breaking news
crime and criminal network and system
-
సినిమా స్టైల్ క్రైం స్టోరీ : ‘ముక్కోటి’కి ముందురోజే ముహూర్తం..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/మానకొండూరు: కాల్పుల మోతతో మానకొండూరు ఉలిక్కిపడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పల్లెలో తుపాకులు గర్జన విని జనం భీతిల్లారు. రౌడీషీటర్ అరుణ్పై కత్తులు, తుపాకులతో జరిగిన హత్యాయత్నం జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నేరచరిత్ర కలిగిన అరుణ్ ఆది నుంచి వివాదాస్పదుడే. వరుసగా ఇతనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గత సీపీ సత్యనారాయణ ఇతనికి కమిషరేట్ నుంచి బహిష్కరణ విధించారు. ఇటీవల కమిషనరేట్ బహిష్కరణ పూర్తిచేసుకుని వచ్చిన అరుణ్పై తుపాకులతో హత్యాయత్నం జరగడం గమనార్హం. వాస్తవానికి ఈ ఘటనకు బీజం ఇప్పుడు పడింది కాదు, పాత కక్షల నేపథ్యంలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి ముందురోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో ప్రధాన నిందితుడు సాయితేజ్ హనుమాన్ ఆలయంలోనే అరుణ్ని చంపుతానని ప్రతినబూనాడు. వస్తూనే దాడి.. కాల్పులు ● పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో ఉండే వీణవంక సాయితేజ్ ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ముందురోజు రాత్రి (నూతన సంవత్సరం రోజు) జీఎం కాలనీలోని హనుమాన్ గుడిలో తన సోదరి మరణానికి కారణమైన ‘మానకొండూరు అరుణ్ గాని తలకాయ కోసి.. జీఎం కాలనీ చౌరస్తాలో పెట్టకపోతే నేను సూరి కొడుకునే కాదు’ అని శపథం చేశాడు. ● ఈ విషయాన్ని పలువురు స్థానికులు వీడియో కూడా తీశారు. ఇప్పుడు ఈ వీడియో కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో ‘సాక్షి’ చేతికి చిక్కింది. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్న సాయి.. బుధవారం అర్ధరాత్రి తన మిత్రులు భువనగిరి జిల్లా దత్తారుపల్లికి చెందిన పాల మల్లేశ్, మానకొండూరు మండలం కెల్లెడ గ్రామానికి చెందిన బైరగోని మధు, గోదావరిఖనికి చెందిన చంటితో కలిసి రాత్రి 9 గంటల సమయంలో వాహనంలో మానకొండూరుకు వచ్చాడు. ● వెల్ది గ్రామానికి వెళ్లే మార్గం నుంచి వీరు గ్రామంలోకి తుపాకీ, కత్తులతో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు 9.30 గంటల సమయంలో అరుణ్ తన ఇంటి ముందు సోదరులతో కలిసి మద్యం తాగుతుండగా.. వీరికి తారసపడ్డాడు. వారిని చూడగానే భయంతో అరుణ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. ● అతడిని వెంబడించిన నలుగురు బీరు బాటిళ్లతో దాడిచేశారు. అడ్డువచ్చిన అరుణ్ భార్య సుమ, పెద్ద కూతురు వైష్ణవిని తుపాకీ చూపించి తీవ్రంగా కొట్టారు. పారిపోతున్న అరుణ్పై రెండు రౌండ్లు కాల్పులు జరపగా గురితప్పాయి. ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు. అరుణ్పై కోపంతో సదరు ఇంట్లోని ఐదుగురు కుటుంబసభ్యులను విచక్షణారహితంగా, రక్తాలు కారేలా కొట్టారు. ● వీరి అరుపులు విన్న స్థానికులు వచ్చారు. వచ్చిన వారిని తుపాకీ చేతబూనిన వ్యక్తి బెదిరించి పంపాడు. తరువాత చాలామంది రావడంతో సాయితేజ్ పరారు కాగా.. పాలమల్లేశ్, మధును పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ● పేలని బుల్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడింది కంట్రీమేడ్ తుపాకీ (తపంచా) అని తూటా ఆధారంగా నిర్ధరణకు వచ్చారు. మరో నిందితుడు చంటి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడని సమాచారం. తనకు సంబంధం లేదంటున్న అరుణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నిందితులు గోదావరిఖనికి చెందిన సాయితేజ్, చంటి, మరో ఇద్దరు మిత్రులు అని వెల్లడించాడు. ఎందుకు దాడి చేశారు..? అని అడిగిన ప్రశ్నకు.. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అని, తనకువారితో ఎలాంటి సంబంధమూ లేదని, వారు గంజాయి విక్రయిస్తారని తెలిపాడు. సంబంధం లేని వ్యక్తి చేసే పని, చిరునామా, పేరుతో సహా ఎలా తెలపగలిగాడు..? అన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు. అతనికి సాయితేజకు ఉన్న వైరం ఏంటీ..? అతని సోదరి మరణంలో అరుణ్ ప్రమేయం ఎంతవరకు ఉంది..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నిందితులకు, బాధితుడికి నేరచరిత ఉన్న విషయం వాస్తవమేనని, అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బారాయుడు ‘సాక్షి’కి తెలిపారు. నిందితుల కోసం మొత్తం మూడు బృందాలు సాయి కోసం గాలిస్తున్నాయి. ఇందులో రెండు హైదరాబాద్కు వెళ్లగా.. ఒక టీం గోదావరిఖనికి వెళ్లినట్లు సమాచారం. బిహార్ నుంచి ఆయుధం..? ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయికి ఆయుధం ఎక్కడిది..? అన్న విషయంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తుపాకీ కాల్చడంలో నిందితులకు అనుభవం లేదని తాజా ఘటనతో తేలిపోయింది. బుల్లెట్లు వేగంగా లోడు చేయలేకపోవడం.. గురిచూసి కాల్చలేకపోయిన విధానాన్ని బట్టి నిందితులు ఇటీవలే తుపాకీ కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు. రెండు నెలల క్రితం ఓ కేసు విషయంలో సాయి సెల్లోకేషన్ బిహార్లో చూపించిందని గోదావరిఖని పోలీసులు తెలిపారు. అదే సమయంలో అతను కాశీయాత్రకు వెళ్లి వచ్చాడని గుర్తుచేసుకుంటున్నారు. దీంతో సాయికి బిహార్లో మిత్రులు ఉండి ఉంటారని, వారి ద్వారానే ఆయుధం కొని ఉంటాడని అనుమానిస్తున్నారు. మాట్లాడకుండానే.. దాడి చేశారు.. మానకొండూర్లో ఉన్న మా అత్త గారింటికి నా పిల్లలను చూసేందుకు వచ్చాను. బుధవారం రాత్రి అన్నం తిని బయట ఉండగా గొడవ అవుతోంది. ఈ లోగానే అరుణ్ మా ఇంటి వైపు వచ్చాడని కొందరు మా ఇంటివైపు పరుగు తీసుకుంటూ వచ్చారు. వాడేడి అంటూ ఆగ్రహంతో నాపై స్టీలు ప్యాల క్యాన్తో దాడి చేశారు. తల పగిలి రక్తస్రావం జరిగింది. ఇంట్లో వాళ్లపై దాడి చేశారు. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. తర్వాత భయాందోళనతో చాలా సేపు తలుపు వేసుకుని ఇంట్లోనే ఉన్నాం, పోలీసులు వచ్చాక బయటకు వచ్చా. – బీరం శ్రీనివాస్, గాయపడ్డ వ్యక్తి -
నేరగాళ్ల ట్రా'కింగ్'
సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చోరీలు చేసిన ఓ నిందితుడు ఖమ్మంలో పోలీసులకు పట్టుబడ్డాడు... ఆ విషయం హైదరాబాద్ పోలీసులకు తెలియకపోవడంతో ఇక్కడి కేసులు పెండింగ్లోనే ఉండిపోతాయి. ► రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న ఓ నేరగాడు వరంగల్ పోలీసులకు చిక్కి కొన్ని రోజుల తర్వాత అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ విషయం సిటీ పోలీసులకు తెలియకపోతే అతడి ‘స్వైర విహారం’ కొనసాగుతుంది. ► సిటీలో ఓ నేరం జరిగిన వెంటనే అలాంటి నేరాలు చేసే మోడెస్ ఆపరెండీ (ఎంఓ) క్రిమినల్స్ ఏఏ జిల్లాల్లో ఉన్నారో తెలుసుకోవడానికి అయ్యే ఆలస్యం నిందితుడికి కలిసి వస్తుంది. ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారంగా, నేరాల దర్యాప్తును వేగవంతం చేయడానికి ఉద్దేశించిందే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టం (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టు. దీన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉండగా... అనేక కారణాల నేపథ్యంలో ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసులు చొరవ తీసుకున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలను అనుసంధానిస్తూ సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ‘ముంబై ఎటాక్స్’ తర్వాత పుట్టిన ఆలోచన... ముంబై ఎటాక్స్గా పిలిచే 2008 నాటి 26/11 దాడుల తరవాత కేంద్ర ప్రభత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ.రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో 2009లో ప్రారంభించిన దీన్ని 2012 నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే దీని అమలుకు అప్పటికే ఉన్న క్రిమినల్స్, క్రైమ్ రికార్డుల్ని డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో బీహార్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాలు వెనుకబడటంతో ప్రాజెక్టు అమలు ఆలస్యమవుతోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై సిటీ పోలీసు విభాగం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాలను ఒక్కతాటి పైకి తీసుకువచ్చి, అనుసంధానించింది. ప్రాజెక్టు లేకపోవడంతో సమస్యలెన్నో... ప్రస్తుతం ఓ జిల్లా/కమిషనరేట్ పరిధిలో అధికారులకు చిక్కిన, వాంటెడ్గా ఉన్న నేరగాళ్ళ వివరాలు పక్క జిల్లా/కమిషనరేట్ వారికీ పూర్తిగా తెలియని పరిస్థితి ఉంది. పాత నేరగాళ్ళు, వాంటెడ్ క్రిమినల్స్ డేటాబేస్లు అందరికీ అం దుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ఫలితంగానే ఓ ప్రాంత పోలీసులకు వాంటెడ్గా ఉన్న అనేక మంది కరుడుగట్టిన నేరగాళ్ళు మరో ప్రాంత పోలీసులకు చిన్న చిన్న కేసు ల్లో చిక్కినా గత చరిత్ర వెలుగులోకి రాని కారణంగా తేలిగ్గా బెయిల్ పొంది బయటకు రావడంతో పాటు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అంతర్ జిల్లా నేరగాళ్ళు చేసే అనేక సొత్తు సంబంధ నేరాలు కొలిక్కి రావట్లేదు. విభాగాల సమన్వయానికి ఓ వేదికగా... సిటీలో సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు అమలుకు నిర్ణయించిన నగర పోలీసులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని డిజిటలైజ్ చేశారు. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ సైతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన జిల్లాలను సైతం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ద్వారా అనుసంధానించారు. ఈ సర్వర్లోని సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ ట్యాబ్్సలోనూ చూసుకునేలా ఏర్పాటు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నుంచి చార్్జషీట్ వరకు ప్రతి అంశమూ అందరికీ అందుబాటులోకి వచ్చింది. కోర్టు కానిస్టేబుళ్ళకు సైతం ట్యాబ్స్ ఇవ్వడం ద్వారా కేసుల సమాచారాన్ని అప్డేట్ చేయించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జైల్ రిలీజ్ అలర్ట్స్ సైతం... దీంతో ఓ నేరం జరిగిన వెంటనే ఈ తరహా నేరాలు ఇంకా ఎక్కడైనా జరిగాయా?ఎవరు చేస్తారు?వారు ప్రస్తుతం ఎక్క డ ఉన్నారు? అనే అంశాలను క్షణాల్లో తెలుసుకునే ఆస్కా రం ఏర్పడింది. రాష్ట్ర, జిల్లా, నగరాల స్థాయిల్లోని క్రైమ్ రికారŠడ్స్ బ్యూరోలో ఉన్న పాత నేరగాళ్ళ వేలి ముద్రలు సైతం వీపీఎన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మరోపక్క ఈ ప్రాజెక్టులో జైళ్ళ శాఖను సైతం అనుసంధానిం చారు. ఫలి తంగా ప్రతి రోజూ జైళ్ళ నుంచి విడుదలవుతున్న వారి వివరాలు వచ్చి చేరుతున్నాయి. వీటి ఆధారంగా జైల్ రిలీజ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఓ నేరగాడు శిక్ష పూర్తి చేసుకుని /బెయిల్పై విడుదలైన వెంటనే ఆ సమాచారం అతడు నేరాలు చేసే, నివసించే, వాంటెడ్గా ఉన్న పోలీసుస్టేషన్లతో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సీసీఎస్,టాస్క్ఫోర్స్ వంటి ప్రత్యేక విభాగాలకు సందేశాల రూపంలో వచ్చి చేరుతుంది. దీంతో అతడిపై నిఘా ఉంచడానికి ఆస్కారం ఏర్పడుతుంది.