జీవితాన్ని మార్చే కొన్ని నిర్ణయాలు తగరతి గదుల్లోనో లేక పెద్ద పెద్ద సమావేశాల్లోనో కాదు భరింపరాని దుఃఖం నుంచి మొదలవుతుంది. మనకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయిన తీవ్ర దుఃఖం ఒకవైపు.. ఒక్కసారిగా మీదపడ్డ కుటుంబ బాధ్యతలు ఇంకోవైపు.. ఆ తరుణంలో తీసుకునే సరైన నిర్ణయాలే ఆ మనిషి గొప్పతనాన్ని చాటుతాయి. అందుకు నిదర్శమే ఈ గుజరాత్ ధీరవనిత కథ.
ఆ మహిళే గుజరాత్లోని కచ్ జిల్లాలో నివశిస్తున్న శాంతాబెన్. భర్త మరణంతో ఒక్కసారిగా పిల్లల చదువులు, కుటుంబాన్ని పోషించడం వంటి బాధ్యతలు ఆమె మీద పడిపోయాయి. అప్పటి వరకు ఇంటి పట్టున భర్త నీడలో బతికిన ఆమెకు ఒక్కసారిగా ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఎందుకంటే వ్యవసాయ పనులు గురించి గానీ, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలన్న దానిపై గానీ ఏ మాత్రం ఆలోచన, అవగాహన లేదు.
ఆ క్లిష్ట సమయంలో తనముందుకు ఉన్న ఒకే ఒక్క దారి.. కుటుంబానికి ఆధారమైన వ్యవసాయ క్షేత్రాన్ని భర్త తదనంతరం తానే స్వయంగా నిర్వహించడం ఒక్కటే. నిజానికి ఆ పనులు ఏవీ ఆమెకు తెలియదు. కనీసం వ్యవసాయ పనిముట్లు ఎలా వాడాలో కూడా తెలియదు. ప్రతీది నేర్చుకోవాల్సిందే. అయినా వెనకడుగు వేయలేదు. భావిని తవ్వడం నుంచి, ఎలాంటి ఎరువులు కొనాలి, ఎలాంటి పురుగులు మందులు ఉపయోగించాలి అన్నింటిని వేగంగా నేర్చుకుంటూ వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది.
అంతేగాదు ఆఖరికి 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్ని నడపడం కూడా స్వయంగా నేర్చుకుంది. అయితే ఇంతలా కష్టపడుతున్నా.. అప్పటికే ఇంటి మీద ఉన్న అప్పులు, కారణంగా కుటుంబ నిర్వహణ మరింత కష్టంగా మారిపోయింది. చెప్పాలంటే ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. ఇక ఉన్న ఆ ఒక్క పొలం అమ్మితే కానీ పరిస్థితి చక్కబడేట్లు కనిపించని దస్థితి. కానీ ఆమె ఆ సమయంలో ఎంతో సమన్వయంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
మొత్తం కుటుంబ సభ్యులు పొలాన్ని అమ్మేద్దామని అంటున్నా..అందుకు ఆమె నిరాకరించింది. తానే ఎలాగోలా కష్టపడి అప్పులు తీరుస్తాని హామీ ఇచ్చి మరీ.. వ్యవసాయం చేసేందుకే మొగ్గు చూపింది. అలా శాంతాబెన్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి ఏడింటి వరకు పొలంలోనే ఉంటూ కష్టపడేది. ఆమె కష్టానికి ఫలితం లభించింది.. పొలం చక్కగా పండటం మొదలైంది. దాంతో ముందుగా ఇంటి మీద ఉన్న అప్పులు తీర్చేసి, పిల్లలను చదివించడం మొదలు పెట్టింది. అప్పటి వరకు బ్యాంకు ఖాతా తెలియని ఆమె..తనలాంటి మహిళా రైతులకు బ్యాంకులు అప్పులు ఇస్తాయని తెలుసుకుని, దాని సాయంతో మరింతగా వివిధ రకాల పంటలు వేసి పండించి ఆదాయం గడించటం మొదలు పెట్టింది.
చివరికి పిల్లలను మంచి చదువులు చదివించే స్థాయికి చేరుకుని ఆదర్శంగా నిలిచింది. ఆమె కష్టానికి ఫలితంగా కుమారుడు సివిల్ ఇంజనీర్ అయ్యాడు. ఇప్పడు అతను అమ్మకు పొలంలో సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నాడు. శూన్యం నుంచి జీవితాన్ని మొదలు పెట్టి శిఖరాగ్రానికి చేరుకునేలా జీవితాన్ని అందంగా మలుచుకుంది శాంతాబెన్. విషాదం అనేది తన మిగిలిన జీవితానికి ముగింపు కాదని ధైర్యంగా ముందుకు సాగితే మంచి రోజులు ఉంటాయనే చెప్పే స్ఫూర్తిదాయక కథ ఆమెది. అంతేగాదు కష్టకాలంలో తప్పుడు నిర్ణయాలు కాదు..వాటిని అధిగమించేలా ధైర్యంగా నిలబడాలని నొక్కి చెబుతోంది ఆమె కథ.
(చదవండి: ఆ డీఆర్డీఓ శాస్త్రవేత్త అడిగిన ఒకే ఒక్క ప్రశ్న..లైఫ్నే మార్చేసింది!)


