టార్గెట్ల కారణంగానే మృత్యువాత
సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ
గాందీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులనుఅధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతూ వారి మరణానికి కారకులవుతున్నారని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆరోపించింది. సెలవు దినాల్లో సైతం యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడింది. నిబంధనలు అతిక్రమిస్తే సస్పెన్షన్లు, మెమోలు జారీ చేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్ష ఆదివారం ముగిసింది.
ఈ దీక్షలో పాల్గొన్న జేఏసీ నేతలు ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జి.సురేంద్ర, ప్రధాన కార్యదర్శి బుగ్గ జగదీష్, అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీష్ మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులను అసిస్టెంట్ బీఎల్వోలుగా నియమించి, శని, ఆదివారాల్లో కూడా అర్ధరాత్రి వరకు పనులు చేయిస్తున్నారన్నారు. అనవసరపు టార్గెట్లు, ఒత్తిడి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటుతో చనిపోవడమే కాకుండా అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
అసిస్టెంట్ బీఎల్వో విధుల నుంచి సచివాలయ ఉద్యోగులను తప్పించాలని, ఒంగోలు, అనకాపల్లి జిల్లాల్లో అన్యాయంగా సస్పెండ్ చేసిన బీఎల్ఓలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 15 నెలలుగా బీఎల్ఓలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ.వెయ్యి గౌరవ వేతనాన్ని బకాయిలు లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్ గడువును పొడిగించి ఉద్యోగులు ఆహ్లాదకర వాతావరణంలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి హాని జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమమే..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమబాట పడతామని నాయకులు హెచ్చరించారు. ఏఏఎస్ అమలు, నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొబేషన్ కాలానికి సంబంధించిన 9 నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు.


