మెటా, గూగుల్‌కు రూ.50 కోట్ల జరిమానా! | Meta And Google Hit With Rs 50 Crore Fine After Court Finds Addictive Features Harmed Teen Mental Health, More Details Inside | Sakshi
Sakshi News home page

మెటా, గూగుల్‌కు రూ.50 కోట్ల జరిమానా!

Jul 11 2026 3:44 PM | Updated on Jul 11 2026 4:01 PM

Meta Google Fined Rs 50 Cr for Addictive Features Targeting Kids

సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ)కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిన్నతనంలో సోషల్ మీడియాకు బానిస కావడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ ఒక 20 ఏళ్ల యువతి దాఖలు చేసిన కేసులో జ్యూరీ ఇచ్చిన తీర్పుపై మెటా తాజా అప్పీల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో మెటా న్యాయవాదులు అధికారికంగా అప్పీల్ నోటీసును దాఖలు చేశారు.

అసలేమిటీ కేసు? బాధితురాలి ఆరోపణలు ఏంటి?

ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న కేలీ అనే యువతి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. తను చిన్నతనంలో ఉన్నప్పుడే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు తీవ్రంగా బానిసయ్యానని, దీనివల్ల తను తీవ్రమైన ఆందోళన (యాంగ్జైటీ), డిప్రెషన్, బాడీ డిస్మోర్ఫియా (శరీర ఆకృతిపై తీవ్రమైన అసంతృప్తి) వంటి మానసిక సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆమె కోర్టుకు తెలిపింది.

టెక్ కంపెనీలు తమ యాప్‌ల్లో వాడే కొన్ని ప్రత్యేక ఫీచర్ల ద్వారా చిన్న పిల్లలను ఉద్దేశపూర్వకంగానే వ్యసనపరులుగా మారుస్తున్నాయని ఆమె తరఫు న్యాయవాదులు బలంగా వాదించారు. ప్రధానంగా కొన్ని ఫీచర్ల రూపకల్పనపై కోర్టులో చర్చ జరిగింది.

ఇన్‌ఫినిట్ స్క్రోలింగ్: యూజర్లు నిరంతరాయంగా కంటెంట్ చూస్తూనే ఉండేలా పేజీలకు ముగింపు లేకుండా డిజైన్ చేయడం.

ఆటోప్లే ఫంక్షన్: ఒక వీడియో ముగియగానే మరో వీడియో ఆటోమేటిక్‌గా ప్లే అయ్యేలా చేయడం.

అల్గారిథమిక్ రికమండేషన్స్: యూజర్ల ప్రవర్తనను బట్టి మరింత వ్యసనకరమైన కంటెంట్‌ను వారి ముందుకు తీసుకురావడం.

సంచలన తీర్పు.. 6 మిలియన్‌ డాలర్ల జరిమానా

ఈ ఏడాది మార్చి (2026)లో ఈ కేసును విచారించిన లాస్ ఏంజెల్స్ జ్యూరీ మెటా, గూగుల్ (యూట్యూబ్) సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌ల రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని నిర్ధారించింది. బాధితురాలి మానసిక స్థితి క్షీణించడానికి ఈ కంపెనీల యాప్ డిజైన్లే ప్రధాన కారణమని పేర్కొంటూ మొత్తంగా 6 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.50 కోట్లు) పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇందులో మెటా 4.2 మిలియన్‌ డాలర్లు, గూగుల్ 1.8 మిలియన్‌ డాలర్లు చొప్పున బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై టెక్ కంపెనీలు దాఖలు చేసిన ‘జడ్జ్‌మెంట్ నాట్‌విత్‌స్టాండింగ్ ద వర్డిక్ట్’ (తీర్పును కొట్టివేయాలనే అభ్యర్థన) పిటిషన్లను ట్రయల్ జడ్జ్ కరోలిన్ బి.కుహ్ల్ జూన్ ప్రారంభంలో తిరస్కరించడంతో మెటా ఇప్పుడు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

మెటా వాదన.. టెక్ కంపెనీల రక్షణ కవచం

అప్పీలుపై మెటా ప్రతినిధి స్పందిస్తూ.. ‘టీనేజర్ల మానసిక ఆరోగ్యం అనేది ఎంతో సంక్లిష్టమైన అంశం. దీన్ని కేవలం ఒక యాప్‌తో మాత్రమే ముడిపెట్టలేము. ఆన్‌లైన్‌లో యువత రక్షణ కోసం మేము అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. గూగుల్ ప్రతినిధి కూడా తాము అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. సాధారణంగా అమెరికాలోని ‘కమ్యూనికేషన్స్ డిసెన్సీ యాక్ట్ - సెక్షన్ 230’ ప్రకారం, థర్డ్-పార్టీ యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్‌కు టెక్ కంపెనీలు చట్టపరంగా బాధ్యులు కావు. అయితే, ఈ కేసులో న్యాయవాదులు కంటెంట్‌ను కాకుండా టెక్ కంపెనీలు రూపొందించిన యాప్ డిజైన్ (వ్యసనకరమైన ఫీచర్లు) లోపభూయిష్టంగా ఉందంటూ పట్టుబట్టడం విశేషం.

ఈ కేసు కేవలం ఒక యువతికి సంబంధించినది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా సోషల్ మీడియా సంస్థలపై దాదాపు 10,000 కంటే ఎక్కువ వ్యక్తిగత కేసులు, సుమారు 800 స్కూల్ డిస్ట్రిక్ట్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ అప్పీల్ తీర్పు భవిష్యత్తులో సోషల్ మీడియా నియంత్రణలపై, అలాగే కంపెనీల యాప్ డిజైన్ విధానాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భవిష్యత్తులో పిల్లల కోసం సోషల్ మీడియా యాప్స్‌లో భారీ మార్పులు వచ్చేందుకు ఇది ఒక మైలురాయిగా మారే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement