వాషింగ్టన్: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సహచరుడు గోల్డీ బ్రార్లపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు నమోదు చేశారు. ‘ఆపరేషన్ హార్డ్బాల్’ పేరుతో అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ ఆపరేషన్లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు.
లాస్ ఎంజెల్స్ ఫెడరల్ కోర్టులో సమర్పించిన అభియోగపత్రం ప్రకారం.. ప్రస్తుతం భారత జైల్లో ఉన్న బిష్ణోయ్, కెనడాలోని సర్రేలో ఉన్న సిక్కు ఆలయం వెలుపల 2023 జూన్ 18న జరిగిన నిజ్జర్ హత్యకు వ్యూహం రచించినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. భారత్ కేంద్రంగా నడుస్తున్న మూడు అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలను లక్ష్యంగా చేసుకుని ఈ దర్యాప్తు సాగింది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలో 11 మందితో సహా మొత్తం 24 మందిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి.
ఈ ముఠాలు అంతర్జాతీయ సరిహద్దుల గుండా హత్యలు, వసూళ్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఎఫ్బీఐ అధికారి పాట్రిక్ గ్రాండీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 37 మందిపై అభియోగాలు మోపారు. కాగా, నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో చేసిన ఆరోపణలను న్యూఢిల్లీ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిష్ణోయ్ జైల్లో ఉండగా, పరారీలో ఉన్న బ్రార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


