కలియుగ వైకుంఠం.. తిరుమల ఆలయం | History of Tirumala Venkateshwara Swamy | Sakshi
Sakshi News home page

కలియుగ వైకుంఠం.. తిరుమల ఆలయం

Sep 21 2025 7:16 AM | Updated on Sep 21 2025 7:16 AM

 History of Tirumala Venkateshwara Swamy

కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయం. క్రీ.పూ. 12వ శతాబ్దంలో తిరుమలలో శ్రీవెంకటేశ్వర ఆలయం నిర్మితమైంది. 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆలయ గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు.. పవిత్ర వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరచేందుకు వేరువేరు గదులు. లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగది. 

మొదటి ప్రాకారం..మహాద్వార గోపురం
ఏడుకొండల్లో కొలువైన వెంకన్న స్వామిని దర్శించుకునే ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ప్రవేశద్వార గోపురమే మహాద్వార గోపురం. పడికావలి, సింహద్వారం, ముఖద్వారం అని వేరువేరు పేర్లు ఉన్నాయి. పెద్దవాకిలి. తమిళంలో ‘పెరియ తిరువాసల్‌’ అని కూడా పిలుస్తారు. ఈ మహాద్వారాన్ని గోపురంతో అనుసంధానిస్తూ నిర్మించిన ప్రాకారమే మహా ప్రాకారం అంటారు. వైకుంఠం క్యూ కంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటారు. లోనికి అడుగుపెట్టక మునుపు పైపుల ద్వారా వచ్చే నీటితోనే భక్తులు పాదాలను శుభ్రం చేసుకుని ప్రవేశించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ వాకిలి గోడపై అనంతాళ్వారులు వినియోగించిన గునపం ఇప్పటికీ కనిపిస్తుంది.

శంఖనిధి.. పద్మనిధి
మహాద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల్లా పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. వీరే శ్రీవారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ఉంటాయి. కుడివైపున ఉన్న మరో రక్షక దేవత పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి.

కృష్ణదేవరాయమండపం
మహాద్వారానికి ఆనుకుని లోపలివైపు 16 స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపమే శ్రీకృష్ణదేవరాయ మండపం. దీనినే ప్రతిమ మండపం అని కూడా అంటారు. ఈ మండపం లోనికి ప్రవేశిస్తున్నప్పుడు కుడివైపున రాణులు తిరుమలదేవి, చిన్నమదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మణ్ణి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడు పర్యాయాలు తిరుమల యాత్ర చేసి శ్రీవారికి ఎన్నో కానుకలు సమర్పించారు. అచ్యుతరాయలు తనపేరిట బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు.

అద్దాల మండపం
ప్రతి మండపానికి 12 అడుగుల దూరంలో ఎతై ్తన అధిష్ఠానంపై నిర్మించిన దాన్నే అద్దాల మండపం లేదా ఆయినా మహల్‌ అంటారు. ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు. ఈ అరలు ఉన్న ప్రాంతాన్ని ప్రసాదం పట్టెడ అంటారు.

తులాభారం
శ్రీకృష్ణదేవరాయల మండపానికి ఎదురుగా ఉంటుంది తులాభారం. భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణా తులాభారంగా స్వామివారికి సమర్పించుకుంటుంటారు. తులాభారానికి అవసరమైన వస్తు సామగ్రిని భక్తులు తిరుమలకు మోసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆలయం లోపలే తులాభారంలో వేయాల్సిన వస్తువులకు తగిన నగదు రూపంలో చెల్లిస్తే టీటీడీనే ఆ వస్తువులను సమకూరుస్తుంది.

రంగనాయక మండపం
కృష్ణదేవరాయ మండపానికి దక్షిణం వైపుగా 108 అడుగల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో శిల్ప శోభితమై విరాజిల్లుతూ కనిపించేదే రంగనాయక మండపం. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపం అని పిలుస్తారు. ఒకప్పుడు నిత్యకళ్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలైన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వాచనంతో పాటు స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు.

