పుస్తకం మార్చేసిన జీవితం.. స్కూల్ డ్రాపవుట్ నుంచి బిలియనీర్‌గా.. | The One Book That Changed Billionaire Nikhil Kamaths View of Life | Sakshi
Sakshi News home page

పుస్తకం మార్చేసిన జీవితం.. స్కూల్ డ్రాపవుట్ నుంచి బిలియనీర్‌గా..

Jul 9 2026 6:30 PM | Updated on Jul 9 2026 6:44 PM

The One Book That Changed Billionaire Nikhil Kamaths View of Life

విజయం సాధించాలంటే.. మంచి చదువు, ఉన్నత విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం.. చాలామంది అనుసరించే మార్గం ఇదే. కానీ భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ బ్రోకరేజ్ సంస్థ అయిన జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ప్రయాణం మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఎందుకంటే.. పాఠశాల చదువును మధ్యలోనే నిలిపివేసిన ఆయన, ఎలాంటి డిగ్రీ లేకుండానే దేశంలోని అత్యంత విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా ఎదిగారు.

కోట్ల రూపాయల సంపదను సృష్టించిన నిఖిల్ కామత్ జీవితంలో అత్యంత ప్రభావం చూపిన పాఠం వ్యాపారం కాదు.. ఒక పుస్తకం అని తెలిస్తే తప్పకుండా చాలామంది ఆశ్చర్యపోతారు.

సుమారు 34 ఏళ్ల వయసులో నిఖిల్ కామత్, పులిట్జర్ అవార్డు గ్రహీత ఎర్నెస్ట్ బెకర్ రచించిన 'ది డినయల్ ఆఫ్ డెత్' (The Denial of Death) పుస్తకాన్ని చదివారు. మనిషి జీవితానికి పరిమితి ఉందనే వాస్తవాన్ని మాత్రమే కాకుండా.. అతని ఆశయాలు, లక్ష్యాలు, నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఈ పుస్తకం చదివిన తరువాత నిఖిల్ కామత్ ఒక సాధారణ లెక్క వేసుకున్నారు. సగటు మనిషి ఆయుష్షును ఆధారంగా తీసుకుని తనకు ఇంకా దాదాపు 36 సంవత్సరాల జీవితం మాత్రమే మిగిలి ఉందని అంచనా వేశారు. అది డబ్బు లెక్క కాదు.. సమయం లెక్క. అదే ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. "డబ్బు కంటే సమయమే జీవితంలో అత్యంత విలువైన ఆస్తి" అనే భావనను ఆయన మరింత బలంగా అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి విజయాన్ని కొలిచే విధానం, నిర్ణయాలు తీసుకునే తీరు, జీవితానికి ఇచ్చే ప్రాధాన్యత అన్నీ మారిపోయాయని ఆయన పలుమార్లు చెప్పారు.

ఆలోచనా విధానాన్ని మార్చిన పుస్తకాలు
నిఖిల్ కామత్ అభిప్రాయం ప్రకారం, పుస్తకాలు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే కాదు.. మనుషులను, సమాజాన్ని, మనల్ని మనం అర్థం చేసుకునే దృక్పథాన్ని కూడా అందిస్తాయి. ఆయన సూచించిన పుస్తకాలలో మోర్గాన్ హౌసెల్ రాసిన ది సైకాలజీ ఆఫ్ మనీ ముఖ్యమైనది. డబ్బు సంపాదించడంలో తెలివితేటల కంటే సహనం, క్రమశిక్షణ, భావోద్వేగాల నియంత్రణ ఎంతో కీలకమని ఈ పుస్తకం వివరిస్తుంది.

ర్యాన్ హాలిడే రచించిన 'స్టిల్‌నెస్ ఈజ్ ది కీ' పుస్తకం.. ఒత్తిడి, అనిశ్చితి మధ్య ప్రశాంతంగా ఆలోచించే వ్యక్తులే సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతుంది. రిచర్డ్ డాకిన్స్ రచించిన 'ది సెల్ఫిష్ జీన్' మానవ ప్రవర్తన వెనుక ఉన్న పరిణామ సిద్ధాంతాన్ని వివరిస్తే, ఇసాబెల్ విల్కర్సన్ రచించిన 'కాస్ట్' సమాజంలో అసమానతలు, సామాజిక వ్యవస్థలపై లోతైన విశ్లేషణను అందిస్తుంది.

పుస్తకాలు నేర్పే జీవిత పాఠాలు
ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. నిఖిల్ కామత్ కథను చూసి చదువు అవసరం లేదని భావించడం సరైంది కాదు. ఆయన ప్రయాణం చెప్పే అసలు సందేశం ఏమిటంటే.. నేర్చుకోవడం అనేది పాఠశాల లేదా కళాశాలతో ముగిసిపోదు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, పుస్తకాలు చదివే అలవాటు, విభిన్న అంశాలపై అవగాహన పెంచుకోవడం వ్యక్తిగత వికాసానికి ఎంతో అవసరం. తరగతి గదిలో నేర్చుకోలేని ఎన్నో జీవన పాఠాలను పుస్తకాలు నేర్పగలవని ఆయన గట్టిగా నమ్ముతారు.

డబ్బు కాదు.. సమయమే అసలు సంపద
విజయవంతమైన వ్యాపారవేత్తలను చూసినప్పుడు వారు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? ఎలా బిలియనీర్లు అయ్యారు? అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ నిఖిల్ కామత్ ఎక్కువగా మాట్లాడేది మరో పెట్టుబడి గురించి.. అదే సమయం.

డబ్బు కోల్పోతే తిరిగి సంపాదించవచ్చు, వ్యాపారాన్ని మళ్లీ నిర్మించవచ్చు. కానీ ఒకసారి గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఎవరూ తిరిగి తీసుకురాలేరు. అందుకే జీవితంలో నిజంగా విలువైన వాటిపై దృష్టి పెట్టాలని, నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: మరో పవర్‌ఫుల్ AI మోడల్ వచ్చేసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement