లో అపహరణకు గురైన వారి పేరు, వర్గం, భాష.. అన్నీ మారిపోయాయి. సంతోష్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎంబీ హట్స్కు చెందిన నాలుగున్నరేళ్ల బాలుడు మహ్మద్ షరీఫ్ మిస్సింగ్కు సంబంధించి 2011 మార్చి 4న అతడి తల్లి రెహానా బేగం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పట్లో పాతబస్తీలో చిన్న పిల్లల మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. పోలీసులు ఈ కేసుల ఛేదన కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. షరీఫ్ కేసు దర్యాప్తులో భాగంగా స్థానికులను విచారించిన ఈ స్పెషల్ టీమ్కు మాదన్నపేట ప్రాంతంలో నివసించే రేష్మా సుల్తానా కదలికలు తెలిశాయి. బాలుడి కిడ్నాప్కు నాలుగు రోజుల ముందు నుంచి ఆమె ఎంబీ హట్స్ ప్రాంతంలో సంచరించిందని, చిన్నారులకు బిస్కట్లు, చాక్లెట్లు ఇస్తూ మచ్చిక చేసుకుందని వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడంతో కీలక విషయాలు బయటపడ్డాయి. కరీంనగర్ నుంచి వచ్చి మాదన్నపేటలో స్థిరపడిన మహబూబ్ ఖాన్ భార్యే ఈ సుల్తానా. వీరిద్దరితో పాటు కమలా అలియాస్ పర్వీన్, నిజామాబాద్కు చెందిన డి.మల్లయ్య యాదవ్, డబీర్పుర వాసి సజీద్, మాదన్నపేటకే చెందిన షరీఫ్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చిన్నారులను కిడ్నాప్ చేసి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో విక్రయించడం మొదలెట్టారు. సంతానలేమితో బాధపడుతున్న భార్యాభర్తలను మల్లయ్య సంప్రదించేవాడు. అక్కడ వారి నుంచి ‘ఆర్డర్’ తీసుకున్న తరవాత ఆ విషయాన్ని నగరంలో ఉన్న ముఠా సభ్యులకు చెప్పేవాడు. సుల్తానా, పర్వీన్, సజీద్, షరీఫ్లు పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నారులను గుర్తించారు. వారికి చాక్లెట్లు, బిస్కట్లు ఆశ చూపి అదును చూసుకుని కిడ్నాప్ చేశారు. వీరిని సజీద్ తన ఆటోలో వేములవాడలోని రుద్రంగికి తీసుకువెళ్లి డి.మల్లయ్య యాదవ్కు రూ.35 వేల నుంచి రూ.50 వేలకు అమ్మేవాడు. అతడు వీళ్లని సంతానలేమితో ఉన్న దంపతులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించేవాడు. ఈ గ్యాంగ్ను అరెస్టు చేసిన పోలీసులు తొమ్మిదిమంది చిన్నారులను రెస్క్యూ చేశారు. అప్పుడే ఓ ఆసక్తికర, కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కిడ్నాపింగ్ గ్యాంగ్ ఎక్కువగా పాతబస్తీలోని ఓ వర్గం బాలలను ఎత్తుకుపోయి జిల్లాల్లో ఉన్న మరో వర్గం దంపతులకు విక్రయించేది. ఫలితంగా వారి పేర్లు, భాష, ఆచార వ్యవహారాలన్నీ పూర్తిగా మారిపోయాయి. 2008లో మాదన్నపేట సలార్నగర్ నుంచి కిడ్నాప్ అయిన మహ్మద్ ఫర్దీన్ ఖాన్ దాదాపు మూడేళ్ల తరవాత ప్రశాంత్గా తన తండ్రి సర్వర్ ఖాన్ వద్దకు వచ్చాడు. అలాగే సంతోష్నగర్ పరిధి నుంచి 2009లో అపహరణకు గురైన మహ్మద్ మజీద్, షేక్ నవీద్లు... వినయ్, రాహుల్గా వారి ఇళ్లకు తిరిగి వచ్చారు. 2011 మార్చి 4న అపహరణకు గురైన షరీఫ్ మాత్రం ఏమార్పు లేకుండా అతడిలానే తన ఇంటికి చేరాడు. ఇలా వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన కథగా మారాయి. ఆ తొమ్మిదిమంది చిన్నారులు పుట్టింది ఎక్కడైనా, చాలాకాలం పాటు పెరిగింది మాత్రం ‘కొన్న తల్లిదండ్రుల’ దగ్గరే. ఈ నేపథ్యంలోనే తమ మాతృభాషను సైతం వాళ్లు మరచిపోయి, తమను పెంచుకుంటున్న వారి భాషనే అలవాటు చేసుకున్నారు. వినయ్గా తిరిగి వచ్చిన మజీద్, రాహుల్గా మారిన నవీద్ ఉర్దూ, హిందీ భాషలను పూర్తిగా మర్చిపోయి ‘తెలుగుబిడ్డ’లుగా ఇళ్లకు చేరారు. ఇలా రెస్క్యూ అయిన తొమ్మిదిమందీ హైదరాబాద్ వచ్చిన వెంటనే అసలు తల్లిదండ్రుల వద్దకు రాలేకపోయారు. తొలుత పోలీసులు ఆ బాలలను న్యాయస్థానం ద్వారా స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. ఆపై వీరిని కన్న తల్లిదండ్రులు రెండు నెలల తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తామే కన్నవారమని నిరూపించుకుని, తమ బిడ్డల్ని తమతో తీసుకువెళ్లారు. అప్పటి వరకు ఈ చిన్నారులకు స్టేట్ హోమ్ ఇల్లు అయింది.అప్పట్లో ఇలా అపహరణలకు గురైన బాలల్లో ఎక్కువమంది పుట్టింది నిరు పేద కుటుంబాల్లో. వీరిలో చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల్ని చదివించే స్తోమత కూడా లేదు. అయితే కిడ్నాపర్ల కారణంగా ఆర్థికంగా కాస్త స్థిరపడినవారి చెంతకు చేరి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి స్కూళ్లల్లో చేరారు. పోలీసులు రెస్క్యూ చేయడంతో మళ్లీ అసలు తల్లిదండ్రుల వద్దకు చేరి, అప్పటి వరకు ఉన్న సౌకర్యాలు, అలవాట్లు, కట్టుబాట్లను పూర్తిగా మరచిపోవాల్సి వచ్చింది. ఒక రకంగా చూస్తే ఈ ఎపిసోడ్లో చిన్నారులు కోల్పోయిందే ఎక్కువ. పిల్లలపై మమకారంతో వీరిని ఖరీదు చేసిన చాలామంది దంపతులు కేసులను ఎదుర్కొన్నారు. -
జగమంత కుటుంబం ఏకాకి జీవితం
ప్రపంచ జనాభా ఎనిమిదివందల కోట్లు దాటేసింది. ఎటు చూసినా మనుషులతో కిటకిటలాడే ప్రదేశాలే! అయినా ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనంతో బాధపడుతున్న ఏకాకుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. జగమంత కుటుంబంలో ఏకాకులు తమదైన చీకటిలోకంలో కృంగి కృశించిపోతున్నారు. భరించరాని ఒంటరితనం వల్ల మానసిక, శారీరక సమస్యలకు లోనవుతూ అర్ధాంతరంగా రాలిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఒంటరితనాన్ని ‘ప్రపంచవ్యాప్త మహమ్మారి’గా (గ్లోబల్ ఎపిడమిక్) గుర్తించిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ప్రపంచ జనాభా ఎనిమిదివందల కోట్లు దాటేసింది. ఎటు చూసినా మనుషులతో కిటకిటలాడే ప్రదేశాలే! అయినా ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనంతో బాధపడుతున్న ఏకాకుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.జగమంత కుటుంబంలో ఏకాకులు తమదైన చీకటిలోకంలో కృంగి కృశించిపోతున్నారు. భరించరాని ఒంటరితనం వల్ల మానసిక, శారీరక సమస్యలకు లోనవుతూ అర్ధాంతరంగా రాలిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఒంటరితనాన్ని ‘ప్రపంచవ్యాప్త మహమ్మారి’గా (గ్లోబల్ ఎపిడమిక్) గుర్తించిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.‘కోవిడ్–19’ అనుభవాలను చూసిన జనాలకు మహమ్మారి తీవ్రత ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. అలాగని ఒంటరితనం అంటువ్యాధి కాదు. అయినా, దీనిని డబ్ల్యూహెచ్ఓ మహమ్మారిగా గుర్తించిందంటే, దానికి కారణమేమిటి? ఒంటరితనం మహమ్మారి స్థాయిలో ప్రాణాలను కబళిస్తోందా? అనే అనుమానాలు చాలామందిలో తలెత్తుతాయి. ఒకసారి గణాంకాలను పరిశీలిస్తే, ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. ఒంటరితనం మోగిస్తున్న ప్రమాదఘంటికల గణాంకాలు ఇవి:ఒంటరితనం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 8.71 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ సంఖ్య ఏటా మలేరియా వల్ల సంభవించే మరణాల కంటే ఎక్కువ. పరిస్థితి ఈ స్థాయిలో ఉండటం వల్లనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒంటరితనం మరణాలను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా గుర్తించింది. ఒంటరితనం సమస్య అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో పోల్చుకుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, పేద దేశాల్లోను ఎక్కువగా ఉంది. మన భారతదేశంలో ఒంటరితనం సమస్య ప్రమాదకరమైన స్థాయిలోనే ఉంది. ‘కోవిడ్–19’ తర్వాత ఒంటరితనం సమస్య ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం రకరకాల స్థాయుల్లో ఒంటరితనంతో బాధపడేవారిలో పిల్లలు కూడా ఉంటుండటం ఆందోళనకర అంశం.మన దేశంలో ఒంటరితనం సమస్య గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే, పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లోని యువతలో 17.3 శాతం మంది తీవ్రస్థాయి ఒంటరితనంతో బాధపడుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 9.5 శాతంగా ఉంది. మన దేశంలో 45 ఏళ్లు పైబడిన వారు ప్రధానంగా మూడు కారణాల వల్ల ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఈ అంశంపై జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థ వెల్లడించిన గణాంకాలు ఇవివిస్తరిస్తున్న ఒంటరితనంఒంటరితనం సమస్య చాప కింద నీరులా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అవివాహితులు, భాగస్వామికి దూరం కావడం వల్ల ఏకాకులుగా మిగిలిన వారిలో 39 శాతం మంది ఒంటరితనంతో బాధపడుతుంటే, వివాహితులలో సైతం 22 శాతం మంది ఒంటరితనంతో బాధపడుతుండటం ఆందోళనకర పరిణామం. ఒంటరితనం సమస్య అకాల మరణాలకు దారితీస్తోందని, అందువల్ల దీనిని మహమ్మారిగానే గుర్తించాల్సి ఉంటుందని అమెరికా సర్జన్ జనరల్ వివేక్మూర్తి తన పరిశోధన వివరాలను వెల్లడించారు. ఆయన వాదనతో ఏకీభవించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఒంటరితనాన్ని మహమ్మారిగా గుర్తించింది. ఒంటరితనం ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావం రోజుకు ఏకంగా పదిహేను సిగరెట్లు తాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలకు సమానంగా ఉంటుందని డాక్టర్ వివేక్మూర్తి చెబుతున్నారు. ఈ లెక్కన ఒంటరితనంతో బాధపడేవారి బతుకులు పొగ తాగకున్నా, పొగ చూరిపోతున్నట్లు అర్థమవుతోంది. జీవితంలో బరువు బాధ్యతలతో కుంగిపోతున్న పెద్దలే కాదు, చదువు సంధ్యలు ఇంకా పూర్తికాని కుర్రకారు కూడా ఒంటరితనం సమస్యతో బాధపడుతున్నట్లు వివిధ అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల ఒంటరితనంతో బాధపడేవారు సర్వసాధారణమే అయినా, ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల ఒంటరితనంతో బాధపడేవారి సంఖ్య కూడా పెరుగుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనంతో బాధపడేవారు ఏ తరంలో ఎందరెందరు ఉన్నారంటే...ఈ జబ్బుల ముప్పు ఎక్కువఒంటరితనంతో బాధపడే వారికి పలు శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒంటరితనం వల్ల తలెత్తే సమస్యల్లో గుండెజబ్బులు, పక్షవాతం, మధుమేహం, అధిక రక్తపోటు, రోగనిరోధక శక్తి క్షీణత, జ్ఞాపకశక్తి క్షీణత కలిగించే డెమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు ప్రధానమైనవి. తరచుగా ఈ సమస్యలు ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవే కాకుండా, ఒంటరితనం వల్ల దిగులు, కుంగుబాటు, ఆందోళన, నిద్రలేమి, ఏకాగ్రత లోపం, ఆత్మహత్య ధోరణులు, స్వీయహాని ధోరణులు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, మానసిక ఒత్తిడి స్థాయిలో పెరుగుదల వంటి మానసిక సమస్యలు కూడా ఎక్కువవుతాయి. ఇలాంటి శారీరక, మానసిక సమస్యల వల్ల ఒంటరితనం బాధితుల్లో అకాల మరణాల ముప్పు 26 శాతం వరకు పెరుగుతోందని డాక్టర్ వివేక్మూర్తి చెబుతున్నారు.ఒంటరితనం కారణంగా స్థూలకాయం, థైరాయిడ్ సమస్యలు, ఉబ్బసం, బైపోలార్ డిజార్డర్, కొన్ని రకాల ఆటిజం వంటి ఇతర శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని ఒక తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన టులేన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, చైనాలోని గువాంగ్ఝో యూనివర్సిటీకి చెందిన బ్రెయిన్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఒంటరితనంతో బాధపడే పలువురు రోగులపై క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. ఒంటరితనం వల్ల 26 రకాల దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, వీటిలో కొన్ని ప్రాణాంతక వ్యాధులు కూడా ఉంటాయని వారు తేల్చారు.ప్రమాదకరమైన ప్రొటీన్ల పెరుగుదలఒంటరితనంతో బాధపడేవారిలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన ప్రొటీన్లు అధిక స్థాయిలో ఉన్నట్లు ఇటీవలి వైద్య పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రొటీన్ల వల్ల ఒత్తిడి పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం సహా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అంతర్గతమైన వాపులకు, గుండె, మెదడు వంటి కీలక అవయవాల పనితీరులోని అవరోధాలకు ఈ ప్రొటీన్లే ప్రధాన కారణమని కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ చున్ షెన్ చెబుతున్నారు. ఒంటరితనంతో బాధపడేవారిలో దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే దాదాపు రెండువందల ప్రొటీన్లు అధిక స్థాయిలో ఉన్నట్లు తమ పరీక్షల్లో గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.బయటపడాలంటే ఏం చేయాలి?ఒంటరితనానికి సంబంధించి పైన చెప్పిన లక్షణాలతో బాధపడుతున్నట్లయితే, ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ఎంత త్వరగా ప్రయత్నిస్తే అంత మంచిది. అందుకోసం ఏం చేయాలంటే...ఇతరులతో సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. ముభావంగా ఉంటూ ఎవరైనా పలకరిస్తే, ముక్తసరిగా బదులివ్వడంతో సరిపెట్టుకోకుండా, సానుకూలంగా మాట్లాడండి.ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఒంటరిగానే ఉంటున్నట్లు అనిపిస్తే, స్వచ్ఛంద సేవాసంస్థల కార్యకలాపాల్లో పాలుపంచుకోండి. మీకు నచ్చిన హాబీలకు సంబంధించిన సంస్థల్లో చేరండి. దీనివల్ల క్రమంగా మీలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఒంటరిననే భావన తగ్గుతుంది.ఉదయంవేళ ఆరుబయట నడక సాగించడం, వ్యాయామం చేయడం, ఆటలాడటం వంటివి చేయండి. ఉదయం వేళ సూర్యకాంతిలో గడిపినట్లయితే, మెదడులో ఎండార్ఫిన్, సెరటోనిన్ల స్థాయి పెరిగి, ఉత్సాహంగా అనిపిస్తుంది.ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుంటే వెంటనే వైద్యులను లేదా మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు అవసరమైతే మందులు వాడాల్సి ఉంటుంది. మీ పరిస్థితిని సన్నిహితులకు చెప్పండి.కొన్ని వాస్తవాలుఒంటరితనం ప్రపంచవ్యాప్త సమస్యగా మారడంతో పలు సంస్థలు ఒంటరితనాన్ని రూపుమాపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బ్రిటన్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘క్యాంపెయిన్ టు ఎండ్ లోన్లీనెస్’ 2011 నుంచి ఒంటరితనంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఒంటరితనం సమస్యపై శాస్త్ర పరిశోధనలకు, సామాజిక సేవలకు సహాయం అందిస్తోంది. ‘క్యాంపెయిన్ టు ఎండ్ లోన్లీనెస్’ పరిశోధనల ప్రకారం ఒంటరితనాన్ని గురించి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు కొన్ని:కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఎందరితో సంబంధాలు ఉన్నా, కొందరు ఒంటరితనంతో బాధపడుతుంటారు. కుటుంబ బాంధవ్యాలు, స్నేహ సంబంధాల పరిమాణానికి, ఒంటరితనానికి ఎలాంటి సంబంధం లేదు. ఒంటరితనం ఒక మానసిక స్థితి.ఒంటరితనం వేర్వేరు స్థాయుల్లో ఉంటుంది. అస్తిత్వ, భావోద్వేగ, సామాజిక స్థాయుల్లో చాలామంది ఒంటరితనంతో బాధపడుతుంటారు.ఈ స్థాయుల్లో ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లుగా భావించడం, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఎందరున్నా తమను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరనుకుని బాధపడటం, స్వార్థం తప్ప సామాజిక సంబంధాలలో మరేమీ లేదనుకుని, సమాజానికి వీలైనంత దూరంగా ఉండటం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు.చిన్నవయసులోనే ఒంటరితనం బారినపడిన వారు ఏకాగ్రత లోపం కారణంగా చదువుల్లోను, కెరీర్లోను వెనుకబడిపోతారు.ఒంటరితనం సమస్య కేవలం ఆ సమస్యతో బాధపడేవారికి మాత్రమే పరిమితం కాదు. ఈ సమస్య ప్రపంచ ఆర్థిక పురోగతికి అవరోధంగా నిలుస్తూ, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది.ఒంటరితనంతో బాధపడే ఉద్యోగుల కారణంగా ఉత్పాదకత తగ్గిపోతుంది. ఫలితంగా వారు పనిచేసే సంస్థలకు, ప్రభుత్వాలకు ఆర్థికభారం ఎదురవుతుంది.బ్రిటన్లో ఒంటరితనంతో బాధపడేవారి శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ఎదురయ్యే వార్షిక తలసరి వ్యయం 9900 పౌండ్లు (రూ.11.50 లక్షలు) వరకు ఉంటుందని ‘క్యాంపెయిన్ టు ఎండ్ లోన్లీనెస్’ అంచనా. ప్రపంచస్థాయిలో ఈ వ్యయం ఎంత ఉంటుందనే దానిపై కచ్చితమైన లెక్కలేవీ అందుబాటులో లేవు.మహమ్మారిగా పరిణమించిన ఒంటరితనం కేవలం ప్రజారోగ్య సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసే సమస్య. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ సమస్యపై మరింతగా దృష్టి సారించి, నివారణ చర్యలు చేపడితే తప్ప సమగ్ర సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పురోగతిని సాధించడం సాధ్యం కాదు.దీర్ఘకాలిక ఒంటరితనం లక్షణాలుఎక్కువకాలం ఒంటరితనంతో బాధపడుతున్నట్లయితే, మిగిలిన దీర్ఘకాలిక వ్యాధుల మాదిరిగానే ఒంటరితనాన్ని కూడా దీర్ఘకాలిక వ్యాధిగానే పరిగణించాలని పలువురు మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం దీర్ఘకాలిక ఒంటరితనం లక్షణాలు ఇవికుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతమంది ఉన్నా, వారితో దగ్గర కాలేకపోవడం. వారికి దగ్గరగా ఉన్నా, వారితో పొడి పొడిగా మాట్లాడటమే తప్ప భావోద్వేగాలను పంచుకోలేకపోవడం. వారితో గాఢమైన బంధాన్ని అనుభూతి చెందకపోవడం.స్నేహితులు చాలామంది ఉన్నా, వారిలో ఎవరూ దగ్గరి స్నేహితులు లేకపోవడం. స్నేహంగా ఉంటున్నవారిని దగ్గరగా భావించలేకపోవడం. ఎందరు స్నేహితులు ఉన్నా, వారిలో కనీసం ఒక్కరైనా మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని లోలోన బాధపడుతుండటం.పని ప్రదేశంలో చుట్టూ ఎందరున్నా, ఎవరికీ పట్టని ఏకాకిలా బాధపడుతుండటం. చేసే పని మీద పూర్తిస్థాయి ఏకాగ్రత చూపలేకపోవడం.ఆత్మన్యూనతకు లోనవడం, ఆరోగ్య పరిస్థితిపై లేనిపోని అనుమానాలతో భయపడటం, తరచుగా ప్రతికూల ఆలోచనలతో సతమతం కావడం.కుటుంబంలోని శుభకార్యాలు, స్నేహితులతో పార్టీలు వంటి వేడుకల్లో పాల్గొనాల్సి వస్తే, బాగా అలసిపోయినట్లగా, ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా ఇబ్బందిపడటం.వేడుకల్లో పాల్గొనేటప్పుడు చుట్టూ జనాలు ఆనందోత్సాహాలతో ఉన్నా, నిర్లిప్తంగా ఎవరికీ పట్టనట్లుగా ఒక మూలన కూర్చుండిపోవడం.పని ప్రదేశంలో చుట్టూ ఎందరున్నా, ఎవరికీ పట్టని ఏకాకిలా బాధపడుతుండటం. చేసే పని మీద పూర్తిస్థాయి ఏకాగ్రత చూపలేకపోవడం. -
మీ జీన్స్లోనే లేదా!
అన్నీ వేదాలలోనే ఉన్నాయన్నట్లు, మొత్తం మన ఆరోగ్య చరిత్రంతా మన జీన్స్లోనే ఉంటుంది. అయితే జీన్స్లో లేకుండా, బయటెక్కడి నుంచో వచ్చి శరీరంలోకి చొర బడి, ఆరోగ్యాన్ని ‘డిస్టర్బ్’ చేసే శక్తుల మాటేమిటి? అది తెలుసుకోవటానికే గత ఇరవై ఏళ్లుగా వైద్య పరిశోధకులు చెట్టూ, పుట్టా గాలిస్తున్నారు. కొండా కోనా ఎక్కి దిగుతున్నారు. పంచభూతాలపై పరిశీలనలు జరుపుతున్నారు. ఏమైనా తేలిందా మరి? త్వరలోనే తేలబోతోందని డాక్టర్ కల్పన బాలకృష్ణన్ అంటున్నారు. చెన్నైలోని ‘శ్రీరామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ డీన్ కల్పన.. ఈ పరిశోధనల్లో భారతదేశం చురుగ్గా ఉందని కూడా చెబుతున్నారు!లోపల జన్యువులు.. బయట అన్యశక్తులు‘‘మా డీఎన్ఏలోనే లేదు..’’ అని ధీమాగా అంటుండే వాళ్లలో సైతం గుండె జబ్బులు కనిపిస్తుంటాయి! కారణమేంటి? ‘‘మా బ్లడ్లోనే లేదు...’’ అని కులాసాగా కబుర్లు చెబుతుండే వాళ్లలో హఠాత్తుగా షుగర్ బయట పడుతుంటుంది! కారణమేంటి? ఈ వైరుధ్యాలను తెలుసుకోవటానికే ‘ఎక్స్పోజోమిక్స్’ రంగంలో నేడు అవిశ్రాంత కృషి జరుగుతోంది. జన్యుశాస్త్రాన్ని ‘జెనోమిక్స్’ అన్నట్లే, బయటి నుండి ప్రభావం చూపే అంశాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఎక్స్పోజోమిక్స్’ అంటున్నారు! మానవ ఆరోగ్యం అన్నది కేవలం వారి లోపలి జన్యువులపైనే ఆధారపడి ఉండదని; బయట పీల్చే గాలి, తాగే నీరు, ఉండే పరిసరాలు, ఉష్ణోగ్రతలు... ఇవన్నీ చూపే ప్రభావాన్ని బట్టి కూడా ఉంటుందని ఎక్స్పోజోమిక్స్ నిపుణులు ఏనాడో నిర్ధారించుకున్నారు. దాంతో ఈ రంగంలో పరిశోధనలు ముమ్మరం అయి, నేటికీ కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వీటిపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించింది.భారత్... సహజ ప్రయోగశాలజన్యు నిపుణులను ‘జెనిటిసిస్ట్’లు అన్నట్లు, ఎక్స్పోజోమిక్స్ నిపుణులకు ప్రత్యేకమైన పేరు లేదు. ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు, బయాలజిస్టులు, కెమిస్టులు, ఎపిడెమియాలజిస్టులు, టాక్సికాలజిస్టులు, డేటా సైంటిస్టులు, స్టాటిస్టీషియన్లు, కంప్యూటేషన్ బయాలజిస్టులు అంతా కలిసి ఒక చెయ్యేస్తేనే ‘ఎక్స్పోజోమిక్స్’ అధ్యయనం ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో భారత్ వడివడిగా అడుగులు వేస్తోందని, ఎక్స్పోజోమిక్స్పై త్వరలోనే ఒక స్పష్టతను సాధించనుందని చెబుతున్నారు ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) కొలాబరేటింగ్ సెంటర్ ఫర్ ఆక్యుపేషనల్ ఎన్విరాన్మెంటల్ హెల్త్’ డైరెక్టర్ కూడా అయిన కల్పన బాలకృష్ణన్. ఇటీవలే ఆమె ఎక్స్పోజోమిక్స్పై వాషింగ్టన్ డీసీలోని జా¯Œ ్స హాప్కి¯Œ ్స విశ్వవిద్యాలయం నిర్వహించిన ఫోరమ్లో పాల్గొని వచ్చారు. ఎక్స్పోజోమిక్స్ సైన్స్ పరిశోధనలకు భారత్ ‘సహజ ప్రయోగశాల‘గా మారబోతోందని ఆమె అన్నారు. జినోమ్ సాఫ్ట్... ఎక్స్పోజోమ్ ఫాస్ట్‘ఎక్స్పోజోమిక్స్’ అనే మాట ‘ఎక్స్పోజోమ్’ అనే పదం నుండి పుట్టింది. 2005లో డాక్టర్ క్రిస్టోఫర్ వైల్డ్ ఈ పదాన్ని సృష్టించారు. గర్భస్థ శిశువు మొదలు, జీవిత చరమాంకం వరకు మనుషులపై ఉండే పర్యావరణ ప్రభావాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఎక్స్పోజోమిక్స్. వారసత్వంగా, స్థిరంగా ఉండే జీనోమ్లా కాకుండా ఎక్స్పోజోమ్ క్రియాశీలకంగా ఉండి, నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుంది. మనిషి ఆరోగ్య అంశాలతో ఇది లోతుగా ముడిపడి ఉంటుంది. జన్యువులు, జన్యు గ్రహణశీలత మాత్రమే మనుషుల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకు అభివృద్ధి చెందుతాయో చెప్పలేవు. కొందరిలో గుండె జబ్బులు లేదా మధుమేహానికి సంబంధించిన జన్యుపరమైన చిహ్నాలు లేకుండానే, వారు వాటి బారిన పడవచ్చు. దీని వెనుక ఉన్న కారణాలను ‘ఎక్స్పోజోమ్’ అధ్యయనం వివరిస్తుంది. మ్యాపింగ్ అత్యంత కీలకంమానవ జీనోమ్ ప్రాజెక్ట్ ఒక దశాబ్దం వ్యవధిలోనే జన్యు శాస్త్రాన్ని అభివృద్ధి పరచినప్పటికీ, హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధులు, అంతఃస్రావ గ్రంథులకు చెందిన ఎండోక్రైన్ రుగ్మతలు, మానసిక ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోటానికి ఒక్క జన్యుశాస్త్రం మాత్రమే సరిపోదు. రసాయన, భౌతిక, జీవ సంబంధ, సామాజిక మనోరుగ్మతలు; జీవనశైలి లేదా జీవన పరిస్థితులతో ఆ రుగ్మతల పరస్పర చర్యల ప్రభావాలను తెలుసుకోటానికి వినూత్నమైన ఉపకరణాలతో పాటుగా ఎక్స్పోజోమ్స్ మ్యాపింగ్ అత్యంత కీలకం. (ఉనికిని గుర్తించి దృశ్యమానం చేసే పటాలను సృష్టించే ప్రక్రియే మ్యాపింగ్). గాలి, నీరు, నేల, ఆహారాలలో వేలాది రసాయన సమ్మేళనాలను ఏకకాలంలో పరీక్షించగల హై రిజల్యూషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ (హెచ్.ఆర్.ఎం.ఎస్.)తో ఇది సాధ్యం అవుతుంది. అయితే, ‘‘మనం ఆశించే ఎ, బి, సి ల కోసం మాత్రమే చూడకుండా, ఉంటాయో ఉండవో తెలియని డి, ఇ, ఎఫ్ లను, ఆ తర్వాతి వాటిని కూడా కనుగొనడానికి ‘లక్ష్య రహిత’ విశ్లేషణ చేయాలి. లేకపోతే, మనకు తెలియని వాటి గురించి మనం ఎప్పటికీ తెలుసుకోలేం’’ అంటారు కల్పన. విశ్లేషణలన్నీ కలిస్తేనే సంపూర్ణం, సఫలంజీవసంబంధమైన ప్రతిస్పందనల విశ్లేషణకు నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్.జి.ఎస్.); జీవక్రియలు, ప్రొటీన్లు, జన్యుశాస్త్ర అధ్యయనాలు సహా, వాటన్నిటికీ ఉపకరించే సాఫ్ట్వేర్ సమాహారం ఎక్స్పోజోమిక్స్లో ముఖ్యమైనవి. ఇవి మన దేహంలోని అంతర్గత వ్యవస్థలు బాహ్య ప్రభావాలకు (ఎక్స్పోజర్లకు) ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. రక్తం, మూత్రం, ఇతర కణజాలాల నుండి తీసుకున్న నమూనాలు వీటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తాయి. అయితే, ఎక్స్పోజోమిక్స్ పరిశోధన ప్రయోగశాలకు మాత్రమే పరిమితమైనది కాదు. అదిప్పుడు వాయు కాలుష్యం, పట్టణ ఉష్ణ దీవులు, వృక్ష విస్తీర్ణం, భూ వినియోగ మార్పుల వంటి భౌతిక ప్రభావాల అధ్యయనం కోసం ఉపగ్రహం ద్వారా సేకరించిన డేటా వంటి వాటిని కూడా కలుపుకుని పోవాలి. అప్పుడే పరిశోధకుల ప్రయత్నాలు సంపూర్ణం, సఫలం అవుతాయి.లోతైన అభ్యాసం.. ఏఐ సహకారం పర్యావరణ సవాళ్లు ఉన్న భారతదేశం వంటి దేశాలలో ఎక్స్పోజోమిక్స్ అధ్యయనం ఎంతో కష్టమైనది. సామాజిక ఆర్థిక స్థితిగతులు కూడా ఆ పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా ఎక్స్పోజోమిక్స్ డేటాలోని సంక్లిష్టతను అర్థం చేసుకోటానికి దానిని మ్యాపింగ్ చేసే ప్రాథమిక గణాంక పద్ధతులకు మించి లోతైన అభ్యాసం, ఏఐ ఆధారిత జీవనశైలి నమూనాల గుర్తింపు అవసరం. ఈ గణన సాధనాలు చాలా కీలకమైనవి. పర్యావరణ నమూనాలు, జీవసంబంధమైన ప్రతిస్పందనలు, జనాభాకు సంబంధించిన భారీ, అంచెలవారీ డేటా కేటగిరీలను అవగాహన చేసుకోవడానికి ఆ నమూనాలు అవసరం. ఉత్తర అమెరికా, యూరోపియన్ దేశాల ఎక్స్పోజోమ్ సంస్థలు తీసుకున్న నమూనాలు అక్కడి కాలుష్యం, భౌగోళిక వైవిధ్యాల మధ్య... మధుమేహం, హృద్రోగాల వంటి వ్యాధుల ప్రమాదాలను విజయవంతంగా అంచనా వేస్తున్నాయి. సవాళ్లలోనే అధ్యయన అవకాశాలుభారతదేశంలో ఎక్స్పోజోమిక్స్ అధ్యయనాలకు అవకాశాలు ఇక్కడి ప్రజారోగ్య సవాళ్లలోనే ఉన్నాయి. పారిశుధ్యలోపం, పరిశుభ్రమైన నీరు లేకపోవడం ఆ సవాళ్లలో ప్రధానమైనవి. అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్, వాయు కాలుష్యం, సామాజిక మనోరుగ్మతల ఒత్తిడి వంటివి కూడా వీటిలో ఉన్నాయి. పైగా భారతదేశం ఒంటరి శాస్త్రీయ విధానాలపై ఆధారపడుతోంది. ‘‘నిజానికి ఎక్స్పోజోమిక్స్లో ప్రపంచంతో కలిసి పనిచేయటానికి భారతదేశం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది..’’ అని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఆరోగ్యం, ప్రాదేశిక శాస్త్రాల అసోసియేట్ ప్రొఫెసర్ రిమా హాబ్రే అన్నట్లు కల్పన తెలిపారు. ఇటీవల అహ్మదాబాద్ జరిగిన ఐ.సి.ఎం.ఆర్–ఎన్.ఐ.ఓ.హెచ్ సమావేశంలో వీరిద్దరూ భారత్లో జరుగుతున్న ఎక్స్పోజోమిక్స్ అధ్యయనాలపై చర్చించారు. గ్రహణం ఆన్ డిమాండ్! సూర్యగ్రహణం కావాలా? ఆర్డర్ పెడితే వస్తుంది! నిజం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ‘ప్రోబా 3’ అనే డబుల్ స్పేస్క్రాఫ్ట్ మిష¯Œ ద్వారా ఒక కృత్రిమ సూర్యగ్రహణం సృష్టించింది. తాజాగా ఆ మొదటి కృత్రిమ గ్రహణం ఫోటోలు కూడా విడుదల చేసింది. ఇది ఆకాశంలో ఒక అద్భుత ప్రదర్శన. రెండు ఉపగ్రహాల్లో ఒకటి ‘ఆక్యుల్టర్ స్పేస్క్రాఫ్ట్’ సూర్యుడిని కప్పేసుంటే, మరొకటి ‘కరోనాగ్రాఫ్ స్పేస్క్రాఫ్ట్’ సూర్యుడిని పరిశీలిస్తుంది. వీటి మధ్యలో కచ్చితంగా 150 మీటర్ల దూరం. అంతే కాదు, ఇక ‘గ్రహణం కేవలం కొన్ని నిమిషాలే’ అన్నది పాత కథ! సెకన్లపాటు వచ్చే సహజ గ్రహణాల మధ్య ఇది ఏకంగా 6 గంటల పాటు కొనసాగింది. అంతేకాదు, ప్రతి 19.6 గంటలకోసారి ఒక కొత్త సూర్యగ్రహణాన్ని సృష్టించవచ్చు. పూర్తిగా మనుషుల చేతుల్లోనే అంతా ఉంటుంది. ఇక గ్రహణం కోసం ఆకాశం కేసి వేచి చూడాల్సిన రోజులు పోయాయి. మనకిష్టమైనప్పుడు గ్రహణాలను షెడ్యూల్ చేసుకోవచ్చు! శాస్త్రవేత్తలు దీనిని ‘ప్రపంచంలోనే ఇది, తొలి ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లైయింగ్ మిషన్’గా ప్రకటించారు. అయితే, ఇది మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో సూర్యుని మరిన్ని రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు.· -
రహస్య నగరాలు
ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. వీటిలో చారిత్రక ప్రాశస్త్యం గల నగరాలు కొన్ని; ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల నగరాలు ఇంకొన్ని; పర్యాటక ఆకర్షణలు గల నగరాలు మరికొన్ని ఉన్నాయి. ఇలాంటి నగరాల గురించి చాలామందికి తెలుసు. వీటికి భిన్నంగా ప్రపంచంలో అక్కడక్కడా రహస్య నగరాలు కూడా ఉన్నాయి. వీటి గురించి బయటి ప్రపంచానికి ఏమీ తెలియదు. ప్రపంచ పటాల్లో కూడా ఈ నగరాలు కనిపించవు. అలాంటి కొన్ని రహస్య నగరాల గురించి, ఆ నగరాల్లో జరిగే కార్యకలాపాల గురించి తెలుసుకుందాం.సిటీ 40ఇది రష్యాలో ఉంది. సోవియట్ ప్రభుత్వం 1946లో అణ్వాయుధాల తయారీ కోసం ఏర్పాటు చేసిన రహస్య నగరాల్లో ఇదొకటి. ఈ నగరంలో దాదాపు లక్షమందికి పైగా జనాభా ఉండేవారు. ఇక్కడకు ఇతరుల రాకపోకలపై కట్టుదిట్టమైన ఆంక్షలు ఉండేవి. రష్యాలోని మిగిలిన నగరాలు, పట్టణాల్లోని పౌరుల కంటే ఈ రహస్య నగరంలోని పౌరులకు నిత్యావసరాల సరఫరా మొదలుకొని రకరకాల సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉండేవి. చుట్టూ ఎత్తయిన ఇనుప కంచెల మధ్యనున్న ఈ నగరంలో ఇప్పటికీ ‘అణు’ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇదివరకు ఇక్కడ కొన్ని అణు ప్రమాదాలు జరిగినా, వాటి వివరాలు బయటి ప్రపంచానికి తెలియకుండా నాటి సోవియట్ ప్రభుత్వం కప్పిపుచ్చింది. చెర్నోబిల్ దుస్సంఘటన ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాతే ‘సిటీ 40’లో కూడా అణు ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసింది. వాతావరణంలో అణు ధర్మాకత నిండి ఉన్న ఈ నగరంలో ఇప్పటికీ జనాలు నివసిస్తున్నారు. కార్మికులు పనులు సాగిస్తూనే ఉన్నారు. ఈ నగరం మ్యాపుల్లో కనిపించదు. అంతేకాదు, ఇక్కడి పౌరుల వివరాలు కూడా ప్రభుత్వ రికార్డుల్లో కనిపించవు.ఇది రష్యాలో ఉంది. ఇప్పటి తరానికి చెందిన రష్యన్లలో చాలామందికి ఈ నగరం ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. ఎందుకంటే, ఈ నగరాన్ని రష్యా మ్యాపుల నుంచి 1947లోనే తొలగించారు. ఇదివరకు దీనిని ‘అర్జామాస్–16’ అనే పేరుతో పిలిచేవారు. సోవియట్ హయాంలో ఇక్కడ అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాక, దీనిని మ్యాపుల నుంచి తొలగించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన అణ్వాయుధ తయారీ కేంద్రం ఇప్పటికీ పనిచేస్తోంది. ఈ నగరాన్ని మ్యాపుల నుంచి తొలగించిన విషయాన్ని రష్యా ప్రభుత్వం 1994లో తొలిసారిగా అంగీకరించింది. ఈ నగరంలో పద్దెనిమిదో శతాబ్ది నాటి చర్చి ఉంది. సెయింట్ సెరాఫియన్ ఈ చర్చిలో ప్రార్థనలు జరిపేవారు. ప్రేమ, కరుణ, మానవత్వం వంటి అంశాలపై తన బోధలు వినిపించేవారు. ఆయన బోధలకు భిన్నంగా ఇక్కడ భీకర హింసకు దారితీసే అణ్వాయుధాల తయారీ కొనసాగుతుండటమే విచిత్రం.