మిస్టిక్ వరల్డ్
అమెరికాలోని కనెక్టికట్కు చెందిన రాన్ ప్రెస్నెల్ అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడు సామ్ ప్రెస్నెల్తో ఇంట్లో ఆడుకుంటున్నాడు. అప్పుడు హఠాత్తుగా సామ్ తన తండ్రి వైపు చూసి,
‘‘డాడ్! నువ్వు నా అంత ఉన్నప్పుడు నీ డైపర్లు నేనే మార్చేవాడిని తెలుసా?’’ అన్నాడు.
రాన్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. తాను తప్పుగా విన్నానేమో అని అనుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సామ్ మరిన్ని విచిత్రమైన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు.
రాన్ తండ్రి.. సామ్ పుట్టడానికి పది నెలల ముందు 1992లో మరణించారు. సామ్ పెద్దవుతున్న కొద్దీ తన తాత జీవితానికి సంబంధించిన వివరాలను చెప్పడం చూసి రాన్ నోరెళ్లబెట్టేవాడు.
‘‘నాకు ఒక చెల్లెలు ఉండేది. కొందరు చెడ్డవాళ్లు ఆమెను చంపేసి నీళ్లలో పడేశారు’’ అని చెప్పేసరికి సామ్ తల్లిదండ్రులకు నోటమాట రాలేదు. అరవయ్యేళ్ల కిందట నిజంగానే కొందరు దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో సముద్రంలో పడేశారు.
సామ్ మాటలను మొదట నమ్మని అతని తండ్రి రాన్– ఈ సంగతేంటో చూద్దామని పాత ఆల్బమ్ను తీశాడు. అందులో సామ్ తాతతో పాటు అతని ఈడు వయసున్న మరో 15 మంది బాలుర గ్రూప్ ఫొటో ఉంది. రాన్ ఆ ఫొటోను సామ్ ముందు పెట్టి, ‘‘ఇందులో నువ్వు ఎక్కడున్నావో చెప్పు?’’ అని అడిగాడు.
సామ్ ఏమాత్రం తడుముకోకుండా అందులోని ఒక బాలుడిపై వేలు పెట్టి, ‘‘ఇదిగో, నేనే ఇక్కడ ఉన్నాను!’’ అని చెప్పాడు. అది చూసిన రాన్ ఆశ్చర్యపోయాడు.
‘‘నువ్వు ఈ లోకంలోకి ఎలా వచ్చావు? ఎలా చనిపోయావు?’’ అని సామ్ను అడిగాడు.
దానికి సామ్ చాలా సీరియస్గా తన తలపై గట్టిగా కొట్టుకుంటూ తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. విస్తుపోయే నిజం ఏంటంటే, సామ్ తాత ‘బ్రెయిన్ హెమరేజ్’ కారణంగా, తలలో విపరీతమైన నొప్పితో హాస్పిటల్లో చేరి మరణించారు. సామ్ తల పట్టుకుని చూపించిన విధానం తన తండ్రి చివరి క్షణాలను కళ్లకు కట్టినట్టు చూపించడంతో రాన్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. సామ్ తను మళ్లీ పుట్టడం గురించి చెబుతూ,
‘‘నేను ఒక ద్వారం నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చాను’’ అని చెప్పాడు.
సామ్ తాత తన జీవితంలో ఒక నిర్దిష్టమైన రాత్రి గురించి తన కొడుకు రాన్ తో తరచుగా చెబుతుండేవారు. ఓ రాత్రి విమానాశ్రయంలో తీవ్రమైన మంచు కురవడం వల్ల విమానాలన్నీ రద్దయ్యాయి. సామ్ తాత ఆ రాత్రంతా ఎయిర్పోర్టులోనే ఒక చిన్న గదిలో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన దగ్గర చిన్న రేడియో, ఓ బ్రిటిష్ నవల మాత్రమే ఉన్నాయి.
సామ్కు దాదాపు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకరోజు తండ్రితో మాట్లాడుతూ, ‘‘అమ్మానాన్నలు నన్ను ఒక గదిలో పెట్టేశారు. అప్పుడు నాకు తోడుగా ఒక రేడియో, ఒక ఇంగ్లిష్ పుస్తకం మాత్రమే ఉన్నాయి. ఆ రాత్రి నాకు చాలా బోర్ కొట్టింది’’ అని చెప్పాడు. ఈ సంఘటన రాన్ భార్యకు (సామ్ తల్లికి) కూడా తెలియదు. కేవలం తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఈ వ్యక్తిగత జ్ఞాపకాన్ని సామ్ గుర్తుచేసుకోవడం రాన్ ను పూర్తిగా మార్చేసింది.
ఒకరోజు నానమ్మ సామ్ ఇంటికి వచ్చింది. అప్పుడు నాలుగేళ్ల సామ్ ఆమె దగ్గరకు వెళ్లి చాలా చొరవగా,
‘‘నువ్వు నా కోసం ఫుడ్ ప్రాసెసర్లో ఆ టేస్టీ మిల్క్షేక్ ఎప్పుడు చేసిస్తావు?’’ అని అడిగాడు.
భర్త బతికున్నప్పుడు ఆమె ప్రతిరోజూ ఫుడ్ ప్రాసెసర్లో రకరకాల వంటకాలు చేసి ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ఒక చిన్న పిల్లోడు తన భర్తలా ఆ పాత వంటకం గురించి అడగడం చూసి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
వర్జీనియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ కేసును పూర్తిగా అధ్యయనం చేశారు. సామ్ కుటుంబ సభ్యులు అతని ముందు ఎలాంటి పాత విషయాలు మాట్లాడలేదని, అయినా సామ్ చెప్పిన ప్రతి విషయాలు వంద శాతం రికార్డులతో సరిపోలిందని ధ్రువీకరించారు. అయితే, సామ్కు ఐదేళ్లు దాటిన తర్వాత అతని గత జన్మ జ్ఞాపకాలు క్రమంగా తగ్గిపోయాయి.
ఒకరోజు రాన్ మళ్లీ పాత విషయాల గురించి అడగ్గా, సామ్ నవ్వుతూ ‘‘నాకు అవేమీ గుర్తులేవు నాన్నా’’ అని చెప్పాడు.
కానీ, ‘‘నేను నీకు డైపర్ మార్చాను’’ అంటూ సామ్ తన తండ్రితో అన్న ఆ మొదటి మాట– పునర్జన్మల చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకంగా మిగిలిపోయింది.
- సత్యకిశోర్


