బీమా పదాలకు అర్థాలే వేరులే.. | Special Story On Insurance Claim Compensation Written By Dilip Madireddy | Sakshi
Sakshi News home page

బీమా పదాలకు అర్థాలే వేరులే..

Jul 5 2026 11:08 AM | Updated on Jul 5 2026 11:09 AM

Special Story On Insurance Claim Compensation Written By Dilip Madireddy

బీమా ఉంది కదా అని ఆ యజమాని ధీమాగా ఉన్నాడు. ఇన్సూరెన్స్‌ క్లైమ్‌ చేసి నష్టపరిహారం పొందచ్చనుకున్నాడు. కానీ, నిబంధనలను సరిగా అర్థం చేసుకోలేదు. పరిహారం రాదని కంపెనీ చెప్పింది. ఒకే ఒక్క పదం ఆ యజమానిని ముప్పు తిప్పలు పెట్టింది. కోర్టుల చుట్టూ తిప్పింది. వినియోగదారుల ఫోరంలో ఊరట దక్కినా, ఆ తీర్పుపై కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సొంత అర్థాలు చెల్లవని, బీమా ఒప్పందాల్లోని పదాలను సరిగా అర్థం చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది. చివరకు ఒక అరుదైన తీర్పును వెలువరించింది.  

గోడౌన్‌ తలుపులు, తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. పగుళ్లు లేవు, బలవంతంగా లోపలికి చొరబడిన ఆనవాళ్లూ కనిపించలేదు. కానీ లోపల నిల్వ ఉంచిన 197 బస్తాలు మాత్రం మాయమయ్యాయి. పోలీసులు వచ్చి పరిశీలించారు. దొంగతనం జరిగిందని నిర్ధారించారు. బీమా ఉండడంతో కంపెనీ ప్రతినిధులు వచ్చారు. చోరీ నిజమేనని వారూ తేల్చారు. కానీ పరిహారం ఇవ్వలేమని చేతులెత్తేశారు.

పరిహారం కోసం ఫోరానికి
హరిచంద్‌రాయ్‌ చందన్‌లాల్‌ అనే వ్యాపారి ఢిల్లీలోని ఓ గోడౌన్‌లో ఆహారధాన్యాలను నిల్వ ఉంచాడు. వీటికి రూ.7లక్షల మొత్తానికి బర్గ్‌లరీ అండ్‌ హౌస్‌ బ్రేకింగ్‌ థెఫ్ట్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్నాడు. దీనికి రూ.7 లక్షలు బీమా సంస్థకు చెల్లించాడు. 1992లో గోదాములో నిల్వ ఉంచిన 197 బస్తాలు మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. బీమా కోసం అప్లయ్‌ చేశాడు. గోదాంలోకి బలవంతపు ప్రవేశం లేదా హింస జరిగినట్లు ఆధారాలు లేవని క్లైమ్‌ను సంస్థ తిరస్కరించింది. దీంతో చందన్‌లాల్‌ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.

కంపెనీకి అనుకూలంగా తీర్పు
బర్గ్‌లరీ అనే పదానికి దొంగతనం అనే సాధారణ అర్థం కూడా వస్తుంది కనుక బాధితుడికి రెండు నెలల్లో పరిహారాన్ని 15% వడ్డీతో చెల్లించాలని, అదనంగా ఖర్చులకు రూ. 1,000 ఇవ్వాలని ఫోరం తీర్పు ఇచ్చింది. దీనిపై బీమా కంపెనీ రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లో అప్పీలు దాఖలు చేసింది. అక్కడా తీర్పు వ్యాపారికి అనుకూలంగా వచ్చింది. దీంతో జాతీయ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఫోరం తీర్పును సమర్థిస్తూ రివిజన్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.

సర్వోన్నత న్యాయస్థానానికి చేరిన కేసు
బీమా కంపెనీ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ పాలసీ రెండు పక్షాల మధ్య ఒప్పందం. అందువల్ల బీమా పాలసీలో ఇచ్చిన నిర్వచనం ఇరుపక్షాలకు వర్తిస్తుందని కోర్టు చెప్పింది. బర్గ్‌లరీకి ప్రత్యేక నిర్వచనం ఉన్నప్పుడు, సాధారణ దొంగతనం జరిగినా బీమా వర్తిస్తుందా? లేదా? అనేది ఈ కేసులో ప్రధానాంశంగా కోర్టు పేర్కొంది. బీమా పాలసీ విషయంలో కేవలం సాధారణ అర్థాన్ని మాత్రమే తీసుకోలేం. పాలసీలో ప్రత్యేకంగా నిర్వచనం ఇచ్చినప్పుడు అదే అర్థాన్ని తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 

ఇది దొంగతనం మాత్రమే..
బర్గ్‌లరీ అనే పదాన్ని ‘దొంగతనం’ అనే సాధారణ అర్థంలో వాడతారు. కానీ పాలసీలో అది హింస లేదా బలప్రయోగంతో కూడిన దొంగతనానికి పరిమితం చేశారు. ఈ సంఘటనలో తలుపులు విరగలేదు, తాళాలు పగలలేదు. ఆ సంస్థ ఉద్యోగులు లేదా కుటుంబ సభ్యులపై ఎటువంటి దౌర్జన్యం జరగలేదు. ఇవేమీ లేకుండా కేవలం దొంగతనం జరిగిందనే కారణంతో పరిహారం కోరే హక్కు బీమాదారుడికి లేదని కోర్టు తేల్చింది. పాలసీ నిర్వచనం ప్రకారం ఇది దొంగతనం మాత్రమే! బర్గ్‌లరీ కాదని చెప్పింది. పాలసీలో ఏ షరతు ఉంటే దానిని కోర్టు అమలు చేయాలి. మార్చకూడదు. కొత్త అర్థాల్ని ఇవ్వకూడదని పేర్కొంది. ఈ కారణంతో బీమా కంపెనీ విజయం సాధించింది. వినియోగదారుల ఫోరం తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే, వినియోగదారుల ఫోరం తీర్పుకనుగుణంగా బాధితుడికి ఇప్పటికే పరిహారం చెల్లిస్తే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని తిరిగి తీసుకోవాలని తాము ఆదేశించడం లేదని కోర్టు చెప్పింది. బీమా సంస్థలు కఠినమైన పదాలు కాకుండా, వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉండేలా నిబంధనలు రూపొందించాలని సూచించింది.

'పాలసీలో పేర్కొన్న వి«ధంగా నష్టం జరిగితేనే బీమా ఉంటుంది. దానికి దగ్గరగా ఉండే ప్రతి నష్టానికి కాదని ఈ కేసు రుజువు చేసింది. బీమా పాలసీ తీసుకునేటప్పుడు అందులో పేర్కొన్న వాస్తవ అర్థాలను సంపూర్ణంగా తెలుసుకోవాలి లేకపోతే బీమా ఉందనే ధీమా పనికిరాదని, పరిహారం దక్కదని రుజువైంది.' - దిలీప్‌ మాదిరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement