ఏజెన్సీ నుంచి లండన్‌ దాకా.. | Economic development of tribal women of Bhadrachalam through self employment | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ నుంచి లండన్‌ దాకా..

Jun 30 2025 3:19 AM | Updated on Jun 30 2025 3:19 AM

Economic development of tribal women of Bhadrachalam through self employment

బిస్కెట్లు తయారు చేస్తున్న గిరిజన మహిళ

స్వయం ఉపాధితో భద్రాచలం గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధి 

శానిటరీ ప్యాడ్‌లు, ఆర్గానిక్‌ మిల్లెట్స్‌ బిస్కెట్ల తయారీ

భద్రాచలం : కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్న గిరిజన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతమయ్యారు. ఏజెన్సీ నుంచి ప్రారంభమైన వీరి వ్యాపారం లండన్‌ వరకూ విస్తరించింది. ప్రధాని మోదీ ‘మన్‌కీబాత్‌’లో భద్రాచలం గిరిజన మహిళల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. 

ఏడేళ్ల క్రితం ప్రారంభం.. 
భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వయం శిక్షణ కింద ఏడేళ్ల క్రితం ఓ ప్రత్యేక ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. గిరిజన మహిళ ఊకే వెంకటలక్ష్మి మరో ఏడుగురితో కలిసి శిక్షణ తీసుకుంది. అనంతరం రూ.5 లక్షల పెట్టుబడితో శానిటరీ నాప్‌కిన్‌ తయారీని ‘భద్రాద్రి శ్రీరామ్‌ జేఎల్‌ గ్రూప్‌’అనే సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌తో ప్రారంభించారు. 

ఐటీడీఏ ప్రాంగణంలోని ఓ భవనాన్ని అధికారులు వీరికి కేటాయించారు. మిషనరీతో తయారీ ప్రారంభించిన కొద్ది కాలంలోనే కరోనా వచ్చింది. దీంతో వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ కోవిడ్‌ కాలం పూర్తయ్యాక మొక్కవోని ధైర్యంతో శానిటరీ ప్యాడ్‌ల తయారీ ప్రారంభించారు. ఐటీడీఏ సహకారం తోడవడంతో ప్యాడ్‌లను గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, కళాశాలల్లో బాలికలకు సరఫరా చేశారు. నాడు నెలకు 100 ప్యాడ్‌లతో ప్రారంభం కాగా, ప్రస్తుతం 40 వేలకు చేరింది. 

ఆర్గానిక్‌ మిల్లెట్‌ బిస్కెట్ల తయారీతో...
వెంకటలక్ష్మి మదిలో మరో ఆలోచన ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ దినుసులతో ఆర్గానిక్‌ మిల్లెట్‌ బిస్కెట్ల తయారీని ప్రారంభించాలనుకుంది. మరో ముగ్గురు సభ్యులతో కలిసి అప్పటి ఐటీడీఏ పీఓ గౌతమ్‌ పొట్రు దృష్టికి తీసుకెళ్లగా ఆయన తగిన శిక్షణతో పాటు బ్యాంకు లోన్‌ కూడా ఇప్పించారు. ఇలా ‘భద్రాద్రి మిల్లెట్‌ మ్యాజిక్‌’పేరిట బిస్కెట్ల తయారీని ప్రారంభించారు. కొర్రలు, రాగులు, జొన్న, సామలతో రకరకాల బిస్కెట్లను తయారు చేసి అమ్మకం ప్రారంభించారు. మైదా, పంచదార లేకుండా పూర్తిగా ఆర్గానిక్‌తో తయారు చేయడం వీరి ప్రత్యేకత. బెల్లం, నెయ్యి, బటర్‌లతో తయారు చేసిన బిస్కెట్లు అనతికాలంలో అందరికీ నచ్చాయి. 

ఐటీడీఏ పీఓల సహకారంతో..
గౌతమ్‌ పొట్రు తర్వాత పీఓగా వచ్చిన రాహుల్‌ మార్కెటింగ్‌పై తగిన శ్రద్ధ చూపి పలుచోట్ల కౌంటర్లు ఇప్పించారు. దీంతో వ్యాపారం విస్తరించింది. భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం వద్ద, పట్టణంలోని పలుచోట్ల, ఐటీడీఏ, గిరిజన మ్యూజియంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ శిల్పారామం, ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌తోపాటు ఇతర ముఖ్య కేంద్రాల్లోనూ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. సుదూర ప్రాంతాలకు కార్గో ద్వారా సైతం ఆర్డర్లతో సరఫరా చేస్తున్నారు. ఎన్‌ఐఆర్‌ల ద్వారా లండన్‌కు సైతం వీరి బిస్కెట్లు పలుమార్లు చేరాయి. 

అందరి సహకారం మరువలేనిది
మొదట ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఐటీడీఏ పీఓలు, కుటుంబసభ్యుల సహాయ సహకారా లతో ముందుకొచ్చాం. గ్రూప్‌లో ప్రతీ మహిళ ఐదంకెల జీతంతో సమానంగా సంపాదిస్తున్నాం. ప్రధాని మోదీ మమ్మల్ని మెచ్చుకోవడం మరింత స్ఫూర్తినిచ్చింది. కొత్తగా ఆలోచించి ఇంకా ముందుకెళ్లాలని ఉంది.  – ఊకే వెంకటలక్ష్మి,  గ్రూప్‌ లీడర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement