రాజస్థాన్‌లో బాలింతల వరుస మరణాలు.. వీడని మిస్టరీ! | 18 Rajasthan Women Die After Childbirth | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లో బాలింతల వరుస మరణాలు.. వీడని మిస్టరీ!

Jul 14 2026 10:48 AM | Updated on Jul 14 2026 11:02 AM

18 Rajasthan Women Die After Childbirth

రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం బాలింతల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతోంది. మే నెల నుంచి ఇప్పటి వరకు 18 మంది బాలింతలు ప్రాణాలు కోల్పోగా... కిడ్నీలు దెబ్బతిన్న మరో ఏడుగురు మహిళలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. జులై 5 నుండి జులై 10 మధ్య భిల్‌వారా, బన్‌స్వారా జిల్లాల్లోనే ఏకంగా తొమ్మిది మంది మహిళలు మరణించారు. ఇది రాష్ట్రంలో మాతృత్వ ఆరోగ్య సేవలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.

భిల్‌వారాలోని మహాత్మా గాంధీ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ప్రసూతి ఆసుపత్రిలో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే ఐదుగురు మహిళలు సిజేరియన్ (సి-సెక్షన్) శస్త్రచికిత్సల అనంతరం మరణించారు. శస్త్రచికిత్స తర్వాత వీరంతా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యారని, ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆసుపత్రి రికార్డులు వెల్లడిస్తున్నాయి.

అంతకు ముందు మే నెలలో కోటాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదుగురు బాలింతలు మృతి చెందారు. జూన్‌లో బికనీర్‌లో సిజేరియన్ చేయించుకున్న ఆరుగురు మహిళలకు కిడ్నీలు దెబ్బతినగా.. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన ఏడుగురు మహిళలు ప్రస్తుతం డయాలసిస్‌పై ఉన్నారు.

బాలింతల మరణాలపై ఆరోగ్యశాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిమ్సర్ మాట్లాడుతూ.. వరుస మరణాలు తమను షాక్‌కు గురిచేసిందని.. మరణాలకు గల కారణాలను తెలుసుకోవడానికి నిపుణుల బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మరణాలన్నీ ఒకే తహాలో సంభవించడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి కారణం ఏంటో స్పష్టంగా అర్థం కావడం లేదు. మొదట ఎండల తీవ్రత (హీట్ స్ట్రోక్) వల్ల మరణించి ఉంటారని భావించాం.. కానీ ఇప్పుడు ఎండలు తగ్గిపోయాయి. రక్త పరీక్షల నివేదికలన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఏదైనా నిర్లక్ష్యం లేదా వైద్యపరమైన లోపాలు ఉన్నట్లు తేలితే తప్ప వైద్యులు లేదా అధికారులపై చర్యలు తీసుకోలేమని మంత్రి తెలిపారు.

విచారణ కోసం జైపూర్ నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించిన ప్రభుత్వం.. కోటా, జోధ్‌పూర్, బికనీర్ జిల్లాల ఆసుపత్రి ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లతో మంత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కాగా, గతంలో ఎయిమ్స్ ఢిల్లీ బృందం చేసిన సమీక్ష తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గైనకాలజిస్టులతో లోతైన దర్యాప్తు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మరణాలపై బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ ఆసుపత్రుల ముందు నిరసనలకు దిగారు.

ఆసుపత్రిలో ప్రతిరోజూ 30 నుండి 40 సిజేరియన్ శస్త్రచికిత్సలు జరుగుతుండగా.. అక్కడ కేవలం 8 సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్ సెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 5 సాధారణ వాడకానికి.. 3 అత్యవసర అవసరాల కోసం కేటాయించారు. ప్రతి సెట్‌ను తిరిగి ఉపయోగించే ముందు కనీసం మూడు గంటల పాటు స్టెరిలైజేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే శస్త్రచికిత్సల ఒత్తిడి కారణంగా ఈ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని.. తద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఆపరేషన్ థియేటర్ నుండి తీసిన కల్చర్ టెస్ట్ శాంపిల్‌లో బ్యాక్టీరియా పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం. అయితే, దీనికి బాలింతల మరణాలకు ప్రత్యక్ష సంబంధం ఉందా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ గౌర్ ఇన్ఫెక్షన్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల నుండి క్రమం తప్పకుండా నమూనాలు సేకరించడం సాధారణ నియంత్రణ ప్రక్రియలో భాగమేనని చెప్పారు. బ్యాక్టీరియా బయటపడిన ఆపరేషన్ థియేటర్‌ను గత మూడు రోజులుగా మూసివేసి, ఫ్యూమిగేషన్ మరియు స్టెరిలైజేషన్ చేస్తున్నామని, తదుపరి పరీక్షల్లో నెగటివ్ వచ్చే వరకు అక్కడ శస్త్రచికిత్సలు నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement