దేశ వ్యతిరేక శక్తులతో కలిసి కాంగ్రెస్, లెఫ్ట్ కుట్రలు
ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన ప్రవేశపరీక్షల పత్రాల లీకేజీలను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, వామపక్ష పారీ్టలు రాజకీయ మనుగడ కోసం అరాచకాలకు పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులను కవచంగా వాడుకుంటూ దేశ వ్యతిరేక శక్తులు, తుక్డే గ్యాంగులతో కలిసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ షహీన్బాగ్ తరహాలో దేశంలో అలజడి సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
నీట్ లీకేజీపై తక్షణ చర్యలు తీసుకున్నాం...
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 17 మందిని సీబీఐ అరెస్టు చేసిందని కిషన్రెడ్డి వెల్లడించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం ద్వారా దోషులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారన్నారు. రెండోసారి పకడ్బందీగా పరీక్ష నిర్వహించామని.. విద్యార్థులంతా సంతోషంగా ఉన్నారని కిషన్రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే పార్లమెంటులో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చకు రావాలని కిషన్రెడ్డి సవాల్ విసిరారు.
టెన్త్ పేపర్ లీకైనప్పుడు రేవంత్ రాజీనామా చేయలేదేం?
గతంలో కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగినా ఏనాడూ బాధ్యత వహించని నేతలు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ రాజీనామాను డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డిలకు రాజీనామాలు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. 2025లో టెన్త్ పేపర్ లీక్ అయినప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. 2026లో జగిత్యాలలోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు కాంగ్రెస్ మంత్రులతో రాజీనామా చేయించారా అని నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పాకే రేవంత్రెడ్డి నీట్ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.


