విజయానికి డిగ్రీలు అక్కర్లేదు. కేవలం పట్టుదల, వ్యాపార దార్శనికత ఉంటే చాలని నిరూపించిన పారిశ్రామికవేత్త ఆర్జీ చంద్రమోగన్. గణితంలో ఫెయిల్ అయి నెలకు కేవలం రూ.65 జీతానికి అప్రెంటిస్గా పనిచేసిన ఒక సాధారణ యువకుడు.. నేడు దేశంలో ప్రముఖ ప్రైవేట్ డెయిరీ సామ్రాజ్యానికి అధిపతిగా ఎదగడం ఒక అద్భుత ప్రయాణం. కేవలం రూ.13,000 ప్రారంభ పెట్టుబడితో మొదలైన ఆయన వ్యాపారం నేడు దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ‘హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్’గా రూపాంతరం చెందింది.
వైఫల్యం నుంచి పాఠాలు
తమిళనాడులోని గ్రామీణ కుటుంబంలో జన్మించిన చంద్రమోగన్ బాల్యం ఒడిదుడుకులతో సాగింది. కుటుంబ వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికి తోడు, పాళయంకోట్టైలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు చదువుతున్న సమయంలో ఆయన గణితంలో ఫెయిలవ్వడంతో చదువు ఆగిపోయింది. ఆ తర్వాత చెన్నైకి 160 కిలోమీటర్ల దూరంలోని విలుప్పురంలోని ఒక కలప డిపోలో నెలకు రూ.65 జీతానికి అప్రెంటిస్గా చేరారు. అక్కడ శారీరక శ్రమ చేస్తూ ఆర్డర్లు తీసుకునే క్రమంలోనే.. సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన వ్యాపార కాంక్ష చిగురించింది.
రూ.13,000తో ‘అరుణ్’ బ్రాండ్
సొంత వ్యాపారం ప్రారంభించాలనే కొడుకు ఆశయానికి తండ్రి అండగా నిలిచారు. కుటుంబానికి ఉన్న పూర్వీకుల భూమిని రూ.13,000కు విక్రయించి పెట్టుబడి పెట్టారు. ఎలాంటి అధికారిక వ్యాపార ప్రణాళికలు లేదా ఇన్వెస్టర్ల సాయం లేకుండా 1970లో చెన్నైలోని రాయపురంలో 250 చదరపు అడుగుల చిన్న అద్దె గదిలో చంద్రమోగన్ తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. నలుగురు ఉద్యోగులు, ఒక ప్రాథమిక ఐస్ తయారీ యంత్రంతో రోజుకు 10,000 ఐస్ క్రీమ్ల సామర్థ్యంతో ‘అరుణ్’ (Arun Icecreams) బ్రాండ్ పుట్టింది. ప్రారంభ రోజుల్లో చంద్రమోగన్ స్వయంగా చెన్నై వీధుల్లో తోపుడు బండిపై ఐస్ క్రీమ్లు అమ్మడం గమనార్హం.
ఐస్ క్రీమ్ నుంచి డెయిరీ వైపు అడుగులు
దాదాపు దశాబ్దం పాటు ఐస్ క్రీమ్ రంగంలో నిలదొక్కుకున్న చంద్రమోగన్ కేవలం సీజనల్ వ్యాపారమైన ఐస్ క్రీమ్ల కంటే నిత్యం డిమాండ్ ఉండే పాలు, పాల ఉత్పత్తుల రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. అప్పటికే అసంఘటితంగా ఉన్న భారతీయ డెయిరీ మార్కెట్ను క్రమబద్ధీకరించేందుకు 1980ల్లో పాల ప్రాసెసింగ్లోకి అడుగుపెట్టారు.
కంపెనీ క్రమంగా వెన్న, నెయ్యి, పెరుగు వంటి ఉత్పత్తులను జోడించి విస్తరించింది. వేగవంతమైన లాభాల కంటే.. నమ్మకమైన సరఫరా గొలుసు ఏర్పాటు, రైతులు, రిటైలర్లతో బలమైన సంబంధాలు, పంపిణీ నెట్వర్క్ బలోపేతం పైనే ఆయన దృష్టి సారించారు. ఈ దీర్ఘకాలిక వ్యూహమే ‘హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్’ను దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ డెయిరీ సంస్థగా నిలబెట్టింది.
గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో స్థానం
ఐదు దశాబ్దాల కృషి ఫలితంగా హాట్సన్ ఆగ్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,000 కోట్ల మార్కును దాటింది. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం చంద్రమోగన్ నికర ఆస్తి విలువ 1.6 బిలియన్ డాలర్లు. ఆయన 2023లో భారత ధనవంతుల జాబితాలో 99వ స్థానంలో, 2026 నాటికి ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 2,481వ స్థానంలో నిలిచారు. పాడి పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గానూ 2018లో ఇండియన్ డెయిరీ అసోసియేషన్ నుంచి ‘ప్యాట్రాన్ అవార్డు’ (పోషక అవార్డు) అందుకున్నారు.
ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు


