ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్‌ ఇచ్చిన సీజేపీ.. గడువు దాటిందో.. | CJP Raises Stakes After Bengals Bankura case | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్‌ ఇచ్చిన సీజేపీ.. గడువు దాటిందో..

Aug 17 2026 9:09 PM | Updated on Aug 17 2026 9:28 PM

 CJP Raises Stakes After Bengals Bankura case

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో జరిగిన దాడిలో సీజేపీ కార్యకర్త అబ్దుల్ హఫీజ్ తండ్రి మృతి చెందడంతో కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రంగంలోకి దిగింది. హఫీజ్‌ కుటుంబాన్ని సీజేపీ సహ కన్వీనర్ ఆశుతోష్ రంకా నేతృత్వంలోని బృందం సోమవారం కరిసుంద గ్రామంలో పరామర్శించింది.

హఫీజ్‌ సీజేపీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని అధ్వాన పరిస్థితులను వీడియో తీసి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారని పార్టీ తెలిపింది. స్థానిక పాఠశాల పరిస్థితులను చిత్రీకరించిన సమయంలో కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేశారని, అనంతరం అతడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో తండ్రికి తీవ్ర గాయాలై మృతి చెందినట్లు కుటుంబం ఆరోపించింది.

ఈ దాడి కావాలనే లక్ష్యంగా చేసుకుని, రాజకీయ ఉద్దేశంతో జరిగిందని సీజేపీ ఆరోపించింది. దాడికి ముందు హఫీజ్ ఇంటి విద్యుత్ సరఫరా నిలిపివేశారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ మరోసారి దాడి జరిగిందని పార్టీ పేర్కొంది. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు తగిన రక్షణ కల్పించలేదని ఆరోపించింది.

ఇప్పటివరకు 8 మంది అరెస్ట్
ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో స్థానిక బీజేపీ నాయకుడు కూడా ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కూడా తెలిపింది.

పరిహారం వద్దు.. తండ్రి పేరుతో పాఠశాల కావాలి
హఫీజ్ కుటుంబం ఆర్థిక పరిహారం కోరడం లేదని సీజేపీ తెలిపింది. తన తండ్రికి న్యాయం జరగడంతో పాటు, ఆయన పేరుతో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసి పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని హఫీజ్ కోరుతున్నట్లు పేర్కొంది.

సీజేపీ 4 డిమాండ్లు

  • నిందితులందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి.

  • పోలీసులు నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలి.

  • హఫీజ్‌, అతడి కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించాలి.

  • మృతి చెందిన తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలి.

ఈ డిమాండ్లపై చర్యలు తీసుకునేందుకు సీజేపీ ప్రభుత్వానికి 10 రోజుల గడువు ఇచ్చింది. ఈలోపు స్పష్టమైన చర్యలు లేకపోతే మద్దతుదారులను సమీకరించి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేపడతామని హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement