నీట్పై హైదరాబాద్లో ఎందుకు ఆందోళన చేయలేదు?
ప్రధాని మోదీ అంటే రేవంత్రెడ్డికి భయం
కేంద్రంతో సఖ్యతతో ఉంటూ కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారు
ప్రజా సమస్యలపై అంశాల వారీగా ఉద్యమాలకు బీఆర్ఎస్ సిద్ధం
త్వరలో పాదయాత్ర తేదీలు, వివరాలు ప్రకటన
మీడియాతో చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: నీట్ పరీక్ష ఉదంతంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోదీ పేరును ప్రస్తావించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంపై రాజ్ భవన్ ముందు ధర్నా చేయాల్సిందిపోయి కొడంగల్లో ధర్నా చేయడం రాజకీయ నాటకమేనన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, మంత్రులు హైదరాబాద్లో ధర్నా చేస్తే ఆయన కొడంగల్కు పోయి అక్కడ ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు.
‘మోదీ అంటే రేవంత్కు భయం. ఆయన పగలు కాంగ్రెస్తో ఉంటాడు. రాత్రయితే బీజేపీతో కలుస్తాడు..’అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు ఒక మూట ఇస్తే బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడని ఆరోపించారు. సీఎంపై ఉన్న పాత కేసులను బీజేపీ ప్రభుత్వం తోడుతుందనే ఉద్దేశంతోనే ప్రధాని పేరును కూడా పలకడానికి భయపడుతున్నాడని విమర్శించారు. గురువారం హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు
‘ఇది మూటలు పంపే పాలన. ప్రజలకు ఉపయోగపడే ఏ పని రేవంత్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టులను తన బంధువులకు ఇప్పించుకుంటున్నారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు. ఆయన బామ్మర్ది సృజన్రెడ్డికి మేలు జరిగే విధంగా వ్యవహరించారు.
కన్నెపల్లి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయరు?
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులేవీ కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయడం లేదు. ఆ పనులు పూర్తి చేస్తే మాకు పేరొస్తుందని సీఎం భయపడుతున్నారు. దేవాదుల నుంచి నీటిని లిఫ్ట్ చేసినప్పుడు కన్నెపల్లి నుంచి ఎందుకు నీటిని పంపిణీ చేయరు? కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయకుండా తాము ఆపలేదని, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు..’అని కేటీఆర్ అన్నారు.
నాలుగు పార్టీలు మారి హరీశ్రావుపై ఆరోపణలా?
‘హరీశ్రావు పార్టీ మారరు. బీఆర్ఎస్ పార్టీ లోనే తన పుట్టుక, చావు అని ఇప్పటికే పలుమార్లు హరీశ్రావు ప్రకటించారు. అయినా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. హరీశ్రావుపై నాలుగు పార్టీలు మారిన రేవంత్రెడ్డి కామెంట్ చేయడం విడ్డూరంగా ఉంది.
ఎవరితోనూ పొత్తులుండవు..
రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు. కవిత అంశంపై కూడా వ్యక్తులుగా కాకుండా వ్యవస్థలుగానే మాట్లాడతాం. కేసీఆర్ దయవల్లే మేమంతా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 179 వరకు పెరిగే అవకాశం ఉంది. పునర్విభజన వల్ల నా నియోజకవర్గం మారే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉండటమే నాకు ఎక్కువ సంతృప్తినిస్తోంది.
ప్రజా సమస్యలపై అంశాల వారీగా ఉద్యమాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతులు, నిరుద్యోగులతో సమావేశాలు నిర్వహించాం. త్వరలో ఇతర వర్గాలతో కూడా సమావేశాలు చేపడతాం. నిరుద్యోగం, యువత సమస్యలు, రైతుల ఇబ్బందులపై బీఆర్ఎస్ మరింత దూకుడుగా పోరాటాలు కొనసాగిస్తుంది. అలాగే వచ్చే ఏడాది పాదయాత్ర కూడా చేస్తా. త్వరలోనే తేదీలు, వివరాలు ప్రకటిస్తాం.
విద్యార్థుల ఆగ్రహం మోదీపైకి మళ్లింది..
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల ఆందోళనలు పెరుగుతున్నాయి. మొద ట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. దేశంలో యువత, నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తే దీనికి కారణం. మోదీ ప్రభుత్వం ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకుంది..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సీఎం పదవి వారసత్వ హక్కు కాదు..
‘ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. సీఎం పదవి అనేది వారసత్వ హక్కు కాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు, రాష్ట్ర సాధకుడు.. కేసీఆర్ కుమారుడిగా, ఈ తెలంగాణ బిడ్డగా రాష్ట్ర సాధన పోరాటంలో మమేకం అయినందుకు గర్వపడుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. పదవులు ప్రజల అభీష్టం మేరకు వస్తాయని, ప్రజలు ఏది కోరుకుంటే అదే అవుతుందని అన్నారు.