బర్లింగ్టన్ బంకర్ఇది ఇంగ్లండ్లో ఉంది. నిజానికి ఇది నగరం కాదు. కేవలం ఒక సువిశాల భూగర్భ స్థావరం మాత్రమే! అయితే, ఇందులో అభివృద్ధి చెందిన నగరాల్లో ఉండే సమస్త సౌకర్యాలూ ఉన్నాయి. కర్మకాలి ఎప్పుడైనా అణు యుద్ధం తటస్థిస్తే, ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి భద్రత కల్పించడానికి యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఈ భూగర్భ నగరాన్ని 1950లలో నిర్మించింది. బ్రిటిష్ రాచకుటుంబ సభ్యులు సహా ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఉండే నాలుగువేల మంది ఇందులో సురక్షితంగా ఆశ్రయం పొందడానికి అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. ఈ స్థావరాన్ని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నిర్మించి, దశాబ్దాలు గడిచినా దీనిని వినియోగించుకునే అవసరం ఏర్పడలేదు. అవసరం లేని ఈ నిర్మాణానికి ఏటేటా నిర్వహణ వ్యయం పెరుగుతూ రావడంతో ప్రభుత్వం 2016లో దీనిని కారుచౌకగా కేవలం 1.5 మిలియన్ పౌండ్లకు (రూ.17.42 కోట్లు) అమ్మకానికి పెట్టింది. అయినా ఇప్పటి వరకు దీనిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం దీనిని అమ్మకానికి పెట్టేంత వరకు జనాలకు దీని గురించి తెలియదు.ఓక్రిడ్జ్ఇది అమెరికాలో ఉంది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలో అమెరికా, దాని మిత్ర దేశాలు యుద్ధాన్ని వీలైనంత త్వరగా పరిసమాప్తం చేయడానికి అణుబాంబు ప్రయోగించడం ఒక్కటే మార్గమని తలచాయి. అణుబాంబు తయారీ కోసం రహస్య స్థావరం, ఆ స్థావరానికి తగిన ఏర్పాట్లు కావలసి వచ్చాయి. అందువల్ల అమెరికా ప్రభుత్వం టెనసీ రాష్ట్రంలోని నాక్స్విల్కు పడమరన నలభై కిలోమీటర్ల దూరంలో అరవైవేల ఎకరాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి, 1943లో ఈ రహస్య నగరాన్ని నిర్మించింది. ఇక్కడ పెద్దసంఖ్యలో సైనికులు, శాస్త్రవేత్తలు, కార్మికులు పనిచేసేవారు. ఈ రహస్య పట్టణాన్ని అమెరికా తన మ్యాపుల్లో చూపలేదు. ఇక్కడ పనిచేసే కార్మికులకు తాము చేసే పని తప్ప, ఇక్కడ జరిగే కార్యకలాపాలేవీ తెలిసేవి కావు. కొంతకాలం పనిచేశాక ఓక్రిడ్జ్లోని శాస్త్రవేత్తలు అణుబాంబు తయారీకి కీలకమైన శుద్ధి చేసిన యురేనియంను తయారు చేయగలిగారు. ఇక్కడ రెండు యురేనియం శుద్ధి కర్మాగారాలు, ఒక ప్లూటోనియం శుద్ధి కర్మాగారం పనిచేసేవి. దీని గురించి సాధారణ పౌరులకు వివరాలేవీ తెలియవు.క్యాంప్ సెంచరీఇది గ్రీన్లాండ్లో ఉంది. బయటి నుంచి చూస్తే, ఇది మంచుకొండల్లో ఏర్పడిన గుహలా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది సువిశాల భూగర్భ నగరానికి ప్రవేశమార్గం. గ్రీన్లండ్ భూభాగంలో అమెరికా ఏర్పరచుకున్న రహస్య సైనిక స్థావరం ఇది. సోవియట్ కాలంలో రష్యా–అమెరికాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో రష్యాను దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో అమెరికా దీనిని నిర్మించింది. భూగర్భంలో నాలుగువేల కిలోమీటర్ల పొడవున సొరంగ రహదారులతో సైనిక అవసరాలకు కావలసిన శాస్త్ర సాంకేతిక పరిశోధనల కోసం అమెరికా భారీ వ్యయంతో ఈ భూగర్భ నగరాన్ని నిర్మించుకుంది. ‘ప్రాజెక్ట్ ఐస్ వర్మ’ పేరుతో ఇక్కడ సైనిక పరిశోధనలు సాగించింది. ఈ నగరంలో శాస్త్రవేత్తలు, సైనికాధికారులు, ఇతర సిబ్బంది, వారి కుటుంబాలు నివసించడానికి కావలసిన సకల సౌకర్యాలూ ఉన్నాయి. వారి కోసం ఒక సినిమా థియేటర్, ఒక ప్రార్థన మందిరం కూడా ఉండటం విశేషం.వన్స్డార్ఫ్ఇది జర్మనీలో ఉంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ రహస్య నగరాన్ని జర్మన్ రాజ్యం 1871లో నిర్మించింది. అప్పట్లో ఇక్కడ ముస్లిం ఖైదీలను బంధించేవారు. వారి కోసం ఇక్కడ మసీదు కూడా నిర్మించారు. ఇదే జర్మనీలోని తొలి మసీదు. నాజీల ప్రాబల్యం పెరిగాక, 1935 నుంచి రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలో ఇది నాజీల ప్రధాన రహస్య స్థావరంగా ఉండేది. తర్వాత సోవియట్ రెడ్ ఆర్మీ వశమైంది. అప్పట్లో సోవియట్ సైనికులు వారి కుటుంబాలతో ఇక్కడ నివసించేవారు. దాదాపు 75 వేల జనాభా ఉండే ఈ నగరం ‘లిటిల్ మాస్కో’గా, ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరుమోసింది. అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో రష్యన్ బలగాలు ఇక్కడి నుంచి రహస్య కార్యకలాపాలు సాగించేవి. ఇప్పుడు ఈ నగరం శిథిలావస్థకు చేరుకుంది. నగరం నడిబొడ్డున సోవియట్ బలగాలు నెలకొల్పిన లెనిన్ విగ్రహం మాత్రం ఆనాటి కార్యకలాపాలకు సాక్షీభూతంగా నిలిచి ఉంది. -
లీప్ ఇయర్ పత్రిక
ప్రపంచంలో రకరకాల పత్రికలు ఉన్నాయి. దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు సర్వసాధారణంగా అందరికీ తెలిసివే! అక్కడక్కడా ద్వైమాసిక పత్రికలు, త్రైమాసిక పత్రికలు కూడా ఉన్నాయి. అరుదుగా ఏడాదికి రెండుసార్లు మాత్రమే ప్రచురితమయ్యే అర్ధవార్షిక పత్రికలు, ఏడాదికి ఒకే సంచికను వెలువరించే వార్షిక పత్రికలు కూడా ఉంటాయి. ఫ్రాన్స్ నుంచి వెలువడే ‘లా బూజీ డి సాపోర్’ అనే ఈ పత్రిక మాత్రం అలాంటిలాంటి పత్రిక కాదు. ప్రపంచంలోని పత్రికలన్నింటిదీ ఒకదారి అయితే, ఈ పత్రికది మరోదారి. జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఈ పత్రిక క్రమం తప్పకుండా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే ప్రచురితమవుతుంది. అది కూడా ఠంచనుగా ప్రతి లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29వ తేదీన ఇది విడుదలవుతుంది. లీపు సంవత్సరం వచ్చిందంటే చాలు, దీనికోసం పెద్దసంఖ్యలో పాఠకులు ఎదురుచూస్తూ ఉంటారు.అలా మొదలైంది...హాస్య, వ్యంగ్య కథనాలను ప్రధానంగా ప్రచురించే ఈ పత్రిక 1980లో మొదలైంది. ఇప్పటి వరకు ఈ పత్రిక వెలువరించినవి పన్నెండు సంచికలు మాత్రమే! పెద్దగా వ్యాపార ప్రణాళికలు, ఘనమైన లక్ష్యాలు వంటివేవీ లేకుండానే ఈ పత్రిక ఇద్దరు మిత్రుల చిలిపి ఆలోచన ఫలితంగా పుట్టుకొచ్చింది. జాక్వెస్ డి బుయిసన్, క్రిస్టియన్ బెయిలీ అనే మిత్రులు కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నపుడు ‘లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి కదా, ప్రతిసారీ ఫిబ్రవరి 29న విడుదలయ్యేలా ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకొస్తే భలేగా ఉంటుంది కదా!’ అని అనుకున్నారు. జాక్వెస్ పాలిటెక్నీషియన్, క్రిస్టియన్ ఔత్సాహిక ప్రెస్ టెక్నీషియన్– అంతేకాకుండా, పాతపత్రికల సేకర్త కూడా! ఇద్దరూ కలసి ఎలాగైనా, ఫిబ్రవరి 29న విడుదలయ్యేలా పత్రిక ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. పత్రికకు ఏ పేరు పెడదామని ఆలోచించారు. పంతొమ్మిదో శతాబ్ది చివరిరోజుల నాటి కార్టూన్ క్యారెక్టర్ ‘సాపర్ కామెంబర్’ గుర్తొచ్చింది. ఆ కార్టూన్ పాత్ర ఫిబ్రవరి 29న వస్తుంది. నాలుగేళ్లకు ఒకసారి పుట్టినరోజు జరుపుకొనే ఆ పాత్ర బోలెడంత హాస్యం సృష్టిస్తుంది. అందుకే, ఆ పాత్ర గుర్తొచ్చేలాంటి పేరు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ‘లా బూజీ డి సాపోర్’ (సాపర్స్ క్యాండిల్) అనే పేరు పెట్టారు. తొలి సంచికను 1980 ఫిబ్రవరి 29న ఇరవై పేజీలతో టాబ్లాయిడ్ సైజులో విడుదల చేశారు. మార్కెట్లోకి విడుదలైన కాపీలు హాట్కేకుల్లా అమ్ముడైపోయాయి. అప్పటి నుంచి ఈ పత్రిక ప్రతి లీపు సంవత్సరంలోను ఫిబ్రవరి 29న ఠంచనుగా మార్కెట్లోకి తన సంచికను విడుదల చేస్తోంది. ప్రస్తుతం జీన్ డి లిండీ ఈ పత్రికకు ప్రధాన సంపాదకుడిగా కొనసాగుతున్నారు. హాస్యరస ప్రధానంప్రధానంగా ఇది హాస్యరస ప్రధానమైన పత్రిక. ఎక్కువగా హాస్య, వ్యంగ్య కథనాలను ప్రచురిస్తుంది. అయినా, దీనిపైన రాజకీయ విమర్శలు లేకపోలేదు. జాతీయ అతివాదానికి ఈ పత్రిక మద్దతుగా కథనాలను ప్రచురిస్తోందని కొన్ని ఫ్రెంచ్ పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే, తమది పూర్తిగా రాజకీయాలకు అతీతమైన పత్రిక అని ప్రధాన సంపాదకుడు జీన్ డి లిండీ చెప్పుకుంటారు. ఈ పత్రిక ప్రతులు ఫ్రాన్స్లోనే కాకుండా బెల్జియం, స్విట్జర్లండ్, లగ్జెంబర్గ్, కెనడా దేశాల్లో కూడా అమ్ముడవుతాయి. చివరిగా 2024లో విడుదలైన ఈ పత్రిక ప్రతులు రెండు లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. ‘మేం ప్రచురించే ప్రతి సంచికలోనూ గడచిన నాలుగేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలను సింహావలోకనం చేస్తాం. అలాగని మాది రాజకీయ పత్రిక కాదు. రాజకీయాలకు అతీతంగా మేం పత్రికను నడుపుతున్నాం. బ్రెగ్జిట్ మొదలుకొని పర్యావరణ మార్పుల వరకు రకరకాల సమస్యలను మా పత్రికలో చర్చిస్తుంటాం. కథనాలు హాస్యస్ఫోరకంగా, వ్యంగ్యంగా ఉంటే పాఠకులను త్వరగా ఆకట్టుకోగలవని మా ఉద్దేశం. నవ్వు ఆరోగ్య లక్షణం. పాఠకులను నవ్వించాలనేదే మా లక్ష్యం’ అంటారు ఈ పత్రిక ప్రధాన సంపాదకుడు జీన్ డి లిండీ. ఈ పత్రిక 2024 సంచిక ధర 4.90 యూరోలు. మిగిలిన పత్రికల్లాగానే ఈ పత్రికను కూడా మార్కెట్లోకి విడుదలైనప్పుడు కొనుక్కోవచ్చు. ఎప్పటి సంచికను అప్పుడు కాకుండా, ఒకేసారి చందా కట్టాలనుకుంటే, 100 యూరోలు చందా కట్టినట్లయితే, వందేళ్ల పాటు– అంటే, పాతిక సంచికలు అందుతాయి. ప్రపంచ పత్రికా రంగంలో ఈ ఫ్రెంచ్ పత్రికది ఒక విలక్షణమైన కథ. -
మంత్ర తంత్రశాస్త్రాల మహిమ
బృహస్పతి నుంచి లౌకిక శాస్త్రాల ఘనతను సోదాహరణంగా తెలుసుకున్నాడు ఇంద్రుడు. మోక్షసాధనకు బ్రహ్మవిద్య ఉండగా, మరి మంత్ర తంత్రశాస్త్రాలు ఎందుకు ఉన్నాయి? వాటి వల్ల ప్రయోజనం ఏముంది? అనే సందేహం కలిగింది అతడికి. అదే సందేహాన్ని దేవగురువు వద్ద బయటపెట్టాడు.‘ఆచార్యా! మోక్షసాధనకు బ్రహ్మవిద్య ఒక్కటి సరిపోతుంది కదా? మరి అలాంటప్పుడు మంత్ర తంత్రశాస్త్రాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? వాటి వల్ల సాధించే ప్రయోజనం ఏముంటుంది? ఈ మంత్ర తంత్ర విద్యలు క్షుద్రప్రయోజనాల కోసం దుర్వినియోగానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ కదా? వీటి వెనుకనున్న మర్మమేమిటి?’ బృహస్పతిని అడిగాడు ఇంద్రుడు. ‘శచీపతీ! మంత్ర తంత్రశాస్త్రాల ప్రయోజనం ఏమిటనేగా నీ సందేహం? నీకు బాగా అర్థం కావడానికి ఒక కథ చెబుతాను, శ్రద్ధగా విను’ అంటూ బృహస్పతి ఆ కథను ఇలా చెప్పసాగాడు.‘పూర్వం విశాలనగరంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల శాస్త్రకోవిదుడు, తత్త్వజ్ఞుడు. అంతేకాదు, బహిరంతరేంద్రియ నిగ్రహం గలవాడు, ధర్మపరాయణుడు. వైదిక కర్మలను తు.చ. తప్పక పాటించేవాడు. గృహస్థాశ్రమ జీవనం సాగిస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. కొన్నాళ్లకు వేదశర్మకు ఒక కొడుకు కలిగాడు. అతడికి సుశీలుడు అని నామకరణం చేశాడు. సుశీలుడి పురాకృత పాపకర్మల ఫలితంగా పుట్టినప్పటి నుంచి ఆ బాలుడిని ఏడుగురు బ్రహ్మరాక్షసులు ఆవహించారు. ఆ ఏడుగురు బ్రహ్మరాక్షసులు పరస్పరం కలహించుకుంటూ, ఒకరినొకరు వధించుకునేందుకు నిరంతరం ప్రయత్నాలు చేసేవారు. వారి ప్రభావానికి సుశీలుడు విలవిలలాడుతూ రోదించేవాడు. ఒక్కోసారి రాక్షసుల ప్రభావంతో అతడికి ఉన్మాదం ప్రకోపించి, ఊరకే నవ్వుతూ నృత్యం చేసేవాడు. ఒక్కోసారి అకస్మాత్తుగా మూర్ఛపోయేవాడు. ఎదుగుతున్న కొద్ది సుశీలుడి చేష్టలు కొంత వింతగాను, మరింత విపరీతంగాను ఉండేవి. ఒక్కోసారి అతడు తినడం మొదలుపెడితే, ఇది తినదగినది, ఇది తినదగినది కాదు అనే విచక్షణ లేకుండా అమితంగా తినేవాడు. ఒక్కోసారి రోజుల తరబడి పస్తులుండేవాడు. కొడుకు తీరు చూస్తూ, వేదశర్మ దంపతులు ఆవేదన చెందేవారు. తన కొడుకును ఏ దయ్యాలో భూతాలో పట్టుకుని ఉంటాయని భావించిన వేదశర్మ, వాటిని వదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హోమాలు, నోములు, తీర్థయాత్రలు వంటివి ఎన్ని చేసినా, ప్రయోజనం లేకపోయింది. ఇంట్లో కొడుకు వల్ల తీరని ఇబ్బంది ఉన్నా, వేదశర్మ ఎన్నడూ తన గార్హస్థ్య ధర్మాన్ని మానుకోలేదు. ప్రతిరోజూ అతిథిపూజ చేసిన తర్వాతే తాను భుజించేవాడు.ఒకనాడు వేదశర్మ వైశ్వదేవం ముగించుకుని, అతిథి ఎవరైనా రాకపోతారా అని గుమ్మం వద్ద ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలోగా ఇంటి ముందుకు ఒక భిక్షువు వచ్చాడు. ఒళ్లంతా మట్టికొట్టుకుని ఉన్నాడు. చీలికలైన దుస్తులతో, దుర్గంధమయంగా ఉన్నాడు. అతడి శరీరం మీద ఈగలు ముసురుతూ ఉన్నాయి. ‘అభ్యాగతః స్వయం విష్ణుః’ అనే ఆర్యోక్తి ప్రకారం వేదశర్మ అతడిని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, ఇంటి లోపలికి తీసుకుపోయి, భోజనం పెట్టించాడు. అతిథి భోజనం తర్వాత వేదశర్మ తాను కూడా ప్రసాదం స్వీకరించి వచ్చి, భిక్షువుకు వింజామర వీచసాగాడు. ఈ అతిథి సాక్షాత్తు దత్తాత్రేయుడే కావచ్చు అనే ఆలోచన వేదశర్మ మనసులో మెదిలింది. దత్తాత్రేయుడు ఈ నగరంలోనే సంచరిస్తూ, ఇళ్లకు వెళ్లి భిక్ష స్వీకరిస్తున్నట్లు కొద్దిరోజుల కిందటే విన్నాడతను. ఈయనే గనుక దత్తాత్రేయుడు అయినట్లయితే తన జన్మ ధన్యమైనట్లేనని భావించాడు. అంతలోనే ఆ భిక్షువు లేచి, ‘ఇక బయలుదేరుతాను’ అంటూ బయటకు నడిచాడు. వేదశర్మ అతడి వెంటపడ్డాడు. భిక్షువు పొమ్మంటున్నా వినిపించుకోకుండా, అతడినే అనుసరించసాగాడు. వేదశర్మ ఎంత చెప్పినా వినకుండా తన వెంటే వస్తుండటంతో విసుగెత్తిన భిక్షువు అతడి మీదకు చేతికందిన రాయి, కట్టె వంటివి విసరసాగాడు. వాటి దెబ్బలకు నెత్తురోడుతున్నా లెక్కచేయకుండా, వేదశర్మ అతడి వెంటే ముందుకు నడవసాగాడు. కొంత దూరం వెళ్లాక దారిలో ఒక గాడిద కళేబరం కనిపించింది. భిక్షువు ఆ గాడిద శరీరం నుంచి ఇంత మాంసం ముద్దను పెకలించి, ‘ఇంద తిను’ అని వేదశర్మ చేతుల్లో పెట్టాడు. వేదశర్మ దానిని ప్రసాదంలా భక్తిగా దోసిట్లో పట్టుకుని, అతడి వెంట నడవసాగాడు. వేదశర్మను చేరువకు రానిచ్చి, భిక్షువు అతడిని కాలితో చాచిపెట్టి తన్నాడు. వేదశర్మ ఆ తాపును తట్టుకుని నిలబడ్డాడు. ఈలోగా భిక్షువు పరుగులాంటి నడకతో ముందుకు సాగి, ఒక కొండ గుహలోకి దూరాడు. వేదశర్మ కూడా ఆ కొండ గుహలోకి వెళ్లాడు.‘ఏమయ్యా నువ్వు! తిట్టినా కొట్టినా వదలకుండా నా వెంటపడ్డావు?’ అడిగాడు భిక్షువు.వేదశర్మ భోరున విలపిస్తూ అతడి పాదాలపై పడ్డాడు. తన కొడుకు దురవస్థను చెప్పి, అతడి దుఃఖాన్ని తొలగించమని అభ్యర్థించాడు. భిక్షువు ప్రసన్నుడయ్యాడు. ఏడు మంత్రాలను బీజాక్షర సహితంగా వేదశర్మకు ఉపదేశించాడు.‘నీ కొడుకును ఏడుగురు బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తున్నారు. వారిని ఒక్కొక్కరినే వదలగొట్టాలి. రోజుకొక మంత్రాన్ని జపించు. మంత్రోదకాన్ని నీ బిడ్డ మీద చిలకరించు. అలాగని, ఒకేసారి ఏడుగురు రాక్షసులను వదలగొట్టడం ఏ మంత్రానికీ సాధ్యం కాదు. అందుకని ఆ బ్రహ్మరాక్షసులను ఒకరి తర్వాత ఒకరుగా మాత్రమే వదలగొట్టాలి. ఏడుగురు బ్రహ్మరాక్షసులూ వారం రోజుల్లోనే నీ బిడ్డను విడిచి వెళ్లిపోతారు. ఆ తర్వాత నీ బిడ్డ నీ అంతటి కర్మిష్ఠి అవుతాడు’ అని చెప్పాడు.వేదశర్మ భిక్షువుకు పదే పదే నమస్కారాలు చేస్తూ, అక్కడి నుంచి ఇంటిముఖం పట్టాడు.ఇందాక గాడిద కళేబరం పడి ఉన్న చోట ఒక రక్తచందన వృక్షం ఉంది. తన చేతిలో భిక్షువు పెట్టిన మాంసం ముద్ద రక్తచందన పుష్పమైంది.ఇంటికి వెళ్లిన బ్రాహ్మణుడు భిక్షువు చెప్పిన ప్రకారమే రోజుకొక మంత్రాన్ని జపించి, ఏడుగురు రాక్షసులను ఒక్కొక్కరినే తన బిడ్డ నుంచి వెళ్లగొట్టాడు. ఆ తర్వాత సుశీలుడు సాధారణ స్థితికి వచ్చాడు.విన్నావు కదా దేవేంద్రా! మంత్ర తంత్రశాస్త్రాలు కేవలం క్షుద్రప్రయోజనాలకే కాదు, పరంపరాగతంగా అవి ముక్తిసాధనాలు కూడా కాగలవు’ అని ముగించాడు బృహస్పతి.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: ముట్టుకోకు
‘‘చదవేస్తే ఉన్న మతి పోయిందట! పిచ్చి అనుమానాలతో పిల్లల బుర్రలు పాడు చేస్తే ఇలానే ఉంటుంది మరి! నా కొడుకు కష్టమంతా బూడిదలో పోసేశావ్, నీ అతితెలివి తగలెయ్యా! బ‘‘మా అత్తగారు ఆ రోజు నా మనసులో గుచ్చిన ఆ ముల్లు ఇంకా పచ్చిగానే ఉంది.‘‘అసలు మగ పిల్లాడిని పెంచే విధానం ఇదేనా! మగపిల్లాడంటే పులిబిడ్డలా ఉండాలి, పిరిగ్గొడ్డులా కాదు.’’ గుచ్చిన ముల్లునే ఇంకా లోనికి దించుతూ అటూ ఇటూ తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది నాకప్పుడు.మారుతున్న కాలంతో పాటూ వంకర్లు పోతున్న మనుషుల మెదళ్ళ గురించి, ఆ వంకర్లలో నుంచి పుట్టే వికృత కృత్యాల గురించి ఆవిడకి వివరించి చెప్పే ధైర్యం నాకు లేదు, అర్థం చేసుకునే పెద్ద మనసు ఆవిడకి లేదు. నాలాంటి పిరికి కోడళ్ళం ఉన్నాం ఈ రోజుల్లో కూడా! భయభక్తులతో నేనూ, ఆధిపత్యంతో అత్తగారూ, కెరీర్లో పడుతూ లేస్తూ మా ఆయన. నిస్సారంగా సాగిస్తున్న మా జీవితాల్లోకి ఆ సంఘటన ఓతుఫానులా వచ్చి వెళ్ళినా, అది వదిలి వెళ్ళిన గుర్తులు ఎప్పటికీ చెరిగిపోవు. పదేళ్ళు కష్టపడ్డా దక్కని ఫలితం ఒక్క విందు దౌత్యం ద్వారా దక్కుతుందంటే వెనుకాడుతామా? ఉదయం నాలుగున్నరకే లేచి రెండు రకాల టిఫిన్లూ, వాటికి రెండు చట్నీలూ, సాంబారూ; మధ్యాహ్నం లంచ్ కోసం కొర్రమీను పులుసు, టైగర్ రొయ్యల వేపుడు, నాటు కోడి ఇగురు, మటన్ బిర్యానీ; వాటికి తోడు శాకపాకాలు కూడా ఉండాలిగా అన్నట్టు ఆలూ ఫ్రై, టమాటా పప్పు, రసం, అప్పడాలూ, పెరుగూ; ఇవన్నీ చాలవన్నట్టు చక్కెర పొంగలి, అరటిపండూ, ఐస్ క్రీమూ– బడా గెస్ట్ కోసం భారీ మెనూ సిద్ధం చేసుకొని,వంట పూర్తిచేసి, మొహాన కాసిన్ని నీళ్ళు జల్లుకొని, ముస్తాబై నవ్వు సింగారించుకొని కూర్చున్నా.మా ఆయన, తనకు దక్కబోతున్న పది కోట్ల కాంట్రాక్టు గురించి; దాన్ని ప్రసాదించబోయే మంత్రిగారి బామ్మర్ది గురించి వేచి చూస్తూ, ఇంటి గేటు దగ్గరే పచార్లు కొడుతూ ఉన్నారు. మంత్రిగారి బామ్మరిదే మా బడా గెస్టు. పదేళ్లుగా చిన్నచిన్న సబ్ కాంట్రాక్టులు చేసుకుంటూ బండి లాక్కొస్తున్న మా ఆయనగారికి దొరక్క దొరక్క ఎదురుపడ్డ పది కోట్ల రోడ్డు కాంట్రాక్టుని విందు దౌత్యం ద్వారా దక్కించుకోవాలని ఆయన ఉబలాటం. అన్నీ పోనూ ఓ పది శాతమైనా మిగిలితే చాలు, జీవితంలో ఓ మెట్టెక్కినట్టే! ఉదయం టిఫిన్ల నుంచి మధ్యాహ్నం భోజనాల సమయం వరకూ పెద్ద పెద్దోళ్లతో మంతనాలన్నీ మా ఇంట్లోనే! వారి కోసమే ఈ భారీ మెనూ. కాంట్రాక్టులంటే కమిషన్లూ, పర్సెంటేజీల అధికారిక పొట్లాల పంపిణీ ఉండనే ఉంటుంది కాని, మనీ పర్సుని తృప్తిపరిస్తే అది ఖాళీ అయ్యేవరకే గుర్తుంటుంది, మనిషి అహాన్ని తృప్తిపరిస్తే మనిషి ఉన్నంతవరకూ గుర్తుపెట్టుకుంటాడు. అతిథి మర్యాదలకున్న పవర్ అలాంటిది. పైగా ఆ వచ్చేవాడు పెళ్లీ పెటాకులు లేని బెమ్మచారిట! ఇంటికి పిలిచి భోజనాలు పెడితే తెగ పొంగిపోతాడట! ఆ వీక్నెస్ పట్టేశారు మావారు.గంట సేపు వెయిటింగ్ తర్వాత పెద్ద పడవ లాంటి కారులో దిగాడు మంత్రిగారి బామ్మర్ది. మాసిన తెలుపు నలుపుల గడ్డం, లోపలకెళ్లిన సీసాల కొద్దీ మద్యాన్ని మోయలేక ఊరిపోయి వేలాడుతున్నట్టున్న పొట్ట, మెడలో కట్లపాములాంటి బంగారపు గొలుసు, చేతికి బ్రేస్లెట్, బొటనవేళ్ళు తప్ప మిగతా ఎనిమిది వేళ్లకు ఎనిమిది ఉంగరాలు ధరించిన ఆ భారీ ఆకారం ఊగుతూ మా ఇంట్లో చొరబడింది, సాదర స్వాగతాలతో!మా సోఫా సెట్లో కుర్చీలు ఈయనకు సరిపోతాయా అన్న అనుమానం గుండెను గుంజేసింది కాసేపు. ఇంతాచేసి ఇలాంటి చోట అభాసు పాలైపోతే ఎలా! పర్లేదు, కుదురుకొని సర్దుకున్నాడు. ఈ మంత్రుల తమ్ముళ్ళు, బామ్మరుదులు ఏదో ఇలానే ఉండాలని రూల్ పెట్టుకుంటారో ఏంటో! అచ్చం సినిమాల్లో చూపించినట్టు ఉన్నాడు. టిఫిన్లకు కూర్చున్నారు. పక్కనే నిలబడి అతి వినయం ప్రదర్శిస్తూ వడ్డిస్తున్నాను. ఆ పక్కగా ఆడుకుంటున్న మా ఐదేళ్ల చింటూగాడు పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని తీసుకున్నాడు. అతడు ముచ్చటగా చూసి నవ్వేడు. గంభీరమైన ఆ ముఖానికి నవ్వు కూడా వచ్చా! అనిపించింది. టిఫిన్లు పూర్తయి భారీ ఆకారాన్ని మళ్ళీ సోఫాకి తరలించి ప్రాజెక్టుకి సంబంధించిన ఫైలు ఏదో తెమ్మని ఆయన్ని లోపలికి పంపేడు.‘‘టిఫిన్ తర్వాత నాకు జ్యూస్ అలవాటు... తీసుకొస్తారా?’’ ఆర్డరు వేసి నన్ను వంటగదిలోకి పరిగెత్తించాడు. అతడు చింటూగాడిని ఎత్తుకొని బుగ్గలు నిమరడం నేను కిచెన్లోకి వెళ్తుండగా నా కంటబడ్డ ఆఖరి దృశ్యం. అంతే!ఓ రెండు నిమిషాల తర్వాత..‘‘బ్యాడ్ అంకుల్! బ్యాడ్ టచ్!! బ్యాడ్ అంకుల్! బ్యాడ్ టచ్!’’ చింటూగాడి అరుపులకు గుండె జలదరించినట్టైంది. పరిగెత్తుకొని హాల్లోకి వచ్చి చూశాను. చింటూని విదిలించి కింద పడేసి, కోపంగా చూస్తూ ఇంటి బయటకు తన భారీ కాయాన్ని జరజరా లాక్కుంటూ పోతున్నాడు.మా ఆయన బెడ్రూమ్లోంచి బయటకొచ్చి ఫైలు పట్టుకొని నిలబడి హతాశుడై చూస్తున్నాడు. బయటకు పోతున్న అతడి వెంట ‘‘సార్సార్! సారీ సార్...!’’ అంటూ పరిగెత్తాడు. అతడి కారు మా ఆయన్ని పట్టించుకోలేదు.చింటూని దగ్గరకు తీసుకొని హత్తుకొని కూర్చున్నాను. ‘‘అసలేమైంది చింటూ?’’ అనునయిస్తూ అడిగాను.‘‘ఏమైందేంటే?? వాడిని ఎత్తుకొని కాస్త ముద్దు చేశాడాయన, అంతే! నేనిక్కడే ఉన్నానుగా!’’ గయ్యిమంది మా అత్తగారు.‘ఊరికే వాడు బ్యాడ్ టచ్ అని ఎందుకు అరుస్తాడు? వాడికి బ్యాడ్ టచ్ అంటే ఏమిటో వివరించి చెప్పానుగా ఎప్పుడో! అంటే వచ్చిన వెధవ ఏమైనా అఘాయిత్యం!’ తల్చుకుంటేనే వెన్నులో వణుకొచ్చేసింది. వివరంగా చింటూని అడగాలనుకున్నా. ఆవిడ ముందు నా గొంతు పెగలలేదు.‘పక్కగదిలో కూర్చొని సాయికోటి రాసుకుంటున్న ఈవిడ హాల్లోకి ఎపుడు చూసిందని, వాడికి వత్తాసు పలుకుతోంది!?’ నా బుర్రకేమీ తోచలేదు.‘‘మొత్తం నాశనం అయిపోయింది. ఛా!!’’ ఇంట్లోకి వస్తూనే చేతిలో ఫైలుని విసిరికొట్టాడు మా ఆయన.కాయితాలన్నీ చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. పిచ్చెక్కినట్టు అరవటం మొదలుపెట్టాడు.పిల్లోడికి ఏమైందో అనే ఆదుర్దా కూడా లేకుండా కాంట్రాక్ట్ పోయిందనే బాధపడటం నాకు ఆశ్చర్యమే కాదు, అసహ్యం కూడా వేసింది. ముడిపడ్డ నా నొసటిని, మా వారివైపు చీదరింపుతో కూడిన నా చూపుని కూడా భరించలేకపోయింది మా అత్తగారు.‘‘చదవేస్తే ఉన్న మతి పోయిందట! పిచ్చి అనుమానాలతో పిల్లల బుర్రలు పాడుచేస్తే ఇలానే ఉంటుంది మరి! నా కొడుకు కష్టమంతా బూడిదలో పోసేశావ్, నీ అతితెలివి తగలెయ్యా! అసలు మగ పిల్లాడిని పెంచే విధానం ఇదేనా? అయినా చింటూ ఏమైనా ఆడపిల్లా? మగపిల్లాడంటే పులిబిడ్డలా ఉండాలి. పిరిగ్గొడ్డులా కాదు’’ అత్తగారు విరుచుకుపడింది. నా ఒళ్ళో ఉన్నవాడిని రెక్కపట్టుకు లాక్కుపోయి బెడ్రూం తలుపేసుకు కూర్చుంది.నా బుర్ర గిర్రున తిరిగింది. అసలక్కడ ఏం జరుగుతోందో నాకేం అంతుబట్టలేదు. ఇలాంటి పరిస్థితిలో ఓ తండ్రి, నానమ్మ ప్రవర్తించాల్సిన తీరు కచ్చితంగా ఇది కాదు. ఒక్కసారిగా అగాథంలోకి కూరుకుపోయిన భావనేదో కమ్మేసింది.మా ఆయనగారు బిక్కుబిక్కుమంటూ అతడికి ఫోన్ చేసి తిరిగి రప్పించే ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నాడు. అతడు ఫోన్ ఎత్తినట్టు లేడు. ఎవరెవరికో ఫోన్లు చేసి, కాంట్రాక్టు చేజారిపోకుండా చూసేందుకు దేబిరిస్తున్నాడు. అత్తగారు మూసిన తలుపింకా తెరవలేదు. లోపల చింటూ ఎలా ఉన్నాడో! తలుపు తట్టే ధైర్యం నాకు లేదు. నా బేలతనానికి నాకే సిగ్గేసింది.డబ్బు కోసం కన్న కూతుర్ల శీలాన్ని తాకట్టు పెట్టే తల్లిదండ్రులు ఉంటారని చాలా చోట్ల చదివి ఉన్నాను.ఇప్పుడు ఇంచుమించు అలాంటి వాళ్ళనే చూస్తున్నాను అనిపించేసింది. ఓహ్! మగపిల్లలకి శీలం లాంటిదేదీ ఉండదు కదూ! మరిప్పుడు తాకట్టు పెట్టినదాన్నేమంటారో!నా తడి కళ్ళు నిస్సహాయంగా తలుపుకేసి చూస్తుండిపోయాయి. అర్హతకు తగ్గ అవకాశాలు, విజయాలు దక్కకపోతే మనిషి మరీ ఇంత దిగజారిపోతాడా? కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరికో ఫోన్లు చేసి దేబిరిస్తున్న మా ఆయన మొహం చూడాలంటే కంపరం మొదలయింది. మూడు గంటలు గడిచాయి. ఆయన ప్రయత్నాలేవీ ఫలించినట్టు లేవు. అసలైనోడే అలిగి వెళిపోతే కొసరు పెద్దమనుషులు కూడా మొహం చాటేశారు. కాంట్రాక్టు గాలిలో కలిసినట్టే. సమయం గడుస్తున్న కొద్దీ రక్తపోటు పెరిగి ఆయన మొహం వికృతంగా కొంకర్లుపోతోంది. ఇంకాసేపైతే కిందపడి గిలగిలా కొట్టుకునేవాడే. గేటు బయట కారు శబ్దం విని దిగ్గున లేచాడు. పరిగెత్తుకు వెళ్ళి అతడి చేతులు పిసుకుతూ సారీలు చెప్పుకుంటూ లోపలికి తీసుకొచ్చాడు .వాడి మొహంలో ఇందాకటి గాంభీర్యం ఇప్పుడు లేదు, పాలిపోయింది. పీడోఫిల్ ... చిన్నపిల్లలపై కామవాంఛలను పెంచుకునే వెధవలను అలానే పిలుస్తారట! ఎక్కడో చదివిన గుర్తు. వీడు అందుకే పెళ్లి పెటాకులు లేకుండా ఆంబోతులా తిరుగుతున్నాడనమాట!వాడ్ని చూస్తూనే నా నరాలు పొంగాయి. చికెనూ మటనూ కోసిన కత్తితోనే వాడి పీక కోసేయాలన్నంత కసి.‘‘బాగా ఆలస్యం అయిపోయింది. సార్గారు వచ్చేశారు కదా, భోజనం వడ్డించు’’ ఆయనగారి ఆర్డరు!కారు శబ్దం వింటూనే బెడ్రూమ్ తలుపు తెరుచుకుంటూ బయటకొచ్చింది మా అత్తగారు. వస్తూనే వంగి వంగి దండాలెట్టేసింది. చింటూ లోపల పడుకున్నట్టున్నాడు. ఏ చప్పుడూ లేదు.‘‘ఏంటి చూస్తున్నావ్ వడ్డించూ!!’’ అత్తగారి హుకుం జారీ అయింది. నాలోని దద్దమ్మ కోడలు తలవంచేసింది. వచ్చినోడు ఎంత వెధవ అయినా, ఎంతటి ఘాతుకానికి ఒడిగట్టినా, వాణ్ని చూస్తేనే మన ఒంట్లో రక్తం సలసలా కాగుతున్నా, మర్యాదలకు మాత్రం లోటు రానివ్వకూడదు. దద్దమ్మ కోడళ్ళ రూల్బుక్లో మొదటి రూల్ ఇదే కావొచ్చు!మటను బొమికల్లో మజ్జను కూడా జుర్రుకుంటూ మెక్కుతున్న ఆ కుక్కను చూస్తే ఒళ్ళంతా కంపరమేసింది. పక్కనే జీ హుజూర్ ! అంటూ నిల్చున్న మా వాళ్ళను చూస్తే అంతకంటే జుగుప్సగా ఉంది.‘‘మీరు చదువుకున్నవారిలా ఉన్నారే!’’ నాకేసే చూస్తూ అడిగాడు ఆ కుక్క.వాడికి జవాబిచ్చే స్థితిలో నేను లేను. చాలాసేపటి నుంచి పంటి బిగువున అదిమిపట్టిన కోపం, కట్టలు తెంచుకోవడం నాకిష్టం లేదు. దద్దమ్మల రూల్ పుస్తకంలో ఇది మరో రూల్.‘ఆ! ఏదో చదివిందిలెండి. ఈకాలం ఆడపిల్లల చదువులు ఉద్యోగాలకి చాలవు ఇల్లు చక్కబెట్టడానికి పనికిరావూ..’’ వెకిలి కామెంటు విసిరింది అత్తగారు.అతడు పట్టించుకోలేదు. ‘‘ఏమ్మా! బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి చెప్పడం తెలిసింది సరే, మరి ఆ తర్వాత పిల్లాడిని జరిగిన విషయం గురించి వాకబు చేశావా తల్లీ?’’ గతుక్కుమన్నాను. అతడు ఎగతాళి చేస్తున్నాడో, సవాలు చేస్తున్నాడో అర్థం కాలేదు. బెడ్రూమ్ వైపు అత్తగారి వైపు మార్చి మార్చి చూశాను. ‘‘పోవే! పోయి వాణ్ని తీసుకురా! ’’ అన్నట్టు కళ్ళతోనే సైగ చేసిందావిడ.పరిగెత్తుకు లోపలికి వెళ్ళాను. చింటూని గుండెలకి హత్తుకుని, బుజ్జగిస్తూ ఆరా తీశాను. నాలుగు గంటల మానసిక క్షోభ తర్వాత గుండెలపై నుండి టన్ను బరువు దించినట్టైంది. వాడి చేయి పట్టుకుని మెల్లగా డైనింగ్ టేబుల్ దగ్గరకు తెచ్చాను. చింటూ కళ్ళలో బెరుకు, భయం లాంటివేవీ నాకు కనపడలేదు. అతడిని చూసి, ‘‘నీ జట్టు పీస్! బ్యాడ్ అంకుల్.’’ అన్నాడు.మా ఆయన గొంతు తడారిపోవడం తెలుస్తూనే ఉంది. గుటకలు మింగుతూనే ఉన్నాడు.‘‘తప్పు! అలా అనకూడదు చింటూ!’’ చింటూ చెయ్యి పట్టుకులాగి చిన్నగా కుదుపుతూ గయ్యిమన్నాడు మా ఆయన.‘‘ఈ అంకుల్ నాతో ఫైటింగ్ చేస్తూ నా సీటుపైన గిచ్చేశాడు.‘‘ బుంగ మూతి పెట్టి చెప్పాడు బుజ్జాయి చింటూ.మా ఆయనగారూ, అత్తగారూ తెచ్చి పెట్టుకున్న నవ్వుతో బిగ్గరగా నవ్వేసి, ‘‘తప్పు నాన్నా! అంకుల్ సరదాగా చేశారు. బ్యాడ్ అంకుల్ అనకూడదు’’ అని, చింటూతో బలవంతంగా ‘సారీ’ కూడా చెప్పించేశారు.చింటూ చెప్పిన విషయం నమ్మాలనే అనిపించింది. ఊహించినట్లుగా ఏ ఘోరమూ జరగలేదని తెలిశాక, తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.‘‘పూర్తిగా తెలుసుకోకుండా ఈ విషయం బయటకెళ్తే నా పరువేం కానూ?’’ నవ్వుతూనే చురక వేశాడు అతడు.‘‘ఈ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం చేశావా?’’ అన్నట్టు కింద నుంచి పైవరకు కొరకొరా చూసింది అత్తగారు.అతడ్ని అనవసరంగా అనుమానించినందుకూ, అడ్డమైన పుస్తకాలూ చదివేసి, అనవసర భయాలతో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అంటూ పిల్లల మనసులు పాడు చేసినందుకు నాలో నేనే కుచించుకుపోయేలా చేసిన చూపు అది.‘‘చక్కెర పొంగలి చాలా బాగుంది. మా అమ్మ గుర్తొచ్చింది’’ చేతి వేళ్ళను చప్పరిస్తూ చెప్పేడతడు.జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకుండా ఎంత బాగా మాట్లాడుతున్నాడో అన్నట్టు మొహాలు పెట్టి మురిసిపోయారు మావాళ్లిద్దరూ. అతడి మంచితనపు ప్రదర్శన పెరిగే కొద్దీ నా వైపు కొరకొర చూపులు ఎక్కువయ్యాయి.‘‘మా అమ్మ మీ కంటే వంట బాగా చేసేది. కాని, మీకున్న తెలివితేటలు ఆవిడకు ఉండి ఉంటే నా జీవితం వేరేలా ఉండేది.’’ అతడి మాట అర్థంకాక మొహాలు చూసుకున్నాం. ‘‘బ్యాడ్ టచ్ అంటే ఏంటో నాకు చిన్నప్పుడే తెలుసు. మా అమ్మ చెప్పలేదు. మా మావయ్య తెలియజెప్పాడు, చేతలతో. నేను జరిగినది చెప్పినా అమ్మ నమ్మలేదు. ఆమెది సొంత తమ్ముడిపై ప్రేమో, లేక అసలు అలాంటి వెధవ బుద్ధుల గురించి తెలియనితనమో! అమ్మ కూడా నన్ను నమ్మటం లేదనే వేదన, ఆమె నమ్మకపోయేసరికి ఇంకా ఎక్కువైన మావయ్య వేధింపులు... ఆ రోజులు చాలా భయంకరంగా ఉండేవి. కలల్లో కూడా వెంటాడే భయం... బాల్యమంతా ఆ భయంతోనే గడిచిపోయింది. సరిగ్గా చదువు వంటబట్టలేదు. కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే భయం. పెళ్లి చేసుకోవాలంటే భయం. కొన్నిసార్లు నా మనసు ఇంకా పిల్లాడి లాగానే ఉండిపోయిందని అనిపిస్తూ ఉంటుంది. అల్లకల్లోలంగా ఉండే మనసుని శాంతింపజేయడానికి తాగుడు అలవాటు చేసుకున్నా, ఫలితం లేదు. సైకాలజిస్టుల చుట్టూ తిరిగా... మొత్తానికి ఆ కూపంలోంచి బయట పడేసరికి నలభైఏడేళ్ళు దాటిపోయాయి. ఇప్పడూ ఓ కుటుంబం కావాలనిపిస్తుంది కాని, ఇలాగే అలవాటైపోయింది. అందుకే ఎవరైనా ఇంటికి పిలిచి భోజనం పెడితే కాదనకుండా వాలిపోతా! పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఏదో తెలియని ఆనందం. కాని, చింటూ అలా అరిచే సరికి నా గతం మొత్తం కెలికినట్టయింది. ఏమీ అనుకోకండి సారీ! చింటూ సారీ నాన్నా! ఈసారి బాగా ఫైట్ చేద్దాం నో చీటింగ్. అమ్మా! మా అమ్మ కూడా మీలాగా ఉండి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు’’ అంతటి భారీ మనిషి కంటి నుండి కన్నీరు మాత్రం అతి తేలికగా జారిపోయింది.అలాంటి వ్యక్తి నుంచి అలాంటి మాటలు వినేసరికి అంతా నిశ్చేష్టులయిపోయారు. చిరునవ్వుతో అతడికి వీడ్కోలు పలికేశాము. మా అత్తగారు చింటూ తల నిమిరి నా వైపే చూస్తూ నిలబడిపోయింది.అంతకు ముందున్న కరకు చూపు కాదది. మా ఆయన దగ్గరుండి కారు డోర్ మూసి మరీ ఆయన్ని సాగనంపి, లోపలికొచ్చి మురిపెంగా ప్రాజెక్టు ఫైలుని చూసుకొని నవ్వుకుంటున్నాడు. నేను కూడా హాయిగా ఊపిరి తీసుకున్నాను. కాని, గుండెలో ఏదో గుచ్చుతున్నట్టు, గుండె గోడకి ఏదో బీటలు పడ్డట్టు అనిపించింది. గట్టిగా ఊపిరి తీసుకున్నాను. బీటలు పడాల్సింది బద్దలవ్వాల్సింది నా గుండె కాదు, నా దద్దమ్మతనం. అర్థమైంది నాకు. -
అడవుల కోసం అలుపెరుగని పోరాటం
‘ఈ భూమికి, అమెజాన్ వర్షారణ్యాలు ఊపిరితిత్తుల వంటివి. అవి నాశనం అవ్వడం మొదలైతే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది’ అని పర్యావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. నిజానికి అమెజాన్ వర్షారణ్యాలు ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, అడవుల నరికివేత, అక్రమ గనుల తవ్వకాలు, వ్యవసాయ విస్తరణ, పట్టణీకరణ వంటి ఎన్నో కారణాలతో ఈ అటవీ ప్రాంతాలు వేగంగా అంతరించిపోతూ వస్తున్నాయి. దీని ఫలితంగా వాతావరణ మార్పులు, జీవజాతులు అంతరించిపోవడం వంటి తీవ్ర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ఆదిమవాసీ బృందం– ఈ వర్షారణ్యాల సంరక్షణ కోసం బ్రిటన్ లో పర్యటించారు. ఈ బృందంలో ‘ఆషానింకా’ జాతి ప్రతినిధి ఒకోషో, అలెగ్జాండ్రినా పియాకోతో పాటు ‘గువారానీ’ అనే మరో ఆదిమజాతి ప్రతినిధి ‘జులియానా కెరెక్సు మిరిమ్’ ప్రత్యేకంగా నిలిచారు. ఈ పర్యటనలో అషానింకా, గువారానీ కమ్యూనిటీల ప్రతినిధులు– బ్రిటన్ కి చెందిన వుడ్లాండ్ ట్రస్ట్ సిబ్బందిని కలిశారు. యునైటెడ్ కింగ్డమ్లోని డెవాన్ లో డార్ట్ వ్యాలీలోని అరుదైన అటవీ ప్రాంత పునరుద్ధరణకు నిధులు సమకూర్చడానికి, వుడ్లాండ్ ట్రస్ట్కి మద్దతు పలికారు. ఆదిమ బృందంతో వుడ్లాండ్ సిబ్బంది కలిసి డార్ట్ వ్యాలీలోని బక్లండ్ వుడ్లోని 247 ఎకరాల పునరుద్ధరణకు 28 లక్షల పౌండ్లు (రూ.32.19 కోట్లు) అవసరమనే విజ్ఞప్తిని గట్టిగా వినిపించారు. ఈ క్రమంలోనే ఆదిమవాసులు– తమ అమెజాన్ వర్షారణ్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను, రాబోయే ప్రమాదాలను ప్రపంచానికి వినిపించే ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా ఈ బృందం–బ్రిటన్ లోని పర్యావరణ సంస్థల ప్రతినిధులు ఎందరినో కలిశారు. వర్షారణ్యాల సంరక్షణకు అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అందులో భాగంగా పలువురు పర్యావరణ అధికారులతో పాటు ఎందరో శాస్త్రవేత్తలను కూడా కలుసుకుని అమెజాన్ అడవుల పునరుద్ధరణ జరగకుంటే రాబోయే సమస్య తీవ్రతను చర్చించారు. అమెజాన్ ఆదిమ బృందం చేపట్టిన ఈ ఖండాంతర పర్యటన యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది. వర్షారణ్యాలను రక్షించాలన్న ఆశే, తమ ప్రధాన ఉద్దేశమని వారు వెల్లడించారు. వర్షారణ్యాలు నాశనం కావడంతో ఏర్పడుతున్న పలు సమస్యల గురించి ఈ బృందం హెచ్చరించింది. అషానింకాకు చెందిన నాయకురాలు అలెగ్జాండ్రినా పియాకో మాట్లాడుతూ– ‘భూమిని, అడవులను పునరుద్ధరించడం అనేది ప్రకృతితో ప్రజల సంబంధాలను పునరుద్ధరించడంతో పాటు జరగాలి’ అని నొక్కి చెప్పారు. ఆ లోతైన సంబంధం లేకుంటే, ఏ పర్యావరణ ఉద్యమం కూడా విజయవంతం కాదని ఆమె హెచ్చరించారు.వుడ్లాండ్ ట్రస్ట్కి సంబంధించిన రెయిన్ ఫారెస్ట్ రికవరీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సామ్ మానింగ్ ఈ ఆదిమవాసులు బ్రిటన్ను సందర్శించి తనను కలిసిన రోజు గురించి చెబుతూ, ‘ఒక అటవీ సంరక్షణాధికారిగా, ఈ రోజు నా జీవితంలో అత్యంత భావోద్వేగంతో కూడిన రోజులలో ఒకటి. గువారానీ, అషానింకాల జ్ఞానం నన్ను చాలా కదిలించింది. వారితో చర్చ చాలా స్ఫూర్తిదాయకమైనది’ అని తెలిపారు.‘అమెజాన్ అడవులు ప్రమాదంలో పడటం అంటే ప్రపంచం ప్రమాదంలో పడటమే! ప్రకృతిని పునరుద్ధరించడం అంత సులభం కాదు. ఇది తొలి అడుగు, అలాగే మేలి అడుగు. ఇది సమష్టి పోరాటం. అందుకే ప్రపంచదేశాల మద్దతుని కోరుతున్నాం’ అని ఈ ఆదిమ బృందం ప్రపంచానికి పిలుపునిచ్చింది.ఈ పర్యటన ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు, వర్షారణ్యాల పునరుద్ధరణకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలియజేస్తుంది. ఇలాంటి అంతర్జాతీయ పర్యటనలు, చర్చలు, చర్యలు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పటికే ఈ అమెజాన్ స్థానికులు, నాయకులు వర్షారణ్యాల సంరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో, అంతర్జాతీయ వేదికల్లో తమ వాదనను వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే! -
ఈ వారం కథ: పరదేశి
ఎప్పుడూ అతని గదిలో నుండి నాకు ‘ఆజారే...’ అంటూ లత మధురగానం వినిపిస్తూ ఉంటుంది. ‘మధుమతి’ చిత్రంలోని పాటలన్నీ అదేపనిగా వస్తూ ఉంటాయి. అతనికా పాటలు అంత ఇష్టమైతే కావచ్చు కాని, ఎప్పుడూ అవే పాటలు వింటూ ఉండటం నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మరో పాట విని ఎరుగను. అతని దగ్గర వున్నది అదొక్కటే క్యాసెట్ కాబోలు!ఉదయం ఏడు గంటలకు వెళ్ళిపోతాడు హడావుడిగా.మళ్ళా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వస్తాడు. ‘మధుమతి’ పాటలు వినిపించాయంటే, అతను వచ్చినట్లే!సుమారు ఓ అరగంట వరకూ ఆ చిత్రంలోని పాటలు వినిపిస్తుంటాయి. అవి వినడం నాకూ అలవాటయిపోయింది.ఓ రోజు ఉదయం అతను వెళ్లే టైమ్కి నేను మా గుమ్మంలో నిలబడ్డాను. సైకిల్ మీద వెళుతున్నాడు. ఇరవై ఐదేళ్లు వుంటాయేమో?బక్కపలచగా, తెల్లగా వున్నాడు. ఊరు చివర ఏదో ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడట!మా ఇంటి పక్క పోర్షన్లో రిటైర్డ్ మాస్టారు వుంటారు. అందులో ఒక గది ఆ అబ్బాయికి అద్దెకు ఇచ్చారు. అది మా వంటింటికి, పెరటి ఖాళీ స్థలానికి దగ్గరగా ఉంటుంది. మధ్యలో ప్రహరీ గోడ ఉన్నప్పటికీ అతని గది కిటికీలు కనిపిస్తూ ఉంటాయి.ఇంటర్లో ఫెయిల్ అయిన సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతుండేదాన్ని. రోజంతా ఇంట్లో ఉండటం బోర్గా ఫీల్ అవుతున్న సమయంలో ఆ ఎదురింటి అబ్బాయిని గమనిస్తూ వుండటం నిజానికి మంచి కాలక్షేపం !మా ఇంట్లో నాన్నగారు రిటైర్ అయి మూడేళ్లు కావస్తోంది. అన్నయ్య పేపర్ మిల్స్లో పని చేస్తాడు. అక్క పెళ్లికి రెడీగా ఉంది.కాస్త నల్లగా, సన్నగా ఉండటం వల్లనేమో? అక్కని చూడటానికి వచ్చిన వాళ్ళు ఓకే అనడం లేదు. రెండో పిల్ల అయితే సరే అన్నారు ఒకరు. ‘పెద్ద అమ్మాయికి కాకుండా రెండో అమ్మాయికి చెయ్యం’ అని ఇంట్లోవాళ్లు గట్టిగా చెప్పడమే కాకుండా, అప్పటి నుంచి పెళ్లి చూపులకు ఎవరైనా వస్తే, నన్ను కనబడనీయకుండా దాచేసేవాళ్ళు.ఆ విధంగా ఒకరోజు సాయంకాలం నేను మా డాబా మెట్ల మీద కూర్చోవలసి వచ్చింది. చీకటి కూడా పడింది. పెళ్లి చూపుల కార్యక్రమం ఇంకా అయినట్లు లేదు. ఒక్కర్తినే ఏమీ తోచక అలా ఆలోచిస్తూ కూర్చున్నాను.ఇంతలో పక్కింటి రూమ్లో లైటు వెలిగింది.అతను తొందరగా వచ్చినట్లు వున్నాడు. కిటికీ తలుపు తెరిచాడు.టేప్ రికార్డర్ ఆన్ చేశాడు.‘ఆజారే పరదేశీ...’ లత తీయని గొంతు వినిపిస్తోంది.చీకటిలో డాబా మీద ఉన్న నేను అతనికి కనబడే అవకాశం లేదు. అతను మాత్రం కాస్తంత మాసిన బనీను, లుంగీతో స్పష్టంగా కనిపిస్తున్నాడు.గది మూల కిరోసిన్ స్టవ్ వెలిగించాడు. ఓ గిన్నెలో బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాడు. ఇంకోపక్క ఓ పళ్ళెంలో ఉల్లిపాయలు, పచ్చిమిరప ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాడు. కోడిగుడ్డు కూడా ఆ పక్కనే కనిపిస్తోంది.ఆమ్లెట్ వేసుకుంటాడేమో?‘రమణీ... రమణీ’ అమ్మ కేక వినిపించింది.‘ఆ... వస్తున్నా’ అంటూ మెట్లు దిగుతుంటే, అతను కిటికీలోంచి నన్ను చూశాడు. చీకటిలో నా ఆకారం అతను గుర్తించినట్లే ఉంది. ఉదయం తొమ్మిది గంటలకు రూమ్ తాళం వేసి, సైకిల్ తీస్తూ గుమ్మంలో నిలుచున్న నన్ను తలెత్తి చూశాడు.అతను ఈ నాలుగు మాసాలలో నన్ను చూడటం అదే మొదటిసారి.అప్పటి నుంచి రోజూ ఉదయం అదే టైమ్కి ఒకరినొకరు చూసుకోవడం ఒక దినచర్యలా మారింది.నేను రోజూ ఉదయం గుమ్మంలో నిలబడటం ఇంట్లో ఎవైనా గమనిస్తారేమో అనే భయం లేకపోలేదు.ఒకసారి అమ్మ అంది ‘మన కులమే అయితే ఆ అబ్బాయిని రమణికి అడిగితే?’నాన్న అన్నారు ‘పెద్దమ్మాయికి పెళ్లి అయ్యాక కనుక్కుందాం’పుస్తకం చదువుకుంటూ ఆ మాటలు విన్న నాకు ఏదోలా అయ్యింది.కాని, మొన్న వచ్చిన సంబంధం వాళ్ళు ఏ కబురూ చేయలేదు.ఆరోజు సాయంకాలం నాలుగు గంటలకే ఆ అబ్బాయి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది.నేను కిటికీలోంచి చూస్తున్నాను.అరగంట తరువాత బ్యాగ్ పట్టుకుని రూమ్ తాళాలు వేసి, మాస్టారు గారింటికి వెళ్లి ‘మా ఊరు వెళుతున్నాను. చెల్లి పెళ్లి. వారం తరువాత వస్తాను’ అంటూ చెప్పడం వినిపించింది. అతను బయలుదేరి మా ఇల్లు దాటే సరికి, గబుక్కున గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను.నన్ను చూసి చిన్న నవ్వు నవ్వాడు.అదే మొదటిసారి అతను నన్ను చూసి నవ్వడం.నేనూ గబుక్కున నవ్వేసి చేయి ఊపాను.అతను ఊరు వెళ్ళాక, మూసివున్న గది తలుపులు చూస్తుంటే నాలో ఏదో అదోలాంటి దిగులులా అనిపిస్తోంది.ఈలోగా అన్నయ్యకు ఓ సంబంధం వచ్చింది.అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి పినతండ్రి కొడుకు అక్కను చేసుకోవడానికి ఇష్టపడటంతో, కట్నకానుకల సమస్య పెద్దగా లేకపోవడంతో ఒకేసారి రెండు పెళ్లిళ్లు కుదిరిపోయాయి.వచ్ఛే నెలలో ముహూర్తాలు నిర్ణయించారు.నాలో ఏదో తెలియని ఉత్సాహం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ అతని కోసం అదేపనిగా ఎదురు చూసేలా చేస్తోంది.పది రోజులు గడిచాయి.ఆరోజు ఉదయం అతని గది కిటికీ తలుపులు తెరిచి ఉండటంతో పాటు, లత తీయని గానం అతని రాకనుతెలియజేసింది.అతను మాస్టారు ఇంటికి వెళ్లి, తరువాత మా ఇంటికి వచ్చాడు. అతని చేతిలో స్వీట్ల కవరు ఉంది.నాన్నగారు ‘రా బాబూ ...కూర్చో’ అన్నారు.‘చెల్లి పెళ్లి...’ అంటూ స్వీట్లు అందించాడు.‘రమణీ...’కర్టెన్ వెనుక నిలబడిన నేను వెంటనే ‘నాన్నగారూ’ అంటూ వచ్చాను.‘మంచినీళ్లు తీసుకురామ్మా’ అన్నారు స్వీట్ల కవరు నా చేతికిస్తూ.నేను లోనికి వెళ్లి గ్లాసుతో నీళ్లు తెచ్చాను.అతను నా వైపు చూడకుండానే, చేతి వేళ్ళు తగలకుండా గ్లాసు అందుకున్నాడు.నాన్నగారు ‘మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ప్రస్తుతం చేస్తున్న జాబ్ ఏమిటి? గోత్రం ఏమిటి? శాఖ ఏమిటి?’ వివరాలు అడుగుతున్నారు.అతడు మా కులం కాదని అప్పుడే తెలిసింది.నేను అక్కడి నుంచి వచ్చేశాను. మా ఇంట్లో పెళ్ళి హడావుడి మొదలయ్యింది. అంత హడావుడిలో కూడా ఉదయం చిరునవ్వుతో విష్ చేసుకోవడం, రాత్రి చేతి సైగతో గుడ్ నైట్ చెప్పుకోవడం ఎవరూ గమనించకుండా జరిగిపోతూనే వుంది. ఇద్దరికీ మొదటిసారి మాట్లాడుకునే అవకాశం అన్నయ్య, అక్క పెళ్లిలో వచ్చింది.చేతిలో గిఫ్ట్ ప్యాకెట్తో కల్యాణ మండపం దగ్గర నిలబడ్డాడు. నేను చిరునవ్వుతో పలకరించాను. నాన్నగారు అంత హడావుడిలో కూడా అతడిని గమనించి ‘రా...బాబూ’ అని పిలిచి, గిఫ్ట్ అందుకుని ‘భోజనం చేసి వెళ్ళు బాబూ’ అంటూ నా వైపు చూశారు.‘రండి’ అంటూ అతడిని భోజనాల దగ్గరికి తీసుకెళ్ళాను.మేము ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అదే మొదటిసారి.‘మీకు మధుమతి పాటలంటే అంత ఇష్టమా?’‘అవును... మా అమ్మ ఎప్పుడూ వినే పాటలవి. ఇప్పుడు అమ్మ లేదు. నాకు ఆ పాటలు మాత్రం అమ్మ గుర్తుగా మిగిలిపోయాయి’నాకెంతో కుతూహలం కలిగింది. కాని, అక్కడ అంతకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు మరి .అతని కళ్ళల్లో లీలగా తడి...పెళ్లి హడావుడి అయిన వారం రోజులకు ఒక రోజు తెగించి చిన్న కాగితం మీద ‘సంగీతం కళాశాల దగ్గర ఈ ఆదివారం కలుద్దాం’ అని రాసి, ఖాళీ అగ్గిపెట్టెలో పెట్టి అతని గది కిటికీలో పడేశాను.నిజంగా నా దైర్యానికి నాకే ఆశ్చర్యం వేసింది.ఇంటి దగ్గర మాట్లాడుకునే అవకాశమే లేదు.నేను సాయంకాలం నాలుగు గంటలకు కళాశాల గేటు దగ్గర నిలబడ్డాను. ఆదివారం కావడం వలన అక్కడ ఎవరూ లేరు. లోపల ఎవరో ఒకరిద్దరు కనిపిస్తున్నారు.ఇంతలో సైకిల్ మీద వస్తూ అతను... నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతను కూడా కొంచెం టెన్షన్గా కనిపిస్తున్నాడు.సైకిల్ స్టాండ్ వేసి నిలబడ్డాడు.ఎవరో ఒకాయన మమ్మల్ని కుతూహలంగా చూస్తూ ఆ దారంట వెళ్ళాడు.‘ఇంటి దగ్గర ాట్లాడటం కుదరదు’ అన్నాను.‘ఇక్కడ ఇలా రోడ్ పక్కన... నాకెందుకో బాగులేదు’ అన్నాడతను.‘అవును’ అన్నాను.జేబులోంచి ఒక కాగితం తీసి ఇచ్చాడు.నా మొహంలోకి చూశాడు. సాయంకాలపు నీరెండ.ఇద్దరి కళ్ళూ కలిసి మళ్లీ విడిపోయాయి. దస్తూరి బావుంది.ఒకే వాక్యం. ఈ శనివారం లక్మీ థియేటర్లో మార్నింగ్ షో.ఇంట్లో ఎవరూ చూడకుండా ఆ కాగితాన్ని ఎన్నిసార్లు చదివానో!శనివారం వచ్చింది. సినిమా హాలులో కలిశాం. మాకోసమే అన్నట్లు హాలు ఖాళీగా ఉంది. ‘శంకరాభరణం’ సినిమా విడుదల అయిన రెండోరోజో... మూడో రోజో!ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం కుదిరిన రోజది. నెమ్మదిగా మాట్లాడుకున్నాం. ఆ చిత్రంలోని పాటలు మమ్మల్ని మౌనంగా ఉండేలా చేశాయి. స్నేహపూర్వకంగా ఒకరి చేయి ఒకరు తాకిన రోజు. మేము మరిచిపోలేని రోజు కూడా!రోజూ ఎవరూ చూడకుండా పరస్పరం విష్ చేసుకోవడం, రాత్రి గుడ్ నైట్ చెప్పుకోవడం మామూలుగానే గడిచిపోతోంది.అతను బిజీ అయిపోయాడు. తొందరగా వెళ్లడం, లేటుగా రావడం, ఆదివారాలు కూడా హడావుడిగా వెళ్లిపోవడం...నేను మా వదినగారి బుల్లి టేప్ రికార్డర్లో ‘శంకరాభరణం’ పాటలు వినడం... అలా మూడు నెలలు గడిచిపోయాయి.ఓరోజు అతను కిటికీలో నుండి అగ్గిపెట్టె చూపించి, సందులో పడేశాడు.‘రేపు ఉదయం కలుద్దాం. మార్నింగ్ షో’ అని రాసి ఉంది.అదే హాలు. అదే సినిమా. నూరవరోజుకి దగ్గరగా ఉండటంతో జనాలు కాస్తంత పలచగానే వున్నారు.హాలులో మాకు మాట్లాడుకోవడానికి వీలుగా ఉన్న సీట్లలో కూర్చున్నాం.‘నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది’ చెప్పాడు.‘కంగ్రాట్స్’ అన్నాను.‘ఢిల్లీ వెళ్లిపోతున్నాను’నాకు అర్థమైపోయింది. ఇక మేము విడిపోయే రోజు వచ్చేసింది.అతను నా చేతికి చిన్న వాచ్ ఇచ్చాడు.‘గుర్తుగా’ అన్నాడు.చాలాసేపు ఏం మాట్లాడుకోవాలో తెలియలేదు. తరువాత చాలా మాట్లాడుకున్నాం కాని, అంత వివరించడానికి ఏమీ లేదు.సినిమా ఆఖరి సన్నివేశం పూర్తి కాకుండానే వెళ్లిపోవడానికి లేచాం. నా చేయి అందుకుని ముద్దుపెట్టుకున్నాడు. బయటికి నడిచాం.అతను రూమ్ ఖాళీ చేసే రోజు వచ్చింది.ఆ రాత్రి వెళ్లిపోతున్నాడు.గుడ్ బై చెప్పే సమయం...నేను ఓ ప్యాకెట్ అతనికి చూపించి కిటికీ లోంచి పడేశాను. అందులో ‘శంకరాభరణం’ కేసెట్ ఉంది. అతను ఇచ్చిన వాచీ నా చేతికి గుర్తుగా కనిపిస్తోంది.‘ఈ వాచీ ఎక్కడిది?’ అని ఇంట్లో అడిగితే నా స్నేహితురాలు ఇంటర్ పాస్ అయ్యానని గిఫ్ట్గా ఇచ్చిందని చెప్పడానికి ఒక అబద్ధం రెడీగా ఉంచుకున్నాను.‘మధుమతి’ పాటలు నాకిప్పుడు వినబడవు. -
లౌకిక శాస్త్రాలూ మోక్షదాయకాలే!
ఒకానొకప్పుడు దేవగురువు బృహస్పతి శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం, దండనీతి శాస్త్రం, కామశాస్త్రం వంటి లౌకిక శాస్త్రాలను సమగ్రంగా రచించాడు. యోగ్యులు, బుద్ధిమంతులు అయిన శిష్యులకు ఆ శాస్త్రాలను నేర్పించడం ప్రారంభించాడు. దేవగురువును దర్శించుకుందామని ఒకనాడు ఇంద్రుడు ఆయన ఆశ్రమానికి వచ్చాడు. శిష్యులకు ఆయన లౌకిక శాస్త్రాలను నేర్పిస్తుండటం గమనించి ఆశ్చర్యపోయాడు. గురువుకు పాదాభివందనం చేసి, ఆయన చూపిన ఆసనంపై కూర్చున్నాడు. పాఠం పూర్తయి, శిష్యులంతా వెళ్లిపోయే వరకు ఓపికగా ఉండి, ‘గురువర్యా! మీరేమీ అనుకోనంటే, నాదొక సందేహం. తత్త్వబాహ్యాలైన ఈ శాస్త్రాలను మీరు ఎందుకు రచించారు? మానవులను మరింతగా విషయవాంఛలలో ముంచడానికి తప్ప ఇవెందుకు పనికొస్తాయి? గురువర్యా! తమరేమి ఆశించి ఈ శాస్త్రాలను శిష్యులకు బోధిస్తున్నారో గాని, నాకిది సముచితంగా తోచడం లేదు. ఇందులో ఇంకేమైనా పరమార్థం ఉంటే, అది నేను తెలుసుకోదగినదే అయితే దయచేసి వివరించండి’ అన్నాడు ఇంద్రుడు.ఇంద్రుడి ప్రశ్నలోని ఆందోళనను గుర్తించాడు బృహస్పతి.చిన్నగా నవ్వుతూ, ‘ఇంద్రా! ఇందులోని తత్త్వరహస్యం ఏమిటనేదే కదా నీ సందేహం? చెబుతాను, విను’ అంటూ బృహస్పతి ఇలా చెప్పసాగాడు.‘నేను రచించి, శిష్యులకు బోధిస్తున్న ఈ శాస్త్రాలన్నీ తత్త్వరహస్యాలే, తత్త్వబోధలే! పారంపర్యంగా ఇవి తత్త్వప్రాప్తికి కావలసిన చిత్తశుద్ధిని కలిగిస్తాయి. నీ సందేహం తొలగిపోవడానికి నీకు సోదాహరణంగా చెబుతాను, శ్రద్ధగా విను. అంతా నీకే అవగతమవుతుంది. కాంపిల్య నగరంలో విధిజ్ఞుడు అనే శిల్పశాస్త్ర పండితుడు ఉండేవాడు. అతడు శిల్పశాస్త్రంలోనే కాకుండా వాస్తు, జ్యోతిష శాస్త్రాలలో విశేష ప్రతిభాసంపన్నుడు. చాలా నీతిమంతుడు. ఆ నగరంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా, అతడినే పిలిచేవారు. ఆ విధంగా అతడు విశేషంగా ధనం సంపాదించాడు. అతడిని ఆశ్రయించుకుని చాలామంది ఉపాధి పొందేవారు. వారికి శాస్త్రపరిజ్ఞానం లేదు. వారు విధిజ్ఞుడితో ఉంటూ అతడు చెప్పిన పనులు చేస్తూ, అతడు ఇచ్చే వేతనాలతో బతుకుతూ ఉండేవాళ్లు. తన విద్యతో పుష్కలంగా ధనం సంపాదించిన విధిజ్ఞుడు విరివిగా దానధర్మాలు చేసేవాడు. నగరంలో దేవతాపూజలను ఘనంగా జరిపించేవాడు. అలా నగరంలోని ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకు అందరికీ ఇష్టుడయ్యాడు. అతడి పేరు ప్రఖ్యాతులు క్రమంగా పొరుగు రాజ్యాలకు పాకాయి. ఇతర దేశాల రాజులు కూడా విధిజ్ఞుడిని పిలిపించుకుని, అతడి సలహా సూచనలతో భవనాలు, తటాకాలు, దేవాలయాలు నిర్మింపజేసుకుని, అతడికి ఘనంగా పారితోషికం, కానుకలు ఇచ్చి పంపుతుండేవారు. ఆ ధనంతో విధిజ్ఞుడు మరింతగా దాన ధర్మాలు చేసేవాడు. శిల్ప వాస్తు జ్యోతిష శాస్త్రాలలో విశేష ఖ్యాతి పొందిన విధిజ్ఞుడు కొంతకాలానికి ఆయువుతీరి మరణించాడు. చేసిన పుణ్యకర్మల ఫలితంగా అతడు స్వర్గానికి చేరుకుని, అక్కడ సుఖాలను అనుభవించి, కొన్నాళ్లకు మళ్లీ జన్మించాడు.ఈసారి అతడు కాంపిల్య రాజవంశంలో జన్మించి, యుక్తవయసు వచ్చాక పట్టాభిషిక్తుడై రాజయ్యాడు. రాజుగా అతడు ప్రజారంజకమైన పాలన సాగించేవాడు. సాధు సజ్జనులను ఆదరించేవాడు. రాజ్యంలో అనేక దేవాలయాలను, వాపీ కూప తటాకాదులను నిర్మించి, రాజ్యం నిత్యం సుభిక్షంగా ఉండేలా చూసుకునేవాడు. అసంఖ్యాకంగా యజ్ఞ యాగాదులను నిర్వహించి, విప్రులకు విశేషంగా గోదానాలు, భూదానాలు చేసేవాడు. సుదీర్ఘకాలం రాజుగా పాలించి, పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత కొన్నాళ్లకు తనువు చాలించాడు. రాజ జన్మలో చేసిన పుణకర్మల ఫలితంగా మళ్లీ స్వర్గానికి చేరుకుని, చాలాకాలం సుఖభోగాలను అనుభవించాడు. పుణ్యఫలం అంతరించాక కొన్నాళ్లకు మళ్లీ భూలోకంలో జన్మించాడు.ఈసారి అతడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రుల ఆలనపాలనలో బాల్యం హాయిగా గడిపాడు. ఉపనయనం తర్వాత బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించి, గురుకులంలో చేరాడు. గురువుకు శుశ్రూష చేస్తూ, వేద వేదాంగాలను, సకల శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుకులవాసం ముగించి, ఇంటికి చేరుకున్నాడు. యోగ్యురాలైన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమం స్వీకరించాడు. గృహస్థాశ్రమంలో నిత్య నైమిత్తిక కార్యాలను నియమం తప్పక నెరవేరుస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. గొప్పగొప్ప వ్రతాలు, పూజలు చేసి, యోగిగా మారి వానప్రస్థం స్వీకరించాడు. వానప్రస్థంలో ఫల కందమూలాదులనే ఆహారంగా స్వీకరిస్తూ, రోజులో అధిక కాలం తపోనిష్ఠలోనే గడిపేవాడు. క్రమంగా సాధనలో పరిపక్వత సాధించి, చివరకు భవబంధాలను విడిచిపెట్టి, సన్యాసాశ్రమం స్వీకరించాడు. సన్యాసాశ్రమంలో కఠోర సాధన సాగిస్తూ, ఆత్మసాక్షాత్కారం పొంది, జీవన్ముక్తుడై, చివరకు విదేహ కైవల్యం సాధించాడు.ఇంద్రా! విన్నావు కదా! శిల్ప, వాస్తు, జ్యోతిష శాస్త్రాలు విధిజ్ఞుడికి వేర్వేరు జన్మలలో క్రమంగా ఉన్నతి పొందడానికి, చివరకు ముక్తిని పొందడానికి దోహదపడ్డాయి. లౌకిక శాస్త్రాలు మానవులను మాయలో ముంచేస్తాయని భయపడటం నిర్హేతుకం. లౌకిక శాస్త్రాలు మానవుల ఐహిక సుఖాలకే కాదు, ఆముష్మిక ఔన్నత్యానికి కూడా ఉపయోగపడతాయి. శచీపతీ! ఈ లౌకిక శాస్త్రాలన్నీ కలకండ ముక్కల్లాంటివి. తత్త్వోపదేశమనే కషాయాన్ని సులువుగా గ్రోలడానికి అవి ఉపకరిస్తాయి. లౌకిక శాస్త్రాల సహాయం లేకుండా, సామాన్యులు తత్త్వాన్ని సులువుగా గ్రహించలేరు. అయినా, కైవల్యమే ఏ జీవికైనా అంతిమ లక్ష్యం, అదే అంతిమ గమ్యం’ అని చెప్పాడు బృహస్పతి.∙సాంఖ్యాయన


