న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారానికి 17వ రోజుకు చేరింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన 25వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కండరాల క్షీణతతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని, బరువు 8.5 కేజీలు తగ్గి, రక్తపోటు (బీపీ) 109/70కి పడిపోయిందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ద్వారా వెల్లడించారు.
దీక్ష విరమించాలని తాను సోనమ్ వాంగ్చుక్ను కోరగా, ‘ప్రభుత్వం చర్చలు ఎందుకు జరపడం లేదో ప్రశ్నించండి’ అని బదులిచ్చినట్లు తెలిపారు. మనిషి ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం పంతం పట్టినట్లు తీసుకోకూడదని దిప్కే హితవు పలికారు. మరోవైపు రాజకీయాలకతీతంగా వాంగ్చుక్కు మద్దతు పెరుగుతోంది. నిరాహార దీక్షను విరమించి పోరాటాన్ని కొనసాగించాలని టీఎంసీ నేత మహువా మోయిత్రా ఆయనను కోరారు. ‘ప్రభుత్వానికి యువత ప్రాణాలపై పట్టింపు లేదు, కానీ మీ ప్రాణాలు మాకు ముఖ్యం’ అని ఆమె పేర్కొన్నారు.
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సైతం ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే, దీక్ష విరమించాలని సోనమ్ వాంగ్చుక్కు విజ్ఞప్తి చేశారు. ఆప్ నేత అతిశి బృందం, సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్ సహా పలువురు నేతలు నిరసన ప్రదేశాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. జూన్ 28న వాంగ్చుక్ ఈ దీక్షలో చేరారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు, పరీక్షల అక్రమాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. ఒక కోటి పరిహారం ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. జూలై 20న పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజున జంతర్ మంతర్ నుండి పార్లమెంట్కు శాంతియుత మార్చ్ నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు.


