రాంచీ: విద్యార్థుల తీవ్ర నిరసనల నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జేఎస్ఎస్సీ-సీజీఎల్ (JSSC-CGL) పరీక్షతో పాటు, టీడీపీఎల్ (TDPL) ఏజెన్సీ నిర్వహించిన అన్ని పరీక్షలని, ఫలితాలని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలానే 2014 నుంచి జరిగిన అన్ని నియామక పరీక్షలపై సీఐడీ, ఎస్ఐటీ విచారణకు ఆదేశించారు.
పరీక్షల నిర్వహణలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన సుదీర్ఘ ఆందోళనల నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో 2014 నుంచి జరిగిన రిక్రూట్మెంట్ పరీక్షలపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో పరీక్షలు పారదర్శకంగా జరిగేలా ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.


