హి..స్టోరీ
దాదాపు 2 దశాబ్ధాల క్రితం దర్శకుడు రామ్గోపాల్ వర్మ తీసిన డి వంటి సినిమాల ద్వారా బాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన రణదీప్ హుడా కెమెరా ముందు ఎంత సహజంగా కనిపిస్తాడో, కెమెరా వెనుక కూడా సహజత్వాన్ని అంతే ప్రేమిస్తాడు. నటనలో జీవించడంతో పాటు ప్రకృతి లో వన్య్రపాణుల జీవితాన్ని పంచుకోవడాన్ని ఇష్టపడతాడు. వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ ఆయనకు ఎంతో ఇష్టమైన అభిరుచి. దీనికోసం గతంలోనూ పలు అరణ్యాలను అన్వేషించి, తాజాగా మధ్యప్రదేశ్లోని కన్హా నేషనల్ పార్క్ను సందర్శించాడు. జీవవైవిధ్యానికి స్వర్గధామమైన కన్హా, పులులు, చిరుతలు, చిత్తడి జింకలు (బారాసింఘా), కృష్ణజింకలు తదితర అరుదైన, అంతరించిపోతున్న జాతులకు నిలయం.
సతీసమేతంగా...
ఆయన తన భార్య, నటి లిన్ లైశ్రామ్తో కలిసి కన్హా జాతీయవనంలోని జీవ వైవిధ్యాన్ని ఆస్వాదిస్తూ పులులు, చిరుతలు, బరాసింఘా జింకలు, బ్లాక్బక్స్ వంటి అరుదైన జంతువులను తన కెమెరాలో బంధించారు. జంతువుల సహజ ప్రవర్తనకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా చిత్రీకరించడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తారు. మంచి ఫొటోకోసం గంటల తరబడి ఓపికగా ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. ‘వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ నాకు కేవలం హాబీ మాత్రమే కాదు. ప్రకృతితో, నాతో నేను మళ్లీ అనుసంధానం కావడానికి ఓ మార్గం కూడా. అడవిలో జంతువులను వాటికి తగిన సహజమైన వాతావరణంలో గమనించడం సహనం, వినయంతో సహా మనకు ఎన్నో నేర్పిస్తుంది. అంతేకాదు, జీవితంపై కొత్త దృక్పథాన్ని ఇస్తుంది’’ అంటాడు రణదీప్.
పర్యావరణ పరిరక్షణకు మద్దతు
గత కొంతకాలంగా వన్య్రపాణుల సంరక్షణకు రణదీప్ తనవంతు మద్దతు ఇస్తున్నాడు. అడవులు, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని సోషల్ మీడియాలో తరచుగా గుర్తు చేస్తుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 500 కుపైగా మొక్కలు నాటిన విషయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.
అడవి రెండో ఇల్లు...
‘గత కొంత కాలంగా అడవి నా రెండవ ఇల్లుగా మారింది, అడవిలో గడిపిన ప్రతి క్షణం ప్రకృతిలోని ప్రతిదీ ఒకదానితో ఒకటి ఎంత అందంగా ఎలా ముడిపడి ఉందో తెలియజేస్తుంది. ఇది అద్భుతాలతో నిండిన ప్రపంచం, ఇక్కడ పర్యావరణ వ్యవస్థ ఎంత క్లిష్టమైనదో ప్రత్యక్షంగా చూశాను. అతి చిన్న జీవుల నుంచి అతి పెద్ద మాంసాహార జీవి వరకు, ప్రకృతి నియమాలను ఎంతో కచ్చితత్వంతో పాటించడం గమనించాను’’ అంటాడాయన.
– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్


