సర్కార్‌పై మాకు నమ్మకం లేదు | Telangana High Court Serious On Hydra: Telangana | Sakshi
Sakshi News home page

సర్కార్‌పై మాకు నమ్మకం లేదు

Jul 24 2026 6:13 AM | Updated on Jul 24 2026 6:13 AM

Telangana High Court Serious On Hydra: Telangana

లోతుకుంట భూ వివాదంలో ఆర్మీని పిలవక తప్పడం లేదన్న హైకోర్టు 

కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో హైడ్రా కమిషనర్‌ తీరుపై ఆగ్రహం  

అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ హామీతో ఉత్తర్వుల తాత్కాలిక నిలుపుదల  

అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ విచారణ నేటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తిలో తమ ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయవ్యవస్థకు నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోర్టు ఉత్తర్వుల అమలు కోసం సైన్యాన్ని రంగంలోకి దింపాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలానికి రక్షణగా 10 మంది ఆర్మీ సిబ్బందిని నియమించాలని, ఉత్తర్వులు ఉల్లంఘించి వచ్చే హైడ్రా, దాని కమిషనర్, ఇతర అధికారులను అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

24వ తేదీకల్లా (నేడు) ఆర్మీ అధికారుల జాబితాను అందజేయాలని రిజిస్ట్రార్‌ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదన్న స్పృహ కోర్టుకు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం లేకపోవడంతో ఇలా ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తోందని చెప్పింది. అలాగే, బయట ఏం జరుగుతుందో కోర్టులోని వారికి కూడా తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

 గతంలో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు, హైడ్రా తరఫున కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ అధికారులు ప్రైవేట్‌ భూమిలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ శాంత శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.నరసయ్య మరో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరై పిటిషనర్‌ భూమిలోకి హైడ్రా అధికారులు వెళ్లరని హామీ ఇచ్చారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సంబంధిత అధికారి అఫిడవిట్‌ దాఖలు చేస్తే పరిశీలిస్తామని విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.  

ఎవరొచ్చినా బ్యారక్స్‌కు తరలించండి.. 
పిటిషనర్‌ తరఫు న్యాయవాది హరీశ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ స్థలంలోకి వెళ్లబోమని హైడ్రా కమిషనర్‌ హామీ ఇచ్చినా దానికి కట్టుబడి ఉండలేదన్నారు. ఈ నెల 20న కోర్టు ఆదేశాల మేరకు హాజరైన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పిటిషనర్‌ స్థలంలోకి జోక్యం చేసుకోలేదని హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత కూడా 21న పిటిషనర్‌ పునరుద్ధరణ పనులు చేపట్టగా హైడ్రా అధికారులు, పోలీసులతో సహా వచ్చి పనుల్లో జోక్యం చేసుకుని బెదిరించారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి..హైడ్రా కమిషనర్‌ చట్టం కంటే తానే గొప్పవాడినని భావిస్తూ, కోర్టు ఆదేశాలను మూడుసార్లు ఉల్లంఘించారన్నారు. 

కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించినందుకు, ఇకపై ఉల్లంఘిస్తే.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను అవసరమైతే సైన్యం అదుపులోకి తీసుకుని, బ్యారక్స్‌లో ఉంచాలని ఆదేశించవచ్చన్నారు. సచివాలయంలో కూర్చున్న వారికి కూడా ఏమి జరుగుతుందో తెలియాలని పేర్కొన్నారు. ఈ వివాదాస్పద (ప్రైవేటు) స్థలం రక్షణ కోసం పది మంది అర్మీ సిబ్బందిని సిద్ధం చేయాలంటూ ఫైర్‌ డివిజన్‌లోని అత్యున్నత బ్రిగేడియర్‌ను సంప్రదించాలని రిజిస్ట్రార్‌ జనరల్‌కు ఆదేశాలు జారీ చేశారు. 

ఆరీ్మకి అడ్డు వస్తే హైడ్రాతో సహా ఎవరు వచ్చినా అదుపులోకి తీసుకుని బ్యారక్స్‌కు తరలించాలని, వాహనాలను కూడా సీజ్‌ చేయాలని చెప్పారు. ఈ ఉత్తర్వుల కాపీని కేంద్రానికి కూడా పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ దశలో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌.. ఒక్క అవకాశం ఇవ్వాలని, ఆ స్థలంలో జోక్యం చేసుకోరని చెప్పారు. ఏఏజీ హామీతో ఉత్తర్వులను న్యాయమూర్తి తాత్కాలికంగా నిలుపుదల చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement