కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై అభ్యంతరకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం.. మెటాను వివరణ ఇవ్వాలని కోరింది.
ఈ విషయంపై సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులకు మెటా ప్రతినిధులను పిలిపించి వివరణ కోరాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మెటా నుంచి పూర్తి వివరాలు తెలుసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ లేదా అలాంటి ప్రకటనలు సోషల్ మీడియా వేదికల్లో ఉండటం చాలా తీవ్రమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వారం మెటాపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇది రెండోసారి. ఇటీవల వాట్సాప్లో యూజర్నేమ్ ఫీచర్ తీసుకురావాలన్న మెటా నిర్ణయంపై కూడా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం ఈ ఫీచర్ అమల్లోకి వస్తే.. ఆన్లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉంది. ఫిషింగ్ దాడులు ఎక్కువ కావచ్చు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలు పెరిగే ప్రమాదం ఉంది. ఇతరుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించడం సులభమవుతుంది. ఈ కారణాల వల్ల ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఆ ఫీచర్ను అమలు చేయవద్దని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది.
భారత ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్ వంటి పెద్ద సోషల్ మీడియా సంస్థలు వినియోగదారుల భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అక్రమ కంటెంట్ను అరికట్టడం, వినియోగదారుల భద్రతను కాపాడడం వంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం మెటాకు హెచ్చరించింది.


