కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా బిధాన్నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన యావత్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అన్నపూర్ణ భండార్ పథకం కింద కేవలం రూ. 2,000 తీసుకునేందుకు వెళ్లిన ఒక పేద మహిళ, తన బ్యాంక్ ఖాతాలో అకస్మాత్తుగా రూ. 740 కోట్ల 68 లక్షలు కనిపించడంతో నిర్ఘాంతపోయింది.
డార్జిలింగ్ జిల్లాలోని ఫాన్సిదేవా బ్లాక్లో ఉన్న కోచుబారీ గ్రామానికి చెందిన మెహరూనేషా అనే మహిళదే ఈ ఘటన. శనివారం ఉదయం సుమారు 11:30 గంటలకు ఆమె తన ప్రాంతంలోని కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ)కి వెళ్లి, అన్నపూర్ణ భండార్ పథకం కింద తనకు వచ్చిన సొమ్ము తీసుకునేందుకు ప్రయత్నించింది. బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా ఆమె రూ. 2,000 విత్డ్రా చేసుకుంది. ఆ తర్వాత తన ఖాతా బ్యాలెన్స్ ఎంత ఉందో చూపించమని సీఎస్పీ నిర్వాహకుడిని కోరింది.
ఖాతా వివరాలు తెరపై చూసిన సీఎస్పీ యజమాని షాహిద్ అన్వర్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. మహిళ పొదుపు ఖాతాలో ఏకంగా రూ. 740 కోట్ల 68 లక్షలు కనిపించాయి. రాత్రికి రాత్రి మెహరూనేషా 'కోటీశ్వరురాలిగా' మారిపోయింది. ఈ విషయం తెలియగానే సీఎస్పీ బయట జనం గుమిగూడారు. ఆశ్చర్యానికి గురైన ఆ మహిళను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.
తన భర్త ఒక సాధారణ కూలీ అని, కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉందని మెహరూనేషా తెలిపింది. కలలో కూడా ఇంత డబ్బు చూడలేదని, అకస్మాత్తుగా ఖాతాలో ఇంత పెద్ద మొత్తం రావడంతో తాము విస్తుపోయామని, దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఆమె పేర్కొంది.
సీఎస్పీ యజమాని షాహిద్ అన్వర్ కూడా ఈ ఘటనను ధృవీకరించారు. మహిళ ఉదయం తన దుకాణానికి వచ్చిందని, సాధారణ ప్రక్రియలో భాగంగా రూ. 2,000 తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ చెక్ చేయగా ఈ అంకె బయటపడిందని చెప్పారు. వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన మహిళకు సూచించారు.
డార్జిలింగ్ జిల్లా పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమస్య బ్యాంక్లో జరిగిన ఏదో సాంకేతిక లోపం వల్లే తలెత్తినట్లు తెలుస్తోంది. విషయం దృష్టికి రాగానే బ్యాంక్ యాజమాన్యం మహిళ పొదుపు ఖాతాను స్తంభింపజేసింది (ఫ్రీజ్ చేసింది). ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్పందన కోసం డార్జిలింగ్ జిల్లా కలెక్టర్ హరిశంకర్ పణిక్కర్ను సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ప్రస్తుతం ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఇలాంటి సాంకేతిక లోపాలు ఎలా జరుగుతాయనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. తదుపరి దర్యాప్తు నివేదిక వెలువడే వరకు ఈ వ్యవహారంపై స్పష్టత రాకపోవచ్చని అధికారులు తెలిపారు.


