Women Power: ‘కోటి’ ఆశల మహిళా మార్ట్‌! | Women Power: Manufacturing Products Using Materials Found In Nature | Sakshi
Sakshi News home page

Women Power: ‘కోటి’ ఆశల మహిళా మార్ట్‌!

Jun 12 2026 9:06 AM | Updated on Jun 12 2026 9:06 AM

Women Power: Manufacturing Products Using Materials Found In Nature

వుమెన్‌ పవర్‌

ప్రకృతి ఒడిలో లభించే వస్తువులతో ఉత్పత్తులు తయారు చేయడం ఆ మహిళలు ఉపాధిగా మార్చుకున్నారు. కానీ వారి రెక్కల కష్టానికి దక్కాల్సిన ఫలితం వారికి దక్కక΄ోయేది. దళారులే దండుకునేవారు. అయితే అప్పటి కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ చొరవతో ఏడాది క్రితం ఆ మహిళలంతా కలిసి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ మార్ట్‌నిప్రారంభించారు. ఇపుడు అదే రూ.కోటి టర్నోవర్‌కు చేరుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది.

జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు అటవీ ఉత్పత్తులతో, చిరుధాన్యాలతో పలు రకాల వస్తువులు, ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తుండేవారు. అయితే ఈ ఉత్పత్తులకు మొదట సరైన మార్కెటింగ్‌ లేక.. పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వ స్టాల్స్‌ పెట్టినపుడో, లేదా వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడో మాత్రమే విక్రయించడానికి అవకాశం ఉండేది. ఇదే అవకాశంగా తీసుకున్న కొందరు వ్యాపారులు వీరి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాలు ΄÷ందేవారు.

ఉపాధికి తోవ చూపింది
మేము జూట్‌ బ్యాగ్‌లు, జొన్నలు, రాగులు, సజ్జలు, అరికెలు, సామలుతో మిల్లెట్‌ఫుడ్‌ తయారు చేస్తాం. ఈ ఆర్గానిక్‌ ఫుడ్‌ను ఎక్కడ విక్రయించాలో ముందు మాకు తెలిసేది కాదు. ఖమ్మంలో మహిళామార్ట్‌ వల్ల మాకు ఉపాధి లభించింది. నెలకు రూ.35 వేల వరకు ఆదాయం వస్తోంది. – చాగంటి లావణ్య, ముదిగొండ, ఖమ్మం

మా జీవితాల్లో వెలుగులు నింపింది!
వినియోగదారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన స్వీట్‌లను తయారు చేసివ్వాలని మేము శ్రీవారాహి హోంఫుడ్స్‌ప్రారంభించాం. ధర ఎక్కువగా ఉందన్న కారణంతో మొదట్లో అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే జిల్లా కేంద్రంలో ఉన్న మహిళామార్ట్‌ గురించి తెలిసి, అక్కడికి మా స్వీట్స్‌ని సరఫరా చేస్తున్నాం. అప్పటి నుంచి మాప్రోడక్ట్స్‌కి మంచి స్పందన లభించి ప్రతినెలా రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు వ్యాపారం చేయగలుగుతున్నాం. – మృణాళిని, శ్రీ వారాహి హోంఫుడ్స్, సరఫరాదారు

ఇలా ఆరంభం!
గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ముజమ్మిల్‌ఖాన్‌  మండలాల్లో పర్యటించినప్పుడు మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను, మార్కెటింగ్‌ చేసేందుకు పడుతున్న ఇబ్బందులను గమనించారు. అపుడే ఖమ్మం మహిళామార్ట్‌ ఆలోచనకు అంకురార్పణ చేశారు. స్థానికంగా ఉత్పత్తి అయిన సరుకులకు ప్రోత్సాహం కల్పించడం, మహిళా సంఘాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. బ్లాక్‌రైస్, రెడ్‌ రైస్‌ నుంచి వెదురు ఉత్పత్తుల వరకు సుమారుగా 200 రకాల ఉత్పత్తులు లభించే ఈ మార్టు అతి తక్కువ సమయంలోనే లాభాల బాటలో నడిచి రూ. కోటి టర్నోవర్‌ను చేరుకుంది. – బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం రాధారపు రాజు, సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌

Advertisement
 
Advertisement
Advertisement