నీళ్లు ఎత్తాలో.. వద్దో రాష్ట్రమే తేల్చాలి | Union Minister CR Patil with Telangana BJP MPs | Sakshi
Sakshi News home page

నీళ్లు ఎత్తాలో.. వద్దో రాష్ట్రమే తేల్చాలి

Jul 24 2026 4:23 AM | Updated on Jul 24 2026 4:23 AM

Union Minister CR Patil with Telangana BJP MPs

‘కాళేశ్వరం’ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతల అంశం మా పరిధిలో లేదు 

రాష్ట్రం కోరితే సాంకేతిక సహాయం మాత్రం అందిస్తాం 

తెలంగాణ బీజేపీ ఎంపీలతో కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌

మరమ్మతులు చేయకుండా మూడేళ్లపాటు రేవంత్‌ సర్కారు చోద్యం చూసిందన్న ఎంపీలు 

మంత్రి ఉత్తమ్‌ బీఆర్‌ఎస్‌లో సభ్యుడు, ఆయన ఆల్‌పార్టీ మెంబర్‌: అర్వింద్‌

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోయాలో, లేదో కేంద్రం నిర్ణయించజాలదని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మరమ్మతులు అవసరమైన మేడిగడ్డ సహా ఇతర బరాజ్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసే అంశం కేంద్ర పరిధిలోనిది కాదని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు గురువారం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందర్‌రావు, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, గోడం నగేశ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, సీనియర్‌ నేత వకులాభరణం కృష్ణమోహన్‌లు పాటిల్‌తో సమావేశమయ్యారు. 

రాష్ట్ర నేతలు ఎన్‌డీఎస్‌ఏ నివేదికలపై పాటిల్‌ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వాస్తవ పరిస్థితులను ఇప్పటికే ఎన్‌డీఎస్‌ఏ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయాలను తెలుపుతూ, అందులో ప్రస్తావించిన అంశాలను వివరించారు. బరాజ్‌లకు అవసరమైన మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని, ఇందులో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నట్లు తెలిసింది. రాష్ట్రం తమ యంత్రాంగంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నట్లు తెలిసింది.

మరమ్మతులు, నీటి ఎత్తిపోతలపై రాష్ట్రం నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే మాత్రం తమ విభాగాల తరఫున సాంకేతిక సహాయాన్ని అందిస్తామన్నట్లు సమాచారం. ఇదే సమయంలో బరాజ్‌ల మరమ్మతుల పనులను మూడేళ్లుగా చేయకుండా రాష్ట్రం అలక్ష్యం చేశారంటూ రాష్ట్ర ఎంపీలు చెప్పినట్లు తెలుస్తోంది. బరాజ్‌ల నిర్మాణంలో కేసీఆర్‌ ప్రభుత్వం తప్పు చేస్తే.. మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం మరో తప్పిదం చేసిందనే అభిప్రాయాలు సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. గత, ప్రస్తుత ప్రభుత్వాలు తప్పుచేసి, ఆ నిందను కేంద్రంపై మోపే కుట్రలు చేస్తున్నారని ఎంపీలు చెప్పగా, అలాంటి ప్రయత్నాలను అడ్డుకొని, వాస్తవాలను ప్రజలకు తెలపాలని పాటిల్‌ సూచించినట్లు తెలిసింది.  

మరమ్మతుల్లో జాప్యం రాష్ట్రానిదే: అర్వింద్‌ 
కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశం అనంతరం ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘మేడిగడ్డ బరాజ్‌ మరమ్మతుల జాప్యానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కారణం. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన రూ.లక్ష కో ట్లపై సమగ్ర దర్యాప్తు జరగాలి. 

కేసీఆర్, కేటీఆర్‌ దగ్గర రేవంత్‌ ఎంత మింగారు? ప్రాజెక్టులో దోచుకున్న దాంట్లో రాహుల్‌ గాందీకి ఎంత ఇచ్చారు?’అని ఆరోపించారు. ‘మంత్రి ఉత్తమ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లోనూ సభ్యుడే, కాంగ్రెస్‌లో కూడా సభ్యుడు, మంత్రి. ఈయన ఆల్‌పార్టీ మెంబర్‌’అంటూ ఎద్దేవా చేశారు. రఘునందన్‌ రావు మాట్లాడుతూ... ‘పొట్టోడు, పొడుగోడు కలిసి రైతుల కడుపు కొడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంత్‌ రెడ్డి ఇద్దరూ దోషులే’అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement