breaking news
self-employment
-
నిరుద్యోగ యువతకు దారుణంగా దగా
సాక్షి, అమరావతి : బడుగు, బలహీన వర్గాల యువతను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్), ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల స్వయం ఉపాధికి, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలిస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు, టీడీపీ నేతలు.. అధికారంలోకొచ్చాక మొండిచేయి చూపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను అన్ని సంక్షేమ శాఖలు కలిపి కనీసం రూ.4 వేల కోట్ల రుణాలివ్వాల్సి ఉంది. ఇందులో 50 శాతం ప్రభుత్వ సబ్సిడీగా ఇవ్వాలి. స్వయం ఉపాధి కోసం చిన్నపాటి పరిశ్రమలు, వ్యాపారాలు, వ్యవసాయ అనుబంధ సంస్థలు తదితర వాటికి యూనిట్కు రూ.50 వేల నుంచి రూ.8 లక్షల వరకు సబ్సిడీపై రుణాలిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా తెగ ప్రచారం చేశారు. ఆ తర్వాత బీసీ, అగ్రవర్ణ పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రుణాలిస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ప్రకటనలు గుప్పించారు. అర్హులైన వారంతా ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్, మానిటరింగ్ సిస్టమ్ (ఏపీఓబీఎంఎంఎస్) వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తేదీలనూ ప్రకటించారు. కూటమి నేతల మాటలు నమ్మిన యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంది. కూటమి ఇచ్చిన హామీ ప్రకారం 2024, 2025 రెండేళ్లకు ఇప్పటికే రెండు పర్యాయాలు రుణాలివ్వాల్సి ఉంది. అయినా ఇప్పటి వరకు ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.బీసీ సంక్షేమ శాఖ మొండిచేయిబీసీలతో పాటు ఈడబ్ల్యూఎస్ (కాపు, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన)కు రూ.వెయ్యి కోట్ల సబ్సిడీ రుణాలు ఇస్తామని ఆర్భాటపు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం.. చివరకు మొండి చేయి చూపింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు నెలల్లో 1.30 లక్షల మందికి సబ్సిడీ రుణాలిస్తున్నట్టు మంత్రి సవిత ప్రకటించారు. లబ్ధిదారుల వాటా, జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివద్ధి సంస్థ, బ్యాంకు రుణాలు కలిపి మొత్తం రూ.1,969.58 కోట్లు అవుతుందని, అందులో రూ.1,038.81 కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఒక్కో యూనిట్కు పదికి పైగా దరఖాస్తులొచ్చాయి. చివరకు ముఖ్య నేత ఆదేశాలతో ఎవరికీ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది.వింత మెలికతో ఎస్సీలకు ఎగనామంఎస్సీల రుణాల విషయంలో ప్రభుత్వం వింత మెలిక పెట్టి మొత్తం పథకానికే ఎసరు పెట్టింది. పెద్ద సంఖ్యలో రుణాలు ఇస్తామంటూ దరఖాస్తులకు రెండు పర్యాయాలు గడువు పెంచిన ఎస్సీ కార్పొరేషన్.. ముగింపు గడువు ఎప్పుడో, రుణాలు ఎప్పుడిస్తారో అన్న విషయాలపై స్పష్టత ఇవ్వలేదు. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్న ఆకాంక్షతో ఎస్సీ యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసింది. సుమారు రూ.410 కోట్ల సబ్సిడీ అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. రుణం మంజూరైన రెండేళ్లకు దానిని లబ్ధిదారులకు అందిస్తామంటూ మెలిక పెట్టడంతో అందరూ విస్తుపోతున్నారు. లబ్ధిదారుడి వాటా, ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణం మొత్తం కలిపితేనే ఎస్సీ యువత యూనిట్ పెట్టుకుని స్వయం ఉపాధి పొందగలదు. అయితే రుణాలు ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మెలిక పెట్టిందని ఎస్సీ వర్గాలు మండిపడుతున్నాయి.మైనార్టీలకూ ఇదే మోసంమైనార్టీ యువతకు అందించే రుణాలకూ ప్రభుత్వం ఇదే విధమైన మెలిక పెట్టింది. రాష్ట్రంలో 49,218 మందికి రూ.326 కోట్ల సబ్సిడీ రుణాలిస్తామంటూ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ గొప్పగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ద్వారా అందించే రుణాలకు ముందుగా బ్యాంకు రుణం పొందిన లబ్ధిదారులకు.. రెండేళ్ల తర్వాత పరిశీలించి సబ్సిడీ అందిస్తామని మెలిక పెట్టడంతో ముస్లిం మైనార్టీ వర్గాలు కంగుతిన్నాయి. రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు నాలుగు శ్లాబ్లలో సబ్సిడీ రుణాలు ఇస్తామనే ఆర్బాటం మినహా ఇప్పటి వరకు ఒక్క రుణమూ మంజూరు చేయలేదు.అడవి బిడ్డల పట్లా అలక్ష్యంబీసీలను మోసం చేసిన కూటమిబీసీలకు స్వయం ఉపాధి రుణాలు ఇస్తామని నమ్మించిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత గొంతు కోశారు. కూటమి నేతల మాటలు నమ్మిన చేతి వృత్తిదార్లు, పేద, మధ్య తరగతి ప్రజలు, ప్రధానంగా నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. వారందరినీ ప్రభుత్వం మోసం చేసింది. – చింతపల్లి గురుప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ కులాల ఐక్య వేదికకార్పొరేషన్ల నిధుల మళ్లింపు దారుణంకూటమి ప్రభుత్వం సబ్సిడీ రుణాలివ్వకుండా.. ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోంది. స్వయం ఉపాధి మార్గం ఎంచుకున్న యువత లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. – ఆండ్ర మాల్యాద్రి, రాష్ట్ర కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంజీవోలు అమలు చేయడం చేతకాలేదా?ముస్లిం మైనార్టీల స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలిస్తామని జీవో ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి దాన్ని అమలు చేయడం చేతకాలేదా? ముస్లిం మైనార్టీలను కూటమి ప్రభుత్వం మరోమారు మోసం చేసింది. 2018–19 మధ్య కూడా టీడీపీ ప్రభుత్వం ఇదే తరహాలో ముస్లిం మైనార్టీ యువత నుంచి దరఖాస్తులు తీసుకుని.. చివరకు నిధులు విడుదల చేయకుండా మొండిచేయి చూపింది. – షేక్ నాగుల్ మీరా, రాష్ట్ర అధ్యక్షుడు, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితిఅడవి బిడ్డల పట్లా అలక్ష్యంగిరిజనులకు సబ్సిడీ రుణాల విషయంలో ప్రభుత్వం పూర్తి అలక్ష్యం ప్రదర్శిస్తోంది. గిరిజనుల స్వయం ఉపా«ధి కోసం గిరిజన ఆర్థిక సహకార సంస్థకు రూ.110 కోట్లు కేటాయించినట్టు లెక్కల్లో చూపినప్పటికీ.. ఇంతవరకు సబ్సిడీ రుణాలకు ఒక్క పైసా విదల్చలేదు. వారి స్వయం ఉపాధి కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న ఆలోచన చేయలేదు. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా వంచిస్తోంది. -
ఏజెన్సీ నుంచి లండన్ దాకా..
భద్రాచలం : కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్న గిరిజన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతమయ్యారు. ఏజెన్సీ నుంచి ప్రారంభమైన వీరి వ్యాపారం లండన్ వరకూ విస్తరించింది. ప్రధాని మోదీ ‘మన్కీబాత్’లో భద్రాచలం గిరిజన మహిళల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఏడేళ్ల క్రితం ప్రారంభం.. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వయం శిక్షణ కింద ఏడేళ్ల క్రితం ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ను ప్రారంభించారు. గిరిజన మహిళ ఊకే వెంకటలక్ష్మి మరో ఏడుగురితో కలిసి శిక్షణ తీసుకుంది. అనంతరం రూ.5 లక్షల పెట్టుబడితో శానిటరీ నాప్కిన్ తయారీని ‘భద్రాద్రి శ్రీరామ్ జేఎల్ గ్రూప్’అనే సెల్ఫ్హెల్ప్ గ్రూప్తో ప్రారంభించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని ఓ భవనాన్ని అధికారులు వీరికి కేటాయించారు. మిషనరీతో తయారీ ప్రారంభించిన కొద్ది కాలంలోనే కరోనా వచ్చింది. దీంతో వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ కోవిడ్ కాలం పూర్తయ్యాక మొక్కవోని ధైర్యంతో శానిటరీ ప్యాడ్ల తయారీ ప్రారంభించారు. ఐటీడీఏ సహకారం తోడవడంతో ప్యాడ్లను గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, కళాశాలల్లో బాలికలకు సరఫరా చేశారు. నాడు నెలకు 100 ప్యాడ్లతో ప్రారంభం కాగా, ప్రస్తుతం 40 వేలకు చేరింది. ఆర్గానిక్ మిల్లెట్ బిస్కెట్ల తయారీతో...వెంకటలక్ష్మి మదిలో మరో ఆలోచన ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ దినుసులతో ఆర్గానిక్ మిల్లెట్ బిస్కెట్ల తయారీని ప్రారంభించాలనుకుంది. మరో ముగ్గురు సభ్యులతో కలిసి అప్పటి ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు దృష్టికి తీసుకెళ్లగా ఆయన తగిన శిక్షణతో పాటు బ్యాంకు లోన్ కూడా ఇప్పించారు. ఇలా ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’పేరిట బిస్కెట్ల తయారీని ప్రారంభించారు. కొర్రలు, రాగులు, జొన్న, సామలతో రకరకాల బిస్కెట్లను తయారు చేసి అమ్మకం ప్రారంభించారు. మైదా, పంచదార లేకుండా పూర్తిగా ఆర్గానిక్తో తయారు చేయడం వీరి ప్రత్యేకత. బెల్లం, నెయ్యి, బటర్లతో తయారు చేసిన బిస్కెట్లు అనతికాలంలో అందరికీ నచ్చాయి. ఐటీడీఏ పీఓల సహకారంతో..గౌతమ్ పొట్రు తర్వాత పీఓగా వచ్చిన రాహుల్ మార్కెటింగ్పై తగిన శ్రద్ధ చూపి పలుచోట్ల కౌంటర్లు ఇప్పించారు. దీంతో వ్యాపారం విస్తరించింది. భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం వద్ద, పట్టణంలోని పలుచోట్ల, ఐటీడీఏ, గిరిజన మ్యూజియంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శిల్పారామం, ఢిల్లీ రాష్ట్రపతి భవన్తోపాటు ఇతర ముఖ్య కేంద్రాల్లోనూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. సుదూర ప్రాంతాలకు కార్గో ద్వారా సైతం ఆర్డర్లతో సరఫరా చేస్తున్నారు. ఎన్ఐఆర్ల ద్వారా లండన్కు సైతం వీరి బిస్కెట్లు పలుమార్లు చేరాయి. అందరి సహకారం మరువలేనిదిమొదట ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఐటీడీఏ పీఓలు, కుటుంబసభ్యుల సహాయ సహకారా లతో ముందుకొచ్చాం. గ్రూప్లో ప్రతీ మహిళ ఐదంకెల జీతంతో సమానంగా సంపాదిస్తున్నాం. ప్రధాని మోదీ మమ్మల్ని మెచ్చుకోవడం మరింత స్ఫూర్తినిచ్చింది. కొత్తగా ఆలోచించి ఇంకా ముందుకెళ్లాలని ఉంది. – ఊకే వెంకటలక్ష్మి, గ్రూప్ లీడర్ -
సంక్రాంతి తర్వాత బీసీలకు ‘స్వయం ఉపాధి’!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల మంజూరుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ బీసీ కార్పొరేషన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,100 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల దీనిపై ప్రత్యేకంగా చర్చించి సూత్రప్రాయంగా ఆమోదించినట్టు తెలిసింది. ఈ మేరకు సంక్రాంతి పండుగ తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఉత్తర్వులు రాగానే క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా చేపట్టేందుకు బీసీ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే మార్చి చివరినాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.దశాబ్దకాలం నుంచీ నిరీక్షణే..తెలంగాణ బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కల్పన చాలా ఏళ్లుగా అటకెక్కింది. దీనికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతూ వచ్చినా, విడుదల చేయలేదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో బీసీ సబ్సిడీ రుణాల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించారు. అప్పుడు దాదాపు 7.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ మంజూరు కాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.50వేల లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న కొందరికి మంజూరు చేసినా.. తర్వాత రుణాల పంపిణీ ఊసేలేదు. తాజాగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్కు భారీగా బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ స్వయం ఉపాధి పథకాలను పట్టాలెక్కించాలని నిర్ణయించింది.స్థానిక సంస్థల ఎన్నికల ముందు..త్వరలో రాష్ట్రంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సబ్సిడీ పథకాలను తెరపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే బీసీ కార్పొరేషన్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఇక ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా కూడా సబ్సిడీ పథకా లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంబీసీ కార్పొరేషన్ అధికారులకు సైతం పలు సూచనలు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వారంలో వెలువడే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. -
‘ప్రగతి’ బాటలో పొదుపు మహిళ
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళా స్వయంశక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటు సత్ఫలితాలనిస్తోంది. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందించిన నిధులతో అక్క చెల్లెమ్మలు స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అండగా నిలిచి ‘పొదుపు’ మహిళలకు దిశానిర్దేశం చేస్తోంది. మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చి విజయం దిశగా ప్రోత్సహిస్తున్నారు గత నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా 25 లక్షల మంది పట్టణ ప్రాంత పొదుపు సంఘాల్లోని మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లను నెలకొల్పి అద్భుత ఫలితాలను సాధించారు. దీంతోపాటు మహిళలు తయారు చేసే చేతి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు పొదుపు మహిళలతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ‘మెప్మా’ ముందడుగు వేసింది. పర్యావరణహితంగా సరికొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ మహిళలతో ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టారు. ఏ పరిశ్రమ స్థాపించాలి? మూలధనం, శిక్షణ లాంటి అంశాలపై చర్చించేందుకు మెప్మా ఎండీ తాజాగా సంఘాల లీడర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 25 లక్షల మంది సభ్యులుగా ఉన్న పట్టణ సమాఖ్యలకు చెందిన టీఎల్ఎఫ్ రిసోర్స్ పర్సన్లు, సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు (ఆఫీస్ బేరర్స్) దాదాపు 700 మంది పాల్గొన్న ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లోని పట్టణ మహిళా సంఘాలు సంఘటితంగా సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఎండీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. 9 పట్టణాల్లోని జగనన్న మహిళా మార్టుల ద్వారా ఆగస్టు వరకు రూ.25 కోట్ల వ్యాపారం చేసినట్లు లబ్ధిదారులు వివరించారు. 110 యూఎల్బీల్లో ప్రతినెలా ఒకరోజు ఏర్పాటు చేసే అర్బన్ మార్కెట్ ద్వారా ఒక్కోచోట సగటున రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వ్యాపారం చేస్తున్నట్టు తెలిపారు. వీటితోపాటు ఆస్పత్రులు, మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 140 మెప్మా ఆహా క్యాంటీన్ల ద్వారా సంఘాల సభ్యులు ఆదాయం పొందుతున్న తీరును, వాటికున్న డిమాండ్ను సదస్సులో పంచుకున్నారు. వ్యాపారం చేసుకుంటున్నాం గతంలో బ్యాంకు రుణం వస్తే డబ్బులు పంచుకుని ఇంట్లో ఖర్చు చేసేవాళ్లం. ఇప్పుడు బ్యాంకు రుణాలు ఇప్పించడంతోపాటు వ్యాపారం దిశగా ‘మెప్మా’ ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లుగా అన్ని పథకాలు అందుతున్నాయి. బ్యాంకులు మాకు పిలిచి మరీ రుణాలు ఇస్తు న్నాయి. ఈ డబ్బులతో సంఘాల్లోని సభ్యులు తమకు నైపుణ్యం ఉన్న అంశంలో వ్యాపారం చేస్తున్నారు. స్థిరమైన ఆదాయం వస్తోంది. వ్యాపార ఆలోచన ఉంటే మెప్మా శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తోంది. – పి.కృష్ణకుమారి, నరసరావుపేట మహిళలకు అండగా సీఎం మహిళా సాధికారత అంటే ఇన్నాళ్లూ మాకు తెలియదు. ఇంటికే పరిమితమైన మమ్మల్ని సీఎం జగన్ ప్రగతి వైపు అడుగులు వేయించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్థికంగా ఎదుగుతున్నాం. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేసుకున్నాం. పెద్దపెద్ద మార్ట్లతో పోటీ పడి వ్యాపారంలో లాభాలు పొందుతున్నాం. నవరత్నాల పథకాలను ప్రధానంగా మహిళల కోసమే అమలు చేస్తున్నారు. – ప్రతిమారెడ్డి, తిరుపతి ఆహా క్యాంటీన్తో ఉపాధి గతంలోనూ పట్టణ మహిళా పొదుపు సంఘాలు ఉన్నా పావలా వడ్డీ రుణాలు తప్ప మిగతావి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రుణాలు మంజూరు చేయడంతో పాటు అవగాహన ఉన్న రంగంలో వ్యాపారం దిశగా ప్రోత్సహించి ఆదాయ మార్గాన్ని కూడా చూపించింది. మెప్మా ప్రోత్సాహంతో ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కపూటకు అన్ని ఖర్చులు పోను రూ.1,000 లాభం వస్తోంది. – శ్యామల, అమలాపురం గత ప్రభుత్వంలో మోసపోయాం ఎన్నో ఏళ్లుగా పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్నా ఏనాడు ఆర్థికంగా బాగున్నది లేదు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సభ్యులు ఎంతో ఆశతో రుణాలు చెల్లించడం ఆపేశారు. దాంతో బ్యాంకు మా సంఘాన్ని డిఫాల్టర్గా ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లిస్తూ వ్యాపారం దిశగా ప్రోత్సహించింది. ఇప్పుడు బ్యాంకులు పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. – షేక్ ఫాతిమా, నరసరావుపేట ప్రతి రూపాయీ మాకే.. గత ప్రభుత్వంలో పట్టణ మహిళా పొదుపు సంఘాల పేరుతో చాలా వరకు బోగస్ సంఘాలు ఉండేవి. మాకు రావాల్సిన నిధులు వారికే పోయేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి సంఘాన్ని, ప్రతి సభ్యురాలి వివరాలను ఆన్లైన్ చేశారు. దీంతో బోగస్ సంఘాలు పోయాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ఇప్పుడు నేరుగా సంఘాలకే అందుతోంది. శిక్షణనిచ్చి మున్సిపల్ స్థలాల్లో వ్యాపారాలు పెట్టిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు. – మీనాక్షి, విజయవాడ మహిళా సాధికారతే లక్ష్యం మెప్మాలోని సభ్యులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్ల నిర్వహణతో మహిళలు విజయం సాధించారు. అనుకున్న దానికంటే మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో మహిళా పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు ఎంతో ఆలోచించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. మహిళల్లో అద్భుతమైన వ్యాపార దక్షత ఉంది. వారు తయారు చేసే చేతి వస్తువులు, ఆహార పదార్థాలను ఈ–కామర్స్ సైట్ల ద్వారా విక్రయించేలా ప్రణాళిక రూపొందించాం. మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. వారిని మరో మెట్టు ఎక్కించేందుకు మెప్మా ద్వారా తయారీ యూనిట్లు కూడా నెలకొల్పే ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచితంగా శిక్షణనిచ్చి ఆర్థిక సాయం చేసి వ్యాపార యూనిట్లు పెట్టిస్తాం. పట్టణ ప్రగతి యూనిట్లు నెలకొల్పే దిశగా సాయం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
భళా బిందు.. స్వయం ఉపాధి
సాక్షి, ఖమ్మం: పని చేయాలనే తపన, స్వయం ఉపాధి పొందాలనే ఆసక్తితో ఖమ్మంలోని ముస్తఫానగర్కు చెందిన వి. భానుసాయిబిందు ధైర్యంగా, వినూత్న మార్గం ఎంచుకున్నారు. హౌస్ కీపింగ్ సేవల పేరిట..పెద్దపెద్ద ఇళ్లు, వివిధ సంస్థల కార్యాలయాలను శుభ్రపరచడం, వస్తువలన్నింటినీ అందంగా సర్దడం, ఇళ్లు మారినప్పుడు సామగ్రినంతా ప్యాకింగ్ చేసి భద్రంగా మరోచోటుకు తరలించడం తదితర పనులను తనతో పాటు పలువురు మహిళలతో కలిసి చేస్తున్నారు. పనిపట్ల చూపే ప్రత్యేక శ్రద్ధ వల్ల మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ గుర్తింపు పొందుతున్నారు. ఎంకామ్ ఉన్నత విద్య చదివిన వంగిభురాత్చి భానుసాయిబిందు ముస్తఫానగర్ పురపాలక సంఘం బోర్డు దగ్గర జిరాక్స్, నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఒక సంస్థలో హౌస్ కీపింగ్లో శిక్షణ పొంది..కేవలం మహానగరాలకే పరిమితమైన సేవలను ఐదు సంవత్సరాల క్రితం కీర్తి హౌస్ కీపింగ్ సర్వీసెస్ పేరిట ఖమ్మం నగరానికి పరిచయం చేసి..కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 20 మంది మహిళలకు పని కల్పిస్తున్నారు. వీరితో పాటు 10 మంది పురుషులు కూడా ఉపాధి పొందుతున్నారు. గూగుల్లో కీర్తి హౌస్ కీపింగ్ సర్వీసెస్, ఖమ్మం అని టైప్చేస్తే వీరి పూర్తి వివరాలు, చేసిన పనుల వీడియోలు చూడొచ్చు. నగర వాసులకు ప్రత్యేకం ఉరుకులు పరుగుల కాలంలో, ఉద్యోగ, వ్యాపార ఒత్తిడిలో ఉన్న వారికి వీరి సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. భార్యాభర్తలు ఉద్యోగం చేసే వారు కొందరైతే, అనారోగ్య సమస్యలతో పనులు చేసుకోలేకపోయేవారు ఇంకొందరు, వంట, ఇతర పనులతో బిజీగా ఉండి ఇంటిని శుభ్రం చేసుకోకపోవడం, అందంగా సర్దుకోవడానికి సమయం లేని వారు అనేకమంది. వీరందరికీ ఉపయోగపడుతోంది కీర్తిహౌస్ కీపింగ్ సర్వీస్. ఇల్లు శుభ్రం చేసి వస్తువులు అందంగా సర్దడానికి కూడా పనివాళ్లు దొరుకుతారా..? అంటే మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. సమయానికి వచ్చి ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి.. ప్రతిఫలంగా డబ్బులు తీసుకుని ఉపాధి పొందుతున్నారు. ఇళ్లకు వచ్చి అందించే సేవలు ఇవే.. నగరంలో కీర్తి హౌస్ కీపింగ్ సర్వీస్ వారు తమ సేవలను విస్తృతంగా అందిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద ఇళ్లు, కార్యాలయాల్లో బూజులు దులపడం, కార్పెట్, సోఫాలను వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయడం, ఇల్లు మారినప్పుడు సామానంతా సురక్షితంగా చేరవేయడం చేస్తున్నారు. ఇంకా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ టెక్నీషియన్, పెయింటర్, చెదలు నియంత్రణ, కార్పెంటర్ తదితర పనులు కూడా చేస్తున్నారు. ఇన్వెర్టర్, గీజర్, ఏసీ, ఆర్వో సిస్టమ్ బిగించాలన్నా, మరమ్మతులు చేయాలన్నా మేమున్నాం అంటూ ఒక్క ఫోన్ చేస్తే వచ్చేస్తాం అంటున్నారు. ఉపాధి కల్పించాలనే.. తొలుత నెట్ సెంటర్ ద్వారా స్వయం ఉపాధి పొందా. చిన్న ఆలోచనతో పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో హౌస్ కీపింగ్ సర్వీసెస్ను ప్రారంభించాను. 10 మంది మహిళలతో కలిసి మొదలెట్టా. ఇప్పుడు 30మంది పనిచేస్తున్నారు. ఖమ్మంలో మేం చేస్తున్న పనులకు మంచి గుర్తింపు వస్తోంది. మా సేవలు పొందాలంటే 88974 35396 సెల్ నంబర్లో సంప్రదించవచ్చు. – భానుసాయి బిందు, కీర్తి హౌస్ కీపింగ్ సర్వీసెస్ నిర్వాహకురాలు, ఖమ్మం -
వికలాంగుల కోసం సరికొత్త పథకం
♦ స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనలో భారీ మొత్తంలో రాయితీలు ♦ బ్యాంకు రుణంలో గరిష్టంగా రూ.5 లక్షలు సబ్సిడీ... సాక్షి, హైదరాబాద్: వికలాంగులకు శుభవార్త. నిరుద్యోగ వికలాంగులు స్వయం ఉపాధివైపు అడుగేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. ఈ మేరకు వికలాంగుల పునరావాస పథకాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వ కార్యదర్శి జగదీశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన వికలాంగులు స్వయం ఉపాధి యూనిట్ను స్థాపిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు రాయితీ ఇవ్వనుంది. 2017–18 వార్షిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కింద అర్హులకు వయోపరిమితి విధించింది. 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసున్న వికలాంగులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు రుణంతో లింకు తాజాగా వికలాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాన్ని బ్యాంకుతో అనుసంధానం చేసింది. యూనిట్ను స్థాపించే ముందు బ్యాంకు ద్వారా రుణాన్ని పొందాలి. అలా పొందిన రుణంలో నిబంధనల మేరకు రాయితీని బ్యాంకుకు విడుదల చేస్తారు. రాయితీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎంపిక ప్రక్రియ జిల్లా సంక్షేమాధికారుల సమక్షంలో జరుగుతుంది. త్వరలో ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరించేందుకు వికలాంగుల సంక్షేమ శాఖ కసరత్తు చేపట్టింది. నెలకొల్పే యూనిట్ విలువ, రాయితీ వివరాలు ఇలా... యూనిట్ విలువ రాయితీ రూ.1 లక్ష 80 వేలు రూ.2 లక్షలు 1.4 లక్షలు రూ.5 లక్షలు 3 లక్షలు రూ.10 లక్షలు 5 లక్షలు -
దళిత సంక్షేమానికి ప్రణాళిక
2017–18 వార్షిక రుణ ప్రణాళిక ఖరారు ► రూ.53.92 కోట్లతో 1,992 మందికి లబ్ధి ► స్వయం ఉపాధికి బాటలు ► మూడెకరాల భూ పంపిణీకి ముందడుగు ► మొదటి పంటకు ఆర్థిక సాయం అందజేత ► నిరుద్యోగులకు శిక్షణా తరగతులు ► వివరాలు వెల్లడించిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య దళితులను స్వయం ఉపాధి, సమృద్ధితో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గతేడాది మాదిరిగానే 2017–18 సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.53.92 కోట్లతో 1,992 యూనిట్లు(లబ్ధిదారులు) మంజూరు చేసేందుకు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసింది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆమోదంతో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెరిక యాదయ్య ప్రణాళికను విడుదల చేస్తూ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతేడాది కార్పొరేషన్ ద్వారా 1,032 యూనిట్లకు గాను రూ.17.85 కోట్లను ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. గతేడాదికంటే 960 యూనిట్లను పెంచగా సగానికి పైగా సబ్సిడీ రుణాల మంజూరును పెంచినట్లు స్పష్టమవుతోంది. – సాక్షి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్: జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకుల స్వయం ఉపాధికి తోడ్పాటు కానుంది. భూ కొనుగోలు పథకం ద్వారా దళితకలకు మూడెకరాల భూ పంపిణీకి ముందడుగు పడనుంది. సాగు యోగ్యమయ్యేలా మొదటి పంటకు ఆర్థిక సాయమూ అందనుంది. నీటి వసతి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. స్వయం ఉపాధికి గాను అర్హులైన ఎస్సీలకు మొదటి కేటగిరీలో 80 శాతం సబ్సిడీ, రెండో కేటగిరీలో 70 శాతం సబ్సిడీ, మూడో కేటగిరీలో 5 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. 1,992 యూనిట్లకు గాను లబ్ధిదారులకు రూ.47.02 కోట్లు సబ్సిడీ రూపంలో అందించనున్నారు. అందులో స్వయం ఉపాధికి అర్హులైన ఎస్సీలకు బ్యాంకు లింకేజీకి రూ.15.92 కోట్ల విలువైన 922 యూనిట్లు పంపిణీ చేయనున్నారు. ఇందులో రూ.11.12 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రూపంలో ఇస్తుందని అధికారులు తెలిపారు. వాహన కొనుగోలుకు సంబంధించి 55 యూనిట్లకు గాను 2.99 కోట్ల విలువైన రుణాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు శిక్షణ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది స్టడీ సర్కిళ్లతోపాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేగాకుండా జిల్లా ప్రాధాన్యతలుగా గుర్తించి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వికలాంగులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా 56 యూనిట్ల (లబ్ధిదారులు)లో ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున 50 శాతం సబ్సిడీతో రుణ సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. భూపంపిణీకి ముందడుగు.. భూమి కొనుగోలు పథకం ద్వారా విభజిత కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది దళితులకు మూడెకరాల పంపిణీకి మోక్షం కలిగించేలా చర్యలకు ఉపక్రమించారు. 132 మందికి రూ.27.72 కోట్లు విలువ చేసే 396 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో 236 ఎకరాలున్నట్లు గుర్తించగా 79 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందులో.. ఇప్పటికే 39 మందికి గాను 100 ఎకరాల ప్రైవేట్ భూమి కొనుగోలుతోపాటు సాగుయోగ్యం, నీటి వసతికి అనువుగా ఉందని గుర్తించారు. ఇంకా మిగిలినవి భూగర్భజల విభాగం, స్థానిక తహసీల్దార్ల నుంచి నివేదికలు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతేడాది 411 మంది లబ్ధిదారులకు రూ.29.79 కోట్ల విలువైన 755 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఈ ఏడాది పంపిణీ చేసిన భూమికి మొదటి పంటకు ఆర్థిక సాయం ద్వారా రూ.57.82 లక్షలను మంజూరు చేయనున్నారు. అందులో రూ.1.79 కోట్ల రాయితీ ఉంటుందని అధికారులు తెలిపారు. నీటి వసతికిగాను బోర్వెల్స్, పంప్సెట్లు, ట్యూబ్వెల్, ఆయిల్ ఇంజన్లు, పైపులైన్ల రూపంలో 307 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. లబ్ధిపొందాలనుకుంటే దరఖాస్తు ఇలా.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిపొందాలనుకునే ఆసక్తి గల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విధానం ఏడాది పొడవునా ఉండడంతో ఆన్లైన్లో రిజిస్టర్ అవుతుంటుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది వరకు ఎంపీడీవోలు, ఆయా స్థాయిలోని అధికారుల వద్దనే 6,500 వరకు పెండింగ్ దరఖాస్తులుండడం గమనార్హం. గతం గతః అన్నట్లుగా తాజాగా ప్రభుత్వం ఎంపిక చేసే అర్హులైన లబ్ధిదారులు, విడుదల చేసే నిధులపైనే ఆధారపడి ఉంది. గతంలో పెండింగ్లో ఉన్న వాటికి వేరుగా నిధులు విడుదలవుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అభ్యర్థులు ఆధార్కార్డు, తెలంగాణ ప్రభుత్వంతో జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, ఇటీవల తీసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం వివరాలతో ఠీఠీఠీ.్టటౌbఝఝట.ఛిజజ.జౌఠి.జీn/లో నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. ఆన్లైన్లో నమోదు ఎంపీడీవో పరిశీలన అనంతరం గ్రామసభలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన లబ్ధిదారుడు బ్యాంకు కాన్సెంట్ ఇస్తే జిల్లాస్థాయిలో పరిశీలన కలెక్టర్ ఆమోదంతో సబ్సిడీ మంజూరు కానుందని అధికారులు వివరించారు. అయితే అధికారికంగా ఈనెల 31 వరకు దరఖాస్తుకు గడువు ఉన్నా.. సాధ్యం కాని పక్షంలో మరింత పొడిగించే అవకాశముందని ఈడీ యాదయ్య తెలిపారు.. దళారులను నమ్మొద్దు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీలకు అత్యధిక సబ్సిడీతో స్వయం ఉపాధి, సమృద్ధి పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తోంది. 100 శాతం, 80, 70, 60 శాతం సబ్సిడీల రూపంలో దళితుల ఆర్థిక పరిపుష్టికి తోడ్పడుతోంది. ఎస్సీల అభివృద్ధికి ప్రోత్సాహాకాలిస్తోంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా యూనిట్లను లబ్ధి చేకూరుస్తాం. దళారులను ఆశ్రయించొద్దు. రుణాల కోసం ఎవరి మాయమాటలు నమ్మొద్దు.. – పెరిక యాదయ్య, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, కరీంనగర్ -
వరంగల్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
♦ మంజూరు చేసిన కేంద్రం ♦ సుశిక్షితులైన డ్రైవర్లుగా తయారు చేయడమే లక్ష్యం ♦ యువత స్వయం ఉపాధికి అవకాశం హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మం జూరు చేసింది. యువత స్వయం ఉపాధి పొం దే అవకాశం కల్పిం చింది. ఈ సెంటర్ ద్వారా యువతకు మోటారు డ్రైవింగ్లో నైపుణ్యం కలిగిన శిక్షణ ఇస్తారు. దేశంలో డ్రైవింగ్ విభాగంలో 100 స్కిల్ డెవలప్మెంట్ సెంట ర్లు ఏర్పాటు చేస్తుండగా ఇందులో మూడు రాష్ట్రాని కి మంజూరయ్యాయి. వాటిలో ఒకటి వరం గల్కు కేటాయిం చింది. మిగతా రెండు హైదరాబాద్కు మంజూరయ్యాయి. తెలంగా ణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వీటి నిర్వహణ బాధ్యత తీసుకుంది. రవాణా రంగంలో విశేష అనుభవం ఉన్న ఆర్టీసీకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్లోని ఆర్టీసీ సిబ్బంది శిక్షణ కాలేజీ, ట్రైనింగ్ అకాడమీతోపాటు వరంగల్లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మంజూరయ్యాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా సుశిక్షితులైన డ్రైవర్లను తయారు చేస్తారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, వీరికి ఈ దిశగా అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్తో పాటు డ్రైవింగ్ ట్రాక్, ఇతర సౌకర్యాలు, శిక్షణ పరికరాల సమకూర్చుకోవడానికి ఒక్కో సెంటర్కు కేంద్రం రూ.కోటి కేటాయించింది. ఇందులో రూ.50 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో డ్రైవింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ పొందిన వారికి ఇతర సంస్థలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. వచ్చే నెల 15న దేశ వ్యాప్తంగా ఒకే రోజు 100 స్కిల్ డెవలప్మెంట్ సెటర్లను ప్రారంభించనున్నారు. డ్రైవింగ్ శిక్షణకు సంబం ధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. -
బడుగులకు అందని సంక్షేమ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: బడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందడం లేదు. ముఖ్యంగా స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలు దళితులకు చేరడం లేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2014-15లో స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన, భూపంపిణీ, నైపుణ్యాల మెరుగుదలకు సంబంధించి రూ.1,193 కోట్లతో మొత్తం 29,030 మందికి లబ్ధి చేకూర్చేలా కార్యాచరణను ప్రకటించారు. అయితే గత జూన్ 30తో గడువు ముగియగా, ఇంకా పదివేల మందికి రుణాలు అందలేదు. దీంతో గడువును నవంబర్ 17 వరకు పొడిగించారు. అక్టోబర్ 28 నాటికి జిల్లాల వారీగా 19,345 మందికి రూ.299.66 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఇందులో 2013-14కు సంబంధించి మిగిలిపోయిన 13,042 మంది లబ్ధిదారులు ఉండటం గమనార్హం. వీరిని కలపకపోతే 2014-15లో కేవలం ఆరువేల మందికే ప్రయోజనం కల్పించి నట్లు అవుతుంది. హైదరాబాద్లో 5,516 మందికి లబ్ధి చేకూర్చాలన్నది లక్ష్యంకాగా.. పది శాతం అంటే 536 మందికే అందించారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండగా, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో లక్ష్యానికి మించి ప్రయోజనం కల్పించారు. ఆయారంగాల వారీగా చూస్తే, బ్యాంక్ ఆధారిత పథకాల కింద 9,332 మందిని లక్ష్యంగా పెట్టుకోగా 5,509 మందికి లబ్ధి చేకూర్చారు. నాన్ బ్యాంక్ లింక్డ్ పథకాల్లో మొత్తం 19,698 మందికి ప్రయోజనం కలిగించాలని లక్ష్యంగా పెట్టుకోగా అందులో కేవలం 794 మందికే లబ్ధి చేకూరింది. మరోవైపు, పథకాల అమలను జిల్లాస్థాయిలో పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ) పోస్టులు ఏడు జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయి. దీంతో సకాలంలో ఆయా పథకాల ప్రయోజనం దక్కే పరిస్థితి కరువైంది. -
మరింత జాప్యం
ప్రగతినగర్ : స్వయం ఉపాధికోసం దరఖాస్తులు చేసుకున్న బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వ పెడుతున్న లేనిపోని కొర్రీలతో రుణమంజూరులో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో ఎంపిక చేసిన బీసీ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట క ల్పిస్తూ జీఓ నెం 165 ను విడుదల చేసిన విషయ తెలిసిందే! స్వయం ఉపాధి పథకం కింద ఎంపికైన 1890 మందికి, వృత్తి పనిదారుల సహకార సంఘాలకు సైతం జీఓ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్చి వరకు లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాధ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో ఎన్నో నెలలుగా రాయితీకోసం ఎదురుచూస్తున్న సుమారు 2 వేల మంది వెనుకబడిన తరగతుల వారికి కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. అయితే బీసీ రాయితీకి సంబంధించి పలు నిబంధనలు విధించడం లబ్ధిదారులను అయోమయానికి గురిచేస్తున్నారు. గతంలో తీసుకువచ్చిన బ్యాంకు రుణ అర్హత పత్రం, జీరో బ్యాలెన్స్ అకౌంట్ నెంబర్లను తిరిగి మళ్లీ అదే బ్యాంకుల నుంచి తీసుకురావాలని బీసీ లబ్ధిదారులకు అధికారులు చెబుతున్నారు. అలాగైతేనే రుణం మంజూరు చేస్తామంటున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో పనిచేసిన ఫీల్డ్ ఆఫీసర్లు, బ్యాంకు మేనేజర్లు అన్ని అర్హతలు చూచుకొని బీసీ లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే తాజాగా తిరిగి డూయల్ అకౌంట్ నెంబర్, బ్యాంకు రుణ అర్హత పత్రం తీసుకరావాలని అధికారులు నిబంధన విధించడంతో బీసీ లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. వివరాలకు జిల్లాలో రాజీవ్ అభ్యుదయ యోజన క్రింద నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు, మూడు మున్సిపాలిటీలలో 248 మందికిగాను రూ. 6 కోట్ల 86 లక్షల రాయితీ విడుదల కాగా, నిజామాబాద్ మండలాల్లో 1608 మందికి గాను రూ. 4కోట్ల 65 లక్షల రాయితీ విడుదల అవుతుంది. 34 వృత్తి పనిదారుల సహకార సంఘాలకుగాను రూ. 6 కోట్ల 49 లక్షల 15వేలు విడుదల అవుతాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1890 మంది ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా జిల్లాలో రాయితీని పొందనున్నారు. 2013 -14 సంవత్సరంలో ఎంపిక చేసిన లబ్ధిదారులను ఈ జీవోతో తిరిగి మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బీసీ రాయితీ ఫైల్పై జిల్లా కలెక్టర్ డి.రోనాల్డ్రోస్ , బీసీ కార్పొరేషన్ అధికారి సత్యనారాయణ , నిజామాబాద్తో పాటు మూడు మున్సిపాలిటీ కమిషనర్ల సంతకాలు అయిపోయినప్పటికీ బ్యాంకుల నుంచి అకౌంట్లు తీసుకువస్తేనే రుణమంజూరు అంటూ మళ్లీ అధికారులు బీసీ లబ్దిదారులకు మెలికపెట్టారు. దీంతో రుణమంజూరు ఎంతకాలం పడుతుందోనని, ఆ తర్వాత మరెలాంటి ఉత్తర్వులు వస్తాయోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. -
ఐతే ఓకే
నూతన పారిశ్రామిక విధానానికి మంత్రి మండలి ఆమోదం సాక్షి, బెంగళూరు : నూతన పారిశ్రామిక విధానానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌధలో గురువారం జరిగిన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఫలితంగా రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 15 లక్షల మందికి ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి రంగాలలో విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయి. మంత్రి మండలి నిర్ణయాలను మీడియా సమావేశంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర వెల్లడించారు. నూతన విధానంలో ఉత్పాదన రంగానికి పెద్ద పీట వేసి ఇందులో 20 శాతం అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014 నుంచి 2019 వరకూ అమల్లో ఉండే ఈ నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా రూ.5 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగాల కల్పనలో స్థానికులకు పెద్ద పీట వేయనుంది. రాష్ట్రంలోని మొత్తం తాలూకాలను ఆరు జోన్లుగా విభజించడం ద్వారా స్థానికతకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు, రాయితీలు తదితర విషయాల్లో పారదర్శకత పెరుగనుంది. పరిశ్రమలు స్థాపించే ప్రాంతం, పెట్టుబడి పరిమాణాన్ని పరిగణలోకి తీసుకుని వడ్డీ రహిత రుణాలు ఇవ్వడంతో పాటు ఏడు నుంచి 14 శాతం వరకు వ్యాట్ నుంచి మినహాయింపు కూడా ఇవ్వనున్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహించే దిశగా ఆరహళ్లి, హుబ్లీ - ధార్వాడల్లో ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం భూములు ఇచ్చే కుటుంబంలో అర్హులైన ఒకరికి తప్పక ఉద్యోగం కల్పించడాన్ని చట్టబద్ధం చేయనున్నారు. మాతా శిశుమరణాలను అరికట్టడంలో భాగంగా రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మాత్రం అమల్లో ఉన్న ‘మడలు’ పథకాన్ని మిగిలిన అన్ని జిల్లాలకు విస్తరించడానికి మంత్రిమండలి అంగీకరించింది. రాష్ట్రంలో నూతనంగా మూడు ప్రైవేట్ వైద్య కళాశాలకు అనుమతి లభించింది. హగరి నదిపై వంతెన నిర్మాణానికి అవసరమైన రూ.33.69 కోట్ల నిధుల విడుదలకు కూడా మంత్రి మండలి ఆమోదం దక్కింది. -
వెనుకబాటు
స్వయం ఉపాధి కల్పనలో లక్ష్యానికి దూరంగా మెప్మా - నిర్దేశించిన లక్ష్యం 600 యూనిట్లు - ఏర్పాటు చేసిన యూనిట్లు 179 - ఈ ఏడాది నుంచి ఎస్జేఎస్ఆర్ రద్దు - ఎన్ఎల్యూఎం పేరిట అమల్లోకి సబ్సిడీ లేని కొత్త పథకం సాక్షి, కర్నూలు: పట్టణ ప్రాంతాల్లోని పొదుపు గ్రూపు సభ్యులకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా వ్యక్తిగత, సామూహిక రుణాల అందజేతలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వెనుకబడింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.6 కోట్లతో స్వయం ఉపాధి పథకం(యూఎస్ఈపీ) కింద జిల్లాలోని నగరపాలక సంస్థ, తొమ్మిది పురపాలక సంస్థల్లో 600 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యం. అయితే ఇప్పటి వరకు 179 యూనిట్లు మాత్రమే నెలకొల్పడం గమనార్హం. అదేవిధంగా సంఘం మొత్తానికి అర్బన్ ఉమెన్ సెల్ఫ్ ప్రోగ్రాం(యూడబ్ల్యుఎస్పీ) కింద ఆరు యూనిట్లకు గాను ఎమ్మిగనూరులో ఐదు, కర్నూలులో ఒక్కటి మాత్రమే ఏర్పాటు చేయించగలిగారు. కర్నూలు, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు మినహా మిగిలిన ఆరు పురపాలక సంస్థల్లో లక్ష్యానికి అనుగుణంగా దరఖాస్తులు కూడా అందని పరిస్థితి నెలకొంది. బ్యాంకర్లు అంగీకార పత్రాలు ఇవ్వకపోవడం.. యూనిట్ల స్థాపనలో స్పష్టమైన విధానాన్ని లబ్ధిదారులు పాటించకపోవడం.. ఈ విషయంలో మెప్మా సిబ్బంది సలహాలు, సూచనలను అందివ్వలేకపోవడం అందుకు కారణమవుతోంది. స్వయం ఉపాధి పథకాలకు రూ.25 వేల వరకు రాయితీ లభిస్తోంది. సంఘాల ద్వారా పొందే రుణాలకు రూ.3 లక్షల వరకు రాయితీ ఉంటుంది. ఈ రెండు పథకాలకు సంబంధించి పురపాలక సంస్థల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన పురోగతి పరిశీలిస్తే ఆ శాఖ పనితీరు ఇట్టే అర్థమవుతోంది. మొత్తం రూ.6 కోట్ల వ్యయంతో 606 యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా.. నిధుల లేమి కారణంగా 179 యూనిట్లు (29.53 శాతం) మాత్రమే స్థాపించగలగడం గమనార్హం. ఇదిలా ఉండగా స్వర్ణ జయంతి సహరీ రోజ్గార్(ఎస్జేఎస్ఆర్) పథకాన్ని ఈ ఏడాది నుంచి కేంద్రం రద్దు చేసింది. దీంతో ఈ పథకం ద్వారా మెప్మా పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు యూఎస్ఈపీ కింద వ్యక్తిగత, సామూహిక రుణాల మంజూరు నిలిచిపోనుంది. అయితే కొత్తగా నేషనల్ అర్బన్ లైవ్లీవుడ్ మిషన్(ఎన్ఎల్యూఎం) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎస్జేఎస్ఆర్ తరహాలో ఈ పథకం కింద రుణాలు పొందే లబ్ధిదారులకు సబ్సిడీ వర్తించదు. కేవలం తక్కువ వడ్డీకి మాత్రమే రుణాలను అందజేస్తారు. ఈ కొత్త పథకం 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేవలం కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఆదోని, నంద్యాల మున్సిపాలిటీల్లోని స్వయం సహాయక సంఘాలకు మాత్రమే వర్తింపజేయనున్నారు. వ్యక్తిగతంగా 1,038.. సామూహికంగా 14 యూనిట్లకు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. నిధుల సమస్య ఉంది ఈ ఏడాది రూ.6 కోట్ల నిధులు కేటాయించగా ప్రభుత్వం మూడు విడతల్లో రూ.70 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. వచ్చిన నిధులను మంజూరైన యూనిట్లకు కేటాయించాం. నిధుల సమస్యను సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రభుత్వానికి నివేదించాం. ఈలోగా రాష్ట్ర విభజన జరగడంతో నిధుల సమస్య తలెత్తింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. - రామాంజనేయులు, పీడీ, మెప్మా -
స్వయం ఉపాధికి ప్రోత్సాహం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. స్వయం ఉపాధి యునిట్లపై ఇప్పటివరకిచ్చిన రాయితీని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో జిల్లాలోని 17,994 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ నిరుద్యోగులు దాదాపు రూ.80కోట్ల మేర లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 65వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కలెక్టర్ ప్రసంగించారు. అవి ఆయన మాటల్లోనే... భూమిలేని నిరుపేదలకు సాగుభూమి కల్పించే భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 666మంది పేదలకు 1,106 ఎకరాల భూమిని పంపిణీ చేసి పట్టా సర్టిఫికెట్లు అందజేశామన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు జిల్లాలో 2లక్షల మంది పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మూడు విడతల కింద 2,63,820 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు పావలా వడ్డీపై రూ.537కోట్ల పంట రుణాలు విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. పేద రైతులకు 74వేల వ్యవసాయ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చామన్నారు. 400కేవీ సామర్థ్యం గల 3సబ్స్టేషన్లు, 132కేవీ సామర్థ్యంగల 2సబ్స్టేషన్లు, 220కేవీ సామర్థ్యం గల ఒక సబ్స్టేషన్, 33 కేవీ సామర్థ్యం గల 9సబ్స్టేషన్లు కొత్తగా నిర్మించామన్నారు. ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం అమలుచేస్తున్న బంగారు తల్లి పథకంతో జిల్లాలో 42వే ల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. స్త్రీనిధి పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 24వేల మంది మహిళలకు రూ.41కోట్ల రుణాలు అందించామన్నారు. అభయహస్తం పథకంతో జిల్లాలో 10వేల మంది సభ్యులకు ప్రతి నెల రూ.500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి, ఎస్పీ రాజకుమారి, డీసీపీ కాంతిలాల్ రాణా తదితరులు పాల్గొన్నారు.