సాక్షి, ఢిల్లీ: పేపర్ లీకేజీల నిరసనలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన మరుసటి రోజే, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ను తన నిరాహార దీక్షను విరమించాలని కోరారు. వాంగ్చుక్కు తన ఇంటి నుంచి వండిన భోజనాన్ని పంపుతానని.. పేపర్ లీకేజీలపై ప్రధానమంత్రి ఇప్పటికే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందున నిరసన తెలుపుతున్న విద్యార్థులను కూడా తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
సల్మాన్ మాటల్లో "సోనమ్, ఇంకా చాలు బ్రో. దీన్ని ఇంకా పొడిగించవద్దు. అత్యవసరమైతే ఆ పట్టుదలను మరొక దాని కోసం ఉంచుకోండి—అయినా ఇప్పుడు దానికి అవసరం లేదనే భావిస్తున్నాను. ఏదైనా తినండి. నీకు కావాలంటే మా ఇంటి నుంచే భోజనం పంపిస్తాను" అని సల్మాన్ సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు.
చదువు పరంగా, భద్రత పరంగా విద్యార్థులే దేశానికి మొదటి ప్రాధాన్యత అని, ప్రధాని నుంచి ఇప్పటికే హామీ లభించినందున వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సల్మాన్ నొక్కి చెప్పారు.
"విద్యాపరంగా, భద్రత పరంగా విద్యార్థులే అత్యున్నత ప్రాధాన్యత. కాబట్టి వారు భయపడాల్సిన పనిలేదు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదు. గౌరవనీయ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. ఈ లీకేజీకి బాధ్యులైన వారందరిపై ఆయన కఠిన చర్యలు తీసుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి విద్యార్థులారా, దయచేసి మీ ఇళ్లకు, మీ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లండి" అని సల్మాన్ తెలిపారు.
రాజకీయ హైజాక్
బాలీవుడ్ స్టార్ అంతకుముందు కూడా విద్యార్థుల నిరసనకు మద్దతు తెలపడమే కాకుండా, వారి ఉద్యమాన్ని ఎవరూ 'హైజాక్' చేయకూడదని హెచ్చరించారు. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఆయన విద్యార్థులు చేపట్టిన "శాంతియుత" నిరసనను ప్రశంసించడమే కాకుండా, వారిని "ధైర్యవంతులు, సాహసవంతులు" అని కొనియాడారు.
"ఈ సమస్య విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మధ్య ఉన్నది. దీనిని రాజకీయంగా హైజాక్ చేయకూడదు. దీని శ్రేయస్సు అంతా మన దేశ విద్యార్థులకే దక్కాలి. ప్రభుత్వం కూడా వారికి పూర్తి మద్దతు ఇచ్చి, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది అందరికీ మంచి జరిగే పరిస్థితి. అనుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. చదువుకోవాలనుకునే మీ అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక" అని ఆయన అంతకుముందు రాసుకొచ్చారు.
కాగా పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ తన నిరాహార దీక్షను విరమింపజేశారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా అతనికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.


