World Population Day: మనదే పైచేయి.. కాని.. | World Population Day: Population Growth Statistics | Sakshi
Sakshi News home page

World Population Day: మనదే పైచేయి.. కాని..

Jul 11 2026 8:40 AM | Updated on Jul 11 2026 9:42 AM

World Population Day: Population Growth Statistics

ప్రపంచ జనాభా దినోత్సవం

ప్రపంచంలో అత్యధికంగా ఫర్టిలిటీ రేట్‌ ఉన్న దేశాలు నైజర్, చాడ్, సోమాలియా, డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో వంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో మహిళ సగటున ఐదు నుంచి ఆరుగురు పిల్లలకు జన్మనిస్తోంది. మరోవైపు దక్షిణ కొరియా, సింగపూర్, హాంకాంగ్, మకావ్, ఇటలీ వంటి దేశాల్లో ఈ రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ఆ దేశాలు పిల్లల్ని కనే కుటుంబాలకు ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, ఉచిత శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి జనాభా పెంపునకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మనదే పైచేయి.. కాని..
దాదాపు 70 సంవత్సరాల పాటు ప్రపంచ జనాభాలో చైనాదే అగ్రస్థానం. కాని 2023లో చరిత్ర పూర్తిగా మారిపోయింది. 146 కోట్ల జనాభాతో చైనాను వెనక్కి నెట్టి భారత్‌ అగ్రస్థానంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ప్రపంచ భూభాగంలో భారత్‌ వాటా కేవలం 2.4 శాతం అయినా జనాభాలో మాత్రం దాదాపు 17.8 శాతం, కలిగి ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వంద మందిలో దాదాపు 18 మంది భారతీయులే.. సరాసరి చూస్తే భూమి మీద ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. ఇంత వరకూ బాగానే ఉన్నా..ఒకప్పుడు భారతదేశంలో ఒక్కో మహిళ సగటున ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చేది. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు రెండుకి చేరుకుంది.

పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు, మహిళా విద్య, కుటుంబ నియంత్రణ, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల పెంపకంపై పెరుగుతున్న వ్యయాలు వంటి కారణాల వల్ల మనదేశంలో జనాభా వృద్ధి రేటు 2.1 శాతంగా ఉండాల్సింది పోయి 1.94కి తగ్గింది. ప్రస్తుతం మనదేశంలో బీహార్‌లో అత్యధిక జననాల రేటు (3.0) ఉండగా తర్వాత రాష్ట్రాలు మేఘాలయ, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో 1.4 నుంచి 1.6 మధ్య లో జననాల రేటు ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా 1.5 నుంచి 1.6 శాతం ఉంది. ఒకప్పుడు జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని ఆందోళన చెందిన తెలుగు రాష్ట్రాలలోనే ఇప్పుడు జనాభా కొరత కనిపించడం గమనార్హం.


ఇదీ ఇవాళ్టి ప్రస్థానం!
ప్రతి ఏటా జూలై 11వ తేదీన, ప్రపంచ దేశాలన్నీ భూమిపై మారుతున్న జనాభా పోకడలను, అవి మన భవిష్యత్తుపై చూపే ప్రభావాన్ని అంచనా వేయడానికి ఒకక్షణం ఆగి ఆలోచిస్తాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభా ఏకంగా 830 కోట్లు  దాటిన తరుణంలో, ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. చారిత్రాత్మక మైలురాళ్ల నుంచి నేటి యువత ఆకాంక్షల వరకు.. ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని ప్రత్యేకంగా మార్చే ఐదు ముఖ్యమైన అంశాలు...

ఈ ఏడాది థీమ్‌ 
ప్రపంచ జనాభా దినోత్సవం 2026 ప్రధాన నినాదం ‘యువత ఆశలు, ఆకాంక్షలను.. నేడు.. భవిష్యత్తు కోసం సాకారం చేయడం’. అంటే నేటి యువత తమ బంధాల గురించి, కుటుంబ నియంత్రణ లేదా పిల్లలను కనడం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వారి ఆశలు ఏమిటి? వారు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? అనే విషయాలపై ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వే ఆధారంగా ఈ ఏడాది థీమ్‌ను రూపొందించారు.

చారిత్రాత్మక మైలురాయి
1987 జూలై 11 నాటికి జనాభా సరిగ్గా ఐదు వందల కోట్లకు చేరింది. అప్పట్లో దీనిపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దాంతో జనాభా సమస్యలపై నిరంతరం అవగాహన కల్పించడం కోసం 1989లో ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ వ్యాప్తంగా జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఇలా మొదలైంది..
మొట్టమొదటి అధికారిక ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1990లో 90 కి పైగా దేశాల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా ఈ రోజున భాగస్వామ్యం వహిస్తున్న దేశాలు, సంస్థలు, స్వచ్ఛంద సంఘాల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. జనాభా సమస్యలతో పాటు అవి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, అభివృద్ధి, పర్యావరణంపై చూపే ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ చేతులు కలుపుతున్నారు.

ఆరోగ్య సంరక్షణే లక్ష్యం!
అన్ని ప్రాంతాల వారికి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోని మహిళలు, యువతకు సార్వత్రిక  పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందేలా చూడటమే ఈ రోజు ప్రధాన లక్ష్యం. కుటుంబ నియంత్రణ, మాతా శిశు సంరక్షణ విషయాలలో ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పించడం ఈ రోజు జరుపుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. దీనిని మానవ హక్కులు, లింగ సమానత్వం, ప్రపంచ సుస్థిర అభివృద్ధితో ఐక్యరాజ్యసమితి నేరుగా ముడిపెట్టింది.

పెరుగుదల ఒకేలా లేదు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభా మార్పులు చాలా విచిత్రంగా ఉన్నాయి. భారతదేశం వంటి దేశాలు ఇప్పటికీ వేగవంతమైన జనాభా వృద్ధిని నమోదు చేస్తుంటే, జపాన్‌ వంటి దేశాలలో జనాభా క్రమంగా పడిపోతోంది. ఈ భిన్నమైన పోకడలు ఆయా దేశాలకు వేర్వేరు సవాళ్లను విసురుతున్నాయి. పెరుగుతున్న జనాభా వల్ల ఇళ్లు, ఉద్యోగాలు, వైద్యం, వనరుల కొరత ఏర్పడుతుంటే, తగ్గుతున్న జనాభా వల్ల సమాజంలో వృద్ధుల సంఖ్య పెరిగి, పనిచేసే యువశక్తి తగ్గిపోతోంది. దీనివల్ల వివిధ దేశాలు తమ సామాజిక, ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా భిన్నమైన ప్రణాళికలు వేసుకోవాల్సి వస్తోంది. ఇలా నాణ్యమైన ప్రమాణాలతో జీవించే దేశాలలో జనాభా రోజురోజుకీ తగ్గిపోతోంది. మా దేశానికి రండి జనాభాను పెంచండి..మీకు ఉపాధి కల్పిస్తాం..ఉద్యోగాలిస్తాం అంటూ పలు దేశాలు ప్రకటనలు చేయడం ఇప్పటికే మనం చూస్తున్నాం.
– శ్రావణ్‌ జయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement