ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
హైదరాబాద్, పంజగుట్ట: ఓ ఔషధ సంస్థకు చెందిన చెక్కుపై రూ.55 కోట్లు రాసుకుని బ్యాంకును, ఔషధ సంస్థను మోసం చేసేందుకు యత్నించిన వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ అనే ఔషధ సంస్థకు బెంగళూరు కెనరాబ్యాంకులో అకౌంట్ ఉంది.
2024లో వీరి చెక్ బుక్ నిండిపోవడంతో కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేస్తూ పాత చెక్బుక్ లోని ఆఖరు చెక్కును సంతకం చేసి ఎలాంటి నగదు వివరాలు రాయకుండా దరఖాస్తుతో పాటు పొందుపర్చి బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఆ చెక్కును యూపీకి చెందిన జగత్సింగ్ అనే వ్యక్తి సేకరించి అందులో రూ.55 కోట్లు రాసుకుని సోమాజిగూడలోని కెనరాబ్యాంకులో ఉన్న తన ఖాతాకు బదిలీ చెసుకునేందుకు ప్రయత్నించాడు.
బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి సదరు ఔషధ సంస్థను సంప్రదించడంతో వారు ఈ చెక్కును తాము కొత్త చెక్కుబుక్ కోసం దరఖాస్తు చేస్తూ బ్యాంకులో ఇచ్చామని చెప్పడంతో నగదు బదిలీ ఆపారు. ఔషధ సంస్థ నిర్వాహకులు నగరానికి చేరుకుని గురువారం అసలు బ్యాంకులో సమర్పించిన తమ చెక్కు బయటకు ఎలా వచ్చిందో తెలుసుకోవడంతో పాటు.. దాన్ని డ్రా చేసుకునేందుకు యత్నించిన జగత్ సింగ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


