నాటి వైభవం ఎందుకు సాధ్యం కాదు? | Guest Column Special Story On Measures To Clean The Moosi Canal Hyderabad | Sakshi
Sakshi News home page

నాటి వైభవం ఎందుకు సాధ్యం కాదు?

Jul 14 2026 10:57 AM | Updated on Jul 14 2026 11:33 AM

Guest Column Special Story On Measures To Clean The Moosi Canal Hyderabad

మధ్య ఓ సాయంత్రం పురానాపూల్‌ మీద నిలబడినప్పుడు కింద మురికి నీటిలో ప్లాస్టిక్‌ కవర్లు, జంతు కళేబరాలు తేలుతూ కనిపించాయి. దుర్గంధం వెదజల్లుతోంది. నాలుగు శతాబ్దాల క్రితం ఇదే బ్రిడ్జి మీద నుండి కుతుబ్‌ షాహీలు నది అందాలను చూసి మైమరచి పోయారన్న చరిత్ర గుర్తుకు వస్తే మనసు వికలమవుతుంది.

1578లో కుతుబ్‌ షాహీల కాలంలో ఈ పురానాపూల్‌ నిర్మాణం జరిగింది. గోల్కొండ కోటకు, మూసీకి ఆవల ఉన్న ప్రాంతానికి మధ్య రాకపోకలు సాగించే ఆలోచనతో పురుడుపోసుకుంది. ఇరవై ఆరు రాతి కమానులతో నిర్మితమైన ఈ వంతెనను ‘బ్రిడ్జ్‌ ఆఫ్‌ లవ్‌’గా ఫ్రెంచ్‌ యాత్రికుడు టావెర్నియర్‌ వర్ణించాడని ప్రతీతి. 17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన విదేశీ యాత్రికులు మూసీ నది ఒడ్డున ఉన్న తోటలు, భవనాలు చూపరులను కట్టిపడేస్తాయని వర్ణించారు. ప్రజలు ఈ నీటినే మంచినీరుగా వాడుకునేవారు.

కానీ ఇదే మూసీ 1908లో భారీ వరదలతో విలయాన్ని చూపించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. నదిని నిర్లక్ష్యం చేస్తే అది తన ప్రకోపాన్ని చూపిస్తుందని అది హెచ్చరించిన గుణపాఠాన్ని పట్టించుకోకపోతే ఎలా? స్థానికుల కథనం–శాటిలైట్‌ చిత్రాల విశ్లేషణ వల్ల తేలిందేమంటే... గత మూడు దశాబ్దాల్లో పురానాపూల్‌ దగ్గర మూసీ నది సహజంగా ఉన్న వెడల్పు చాలా వరకు తగ్గిపోయిందని! అంటే నదిని మనం మింగేశామన్న మాట! హైదరాబాద్‌లో ఉత్పత్తి అయ్యే మురుగునీటి మొత్తంలో ఎక్కువ శాతం శుద్ధి కాకుండానే నేరుగా మూసీలో కలుస్తోంది. వర్షం పడగానే వ్యర్థాలన్నీ బ్రిడ్జి పిల్లర్లకు తట్టు కుని ప్రవాహం ఆగిపోయేలా చేస్తున్నాయి. ఫలితంగా దిగువన ఉన్న చాదర్‌ఘాట్, మూసారాంబాగ్‌ లాంటి లోతట్టు ప్రాంతాలు కూడా చిన్న వర్షానికే నీట మునిగిపోతున్నాయి.

ప్రస్తుతం మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నదికి ఇరువైపులా ఫెన్సింగ్‌ వేస్తోంది. ఆక్రమణలు ఆపడం, చెత్త వేయకుండా చూడటం దీని ఉద్దేశ్యం కావచ్చు. కానీ నదిని ప్రజలకు దూరం చేసినట్లు అవుతుంది. 1950ల్లో లండన్‌లో థేమ్స్‌ నదిని ‘జీవ శాస్త్రపరంగా మృత నది’గా ప్రకటించారు. కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో దాన్ని పునరుజ్జీవింపచేసింది. ఫలితంగా ఇటీవల కాలంలో థేమ్స్‌ నదిలో సీల్స్, డాల్ఫిన్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నది ఒడ్డున రెస్టారెంట్లు, వాకింగ్‌ ట్రాక్‌లు, టూరిస్ట్‌ బోట్‌ లతో బిలియన్ల పౌండ్ల ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌ కూడా ఇదే మోడల్‌. మరి చరిత్ర నేర్పిన పాఠాల నుండి మనమేం నేర్చుకుంటున్నాం?

స్మార్ట్‌గా ఆలోచించాలి!
మూసీని బతికించాలంటే మనకు కావాల్సింది కేవలం కాంక్రీట్‌ కాదు, ‘స్మార్ట్‌ సైన్స్‌’. ముందుగా డ్రోన్లు, ఉపగ్రహాలతో మూసీ నదికి 1:1000 స్కేల్‌లో త్రీ డీ మ్యాప్‌ తయారు చేయాలి. ఎక్కడ ఆక్రమణ ఉంది, ఎక్కడ నాలా కలుస్తుంది, ఎక్కడ నీరు నిల్వ ఉంది అనేది ప్రతి మీటర్‌ లెక్క తేలాలి. పురానాపూల్, చాదర్‌ఘాట్, నాగోల్‌ వంటి కీలక పాయింట్ల దగ్గర నీటి నాణ్యతను, నీటి మట్టాన్ని 24 గంటలూ కొలిచే ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) సెన్సార్లు పెట్టాలి. ఏ నాలా నుండి కాలుష్యం వస్తోందో వెంటనే తెలిసిపోతుంది. పర్యాటక అవకాశం, జనసాంద్రత, కాలుష్య స్థాయి, వరద ముప్పు వంటి అంశాలను తీసుకుని, ప్రాధాన్యతా పట్టిక ప్రకారం నిధులు ఖర్చు పెడితే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుంది. పురానాపూల్‌ను కేవలం బ్రిడ్జిలా కాకుండా ‘సాంస్కృతిక వ్యాఖ్యాన కేంద్రం’గా మార్చాలి. నాలుగు శతాబ్దాల క్రితం కుతుబ్‌ షాహీలు చూసిన అందమైన మూసీని మన పిల్లలకు చూపించే బాధ్యత మనదే! 
– డా. రామకృష్ణ మనిమద్దె, ఎర్త్‌ సైంటిస్ట్, నదీ వ్యవస్థల పరిశోధకులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement