కాంగ్రెస్‌ ఓట్లే లక్ష్యం.. 'సర్‌'తో బీజేపీ సర్కార్‌ కుట్ర: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Fires On BJP Govt About SIR | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఓట్లే లక్ష్యం.. 'సర్‌'తో బీజేపీ సర్కార్‌ కుట్ర: సీఎం రేవంత్‌

Jul 24 2026 2:11 AM | Updated on Jul 24 2026 5:25 AM

CM Revanth Reddy Fires On BJP Govt About SIR

అసెంబ్లీ సెంట్రల్‌ హాల్, ఇతర మరమ్మతు పనుల తీరును మ్యాపుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరిస్తున్న అధికారులు. చిత్రంలో మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్‌ తదితరులు

సర్‌ పేరుతో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కుట్ర: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

గ్రామాల్లో దళితులు, గిరిజనుల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నం 

ఓటు పోతే సంక్షేమ పథకాలకు కూడా ఇబ్బందులు 

ఎస్‌ఐఆర్‌కు ఆద్యుడు కేసీఆరే.. మీడియాతో సీఎం చిట్‌చాట్‌ 

జన్వాడ ఫామ్‌హౌస్‌ ఏ రాజుది?

ఏ రాజుకు గ్లోబరీనా సంస్థతో సంబంధం? 

నీట్‌ పేపర్‌ లీకేజీకి స్ఫూర్తి ‘కో ఎంప్ట్‌’గా పేరు మార్చుకున్న నాటి గ్లోబరీనా సంస్థ 

ఆ సంస్థతో సంబంధం లేకపోతే.. కేటీఆర్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తా

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌–సర్‌) పేరుతో కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘సర్‌’ పేరుకే ప్రక్షాళన అని, కాంగ్రెస్‌ ఓట్ల తొలగింపే టార్గెట్‌ అని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దళితులు, గిరిజనుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు కోల్పోతే సంక్షేమ పథకాల లబ్ధి పొందడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. గతంలో కేసీఆర్‌ హయాంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ నగరంలో లక్షల ఓట్లు తొలగించారని, ఎన్నికల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనను సంక్షేమ శాఖకు బదిలీ చేశారని విమర్శించారు. ఇప్పుడు చేస్తున్న ఎస్‌ఐఆర్‌కు ఆద్యుడు కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. గురువారం శాసనసభ ఆవరణలో జరుగుతున్న మరమ్మతు పనులను సీఎం పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ మీడి యా అడ్వైజరీ కమిటీ కార్యాలయంలో విలేకరులతో చిట్‌చాట్‌ చేశారు. 

ముందు ఓట్ల తొలగింపు.. తర్వాత సంక్షేమ పథకాలు 
‘పేదోడి ఓటు చాలా విలువైంది. ఓటు పోతే వారి జీవితం పోతుంది. అందుకే 3వ తేదీ వరకు మా నేతలకు హైదరాబాద్‌ రావొద్దని చెప్పా. సర్‌ ప్రక్రియ ఇప్పటివరకు 70 శాతం పూర్తయ్యింది. ఇంకా 30 శాతం ఉంది.. ఇదే కీలకం. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో బూత్‌ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) అత్యంత కీలక పాత్ర పోషించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలు, దళితులు, గిరిజనుల ఓట్లు పెద్దఎత్తున తొలగిపోయే ప్రమాదం ఉంది. కూలీ పనులకు వెళ్లేవారు, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పేదలంతా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వాళ్లే. బీఎల్‌ఓలు వచ్చినప్పుడు వాళ్లు ఇంట్లో లేకపోతే ఆ ఓట్లు పోయినట్టే. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న ఈ వర్గాల ఓట్లను తొలగించడం ద్వారా పార్టీని బలహీనపరచాలని కుట్ర జరుగుతోంది. ఓటు లేకపోతే ప్రజాస్వామ్య హక్కులు పోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.  

నాకు రెండు ఓట్లు లేవు.. 
‘కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పరస్పరం సహకరించుకుంటున్నాయి. నీట్‌ పేపర్‌ లీకేజీ నుంచి ఎస్‌ఐఆర్‌ వరకు రెండు పార్టీల వైఖరి అనుమానాలకు తావిస్తోంది. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. నాకు రెండు ఓట్లు ఉంటే బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. విచారణ చేసి తప్పు అయితే లోపల వేస్తారు. నేను స్వయంగా ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు పెట్టుకుని ఓటు కొడంగల్‌కు  మార్చుకున్నా.  

కాళేశ్వరం కేసులో సీబీఐ తన పని చేసుకుంటుంది..  
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎన్డీఎస్‌ఏ, పీసీ ఘోష్‌ కమిటీ నివేదికల ఆధారంగానే సీబీఐకి దర్యాప్తుకు అప్పగించాం. తప్పు చేసి ఉంటే తప్పించుకోలేరు. మేడిగడ్డ బరాజ్‌ గేట్లు తెరిచినా, పంప్‌హౌస్‌లు నడిచేపక్షంలో అవెందుకు కట్టారో చెప్పకుండా హరీశ్‌రావు చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్, బరాజ్‌ల నిర్మాణం, గేట్ల నిర్వహణపై నిపుణుల నివేదికలు స్పష్టంగా ఉన్నాయి. ఆ అంశాలపై బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడకుండా కన్నెపల్లి నుంచి నీటిని తరలించాలని కొత్త రాగం అందుకున్నారు. మేడిగడ్డ బరాజ్‌లో 5 టీఎంసీల నీళ్లు ఉన్నప్పుడే కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీటిని తరలించే అవకాశం ఉంది. అదే పద్ధతి అన్నారం, సుందిళ్లలో కూడా ఉంది. ఇవన్నీ జరగాలంటే మూడు బరాజ్‌ల గేట్లు మూయాలి. అవి మూస్తే బరాజ్‌ కూలుతుందని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టం చేసింది. దేవాదుల ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేస్తున్నాయి..’ అని రేవంత్‌ వివరించారు. 

జన్వాడ ఫామ్‌హౌస్‌ ఎవరిది? 
‘ఇంటర్మీడియెట్‌ పరీక్షల వ్యవహారంలో 25 మంది విద్యార్థుల మరణాలకు కారణమైందని ఆరోపణలు ఎదుర్కొన్న గ్లోబ్‌ అరెనా సంస్థ పేరు మార్చుకుని ప్రస్తుతం ’కో ఎంప్ట్‌’ గా చలామణి అవుతోంది. నీట్‌ పేపర్‌ లీకేజీకి స్ఫూర్తి నాటి గ్లోబ్‌ అరెనా సంస్థ చేసిన ఇంటర్‌ లీకేజీనే. జన్వాడ ఫామ్‌హౌస్‌ ఏ రాజు నుంచి వచ్చిందో...ఆ ఫామ్‌హౌస్‌కు, గ్లోబ్‌ అరెనా సంస్థ ‘రాజు’కు ఉన్న సంబంధమేంటో కేటీఆర్‌ చెప్పాలి. గ్లోబ్‌ అరెనా సంస్థ తనది కాదని కేటీఆర్‌ చెప్పే పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. ఇప్పటికే విజిలెన్స్‌ ద్వారా గ్లోబ్‌ అరెనా ఇంటర్‌ లీకేజీపై విచారణ జరుగుతోంది.  కేటీఆర్‌ ఫిర్యాదు చేస్తే సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దిగుతారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారి విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు. జైలుకు వెళ్తే సానుభూతి వచ్చి సీఎంలు అయ్యే పక్షంలో, ఎప్పుడో జైల్లో ఉన్న చార్లెస్‌ శోభరాజ్, బిల్లా రంగాలు కూడా పీఎంలు ఆయ్యే వాళ్లు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. 

‘ఇందిరమ్మ’ అదనపు ఖర్చు లబ్ధిదారులదే 
‘పేదల ఇళ్లకు రూ.5 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అందుకు అనుగుణంగానే భూమి ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంది. హైదరాబాద్‌లో ఇచ్చే లక్ష ఇళ్లకు కూడా ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంది. అదనపు ఖర్చు లబ్ధిదారులే చెల్లించాల్సి ఉంటుంది.  

సమర్ధవంతంగా హైడ్రా వ్యవస్థ 
హైడ్రా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది. చెరువులను పునరుద్ధరించి ప్రభుత్వ భూములను కాపాడుతోంది. ఉద్యోగాల భర్తీలో మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 55 రోజుల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే నియామకాల జాబితాను పేర్లతో సహా వెల్లడించడానికి సిద్ధం. నోటిఫికేషన్‌ ఇవ్వడం, ప్రశ్నపత్రం అమ్ముకోవడం వారి విధానమైతే, నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం మా విధానం. టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేయలేకపోయామని కేటీఆర్‌ ఒప్పుకున్నాడు. మేము ప్రక్షాళన చేయడమే కాకుండా పదేళ్ల తర్వాత గ్రూప్‌ –1 పరీక్షలు నిర్వహించాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement