సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని తీవ్ర కలకలం చోటుచేసుకుంది. కేపీహెచ్బీలోని లులూ మాల్లో ఓ వ్యక్తి గన్తో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో తుపాకీ కనిపించడం దుమారం రేపింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారరం లులూ మాల్ పార్కింగ్ వద్ద రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం, ఇరువర్గాలను విచారిస్తుండగా పాతబస్తీకి చెందిన సిద్ధిఖీ జేబులో గన్ గుర్తించారు. పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా అది లైసెన్స్ ఉన్న గన్గా గుర్తించారు.
దీంతో, గన్తో వచ్చిన వ్యక్తిని మాల్లోకి అనుమతించే సమయంలో భద్రతా సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించలేదని గుర్తించిన పోలీసులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారి తీసింది.


