కేంద్రం ఆందోళనలపై స్పందించిన వాట్సాప్‌ | WhatsApp Reacts on Username Feature Amid Government Concerns | Sakshi
Sakshi News home page

కేంద్రం ఆందోళనలపై స్పందించిన వాట్సాప్‌

Jul 2 2026 7:44 AM | Updated on Jul 2 2026 7:48 AM

WhatsApp Reacts on Username Feature Amid Government Concerns

వినియోగదారులు తమ మొబైల్‌ నంబర్‌ను ఇతరులతో పంచుకోకుండా కేవలం యూజర్‌నేమ్‌తోనే వాట్సాప్‌లో చాట్‌ ప్రారంభించేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతోంది. వ్యక్తిగత గోప్యతను మరింత బలోపేతం చేయడమే ఈ ఫీచర్‌ ఉద్దేశమని కంపెనీ చెబుతోంది. అయితే ఈ వ్యవస్థను సైబర్‌ నేరాలకు దుర్వినియోగం చేసే అవకాశం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలు, నోటీసులు పంపిన నేపథ్యంలో.. వాట్సాప్‌ తొలిసారిగా స్పందించింది.

ఈ ఫీచర్‌ను సైబర్‌ నేరాలకు ఉపయోగించే అవకాశం ఉందన్న అనుమానాలను మెటా తోసిపుచ్చింది. ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, సెలబ్రిటీల పేర్లను ఎవరూ దుర్వినియోగం చేయలేరని స్పష్టం చేసింది. అలాంటి పేర్లను ముందుగానే రిజర్వ్‌ చేసినట్లు, వాటిని నిజమైన యజమానులు మాత్రమే ఉపయోగించుకునేలా ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

వాట్సాప్‌ ప్రతినిధి ఒకరు ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై పలు కీలక వివరాలు వెల్లడించారు. మొబైల్‌ నంబర్‌ను ఇతరులకు వెల్లడించకుండా సంభాషణలు ప్రారంభించేలా ఈ ఫీచర్‌ను రూపొందించామని తెలిపారు. అయితే వాట్సాప్‌ ఖాతాను ఉపయోగించాలంటే ఫోన్‌ నంబర్‌ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

యూజర్‌నేమ్‌ల విషయంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు వాట్సాప్‌ తెలిపింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ప్రముఖులు, సెలబ్రిటీల పేర్లను ముందుగానే రిజర్వ్‌ చేసినట్లు వెల్లడించింది. అంతేకాదు, వారి పేర్లను పోలి ఉండే యూజర్‌నేమ్‌లను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని పేర్కొంది. దీంతో ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసం చేసే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కంపెనీ చెబుతోంది.

అంతేకాదు, నకిలీ ఖాతాలు, ఇంపర్సనేషన్‌, ఫిషింగ్‌ వంటి మోసాలను గుర్తించే ప్రత్యేక వ్యవస్థలను కూడా అభివృద్ధి చేసినట్లు తెలిపింది. కొత్తగా సృష్టించిన ఖాతాలు ఒకేసారి ఎక్కువ మందిని సంప్రదించకుండా పరిమితులు ఉంటాయని, ఇతరుల యూజర్‌నేమ్‌లను ఊహించి వెతికే ప్రయత్నాలను కూడా అడ్డుకుంటామని వివరించింది. యూజర్‌నేమ్‌ ద్వారా సందేశం వచ్చినప్పుడు ఆ ఖాతా కొత్తదా? ఇప్పటికే కాంటాక్ట్‌లో ఉందా? ఉమ్మడి గ్రూపులు ఉన్నాయా? ఏ దేశానికి చెందినది? వంటి వివరాలు కూడా వినియోగదారుడికి కనిపించేలా వ్యవస్థను రూపొందించినట్లు తెలిపింది.

అలాగే, యూజర్‌నేమ్‌ ఫీచర్‌ను ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురాలేదని వాట్సాప్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం దీనిని దశలవారీగా పరీక్షిస్తున్నామని, కొంతమంది వినియోగదారులకు యూజర్‌నేమ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని తెలిపింది. 

ఇదిలా ఉండగా, ఈ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్‌ నంబర్‌ను దాచిపెట్టి యూజర్‌నేమ్‌తో చాట్‌ చేసే అవకాశం రావడం వల్ల ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు లేదంటే విశ్వసనీయ సంస్థల పేర్లను పోలిన యూజర్‌నేమ్‌లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఫిషింగ్‌, ఆన్‌లైన్‌ మోసాలు, డిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్‌లు, ఇంపర్సనేషన్‌ దాడులు పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) మెటాకు నోటీసులు జారీ చేసింది. యూజర్‌నేమ్‌ ఫీచర్‌కు సంబంధించి అమలు చేసిన భద్రతా చర్యలు ఏమిటి? మోసాలను ఎలా అడ్డుకుంటారు? అనే అంశాలపై మూడు రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు భారత్‌లో ఈ ఫీచర్‌ను అమలు చేయొద్దని కూడా సూచించినట్లు తెలుస్తోంది.

మెటా నుంచి వచ్చే వివరణను పరిశీలించిన అనంతరం, భద్రతా అంశాలపై మరిన్ని సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో భారత్‌లో వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌ అమలుపై ప్రస్తుతం కేంద్రం నిర్ణయమే కీలకంగా మారింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement