‘పిల్లలను లక్ష్యంగా చేసుకున్నామనడం తప్పు’ | govt-notice-meta-replies-on-child-abuse-ads | Sakshi
Sakshi News home page

‘పిల్లలను లక్ష్యంగా చేసుకున్నామనడం తప్పు’

Jul 8 2026 1:03 PM | Updated on Jul 8 2026 1:17 PM

govt-notice-meta-replies-on-child-abuse-ads

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పెయిడ్‌ ప్రకటనల ద్వారా ‘చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్’ (సీఎస్‌ఈఏఎం) ప్రచారమవుతోందన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది. అయితే, పిల్లలపై అనుచిత ఆసక్తి ఉన్నవారిని (పెడోఫైల్స్) లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా పిల్లల కంటెంట్‌తో కూడిన ప్రకటనలను అనుమతించామనడం పూర్తిగా తప్పు అని మెటా స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర నోటీసులకు స్పందిస్తూ కంపెనీ ఒక అధికారిక బ్లాగ్ పోస్ట్‌ను విడుదల చేసింది.

ఆరోపణలను తోసిపుచ్చిన మెటా

ప్రభుత్వ ఆందోళనలను తాము అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని, తమ ప్లాట్‌ఫారమ్‌లపై ఇలాంటి హేయమైన కంటెంట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని మెటా స్పష్టం చేసింది. ‘పిల్లలపై వేధింపులకు వ్యతిరేకంగా ఉన్న మా విధానాలను ఉల్లంఘిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రకటనలపై కథనాలు మా దృష్టికి వచ్చాయి. దీనికి పూర్తి విరుద్ధంగా.. పిల్లలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను చూపే ఖాతాలను గుర్తించడానికి మేము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. గత ఏడాది కాలంలో ఇలాంటి 4 మిలియన్లకు (40 లక్షలు) పైగా ఖాతాలను ఆటోమేటిక్‌గా తొలగించాం’
అని మెటా బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

భారతదేశంలో గడచిన ఆరు నెలల్లోనే అనుమానాస్పద లింకులు, పిల్లల దోపిడీ సంకేతాలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించి 1.60 లక్షల ఖాతాలను తొలగించినట్లు కంపెనీ వెల్లడించింది.

ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న కేంద్రం

గత శుక్రవారం (జులై 4) కేంద్ర ఐటీ శాఖ మెటాకు నోటీసులు జారీ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌ఈఏఎం కంటెంట్‌కు అవకాశం కల్పించేలా ఉండే ప్రకటనలను, కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై ఏడు రోజుల్లోగా సమగ్ర వివరణాత్మక నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన మెటా.. ఈ వ్యవహారం తమ దృష్టికి రాకముందే తమ నిఘా వ్యవస్థలు సదరు ఉల్లంఘన ప్రకటనలను, వాటి వెనుక ఉన్న ఖాతాలను గుర్తించి నిలిపివేశాయని తెలిపింది. అనంతరం జరిపిన అంతర్గత దర్యాప్తులో మరికొన్ని ప్రకటనలను తొలగించి ఖాతాలను రద్దు చేయడంతో పాటు ఆ కంటెంట్‌కు సంబంధించిన యూఆర్‌ఎల్‌లను కూడా బ్లాక్ చేసినట్లు పేర్కొంది.

నేరస్థులతో నిరంతర యుద్ధం

ప్రపంచవ్యాప్తంగా తమకున్న 3.5 బిలియన్ల (350 కోట్లు) వినియోగదారుల్లో దాక్కుని తమ నిఘా నేత్రం నుంచి తప్పించుకోవాలని చూసే నేరస్థులతో ఇది నిరంతర యుద్ధమని మెటా వ్యాఖ్యానించింది. పిల్లల దోపిడీకి సంబంధించి తొలగించిన కంటెంట్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి 40 లక్షలకు పైగా అనుమానాస్పద ఖాతాలను తొలగించామని తెలిపింది.

భారతదేశంలో చట్టాల అమలు తీరును వివరిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల దోపిడీ ఉదంతాలు వెలుగుచూసినప్పుడు వర్తించే చట్టాల ప్రకారం అమెరికాకు చెందిన ‘నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లోయిటెడ్ చిల్డ్రన్’ (ఎన్‌సీఎంఈసీ)కు నివేదిస్తామని మెటా పేర్కొంది. భారతదేశంలో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2021, ఐటీ నిబంధనల ప్రకారం.. ఎన్‌సీఎంఈసీ ద్వారా భారత జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఈ సమాచారాన్ని మెటా తరపున నివేదిస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement