ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షిస్తున్న మంత్రి పొంగులేటి
పేదలకు గౌరవ ప్రదమైన సొంతింటిని అందించడమే లక్ష్యం
ఇందిరమ్మ ఇళ్లలో 50 శాతం రిజర్వేషన్ల పద్ధతిలోనే కేటాయింపు
ఇందులో 30 శాతం మహిళలకే.. మిగతా జనరల్ కేటగిరీకి..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున పేదలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతంలోనే సొంతింటి కలను నెరవేర్చేందుకు నియోజకవర్గాన్ని యూనిట్గా ఎంపిక చేశామన్నారు. అక్కడే ఇందిరమ్మ టవర్స్ నిర్మించి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఈ ఇళ్ల కోసం స్థానికంగా అందుబాటులో ఉన్న మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీసేవ వాట్సాప్ నంబర్(8096958096), మీ సేవ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.60 లక్షల విలువ ఉండే ఒక ఫ్లాట్ను కేవలం రూ.6లక్షలకు మాత్రమే ఇస్తున్నామన్నారు.
గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, దరఖాస్తులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియలో రిజర్వేషన్లు పాటిస్తామని, అన్ని వర్గాలకు ఇళ్లు ఇచ్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొత్తం ఇళ్లలో 50శాతం ఇళ్లు రిజర్వేషన్ల పద్దతిలోనే కేటాయిస్తామని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని పనిని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. లబ్ధిదారుల మీద ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తోందని, ఇది విక్రయ ప్రక్రియ కాదని, ప్రభుత్వ ఆర్థిక సహకారం అని స్పష్టం చేశారు.
లబ్ధిదారుడి వాటా అన్ని ప్రాంతాల్లో రూ.6 లక్షలు మాత్రమే అని అన్నారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్లలో యాజమాన్య హక్కుల రిజర్వేషన్కు సంబంధించి ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్, 4వ తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10 శాతం చొప్పున మొత్తం 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. ఈ 50 శాతం రిజర్వేషన్లలో 30 శాతం మహిళలకే కేటాయిస్తున్నామని, మిగిలిన 50 శాతం వాటా జనరల్ కేటగిరీకి మంజూరు చేస్తామన్నారు.


