బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్/తిమ్మాపూర్/గన్నేరువరం: కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ మురళీధర్రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ ఈనెల 14వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఒంటిపై పెట్రోలు పోసుకున్న బేతెల్లి రాజేందర్రెడ్డి బుధవారం రాత్రి కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతని స్వగ్రామం గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాజేందర్రెడ్డి మరణానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ వంగల మురళీధర్రెడ్డే కారణమని, అతన్ని వెంటనే అరెస్టు చేయాలని నగరంలోని జిల్లా ఆస్పత్రి ఎదుట మృతుడి కుటుంబం, బంధువులు నిరసనకు దిగారు.
కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్కుమార్తోపాటు పోలీసులు వారితో మాట్లాడి పోస్టుమార్టం పూర్తయ్యాక రాజేందర్రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. గుండ్లపల్లి స్టేజీ రాజీవ్ రహదారిపై మరోసారి బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్కడ నుంచి మురళీధర్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముట్టడికి యత్నించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రాజేందర్రెడ్డి మరణానికి ఎమ్మెల్యే పీఏ మురళీధర్రెడ్డి వేధింపులే కారణమని, తన భర్తపై పలువురితో అక్రమ అట్రాసిటీ కేసు పెట్టించడంతోనే ప్రాణాలు తీసుకున్నాడని భార్య సమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసులో ఏ–1గా మురళీధర్రెడ్డితో పాటు మరో నలుగురిపై ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు.