తిరుమలరాయ మండపం
రంగనాయక మండపాన్ని ఆనుకుని పడమరవైపున ఉన్న ఎత్తైన స్తంభాలతో, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి ఈ మండపం. ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించారు. స్వామివారికి ‘అన్నా ఊయల తిరునాళ్లు’ అనే ఉత్సవాన్ని నిర్మించే నిమిత్తం క్రీశ 1473లో ఈ మండపాన్ని నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించారు. బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.

రాజా తోడరమల్లు
అక్బర్‌ ఆస్థానంలో మంత్రిగా ఉన్న లాలా ఖేమార్ము క్షత్రియ వంశస్థుడు. ఈయన రాజా తోడరమల్లుగా ప్రసిద్ధి పొందాడు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశించేటప్పుడు ధ్వజస్తంభానికి సమీపంలో రాజా తోడరమల్లు, తల్లి మాత మోహనాదేవి, భార్య పితబీబీ విగ్రహాలు స్వామివారికి అభిముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్నట్టు కనిపిస్తాయి. 17వ శతాబ్దంలో ముస్లిం పాలకుల దాడులు, బ్రిటిష్‌ దండయాత్రల నుంచి శ్రీవారి ఆలయాన్ని సంరక్షించిన పాలకుల్లో రాజా తోడరమల్లు ఒకరు. నాటి నుంచి వీరి లోహ విగ్రహాలు తిరుమల ఆలయంలో ఉన్నాయి.

ధ్వజస్తంభం
ధ్వజస్తంభ మండపం వెండి వాకిలికి ఎదురుగా చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంలా ఎత్తైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం. ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండి వాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్న ధ్వజారోహణం అంటారు.

 

బలిపీఠం
ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఆనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారురేకు తాపడం ఉంటుంది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని (అన్నాన్ని) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

క్షేత్రపాలక శిల
ధ్వజస్తంభానికి ఈశాన్య మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే క్షేత్రపాల శిల అంటారు. ఇది రాత్రి పూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్లేటప్పుడు గుడికి తాళం వేసి తరువాత ఈ శిలపై ఉంచి నమస్కరించి తాళం చెవులను తీసుకెళుతారు. మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి తాళం చెవులతో గుడి తలుపులు తెరుస్తారు. 

సంపంగి ప్రాకారం
మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థలవృక్షాలనేవి ఉండటం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం సంపంగి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందున ఇలా పిలువబడుతోంది. 

కళ్యాణమండపం
దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంలో ఈ కళ్యాణమండపాన్ని నిర్మించారు. ఇందులో తూర్పుముఖంగా ఉన్న కళ్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కళ్యాణోత్సవం జరుగుతుంది.

ఉగ్రాణం
స్వామివారి ప్రసాదాలకు తయారయ్యే ముడిసరుకులు నిల్వ ఉంచే గది. ఇది వాయవ్య మూలగా ఉంటుంది.

విరజానది
వైకుంఠంలోని పరమ పవిత్రమైన ఈ నది శ్రీవారి పాదాల క్రిందగా ప్రవహిస్తుంటుందని నమ్మకం. ఆలయం లోపలి బావుల్లో ఈ నది నీరు ప్రవహిస్తుందని, అందుకే ఆలయ బావుల్లోని నీరు పరమ పవిత్రమైనదిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వినియోగిస్తుంటారు.

నాలుగుస్తంభాల మండపం
సంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వనరసింహ రాయలు, ఆయన భార్య, ఇద్దరు కుమారుల పేర స్తంభాలు కట్టించారు.

పూలబావి
పూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామివారికి ఉపయోగించిన పూలను ఇందులో వేస్తారు. దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్లేటప్పుడు ఎతైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.

వగపడి భక్తులు దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది. ముఖ మండపం అద్దాల మండపానికి ముందు భాగంలో ఉంటుంది. కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు ఇక్కడ అందజేస్తారు.

రెండవ ప్రాకారం..
వెండి వాకిలి.. నడిమి పడికావలి ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండి వాకిలి. నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండి వాకిలి మీదుగా భక్తులు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రవేశ ద్వారమంతటా వెండిరేకు తాపడం చేసినందున దీన్ని వెండివాకిలి అంటారు. ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీవారు పాచికలాడుతున్న శిల్పం ఉంటుంది.

విమాన ప్రదక్షిణం
వెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అని కూడా అంటారు. సుప్రభాత సేవ జరిగే సమయంలో భక్తులు వెలుపల అంగప్రదక్షిణం చేస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలో వెండి వాకిలికి ఎదురుగా శ్రీరంగనాథస్వామి, వరదరాజస్వామి ఆలయాలు ఉంటాయి. ఇంకా ప్రధాన వంటశాల, పూలబావి, అంకురార్పణ మండపం, యాగశాల, నాణేల పరకామణి, నోట్ల పరకామణి, చదనపు అర, విమాన వేంకటేశ్వరస్వామి, రికార్డులగది, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి సన్నిధి, ప్రధాన హుండి, విష్వక్సేనుల వారి ఆలయం మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్లుగా పేర్కొంటారు.

బంగారు బావి
దర్శనాంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడం ఉంటుంది. ఇందులో నీటినే స్వామి వారి అభిషేకాలకు, ప్రసాదాలకు వినియోగిస్తారు. ఇందులో వైకుంఠంలోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

వకుళాదేవి
బంగారుబావి పక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది. శ్రీవారి తల్లి. ద్వాపరయుగంలో యశోదాదేవే ఈ కలియుగంలో స్వామివారి కళ్యాణం చూడటానికి వకుళాదేవిగా అవతరించింది.

అంకురార్పణ మండపం
బంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు. ఇంకా గరుడ, విష్వక్సేన, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.

యాగశాల
హోమాది క్రతువులు నర్వహించే ప్రదేశం. ఇప్పుడు సంపంగి ప్రాకారంలోని కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.

సభ అర
కైంకర్యాలకై ఉపయోగించే బంగారు, వెండి పాత్రలు, కంచాలు, గొడుగులు ఉంచే ప్రదేశం. ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విసనకర్రలను ఇక్కడే భద్రపరుస్తారు.

సంకీర్తన భాండాగారం
సభ అర పక్కనే ఈ గది ఉంటుంది. ఇరువైపులా తాళ్లపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్లపాక వంశం వారు రచించిన సుమారు 32వేల సంకీర్తనలను భద్రపరచారు. వేటూరి ప్రభాకర శాస్త్రి, సాధు సుబ్రమణ్యశాస్త్రి వంటి వారి విశేష కృషి వలన ఈ రోజు మనం వాటిని  చూస్తున్నాం.

భాష్యకార్ల సన్నిధి
ఇందులో శ్రీమద్‌ రామానుజాచార్యులు విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏ కైంకర్యాలు ఏ విధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి. తన 120 సంవత్సరాల కాలంలో మూడు పర్యాయాలు తిరుమలకు మోకాళ్లపై వచ్చారు. అలా వస్తున్నప్పుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ల పర్వతం. నేటికీ కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్లతో ఎక్కుతుంటారు.

పోటు
ప్రధాన వంటశాల. విమాన ప్రదక్షిణంలో ఈ పోటు ఉంది. ఇక్కడ దద్ధోజనం, చక్కెర పొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరాతో పాటు కళ్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవి తయారు చేస్తుంటారు. 

ఆనందనిలయ విమానం
ఆనందనిలయంపై ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు. గరుత్మంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుంచి భూమి మీదకు తీసుకొచ్చారని చెబుతారు. దీని మీద దాదాపు 64 మంది దేవతామూర్తుల ప్రతిమలు ఉన్నట్లు చెబుతుంటారు. ఈ గోపురంపైనే వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామినే విమాన వెంకటేశ్వరస్వామి అంటారు.

రికార్డు గది
స్వామివారి అభరణాల వివరాలు, జమ ఖర్చులు వివరాలను భద్రపరచు గది.

వేదశాల
రికార్డుల గది పక్కనే వేద పండితులు పఠనం చేసే గది. ఇక్కడ మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.

యోగనరసింహస్వామి సన్నిధి
రామానుజాచార్యులుచే శ్రీనరసింహాలయం ప్రతిష్ఠితం చేయబడింది. క్రీశ 1330–1360 మధ్య కాలంలో నిర్మించినట్లు పరిశోధకుల అభిప్రాయం. క్రీశ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. అళగియ సింగం (అందమైన సింహం) అని, వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది. చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండటం ప్రత్యేకం. ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.

శంకుస్థాపన స్తంభం
రాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.

పరిమళ అర
శంకుస్థాపన స్తంభం నుంచి తిరిగి వచ్చే మార్గంలో ఈ పరిమళ అర ఉంది. స్వామివారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.

శ్రీవారిహుండీ
భక్తులు కానుకలు వేసే ప్రాంతం. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగినా ఇప్పటికీ ఎటువంటి మార్పు చెందని ఒకే ఒక స్థలం. దీని కింద శ్రీచక్రయంత్రం, ధనాకర్షణ యంత్రం ఉన్నాయని నమ్మకం.

బంగారు వరలక్ష్మి
హుండీ ఎడమగోడపై బంగారు లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ఈవిడ భక్తులకు అషై్టశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.

కటాహ తీర్థం
అన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టిలాంటి నిర్మాణం. ఇందులో స్వామివారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.

విష్వక్సేన
హుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. 

ఘంటా మండపం
బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్య ఉన్న ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామివారి సందర్శనకు వేచి ఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు. పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయంలో వీటిని మోగించేవారు. దీనిని ఘంటపని అనేవారట. ఈ గంటలను అనుసరించే స్వామివారి ఆహారసేవలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం తీసుకునేవారట. ప్రస్తుతం రెండూ ఒకేచోటుకు చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం పక్కనే ఉంటాయి.

గరుడ సన్నిధి
మూలవిరాట్టుకు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారు మండపం. బంగారువాకిలి ఎదురుగా, గరుడాళ్వార్‌ మందిరం ఉంది. శ్రీవారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో ఉన్న గరుడాళ్వారు దర్శనమిస్తాడు. ఈ మందిరానికి వెలుపల అంతటా బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్‌ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.

ద్వారపాలకులు
బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు. మహాలఘు దర్శనం ఇక్కడే చేసుకుంటారు.

మూడవ ప్రాకారం..బంగారు వాకిలి
శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లటానికి అత్యంత ప్రధానమైన ఏకైక ద్వారం బంగారు వాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారు వాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాత పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీమలయప్పస్వామి వారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. 

స్నపన మండపం
బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే స్నపనమండపం. క్రీ.శ. 614లో పల్లవరాణి సామవై ఈ మండపాన్ని నిర్మించి భోగశ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించారట. ఈ స్నపన మండపాన్నే తిరువిలాన్‌కోయిల్‌ అంటారు. ఆనందనిలయం జీర్ణోద్ధరణ సమయంలో ఈ మండపాన్ని నిర్మించినట్లు చెబుతారు. ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునికి ఆరోజు పంచాంగం చెప్పే పూజారులు, క్రితం రోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు. 

రాములవారి మేడ
స్నపన మండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపులా ఎత్తుగా కనిపిస్తుంది రాములవారి మేడ. తమిళంలో మేడు అంటే ఎతై ్తన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆనంద నిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పేరుపొందింది.

శయన మండపం
శ్రీవారి గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయన మండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.

కులశేఖరపడి
శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరపడి. పడి అనగా మెట్టు, గడప అని అంటారు.

ఆనందనిలయం
కులశేఖరపడి అనే బంగారు గడప దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. ఈ ఆనందనిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయం అంటారు.

శ్రీవేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు)
గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిల్చొని ఉన్న శిలాదివ్యమూర్తి శ్రీవేంకటేశ్వరస్వామి. నిలబడి ఉన్నందున ఈ అర్చామూర్తిని ‘స్థానకమూర్తి’ అంటారు. అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ‘ధ్రువమూర్తి’ అని, ‘ధ్రువబేరం’ అని కూడా అంటారు. శ్రీవారు అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నారు. ఈ మూలమూర్తికి ప్రతినిధులుగా కొలువు శ్రీనివాసమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మలయప్ప స్వామి అనే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా సీతారామలక్ష్మణులు, శ్రీకృష్ణ రుక్మిణులు, చక్రత్తళ్వారులు, సాలగ్రామ శిలలు ఉన్నాయి (స్వామివారికి ప్రతిరూపాలుగా వారికి నిత్య అభిషేకాలు జరుగుతుంటాయి)
∙ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement