తీవ్ర ఎండలతో గర్భస్థ శిశువులకు ప్రమాదం | Extreme sun exposure poses danger to pregnant women | Sakshi
Sakshi News home page

తీవ్ర ఎండలతో గర్భస్థ శిశువులకు ప్రమాదం

Jul 24 2026 4:44 AM | Updated on Jul 24 2026 4:44 AM

Extreme sun exposure poses danger to pregnant women

ముందస్తు ప్రసవాలు, తక్కువ బరువుతో శిశువులు పుట్టే అవకాశం 

ఐఐటీ ఢిల్లీ–యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌ల్యాండ్‌ అధ్యయనంలో వెల్లడి 

గర్భిణులను హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌లో ప్రాధాన్య వర్గంగా చేర్చాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌: గర్భిణులు వరుసగా 3–4 రోజులపాటు తీవ్ర ఎండల బారినపడితే గర్భంలోని శిశువు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని దేశవ్యాప్తంగా జరిగిన ఓ తాజా అధ్యయనం హెచ్చరించింది. తీవ్ర వేడికి గురయ్యే గర్భిణులకు తొలి త్రైమాసికంలో ముందస్తు ప్రసవ ప్రమాదం పెరుగుతుందని.. రెండో త్రైమాసికంలోనూ అదే పరిస్థితి కొనసాగితే తక్కువ బరువుతో శిశువులు జన్మించే అవకాశం ఎక్కువ అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు ఐఐటీ ఢిల్లీకి చెందిన అకాడమీ ఆఫ్‌ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌ల్యాండ్‌ సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయన వివరాలను ఎన్విరాన్‌మెంటల్‌ రీసెర్చ్‌ కమ్యూనికేషన్స్‌ అనే అంతర్జాతీయ జర్నల్‌ ప్రచురించింది. 

దేశంలో గర్భిణులపై తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావాన్ని విశ్లేషించిన తొలి అధ్యయనం ఇదేనని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా 2015 నుంచి 2020 మధ్య దేశవ్యాప్తంగా నమోదైన 2,09,266 ప్రసవాలను ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలతో అనుసంధానించి విశ్లేషించారు. గర్భధారణ కాలంలో నమోదయ్యే ప్రతి అదనపు డిగ్రీ తీవ్రమైన ఎండల వల్ల శిశువులు తక్కువ బరువుతో జన్మించే అవకాశం సుమారు ఒక శాతం చొప్పున పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఆయా ప్రాంతాల దీర్ఘకాలిక వాతావరణ సగటుతో పోల్చి, ఇండియా హీట్‌ ఇండెక్స్‌ 90వ శాతానికి మించిన రోజులను పరిశోధకులు ‘ఎండ తీవ్రత రోజులు’గా పరిగణించి విశ్లేషించారు. 

నిరక్షరాస్య మహిళలపై మరింత ప్రభావం 
చదువుకోని లేదా ప్రాథమిక విద్య మాత్రమే అభ్యసించిన మహిళల్లో తీవ్ర ఎండల ప్రభావం మరింత ఎక్కువగా కనిపించినట్లు అధ్యయనం పేర్కొంది. పేదరికం, పోషకాహార లోపం, బహిరంగ వాతావరణంలో పని చేయాల్సిన పరిస్థితులు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఎండల్లో పనిచేసిన గర్భిణులకు తక్కువ బరువుతో శిశువులు జన్మించడం లేదా మృత శిశువులను ప్రసవించడం వంటి ప్రతికూల పరిస్థితులు అధికంగా నమోదైనట్లు గుర్తించారు. 

గర్భిణులకు ప్రత్యేక రక్షణ అవసరం 
ప్రతి అదనపు తీవ్రమైన వేడి రోజు వల్ల పెరిగే ప్రమాదం ప్రజారోగ్య సమస్యగా మారుతుందని అధ్యయన ప్రధాన రచయిత వినీతా విన్సెంట్‌ అభిప్రాయపడ్డారు. తీవ్ర ఎండలకు ఎక్కువగా గురయ్యే పేద, నిరక్షరాస్య, పోషకాహార లోపంతో ఉన్న గర్భిణుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు అవసరమని ఈ అధ్యయన సహ రచయిత, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్‌ సాగి్నక్‌ దే సూచించారు. వాతావరణ మార్పులతో దేశంలో తీవ్రమైన వేడి రోజులు పెరుగుతున్న నేపథ్యంలో గర్భిణులను హీట్‌ యాక్షన్‌ ప్రణాళికల్లో ప్రాధాన్య వర్గంగా గుర్తించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడం అత్యవసరమని అధ్యయనం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement